ఈ మధ్య ఆంధ్రప్రదేష్ మీడియా కబుర్లు బ్లాగరి, రాముగారు “కవిత్వంలో డెబ్భై శాతం నాకు అర్థం కాదు...ఒక పాతికశాతం విషయాన్ని...'బహుశా ఈ అర్థం అనుకుంటా...' అని సరిపుచ్చుకుంటాను. సరిగ్గా అర్థమయ్యేది ఒక ఐదుశాతమే” అంటూ కవిత్వంపై ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం చూసి ఆశ్చర్యం కలిగింది. ఆయనేమీ మామూలు వ్యక్తి కాదు. దశాబ్దాలుగా రచనారంగంలో ఉన్నవారే.
అంతేకాక ఈ మధ్య విడుదల అయిన ఒక కవితా సంకలనంపై బ్లాగుల్లో జరిగిన వాద ప్రతివాదాలు అందరికీ తెలిసినవే. ఈ సందర్భంగా Does Poetry matter in 21 centuary అనే పేరుతో ఒక వెబ్ సైట్ లో జరిగిన డిబేట్ నన్ను ఆకర్షించింది. అందులోని కొన్ని ఆశక్తి కరమైన అంశాలను సంక్షిప్తీకరించి పెడుతున్నాను.
కవిత్వానికి అనుకూల వాదనలు
కవిత్వం ఒక వ్యక్తీకరణ: కవిత్వాన్ని అర్ధం చేసుకోవటం సులువైన పనికాదు. కవిత్వం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్న విషయంలో మనం తరచూ గందరగోళానికి గురవుతూంటాం. కవిత్వం ఇలా ఉండాలని కవిత్వానికి సంబంధం లేని కొన్ని సూత్రాలను ప్రతిపాదించుకొంటాం. ఆ సూత్రాలకు అనుగుణంగా కవిత్వం రావటం లేదని బాధపడుతూంటాం. ఎవరేమనుకొన్నప్పటికీ కవిత్వం అనేది కవియొక్క అభివ్యక్తి (expression). ఇది వాని హృదయంనుంచో, మెదడులోంచో లేక ఆత్మలోతుల్లోంచో మొలకెత్తుతుంది. కొన్నిసార్లు ఇది మసకమసకగానో లేక ప్రకాశవంతంగానో బయటకు వస్తుంది. ఇది కొన్ని దృశ్యాలను, ఉద్వేగాలను, ప్రేమను, ఆనందాన్ని, బాధను తెలియచేస్తూంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒక కవి తన చుట్టూ ఉన్న ప్రపంచంతో పంచుకోవాలని తనలోలోపల్లోంచి బయటకు తీసిన పదార్ధమే కవిత్వం.
కవిత్వం ఒక కళారూపం: జాక్స్ న్ పోల్లక్ (ఒక అబ్ స్ట్రాక్ట్ పెయింటరు) చిత్రాన్ని చూసిన ఒక వ్యక్తి దానికి అర్ధం ఏమిటని అడగవచ్చు. అదే చిత్రాన్ని చూసిన మరొకరు భావోద్వేగానికి గురయి చెమ్మగిల్లిన కళ్లతో వెనుతిరగవచ్చు. రెండో వ్యక్తికి తెలుసు పోల్లక్ గీసిన చిత్రం లోని అర్ధమేమిటో. కవిత్వం కూడా అంతే. అందరికీ అర్ధం కావాలనేమీ లేదు. అలాగని అందరికీ అర్ధం కాకుండా కూడా ఉండదు. ఎందుకంటే కవిత్వమొక కళా రూపం అంతే. కళా రూపం కనుక కవిత్వానికి ఉండాల్సిన విలువ ఉండాల్సిందే అది ఏ శతాబ్దమైనా.
కవిత్వం ఒక కధ: హోమర్ కాలం నుంచి డికిన్ సన్ కాలం వరకూ కవిత్వం లో కధను చెప్పటం ఒక ప్రక్రియ. అది గొప్ప గాధలు కావొచ్చు, లేక చిన్న చిన్న సంఘటనలు కావొచ్చు. కధలు అనేవి మానవ చరిత్రని లిఖించే శిలా శాసనాలు.
ఒకరు అక్షరీకరించిన రసాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవటం సులభం కాకపోవచ్చు కానీ ఒకరు ఆవిష్కరించిన రసం అప్రాధాన్యమైనదని తీర్మానించటం దుస్సాధ్యం అది ఏ శతాబ్దమైనప్పటికీ. – డనెల్లె కార్త్
వ్యతిరేక వాదనలు
చరిత్రను గమనిస్తే- పబ్లిక్ రంగము, వ్యక్తిగత రంగాలు విస్పష్టంగా ఉండేవి. ఇల్లు వ్యక్తిగతమైన రంగం గాను, ప్రదర్శన శాలలు/రాజ సభలు పబ్లిక్ రంగాలుగా పనిచేసేవి. ఈ ప్రదర్శన శాలలలో కళాకారులు, కవులు వారివారి కళలను సభికులముందు ప్రదర్శించేవారు. వాటి మంచి చెడ్డలను అక్కడ చర్చించటం జరిగేది. ఇందులో కళల ప్రదర్శన కు మౌఖికరూప ప్రక్రియ ప్రధాన పాత్ర వహించేది. నేడు అట్లాంటి ప్రదర్శన శాలలు అంతరించిపోయాయి. వాటి స్థానాన్ని దృశ్యరూప మాద్యమం ఆక్రమించింది. ఇలాంటి దృశ్య ఆధారిత కళల ప్రదర్శనా వాతావరణంలో చాలా కళారూపాలు అంతరించటం మొదలైంది. అందుకనే పత్రికల, పుస్తకాల అమ్మకాలు పడిపోయాయి. కవిత్వం ముఖ్యంగా ఒక శబ్దాధారిత ప్రక్రియ. కనుక అంతరించక తప్పదు. ఈ దృశ్యాధారిత మాద్యమ ప్రభంజనంలో కవిత్వం అనేది ఒక తెల్లకాగితం పై వ్రాసిన అక్షరాలు మాత్రమే – చాలా సందర్భాలలో ఆ తెల్లకాగితం విలువకూడా లేని. – హ్యూమా రషిద్
19 వ శతాబ్దం వరకూ కవిత్వమే అత్యున్నతమైన సాహిత్య ప్రక్రియ. కధ లేదా నవలా ప్రక్రియ అప్పటికే ఉన్నప్పటికీ ఆకాలంలో కవులకు వచ్చినంత పేరు రచయితలకు రాలేదు. ఈనాటి చాలామందికి ఆనాటి రచయితల పేర్లే తెలియవు. కానీ ఇరవయ్యవ శతాబ్దం వచ్చేసరికి పరిస్థితి తారుమారయ్యింది. నేడు కవి కంటే రచయిత ప్రముఖుడుగా చలామణీ అయ్యే పరిస్థితి వచ్చింది. నేడు చాలా మంది ఔత్సాహిక కవులకు కవిత్వం అనేది ఒక మానసిక అవుట్ లెట్ గా మారిపోయిందనటంలో సందేహం లేదు. సార్వజనీనత కోల్పోయింది. ఏదో కొద్దిమందికే అర్ధం అయ్యే ప్రక్రియగా మారిపోయింది. కవిత్వం స్వీయనిర్మిత శిఖరం నుంచి దిగివచ్చి, మేధోపరంగా తాజాగా తయారయి, ప్రజాస్వామికంగా అందరికీ అందుబాటులోకి వచ్చినపుడే అది నేటి మల్టిమీడియా దాడిని ఎదుర్కొని నిలబడగలదు. – లెప్లెన్
కవిత్వం నేడు డబ్బునిచ్చే ప్రక్రియ కాదు. డబ్బులేని ప్రక్రియలు బతికే అవకాశాలు లేవు. -- సాండీ షాన్
ప్రస్తుతకాలం హారీపోటర్, ది సింప్సన్ సినిమాలు, Myspace, sms ల ప్రపంచం. ఇవే నేటి కాలపు కళారూపాలు, వ్యక్తీకరణ మాధ్యమాలు. ఒకప్పుడు కవులు రాక్ స్టార్ లకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండేవారు. కానీ ఈ రోజు కవులు ఏవో స్థానిక పత్రికల్లో ఎక్కడో ఓ మూల తమ కవిత పబ్లిష్ అయితే చాలులే అనే స్థాయికి చేరుకొన్నారు. మనలో ఎంతమంది 1970 ల తరువాత వచ్చిన కవులలోని ఓ ముగ్గురి పేర్లు చెప్పమంటే టకటకా చెప్పగలరు?
మనలో ఎంతమంది ప్రతిరోజూ కవిత్వం చదువుతున్నారు. నిన్నచదివిన నవలలానో లేక చూసిన సినిమాలానో ఎంతమంది తమమిత్రుల వద్ద తాము చదివిన కవిత్వం గురించి చర్చిస్తున్నారు? దురదృష్టవశాత్తు కవిత్వం తన మాస్ అప్పీల్ ను కోల్పోయింది. కవియొక్క మేధోశక్తిని, శ్రమని సమాజం హర్షించే స్థితిలో లేదు. యవ్వనంలో ఉన్న ఈ శతాబ్దం హారీపోటర్ పేజీలు తిప్పుకొంటోంది. – సి.సి. వాగో
భవదీయుడు
(ఈ పోస్టుకు ఇంట్రోగా రాముగారిని తీసుకోవటం ఆయనను నొప్పిస్తే క్షంతవ్యుడను. పై అభిప్రాయాలలో – చెర్రీ లార్సన్ భావాలతో నేను ఏకీభవిస్తాను. పై వ్యాఖ్యలు ప్రపంచ కవిత్వధోరణులని ప్రతిబింబించినా తెలుగులో కూడా అదే పరిస్థితి ఉంది —బొల్లోజు బాబా)







