గోదావరి నది పై ప్రయాణించటం ఒక మంచి అనుభూతి. ఇంతవరకూ బస్సులోనో, రైల్లోనో ప్రయాణిస్తూ గోదావరిని దాటటం తప్ప బోట్ పై పాపికొండల వరకూ వెళ్లటం జరగలేదు. మొన్న సాధ్యపడింది. ఎత్తైన కొండలు, వాటిమధ్య పరవళ్లుతొక్కుతూ ప్రవహించే అఖండ గోదావరి, దారిపొడుగునా ఒడ్డుపై కనిపించే పల్లెటూర్లు, అక్కడక్కడా కనువిందు చేసే పక్షుల నడుమ సాగిన మా ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది.
బహుసా ఈ అనుభూతి ఇంత డీప్ గా ఉండటానికి కారణం పోలవరం ప్రోజెక్టు కావొచ్చు. ఎందుకంటే దాని నిర్మాణం పూర్తయ్యే సరికి సుమారు 450 గ్రామాలు నీటమునిగి, ఇప్పుడు కనిపిస్తున్న పాపికొండల అందాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది కనుక.
ఆ సందర్భంగా నాలో కలిగిన ఆలోచనల శకలాలను ఇలా మీతో పంచుకోవాలనిపించి........
బోటు ఎక్కగానే నది నీటిని చూస్తున్నప్పుడు, రాజమండ్రిలో పుట్టి, గతించిన మా పూర్వీకులు జ్ఞాపకం వచ్చారు. భద్రాచలంలో ఆలయ పునర్నిర్మాణంలో పన్నెండేళ్ల పాటు శిల్పిగా పనిచేసిన మా తాతగారి రూపం కదలాడింది. ధవళేశ్వరంలో పుట్టిన మా అమ్మమ్మ తలపుల్లోకి వచ్చింది. వీళ్లందరకూ ఈ గోదావరి తెలుసు/గోదావరికి వీళ్లందరూ తెలుసు అనిపించింది.
అలా ఎన్ని కోట్ల జీవితాలతో ఈ గోదావరి పెనవేసుకుపోయి ఉంటుందో కదా అన్న ఊహకు .......
ఆమెను తాకగానే,ఓ నీటి బిందువులోంచినా ప్రవర వినిపించింది.ఇక్కడి ప్రజల గుండెల్లో
గోదావరి ఉత్త నదే కాదు, మరింకేదో!*********
నదిపై లారీ టైర్లలో గాలినింపి దానిపై ఒక చెక్కవేసుకొని కూర్చొని చేపలు పడు
తున్న జాలరులను చూసి ముచ్చటేసింది. చిన్నప్పుడు మా వూరి చర్చి ఫాదరు జేబునిండా చాకలేట్ లు వేసుకొని, స్కూలు నించి వచ్చే మాకు పంచిపెట్టేవారు. మేము కూడా స్కూలు అవ్వగానే బిళ్లలకోసం చర్చివీధి గుండా ఇళ్లకు చేరేవాళ్లం. నదినీ, జాలర్లను చూసినపుడు ఎందుకో నది చాక్లెట్లిచ్చే చర్చి ఫాదరులాగా కని

పించింది.
పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టే చర్చి ఫాదర్ లా జాలర్లకు చేపలు పంచిపెడుతోంది, నది.********
పాపికొండల మధ్య ఒక చోట గోదావరి దాదాపు తొంభై డిగ్రీల టర్న్ తీసుకొంటుంది. దూరంనుంచి చూస్తుంటే నదికి అడ్డంగా ఓ పెద్ద కొండ ఉన్నట్టు అనిపిస్తుంది. నది అక్కడతో అంతం అయినట్లు అనిపిస్తుంది. దానినే చిన్న చిన్న మాటలలో ఇలా.
నదికి అడ్డంగా పెద్ద కొండ.ప్రవాహం ఆగలేదుమలుపు తీసుకొంది.ఇక్కడ నదీ ప్రవాహం జీవితం కావొచ్చు. అడ్డంకుల వద్ద జీవితం ఆగిపోదుగా. మలుపు తీసుకోవటమూ ఒక వ్యూహమే. అలా మలుపు తీసుకొన్నచోట గోదావరి లోతు వంద మీటర్ల పైన ఉంటుందట. మన జీవన మార్గాన్ని మళ్లించే ఏ అనుభవమైనా ఆ మాత్రం లోతుగానే ఉంటుంది.
**********
పర్యావరణ విచ్చిన్నం వలన వర్షాలు పడకపోవటం,
ఎక్కడికక్కడ డాములు కట్టటమూ వంటి కారణాల వల్ల నదుల్లో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి.
ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక పరిణామం.
తమిళ కవి వైరముత్తు వ్రాసిన ఒక అద్బుతమైన కవితలో తన ఊరి నది గురించి వర్ణిస్తూ --- 1967
లో పాలనురుగులాంటి పౌర్ణమి రాత్రుల్లో వెన్నెల కరిగించుకొని తెల్లగా ప్రవహించిందని, 1977
లో కాల ప్రవాహంలో కాలువలా మారిందని, 1987
లో జలదానం కోల్పోవటంతో ఇసుక దానం చేస్తున్నదనీ, 1997
ఎక్కడకు మాయమయ్యావో చెప్పవా ఓ నదీ ---
అంటూ ఆర్తిగా ప్రశ్నిస్తారు.
గోదావరికి కూడా నీటి కరువు వచ్చి (
ప్రస్తుత ఎండాకాలం కాదు ప్రధాన కారణం)
అక్కడక్కడా నదీ గర్భం బయట పడి వికృతంగా కనిపించటం ఒక విషాద దృశ్యం.
దాని పదచిత్రం ఇలా....

నీరులేక బయటపడ్డ నదీగర్భం.
రాచపుండు గుంతల్లోంచి
కనిపించే వెన్నెముకలా ఉంది.
**********
ఈ నదిపై డామ్ నిర్మాణం పూర్తయితే ఇలా ప్రవహించే ఈ అఖండ గోదావరి జలాలు రిజర్వాయిర్ లో మురిగిపోవాల్సిఉంటుందేమో. అవసరాలకు తగ్గట్టుగా వేసిన కూడికలు తీసివేతల ప్రకారం ప్రవహించవలసి ఉంటుంది. ఇప్పటి స్వేచ్ఛ, విశృంఖలత్వం ఉండదు. అలాంటి పరిస్థితి ఊహకు వచ్చి, ఇలా

డామ్ సంకెళ్లు
వేయించుకోబోతున్న
ఈ నదీ ప్రవాహాన్ని
చూస్తూంటే జాలేస్తుంది.
ఇంకా మరికొన్ని
సముద్రానికి దారెటని
అడిగిన వాన చినుకుకు దారి చూపుతోంది, నది. ****** బరువైన దినాల మధ్య ప్రవహించే నీ జ్ఞాపకాల్లా చుట్టూ కొండల మధ్య
అఖండ గోదావరి. ******* ఒక్క క్షణం ఆగానో లేదో నది నన్ను దాటుకొని నవ్వుకొంటూ వెళ్లిపోయింది.*********
ప్రస్తుతానికి ఇంతే.
పోలవరం ప్రోజెక్టు నిర్మాణంలో ఏర్పడే వాక్యూం గురించి వ్రాయాలని ప్రయత్నిస్తున్నాను.
అది కూడా త్వరలో.......
బొల్లోజు బాబా