Thursday, October 19, 2023

బౌద్ధ చిహ్నారాధన - పార్టు 2


3. స్తూపం (thube)

బుద్ధుని రూపం బదులుగా ఆరాధించబడిన చిహ్నాలలో స్తూపం ఒకటి. ప్రాచీన బౌద్ధనిర్మాణాలలో స్తూపారాధన శిల్పాలు తప్పక కనిపిస్తాయి. స్తూపం అంటే అర్ధవృత్తాకారంలో లేదా గంట ఆకారంలో ఉండే నిర్మాణం అని అర్ధం.
 
బుద్ధుడు పరినిర్వాణం పొందినపుడు అతని దేహ అవశేషాల కొరకు ఆనాటి సమకాలీన ఎనిమిది మంది రాజులు యుద్ధానికి దిగారట. ఆ సంఘటనను సాంచిస్తూప దక్షిణ ద్వారంపై శిల్పరూపంగా మలచారు. ఇందులో బుద్ధునిదహనం చేసిన చోటుకు ఇరువైపులా సేనలు మొహరించి ఉండటం చూడవచ్చు. (photo). ద్రోన అనే బ్రాహ్మణుడు (Brahmin Drona) మధ్యవర్తిత్వం వహించి అవశేషాలను ఎనిమిది సమ భాగాలుగా చేసి ఇవ్వటంతో యుద్ధం ఆగిందని “మహాపరి నిర్వాణ సూత్ర” గ్రంథంలో చెప్పబడింది. ఆ సంఘటనను శిల్పంగా మలచిన ఫలకం నేడు టోక్యో మ్యూజియంలో ఉంది. (see photo).
 
ఆ ఎనిమిది అవశేషాలను ఆయా రాజ్యాల ప్రధాన పట్టణాలకు పంపి స్తూపాలను నిర్మించారు. అవి- రాజగృహ, వైశాలి, కపిలవస్తు, అల్లకప్ప, రమగ్రమ, పావ, కుశినగర్, వేతాదిప లు. ఆర్కియాలజిస్టులు వీటిలో ఇంతవరకూ రాజగ్రిహ, వైశాలి, రమగ్రమ, కుశినగర్ కపిలవస్తు ల వద్ద నిర్మించిన స్తూపాలను గుర్తించగలిగారు. మిగిలినవాటి వివరాలు తెలియరావు. Piprahwa/కపిలవస్తు స్తూపం వద్ద ఒక భరిణిలో దొరికిన బుద్ధునివని చెప్పబడే అవశేషాలను 1971 లో K.M. Srivastava కార్బన్ డేటింగ్ చేయించి అవి క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దానికి చెందినవని నిర్ధారించాడు. [1]
 
ఆ తరువాత అశోకచక్రవర్తి వాటిని తవ్వించి ఆ దాతువులను మరల కొన్ని వేల భాగాలుగా చేసి చేసి దేశమంతటా 84 వేల స్తూపాలు నిర్మించినట్లు బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుస్తుంది. ఈ స్తూపాలవద్ద అశోకుడు రాతి స్తంభాలను పాతించి దానిపై తన శాసనాలను లిఖింపచేసాడు. ఈరోజు దేశంలో ఏ ప్రాంతంలో తవ్వినా దొరకే బౌద్ధ అవశేషాలు అశోకుడు స్థాపించినవే కావొచ్చు.
గాజు, లేదా బంగారు భరణెలో బుద్ధుని భౌతిక అవశేషాలు ఉంచి దానిపై నిర్మించిన స్తూపాన్ని Relic stupa అంటారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా దంతపురంవద్ద బుద్ధుని దంతం కలిగిన Relic స్తూపం ఉండేదట. ఆ పవిత్రదంతాన్ని శ్రీలంక అనురాధపురానికి తరలించుకొని పోగా దంతపురం అనే ఊరిపేరు, అక్కడ కొన్ని స్తూప శిథిలాలు మాత్రం ప్రస్తుతం మిగిలాయి.
 
నిత్యం దర్శించుకొని ఆరాధన చేయటం కొరకు నిర్మించిన స్తూపాన్ని Votive stupa అంటారు. విశాఖపట్టణం సమీపంలో బావికొండ, సాలిహుండంల వద్ద వీటి అవశేషాలు కనిపిస్తాయి.
బౌద్ధ స్తూపం చుట్టూ ప్రదక్షణ చేయటానికి వీలుగా ఒక మార్గం, దానికి వెలుపల పిట్టగోడలాంటి ప్రాకారం ఉంటుంది. దీన్ని Guard rails (వేదిక) అంటారు. ఇది నిలువు, అడ్డ రాతి స్తంభాల వెదురుబద్దల అల్లికవంటి బిగింపుతో నిర్మితమై ఉంటుంది. వీటిపై అందమైన బౌద్ధ శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఈ రాతి వేదిక (railing) ఐహిక ప్రపంచాన్ని, ఆథ్యాత్మిక ప్రపంచాన్ని వేరుచేసి, భక్తులను స్తూపం చుట్టూ ఉన్న ప్రదక్షణ మార్గం మీదకు నడిపిస్తుంది. స్తూపం చుట్టూ మూడుసార్లు ప్రదక్షణం చేయాలని బౌద్ధనియమావళి.
 
బౌద్ధ స్తూపాలు, కొండగుహలు, చైత్యాలు ప్రస్ఫుటమైన శైలిని కలిగిన స్వతంత్రనిర్మాణాలు.
బోధగయలో CE 150 కి చెందిన మహాబోధి ఆలయ గోపురం 180 అడుగుల ఎత్తుఉండే ఇటుకల నిర్మాణం. గోపురశిఖరంపై బౌద్ధ స్తూపం ఉంటుంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధివృక్షానికి దగ్గరలో ఈ ఆలయం ఉందికనుక దీన్ని Great Awakening Temple అని అంటారు.
400-425 CE మధ్య నిర్మించిన సాంచి 17 వ నంబరు బౌద్ధ ప్రతిమాగృహం భారతదేశంలో అత్యంతపురాతనమైన freestanding ఆలయం. ఇది చాలా సరళమైన నిర్మాణాన్ని కలిగిఉంటుంది. చతురస్రాకారపు గర్భగుడి దాని పైన చదునైన కప్పు, ద్వారమండపాన్ని నిలబెడుతూ ముందువైపున నాలుగు స్తంభాలు వాటిపై పద్మాలు, సింహాలు చెక్కబడి ఉంటాయి.
పైన చెప్పిన బౌద్ధ ఆలయాల నిర్మాణశైలి కొన్ని శతాబ్దాల అనంతరం నిర్మించిన హిందూ ఆలయాలనిర్మాణ శైలికి స్పూర్తి కావొచ్చు.[2]
 
బొల్లోజు బాబా

1. The Relics of Culture, Vol I William Anderson Gittens- pn.78
2. Buddhist Architecture, Le Huu Phuoc 2010 pn. 252, 254

















No comments:

Post a Comment