Tuesday, November 28, 2023

శ్రీ మువ్వా శ్రీనివాసరావు కవిత్వంలో వస్తు వైవిధ్యం

 

కవి ఏ విషయాన్ని చెప్పదలచుకొన్నాడో దాన్ని వస్తువని చెప్పిన విధానాన్ని శిల్పమని అంటారు.  సామాజిక జీవితం, జీవనవైరుధ్యాలు, మానవసంబంధాలు, పర్యావరణం లాంటి అనేక అంశాల కళాత్మక వ్యక్తీకరణే సాహిత్యంలో వస్తువుగా మారుతుంది.  ఏ వస్తువుకైనా మానవజీవితమే భూమిక.  ఒక సంఘటన లేదా ఒక అనుభూతి లేదా ఒక ఆలోచనా ఏదైనా వస్తువుగా ఉండొచ్చు.   సాహిత్య వస్తువు కాలానుగుణంగా నిరంతరం మారుతూ ఉంటుంది.   ప్రబంధకవులు ఎన్నుకొన్న కథా వస్తువుకు ఆధునిక కవి రాస్తున్న వస్తువుకూ తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఒక కవి సుదీర్ఘకాలంపాటు చేసిన సాహితీయానంలో కూడా ఈ వస్తు పరిణామం గమనించవచ్చు.

ప్రతికవికి ఒక నిర్ధిష్టమైన  సాహిత్య దృక్ఫథం ఉంటుంది.  తన ఆశయాలకు, నిబద్ధతకు, ఆలోచనా విధానానికి అనుగుణంగా ఉండేవాటినే వస్తువులుగా స్వీకరిస్తాడు. వస్తు శిల్పాలు ఒకదానినొకటి కబళించుకోకుండా పరస్పర ఫూరకాలుగా ఉన్నప్పుడు అది గొప్ప కవిత్వమౌతుంది.  శ్రీ మువ్వా శ్రీనివాసరావు ఇంతవరకూ సమాంతర ఛాయలు, 6th ఎలిమెంట్, వాక్యాంతం, వైరాయణం అనే కవితాసంపుటులను వెలువరించారు.  వీరి వస్తు స్పృహ గొప్పది. వైవిధ్యభరితమైనది. వీరి కవిత్వంలో వస్తువైవిధ్యం ఉత్తమస్థాయిలో ఉన్నట్లు ఈ క్రింది పరిశీలనల ద్వారా అర్ధంచేసుకోవచ్చు.

 

1. రైతు పట్ల సహానుభూతి

ప్రకృతిపరంగా, రాజకీయకారణాలతో, ప్రపంచీకరణ ప్రభావం వలనా నేడు రైతు  దిగులు అంచులకు నెట్టివేయబడుతున్నాడు.  గౌరవంతో జీవించే పరిస్థితులు కరువయ్యాయి.  జీవనం ఛిద్రమైంది. శ్రీనివాసరావు అనేక కవితలలో రైతు దీనస్థితిని చిత్తరువుగా నిలిపారు. 

సూర్యుడు మేఘాలను కుప్పపోసి

గిట్టుబాటు ధర దొరకని రైతు

పత్తిని కాల్చినట్లు కాలుస్తున్నాడనిపిస్తుంది  (బొట్టుసూర్యుడు-6th ఎలిమెంట్)

పై వాక్యాలు సూర్యుని ఎండతీవ్రతను వర్ణించటానికి ఉద్దేశించినవైనా, అక్కడ తెచ్చిన రైతుప్రస్తావన ద్వారా ఈ కవికి రైతులపై ఉన్న సహానుభూతిని అర్ధం చేసుకోవచ్చు.

పండిన పిడికెడు గింజలు 

పుట్టకముందే నపుంసకత్వం నిర్ధేశించుకొన్నాయి//

విధిలేక తనే అంతమై

అలజడి విత్తుతున్నాడు అలలు మొలవాలని

నడిచిన అలలు సందేశం చేరవేస్తాయని// (సమాంతర ఛాయలు)

ఒకప్పుడు   రైతు పండించిన పంటలోని కొన్ని గింజలను విత్తనాలుగా దాచుకొని తదుపరి పంటకు వాదుకొనేవాడు.  ఆధునిక వ్యవసాయం వాడే హైబ్రిడ్ విత్తనాలు ఒక పంటమాత్రమే పండుతాయి.  వాటి గింజలు మొలకెత్తవు, విత్తనాలుగా పనికిరావు.  ప్రతీ పంటకూ విత్తనాలు కొనుక్కోవలసి రావటం రైతుకు అదనపు ఖర్చు. పై కవితలో పిడికెడు గింజల నపుంసకత్వం అర్ధం అది.  ఆ చితికి పోయిన రైతు తన చావు అలలుగా మారి  తన వాదన వినిపిస్తుందని భావించటం సమకాలీన  విషాదం.

***

ఈ రోజు ఏనాడూ ఒక ఆవుకు పేడ ఎత్తని, గడ్డి మేపని సమూహాలు ఆవుని కాపాడతామని కత్తులు ధరించి గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. అది రాజకీయ ప్రేరేపితం. కానీ  నిజానికి రైతుకు పశువుతో ఉండే అనుబంధం అలాంటిది కాదు.  హృదయగతమైనది.   ఒక   కవితలో చనిపోయిన ఎద్దుని తలచుకొని వెక్కి వెక్కి ఏడ్చిన ఒక రైతుని మనకళ్ళముందు నిలుపుతాడు కవి.  ఇదొక గ్రామీణ పురాపరిమళం.

ఏడ్చి ఏడ్చి చింతనిప్పులయిన

నాన్న కళ్ళు నాకింకా గుర్తే

ఎద్దుపోతేనే గుండెలవిసిన నాన్న కళ్ళు

మానవత్వపు వాకిళ్ళు (నాన్నకళ్ళు-సమాంతర ఛాయలు)

డంకెల్ ఒప్పందాల వల్ల సంప్రదాయ వ్యవసాయరంగం చితికిపోయింది.  అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యచేసుకొన్నాడట రైతు.  అతను పండించిన పత్తితో చేసిన వత్తే అతని తలవద్ద వెలగటం ఒక సామాజిక వైఫల్యం.

డంకెల్ రంకెలకు

అప్పుల వేలం డప్పుల చప్పుళ్ళకు

తను పండించిన పత్తి,  దీపం వత్తులై

రైతన్నల నెత్తిమీద వెలుగుతున్నాయి (పోస్ట్ మార్టం- సమాంతర ఛాయలు)

 

2. పర్యావరణ పరిరక్షణ/ప్రకృతి సౌందర్యం

కవులు ప్రకృతిని ఎంతైతే ఆస్వాదిస్తారో దాని విధ్వంశం పట్ల కూడా అంతే వ్యసనపడుతూంటారు. శ్రీ శ్రీనివాసరావు ప్రకృతిని ఆస్వాదిస్తూ రాసిన కవితలకన్నా పర్యావరణ పరిరక్షణను వస్తువుగా చేసుకొని వ్రాసిన కవితలు ఎక్కువ.

మనిషిని కట్టేయ్యడానికి

మబ్బులు

నాలుగు మెరుపు తాళ్ళు ఇస్తానన్నాయి

మనిషిని కడిగెయ్యడానికి

సూర్యుడు

నాలుగు బిందెల ఎండనీరు ఇస్తానన్నాడు

మనిషిని మత్తులో ముంచెయ్యడానికి

చంద్రుడు

నాలుగుతీగెల వెన్నెల వీణను ఇస్తానన్నాడు

 

కానీ

మనిషిని మనిషిగా మార్చెయ్యడానికి

ఎవరైనా

నాలుగు కవితావాక్యాలు ఇవ్వగలరా? (ఏమివ్వాలి? -వాక్యాంతం)

మెరుపుతాళ్ళు, ఎండనీరు, వెన్నెల వీణ గొప్ప సౌందర్యాత్మక వ్యక్తీకరణలు.  మానవజీవితానికి ప్రకృతికి ఉండే సంబంధాన్ని అందంగా చెబుతూనే అంతిమంగా  మనిషిని మనిషిగా మార్చేది కవిత్వమే  అని స్పష్టపరుస్తాడు.

 

పదిలంగా పేడ ఉండ్రాల్లు చుడుతోంది

ఏ వినాయకుడి కోసమో//

దేహానికి దీపాన్ని తొడుక్కొన్నది

ఏ కళ్ళకు

చీకటి రంద్రాల చమత్కారాన్ని చూయించడం కోసమో//

ప్రకృతి కళ్యానపు పనిలో

మనకు తప్ప

ప్రతిపురుగుకూ ఓ పాత్ర ఉంది (ప్రతికథనం-వాక్యాంతం)

పేడపురుగు పేడతో ఉండ్రాళ్ళు చుట్టి వాటిని దొర్లించుకొంటు వెళ్ళటం ఒక అందమైన ప్రకృతిదృశ్యం. మిణుగురు పురుగులు రాత్రివేళల మెరుపులు చిందించటం ఒక హృద్యచిత్రం.  ఆ మెరుపు వెలుగులని చీకటి రంద్రాలు అనటం అద్భుతమైన వర్ణన. ప్రకృతిలో   ప్రతిజీవికీ ఒక స్పష్టమైన పాత్ర ఉందని చెబుతూ,   మనిషికే ఏ పాత్రా లేదు అని కుండబద్దలుకొడతాడు.  ఆ విధంగా మనిషి చేస్తున్న పర్యావరణ విధ్వంసాన్ని పరోక్షంగా ఎత్తిచూపుతున్నాడు కవి.

 

3. మధ్యతరగతి జీవన వాస్తవికత

మధ్యతరగతి జీవులకళ్ళు పైవర్గాలకు అతుక్కుపోయి, కాళ్ళుమాత్రం పేదరికంలో కూరుకుపోయి ఉంటాయి. నిత్య సంఘర్షణ, ఉన్నదాంట్లో సర్దుకుపోవటం, అసంతృప్తుల మధ్య సాగుతుంది మధ్యతరగతి జీవనయానం.   ఈ అంశాలను ఒకకవితలో ఆలోచనాత్మకంగా ఇలా చెబుతున్నాడు కవి.

రెండు విసుర్రాళ్ళ మధ్య

పెసరగింజల్లా పగిలిపోతుంటాం//

తాత తాతెవరో తెలియకున్నా

వంశవైభవాన్ని వర్ణిస్తూంటాం

మధ్యతరగతి మనుషులం మేం

 

ఒంటినిండా పులుముకొన్న ఇంటిపేరును

ఏ పలుకుబడి వున్నోడితోనో అంటుగట్టి

ఆశల చిగురులు తొడుక్కుంటాం// (మధ్యపర్వం-సమాంతర ఛాయలు)

 

ఆ రెండు విసుర్రాళ్లను  సంఘర్షణ,  సంక్షోభం అని కవిత చివర్లో గుట్టు విప్పుతాడు కవి.  గొప్పలకు పోవటం, ఒకే ఇంటిపేరున్నగొప్పవ్యక్తులతో పోల్చుకోవటం, నిత్యం ఆశ నిరాశల మధ్య ఊగిసలాడటం మన నైజమని;   గతంలో కూరుకుపోయి  భవిష్యత్తు పట్ల నేలవిడిచి సాముచేస్తూ  గ్లోబల్ గుహలో రెక్కలు తెగిన పక్షుల వలే జీవిస్తున్నామని అంటాడు కవి. 

 

4. స్త్రీలు పిల్లల పట్ల గౌరవం

ఈ కవికి స్త్రీల పట్ల ప్రగాఢమైన గౌరవం, ప్రేమ ఉన్నట్లు దయ్యాలమాణిక్యమ్మ, క్షమించకు తల్లి, అమ్మమ్మ, నెలరాని రోజు లాంటి అనేక కవితల ద్వారా అర్ధమౌతుంది.

వయసు ముడతల మీద భయాన్ని వాలనీయక

ధైర్యపు నీడలా నడుస్తుండేది

కాలువ మడవ మీద కాచుకు కూర్చున్న

రైతు మాణిక్యం

మా నాయిన అమ్మ  (దయ్యాల మాణిక్యమ్మ- సమాంతర ఛాయలు)

***

అమ్మమ్మ పిడికిలి నుండి

జారిన

పంచదార ధార

నా నాలుకపై చేసిన

చేసిన సంతకం

నేనికా దాచుకునే ఉన్నా  (అమ్మమ్మ-సమాంతర ఛాయలు)

చిన్నవయసులోనే భర్తను కోల్పోయినా ధైర్యాన్ని కోల్పోక పసివాళ్లుగా ఉన్న పిల్లలను పెంచి ప్రయోజకులను చేసిన కవి నాయినమ్మ దయ్యాల మాణిక్యమ్మ గురించి వ్రాసిన ఈ వాక్యాలు స్త్రీల పట్ల, మరీ ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కలిగిన స్త్రీల పట్ల ఉన్న కవికి ఉన్న గౌరవం తెలియచేస్తుంది

ఈ కవికి అమ్మంటే అనురాగం. అమ్మంటే ఒక భాగ్యం. అమ్మంటే భరోసా.  అనేక కవితలలో అమ్మతనం గురించిన వాక్యాలు పాయసంలో ద్రాక్షపలుకుల్లా తియ్యగా తగుల్తూంటాయి.  అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదూ…

భాగ్యం అంటే ఏమిటో తెలుసా

అమ్మచూస్తుండగానే ముసలాడైపోవడం

అమ్మనీడలోనే అమ్మంత అయిపోవడం (అమ్మంత కావడం-వాక్యాంతం) – నిజంగానే అమ్మచూస్తుండగానే

ముసలాడైపోవటం ఎంత అదృష్టం. ఇదొక నవ్యమైన ఊహ.

 

ఈ మధ్యనే మొదలైంది

నాకో మహాగురువు సాన్నిధ్యం… అంటూ తన మనవడి గురించి చెప్పుకోవటం ఒక నులివెచ్చని

హ్రుదయస్పర్శ.

 

5. ఉద్యమ స్పృహ

సాహిత్యం మానవోద్వేగాల వ్యక్తీకరణ మాత్రమే కాదు అవసరపడినప్పుడు సామాజిక చైతన్యంతో రాజ్యవ్యతిరేక ఉద్యమబాట పట్టవలసి ఉంటుంది. దానికి అందరు కవులూ సిద్ధంగా ఉండరు. ప్రజలస్వామ్యమెప్పుడు? ఈ పద్యానికి ముగింపులేదు, గురితప్పిన పిడికిళ్ళు లాంటి కవితలలో ఈ కవికి ఉద్యమభావజాలం పట్ల సానుకూల వైఖరి ఉన్నట్లు కనిపిస్తుంది.

మా వూరి మర్రి చెట్టుమీద

అర్ధరాత్రి

మందారం పూసిందని

ఖాకీలు కాలువల్లా ప్రవహించాయి

 

తుపాకి గొట్టాలు

తూర్పు మొక్కలను పసిగట్టాయి

తెల్లవార్లూ

లాఠీలు ఎముకలూ

మాట్లాడుకొంటూనే ఉన్నాయి ( 1975 … ఓ పోరాట గాథ - సమాంతర ఛాయలు)

ఎమర్జెన్సీ కాలంలో ఏ కాస్త ప్రభుత్వ వ్యతిరేకత వాసన తగిలినా బిలబిలమంటూ పోలీసులు దిగిపోయి, రాజ్యధిక్కారనేరం మోపి ఆలోచనాపరులను చితకబాది జైళ్ళకు తరలించేవారు.  ఆ నేపథ్యంలోంచి రాసిన కవిత ఇది.   రాజ్యధిక్కారాన్ని, మందారం పూసింది, తూర్పుమొక్కలు అనటంలో రాజ్యవ్యతిరేక భావజాలం పట్ల ఉన్న సానుకూల దృక్ఫథం అర్ధమౌతుంది.

 

6. మానవసంబంధాలు

మానవసంబంధాలను స్పృశించని సాహిత్యం ఉండదు. ప్రపంచీకరణ, పరాయీకరణ, వస్తువ్యామోహం లాంటి ఆధునిక జీవనసరళులు మానవసంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. అదే సమయంలో ఇద్దరుమనుషులు కలిసిన చోట సంబంధాలు ఉండక తప్పదు.  మానవసంబంధాలు ఎంతగా విచ్ఛిన్నమైపోయినా మనకుటుంబవ్యవస్థ నేటికీ ప్రపంచానికి ఆదర్శంగానే ఉంది. శ్రీనివాసరావుని మానవసంబంధాల కవి అని పిలుచుకునే విధంగా మానవసంబంధాలపై అచంచలమైన విశ్వాసంతో లోతుగా, వివిధ కోణాలలో, మానవసంబంధాలలోని చీకటివెలుగులను ప్రతిబింబిస్తూ అనేక కవితలు రాసారు.

            //ఒక్కొక్కటిగా గదులన్నింటినీ

బయటకు విసిరేయాలి//

అటాచ్డ్ బాత్రూం ని

పెరటి చివరి గోడమీద ఉతికెయ్యాలి

ఈ లివింగ్ రూముని

ఇరుగుపొరుగు వచ్చిపొయ్యేలా

ఇంటిముందు అరుగుగా పరిచెయ్యాలి//

గడుల గడుల ఈ ఇంటిని

ఎక్కడకక్కడ విడగొట్టాలి

కుటుంబసభ్యుల మధ్య

కొత్తకూడికలు మొదలెట్టాలి (కూడికలు+తీసివేతలు- వాక్యాంతం)

ఈ కవితలో కవి-మానవ సంబంధాల విచ్చిన్నానికి మనిషికో గది ఉండే ఆధునిక ఇంటి ప్లాను కూడా కారణమే అనే చిత్రమైన పరిశీలన చేస్తాడు. లివింగు రూముని ఇరుగుపొరుగు వచ్చిపొయేలా ఇంటిముందు అరుగులా పరిచేయాలి అనటం అంటే కూలిపోతున్న మానవ సంబంధాలను నిలబెట్టుకొమ్మని చెప్పటం. ముక్కలు ముక్కలుగా ఉన్న ఇంటిని ఎక్కడికక్కడ విడగొట్టినప్పుడే, కుటుంబసభ్యుల మధ్య బంధాలు మెరుగవుతాయి అంటాడు. ఇది ఏకకాలంలో సమాజానికి చేస్తున్న హెచ్చరికా, ఉపదేశం.

పెళ్ళంటే

అతను ఆమెగా మారటం

ఆమె అతను కావటం//

ఒకరినుండి ఒకరు నిరంతరం ప్రవహించడం

జీవితానికి కొత్తపిలకలు వేయడం

చెరో అమ్మనాన్నను అదనంగా పొందటం

రెండు చెవులై వినడం, రెండు కళ్లై చూడటం

రెండు పాదాల్లా నడవటం, ఒక్క గుండెగా మిగలటం// (పెళ్ళి @ - వాక్యాంతం)

మానవసంబంధాలను ఉజ్వలీకరించే  కవితా వాక్యాలవి. ఆదర్శ వైవాహిక జీవిత ఔన్నత్యానికి శిలాక్షరాలు.  ఒకరికొరకు ఒకరు అని అన్న భావనకు అద్భుతమైన వ్యక్తీకరణ. ఒక కొత్త తరాన్ని సృష్టించటం, చెరో అమ్మనాన్నను అదనంగా పొందటం అనే వాక్యాలలో- ఒక సాంస్కృతిక పరంపర దాగి ఉంది, మూడు తరాలను పెనవేసే అందమైన అల్లిక ఉంది. ఈ కవి దార్శనికుడు కనుకనే ఒకే వస్తువులోని మంచి చెడుల గమనింపు లోతుగా చేయగలిగాడు.

అదేం చిత్రమో

ఈ ప్రకృతికి ఎందుకింత నిర్దయో

రవ్వంత దుఃఖాన్ని స్వీకరించదు//

దుఃఖాన్ని ఇంకెక్కడా పారబోయలేం

ఇంకో మనిషిలో తప్ప

అందుకైనా ఒక తోడుండాలి (కన్నీటికి తోడూ జోడూ - వాక్యాంతం)

గొప్ప తాత్వికత నిండిన వాక్యాలివి.  మనిషికి మనిషి అవసరాన్ని విశదపరచే వాక్యాలు.  మన ఉద్వేగాలను దుఃఖమైనా, సంతోషమైనా మరొక మనిషితో పంచుకోగలమే తప్ప ఈ భౌతిక ప్రపంచంతో కాదు అనే భావన ఉదాత్తమైనది. మన దుఃఖాన్ని పంచుకోవటానికైనా మనకొక తోడుండాలి, మానవసంబంధాలను నిలుపుకో అని హెచ్చరిస్తున్నాడు కవి.

అమాయకంగా అనుకున్నా

కొడుకు మొక్కలా ఉన్నప్పుడు

ఎక్కడయితేనేం

ఎలా నయితేనేం

చెట్టంత ఎదగాలని

ఆ నీడలో సేదదీరాలని.

 

రోజూ చెట్లమధ్యలో

బతికే నాకు

ఎందుకు గుర్తులేదో

చెట్టు కదలదని

నీడకోసం దానిచెంతకే చేరాలని (ఆవలితీరం-సమాంతర ఛాయలు)

గొప్ప ఆర్తి ధ్వనించే వాక్యాలివి. ప్రపంచీకరణ ప్రభావంచే ఉపాథి కొరకు వలసలు అనివార్యమైనాయి. ఆ కారణంగా కుటుంబ సభ్యులు చెట్టుకొకరుగా విడిపోక తప్పనిసరైంది.  నా కొడుకు చెట్టంత ఎదగాలి అని కోరుకోవటం సహజమే.  కానీ ఆ చెట్టు మనవద్దే ఉండి మనకు నీడనివ్వాలని కోరుకోవటం ఆధునికకాలంలో అమాయకత్వమే.  సమకాలీన మానవసంబంధాలకు అద్దం పట్టే కవిత ఇది.

కవిగారు గుమ్మం పక్కనే సోఫాలో పేపరు చదువుకొంటున్నపుడు ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు.  ఆ వచ్చిన వ్యక్తి ఎవరో పోల్చుకోవటానికి ప్రయత్నించి విఫలమై అర్ధాంగిని పిలుస్తాడు కవి “ఏమోయ్ ఎవరో వచ్చారు చూడు అంటూ” ఆమె “ఎవరో తెలుసుకోలేకపోయారా” అంటూ వస్తుందామె.   ఇంతవరకూ అందరి ఇళ్ళలో జరిగేదే.  ఈ ఘటనతో ఘర్షణపడి కూలిపోయిన సంసారాలు ఉండొచ్చు. కానీ దాని నుండి ఒక జీవితసత్యాన్ని వెలికి తీయటం కవి ప్రతిభ. ఆ సత్యమేదో మానవసంబంధాలను పటిష్టపరిచేదిగా ఉండటం మరింత ప్రశంసనీయం. ఆ కవిత ఇలా ముగుస్తుంది. 

క్షమించడంలో కూడ

ఆనందం వెతుకుతూ ఆమె

క్షమించబడటంలో

సంతోషంలో నేను

 

సంసారం సజావుగా

సాగిపోతూనే ఉంది (థింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్-సమాంతర ఛాయలు) .

క్షమ మనుషుల్ని కలిపి ఉంచుతుందనటంలో సందేహం లేదు.  ఆ క్షమ  స్త్రీ ద్వారానే పలికించటం అనాదిగా జరుగుతున్నదే కావొచ్చు. అది పితృస్వామ్య భావన అంటూ ఎన్ని సార్లు చెప్పుకొన్నా అది సంసారం సజావుగా సాగిపోవటానికి దోహదపడే అంశం కాకపోవచ్చు అన్నివేళలా.  క్షమించబడటానికి సంతోషించి, విశ్వాసంగా ఉన్నప్పుడే ఆ ఇరువురి మధ్య ప్రేమ పరిపూర్ణమవుతుంది.

***

కరోనా వైరస్ ప్రపంచంలోని మనుషుల మధ్య అనుబంధాలను విచ్ఛిన్నం చేసిందని బాహ్యంగా కనిపిస్తున్నా, ఈ కవి తన అంతర్దృష్టితో చూసి ఇలా అంటున్నాడు.

రొసెట్టా రాయినుండి

మాసిపోయిన భాషనే బతికించుకున్నోళ్ళం

మహా అయితే… ఏమవుతుంది

మాలోమాకు యుద్ధాల పేరుతో

గతంలో

పోయినంత మంది మళ్ళీ పోతాం

అప్పుడు ద్వేషంతో కొట్టుకున్నోళ్ళం

ఇప్పుడు ఐకమత్యంతో పోరాడుతున్నాం

కరోనా… కారణజన్మమే నీది  (వైరాయణం)

క్రీస్తుపూర్వం రెండో శతాబ్దానికి చెందిన రోసెట్టా రాయిపై ఉన్న లిపిని ఛేదించిన తరువాత మాత్రమే ఆర్కియాలజిస్టులకు ఈజిప్టు పిరమిడ్ల గోడలపై ఉన్న Hieroglyphs లిపిని డీకోడ్ చేయటం సాధ్యమైంది. అలా ఒక ప్రాచీనఈజిప్షియన్ ప్రపంచాన్ని తిరిగి బతికించుకోగలిగాం.  ఓ కరోనా నీవల్ల ఏం జరుగుతుంది అని ప్రశ్నించటం, ఏం జరిగినా నువ్వు మాలో ఐకమత్యాన్ని పెంచుతున్నావు అంటూ గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించటం మానవజాతి పరిణామక్రమాన్ని అర్ధం చేసుకొన్న క్రాంతదర్శి మాత్రమే రాయగలిగే వాక్యాలు.

 

7. ప్రపంచీకరణ

మన జీవన విధానం, అలవాట్లు, సంప్రదాయాలు, పండుగలు, భాష, సాహిత్యం, కళలు అన్నీ కలిస్తే మన సంస్కృతి. ప్రపంచీకరణ ప్రభావం వల్ల ఇవన్నీ  మార్కెట్ సరుకులుగా మారిపోతున్నాయి. మనిషితనం పోయి వస్తువులకు ప్రాధాన్యం పెరిగింది.  గుంపులో ఏకాకితనం, అమానవీకరణ,, నగరంలో ఉంటూనే నగరం పట్ల విముఖత లాంటివి   ప్రపంచీకరణ దుష్పరిణామాలు.   దీన్ని కవులు గుర్తించి వాటినికవిత్వంలోకి తీసుకొస్తున్నారు.  

మహానగరం అంటే

మంచితనం కోసం

వెతుకులాడటమేనట

 

మహానగరమంటే

బతుకుల్ని

బహుచౌకగా అమ్ముకొనే

పెద్ద తిరనాళ్ళట//

అయినా సరే

ఉసిళ్ళలా ఊళ్ళన్నీ

ఇక్కడే వాలిపోతున్నాయి

ఏమీ సాధీంచకుండానే

రాలిపోతున్నాయి (సమాంతర ఛాయలు)

పై కవితా వాక్యాలలో కవి  నగరజీవితాన్ని నగ్నంగా మనముందు నిలుపుతాడు, నగర జీవనపు ఒరిపిడిని, వలస దుఃఖాన్ని, దాని అనివార్యతని అలతి అలతి మాటలలో  పట్టుకొన్నాడు.

//వస్తువుల్లో ఇరుక్కుపోయిన నా జీవితాన్ని

పట్టుకొందామని పరిగెత్తుతున్నా

పక్కనే ఉన్నట్లనిపించినా

చటుక్కున మాయమై

అందీ అందనంత దూరం జరిగి

దొరక్కుండా దోబూచులాడుతుంది

వస్తువుల్ని ప్రేమిస్తూ

మనుషుల్ని వాడుకొంటున్న

సమాజంలో సగటు మనిషిగా వున్నానేమో (గాజుపూల కంపు- సమాంతర ఛాయలు)

వస్తువుల్ని వాడుకోవాలి మనుషుల్ని ప్రేమించాలి అనేది ఒక ఆదర్శవంతమైన జీవనశైలి.  ప్రపంచీకరణ దీన్ని తారుమారు చేసింది. మనిషికి కాక వస్తువులకు ప్రాధాన్యం పెరిగింది.  మనిషిని వస్తువులకు బానిస చేసింది. మార్కెట్ నిర్ధేశించిన వస్తువులని కొంటున్నాం, వింటున్నాం, తింటున్నాం.  వస్తువుల క్రింద మనిషి కూరుకుపోయాడు.  ఇద్ సమకాలీన జీవన వైచిత్రి.

 

8. దురాచారాల పట్ల నిరసన

కవిత్వం ప్రజలలో నెలకొని ఉన్న మూఢనమ్మకాలను ప్రశ్నించాలి, దురాచారాలను ఖండించాలి.  ఇప్పటికీ అనేక చోట్ల నేలలో ఏదైనా విగ్రహం దొరికితే దానికి గుడి కట్టించి జాతరలు చేయటం ఒక తంతులా మారింది ప్రతీచోటా.  నిజానికి అక్కడ దొరికింది ఒకనాటి గుడికి చెందిన సాలభంజికో, యక్షిణో విగ్రహం కావొచ్చు.  వాటికి పూజలు, జాతరలు చేయడంలో భక్తి కన్నా వ్యాపారం ఉంటుందనటంలో సందేహం లేదు.  ఇలాంటి విషయాలను  స్పృశించటం అంటే శాస్త్రీయ దృక్పథాన్ని పలికించటం.  

నేలలో దొరికితే చాలు

సాలభంజిక కూడా’

అమ్మవారిగా పూజలందుకొంటుంది

తిరునాళ్ళు జరుగుతాయి

పూలదండలు

విలపిస్తాయి కానీ ఎవరికీ వినబడవు  (స్థలభంజిక-వాక్యాంతం)

 

9. మెటపొయెట్రి

కవిత్వంపై రాసే కవితలను మెటపొయెమ్స్ అంటారు.  ప్రతికవి తన కవిత్వతత్వాన్ని కవితాత్మకంగా చెప్పుకోవటం కద్దు.

మిత్రమా ప్రియురాలి పెదాలపై అంటిన

వెన్నెల ఎంగిలిలో కలిసిపోతే పో

కానీ

అవసరం అయినప్పుడన్నా

అక్షరాన్ని ఆయుధంగా మార్చు(అక్షరాయుధం -వాక్యాంతం)

ప్రేమగీతాలు, చెట్టు పిట్టా కవిత్వాలు మాత్రమే వెలువరిస్తూ, సామాజిక స్పృహకొరవడిన కవులపై సంధించిన వ్యంగ్యాస్త్రం పై కవిత.

కవి గాడు అనే కవితలో “వాడు మాటల్ని మంత్రిస్తాడు/జనం నాలుకలపై ప్రశ్నల్ని అతికిస్తాడు అంటూ కవికి ఉన్న సామాజిక బాధ్యతను గుర్తుచేస్తాడు.

నా ఏడుపేదో

నేనే ఏడుస్తుంటే

మెల్లగా నా పక్కన చేరి

నా ఏడుపుకు రాగం కట్టి

నువ్వు మాత్రమే ఆస్కార్

కొట్టేస్తావనుకోలేదు (అశ్రు సంగీతం-వాక్యాంతం)

 

చాలా సూటిగా, పదునుగా కవిత్వంలోని ఒక ధోరణిపై చేసిన విమర్శ ఇది.  ఇన్ని దశాబ్దాలుగా పేదల కష్టాలపై కవిత్వం రాసి రాసి ఆ రాసినోళ్ళు అవార్డులు పొందారు తప్ప ఆ కష్టాలు అనుభవించినవారికి ఆ కవిత్వాల వల్ల ఏం మేలు జరిగింది అన్న ప్రశ్న విలువైనది.    

 

10. పర్యాటక కవిత్వం

పర్యటనకోసమో, చుట్టపుచూపుగానో కొత్తప్రాంతాలను దర్శించినపుడు అక్కడి పర్యాటక స్థలాల అందాలను, వింతలు విశేషాలను చాలా మంది కవులు తమ కవిత్వంలో బంధించారు.  శ్రీనివాసరావు కూడా తన అమెరికా పర్యటనలో చూసిన అక్కడి విశేషాలతో కొన్ని కవితలు రాసారు. 

అతిశయించిన ప్రకృతిపై

జలఖడ్గం సాగించిన

వేల ఏండ్ల అందమైన పోరాటం//

ప్రతిరోజు

వేలాది జనం సాక్షిగా

ఉభయ సంధ్యల అందాన్ని

ఓడిస్తున్న గ్రాండ్ కేనియన్ (గ్రాండ్ కేనియన్ - వాక్యాంతం)

గ్రాండ్ కేనియన్ అనేది అమెరికాలోని కొలరాడొ నది వెంబడి నీటిప్రవాహపు కోతకు  సహజసిద్ధంగా ఏర్పడిన కొండచరియలసమూహము.   ఇది సహజసిద్దమైన ఒక ప్రకృతి వింతగా గుర్తింపబడి, గొప్ప పర్యాటక క్షేత్రంగా పేరుతెచ్చుకొంది.  నదీ కోతను జలఖడ్గం చేసిన పోరాటంగా చెప్పటం చక్కని పోలిక.

***

వాళ్ళక్కడ వెలుగుల వడియాలు పెట్టుకొన్నారు

వందలకొద్దీ సూర్యుళ్ళనీ

వేలాది చంద్రుళ్ళనీ

ఒకే గ్రైండర్లో నూరి

వెలుగు వలయాల వడియాలు

పెట్టుకొన్నారు//

చీకటికి బట్టలిప్పి

చిందులేయిస్తారిక్కడ (లావేగాస్- 6th ఎలిమెంట్)

లాస్ వేగాస్ గురించి వ్రాసిన కవితా వాక్యాలవి. లాస్ వేగాస్ జూదానికి, రాత్రి జీవితానికి ప్రసిద్ధి.  రాత్రి జీవితం అనగానే తప్పని సరిగా మిరిమిట్లు గొలిపే లైటింగ్ ఉంటుంది.  ఆ లైటింగ్  సూర్యచంద్రులని నూరి వడియాలుగా పెట్టినట్లుంది అనటం నవ్యమైన ఊహ.   

     

11. రాజకీయ అభిప్రాయాలు

నేడు మతతత్వ పార్టీలు ప్రజలను పోలరైజేషను గురిచేసి రాజకీయ అధికారం పొందటం కోసం   ముస్లిములను టార్గెట్ చేయటం జరుగుతున్నది.  ఈ క్రమంలో భాగంగా తాజ్ మహల్ ఒకనాటి శివాలయమని ఆధారరహిత వాదనను కొందర ముందుకు తెచ్చారు. ఈ అంశంపై శ్రీనివాసరావు నిర్ధ్వంధ్వంగా తన అభిప్రాయాన్ని ఇలా చెబుతారు.

వేదికనెక్కిన వీధి కుక్కలు వాగినంతనే

తాజ్ మహల్ పునాది వాసన మారుతుందా?

ఇప్పుడూ మనదే కదా!

అయినా

అప్పుడెప్పుడో మనదనుకోవడం

నిజంగానే దౌర్భాగ్యం

కోట్లమంది దేవుళ్ళున్న దేశంలొ

ఇంకో ఇద్దరిని కలుపుకుంటే పోయేదేముంది? (వాక్యాంతం)

            కోట్ల మంది దేవుళ్ళున్న దేశంలో ఇంకోఇద్దరిని కలుపుకొంటే తప్పేమిటి? అనే ప్రశ్నలోని సహిష్టుత ప్రతి నిజమైన హిందువుకూ అర్ధమౌతుంది. అది భారతజాతి గమ్యం అవ్వాలి.   

తెలంగాణా ఉద్యమం నడిచే సమయంలో ప్రత్యేక తెలంగాణా అంశం గొప్ప భావోద్వేగాలను రేకెత్తించిన అంశం.   అంశంపై చేసిన ఈ వ్యాఖ్య చాలా విలువైనది

విడివడటం నేరమేమీ కాదు

వేర్పాటే విముక్తీకాదు

మునిగిపోయిందేమీ లేదు

మళ్ళీమొదలుపెడదాం పరుగు//

అక్కడైనా, ఇక్కడైనా పేదజనం ఒక్కటే

ఎప్పటికయినా

ప్రపంచ పేదలంతా ఏకం కావాల్సిందే (వాక్యాంతం)

పేదప్రజలు ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే, వాళ్ళు ఏనాటికైనా ఏకంకావాల్సిందే అనే ఆకాంక్ష నరనరానా కమ్యూనిష్టు భావజాలంనింపుకొన్న వారు మాత్రమే చేయగలిగే వ్యాఖ్య.

మహాత్మా

నీవు నడిచి వెళ్ళిన బాటను

అక్షరాలతో పుస్తకాలనిండా ముద్రించుకున్నాం

భద్రంగా బీరువాల్లో దాచుకున్నాం//

మహాత్మా

నీవు విడిచివెళ్ళిన ఆశయాలను

అందంగా మూటగట్టి

మా పిల్లలెవరికీ అందకుండా

ఆకాశపు ఉట్టిలో దాచిపెట్టాం//

మహాత్మా

ఉత్తమాటలుగానే మిగిలిపోయాం 

మన్నిస్తావా? (మార్గదర్శి - వాక్యాంతం)

గాంధీ ఆలోచనలవైపు నేడు ప్రపంచదేశాలు చూస్తున్నాయి. మనవద్దమాత్రం గాడ్సే క్రమక్రమంగా పూజనీయుడౌతున్నాడు.  ఈ సున్నితాంశాన్ని కవి గుర్తించాడు. మహాత్మా నన్ను మన్నించు అని కోరుతున్నాడు.

 

12.  సమకాలీనత

సమాజంలో సమకాలీన సంక్షోభాలు, వైరుధ్యాలను కవిత్వంలోకి తీసుకురావటం వల్ల ఆ కవిత్వానికి గొప్ప లోతు విస్తృతి వచ్చి చేరతాయి. సమకాలీనత పాఠకునిలో ఆసక్తి రేపుతుంది. శ్రీనివాసరావు కవిత్వంలో సమాజంలో సమకాలీన  ఆధునిక అంశాలు వివిధ కవితలలో కనిపిస్తాయి.  సోషల్ మిడియాలో అజ్ఞాతంగా ఉంటూ నకిలీ ప్రొఫైళ్ళతో చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేసే వ్యక్తులు ఉంటారు.  కొన్ని సందర్భాలలో వీరు చేసే ట్రోల్స్ మర్యాదస్తుల పాలిట తలనొప్పిగా పరిణమిస్తాయి.  ఇది అవాంఛనీయం. Fake ID అనే కవిత ఈ అంశాన్ని స్పృశిస్తుంది.

            వెలుగులో ఓడిపోయేవాడు

ముఖపుస్తకంలో తలదాచుకొని

ముఖానికి వేరే బొమ్మేసుకుని

నకిలీ ప్రొఫైళ్ళ నెమలీకలతో దర్శనమిస్తుంటాడు//

అసలు మనిషెవరో ఎప్పటికీ తెలియదు  (Fake ID - వాక్యాంతం)

కరోనా ప్రపంచ విలయాన్ని సృష్టించింది.  తన ప్రయాణం ఎటువైపు మార్కెట్ వైపా మనిషితనం వైపా అని ఒక్కసారి ఆగి ఆలోచించుకోవాల్సిన స్థితి కల్పించింది మనిషికి. ఆ సంక్లిష్టతను అలతి అలతి మాటలలో ఇలా అక్షరీకరించారు శ్రీనివాసరావు

మనుషులు చస్తే

మళ్ళీ పుడతారు

మార్కెట్ చస్తే మనమెట్లా అంటాడొకడు!

బతికుంటే చాలు

బలుసాకు తినైనా బతకొచ్చంటాడు మరొకడు

ఒకే యుద్ధంలో

రెండు గీతోపదేశాలు వినిపించి

తర్క తాంబూలమిచ్చి తన్నుకు చావమంటున్నావు కదా!

కరోనా… కారణ జన్మమే నీది! (వైరాయణం)

వైరాయణం సంఘటనాత్మక కవిత్వసంపుటిగా భావించవచ్చు. పై కవితలోని బలం అంతా “ఒకే యుద్ధంలో రెండు గీతోపదేశాలు” అన్నవాక్యం వద్ద ఉంది. ఇంతవరకూ జరిగిన మానవపరిణామం అంతా కరోనా కారణంగా కొత్తగా కనిపించటం పట్ల చేసిన లోతైన వ్యాఖ్య అది. కరోనా నేపథ్యంలో  మనిషిపై మార్కెట్ చేస్తూ వచ్చిన దాడి ఒకవైపు, మానవ జీవనేచ్ఛ మరోవైపు చేరగా జరిగిన సంఘర్షణను ఇముడ్చుకొన్న అనల్పార్ధ తాత్విక వచనమిది.

శ్రీనివాసరావు కవిత్వం సమకాలీనంగా ఉండే సామాజిక అంశాలను ప్రతిభావంతంగా ఇముడ్చుకొందని వీరి అనేక కవితలు సాక్ష్యమిస్తాయి.

***

మువ్వా శ్రీనివాసరావు వస్తు స్పృహ వైవిధ్యభరితమైనది. ఇతని  ప్రారంభకవితలలో కనిపించే వైయక్తిక వస్తువు క్రమేపీ సార్వజనీన వస్తువుగా పరిణామం చెందటాన్ని గమనించవచ్చు. పల్లెటూరి అనుభవమైనా, మానవసంబంధాల పరిమళమైనా, నగర చిధ్రజీవనశకలమైనా, పదునైన రాజకీయ అభిప్రాయమైనా ఇతని చేతిలో కళాత్మకతను సంతరించుకొంటుంది. ఏ వస్తువును తీసుకొని రాసిన కవితలోనైనా  అంతఃస్సూత్రంగా మానవతావాదం పలుకుతుంది. అదే శ్రీనివాసరావు కవిత్వ స్వరం.

 

బొల్లోజు బాబా

5/03/2022

 

Sunday, November 26, 2023

తొలకరి వానలు - Plum Rain by Mei Yaochen (CE 1002-1060)


మూడురోజులుగా ఎడతెరపిలేని వాన
వానపాములు నా గదిలోకి ఎగబాకాయి
ఎండిన కంచెలపై పుట్టగొడుగులు పెరిగాయి
తేమగాలి బట్టలపై తెల్లటి బూజు కట్టింది

ఊరిచెరువులో కప్పలు విడుపు లేకుండా
ఒకదానిపై ఒకటి దూకుతున్నాయి
నా పూలతోటను ఆక్రమించిన రెల్లుగడ్డి
ఉన్నట్టుండి చెయ్యెత్తు ఎదిగిపోయింది

నా ఇంటిముందు
ఏ పల్లకి లేదా ఏ గుర్రమూ నిలిచిలేదు
ఒత్తైన పచ్చిక చీకటిలా పరుచుకొంది
ఇంటివెనుక Zhaoting పర్వతాన్ని
మేఘాలు కప్పేసాయి
దారులన్నీ మూసుకుపోయాకా
ఎచటికి పోగలనీ పూట!

ప్రపంచాన్ని బయటే వదిలేసి
మంచంపై ఒంటరిగా కూర్చుని ధ్యానంలోకి వెళ్లాను

నా రికామీతనాన్ని చూసి నా భార్య నవ్వింది

నీకోసం కాస్తంత మద్యాన్ని సేవించవచ్చు కదా! అంది
తను Bolun [1] భార్యకంటే చాలా మంచిది
నేను తాగేటపుడు నా పక్కనే కూర్చుని కబుర్లు చెబుతుంది.
.
మూలం:Plum Rain by Mei Yaochen (CE 1002-1060)
 
అనువాదం: బొల్లోజు బాబా


Bolun [1] (Liu Ling (221-300 CE)) . ఇతను వెదురుతోటలో ఉండే ఏడుగురు ప్రాచీన ఋషులలో ఒకరు. నిరంతరం తాగుతూ ఉండే ఇతని పట్ల విసిగిఫోయిన ఇతని భార్య మద్యం కప్పులను, పాత్రలను బద్దలు కొట్టేసిందట. అయినా మారని బోలన్ మాత్రం మద్యం గొప్పతనం గురించి విషాదగీతాలు రాసాడట.

Tuesday, November 14, 2023

వేదబాహ్యులు - చరిత్ర వ్యాసాలు, e.book


గత నాలుగు సంవత్సరాలుగా బుద్ధిజం, జైన, చార్వాక, ఆజీవిక, లకులీశ సంప్రదాయాలపై రాసిన వ్యాసాలు ఒకచోట ఉండాలనే ఉద్దేశంతో "వేద బాహ్యులు" పేరుతో ఇ.బుక్ గా కూర్పు చేసాను. దానికి రాసుకొన్న ముందుమాటలు ఇవి.
పుస్తకం లింకు ద్వారా  డౌన్ లోడ్ చేసుకొనవచ్చును.
 
****
మనవి మాటలు
ప్రాచీన భారతదేశ ప్రజల విశ్వాసాల గురించి అధ్యయనం చేయటం ఒక నిరంతర శోధన. వైదిక మతానికి వెలుపల ఎన్నో సంస్కృతులు ఈ నేలపై సహజీవనం చేసాయి.
హిందూమతం రూపుదిద్దుకొనకముందు ఈ నేల భిన్న సంప్రదాయాలకు, విశ్వాసాలకు ఆలవాలంగా ఉంది. వైదిక సంప్రదాయం మాత్రమే భారతదేశపు ఆత్మ అని పలికే మాటలకు ఈ వేదబాహ్య సంస్కృతి ఒక కనువిప్పు.
 
కూర్మపురాణం (CE 550-800) బౌద్ధులు, జైనులు, పంచరాత్రలు, కాపాలికులు, పశుపతులు అంటూ ఐదురకాల వేదబాహ్యులను పేర్కొనింది. పంచరాత్ర కల్ట్ మొదట్లో వేదబాహ్యంగా ఉన్నప్పటికీ క్రమేపీ వైష్ణవంలో కలిసిపోయి వేదావలంబిగా మారిపోయింది.

వేదబాహ్యులను నీతిశాస్త్రాలు చాలా తక్కువతనం చేసి మాట్లాడాయి. గృహస్తులెవరూ వీరిని ఆదరించరాదని మనువు; నాస్తికులను పరిహరించాలని యాజ్ఞవల్క్యుడు; సాక్షులుగా పెట్టుకోరాదని నారదుడు; ఆపత్సమయాలలో వేదబాహ్యుల ఆస్తులను రాజు స్వాధీనం చేసుకొనవచ్చునని అంతేకాక వారితో సన్నిహితంగా ఉండేవారిపై అధికపన్నులు విధించవచ్చునని కౌటిల్యుడు; సౌరపురాణంలో వేదబాహ్యులు రాజ్యంలోకి ప్రవేశించరాదని; శుక్రనీతి సార లో వేదబాహ్యులను రాజు శిక్షించాలని; అంటూ నీతిశాస్త్రకారులు తమ తమ గ్రంథాలలో వీరిపట్ల సమాజం వ్యవహరించాల్సిన పద్దతులను నిర్ధేశించారు. ఇన్ని వెలివేతలు పెట్టినా సంఘంలో వేదాలను ధిక్కరించి జీవించేవారి సంఖ్య తక్కువ ఏమీ ఉండేది కాదు.
 
ఈ వైదిక, అవైదిక విశ్వాసాలు చరిత్రలో ఘర్షించుకొన్నాయి. ఒకదానినొకటి మెరుగుపరుచుకొన్నాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. భారతీయ ఆత్మను, బహుళతను తీర్చిదిద్దటంలో వేదబాహ్యులు పోషించిన పాత్ర గణనీయమైనది. విస్మరింపరానిది.
ఈ వ్యాసాలు గతనాలుగేళ్ళుగా రాసినవి. ఒకే అంశాన్ని ఆవిష్కరించే వీటిని ఒకచోటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఇ.బుక్ గా కూర్పు చేసాను.

మీకు నచ్చుతుందని భావిస్తాను

భవదీయుడు
బొల్లోజు బాబా
06/11/2023

పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

Wednesday, November 8, 2023

భిన్నమతాలలో ఉమ్మడి పాత్రలు - విష్ణుమూర్తి


వైదిక మతంలో విష్ణువు ప్రస్తావనలు రుగ్వేదంలో కనిపిస్తాయి. నారాయణుడే సత్యము, నిత్యము, ఆకాశమూ భూమి, యజ్ఞము విష్ణు స్వరూపము అంటూ విష్ణుమూర్తి రుగ్వేదంలో కీర్తించబడ్డాడు. అయినప్పటికీ విష్ణువు ఇంద్రుడు, అగ్ని లవలె ప్రధాన దైవం కాదు. యుద్ధాలలో ఇంద్రునికి సహాయంగా ఉండేవాడు కనుక విష్ణువును ఉపేంద్రుడు అన్నారు.
BCE రెండవ శతాబ్దంలో పంచరాత్ర కల్ట్ ప్రముఖ ఆరాధనా విధానంగా ఉండేది. వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షన, బలరామ మరియు అనిరుద్ధ అనే ఐదుగురు దేవుళ్ళను కొలిచే విధానం ఇది. ఈ కల్ట్ వేదాలను అంగీకరించలేదు. ఈ పంచరాత్ర లోని వాసుదేవుని పేరు మీదుగా గ్రీక్ అంబాసిడర్ Heliodores విదిశ లో గరుడ స్తంభాన్ని నిలబెట్టాడు. ఈ కల్ట్ ప్రబలంగా ఉండే కాలానికి విష్ణువు ఇంకా ప్రధాన దైవంగా మారలేదు.
గుప్తుల కాలంలో CE నాలుగు నుంచి ఆరో శతాబ్దం మధ్య వైష్ణవం ప్రధాన ఆరాధనా విధానంగా రూపుదిద్దుకొంది. పురాణకాలం నాటికి ఇంద్రుడు, అగ్ని, మైత్రి, ప్రజాపతి లాంటి వైదిక దేవుళ్ల స్థానాన్ని విష్ణువు స్వీకరించాడు. వేదాలలో ప్రజాపతి (బ్రహ్మ) నిర్వహించిన అవతారాలు ఎత్తటం అనే ప్రక్రియ విష్ణువుకు బదలాయించారు.
***

బౌద్ధ జైనాలలో విష్ణువు కనిపించడు. విష్ణువే బుద్ధునిగా, రిషభనాథునిగా అవతారాలు ఎత్తినట్లు హిందూ పురాణాలలో కనిపిస్తుంది.

మాయామోహనుడు

విష్ణుపురాణంలో మాయామోహనుడు పేరుతో ఒక కథ ఉంది. ఒక కాలమందు అసురులు వేదవేదాంగములను అధ్యయనం చేసి, వైదిక యజ్జయాగాదులు నిర్వహిస్తూ శక్తివంతులై దేవతలచే ఓటమిలేనివారైనారు. దేవతలందరూ శ్రీ మహావిష్ణువును కలిసి మొరపెట్టుకోగా, ఆయన తనకు మారుగా ఒక మాయామోహన రూపాన్ని సృష్టించి రాక్షసులను ఓడించటానికై దేవతలకు సహాయపడమని పంపించాడు. ఈ మాయామోహనుడు ఒక సన్యాసి రూపం ధరించి నర్మదా నదీతీరములో తపస్సుఆచరిస్తున్న రాక్షసులచెంతకు పోయి వారి గౌరవపూజలందుకొని వారిని దీవించి వారితో ఇలా అన్నాడు “మీరు పరలోక సుఖములు పొందాలని వేదపారంగతులై జీవిస్తున్నారు, కానీ పరలోకం అంటూ ఏమీ ఏమీ లేదు, వేదశాస్త్రములు అబద్దములు, యజ్ఞయాగాదులు ఆచరించిన ముక్తి పొందుతారనటం అసత్యం” అంటూ అనేక వేదనిందా సమర్ధములైన శాస్త్రాలను వారికి బోధించగా, వారు మాయామోహనుడి మాటలను నమ్మి వేదాలను విడిచి వైదిక క్రియలను మరచి యజ్జయాగాదులను నిందించసాగారట. ఆ రాక్షసులు మాయామోహనుడి మాయకులోబడి వేదబహ్యులుగా మారగానే దేవతలు వారిపై దాడిచేసి చాలా సులభంగా వారిని జయించారట. [1]

పైన మాయామోహన రూపంలో విష్ణుమూర్తి చెప్పినవి బౌద్ధ, జైన, చార్వాక బోధనలుగా ఇట్టే పోల్చుకొనవచ్చును. పై కథ ద్వారా హిందూధర్మావలంబులు అప్పటికి ప్రత్యర్ధిగా ఉండిన అన్యమతస్థులను ఎలా నిర్మూలించేందుకు యత్నించారో తెలుస్తుంది.

పై కథలో మాయామోహన వ్యక్తి ఎవరో పోల్చుకోలేము కానీ ఆ తరువాతి గాథలలో ఆ వ్యక్తి బుద్ధునిగా, విష్ణువు అవతారాలలో ఒకటిగా చెప్పటం ద్వారా ఆ వ్యక్తి బుద్ధుడని ఊహించవచ్చు. ఈ మాయా మోహన ఉదంతం బుద్ధుని బోధనలైన అహింస, జంతుబలుల నిరసన గంపగుత్తగా హిందూ ధర్మంలోకి తీసుకొనే ప్రయత్నమని అర్ధమౌతుంది. అదే సమయంలో ఆ మాయామోహన వ్యక్తి- "నగ్నంగా, నెమలి ఈకలగుత్తి చేతబూనిన ముని" అంటూ చేసిన వర్ణనల ద్వారా అతన్ని జైన మునిగా కూడా పోల్చుకొనవచ్చును. ఎందుకంటే జైన మునులు దిగంబరులు, నేలపై నడిచేటపుడు కీటకములకు హానికలుగకుండా నెమలీకల గుత్తితో నేలను చిమ్ముకొంటూ నడిచేవారు. [2]

విష్ణుపురాణం CE 4-6 శతాబ్దాల గుప్తులకాలంలో రాయబడింది. అప్పట్లో జైన బౌద్ధాలు సమాజంలో ప్రబలంగా పాతుకొని ఉన్నాయి. ప్రజలను తమవైపు తిప్పుకోవటానికి బౌద్ధ జైన బోధనలు “విష్ణుమాయ” గా అభివర్ణించటం ద్వారా జైన బౌద్ధ విశ్వాసులను ఆకర్షించే యత్నంగా ఈ మొత్తం ఉదంతాన్ని అర్ధం చేసుకోవాలి.
***

జైనమత మొదటి తీర్థంకరుడైన రిషభనాథుని చరిత్రను తెలుపుతూ తొమ్మిదో శతాబ్దంలో జినసేనుడు రచించిన ఆదిపురాణంలో - ఈ చరాచర సృష్టిని కల్పించిన హిందూపురాణాలలోని బ్రహ్మపాత్రను రిషభనాథునికి ఆపాదించి బ్రహ్మను ఒక మామూలు దేవుడిగా వర్ణించాడు.
ఈ చర్యకు ప్రతిగా అన్నట్లు పదోశతాబ్దంలో రాయబడిన భాగవత పురాణంలో రిషభనాథుడిని విష్ణుమూర్తి అంశగా చెప్పటం ద్వారా జైనమత స్థాపకుడినే హిందూధర్మం తనలో ఒక పాత్రగా కలుపుకోవటం జరిగింది.

ప్రజలలో ఉన్న జంతుబలులను అరికట్టటానికి విష్ణువు బుద్ధునిగా అవతరించాడు అని పన్నెండో శతాబ్దపు గీతగోవిందంలో జయదేవుడు అనటాన్ని- బౌద్ధ జైన ప్రబోధాలను హిందూమతం తనలో విలీనం చేసుకోవటమే కాక వాటి ఉపదేశాలలోని మంచిని గ్రహించే ప్రయత్నంగా కూడా దీన్ని చూడాలి. [3]

ధర్మసంస్థాపన కొరకు విష్ణుమూర్తి వివిధ అవతారాలు ఎత్తినట్లు చెప్పే పురాణాలన్నీ హిందువులు తమ చరిత్రను నిక్షిప్తం చేసుకొన్న రచనలు. ఇదే తరహాలో బౌద్ధ జైనాలు కూడా తమ చరిత్రను సాహిత్యం ద్వారా వ్యక్తీకరించుకొన్నాయి. 24 తీర్థంకరులు జన్మించి, సన్యసించి, ప్రవచించి సిద్ధలోకాలను చేరుకొన్నట్లు జైన మత సాహిత్యం చెబుతుంది. వీరిలో BCE తొమ్మిదో శతాబ్దపు రిషభనాథుడు తొలితీర్థంకరుడు కాకా, BCE ఆరోశతాబ్దపు మహావీరుడు చివరి తీర్థంకరులు. CE మూడవ శతాబ్దంలో రాయబడిన Paumacariya జైన గ్రంథంలో ఈ ఇరవై నలుగురు తీర్థంకరులగురించి ఉంది.

బౌద్ధ థెరెవాదానికి చెందిన “బుద్ధవంశ” గ్రంధంలో ఇరవై నలుగురు బుద్ధులు ఉన్నారు. వీరి వరుస దీపాంకర బుద్ధుడు తో మొదలై చారిత్రిక గౌతమ బుద్ధునితో ముగుస్తుంది. వీరు వివిధ యుగాల్లో జీవించినట్లు, వారి బోధనలు, కార్యాలను ఈ గ్రథం వివరిస్తుంది. ఈ బుద్ధవంశ గ్రంథం BCE 2/3 శతాబ్దాలలో రాయబడిందని చరిత్రకారుల అభిప్రాయం. ఇక ఈ 24 అనే సంఖ్యను జైనుల నుంచి బౌద్ధులు గ్రహించారా లేక బౌద్ధులనుంచి జైనులు గ్రహించారా అనేది ఇతమిద్దంగా చెప్పలేం. 24 సంఖ్య అనేది ఆయా ఆథ్యాత్మిక మార్గాలలో బోధనలందించిన గురుపరంపరగా గుర్తించాలి.
***

బౌద్ధంలో కనిపించే అవలోకితేశ్వర బోధిసత్వునికి, విష్ణుమూర్తి విగ్రహానికి; శయనించే బుద్ధునికి, శేషతల్పంపై పడుకొన్న అనంతశయన విష్ణుమూర్తి కి ఐకనోగ్రాఫికల్ పోలికలు కనిపిస్తాయి. ఏది ముందు ఏది వెనుక అనేది నిర్ధిష్టంగా చెప్పలేం కానీ బౌద్ధ, వైష్ణవ శిల్పరీతులు ఒకదానినొకటి ప్రభావితం చేసుకొన్నాయని సులభంగానే అర్ధమౌతుంది.

బొల్లోజు బాబా

[1]ఆంధ్ర శ్రీవిష్ణుపురాణము by వెన్నలకంటి సూర్యనారాయణ పే.నం. 186
[2]Shared Characters in Jain, Buddhist and Hindu Narrative by Naomi Appleton pn. 83
[3]Doniger O’Flaherty, The Origins of Evil, 204–11.





Saturday, November 4, 2023

భిన్నమతాలలో ఉమ్మడి పాత్రలు - ఇంద్రుడు, బ్రహ్మ

వైదికమతంలో ఇంద్రుడు దేవతల అధిపతి. అత్యంత ముఖ్యమైన దేవుడు. సోమరసాన్ని సమర్పిస్తూ ఋగ్వేదంలో అనేక శ్లోకాలు ఇంద్రుని కీర్తిస్తూ ఉంటాయి. దుష్టశక్తులను సంహరించటం, వర్షాలు కురిపించటం, కోర్కెలు నెరవేరటం కొరకు ఇంద్రుని ప్రార్ధించేవారు. రాక్షసులనుండి, బలవంతులైన నరులనుండి దేవతలను రక్షించటం ఇంద్రుని ప్రధాన విధి.
సనాతన విశ్వాసాలు హిందూమతంగా రూపుదిద్దుకొన్నాకా వేదాలలో ప్రముఖపాత్ర వహించిన ఇంద్రుని పాత్ర క్రమేపీ తన ప్రాభవాన్ని కోల్పోయింది.
 
అహల్యతో ఇంద్రుడు శారీరికంగా కలిసి ఆమె భర్త గౌతముని ఆగ్రహానికి గురయి, ఆ కారణంగా - ఇంద్రుడు వంధ్యత్వాన్ని శాపంగా పొందాడని రామాయణంలో; శరీరమంతా వెయ్యి యోనులను కలిగిఉండేటట్లు శపించబడ్డాడని భారతంలోను భిన్న కథనాలు కనిపిస్తాయి. అప్పటికే ప్రాధాన్యత కోల్పోయిన దేవలోకపాలకుడయిన ఇంద్రుడిని ఒక నరుడు, ఒక బ్రాహ్మణుడు శపించినట్లు చెప్పటం దేవతలపై కూడా బ్రాహ్మణ వర్గం తమ ఆధిపత్యం చూపగలదు అని చెప్పటం కొరకేనని జర్మన్ ఇండాలజిస్ట్ SöhnenThieme అభిప్రాయపడ్డారు.
 
***
బౌద్ధ, జైన మతాలలో కూడా ఇంద్రుని పాత్ర కనిపిస్తుంది. కానీ ఈ మతాలలో ఇంద్రుడు సాత్వికగుణాలు కలిగిఉంటాడు. ఉదాహరణకు బౌద్ధంలోని ఇంద్రుడిపేరు “శక్ర”. ఇతను సంహారకునిగా, స్త్రీలను వశపరచుకొనేవానిగా, సోమరసాస్వాదకునిగా కాక శాంతికాముకునిగా, స్త్రీలను రక్షించేవానిగా, ఇంద్రియనిగ్రహుడిగా కనిపిస్తాడు.
 
చెట్లపై గరుడపక్షులగూళ్ళు చెదరకూడదని సైన్యాన్ని దారిమళ్ళించాడట. కుంభజాతకంలో రాజు మద్యపానాన్ని సేవించినట్లయితే రాజ్యం నాశనం అవుతుందని రాజుకు హితోపదేశం చేసి అతనిని దుర్వసనాలనుండి మరల్చాడట. Mahājanaka-jātaka కథలో భర్త మరణించి, రాజ్యం కోల్పోయి, అప్పటికే గర్భవతిగా ఉండిన ఒక పట్టపురాణిని, వృద్ధుని రూపంలో వచ్చి రక్షించాడట. ఈ ఉదంతాలన్నీ ఇంద్రుని సుగుణాలను వెల్లడిస్తాయి.
 
బౌద్ధసాహిత్యంలో ఇంద్రుడు అనేక సందర్భాలలో స్త్రీలను చెరలనుంచి విడిపించినవాడిగా, సంతానాన్ని ప్రసాదించిన దైవంగా చిత్రించబడటాన్ని బట్టి ఈ పాత్ర ఉదాత్త వ్యక్తిత్వాన్ని కలిగిఉన్నట్లు భావించాలి.

జైన సాహిత్యంలో- ఇంద్రుడు పూర్వజన్మలో యుద్ధవీరుడని జైనం స్వీకరించి మరణించే వరకూ ఆహారం తినకుండా ఉండే సల్లేఖనా వ్రతం చేసి చనిపోయినట్లు ఉంటుంది. (Bhagavatī Sūtra; 18.2)

జైన తీర్థంకరులు క్షత్రియ గర్భంలో జన్మించటం ఒక ఆచారం. జైన మహావీరుడు దేవనంద అనే ఒక బ్రాహ్మణ స్త్రీ గర్భంలో పెరుగుతున్నట్లు తెలుసుకొన్న ఇంద్రుడు, నైగమేష అనే మేకతల దైవానికి చెప్పి – ఆ దేవనంద గర్భంలో పెరుగుతున్న పిండాన్ని త్రిశల అనే పేరుగల క్షత్రియ స్త్రీ గర్భంలోకి మార్పించినట్లు జైన సాహిత్యంలో కలదు.
ఇరవైనాలుగవ తీర్థంకరుడైన మహావీరునికి ఇంద్రుడు స్వర్ణవస్త్రాన్ని సమర్పించుకొన్నట్లు మరొక జైనకథనం.

బౌద్ధ జైన మతాలలోని ఇంద్రుడు/శక్ర సాత్వికునిగా జీవిస్తూ జిన, బుద్ధ దేవులను సేవించుకొంటూ గడిపినట్లు ఉండగా; హిందూ మత ఇంద్రుడు మాత్రం యుద్ధప్రీతి, సురాపానం, స్త్రీలోలత్వం లాంటి దుర్లక్షణాలతో కనిపిస్తాడు.
.
బ్రహ్మ
.
ముల్లోకాలను సృష్టించిన వాడిగా బ్రహ్మకు హిందూమతం పెద్దపీట వేసింది. బ్రహ్మ వేదవాజ్ఞ్మయంలో కనిపించడు. బ్రహ్మకు బదులుగా ప్రజాపతి, బృహస్పతి లు వేదాలలో బ్రహ్మ పాత్రను నిర్వహిస్తారు. పురాణకాలం వచ్చేసరికి బ్రహ్మ ప్రాముఖ్యత పెరిగి త్రిమూర్తులలో ఒకరిగా కొలువుదీరటం జరిగింది.
 
పురాణాలప్రకారం బ్రహ్మకు మూడు పాత్రలు. ఒకటి, ఈ చరాచర లోకాన్ని, వేదాల్ని, ధర్మశాస్త్రాలను సృష్టించటం; రెండు, దేవతలకు పురోహితుడిగా వ్యవహరించటం: మూడు, విపత్కర పరిస్థితులలో లోకకల్యాణం కొరకు పరిష్కారమార్గాలు చెప్పటం. వీటిని జాగ్రత్తగా గమనిస్తే భూమిపై “బ్రాహ్మణుడు” నిర్వహించే పనులుగా గుర్తించవచ్చు. బ్రాహ్మణులు తాము ఐహికంగా పోషిస్తున్న పాత్రను బ్రహ్మదేవుడిగా పురాణాలలో లిఖించుకొన్నారు. కాలక్రమేణా బ్రహ్మ దేవుని పాత్ర ప్రాభవాన్ని కోల్పోయి – శతృసంహారం కొరకు యుద్ధాలు చేస్తూ అధికారాన్ని ఆధిపత్యాన్ని చలాయించే విష్ణువుకు ప్రాధాన్యత పెరగటం గమనించవచ్చు.
 
***
బౌద్ధజైనాల ప్రకారం ఈ జగతి సృష్టించబడలేదు.. ఆ మేరకు బౌద్ధ జైన మతాలలో కనిపించే బ్రహ్మ పాత్రకు ముల్లోకాలను సృష్టించే పని ఇవ్వలేదు.
 
జైనమతంలో మొదటి తీర్థంకరుడైన రిషభనాథుడు (BCE 9వ శతాబ్దం) జన్మించినపుడు బంగారం వర్షించింది కనుక హిరణ్యగర్భ (Golden womb/egg) అనే పేరుకూడా ఉంది. (హిరణ్యగర్భంనుంచి ప్రజాపతి ఆవిర్భవించాడని రుగ్వేదంలోని హిరణ్యగర్భసూక్తం చెబుతుంది. విశ్వకర్మ సూక్తం, హిరణ్య గర్భ/Golden egg అనేది విశ్వకర్మ నాభి నుంచి వచ్చిందని చెబుతుంది. ( నాభి నుంచి బ్రహ్మ పుట్టటం అనే భావన క్రమేపీ విష్ణుమూర్తికి అన్వయించారు.)

అలా జన్మించిన రిషభనాధుడు పెరిగి నగరాలను, పట్టణాలను, గ్రామాలను, శాస్త్రాలను, కళలను సృష్టించి ఈ లోకానికి ఇచ్చి తాను అన్నింటిని త్యజించి తీర్థంకరునిగా మారాడు.
రిషభనాథుని కుమారుడు భరతుడు భరతవర్షానికి మొదటి చక్రవర్తి అని, మనవడు ఆదిత్యయశ (Adityayasa) ఇక్ష్వాకువంశానికి మూలపురుషుడని- రిషభనాథుని జీవితచరిత్రను తెలిపే పౌమచరియ (Paumacariya) అనే గ్రంథంద్వారా తెలుస్తుంది.
 
తొమ్మిదో శతాబ్దానికి చెందిన జినసేనుడు రచించిన ఆదిపురాణంలో- రిషభనాథుడిని బ్రహ్మ యొక్క విశేషణాలైన ప్రజాపతి, స్వయంభు అంటూ కొన్ని చోట్ల సాక్షాత్తూ బ్రహ్మ అనే పేరుతోనే సంబోధించాడు.
జైనంలో బ్రహ్మకు సృష్టికర్త పాత్రలేదు. ఆ పాత్ర చేసే పనులను రిషబనాథుడు నిర్వహించినట్లు చెప్పటం ద్వారా, జైన సాహిత్యంలో బ్రహ్మపాత్ర ఉన్నప్పటికి ఆయన ఒక మామూలు దేవుడు.
బ్రహ్మదేవుడు బ్రహ్మ లోకంలో నివసిస్తాడని అన్ని మతగ్రంధాలలో ఉంది. జైన బ్రహ్మలోకానికి ఏ ప్రత్యేకతా లేదు.
 
బౌద్ధంలోని బ్రహ్మలోకం మానవ, జంతు, రాక్షస, నరకలోకాలకన్నా ఉన్నతమైన లోకం. బౌద్ధ బ్రహ్మలోకంలో ఒక బ్రహ్మ మాత్రమే ఉండడు, అనేకులు ఉంటారు. భూమిపై ఉత్తమజీవనాన్ని గడిపిన నిష్కామపరులు బ్రహ్మలోకంలో బ్రహ్మలుగా అవతరిస్తారు. వీరు ఇతరబౌద్ధ దేవతల వలే చావుపుటుకలు కలిగి ఉంటారు. దయ, కరుణ, సహానుభూతి, సహిష్ణుత లక్షణాలు కలిగి ఉండటం బ్రహ్మలోక అర్హతగా బుద్ధభగవానుడు తన శిష్యులకు భోదించాడు. బక బ్రహ్మ, ఘటికార బ్రహ్మ, సహంపతి బ్రహ్మ, సనత్కుమార బ్రహ్మ పేర్లతో పాలి సాహిత్యంలో అనేక బ్రహ్మలు కనిపిస్తారు. వీరందరూ బుద్ధుని సేవిస్తూంటారు.
 
బుద్ధుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు తన 29 వ ఏట- ఒక ముసలి వ్యక్తిని, రోగపీడితుడిని, కుళ్ళిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూసి, హృదయము ద్రవించి ప్రజల దుఃఖానికి గల కారణాలు కనుగొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం పరివ్రాజక జీవితం స్వీకరించాడు. బుద్ధుడు తన అంతఃపురాన్ని, రాజభోగాలను విడిచిపెట్టటానికి ప్రేరణ కలిగించిన- ఆ నాలుగు సంకేతాలను (ముదుసలి, రోగి, శవం, సన్యాసి) పంపించింది Ghaṭīkāra Brahmā అని బౌద్ధ Mahāvastu గ్రంథంలో ఉంది.

***
మూడు మతాలలోను బ్రహ్మ పాత్ర కనిపిస్తుంది. బౌద్ధ జైనాలలో బ్రహ్మ బుద్ధభగవానుని, తీర్థంకరులను సేవించుకొనే ద్వితీయశ్రేణి పాత్ర. బౌద్ధ సాహిత్యంలో బ్రహ్మదేవుని ప్రస్తావనలు ఉంటాయితప్ప ఇతర త్రిమూర్తులైన విష్ణువు శివుడు గురించి ఉండవు.
 
హిందూ మతంలో బ్రహ్మ మొదట్లో త్రిమూర్తులలో ఒకరిగా పూజలందుకొన్నాడు. సామాన్యశకం తొలి శతాబ్దాలవరకు ఉత్తరభారతదేశం లో బ్రహ్మదేవుడు ప్రధానపూజలు అందుకొనేవాడని The Mythology of Brahma పుస్తకంలో Greg Bailey అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు.
 
క్రమేపీ విష్ణువు శివుడు ఎక్కువ ప్రాధాన్యత పొందటం వల్ల బ్రహ్మ దేవుని ఆరాధన సర్వత్రా తగ్గిపోయింది.

 
బొల్లోజు బాబా







Wednesday, November 1, 2023

వేదబాహ్యులు

వేదబాహ్యులు 

భారతీయ తాత్విక పరంపరలో వేదాలను ప్రమాణంగా అంగీకరించని దర్శనాలలో బౌద్ధం, జైనం, చార్వాక, ఆజీవిక లు ముఖ్యమైనవి.

చార్వాకమతం

చార్వాకుడు అంటే అందమైన మాటలు (చారు-అందమైన, వాక్కు -మాటలు) చెప్పేవాడు అని అర్ధం. చార్వాకుడు ఒకడు కాదు. అనేకులు. ప్రాచీనభారతదేశంలో నాస్తికవాదానికి ప్రాతినిధ్యం వహించిన ఒకే ఒక శాఖ చార్వాకమతం. వివిధ కాలాలలో ఇది బృహస్పత్య, లోకాయత, వైతండిక అనే పేర్లతో పిలవబడింది. చార్వాకులు భిన్నకాలాలలో బార్హస్పతులు, లోకాయతులు, వైతండికులు అంటూ వివిధ పేర్లతో చెప్పబడ్డారు. వారందరినీ చార్వాకులుగా నేడు గుర్తిస్తున్నారు. అజితకేశకంబలి, మక్కలిగోశాలి, పూర్ణకాశ్యపుడు పాయాసి ఇంకా జాబాలి ఋషి, హరి వంశములో వేనరాజు లాంటి వారు చార్వాక భావాలను ప్రచారం చేసారు. హిందూ, (Naiyayika’s, Vedantins) బౌద్ధ, జైన మతాలు సైద్ధాంతికంగా చార్వాకులతో విభేదించి వారిని విమర్శించాయి.
***

చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణమును మాత్రమే అంగీకరించారు. ఇంద్రియములకు అందనివాటిని అంగీకరించలేదు. కొన్ని ప్రత్యక్ష ప్రమాణముకు తెలియవు. ఉదాహరణకు కొండపైన నిప్పు ఉందో లేదో చెప్పలేము. కానీ అక్కడ పైకి ఎగసే పొగ కనిపిస్తుంది. అప్పుడు ప్రత్యక్షప్రమాణముకు తెలిసే పొగను బట్టి నిప్పు ఉన్నదని ఊహ చేయవచ్చు. దీనినే అనుమానము అంటారు. పాపపుణ్యాలు, ధర్మాధర్మములు లాంటివి ఇంద్రియాలకు తెలియకున్నా వాటిని అనుమాన ప్రమాణముగా తీసుకొంటారు. జైన, బౌద్దులు ప్రత్యక్షము, అనుమానము అను రెండిటిని అంగీకరించారు.
ఇవి కాక- పిల్లిని బట్టి పెద్దపులిని ఊహించగలిగే జ్ఞానాన్ని ఉపమాన ప్రమాణం అని, ఇతరుల అనుభవాల ద్వారా తెలుసుకొన్న విషయాలను శబ్దప్రమాణమని అంటారు. ఈ నాలుగు ప్రమాణాల ద్వారా ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకొని జీవితంలో ధర్మార్ధ కామమోక్షాలనే పురుషార్ధాలను పొందాలని భారతీయ దర్శనాల సారాంశం . (దర్శనకర్తలు – దర్శనములు by చర్ల గణపతిశాస్త్రి)
చెవి, కన్ను, నాలుక, ముక్కు, చర్మము అనే పంచేంద్రియములు చెప్పినవి మాత్రమే ప్రమాణములుగా అంగీకరిస్తుంది చార్వాకమతం. ధర్మాధర్మములు, పాపపుణ్యములు , దేవుడు, జన్మాంతర విషయాలు లాంటివి అభౌతికాలు, ఇంద్రియగోచరములు కావు కనుక వాటిని చార్వాకులు అంగీకరించలేదు.
***
బార్హస్పత్య (Bārhaspatya/బార్హస్పత్య) పేరుమీదుగా “బార్హస్పత్య సూత్ర” గ్రంధం ఒకటి ఉండేదని ఇతర గ్రంధాల ద్వారా తెలుస్తుంది తప్ప అసలు ప్రతి లభించలేదు. ఇంతవరకూ “బార్హస్పత్య సూత్ర” గ్రంధంనుండి లభించిన సుమారు 60 శ్లోకాల ద్వారా ఇది భౌతిక వాదానికి చెందిన గ్రంథమని, దీనిలో నాస్తిక/చార్వాక సిద్ధాంతాలు స్పష్టంగా చెప్పబడ్డాయని అర్ధమౌతుంది. BCE 2 వ శతాబ్దానికి చెందిన “పతంజలి మహాభాష్య” లో బార్హస్పత్య సూత్ర ఉటంకించబడింది కనుక ఇది అంతకు పూర్వమే గ్రంథస్థం చేయబడి ఉండాలి. చార్వాక మతం బార్హస్పత్య పేరుతో కొన్నాళ్ళు మనుగడ సాగించింది.

చార్వాకమతానికే మరో పేరు లోకాయత. లోకమును మాత్రమే పట్టించుకొనే శాస్త్రం కనుక లోకాయతం అని పేరువచ్చింది. అంటే లోకులు పాటించేది అని అర్ధం. ఒక రకంగా “జనవేదాంతం”. తర్కం ప్రధానంగా ఉండే “లోకాయతం వేదవిరోధిని” అని మహాభారత వ్యాఖ్యాత నీలకంఠాచార్యుడు అన్నాడు.
లోకాయుత అన్న పదం మొదటగా కౌటిల్యుని అర్ధశాస్త్రంలో కనిపిస్తుంది. కౌటిల్యుడు లోకంలో- యోగ, సాంఖ్య, లోకాయత అంటూ మూడురకాల అన్వీక్షికులు (తర్కవేదాంతులు) ఉన్నారని వీరు తమ తర్కంతో, మతం వ్యాపారం న్యాయం వంటి వివిధ రంగాలను పరీక్షించి వాటిలోని లోపాలను ఎత్తిచూపుతారు” అంటాడు. ఇక్కడ చెప్పిన యోగ, సాంఖ్య స్కూల్స్ తో లోకాయత ఇమడదు ఎందుకంటే మొదటి రెండు వేదాలను అంగీకరిస్తాయి లోకాయత వేదవ్యతిరేకం. బహుశా తార్కికంగా వాదిస్తుంది కనుక కౌటిల్యుడు అలా చేర్చి ఉంటాడు.
 
CE 5 వ శతాబ్దపు బుద్ధఘోషుడు లోకాయతులను వైతండికులు అని వారి శాస్త్రాన్ని వైతండవాద శాస్త్రం (vitandavadasattham/ Science of Disputation) అని చెప్పాడు. లోకాయతులు(చార్వాకులు) ఇతరుల విశ్వాసాలను ఖండిస్తూ, వారికి ఏ విలువా ఇవ్వకుండా వాదిస్తారు కనుక వారిని వైతండికులని (vaitandika) పిలిచేవారు. అందరు లోకాయతులు అలా ఉండేవారు కారేమో అందుకే- తొమ్మిదోశతాబ్దపు కాశ్మిరీ జైన పండితుడు జయంత భట్ట- చార్వాకులను, ధూర్తులు, సుశిక్షితులు, గొప్ప పండితులు అని మూడురకాలుగా విభజించాడు. (రి. Lokāyata/Cārvāka: A Philosophical Inquiry Pradeep P. Gokhale పేనం. 15)

శంకరాచార్యులు భౌతికవాదులను/నాస్తికుల గురించి చెప్పవలసి వచ్చినపుడు వారిని లోకాయతికులు అన్నాడు తప్ప చార్వాక అన్న పదం వాడలేదు.
***
చార్వాక సిద్ధాంత మూలగ్రంథమైన Cārvākasūtra ఇంతవరకూ లభించలేదు కానీ దానిపై Aviddhakarṇa, Kambalāśvatara, Purandara లాంటి వారు రాసిన వ్రాసిన వ్యాఖ్యల ద్వారా చార్వాక సూత్రాలను కొంతమేరకు గుర్తించగలిగారు.
 
లోకాయుత/బృహస్పత్య/వైతండిక మతాన్ని ప్రచారం చేసే వ్యక్తులను సూచించటానికి చార్వాక అనే పదాన్ని మొదటగా ఉపయోగించినవాడు CE 7వ శతాబ్దానికి చెందిన పురందర (Purandara). ఇతను తనను, తన సహచరులను చార్వాకులని చెప్పుకొన్నాడు.
CE 8 వ శతాబ్దం వరకూ నాస్తిక/భౌతిక వాదాన్ని చెప్పటానికి బృహస్పత్య, లోకాయత, వైతండిక, చార్వాక అనే పేర్లు పర్యాయపదాలుగా వాడారు. క్రమేపీ చార్వాక అన్న పదం స్థిరపడింది. 15 వ శతాబ్దం వరకూ చార్వాకవాదం పై చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ఇక ఆధునిక కాలానికి వచ్చేసరికి చార్వాకుల గురించి మొదటగా Henry Thomas Colebrooke 1827 లో ఒక వ్యాసంలో ప్రస్తావించాడు. బౌద్ధ, జైన, హిందూ రచనలలో లభించే అనేక చార్వాక వాక్యాలను D.R. Shastri సేకరించి Cārvāka Darśana (1959) గ్రంథాన్ని రచించారు. సమకాలీనంగా Pradep P. Gokhale, Debiprasad Chattopadhyaya, Ramakrishna Battacharya వంటి వారు చార్వాకదర్శనంపై గొప్ప పరిశోధనా గ్రంథాలు వెలువరించారు.
****
.
చార్వాకమత సిద్ధాంతములు
.
చార్వాక దర్శనంలో ప్రదానమైన అంశాలు నాలుగు
ఎ. ప్రత్యక్షప్రమాణము మాత్రమే అంగీకారయోగ్యం
బి. చైతన్యం భౌతికమైనది
సి. జీవించేది సుఖించటానికే
డి. దేవుడు లేడు, స్వర్గనరకాలు లేవు. మరణాంతరజీవితం లేదు.

చార్వాకులు సూత్రీకరించిన అంశాలు, సంధించిన ప్రశ్నలు
.
1. భూమి, నీరు, నిప్పు, గాలి నాలుగు మాత్రమే ప్రత్యక్షములు. ఆకాశము లేదు.
 
2. ధర్మాధర్మములు, పాప పుణ్యములు, స్వర్గ నరకములు, అదృష్ట దురదృష్టములు అగోచరములు కనుక లేవు.
 
3.దేహంలో ఉండే చైతన్యమే ఆత్మ. వేరుగా ఆత్మలేదు

4. దేహంలోంచి ప్రాణం పోవటమే మోక్షం. కనుక మోక్షం కొరకు ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు తపస్సులు చెయ్యక్కరలేదు.
 
5. యజ్ఞంలో హింసించబడే పశువుకు స్వర్గప్రాప్తి లభించేటట్లయితే తండ్రినే హింసించి చంపి నేరుగా స్వర్గానికి పంపొచ్చు కదా!

6. శ్రాద్ధము మరణించినవారికి చేరేటట్లయితే, దూరదేశమేగినవారికి ఇంటినుంచే భోజనము పంపవచ్చు కదా!

7. ఇక్కడ ఇచ్చిన దానము పైలోకములలోని వారికి చేరేటట్లయితే, మేడ క్రింద ఇచ్చిన దానము మేడపై ఉండేవారికి చేరుతుందా!

8. జీవించినంతకాలమే ఆనందించగలం. చావుతరువాత ఏమీ లేదు
 
9. మరణించిన వ్యక్తి వేరేలోకాలకు వెళితే బంధువులను చూడటానికి ఒకసారైనా తిరిగిరాడేమి? ప్రేతకార్యాదులు కొందరకు ఒక రకమైన జీవనోపాధి

10. వేదాలు, ఆగమ శాస్త్రాలు వంటి ఏ మతగ్రంథాలనైనా జ్ఞాన హేతువులుగా భావించరాదు. వేదాలను రచించినవారు విదూషకులు, మోసగాళ్ళు, రాక్షసులు.
 
11. ఓ, దిగంబరులారా! (O,Jains), ఓ సన్యాసులారా! (O, Buddhists) దేహాన్ని కష్టపెట్టుకొంటూ అలా కఠోరమైన నియమనిష్టలతో జీవించమని మీకు ఎవరు చెప్పారు?

12. ఇంద్రియములకు తెలిసే జ్ఞానం మాత్రమే మనిషి వద్ద ఉంటుంది. విపరీతంగా చదువుకొన్న పండితులు మాత్రం “మిత్రమా చూసావా! ఈ తోడేలు పాదముద్ర ఏవేం సత్యాలు చెబుతోందో” అంటూ ప్రసంగిస్తారు. 

(తోడేలు పాదముద్ర అనేది ఒక పిట్టకథ. చార్వాకులు చెప్పారని ప్రచారంలో ఉంది.
ఒకడు తన చేతితో తోడేలు పాదముద్రను నేలపై చిత్రించి అదేమిటని సన్యాసులను అడుగగా, అది ఒక మనిషి చిత్రించి ఉండవచ్చనే కనీసఆలోచన లేకుండా వారు-- ఒక తోడేలు ఇక్కడ నిన్న రాత్రి సంచరించింది, తోడేలు పాదముద్ర కనిపించటం అదృష్టమని చెప్పినట్లుగా, కొందరు తెలివైన వంచకులు ఏ రకమైన హేతువు లేకుండా ఎదుటివారు ఏంతినాలి, ఏం తినకూడదు, ఎప్పుడు సంయోగం జరుపుకోవాలి, ఎప్పుడు జరుపుకోకూడదు, స్వర్గంలో ఏ ఏ రకాలైన సుఖాలుంటాయి అని చెబుతూ మోసగిస్తారు. ఏవి ప్రత్యక్ష ప్రమాణానికి అందుతాయో వాటినే విశ్వసించాలని, అగోచరాలు, ఊహాజనితాలు అయిన వాటిని నమ్మరాదని ఈ కథ అంతరార్థం.)

13. తపస్సు చేయటం దేహాన్ని బాధించుకోవటమే. ఉపవాసాలుండటం జీవితంలోని ఆనందాలను దూరంచేసుకోవటమే. యజ్ఞయాగాదులు చిన్నపిల్లల ఆటలు.
 
14 ఇంకా నిరూపించాల్సి ఉన్న అంశాలైన ఆత్మ, దేవుడు, మరో జన్మ, స్వర్గనరకాలు వంటి వాటి ద్వారా నిష్కపట మనస్కులు ఏ కొత్త జ్ఞానాన్ని పొందలేరు, వారి మనస్సులు కుటిల తార్కికులచే కలుషితం కానంతవరకూ (Bhattacharya, Ramakrishna. Studies on the Carvaka/Lokayata p.n 92)
***

చార్వాకులు సుఖవాదులని; వారికి నైతిక విలువలు ఉండవని; దేవుడిని అంగీకరించరని;, పాపపుణ్యాలను, ధర్మాధర్మాలను పాటించరని అటు బౌద్ధ, జైనులు, ఇటు బ్రాహ్మణవాదులు విమర్శించారు.
 
“ప్రాణం ఉండగనే దేన్నైనా ఆనందించగలం. అప్పులపాలైనా సరే నేతిని ఆరగించండి. కాలి బూడిదయ్యాకా దేహం తిరిగొస్తుందా” (jāvaj jīvet sukhaṃ jīved ṛṇaṃ kṛtvā ghṛtaṃ pibet | bhasmībhūtasya dehasya punar āgamanaṃ kutaḥ. ||)
 
పై వాక్యం ప్రసిద్ధిగాంచి మొత్తం చార్వాకవాదాన్నే నవ్వులపాలు చేసింది. 14 పైన వివిధ ప్రతుల్లో nāsti mṛtyor agocaraḥ అనే వాక్యం ఉండగా, సాయన-మాధవ సంగ్రహపరచిన “సర్వదర్శన సంగ్రహ” అనే ఒక గ్రంథంలో మాత్రమే ṛṇaṃ kṛtvā ghṛtaṃ pibet కనిపిస్తుంది. అంటే ఎవరో తుంటరి “ఎవరూ మృత్యువుకు అతీతులు కారు” అన్న చోట “అప్పులపాలైనా నేతిని ఆరగించండి” అనే వాక్యాన్ని ప్రక్షిప్తం చేసాడు. ఇది ఒకరకంగా చార్వాకసిద్ధాంతాన్ని చులకనచేయటానికే అంటాడు Bhattacharya, Ramakrishna (Bhattacharya, Ramakrishna. Studies on the Carvaka/Lokayata pno73, 124)


పురాణాలలో చార్వాకమతం

భారతీయపురాణాలు కాల్పనికత, చరిత్రల సమ్మేళనం. అనేక చారిత్రిక పాత్రలు పురాణపాత్రలుగా రూపుదిద్దుకోవటం గమనించవచ్చు. వాస్తవికతకు దగ్గరగా ఉండే పురాణ ఉదంతాల ద్వారా చారిత్రిక పాత్రలను సులభంగానే పోల్చుకోవచ్చును. చార్వాకదర్శనం యొక్క సూత్రాలు బ్రాహ్మణవాద సాహిత్యంలో అక్కడక్కడా కనిపిస్తాయి.
.
1. రామాయణంలో చార్వాక మతం (Ayodhya Kanda in Prose Sarga 109)

శ్రీరామచంద్రుడు తండ్రిమాటమీద అరణ్యవాసానికి బయలుదేరినపుడు ధశరధుని ఆస్థానపండితుడైన జాబాలి అనే బ్రాహ్మణుడు – “రామా! మనిషి ఒంటరిగా పుట్టి ఒంటరిగా మరణిస్తాడు. తల్లిదండ్రులపట్ల వాత్సల్యం కలిగినవాడు పిచ్చివాడు. తండ్రిమాటపై రాజ్యాన్ని త్యజించి అడవులలో నిన్ను నీవు హింసపెట్టుకోవటం నీ పని కాదు.
ఓ యువరాజా! అయోధ్య నీకొరకు ఎదురుచూస్తోంది. రాజభోగాలు అనుభవించు. తండ్రి ఎవరు నీకు? తండ్రికి నీవెవ్వడవు? మీ తండ్రిగారి శ్రాద్ధకర్మల పేరిట ఆహారాన్ని వృధాచేస్తున్నారు. మృతి చెందినవాడు తింటాడా? బలులు, దానాలు, యాగాలు ఇవన్నీ ప్రజలను లొంగదీసుకోవటానికి, ధనార్జనకు తెలివైన వారు పన్నిన పన్నాగం.
 
ఓ జ్ఞానీ! కంటికి కనిపించేవాటికి ప్రాధాన్యత ఇవ్వండి, అగోచరమైనవాటిని తిరస్కరించండి”- అని అన్నాడు.
 
జాబాలి మాటలకు రాముడు- “ఓ బ్రాహ్మణా! ఇది కర్మభూమి. దీనియందు పుణ్యపురుషులెప్పుడూ వేదవిహిత కార్యములు, పుణ్యకర్మలు ఆచరించాలి. నూరు యాగములు చేసి ఇంద్రుడు స్వర్గాధిపతి పదవిని సంపాదించెను. తపోనిష్టలతో ఎల్ల ఋషులు స్వర్గము పొందిరి. మీ సలహా వైదిక విరుద్ధము. అధర్మమార్గమున నడిచే నీవంటి నాస్తికుని, దుష్టుడని చేరదీసినందుకు నా తండ్రిని నిందించాలి.
 
వేద ప్రామాణ్యమంగీకరింపనట్టి నాస్తికుడును, బుద్ధుడును చోరునివలె నిరాకరింపదగినవారు. అట్టి వేదబాహ్యుడైన నాస్తికునితో వివేకి వ్యవహరింపరాదు” అన్నాడు. (అయోధ్యా కాండము, శ్రీమతి శ్రీమత్తిరుమల పెద్దింటి వెంకట సీతమ్మ)

పై సంభాషణ ద్వారా జాబాలి తనమాటలలో చార్వాకవాదాన్ని స్పష్టంగా పలికించాడు. దాని ఖండనను "రామో విగ్రహవాన్ ధర్మః'' అని కీర్తించబడిన రాముడి నోటి ద్వారా చెప్పించి చార్వాకవాదాన్ని పూర్వపక్షం చేయటానికి వాల్మీకి ప్రయత్నించినట్లు అర్ధం చేసుకోవాలి.
వేదాలను అంగీకరింపక శూద్రుడైన శంబూకుడు తపస్సు ఆచరించినందుకు శ్రీరాముడు అతడిని వధించిన రామాయణ ఉదంతం కూడా వేదాలను తిరస్కరించే నాస్తికులకు ఒక హెచ్చరిక.

2. భారతంలో చార్వాకుడి ప్రస్తావన

చార్వాకుడనెడి వాడు ఒక రాక్షసుడని, ధుర్యోధనుడి మిత్రుడని భారతములో ఉన్నది.
మహాభారతయుద్ధం ముగిసాక ధర్మరాజు విరాగియై రాజ్యం చేపట్టనని ఖిన్నుడై ఉండగా, మహర్షులు అతనికి కర్తవ్యం భోధించి రాజ్యాభిషిక్తుడిని చేసిన సందర్భములో చార్వాకుడు ఒక బ్రాహ్మణుడి వేషములో అక్కడకు వచ్చి ధర్మరాజును “నువ్వు స్వజనుల క్షయం గావించావు, నీవు ప్రజాపాలనకు తగవు, జ్ఞాతినాశనము, గురుజనహింస చేసిన నీవు జీవించుటకంటే మరణించుట మేలు” అని నిందించగా ఆ సభలోని విప్రోత్తములందరూ మీదపడి గాయపరచగా చార్వాకుడు చనిపోయాడు.
 
అలా మాట్లాడిన వ్యక్తి తమ వాడు కాదని, అతను ధుర్యోధనుని స్నేహితుడని, బ్రాహ్మణరూపంలో వచ్చిన రాక్షసుడని ధర్మరాజుకు ఆ బ్రాహ్మణులు సర్దిచెప్పారు.
ఆనాడు సమాజంలో ఆదరణ పొందుతున్న చార్వాక నెరేటివ్ ని ఖండించే కౌంటర్ నెరేటివ్ ఇది. కానీ ఇందులో "చార్వాక " పేరుతో చెప్పింది నాస్తికవాదం కాక యుద్ధం చేసి నువ్వు హింసకు పాల్పడ్డావు అంటూ అహింసావాదాన్ని చెప్పటం గమనార్హం.

3. చార్వాక మతంలో బృహస్పతి పాత్ర

బృహస్పతి దేవగురువు. అసురులు వేదోక్తంగా యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ తత్ఫలితంగా అమేయబలసంపన్నులై దేవతలను జయించసాగారట. దేవతలకు అసురులవలన కలుగుతున్న బాధలను తొలగించటానికి ఒక ఉపాయము చేసాడట. దీనిప్రకారం- అసురులకు వేదాలపట్ల గౌరవం తగ్గి, వారిని వేద నిందకులుగా మార్చటానికి, తద్వారా వారు నిర్వీర్యులవటానికి కొన్ని సూత్రాలను రచించాడట.
 
బృహస్పతి ఈ సూత్రాలను చార్వాకుడు అనే తన శిష్యుని ద్వారా ప్రచారింపచేసాడని, వాటి కారణంగా రాక్షసులు వేదనిందకులై యజ్ఞయాగాదులను నిలిపివేసి బలహీనులుకాగా వారిని దేవతలు సులువుగా ఓడించారని దేవీ భాగవతంలో ఉంది.
అలా చార్వాక మతం చేసిన బోధనలను దేవతల గురువైన బృహస్పతి చేసిన ఒక "యోచన"గా హిందూ పురాణాలు అప్రాప్రియేట్ చేసుకొన్నాయి. (ఇదే తరహా ఉదంతం ద్వారా మాయామోహనుడు పేరుతో బుద్ధుని బోధనలను అప్రాప్రియేట్ చేసుకొన్నట్లు విష్ణుపురాణంలో కూడా కనిపిస్తుంది)

4. భగవద్గీతలో చార్వాకదర్శనం

భగవద్గీత 16 వ అధ్యాయం, దైవాసురసంపద్విభాగ యోగం లో అసుర దైవ లక్షణాలను వివరిస్తూ కృష్ణుడు చార్వాకభావాలను అసురులకు ఆపాదిస్తూ ఇలా అంటాడు – “అసుర స్వభావం కలవారు ప్రవృత్తిని కాని నివృత్తిని గాని ఎరుగరు. వాళ్ళలో శౌచమూ, ఆచారమూ, సత్యమూ ఉండవు. జగత్తు మిధ్య అనీ, దానికి ధర్మా ధర్మాలు ఆధారము ఉండవని, ఈశ్వరుడే లేడనీ ఈ ప్రపంచములోని ప్రాణులు స్త్రీ పురుషుల కలయిక వలననే పుట్టాయని వారు అంటారు. అందుచేత ఈ జగత్తుకి కారణం కామమే అంటారు అసుర జనులు. ఈ దృష్టినే పట్టుకుని వేలాడుతూ వీళ్ళు ధర్మ భ్రష్టులై సంకుచిత బుద్ధులై, ప్రపంచానికి శత్రువులై, కౄరకర్ములై లోక నాశనం కోసం పుడతారు. (వికీ సోర్స్)
పై వాక్యాలు చార్వాకవాదానికి ప్రతివిమర్శగా రాసారని ఇట్టేపోల్చుకోవచ్చును. “అప్పుచేసైనా నెయ్యి తిను” అని ప్రక్షిప్తం చేసినట్లుగానే “ఈ జగత్తుకు కారణం కామమే” అని చార్వాకులు అన్నట్లు ప్రచారించారు. దీనికి ఆధారంగా చార్వాకమతానికి చెందినదని చెప్పబడే “kāma evaikaḥ puruṣārthaḥ” (కామం మాత్రమే పురుషార్ధం) అనే వాక్యాన్ని చూపుతారు. ధర్మార్ధకామ మోక్షాలను పురుషార్ధాలుగా చెప్పటం బ్రాహ్మణీయభావజాలం. తదుపరి జన్మ, మోక్షం లాంటి భావాలను అంగీకరించక, స్వేచ్ఛాజీవనాన్ని ప్రవచించిన చార్వాకులు పురుషార్ధాలు అనే చట్రాన్ని అంగీకరించి ఉంటారా అని Battacharya ramkrishna ప్రశ్నిస్తారు.

మహాభారతం వనపర్వంలో (33:57) చిన్నప్పుడు తండ్రి ఒడిలో కూర్చుని ఒక బ్రాహ్మణుడు చెప్పే బార్హస్పత్య సూత్రాలను ఏపనీ లేకపోయినా ఏదో పనికల్పించుకొని వెళ్లి వినేదానినని ద్రౌపతి ధర్మరాజుతో చెబుతుంది. (వనపర్వం నీతిం బృహస్పతిప్రొక్తాం భరాతౄన మే ఽగరాహయత పురా/తేషాం సాంకద్యమ అశ్రౌషమ అహమ ఏతత తథా గృహే)

ఆరుగురు గురువులు

BCE 5 వ శతాబ్దానికి చెందిన మగధరాజైన అజాతశత్రు ఒకరోజు రాజభవనం మిద్దెపై కూర్చుని తాత్వికచర్చ చేయటానికి సరైన సన్యాసి ఎవరున్నారు అని తన మంత్రులను అడగగా వారు- అజితకేశ కంబళ, పూరన కస్సప, మఖలి గోశాల, పకుధకచ్ఛాయన, సంజయబేలత్తిపుత్త, నిగంత్తనాతపుత్త అనే ఆరుగురి పేర్లు చెప్పి; వీరందరూ చాలాకాలంగా సన్యాసిజీవనాన్ని గడుపుతున్నారని, ప్రతిఒక్కరు తమదైన తాత్విక సంప్రదాయాన్ని నెలకొల్పి దానికి గురువులుగా ఉంటూ దాన్ని ప్రచారం చేసుకొంటున్నారని చెప్పారు. అదే సమయంలో అజాతశత్రు వ్యక్తిగత వైద్యుడైన జీవకుడు, ఆసమయంలో రాజగ్రుహలో సమీపంలో బసచేసి ఉన్న బుద్ధుని వద్దకు అజాతసత్రుని తీసుకొని వెళ్లాడని బౌద్ధ గ్రంథం Samannaphala Sutta లో ఉంది.

1. అజిత కేశకంబళ

BCE 6 వ శతాబ్దానికిచెందిన అజిత కేశకంబళ మొట్టమొదటి భౌతికవాది. ఇతను బుద్ధుని సమకాలీనుడు. ఇతనికి పూర్వం ప్రాచీనభారతీయ సాహిత్యంలో భౌతిక వాద ఛాయలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తిగా అజితకేశకంబళ పేరు ప్రాచీన భారతవేదాంత గ్రంధాలన్నింటిలో కనిపిస్తుంది. ఇతడు చెప్పినబోధనలకు సంబంధించిన వివరాలు నేరుగా దొరకవు. బౌద్ధ పాలి, జైన ప్రాకృత రచనలలో ఇతని గురించిన ప్రస్తావనలు విరివిగా లభిస్తాయి. వారు ఇతని సిద్ధాంతాన్ని స్మశానవైరాగ్యంగా అభివర్ణించారు. బౌద్ధ, జైన మతాలు అజితకేశకంబలను వారికి పోటీ దారునిగా చూసిన కారణంగా వారి వ్యాఖ్యలు అంత విశ్వసనీయమని భావించలేం. (రి. Studies on Carvaka/Lokayata by Battacharya ramkrishna pno28 )

అజితకేశ కంబళ బుద్ధుని కంటే వయసులో పెద్ద. ఇతను మనిషివెంట్రుకలతో చేసిన కంబళి వేసుకొని తిరిగేవాడు. Anguttara Nikaya (3.135) లో బుద్ధుడు అజితకేశ కంబళునిగురించి ఇలా అన్నాడు-“ఇతను వేసుకొనే వెంట్రుకల దుస్తులు చాలా అసౌకర్యం. వేసవిలో వెచ్చగా, శీతాకాలంలొ చల్లగా, దుర్వాసనవేస్తూ, దురదలు కలిగిస్తూ ఉంటాయి ” (The historical buddha, The times, Life and Teachings of the founder of Buddhism, Hans Wolfgang Schumann pn 221)

మగథ రాజైన అజాతశతృతో అజితకేశకంబళి చేసిన సంభాషణ Sāmañña-phala-sutta లో ఇలా ఉంది.
“ఓ మహారాజా! దానాలు, బలులు, నైవేద్యాల వల్ల ఏ ఫలితమూ లేదు. మంచి చెడు కర్మలంటూ ఏమీ లేవు. ఈ లోకము లేదు పర లోకమూ లేదు”.
పై వాఖ్యలోని చివరిభాగం మహాభారతంలో కనిపిస్తుంది. భీష్ముడు యుధిష్టిరునితో “కొంతమంది “ఈ లోకము లేదు పర లోకమూ లేదు” అని భావిస్తారు. అటువంటి నాస్తికులను నమ్మరాదు” అంటాడు. (శాంతిపర్వం131.13)

దాదాపు అదే వాక్యం భగవద్గీతలో కూడా కనిపిస్తుంది (4.40) సంశయంలో పడ్డవాడికి “ఈ లోకము లేదు పర లోకమూ లేదు”. సుఖం కూడా లేదు.

సమాధానం ఇవ్వకతప్పని వాదన చేసాడు అజితకేశకంబళ. దానికి ఒక చోట అలాంటి వారిని నమ్మరాదని, మరో చోట వారు సంశయవాదులని, వారికి సుఖం ఉండదని మహాభారతం ద్వారా బ్రాహ్మణవాదులు సమాధానం ఇచ్చారు. అజితకేశకంబళ చేసిన భావవాదపు శక్తి అది.
Dlgha Nikaya 2.23 లో అజితకేశకంబల ఇతర ప్రవచనాలు ఇలా ఉన్నాయి

1. మంచి చెడు కర్మలంటూ ఏమీ లేవు.
2. స్వర్గ నరకాలు ఏమీ లేవు.
3. తల్లి దండ్రి అంటూ ఎవరూ లేరు. వారికి చేసే మంచి చెడులకు ఫలితాలు ఏమీ ఉండవు
4. మరణించాక మరుజన్మ, ఆత్మ అంటూ ఏమీ ఉండవు. ఈ దేహంలోని మట్టి మట్టిలో, నీరు నీటిలో, గాలి గాలిలో, వెచ్చదనం నిప్పులో, ఆలోచనలు శూన్యంలో కలిసిపోతాయి.
5. మూర్ఖుడు, జ్ఞాని చనిపోయాకా ఒకేలా మట్టిగా మారతారు.
6. శవాన్ని నలుగురు స్మశానానికి మోసుకెళతారు. కొన్నాళ్లకు పావురంరంగులోకి మారి వెలిసిపోయిన ఎముకలు మాత్రమే స్మశానంలో మిగులుతాయి.
6. చనిపోయిన వ్యక్తిపేరిట దానదర్మాలు చేయటం అవివేకం
అజిత కేశకంబళి నెలకొల్పిన సంప్రదాయం CE 6 వ శతాబ్దపు చార్వాకుల వరకూ కొనసాగి ప్రశ్నించటం, వాదించటం, ధిక్కరించటం ఈ దేశ సంస్కృతికి, బహుళత్వానికి వెన్నుగర్ర అని నిరూపించింది.

2. పూర్ణ కాశ్యప/పూరన కస్సప

పూర్ణకాశ్యపుని గురించిన ఆధార గ్రంథాలు లభించవు. జైన బౌద్ధ రచనలలో ఇతనిని విమర్శిస్తూ చేసిన కథనాల ద్వారా ఇతను వేదాలను తిరస్కరించి, దిగంబరంగా సంచరిస్తూ, భౌతికవాదాన్ని ప్రవచించాడని అర్ధమౌతుంది. ఇతను- ఒక గృహబానిస అని, ఇంటినుండి పారిపోగా, దారిలో దొంగల దోపిడీకి గురయి కట్టుబట్టలుకూడ కోల్పోయి దిగంబరంగా సంచరిస్తూ, అందరిని అపహాస్యం చేస్తూ చివరకు నిరాశతో, దుఃఖితుడై చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడని బుద్ధ ఘోషుడు తన “సుమంగళ విలాసిని” అనే గ్రంథంలో పేర్కొన్నాడు (రి. Lokayata a Study in Ancient Indian Materialism, Debiprasad Chatopadhyaya pn 513)
 
పూర్ణ కాశ్యపుడు చాన్నాళ్ళు గృహస్థుగా జీవించాడని, సన్యసించాక తనకు వచ్చే భిక్షాన్ని నాలుగుభాగాలు చేసి మూడుభాగాలు బాటసారులకు, కుక్కలకు, కాకులకు, చేపలకు పంచి నాలుగోభాగాన్ని తను తినేవాడని - “భాగవతీ సూత్ర” అనే జైన గ్రంథంలో కనిపిస్తుంది.
పూర్ణ కాశ్యప బోధించిన వాటిలో ముఖ్యమైన అంశాలు-యజ్ఞయాగాదులు, కర్మకాండలు , పాపపుణ్యాలు, స్వర్గనరకాలు లేవు. మంచి చేస్తే పుణ్యం రాదు, చెడు చేస్తే పాపం అంటదు. దానధర్మాలు అర్ధరహితం. ఈ ప్రపంచం నియతిజనితం (ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది అనే వాదన /Every thing is born of destiny).
 
15 వ శతాబ్దపు జైనపండితుడు గుణరత్న తాను రచించిన “తర్క రహస్య దీపిక” అనే గ్రంథంలో పూర్ణ కాశ్యపుడు ప్రవచించిన నియతివాదాన్ని ప్రస్తావించాడు. పాలిరచనల్లో చెప్పిన పూర్ణ కాశ్యపుని బోధనలు రెండువేల ఏండ్ల తరువాత కూడా ఉటంకించబడటం భౌతికవాద దృక్ఫథపు బలంగా భావించాలి.

3. మఖలి గోశాల (చూడుడు అంతర్ధానమైన ఆజీవిక మతం వ్యాసం.)

4. పకుధ కచ్ఛాయన /ప్రకృత కాత్యాయనుడు
.
పకుధ కచ్చాయన భౌతికవాది. ఇతను కర్మవాదాన్ని అంగీకరించలేదు. ప్రకృతిలో భూమి, నీరు, అగ్ని, గాలి తో పాటు జీవితము, సుఖ, దుఃఖాలు కూడా ఉంటాయని చెప్పాడు. ఈ ఏడు అంశాలు స్థిరమైనవి, మార్పులేనివి ఒకదానిని మరొకటి ప్రభావితం చేయలేనివి అంటాడు. భౌతిక అంశాలతో పాటు అభౌతికాలైన జీవితము, సుఖదుఃఖాలను చేర్చటం అనేది కచ్ఛాయన సిద్ధాంతంలోని ప్రత్యేకతగా భావించాలి.

5. సంజయబేలత్తిపుత్త

సంజయబేలత్తిపుత్త స్పష్టమైన భౌతిక వాది. గోచరమైనవి తప్ప మిగిలినవాటిని నమ్మరాదని ప్రవచించాడు. ఇది కొంతమేరకు చార్వాకుల వాదం. ఇతను ఏ సమకాలీన సిద్ధాంతాలను అంగీకరించనూ లేదు ఖండించనూ లేదు. ఈ లోకంలో దేనిమీదా సంపూర్ణమైన అవగాహన ఉండదని, ఒకే అంశాన్ని భిన్నవిధాలుగా వ్యాఖ్యానించవచ్చుకనుక, ఇది మంచి, ఇది చెడు, ఇది సరైనది, ఇది తప్పు అని వాదులాడుకోవటం అర్ధరహితమని ఇతను అభిప్రాయపడ్డాడు. ఇది ఒక రకంగా సంశయవాదం. (skepticism). బుద్ధుని వద్ద శిష్యులుగా చేరకముందు సరిపుత్త, మహామొగ్గల్లన లాంటివారు సంజయవద్ద కొంతకాలం శిష్యరికం చేసారు.

6. నిగంత్తనాతపుత్త

జైన మతానికి చెందిన 24 వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు బౌద్ధసాహిత్యంలో నిగంత్తనాతపుత్త గా చెప్పబడ్డాడు. నిర్గ్రంథులతో (దిగంబరులు) చేతులు కలిపిన నాత వంశీకుడు అని అర్ధం. ఇతని నిజజీవిత పేరు వర్థమాన. సైన్యాద్యక్షుడైన తండ్రిపేరు సిద్థార్ధ, తల్లి త్రిశల. వైశాలి సమీపంలో ఇతను BCE 557 లో జన్మించాడు. ఇతనికి జైన మహావీర అనే బిరుదు కలదు. ఇతని తల్లిదండ్రులు పార్శ్వనాథుని బోధనలను ఆచరించేవారు. వారు సల్లేఖవ్రతం (Fast onto death) చేపట్టి మరణించాకా, వర్ధమాన మహావీరుడు తన ముప్పై ఏండ్లవయసులో ఇంటిని విడిచిపెట్టి శ్రమణ జీవితాన్ని ప్రారంభించాడు. ఇతని బోధనలు జైన ధర్మానికి చెందినవి.
.
***
పాయాసి

ఇతను ఒక రాజు. బౌద్ధ, జైన, బ్రాహ్మణవాద మతాలకు వివిధ కాలాలలో వివిధ రాజుల ఆదరణ లభించి అవి ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. చార్వాక వాదానికి ఏ రకమైన రాజాదరణ లభించలేదు కానీ పాయసి అనే రాజు భౌతికవాదాన్ని కొన్ని జుగుప్సాకర ప్రయోగాల ద్వారా పరీక్షించి వాటి నిగ్గు తేల్చాలని చూసినట్లు కొన్ని బౌద్ధ జైన రచనలలో కనిపిస్తుంది.
ఆత్మ లేదు అని చార్వాకులు చెప్పారు. ఆత్మ ఉందాలేదా అనే విషయాన్ని తెలుసుకోవటానికి పాయాసి- ఒక దొంగను పెద్ద ఇత్తడి పాత్రలో ఉంచి దానిమూతను తగరంతో అతికింపచేసాడు. ఆ పాత్రలో దొంగచనిపోతే ఆత్మ ఏ విధంగా బయటకు వెళుతుందో చూడాలనుకొన్నాడు. మరొక ప్రయోగంలో పెద్దపాత్రలో ఉంచిన వ్యక్తి బరువు చనిపోకముందు చనిపోయాకా ఏమైనా తేడా ఉందా లేదా అని కూడా పరీక్ష చేసాడు. ఈ ప్రయోగాలన్నీ దేహాత్మవాదం నిగ్గు తేల్చటానికే.

ముగింపు

బౌద్ధజైనాలు చార్వాకులను అంగీకరించకపోవటానికి కారణం వారు పునర్జన్మను, నైతిక, ధార్మిక జీవనాన్ని విశ్వసించారు. ఈ లోకంలో తర్కం వెర్రితలలు వేయకుండా కొన్ని మతగ్రంథాలను ఏర్పరచుకొని వాటి ఆధారంగా ఒక పరిధి విధించుకొని జీవించటం ఉత్తమజీవనం అని నమ్మారు. వారికి చార్వాకుల తర్కం విచ్చలవిడితనంగాను, వితండవాదంగాను కనిపించింది. ఆకారణంగా బౌద్ధ, జైనులు చార్వాక సిద్ధాంతాన్ని తిరస్కరించి తమ గ్రంథాలలో చార్వాకసిద్ధాంతాలను ఖండించారు.
 
కూర్మపురాణం (CE 550-800) బౌద్ధులు, జైనులు, పంచరాత్రలు, కాపాలికులు, పశుపతులు అంటూ ఐదురకాల వేదబాహ్యులను పేర్కొనింది. పంచరాత్ర కల్ట్ మొదట్లో వేదబాహ్యంగా ఉన్నప్పటికీ క్రమేపీ వైష్ణవంలో కలిసిపోయి వేదావలంబిగా మారిపోయింది.
 
పదిహేనవ శతాబ్దంలో ఆంధ్రదేశంలో బౌద్ధులు, చార్వాకులు, జైనులే కాక పాషండులు, కాపాలికులు, పాశుపతులు పేర్లతో నాస్తికులు ఉన్నారని శృంగార నైషద పద్యంలో (7-127) శ్రీనాథుడు చేసిన వర్ణనను బట్టి తెలుగునేలపై ప్రాచీన వేదబాహ్య జీవనవిధానాలు నిన్నమొన్నటి వరకూ మనుగడ సాగించాయని, ఇక్కడి ప్రజలు సాంస్కృతికంగా వైవిధ్యాన్ని కలిగిఉండేవారని అర్ధమౌతుంది.
***
భిన్న ప్రాచీన భారతీయ దర్శనాలు ఒకదానినొకటి కబళించే శతృశిబిరాలుగా లేవు. వేరు వేరు సంప్రదాయ శాస్త్రాలుగా సమాంతరంగా మనుగడ సాగించాయి. ఇవి ఒకదాని లోపాలను మరొకటి ప్రశ్నించుకొంటూ ఒకదానినొకటి పూరించుకొంటూ సాగాయి తప్ప ఒకదానినొకటి తొలగించుకోలేదు. అగ్నివేషుడు, కౌటిల్యుడు, వాల్మీకి, వ్యాసుడు లాంటి వారు తాము నమ్మిన విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అప్పటికి ప్రచారంలో ఉన్న అన్ని దర్శనాలను తమరచనలలో ఉటంకించారు. వాటిలోని అసంబద్దతలను ఖండించారు. వైరుధ్యాలను కలిగిఉండటం మానవ మేథ యొక్క భిన్నపార్శ్వాల ఆవిష్కరణగా చూసారు.

 
బొల్లోజు బాబా


సంప్రదించిన పుస్తకాలు

1. Bhattacharya, Ramakrishna. Studies on the Carvaka/Lokayata
2. The historical buddha, The times, Life and Teachings of the founder of Buddhism, Hans Wolfgang Schumann
3. Lokayata a Study in Ancient Indian Materialism, Debiprasad Chatopadhyaya
4. దర్శనకర్తలు – దర్శనములు by చర్ల గణపతిశాస్త్రి
5.Lokāyata/Cārvāka: A Philosophical Inquiry Pradeep P. Gokhale
6. History and Doctrines of THE AJIVIKAS, AL Bhasham
7. ON HINDUISM Wendy Doniger
8. చార్వాక దర్శనం – డా. కత్తి పద్మారావు
9. ఆస్తికత్వము by వారణాసి సుబ్రహ్మణ్యం
10. అయోధ్యా కాండము, శ్రీమతి శ్రీమత్తిరుమల పెద్దింటి వెంకట సీతమ్మ