Monday, June 1, 2009

మహాప్రస్థానం - చలం యోగ్యతాపత్రం

పిచ్చిరెడ్డి, ఎమ్‌.. విధ్యార్ధి ప్రశ్న: యోగ్యతాపత్రం చదివితే మహా ప్రస్థానం గీతాలు మరి చదవక్కరలేదు అనుకుంటా. మీరేమంటారు?
శ్రీశ్రీ జవాబు : ఏమంటాను? మీరు సార్ధకనామధేయులంటాను.

******

శ్ర్రీశ్రీ ని కాస్తంత అసహనానికి గురిచేసిన ప్రశ్న సామాన్యమైనదేమీ కాదు. కారణాలు తెలియవు కానీ మహాప్రస్థానం కొన్ని ముద్రణలను చలం యోగ్యతా పత్రం లేకుండానే ప్రచురించారు.

తెలుగు సాహిత్య చరిత్రల్లో వేళ్లపై లెక్కించదగిన కొన్ని ముందుమాటల్లో, చలం మహాప్రస్థానానికి వ్రాసిన యోగ్యతాపత్రం ముందుంటుంది.

శ్రీశ్రీ పేరు తలచుకోగానే మహాప్రస్థానం ఎలాగ గుర్తుకు వస్తుందో, మహాప్రస్థానాన్ని గుర్తుచేసుకొంటే, దానికి చలం వ్రాసిన యోగ్యతాపత్రం తలపుకు వస్తుంది. మహాప్రస్థానానికి చలం వ్రాసిన ముందుమాటను మొదట " మహాప్రస్థానానికి జోహార్లు" అని పేరుపెట్టినట్లు, దానిని శ్రీశ్రీ యోగ్యతాపత్రంగా మార్చారని అంటారు.

గీతాంజలికి వ్రాసుకొన్న ముందుమాటలో చలం ఇలా అంటాడు. "గీతాంజలి గురించి చలానికి ఏమితెలుసు? అసలు టాగోర్ కు ఏమి తెలుసు?" మొదటి ప్రశ్న వద్ద ఆహా ఏమి వినయం అనుకొంటాం. రెండో వాక్యం పూర్తయ్యేసరికి షాక్ లాంటిదేదో తగిలి, పుస్తకం ఒక్కక్షణం పక్కన పెట్టి ఆలోచించవలసిందే. అదే చలం గొప్పతనం. ఏదైనా ఒక విషయాన్ని (ఇక్కడ గీతాంజలి గొప్పతనాన్ని) చదువరి హృదయంలోకి గొప్ప ఒడుపుతో ప్రవేశపెట్టగలడు.

యోగ్యతాపత్రం కూడా అలాంటిదే. 1940 లో వ్రాసిన యోగ్యతాపత్రంలో చలం చేసిన పరిశీలనలు ఈనాటికీ నిలబడ్డాయంటే, అది ఆయన దార్శనికతకు నిదర్శనం.

కవిత్వాన్ని తూచే రాళ్లు నావద్ద లేవంటూ, అత్యంత మోడెస్టీ తో ప్రారంభించి, ఒక యుగాన్ని శాసించబోయే కవిని, ఆతని కవిత్వతత్వాన్ని గొప్పగా ఆవిష్కరిస్తాడు.

"కవిత్వంలోనూ జీవితంలోనూ, economy of words and thoughts లేకపోవటం దేశభక్తి కన్న హీనమైన పాపం, ఆత్మలోకంలో దివాలా" అన్న మాటలు జీవితానికి, కవిత్వానికి ప్రామాణిక సూత్రాలే. ఇక్కడ చలం దేశభక్తి అంటున్నది, హిపోక్రిసీతో ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే కుహనా రాజకీయనాయకుల గురించేనని వేరే చెప్పుకోనక్కరలేదు. విషయం లేకుండా చెప్పిందే చెప్పుకుంటూ పోయే గాఢత లోపించే కవిత్వం గురించీను.

తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వమంటాడు చెలం. కవి తన సమాజంలో ఉన్న విషయాలను, తన అనుభవాలను కలగలిపి కవిత్వాన్ని సృష్టిస్తాడు. దాన్నే యుద్దారావమని చలం, పురిటినొప్పులని శ్రీశ్రీ అన్నారు. ఇదేమాట చలం సాహిత్యానికి కూడా వర్తిస్తుంది.

కృష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే, శ్రీశ్రీ అందరిబాధనూ తనలో పలికిస్తాడు.
కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ.

అప్పటి ప్రముఖ కవి అయిన కృష్ణ శాస్త్రికి శ్రీశ్రీకి ఉన్న ప్రధానమైన వ్యత్యాసాన్ని చాలా చిన్న చిన్న మాటలలో చలం చెప్పిన వాక్యాలు వారి కవిత్వతత్వాన్ని బహు లాఘవంగా ఇముడ్చుకొన్నాయనే అనుకోవచ్చు. వాక్యాలు తెలుగు సాహిత్యరంగంలో వారి సాహిత్యాలకు నిర్వచనాలవలె నిలచిపోయాయి.


సొంత ఇల్లూ, అణగారిన భార్య, ప్రతి సంవత్సరం పై క్లాసులోకి వెళ్ళే కొడుకూ, bank-account, వొట్టిపోని ఆవుతో తృప్తిపడే సంసారుల శాంత హృదయాలమీదినుంచి యీ గీతాల్లోని ఉద్రేక ఉత్సాహాలు విశాఖ పట్నం సముద్రంలో నల్లరాళ్ళ మీద అలలు విఫలమైనట్లు దొర్లిపోతాయి. తాంబూలం వేసుకుంటో, పుస్తకాన్ని ముడిచిపెట్టి "దేనికోసం? ఎందుకు? ఏమిటి కావాలంటాడు? ఏమిటి వేదన పాపం?" అని కొంచెం ఆలోచిస్తారేమో!

మధ్యతరగతి ప్రజల నిర్లిప్తత, మార్పును స్వీకరించలేనితనం పై చలం సంధించిన వ్యంగ్యాస్త్రాలు ఇవి. చలానికి ఇలాంటివారిపై అవకాసమొచ్చినప్పుడల్లా విసుర్లు విసురుతూనే ఉన్నాడు. చలాన్ని, చలం సాహిత్యాన్ని అర్ధంచేసుకోలేక అదంతా బూతంటూ ప్రచారం చేసి, చలాన్ని తెలుగునేలపై నిలువనీయకుండా తరిమేసిన వర్గమది మరి. అందుకనే బహుసా సందర్భం కుదిరినప్పుడల్లా వారి వైఖరికి వ్యతిరేకంగా, చలం తనగళాన్ని వినిపిస్తూనే సాగాడు

శ్రీశ్రీ కవిత్వాన్ని analyse చేసి, ముక్కల కింద ఎత్తి చూపి, కవీ, మనిషీ, శైలీ, బాల్యం, కవిత్వం, ఛందస్సు, ఎదిరింపు, కొత్తపోకడలు, పాత influences అంటో వాటి శ్రేష్టత్వాన్ని explain చెయ్యడానికి చెలానికి అధికారమూ, అర్హతా లేవు. చెలానికి విమర్శే చాతనైతే కొత్త వ్రాతల్ని పాత పత్రికల్లో చీల్చి, చెండాడి గొప్పతనం లేదని నిరూపించి, ఘనత సంపాయించి, సంవత్సరానికోసారి నిండు భోజనాలు చేసే ఒక డజన్ సారస్వత, కళా, నాటక, నృత్య, గాన సినిమా పరిషత్తులలో సభ్యత్వం, ఏమో అదృష్టం అపూర్వంగా కలసివస్తే జాయింటు సెక్రటరీ కూడా సంపాయించేవాడు కాడా

పై వాక్యాలు శ్రీశ్రీ కవిత్వం కన్నా చలం తత్వాన్ని మనకు చెపుతూంటాయి. నిజమే మరి చలం అలా చేయకపోవటం వలననే ఈనాటికీ స్మరణీయుడయ్యాడేమో! ఎంతమంది విమర్శకులు కాలగర్భంలో కలసిపోలేదు. కనీసం వారి పేర్లు కూడా తరానికి తెలీకుండా.

శ్రీశ్రీ పుస్తకం కొని తీరికగా చదవండి, పద్యం పదిసార్లు చదవండి, ఏమీ అర్థం కాలేదా - యువకుడికో, భిక్షుకుడికో, death-bed present గా పంపండి. పారెయ్యకండి. అంతకన్నా దాచుకోకండి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి మీ చేతులో పుస్తకం.

చిన్నినాబొజ్జకు శ్రీరామరక్ష అనుకొంటూ, గిరిగీసుకొని జీవించేవారికి, మహాప్రస్థాన గేయాలు పెద్దగా రుచించవు, సమాజంపట్ల ఇంకా నిశ్చితాభిప్రాయాలను ఏర్పరచుకోని యువకునికిచ్చినట్లయితే పుస్తక ప్రయోజనం నెరవేరుతుందని చెప్పటం శ్రీశ్రీ కవితోద్దేశ్యాన్ని పరోక్షంగా చెప్పటమే.

తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి గా శ్రీశ్రీ కవిత్వాన్ని ఆనాడే అంచనా వేయటం, చలం ద్రష్ట అనటానికి ఉదాహరణ. అలానే శతాబ్ధం శ్రీశ్రీది అని చెప్పగలిగేస్థాయిలో కవిత్వం తదనంతరం పేరుతెచ్చుకోవటం గమనార్హం.


కొద్దిరోజుల్లో నేడు విర్రవీగే కవులు ప్రతి ఒక్కరూ శ్రీశ్రీ నీడ కింద నించుని తమ ఉనికిని సమర్థించుకో వలసిన గతి వస్తుంది.

శ్రీశ్రీ కవిత్వం ప్రారంభరోజుల్లో చలం వ్రాసిన వాక్యాలు తరువాతకాలంలో అక్షరసత్యాలైనాయి. నలభైలనుంచి ఎనభైలవరకూ ప్రతీకొత్త కవి శ్రీశ్రీని అనుకరించాలని ప్రయత్నించినవారే. చాలామంది తుఫానులో కొట్టుకుపోయారు లేదా శ్రీశ్రీ గొడుగుక్రింద తలదాచుకొన్నారు. ఈనాటివరకూ కూడా తెలుగు సాహిత్యంలోవచ్చిన నూతన ప్రక్రియలుగా పిలవబడేవాటికి శ్రీశ్రీ ఆనాడే తన కవితలలో బీజం వేసాడన్నది ఒక విస్మయం గొలిపే విషయం. ఉదా: మినీకవిత్వం, మాండలికంలో కవిత్వం వ్రాయటం వంటివి.

ఎవరినించి దొంగిలించామో వాళ్ళని క్షమించడం కష్టం.

అని చలం వ్రాసిన వాక్యం పై డబ్బ్దైలలో రగడజరిగింది. రుధిరజ్వాల వ్రాసిన నారాయణబాబు కవిత్వాన్ని శ్రీశ్రీ అనుకరించాడని దానిని పై వాక్యం సమర్ధిస్తుందనీ వాదోపవాదనలు జరిగాయి. నారాయణ బాబుకు శ్రీశ్రీ కి ఉన్న వైషమ్యాలు కూడా వాదనకు బలాన్నిచ్చాయి.
నారాయణ బాబు మంచికవి. కానీ శ్రీశ్రీలా ఆయన అప్రతిహతంగా తన సాహితీయానాన్ని కొనసాగించలేకపోవటం వల్ల అతనికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఇద్దరినీ పోల్చినప్పుడు, నారాయణబాబుకన్నా శ్రీశ్రీ చాలా ముందు ఉంటాడు. వివాదాన్ని అప్పట్లో రేపింది ఆరుద్ర, సోమసుందర్ వంటి ప్రముఖులు. దానివెనుకకూడా అనేక రాజకీయ కారణాలుండవొచ్చు.

మెరీనాలో గాలిలో ఊగే (రేడియోలేని రోజులవి) flower-bed పుష్పశయ్య కేసి చూస్తున్న నన్ను చూచి, " పువ్వులు పాడు పువ్వులు: ఎక్కడ చూసినా రోడ్డు ప్రక్కన అంతా పువ్వులే" అని నన్ను నిందిస్తున్న మిత్రుడికి ఏం జవాబు చెప్పగలిగాను.
"ఏమిటి వంతెన మీద నుంచుని చూస్తున్నావు?"
"సంధ్య కేసి"
"ఎవరు ఆమె?"
అంటే ఏం మాట్లాడగలిగాను?

ప్రజల్లో ఉండే అరాసిక్యం గురించి చలం చెప్పిన పై మాటలలోని వ్యంగ్యం, ఆలోచనల్లో తగ్గిపోతున్న సున్నితత్వాన్ని ఎత్తిచూపుతుంది. ఇది కాలానికి మరింతబలపడిందనే అనుకోవాలి. బహుసా చలాన్ని అర్ధం చేసుకోవటంలో చాలామంది ఇక్కడే విఫలమయ్యారనిపిస్తుంది.

శ్రీశ్రీ ఎందుకు నచ్చుతాడు?
ఇంకా రాత్రి చీకట్లో, లోకం నిద్రలో భయంకర స్వప్నాలు కంటో, దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతమిచ్చే వైతాళికుడు శ్రీశ్రీ!

పై వాక్యాలు శ్రీశ్రీ కవితాత్మను చక్కగా ఇముడ్చుకొంటాయి. నిరాశను, విరహాల్ని గానం చేసే భావకవిత్వానికీ, కొత్తనెత్తురును ప్రవహింపచేసే శ్రీశ్రీ కవిత్వానికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం అదే. అందుకనే శ్రీశ్రీ చలానికి నచ్చుతాడు. ఎంత మేన్ ఆఫ్ లిటిల్ ఫైత్ అయినప్పటికీ.

అరుగో మూల పాతగోరీల కేసి మొహాలు తిప్పుకొని నగిషీలు చెక్కుతున్నారు -పాత పదాలకీ, ఊహలకీ చిత్రికలు పట్టి- ప్రేయసి మెల్లకన్నుల మీద పద్యాలు అల్లుతున్నారు -రామాయణాలూ, శర్మిష్ఠలూ వృద్ధ మునులు వ్రాసి అర్పిస్తున్నారు, "భారతి" కి నైవేద్యంగా.
వాళ్ళలో చేరండి. వాళ్ళ ధైర్యవచనాలను విని మళ్ళీ నిద్రపొండి.

అంటూ ఇంకా పాతపదాలు, వర్ణనలు, అలంకారాలు, ఛందస్సు, ఉపమానాలు, ఆచారాలను పట్టుకొని వేళ్లాడే కవులను,వారి శిష్య పరంపరను, చలం ఎద్దేవా చేస్తున్నాడు. (మరో ఆశక్తికరమైన విషయం ఏమిటంటే అప్పటికింకా రామాయణ కల్పవృక్షం వ్రాయలేదు). భారతి అప్పట్లో వెలువడే సాహిత్య మాసపత్రిక. ఎనభైలలో అది నిలచిపోయింది. భారతిలో అచ్చయిందంటే అలాంటి కవిత్వానికి ఒక ప్రామాణికత, కవికో గుర్తింపు ఉండేదట. వారిని విమర్సించటం ద్వారా, శ్రీశ్రీ కవిత్వం యొక్క గొప్పతనాన్ని, నవ్యతను, అది తీసుకురాబోయే విప్లవాన్ని అన్యాపదేశంగా చలం చెప్పాడనిపిస్తుంది.

శ్రీశ్రీ కవిత్వాన్ని ఇష్టపడని వారిని సోమరులు, వృద్దులు, ఛావ లేనివారు, చాందసులు అంటూ ప్రకటించటం ఒకరకంగా పుస్తకం ఎవరికైతే చేరాలో వారికి చేర్చటానికి పన్నిన వ్యూహం లా అనిపిస్తుంది. ఆవిషయంలో చలం నూరుశాతం సఫలమయ్యాడు. ఎందుకంటే అప్పుడు పుస్తకాన్ని హృదయానికెత్తుకొన్న యువకులు, దానిపట్ల తమ నిబద్దతను చివరివరకూ కొనసాగించారనే భావించవచ్చు.
అదే క్రమంలో అప్పటి భావకవిత్వంపైనా, సాంప్రదాయ రచనలపైనా చలం సంధించిన విమర్శనాస్త్రాలు కూడా.

చలం వ్రాసిన యోగ్యతాపత్రంలో, దైవదూషణ, పూర్వకవులపై నిందలు, సొంతగొడవలు, వెటకారాలు, కృష్ణశాస్త్రి కవిత్వంపై విసుర్లు తప్ప శ్రీశ్రీ కవిత్వం గురించి ఉన్నది తక్కువేనన్న విమర్శలు ఉన్నాయి. బహుసా అలాంటి విమర్శను ముందే ఊహించి "ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు పేజీలు తిప్పేసుకోవచ్చని" ముందే చెప్పుకొంటాడు చలం.

తెలుగు సాహిత్యంలో మహాప్రస్థానం ఉన్నంతకాలమూ యోగ్యతాపత్రం కూడా ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహంలేదు.

బొల్లోజు బాబా

లింకులో చలం యోగ్యతాపత్రాన్ని చదువుకొనవచ్చును




Saturday, May 30, 2009

ప్రారంభం (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

"నేనెక్కడి నుండి వచ్చాను? నేను నీకు ఎక్కడ దొరికానూ?" పాపాయి అమ్మనడిగింది.
పాపాయిని గుండెలకదుముకొని
" నీవు నా హృదయంలో దాని వాంఛై ఉండినావు చిన్నారీ"
నవ్వుతూ, కనులనీరు నించుకుంటో అమ్మ బదులిచ్చింది.

నీవు నా బాల్యపు ఆటలలో బొమ్మవై ఉండే దానవు.
ప్రతి ఉదయమూ నా దేవుని ప్రతి రూపాన్ని మట్టితో చేసే దానిని.
అపుడే నిన్ను కూడా తయారు చేసి చేజార్చుకొనే దానిని.
మా కులదైవంతో సమానంగా నీకు కొలువుండేది.
ఆతని పూజలో నిను సేవించే దానిని.
నా అన్ని ఆశలలో, ప్రేమలలో, జీవితంలో, నా తల్లి జీవితంలో నీవు సంచరించావు.
మా ఇంటిని పాలించే అమృతమూర్తి ఒడిలో నీవు అనాదిగా సాకబడుతున్నావు.
కౌమార్యంలో నాహృదయం తన రేకలు విచ్చుకొన్నప్పుడు
నీవు దాని సుగంధానివై పరిమళించావు.
నీ సౌకుమార్యం నా యవ్వనాంగాలలో వేకువవెలుగులా వికసించింది.

స్వర్లోకపు ఆదిమ సఖి, ఉదయకాంతికి సహోదరివి అయిన నీవు
ఈ ప్రపంచ జీవన వాహినిపై తేలియాడ దిగివచ్చావు,
చివరకు నాహృదయానికి చిక్కావు.
నిన్నలా తేరిపార చూస్తే రహస్యమేదో ముంచెత్తుతుంది.
అందరకూ చెందిన నీవు నాకే సొంతమైనావు.
ఏ ఇంద్రజాలం నా దుర్భల చేతులలో
ఇంతటి భువనైక సౌందర్యాన్ని బంధించగలదు?

మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Beginning అనే గీతం

Sunday, May 24, 2009

స్వస్థానము (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

పిసినారి సాయింసంధ్య తన స్వర్ణ వర్ణాలను వెనక్కి తీసేసుకొంటున్నవేళ,
మైదానపు మార్గాన ఏకాకినై నేను సాగుతున్నాను.

పంటకోసిన పొలాలు బోసిపోయి, మౌనంగా పడిఉన్నాయి.
చీకటి లోలోతుల్లోకి, పగటి కాంతి మునిగిపోతోంది.

ఉన్నట్టుండి ఒక పిల్లగాని కీచు స్వరం గాలిలోకి లేచింది.
సాయింత్రపు నిశ్శబ్ధంలోకి తన పాట జాడను విడిచి
అగుపించని చీకట్లలోకి వాడు కనుమరుగయ్యాడు.

మైదానపు ఆవలి అంచున , చెరుకు తోటల కవతల కనిపిస్తున్న
పోక, పనస, కొబ్బరి చెట్ల నీడల మధ్య దాగొని ఉన్నదట వాని ఇల్లు.

తారల కాంతిలో సాగుతున్న నా ఏకాకి యానాన్ని ఒక క్షణం నిలిపి పరికించాను.
నల్లని నేల బాహువులు అక్కున చేర్చుకొన్న గృహ సముదాయం
కనిపించింది.
ఊయలలు, మంచాలు, సాయింత్రపు దీపాలు, మాతృహృదయాలు,
తమ విలువ తమకే తెలియని బ్రహ్మానందంతో నిండిన పసి హృదయాలతో
అది పరిమళిస్తోంది.

బొల్లోజు బాబా
మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Home. అనే గీతం

Wednesday, May 20, 2009

నిద్ర దొంగ (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

\పాపాయి కనులనుండి నిదురను దొంగిలించింది ఎవరూ? నాకు తెలియాలి.

ఊరి చివరి చెరువు నీళ్ళు తేవటానికై అమ్మ బిందె తీస్కొని వెళ్ళింది.
మద్యాహ్నమైంది. పిల్లల ఆటలు ముగిసాయి.
చెరువులోని బాతులు నిశ్శబ్ధంగా ఉన్నాయి.
రావిచెట్టునీడలో పసులు గాసే పిలగాడు కునుకు తీస్తున్నాడు.
మామిడితోపుల చిత్తడిలో ఓ కొంగ నిశ్చల గాంభీర్యంతోజపం చేస్తున్నది.

ఇదే అదుననుకొన్నదో ఏమో!
పాపాయి కనులనుండి నిదుర దొంగ
నిదురను దొంగిలించి మాయమయ్యింది.
అమ్మతిరిగి వచ్చేసరికి , పాపాయి గదిలో కలియపాకుతూ తిరుగుతోంది.

పాపాయి కనులనుండి నిదురను దొంగిలించింది ఎవరు? నాకు తెలియాలి.

ఆమెను కనుగొని గొలుసులతో బంధించాలి. ఆమెవరో నాకు తెలియాలి.
ఆ చీకటి కొండగుహలో గులకరాళ్ళ మధ్య
ఓ చిరుసెలయేరు పారాడుతున్నది. అచట వెతకాలి.

ప్రశాంత రాత్రివేళ సంచరించే నిశి మోహిని కాలిమువ్వల గలగలలకూ
గూటి పావురాల గుబగుబలకూ మత్తుగొలిపే నీడనిస్తున్న ఆ పొగడ తోపులో వెతకాలి.
సాయింకాల వేళ మిణుగురుల కాంతి తారాడే
వెదురుపొదల గుసగుసల మౌనంలోకి తొంగి చూస్తాను.
కనపడిన ప్రతి జీవినీ "నిదుర దొంగ ఎక్కడ నివసిస్తుందో చెప్పండి" అని ప్రశ్నిస్తాను.

పాపాయి కనులనుండి నిదురను దొంగిలించింది ఎవరో నాకు తెలియాలి.
ఆమె గానా నాకు దొరికిందా, మంచి గుణపాఠమే చెపుతాను.
ఆమె గూటిపై దాడిచేసి తాను దొంగిలించిన నిద్రలను
ఎక్కడ దాచుకొందో పట్టుకుంటాను.
దానిని కొల్లగొట్టి, ఆమెను ఇంటికి తీసుకొని వెళతాను.

ఆమె రెండు రెక్కలను బంధించి, ఏటిఒడ్డున కూర్చోపెట్టి
రెల్లు గుబుర్లతో, చేపలతో ఆడుకొమ్మని, పేక బెత్తంతో శాసిస్తాను.

సాయింత్రం బజారులు ఖాళీ అయిపోయాకా
పిల్లగాండ్రు తల్లుల ఒడిలో చేరేవేళ
ఆ నిదురదొంగ చెవులలో రాత్రిపక్షులు
"ఇక ఇపుడు ఎవరి నిద్రనూ నీవు దొంగిలించలేవు" అని అరుస్తో పరిహసిస్తాయి.


బొల్లోజు బాబా
మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Sleep Stealer

అనే గీతం



Monday, May 18, 2009

శిశువు రీతి - (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

శిశువు తలచుకొంటే
క్షణమే స్వర్గానికి ఎగురుకుంటూ పోగలడు
.
మనలను విడువకపోవటం మరెందుకోకాదు.
తల్లి చనవులపై తలాన్చి పరుండటం తనకెంతో ఇష్టం కనుక.
ఆమె వియోగాన్ని భరించలేడు కనుక.

శిశువుకు ఎన్నెన్ని గొప్పమాటలు తెలుసో!
కానీ వాటికి భాష్యం చెప్పగలిగేది కొద్దిమందే
.
తను మాట్లాడాలనుకోకపోవటం మరెందుకో కాదు.
మాతృభాషను ఆమె పెదాలనుండే నేర్చుకోవాలని.
అందుకే అతడు ఏమీ ఎరుగని వానివలే అగుపిస్తాడు.

శిశువు పసిడి ముత్యాలకధిపతియైనప్పటికీ
లోకంలోకి ఒక యాచకుని వలే అరుదెంచాడు.
అట్టి మారు వేషం మరెందుకో కాదు.
చిన్నారి దిశమొల యాచకుడై నిస్సహాయత నటిస్తూ,
తల్లి ప్రేమ నిధిని పొందటానికే
.

చిరునెలవంక లోకంలో శిశువు విశృంఖల విహారియే!
తన స్వేచ్ఛను త్యజించింది మరెందుకో కాదు.
తల్లి హృదయాంతరాళంలో అనంతమైన ఆనందమున్నదనీ
ఆమె బాహువులలో ఒదిగి అదుముకోబడటం
స్వేచ్ఛకన్నా మధురమనీ తెలుసుకనుక.

బ్రహ్మానందలోకంలో ఉండేపుడు శిశువుకు ఏడవటమే తెలియదు
కానీ ఇపుడు కన్నీరు చిందించటం మరెందుకో కాదు.
శిశువు తన రోదనలతో దయ, ప్రేమ బంధాలను అల్లుకుంటూ
తనబోసినవ్వులతో అమ్మ కరుణాహృదయాన్ని తనవైపుకు ఆకర్షించటానికే.

మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని
BABY'S WAY
అనే గీతం

Friday, May 15, 2009

పుస్తకం.నెట్ లో రవీంద్రుని క్రిసెంట్ మూన్ పై నా వ్యాసం

Crescent Moon అనే వచన గీతాల సంకలనం 1903 లో రవీంద్రనాధ్ టాగోర్ రచించిన “శిశు అనే బెంగాలీ రచనకు స్వీయ ఇంగ్లీషు అనువాదం.

ఈ గీతాలలో టాగోర్ ఒక అద్భుతమైన చిన్నారి ప్రపంచాన్ని సృష్టించి అనేక పాత్రల్ని అందులో సంచరింపచేస్తాడు. ..............

పూర్తి వ్యాసాన్ని, కొన్ని గీతాల అనువాదాన్ని ఇక్కడ చదవండి.


http://pustakam.net/?p=976


క్రిసెట్ మూన్ లో మొత్తం నలభై గీతాలున్నాయి. వాటి తెలుగు అనువాదం పూర్తయింది. త్వరలోనే వాటిని మీతో పంచుకొంటాను.

భవదీయుడు

బొల్లోజు బాబా


Sunday, May 10, 2009

పోలవరం కవితలు

గోదావరి నది పై ప్రయాణించటం ఒక మంచి అనుభూతి. ఇంతవరకూ బస్సులోనో, రైల్లోనో ప్రయాణిస్తూ గోదావరిని దాటటం తప్ప బోట్ పై పాపికొండల వరకూ వెళ్లటం జరగలేదు. మొన్న సాధ్యపడింది. ఎత్తైన కొండలు, వాటిమధ్య పరవళ్లుతొక్కుతూ ప్రవహించే అఖండ గోదావరి, దారిపొడుగునా ఒడ్డుపై కనిపించే పల్లెటూర్లు, అక్కడక్కడా కనువిందు చేసే పక్షుల నడుమ సాగిన మా ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది.

బహుసా ఈ అనుభూతి ఇంత డీప్ గా ఉండటానికి కారణం పోలవరం ప్రోజెక్టు కావొచ్చు. ఎందుకంటే దాని నిర్మాణం పూర్తయ్యే సరికి సుమారు 450 గ్రామాలు నీటమునిగి, ఇప్పుడు కనిపిస్తున్న పాపికొండల అందాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది కనుక.

ఆ సందర్భంగా నాలో కలిగిన ఆలోచనల శకలాలను ఇలా మీతో పంచుకోవాలనిపించి........

బోటు ఎక్కగానే నది నీటిని చూస్తున్నప్పుడు, రాజమండ్రిలో పుట్టి, గతించిన మా పూర్వీకులు జ్ఞాపకం వచ్చారు. భద్రాచలంలో ఆలయ పునర్నిర్మాణంలో పన్నెండేళ్ల పాటు శిల్పిగా పనిచేసిన మా తాతగారి రూపం కదలాడింది. ధవళేశ్వరంలో పుట్టిన మా అమ్మమ్మ తలపుల్లోకి వచ్చింది. వీళ్లందరకూ ఈ గోదావరి తెలుసు/గోదావరికి వీళ్లందరూ తెలుసు అనిపించింది.
అలా ఎన్ని కోట్ల జీవితాలతో ఈ గోదావరి పెనవేసుకుపోయి ఉంటుందో కదా అన్ ఊహకు .......

ఆమెను తాకగానే,
ఓ నీటి బిందువులోంచి
నా ప్రవర వినిపించింది.
ఇక్కడి ప్రజల గుండెల్లో
గోదావరి ఉత్త నదే కాదు, మరింకేదో!

*********

నదిపై లారీ టైర్లలో గాలినింపి దానిపై ఒక చెక్కవేసుకొని కూర్చొని చేపలు పడుతున్న జాలరులను చూసి ముచ్చటేసింది. చిన్నప్పుడు మా వూరి చర్చి ఫాదరు జేబునిండా చాకలేట్ లు వేసుకొని, స్కూలు నించి వచ్చే మాకు పంచిపెట్టేవారు. మేము కూడా స్కూలు అవ్వగానే బిళ్లలకోసం చర్చివీధి గుండా ఇళ్లకు చేరేవాళ్లం. నదినీ, జాలర్లను చూసినపుడు ఎందుకో నది చాక్లెట్లిచ్చే చర్చి ఫాదరులాగా కనిపించింది.

పిల్లలకు చాక్లెట్లు
పంచిపెట్టే చర్చి ఫాదర్ లా
జాలర్లకు చేపలు
పంచిపెడుతోంది, నది.
********

పాపికొండల మధ్య ఒక చోట గోదావరి దాదాపు తొంభై డిగ్రీల టర్న్ తీసుకొంటుంది. దూరంనుంచి చూస్తుంటే నదికి అడ్డంగా ఓ పెద్ద కొండ ఉన్నట్టు అనిపిస్తుంది. నది అక్కడతో అంతం అయినట్లు అనిపిస్తుంది. దానినే చిన్న చిన్న మాటలలో ఇలా.

నదికి అడ్డంగా పెద్ద కొండ.
ప్రవాహం ఆగలేదు
మలుపు తీసుకొంది.

ఇక్కడ నదీ ప్రవాహం జీవితం కావొచ్చు. అడ్డంకుల వద్ద జీవితం ఆగిపోదుగా. మలుపు తీసుకోవటమూ ఒక వ్యూహమే. అలా మలుపు తీసుకొన్నచోట గోదావరి లోతు వంద మీటర్ల పైన ఉంటుందట. మన జీవన మార్గాన్ని మళ్లించే ఏ అనుభవమైనా ఆ మాత్రం లోతుగానే ఉంటుంది.
**********

పర్యావరణ విచ్చిన్నం వలన వర్షాలు పడకపోవటం, ఎక్కడికక్కడ డాములు కట్టటమూ వంటి కారణాల వల్ల నదుల్లో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక పరిణామం.

తమిళ కవి వైరముత్తు వ్రాసిన ఒక అద్బుతమైన కవితలో తన ఊరి నది గురించి వర్ణిస్తూ --- 1967 లో పాలనురుగులాంటి పౌర్ణమి రాత్రుల్లో వెన్నెల కరిగించుకొని తెల్లగా ప్రవహించిందని, 1977 లో కాల ప్రవాహంలో కాలువలా మారిందని, 1987 లో జలదానం కోల్పోవటంతో ఇసుక దానం చేస్తున్నదనీ, 1997 ఎక్కడకు మాయమయ్యావో చెప్పవా నదీ --- అంటూ ఆర్తిగా ప్రశ్నిస్తారు.

గోదావరికి కూడా నీటి కరువు వచ్చి (ప్రస్తుత ఎండాకాలం కాదు ప్రధాన కారణం) అక్కడక్కడా నదీ గర్భం బయట పడి వికృతంగా కనిపించటం ఒక విషాద దృశ్యం. దాని పదచిత్రం ఇలా....

నీరులేక బయటపడ్డ నదీగర్భం.
రాచపుండు గుంతల్లోంచి
కనిపించే వెన్నెముకలా ఉంది.
**********


ఈ నదిపై డామ్ నిర్మాణం పూర్తయితే ఇలా ప్రవహించే ఈ అఖండ గోదావరి జలాలు రిజర్వాయిర్ లో మురిగిపోవాల్సిఉంటుందేమో. అవసరాలకు తగ్గట్టుగా వేసిన కూడికలు తీసివేతల ప్రకారం ప్రవహించవలసి ఉంటుంది. ఇప్పటి స్వేచ్ఛ, విశృంఖలత్వం ఉండదు. అలాంటి పరిస్థితి ఊహకు వచ్చి, ఇలా

డామ్ సంకెళ్లు
వేయించుకోబోతున్న
ఈ నదీ ప్రవాహాన్ని
చూస్తూంటే జాలేస్తుంది.




ఇంకా మరికొన్ని

సముద్రానికి దారెటని
అడిగిన వాన చినుకుకు
దారి చూపుతోంది, నది.
******

బరువైన దినాల మధ్య
ప్రవహించే నీ జ్ఞాపకాల్లా
చుట్టూ కొండల మధ్య
అఖండ గోదావరి.
*******

ఒక్క క్షణం ఆగానో లేదో
నది నన్ను దాటుకొని
నవ్వుకొంటూ వెళ్లిపోయింది.
*********


ప్రస్తుతానికి ఇంతే.
పోలవరం ప్రోజెక్టు నిర్మాణంలో ఏర్పడే వాక్యూం గురించి వ్రాయాలని ప్రయత్నిస్తున్నాను.
అది కూడా త్వరలో.......

బొల్లోజు బాబా

పోలవరం కవితలు

1.
సముద్రానికి దారెటు అని
అడిగిన వాన చినుకుకు
దారి చూపుతోంది, నది.


2.
పిల్లలకు చాక్లెట్లు
పంచిపెట్టే చర్చి ఫాదర్ లా
జాలర్లకు చేపలు
పంచిపెడుతోంది నది.


3.
ఇక్కడి ప్రజల గుండెల్లో
గోదావరి ఉత్త నదే కాదు, మరింకేదో?
ఆమెను తాకగానే,
ఓ నీటి బిందువులోంచి
నా ప్రవర వినిపించింది.


4.
నీరులేక బయటపడ్డ నదీగర్భం.
రాచపుండు గుంతల్లోంచి
కనిపించే వెన్నెముకలా ఉంది

5.
నదికి అడ్డంగా పెద్ద కొండ.
ప్రవాహం ఆగలేదు
మలుపు తీసుకొంది.


6.
బరువైన దినాల మధ్య
ప్రవహించే నీ జ్ఞాపకాల్లా
చుట్టూ కొండల మధ్య
అఖండ గోదావరి.



7.
డామ్ సంకెళ్లు వేయించుకోబోతున్న
ఈ నదీ ప్రవాహాన్ని చూస్తూంటే
జాలేస్తుంది.


8.
ఒక్క క్షణం ఆగానో లేదో
నది నన్ను దాటుకొని
నవ్వుకొంటూ వెళ్లిపోయింది.

Sunday, May 3, 2009

జీవనమాధుర్యం


చేయాల్సిన పనులలా
మిగిలిపోతూనే ఉంటాయి.

కెరటాలు ఒకదానివెనుక ఒకటి
పరుగులేడుతూనే ఉన్నాయి.
నెలనెలా వెన్నెల కుబుసం
ఆకాశం నుండి రాలిపడుతూనేఉంది.
వర్షాకాలంనుంచి తీసుకొన్న పగ్గాల్ని
వేసవికిచ్చేసి సాగిపోతుంది శీతాకాలం.

చేయాల్సిన పనులలా
పేరుకుపోతూనే ఉంటాయి.

కొన్నిపనులు
మరుపులోయల్లోకి జారినట్లే జారి
ఫీనిక్స్ పక్షుల్లా పైకి లేస్తున్నాయ్.

రేపు, వచ్చేఏడాది, ఎప్పటికైనా - అంటూ
చేయాల్సిన పనులు
భవిష్యత్తునిండా
చిక్కుడుపాదులా
అల్లుకొని బిగుసుకొన్నాయి.
జీవితాన్ని అడ్డంగా, నిలువుగా
అడ్డదిడ్డంగా పరుగులెట్టిస్తూన్నాయి.


రెండుకాళ్లపై నించొని
ఆకులనందుకో
యత్నించే మేకపిల్లలా
హృదయం శ్రమిస్తూనే ఉంది.

అయినా సరే
చేయాల్సిన పనులలా
మిగిలిపోతూనే ఉన్నాయి.



బొల్లోజు బాబా

Saturday, May 2, 2009

శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా.......



అక్షరాలనిండా నమ్మకాన్ని
జనుల అగాధ గాధల్నీ నింపిన కవీ
నీవు లోహ స్వరంతో చేసిన
జయగీతాలాపన ఇప్పటికీ
అమృతవర్షిణియే.

పాదముద్రలూ, పనిముట్లూ
రక్తపుచుక్కా, రొట్టెముక్కా,
గద్దరెక్కా, చమట చుక్కా
మానవత్వం, కరుణలతో
జలజలలాడిన నీ కవిత్వం
మరో వందేళ్లయినా
నిత్యనూతనమే.

విరహ సుఖాలు, జ్ఞాపకాల శోకాలూ
ప్రణయవేదనలు, సానుభూతి ప్రవచనాలూ
లేకుండా నీవు చేసిన కొత్త టానిక్
జీవనయానపు జాడీలో ఊరే కొద్దీ
దాని విలువ పెరుగుతూనే ఉంది.

ఉదయాస్తమయాలను పొదువుకొన్న
నీ కవిత్వం కాలమున్నంత కాలమూ
జనహృదయాల మధ్య
ప్రవహిస్తూనే ఉంటుంది.

చుట్టూ దగా ఉందని హెచ్చరించి
ప్రజకు ముందూవెనుకా కవిత్వాన్ని నిలిపిన
కవీ, రవీ, నీకివే మా జోతలు.


బొల్లోజు బాబా