Friday, November 28, 2025

హరప్పానుంచి నేటివరకూ ..... ముందుమాట

పుస్తకం చదివి చాలామంది ఫోనులు, మెసేజులు చేసి అభినందిస్తున్నారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను. ఈ పుస్తకానికి నేను రాసుకొన్న ముందుమాట ఇది. థాంక్యూ ఆల్.
.
మనవి మాటలు

దేవానాం ప్రియుడు సమస్త (మత) శాఖల వారిని సన్యాసులైనా, గృహస్థులైనా, దానములు ఇచ్చి, ఇతర సత్కారములు చేసి గౌరవించుచున్నాడు. ఒక శాఖకు (మతానికి) చెందిన వ్యక్తులు అసందర్భంగా తమ శాఖను పొగుడుకోవడం, ఇతర శాఖలను నిందించడం చేయరాదు. పరశాఖల వారిని కూడా గౌరవించవలెను. ఇట్లు చేయుట వలన తన శాఖను అభివృద్ధి చేసుకోవటమే కాక ఇతర శాఖలవారికి ఉపకారం కలిగించిన వారు అయ్యెదరు. తన వారిని స్తుతిస్తూ ఇతరశాఖల వారిని నిందించేవాడు తన శాఖకే ఎక్కువ అపకారం చేసిన వాడవుతాడు. తన శాఖవారు, ఇతరశాఖలవారు ఒకరితో ఒకరు పొత్తు కలిగి ఉండడమే శ్రేయోదాయకము. సమస్త జనులకు ధర్మాభివృద్ధి ముఖ్యము. (అశోకుని XII వ శిలాశాసనం, BCE 256)

అశోకుని కాలంలో వైదికం, బౌద్ధం, జైనం, ఆజీవికం, చార్వాకం, శాక్తేయంవంటి భిన్న మతాలు (విశ్వాసాలు) ఉండేవి. ఇవికాక స్థానిక గిరిజన విశ్వాసాలు. ప్రజలు భిన్నమతాలపట్ల సహిష్ణుతతో మెలగటం, రాజ్యం అన్ని మతాలను సమాదరించటం మన ప్రాచీనభారతదేశపు జీవనవిధానం. ఈ దేశభిన్నత్వపు మూలాలు అక్కడివి. సెక్యులరిజం అనే భావన పుట్టిందే ఈ నేలపైన.

బౌద్ధం, జైనం, ఆజీవికం, చార్వాకం లాంటి మతాలు వెనుకకు మళ్లి వైదికమతం రూపం మార్చుకొని హిందూమతంగా ముందుకురావటం భారతదేశ మతాల చరిత్రలో ఒక మైలురాయి. ఇది సుమారు ఆరు ఏడు శతాబ్దాలలో ప్రారంభమై పదో శతాబ్దం నాటికి స్పష్టమైన రూపాన్ని తీసుకొంది.

హెచ్చుతగ్గుల వర్ణవ్యవస్థ, కర్మ, మోక్షం, బహుదేవతారాధన, యజ్ఞయాగాదులు, వేదాలు ఉపనిషత్తులపై అంగీకారం, ద్విజుడే ఉత్తమమానవుడు లాంటి భావనలను జీవనవిధానంగా కలిగి ఉండటాన్ని హిందూమతంగా చెబుతారు. చారిత్రకంగా పాలకులు వేరేమతాలకు చెందినవారైనప్పటికీ హిందూమతం తన అస్తిత్వాన్ని నిలుపుకొని, భారతదేశం బహుళఅస్తిత్వ సమాహారంగా రూపుదిద్దుకొంది. భిన్న భాషలు, ఆరాధనలు, సంస్కృతులు, ఆహారపుటలవాట్ల ద్వారా వైవిధ్యమైన సమాజంగా నిలిచింది. ఈ బహుళత్వం ఈ దేశ భౌగోళిక వైవిధ్యం, ఎక్కడినుంచో దఫదఫాలుగా వచ్చి ఈ దేశప్రజలతో సాంస్కృతికంగా మమేకమైన వలసకారులవల్లా ఏర్పడింది.

స్వతంత్ర భారతదేశ నాయకులు భారతదేశ బహుళత్వాన్ని ప్రతిబింబించే భిన్న భాషలు, కులాలు, మతాలు, సంస్కృతులు, ఆహారపు అలవాట్లను గౌరవిస్తూ అన్ని సమాజవర్గాలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించే లక్ష్యంతో భారత రాజ్యాంగాన్ని రూపొందించారు.
***
డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ తన అసమాన ప్రతిభతో, తర్కంతో, సాక్ష్యాధారాలతో భారతదేశ చారిత్రక నెరేటివ్‌ను గొప్ప మలుపు తిప్పారు. ఆయన దృక్పథంతో సమకాలీన అంశాలను ఒక బహుజనవాదిగా పరిశీలించినపుడు అవి నాకు ఎలా కనిపించాయో, ఎలా అనిపించాయో విశ్లేషిస్తూ గత మూడు నాలుగేళ్ళు గా రాసిన వ్యాసాలు ఇవి. ఒకే అంశానికి భిన్న పెర్‌స్పెక్టివ్స్‌గా చూస్తాను వీటిని.

ఈ వ్యాసాలు పూర్తిగా అకడమిక్‌ ఆసక్తితో, స్వీయ అన్వేషణలో భాగంగా రాసినవి. ఆయా సందర్భాలకు సంబంధించిన రిఫరెన్సులను ఎక్కడికక్కడ ఇచ్చాను. అయినప్పటికీ నాకు తెలియని, నా దృష్టికి రాని అంశాలు ఎన్నో ఉండవచ్చునన్న ఎరుక, వినమ్రత నాకు ఎన్నడూ ఉంటుంది.

ఈ పుస్తకంలోని వివిధ వ్యాసాలు - హరప్పా నాగరికత నుండి సమకాలీన హిందూత్వ భావనల వరకు భారతదేశ మత వైవిధ్యాన్ని, మత విశ్వాసాల పరిణామ క్రమాన్ని విశ్లేషిస్తాయి. ఆయా చారిత్రక కాలాల్లో ప్రజలు ఎదుర్కొన్న సామాజిక, సాంస్కృతిక సవాళ్లను చిత్రిస్తాయి. మత వైవిధ్యాన్ని, సాంస్కృతిక భిన్నత్వాన్ని వివిధ కాలాలలో ప్రజలు ఎలా కాపాడుకొంటూ వచ్చారో చెబుతాయి. ఈ ప్రక్రియలో ఎదుర్కొన్న సవాళ్ళు, విభేదాలను వివరిస్తాయి.

ఈ రచనలో బౌద్ధ, జైన, చార్వాక, ఆజీవిక మతాల ప్రస్తావన ఉండాలి. అయితే వాటిని నేను ఇప్పటికే ‘వేద బాహ్యులు’ (2024) పుస్తకంలో విశదంగా చర్చించినందున, ఇక్కడ వాటి వివరాల్లోకి వెళ్లలేదు. ఇవి భిన్నకాలాలలో రాసిన వ్యాసాలు కనుక అక్కడక్కడా దొర్లే పునరుక్తులను పెద్దమనసుతో చూస్తారని భావిస్తాను.

మెజారిటేరియన్‌ వాదం ఎల్లెడలా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ దేశసమైక్యతను, భిన్నత్వాన్ని కాపాడటానికి సామాన్య మానవునికి, స్వేచ్ఛ సమానత్వం కల్పించటం కొరకు ఏ మార్గం అనుసరణీయమో ఎవరికి వారు నిర్ణయించుకోవాలని నమ్ముతాను.
ఈ వ్యాసాలు కేవలం చారిత్రక సామాజిక అంశాలపై ఉండే భిన్నాభిప్రాయాల అకడమిక్‌ చర్చలకొరకు మాత్రమే ఉద్దేశించబడినవి. సహృదయ పాఠకులు అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాను.

***
ఈ పుస్తకరచనలో శ్రీ కల్లూరి భాస్కరం గారు చేసిన సూచనలు విలువైనవి. వారు ఈ పుస్తకానికి గొప్ప నాందీ ప్రస్తావన చేస్తూ రాసిన చక్కని విశ్లేషణాత్మక ముందుమాటకు ఎంతో కృతజ్ఞుడను. విషయసారాన్ని ఈ పుస్తాకానికి బ్లర్బ్ రూపంలో కొద్ది వాక్యాల్లో బంధించిన శ్రీ అద్దేపల్లి ప్రభుకు ధన్యవాదములు.

నా పై అవ్యాజమైన ప్రేమ కురిపించే శ్రీ శిఖామణి, శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ మధునాపంతుల సత్యనారాయణమూర్తి, శ్రీ గనారా, శ్రీ మార్ని జానకీరామ్‌ చౌదరి, శ్రీ అవధానుల మణిబాబు, శ్రీ ఎస్‌.కె. మోహనరావు ఇంకా నన్ను ప్రోత్సహించే మిత్రులందరకూ...

ధన్యవాదములతో...

భవదీయుడు
బొల్లోజు బాబా

సెప్టెంబరు, 2025
పేజీలు 240. ధర రూ. 275/-

9866115655 నెంబర్ కి రు. 300/-(పోస్టెజ్ తో) ఫోన్ పే చేసి ఎడ్రస్ పంపితే regd book post లో పంపగలరు, పల్లవి పబ్లిషర్స్, శ్రీ ఎస్.వి నారాయణ గారు.
అమజాన్ లింక్ కామెంటులో కలదు. థాంక్యూ.










Some stray thoughts….

ఈ మధ్య ఒటిటి ల్లో మళయాల సినిమాలు చూస్తున్నాను. చాలా సినిమాల్లో క్రిస్టియన్, ముస్లిమ్ పాత్రలు ఉంటున్నాయి. వాటిని ఏ టెర్రరిస్టులగానో, మతదురహంకారులుగానో కాక ఉదాత్తంగా చిత్రిస్తున్నారు. ఉత్తమ మానవులుగా చూపిస్తున్నారు. కొన్ని సినిమాలలో హీరోయే ఆ మతాలకు చెందినవ్యక్తిగా కథ నడుస్తుంది. ఇలాంటి కల్చర్ మనవద్ద కూడా ఒకప్పుడు ఉండేది. ప్రముఖ హీరోల చిత్రాలలో ముస్లిమ్/క్రిష్టియన్ మతాలకు చెందిన వ్యక్తులు కథలో ఏదో ఒక పాత్రగా ఉండేవారు. ఈ కల్చర్ క్రమేపీ కనుమరుగైంది.
 
హైందవేతరమతాలకు చెందిన వారిని శత్రువులుగా చూపించటం లేదా హేళనచేయటం ఇటీవల ఎక్కువగా జరుగుతోంది.
***

“ఆ అమ్మాయి తన క్రికెట్ విజయానికి తను నమ్మే దేవుడు కారణమని చెప్పటం తప్పు కాదు కానీ ఆ మాటలు చూపించి మతమార్పిడులు చేస్తారు” అంటాడొకడు ఆ మొత్తం ట్రోలింగ్ కు ప్రధాన వాదనగా.
 
ఒకరి విశ్వాసాలను మరొకరు మార్చుతారు అనే ఆలోచనే నీచమైనదనుకొంటాను. ఎవరు ఎవరిని మార్చగలరు?. ఇలా ఆలోచించేవారికి సాటి మనిషి స్వేచ్ఛ, చేతన, ఐచ్ఛికతల పట్ల ఎంత తక్కువ అభిప్రాయం ఉందో కదా! అనిపిస్తోంది. వీరికే తప్ప ఇతరులకు సొంత అభిప్రాయాలుండకూడదు, వీరికి నచ్చినట్లే వీరి కనుసన్నల్లోనే ప్రపంచం ఉండాలి కాబోలు.
 
"ఒక వ్యక్తి ఏమి మాట్లాడాలి, ఎలా విశ్వసించాలి అనేదానిని మేము నిర్దేశిస్తాము; మీరు మమ్మల్ని అనుసరించాలి" అనే ఈ పద్ధతి, పౌరులందరికీ సమాన విచక్షణ శక్తి ఉందని నమ్మకుండా, కొంతమంది సవర్ణులు చెప్పినట్లే అవర్ణులు వినాలి, లోబడి ఉండాలి అని చెప్పే మనుస్మృతి సూత్రాలను అమలు చేయడమే.

ఇది అప్రజాస్వామికము, ఫాసిజము అనే స్పృహకూడా ఉండదు చాలామందికి.
“మనచుట్టూ ఉన్న సమాజం అంతలా పాడయిపోయిందా?”
 
బొల్లోజు బాబా

తరం మారుతున్నది…. ఆ స్వరం మారుతున్నది!

బకించంద్ర చటోపాధ్యాయ వందేమాతర గీతం రాసి 150 ఏళ్ళఅయిన సందర్భంగా సంబరాలు జరుపుకొంటున్నాం. ఈ రోజు మనం పాడుకొంటున్న పాటలో రెండు చరణాల అర్ధం ఇది.

తల్లీ నీకు వందనం!
మధురమైన జలాలతో, ఫలాలతో, పంటలతో
చల్లని మలయమారుతాలతో సుభిక్షంగా ఉండే
తల్లీ నీకు వందనం!
చంద్రకాంతులలో పులకించే రాత్రులతో
పుష్పాలతో శోభిల్లే వనాలతో
నవ్వులతో, స్నేహపూర్వక మాటలతో
సంతోషాలను, వరాలను ఇచ్చే
తల్లీ నీకు వందనం!

పై చరణాలు భరతమాత సౌందర్యం, సంపద, సుభిక్షతలగురించి చెబుతాయి. మిగిలిన చరణాలలో భారతమాతను దుర్గాదేవికి, లక్ష్మీ దేవికి, సరస్వతి దేవికి ప్రతిరూపంగా చిత్రించారు. (ఈ గీతాన్ని ఆనందమఠ్ అనే నవలనుంచి తీసుకొన్నారు కనుక ఈ పోలికలు అక్కడ సందర్బోచితం)
.
నీవు దుర్గాదేవి శక్తివి
కమలదళాలమధ్య విహరించే లక్ష్మీదేవివి
జ్ఞానమును ప్రసరించే సరస్వతీ దేవివి
తల్లీ నీకు వందనం!
లక్షల కంఠాలతో గర్జించే తల్లీ!
లక్షలచేతులతో ఆయుధాలు ధరించిన తల్లీ
నీవు అబలవు కావు, మహాబలశాలివి
శత్రుసంహారిణీ
తల్లీ నీకు వందనం!
.
1896 జాతీయ కాంగ్రెస్ మహాసభలలో మొదటిసారిగా రవీంద్రనాథ్ టాగోర్ వందేమాతర గీతాన్ని ఆలపించాడు. అది మొదలు భారతస్వాతంత్ర్య పోరాటంలో వందేమాతర గీతం ఒక ఉద్యమ గీతంలా ప్రజలు సొంతం చేసుకొన్నారు. వందేమాతరం అనేది బలమైన బ్రిటిష్ శక్తులను ఎదిరించే ఒక నినాదంగా నిలిచింది.

కానీ ఈ గీతంలో ఉండే హిందూదేవతల ప్రస్తావనలున్న చరణాలపట్ల హైందవేతరులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ముఖ్యంగా మహమ్మద్ ఆలీ జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్, ఈ గీతాన్ని బలవంతంగా అందరిచేతా పాడించటాన్ని తప్పు పడుతూ ఈ గీతం "positively anti-Islamic and idolatrous” అని పేర్కొంది. ఆమేరకు 1937 లో లక్నో లో జరిగిన ముస్లిం లీగ్ సెషన్ లో తీర్మానం చేసారు.

1937 అక్టోబరు లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ వివాదాన్ని గుర్తించి, హైందవేతరుల మనోభావాలు గాయపడకుండా ఏం చేయాలనేది చర్చించింది.

ఈ చర్చలలో- జవహర్ లాల్ నెహ్రూ అందరకూ ఆమోదయోగ్యమైన మధ్యే మార్గాన్ని సూచించమని కమిటీ సభ్యులను కోరాడు

-మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ముస్లిముల మనోభావాలను గుర్తించమని అందరినీ కోరాడు
-సుభాష్ చంద్రబోస్, వందేమాతర గీతం యధాతధంగా ఉండాలని వాదించాడు. (చంద్ర బోసు తన అజాద్ హింద్ ఫౌజ్ కు Anthem గా Abid Hasan Safrani రచించిన "Subh Sukh Chain ki Barkha Barse" అనే గీతం ఉండటం గమనార్హం)

-రవీంద్రనాథ్ టాగోర్ వందేమాతర గీతంలోని మొదటి రెండు చరణాలలో ఏ రకమైన మతప్రస్తావనలు లేవు కనుక వాటిని ఉంచి మిగిలినవి తొలగించటం ద్వారా ఈ వివాదాన్ని ముగించవచ్చునని సలహా ఇచ్చాడు.

రవీంద్రుని సూచన మేరకు వందేమాతర గీతంలో మొదటి రెండు చరణాలను మాత్రమే అప్పటినుంచి మన జాతీయ గేయంగా పాడుకొంటూ వస్తూన్నాం.
***
ఈ వందేమాతర వివాదం స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మరొక్క సారి చర్చకు వచ్చింది. స్వతంత్ర్య భారతదేశానికి ఒక జాతీయ గీతం (National Anthem) కావలసి వచ్చింది. ఆ హోదా కొరకు జనగణమన, వందేమాతరం మధ్య టై పడింది. ఏ పాటకు National Anthem హోదా ఇవ్వాలి అనే అంశాన్ని 1946-1950 మధ్యలో జరిగిన constituent Assembly Debates లో కమిటీ సభ్యులు చర్చించారు. ఆ చర్చలు ఇలా ఉన్నాయి.

1. 31st July 1947 న H. V. Kamath అనే సభ్యుడు “వందేమాతర గీతాన్ని ఆగస్టు 15, 1947 అధికారబదిలీ వేడుకలలో ప్రారంభగీతంగా పాడాలి అని కోరాడు. (ఆ విధంగానే శ్రీమతి సుచేత క్రిపాలాని ఆ రోజున వందేమాతరంలోని మొదటి చరణాన్ని పాడటం జరిగింది)
.
2. 5th November 1948 న Seth Govind Das అనే సభ్యుడు ఇలా అన్నాడు
జాతీయ గీతం విషయానికి వస్తే, నేను చెప్పేది — “వందే మాతరం” మన జాతీయ గీతంగా ఉండవచ్చు.

మన స్వాతంత్ర్య పోరాట చరిత్ర వందే మాతరంతో విడదీయలేని బంధం కలిగి ఉంది.
ఎవరైనా ఇది సంగీత వాద్యములకు (orchestration) అనుకూలంగా లేదని చెబితే - అది చిన్న సమస్య మాత్రమే.

మహాకవి సూరదాస్, మీరాబాయి గారి గీతాలు ఒకే రాగంలో కాదు —అనేక రాగాల్లో పాడవచ్చు. కాబట్టి “వందే మాతరం” ను వాద్యరూపంలో స్వరపరచలేం అనడం సరైంది కాదు.
రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ పట్ల అందరకూ గౌరవమే. ఆయన నిజంగా కవులలో రాజు.
అయితే ఆయన రాసిన “జన గణ మన” కవిత 1911లో బ్రిటన్ చక్రవర్తి జార్జ్ V భారతదేశానికి వచ్చిన సందర్భంగా రాయబడింది.

ఆ కవితలోని భావాలు భారతమాతకు అంకితం చేయబడినవి కావు — అవి ఆ కాలంలోని రాజాధిరాజు (ఎంపరర్)కు అంకితం చేయబడ్డవి. “భారత భాగ్య విధాత” అనే పదబంధంలో పేర్కొన్నది ఆ చక్రవర్తినే అని “జయ రాజేశ్వర్” (రాజాధిరాజుకు జయం) అనే వాక్యంతో స్పష్టమవుతుంది.

అందువల్ల — మన దేశం ఒక ప్రజాస్వామ్య రాజ్యంగా (Republic) ఉన్నప్పుడు, ఎవ్వరైనా రాజాధిరాజుకు జయగానం చేసే పాటను జాతీయ గీతంగా ఉపయోగించలేము. అందుచేత “వందే మాతరం” మాత్రమే మన జాతీయ గీతం కావాలి
.
3. 9th November, 1948 న Shri Vishwambar Dayal Tripathi అనే సభ్యుడు ఇలా అన్నాడు
“వందే మాతరం” మరియు “జన గణ మన” మధ్య జాతీయ గీతం గురించి కొంత వివాదం ఉంది. నా అభిప్రాయం ప్రకారం, గత యాభై సంవత్సరాలుగా మన దేశ ప్రజల హృదయాలలో నిండిపోయి, మన స్వాతంత్ర్య పోరాటానికి దీపస్తంభంలా మారిన “వందే మాతరం” మన దేశపు జాతీయ గీతం కావాలి.
.
4. 24th January 1950 న Dr. Rajendra Prasad అధ్యక్షత స్థానంలో ఉండి ఇలా ప్రకటించి వందేమాతర వివాదానికి ముగింపు పలికారు.

జాతీయ గీతం (National Anthem) విషయం ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ అంశాన్ని సభ ముందు ఉంచి, ఒక ప్రతిపాదన (resolution) ద్వారా నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. అయితే అలా ప్రతిపాదన తీసుకోవడం కంటే, నేను జాతీయ గీతం గురించి ఒక ప్రకటన చేయడం మంచిదని భావించి నేను ఇప్పుడు ఈ ప్రకటన చేస్తున్నాను:

“జన గణ మన” అనే పదాలతో, స్వరంతో కూడిన కృతి భారత దేశ జాతీయ గీతంగా నిర్ణయించబడింది, అవసరమైతే ప్రభుత్వం కొన్ని పదాలను మార్చే అధికారాన్ని కలిగి ఉంటుంది.
అలాగే — భారత స్వాతంత్ర్య పోరాటంలో చారిత్రాత్మక పాత్ర పోషించిన “వందే మాతరం” పాటను కూడా జన గణ మనతో సమాన గౌరవం, స్థానం కలిగినదిగా గుర్తించాలి”
(అభినందనలు — సభలో చప్పట్లు)
***
వందేమాతర గీతం జాతీయగేయంగా చేయటం వెనుక చరిత్ర ఇది. మొదటిదశలో మతపరమైన అంశాలున్న కారణంగా కొన్ని చరణాలను తొలగించారు. ఆనాటి నాయకులు దార్శనికులు. ఈ దేశవైవిధ్యాన్ని, బహుళతను గౌరవించారు. భిన్నవర్గాల మధ్య సయోధ్య కుదిర్చి అన్నిటినీ ఒకే జాతీయభావన కిందకు తీసుకురావటానికి కృషిచేసారు.

రెండవ దశలో జనగణమన గీతాన్ని National Anthom గా ఆమోదిస్తూనే, వందేమాతరగీతానికి ఉన్న ప్రజాదరణ రీత్యా దానికి కూడా సమాన స్థాయి కల్పించారు.

ఈ రోజు వందేమాతరం "పూర్తి గీతం" అంటూ పాట ఒకటి వాట్సప్పులలో చక్కర్లు కొడుతుంది. – “తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది” అని సినారే ఏనాడో రాసారు.
.
బొల్లోజు బాబా

“ హిందుత్వ ఇండియాలో ముస్లిముగా ఉండటం” పుస్తకావిష్కరణ సభలో శ్రీ సిద్ధార్ధ వరదరాజన్ ప్రసంగం .

(Zia Salam రచించిన “Being Muslim in Hindutva India” పుస్తకావిష్కరణ సందర్భంగా “The Wire” వ్యవస్థాపక సంపాదకుడు Siddharth Varadarajan ఇచ్చిన స్పీచ్ కు formatted ఉరామరి తెలుగు లిఖితరూపం. స్పీచ్ లింక్ మొదటి కామెంటులో కలదు)
***

“Being Muslim in Hindutva India” పుస్తక రచయిత జియా సలాం ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరు కాలేకపోవడం ఆయన పుస్తకంలోని ప్రధానాంశమైన హిందుత్వ ఇండియాలో ముస్లింగా ఉండటం యొక్క కఠిన వాస్తవికతను తెలియజేస్తుంది. దీనికి కారణం ఒకే ఒక్క అక్షరం తప్పుగా ఉండటం.
 
మేం ఇద్దరం ఢిల్లీ నుండి వస్తున్నాము. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నాము, ఒక ట్రావెల్ ఏజెంట్ చేసిన స్పెల్లింగ్ తప్పు కారణంగా, జియా సలాం (ప్రతిష్టాత్మక 'ది హిందూ' గ్రూప్ అసోసియేట్ ఎడిటర్ అయినప్పటికీ) ప్రయాణించలేక పోయారు. ఆయన "పొడవైన గడ్డం" ముస్లిమ్ పేరు CISF గార్డుల మనసుల్లో అనుమానాన్ని రేకెత్తించి ఉండవచ్చు. నా పేరులో కూడా స్పెల్లింగ్ తప్పు ఉంది. అయినప్పటికీ నేను ప్రయాణించగలిగాను. ఎందుకంటే, నా పేరు సిద్ధార్థ్ వరదరాజన్. 'శర్మ'ని 'హెచ్' (H) లేకుండా రాయవచ్చు, అది ఓకే. 'దేశ్‌పాండే'లో ఒక 'ఈ' (E) ను తొలగించవచ్చు, అది ఓకే. కానీ జియా సలాం గారి పేరును 'సియా సలాం' అని స్పెల్లింగ్ మిస్టేక్ జరిగినపుడు, ఈయన అదే వ్యక్తి అని చూపించడానికి ఆయన దగ్గర ప్రపంచంలో ఉన్న ఐడీలన్నీ ఉన్నప్పటికీ, ఆయనకు విమానాశ్రయంలోకి కూడా ప్రవేశించడం అసాధ్యం అవుతుంది.
ఈ పుస్తకం పేరు 'హిందుత్వ ఇండియాలో ముస్లింగా ఉండటం'. దీనిని “ఇండియాలో ముస్లింగా ఉండటం” గా ఆలోచించండి. మనం జీవిస్తున్న ఈ శకం, ఈ కాలాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తుంది. మీరు ఒక ముస్లింను 1950లు లేదా 1960లు లేదా 70లు లేదా 80లలో ఒక పుస్తకం రాయమని అడిగి ఉంటే, మీకు చాలా భిన్నమైన పుస్తకం దొరికేది.

1950 లలో 'పేయింగ్ గెస్ట్' అనే ఒక ప్రసిద్ధ హిందీ సినిమా వచ్చింది. దేవ్‌ ఆనంద్, నూతన్ నటించారు. కథ లక్నోలో జరుగుతుంది. దేవ్‌ ఆనంద్ రమేష్ శర్మ అనే యువ లాయర్‌ పాత్రలో నటించాడు. అద్దెఇల్లు దొరకడం కష్టమవ్వటంతో ఆనంద్ ఒక వృద్ధ ముస్లిం వ్యక్తిగా వేషం వేసుకుని హిందూ యజమాని ఇంట్లో అద్దెకు దిగుతాడు, జియా సలాం గారిని ఇవాళ ఢిల్లీ విమానాశ్రయంలోకి ప్రవేశించకుండా చేసిన అదే పొడవైన గడ్డంతో!

ఈ రోజు 'పేయింగ్ గెస్ట్' లాంటి కథాంశంతో సినిమా తీయడం అనుమానమే. ఒక హీరో ముస్లిమ్ వ్యక్తి వేషం వేసుకొని హిందూ ఇంట్లో అద్దెకు దిగి ఇంటియజమాని కూతురిని ప్రేమిస్తే, “లవ్ జిహాద్” అని విరుచుకుపడతారు.
.
1. నివసించే స్వేచ్ఛ:
ఈ రోజు, బొంబాయి, ఢిల్లీ ఇంకా అనేక నగరాలలో, ఒక ముస్లిం వ్యక్తి తనకు నచ్చిన చోట ఇల్లు అద్దెకు తీసుకోవడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే యజమానులు, కాలనీ ప్రజలు, చుట్టుపక్కల వారు, కొన్నిసార్లు అధికారులు కూడా "లేదు, "మేము మీకు అద్దెకు ఇవ్వము" అని చెబుతారు.

ఎవరికైనా నచ్చిన ప్రాంతంలో జీవించే హక్కు, స్వేచ్ఛ అనేవి ప్రాథమిక విషయాలు, మీరు ముస్లిం అయితే, ఈ రోజు భారతదేశంలో ఈ హక్కు ప్రశ్నార్థకమైంది.

భారతదేశంలో వివక్ష ముందునించీ ఉంది. ఇది కేవలం మోడీ సంవత్సరాల ఫలితం అని నేను చెప్పడానికి ఇష్టపడను. కానీ గత 10 సంవత్సరాలలో పరిస్థితులు చాలా చాలా దారుణంగా మారాయి,
 
గత రెండు సంవత్సరాలలోనే, కనీసం మూడు లేదా నాలుగు కథనాలు చదివాను. ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుండి, ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నుండి, ఒకటి గుజరాత్‌లోని వడోదర నుండి. వడోదర కేసులో ముస్లిం మహిళ ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఏదో ఓ ప్రభుత్వ పథకం ద్వారా కేటాయించబడిన ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా, ఇరుగుపొరుగు కానీ, హిందూ నివాసితులు నుండి భారీ నిరసనలు వచ్చాయి, చివరికి ఆమె అక్కడ నివసించకుండా వెళిపోయారు. బరేలీలో, మొరాదాబాద్‌లో కూడా అదే జరిగింది. ఈ దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రతిరోజూ ఇలాంటి ఎన్ని కథనాలు జరుగుతాయో ఎవరికి తెలుసు?
.
2. ప్రేమించే స్వేచ్ఛ:
మీరు ప్రేమించే వ్యక్తిని ప్రేమించే స్వేచ్ఛ కూడా నేటి భారతదేశంలో ముస్లింలకు కనుమరుగౌతుంది. మొదటగా, వారు ఈ 'లవ్ జిహాద్' అనే భావనను సృష్టించారు. ఇది ఒక మోసపూరిత కుట్ర సిద్ధాంతం. కొన్ని పదాలు తరచుగా ఉపయోగించబడతాయి, ఆపై అవి సాధారణీకరించబడతాయి చివరకు ప్రజలు వాటిని అంగీకరిస్తారు.

అమీర్ ఖాన్ ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి నేను చదివాను, అది ఇంకా విడుదల కాలేదు. కావచ్చు. రజత్ శర్మ, అమీర్ ఖాన్‌ను అడిగాడు, "మీరు మూడుసార్లు వివాహం చేసుకున్నారు, ప్రతిసారీ హిందూ మహిళలను వివాహం చేసుకున్నారు. మీరు 'లవ్ జిహాద్' చేస్తున్నారు అని అనుకోవచ్చా" అన్నాడు.

లవ్ జీహాద్ లాంటి పదాన్ని అంత అలవోకగా వాడుతూ ఒక ప్రముఖ టీవీ యాంకర్ అడగాల్సిన ప్రశ్నేనా ఇది? మీరు ప్రేమించి పెళ్ళిచేసుకొన్న వారు వేరేమతానికి చెందినవారు అయినంత మాత్రాన ఆ ప్రేమకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు.
 
ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక యువ జంట వివాహం చేసుకున్నారు. ఆ అబ్బాయి పేరు అమన్ సిద్ధిఖీ అనుకుంటున్నాను. అమన్ సిద్ధిఖీకి హిందూ తల్లి, ముస్లిం తండ్రి ఉన్నారు. అతనికి ముస్లిం పేరు ఉన్నప్పటికీ, అతన్ని హిందువుగా పెంచారు. అతని తల్లిదండ్రులు విడిపోయారు, అతను హిందూ తల్లితో జీవిస్తున్నాడు. అతను ఒక హిందూ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వారికి హిందూ వివాహ వేడుక జరిగింది. ఇద్దరి తల్లిదండ్రులు, అంటే అమ్మాయి తల్లిదండ్రులు, అతని తల్లి కూడా హాజరయ్యారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.
 
వివాహం జరిగిన కొన్ని వారాలు లేదా నెలల తర్వాత, అమ్మాయి బంధువులలో ఒకరు, బహుశా ఆమె కజిన్ కావొచ్చు, ఆ వివాహం “బలవంతపు మత మార్పిడి కేసు” అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమన్ సిద్ధిఖీ అరెస్టు చేయబడ్డాడు. హైకోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది. చివరకు సుప్రీంకోర్టు అతనికి బెయిల్ ఇవ్వడానికి ఆరు నెలలు పట్టింది.
 
వేర్వేరు మతాల పేర్లు ఉన్న వ్యక్తుల మధ్య వివాహం అనే ఆలోచననే చాలా షాకింగ్‌గా పరిగణించబడుతోంది నేడు.
 
అనేక చిన్న పట్టణాలలో ఇలాంటి కేసులు పెద్దసంఖ్యలో ఉంటున్నాయి
వేర్వేరు మతాలను ఆచరించే వ్యక్తులు వివాహం చేసుకోవాలనుకుంటే, వారికి ప్రభుత్వ అనుమతి అవసరం అని చెప్పే చట్టాలను రాష్ట్రం తర్వాత రాష్ట్రం ఆమోదిస్తోంది. మనం ఎలాంటి దేశంగా మారాము?

మీరు మతం మారాలనుకుంటే, మీరు అనుమతి పొందాలి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఇప్పుడు గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలలో ఈ చట్టం ఉంది. ప్రజలను వేధించడానికి ఈ చట్టాలు ఉపయోగించబడుతున్నాయి.

వేరే మతానికి చెందినవారిని పెళ్ళిచేసుకోవాలంటే మీరు బంధువులనే కాదు భారతప్రభుత్వ పూర్తి బలాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. మీరు ప్రేమించే వ్యక్తిని ప్రేమించే స్వేచ్ఛ రాజీ పడింది.
.
3. ఆహార స్వేచ్ఛ: మీరు తినాలనుకున్నది తినే స్వేచ్ఛ కూడా రాజీ పడింది. రాష్ట్రం తర్వాత రాష్ట్రం ప్రజల ఆహార పద్ధతులను నియంత్రిస్తోంది. నేరంగా పరిగణిస్తోంది. ఆహార పద్ధతులను కొన్ని కొలబద్దలకు అనుగుణంగా బలవంతంగా రుద్దటానికి ప్రయత్నిస్తున్నారు. చాలా మంది హిందువులు మాంసం తింటారు. కానీ ఇప్పుడు, ఢిల్లీ ప్రాంతంలో కూడా, నవరాత్రుల సమయంలో, కొన్ని ప్రాంతాలలో మాంసం అమ్మకంపై నిషేధం ఉంటుంది, ఇది ఒక ధోరణిగా మారింది.
ఈ 'నయా భారత్'లో ముస్లింల అన్ని ప్రాథమిక స్వేచ్ఛలు హక్కులపై ఒత్తిడిని పెరుగుతోంది. ఇతర మైనారిటీలను కూడా లక్ష్యంగా చేసుకుని, వివిధ రకాలుగా బాధపడుతున్నారు. కానీ ఈ నిరంతర దాడి భారాన్ని మోస్తున్న ఒకే ఒక మైనారిటీ భారతదేశంలోని ముస్లింలు.
.
4. వస్త్రధారణ స్వేచ్ఛ
: 2019-2020 లో సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా మన ప్రధానమంత్రి మాటలను మనం ఎలా మర్చిపోగలం, "వారు ధరించే దుస్తుల నుండి మీరు ఈ వ్యక్తులను గుర్తించవచ్చు" అని ఆయన అన్నారు.

ఈ దేశ ప్రధాని అలా మాట్లాడటం మీరు ఊహించగలరా? అయితే అది 2019 నాటి విషయం. కానీ రాష్ట్రం తర్వాత రాష్ట్రం, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో, ముస్లిం మహిళలు, ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని నేరంగా పరిగణించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటివిషయాలను ఆయా వ్యక్తుల ఇష్టానికి వదిలివేయకుండా, ప్రభుత్వం జోక్యం చేసుకొంటోంది.
 
5. ఆరాధనా స్వేచ్ఛ: భారత రాజ్యాంగం ఈ దేశప్రజలకు ఆరాధనా స్వేచ్ఛ ఇచ్చింది. కానీ బహిరంగంగా నమాజ్ ఆచరించడాన్ని క్రిమినల్ చర్యగా చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. షాపింగ్ మాల్, రైల్వే ప్లాట్‌ఫారమ్‌, బస్సు దిగి రోడ్డు పక్క లేదా విశ్వవిద్యాలయం, కళాశాలలో ప్రార్థించడానికి ప్రయత్నించినందుకు ముస్లింలపై కేసులు నమోదు అయినట్లు నేను చదివాను.
వ్యక్తిగతంగా నన్ను అడిగితే, నేను లౌడ్ స్పీకర్ల వాడకాన్ని పెద్దగా ఇష్టపడను - అది అజాన్ కోసం అయినా, జాగరణ్ కోసం అయినా. మీరు మీ మతాన్ని ఆచరిస్తున్నప్పుడు మరెవరినీ ఇబ్బంది పెట్టవద్దు, అది మంచిదే. కానీ ఒక రకమైన ఇబ్బందిని నేరంగా పరిగణించి, ఇతర రకాల ఇబ్బందులను అనుమతించే పరిస్థితి ఉండకూడదు.

ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు పాల్గొంటున్న కొన్ని రకాల మత ఊరేగింపులను ఆపుతున్నారు. అదే సమయంలో హిందూ విశ్వాసాన్ని కలిగి ఉన్న ఇతర యాత్రలు, ఊరేగింపులు
అనుమతించబడటమే కాకుండా, పరిపాలన ద్వారా ప్రోత్సహించబడుతున్నాయి, మద్దతు ఇవ్వబడుతున్నాయి.

1991 ఆరాధనా స్థలాల చట్టం ఇది స్వాతంత్య్రం వచ్చే సమయానికి ఉన్న ఆరాధనా స్థలాల స్వభావం మార్చకూడదని చెప్పింది.

బాబ్రిమసీదు తీర్పుకు ఒక సంవత్సరం తరువాత, బనారస్‌ జ్ఞాన్‌వాపి మసీదు, మధురలోని మసీదు ఇతర మసీదుల పునరుద్ధరణ కోసం మోసపూరితమైన వాదనలు సృష్టించబడుతున్నాయి, కోర్టుల ద్వారా ముందుకు నెట్టబడుతున్నాయి. దాదాపు ప్రతి రాష్ట్రంలో వివాదాలు తిరిగి తెరవబడుతున్నాయి. ఇది భారతదేశంలోని ముస్లిములను మరింత భయాందోళనలకు గురిచేసే స్థితి.
 
6. మాట్లాడే స్వేచ్ఛ: ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశద్రోహం కింద అరెస్టు అయిన ప్రొఫసర్ అలీ ఖాన్, మహమూదాబాద్ కేసు మీకు అందరికీ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆయన, ‘ప్రభుత్వం కర్నల్ సోఫియా ఖురేషి వంటి వారిని రోల్ మోడల్‌గా హైలైట్ చేయడం సరిపోదని, మూక హత్యల లాంటి ముస్లిముల ఇతర సమస్యలపై కూడా దృష్టిపెట్టాలని” అని ఒక ప్రకటన చేశారు. దృష్టికి తెచ్చారు. ఆయన ప్రభుత్వాన్ని అభినందించారు. ప్రభుత్వం చేసిన చాలా మంచి పని అని అన్నారు. అలా అన్నందుకు ఆ ప్రొఫెసర్‌పై క్రిమినల్ కేసు దాఖలు చేసి అరెష్టు చేసి జైలుకు పంపారు.
 
అశోకా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఆ ప్రొఫెసర్‌ను, ప్రముఖ మేధావిని, పండితుడిని, బాగా గౌరవించబడిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని, అరెస్టు చేయడం ద్వారా, ముస్లింలందరికీ ఒక సందేశం పంపబడింది. "ఇక్కడ మేము ఇంత ప్రసిద్ధుడైన, గౌరవించబడిన వ్యక్తిపై చర్య తీసుకుంటున్నాము, ఆయన మాట్లాడినందుకు దేశద్రోహం ఆరోపిస్తున్నాము." అని.
ఆయన మాట్లాడింది మత సామరస్యం కోసం. మతం ఆధారంగా విభజించబడని దేశం కోసం. ఆయన సందేశం జాతీయ సమైక్యతకు సంబంధించినది. కానీ బదులు సందేశం ఏమిటంటే, “అలా మాట్లాడితే మీపై దేశద్రోహ నేరం మోపబడుతుందని”
 
కానీ కర్నల్ సోఫియా ఖురేషిని "టెర్రరిస్టుల సోదరి" అని పేర్కొన్న మధ్యప్రదేశ్ మంత్రి అరెస్టు కాలేదు. నిజానికి, ప్రజలు కోర్టుకు వెళ్లిన తర్వాత మాత్రమే ఆయనపై కేసు దాఖలు చేయబడింది.
7. జీవనోపాధి స్వేచ్ఛ: మహారాష్ట్రలోని ఒక మంత్రి, బిజెపి మంత్రి, పేరు గుర్తులేదు, ఒక ప్రకటన చేశారు. "మీరు ఈసారి మార్కెట్‌కు వెళ్లి ఏదైనా కొనాలనుకుంటే, దుకాణదారుడిని హనుమాన్ చాలీసా చదవమని అడగండి, ఆయన చదవకపోతే, అతని నుండి కొనుగోలు చేయవద్దు" అని హిందువులను కోరారు.

అధికారంలో ఉన్న వ్యక్తులు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు, విభజనను వ్యాప్తి చేస్తున్నారు, ముస్లింలను బహిష్కరించమని హిందువులకు పిలుపునిస్తున్నారు. కోవిడ్ సమయంలో, కరోనా వైరస్ వ్యాప్తికి ముస్లింలను నిందించారు. 'కరోనా జిహాద్' అనే పదం వాడారు. "ముస్లింల నుండి పండ్లు, కూరగాయలు కొనవద్దు" అని చెప్పారు. ముస్లింల జీవనోపాధిపై ఈ దాడి జరుగుతోంది.
మీరు ఎక్కడ జీవించాలనుకుంటున్నారు, మీరు ఎవరిని ప్రేమించాలనుకుంటున్నారు, మీరు ఏమి తినాలనుకుంటున్నారు, మీరు ఏమి ధరించాలనుకుంటున్నారు, మీరు బహిరంగ ప్రదేశంలో ఉన్నప్పుడు సమయానికి మీరు నమాజ్ చేసుకొనే స్వేచ్ఛ - అదంతా సరిపోదు. మీ జీవనోపాధిని ఆచరించే స్వేచ్ఛ కూడా ఒత్తిడిలో ఉంది.
.
8. విషపూరిత ప్రచారం: ప్రజా రంగం నుండి ముస్లింల ఉనికిని తుడిచిపెట్టడానికి ఒక స్పృహతో కూడిన ప్రయత్నం జరుగుతోంది. ప్రదేశాల పేర్లను మార్చడం, భారత చరిత్రకు ముస్లిం భారతీయుల సహకారాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నించడం.

ముస్లింలు శతాబ్దాలుగా భారతదేశంలో లేనట్లుగా ఈ తుడిచిపెట్టే ప్రక్రియ జరుగుతోంది. దీనిని మీరు అనేక రాష్ట్రాలలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చూడవచ్చు.

2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, మిస్టర్ మోడీ వయనాడ్‌లో మాట్లాడుతున్నప్పుడు, రాహుల్ గాంధీ 2019 ఎన్నికలలో వయనాడ్ నుండి పోటీ చేసినందుకు ఆయనపై దాడి చేశారు. నా దృష్టిలో, ఆయన చేసినది ఒక మతపరమైన, చట్టవిరుద్ధమైన ప్రసంగం. ఎన్నికల సంఘం చాలా స్పష్టమైన కారణాల వల్ల ఆయనపై చర్య తీసుకోకూడదని నిర్ణయించుకుంది. కానీ ఆయన చెప్పింది భారతీయ ఓటరుకు, కేరళ ప్రజలకు, వయనాడ్ ప్రజలకు, హిందువులకు, ముస్లింలకు అవమానం.
"రాహుల్ గాంధీ ఒక మైక్రోస్కోప్ తీసుకుని, భారతదేశంలో మైనారిటీలు ఎక్కువగా ఉన్న స్థలం కోసం వెతికాడు, ఆ తర్వాత ఆ నియోజకవర్గం నుండి నిలబడాలని నిర్ణయించుకున్నాడు" అని ఆయన అన్నారు. ఇక్కడ మీరు భారత ప్రధాని ఓటర్లను మెజారిటీ, మైనారిటీగా విభజించడం, ఆపై మైనారిటీ ఓటర్లు భారతీయులు కానట్లుగా జోక్ చేయడం గమనించవచ్చు.

2019 నాటి ఆ మతపరమైన ప్రచారం, 2024 ప్రచారం సందర్భంగా ఆయన చెప్పిన దానితో పోలిస్తే సాపేక్షంగా తేలికపాటిది, ఇది నిజంగా షాకింగ్‌గా ఉంది. ఆయన దాదాపు 200 ప్రసంగాలు చేశారు. వాటిలో 100 కంటే ఎక్కువ ప్రసంగాలలో ఆయన ముస్లింలను టార్గెట్ చేసిన సందర్భాలున్నాయని హ్యూమన్ రైట్స్ వాచ్ లెక్కించింది.
 
ప్రధానమంత్రి, భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి, ఆ స్థాయికి దిగజారతారని మీరు ఎప్పటికీ ఊహించరు. ఆయన ఏమి చెప్పారు? "కాంగ్రెస్ గెలిస్తే, బిజెపి ఓడిపోతే మీ మంగళసూత్రం, మీ బర్రెలు, మీ ఇళ్లు, మీ ఆభరణాలు తీసివేసి ముస్లింలకు ఇవ్వబడతాయి" అని హిందువులకు చెప్పారు. వాస్తవానికి, ఆయన ముస్లిం అనే పదాన్ని నేరుగా ఉపయోగించలేదు, చొరబాటుదారులు, ఎక్కువ పిల్లలను ఉత్పత్తి చేసే వ్యక్తులు వంటి నిందలను ఉపయోగించారు.
ఒక ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడి, నేరుగా రెచ్చగొట్టడం అనేది చివరిసారిగా ఎప్పుడు జరిగింది? రాజీవ్ గాంధీ 1984 నవంబర్‌లో సిక్కుల హత్యను సమర్థిస్తూ, "ఒక పెద్ద చెట్టు పడిపోతే, భూమి కదలక తప్పదు" అని ఒక అపఖ్యాతి పాలైన ప్రకటన చేశారు. కానీ ఇక్కడ మీరు ఒక ప్రధానమంత్రిని చూస్తున్నారు, ఆయన హిందువులను భయపెట్టడానికి ప్రయత్నిస్తూ, హిందు, ముస్లింల మధ్య ద్వేషాన్ని నేరుగా రెచ్చగొడుతున్నారు
 
మీ ప్రధానమంత్రి, ఆయన అందరు భారతీయులకు ప్రాతినిధ్యం వహించవలసిన వ్యక్తి, పక్షపాతిగా ఉండి, విభజన భాష, ద్వేష భాష మాట్లాడటం కంటే అవమానకరమైనది ఇంకేముంటుంది?
 
ఈ నెల ప్రారంభంలో నేను ఒక ప్రసంగం విన్నాను. అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఆపరేషన్ సింధూర్‌కు మద్దతు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోరాటంలోకి నేను వెళ్లాలనుకోవడం లేదు. ఇది వారి పోరాటం, ఇది వారి వ్యవహారం. ఆయన మమతా బెనర్జీని ఆపరేషన్ సింధూర్‌ను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించడంపై నాకు పట్టింపు లేదు.

కానీ ఆయన చెప్పింది ఈ క్రింది కారణాల వల్ల ఆమోదయోగ్యం కాదు. ఆయన ఇలా అన్నారు: "భారతదేశంలోని ముస్లింలను సంతృప్తి పరచడానికి (appease), మమతా ఆపరేషన్ సింధూర్‌ను వ్యతిరేకించింది." కాబట్టి ఇక్కడ లక్ష్యం నిజానికి మమతా కాదు, దయచేసి శ్రద్ధగా గమనించండి. "ముస్లింలను సంతృప్తి పరచడానికి, ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి, మమతా ఆపరేషన్ సింధూర్‌ను వ్యతిరేకించింది" అని. భారతదేశ హోంమంత్రి ఇలా మాట్లాడటం, మొత్తం ముస్లిం సమాజాన్ని, సో-కాల్డ్ ముస్లిం ఓటు బ్యాంకును దేశభక్తి లేనివారిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు.
 
ద్వి-జాతి సిద్ధాంతపు స్థాపకుడి వారసులు, రాజకీయ వారసులు ఈ రోజు భారతదేశాన్ని పాలిస్తున్నారు. వారు హిందూ, ముస్లింలను విభజించడం, ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడం, వారిపై ఒత్తిడి తేవడం, వారి స్వేచ్ఛను పరిమితం చేయడానికి ప్రయత్నించడం, వారి హక్కులను అడ్డుకోవడానికి ప్రయత్నించడం, వారు అసురక్షితంగా, బెదిరింపులకు గురైనట్లు భావించేలా చేసేఈ విషపూరిత సిద్ధాంతాన్ని అమలు చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.
మూక హత్య (mob lynching) లాంటియాదృచ్ఛిక హింసాత్మక సంఘటనల లక్ష్యం ప్రజలను విభజించి, భయభ్రాంతులకు గురిచేయడం. ఈ లక్ష్యం సాధించటం కొరకు ఒక చోట్లో ఎక్కువమందిని చంపాల్సిన అవసరం లేదు, దేశంలోని వివిధ ప్రాంతాలలో యాదృచ్ఛికంగా మూక హత్యలు చేస్తే సరిపోతుంది. రైలుప్రయాణం, హైవే ప్రయాణం, బస్సు ప్రయాణం లాంటి చోట్ల జరిపే మూకహత్యలు. ఆ యాదృచ్ఛిక స్వభావం సాధారణ ముస్లింలకు ఒక సందేశాన్ని పంపుతుంది: మీరు ముస్లింలా కనిపిస్తే, ముస్లింలా అనిపిస్తే, మీరు ముస్లింలా మాట్లాడితే, మీకు ఆ రకమైన గడ్డం ఉంటే, మీ వెనుక ఎల్లప్పుడూ ఒక ప్రమాదం ఉంటుంది, ఎల్లప్పుడూ ఒక భయం ఉంటుంది.
***

ఈ రోజు ఈ దేశముస్లిములు ఎదుర్కొంటున్న ఒత్తిడిని , వాస్తవికతను జియా సలాం గారు తన పుస్తకంలో చెప్పారు.
 
నిజాయితీగా, ఇది ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం. ఈ సంఘటనల గురించి మనందరికీ తెలుసు, మనందరం కథలు విన్నాము. కానీ మీరు దానిని డాక్యుమెంట్ చేసి, పుస్తకం రూపంలో ఉంచడం చూసినప్పుడు, సమస్య ఎంత తీవ్రంగా ఉందో మీరు గ్రహిస్తారు. కాబట్టి ఈ పుస్తకం రాసినందుకు నేను జియా గారిని అభినందిస్తున్నాను. ఆయన ఈ రోజు ఇక్కడ లేకపోవడం బాధాకరం.

పాఠకులకు ఈ పుస్తకం అందుబాటులో ఉండేలా చూసిన ప్రచురణకర్తలు, అనువాదకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ పుస్తకం విస్తృతంగా ప్రచారం అవుతుందని, ప్రజలు దానిని చదివి, జియా గారు వ్రాసిన సరళమైన సత్యాలను చర్చించి, అభినందిస్తారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.

(“The Wire” వ్యవస్థాపక సంపాదకుడు శ్రీ సిద్ధార్థ్ వరదరాజన్ ఇచ్చిన స్పీచ్ కు formatted ఉరామరి తెలుగు లిఖితరూపం)


https://www.youtube.com/watch?v=_13v4eucZiw

ఆర్ద్రత, ఆగ్రహం, తాత్వికతలను "చిగురించే పేజీలు"


.
శ్రీమతి నాగజ్యోతి శేఖర్ “రెప్పవాల్చని స్వప్నం” కవితా సంపుటితో తెలుగు సాహిత్యలోకంలో తనదైన స్థానాన్ని సంపాదించుకొన్నారు. “చిగురించే పేజీలు” వీరి రెండవ కవిత్వ సంపుటి. ఈ పుస్తకంలో కవితలు సామాజిక స్పృహ, మానవసంబంధాల గాఢత, ప్రకృతి పట్ల ప్రేమ, స్త్రీవాద దృక్పథాలను గాఢంగా ప్రతిబింబిస్తాయి. వీరి వస్తువైవిధ్యం విస్తారమైనది. అభివ్యక్తి నవ్యం. కవితను నడిపించే శైలి వినూత్నం.

నాగజ్యోతి తన కవిత్వాన్ని కేవలం భావవ్యక్తీకరణగా మాత్రమే కాక, సామాజిక మార్పుకు, ముఖ్యంగా బడుగు జీవన చిత్రణకు, వ్యవస్థీకృత నిరసనకు ఒక శక్తివంతమైన మాధ్యమంగా ఆమె మలచుకున్నారు.

నాగజ్యోతి కవితా ప్రపంచాన్ని నాలుగు ప్రధాన కోణాలలోంచి దర్శించవచ్చు.

1. సామాజిక స్పృహ, సహానుభూతి

ఈమె సమాజంలోని అణగారిన వర్గాలు, బాధితుల పక్షాన నిలబడి వారి స్వరాన్ని తన కవిత్వంలో శక్తివంతంగా పలికిస్తారు.

"బర్త్ మార్క్" కవితలో,

"వాడెవడో
పాదాల నుండి పుట్టావని
రాసిన / బర్త్ సర్టిఫికెట్
ఇంకా తగుల బెట్టడు ఎందుకో" - అని ప్రశ్నిస్తూ, కుల వ్యవస్థలోని అమానవీయతను నిలదీస్తారు.
"భూమి మింగిన సూరీడు" కవితలో, అప్పుల భారంతో కుంగిపోయి ఆత్మహత్య చేసుకొన్న రైతు కథను ప్రతీకాత్మకంగా చెబుతారు.

వెతుక్కుంటూ వెళ్ళిన లాంతరు
వెక్కుతూ వచ్చింది
కూడా వచ్చిన
ఖాళీపురుగుమందు డబ్బా
ఆ ఇంటి పచ్చని చేనును
అప్పుల పురుగు/ తినేసిందని
ఎర్రని కుంకుమ బొట్టుతో
చెప్పి కూలబడింది – (భూమి మింగిన సూరీడు). ఎక్కడా అస్పష్టత ఉండదు. బరువైన దృశ్య చిత్రాలద్వారా పదునైన విషాదం హృదయానికి గుచ్చుకొనేలా పలికించారు.

“వాక్సినేషన్” అనే కవితలో-
“ఏ ఊరి బయటి మందారమో
చదువుల నూతిలో నీళ్ళు తోడుకుంటుంది
తక్షణమే ఓ తక్షకుడు కులం కోరలతో కాటేసి
నీళ్ళు తాగాలన్న కోరికను మసి చేస్తాడు//”
“గిట్టుబాటు ధర కోల్డ్ స్టోరేజిలో శవమౌతుంది//”
“భూమితల్లి గుండెల్లో మైనింగ్ చేసి ఓ పలుగు పెత్తందారీ అవుతుంది”
- లాంటి వాక్యాలు సమాజంలో వేళ్ళూనుకుపోయిన కులవివక్ష, దళారీ వ్యవస్థ, సహజవనరుల దోపిడి లాంటి వివిధ రకాల అవినీతి స్వరూపాలను తీవ్రంగా ఎత్తిచూపుతాయి.

2. స్త్రీవాద దృక్పథం:

నాగజ్యోతి కవిత్వంలో స్త్రీల అణచివేత, అంతర్గత సంఘర్షణ, వారి స్వేచ్ఛా కాంక్ష బలంగా ధ్వనిస్తాయి.

"ఆమెనలా వదిలేయండి" కవితలో, స్త్రీని నదిగా, చెట్టుగా అభివర్ణిస్తూ, “నది సర్దుకుపోవడం అంటే జీవాన్ని కోల్పోవడమే” అని హెచ్చరిస్తారు.

అరచేతుల్లో గోరింట పూయించాలని
పుట్టింటికి వెళ్ళా
పాత జ్ఞాపకాల పరిమళం గుప్పుమంది
అమ్మ నా గదిలో గతాన్ని సర్దుతున్నది (అలిఖిత ఆస్తి)
పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి పుట్టింటికి వచ్చినప్పుడు పొందే అనుభూతుల్ని ఈ కవిత బంధిస్తుంది. “గదిలో గతాన్ని సర్దటం” అనే వర్ణన అత్యద్బుతంగా సందర్భాన్ని కళ్ళకు కడుతుంది.

“పుట్టింట్లో కూతురికి తనదైన ఓ గది ఉంచడం
హృదయ రాజ్యాంగం కల్పించాల్సిన
ఆస్తిహక్కు” అంటూ ఈ కవిత ముగుస్తుంది. స్త్రీల మానసిక హక్కుల పట్ల కవయిత్రికి ఉన్న స్పష్టతను ఆ వాక్యాలు పట్టిచూపుతాయి. “అలిఖిత ఆస్తి” అనే కవితా శీర్షికకు గొప్ప ఉదాత్తమైన ముగింపు అది.

మణిపూర్ ఘటనల నేపథ్యంలో రాసిన "నగ్నత్వం" కవిత స్త్రీలపై జరిగే హింసను అత్యంత తీవ్రమైన పదజాలంతో ఖండిస్తుంది.

“ఇప్పుడిక నగ్నత్వానికి సంస్కారం నేర్పక్కరలేదు
కొత్త రాజ్యాంగం బట్టలిప్పడాన్ని శాసనం చేసింది
ఊరావలి పుష్పాలను దిగంబరంగా
ఊరేగించడానికి చట్టం చేసింది
ఇక్కడంతా స’మ్మతమే” అనే వాక్యాలలో మతం పేరిట జరుగుతోన్న ఉన్మాద ఊరేగింపులకు ఎవరు బలవుతున్నారో, వాటి వెనుక ఎవరున్నారో స్పష్టపరుస్తారు.

"నువ్వు గొంతు విప్పకపోతే కుకీల నగ్నదేహాలు
శాశ్వత తీతువులై
నీ చరిత శిరస్సుపై నిత్యం ఎగురుతూనే ఉంటాయి
వారి ఆర్తనాదాలు అగ్నిపూలయి
నిన్ను దహిస్తూనే ఉంటాయి" అని హెచ్చరించడం, ఈ అన్యాయాలపై మౌనంగా ఉండకూడదన్న ఆమె తిరుగుబాటు తత్వాన్ని చూపుతుంది.

3. యుద్ధ వ్యతిరేకత, శాంతి కాంక్ష

ఈ కవయిత్రి శాంతిని, సామరస్యజీవనాన్ని అమితంగా ప్రేమిస్తారని వివిధ కవితల ద్వారా స్పష్టమవుతుంది. "రెండు సత్యాలు" "మూడవ ప్రపంచం" కవితల్లో యుద్ధం మిగిల్చే విధ్వంసాన్ని వర్ణించారు.

యుద్ధం ముగిసినా దాని బీభత్సం మానవజీవితాన్ని వెంటాడుతూనే ఉంటుందని, యుద్ధం ముగియటం అనేది విరామం మాత్రమే అనే రెండు పరమసత్యాలను “రెండు సత్యాలు” అనే కవితలో ఆవిష్కరిస్తారు కవయిత్రి.

“అస్థిపంజరాల నదీ
రక్తపు సంద్రం/ సంగమిస్తాయి
తేలుతున్న పడవలనిండా
తెగిపడ్డ అవయవ శకలాలు
పూచిన పూలనిండా విరిగిన పాల
నీచువాసన
అప్పుడే పుట్టిన పిట్టనోట్లో
గాయాల రొమ్ము (రెండు సత్యాలు)” లాంటి పదచిత్రాలు యుద్ధబీభత్సాన్ని ఎంతో భయావహంగా వర్ణిస్తాయి.

ఈరోజు జరుగుతున్న యుద్ధంలో చిన్నపిల్లలు టార్గెట్స్ గా ఉంటున్నారు. ఇది అత్యంత హేయం. ఈ అంశాన్ని స్పృశిస్తూ రాసిన "శిథిల స్వప్నాలు" కవితలో

“తెగిపడ్డ ఆ చిన్ని చేతులు
ఎన్ని పున్నములు పుట్టించేవో
ఆ లేత కాళ్ళు ఏ గెలుపు గ్రహంపై అడుగుపెట్టేవో” అనే వాక్యాలు యుద్ధం వల్ల పిల్లల భవిష్యత్తు నాశనమవడం పట్ల తీవ్ర ఆవేదనను పలికిస్తాయి. "యుద్దానికి గర్భసంచి ఉంటే తెలిసేది గర్భస్రావమెంత నరకమో" అనడం హింస పట్ల కవయిత్రికున్న తీవ్ర వ్యతిరేకతకు పరాకాష్ట

4. అంతర్యానం, జీవన తాత్వికత

ఈ కవయిత్రి సామాజిక అంశాలపై ఎంత బలంగా స్పందిస్తారో, వ్యక్తిగత భావోద్వేగాలను, దుఃఖాన్ని, ఏకాంతాన్ని కూడా అంతే లోతుగా విశ్లేషించుకుంటారు. “దుఃఖానికో గది” కవితలో
“లోలోపల ఎక్కడో వాన
గుండెను నిలబెట్టిన గుప్పెడంత నేలపై
ఆరని తడి
నాలుగు గదుల్లోనూ అల్పపీడనం// అనే ప్రారంభ వాక్యాలు మనసులోని లోతైన బాధను, ఒంటరితనాన్ని, నిస్సహాయతను కళ్ళకు కడతాయి. మానవజీవితంలో దుఃఖం అనివార్యతను చెబుతూ “గుండె బరువు తీర్చుకొనేందుకు/ దుఃఖానికో గది కావాలి” అంటూ ముగుస్తుందీ కవిత.
ఈ కవిత కేవలం బాధను వర్ణించే కవిత కాదు. దుఃఖాన్ని గౌరవించమని, దాన్ని అంగీకరించమని, ఆ బరువును దించుకోవడానికి మనకు మనమే ఒక "గది"ని (ఏకాంతాన్ని) ఇచ్చుకోవాలని చెప్పే ఒక తాత్విక విశ్లేషణ.

‘పట్టాలు తప్పిన రాత్రి’ కవిత మొత్తం సృజనాత్మక ప్రక్రియ (creative process) గురించిన అంతర్మథనం.

"పొద్దు పొద్దున్నే ప్రయాణం మొదలు పెడతాను" , కానీ "రాత్రైనా రావాల్సిన రైలు రాదు" అంటారు.
ఆ "రైలు" మరేదో కాదు, ఆమె రాయాలనుకుంటున్న "వాక్యం" లేదా "కవిత". సృజన కోసం పడే నిరీక్షణ ఇది. సృజన సామాజికం కావొచ్చు, కానీ ఆ సృజన చేసే క్షణంలో సృజనకారుడు ఒంటరి. ఎంత ఒంటరి అంటే “రైలు ఎక్కేటప్పుడో/ దిగేటప్పుడో/ జారిపడ్డ చెప్పు” అంత ఒంటరి అని ఉపమిస్తారు కవయిత్రి.

"ఉదయపు బుగ్గపై సిరా చుక్క పెడతాను” అనటం ద్వారా సృజన పూర్తయింది అని సూచిస్తారు. ఇంత అంతర్మథనం, ఒంటరితనం, నిరీక్షణ... ఇవన్నీ ఆమె "కవిత్వం" కొరకు చెల్లించిన మూల్యం.

కెటలిస్ట్" కవితకూడా సృజనకు సంబంధించినదే. దీనిలో
"నలిగిన గుండెను కాగితం చేసి మడతల మధ్య నన్ను నేను పరుచుకుంటాను" అనే వాక్యం ద్వారా, బాధ నుండే సృజన పుడుతుందని సూచిస్తారు.
“నేల హృదయపు లోతులు
చెప్పుల్లేని పాదాలకే తెలుస్తాయి (డార్వినిజం)” ఇది కేవలం నేల గురించి కాదు, జీవితం గురించి చెప్పిన తాత్విక వాక్యం. నిజమైన అనుభవం, జ్ఞానం ఆడంబరాలకు దూరంగా, నేలతో మూలాలతో మమేకమైనప్పుడే తెలుస్తాయని ఈ పదచిత్రం చెబుతుంది.

“దుఃఖాన్ని పూడ్చిపెట్టి
ఓ నవ్వుగా చిగురించాలంటే
చెట్టుకెంతటి
ప్రసవ వేదన (ఇంకెవరికి….?)” చెట్టు చిగురించడానికి ఎంత అంతర్గత శక్తి అవసరమో, మనిషి కూడా దుఃఖాన్ని దాచుకుని నవ్వడానికి అంతటి "వేదనా" అనుభవిస్తాడని చెప్పడం చాలా ఆర్ద్రమైన పోలిక.
“దుఃఖాన్ని పూడ్చిపెట్టి
నవ్వుగా మొలకెత్తడం
“ఆమెకు”
తప్పా ఎవరికి సాధ్యం?” అంటూ ఈ కవిత ముగుస్తుంది. చెట్టుకి స్త్రీని ప్రతీకగా చేయటం ఒక బలమైన వ్యక్తీకరణ.

ఈ సమాజంలో స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న లైంగిక హింసను, దుఃఖాన్ని తీవ్రంగా విమర్శిస్తూ రాసిన వేదనాత్మక కవిత “కొత్త కాన్పు”. ఈ కవిత ముగింపు ఆలోచింపచేస్తుంది
“క్షేత్రాన్ని కన్న తల్లుల్లారా
కలలతో పాటు కత్తులనూ కనండి
బీజాన్ని కన్న తల్లుల్లారా
వంశంతో పాటు
శవమవ్వని సంస్కారాన్ని
కూడా ప్రసవించండి. (కొత్తకాన్పు)”. నేటి వివక్షాపూరిత సమాజానికి అవసరమైన ఒక కొత్తతరం కోసం కవయిత్రి చేసిన ప్రకటన ఇది.

***
ఈ సంపుటిలో రచయిత్రి అనేక విభిన్నమైన వస్తువులను ఎంచుకున్నారు. వ్యక్తిగత అనుభూతుల నుండి ప్రపంచ యుద్ధాల వరకు, అమ్మ ప్రేమ నుండి విద్యార్థుల ఆత్మహత్యల వరకు కవితావస్తువులో వైవిధ్యం కనిపిస్తుంది. తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని, దానిలోని వైరుధ్యాలను, సంఘర్షణలను చాలా లోతుగా పరిశీలించి తనదైన తాత్విక డైమెన్షన్ ను జోడించి కవిత్వీకరించారు.

కొన్ని కవితలను భాషాపరంగా మరింత సరళంగా చెప్పటం, భావోద్వేగ తీవ్రత వల్ల నిర్మాణం తడబడకుండా చూసుకోవటం లాంటివి చేసిఉంటే అవి మరింత ప్రకాశించేవి అనిపిస్తుంది.
"ఎక్కడ ఏం జరిగినా అందులో జ్యోతి తనను తాను వెతుక్కుంటుంది. లేదూ తనలో అదుందేమోనని వెతుక్కుంటుంది" అని ముందుమాటలో ప్రసేన్ అన్నట్లు, ఆమె ప్రతి వాస్తవంతో మమేకమవుతారు. ఈ తాదాత్మ్యతే ఆమె కవిత్వానికి జీవం పోసింది.

చాలా పదచిత్రాలు ఏకకాలంలో హృద్యంగా, శక్తివంతమైన పొయెటిక్ ఎక్స్ ప్రెషన్స్ గా ఉండటం గొప్ప అరుదైన లక్షణం. మార్చురీబోయ్ ని వర్ణిస్తూ అతను “నగ్నంగా నిద్రపోయే చెట్లకు తోటమాలి” అంటారు.

"జెండా కర్ర మూల్గుతూనే ఉంది ఒక్క వర్ణాన్నే మోయలేక" ("అటే పోవాలి") అంటూ కాషాయీకరణను నిరసిస్తారు. ఈ ఒక్క వాక్యం ఒక పూర్తి రాజకీయ వ్యాసంతో సమానం.
నాగజ్యోతిశేఖర్ గారి కవిత్వం ఆలోచింపజేస్తుంది, ఆర్ద్రతతో కదిలిస్తుంది, కొన్నిసార్లు నిద్రపోతున్న మనస్సాక్షిని తట్టిలేపుతుంది. చాలా కవితలలో నేడు జడలువిప్పి తాండవం చేస్తున్న మతోన్మాదాన్ని దళితబహుజన కోణంలోంచి ఎత్తిచూపారు. స్త్రీల ఆత్మవిశ్వాసం స్వేచ్ఛాకాంక్ష వంటి అంశాలను ఈ సంపుటిలో బలంగా వినిపించారు. మొత్తం మీద, "చిగురించే పేజీలు" కేవలం ఒక కవితా సంపుటి మాత్రమే కాదు, మన కాలపు సామాజిక, మానసిక చిత్రణ. తెలుగు కవిత్వాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

బొల్లోజు బాబా

(ఈ వ్యాసం " నడుస్తున్న తెలంగాణ" పత్రికలో ప్రచురింపబడింది. శ్రీ చందు శివన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను)









పధకం ప్రకారం…..

గాంధి హత్య
ఒక accidental sequence of events అట

చారిత్రపు సన్నని దారంపై
హఠాత్తుగా గూడు కట్టిన చలిగాలి,
దాని కొసలో వణికిన దీపం.

ఎవరో సత్యాన్ని పలికారు
అది గాలిలో కలిసిపోయింది
పూలచెట్టు నీడలో రాలిన ఆకులా
నిశ్శబ్దంగా, తెలియకుండా.

ఎక్కడో దూరంలో
ఒక అగ్ని ప్రమాదం
వాసన మాత్రం దేశమంతా—
అదికూడా
accidental sequence of events
అని నది చెప్పింది తన ప్రవాహంతో.

ఎన్నికల రాత్రి వెలిగిన
వింత లెక్కల అద్దం,
యంత్రం ఒకటే మాట్లాడింది
గెలుపులు గాలిలో మొలిచాయి
చరిత్ర పుస్తకాల్లో గాయాల రూపంలో
మతోన్మాద గుసగుసలు

నిజాలు దగ్గరున్నా ఎవరూ పలకరు.
కన్ను మూసుకుంటేనే
చరిత్ర అందరికీ ఒకేలా కనిపిస్తుంది.

అన్నీ తెలిసినా
ఎవ్వరూ నేరుగా పలకని కథ
సంకేతాలతో చెప్పుకొనే
దేశకాలానుభూతి
ఇది కూడా
accidental sequence of events

బొల్లోజు బాబా

(ఒడిస్సా స్కూలు పుస్తకాలలో గాంధి హత్యను accidental sequence of events గా చెప్పారు)

సార్వత్రిక ఓటుహక్కు ఎలా వచ్చింది?

బ్రిటిష్ పాలనలో భారతీయుల స్వయంపాలనకొరకు పరిమిత ఓటుహక్కుతో ఎన్నికలు జరిగేవి. 1919 లో ప్రొవెన్షియల్, కేంద్ర శాసనసభ్యుల కొరకు జరిగిన ఎన్నికలలో - ఆస్తిపన్ను, ఆదాయపన్ను చెల్లించేవారికి, కొద్దోగొప్పో విద్యార్హత కలిగి ఉన్నవారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది.

1921 లో మోతిలాల్ నెహ్రూ అధ్యక్షుడు, జవహర్ లాల్ నెహ్రూ సెక్రటరీగా పాట్నాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏ కొద్దిమందికో కాక భారతదేశ ప్రజలందరకూ ఓటుహక్కు (Universal Adult Saffrage) కల్పించాలని తీర్మానం చేసారు. దీన్ని “నెహ్రూ రిపోర్టు” అంటారు.

మహాత్మ గాంధి తన Young India పత్రికలో సార్వత్రిక ఓటుహక్కును ఇలా సమర్ధించారు.

“డబ్బు ఉన్న మనిషికి ఓటు హక్కు ఇచ్చి, సంపద లేదా అక్షరాస్యత లేని మనిషికి ఓటు హక్కు ఇవ్వకపోవడం నేను ఎంతమాత్రం సహించలేను. ప్రతిరోజూ కష్టపడి నిజాయితీగా పనిచేసే మనిషికి, కేవలం పేదవాడు అయిన 'నేరం' కారణంగా ఓటు హక్కు ఉండకూడదు అనే ఆలోచనను నేను అంగీకరించలేను."- మహాత్మా గాంధి (1931).

1935 లో నెహ్రు అధ్యక్ష్యతన జరిగిన లక్నో అఖిలభారత కాంగ్రెస్ మహాసభలలో “సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరగాలని” తీర్మానం చేసారు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన రాజ్యాంగం మనం రాసుకొనే క్రమంలొ 1946-1950 మధ్యలో జరిగిన constituent Assembly Debates లో కమిటీ సభ్యులు జాతి, కులం, ధనం, మతం, లింగ భేదం లేకుండా - ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించాలి అని దాదాపు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ సందర్భంగా- సార్వత్రిక ఓటుహక్కు ఆధారంగా ఎన్నికలు జరగాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూన్నదని జవహర్ లాల్ నెహ్రూ గుర్తుచేసారు. చారిత్రకంగా అణగారిన వర్గాలను శక్తివంతం చేయడానికి సార్వత్రిక ఓటుహక్కు తప్పనిసరి అని డా. అంబేద్కర్ అభిప్రాయపడ్డారు.

నెహ్రూ, డా. అంబేద్కర్, శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, శ్రీ వి మునిస్వామి పిళ్లై లాంటి దార్శనికులు రాజ్యాంగ నిర్మాణ సమయంలో 21 సంవత్సరములు నిండిన ప్రతి భారతీయునికి ఓటుహక్కు కల్పించటం ద్వారా ఈ దేశ నిర్మాణంలో సామాన్యుడు కూడా పాలుపంచుకొనే అవకాశం కల్పించారు.
***

స్వతంత్రభారతదేశ భవిష్యత్తును దేశప్రజల భాగస్వామ్యంతో తీర్చిదిద్దటంలో ఆనాటి దార్శనికులు కృషిచేస్తూండగా…. మరో వైపు ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించటాన్ని ఆనాటి సనాతనవాదులు తీవ్రంగా విమర్శించారు.

రాజ్యాంగ సార్వత్రిక ఓటుహక్కు కల్పించిన సందర్భంలో శ్రీ గోల్వాల్కర్ ఒక సభలో ప్రసంగిస్తూ “అందరికీ ఓటు హక్కు కల్పించటం అంటే కుక్కలు పిల్లులకు హక్కులు ఇవ్వడం కంటే మరేమీ కాదు" అని వ్యాఖ్యానించాడు. (రి. Critical analysis of Rastriya Swayamsevak Sangh by Govind Sahai, ex chief parliamentary secy. pn. 39)

గోల్వాల్కర్ దృష్టిలో ముస్లిములు, క్రిష్టియనులు, కమ్యూనిష్టులు లోపలి శత్రువులు. అదే విధంగా వర్ణవ్యవస్థ ద్వారా దళితబహుజనులను దూరంపెట్టే మనుస్మృతిని రచించిన మనువును మానవాళికి గొప్ప శాసనకర్తగా అభివర్ణిస్తాడు. ఇలాంటి అభిప్రాయాలున్న వ్యక్తి కుక్కలు పిల్లులకు హక్కులు కల్పించారు అనటంలో- ఆ కుక్కలు పిల్లులు ముస్లిములు, క్రిష్టియనులు, కమ్యూనిష్టులు, అవర్ణులు అని సులభంగానే పోల్చుకోవచ్చు.

సాటి మనిషిని కుక్కలు పిల్లులుగా చూసే సంస్కృతి మనువాదులది.

ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజర్ January 7, 1952 సంచికలో సార్వత్రిక ఓటుహక్కు ను ఎద్దేవా చేస్తూ "భారతదేశంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు (universal adult franchise) విఫలమైందని పండిట్ నెహ్రూ స్వయంగా ఒప్పుకునే వరకు జీవించే ఉంటారు" అని వ్యాఖ్యానించింది. (Reference: India After Gandhi: The History of the World's Largest Democracy By Ramachandra Guha pn 157)

ఈ అభిప్రాయం, కొత్తగా ఓటు హక్కు పొందిన, నిరక్షరాస్యులైన భారతీయ ప్రజల సామర్థ్యాన్ని వెటకరిస్తుంది. వయోజనులందరకీ ఓటుహక్కును ఇవ్వటం లోని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది.

ప్రజలందరూ సమానంకాదు, ఎక్కువతక్కువలుగా విభజింపబడి ఉన్నారని చెప్పిన మనుస్మృతి సూత్రాలను తిరస్కరించి ప్రజలందరూ సమానమే అని చెప్పింది రాజ్యాంగం. అది కల్పించిన సార్వత్రిక ఓటుహక్కును మనువాదులు విమర్శించిన తీరు ఇది.

దీని వెనుక ఉద్దేశాలు స్పష్టమే. వేల సంవత్సరాలుగా సమాజపు నెత్తిపై కూర్చుని అందరిపై సాగించిన పెత్తనం ఇంకా కొనసాగించాలని.

***
ఈ రోజు విచ్చలవిడిగా జరుపుతోన్న తొలగింపుకు మూలాలు ఇక్కడ ఉన్నాయి. శ్రీ గోల్వాల్కర్ చెప్పినట్లు కుక్కలకు పిల్లులకు ఓట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకోవటం అభ్యంతరకరం. …. పిర్రలు కోయాలి…. ఏ కాలంలోనైనా….

బొల్లోజు బాబా

మతవాదులు పదే పదే ప్రచారంలో ఉంచే కొన్ని అంశాలు….


1. ప్రచారం: బ్రిటిష్ వారికి కావలసిన బానిసలను తయారుచేయడానికి మెకాలే అంతవరకూ అద్భుతంగా నడిచిన గురుకులాలను తొలగించి ఇంగ్లీషు చదువులను ప్రవేశపెట్టాడు. ఈ మెకాలే విద్య వలన బానిస మనస్తత్వం పెరిగింది.

వాస్తవం: మెకాలే శాస్త్రీయ విద్యను ప్రవేశపెట్టాడు. దాన్ని కులమతాలకు అతీతంగా ప్రజలందరకూ అందుబాటులోకి తెచ్చాడు. దీనివల్ల శతాబ్దాలుగా విద్యకు దూరంగా ఉన్న శూద్ర, అతి శూద్ర వర్గాలు విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలను పొందారు. అలా వచ్చినవారిలో మహాత్మా పూలే, డా. అంబేడ్కర్ లు నేటికి సమాజానికి వేగుచుక్కలే.

గురుకులాలు బ్రాహ్మణులకు మాత్రమే విద్యనందించేవి. వర్ణవ్యవస్థలో శూద్ర అతిశూద్ర వర్ణాలకు, స్త్రీలకు విద్య నిషేదం. సమాజంలో సుమారు 90 శాతం ఉండే ఈ ప్రజలు 10% ఉండే ఉన్నత వర్ణాలకు జీవితపర్యంతం సేవలు చేయాలని ధర్మశాస్త్రాలు చెప్పాయి. ఈ బానిసత్వాన్ని మెకాలే విద్యావిధానం బద్ధలుకొట్టి శూద్ర అతిశూద్రులకు స్వేచ్చనిచ్చింది. కులానికి విద్యకు ఉన్న బంధాన్ని తుంచేసింది. అలా జరగటం ఇష్టం లేని వ్యక్తులే ఇంకా మెకాలేని ఆడిపోసుకొంటారు.
.
2. ప్రచారం: బ్రిటిష్ వారు కులాన్ని సృష్టించి, ప్రజలను కులాలుగా విభజించారు

వాస్తవం: ధర్మశాస్త్రాల ప్రకారం సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణాలుగా విభజింపబడి ఉండేది. క్రమేపీ పై మూడు వర్ణాలు ఒక్కోకులంగా స్థిరపడగా శూద్రవర్ణం మాత్రం వృత్తులు ఎండోగమీ కారణంగా భిన్నకులాలుగా c100 CE అంటే సుమారు రెండువేల సంవత్సరాల క్రితం స్థిరపడ్డాయని ఆధునిక జన్యుశోధనలు తెలియచేసాయి. పదకొండోశతాబ్దం నుంచీ వేయబడిన అనేక శాసనాలలో వివిధ కులాల పేర్లు కనిపిస్తాయి. అప్పటికి ముస్లిములు (పూర్తిస్థాయిలో), బ్రిటిష్ వారు లేరు.

పోనీ బ్రిటిష్ వారు కులగణన చేసి అప్పటికి ఉన్న కులాలను స్థిరీకరించారా అనుకొంటే, భారతదేశంలో మొదటిసారిగా కులగణన 1658-1664 మధ్య హిందూ పాలిత మార్వాడ్ రాజ్యంలో మహరాజా జస్వంత్ సింగ్ ఆధ్వర్యంలో జరిగింది.

బ్రిటిష్ వారికి ఏ సంబంధమూ లేని కులవిభజనను వారికి ఆపాదించటం అంతకు ముందు సమాజం గొప్ప సమానత్వంతోను, ఐకమత్యంతోను, ఏ హెచ్చుతగ్గులు లేకుండా నడిచిందని ప్రచారించటానికే.
.
3. ప్రచారం: బ్రిటిష్ వారు మనలను విభజించి పాలించారు

వాస్తవం: నిజానికి శతాబ్దాలుగా ప్రజలను ఎక్కువతక్కువ వర్ణాలుగా విభజించి ఆధిపత్యంతో 90 శాతం ప్రజలను బానిసలుగా చేసుకొని పాలించింది మనుధర్మమే. తాము చేసిన పనిని బ్రిటిష్ వారు చేసారని చెప్పటం కాపట్యం.
.
4. ప్రచారం: ముస్లిమ్ దండయాత్రలనుండి కాపాడుకోవటానికే స్త్రీ స్వేచ్చను కట్టడి చేయటం, సతి ఆచారం, బాల్యవివాహాలు వంటివి వచ్చాయి.

వాస్తవం: ఇస్లామ్ మతం పుట్టకముందే రాసుకొన్న మహాభారతంలో సతి సహగమన ఉదంతం ఉంది. విష్ణుపురాణంలో శ్రీకృష్ణుని అష్టభార్యలు సతీసహగమనం ఆచరించినట్లు ఉంది.
సతీసహగమనం గురించి విష్ణుస్మృతి (25.14), పరాశర స్మృతి (4.29-31, అగ్నిపురాణం (222:19-23), గరుడపురాణం (1.107.29) లలో చెప్పబడింది.

మనుధర్మ శాస్త్రంలో బాల్యవివాహ ప్రస్తావన ఉంది. స్త్రీ విశ్వసించదగిన వ్యక్తి కాదు అంటుంది.
ఈ హిందూ గ్రంథాలేవీ ముస్లిం పాలనలో రాసినవి కావు. ఈ ప్రచారం ఒక వర్గంపై ద్వేషాన్ని నూరిపోయడానికే
.
5. ప్రచారం: వేదాలలో విమాన నిర్మాణం, అటమిక్ బాంబ్ తయారీ, ప్లాస్టిక్ సర్జరీ, (వినాయకుడు) క్వాంటమ్ థీరీ, టెస్ట్యూబ్ బేబీ (కర్ణుడు) లాంటి ఆధునిక శాస్త్ర సాంకేతిక శాస్త్రాలు ఉన్నాయి.

వాస్తవం: ఇది పురాణాలను చరిత్ర/సైన్సు ను కలగాబులగం చేయడం. పెద్ద పెద్ద పదవులలో ఉన్నవారే ఇలా మాట్లాడటం శోచనీయం. వేదాలను అనువదించిన మాక్స్ ముల్లర్ ఇలాంటి గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణల కనీస ప్రస్తావన తేలేదు. అందుకే మాక్స్ ముల్లర్ అంటే నేటికీ మతవాదులకు ద్వేషం.

పోనీ ఈ పండితులు వేదాలలో ఉన్నట్లు చెబుతున్న ఈ అంశాలపై సైంటిఫిక్ జర్నల్స్ లో పేపర్లు రాసి అంతర్జాతీయ శాస్త్రవేత్తల అంగీకారం పొందారా అంటే అదీ లేదు. ఈ నాటికీ కూడా వేదాలలో అన్నీ ఉన్నాయి అంటూ మాటలు చెబుతారు. ఆధారాలు చూపటం మనపద్దతి కాదు అని బండగా వాదిస్తారు.

ఖగోళశాస్త్రం, వైద్యం, గణితం లాంటి రంగాలలో ప్రాచీనభారతీయుల కృషి ఎన్నదగ్గది. ఆయా శాస్త్రాల పురోగతిలో బౌద్ధ, జైన, చార్వాక మతస్థుల ప్రమేయాన్ని కొట్టిపడేయలేం. ఆరోశతాబ్దంలో హిందుమతం అన్ని మతాలపై పైచేయి సాగించిన పిదప పై రంగాలలో పెద్దగా ఆవిష్కరణలు కనిపించవు. పైపెచ్చు ఖగోళశాస్త్రం అశాస్త్రీయ జోతిష శాస్త్రంగా మారి కొందరికి ఉపాధిగా మిగలటం చారిత్రక విషాదం.
.
6. ప్రచారం: ఆర్యుల వలస జరగలేదు. ఇది బ్రిటిష్ చరిత్రకారుల సృష్టి. ఆర్యులు ఇక్కడి వారే. ఇక్కడనుంచి ప్రపంచదేశాలకు వలసలు వెళ్ళారు (out of india theory)

వాస్తవం: ఆర్యులు అనబడే యోధజాతి Eurasian Steppe (మధ్య ఆసియా) ప్రాంతాలనుండి c1900-1500 BCE మధ్య భరతఖండానికి వలస వచ్చినట్లు నేడు జన్యు పరిశోధనలద్వారా నిరూపించబడింది. ఇంకా… ఈ ఆర్యుల జన్యువులు (R1 haplogroup) నేటి బ్రాహ్మణులలో ఎక్కువగాను, lower castes లో తక్కువగాను ఉన్నట్లు గుర్తించారు.

అలా బయటనుంచి వచ్చిన విదేశీ ఆర్యులు భరతఖండంలోకి సంస్కృతాన్ని తీసుకొని వచ్చారు. ఆర్యులు రాసుకొన్న వేదసాహిత్యంలో అప్పటికి ఉన్న నగరాలను ధ్వంసం చేసినట్లు అనేక సూక్తాలు కలవు. వర్ణవ్యవస్థను ఏర్పరచి హరప్పాకాలం నుంచీ అంటే సుమారు 8000 సంవత్సరాలుగా భరతఖండంలో నివస్తున్న అబొరిజినల్ ప్రజలను దిగువశ్రేణి ప్రజలుగా చేసారు.
ఆర్యులు విదేశీయులైతే వారి జన్యువులు కలిగిన ఈ పండితులు కూడా టర్కీ నుంచి వలసవచ్చిన తురకలతో సమానమవటం ఇష్టం లేక, మేము ఇక్కడి వాళ్ళమే అని చెప్పుకోవటానికి ఆర్యుల వలస సిద్ధాంతం తప్పు అని ఇంకా ప్రచారం చేస్తున్నారు. out of india theory అంటూ అతివిశ్వాసపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించి జన్యు ఆధారాలు చూపలేక ప్రపంచం ముందు నవ్వులపాలయ్యారు.
.
7. ప్రచారం: RSS కులరహితమైనది, సమానత్వాన్ని పాటిస్తుంది (RSS is casteless and egalitarian)

వాస్తవం: కులం/జాతి కాలం చెల్లిన వ్యవస్థ అని దాన్ని తొలగించాలని ఆ సంస్థ పెద్దలు వేదికలపై మాట్లాడతారు. కానీ ఆ సంస్థ అధినాయకత్వం బ్రాహ్మణులతో నిండి ఉంటుంది. దళిత బహుజనులు కిందిస్థాయి, కొంతమేరకు మిడిల్ కేడర్ లో ఉంటారు తప్ప పై స్థాయిలో ఉండరు. వందేళ్ల చరిత్రలో ఒక్కరంటే ఒక్క అబ్రాహ్మణుడు ఆ సంస్థ అధ్యక్షుడు కాలేదు. ఒక్క మహిళ కూడా. ఈ సంస్థ సిద్ధాంతకర్తలకు కులవివక్షను అనుసరించే మనుస్మృతి ఆదర్శనీయం. కాగా ఈ సంస్థ కులరహితమైనదని అనటం వాస్తవాల వక్రీకరణ.
***

ఇవేకాక లాక్డ్ ప్రొఫైల్ పెయిడ్ మనువాదుల పోస్టులలో, కామెంటులలో – రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా మెరిట్ వాదం; మనుస్మృతి ఏనాడు సామాజికంగా అమలులో లేదని; ఏదైనా విమర్శిస్తే బ్రాహ్మణ ద్వేషమని దాడి చేయటం; గుణ కర్మల వలన ఎవరైనా బ్రాహ్మణుడు కావచ్చని దబాయించటం; అహింస గొప్పహిందూ ధర్మమని హింస ఇతరమతాలదనటం; వేదాలలో ఆవుమాంసం తినేవారనే సత్యాన్ని అంగీకరించక అది మాంసం కాదు దుంపలు అంటూ వాదించటం; వారి బ్రాహ్మణ మూలాలను దాచిపెట్టి వాల్మీకి, వ్యాసుడు లాంటి కొందరిని చూపి తక్కువ కులాలవారిపై ఏనాడూ ఆంక్షలు లేవని బుకాయించటం…. లాంటి అనేక అసత్యాలు, వక్రీకరణలు అలవోకగా దొర్లిపోతూంటాయి. చూసి నవ్వుకోవడమే.

బొల్లోజు బాబా

ఉత్తరం రాసిన 272 మంది.

భారతరాజ్యాంగ అధికారులపై దాడిచేస్తున్నారని అభియోగిస్తూ ఇటీవల 272 మంది సమాజంలోని కొందరు మర్యాదస్తులు ఉత్తరం రాసారు. ఈ రాసినవారు “ఎవరు” అని గ్రోక్ ని అడిగాను. దాని సమాధానం నాకు ఆశ్చర్యం కలిగించలేదు.

వీరిలో 16 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 123 రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, 133 రిటైర్డ్ ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు.
 
వీరి సామాజికవర్గాన్ని విశ్లేషించమని అడిగినపుడు గ్రోక్ ఇలా చెప్పింది…

వీరిలో బ్రాహ్మణులు+క్షత్రియులు+కాయస్తులు+వైశ్యులు లాంటి ఉన్నతవర్ణాలకు చెందిన చెందిన వారు సుమారు 248 మంది ఉన్నారని - సింగ్, రావు, గుప్తా, వర్మ దలాల్ లాంటి పేర్లద్వారా తెలుస్తుంది. అంటే సంతకాలు చేసినవారిలో 91 శాతం ఉన్నతవర్గాలకు చెందినవారే. దేశజనాభాలో వీరు 10 శాతం కన్నా తక్కువ.
 
ఇక ఈ 248 మందిలో 61 శాతం అంటే సుమారు 165 మంది బ్రాహ్మణ వర్గాలకు చెంది ఉన్నట్లు - శర్మ మిశ్రా, తివారి, శుక్లా, త్రివేది, ద్వివేది, అయ్యర్, శ్రీ వాస్తవ, సిన్హా, మాథుర్, పాఠక్, త్రిపాటి, భండారి, భరద్వాజ భార్గవ, చతుర్వేది, చావ్లా, మెహతా వంటి ఇంటిపేర్ల ద్వారా తెలుస్తుంది.
ఈ లిస్టులో దళితులు, బహుజనులు ముస్లిముల ప్రాతినిధ్యం అతి స్వల్పం. నిజానికి ఈ దేశ జనాభాలో వీరు 90%. క్రిష్టియన్ లు లేనే లేరు. స్త్రీలు 5 % కూడా మించలేదు.
***

ఇదీ ఆధునిక భారతదేశపు సామాజిక స్వరూపం. రాజకీయ వాస్తవం. సమాజం ఎంత లోతుగా పోలరైజ్ అయిపోయిందో ఈ ఉదంతం ద్వారా తెలుస్తుంది. ఈ 10 శాతం వ్యక్తులు దేశప్రజలకు ఎలా ప్రాతినిథ్యం వహిస్తారనేది ప్రశ్నార్ధకం.
 
ఈ ఉత్తరంలో మరొక కనిపించని పార్శ్వం ఏమిటంటే ఈ దేశంలోని ఉన్నతపదవులలో ఉన్నతవర్ణాలు ఏ స్థాయిలో తమ ప్రభావాన్ని నేటికీ కూడా చూపగలుగుతున్నాయో అనే అంశం.
"ఈ సవర్ణ లాబీయింగ్ దేనికొరకు అనే విషయాన్ని ఎవరికి వారే గ్రహించాలి.

బొల్లోజు బాబా

ఫ్రాగ్మెంట్

రోజూ అంకెలు
మనప్రపంచాన్ని
కత్తిరిస్తూ, అతికిస్తూ
సులభంగా మనకందించేందుకు
నిత్యం శ్రమిస్తూంటాయి

తొలి ఉషస్సును తట్టిలేపిన
క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దం

అధర్మస్థాపన చేసిన
పది అవతారాలు

చావుబతుకుల్ని శాసించే
15 ఎమ్.ఎమ్ కణితి

జ్ఞాపకాల దండను మెడలో వేసే
వేయి శరత్తుల సంబరాలు.... అలా...

బొల్లోజు బాబా