Saturday, January 10, 2026

ప్రాచీనగాథల గురించి ….


.
ప్రాచీన గాథలు పుస్తకం విడుదలై ఏడాది కావొస్తుంది. సుమారు 500 పైగా ప్రాకృత, తమిళ, సంస్కృత పురాగాథల అనువాద సంపుటి ఇది. “సంగం కవిత్వం” ఈ పుస్తకంలో మొదటి చాప్టరు. నాకెంతో ఇష్టమైన చాప్టరు. పుస్తకంలో సుమారు 100 వరకూ సంగం కవితలు ఉన్నాయి.
సంగం కవిత్వంలో నాకు నచ్చిన ఒక గొప్ప కవిత ఇది.

55
పండగ రోజులు సమీపించాయి
భార్య ప్రసవవేదనలో ఉంది
వర్షం వల్ల పెందలాడనే చీకటి కమ్మేసింది
ఆమెకు సహాయం చేయటానికి
తొందరగా ఇంటికి వెళ్ళాలి ఆ చర్మకారుడు
బొంతను కుడుతున్న అతని చేతివేళ్ళ మధ్య సూది -
పట్టణాన్ని జయించటానికి వచ్చిన శత్రువుతో
ద్వంద్వయుద్ధంలో పోరాడుతున్న రాజు మెడలోని
దేవకాంచన పూలమాల కన్నా
వడిగా, కోమలంగా కదులుతోంది
Purananuru 82
(Perunarkilli అనే చోళరాజుకు Amur Mallan కు జరిగిన మల్లయుద్ధం ఈ గాథాసందర్భం)
.
బొంతను కుట్టే చర్మకారుని పని, పట్టణాన్ని కాపాడేందుకు ఒక రాజు చేస్తున్న పోరాటాన్ని ఒకే తలంపై నిలబెడతాడు ఈ గాథాకారుడు. రాజు చేసే యుద్ధం ఎంత విలువైనదో చర్మకారుని పని కూడా అంతే గౌరవనీయమని కవి చెబుతున్నాడు. మానవ విలువలు వృత్తితో నిర్ణయించబడవు అన్న భావన ఎంత ఉదాత్తమైనది. వర్ణ వ్యవస్థ, పురుషాధిక్యత ఇంకా కబళించని కాలమది.
అంతే కాక అప్పట్లో ప్రాణనష్టం నివారించటానికి ఇరురాజులు ద్వంధ్వ యుద్ధం ద్వారా జయాపజయాలను నిర్ణయించుకొనేవారనే చారిత్రక సత్యం కూడా ఈ గాథలో పొందుపరచబడింది.
***
పుస్తకం చివర ఆయా గాథల చారిత్రక నేపథ్యం చెప్పే నోట్సులో సంగం కవిత్వ సమాచారం ఇది.
ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో ఛాయా వారి స్టాల్స్ 178 నందు లభిస్తుంది. మొదటి కామెంటులో ఇచ్చిన అమజాన్ లింక్ లో కూడా దొరుకుతుంది.
***

సంగం కవిత్వం నోట్సు
.
సంగం కవిత్వం, 300 BCE నుండి 300 CE మధ్య రచింపబడిన తమిళ సాహిత్యం. ఇంతవరకూ లభించిన సంగం కవిత్వం సుమారు 473 మంది కవులు రచించిన 30 వేల పాదాలున్న 2381 కవితలు. ఈ 473 మంది కవులలో 103 మంది అజ్ఞాతకవులు. కపిలర్‌ కవి పేరుతో అత్యధికంగా 235 గాథలు ఉన్నాయి. సంగం కవిత్వంలో రెండు సంప్రదాయాలున్నాయి. ఒకటి అకం` ప్రేమ, మానవోద్వేగాలను వర్ణించే భాగం, రెండు పురం- రాజకీయాలు, యుద్ధాలను ప్రతిబింబించే భాగం. ఈ సాహిత్యంలో వేటగాళ్ళు, రైతులు, నావికులు మత్స్యకారులు, కుమ్మరులు, గొల్లలు, వర్తకులు, గాయకులు, కమ్మరులు, సైనికులు లాంటి దిగువతరగతి కుటుంబాలకు చెందిన సామాన్య వ్యక్తులే ప్రధాన పాత్రలు. కులీనుల జీవిత చిత్రణ అరుదు.

తెలుగు తమిళాలు ఒకే రకమైన మూలాలను, సంస్కృతిని పంచుకొన్నప్పటికీ తెలుగు తమిళవారసత్వాన్ని కాక, సంస్కృత కావ్య వారసత్వాన్ని అందిపుచ్చుకోవటం వల్ల, ప్రాచీనమైన ఉమ్మడి తమిళ, ప్రాకృత మూలాలకు దూరం జరిగిపోయింది. నన్నయకు పూర్వం తెలుగు సాహిత్యం ఉండేదని అరకొర ఆధారాలు లభిస్తాయి తప్ప బలమైన ఋజువులు లేవు. సంగం సాహిత్యానికి తొలి తెలుగు సాహిత్యానికి మధ్య సుమారు వెయ్యేళ్ల వ్యత్యాసం ఎందుకు ఉందనే ప్రశ్న విలువైనది.

‘‘సంగం సాహిత్యం ఎక్కువగా జైన, బౌద్ధ విశ్వాసాలకు సంబంధించినది. ఆ తరువాత కాలంలో వచ్చిన శైవ వైష్ణవ సంప్రదాయ పండితులు ప్రోత్సహించని కారణంగా సంగం సాహిత్యం చాన్నాళ్ళు గుప్తంగా ఉండిపోయింది’’ అని Poems of Love and War పేరుతో వెలువరించిన సంగం సాహిత్య అనువాదరచనకు రాసిన ముందుమాటలో శ్రీ A.K. Ramanujan అన్నారు.

ఈ పని తెలుగునాట కూడా జరిగి ఉంటుంది. నన్నయపూర్వ ప్రాకృత లేదా ప్రాచీన తెలుగు సాహిత్యం ఎక్కువగా జైన, బౌద్ధ విశ్వాసాలకు సంబంధించినదనే కారణంతో సంప్రదాయ పండితులు దాన్ని తగలపెట్టి ఉంటారు. ఇదే అభిప్రాయాన్ని శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్ళపల్లి వారి గాథాసప్తశతి తొలి తెలుగు అనువాద రచన తొలిముద్రణ (1931) ముందుమాటలో చెప్పారు. సంగం సాహిత్య వారసత్వాన్ని రెండువేల సంవత్సరాల పాటు అటకలపై దాచుకొని, మఠాలలో భద్రపరచుకొని నిలబెట్టుకొన్నారు తమిళులు. తెలుగునేలపై అలాంటి పని జరిగినట్లు లేదు. బ్రాహ్మణిజపు విలువల్ని స్థాపించే మహాభారత కావ్యానువాద రచన చేసిన నన్నయను తెలుగుభాషకు ‘ఆదికవి’ గా ప్రతిష్ఠించుకోవలసి వచ్చింది.

***
ప్రాచీనతమిళ సమాజాన్ని, సంస్కృతిని అర్ధం చేసుకొనటానికి సంగం సాహిత్యం ఎంతో దోహదపడుతుంది. ప్రేమ, రాజ్యపాలన, యుద్ధం, నీతి, రాజకీయాలు, ప్రకృతి, సామాన్యప్రజల జీవనం వంటి అనేక జీవితకోణాలను ఈ సాహిత్యం ఆవిష్కరిస్తుంది. సంగం కాలం తరువాత శైవ నాయనార్ల, వైష్ణవ ఆళ్వార్ల సాహిత్యం ప్రసిద్ధి చెందింది.

సంగం కవిత్వంలో ప్రముఖమైనది ఎట్టుతొగై. ఇది ఎనిమిది సంకలనాల సముదాయం. అవి Ainkurunuru, Akananuru, Purananuru, Kalittokai, Kuruntokai, Natrinai, Paripadal, Patirruppattu.
ఈ ప్రాచీన కావ్యాలను వెలుగులోకి తెచ్చింది శ్రీ సామినాథ అయ్యర్‌ (1855-1942). తమిళ సంగం సాహిత్యం పునరుజ్జీవనం కొరకు ఇతను ఊరూరు తిరుగుతూ, మఠాలను సందర్శిస్తూ, అటకలపై దాచిన తాళపత్ర గ్రంథాలను సేకరిస్తూ, వాటిని పరిష్కరించి పుస్తకరూపంలో ప్రచురించటానికై తన యావజ్జీవితాన్ని వెచ్చించాడు. దాదాపు కనుమరుగైపోయిన ఒక విస్మృత సారస్వతాన్ని తిరిగి బతికించి ప్రచారంలోకి తీసుకొని వచ్చాడు.

1877లో ఎట్టుతొగై మొదటి ముద్రణకు రాసిన ముందుమాటలోని ఈ వాక్యాలు ఒక చారిత్రిక సందర్భాన్ని నమోదు చేస్తాయి

‘‘నిప్పు, నీరుల నుండి తప్పించుకొన్నవి మాత్రమే నిలిచాయి. వాటిలోకూడా చెదపురుగుల బారినబడి మిగిలినవి కొన్నే.... ముడి విప్పితే తాటిఆకులు పికిలిపోతాయి, ఆకు తిప్పితే అది మధ్యకు విరిగిపోతుంది.... పాత రాత ప్రతులు పొడుం పొడుం అయ్యాయి, వాటికి ఎవరూ పుత్రికలను పుట్టించలేకపోయారు’’

ఆ విధంగా వెలుగు చూసిన సంగం సాహిత్యం భారతీయ సాహిత్యచరిత్రలో గొప్ప స్థానాన్ని పొందింది. సంగం సాహిత్యం ఆర్యసంస్కృతి ప్రభావం దక్షిణ భారతదేశంపై ఇంకా పడని కాలంలో రచించబడటం వల్ల, వైదిక దేవతలు, ఆచారాలు, సంస్కృత పదాలు, పురుషాధిక్యత, వర్ణవ్యవస్థ లాంటివి కనిపించవు. ఆ విధంగా సంగం సాహిత్యపు చారిత్రికత ఎంతో విలువైనది. ఇది తమిళుల ఇంకా చెప్పాలంటే దక్షిణ భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించే సాహిత్యం.
ఈ గాథలు అనువదించడానికి Sri. A.K. Ramanujan, Sri. M.L. Thangappa, Prof. S.M. Ponniah వంటి ప్రముఖుల అనువాదాలు దారిచూపాయి.
.










బొల్లోజు బాబా

దేశవిభజన కొరకు జిన్నా చేసిన ఆర్గ్యుమెంట్



మేము (మాకొక దేశాన్ని ఇమ్మని) హిందువులను ఏమీ అడగటం లేదు. ఎందుకంటే వారేనాడూ చారిత్రికంగా సంపూర్ణ భారతదేశాన్ని పాలించలేదు. ముస్లిములే భారతదేశాన్ని ఏకం చేసి 700 ఏళ్ళు పాలించారు. మా నుంచి బ్రిటిష్ వారు భారతదేశాన్ని తీసుకొన్నారు. ఇప్పుడు అది వారిచేతుల్లో ఉంది కనుక వారిని అడుగుతున్నాము, మాకు తిరిగి ఇచ్చేయమని. హిందువులని కాదు. హిందుస్థాన్ హిందువులకే చెందుతుందని చెప్పడం ముమ్మాటికీ అర్ధం లేని మాట."
(Said by Muhammad Ali Jinnah, President of the All-India Muslim League March 2, 1941)

మూలవాసుల స్వరం - ద్రావిడ మహాసముద్రం


.
గూండ్ల వెంకటనారాయణ తాజా కవితాసంకలనం "ద్రావిడ మహాసముద్రం". ఇది కేవలం ఒక కవితా సంకలనం కాదు- ఒక సైద్ధాంతిక ప్రకటన, ఒక చారిత్రక పునర్నిర్మాణ ప్రయత్నం, ఆధిపత్య భావజాలంపై ఎక్కుపెట్టిన ఒక వాడి అయిన అస్త్రం. డా. జిలుకర శ్రీనివాస్ తన ముందుమాటలో అన్నట్లు ఇది "ఒక ఐడియలాజికల్ మెటఫర్". మరొక ముందుమాటలో పల్లెపట్టు నాగరాజు “సత్యం కోసం నిలబడేవాళ్ళు, సత్యం కోసం పలవరించే వాళ్ళు, సత్యం ఎంత సౌందర్యవంతమైందో అనుభవించేవాళ్ళు, ఈ పుస్తకాన్ని తెరవండి, కాలం గుండె చప్పుడు వినండి … అంటాడు. అది నిజం. "ద్రావిడ మహాసముద్రం" ఈ కాలపు దళితబహుజనుల గుండెచప్పుడు.
 
ఈ కావ్యంలోని భావజాలాన్ని, కవితా శిల్పాన్ని, దాని బలాలను పరిమితులను పరిశీలించినపుడు దాని ఆత్మ ఆవిష్కృతమౌతుంది.

భావజాల పునాది- ద్రావిడ అస్తిత్వ ప్రకటన
ఈ పుస్తకం యొక్క ఆత్మ ద్రావిడవాదం, కానీ అది కేవలం భౌగోళిక, రాజకీయ అస్తిత్వానికి పరిమితమైనది కాదు. కవి దృష్టిలో ద్రావిడవాదం ఒక తాత్విక చింతన. కవిచెబుతోన్న ద్రావిడ భావజాలం ఈ కింది మూల స్తంభాలపై నిర్మించబడింది:

1. ఆర్య సంస్కృతి వ్యతిరేకత:
భరతఖండానికి వలస వచ్చిన ఆర్యులు ఇక్కడి మూలవాసుల (ద్రావిడుల) మహోన్నత నాగరికతను ధ్వంసం చేసి, వారి చరిత్రను వక్రీకరించారని కవి బలంగా వాదిస్తాడు. ఈ ఆర్య ఆధిపత్య సంస్కృతిని, వారి దేవుళ్ళను, పురాణాలను కవి నిర్మొహమాటంగా తిరస్కరిస్తాడు.

"దేవుడికి ఆకలి అవుతుంది
నోటిలో నెత్తురు పిండితే కానీ ఆకలి తీరదు అంటాడు"
ఇక్కడ 'దేవుడు' అనే ప్రతీక, కేవలం ఒక మతపరమైన భావన కాదు. అది ఒక దోపిడీ వ్యవస్థకు, తన ఆధిపత్యంతో తన ప్రజలనే బలులగా కోరే ఆధిపత్య శక్తికి రూపకం.
/అక్కడ ఒక తోట ఉండేది
అది పూలతో, పండ్లతో ఇంకా నీడలతో గుబురుగా ఉండేది.
ఉదయసాయంత్రాల ఎండపొడితో ఒళ్ళుతోముకునేది
రాత్రి నక్షత్రాలను అంటించుకుని మురిసిపోయేది
చల్లని గాలులను మూటగట్టుకొని పైకి వెదజల్లుతూ ఉండేది//

కానీ ఒకనాడు అక్కడికో గోవు వచ్చింది
పూలను తుంపేసింది
తోకతో మొక్కలను విరిచింది
అక్కడ తేనె నెత్తురులా పారింది
నక్షత్రాలను, సీతాకోక చిలుకలను
తేనెటీగలను కాళ్లకింద నలిపేసింది
చల్లని గాలులను తరిమేసింది. //

ఈ కవితలో తోట అంటే కేవలం భౌతికమైన తోట కాదు. ఆర్యులరాక ముందు హరప్పాకాలం నుండీ ఈ నేలపై విలసిల్లిన ద్రావిడ సంస్కృతి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ నేల మూలవాసులైన దళిత బహుజనుల సంస్కృతి, వారి ప్రాకృతిక కళలు, శాంతి, సౌభాగ్యం, సౌందర్యం, ఆనందం నిండిన జీవనవిధానం. ఆర్యుల రాకను పవిత్రమైన గోవుతో పోలుస్తున్నాడు కవి. ఇదొక గొప్ప మెటఫర్. ఆ గోవు తోటను నాశనం చేసిందడంలో, ఆర్యులు మూలవాసుల కళలను, జీవనవిధానాన్ని, సామాజిక సాంస్కృతిక వ్యవస్థలను ధ్వంసం చేసిన వైనాన్ని మార్మికంగా చెబుతున్నాడు. “అక్కడ తేనె నెత్తురులా పారింది” అనే ఉపమానం ద్వారా జరిగిన హింసతో అణచివేత గొప్పగా వ్యక్తీకరించబడింది.
 
2. మూలవాసుల చరిత్ర పునర్నిర్మాణం:
ఆధిపత్య గాథలలో రాక్షసులుగా, దస్యులుగా, దెయ్యాలుగా చిత్రీకరించబడిన వారే ఈ నేల అసలైన బిడ్డలని, ఒకనాటి పాలకులని కవి గర్వంగా ప్రకటిస్తాడు. నిరాకరించబడిన గుర్తింపులను తిరిగి స్వీకరించి, వాటిని గౌరవ చిహ్నాలుగా మార్చుతాడు.

"అప్పుడు ఈ నేల మీద ఎన్నో దెయ్యాలు ఉండేవి
ఎంతో ముద్దుగా, ముచ్చటగా ఉండేవి"
ఈ వాక్యం ఒక అద్భుతమైన పునర్నిర్మాణం. 'దెయ్యం' అనే తిట్టును ఒక సహజమైన, అందమైన అస్తిత్వంగా మార్చడం ద్వారా, కవి ఆధిపత్య భాషను ధ్వంసం చేస్తున్నాడు.
“పంది తన రెక్కలతో నింగికి ఎగిరింది

నేలను చూసింది
అడవిని చూసింది
ఊరిని చూసింది
అలా ఎగురుతూ పక్షులతో స్నేహం చేసింది
రకరకాల పండ్లను తిన్నది, తేనెను రుచి చూసింది
మేఘాలపై నిద్రించింది
గాలులతో ఆటలు ఆడింది”//…... (రెక్కలపంది)

బ్రాహ్మణవాద ఉన్నతవర్గాల సౌందర్యశాస్త్రం పందిని నీచ జంతువు అంటుంది. దాన్ని అణచివేతకు గురైన వర్గాలకు ప్రతినిధిగా, కవితా వస్తువుగా చేయటం ఒక ధిక్కారం. ఆ రెక్కలు కేవలం కల్పన కాదు అవి చదువు, చైతన్యం, ఆత్మగౌరవం, తిరుగుబాటు. హెజిమోనిక్ బావజాలాన్ని తిరస్కరించటం.
 
3.అంబేద్కర్, ఫూలే, పెరియార్ తాత్విక కొనసాగింపు:
ఈ కావ్యం మహాత్మా ఫూలే ఆవిష్కరించిన ఆర్య-అనార్య, బ్రాహ్మణ-అబ్రాహ్మణ ద్వైదీకృత సంబంధాల వ్యక్తీకరణే అని స్పష్టమవుతుంది. రచయిత ఈ పుస్తకానికి రాసుకొన్న ముందుమాటలో తన స్వప్నం కోసం "అంబేద్కర్, మార్క్స్ అనే రెండు కాగడాలను పట్టుకొని పెరియార్ చూపుతో" తన కవిత్వంలో తిరుగుతానని చెప్పుకోవడం ఈ భావజాల స్పష్టతకు నిదర్శనం. ఈ మొత్తం అవ్యవస్థలకు పరిష్కారం ఏమిటనేది దానిపట్లకూడా కవి స్పష్టంగానే ఉన్నాడు.
“ఒరే బ్రాహ్మడా! నువ్వంటే ఎంతిష్టమో తెలుసా అంటూ మొదలయ్యే ఒక కవితలో
"రా, నా బిడ్డను నీ కుమారుడికి ఇచ్చి పెళ్ళి చేస్తాను
 
నీ కుమార్తెను నా కొడుక్కి ఇవ్వు" // అనడం కేవలం పెళ్లి ప్రతిపాదన కాదు. అది కుల నిర్మూలనకు డా. అంబేద్కర్ ప్రతిపాదించిన సూటియైన, విప్లవాత్మక మార్గం. వేల ఏళ్లుగా కులం పేరుతో వేరు చేయబడిన రెండు సమూహాలను "వియ్యంకులు"గా మార్చి, జాంబవ ద్వీపాన్ని (ప్రాచీన భారతదేశం) మళ్లీ పచ్చగా చూసుకుందాం అనడంలో ఒక గొప్ప ఆశ, బలమైన రాజకీయ ప్రకటన ఉన్నాయి. ముగింపులో కవి మళ్ళీ ఒక మానవీయమైన స్థాయికి సంభాషణను తెస్తాడు.
 
"ఆ మడి కట్టులో నువ్వెంత మగ్గి పోయావో కదా
ఊరి చివర వెట్టివాడిగా నేనూ అంతే కుమిలిపోయాను" అంటాడు. ఇక్కడ కులం అనేది కేవలం అణగారిన వర్గానికే కాదు, ఆచారాల చట్రంలో బందీ అయిన బ్రాహ్మణుడికి కూడా ఒక చెరసాలేనని కవి గుర్తిస్తాడు. ఇలాంటి వాక్యాలు రాయాలంటే మనుషులపట్ల అపారమైన ప్రేమా, లోతైన సామాజిక అవగాహనా ఉండాలి. ఇంత భావజాల స్పష్టత అరుదుగా చూస్తాం.
 
4. శిల్పం మరియు శైలి
నిజానికి ద్రావిడవాదం, చారిత్రిక, సైద్ధాంతిక వస్తువును కవిత్వరూపంలో చెప్పటం సాహసం అయినప్పటికీ వెంకట నారాయణ తన భావజాలాన్ని కేవలం నినాదాల రూపంలో కాకుండా, శక్తివంతమైన కవితా శిల్పంతో ఆవిష్కరించారు. దీనిని సాధించడానికి కవి జానపద కథనాత్మకత, ప్రతీకాత్మక, సంభాషణాత్మక శైలులను ఎంచుకొని చెప్పదలచుకొన్న వస్తువును సూటిగా స్పష్టంగా, బలంగా చెప్పగలిగాడు. ముందుమాటలో డాక్టర్ జిలుకర శ్రీనివాస్ చెప్పినట్లు, ఈ కవి "మృత రూపకాలకు రక్తమాంసాలిచ్చి, జీవం పోసాడు". ఈ టెక్నిక్, ఇతర పద్ధతులతో కలిసి, ఈ సంపుటిని ఒక సైద్ధాంతిక కావ్యంగా నిలబెట్టింది.

1. కథనాత్మక శైలి (Narrative Style): ఈ సంకలనంలోని అనేక కవితలు చిన్నచిన్న జానపద కథల రూపంలో ఉంటాయి. కథనాత్మకత పాఠకుడిని సులభంగా కట్టిపడేస్తుంది. 'రెక్కల పంది' కవిత ఇందుకు చక్కటి ఉదాహరణ. రెక్కలు మొలిచి ఆకాశంలోకి ఎగరాలనుకున్న పందిని (అణగారిన వర్గాల చైతన్యం), అధర్మం పేరుతో 'గోవులు' (ఆధిపత్య కులాలు) చంపేయడం కుల వ్యవస్థ యొక్క క్రూరత్వాన్ని సూటిగా చెబుతుంది.
 
‘పల్లెలో వెన్నెల’ కవితలో – ఒక పండితుడు అందమైన వెన్నెల తనపైనే కాకుండా “అధముల పల్లె” పై (దళితులు) కూడా కురుస్తున్నందుకు అవమానంగా భావించి దొరకు చాడీలు చెప్పి ఆ పల్లెను తగలబెట్టిస్తాడు. ఇది కులాధిపత్యంలోని దౌష్ట్యాన్ని కళ్ళకు కడుతుంది.
నిజమైన ఆవు, కోల్పోయిన లోకం, దేవుని స్వర్గం లాంటి కవితలు ఈ కోవకు చెందుతాయి
 
2. ప్రతీకాత్మక శైలి (Symbolism): ఈ కవిత్వంలో ప్రతీకలు కీలక పాత్ర పోషిస్తాయి. 'ఆవు' పూజ్యనీయమైనదిగా, 'పంది' అపవిత్రమైనదిగా నిర్మించిన సామాజిక సంకేతాలను కవి తలకిందులు చేస్తాడు. 'నలుపు' రంగును ఆత్మగౌరవానికి, సౌందర్యానికి ప్రతీకగా నిలబెడతాడు.
/నాయనా ఇలా రా! కాస్త నలుపెక్కుదాం
నలుపు జాతరలో బూరలమవుదాం//
పిల్లా! నీ కర్రెపెదాల మీద పూసిన వానపూగుత్తి ఇది
నీకోసం నేను కట్టిన నల్లపదం ఇది/ …..అంటాడు ‘నల్లపదం’ అనే కవితలో. ఇది కేవలం నలుపు రంగు గురించి కాదు, అణచివేయబడిన గుర్తింపును ఉత్సవంగా జరుపుకోవడం గురించి.
‘మనుష్యపంచకం’ అనే కవితలో గోవులను బ్రాహ్మణీయ వర్గానికి ప్రతీకగా, నల్లజాతి గొడ్లను ఈ దేశ దళిత-బహుజన శ్రామిక వర్గాలకు ప్రతీకగాను చేస్తాడు. ‘రంగుల దెయ్యంపిల్ల’ అనే కవితలో అట్టడుగు వర్గాల సంతోషాన్ని, సౌందర్యాన్ని ఆధిపత్య వర్గాలు ఎలా సహించలేవో ప్రతీకాత్మకంగా చెబుతాడు కవి.
 
3. సంభాషణాత్మక శైలి: కవి ఎక్కడా అభ్యర్థన స్వరంతో మాట్లాడరు. ఆయన స్వరం నిండా ఆత్మవిశ్వాసం, ధిక్కారం, మరియు హక్కుగా అడిగే తత్వం కనిపిస్తుంది. "మా కక్కయ్య మద్దూరి నగేష్ బాబుకి" అనే కవిత ఇందుకు పరాకాష్ట. బ్రాహ్మణుడిని సంబోధిస్తూ, ప్రేమను, ఆవేదనను, కోపాన్ని కలగలిపి, కుల నిర్మూలన జరగాల్సిన ఆవశ్యకతను ఒక సంక్లిష్టమైన సంభాషణగా మలిచారు.

‘కాంతివ్యాప్తం’ అనే కవిత ఇద్దరు ప్రేమికుల సంభాషణ. దానిలో “ప్రపంచంలో ఇంత బాధ ఉండగా మనమెలా ప్రేమించుకోగలం?”..... అంటూ కవి సంధించిన ప్రశ్న మామూలుది కాదు. ఆ ప్రశ్న ఎన్ని జీవితాల్ని రగిల్చి ఉంటుందో అనే ఊహే హృదయాన్ని పట్టిలాగుతుంది. ఈ సంపుటిలో ఇంకా ‘మనువాద దేశ ప్రేమకథ’, ‘గొప్ప కవిత్వానికి నిర్వచనం’ అనే కవితలు సంభాషణాత్మకంగా సాగుతాయి.
 
5. బలాలు - పరిమితులు
భావజాల స్పష్టత: ఈ పుస్తకం యొక్క అతిపెద్ద బలం దాని సైద్ధాంతిక స్పష్టత. రచయిత దేని తరపున నిలబడుతున్నాడో, దేనిని .వ్యతిరేకిస్తున్నాడో ఎక్కడా సందిగ్ధత లేదు.
శక్తివంతమైన రూపకాలు: "ద్రావిడ మహాసముద్రం" అనే శీర్షికే ఒక శక్తివంతమైన రూపకం. ఇది హిందూ మహాసముద్రం అనే ఆధిపత్య నామకరణాన్ని తిరస్కరించి, ఈ నేలపై, సముద్రంపై మూలవాసుల హక్కును ప్రకటిస్తుంది.

చారిత్రక చైతన్యం: సమకాలీన రాజకీయ పరిణామాల (తమిళనాడు గవర్నర్ జనగణమన జాతీయగీతంలో ద్రావిడ అనే పదాన్ని ఉచ్ఛరించనని రేపిన వివాదం) స్పృహతో మొదలుకొని, సింధు నాగరికత మూలాల వరకు కవి తన రచనను ఒక విస్తృత చారిత్రక చట్రంలో నిలబెట్టాడు.
పరిశీలించాల్సిన పరిమితులు

కవిత్వాన్ని అలంకారయుతంచేసే ప్రక్రియలో, అనివార్యంగా వస్తువును కొంతమేరకు రూపకాలు, ప్రతీకల మాటున కప్పి చెప్పవలసి ఉంటుంది. చారిత్రిక, రాజకీయ, సైద్ధాంతిక వస్తువును కవిత్వ రూపంలో చెప్పినప్పుడు పాఠకుడు దాని సౌందర్యాన్ని ఆస్వాదించే క్రమంలో దానిలోని చారిత్రక విమర్శను గుర్తించలేకపోవచ్చు.
 
సిద్ధాంతాలను కవిత్వరూపంలో చెప్పటం కత్తిమీద సాము. ఈ విషయంలో వెంకటనారాయణ వస్తువుకు సరిపడే రూపాన్ని ఎన్నుకోవటంద్వారా ఆ పరిమితిని అధిగమించి విజయం సాధించారని చెప్పవచ్చు. ఎందుకంటే కథనాత్మక, సంభాషణాత్మశైలిలో చెప్పినప్పుడు పాఠకులు సులభంగా లీనమైపోతారు. రచనతో కనక్టై ఆలోచించడం మొదలుపెడతాడు. ఏ రచన అంతిమ లక్ష్యమైనా ఇదే కదా!
 
6. ముగింపు
"ద్రావిడ మహాసముద్రం" తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా దళిత-బహుజన, ద్రావిడవాద సాహిత్యంలో ఒక గొప్ప ప్రయోగం. ఆర్యులు ఈ నేలకు వలస వచ్చారు అని ఇటీవలే జన్యుశోధనల ద్వారా నిరూపితమైంది. అయినప్పటికీ దాన్ని మనువాదులు ఒక సత్యంగా అంగీకరించటానికి సిద్ధంగా లేరు. కానీ ఆర్యులు వలస వచ్చి, మూలవాసుల సంస్కృతులను ధ్వంసం చేసి, వారిని బానిసలుగా చేసుకొని వారిపై తమ ఆధిపత్యాన్ని స్థాపించుకొన్నారు అనే సత్యం ఈ దేశ దళిత బహుజన వర్గాలు గ్రహించాయి. ఆ మేరకు వారు తమ అస్తిత్వాన్ని పునర్నిర్వచించుకొంటున్నారని పల్లెపట్టు నాగరాజు ముందుమాట స్పష్టపరుస్తుంది.
ఈ నేపథ్యంలో తెలుగు సాహిత్యంలో ఇలాంటి వస్తువుపై వచ్చిన కవిత్వంలో ఇదే మొదటిది కావచ్చు.
 
ద్రావిడ మహాసముద్రం అణగారిన వర్గాల వేదనను, ఆగ్రహాన్ని, వారి ఆకాంక్షలను ఇంకా వారి ఉజ్వలమైన భవిష్యత్ స్వప్నాన్ని అత్యంత శక్తివంతంగా నమోదు చేసింది. ఇది కేవలం చారిత్రక గాయాలను తడమడమే కాదు, భవిష్యత్తులో నిర్మించుకోవాల్సిన ఒక సమసమాజపు చిత్రపటాన్ని కూడా మన ముందు ఉంచుతుంది. గూండ్ల వెంకటనారాయణ కవిగా, ఒక సైద్ధాంతిక యోధుడిగా తన కలం ద్వారా ఒక బలమైన పొలికేక పెట్టాడు. ఆ పొలికేక ఈ "ద్రావిడ మహాసముద్రం" లో ప్రతిధ్వనిస్తోంది.

బొల్లోజు బాబా
(ఈ వ్యాసం నవ తెలంగాణ పత్రికలో ప్రచురింపబడింది. ఎడిటర్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను)




ఒక పెద్దాయన వాల్ పై.....

ఒక పెద్దాయన వాల్ పై --- "శంకరుడి తర్వాత...మళ్లీ ఈనేలలో మరెవడూ తాత్వికుడిగా పుట్టలేదు..!!" అనే మాటను విభేదించి డా. అంబేడ్కర్, ఫూలే, పెరియార్, రామస్వామి లాంటి తాత్వికులు మీకు కనిపించరా అని ప్రశ్నించాను. (ఆయనపట్ల నాకు గౌరవమే.) కానీ అక్కడ నేను ఎప్పుడెప్పుడో బ్లాక్ చేసిన అసహన పండితులందరూ చేరి నన్ను బాగానే తిట్టుకొన్నారు. Its ok. No problem.

ఇక ఈ అంశంపై కొంత వివరణ ఇది.

మనిషి, సమాజం, జీవితం, సత్యం, మానవ సంబంధాలు వంటి ప్రశ్నలపై తర్కబద్ధమైన, విమర్శనాత్మక ఆలోచనలనే తాత్వికశాస్త్రం అని అలా ఆలోచించే వ్యక్తిని తాత్వికుడు లేదా దార్శనికుడు అనీ అంటారు.
 
తత్వవేత్తలు సంప్రదాయాలను ప్రశ్నిస్తారు, కొత్త ఆలోచనా వ్యవస్థను నిర్మిస్తారు, మానవ అస్తిత్వాన్ని నిర్వచిస్తారు. ఈ పరిధిలోంచి చూసినపుడు మహాత్మా ఫూలే, డా.అంబేద్కర్, పెరియార్ లు ఇరవయ్యోశతాబ్దపు తత్వవేత్తలు.
 
1. మహాత్మా జ్యోతిరావు ఫూలే (1827–1890)
ఈయన చారిత్రిక నైతిక కారణాలు చూపి వేదాల ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. సమానత్వం ప్రాతిపదికన మానవసమాజాన్ని ఊహించాడు. పుట్టుక ఆధారంగా మనుషుల విభజన ఉండరాదని చెప్పారు. ఈయన రాసిన 'గులాంగిరీ' ఒక రాజకీయ తత్వశాస్త్ర గ్రంథం. దీన్ని రూసో లేదా మార్క్స్ రచనలతో పోల్చవచ్చు.

2. పెరియార్ ఇ.వి. రామసామి (1879–1973)
ఈయన హేతువుతో ఆలోచించి దేవుడిని, ఆత్మను, పునర్జన్మను అంగీకరించలేదు . కులం అనేది ఒక వ్యవస్థీకృత హింస అని వివరించాడు. నైతికత అనేది శాస్త్రాల నుండి కాదు, సామాజిక న్యాయం నుండి రావాలని చెప్పాడు. పెరియార్ ఆలోచనలు నీషే (Nietzsche) ఆలోచనలకు దగ్గరగా ఉంటాయి

3. డా. బి.ఆర్. అంబేద్కర్ (1891–1956): భారతదేశం అందించిన అత్యున్నత మేధావి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం వంటి పదాలకు భారతీయ పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త నిర్వచనాలు ఇచ్చారు.
ఈయన ప్రతిపాదించిన కుల నిర్మూలన అనేది కేవలం సామాజిక సంస్కరణ కాదు, ఒక నైతిక దిశానిర్ధేశనం. నవయాన బౌద్ధం ద్వారా దేవుడు లేని మానవతావాదాన్ని ప్రతిపాదించారు.
***

నేటి పండితులు తత్వశాస్త్రాన్ని ఇప్పటికీ శంకరుడు, రామానుజుడు, మాధ్వుడు, నింబార్కుడు, వల్లభాచార్యుడు వంటి కొన్ని పేర్ల చుట్టూనే తిప్పుతారు. వీరందరూ బ్రాహ్మణిజానికి కేంద్రంగా ఉండే కర్మ సిద్ధాంతం, వర్ణాశ్రమ ధర్మాలు, జన్మ ఆధారిత హెచ్చుతగ్గుల వ్యవస్థ, బ్రాహ్మణాధిక్యత లాంటివాటిని తాత్వికంగా సమర్థించినవారే. ఈ ధోరణి సమాజంలోని అసమానతలను ప్రశ్నించకుండా, అవే సహజమైనవన్నట్లుగా చూపుతుంది. తత్వచింతనను “వేదాలు–బ్రాహ్మణులు–సంస్కృతభాష” అనే పరిమితిలో బంధించి, సామాజిక అనుభవాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వదు.
 
బ్రాహ్మణీయచట్రంలో కుదురుకొనే గాంధీ, సర్వేపల్లి రాధకృష్ణ, జిడ్డు కృష్ణమూర్తి, అరవిందో లాంటివారిని సమకాలీన పండితులు తత్వవేత్తలుగా అంగీకరిస్తారు కానీ బ్రాహ్మనిజాన్ని ధిక్కరించిన బుద్ధుడు, చార్వాకులు డా. అంబేడ్కర్, ఫూలే, పెరియార్, రామస్వామి, కంచె ఐలయ్య లాంటి వారిని ఒప్పుకోలేరు.

నిజానికి నేడు తత్వశాస్త్రం అంటే – సమాజం, మానవజీవితం పై చేసే తార్కిక విమర్శనాత్మక విశ్లేషణ. ఆధిపత్యధోరణులను సమర్ధించే వేదాంతం కాదు.
 
తత్వశాస్త్రం ఆధిపత్యం నుంచి విముక్తి వైపుకు పంతొమ్మిదో శతాబ్దంలోనే మార్క్స్ సిద్ధాంతంతో దిశమార్చుకుంది. ఈ మార్పు ఇప్పటికీ ఈ పండితుల కళ్లకు కనిపించటం లేదు. ఇంకా పాచిపళ్ళ పాటలే పాడుతున్నారు.

బొల్లొజు బాబా
పిఎస్. అక్కడ చర్చలో నా తరపున రెండుమాటలు మాట్లాడిన Sreerama Murthy గారికి, Pasunoori Ravinder అన్నకు ధన్యవాదములు

థ్యాంక్యూ విరాట్ గారు for a crisp review

 


@#$%^&... చోరీ


.
మోకాళ్ళపై కూర్చుని
దేశాన్ని భుజాలపై మోసే
అనామకుని పేరు
దేశానికి తెలియదు.

వాడి చెమటతో
బడ్జెట్ లు తయారవుతాయి
వాడి ఆకలితో
జెండాలు ఎగురుతాయి
వాడి కలలతో
జాతిభవిష్యత్తు
రూపుదిద్దుకొంటుంది

వాడు దేశాన్ని మోస్తాడు
దేశం వాడి ఓటునే
దొంగిలిస్తుంది.

28/12/2025

డిజిటల్ ఒంటరితనం


చీకటి గది
ఫోన్ వెలుగులో
రాత్రిని స్క్రోల్ చేస్తున్నాను
స్క్రీన్ పై కదిలిపోయే
వేల ముఖాలు

నేనొక్కడినే ఒంటరిగా.
డిజిటల్ గోడల మధ్య

కనక్షన్ ఉంది
సంభాషణ లేదు
నెట్ వర్క్ బలంగా ఉంది
మనిషి బలహీనంగా ఉన్నాడు

బొల్లోజు బాబా



Friday, January 2, 2026

ద్రాక్షారామ పట్టణ చరిత్ర- ఆలయ శాసనాలలో ఆనాటి సమాజం pdf




ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చరిత్రపై నేను మెకంజి కైఫియ్యతులు-తూర్పుగోదావరి జిల్లా (2020), ప్రాచీన పట్టణాలు- తూర్పుగోదావరి జిల్లా (2021) అనే రెండుపుస్తకాలు రాసాను. ఇటీవల ప్రాచీనపట్టణాలు పుస్తకం నుంచి ద్రాక్షారామ పట్టణ చరిత్ర వ్యాసాన్ని నా ఫేస్ బుక్ వాల్ పై షేర్ చేసినపుడు చాలామంది నాకు కాల్ చేసి అభినందనలు తెలిపారు. వివిధ వాట్సప్ గ్రూపులలో విస్తృతంగా షేర్ అయినట్లు తెలిపారు. ఈ అంశంపై మరింత సమగ్ర సమాచారం ఒకే చోట ఉంటే బాగుంటుందనిపించింది
• 'ప్రాచీన పట్టణాలు' పుస్తకంలో ద్రాక్షారామ పట్టణ చరిత్ర గురించి వివరించగా,
• 'మెకంజి కైఫియ్యతులు' పుస్తకంలో ద్రాక్షారామ ఆలయ శాసనాల ఆధారంగా ఆనాటి సమాజపు లోతైన విశ్లేషణ ఉంటుంది.
.
ముప్పై పేజీల ఈ రెండువ్యాసాలు ఒకే చోట ఉంటాయని ఒక పిడిఎఫ్ గా చేసి ఆర్చైవ్ లో ఉంచుతున్నాను. ఆసక్తి కలిగినవారు ఈ ప్రాంత చరిత్రను, శాసనాలలో అభించే ఆనాటి సామాజిక పరిస్థితులను తెలుసుకొంటారని భావిస్తాను.

బొల్లోజు బాబా

1/1/2026

Thursday, January 1, 2026

కొత్తసంవత్సరం పూట





నిన్నటి సూర్యుడే
ఉదయాన్ని వెచ్చగా తాకాడు
నిన్నటి కాంతే
ఆకాశపు మడతలలోంచి
ఆకులపై నిశ్శబ్దంగా జారింది.
నిన్నటి వెలుగే
కళ్ళల్లో కన్నీళ్ళ అంచులవరకూ
పరచుకొంది

కాలం కొత్తదైందని
చెప్పుకొంటాం
కానీ
దారి పాతదే
నడకా పాతదే
గోడపై రాసిన నినాదమూ పాతదే

ఎత్తిన గ్లాసులో
అదే ఆశల మత్తు
అదే నిన్నటి రుచి.

బొల్లోజు బాబా
1/1/2026