Tuesday, October 24, 2023

బౌద్ధ చిహ్నారాధన - పార్టు 3

4. బుద్ధుని పాదముద్రలు
.
గురువులు, పెద్దల పాదాలను పూజించటం, వాటికి శిరస్సుముట్టించి ప్రార్ధించటం ఒక సంప్రదాయం. బుద్ధునికి ప్రతిరూపంగా బుద్ధ పాదాలను పూజించటం ఆ కోవకు చెందినదే.
ద్రోన (Drona) అనే పేరుకల బ్రాహ్మణుడు ఒకనాడు బుద్ధభగవానుని పాదముద్రలను చూసి, అవి అపూర్వమైనవని గుర్తించి ఆ పాదముద్రలను విడిచిన వ్యక్తికొరకు అన్వేషించి బుద్ధభగవానుని కలిసాడట. ఆయనవద్ద అనేక ఆథ్యాత్మిక సందేహాలకు సమాధానాలు దొరకటంతో, బుద్ధభగవానుడే “మహాపురుషుడు” అని గుర్తించిన ద్రోన, బౌద్ధసంఘంలో చేరినట్లు బౌద్ధసాహిత్యం ద్వారా తెలుస్తున్నది. [1] . ఈ కథద్వారా బుద్ధపాదాలు బుద్ధభగవానుని చేర్చే సాధనాలు అని చెబుతున్నట్లు అర్ధం చేసుకోవాలి.
రాతిపై పల్లముగా (concave) చెక్కిన పాద ఆకృతి బుద్ధభగవానుడు ఆ ప్రదేశంలో నడయాడినదానికి సూచన. రాతిపై ఉబ్బెత్తుగా (convex) చెక్కిన ముద్రలు బుద్ధభగవానుడి పాదాలు. ఇవి భక్తులకు ఆథ్యాత్మిక మార్గదర్శనం చేసే చిహ్నాలు.
బుద్ధపాదాలకు ప్రత్యేకమైన మందిరాలు నిర్మించి పూజించటం జరిగేదని తొట్లకొండ, బావికొండ బౌద్ధ శిథిలాల ద్వారా తెలుస్తుంది. అమరావతి శిథిలాలలో లభించిన బుద్ధపాదాలలో-పద్మం, ధర్మచక్ర, స్వస్తిక, త్రిరత్న చిహ్నాలు ఉంటాయి. ఆ తరువాత కాలంలో చెక్కిన బుద్ధపాదాలపై, 8 (అష్టమంగళ), 16(షోడశ) 108 (అష్టశత) చిహ్నాలవరకూ ఉండటం ఒక పరిణామం. [2]
ఈ నేలపై నడయాడిన పుణ్యపురుషులు విడిచిన పాదముద్రలను పవిత్రంగా చూసుకోవటం అన్నిమతాలలోను కనిపిస్తుంది. Domine Quo Vadis చర్చ్ లో ఒక పాలరాతిపై ఉన్న పాదముద్రలు ఏసుక్రీస్తువని భక్తుల విశ్వాసం. జెరుసలెం లో Dome in the Rock వద్ద ఉన్న గురుతులు మహమ్మదు ప్రవక్త పాదముద్రలని నమ్ముతారు.
భారతదేశం నలుమూలలా కనిపించే పాదముద్రలు విష్ణువు, శ్రీరాముడు, భీముడు వంటి పురాణపురుషులవని హిందువులు భావిస్తారు.
BCE రెండోశతాబ్దానికి చెందిన భార్హౌత్ స్తూపం పై లభించే బుద్ధునిపాదముద్రలు భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనవి.


***
5.బుద్ధుని భిక్షాపాత్ర
.
బుద్ధుడు ఉపయోగించిన భిక్షాపాత్రను ఆయన చిహ్నంగా అనేక శిల్పాలలో చూపబడింది. బుద్ధభగవానుడు Kusinara వెళుతూ వెళుతూ తన భిక్షాపాత్రను వైశాలి ప్రజలకు ఇచ్చివేసాడు. రెండో శతాబ్దంలో కనిష్కుడు దీనిని వైశాలినుండి నేటి Peshawar కు తరలించాడు. చైనా యాత్రికులు దీనిని చూసినట్లు వారి కథనాలలో నమోదు చేసారు. ఇస్లామిక్ పాలనలో ఈ భిక్షాపాత్ర ఒక మసీదునుండి మరొక మసీదుకు మారుతూ చివరకు Kandahar చేరింది. ఆ సమయంలో ఈ పాత్రపై ఖురాన్ వాక్యాలు లిఖించబడ్డాయి. బ్రిటిష్ చరిత్రకారులు ఈ భిక్షాపాత్రపై ఉన్న శాసనాలను చదవటానికి ప్రయత్నించారు.
ఇటీవలి కాలంలో తాలిబాన్లు అనేక బౌద్ధ చిహ్నాలను నాశనం చేసినప్పటికీ ఈ భిక్షాపాత్రపై ఖురాన్ వాక్యాలు ఉండటంతో దీనిని ఏమీ చెయ్యలేదు. ఇది ప్రస్తుతం కాబూల్ నేషనల్ మ్యూజియం లో ఉంది.
ఈ భిక్షాపాత్ర 400 కేజీల బరువు ఉంటుంది. ఒక మనిషి ఎత్తలేడు. ఇది బహుశా అసలైన భిక్షాపాత్రకు నమూనాగా భక్తులు పూజించటానికి పెద్ద ఆకారంలో చేయించినది కావొచ్చు.
6. త్రిరత్న, వజ్రాసన చిహ్నాలు
.
బుద్ధుడు ప్రవచించిన మూడు ప్రధాన ధర్మాలైన బుద్ధ, దమ్మ, సంఘ లను త్రిరత్న చిహ్నం సూచిస్తుంది. ఈ త్రిరత్న చిహ్నం సాంచి స్తూపం పై కనిపిస్తుంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ఆసనాన్ని వజ్రాసనంగా భావిస్తారు. బౌద్ధ శిల్పాలలో బోధి వృక్షం క్రింద ఒక ఖాళీ ఆసనం రూపంలో వజ్రాసనం కనిపిస్తుంది.
****
ముగింపు
.
బుద్ధుడు BCE 623 ఆరోశతాబ్దంలో జన్మించాడు. బౌద్ధమతం ఒకప్పుడు భారతదేశం నలుమూలలా విస్తరించింది. భారతదేశంలో ఏ మూల తవ్వినా బౌద్ధమతపు ఆనవాళ్ళు నేటికీ శిల్పాలు, చెక్కుడు ఫలకల రూపంలో లభిస్తాయి. బుద్ధుని జననం, జ్జానోదయం, మొదటి భోధన, పరినిర్వాణం లాంటి ముఖ్యమైన జీవిత ఘట్టాలను చెక్కుడు ఫలకలుగా చేసి ప్రదర్శించటం ద్వారా బౌద్ధమతం సామాన్య ప్రజలలోకి సమర్ధవంతంగా చేరగలిగింది. వేల మైళ్ళ దూరంలో, వందల సంవత్సరాల వ్యత్యాసంతో చెక్కిన శిల్పాలు ఒకే రకమైన ప్రతిమాలక్షణాలను కలిగి ఉండి ఆనాటి శిల్పులు సాధించిన ప్రామాణికతకు అద్దంపడతాయి. భారతీయ శిల్పశాస్త్ర ఆవిర్భావ సమయంలో/పరిణామక్రమంలో బౌద్ధమతం ఇచ్చిన ఊతం సామాన్యమైనది కాదు.
బుద్ధుడు BCE ఆరోశతాబ్దానికి చెందినవాడైనప్పటికీ మానవరూపంలో ఉన్న బుద్ధ ప్రతిమలు CE ఒకటో శతాబ్దం నుంచి మాత్రమే కనిపిస్తాయి. BCE 332 లో అలెగ్జాండర్ బారతదేశంపై చేసిన దండయాత్రఫలితంగా భారత గ్రీకు సంస్కృతుల మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. పెద్దసంఖ్యలో గ్రీకు సైనికులు, వ్యాపారులు భారతదేశంలో స్థిరపడ్డారు. వారు తమతో పాటు గ్రీకు భాష, కళలు, సంస్కృతులను తీసుకొచ్చారు. భారతీయ-గ్రీకుల సాంస్కృతిక సమ్మేళనం వలన ఇండో- హెలినిస్టిక్ సంస్కృతి అనే కొత్త సాంస్కృతిక ఒరవడి ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ ఉన్న గాంధార ప్రాంతంలో ఒక కొత్త శిల్పకళాశైలి ఏర్పడింది. దానిని గాంధారశిల్పశైలి అంటారు. ఈ శైలిలో అంతవరకూ చిహ్నాలరూపంలో ఉన్న బుద్ధుడు, బౌద్ధమతపాత్రలు మొదటిసారిగా మానవరూపంలో చిత్రీకరించటం జరిగింది. బౌద్ధమత పరిణామక్రమంలో ఇదొక ముఖ్యమైన మలుపు.
కూర్చొని ఉన్న బుద్ధుని శిల్పాలలో ధ్యానముద్ర, భూమిస్పర్శ ముద్ర, ధర్మచక్రముద్ర లతో ఉన్నవి , అలాగే నిలుచుని ఉన్న అవలోకేశ్వర, , శయనస్థితిలో ఉండే Reclining బుద్ధుని ప్రతిమలు భారతదేశంలో విరివిగా లభిస్తాయి.
బౌద్ధ ప్రతిమాశాస్త్రం ఆ తదుపరి కాలంలో వచ్చిన హిందూ ప్రతిమలను తీర్చిదిద్దటానికి ప్రేరణగా నిలిచి ఉంటుంది.
[1] pn.15, Buddhapada and the Bodhisattva Path, Hamburg Buddhist Studies 8
[2] The Significance of the signs and symbols on the foot prints of the buddha, TB Karunaratne, Jestor 5.
బొల్లోజు బాబా
ఈ సీరిస్ రాయటానికి సంప్రదించిన పుసకాలు
1. Yaksha cult, Ram Nath Misra
2. The Art and Architecture of India, Benjamin Rowland
3. Le Huu Phuoc, Buddhist Architecture
4. Iconography of the Hindus Buddhists, and Jains, RS Gupte
5. Gouriswar Bhattacharya, Essays on Buddhist Hindu Jain iconography and epigraphy
6. The Art of Ancient India, Buddhist, Hindu, Jain
7. Elements of Buddhist Iconography, Ananda K Coomaraswamy
8. పురాణాలు-మరోచూపు, బి. విజయభారతి

















No comments:

Post a Comment