Saturday, February 8, 2025
ఆది శంకరాచార్యుడు - ఆథ్యాత్మిక దండయాత్ర
Friday, January 31, 2025
పున్నిక థేరీ గాథ
.
థేరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు
[పున్నిక:]
నేను నీళ్ళు మోయు దాసిని
యజమానురాలి తిట్లకు, శిక్షలకు భయపడి
ఎంతచలిలోనైనా నేను నదిలో దిగకతప్పదు
ఓ బ్రాహ్మణుడా!
కాళ్ళుచేతులు వణికే ఇంతచలిలో
నీవు దేనికి భయపడి నీటిలో మునుగుతున్నావు?
[ఉదకసుద్ధిక:]
పున్నికా! నీకు అన్నీ తెలుసు
నదీ స్నానం సర్వపాపాలను హరిస్తుంది
దుష్కర్మలనుండి విముక్తులను చేస్తుంది
[పున్నిక:]
నీటిలో మునిగితే
పాపవిముక్తి జరుగుతుందని ఎవరన్నారు?
ఒక అంధుడు మరొక అంధునికి దారిచూపినట్లు.
అదే నిజమైతే
కప్పలు, తాబేళ్ళు, నీటిపాములు, మొసళ్లు లాంటి
జలచరాలన్నీ స్వర్గార్హత పొందిన పుణ్యజీవులేనా!.
జంతువులను వధించువారు, వలలు వేసేవారు,
ఉచ్చులు పన్నేవారు, దొంగలు, హంతకులు, దుర్మార్గులు
ఈ నీరు నెత్తిపై చల్లుకొంటే వారి వారి పాపాలు తొలగి
పుణ్యాత్ములౌతారా?
ఈ నీటికే పాపాలను తొలగించే శక్తే ఉంటే
పుణ్యాలను కూడా తీసుకుపోగలదు కదా!
అప్పుడు నీవు రెండిటినుండి విముక్తుడవు అవుతావు.
పాపభీతితో ఎముకలు కొరికే చలిలో స్నానం చేస్తూ
నీ శరీరాన్ని కష్టపెట్టుకోకు
[ఉదకసుద్ధిక:]
ఓ వనితా!
నేను తప్పు మార్గంలో వెళుతున్నాను
నీవు నన్ను ఉత్తమ మార్గం లోకి మళ్ళించావు
ఈ వస్త్రాన్ని నీకు ఇస్తున్నాను, స్వీకరించు
[పున్నిక:]
వస్త్రాన్ని నీవే ఉంచుకో, నాకు అవసరం లేదు.
దుఃఖం అంటే భయం ఉన్నప్పుడు
దుష్కర్మలు చేయవద్దు చీకట్లోనైనా లేదా వెలుగులోనైనా
చెడ్డపనులు చేసి వాటినుంచి పారిపోయినప్పటికీ
వాని తాలూకు దుఃఖం నుంచి తప్పించుకోలేవు.
దుఃఖం నుండి విముక్తి పొందాలంటే
తధాగతుడిని, ధమ్మాన్ని, సంఘాన్ని ఆశ్రయించు
ఉపదేశాలను ఆచరించు. మంచి జరుగుతుంది.
[ఉదకసుద్ధిక:]
తధాగతుడిని, ధమ్మాన్ని, సంఘాన్ని ఆశ్రయించాను
ఉపదేశాలను ఆచరించాను. మంచి జరిగింది.
ఒకప్పుడు నేను బ్రాహ్మణసంతానాన్ని మాత్రమే
నేనీనాడు త్రివిద్యలను అభ్యసించి పరిశుద్ధుడనైన
నిజమైన బ్రాహ్మణుడను.
***
(థేరీగాథలు పుస్తకం నుంచి)
.
పున్నిక ఒక దాసి కూతురు. ప్రతిరోజు నదికి పోయి గృహావసరాలకు నీరు తీసుకొని వచ్చే అంబువాహిని. దాదాపు రెండున్నరవేల ఏండ్లక్రితం పున్నిక, ఉదకశుద్ధిక అనే బ్రాహ్మణుడితో నదీ స్నానం వెనుక ఉండే మూఢత్వాన్ని గురించి చేసిన సంభాషణ పై థేరీగాథలో గమనించవచ్చు. ఇది ఆనాటి ప్రజలలో ఉండిన మత పరమైన అవగాహన.
నీళ్ళలో నివసించే చేపలు, తాబేళ్ళు కూడా పుణ్యజీవులేనా? దుర్మార్గులు ఈ నీళ్ళు చల్లుకొంటే వారి పాపాలు పోతాయా అని వేసిన ప్రశ్నలు నేటికీ విలువైనవి.
అంత తార్కికంగా ఆలోచించిన అదే ప్రజలు నేడు పర్వదినాల పేరిట తొక్కిసలాటకు గురయి మరణిస్తున్నారు. అశోక చక్రవర్తి వేయించిన 1 వ నంబరు శాసనంలో ప్రజలు గుమిగూడటాన్ని నిషేదించాడు. బహుశా మతం అనేది వ్యక్తిగతంగా సాధన చేయాల్సిన అంతర్యానం తప్ప సామాజికంగా గుంపులు గూడి ఆరాధించాల్సిన విషయం కాదని అశోకుని అభిప్రాయం కావొచ్చు.
అలాంటి ప్రజలలో ఉండిన శాస్త్రీయ ఆలోచనలను చంపేసి, జాతిమొత్తాన్ని నిర్వీర్యం చేసి అంధకారం వైపు, మూఢనమ్మకాలలోకి నడిపించారు గత వెయ్యేళ్ళుగా.
.
బొల్లోజు బాబా
Tuesday, January 28, 2025
రాజ్యాంగ రచన - డా.అంబేద్కర్ మహాశయుడు
.
భారతరాజ్యాంగ నిర్మాణంలో 299 మంది సభ్యులు పాల్గొన్నారని వారిలో డా. బి. ఆర్. అంబేద్కరు ఒకరని; నిజానికి రాజ్యాంగాన్ని 1947 లోనే బి.ఎన్. రావు రచించాడని దానినే డా. అంబేద్కర్ రాజ్యాంగ కమిటీ ముందు ప్రవేశపెట్టాడని; భారత రాజ్యాంగ నిర్మాతగా డా.అంబేద్కర్ పాత్ర పరిమితమని- అంటూ కొంతమంది సనాతనులు ప్రతి రిపబ్లిక్ డే రోజునా అబద్దాలను వండివార్చటం పరిపాటి.
***
రాజ్యాంగ సభ (Constituent Assembly) అంటే భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన సంస్థ. ఈ సభ భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, 1946లో ఏర్పడింది. దీని ప్రధాన లక్ష్యం స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడం. ఈ సభ అధ్యక్షుడైన డా. రాజేంద్రప్రసాద్, భారత ప్రభుత్వ అధికారి, న్యాయకోవిదుడు బి.ఎన్ రావును రాజ్యాంగ ప్రాధమిక డ్రాఫ్ట్ ను/ముసాయిదా తయారు చెయ్యమని కోరాడు.
ఆ మేరకు బి.ఎన్. రావు వివిధ దేశాలు పర్యటించి, ఆ యా దేశాల రాజ్యాంగాలను పరిశీలించి వాటిలోని మంచి అంశాలను క్రోడీకరిస్తూ ఒక నివేదికను తయారు చేసి అక్టోబరు 1947 లో స్వతంత్రభారత ప్రభుత్వానికి సమర్పించాడు. (దీన్ని ఆర్చైవ్స్ లో Constitution in the making పేరుతో చదువుకొనవచ్చును) ఇది ఒకరకంగా రాజ్యాంగానికి ప్రాధమిక ఔట్ లైన్. ఇక్కడితో బిఎన్ రావు పాత్ర ముగిసిపోయింది. 1948 లో బి.ఎన్ రావు యునైటెడ్ నేషన్స్ లో భారత ప్రతినిధిగా, 1952 వరకు అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జ్ గా పని చేసారు. భారతదేశంలోనే లేరు.
బి.ఎన్ రావు తయారు చేసిన నివేదిక ను రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా నియమించబడిన డా. అంబేడ్కర్ కు ఇచ్చారు. దీనిని డా. అంబేద్కర్ దాదాపు తిరగ రాసి 299 మంది సభ్యులున్న Constituent Assembly ముందు చర్చించటానికి ప్రవేశపెట్టారు.
రాజ్యాంగాన్ని నిర్మించటం కొరకు జరిగిన చర్చలను Constituent Assembly Debates అంటారు. ఇవి డిశంబరు 9 1946 నుండి నవంబరు 26, 1949 మధ్య జరిగాయి.
.
బి.ఎన్ రావు ప్రతిపాదించిన రాజ్యాంగ ఫ్రేమ్ వర్క్ నివేదికకు (1947) డా. అంబేద్కర్ తుదిరూపు దిద్దిన (1950) రాజ్యాంగానికి గల వ్యత్యాసాలను ఈ విధంగా గుర్తించవచ్చు.
1. 240 ఆర్టికిల్స్ ను 390 ఆర్టికిల్స్ గా డా. అంబేద్కర్ విస్తరించారు.
2. ప్రజలమధ్య సోదరభావం సమైక్యత పెంపొందించటానికి రాజ్యాంగ ప్రవేశికలో సౌభ్రాతృత్వం అనే పదాన్ని డా. అంబేద్కర్ చేర్చారు
3. బిఎన్ రావు ప్రణాళిక 1935 నాటి భారతప్రభుత్వ చట్టాలపై ఎక్కువగా ఆధారపడింది. డా. అంబేడ్కర్ రాష్ట్రాలు, కేంద్రాల అధికారాలను, పరిధులను స్పష్టంగా నిర్వచించారు. కేంద్రం బలంగా ఉండేందుకు అనేక మార్పులు చేసారు. అత్యవసర సమయంలో దేశంలో ప్రాధమిక హక్కులు రద్దుచేసి ఎమర్జెన్సీ విధించే హక్కు కేంద్రానికి కల్పించారు.
4. బిఎన్ రావు ప్రణాళికలో ప్రాథమిక హక్కులు పరిమితంగా ప్రస్తావించబడ్డాయి. డా.అంబేద్కర్ తుది రాజ్యాంగం వాటిని విస్తరించి పునర్నిర్మించింది, ముఖ్యంగా వివక్షకు వ్యతిరేకంగా రక్షణలు కల్పించింది. అంటరానితనాన్ని రద్దు చేసింది. ప్రాధమిక హక్కుల పునరుద్ధరణ కొరకు ఏ పౌరుడైనా సుప్రీమ్ కోర్టు తలుపు తట్టటం అనే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. (ఆర్టికిల్ 32) దీన్ని రాజ్యాంగం యొక్క హార్ట్ అండ్ సోల్ అని డా. అంబేద్కర్ వర్ణించారు.
5. డా. అంబేద్కర్ న్యాయవ్యవస్థను స్వతంత్రంగా నిలబెట్టారు. ప్రజల ప్రాధమిక హక్కులను రక్షించటానికి దానికి విస్త్రుతమైన అధికారాలను ఇచ్చారు.
6. బిఎన్ రావు ప్రణాళికలో పెద్దల ఓటు హక్కు లేదా ఎన్నికల ప్రక్రియలను స్పష్టంగా నిర్వచించలేదు. అంబేద్కర్ బృందం సార్వత్రిక పెద్దల ఓటు హక్కు మరియు ఎన్నికల యంత్రాంగాల కోసం ఒక బలమైన స్వతంత్ర వ్యవస్థను ప్రతిపాదించింది.
7. బిఎన్ రావు ప్రణాళిక భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు స్పష్టమైన నిబంధనలను రూపొందించలేదు. అంబేద్కర్ ఆధ్వర్యంలోని తుది రాజ్యాంగం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఆవశ్యతను, అవకాశాలను గుర్తించింది.
8. ఆర్టికిల్ 39 ద్వారా సమానపనికి సమాన వేతనచట్టాన్ని మరింత విస్త్రుతపరచారు డా. అంబేడ్కర్. అదే విధంగా ఆర్టికిల్ 45 ద్వారా 14 ఏళ్ళ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పటం రాష్ట్రాల బాధ్యత చేసారు.
9. బిఎన్ రావు ప్రణాళికలో వెనుకబడిన వర్గాలకు రక్షణ కల్పించమని ఉంది. దీన్ని డా.అంబేద్కర్ మరింత విస్తరించి ఎస్సి, ఎస్టీ లకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారు.
10. అత్యయిక పరిస్థితులలో దేశం ఏం చెయ్యాలనేది బి.ఎన్ రావు ప్రణాలికలో సూచించలేదు. దీన్ని 352, 356, 360 లాంటి ఆర్టికిల్స్ ద్వారా కేంద్రం దేశాన్ని కంట్రోల్ లోకి తీసుకొని యుద్ధం, అంతర్గతకల్లోలాలు వంటి అత్యయిక పరిస్థితులను సరిదిద్దే అవకాశం కల్పించారు డా. అంబేద్కర్
11. రాజ్యాంగ సభ ఈ ముసాయిదాను సుమారు మూడేళ్ళపాటు చర్చలు జరిపి తుది రాజ్యాంగాన్ని ఆమోదించింది. దాదాపు ఈ చర్చలన్నిటిలో డా. అంబేద్కర్ పాల్గొన్నారు. సభ్యుల సందేహాలకు వివరణలు ఇచ్చారు. అభ్యంతరాలు చెప్పిన చోట వేల కొలదీ తగిన సవరణలు చేసి ఒప్పించారు. ఆ విధంగా రాజ్యాంగ తుది రూపం డా.అంబేద్కర్ మేధో శ్రమఫలితమే.
పై అంశాలను గమనిస్తే- ఈ రోజు ఏదైతే మనం రాజ్యాంగ మౌలిక స్వరూపం అని అనుకొంటున్నామో దానిని డా. అంబేడ్కర్ రూపొందించినట్లు అర్ధమౌతుంది. ఇది సామాన్యపౌరుడిని వివక్ష, దోపిడి, దౌర్జన్యాలనుండి నుండి రక్షిస్తుంది. ఈ రోజు ఈ హక్కులను కాలరాయటం జరుగుతోంది. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నించటం కూడా పైన పొందుపరచిన అంశాలను తొలగించటానికే అని అనుమానించే పరిస్థితులు ఉన్నాయి.
***
రాజ్యాంగ సభ 165 సార్లు కూర్చుని రాజ్యాంగం ఎలా ఉండాలో చర్చించింది. అనారోగ్యంతో ఉండికూడా వీటిలో సుమారు 150 సమావేశాలకు డా.అంబేడ్కర్ హాజరయ్యారు. తుది మెరుగుల కొరకు ముసాయిదాను మూడుసార్లు సభ్యుల ముందు ప్రవేశపెట్టారు.
రాజ్యాంగ సభ సభ్యులు మొత్తం 7635 మార్పులు సూచించగా 2473 మార్పులను డా. అంబేద్కర్ అంగీకరించి తదనుగుణంగా సవరణలు చేసారు. తిరస్కరించిన సూచనలకు, చేసిన మార్పులకు స్వయంగా సమాధానం ఇచ్చారు.
ఈ Constituent Assembly చర్చలన్నీ నేడు 6756 పేజీల డాక్యుమెంటుగా లభిస్తున్నాయి. ఈ డాక్యుమెంటులో డా. అంబేడ్కర్ పేరు 4524 సార్లు రాగా బి.ఎన్ రావు పేరు 35 సార్లు మాత్రమే ఉండటాన్ని బట్టి డా. అంబేద్కర్ రాజ్యాంగ రచనలో పోషించిన పాత్ర స్పష్టమౌతుంది.
రాజ్యాంగ సభలో డా. అంబేద్కర్ రోజూ 9-10 సార్లు లేచి నిలబడి తన అభిప్రాయాలను సమర్ధించుకోవటమో లేక సమాధానం ఇవ్వటమో చేసారని, కొన్ని సార్లు రోజుకు 25-26 సార్లు కూడా సభలో తన గళాన్ని వినిపించేవారని ఈ Constituent Assembly చర్చల ద్వారా అర్ధమౌతుంది.
తుది రాజ్యాంగ ప్రతి 1949 లో కమిటీ సభ్యుల ఆమోదం పొంది జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చింది. రాజ్యాంగ నిర్మాణదశ, దాన్ని ఆమోదించటంలో రాజకీయంగా డా. అంబేడ్కర్ కు జవహర్ లాల్ నెహ్రూ ఇచ్చిన మద్దతును విస్మరించలేం.
***
రాజ్యాంగ రచనలో పాల్గొన్న 299 మంది సభ్యులలో డా. అంబేద్కర్ ఒకరని, రాజ్యాంగాన్ని బి.ఎన్ రావు రూపొందించగా డా. అంబేద్కర్ క్రెడిట్ తీసుకొన్నారని సనాతనులు దుష్ప్రచారం చేస్తారు.
రాజ్యాంగ సభ సభ్యులలో ఒకరైన టీ.టీ. కృష్ణమాచారి, ఒక సమావేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంకితభావం గురించి మాట్లాడుతూ ---"రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి ఎంపిక చేసిన ఏడుగురు సభ్యులలో ఒకరు రాజీనామా చేశారు, ఒకరు మరణించారు, ఒకరు అమెరికాకు వెళ్ళారు, ఒకరు స్వరాష్ట్రంలో తన పనితో బిజీగా ఉన్నారు, ఇద్దరు ఢిల్లీ నుండి దూరంగా నివసిస్తున్నారు, మరొకరు ఆరోగ్య కారణాల వల్ల మినహాయించబడ్డారు, డాక్టర్ అంబేద్కర్ ఒక్కరే భారాన్ని మోయవలసి వచ్చింది" అని అన్నారు.
డా.అంబేడ్కర్ సమకాలీనుడు, రాజ్యాంగరచనలో పాల్గొన్న ఒక వ్యక్తి అన్నమాటలు. ఇవేవీ ఈ సనాతనులకు కనిపించవు.
నేడు వీరు డా. అంబేద్కర్ కృషిని తగ్గించాలని చూడటానికి కారణాలు - డా.అంబేడ్కర్ ప్రాచీన ధర్మశాస్త్రాలకు విరుద్ధంగా, ప్రజలందరకూ సమాన హక్కులు, విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించటం మరీ ముఖ్యంగా ఈ దేశాన్ని హిందూరాజ్యంగా కాక స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు ప్రాధమిక సూత్రాలకు అనుగుణంగా నిర్మించు కొనేందుకు ఒక బలమైన రాజ్యాంగాన్ని ఇవ్వటం, అది సామాన్యులు, నిరుపేదల పట్ల పక్షపాతంతో ఉండటం. వీటిని జీర్ణించుకోలేక సనాతనులు నిత్యం ఈ శతాబ్దపు దార్శనికుడిపై బురద జల్లుతున్నారు.
బొల్లోజు బాబా
Monday, January 13, 2025
సతీ- సహమరణం - చారిత్రిక పరిశీలన
సతిసహగమనం గురించిన మొదటి చారిత్రిక ఆధారం గ్రీకు చరిత్రకారుల
నుంచి లభిస్తుంది. BCE ఒకటో శతాబ్దానికి చెందిన Diodorus Siculus అనే చరిత్రకారుడు
Bibliotheca Historica అనే గ్రంథంలో ఉత్తర భారతదేశంలో జరిగిన ఒక సతీసహగమం గురించి ఇలా
వర్ణించాడు.
"Ceteus అనే భారతీయ సైనికాధికారి యుద్ధంలో మరణించాడు. అతనికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య గర్భవతి కనుక భర్తతో సహమరణించటానికి సేనాధిపతులు చిన్నభార్యను ఎంపిక చేసారు. దాసిలు ఆమెను కొత్తపెళ్ళికూతురుగా అలంకరించి తలపై పుష్పకిరీటాన్ని ఉంచారు. ఆమె సద్గుణాలను స్తుతిస్తూ కీర్తనలు పాడారు. ఆమె తన ఆభరణాలను స్నేహితులకు, సేవకులకు ఇచ్చివేసింది. ఆమెసోదరుడు ఆమెను చితివద్దకు నడిపించుకు వెళ్ళాడు. ఆమె స్వయంగా భర్తపక్కన పడుకోగా చితికి నిప్పుపెట్టారు. ఆమె అగ్నికి ఆహుతి అయ్యింది. Diodorus తో సహా కొందరు గ్రీకులు ఇది క్రూరమైన అనాగరిక ఆచారమని భావించారు" సతికి సంబంధించి లభించే అత్యంత ప్రాచీన ఆధారం ఇదే.
సతీసహగమన ఆచారానికి సంబంధించి మరింత స్పష్టమైన ఆధారాలు గుప్తులకాలం నుండి లభిస్తాయి. ఇది మొదటగా క్షత్రియులలో మొదలై క్రమేపీ బ్రాహ్మణులకు పిదప సాంస్క్రిటైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇతరకులాలకు కూడా విస్తరించింది. 1000 CE నాటికి ఇది సమాజంలో ఒక ఆచారంగా స్థిరపడిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.*. భర్త మరణించిన స్త్రీ బ్రహ్మచర్యం ఆచరిస్తే ఆమె మరణానంతరం స్వర్గాన్ని చేరుకొంటుంది. అలా కాక భర్తతో పాటు సహగమిస్తే మనిషిదేహంపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటుంది. -- పరాశర స్మృతి 4.29-31
Tuesday, December 24, 2024
డా. అంబేద్కర్ ఎందుకు రాజీనామా చేశారు?
ప్రాచీన గాథలు పుస్తకంపై డా. సుంకర గోపాల్ స్పందన
అనువాదం చేశారు. అయితే ఇందులో భీముని భాగం అనువాదాలు మూలానికి దగ్గరగా ఉన్నాయనిపిస్తోంది. అనువాదకుడు వాటిని ఎంతవరకు లోపలకి తీసుకున్నాడనేది ,వాటిని చదువుతూ ఉన్నప్పుడు
అర్థం అయిపోతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రాచీన గాథలు చదువుతుంటే అద్భుతమైన కవిత్వ అనుభూతి సహృదయ పాఠకుడు పొందగలడు. అట్లాంటి అనుభూతిని నాకు ప్రసారం చేసిన బాబా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని కొని చదవడం ద్వారా మన డబ్బు వృధా కాదు.
ముచ్చట గా మూడు అనువాదాలు
నా ఇంటి స్తంభాన్ని ఆనుకొని నిలిచి
"నీ కొడుకు ఎక్కడ "అని అడుగుతున్నావు
వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు
అతనికి జన్మనిచ్చిన ఈ గర్భం ఒక కొండ గుహ
పులి కొంతకాలం ఇక్కడ నివసించి వెళ్ళిపోయింది
ఎక్కడో ఏదో యుద్ధ భూమిలో అతను నీకు దొరుకుతాడు
(పురనానూరు-86)
ఊరి పెద్ద కూతురు చాలా అందగత్తె
ఊరిలోని మగాళ్ళందర్నీ
దేవతలుగా మార్చేసింది
ఎవరు రెప్పలు మూయరు
ఆమెను చూస్తున్నప్పుడు( గాథా సప్తశతి)
ఓ వేటగాడా
ఒక బాణం సరిపోతుంది కదా
ఎందుకు పొదిలోంచి మరొకటి తీస్తున్నావు
మా ఇరు దేహాలలో ఉండేది ఒకే ప్రాణం (వజ్జా లగ్గము)
Thursday, December 19, 2024
ఈ దేశానికి నెహ్రూ తప్పించిన ఉపద్రవం
Saturday, December 14, 2024
ప్రాచీన గాథలు- అనువాద కవిత్వం
ప్రాచీన గాథలు.
ప్రాచీన గాథలు పుస్తకం కావలసిన వారు 7989546568 నంబరు లేదా chaayabooks com వెబ్సైట్ వద్ద పొందవచ్చును.
పేజీలు 254, ఆఫర్ ధర 250/- రూపాయలు, ఫ్రీ షిప్పింగ్.
Friday, November 29, 2024
ప్రార్థనా మందిరాల వివాదం: చట్టం, సమాజం, సమతుల్య దృక్పథం
ఇటీవలి కాలంలో మసీదులు, దర్గాలు, చర్చిల కింద శివలింగాలు ఉన్నాయని, వాటిని తవ్వి బయటపెట్టాలని, హిందువులకు ఆ ప్రదేశాల్లో పూజలు చేసుకోవటానికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేసే వాదనలు పెరుగుతున్నాయి. ఈ వాదనలు సాధారణంగా మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉండటం గమనార్హం.
ఈ రకమైన ప్రచారాల వెనుక అసలైన ఉద్దేశాలు ఏమిటి?
మతసామరస్యానికి చెక్ పెట్టడం: దేశంలో ఇప్పటికే మెరుగులేని స్థితిలో ఉన్న మతసామరస్యాన్ని పూర్తిగా చెరిపేయడం.
ప్రజల దృష్టిని మళ్లించడం: అసలు చర్చించాల్సిన ముఖ్యమైన ఆర్థిక, సామాజిక సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చి, నిరర్థకమైన వాదనలపై దృష్టి పెట్టించడం.
రాజకీయ లబ్ధి: మెజారిటీ మతాన్ని దేశపు అధికారిక మతంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించడం.
చట్టం ఏమంటుంది?
1991లో భారతదేశ పార్లమెంట్ ప్రవేశపెట్టిన Places of Worship Act ప్రకారం,
1947, ఆగస్టు 15 నాటికి ఏ ప్రార్థనా స్థలం ఏ మతానికి చెందుతుందో, అది ఆ మతానికి మాత్రమే చెందుతుంది.
ఈ చట్టం ప్రకారం, ఎటువంటి ప్రార్థనా స్థలాన్నీ ఇతర మతాలకు మార్చడం నిషిద్ధం.
నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి.
చట్టం రామజన్మభూమి వివాదానికి మినహాయింపు ఇచ్చింది, కానీ దేశంలోని ఇతర అన్ని ప్రార్థనా స్థలాలకు ఈ చట్టం వర్తిస్తుంది.
చట్టాన్ని దాటి బయటకు వెళ్తున్న ప్రస్తుత పరిస్థితి
నేడు కొన్ని వర్గాలు చట్టాన్ని అవమానిస్తూ ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనాలయాలను హిందూ మతంలోకి మార్చాలని కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నాయి. ఈ చర్యలు సమాజంలో విభజన, ద్వేషాన్ని పెంచడం తప్ప మరేమీ చేయవు.
ఈ తవ్వకాల పరిణామాలు
మన దేశం గొప్ప వైవిధ్యానికి నిలయం. మతం, సంస్కృతి, సంప్రదాయాలలోనూ ఈ వైవిధ్యం ప్రస్ఫుటమవుతుంది.
చరిత్రపరమైన సమస్య: తవ్వకాల్లో హిందూ మతానికి సంబంధించిన వస్తువులు మాత్రమే బయటపడతాయనే నమ్మకానికి ఆధారాలు లేవు.
సామాజిక విబేధం: ఇటువంటి చర్యలు వివిధ మతాల మధ్య విభేదాలను మరింతగా పెంచుతాయి.
సంస్కృతికి వ్యతిరేకం: వైవిధ్యానికి మించిన విలువ మనకు లేదు. మన దేశ సౌందర్యం ఈ వైవిధ్యంతోనే నిలబడింది.
మనకు కావాల్సినది ఏమిటి?
అన్ని మతాలకు సమానమైన గౌరవం, సమాన హక్కులు కల్పించడమే భారత రాజ్యాంగం మూలసిద్ధాంతం.
మతసామరస్యం: ప్రతి మతాన్ని గౌరవించడం, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడం మన బాధ్యత.
చరిత్రను సరిదిద్దడం కాదు: చరిత్రను ఆధునిక రాజకీయ అవసరాలకు ఉపయోగించడాన్ని నిరోధించాలి.
ముగింపు
ఇటువంటి అనవసర వాదనలు మన దేశ బలం అయిన వైవిధ్యాన్ని దెబ్బతీయవచ్చు. మతసామరస్యాన్ని, మన సంప్రదాయ విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. చట్టాన్ని గౌరవించడం, వివేకంతో నడుచుకోవడం, విభేదాలను పక్కన పెట్టి సమైక్యతను బలపరచడం అత్యవసరం.
- బొల్లోజు బాబా