Friday, November 13, 2020

#కులపురాణం

 #కులపురాణం

Bolloju Baba
గారు ముందటి
Chilekampalli Kondareddy
గారు రాసిన జాంబవపురాణంపై పెట్టిన టపాలో ఇచ్చిన సమాధానం.
.
కులాలు పదో శతాబ్దం తరువాత వచ్చిన సామాజిక పరిణామం. అంతవరకూ అందరూ శూద్రులే (వేదకాలంనుండి ఊరివెలుపల ఉన్న చండాల, పుళింద/ట్రైబల్ వర్గాలు తప్ప). అందరిమధ్యా కంచం పొత్తు మంచం పొత్తు ఉండేది.
కులస్థిరీకరణ జరిగి కంచం పొత్తు మంచం పొత్తు ఆగిపోయాకా ఎవరి కుల ప్రాశస్త్యా న్ని చెప్పుకొనే పురాణాలు వారు రాసుకోవటం జరిగింది.
అదే సమయంలో ఈ విభజనలను వ్యతిరేకించే వీరశైవ ఉద్యమం వచ్చింది. పల్నాడు చాపకూడు ఉదంతం, వీరబ్రహ్మేంద్ర స్వామి భోధనలు సమాజాన్ని ఒక రకంగా అంచెల వ్యవస్థ అయిన హిందూ ధర్మాన్ని అతలాకుతలం చేసాయి. సవాల్ చేసాయి.
ఇదే సమయంలో భిన్న కులాలమధ్య సమన్వయం కొరకు హిందూ మతం ఇలాంటి కులపురాణాలను పుట్టించి ఉండొచ్చు తెలివిగానో లేక సహృదయంతోనో ఈనాడు చెప్పలేం..... ప్రతి కులాన్నీ ఇంకో కులంతో ముడివేయటం జరిగింది.
ఈ ముడివేయటం అనేది పై గాథలో చూడవచ్చు. సమాజంలో పైతరగతిలో ఉండే బ్రాహ్మణుల ఇంట పెండ్లికి (కోమట్లకు కూడా) మాదిగ కులస్తుని అవసరం ఉండేలా లింక్ చేసింది. ఒక్క మాదిగే కాదు మన హిందూ సంస్కృతిని గమనిస్తే ప్రతి కులంలోని ఇంట్లో జరిగే శుభ, అశుభ కార్యాలకు మాల, మాదిగ, మంగలి, చాకలి, కంసాలి, కుమ్మరి లాంటి వారి ప్రమేయం లేకుండా జరగకూడదనే ఆచారాల్ని సృష్టించారు.
సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఇతర ప్రతిఒక్కరి అవసరం ఉండేలా అందరినీ సంప్రదాయాలు/ఆచారాలు పేరిట ముడివేసారు. ఆఖరుకు అడుక్కుతినే హక్కు కలిగిన కులం, దొంగతనాలు చేసుకొనే హక్కుకలిగిన కులం లాంటివి కూడా ఉండటం దీనికి పరాకాష్ట.
ఈ close knitted వ్యవస్థ - కులవృత్తులు ఉండే అతి చిన్న యూనిట్ అయిన గ్రామాలలో ఒకప్పుడు సమర్ధవంతంగానే పనిచేసింది.
ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవంతో కులవృత్తులు పోయాయో సమాజంలోని మనుషులందరూ సాఫుగా తాపీ చేయబడి సమానం అయిపోయి.... ఇలా కులాలుగా మిగిలిపోయాం. ఎక్కువతక్కువలతో. ఎవరి అవసరం ఎవరికీ లేదీనాడు.
నా ఉద్దేశం ఇక్కడ పుట్టుకతో ఎక్కువతక్కువలు నిర్ణయించే కులాలు ఉండాలని కాదు... ఉపాధులు, స్వావలంబనా జీవనాలు పోయాయని. రెండిటికీ చాలా తేడా ఉంది.
ప్రతీ కులపురాణం అందరినీ కలిపి ఉంచుతూ, స్వాభిమానాన్ని పెంచే "కథలుగా అనిపిస్తాయి నాకు.

No comments:

Post a Comment