Saturday, February 8, 2025

ఆది శంకరాచార్యుడు - ఆథ్యాత్మిక దండయాత్ర


వైదికమతంలోని వర్ణవ్యవస్థ, యజ్ఞయాగాదులు, బ్రాహ్మణాధిక్యతను నిరసిస్తూ బౌద్ధ, జైన మతాలు ఆవిర్భవించాయి. వైదికమతాన్ని (బ్రాహ్మణమతం) ధిక్కరించి బౌద్ధం ఒక ప్రత్యామ్నాయ ఆథ్యాత్మికమార్గాన్ని ఏర్పరచింది. బ్రాహ్మణులను అత్యున్నతవర్గంగా పరిగణించే కులవ్యవస్థను బుద్ధుడు ఖండించాడు. మనుషులందరూ సమానమేనని, జన్మత హెచ్చుతగ్గులు ఉండవని ప్రకటించాడు. ఆత్మ, దేవుడు ఉనికిని అంగీకరించలేదు. మౌర్యులు, కుషానులు, కొంతమేరకు గుప్తులు బౌద్ధమతాన్ని ఆదరించటంతో బౌద్ధం సుమారు వెయ్యేళ్లకుపైన (BCE 6 నుండి CE 8 వ శతాబ్దం) భారతదేశంలో అప్రతిహతంగా మనుగడ సాగించింది. క్రతువులు జంతుబలులు కాక ధ్యానం అంతఃచేతన ద్వారా ప్రజలు నైతిక వర్తనను, మెరుగైన జీవితాన్ని పొందాలని బౌద్ధం ప్రవచించింది. ధర్మకీర్తి, శాంతిరక్షిత, నాగార్జునుడు వంటి వారు బౌద్ధబోధనలను సర్వోత్కృష్ట స్థాయికి తిర్చిదిద్దారు.

బౌద్ధమతం వర్ణాలకు అతీతంగా ప్రజలందరినీ సమానంగా చూడటంతో సామాన్యప్రజలు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. జనాభాలో అధికశాతం బౌద్ధం ఆచరించారు. ఇది ఒకరకంగా వైదిక/బ్రాహ్మణ మతానికి సైద్ధాంతిక సవాలు. జీవన్మరణ సమస్య.

బ్రాహ్మణమతానికి బౌద్ధం విసిరిన ఈ సవాలును మొదటగా స్వీకరించింది ఆదిశంకరాచార్యుడు. చరిత్రకారులు ఇతను c. 788-820 CE మధ్య జీవించిన వ్యక్తి అని నిర్ణయించారు. కోటవెంకటాచలం లాంటి వారు శంకరాచార్యుని కాలం BCE 509-477 గా చెబుతారు. నిజానికి శంకరాచార్యుని ప్రచ్ఛన్న బౌద్ధుడని (crypto buddha) అందరూ అన్నారు కనుక బుద్ధుని తరువాత పెట్టవలసి వచ్చింది కానీ లేకపోతే తీసుకువెళ్ళి బుద్ధుడికన్నా పూర్వుడని చెప్పేవారే ఈ పండితులు.
 
1. జీవిత చరిత్ర

శంకరుని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చారిత్రిక ఆధారాలు పెద్దగా లభించలేదు. అతని పుట్టుక, వ్యక్తిత్వం, అతను చేసిన ఆథ్యాత్మిక దండయాత్ర, మఠాల స్థాపన, అతని మరణం లాంటి విషయాలు – 14 వ శతాబ్దం నుంచి లభించే “శంకరవిజయాలు” పేరిట విద్యారణ్యుడు, ఆనందగిరి, చిద్విలాసుడు లాంటి కవులు రచించిన శంకరుని జీవితచరిత్రలు, ఇంకా శంకర విరచితమని చెప్పబడే వివిధ వ్యాఖ్యాన గ్రంథాల ద్వారా తెలుస్తాయి.

ఆది శంకరాచార్యుడు కేరళలోని కాలడి గ్రామంలో సంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు శివగురు, తల్లి పేరు ఆర్యాంబ. చిన్న వయస్సులోనే వేదాలు, ఉపనిషత్తులు మరియు తర్కశాస్త్రంలో ప్రావీణ్యం సాధించాడు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి, గురువు గోవింద భగవత్పాదుల చెంతకు వెళ్లి వేదాంత విద్యను అభ్యసించారు.

ఆది శంకరాచార్యుడు అద్వైత వేదాంతాన్ని ప్రబలంగా ప్రచారం చేశారు. బ్రహ్మమే పరమ సత్యం, జగత్ మిథ్య (మాయ), జీవాత్మ పరమాత్మలు ఒక్కటే అనే భావనల్ని అద్వైతతత్వంగా చెబుతారు.
శంకరాచార్యుడు భారతదేశమంతా తిరిగి తన బోధనలను వ్యాప్తి చేశాడు. నాలుగు మఠాలను స్థాపించారు: అవి కర్ణాటకలో శృంగేరి మఠం, గుజరాత్ లో ద్వారకా మఠం, ఉత్తరాఖండ్ లో జ్యోతిర్ మఠం (జోషిమఠం), ఒడిశాలో పూరీ మఠం. శంకరాచార్యుడు ఈ మఠాలను ధార్మిక నాయకత్వం, సనాతన హిందూ ధర్మపరిరక్షణ కొరకు స్థాపించారు. వీటికి అధిపతులుగా వేదాధ్యయనం చేసిన పండితులే ఉంటారు.
 
శంకరాచార్యుడు ఉపనిషత్తుల, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు; భజ గోవిందం, సౌందర్యలహరి, నిర్వాణ షట్కమ్ వంటి రచనలు చేసాడు.  శంకరాచార్యుడు తన 32వ ఏట   హిమాలయాలో కేదారనాథ్ వద్ద వెళ్లి జీవ సమాధిని పొందాడు.
ఇదీ స్థూలంగా శంకరాచార్యుని జీవిత చరిత్ర.

2. బౌద్ధంపై ఆథ్యాత్మిక దండయాత్ర

శంకరాచార్యుడు బౌద్ధ మరియు జైన ప్రభావాలకు వెనుకబడ్డ హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించాడు.
 
శంకరాచార్యుని కాలానికి బౌద్ధం భారతదేశంలో బలంగానే ఉంది. ఏడో శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన యవాన్ చ్వాంగ్ దేశంలో దేవాలయాలతో పాటు బౌద్ధారామాలు, బౌద్ధబిక్కులు పెద్దసంఖ్యలో ఉన్నట్లు నమోదు చేసాడు. 
****

బౌద్ధులు చార్వాకులు ఈ సమాజంలో హేతుబద్దమైన ఆలోచనలను ప్రోత్సహించారు. వారు ఈ ప్రపంచానికి ఆధారమేమిటని సత్యాన్వేషణ చేసారు. ఈ ప్రపంచం ఇంద్రియాల ద్వారా తెలుసుకోగలిగే సత్యంగా భావించారు.
 
శంకరాచార్యుడు జగత్తు మిథ్య అని ప్రకటించటం వల్ల ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకొనే ప్రయత్నానికి విలువలేకుండా అయిపోయింది. సత్యాన్వేషణను మొగ్గలోనే తుంచేసాడు. వైద్యం, రసాయిన శాస్త్రం ఖగోళ శాస్త్రం వంటి వివిధ శాస్త్రాల అథ్యయనం శంకరాచార్యుని తరువాత కుంటుపడింది. భారతీయ ప్రాచీన ఆవిష్కరణలు చాలామట్టుకు శంకరాచార్యునికి ముందు బౌద్ధ జైన లేదా వైదిక ఋషులు సాధించినవే. శంకరాచార్యుడు ప్రతిపాదించిన అద్వైతసిద్ధాంతం సమాజాన్ని మిథ్యావాదం, అలౌకిక అంశాలవైపు నడిపించి శాస్త్రీయ ఆవిష్కరణలను తిరోగమింపచేసింది.
 
దుఃఖం వాస్తవమైనది కాబట్టి దానినుండి విముక్తి పొందటమే జీవితలక్ష్యంగా బౌద్ధులు చెప్పారు. దుఃఖాన్ని ఒప్పుకొని దానిని అధిగమించే మార్గాలను సూచించారు. శంకరాచార్యుడు జగత్ మిథ్య అనటం వల్ల దుఃఖం కూడా ఒక అబద్దం అయిపోయింది. ఇది మానవ దుఃఖాన్ని ఒక మాయగా తోసిపుచ్చుతుంది. దీనివల్ల అమానుషమైన వర్ణ వ్యవస్థ లోని నిచ్చెనమెట్లలో కిందనున్న సాటిమానవుడు అత్యంత హేయమైన దుర్భర జీవనాన్ని గడపటం పట్ల ఇతరులకు ఏ రకమైన సహానుభూతి లేకుండా పోవటమే కాక ఈ భావన వర్ణ వ్యవస్థను సమర్ధించటానికి దోహదపడుతుంది. సమాజంలో ఉన్న అసమానతలు, దారిద్ర్యం, వివక్షను పట్టించుకోదు. ఈ జగమేమాయ అయినప్పుడు ఈ వివక్షపట్ల బాధితులు పోరాటం చేయాలన్న స్పృహను కూడా కోల్పోయేలా చేస్తుంది.
****

బౌద్ధసూత్రాలను కొన్నింటిని శంకరాచార్యుడు కాపీ కొట్టటంచేత శంకరాచార్యుడిని ప్రచ్ఛన్న బౌద్ధుడని చెబుతారు. అలా బుద్ధునితో పోలిక తీసుకురావటం ఒక కుట్ర. శంకరాచార్యునికి బుద్ధునికి ఆచరణలో నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. బుద్ధుడు వైదిక క్రతువులను వర్ణ వ్యవస్థను ఖండించగా, శంకరాచార్యుడు వాటికి మసిపూసి మారేడు కాయ చేసి వేదాలను ఉల్లంఘించరాదని, వర్ణ వ్యవస్థ సదా ఆచరణీయం అని చెప్పాడు. బౌద్ధారామాలలో శూద్ర, అతిశూద్ర స్త్రీలకు ప్రవేశం ఉండగా శంకరమఠాల్లో బ్రాహ్మణ పురుషులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. నిజానికి బౌద్ధాన్ని నిర్మూలించటంలో శంకరాచార్యుని పాత్ర గణనీయమైనది. అలాంటి శంకరాచార్యుడిని ప్రచ్ఛన్న బౌద్ధుడని అనటం- వ్యాసుడు శూద్రుడు, వాల్మీకి బోయ అనటం లాంటి వక్రీకరణ. వారు చెప్పే మాటలకు లెజిటమసీ కల్పించటం కొరకు పండితులు చెప్పే అసత్యాలు అవి.
****

14 వ శతాబ్దంలో మాధవాచార్యులు (విద్యారణ్యస్వామి) రచించిన శంకర దిగ్విజయ లోని 1.27-56 శ్లోకాల సారాంశం ఇలా ఉంది.
 
“లోకంలో బౌద్ధులు, జైనులు శైవ కాపాలికులు ఎక్కువకావటం చేత వైదిక ధర్మం నిర్లక్ష్యం చేయబడుతున్నదని దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకొన్నారట. దానికి శివుడు “నేను ఆది శంకరాచార్యునిగాను, తనకుమారుడైన కార్తికేయుడు కుమారిల భట్టుగాను అవతరించి తర్కశక్తితో ఆ మతాలను ఖంఢిస్తామని అదే విధంగా ఇంద్రుడు సుధన్వ రాజుగా జన్మించి వైదికధర్మ పునరుద్ధరణకు తోడ్పడతాడని” చెప్పాడు. ఈ ఉదంతం ద్వారా శంకరాచార్యుడు సాక్షాత్తూ శివావతారం అని, బౌద్ధ, జైన కాపాలికా ధర్మాలను నిర్మూలించటం కొరకే అతను జన్మించాడని అర్ధమౌతుంది
 
ఉజ్జయినిని పాలించిన సుధన్వ రాజు శంకరాచార్యుడు, కుమారిల భట్టుల ప్రోత్సాహంతో హిమాలయాలనుండి రామేశ్వరం వరకూ గల అనేక వేల బౌద్ధారామాలను, బౌద్ధులను నిర్మూలించాడని శంకర దిగ్విజయంలో మాధవాచార్యుడు చెప్పాడు. ఏడవ శతాబ్దపు చైనాయాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ రాతలలో ఉజ్జయినిని ఒక బ్రాహ్మణ రాజు పాలిస్తున్నాడని ప్రస్తావించాడు. మృచ్చకటిక నాటకంలో ఉజ్జయిని రాజుయొక్క బావమరిది బౌద్ధులను పీడించసాగాడు అనే మాట ఉంటుంది. ఈ రెండు ఆధారాలు శంకరదిగ్విజయ గ్రంథంలో చెప్పిన బ్రాహ్మణ సుధన్వ రాజు చారిత్రికతను తెలియచేస్తాయి .
 
శంకరదిగ్విజయ ఏడో సర్గ లో- కుమారిల భట్టు శంకరునితో "ఈ భూమి బౌద్ధులతో నిండిపోయింది వేదాలను పట్టించుకొనేవారు లేరు. నేను బౌద్ధులను జయించి వేదాలకు పునర్వైభవం తీసుకొని వస్తాను" అనగా దానికి శంకరాచార్యుడు "భట్టా నీవు బౌద్ధులను నిర్మూలించటానికి అవతరించిన కారణ జన్ముడవు. నీకు ఏ పాపము అంటదు" అని అంటాడు. (7- 77-121 Sankara Digvijaya,Translated by Swamy Tapasyananda, Ramakrishna math publication)

“శంకరాచార్యుడు బౌద్ధసన్యాసులను వాదనలో ఓడించి వారిని సజీవంగా కాల్చి చంపాడు. దీన్ని మత పిచ్చి కాక మరెలా పిలవగలం” అంటాడు స్వామి వివేకానందుడు.
 
శంకరాచార్యుడు దేశం అంతా తిరిగి బౌతికవాదులైన బౌద్ధులతో శాస్త్ర చర్చలు జరిపి – జగం మిథ్య, అహం బ్రహ్మస్మి, జీవాత్మే పరమాత్మ అంటూ పొంతనలేని పారమార్ధిక వాదనలతో ఓడించి వారిని సామూహిక దహనాలలో హతమార్చాడు. ఇది దుర్మార్గమైన క్రూసేడ్లతో సమానం.
శంకరాచార్యుని బృందం ఒక క్రమపద్దతిలో బౌద్ధ, జైన, కాపాలిక లాంటి హైందవేతర మతాలపై దాడి జరిపింది. ఈ రోజు దేశం అంతటా ఎక్కడ తవ్వితే అక్కడ లభించే విరూపమైన బుద్ధుని విగ్రహాలు శంకరాచార్యుని కాలం నాటివే.
 
అప్పటికి ఉన్న బౌద్ధ ఆరామాన్ని శంకరాచార్యుడు తొలగించి శృంగేరి పీఠాన్ని ఏర్పరచాడంటారు. CE రెండు మూడు శతాబ్దాలలో నాగార్జునకొండ వద్ద విజయపురి అనే పట్టణం గొప్ప బౌద్ధఆరామంగా విలసిల్లినట్లు శాసనాధారాలు కలవు. శంకరాచార్యుడు తన అసంఖ్యాకమైన అనుచరులతో నాగార్జున కొండవచ్చి అక్కడి బౌద్ధఆరామాలను ధ్వంసం చేసాడని నాగార్జున కొండ వద్ద జరిపిన తవ్వకాల రిపోర్టులో A.H.Longhurst అన్నాడు . అదే విధంగా బౌద్ధక్షేత్రమైన శ్రీశైలం, బద్రినాథ్, పూరి, శబరిమలై, తిరుపతి లాంటి బౌద్ధ ఆరామాలను హిందూ ఆలయాలుగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
నేడు సంఘీయులు జరుపుతున్నట్లుగా ఒకప్పుడు శంకరాచార్యుడు హైందవేతర మతాలపై జరిపిన ఆథ్యాత్మిక దండయాత్ర ఇది.
 
3. కరడు కట్టిన మనువాది శంకరాచార్యుడు

శంకరాచార్యుడు దేశంనాలుగు వైపులా స్థాపించిన పీఠాలకు ఒక్కో ఆచార్యుని నియమించాడు. ఎవరి పీఠపరిథిలో వారు అక్కడి ప్రజలలో వర్ణాశ్రమ ధర్మాలను కాపాడాలని 26 శ్లోకాల “మహానుశాసనం” ను రచించాడు. దానిలోని కొన్ని శ్లోకాల అర్థాలు ఇవి…..

మేము సాధించిన వర్ణాశ్రమ ధర్మములను తమ పరిధులలోని ప్రజలలో రక్షితములు అగునట్లు చూడవలెను (శ్లోకం నంబరు 3) ఇక్కడ మేము సాధించిన అనే పదం ప్రధానము.
 
నా చే నిర్మించబడిన ఈ ఆర్యమర్యాద యధావిధిగా నాలుగు మఠములద్వారా రక్షింపబడునట్లు పీఠాధిపతులు తమ శక్తిని వినియోగించవలెను. (8 వ శ్లోకం)

ధర్మసంరక్షణార్ధము సుధన్వ మహారాజునకు గల అధికారమును ఇంద్రాజ్ఞవలె పాలింతురు గాక (14 వ శ్లోకము).
 
చాతుర్వర్ణములవారు యధాశక్తి ఈ గురుపీఠములను అర్చింతురుగాక (17 వ శ్లోకము)

ఈ నియమములన్నియు మనువు, గౌతముడు మొదలైన వారు చెప్పినవే (22 వ శ్లోకము)

కృతయుగమును బ్రహ్మదేవుడును, త్రేతాయుగమందు వశిష్ఠమహర్శియును, ద్వాపరయుగమున వ్యాసమహర్షియును జగద్గురువులై యుండిరి. ఈ కలియుగమున నేనే జగద్గురువునై అవతరించితిని. (శ్లోకం 25)
 
బౌద్ధం వల్ల ఒడిదుడుకులకు గురైన సనాతన హిందూవర్ణ వ్యవస్థను తానే తిరిగి స్థాపించానని; దానిని మీరు కాపాడుకోవాలని; చాతుర్వర్ణాలు ఈ గురుపీఠాలను యధాశక్తి సేవించుకోవాలని “మహానుశాసనం” ద్వారా చెప్పాడు. ఇది ఒకరకంగా ఆయామఠాలను నడిపించటానికి రాసుకొన్న "corporate governance manual" లాంటిది.
 
శంకరమఠాలు నేటికీ ఈ సూత్రాలపైనే నడుస్తున్నాయి. శంకరాచార్యుడు ఈ మఠాలను వర్ణాశ్రమధర్మాన్ని కాపాడటానికి, దానికి ప్రచారం కల్పించటానికి స్థాపించాడు. ఇతను దేశంలో వివిధ ప్రాంతాలు తిరుగి, మండనమిశ్ర, భాస్కర, కుమారిల భట్ట, భాస్కర వంటి పండితులతో శాస్త్ర చర్చలు జరిపి వారిని ఓడించి తన బోధనలకు విస్త్రుత ప్రచారం కల్పించినట్లు శంకరవిజయాలు చెబుతాయి.
****

బౌద్ధం ప్రభావంచే వేదాలు ఉపనిషత్తులు తీవ్రమైన విమర్శకు గురయ్యాయి. ఆ సమయంలో శంకరాచార్యుడు ఉపనిషత్తులకు వ్యాఖ్యానం చెప్పాడు. వేదాలను తిరిగి చర్చలోకి తీసుకొని వచ్చి వైదిక పునర్వికాసానికి దోహదపడ్డాడు. ఇతను ఈ పని చేయకపోయి ఉన్నట్లయితే బౌద్ధం ఘాతానికి వైదికమతం కాలగర్భంలో కలిసిపోయి ఉండేది.
*****

"శ్రవణాథ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ........." అనే బ్రహ్మసూత్రానికి శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో శూద్రునికి వేదాలు వినడం నిషిద్ధమని, ఒకవేళ వింటే అతని చెవుల్లో సీసం కరిగించి పోయాలని, వేదాలు పలికితే నాలుక కొసివేయాలని అంటూ అనేక ఉపపత్తులు ఇస్తాడు. శంకరాచార్యుడు చేసిన ఇలాంటి వ్యాఖ్యానాలను అంతవరకు బౌద్ధమతం మనుషులందరూ ఒకటే అంటూ వెయ్యేళ్ళుగా తన బోధనల ద్వారా సాధించిన సమతను కాలరాసి సమాజంలో వర్ణవ్యవస్థను పునర్ ప్రతిష్టించే ప్రయత్నంగా అర్ధం చేసుకోవాలి. శూద్రునికి చదువు నిషిద్ధం అంటూ శంకరాచార్యుని చేసిన ఈ దిశానిర్ధేశం అనంతరం రాసిన అనేక పురాణేతిహాస వ్యాఖ్యానాలలో ప్రతిబింబించింది.

బ్రహ్మసూత్రకు శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో 9 అపశూద్రాధికరణం 34-38 లలో శూద్రునికి ఉపనయన సంస్కారం లేదు కనుక వేదాధ్యయనం లేదు. వేదాధ్యయనం లేదు కనుక బ్రహ్మ విద్యాధికారం లేదు అని స్పష్టంగా శూద్రులు విద్యనేర్చుకోవటానికి అర్హులు కారని ప్రకటించాడు.
ప్రాచీనకాలంలో ఆర్య అనార్య జాతులందరికీ ఉపనయన సంస్కారం ఉండేది. క్రమేపీ ఇది శూద్రులకు నిరాకరింపబడింది. ఉపనయనం ఉండటం ఒక గౌరవ సూచనగాను, లేకపోవటం దాసత్వం గాను మారిపోయింది. ఇది సమాజాన్ని నిలువునా చీల్చింది. ఉపనయనం ఉన్న పైమూడు వర్ణాలు అధికులుగాను, ఉపనయనం లేని శూద్రులు వారి సేవకులుగాను మిగిలిపోయారు. ఆ విధంగా శూద్రులు దాదాపు పరాజితులైనారు. ఇక అతిశూద్రులైతే ఈ మొత్తం ప్రక్రియలో పూర్తిగా బహిష్కృతులు.
****
 
శంకరాచార్యుడు భగవద్గీతలోని 18.41 శ్లోకానికి ఇచ్చిన వ్యాఖ్యానంలో గత కర్మల ఫలితంగా బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య శూద్రుల జన్మలు నిర్ణయమౌతాయని కర్మ సిద్ధాంతాన్ని సమర్ధిస్తాడు. కర్మ భావన అనేది ఈ జన్మలో జరుగుతున్న విషయాలకు గతజన్మలో చేసిన కర్మలే కారణం అనే వాదన. ఇది జాతిలో స్వేచ్ఛా సంకల్పం, వ్యక్తిగత ప్రయత్నాల అవసరాన్ని తగ్గిస్తుంది. ప్రజల మధ్య విభజనలు, హెచ్చుతగ్గుల పట్ల వారు ఏ పోరాటమూ చేయక అన్యాయాన్ని నిష్క్రియంగా స్వీకరించేలా చేస్తుంది. నా బ్రతుకు ఇంతే అనే నిరాశావాద ధోరణి ప్రబలుతుంది. నిజానికి వర్ణవ్యవస్థ ద్వారా 80% ప్రజలను బానిసలుగా రెండువేల సంవత్సరాలుగా కిక్కురుమనకుండా తొక్కిపెట్టటానికి దోహదపడిన మంత్రాంగంలో కర్మ సిద్ధాంతం ఒకటి.
 
భగవద్గీతలో “చాతుర్వర్ణం మయా సృష్టం….4.13 అనే శ్లోకంలో కృష్ణుడు బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య శూద్రవర్ణాలను వారి వారి గుణములు, కర్మలను బట్టి నాచే సృష్టించబడ్డాయి అంటాడు. ఈ శ్లోకానికి శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో తమోగుణము కలిగిన శూద్రులు పై మూడు వర్ణాలైన బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య వర్ణాలకు అవసరమగు సేవలు చేస్తూ జీవించాలని అన్వయం చెప్పాడు. ఇది మనుధర్మాన్ని సమాజంలో స్థిరపరచటం.
****

3. హిందూమత ఆవిర్భావం

1500–500 BCE మధ్య కాలంలో ఇంద్రుడు, అగ్ని వరుణుడు, సోముడు వంటి దేవతలు, యజ్ఞయాగాదులు, వేదాలు, ఉపనిషత్తులు ప్రభావంతో నడిచిన మతాన్ని వైదికమతం గా చెబుతారు. 600 BCE లో ఈ వైదికమతంలో విచ్చలవిడిగా సాగిన యజ్ఞయాగాదులు, బలులకు నిరసనగా బౌద్ధ, జైన, చార్వాక, ఆజీవిక లాంటి అనేక మతాలు పురుడుపోసుకొన్నాయి. వీటిలో బౌద్ధం సామాజిక సమానత్వం కలిగిఉండటం, కర్మకాండల ఒత్తిడి, జాతి ఆధిపత్యం లేకపోవటం, సరళమైన నైతిక జీవనం లాంటి అంశాలతో ప్రజలను ఆకట్టుకొంది. ఎక్కువమంది సామాన్యులు బౌద్ధంలో చేరారు. బౌద్ధం తాకిడికి వైదికమతం తన ప్రాభవాన్ని కోల్పోయింది. 600 CE నాటికి వైదిక మతం శైవం, వైష్ణవం, శాక్తేయం (శక్తి ఆరాధన), సౌర్యం (సూర్యారాధన), గణాపత్యం (గణపతి ఆరాధన), స్కంద (కార్తికేయ ఆరాధన) ఇంకా కాపాలిక, పాశుపత అంటూ శాఖోపశాఖలుగా చీలిపోయింది. అనైక్యత ఆవరించింది. శంకరుని కాలానికి 72 రకాల మతాలు ఉండేవని అంటారు.
ఇలాంటి నేపథ్యంలో శంకరాచార్యుడు తెరపైకి వచ్చాడు. బౌద్ధాన్ని మాయావాదనలతో కర్కశంగా అణచివేసాడు. వేదాలకు ఉపనిషత్తులకు భాష్యాలు రచించి వాటికి పునర్వైభవం కల్పించాడు. చీలిపోయిన వైదిక మతశాఖలన్నింటిని ఒక్కటిగా చేసి “పంచాయతన ఆరాధన” విధానాన్ని ప్రవేశపెట్టి దానికి బ్రాహ్మణుడిని అధిపతిని చేసాడు.

శివుడు, సూర్యుడు గణేషుడు, పార్వతీ దేవి, విష్ణువులను ప్రధానదేవతలుగా ఆరాధించటాన్ని పంచాయత పూజావిధానం అంటారు. ఈ విధంగా చేయటం వల్ల వేదాలను అనుసరించే శాఖలన్నీ ఒక్కటి అయ్యి బలంపుంజుకొన్నాయి. బుద్ధుడిని విష్ణువుయొక్క అవతారంగా కట్టుకథలు కల్పించారు. ఈ విధానం ప్రాచీనభారతదేశపు మతపరమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని క్షీణింపచేసింది. ఆథ్యాత్మికామార్గాలలోని భిన్నత్వాన్ని చెరిపేసింది. ఆయా మతాల అవలంబులను బలవంతంగా హిందు ధర్మంలోకి కలిపేయటం లేదా నిర్మూలించటం జరిగింది. ఇదొకరకమైన ఆథ్యాత్మిక క్రూసేడ్.

వైదిక మతం బౌద్ధమతంలోని ధ్యానం, ఆరామసంస్కృతి, విగ్రహారాధనలను స్వీకరించింది. జైనంనుంచి అహింస, సన్యాసి జీవితం, కర్మ సిద్ధాంతం లాంటి అనుకూల అంశాలను గ్రహించింది. వేదాలకు, ధర్మశాస్త్రాలకు సాంస్కృతిక రూపంగా అష్టాదశ పురాణాలను, రామాయణ, మహాభారత పురాణాలను సృష్టించుకొంది. అలా వైదిక మతం క్రమేపీ నేడు మనం చెప్పుకొంటున్న హిందూమతంగా రూపాంతరం చెందింది.

ఈ ప్రక్రియలో శంకరాచార్యుడు పోషించిన పాత్ర రాజకీయమైనది. ఈ క్రమంలో హిందూమతం స్థిరీకరించబడిందని మాట్లాడతారు తప్ప ఏరకమైన అసమానతలు, వివక్ష లేకుండా సమాజాన్ని- సమానత్వం వైపు, శాస్త్రీయతవైపు నడిపించిన బౌద్ధమతం తొలగించబడిందని ఎవరూ మాట్లాడుకోరు. బౌద్ధమతం క్షీణించటానికి ఉన్న అనేక కారణాలలో శంకరాచార్యుడు జరిపిన దాడి కూడా ముఖ్యమైనదే.

4. ముగింపు

శంకరాచార్యుడు 8 వ శతాబ్దపు వ్యక్తి అని మనకు 14వ శతాబ్దంలో వివిధ వ్యక్తులు రాసిన అతని జీవిత చరిత్రల ద్వారా అర్ధమౌతుంది. మధ్యలో ఉండిన ఆరు శతాబ్దాల ఖాళీకి సంబంధించి ఏ రకమైన ఆధారాలు లభించవు. శంకరాచార్యుడు స్థాపించినట్లు చెబుతున్న మఠాలలో కూడా శాసనాలు 14 వ శతాబ్దం నుండి మాత్రమే లభిస్తాయి. శంకరాచార్యుని సమకాలీన శాసనాలు కానీ ఉటంకింపులు కానీ దొరకలేదు. ఇతను ఒక వ్యక్తా అనేక వ్యక్తులా అనేది కూడా చెప్పలేం. ఇతను చాణుక్యుడిలా కల్పిత పాత్రకావచ్చుననే సందేహం కూడా ఉంది. సాధారణంగా చారిత్రిక వ్యక్తుల కన్నా పురాణవ్యక్తులే శక్తివంతంగా ఉంటారు. అలా శంకరాచార్యుడు నేడు శ్రీరామచంద్రునిలా పురాణపురుషుడు. పూజనీయుడు. చరిత్రను దాటి పురాణపురుషునిగా ఎదిగిన వ్యక్తి చరిత్రాతీతుడు అయిపోతాడు. ఇక అతనికి ఆపాదించబడ్డ శక్తులను నిరూపించటం చారిత్రికంగా అసాధ్యం. వారిపై చర్చను ఈ మహిమలపైనకాక ఆ మహిమలు సమాజాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయనే చారిత్రిక సత్యాలపైనే చెయ్యాల్సి ఉంటుంది. అంతమాత్రానా అతన్నీ అతని మహిమల చారిత్రికతను ఒప్పుకొన్నట్లు కాదు.
****

శంకరాచార్యుడు సామాన్యప్రజలతో సంబంధాలు పెట్టుకోలేదు. ఇతని బుధజనవర్గం వేదపండితులు. వైదికరచనలకు వ్యాఖ్యానాలు రాయటం; వర్ణాశ్రమ ధర్మాలను స్థిరీకరించటం; మఠాలు క్రతువుల ద్వారా బ్రాహ్మణాధిక్యతను స్థాపించటం; స్త్రీలకు శూద్రులకు చదువును నిరాకరించటం; బౌద్ధులను నిర్మూలించి బౌద్ధారామాల ఆక్రమణ చేయటం లాంటివి శంకరాచార్యుడు చేసిన పనులు. వీటిలో ఏవీ 90 శాతం దేశ ప్రజలకు ఉపయోగకరం కావు సరికదా వారిని పీడించేవే.

శంకరాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు చేసిన వ్యాఖ్యానాలు బౌద్ధ జైన మతాల తాకిడికి రెపరెపలాడుతున్న వైదిక ధర్మాన్ని నిలబెట్టిందని పండితులు పదే పదే చెబుతారు. “రాముడు రాక్షసులందరిని నాశనం చేసి సీతను రక్షించినట్లే, శంకరాచార్యుడు వేదాలను దూషించే బౌద్ధులను ఓడించి, ఉపనిషత్తుల సత్యమైన సీతకు పూర్వపు వైభవాన్ని పునరుద్ధరించాడు. మూడు లోకాలకు మేలు చేసిన గొప్ప శంకరునికి విజయం కలుగుగాక!” అని శంకరదిగ్విజయలో మాధవాచార్యుడు శంకరుని వేనోళ్ళ కొనియాడతాడు. (4-110)

శంకరాచార్యుని అద్వైత సిద్ధాంతం సామాన్యప్రజలకు అర్ధం కాదు. నేటికీ దానికి అన్వయం చెప్పటం సులభం కాదు. అయినప్పటికీ పండితులు అదేదో మానవేతిహాసపు మహావిష్కరణ అంటూ ప్రచారం చేసారు. శంకరుని వ్యాఖ్యానాలను చూపి వర్ణవ్యవస్థ, కర్మ సిద్ధాంతం, బ్రాహ్మణాధిక్యతను బతికించుకొని సమాజాన్ని మూఢనమ్మకాలలోకి, అసమానతలలోకి నడిపించి ధర్మం పేరుతో శూద్ర అతి శూద్ర వర్గాలను, వారి శ్రమను దోచుకుతినడానికి తెరలేపారు పండితులు.

ఈ మొత్తం చారిత్రిక మలుపులో పండితులు పోషించినపాత్ర, వారు పొందిన సామాజిక హోదా అత్యంత అమానవీయమైనది.

శంకరాచార్యునిచే ప్రవేశపెట్టబడినదిగా చెప్పే పంచాయతన ఆరాధనా విధానం వల్ల ఈదేశపు సాంస్కృతిక వైవిధ్యం అంతరించింది. బ్రాహ్మణుడు ప్రధానంగా జరిగే రిచువల్స్ కి ప్రాధాన్యత పెరిగింది.

శంకరాచార్యులు కాశీలో గంగానదిలో స్నానం చేసి వస్తుండగా ఒక చండాలుడు ఎదురుపడతాడు. అప్పటి ఆచారం ప్రకారం శంకరాచార్యులు అతన్ని దూరంగా ఉండమని చెబుతాడు. చండాలుడు శంకరాచార్యుని దేహాన్ని చూసి "మీరు దేహాన్ని దూరంగా ఉండమంటున్నారా లేక ఆత్మను దూరంగా ఉండమంటున్నారా?" అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నకు శంకరాచార్యులు తన అజ్ఞానాన్ని తెలుసుకొని చండాలుని సాక్షాత్తు శివునిగా గుర్తించి నమస్కరిస్తాడు. శంకర దిగ్విజయంలో చెప్పిన ఈ చండాలుని వృత్తాంతం చూపుతూ శంకరాచార్యుడు అంటరానితనాన్ని నిరసించాడని, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలిచాడని కొందరు పండితులు వాదిస్తారు. నిజానికి పై ఘట్టంలో సమానభావన ఎక్కడ ఉంది? అదే శంకరదిగ్విజయంలో శంకరాచార్యుడు సాక్షాత్తూ శివావతారమని చెప్పినప్పుడు చండాలుని రూపంలో వచ్చిన మరొక శివుడు ఎవరు? ఇవన్నీ అన్వయాలపేరుతో పండితులు చేసే మోసాలు.

శంకరాచార్యుని ప్రభావం నేటికీ సమాజంలో ఉంది. ఉదాహరణకు డా. అంబేద్కర్ మహాసయుడు పార్లమెంటులో హిందూకోడ్ బిల్ ప్రవేశపెడుతున్నప్పుడు కర్ణాటకలోని శంకరాచార్యుని స్కూల్ కు చెందిన సంకేశ్వర మఠాధిపతి "గంగాజలం పవిత్రమైనది కావచ్చు, కానీ అది వీధి కుళాయి ద్వారా వస్తే, దానిని పవిత్రంగా పరిగణించలేము. అదేవిధంగా, 'ధర్మశాస్త్రం' (హిందూకోడ్ బిల్) ఎంత ప్రామాణికమైనదైనా, డాక్టర్ అంబేద్కర్ వంటి 'మహర్' నుండి వచ్చినందున దానిని ప్రామాణికంగా పరిగణించలేము" అన్నాడు. శతాబ్దాలతరువాత కూడా శక్తివంతంగా నిలిచిన శంకరాచార్యుని “మహానుశాసనం” అది.

వర్ణవ్యవస్థను సమాజంలో స్థిరపరచి బౌద్ధం వల్ల మసకబారిన బ్రాహ్మణాధిక్యతకు పునర్వైభవం తెప్పించినందుకు నేటికీ పండితులు శంకరాచార్యుడిని “శంకరభగవత్పాదులు” అనీ, సాక్షాత్తూ శివావతారమనీ గొప్ప భక్తి ప్రపత్తులతో, కృతజ్ఞతాపూర్వకంగా పిలుచుకొంటారు. శంకర జయంతి పేరిట ఏటా పెద్దఎత్తున పూజలు, వేడుకలు జరుపుకొంటారు.
***

ఈరోజు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛతో చదువుకొని గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్న బహుజనులు, ఒకప్పుడు తాము బానిసత్వపు చీకటిలోకి ఎలా నెట్టబడ్డారో, శతాబ్దాలుగా అక్కడే ఎలా ఉంచబడ్డారో ఆ మంత్రాంగాన్ని అర్థం చేసుకునే క్రమంలో శంకరాచార్యుడు పోషించిన పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలించాలి. గతమెంతో గొప్పది, అందరినీ అక్కడికే నడిపిస్తాం అంటూ పండితులు ప్రచారిస్తున్న నేపథ్యంలో ఇలాంటి అవగాహన అవసరం.

బొల్లోజు బాబా


సంప్రదించిన పుస్తకాలు
1. 1. Brahma Sutra Bhasya Of Shankaracharya by Swami Gambhirananda, pn233
2. శ్రీశంకరావతార చరితము, యఱ్ఱాప్రగడ వేంకట సూర్యనారాయణ మూర్తి
3. The Buddhist Antiquities of Nagarjunkonda, by A.H.Longhurst, Delhi, 1938, p.6.
4. complete Works of Swami Vivekananda, vol. VII, p.116
5. Tirupati Balaji was a Buddhist Shrine, by K. Jamanadas
6. Sankara Digvijaya, Translated by Swamy Tapasyananda, Ramakrishna math publication.
7. శ్రీశంకర విజయము, చిలుకూరు వెంకటేశ్వర్లు
8.ఆదిశంకరాచార్య వ్యక్తిత్వం తత్వం – రావిపూడి వెంకటాద్రి
9. Decline and Fall of Buddhism, by Dr.KJamnadas
10. Slavery, Jyothirao Phule
11. On Hinduism, Wendy Doniger
12. వేదబాహ్యులు, బొల్లోజు బాబా



Friday, January 31, 2025

పున్నిక థేరీ గాథ

గతకొద్దిరోజులుగా జరుగుతున్న కుంభమేళా సందర్భంగా రెండు వేల ఏండ్లక్రితం పున్నిక అనే బౌద్ధ భిక్కుణి నదిలో పవిత్రస్నానం చేస్తున్న ఒక బ్రాహ్మణుడితో చేసిన సంవాదన గుర్తుకువస్తోంది పదే పదే.
.
థేరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు
.  
[పున్నిక:]
నేను నీళ్ళు మోయు దాసిని
యజమానురాలి తిట్లకు, శిక్షలకు భయపడి
ఎంతచలిలోనైనా నేను నదిలో దిగకతప్పదు
ఓ బ్రాహ్మణుడా!
కాళ్ళుచేతులు వణికే ఇంతచలిలో
నీవు దేనికి భయపడి నీటిలో మునుగుతున్నావు?

[ఉదకసుద్ధిక:]
పున్నికా! నీకు అన్నీ తెలుసు
నదీ స్నానం సర్వపాపాలను హరిస్తుంది
దుష్కర్మలనుండి విముక్తులను చేస్తుంది

[పున్నిక:]
నీటిలో మునిగితే
పాపవిముక్తి జరుగుతుందని ఎవరన్నారు?
ఒక అంధుడు మరొక అంధునికి దారిచూపినట్లు.
అదే నిజమైతే
కప్పలు, తాబేళ్ళు, నీటిపాములు, మొసళ్లు లాంటి
జలచరాలన్నీ స్వర్గార్హత పొందిన పుణ్యజీవులేనా!.
జంతువులను వధించువారు, వలలు వేసేవారు,
ఉచ్చులు పన్నేవారు, దొంగలు, హంతకులు, దుర్మార్గులు
ఈ నీరు నెత్తిపై చల్లుకొంటే వారి వారి పాపాలు తొలగి
పుణ్యాత్ములౌతారా?
ఈ నీటికే పాపాలను తొలగించే శక్తే ఉంటే
పుణ్యాలను కూడా తీసుకుపోగలదు కదా!
అప్పుడు నీవు రెండిటినుండి విముక్తుడవు అవుతావు.
పాపభీతితో ఎముకలు కొరికే చలిలో స్నానం చేస్తూ
నీ శరీరాన్ని కష్టపెట్టుకోకు

[ఉదకసుద్ధిక:]
ఓ వనితా!
నేను తప్పు మార్గంలో వెళుతున్నాను
నీవు నన్ను ఉత్తమ మార్గం లోకి మళ్ళించావు
ఈ వస్త్రాన్ని నీకు ఇస్తున్నాను, స్వీకరించు

[పున్నిక:]
వస్త్రాన్ని నీవే ఉంచుకో, నాకు అవసరం లేదు.
దుఃఖం అంటే భయం ఉన్నప్పుడు
దుష్కర్మలు చేయవద్దు చీకట్లోనైనా లేదా వెలుగులోనైనా
చెడ్డపనులు చేసి వాటినుంచి పారిపోయినప్పటికీ
వాని తాలూకు దుఃఖం నుంచి తప్పించుకోలేవు.
దుఃఖం నుండి విముక్తి పొందాలంటే
తధాగతుడిని, ధమ్మాన్ని, సంఘాన్ని ఆశ్రయించు
ఉపదేశాలను ఆచరించు. మంచి జరుగుతుంది.
 
[ఉదకసుద్ధిక:]
తధాగతుడిని, ధమ్మాన్ని, సంఘాన్ని ఆశ్రయించాను
ఉపదేశాలను ఆచరించాను. మంచి జరిగింది.
ఒకప్పుడు నేను బ్రాహ్మణసంతానాన్ని మాత్రమే
నేనీనాడు త్రివిద్యలను అభ్యసించి పరిశుద్ధుడనైన
నిజమైన బ్రాహ్మణుడను.
***
(థేరీగాథలు పుస్తకం నుంచి)
.
పున్నిక ఒక దాసి కూతురు. ప్రతిరోజు నదికి పోయి గృహావసరాలకు నీరు తీసుకొని వచ్చే అంబువాహిని. దాదాపు రెండున్నరవేల ఏండ్లక్రితం పున్నిక, ఉదకశుద్ధిక అనే బ్రాహ్మణుడితో నదీ స్నానం వెనుక ఉండే మూఢత్వాన్ని గురించి చేసిన సంభాషణ పై థేరీగాథలో గమనించవచ్చు. ఇది ఆనాటి ప్రజలలో ఉండిన మత పరమైన అవగాహన.
నీళ్ళలో నివసించే చేపలు, తాబేళ్ళు కూడా పుణ్యజీవులేనా? దుర్మార్గులు ఈ నీళ్ళు చల్లుకొంటే వారి పాపాలు పోతాయా అని వేసిన ప్రశ్నలు నేటికీ విలువైనవి.
అంత తార్కికంగా ఆలోచించిన అదే ప్రజలు నేడు పర్వదినాల పేరిట తొక్కిసలాటకు గురయి మరణిస్తున్నారు. అశోక చక్రవర్తి వేయించిన 1 వ నంబరు శాసనంలో ప్రజలు గుమిగూడటాన్ని నిషేదించాడు. బహుశా మతం అనేది వ్యక్తిగతంగా సాధన చేయాల్సిన అంతర్యానం తప్ప సామాజికంగా గుంపులు గూడి ఆరాధించాల్సిన విషయం కాదని అశోకుని అభిప్రాయం కావొచ్చు.
అలాంటి ప్రజలలో ఉండిన శాస్త్రీయ ఆలోచనలను చంపేసి, జాతిమొత్తాన్ని నిర్వీర్యం చేసి అంధకారం వైపు, మూఢనమ్మకాలలోకి నడిపించారు గత వెయ్యేళ్ళుగా.
.
బొల్లోజు బాబా



Tuesday, January 28, 2025

రాజ్యాంగ రచన - డా.అంబేద్కర్ మహాశయుడు


.
భారతరాజ్యాంగ నిర్మాణంలో 299 మంది సభ్యులు పాల్గొన్నారని వారిలో డా. బి. ఆర్. అంబేద్కరు ఒకరని; నిజానికి రాజ్యాంగాన్ని 1947 లోనే బి.ఎన్. రావు రచించాడని దానినే డా. అంబేద్కర్ రాజ్యాంగ కమిటీ ముందు ప్రవేశపెట్టాడని; భారత రాజ్యాంగ నిర్మాతగా డా.అంబేద్కర్ పాత్ర పరిమితమని- అంటూ కొంతమంది సనాతనులు ప్రతి రిపబ్లిక్ డే రోజునా అబద్దాలను వండివార్చటం పరిపాటి.
***
రాజ్యాంగ సభ (Constituent Assembly) అంటే భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన సంస్థ. ఈ సభ భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, 1946లో ఏర్పడింది. దీని ప్రధాన లక్ష్యం స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడం. ఈ సభ అధ్యక్షుడైన డా. రాజేంద్రప్రసాద్, భారత ప్రభుత్వ అధికారి, న్యాయకోవిదుడు బి.ఎన్ రావును రాజ్యాంగ ప్రాధమిక డ్రాఫ్ట్ ను/ముసాయిదా తయారు చెయ్యమని కోరాడు.
ఆ మేరకు బి.ఎన్. రావు వివిధ దేశాలు పర్యటించి, ఆ యా దేశాల రాజ్యాంగాలను పరిశీలించి వాటిలోని మంచి అంశాలను క్రోడీకరిస్తూ ఒక నివేదికను తయారు చేసి అక్టోబరు 1947 లో స్వతంత్రభారత ప్రభుత్వానికి సమర్పించాడు. (దీన్ని ఆర్చైవ్స్ లో Constitution in the making పేరుతో చదువుకొనవచ్చును) ఇది ఒకరకంగా రాజ్యాంగానికి ప్రాధమిక ఔట్ లైన్. ఇక్కడితో బిఎన్ రావు పాత్ర ముగిసిపోయింది. 1948 లో బి.ఎన్ రావు యునైటెడ్ నేషన్స్ లో భారత ప్రతినిధిగా, 1952 వరకు అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జ్ గా పని చేసారు. భారతదేశంలోనే లేరు.
బి.ఎన్ రావు తయారు చేసిన నివేదిక ను రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా నియమించబడిన డా. అంబేడ్కర్ కు ఇచ్చారు. దీనిని డా. అంబేద్కర్ దాదాపు తిరగ రాసి 299 మంది సభ్యులున్న Constituent Assembly ముందు చర్చించటానికి ప్రవేశపెట్టారు.

రాజ్యాంగాన్ని నిర్మించటం కొరకు జరిగిన చర్చలను Constituent Assembly Debates అంటారు. ఇవి డిశంబరు 9 1946 నుండి నవంబరు 26, 1949 మధ్య జరిగాయి.
.
బి.ఎన్ రావు ప్రతిపాదించిన రాజ్యాంగ ఫ్రేమ్ వర్క్ నివేదికకు (1947) డా. అంబేద్కర్ తుదిరూపు దిద్దిన (1950) రాజ్యాంగానికి గల వ్యత్యాసాలను ఈ విధంగా గుర్తించవచ్చు.
 
1. 240 ఆర్టికిల్స్ ను 390 ఆర్టికిల్స్ గా డా. అంబేద్కర్ విస్తరించారు.
 
2. ప్రజలమధ్య సోదరభావం సమైక్యత పెంపొందించటానికి రాజ్యాంగ ప్రవేశికలో సౌభ్రాతృత్వం అనే పదాన్ని డా. అంబేద్కర్ చేర్చారు

3. బిఎన్ రావు ప్రణాళిక 1935 నాటి భారతప్రభుత్వ చట్టాలపై ఎక్కువగా ఆధారపడింది. డా. అంబేడ్కర్ రాష్ట్రాలు, కేంద్రాల అధికారాలను, పరిధులను స్పష్టంగా నిర్వచించారు. కేంద్రం బలంగా ఉండేందుకు అనేక మార్పులు చేసారు. అత్యవసర సమయంలో దేశంలో ప్రాధమిక హక్కులు రద్దుచేసి ఎమర్జెన్సీ విధించే హక్కు కేంద్రానికి కల్పించారు.

4. బిఎన్ రావు ప్రణాళికలో ప్రాథమిక హక్కులు పరిమితంగా ప్రస్తావించబడ్డాయి. డా.అంబేద్కర్ తుది రాజ్యాంగం వాటిని విస్తరించి పునర్నిర్మించింది, ముఖ్యంగా వివక్షకు వ్యతిరేకంగా రక్షణలు కల్పించింది. అంటరానితనాన్ని రద్దు చేసింది. ప్రాధమిక హక్కుల పునరుద్ధరణ కొరకు ఏ పౌరుడైనా సుప్రీమ్ కోర్టు తలుపు తట్టటం అనే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. (ఆర్టికిల్ 32) దీన్ని రాజ్యాంగం యొక్క హార్ట్ అండ్ సోల్ అని డా. అంబేద్కర్ వర్ణించారు.
 
5. డా. అంబేద్కర్ న్యాయవ్యవస్థను స్వతంత్రంగా నిలబెట్టారు. ప్రజల ప్రాధమిక హక్కులను రక్షించటానికి దానికి విస్త్రుతమైన అధికారాలను ఇచ్చారు.
 
6. బిఎన్ రావు ప్రణాళికలో పెద్దల ఓటు హక్కు లేదా ఎన్నికల ప్రక్రియలను స్పష్టంగా నిర్వచించలేదు. అంబేద్కర్ బృందం సార్వత్రిక పెద్దల ఓటు హక్కు మరియు ఎన్నికల యంత్రాంగాల కోసం ఒక బలమైన స్వతంత్ర వ్యవస్థను ప్రతిపాదించింది.
 
7. బిఎన్ రావు ప్రణాళిక భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు స్పష్టమైన నిబంధనలను రూపొందించలేదు. అంబేద్కర్ ఆధ్వర్యంలోని తుది రాజ్యాంగం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఆవశ్యతను, అవకాశాలను గుర్తించింది.

8. ఆర్టికిల్ 39 ద్వారా సమానపనికి సమాన వేతనచట్టాన్ని మరింత విస్త్రుతపరచారు డా. అంబేడ్కర్. అదే విధంగా ఆర్టికిల్ 45 ద్వారా 14 ఏళ్ళ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పటం రాష్ట్రాల బాధ్యత చేసారు.

9. బిఎన్ రావు ప్రణాళికలో వెనుకబడిన వర్గాలకు రక్షణ కల్పించమని ఉంది. దీన్ని డా.అంబేద్కర్ మరింత విస్తరించి ఎస్సి, ఎస్టీ లకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారు.
 
10. అత్యయిక పరిస్థితులలో దేశం ఏం చెయ్యాలనేది బి.ఎన్ రావు ప్రణాలికలో సూచించలేదు. దీన్ని 352, 356, 360 లాంటి ఆర్టికిల్స్ ద్వారా కేంద్రం దేశాన్ని కంట్రోల్ లోకి తీసుకొని యుద్ధం, అంతర్గతకల్లోలాలు వంటి అత్యయిక పరిస్థితులను సరిదిద్దే అవకాశం కల్పించారు డా. అంబేద్కర్

11. రాజ్యాంగ సభ ఈ ముసాయిదాను సుమారు మూడేళ్ళపాటు చర్చలు జరిపి తుది రాజ్యాంగాన్ని ఆమోదించింది. దాదాపు ఈ చర్చలన్నిటిలో డా. అంబేద్కర్ పాల్గొన్నారు. సభ్యుల సందేహాలకు వివరణలు ఇచ్చారు. అభ్యంతరాలు చెప్పిన చోట వేల కొలదీ తగిన సవరణలు చేసి ఒప్పించారు. ఆ విధంగా రాజ్యాంగ తుది రూపం డా.అంబేద్కర్ మేధో శ్రమఫలితమే.
 
పై అంశాలను గమనిస్తే- ఈ రోజు ఏదైతే మనం రాజ్యాంగ మౌలిక స్వరూపం అని అనుకొంటున్నామో దానిని డా. అంబేడ్కర్ రూపొందించినట్లు అర్ధమౌతుంది. ఇది సామాన్యపౌరుడిని వివక్ష, దోపిడి, దౌర్జన్యాలనుండి నుండి రక్షిస్తుంది. ఈ రోజు ఈ హక్కులను కాలరాయటం జరుగుతోంది. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నించటం కూడా పైన పొందుపరచిన అంశాలను తొలగించటానికే అని అనుమానించే పరిస్థితులు ఉన్నాయి.
***
రాజ్యాంగ సభ 165 సార్లు కూర్చుని రాజ్యాంగం ఎలా ఉండాలో చర్చించింది. అనారోగ్యంతో ఉండికూడా వీటిలో సుమారు 150 సమావేశాలకు డా.అంబేడ్కర్ హాజరయ్యారు. తుది మెరుగుల కొరకు ముసాయిదాను మూడుసార్లు సభ్యుల ముందు ప్రవేశపెట్టారు.
రాజ్యాంగ సభ సభ్యులు మొత్తం 7635 మార్పులు సూచించగా 2473 మార్పులను డా. అంబేద్కర్ అంగీకరించి తదనుగుణంగా సవరణలు చేసారు. తిరస్కరించిన సూచనలకు, చేసిన మార్పులకు స్వయంగా సమాధానం ఇచ్చారు.
 
ఈ Constituent Assembly చర్చలన్నీ నేడు 6756 పేజీల డాక్యుమెంటుగా లభిస్తున్నాయి. ఈ డాక్యుమెంటులో డా. అంబేడ్కర్ పేరు 4524 సార్లు రాగా బి.ఎన్ రావు పేరు 35 సార్లు మాత్రమే ఉండటాన్ని బట్టి డా. అంబేద్కర్ రాజ్యాంగ రచనలో పోషించిన పాత్ర స్పష్టమౌతుంది.
రాజ్యాంగ సభలో డా. అంబేద్కర్ రోజూ 9-10 సార్లు లేచి నిలబడి తన అభిప్రాయాలను సమర్ధించుకోవటమో లేక సమాధానం ఇవ్వటమో చేసారని, కొన్ని సార్లు రోజుకు 25-26 సార్లు కూడా సభలో తన గళాన్ని వినిపించేవారని ఈ Constituent Assembly చర్చల ద్వారా అర్ధమౌతుంది.
తుది రాజ్యాంగ ప్రతి 1949 లో కమిటీ సభ్యుల ఆమోదం పొంది జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చింది. రాజ్యాంగ నిర్మాణదశ, దాన్ని ఆమోదించటంలో రాజకీయంగా డా. అంబేడ్కర్ కు జవహర్ లాల్ నెహ్రూ ఇచ్చిన మద్దతును విస్మరించలేం.
***
రాజ్యాంగ రచనలో పాల్గొన్న 299 మంది సభ్యులలో డా. అంబేద్కర్ ఒకరని, రాజ్యాంగాన్ని బి.ఎన్ రావు రూపొందించగా డా. అంబేద్కర్ క్రెడిట్ తీసుకొన్నారని సనాతనులు దుష్ప్రచారం చేస్తారు.
రాజ్యాంగ సభ సభ్యులలో ఒకరైన టీ.టీ. కృష్ణమాచారి, ఒక సమావేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంకితభావం గురించి మాట్లాడుతూ ---"రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి ఎంపిక చేసిన ఏడుగురు సభ్యులలో ఒకరు రాజీనామా చేశారు, ఒకరు మరణించారు, ఒకరు అమెరికాకు వెళ్ళారు, ఒకరు స్వరాష్ట్రంలో తన పనితో బిజీగా ఉన్నారు, ఇద్దరు ఢిల్లీ నుండి దూరంగా నివసిస్తున్నారు, మరొకరు ఆరోగ్య కారణాల వల్ల మినహాయించబడ్డారు, డాక్టర్ అంబేద్కర్ ఒక్కరే భారాన్ని మోయవలసి వచ్చింది" అని అన్నారు.
 
డా.అంబేడ్కర్ సమకాలీనుడు, రాజ్యాంగరచనలో పాల్గొన్న ఒక వ్యక్తి అన్నమాటలు. ఇవేవీ ఈ సనాతనులకు కనిపించవు.
 
నేడు వీరు డా. అంబేద్కర్ కృషిని తగ్గించాలని చూడటానికి కారణాలు - డా.అంబేడ్కర్ ప్రాచీన ధర్మశాస్త్రాలకు విరుద్ధంగా, ప్రజలందరకూ సమాన హక్కులు, విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించటం మరీ ముఖ్యంగా ఈ దేశాన్ని హిందూరాజ్యంగా కాక స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు ప్రాధమిక సూత్రాలకు అనుగుణంగా నిర్మించు కొనేందుకు ఒక బలమైన రాజ్యాంగాన్ని ఇవ్వటం, అది సామాన్యులు, నిరుపేదల పట్ల పక్షపాతంతో ఉండటం. వీటిని జీర్ణించుకోలేక సనాతనులు నిత్యం ఈ శతాబ్దపు దార్శనికుడిపై బురద జల్లుతున్నారు.
 
బొల్లోజు బాబా

Monday, January 13, 2025

సతీ- సహమరణం - చారిత్రిక పరిశీలన

మధ్యయుగాలలో సమాజం ధర్మశాస్త్రాలకు అనుగుణంగా నడిచేది. శాస్త్రాలు స్త్రీకి సమానస్థానం ఇవ్వలేదు. నేడు కొందరు ఏవో కొన్ని అనుకూలంగా ఉన్న శ్లోకాలు ఉటంకించి స్త్రీ గొప్పగా మనుగడ సాగించింది అని నమ్మించటానికి ప్రయత్నిస్తారు కానీ చారిత్రికంగా స్త్రీ "జీవించే హక్కు" కూడా కలిగి ఉండేది కాదని నిన్నమొన్నటి వరకూ సాగిన సతీసహగమనం లాంటి దురాచారం ద్వారా తెలుస్తుంది.
 
మరణించిన భర్త శవంతో పాటు అతని భార్యను అదే చితిపై దహనం చేయటాన్ని సహమరణం లేదా సహగమనం అని, భర్తమరణించిన కొన్నాళ్ళకు భర్త వాడిన వస్తువులతో పాటు అతని భార్యను కూడా దహనం చేయటాన్ని అనుమరణం అని అంటారు. బ్రాహ్మణ స్త్రీలకు సహమరణమే అర్హమని, అనుమరణం కాదని శాస్త్రాలు చెప్పాయి.

I. కొద్దిగా చరిత్ర

ముస్లిముల రాకతో హిందూ స్త్రీలను కాపాడుకోవటం కోసం సతిదహన ఆచారం వచ్చిందని కొందరు వాదిస్తారు కానీ సతి దురాచారం ముస్లిముల రాకకు కొన్ని వందల సంవత్సరాల ముందునించీ పాటింపబడుతూ ఉంది.

సతిసహగమనం గురించిన మొదటి  చారిత్రిక ఆధారం గ్రీకు చరిత్రకారుల నుంచి లభిస్తుంది. BCE ఒకటో శతాబ్దానికి చెందిన Diodorus Siculus అనే చరిత్రకారుడు Bibliotheca Historica అనే గ్రంథంలో ఉత్తర భారతదేశంలో జరిగిన ఒక సతీసహగమం గురించి ఇలా వర్ణించాడు.

"Ceteus అనే భారతీయ సైనికాధికారి యుద్ధంలో మరణించాడు. అతనికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య గర్భవతి కనుక భర్తతో సహమరణించటానికి  సేనాధిపతులు చిన్నభార్యను ఎంపిక చేసారు. దాసిలు ఆమెను కొత్తపెళ్ళికూతురుగా  అలంకరించి తలపై పుష్పకిరీటాన్ని ఉంచారు. ఆమె సద్గుణాలను స్తుతిస్తూ కీర్తనలు పాడారు. ఆమె తన ఆభరణాలను స్నేహితులకు, సేవకులకు ఇచ్చివేసింది. ఆమెసోదరుడు ఆమెను  చితివద్దకు నడిపించుకు వెళ్ళాడు. ఆమె స్వయంగా భర్తపక్కన పడుకోగా చితికి నిప్పుపెట్టారు.   ఆమె  అగ్నికి ఆహుతి అయ్యింది. Diodorus తో సహా కొందరు గ్రీకులు ఇది క్రూరమైన అనాగరిక  ఆచారమని భావించారు"  సతికి సంబంధించి లభించే అత్యంత ప్రాచీన ఆధారం ఇదే. 

సతీసహగమన ఆచారానికి సంబంధించి   మరింత స్పష్టమైన ఆధారాలు గుప్తులకాలం నుండి లభిస్తాయి.   ఇది మొదటగా క్షత్రియులలో మొదలై క్రమేపీ బ్రాహ్మణులకు పిదప సాంస్క్రిటైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇతరకులాలకు కూడా విస్తరించింది. 1000 CE నాటికి ఇది సమాజంలో ఒక ఆచారంగా స్థిరపడిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.
 
మృతదేహాన్ని అగ్నికి ఆహుతిచేయటం ఆర్యసంస్కృతి. ఋగ్వేదం  దహన సంస్కార ప్రాముఖ్యత చెప్పింది (10.16). వేదకాలంలో  సతిసహగమనం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించవు.    అథర్వణ వేదం లోని 18.3.1 శ్లోకానికి భర్తమృతదేహం సరసన పడుకొన్న స్త్రీకి ఆమె భర్తతో పాటు సద్గతులు ప్రాప్తిస్తాయి అనే అర్ధం చెబుతారు కానీ ఇతర శ్లోకాలతో పోల్చినపుడు అక్కడ సతీసహగమన అర్ధం  పొసగదు. ఇలాంటి వ్యాఖ్యానాలను సతిదహనానికి వేదాల అంగీకారం ఉంది అనేవారు చేసిన కిట్టింపుగా భావించవచ్చు. 

ఇక స్మృతులు,  పురాణేతిహాసాలలో సహమరణం గురించి అనేక ప్రస్తావనలు కనిపిస్తాయి.

*.వైష్ణవ ధర్మశాస్త్రం (విష్ణు స్మృతి) మొదటగా సహగమనం గురించి ప్రస్తావించింది. భర్తకోల్పోయిన స్త్రీలకు సహగమనం ఐచ్ఛికమని చెప్పింది. (25.14)
 
*. భర్త మరణించిన స్త్రీ బ్రహ్మచర్యం ఆచరిస్తే ఆమె మరణానంతరం స్వర్గాన్ని చేరుకొంటుంది. అలా కాక భర్తతో పాటు సహగమిస్తే మనిషిదేహంపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటుంది. -- పరాశర స్మృతి 4.29-31
 
*. భర్తతో పాటు సహగమనం చేసిన స్త్రీలు స్వర్గానికి చేరుకొంటారు. -- అగ్నిపురాణం, 222:19-23.
 
*. సహగమనం చేసిన స్త్రీ, భర్త శరీరంపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయోఅన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటుంది. -- గరుడ పురాణం,1.107:29.

*. సతి సహగమనం చేసిన స్త్రీ, తన భర్త బ్రహ్మహత్యాపాతకుడు, కృతఘ్నుడు, పరమ పాపి అయినప్పటికీ అతనిని మోక్షానికి తీసుకువెళుతుంది. స్త్రీలకు ఇదే గొప్ప విమోచనం. -- కూర్మ పురాణం, 2.34:108b-109.
 
*. శ్రీ కృష్ణుని అష్ట భార్యలు సహగమనం ఆచరించినట్లు విష్ణుపురాణం 5:38 చెబుతుంది.

*. భర్తతో పాటు మరణించటం స్త్రీ ధర్మం. ఇది వేదాలలో చెప్పబడింది. పాములు పట్టేవాడు పుట్టలోంచి పాముని బయటకు రప్పించినట్లు సహగమించిన ఆ స్త్రీ మరణించిన భర్తను యమదూతలనుండి విడిపించి స్వర్గానికి తీసుకువెళుతుంది.-- బ్రహ్మ పురాణం 10.75.

*. మహాభారతంలో సూరుని నలుగురు భార్యలు సతీ సహగమనం చేసి స్వర్గంలో భర్తను చేరుకొన్న కథ ఉంది. మహాభారతం, 16.7.24-26

*. మహాభారతంలో మాద్రి సహగమనం ప్రస్తావన ఉంటుంది.

*.  కౌటిల్యుని అర్థశాస్త్రం, మనుధర్మశాస్త్రంలో సహగమనం గురించి లేదు.  పురాణ యుగపు (c300-1400 CE) రచనల్లో సహగమనాన్ని ఒక ఉత్కృష్టమైన చర్యగా ఆకాశానికెత్తటం గమనించవచ్చు.

****

510 CE లో మధ్య ప్రదేష్ లోని ఎరాన్ అనే ప్రాంతంలో గోపరాజ అనే పేరుగల సైన్యాధిపతి జ్ఞాపకార్ధం వేయించిన శాసనం అత్యంత ప్రాచీన మైన సతిశిల (sati stone) గా గుర్తించారు. దీనిలో “ఇతను (గోపరాజ) దేవతలలో శ్రేష్ఠుడైన ఇంద్రునితో సమానంగా స్వర్గానికి చేరాడు. భక్తికలిగిన, అందమైన ఇతని భార్య చిత్తశుద్ధితో చితిపై అగ్నిలో ఇతనితో సహగమనం చేసింది” అని ఉంది. అలాంటి సతిశిలలు దేశవ్యాప్తంగా పద్దెనిమిదో శతాబ్దం వరకూ వేయబడుతూనే ఉన్నాయి.

ఇలాంటి శిలలలో సాధారణంగా గాజులు ధరించిన కుడిచేయి ప్రముఖంగా కనిపిస్తుంది. ఇది సుమంగళత్వానికి సంకేతం.

Al Biruni (973-1048 CE), Ibn Battuta (1304 CE) లాంటి విదేశీ యాత్రికులు సతిదహనాల గురించి తమ రాతలలో వర్ణించారు.

కాకతీయుల పాలనలో జరిగిన సతి ఉదంతాన్ని 1210 CE నిడుబ్రోలు శాసనం చెబుతుంది. విజయనగర సామ్రాజ్యంలో సాగిన సతిదహనాలను Nuniz, Barradas వంటి పోర్చుగీస్ చరిత్రకారులు తమరచనలలో ప్రస్తావించారు.
 
1760 లో ఆనందగజపతి రాజుతో జరిగిన యుద్ధంలో పెద్దాపురం జగపతిరాజు మరణించాడు. అతని భార్య సతీసహగమనం చేసినట్లు మెకంజీ కైఫియ్యతుల ద్వారా తెలుస్తుంది .

II. ముస్లిమ్ పాలనలో సతిదహనం
.
మహమ్మద్ బిన్ తుగ్లక్ (1325–1351) సతి ఆచారాన్ని నిలువరించటానికి చేసిన ప్రయత్నంలో, సతిదహనం చేయాలనుకొన్నవారు తప్పని సరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చట్టం చేసాడు.
 
అక్బర్ (1556–1605) ఆస్థాన చరిత్రకారుడు అబుల్ ఫజల్ రచించిన అక్బర్ నామ లో సతి గురించి “భర్త చనిపోయిన స్త్రీకి ఇష్టమున్న ఇష్టం లేకపోయిన చితిపై దహనం చేయటం హిందువుల ఆచారం" అని చెప్పబడింది. అక్బర్ ఈ సతి దురాచారాన్ని నిషేదించాడు. ఈ నిషేదాన్ని అమలుపరచటానికి అధికారులను నియమించాడు.
 
ఇతని తరువాత జహంగిర్ కూడా సతి దహనం, ఆడశిశువుల హననం లాంటి దుశ్చర్యలను నిషేదించాడు. కానీ ఇవి ఉత్తర్వులకే పరిమితమైనాయి.
 
షాజహాన్, ఔరంగజేబులు కూడా సతిపట్ల కఠినంగానే వ్యవహరించి, బాలవితంతువులకు విద్యాబుద్ధులు నేర్పమని ఆదేశాలు జారీచేసినా అవి ఈ దురాచారాన్ని శాశ్వతంగా పరిష్కరించలేదు. దీనికి కారణం ఆనాటి హిందూ సమాజం శాస్త్రాల ప్రకారం జీవించటమే ధర్మంగా భావించటం, అన్యమతాల ఆచారాలలో ఎక్కువ జోక్యం కల్పించుకోకూడదు అనే రాజధర్మం కూడా కావొచ్చు.
 
III. బ్రిటిష్ పాలన

“ సతి” ఆచారాన్ని 1787 లో పీష్వా పాలకుల వద్ద రెసిడెంట్ గా ఉన్న C Malet అనే బ్రిటిష్ అధికారి గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాడు. 1788 లో బెనారస్ రెసిడెంట్ Jonathan Dungan, భర్త చనిపోయాడు అనే పుకారును నమ్మి అతని భార్యను బంధువులు బలవంతంగా ఇంట్లో ఉంచి దహనం చేసారనే దారుణమైన విషయాన్ని లార్డ్ కార్న్ వాలిస్ కు తెలియచేసాడు.
 
1789 లో షాహాబాద్ కలక్టర్ M.H. Brooks, తన అధికారాలను ఉపయోగించి సతి ఆచారాన్ని నిలుపుదల చేయించిన ఒక సంఘటనను పై అధికారులకు చెప్పినప్పుడు “నువ్వుచేసిన పని మంచిదే కానీ ఇకపై ఆ ఆచారంలోని అమానవీయతను వాళ్ళు తెలుసుకొనేలా చేయి తప్ప వారిపై బలప్రయోగం చేయకు” అని సలహా ఇచ్చారు.

1805 లో బీహార్ లో పన్నెండేళ్ళ బాలికను బలవంతంగా సతిదహనం చేయిస్తున్నప్పుడు JR Elphinstone, అనే మాజిస్ట్రేట్ అనుమతులకొరకు ఎదురుచూడకుండా తన విచక్షణ అధికారాలతో నిలుపుదల చేయించినట్లు, దానికి ఆ బాలిక ఎంతో సంతోషించినట్లు తెలియచేస్తూ- ఈ దురాచారం పట్ల భవిష్యత్తులో ఎలా వ్యవరించాల్సిందో తదుపరి ఉత్తర్వులు ఇవ్వమని ప్రభుత్వాన్ని అడిగాడు. జావా యుద్ధం, లార్డ్ కార్న్ వాలిస్ మరణం వంటి అనేక కారణాలవల్ల ఈ అంశం చాన్నాళ్ళు మరుగునపడిపోయింది.

సతిదహనాలు దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతున్నట్లు, చాలా సందర్భాలలో సతికి పాల్పడే అమ్మాయికి అధికమోతాదులో మత్తుపదార్ధాలు ఇచ్చి దహనం చేస్తున్నట్లు వస్తున్న రిపోర్టులను ఆధారంగా చేసుకొని 1812 లో ప్రభుత్వం హిందూ పండితులతో చర్చించి, సతిదహన నియంత్రణ కొరకు ఈ క్రింది నియమావళిని ప్రతిపాదించింది -

ఎ. బంధువులు, పండితులు, ఇతరుల వత్తిడి లేదా బలవంతంపై ఆ మహిళ సతిదహనంలో పాల్గొనటం లేదని నిర్ధారించుకోవాలి

బి. సతిదహన సమయంలో ఆ మహిళకు మత్తుపదార్ధాలు ఇవ్వలేదని తేల్చాలి
 
సి. ఆ మహిళకు 16 ఏళ్లకన్న తక్కువ వయసు ఉండరాదు. బహిష్టులో ఉండరాదు. . గర్భవతి అయి ఉండకూడదు.
 
డి. ఈ ఆచారం హిందువులకు మాత్రమే అనుమతించబడింది. ఆ మహిళ కనుక తన పోలీసులకు అయిష్టతను తెలియచేసినచో వెంటనే బలప్రయోగంతో ఆ సతిదహనాన్ని నిలుపుచేయాలి.
 
ఇన్ని చేసినా హిందూ మతాచారాలకు అనుగుణంగా పండితుల సలహాలతో, సతిదహనాలు దేశవ్యాప్తంగా జరగటం బ్రిటిష్ అధికారులను ఆశ్చర్యపరచేది. ఇది ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధం చేసుకోవటానికి, 1815 నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ఈ సతిదహనం చేసుకొన్న స్త్రీల పేర్లు, భర్త కులం, వయస్సు, లాంటి వివరాలు సేకరించసాగింది. బెంగాలుకు సంబంధించి 1815-1818 ల మధ్య జరిగిన సహగమనాల సంఖ్యలు ఇలా ఉన్నాయి.

1815 లో 378, 1816 లో 442, 1817 లో 707, 1818 లో 839

1817, 1818 లలో కలరా మరణాలు ఎక్కువగా ఉండటం వలన సతిదహనాల సంఖ్యకూడా ఎక్కువగా నమోదయ్యింది.

మద్రాసు డివిజనుకు సంబంధించి 1816 నాటికి మూడేళ్ళ సతిదహన లెక్కలు ఇవి

గంజాం- 45; విశాఖపట్నం- 6; రాజమండ్రి లో ఇద్దరు బ్రాహ్మలు, ఒక రాజు, ఆరుగురు శూద్రులు; మచిలిపట్నం – 42: గుంటూరు – 14: నెల్లూరు- 12: చిత్తూరు – 13: కుంబకోణం – 18

ఆనాటి ఫ్రెంచి పాలిత యానాంలో 1830లో జరిగిన ఒక సతిదహన ఉదంతాన్ని ప్రముఖ ప్రపంచయాత్రికుడు CPT Laplace, Travel around the world అనే పుస్తకంలో గ్రంథస్థం చేసాడు .

IV. బ్రిటిష్ పార్లమెంటు పేపర్లలో సతిదహనం పై జరిగిన చర్చలు

భారతదేశంలో తన అధికారిక వ్యవహారాలకు సంబంధించి ఈస్ట్ ఇండియా కంపనీ అఫిషియల్ రిపోర్టులను లండన్ లో ఉండే బ్రిటిష్ పార్లమెంటుకు సమర్పించేది. వీటిని పార్లమెంటరీ పేపర్స్ (PP) అంటారు. భారతదేశంలో ఉండే గవర్నర్ జనరల్ బ్రిటిష్ పార్లమెంటు నిర్ణయాలకు లోబడి పనిచేసేవారు.

ఈ పార్లమెంటు పేపర్లలో 1821-30 లమధ్య సతిదహనం గురించి విస్త్రుతమైన చర్చలు జరగాయి. వీటి ద్వారా సతిసహగమన నిషేదం వెనుక ఉండిన ఆనాటి సామాజిక పరిస్థితులను అర్ధం చేసుకోవచ్చును. వాటిలోంచి ఇవి కొన్ని ఉటంకింపులు

1. గవర్నర్ జనరల్ మోయిరా (1812-1829): స్థానిక హిందూ చట్టాలపై విదేశీపాలకులమైన మన ప్రభావం పరిమితమైనది. బ్రిటిష్ అధికారులు సతిదహనం విషయంలో జోక్యం చేసుకోవటంపై జాగ్రత్తగా ఉండాలి ప్రజల మతపరమైన అభిప్రాయాలలో ప్రభుత్వం జోక్యం చేసుకొంటోందనే అభియోగం రాకుండా చూసుకోవాలి (PP 1821:243)

2. లండన్ లో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 1823 లో – సతిదహనం అనే ఆచారానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇవ్వదని, అలా చేసి సతిదహనం అనే క్రియలో భాగస్వామి కావటం తమకు ఇష్టం లేదని, శాసనకర్తలుగానే కాక క్రైస్తవులుగాకూడా అట్టి ఆచారాలను తాము అంగీకరించబోమని అన్నారు. (PP 1824: 45).

3. కలకత్తా నుండి వెలువడే Quarterly friend of India అనే పత్రిక 1822 లో- బ్రిటిష్ పాలకులు హిందూ చట్టాలపై స్వేచ్చానుసారంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కలిగి ఉంటే, అభాగ్యులైన హిందూ విధవలను కనికరంతో కాపాడగలిగే హక్కు ఉండేది” అని వ్యాఖ్యానించింది (PP 1822: 22)

4. సతిదహనానికి ఒక మహిళ తనంతట తాను సిద్ధపడినప్పుడు మనమేం చేయగలం అనే వాదనకు సమాధానంగా, ఇ. వాట్సన్ అనే న్యాయమూర్తి- “ఒక మహిళ సతిదహనానికి సిద్ధపడి తన ఆమోదం తెలిపినప్పటికీ ఆ ఆమోదం చట్టపరంగా పూర్తిగా చెల్లనిది/విలువలేనిది కావాలి. ఆమె కోరికపై ఆమెను చంపేవారు చట్టం ముందు హంతకులుగానే పరిగణింపబడాలి” అన్నాడు. (PP 1821: 99)

5. పై అభిప్రాయాన్ని మరింత విపులంగా Ewer అనే బ్రిటిష్ అధికారి “సతికి సిద్ధపడిన మహిళ స్వచ్చందంగా ఆ పని చేస్తున్నట్లు నమ్మలేమని, అది బలవంతం లేదా ప్రలోభపెట్టటం వలన మాత్రమే జరిగే ప్రక్రియ అని; ఎక్కువశాతం హిందూమహిళలను మానసికంగా ప్రభావితం చేయటం సులభమని; ఆమె స్వచ్చందంగానే దహనానికి సిద్ధపడుతున్నాను అని చెప్పినప్పటికీ ఆమె మాటలు ఆమె నిజమైన భావాలను తెలియజేయవు” అన్నాడు (PP 1821: 227)

6. పార్లమెంటరీ పత్రాలలో పండితులను “నిత్యం ఆకలిగొన్న” వారిగా వర్ణించారు. Ewer అనే బ్రిటిష్ అధికారి ఈ మొత్తం సతిఆచారాన్ని ఇలా చూసాడు-- మొదటి సతిఆచారం జరిగిన కొద్దికాలంలోనే పండితులు దీనిని సరైన రీతిలో నిర్వహించినట్లయితే తమకు మంచి ఆదాయవనరుగా మారుతుందని గుర్తించారు. అప్పటి అత్యంత గౌరవనీయ రచయితలు సతిని శ్రేష్టమైన పుణ్యకార్యంగా, విధవ మరియు ఆమె భర్త ఆత్మలకు అలాగే కుటుంబంలో మిగిలిన ఇతర బంధువులకు మంచి ఫలితాలు కలుగుతాయి అని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం, సంబంధిత పూజావిధానాలు జరిపించటానికి పండితుల హాజరు తప్పనిసరి చేసారు. (PP1821: 231)

7. Council Governor-General అయిన Lord Amherst, ఇలా అన్నాడు- స్త్రీలు చిన్నతనం నుండి ఒక విశ్వాసంతో పెరుగుతారు, అంటే సతీగమనం చేయడానికి ఒప్పుకోవడం ద్వారా వారు తప్పనిసరి కర్తవ్యాన్ని మాత్రమే కాకుండా, తమకూ మంచి పేరు వస్తుందని, తమ కుటుంబం ప్రతిష్ట పెరుగుతుందని భావిస్తారు. సతీగమనం చేయడానికి నిరాకరిస్తే, పిరికితనం, భర్తపట్ల అంకితభావం లేకపోవడం అనే అపవాదును ఎదుర్కోవలసి వస్తుందని భయపడతారు (PP1824:43).

8. ఒక చండాల స్త్రీ సతీదహనానికి అనుమతి కోరగా, ఆమె అతిశూద్ర స్త్రీ అయినప్పటికీ స్థానిక పండితులు ఆమెకు శూద్ర స్త్రీ స్థానాన్ని కల్పించి సతిసహగమనానికి అనుమతించారు (PP1825:42)

9. చేనేత కులస్థులలో భర్తశవంతో పాటు సజీవంగా ఉన్న భార్యను ఖననం చేయటం సతిసహగమన ఆచారం. ఇంతటి అమానవీయ ఆచారాన్ని ఇంకా కొనసాగించటం ఎంతో అభ్యంతరకరంగా ఉందని కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ అభిప్రాయపడ్డారు (PP1821:179) .

V. ముగింపు

ఆచారాలు, సేవాధర్మం, పాతివ్రత్యం లాంటివి అనాదిగా హిందూ స్త్రీకి ఊపిరాడనివ్వకుండా చేసాయి. సనాతన ధర్మంలో హిందూ స్త్రీ ఎలా జీవించాలి అనే అంశంపై “స్త్రీ ధర్మ పద్దతి” అనే ఒక సంస్కృతగ్రంథం మార్గదర్శనం చేస్తుంది. దీనిలో ఉదయం లేచినదగ్గరనుంని పడుకొనే వరకూ హిందూ స్త్రీ ఎలాంటి విధివిధానాలను (మలమూత్ర విసర్జనాదులతో సహా) పాటిస్తే పతివ్రతగా పేరుతెచ్చుకొంటుందో ఎంతో విపులంగా వర్ణించబడింది.

ఈ గ్రంథంలో భర్తమరణించిన స్త్రీ సహగమనం చేసినట్లయితే లభించే పుణ్యం గురించి అనేక శ్లోకాలలో ఎంతో రసవత్తరంగా చెబుతాడా పండితుడు. ఈ గ్రంథాన్ని 18 వ శతాబ్దంలో త్రయంబకయాజ్వన రచించాడు. దీనినిబట్టి 18 వ శతాబ్దం వరకూ కూడా సతి సహగమనంను పండితులు ఏ రకంగా బతికించుకొంటూ వచ్చారో అర్ధం చేసుకొనవచ్చును. ప్రతి హిందువు ఆచరించాల్సిన ధర్మాలను తెలియచేసే కొల్లూరి కామశాస్త్రి క్రోడీకరించిరాసిన “ధర్మసింధు” అనే గ్రంథంలో వివిధ వర్ణాలవారికి సహగమనాన్ని చేయించే విధి విధానాలు, మంత్రాలు ఉన్నాయి.  

***

బ్రిటిష్ అధికారి విలియం కేరీ 1799 లో మొదటిసారిగ సతీదహనాన్ని చూసి చలించిపోయాడు. జాషువా మార్ష్ మాన్, విలియం వార్డ్ వంటి మిత్రులతో కలిసి ఈ సతి దురాగతాన్ని రూపుమాపటానికి బ్రిటిష్ పార్లమెంటులో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని ఎంతగానో శ్రమించాడు. సతిని నిషేదించమని కోరుతూ అనేక వ్యాసాలు రాసాడు. వీరితో ఆధునిక భావాలు కలిగిన రాజారామ్మోహన్ రాయ్ చేతులు కలిపాడు. స్వామినారాయణ శాఖ వ్యవస్థాపకుడైన సహజానంద్ స్వామి కూడా సతినిషేదాన్ని సమర్ధించాడు. వీరిపై స్థానిక సనాతన బృందాల నుండి ప్రతిఘటన ఉండేది.

ఎట్టకేలకు తొలి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ 4, డిశంబరు 1829 న రెగ్యులేషన్ XVII ను జారీ చేసి సతి దహనం చట్టవ్యతిరేక, శిక్షించదగిన నేరంగా ప్రకటించాడు.

దీనిపై సనాతనులనుంచి తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది. ప్రధానంగా రాధాకాంత్ దేవ్ స్థాపించిన ధర్మ సభ అనే సంస్థ సతినిషేదాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. (ఇదే సంస్థ 1856 లో వితంతుపునర్వివాహ చట్టాన్ని వ్యతిరేకించింది)

సతిఆచారాన్ని నిషేదించటం అనేది “భారతీయుల ఆచార వ్యవహారాలలో కలగచేసుకోము” అని మూడవ జార్జి చక్రవర్తి ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా ఉందని సనాతనులు వాదించారు. బీహార్, బెంగాల్ ఒరిస్సాల నుంచి కొన్ని వేలమంది సంతకాలు చేసిన పిటిషనులు ప్రభుత్వానికి సమర్పించారు. ఈస్ట్ ఇండియా కంపనీ ప్రభుత్వం సతీదహనాన్ని నిషేదించటాన్ని 1830 లో లండన్ ప్రివీ కౌన్సిల్ లో సవాలు చేసారు సనాతనులు.

రాజా రామ్ మోహన్ రాయ్ ఈ సనాతనుల వాదనను ఖండిస్తూ సతిని ఎందుకు నిషేదించాలో కౌంటర్ పిటిషన్ లు పార్లమెంటులో సమర్పించాడు. ఇతను చేసిన పోరాటంవల్ల 1832 లో సతినిషేదానికి సంపూర్ణ ఆమోదం లభించింది.

****

హిందూ ధర్మశాస్త్రాలు స్త్రీ కి సముచిత స్థానం ఇవ్వలేదు. బాల్యవివాహాలు, బహుభార్యత్వం, ఆస్తి హక్కులేకపోవటం, స్వేచ్ఛలేకపోవటం, విడాకులు తీసుకొనే స్వతంత్రత లేకపోవటం లాంటివి కొన్ని ఉదాహరణలు. వీటన్నిటికీ పరాకాష్టలాంటి ఆచారం ఈ సతీదహనం. బహుజనులలో సతీసహగమనం పొందిన స్త్రీలను పేరంటాళ్ళుగా కొలుస్తారు.

ఇవన్నీ సామాజిక రుగ్మతలు. వీటిని భారతీయసమాజం తొలగించుకొనే ప్రతిదశలోనూ సనాతనులు అడ్డుపడ్డారు. ఇవన్నీ మా ఆచారాలు మీరెవరు మార్చటానికి అంటూ తీవ్రంగా ప్రతిఘటించారు. స్త్రీలకు ఆధునిక ప్రజాస్వామిక హక్కులను కల్పించే హిందూకోడ్ బిల్లును పార్లమెంటులో చర్చిస్తున్న సమయంలో డిశంబరు 11, 1949 న వేయిమందికి పైన  సనాతనులు పార్లమెంటును ముట్టడించి ఆ బిల్లు అమలుకాకుండా చూసారు. ఈ రకపు వాదనలు నేడు కూడా వినిపిస్తాయి. ఎవరైనా రేషనల్ గా మాట్లాడితే విశ్వాసాలమీద దాడిగా భావిస్తారు కొందరు.

నిజానికి ఈ పాత విషయాలు ఇప్పుడెందుకు అంతాబాగానే ఉంది కదా అంటూ కొందరు వాదిస్తారు. కానీ మనం నడిచి వచ్చిన దారిని మరచిపోతే, చేసినతప్పులే మరల మరలా చేసే ప్రమాదం ఉంటుంది. గతం ఎంతో అందమైనది అంటూ తిరిగి  అక్కడకే హిందువులను నడిపించాలని; ఆధునిక ప్రజాస్వామిక యుగలక్షణాలైన స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పునాదులపై నిర్మించుకొన్న రాజ్యాంగం బదులు మనుధర్మశాస్త్రాన్ని అమలుపరచాలని కుట్రలు పన్నుతున్న కాలంలో ఉన్నాం మనం. చరిత్ర అర్ధం కాకపోతే ఏ వర్గాల ఆధిపత్యం తిరిగి నెలకొల్పటానికి ఈ కుట్రలు పన్నుతున్నారో అర్ధం కాదు.

****

సతి దురాచారాన్ని నిషేదించిన ఒక బెంటింగ్, వితంతుపునర్వివాహచట్టాన్ని ప్రవేశపెట్టిన ఒక డల్ హౌసీ, బాల్యవివాహాలను రద్దు చేసిన ఒక లార్డ్ ఇర్విన్, హిందూకోడ్ బిల్ ప్రవేశపెట్టిన ఒక  డా. బి.ఆర్. అంబేద్కర్ లాంటివారు ప్రాతఃస్మరణీయులు.









బొల్లోజు బాబా

రిఫరెన్సులు

1.  Religion and Philosophical Research E-ISSN: 2667-6583 Haziran | June 2020 Volume: 3 - Sayı | Number: 5,  A Brief Historical Background Of Sati Tradition In India, Pn. 45

2. The dharmasastric debate on widow burning, David Brick, Yale University

3. మెకంజీ కైఫియ్యతులు, తూర్పుగోదావరిజిల్లా, బొల్లోజు బాబా

4. Susil Chaudhuri, ‘Sati as Social Institution and the Mughals’, Proceedings of the Indian History Congress, vol. 37 (1976), pp. 218 223.)

5.Calcutta Review 1868, vol 47, pn 221

6. ఫ్రెంచిపాలనలో యానాం-బొల్లోజు బాబా

7. Hindu Pasts, Women, Religion, Histories, Vasudha Dalmia. Chapter: Sati as a Religious Rite: Parliamentary Papers on Widow Immolation

8. https://www.jstor.org/stable/4397528

9. The perfect Wife, Sridharmapaddhati, by I Julia Leslie pn.293

10. The Dharmasastric Debate on Widow-Burning,David Brick, Yale University

11. https://penelope.uchicago.edu/Thayer/E/Roman/Texts/Diodorus_Siculus/19B*.html

Tuesday, December 24, 2024

డా. అంబేద్కర్ ఎందుకు రాజీనామా చేశారు?

భారతదేశాన్ని లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దటంలో నెహ్రూ, డా. అంబేద్కర్ లు పరస్పరం సహకరించుకొంటూ పోషించిన పాత్ర అనన్యసామాన్యమైనది. డా. అంబేద్కర్ కు రాజకీయపరంగా నెహ్రూ ఇచ్చిన మద్దతుతో గొప్ప ఆధునిక విలువలు కలిగిన రాజ్యాంగం రూపుదిద్దుకొంది. డా. అంబేద్కర్,పండిత నెహ్రూల సంస్కరణాభిలాషకు హిందూకోడ్ బిల్ అద్దం పడుతుంది. మతవాదులు ఈ బిల్లును తీవ్రంగా అడ్డుకొన్నారు. ఈ మతవాదుల దూకుడుకు నెహ్రూ కూడా రాజకీయంగా కొంత తగ్గవలసి వచ్చింది. 1949 నుంచి దాదాపు రెండేళ్లపాటు పార్లమెంటులో హిందూకోడ్ బిల్లుపై చర్చలు జరిగాయి. కొలిక్కి రాలేదు.

ఈ బిల్లును పార్లమెంటులో డా. రాజేంద్ర ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జి, పట్టాభి సీతారామయ్య పండిత్ గోవింద మాలవ్య, బిహారీలాల్ భార్గవ, దుర్భంగా మహరాజా లాంటి వారు వ్యతిరేకించారు. పార్లమెంటు వెలుపల హిందూ మతగురువులు, ధార్మిక నాయకులు ఈ బిల్లును తీవ్రంగా తూర్పారపట్టారు.
 
వీరందరి వాదన ఒకటే – ఈ బిల్లు హిందూ ధర్మశాస్త్రాలపై ఆధారపడి లేదని, పాశ్చాత్యప్రభావంతో కూడిన చట్టం అని, ఇది మన సంస్కృతిని సంప్రదాయాలను మార్చటానికి ప్రయత్నిస్తున్నదని. వేల సంవత్సరాలుగా కాలపరీక్షకు తట్టుకొని నిలబడ్డ హిందూ సామాజిక ఆచారవ్యవహారాలకు ఈ బిల్లులోని అంశాలు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. అంతేకాక మతవిషయాలపై పార్లమెంటుకు చట్టాలు చేసే యోగ్యత లేదని మతవాదులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసారు.
ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంలో- డిశంబరు 11, 1949 న వెయ్యిమంది సనాతనవాదులు పండిత గోవింద మాలవ్య నాయకత్వంలో పార్లమెంటును ముట్టడించారు. (ఆంధ్రపత్రిక డిశంబరు 13, 1949)

ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపి పునఃపరిశీలన చేయటానికి డిశంబరు 19, 1949 న పార్లమెంటులో జరిగిన ఓటింగులో పదకొండు మంది మాత్రమే బిల్లుకు అనుకూలంగా ఓట్ చేయటాన్ని బట్టి హిందూ కోడ్ బిల్లు ఏ మేరకు సనాతనులనుండి ప్రతిఘటనను ఎదుర్కొందో అర్ధం చేసుకొనవచ్చును. (ఆంధ్రపత్రిక డిశంబరు 20, 1949)

సెలక్ట్ కమిటీ రెండేళ్ళ పాటు పరిశీలించిన అనంతరం కూడా హిందూ కోడ్ బిల్ పార్లమెంటులో ఆమోదం పొందలేదు.
 
హిందూ కోడ్ బిల్ ఆమోదం పొందనందుకు డా. అంబేద్కర్ సెప్టెంబరు 27, 1951 న లా మినిస్టర్ గా రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖలో "పార్లమెంటు ప్రస్తుత సమావేశాలలోనే హిందూ న్యాయశాస్త్ర సవరణ బిల్లు నెగ్గవచ్చుననే నమ్మకంతో ఇంతవరకూ పనిచేసానని, ఆ ఉద్దేశంతోనే బిల్లులోనుంచి "వివాహం విడాకులు" భాగాన్ని ప్రత్యేకించటానికి కూడా అంగీకరించానని, ఇప్పుడు ప్రభుత్వము దానిని పూర్తిగా చంపివేసినందున రాజీనామా చేస్తున్నానని" డా. అంబేద్కర్ తెలియచేసారు. (ఈ లేఖలో డా. అంబేద్కర్ ప్రభుత్వ ఇతరవిధానాలతో తాను వ్యతిరేకిస్తున్నట్లు ఎక్కడా చెప్పి ఉండలేదు. - అక్టోబరు 13 1951 ఆంధ్ర పత్రిక)
 
పండిత నెహ్రూ ఈ లేఖకు ఆరోజే జవాబిస్తూ "హిందూ న్యాయసవరణ బిల్లు ఉపసంహరించబడి నందుకు డా. అంబేద్కర్ పొందిన ఆశాభంగాన్ని తాను గుర్తించినట్లూ, అయితే విధీ, పార్లమెంటు నియమాలూ తమకు ప్రతికూలించినట్లు, ఆ బిల్లు నెగ్గనిదే నిజమైన అభివృద్ధి ఉండదు కనుక దానికోసం ఇంకా తాను పాటు పడబోతున్నట్లూ తెలియచేసాడు.

హిందూ మహాసభ, జన సంఘ్, రామ రాజ్య పరిషద్ లాంటి మతవాద పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయగా, కాంగ్రెస్ లోని కొందరు మతవాదులు కూడా వారితో జతకలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడైన పట్టాభిసీతారామయ్య “ఈ బిల్లు విషయంలో జాగ్రత్తగా నడవకపోయినట్లయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతింటుంది” అని నెహ్రూను హెచ్చరించాడు. ఇలాంటి తీవ్ర ప్రతికూలతల మధ్య బిల్లును ఆమోదింపచేయటం పండిత నెహ్రూ చేతిలో కూడా ఉండకపోవచ్చు. ఈ పరిణామాలు డా.అంబేద్కర్‌ను తీవ్రంగా నిరాశపర్చాయి.

హిందూ కోడ్ బిల్ లో ఏముంది?

హిందూ సమాజంలోని కుటుంబ, వివాహం, వారసత్వం వంటి వ్యక్తిగత చట్టాలను క్రోడీకరించి ప్రవేశపెట్టిన ఒక సమిష్టి చట్టాల సముదాయాన్ని హిందూ కోడ్ బిల్ అంటారు. హిందూకోడ్ బిల్ ఒక విప్లవాత్మక చట్టం. హిందూ కుటుంబం, వివాహం లాంటి అంశాలు ఎలా ఉండాలనేది హిందూ ధర్మ శాస్త్రాలు ఏనాడో నిర్ణయించాయి. కానీ వాటిలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం, స్వేచ్ఛ ఉండదు. లింగ, కుల వివక్షలు ఉంటాయి. వాటిని తొలగించి మానవ సంబంధాలను ఆధునిక భావనలకు అనుగుణంగా నిర్వచించి, హిందూ సమాజాన్ని స్వేచ్ఛ, సమానత్వాలకు సిద్ధం చేయటం హిందూకోడ్ బిల్ ముఖ్య ఉద్దేశం.

ఈ బిల్లును సంప్రదాయ మత వాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూ ధర్మశాస్త్రాలు నిర్ధేశించినట్లు హిందువులు జీవిస్తారని; ధార్మిక విషయాలలో చట్టాలు చేసే హక్కు పార్లమెంటుకు లేదని అంటూ ఆందోళనలు చేసి హిందూ బిల్ ను అడ్డుకొన్నారు.
హిందూ బిల్ లో ప్రతిపాదించిన అంశాలను గమనిస్తే, డా. అంబేద్కర్ ఎంతటి దార్శనికత కలిగిన మనిషో, ధర్మశాస్త్రాల నిర్ధేశించినట్లుగా హిందూ కుటుంబం నడుచుకోవాలి అంటూ మతవాదుల ఎంతటి మూర్ఖపు వాదన చేసారో అర్ధమౌతుంది.

హిందూ కోడ్ బిల్---

1.బాల్యవివాహాలను నిషేదించింది. వివాహవయస్సు నిర్ణయించి, వధూవరుల పరస్పర అంగీకారంతో వివాహం జరగాలని చెప్పింది.
2.కులాంతర, మతాంతర వివాహాలను అనుమతించింది
3.స్త్రీలకు దత్తత తీసుకొనే హక్కు కల్పించింది
4.స్త్రీలకు విడాకులు ఇచ్చే హక్కు కల్పించబడింది. (ఈ క్లాజుకి భారతీయ సమాజం కుప్పకూలిపోతుందని పార్లమెంటులో మతవాదులు గగ్గోలు పెట్టారు)
5.విడాకులు తీసుకొన్న మహిళ జీవన బృతిగా మనొవర్తిపొందే హక్కు కల్పించింది
6.బహుబార్యత్వాన్ని నిషేదించింది
7.కుమార్తెలకు, కుమారులతో సమానంగా తండ్రి ఆస్తిలో హక్కు కల్పించింది. పెద్ద కొడుకుకు మాత్రమే ఆస్తిలో హక్కు కలిగి ఉండే ఆచారాన్ని నిషేదించింది.
8.స్త్రీలు ఆస్తిని కొనుగోలు చేసే హక్కు కల్పించింది
9.తండ్రితో సమానంగా పిల్లలకు తల్లి సహజ సంరక్షకురాలిగా ఉండే హక్కు కల్పించింది
10 స్త్రీలకు సమాన హక్కులు కల్పించబడ్డాయి

పైన చెప్పిన అంశాలన్నీ స్త్రీ స్వేచ్ఛ, సాధికారికతకు సంబంధించిన అంశాలు. భారతదేశం రెండువేల సంవత్సరాలుగా పాటించిన సామాజిక విలువలకు ఇవి పూర్తిగాభిన్నమైనవి, కొత్తవి.
ధర్మశాస్త్రాలలో బాల్య వివాహాలు ఉంటాయి. కులాంతర వివాహాలు చేసుకోరాదు. స్త్రీలకు తండ్రి ఇచ్చిన స్త్రీధనంపై హక్కులు తప్ప మరే విధమైన ఆస్తి హక్కులు లేవు. భర్త దేశాంతరాలు పట్టిపోయినా, నపుంసకుడైనా విడాకులు కోరవచ్చు తప్ప మరే ఇతరకారణాలతో కాదు. మనోవర్తి లేదు. బహుభార్యత్వం ఉంది. పెద్దభార్య పెద్ద కొడుకే ఆస్తికి వారసుడు. స్త్రీపురుషులు సమానులు కాదు. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, ముసలితనంలో కుమారుని సంరక్షణలో ఉండాలని స్త్రీకి స్వాతంత్రం లేదని మనుధర్మశాస్త్రం చెప్పింది.

ధర్మశాస్త్రాలలో చెప్పిన అంశాలు భారతీయ సంస్కృతి అని, వాటిని రాజ్యాంగంలో పొందుపరచాలని మతవాదులు పోరాడారు. ప్రజాస్వామిక లక్షణాలతో ఉన్న హిందూకోడ్ బిల్ ను వ్యతిరేకించారు. బిల్లును పార్లమెంటులో ఓడించారు. లౌకిక ప్రజాస్వామిక విలువలు కలిగిన దేశాన్ని నిర్మించాలని కలలు కన్న డా. అంబేద్కర్ ను తీవ్ర నిరాశకు గురిచేశారు. నిరసనగా డా. అంబేద్కర్ లా మంత్రిగా రాజీనామా చేసారు. స్వతంత్ర భారతదేశంలో ఒక అంశాన్ని విభేదిస్తూ చేసిన మొట్టమొదటి రాజీనామా ఇది.

ముగింపు

ఆ తదనంతరం 1955-56 మధ్య ఈ బిల్లును- the Hindu Marriage Act, Hindu Succession Act, Hindu Minority and Guardianship Act, and Hindu Adoption and Maintenance Act అనే పేర్లతో దఫదఫాలుగా చట్టాలుగా చేయటం జరిగింది. నేడు భారతీయ మహిళ స్వేచ్ఛగా, సాధికారంగా జీవనం సాగిస్తున్నదంటే డా. అంబేద్కర్ రూపొందించిన హిందూ కోడ్ బిల్ మరియు దాన్ని సాకారం చేసిన పండిత నెహ్రూ దృఢ సంకల్పమే కారణం.
****
రాజ్యాంగం ఆర్టికిల్ 44 లో ప్రజలందరకూ ఒకటే వ్యక్తిగత చట్టాలు అమలుకావాలంటే యూనిఫార్మ్ సివిల్ కోడ్ (UCC) తీసుకురావలసి ఉంటుందని రాసుకున్నాం. భారతదేశం వైవిధ్యభరితమైనదని మైనారిటీలకు సంబంధించి వారు కోరుకుంటే UCC లోకి రావచ్చని పండిత నెహ్రూ అప్పట్లో వ్యాఖ్యానించారు.

UCC తీసుకొస్తే ముస్లిములకు ఉండే నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవటం, 16 ఏళ్ళకే వివాహ వయస్సు లాంటి హక్కులను కోల్పోతారు. ట్రిపుల్ తలాక్ హక్కు ఇప్పటికే తొలగించారు. ముస్లిమ్ సమాజాన్ని ఏదో చేసేయ్యాలని హిందుత్వవాదులు UCC తీసుకొస్తామని పదే పదే ప్రకటనలు చేస్తుంటారు.
నిజానికి UCC వల్ల హిందూ సమాజం కూడా గణనీయంగానే ప్రభావితమౌతుంది. హిందూ కోడ్ బిల్ భారతదేశపు హిందువులలో ఉండే భిన్నత్వాన్ని గౌరవిస్తుంది. UCC వస్తే సిక్కులు కృపాణం ధరించటం, కొన్ని చోట్ల గిరిజనులు ప్రత్యేక వివాహ చట్టాలను కలిగి ఉండటం, హిందూ ఉమ్మడికుటుంబం పేరిట పొందే ప్రత్యేక టాక్సు మినహాయింపులు వారసత్వ హక్కులు, గోవా లాంటి ప్రాంతాలలో హిందువులు పొందే కొన్ని ప్రివిలేజస్, ఉత్తరాఖాండ్ లాంటి చోట హిందువులు పాటించే విభిన్నమైన ఆచారాలు లాంటివి కోల్పోవలసి ఉంటుంది.

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని 2018 లో లా కమిషన్, గొప్ప సాంస్కృతిక వైవిధ్యం కలిగిన భారత దేశంలో UCC సాధ్యంకాదు వాంఛనీయం అసలే కాదు అని రిపోర్ట్ ఇచ్చింది.

బొల్లోజు బాబా



















ప్రాచీన గాథలు పుస్తకంపై డా. సుంకర గోపాల్ స్పందన

ఇదే ఆకాశం ,ఇదే నేల మీద వందల ఏళ్ళ క్రితం ఏం జరిగిందో అప్పటి మనుషులు వారి తాలూకా జీవనం ,జీవన సౌందర్యం ఎట్లా ఉండేదో ఊహించుకుంటే భలే ఉంటుంది. బహుశా ఎన్ని సౌకర్యాలు అప్పుడు ఉండకపోవచ్చు.ప్రకృతి ఉంది. నది ఉంది.చంద్రుడు ఉన్నాడు. చుక్కలు ఉన్నాయ్. తాజాతనంతో కూడిన గాలి ఉండవచ్చు. చేలల్లో, వీధుల్లో, నదీతీరాల్లో,ఋతువుల మధ్య ,కొండల మీద, వాళ్ళు ఎలా బతికారో పేరు తెలియని కవులు రికార్డ్ చేశారు. అప్పటి ప్రపంచ సౌందర్యాన్ని భౌతికంగానూ, మానసికంగానూ ఈ ప్రాచీన గాథలు మన హృదయాల్లోకి పంపుతాయి. చదువుతూ చదువుతూ ఉంటే మన ముందు అప్పటి వాతావరణం లీలగా కనిపిస్తుంది. మనల్ని అక్కడికి ప్రయాణింప చేస్తాయి.సంగం కవిత్వం దక్షిణ భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించే సాహిత్యమని వేరే చెప్పక్కర్లేదు.హాలుని గాథా సప్తశతి లోని గ్రామీణ ప్రజల సాంఘిక జీవనంతో పాటు , స్త్రీ పురుష సంబంధాలు , ప్రకృతి వర్ణనలు మనల్ని అలోచింపచేస్తూనే, ఆనందింపచేస్తాయి. ఇట్లా వజ్జా లగ్గము ,కువలయ మాల ,సేతుబంధ, అమర శతకం,ఋతు వర్ణనలు ఇంకా మరి కొన్ని వాటితో కలిపి 11 అంశాలను ప్రాచీన గాధ లుగా బొల్లోజు బాబా
అనువాదం చేశారు. అయితే ఇందులో భీముని భాగం అనువాదాలు మూలానికి దగ్గరగా ఉన్నాయనిపిస్తోంది. అనువాదకుడు వాటిని ఎంతవరకు లోపలకి తీసుకున్నాడనేది ,వాటిని చదువుతూ ఉన్నప్పుడు

అర్థం అయిపోతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రాచీన గాథలు చదువుతుంటే అద్భుతమైన కవిత్వ అనుభూతి సహృదయ పాఠకుడు పొందగలడు. అట్లాంటి అనుభూతిని నాకు ప్రసారం చేసిన బాబా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని కొని చదవడం ద్వారా మన డబ్బు వృధా కాదు.
 
ముచ్చట గా మూడు అనువాదాలు

నా ఇంటి స్తంభాన్ని ఆనుకొని నిలిచి
"నీ కొడుకు ఎక్కడ "అని అడుగుతున్నావు
వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు
అతనికి జన్మనిచ్చిన ఈ గర్భం ఒక కొండ గుహ
పులి కొంతకాలం ఇక్కడ నివసించి వెళ్ళిపోయింది
ఎక్కడో ఏదో యుద్ధ భూమిలో అతను నీకు దొరుకుతాడు
(పురనానూరు-86)

ఊరి పెద్ద కూతురు చాలా అందగత్తె
ఊరిలోని మగాళ్ళందర్నీ
దేవతలుగా మార్చేసింది
ఎవరు రెప్పలు మూయరు
ఆమెను చూస్తున్నప్పుడు( గాథా సప్తశతి)

ఓ వేటగాడా
ఒక బాణం సరిపోతుంది కదా
ఎందుకు పొదిలోంచి మరొకటి తీస్తున్నావు
మా ఇరు దేహాలలో ఉండేది ఒకే ప్రాణం (వజ్జా లగ్గము)

డా. సుంకర గోపాల్



Thursday, December 19, 2024

ఈ దేశానికి నెహ్రూ తప్పించిన ఉపద్రవం

ఈ రోజు భారతదేశం ఎదుర్కొంటున్న పేదరికానికి, మతకలహాలకు, చైనా సమస్యకు, రాజ్యాంగసమస్యకు, ఒకప్పటి దేశవిభజనకు ఒకటేమిటి సకల అవస్థలకు జవహర్ లాల్ నెహ్రూయే కారణమని హిందుత్వవాదులు తమ ప్రచారయంత్రాంగంతో హోరెత్తిస్తారు. మరణించి 60 ఏళ్ళవుతున్నా నేటికీ నెహ్రూని భారతదేశానికి పట్టిన ఒక అరిష్టంగా, ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన ఒక చారిత్రిక ద్రోహిగా చిత్రీకరించటం జరుగుతోంది. కొందరైతే మరీ చిత్రంగా నెహ్రూ పూర్వీకులు ముస్లిమ్ మూలాలు కలిగి ఉన్నారని (కలిగిఉండటం ఏదో నేరంలా) అబద్దాలు ప్రచారం చేసారు.

నెహ్రూ ప్రధానమంత్రిగా నివసించిన భవనంలో ఆయన మరణానంతరం1966 లో Nehru Memorial Museum and Library ని స్థాపించారు. దీని పేరుమార్చబడి నెహ్రూ ఉనికి నేడు నామమాత్రంగా మిగిలింది. నెహ్రూ పాఠాలు క్రమేపీ పాఠ్యపుస్తకాలనుండి తొలగించబడుతున్నాయి. 75 వ భారత స్వాతంత్రదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని Indian Council for Historical Research వారు ప్రచురించిన ఒక పోస్టర్ లో నెహ్రూ చిత్రం లేదు. జైలుశిక్షరద్దుచేయమని బ్రిటిష్ వారిని క్షమాపణ అడిగిన చరిత్ర కలిగిన సావార్కర్ చిత్రం ఉంది. ముప్పై ఏళ్లపాటు బ్రిటిష్ వారితో పోరాడి, తొమ్మిదేళ్ళు జైళ్లలో మగ్గిన జవహర్ లాల్ నెహ్రూ పాత్ర ఈ దేశస్వాతంత్రోద్యమంలో గాంధిసరసన నిలుపదగినది.

ఎందుకు ఇంతవిషప్రచారం అంటే, భారతప్రజల సామూహిక చేతనలోంచి నెహ్రూ జ్ఞాపకాలను తుడిచివేయటమే లక్ష్యం. ఎందుకు తుడిచివేయాలి అనే ప్రశ్నకు ఒకే ఒక సమాధానం – ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా కాక లౌకిక, ప్రజాస్వామిక దేశంగా తీర్చిదిద్దినందుకు.
****
స్వాతంత్రోద్యమంలో నెహ్రూ జైళ్ళలో ఉన్నప్పుడు “Glimpses of World History, Discovery of India లాంటి గొప్ప చారిత్రిక విశ్లేషణాత్మక రచనలు చేసాడు. ఈ రచనలు శాస్త్రీయ దృక్ఫథంతో, సమాజంపట్ల ఆధునిక అవగాహనతో సాగుతాయి. స్వతంత్ర్య భారతదేశాన్ని నిర్మించటంలో నెహ్రూ పోషించిన పాత్రకు ఈ అవగాహనే ఆధారం.

ఐదువేల సంవత్సరాలక్రితపు సింధులోయనాగరికతనుండి మొదలుపెడితే, ఆర్యులు, ఇరానియన్ లు, గ్రీకులు పార్తియన్ లు, సింథియన్ లు, హూణులు, అరబ్బులు, టర్కులు, క్రిష్టియన్ లు, జొరాష్ట్రియన్ లు , మొఘలులు ఎందరో భారతదేశంలో ప్రవేశించి తమదైన ముద్రను భారతీయ సంస్కృతిపై వేసారు. శతాబ్దాలపాటు సాగిన విదేశీ వాణిజ్యం, వలసలు, పరస్పరకలయికల ద్వారా భిన్న ఆచారాలను, సంస్కృతులను స్వీకరించటం, అనుకరించటం, తనలో కలుపుకోవటం ద్వారా భారతదేశ ఆత్మ భిన్నత్వానికి ప్రతీకగా నిలిచిందని నెహ్రూ విశ్వసించాడు. వేదఋషులు, బుద్ధుడు, అశోకుడు, అల్లావుద్దిన్ ఖిల్జి, అమీర్ ఖుస్రో అక్బర్, వివేకానందుడు, గాంధి లాంటి వారి ఆలోచనలు భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని తీర్చిదిద్దాయని నెహ్రూ భావించాడు.
***
"జవహర్ లాల్ నెహ్రూ నా వారసుడు. రాజాజి కాదు, వల్లభాయ్ పటేలు కాదు. నేను వెళిపోయాకా నా ఆదర్శాలను కొనసాగించే వ్యక్తి నెహ్రూ అని నమ్ముతాను" అని గాంధీ 1942 నుంచే చెప్పసాగాడు. గాంధీ భావజాలాన్ని నెహ్రూ అంది పుచ్చుకొన్నాడు. వీళ్ళిద్దరి ఆలోచనలను “గాంధి-నెహ్రూ మోటిఫ్” గా నేడు చరిత్ర కారులు గుర్తిస్తున్నారు. ఈ గాంధి-నెహ్రూ మోటిఫ్ లో ప్రచలితమయ్యే సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, పేదలపట్ల పక్షపాతం, శాస్త్రీయ దృక్ఫథం అనే విలువలు భారతీయ ఆత్మగా చెప్పబడ్డాయి. పై విలువల ఆధారంగా నెహ్రూ స్వతంత్ర భారతదేశాన్ని తీర్చిదిద్దాడు.
****
దేశవిభజన ప్రపంచంలోనే అతిపెద్ద మానవ విస్థాపనం. ఐదు లక్షల మంది చనిపోయారు. మిలియన్ల కొద్దిప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆధునిక భారతదేశం ఎదుర్కొన్న మొదటి సంక్షోభం ఇదే. దేశవ్యాప్తంగా ఎక్కడచూసినా మతకల్లోలాలు. దేశానికి పెద్దదిక్కు అయిన మహాత్మాగాంధి మతోన్మాదానికి బలి అయ్యారు.

విభజిత భారతదేశాన్ని లౌకిక, ప్రజాస్వామిక విలువలపై నిర్మించాలని సంకల్పించిన గాంధి-నెహ్రు మోటిఫ్ పరీక్షకు పెట్టబడిన కాలం అది. హిందూమత ప్రాతిపదికన దేశనిర్మాణం జరగాలని పెద్ద ఎత్తున అల్లర్లు చుట్టుముట్టాయి. ఇంటిరిమ్ ప్రధానిగా ఉన్న నెహ్రూ, ఆనాటి డిప్యూటి ప్రధాని హోమ్ మంత్రిగా ఉన్న వల్లభాయ్ పటేల్ మద్దతుతో ఆర్.ఎస్.ఎస్. సంస్థను నిషేదించి సుమారు 25 వేలమంది దాని కార్యకర్తలను బందీ చేయించాడు.

ఇలాంటి దశలో ప్రజలందరకీ ఓటుహక్కుతో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడటం నెహ్రూ తీసుకొన్న అతిపెద్ద సాహసోపేతనిర్ణయం. ఈ రోజు భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం అని పిలవబడుతుందంటే ఆనాడు నెహ్రూ వేసిన పునాదే కారణం.

1951 ఎన్నికలు - భారతదేశం మతప్రాతిపదికన హిందూరాష్ట్రంగా ఉండాలా లేక లౌకిక, ప్రజాస్వామ్య దేశంలా ఉండాలా అనే రెండు నిర్ణయాలమధ్య జరిగిన రిఫరెండంగా భావించవచ్చు.
హిందూ రాష్ట్రంగా దేశాన్ని తీర్చిదిద్దాలని కోరుకొన్న హిందూ మహాసభ, జన సంఘ్, రామ రాజ్య పరిషద్ పార్టీలు 6 శాతం ఓట్లతో 489 సీట్లలో10 లోక్ సభ స్థానాలను పొందగా భారతదేశాన్ని ప్రజాస్వామ్య, సెక్యులర్ దేశంగా తీర్చిదిద్దుతామనే హామీతో ఎన్నికల బరిలో దిగిన నెహ్రూ నేత్రుత్వంలోని కాంగ్రెస్ 364 సీట్లు దక్కించుకొంది. ఇది ఆనాటి ప్రజల విజ్ఞత. వారు ఈ దేశం లౌకిక ప్రజాస్వామిక దేశంగా ఉండాలని కోరుకొన్నారు. నిజానికి చారిత్రికంగా అదే భారతదేశ ఆత్మ.
****
మతవాదులనుండి భారతదేశం ఎదుర్కోబోతున్న ప్రమాదాలను నెహ్రూ ఆనాడే గుర్తించాడు. ఆర్ ఎస్ ఎస్ పై విధించిన నిషేదాన్ని రెండేళ్ళ తరువాత తొలగించినపుడు “ఆర్ ఎస్ ఎస్ సంస్థ ఫాసిజ లక్షణాలను కలిగి ఉంటుంది, దాని కదలికలపై నిఘా పెట్టండి” అని నెహ్రూ వివిధ ముఖ్యమంత్రులను కోరాడు.

"భారతీయజనసంఘ్, మతం, సంస్కృతి పేరుతో ప్రజల మధ్య విషాన్ని, ద్వేషాన్ని వ్యాపింపచేస్తుంది" అని తన ఎన్నికల ప్రచారంలో విమర్శించాడు.

1952 ఎన్నికలలో విజయం సాధించాకా నెహ్రూ ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీలకు రాసిన ఒక ఉత్తరంలో “ఈ ఎన్నికలలో మతతత్వ శక్తులతో మనం నేరుగా కలబడి విజయం సాధించటం గొప్ప విషయం. కానీ ఈ విజయం సంపూర్ణం కాదు. మతతత్వ శక్తుల పట్ల మనం మరింత అప్రమత్తతతో ఉండాలి” అని హెచ్చరించాడు.

“మతం ఆధారంగా ఎవరైనా మరొక వ్యక్తిపై చేయి ఎత్తితే, ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని వనరులను అతనిపై ఉపయోగించి అతన్ని నిలువరిస్తాం” అంటూ 1951 లో మహాత్మగాంధి జయంతి రోజున చేసిన ప్రసంగంలో అన్నాడు.

మతతత్వ శక్తులపట్ల నెహ్రూ అంచనాలు వాటిని నిలువరించిన విధానం పై మాటల ద్వారా అర్ధం చేసుకొనవచ్చు.
****

భారతదేశంలో ఉన్న భిన్న భాషలు, సంస్కృతులు, మతాలు, సామాజిక ఆర్ధిక స్థితిగతులు అన్నీ మనుగడసాగించాలంటే స్వేచ్ఛాయుత పరిస్థితులల్లో ప్రజాస్వామ్యం ఉండాలని నెహ్రూ అభిప్రాయపడ్డాడు. దాదాపు ఇదే భావనను సమకాలీనంగా "మతతత్వ ఫాసిజం వల్ల భారత ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లనుంది" అని అమర్త్యసేన్ అంటారు.

దేశం యొక్క సార్వభౌమత్వం ఆ దేశం ఆర్ధికంగా నిలదొక్కుకున్నప్పుడే సిద్ధిస్తుంది అని నమ్మిన నెహ్రూ అనేక పబ్లిక్ రంగ సంస్థలను స్థాపించి పారిశ్రామికీకరణకు; పెద్దపెద్ద ఆనకట్టలను నిర్మించి వ్యవసాయాభివృద్ధికి; వివిధ ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పి విద్యాభివృద్ధికి; అనేక పరిశోధనా సంస్థలను స్థాపించి శాస్త్ర సాంకేతిక ప్రగతికి బాటలు వేసాడు. సాహిత్య అకాడెమి, లలిత కళా అకాడమీ, సంగీత్ నాటక్ అకాడమీలు స్థాపించి సాంస్కృతిక పరిరక్షణ చేసాడు. ఇవన్నీ ఆధునిక భారతదేశపు పునాదులు.

ముగింపు

1. నెహ్రూ పాలనని మతాన్ని వేరు చేసాడు. భిన్నత్వాన్ని అంగీకరించి ప్రజలందరూ ఒకరిని ఒకరు గౌరవించుకొంటూ, కలుపుకొనిపోతూ కలిసిమెలసి జీవించాలని ఆకాంక్షించాడు. ఇది మతవాదులకు నచ్చలేదు. మెజారిటేరియన్ మతంగా హిందూమతం ఇతరులపై ఆధిపత్యం సాగించాలని వారు ఆశించారు. దీనికి నెహ్రూ తనజీవితకాలంలో అనుమతించలేదు.

2. దేశవిభజన విషయంలో నెహ్రూ తొందరపడ్డాడని మతవాదులు ఆరోపిస్తారు. దేశవిభజన ఆనాటికి ఒక చారిత్రిక ఆవశ్యకత. జిన్నా నాయకత్వంలోని ముస్లిమ్ లీగ్ పాకిస్తాన్ ఏర్పాటుపై గట్టిగా పట్టుబట్టింది. “డైరెక్ట్ యాక్షన్” కు పిలుపునిచ్చింది.

ఇలాంటి సందర్భంలో దేశవిభజన నిలుపుచేసే శక్తి నెహ్రూకి కానీ గాంధీకి కానీ లేకుండాపోయింది.

మతకల్లోలాలలో చెలరేగిన హింస తన ప్రాణాలకు ప్రమాదం కలిగించే నేపథ్యంలో కూడా - నెహ్రూ వీధుల్లో తిరుగుతూ ఇరుపక్షాలను సర్ది చెప్పేందుకు యత్నించాడు. బీహార్‌లో ఒక సందర్భంలో, "నేను హిందూ-ముస్లిం అల్లర్ల మధ్యదారిలో నిలబడి ఉన్నాను. ఇరుపక్షాలకు చెందినవారు ఒకరిపై ఒకరు దాడి చేయాలనుకుంటే, అది నా శవం మీదుగా చేయాలి" అని నెహ్రూ అన్నాడు. నెహ్రూ ఆ మాటలు పలికినప్పుడు, ఆయనను ఉన్నత వర్గానికి చెందిన ఒక విలాసవంతులైన వ్యక్తిగా చిత్రించే ధోరణికి భిన్నంగా అనిపిస్తుంది.

విభజనానంతర దేశాన్ని రాజకీయంగా స్థిరపరచటం, శాంతిని పునరుద్దరించటం, ప్రగతి పథంలో నడిపించటం లాంటి కీలక అంశాలలో నెహ్రూ పాత్ర చాలా విలువైనది.

3. జవహర్ లాల్ నెహ్రూ పండితుడు. చరిత్రను, ప్రపంచ గమనాన్ని అర్ధం చేసుకొన్న పండితుడు. మానవజాతి పరిణామక్రమంలో మతం ఆదిమ లక్షణంఅని, స్వేచ్ఛ, సమానత్వం ఆధునిక లక్షణాలని ఎరుక కలిగినవాడు. భారతదేశ వైవిధ్యం, బహుళతపై అవగాహన కలిగినవాడు. స్వతంత్రభారతదేశాన్ని లౌకిక, ప్రజాస్వామిక దేశంగా మలచాడు.

గాంధీ హత్యద్వారా అల్లకల్లోలం సృష్టించి, నెహ్రూను ఒంటరిని చేసి దేశాన్ని హిందూరాష్ట్రంగా చేసెయ్యాలని ఆశించిన మతతత్వ శక్తులను శాయశక్తులా ఎదుర్కొన్నాడు. హిందూ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకొన్నాడు. ఇది మతవాదులకు నచ్చలేదు. నెహ్రూ పై హిందుత్వవాదుల ద్వేషానికి మూలాలు ఇక్కడ ఉన్నాయి.

4. సోమనాథ్ ఆలయం, అయోధ్య లాంటి హిందూ ఆలయాలను పునర్నిర్మించటంలో నెహ్రూ అలసత్వం ప్రదర్శించాడనే మరొక విమర్శ చేస్తారు. ప్రభుత్వానికి మతానికి సంబంధం ఉండకూడదనేది నెహ్రూ ఆలోచన. అంతే కాక చారిత్రిక దాడులలో జీర్ణమైన ఆలయాలజోలికి పోవటం ”గాయాలను” పెద్దవిచేసుకోవటమే అనే భావన కూడా ఉండొచ్చు.

5. నెహ్రూ మిశ్రమ ఆర్ధిక విధానాలను విమర్శిస్తారు కానీ భారతదేశం ఆర్ధికంగా, సామాజికంగా పరిపుష్టి చెందటంలో మిశ్రమ ఆర్ధిక విధానాలే కారణం. ఈనాడు పబ్లిక్ రంగ సంస్థలు, విమానాశ్రయాలు, గనులు, పోర్టులు, అడవులు, టెలికామ్, ఇన్సూరెన్స్ లాంటి ప్రజల ఆస్తులు విక్రయానికి గురవుతూ, ఎవరి జేబులు నిండుతున్నాయో ఆలోచిస్తే నెహ్రూ ఆర్ధికవిధానం ప్రజలకు ఏ మేరకు మేలు చేసిందో అర్ధమౌతుంది.

6. నేటి హిందుత్వ వాదులు నెహ్రూ కి ప్రత్యామ్నాయంగా పటేల్ ని సావార్కర్ ని ప్రతిష్టిస్తున్నారు. గాంధి, నెహ్రూ, పటేల్ లు దేశభక్తులు. దేశ సమగ్రత కోరుకొన్నారు. ముగ్గురూ సమన్వయంతో దేశాభ్యున్నతికొరకు కలిసి పనిచేసారు. గాంధి 1948 లో, పటేల్ 1950 లో మరణించటంతో నెహ్రూ ఒంటరి అయిపోయాడు. ఇక భారతదేశ చరిత్రలో వీరసావార్కర్ పాత్ర వివాదాస్పదమైనది ఇతను నేడు సర్వత్రా నడుస్తున్న హిందుత్వ ఐడియాలజీకి ఆద్యుడుగా చెప్పుకోవచ్చు. ఇది విభజన, ద్వేషం నింపుకొన్న మార్గం. గాంధి- నెహ్రూ- పటేల్ ల మధ్య ఇమడనిది.

1951 ఎన్నికలలో నెహ్రూకు 75% స్పష్టమైన ప్రాతినిధ్యం ఇచ్చారు ప్రజలు. డా.అంబేద్కర్ సహాయంతో జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్ర్య భారతావనికి గొప్ప రాజ్యాంగాన్ని ఏర్పరచి, లౌకిక, ప్రజాస్వామిక దేశంగా తీర్చిదిద్దారు. నేడు కొందరు నెహ్రూ పేరును భవనాలకు సంస్థలకు తొలగిస్తూ, అతనిపై అబద్దాలు కట్టుకథలు ప్రచారం చేస్తున్నారు. వాటి వెనుక ఉద్దేశం ఒకటే, మెజారిటేరియన్ వాదాన్ని ఒప్పుకోలేదన్న కోపం. ఎందుకు ఒప్పుకోలేదో ఏనాటికైనా సత్యం అందరూ తెలుసుకొంటారు. ఈ దేశానికి నెహ్రూ తప్పించిన ఉపద్రవాన్ని గుర్తుచేసుకొంటారు.

బొల్లోజు బాబా






Saturday, December 14, 2024

ప్రాచీన గాథలు- అనువాద కవిత్వం


ప్రాచీన గాథలు.

ప్రాచీన గాథలు పుస్తకం కావలసిన వారు 7989546568 నంబరు లేదా chaayabooks com వెబ్సైట్ వద్ద పొందవచ్చును.

పేజీలు 254, ఆఫర్ ధర 250/- రూపాయలు, ఫ్రీ షిప్పింగ్.

అమజాన్ లో లభించు లింకు



బొల్లోజు బాబా







Friday, November 29, 2024

ప్రార్థనా మందిరాల వివాదం: చట్టం, సమాజం, సమతుల్య దృక్పథం


ఇటీవలి కాలంలో మసీదులు, దర్గాలు, చర్చిల కింద శివలింగాలు ఉన్నాయని, వాటిని తవ్వి బయటపెట్టాలని, హిందువులకు ఆ ప్రదేశాల్లో పూజలు చేసుకోవటానికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేసే వాదనలు పెరుగుతున్నాయి. ఈ వాదనలు సాధారణంగా మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉండటం గమనార్హం.

ఈ రకమైన ప్రచారాల వెనుక అసలైన ఉద్దేశాలు ఏమిటి?

మతసామరస్యానికి చెక్ పెట్టడం: దేశంలో ఇప్పటికే మెరుగులేని స్థితిలో ఉన్న మతసామరస్యాన్ని పూర్తిగా చెరిపేయడం.

ప్రజల దృష్టిని మళ్లించడం: అసలు చర్చించాల్సిన ముఖ్యమైన ఆర్థిక, సామాజిక సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చి, నిరర్థకమైన వాదనలపై దృష్టి పెట్టించడం.

రాజకీయ లబ్ధి: మెజారిటీ మతాన్ని దేశపు అధికారిక మతంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించడం.

చట్టం ఏమంటుంది?

1991లో భారతదేశ పార్లమెంట్ ప్రవేశపెట్టిన Places of Worship Act ప్రకారం,

1947, ఆగస్టు 15 నాటికి ఏ ప్రార్థనా స్థలం ఏ మతానికి చెందుతుందో, అది ఆ మతానికి మాత్రమే చెందుతుంది.

ఈ చట్టం ప్రకారం, ఎటువంటి ప్రార్థనా స్థలాన్నీ ఇతర మతాలకు మార్చడం నిషిద్ధం.

నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి.

చట్టం రామజన్మభూమి వివాదానికి మినహాయింపు ఇచ్చింది, కానీ దేశంలోని ఇతర అన్ని ప్రార్థనా స్థలాలకు ఈ చట్టం వర్తిస్తుంది.

చట్టాన్ని దాటి బయటకు వెళ్తున్న ప్రస్తుత పరిస్థితి

నేడు కొన్ని వర్గాలు చట్టాన్ని అవమానిస్తూ ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనాలయాలను హిందూ మతంలోకి మార్చాలని కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నాయి. ఈ చర్యలు సమాజంలో విభజన, ద్వేషాన్ని పెంచడం తప్ప మరేమీ చేయవు.

ఈ తవ్వకాల పరిణామాలు

మన దేశం గొప్ప వైవిధ్యానికి నిలయం. మతం, సంస్కృతి, సంప్రదాయాలలోనూ ఈ వైవిధ్యం ప్రస్ఫుటమవుతుంది.

చరిత్రపరమైన సమస్య: తవ్వకాల్లో హిందూ మతానికి సంబంధించిన వస్తువులు మాత్రమే బయటపడతాయనే నమ్మకానికి ఆధారాలు లేవు.

సామాజిక విబేధం: ఇటువంటి చర్యలు వివిధ మతాల మధ్య విభేదాలను మరింతగా పెంచుతాయి.

సంస్కృతికి వ్యతిరేకం: వైవిధ్యానికి మించిన విలువ మనకు లేదు. మన దేశ సౌందర్యం ఈ వైవిధ్యంతోనే నిలబడింది.

మనకు కావాల్సినది ఏమిటి?

అన్ని మతాలకు సమానమైన గౌరవం, సమాన హక్కులు కల్పించడమే భారత రాజ్యాంగం మూలసిద్ధాంతం.

మతసామరస్యం: ప్రతి మతాన్ని గౌరవించడం, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడం మన బాధ్యత.

చరిత్రను సరిదిద్దడం కాదు: చరిత్రను ఆధునిక రాజకీయ అవసరాలకు ఉపయోగించడాన్ని నిరోధించాలి.

ముగింపు

ఇటువంటి అనవసర వాదనలు మన దేశ బలం అయిన వైవిధ్యాన్ని దెబ్బతీయవచ్చు. మతసామరస్యాన్ని, మన సంప్రదాయ విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. చట్టాన్ని గౌరవించడం, వివేకంతో నడుచుకోవడం, విభేదాలను పక్కన పెట్టి సమైక్యతను బలపరచడం అత్యవసరం.

- బొల్లోజు బాబా

Saturday, November 9, 2024

సనాతనవాదులకు మాక్స్ ముల్లర్ అంటే ఎందుకు అంత ద్వేషం

1. జననం విద్యాభ్యాసం

మాక్స్ ముల్లర్ (1823-1900) జర్మనీలోని డెస్సౌ అనే ఊర్లో , 6, డిశంబరు 1823 న జన్మించాడు. 1843 లో సంస్కృతం, గ్రీక్, లాటిన్ ప్రాచీనభాషల అధ్యయనంలో Leipzig యూనివెర్సిటీనుండి డిగ్రీ పొందాడు. ఫ్రొఫెసర్ Brockhaus వద్ద సంస్కృతం నేర్చుకొని 1844 లో మొదటగా హితోపదేశ అనే సంస్కృత గ్రంథాన్ని ఇంగ్లీషులోకి అనువదించాడు. వేదాలను అనువదించటం కొరకు రాతప్రతులను సేకరించటం మొదలుపెట్టాడు.

2. ముల్లర్ ఏం చేసాడు

మాక్స్ ముల్లర్1848 లో ఆక్స్ ఫర్డ్ లో స్థిరపడ్డాడు. ఆక్స్ ఫర్డ్ యూనివెర్సిటీలో ప్రాచీన భారతీయ భాషల అధ్యయన కేంద్రానికి ఇతను వ్యవస్థాపకుడు. ఋగ్వేద అనువాదం మొదటి సంపుటిని “ఋగ్వేద సంహిత” పేరుతో 1849 లో వెలువరించాడు. కొన్నేళ్ళకు మరో ఐదు సంపుటాలు తీసుకొచ్చాడు. 1874 నాటికి ఋగ్వేద అనువాదం పూర్తయింది. ఇతర వేదాలపై వ్యాసాలు రాసాడు తప్ప పూర్తి అనువాదం చేయలేదు.

ముల్లర్ రచనల ద్వారా యూరోపియన్ సమాజంలో హిందూమతం పట్ల ఆసక్తి పెరిగింది. సంస్కృతభాషపై ముల్లర్ చేసిన రచనలలో “Handbook for the Study of Sanskrit,” a “Sanskrit-English Dictionary and Grammar,” లాంటి పుస్తకాలు అప్పట్లో సంస్కృతం నేర్చుకోవాలనుకొనే వారికి ఎంతగానో ఉపయోగపడేవి.

సంస్కృత సాహిత్యాన్ని సరైన దృక్పథంతో అధ్యయనం చేస్తే, గొప్పమానవీయ విలువలు కనిపిస్తాయి. గ్రీకు సాహిత్యం కూడా మనకు బోధించలేని పాఠాలు దానిలో దాగి ఉన్నాయి అని ముల్లర్ సంస్కృత వాజ్ఞ్మయాన్ని ప్రశంసించేవాడు .

హిందు, బౌద్ధ, జైన, ఇస్లామ్ మతాలకు చెందిన గ్రంథాలను “Sacred Books of the East” అనే పేరుతో 50 సంపుటాలుగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తీసుకొని వచ్చింది. వీటికి ముల్లర్ ఎడిటర్ గా వ్యవహరించాడు.

మాక్స్ ముల్లర్ ప్రపంచ మతాల తులనాత్మక అధ్యయనానికి ఆధ్యుడు. 1856 లో “Comparative Mythology” పేరుతో ముల్లర్ ప్రతిపాదించిన కొత్త రీసెర్చ్ ప్రక్రియకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు వచ్చింది. వివిధ సంస్కృతుల మధ్య సంబంధాలను, వాటి పరిణామక్రమాన్ని తులనాత్మక విశ్లేషణ చేయటం చేయటం ద్వారా వాటి చారిత్రిక సంబంధబాంధవ్యాలను అంచనా వేయవచ్చు అనేది ఇతని ఆలోచన. ఉదాహరణకు ఈ పద్దతిలో – భిన్న నాగరికతలలో సూర్యుడిని ఏ విధంగా దర్శించారో గమనించటం ద్వారా ఆయా నాగరికతల చారిత్రిక పరిణామాన్ని పోల్చవచ్చుననేది ఇతని ప్రతిపాదన.

ముల్లర్ ద్వారా భారతీయ ఆథ్యాత్మిక గ్రంథాలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. భాష, పురాణాలు, మతం ఈ మూడింటి ద్వారా మానవ ఆలోచనా పరిణామాన్ని పట్టుకోవటానికి ఇతను ప్రయత్నించాడు. ఋగ్వేద అనువాదం ముల్లర్ కు గొప్ప పేరు తీసుకొచ్చింది. 

3. వేదాల్లో ఏమున్నాయి

వేదాలను ప్రమాణంగా అంగీకరించేవారు, వేదాలను వ్యతిరేకించేవారు అనే రెండు సమూహాలుగా ప్రాచీన భారతదేశం విడిపోయింది. వేదాలను అంగీకరించినవారిని వేదావలంబులు/హిందువులు అని, తిరస్కరించిన బౌద్ధ, జైన, ఆజీవిక, చార్వాక, కాపాలిక విశ్వాసులను "వేదబాహ్యులు" అనీ విభజించారు. వేదాలు మనుష్యులెవరూ రాయనివి అంటారు.

వేదాలు నాలుగు. ఋగ్వేదంలో దేవతల కీర్తనలు; యజుర్వేదంలో యజ్ఞముల నిర్వహణా విధానం; సామవేదంలో పాడుకొనేందుకు వీలుగా మలచిన కీర్తనలు. అథర్వణవేదంలో క్షుద్రశక్తులకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి.

ఈ నాలుగు వేదాలనే మరలా నాలుగు భాగాలుగా చేసారు. అవి సంహితలు (మంత్రాలు), బ్రాహ్మణాలు (క్రతువుల విధానాలు), ఆరణ్యకాలు (వేదాంత చర్చలు) ఉపనిషత్తులు (ఆథ్యాత్మిక బోధనలు). ఇవీ వేదాలలో ఏమున్నాయి అనే ప్రశ్నకు పండితులు ఇచ్చే స్థూల వివరణ.

వేదాలను దళితబహుజన దృక్ఫథంతో తరచి చూసినపుడు ఈనాటి అనేక సామాజిక అవ్యవస్థలకు మూలాలు వేదసాహిత్యంలో ఉన్నాయని అర్ధమౌతుంది.

ఎ. నిచ్చెన మెట్ల వర్ణవ్యవస్థ:
వేదాలపై ప్రధాన విమర్శ నిచ్చెనమెట్ల వర్ణవ్యవస్థను ప్రతిపాదించి, సమాజంలో దానిని స్థిరపరచటం. ఋగ్వేదంలో పురుషసూక్తంలో భగవంతుని ముఖంనుండి బ్రాహ్మణులు, భుజములనుండి క్షత్రియులు, తొడలనుండి వైశ్యులు, పాదములనుండి శూద్రులు ఉద్భవించారని చెప్పబడింది. దీని ఆధారంగా సమాజం భిన్న అంతస్థులుగా విభజింపబడింది. శూద్రులు పై మూడు వర్ణాలవారిని సేవించుకోవాలని చెప్పబడింది. ఈ నాలుగు వర్ణాలకు వెలుపల చంఢాలురు (అస్పృశ్యులు) ఉంటారు. నేటికీ కూడా సమాజంలో అవే విభజనలు కొనసాగటానికి వేదాలే కారణమని డా. బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా ఫూలే లాంటి ఆధునిక కుల వ్యతిరేక మేధావులు విమర్శించారు.

బి. కర్మకాండలకు ప్రాధాన్యత:
వేదాలలో యజ్ఞయాగాదులకు, కర్మకాండలకు విపరీతమైన ప్రాధాన్యత ఉండటం, ఆ ప్రక్రియలో జరిగే అసంఖ్యాకమైన జంతుబలులలో ఉండే హింసను, అశాస్త్రీయతను- బౌద్ధం, ఆజీవికం, చార్వాకం లాంటి మతాలు వ్యతిరేకించాయి.

సి. స్త్రీలు, శూద్రులకు స్థానం లేదు:
ఈ వైదిక కర్మకాండలలో స్త్రీలకు, శూద్రులకు ఏ రకమైన పాత్ర లేకపోవటం కూడా వేదాలపట్ల ఒక విమర్శ.

సి. అనార్యప్రజలపై దాడి వారి నగరాల దహనం:
వేదాలు ఆర్యుల సాహిత్యం. ఆర్యులు c2000 BCE లో Pontic-Caspian steppe (ఉక్రయిన్, రష్య, కజకిస్తాన్) ప్రాంతాలనుంచి భారతదేశంలోకి ప్రవేశించిన Yamnaya Steppe pastoralist లు. వీరు భారతదేశం రావటానికి ముందే ఇక్కడ స్థానిక ప్రజలు వేల సంవత్సరాలుగా హరప్పా నాగరికతను నిర్మించుకొన్నారు. ఇది మూలవాసుల సంస్కృతి.

ఈ ఆర్యులు తాము రాసుకొన్న వేదాలలో శత్రువుల పురాలను/మూలవాసుల నగరాలను నాశనం చేయమని ఇంద్రుని ప్రార్థించే సూక్తాలు అనేకం ఉన్నాయి. ఇంద్రునికి పురందరుడు (నగరాలను ధ్వంసం చేసేవాడు) అని పేరు. ఈదేశ మూలవాసులైన అనార్య స్థానిక తెగలకు చెందిన వ్యక్తులను, అసురులు, దస్యులు అని వేదాలలో పిలిచారు

ఇంద్రుడు 30 వేలమంది దాసుల్ని., వృత్రాసురుడిని చంపినట్లు ఋగ్వేదంలో ఉంది. (4.30.210). మధ్య ఆసియానుంచి వలస వచ్చిన ఆర్యులు స్థానిక హరప్పా నగరాలను, ప్రజలను ధ్వంసంచేయటంగా ఈ ఉదంతాలను అర్ధం చేసుకోవాలి.

శత్రువుల గర్భంలోని పిండాలను కూడా నాశనం చెయ్యాలని దేవతలను కోరుతూ ఆర్యులు రాసిన సూక్తులు వేదాలలో ఉన్నాయి. అనార్య రాజైన శంబరాసురుడు తమ సంస్కృతిని కాపాడుకోవటం కొరకు ఇంద్రునితో పోరాడినట్లు వేదాలలో ఉంది.

ఆవిధంగా ఆర్యులు స్థానిక అనార్యులపై సాగించిన దండయాత్రలు వేదాలలో విపులంగా వర్ణించబడ్డాయి. ఆర్యులు స్థానికులపై దండయాత్ర జరిపినట్లు చెప్పటానికి వేదాలే గొప్ప సాక్ష్యం. Steppe ancestry ని సూచించే R1 haplogroup జన్యువు పై సాగించిన ఆధునిక ప్రయోగాలు కూడా ఆర్యుల వలస జరిగినట్లు నిర్ధారిస్తున్నాయి.

4. సనాతన పండితుల అభ్యంతరాలు ఏమిటి?
.
ఎ. రహస్యం బట్టబయలు:
హిందూ పండితులు వేదాలను, సంస్కృత భాషను దాదాపు మూడు వేల సంవత్సరాలనుండి కాపాడుకొంటూ వచ్చారు. వేదాలను శూద్రుల ఎదుట చదవరాదని, ఎవరైనా శూద్రుడు వేదాలను వింటే వారి చెవుల్లో సీసం పొయ్యాలని లాంటి ఆంక్షలు విధించి వేదాలను తమకు మాత్రమే చెందిన రహస్యసొత్తుగా నిలుపుకొన్నారు.

1783 లో సుప్రీమ్ కోర్టు జడ్జ్ విలియం జోన్స్ సంస్కృతం నేర్చుకోవటానికి ప్రయత్నించగా, బ్రాహ్మణులు ఎవరూ నేర్పటానికి అంగీకరించలేదు. అతను ఒక అబ్రాహ్మణ వైద్యుని వద్ద నేర్చుకొన్నాడు. 1786 నాటికి సంస్కృత గ్రంథాలను ఇంగ్లీషులోకి అనువదించగలిగే ప్రావీణ్యాన్ని సంపాదించగలిగాడు. మనుస్మృతిని జోన్స్ ఇంగ్లీషులోకి తానే అనువదించాడు.

వేదాలను అనువదించటం ద్వారా ఈ గుట్టును బట్టబయలు చేసాడు మాక్స్ ముల్లర్. హిందూమతానికి ఆయువుపట్టైన ఈ వేదాలలో ఏముందో ప్రజలందరూ తెలుసుకొని బ్రాహ్మణులు ఇన్ని శతాబ్దాలుగా ఈ సమాజంపై తమ ఆధిపత్యం నిలుపుకోవటం కొరకు ఎన్నెన్ని పన్నాగాలు పన్నారో అందరికీ తెలిసిపోయింది. ఈ అవమానకర పరిస్థితులనుండి ఎదుర్కోవటానికి- మాక్స్ ముల్లర్ వేదాలను తప్పుగా అనువదించాడని; కలోనియల్ కోణంలోంచి చూస్తూ పవిత్రమైన వేదాలను అందులోని రహస్యాలకు వక్రభాష్యం చెప్పాడని; లక్షల సంవత్సరాల భారతీయ చారిత్రిక కాలక్రమాన్ని తప్పుగా చూపాడని సనాతన పండితులు వాదించటం మొదలుపెట్టారు.

వేదాలలో గొప్ప గొప్ప సంగతులు ఉన్నాయని, ఆధునిక బహుజన మేధావులు చెబుతున్నట్లు అందులో అనార్యుల అణచివేత, వర్ణవ్యవస్థమూలాలు లాంటి విషయాలు ఏమీ లేవని ఇంకా వంచించేందుకే సనాతన పండితులు ఇలాంటి వాదనలు చేస్తున్నారని సులువుగానే అర్ధం చేసుకొనవచ్చును.

బి. వేదాలలో అన్నీ ఉన్నాయష:
వేదాలలో ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన అనేక అంశాలు శ్లోకాల రూపంలో ఉన్నాయని సనాతన పండితులు ప్రచారం చేస్తారు. పైథాగరస్ సిద్ధాంతము, అణుబాంబు తయారీ, కాంతివేగము, పుష్పక విమానాల తయారీ, కాస్మాలజీ, క్వాంటం థీరి, ఖగోళ భౌతిక శాస్త్రము, ఆధునిక వైద్యం, గణితశాస్త్ర సిద్ధాంతాలు లాంటి అనేక శాస్త్రీయ విషయాలు సంకేతరూపంలో వేదశ్లోకాలలో నిక్షిప్తం చేయబడ్డాయి అని వాదిస్తారు. మాక్స్ ముల్లర్ అనువాదాలలో ఇలాంటి అంశాలపై కనీస ప్రస్తావనలు లేకపోవటం ఇతని పట్ల సనాతన పండితుల ఓర్వలేనితనానికి ఒక కారణం కావొచ్చు.

అలాగని ఈ పండితులు వేదాలలో ఉన్నట్లు చెబుతున్న ఈ అంశాలపై సైంటిఫిక్ జర్నల్స్ లో పేపర్స్ రాసి అంతర్జాతీయ శాస్త్రవేత్తల అంగీకారం పొందారా అంటే అదీ లేదు. ఈనాటికి కూడా వేదాలలో అన్నీ ఉన్నాయి అంటూ మాటలు చెబుతారు

సి. మాక్స్ ముల్లర్ కలోనియల్ ఏజంటా?
మాక్స్ ముల్లర్ పై సనాతన పండితులు చేసే మరొక అభియోగం ఏమిటంటే- వేదాలపై భారతీయులకు విశ్వాసం కోల్పోయేలా అనువదించటానికి బ్రిటిషర్స్ ముల్లర్ ను నియమించారని. దీనికి ఆధారంగా ముల్లర్ తన భార్యకు December 9, 1867 న రాసిన ఒక లెటర్లో “ he was especially employed to translate the Vedas in such a way that the Hindus lose faith in them” అని రాసినట్లు ఒక అబద్దాన్ని చెబుతారు.

నిజానికి ఆ లెటర్ లో పైన చెప్పిన వాక్యాలు లేవు. - It is the root of their religion, and to show them what that root is, I feel sure, the only way of uprooting all that has sprung from it during the last 3,000 years.” అనే వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలలో - మూడువేల సంవత్సరాలుగా వేదాల చుట్టూ పేరుకొన్న అభూతకల్పనలని, చెత్తా చెదారాన్ని తొలగించి నిజమైన సత్యాన్ని భారతీయులకు చూపటమే నా లక్ష్యం అని ముల్లర్ భావంగా అర్ధం చేసుకోవాలి. ఈ విషయం భారతీయులు తెలుసుకొనే సమయానికి నేను జీవించి ఉండకపోవచ్చును అని కూడా అంటాడు. అలాంటి ఉదాత్తమైన  వాక్యాన్ని సనాతన పండితులు వక్రీకరించారు.

నిజానికి వేదాలను అనువదిస్తూ ముల్లర్ ఎంతో ఉద్వేగాన్ని ఆథ్యాత్మిక అనుభవాలను పొందినట్లు తనపుస్తకాల ముందుమాటలలో, ఉత్తరాలలో, ప్రసంగాలలో చాలా సార్లు చెప్పాడు. India, What can it Teach us (1882) పుస్తకంలో సంస్కృత వాజ్ఞ్మయం గ్రీకు కన్న గొప్పది అని అని ప్రశంసించాడు. బున్సెన్ అనే మిత్రునికి రాసిన ఒక లేఖలో “వేదాలను చదువటం నాకెంతో ఆనందకరం. అవి నాకు ఉదయపు వెలుగులా, స్వచ్ఛమైన మలయమారుతంలా ఎంతో తేటగా, సత్యవాక్కులా అనిపిస్తాయి” అంటూ ముల్లర్ తాను వేదాలను చదవటంద్వారా పొందిన పరవశతను చెప్పాడు. ముల్లర్ ఈ పనిని వేదాలపై గౌరవంతో చేసాడు తప్ప ఎవరినో మోసగించటానికి కాదు.

డి. ముల్లర్ అనువాదం విశ్వసనీయమైనది కాదా?
ఈ వాదన చేసింది- ఆర్యసమాజ స్థాపకుడైన దయానంద సరస్వతి, బాలగంగాధర తిలక్, అరబిందో వంటి వారు. వీరు, వేదాలు అనేవి ఆథ్యాత్మిక అనుభవాలు; ప్రతీ శ్లోకం వెనుక అనేక పొరలలో అర్ధాలు ఉంటాయి; వేదాలను ప్రాచీనమానవుని ప్రార్థనలుగానో, ఇంద్రుడు అగ్ని వాయు లాంటి దేవుళ్ళను ఉత్త ప్రాకృతిక శక్తులుగానో చూడరాదు అని వాదించారు.

ఈ సందర్భంగా ఎనిమిదోశతాబ్దపు జైనకవి అయిన ఉద్యోతన సూరి చెప్పిన “పదాలకు నానార్ధాలతో, వాక్యనిర్మాణానికి వందల మెలికలతో అర్ధం చేసుకోవటానికి కష్టంగా ఉంటుంది సంస్కృత భాష” అనే మాటలు ప్రస్తావనార్హం. భాష కారణంగా వేదాలకు భిన్న భాష్యాలు చెప్పే అవకాశం ఏర్పడింది. మూడువేల సంవత్సరాలుగా చేస్తున్న భిన్న వ్యాఖ్యానాల వల్ల వేదాలలో అన్నీ ఉన్నాయష అనే నానుడి స్థిరపడిపోయింది.

మాక్స్ ముల్లర్ వేదాలను భిన్నపొరలలో చూడలేదు. వాటిని “భౌతిక దృష్టితో చూసి చారిత్రిక కోణంలోంచి” అనువదించాడు. ఇది యురోపియన్ శాస్త్రీయ పద్దతి. ఈ పని చేయటానికి ముల్లర్ తన పూర్తి జీవితాన్ని ధారవోసాడు. అలా శాస్త్రీయంగా వేదాలను అనువదించటం సనాతన పండితులకు నచ్చలేదు.

వేదాలకు మాక్స్ ముల్లర్ చేసిన అనువాదం మొదటిదీ కాదు, చివరదీ కాదు. రాజారామ్మోహన్ రాయ్ ముల్లర్ కన్నా ముందే 1835 నాటికే వేదాలలోని కొన్ని భాగాలను ఇంగ్లీషులోకి అనువదించాడు మాక్స్ ముల్లర్ తరువాత, Ralph Griffith, A.B. Keith, Arabindo, Dayananda Saraswati, S. Radhakrishnan, P. Lal, Swami Prabhupada, Wendy Doniger, Swami Sivananda లాంటి అనేకమంది వేదాలను పూర్తిగానో, కొద్ది భాగాలనో అనువదించారు. వీటిలో స్వదేశీయులు చేసినవి కూడా ఉన్నాయి.
వేదాలకు ఇన్ని స్వదేశీ అనువాదాలు ఉండగా మాక్స్ ముల్లర్ పేరు సనాతన పండితులు పదే పదే చర్చలోకి ఎందుకు తీసుకొని వస్తారంటే- మాక్స్ ముల్లర్ శాస్త్రీయదృష్టితో అనువదించటమే కాక వేదాలకు చారిత్రిక కాలనిర్ణయం చేసాడు. వేదాలను రచించిన ఆర్యులు విదేశీయులు అని ప్రతిపాదించాడు. ఇవి రెండూ ముల్లర్ ని నేటికీ ద్వేషించటానికి బలమైన కారణాలు. ఈ రోజు జన్యుపరీక్షలు అందిస్తున్న విజ్ఞానం ప్రకారం ఈ రెండు విషయాలు సత్యాలుగా నిరూపితమవుతూండటం మాక్స్ ముల్లర్ ద్రష్టత్వానికి, మేధస్సుకు గొప్ప నిదర్శనం.

5. ఆర్యుల దాడి సిద్ధాంతం, వేదకాల నిర్ణయం

భాషలను, సంస్కృతులను, మతాలను ముల్లర్ తులనాత్మక అధ్యయనం చేసాడు. ఆ పరిజ్ఞానంతో వేదాలను రచించిన ఆర్యులు మధ్య ఆసియా నుంచి 1500 BCE లో భారతఖండంలోకి ప్రవేశించి ఉంటారని ప్రతిపాదన చేసాడు. అలా వచ్చిన ఆర్యులు తమతో పాటు వేద సంస్కృతిని, సంస్కృతభాషను ఉత్తరభారతదేశంలోకి తీసుకొని వచ్చారని అన్నాడు. ఆ ప్రకారం చూసినప్పుడు వేదాలలో అత్యంత ప్రాచీనమైన ఋగ్వేదం BCE1500-1200 మధ్య రాయబడి ఉంటుందని ముల్లర్ అభిప్రాయపడ్డాడు.
అది సనాతన పండితులకు అంగీకారం కాలేదు ఎందుకంటే వేదాలు కనీసం BCE 5000 నాటివి అని వీరి విశ్వాసం. అంతేకాక ఆర్యులు స్వదేశీయులు అని, బయటనుంచి వలస వచ్చిన వారు కారని వాదిస్తారు.

6. ఆధునిక అవగాహన:

ఈ రోజు ఒక జన్యువు వివిధ జనాభాలలో వివిధ కాలాలలో ఎలా ప్రయాణం చేసింది అనే విషయం చాలా సులువుగా మేప్పింగ్ చేయగలుగుతున్నారు. ఈ ప్రాచీన DNA అధ్యయనాల ద్వారా c2000 BCE లో Pontic-Caspian steppe (ఉక్రయిన్, రష్య, కజకిస్తాన్) ప్రాంతాలనుంచి భారతదేశంలోకి Yamnaya Steppe pastoralist లు ప్రవేశించారని తెలుస్తున్నది. వీరు ఋగ్వేద ఆర్యులు.
ఈ ఆధునిక ఆవిష్కరణ -- మధ్య ఆసియా నుంచి ఆర్యులు 1500 BCEలో భరతఖండంలోకి వలస వచ్చారని చెప్పిన ముల్లర్ ప్రతిపాదనతో ఈ దాదాపు సరిపోలుతునన్నది. ఈ ఆర్యులు గుర్రాలపై వచ్చారు. వేదాలలో గుర్రాలమీద 200 శ్లోకాలు ఉన్నాయి. గుర్రాలు భారతఖండానికి చెందిన ఇండిజినస్ జంతువులు కావు. ఎక్సోటిక్ జంతువులు.  అందుకే హరప్పానాగరికతలో ఎక్కడా గుర్రాల ముద్రలు కానీ,  తవ్వకాలలో గుర్రాల అస్థిపంజరాలు కానీ కనిపించవు. ఈ సత్యం కూడా ఆర్యులు బయటనుండి గుర్రాలపై వలస వచ్చిన వారు అని ఋజువు చేస్తుంది.

ముల్లర్ వేదాలు 1500-1200 BCE మధ్య రచింపబడి ఉంటాయని ఊహించాడు. ఇది కూడా సత్యదూరం కాదని ఇండో యూరోపియన్ భాషల ఆధునిక అధ్యయనాల ద్వారా తెలుస్తున్నది.

మాక్స్ ముల్లర్ వివిధ భాషలను తులనాత్మకంగా అధ్యయనం చేసిన వ్యక్తి. ఇతనికి మధ్య ఆసియాప్రాంతపు అవెస్తా భాషకు, సంస్కృత భాషకు గల పోలికలను గమనించాడు. వాటి ఆధారంగా సంస్కృతబాషమాట్లాడే ఆర్యులు, మధ్యఆసియానుండి వలస వచ్చి ఉండవచ్చు అని ఊహించాడు. వేదాలలోపలి ఆధారాలు భీకరమైన దండయాత్రలను సూచించటాన్ని గుర్తించాడు. ఈ రెండు దృగ్విషయాలను కలిపి "ఆర్యుల దండయాత్ర" సిద్ధాంతంగా చెప్పాడు.

మాక్స్ ముల్లర్ కాలానికి జన్యుశాస్త్రం లేదు. జనాభాలలో జన్యువుల కదలికలను అంచనావేసే టెక్నాలజీ లేదు. భిన్నభాషల పదాల మధ్య సామ్యాలను వేగంగా పోల్చిచూడగలిగే కంప్యూటర్ పరిజ్ఞానం లేదు. అయినప్పటికీ ముల్లర్ వేదకాలం, ఆర్యుల దాడి సిద్ధాంతాల గురించి 90% సరైన ఊహ చేసాడు. జన్యు ఆధారాలనుబట్టి దీన్ని ఆర్యుల వలస గా నేడు అందరూ అంగీకరించినా, వేదాలలోని అంతర్గత ఆధారాలనుబట్టి దీన్ని ఆర్యుల దాడిగా సామాజిక శాస్త్రవేత్తలు పరిగణిస్తారు. వేదాలను భౌతిక దృష్టితో శాస్త్రీయ అధ్యయనం చేయటం వల్ల ఇది సాధ్యమైంది. ఇది ముల్లర్ మేధోశ్రమకు సంకేతం.

*****
ఆర్యుల వలస సిద్ధాంతంతో ఏంటి సమస్య?
ఆర్యులు విదేశీయులైతే ఈ సనాతనపండితులు కూడా టర్కీనుంచి వచ్చిన తురకలతో సమానమౌతారు. భరతఖండం అంటే మేమే అని ఇన్నాళ్ళూ చెప్పుకొన్న వారికి ఇది చాలా అవమానకరమైన స్థితి. కనుక ఆరు నూరైనా నూరు ఆరైనా ఆర్యులవలస సిద్ధాంతం తప్పు అని నిరూపించటానికి వందేళ్ళుగా ప్రయత్నిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా మాక్స్ ముల్లర్ ను పంచింగ్ బాగ్ లా వాడుకొంటూ ఆర్యులదాడి సిద్ధాంతాన్ని ఖండిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా హరప్పాలిపిలో సంస్కృత ఛాయలు ఉన్నాయని, హరప్పా సంస్కృతి వేద సంస్కృతే అని ప్రచారం ఎత్తుకొన్నారు.

రోజు రోజుకీ ఆధునిక జన్యుశాస్త్ర పరిశోధనల వలన ఆర్యుల వలస జరిగిందనే సత్యం బలంగా ఆవిష్కరింపబడుతున్నది. ఇది నేటి సనాతన పండితులకు మింగుడుపడక, Out of India Theory పేరుతో ఓ అబద్దపు సిద్ధాంతాన్ని తెరమీదకు తెచ్చి -- ఆర్యులు భరతఖండంలో పుట్టినవారే, ఇక్కడనుంచి మధ్య ఆసియాకు వలస వెళ్ళి మరలా తిరిగి BCE 1500లో భరతఖండంలోకి  వెనక్కు వలస వచ్చారని గొప్ప అతి తెలివి వాదన ఒకటి మొదలుపెట్టారు.

హిందూ పండిత చరిత్రకారులు చెబుతున్న సిద్ధాంతాలను ప్రపంచవ్యాపిత ఇండాలజిస్టులు నమ్మటంలేదు. అదొక సంకట స్థితిగా మారింది సనాతనహిందూ చరిత్రకారులకు.

మరొక ఆశ్చర్యకరమైన అంశం- ఆర్యులుగా పిలవబడిన Steppe Ancestry మూలాలు కలిగిన ప్రజలలో ఉండే R1 haplogroup జన్యువు ఆధునిక భారతసమాజంలో బ్రాహ్మణులలో అధికంగాను క్రింది తరగతి ప్రజలలో తక్కువ శాతంగాను ఉన్నట్లు నేడు గుర్తించారు.

7. ముగింపు

“మాక్స్ ముల్లర్ వశిష్ట మహాముని”- వివేకానందుడు.

వేదాలు రాసిన అత్యంత ప్రాచీనమైన తాళపత్ర రూపం 11 వ శతాబ్దానికి చెందినది. East India Company అధికారులైన విలియం జోన్స్, హెచ్.హెచ్. విల్సన్ లు సేకరించి యురోపియన్ లైబ్రేరీలలో భద్రపరచిన ఋగ్వేద సంహిత అనే రాతప్రతి, 14 వ శతాబ్దపు సాయనాచార్యుడు ఋగ్వేదానికి చేసిన వ్యాఖ్యానాన్ని ప్రాతిపదికగా చేసుకొని ముల్లర్ తన అనువాదం సాగించాడు. తుదిప్రతి పరిష్కరణ సమయంలో భారతీయ సంస్కృత పండితుల సహాయం తీసుకొన్నాడు. మాక్స్ ముల్లర్ తన ముందుమాటలో – “వేదాలను అనువదించటానికి పాతికేళ్ళు కష్టపడ్డాను ఆ అనువాదాన్ని పరిష్కరించి పుస్తకరూపంలో తీసుకురావటానికి ఇరవై ఏళ్ళు పట్టింది” అని చెప్పుకొన్నాడు. మొత్తం నలభై ఐదు ఏళ్ళు. అంటే మాక్స్ ముల్లర్ తన యావజ్జీవితాన్ని ఈ వేదాలను అనువదించటానికే వెచ్చించాడు.

వేదాలను అనువదించటానికి, ఒక పేజీకి నాలుగు పౌండ్ల చొప్పున మొత్తం 9 లక్షల రూపాయిలు ఈస్ట్ ఇండియా కంపనీ నుంచి మాక్స్ ముల్లర్ తీసుకున్నాడని, అది చాలా పెద్దమొత్తం అని సనాతనవాదులు ఆరోపిస్తారు కానీ ఈ డబ్బు 45 ఏండ్లపాటు చేసిన విద్వత్సంబంధమైన పనికి పొందిన ప్రతిఫలం. దానిలోంచే పరిష్కరణ సమయంలో పెట్టుకొన్న సంస్కృత పండితులకు ఇచ్చిన జీతబత్యాలు ఖర్చు కూడా ఉంది.

స్వామి వివేకానంద 28, మే 1896 న మాక్స్ ముల్లర్ ను ఆక్స్ ఫర్డ్ లో కలిసాడు. ఆ సమయంలో వారిరువుతూ భారతీయ వేదాంతం, ఆథ్యాత్మికతలను చర్చించుకొన్నారు. అప్పటికే మాక్స్ ముల్లర్ వృద్ధాప్యానికి చేరుకొన్నాడు. వివేకానందకు ముల్లర్ పట్ల అపారమైన గౌరవం. అదే విధంగా ముల్లర్ కు కూడా వివేకానందుడంటే అవ్యాజమైన ప్రేమ. వారి కలయికను వివేకానందుడు - “ఆ వృద్ధ దంపతులను చూస్తే ఏదో ఆశ్రమంలో నివసిస్తున్న వశిష్టుడు, అరుంధతిల వలే ఉన్నారు. మాక్స్ ముల్లర్ సాయనాచార్యుని పునర్జన్మ. నేను బయలుదేరినపుడు కనుల నిండా నీరు నింపుకొని ముల్లర్ నాకు వీడ్కోలు పలికారు. మాక్స్ ముల్లర్ తో సరితూగగల సంస్కృత పండితుడు భారతదేశంలో ఒక్కడు కూడా లేడు" అంటూ ఎంతో ఆర్థ్రంగా వర్ణించాడు. 

మాక్స్ ముల్లర్, వివేకానందుడు సెక్యులరిజం అనే పదం వాడకపోయినా భారతీయ సమాజంలో సెక్యులరిజం అనే భావనలకు ఆధ్యులు అంటారు.

నేటికీ సనాతన పండితులతో తిట్టించుకొంటున్న మాక్స్ ముల్లర్ తన జీవితకాలంలో ఇండియాకు రానే లేదు. తన పనంతా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో ఉంటూ చేయటం ఒక కొసమెరుపు. చివరి దరహాసం ముల్లర్ దే అవుతున్నది.

బొల్లోజు బాబా


References
1. The complete works of Swami Vivekananda: Volume 6
2. religion for a secular age by Thomas J green.
3. researchguru.net/volume/Volume%2013/Issue%201/RG26.pdf
4. Sri Madhvacarya a 13th century revolutionary monk quotes Skanda Purana, an authoritative scripture, in his commentary to the Rig Veda as follows: trayoarthaha sarvavedeshu dasharthah sarvabharate vishnon sahasranamapi nirantarasatarthakam || "Vedas have at least three meanings, Mahabharata has atleast ten meanings and Vishnu Sashranama has at least 100 meanings for each word."
5. quora.com/Did-the-West-borrow-nuclear-technology-from-the-Vedas-z
6. Selected works of Dr. B. R. Ambedkar
7. India What it can teach us, Max Muller
8. Life And Letters Of The Right Honourable Friedrich Max Muller Vol.1 పేన. 346
9. వేదబాహ్యులు, బొల్లోజు బాబా