Saturday, March 5, 2022

‘కవిత్వ భాష’లో విహారయాత్ర (Book Review)

thank you Lenin Babu gaaru

మీ క్లోజ్ రీడింగ్ కు థాంక్యూ అన్నమాట చాలా చిన్నది. మీ పఠనాశక్తి గొప్పది. ఈ నాలుగు ప్రశంసాపూర్వక వాక్యాలకు ధన్యుడను
ఈ పుస్తకాన్ని ఇక్కడనుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును https://archive.org/details/kavithva-bhasha-by-bolloju-baba


భవదీయుడు
బొల్లోజు బాబా


.
‘కవిత్వ భాష’లో విహారయాత్ర

“చాలా కాలం తరువాత ఒక పుస్తకంలోకి దూకి ప్రతీ పదాన్నీ కౌగిలించుకుంటున్నాను…ఒడ్డుకు చేరాక ఇంకోసారి మిమ్మల్ని పలకరిస్తాను ” అని శ్రీ బొల్లోజు బాబా గారికి facebookలో కామెంట్ పెట్టాను…దానికి పూర్వరంగం ఏమిటంటే, “కవిత్వ లక్షణాలు ఏమిటి?…కవితాత్మక గద్యానికీ, కవిత్వానికీ తేడా ఏమిటి?…ఈ రెంటినీ గుర్తించటం ఎలా?…” అని నేను facebookలో అడిగిన ఒక ప్రశ్నకి వారు ఈ పుస్తకం పంపి, అందులో ఫలానా చోట మీ ప్రశ్నకి సమాదానం లభిస్తుంది అని చెప్పటం…నేను పుస్తకంలో వారు చెప్పిన భాగం చదివి తక్షణ స్పందనగా పై కామెంట్ పెట్టాను… పుస్తకం చదివాక,వారికి కృతజ్ఞతగా ఈ పోస్టు రాయకుండా ఉండలేకపోయాను…

సామాజిక మాధ్యమాలలో ఒకరి వీపు ఒకరు చరుచుకుంటూ ఉండే కవికూటములలోని కవుల లక్షణం బొల్లోజు బాబాగారికి  లేదు అని అనిపిస్తోంది …పొగడ్తలు ఆశించే చోట ప్రశ్నలు ఎదురైతే,చూసీ చూడనట్టు తప్పుకుపోవటమో, ప్రశ్న వేసిన వారిని ‘మీ తలం వేరు, మా తలం వేరు’ అని జవాబు ఇచ్చినట్లే ఇచ్చి,అసలు ప్రశ్నకి జవాబు దాటవేసి తమ భద్రజీవితపు బావులలోకి మునిగి పోవటమో వీరు చెయ్యలేదు …ఒక పాఠకుడికి మేలు చేసే సంకల్పాన్ని చూపించారు… సులక్షణాలు లేకుంటే, అభినందిస్తూ నెత్తిన ప్రేమతో నిమిరినా, మొట్టికాయలూ వెయ్యటానికి  మొహమాటపడని శ్రీ రెంటాల వెంకటేశ్వరరావు గారిని ఈ పుస్తకంలోకి పెద్దపీట వేసి ఆహ్వానించి ఉండేవారు కాదు …ఆ నిజాయితీతో కూడిన  ఒద్దిక నాచేత వీరికీ, వారికీ  నమస్కారం చేయించింది…వారి మధ్య అవ్యక్త గురుశిష్య భావనా వీచికలు నా  హృదయానికి వెచ్చదనపు హాయినిచ్చాయి…’కవిత్వ భాష’లో నా విహార యాత్రకి ఆత్మీయంగా పొద్దు పొడిచింది…

బాలుడినైన నన్ను చెయ్యి పట్టి నడిపించే కవిత్వ గైడ్ లాగా అనిపించారు శ్రీ బొల్లోజు బాబా…

ఒక గదిలో కొండేపూడి నిర్మలగారు ‘మేకులు వంగాయి’ అంటుంటే, ‘మేకులే వంగితే, మానవ హృదయం ఎంత?’ అని గుసగుసలాడారు నా విభ్రమం సంబ్రమంగా మారేటట్టు…

ఇంకాస్త ముందుకు నడిపించి కరెన్సీ నోటులో కత్తిని చూస్తున్న అలిశెట్టి ప్రభాకర్ గారి చూపులో నా చూపుని సంలీనం చేయించారు…

అడవిలో చెట్టు దుంగల్లో తల లేని మొండాలను చూపించే అరణ్యకృష్ణ గారి ఆవేదనా ప్రకంపనలకు నా  హృదయాన్ని శృతి చేశారు…

ఒక చోట పాటిబండ్ల రజని గారు మనస్సు ఇంకిపోయే మందుకై తపించడాన్ని చూపించారు…

ఎండ్లూరి సుధాకర్ గారు తమ గుప్పిట్లో దాచుకున్న బొటనవేలిలో, దాచేస్తే దాగని  వివక్షాచరిత చీకటిలా విస్ఫోటించడాన్ని విప్పార్చిన నా కళ్ళకు సాక్షాత్కరింపచేశారు …

కొందరు పుట్టుకతోనే కొన్ని పుట్టుమచ్చల అమానవీయ బరువును మొయ్యవలసిన పరిస్థితిని చూపించే ఖాదర్ మోహిద్దీన్ గారిని పరిచయం చేశారు…ఇంకొన్ని అడుగులు వేశాక, ఇస్మాయిల్ గారు ఎండా, నీడలతో చిత్రించిన ఆకుని పరిశీలించమన్నారు…

అంతలో,తనంటే ఇష్టపడే పాపని ఎత్తుకున్న వానై వచ్చిన తెలుగు వెంకటేష్ గారిలో తడిచేలా చేశారు…

ఆ తరువాత మండే గుండెతో ఉన్న కలేకూరి ప్రసాద్ గారి ఎగిరే ధిక్కార పతాకంలా ఉన్న కవిత్వాన్ని తలవంచి చదవమన్నారు…

కాస్త ముందుకు కదిలి, అత్యాచార బాధితురాలికి ధైర్యాన్ని కలిగిస్తూ కవన ఖడ్గం అందించే కె.క్యూబ్ వర్మ గారిని చూపిస్తూనే, నగలు పెట్టుకుని నడిచే గాయాలని చూపించే కొండేపూడి నిర్మల గారినీ వినమన్నారు…

జయప్రభ గారు, జూపాక సుభద్ర గారు పైట/కొంగు ని చూసిన విధానాన్ని తరిచి చూపిస్తూ, శవపేటికలను తుపాకులతో కొలిచి తాలిబన్లపై కాల్పులు జరిపిన అనంతు గారినీ  చూపించారు…

చూపుడు వేలినుండి వెలిగించే ఖడ్గాలను మొలిపించిన సరికొండ నరసింహ రాజు గారిని, పిల్లలను నీలిగోళ్ళ దగ్గరితనం గురించి హెచ్చరించే నిరంతర గారిని, గతాన్ని చదివించే కొప్పర్తిగారినీ,తరాల పాటు స్థిరంగా ఉన్న  కుడి ఎడమలని తిరగేస్తున్న శివసాగర్ గారినీ చూపించారు…

కొంచెం ముందుకు నడిచి చీకటి చరిత్ర మీద చెరగని వెలుగు పాదముద్రలతో నడుస్తూ మినుములు మొలిపిస్తున్న  శిఖామణి గారినీ,కూలీలు వేసుకున్న స్వేదబిందువుల దండలను చూపించే గుంటూరు శేషేంద్రశర్మ గారినీ చూశాను…

ఆ పక్కనే,రాత్రి వేళ మిణుగురుల సంగీతాన్ని వాయించే సూర్యుడిని చూపించే డాక్టర్ ఎన్.గోపి గారు, ప్రతీ మనిషీ ఊరికొయ్యే అని ఉచ్చ స్వరంలో అరుస్తున్న భగ్వాన్ గారు, పిడికిలి బిగించి, “నాక్కొంచెం నమ్మకమివ్వు” అంటున్న ఆలూరి భైరాగి గారూ  కనపడ్డారు…

అక్కడినుండి సముద్ర తీరానికి వస్తే , “ఈ సముద్రపు నీరు ఇంత ఉప్పగా ఉందేమిటి?ఈ జలసానువుల మీద తెల్లగుడ్డ కప్పింది ఎవరు?”అని నిలదీస్తూ సిరికి స్వామినాయుడు గారు కనిపించారు…

అటుచూస్తే, దేవుని కన్నీళ్లను తుడుస్తున్న తిలక్ గారు… ఇటు చూస్తే, పాపుల్ని కరుణించేవరకూ నువ్వు నిదురించవు కదా అని ప్రపంచీకరణపై వక్రోక్తులు విసురుతూ అద్దేపల్లి ప్రభు గారు కనిపించారు…

సముద్రాన్నే,ఆస్తి అనుకున్న ఏమీలేని అమాయకపు అమ్మని చూపిస్తూ ఎం.వెంకట్ గారు,కాగితాలపై పెరిగే అభయారణ్యాల గుట్టుని పట్టిస్తూ యశస్వి సతీష్ గారు, పొలాలకు తాళాలు వేస్తూ దర్భశయనం శ్రీనివాసాచార్య గారు సంచలిస్తున్నారు…

అంతేనా,స్వీట్ డిస్టర్బెన్స్ మధ్య పాఠాలు చెబుతూ గోదావరి శర్మ గారు, కనుకొనుకులలో నిప్పుకణికలతో ఎదురుచూస్తూ నారాయణస్వామి గారు, ఏమీ లేకపోవటాన్ని కాపలా కాస్తున్న హెచ్చార్కే గారు, వానలకు తడిసిన కొన్ని ఎండలను చూపిస్తూ త్రిపురనేని శ్రీనివాస్ గారు మనస్సులో అలజడి రేపుతూ కనిపించారు…

వీటన్నిటి మధ్యలో నా చేతులు తన చేతుల నుండి విడివడిన క్షణాలూ,జతపడిన క్షణాలూ ఉన్నాయి… ఇమేజరీ,సినక్డకి,అల్లిగొరి మొదలైన తూకపు రాళ్ళు నా హృదయంలో పెడుతూ భుజం తడుతూ శ్రీ బొల్లోజు బాబా నన్ను ముందుకు నడిపించారు…

 భూగోళానికి అటూ ఇటూ ఉన్న కవులు చేసిన కృషినీ, పూర్వపు సిద్ధాంత  తరకలను రుచి చూపించారు…వాటి నడుమ సామ్యాల, వైవిధ్యాల  అధ్యయన సారాలను చవి చూపించారు…పాత పనిముట్లను,కవిత్వ తూకపు రాళ్ళను  ఆధునీకరించుకోవలసిన ఆవశ్యకతను చెప్పడం నాకు వ్యక్తిగతంగా నచ్చింది…

ఆ పక్కనే, ఆత్మకు లంగరు వేస్తూ కలవరిస్తున్నాడేమో అని అనుమానం కలిగిస్తూ వేగుంట మోహన ప్రసాద్ గారు…ఆయనను చూస్తూ తిక్కగా ఉన్నా కవిత్వం ఉంటే క్షమించేస్తాం అని సాలోచనగా అంటూ, చేరా గారు కనిపించారు…

కొంచెం ముందుకు నడిపించి, పదాలతో కవితా ప్రహేళికలు సృష్టిస్తున్న  ఎమ్మెస్ నాయుడు మరియు బి.ఎస్.ఎం కుమార్ గార్లను చూపించారు …వారిని ఓరకంట చూస్తూ ”కవిత రాయటం పూర్తయ్యింది…ఇక అర్థం చేసుకోవటమే మిగిలుంది” అంటూ తమ్మినేని యదుకుల భూషణ్ గారు అంటున్న మాటలనూ వినమని సైగ చేశారు…

కాస్త దూరంలో “దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తాం” అంటూ కాళోజీ గారు కన్నెర్ర చేస్తూ కనిపించారు…అటుపక్కనే, ఆ నీళ్ళు ఉల్లిపాయలు తరిగితే వచ్చినవి కావని భావన గారి బాధని మన భాషలోకి తర్జుమా చేసి వివరించే వాడ్రేవు చినవీరభద్రుడు గారు…కవిత్వం చదవటం ఒక performing art అని చెబుతూ శివారెడ్డి గారు గంభీరంగా కవితాలీనులై ఉండటం చూపించారు…అలంకార రహితులై  నిరాడంబరంగా వెలగటం చూపించారు…

“నిప్పులు చిమ్ముతూ నింగికి నేనెగిరిపోతే ” అంటున్న శ్రీ శ్రీ గారు, “పంజరంలో ఇమడలేని విశ్వనరుడను నేను ” అంటూ జాషువా గారు, ‘ప్రపంచమే ఒకటి ’  అంటూ దాశరధి గారు, ఎంకిని ముద్దు చేస్తూ నండూరి గారు,’బండరాళ్ళ పై మొక్కలు ఎదగవంటూ ’ భైరాగి గారూ కనిపించారు…

అంతేనా, ఇంకా ఎందరో కనిపించారు…ఎన్ని వెలిగే హృదయాలో!…ఎన్ని నివురుగప్పిన మాణిక్యాలో!… కవిత్వాన్ని పలు విధాలుగా వాడిన ఎన్ని మచ్చుతునకలో!…ఇవి కాక,కాలంతో పాటు కవిత్వంలో వచ్చిన మార్పులు, తారీఖులు దస్తావేజుల జోలికి పోకుండా వివరించారు…

చాలా కొత్త పదాలు పరిచయమయ్యాయి…పాఠకుల ఆస్వాదనా శక్తిని పెంచే పుస్తకమిది…చిన్నప్పుడు మిత్రులతో ఆటలలో పడితే ఆకలి తెలిసేది కాదు…పెద్దయ్యాక, క్లాసులో పాఠం చెప్పటానికి నోట్సు తయారు చేసుకోవటానికి మంచి ముడి సరుకు దొరికితే ఆకలి అయ్యేది కాదు…అలా,చదవటం మొదలయ్యాక  ఆకలిని దూరం చేసి, మరొక ఆకలిని తీర్చిన పుస్తకం ఇది…

పత్రికలలో ప్రచురితమయ్యే, చాలా కవితలను చూసి, ఇదేమి కవిత్వం? గద్యాన్ని శకలాలుగా చేసి కవిత్వంగా చలామణి చేస్తున్నారు…అని చిరాకు పడే నేను ఇప్పుడు కాస్త educated పాఠకుడిని అయ్యానని అనిపిస్తుంది…ఇందుకు కారకులు శ్రీ బొల్లోజు బాబాగారు…ఇటువంటి వ్యాసాలు వ్రాయాలంటే,ఎంతటి అధ్యయనం,జ్వలన కావాలో కొంత ఊహించగలను…వారికి చాలా కృతజ్ఞతలు…నా ప్రశ్నకి సమాధానాన్ని మించి చాలా ఇచ్చిన పుస్తకం ‘కవిత్వ భాష’…నాబోటి వారు చదవవలసిన పుస్తకం…

***లెనిన్ బాబు***




No comments:

Post a Comment