Tuesday, November 14, 2023

వేదబాహ్యులు - చరిత్ర వ్యాసాలు, e.book


గత నాలుగు సంవత్సరాలుగా బుద్ధిజం, జైన, చార్వాక, ఆజీవిక, లకులీశ సంప్రదాయాలపై రాసిన వ్యాసాలు ఒకచోట ఉండాలనే ఉద్దేశంతో "వేద బాహ్యులు" పేరుతో ఇ.బుక్ గా కూర్పు చేసాను. దానికి రాసుకొన్న ముందుమాటలు ఇవి.
పుస్తకం లింకు ద్వారా  డౌన్ లోడ్ చేసుకొనవచ్చును.
 
****
మనవి మాటలు
ప్రాచీన భారతదేశ ప్రజల విశ్వాసాల గురించి అధ్యయనం చేయటం ఒక నిరంతర శోధన. వైదిక మతానికి వెలుపల ఎన్నో సంస్కృతులు ఈ నేలపై సహజీవనం చేసాయి.
హిందూమతం రూపుదిద్దుకొనకముందు ఈ నేల భిన్న సంప్రదాయాలకు, విశ్వాసాలకు ఆలవాలంగా ఉంది. వైదిక సంప్రదాయం మాత్రమే భారతదేశపు ఆత్మ అని పలికే మాటలకు ఈ వేదబాహ్య సంస్కృతి ఒక కనువిప్పు.
 
కూర్మపురాణం (CE 550-800) బౌద్ధులు, జైనులు, పంచరాత్రలు, కాపాలికులు, పశుపతులు అంటూ ఐదురకాల వేదబాహ్యులను పేర్కొనింది. పంచరాత్ర కల్ట్ మొదట్లో వేదబాహ్యంగా ఉన్నప్పటికీ క్రమేపీ వైష్ణవంలో కలిసిపోయి వేదావలంబిగా మారిపోయింది.

వేదబాహ్యులను నీతిశాస్త్రాలు చాలా తక్కువతనం చేసి మాట్లాడాయి. గృహస్తులెవరూ వీరిని ఆదరించరాదని మనువు; నాస్తికులను పరిహరించాలని యాజ్ఞవల్క్యుడు; సాక్షులుగా పెట్టుకోరాదని నారదుడు; ఆపత్సమయాలలో వేదబాహ్యుల ఆస్తులను రాజు స్వాధీనం చేసుకొనవచ్చునని అంతేకాక వారితో సన్నిహితంగా ఉండేవారిపై అధికపన్నులు విధించవచ్చునని కౌటిల్యుడు; సౌరపురాణంలో వేదబాహ్యులు రాజ్యంలోకి ప్రవేశించరాదని; శుక్రనీతి సార లో వేదబాహ్యులను రాజు శిక్షించాలని; అంటూ నీతిశాస్త్రకారులు తమ తమ గ్రంథాలలో వీరిపట్ల సమాజం వ్యవహరించాల్సిన పద్దతులను నిర్ధేశించారు. ఇన్ని వెలివేతలు పెట్టినా సంఘంలో వేదాలను ధిక్కరించి జీవించేవారి సంఖ్య తక్కువ ఏమీ ఉండేది కాదు.
 
ఈ వైదిక, అవైదిక విశ్వాసాలు చరిత్రలో ఘర్షించుకొన్నాయి. ఒకదానినొకటి మెరుగుపరుచుకొన్నాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. భారతీయ ఆత్మను, బహుళతను తీర్చిదిద్దటంలో వేదబాహ్యులు పోషించిన పాత్ర గణనీయమైనది. విస్మరింపరానిది.
ఈ వ్యాసాలు గతనాలుగేళ్ళుగా రాసినవి. ఒకే అంశాన్ని ఆవిష్కరించే వీటిని ఒకచోటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఇ.బుక్ గా కూర్పు చేసాను.

మీకు నచ్చుతుందని భావిస్తాను

భవదీయుడు
బొల్లోజు బాబా
06/11/2023

పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

No comments:

Post a Comment