Tuesday, March 1, 2022

అతని కవిత్వమొక అనుభూతి

 ప్రముఖ కవి శ్రీ ఎమ్మెస్ సూర్యనారాయణ తాజా కవిత్వ సంకలనం "నేనొక అనుభూతి" ఆవిష్కరణ నిన్న కాకినాడ సాహితీస్రవంతి ఆధ్వర్యంలో జరిగింది. ఆ సభతాలూకు ప్రెస్ కవరేజ్...

ఆ సందర్భంగా నేను చేసిన ప్రసంగంలోంచి కొన్ని వాక్యాలు ఇవి.
.
అతని కవిత్వమొక అనుభూతి
.
ఎమ్మెస్ కవిత్వం ఎన్నడూ వాచ్యంగా ఉండదు. ఎమ్మెస్ ఏనాడూ ఎంగిలి ప్రయోగాలు చేయలేదు, డెడ్ మెటఫర్స్ వాడలేదు. ఏం చెప్పినా నవ్యంగానే చెప్పాడు, సొంతస్వరంలోనే రాసాడు. కవిత్వం అనేది ధ్వన్యాత్మకంగా, ప్రతీకాత్మకంగా మాత్రమే చెప్పాలని కంకణం కట్టుకొని మూడు దశాబ్దాలుగా కవిత్వాన్ని వెలువరిస్తున్నాడు. ఇతనిది జీవనానుభవాల కవిత్వం. కవిగా ఎమ్మెస్ నిజాయితీపరుడు. తాను చూచినది, తాను అనుభవించినది మాత్రమే కవిత్వంలోకి తీసుకొని వచ్చాడు. తన అనుభవానికి వెలుపల ఉన్నదానిని ఏనాడూ స్పృశించలేదు.
.
జీవితం
కిటికీపై
వాలిన పిట్ట
ఎగిరిపోయేలోగా
మిగిలిపోయే
నేనొక అనుభూతి…
.
రామో విగ్రహవాన్ ధర్మః అంటే ధర్మానికి ఒక ఆకారాన్ని ఇస్తే అది రాముడు అని అర్ధం. అదే రీతిగా, అనుభూతికి ఒక ఆకారాన్ని ఇస్తే ఎమ్మెస్ కవిత్వం అని అర్ధం చెప్పుకోవచ్చు. అందుకనే జీవితం కిటికీ పై వాలిన పిట్ట ఎగిరిపోయేలోపు నేనొక అనుభూతిగా మిగిలిపోతాను అని ప్రకటించుకొన్నాడు- మనకున్న గొప్ప కవి శ్రీ ఎమ్మెస్ సూర్యనారాయణ.
.
బొల్లోజు బాబా







No comments:

Post a Comment