Tuesday, May 20, 2025

భర్తపోయిన స్త్రీలకు గాజులు, బొట్టు తియ్యమని ఏ శాస్త్రాలలో ఉంది?

భర్తపోయిన స్త్రీలకు గాజులు, బొట్టు తియ్యమని ఏ శాస్త్రాలలో ఉంది అని ఢంకాభజాయించి మరీ ప్రశ్నిస్తున్నారు ఈవిడ. (see video link in comment).
 
వీళ్ళు తెలియక ఇలా మాట్లాడుతున్నారని అనుకోను. హిందూ ధర్మంలో ఎలాంటి దురాచారాలు లేవు అని బుకాయించటం నేడు ఫాషన్. 

యజ్ఞాలలో మాంస, మద్యసేవనాలని కందమూలాల సేవనంగా గీతా ప్రెస్ ఇటీవలి ప్రచురణలలో క్రమేపీ మార్చుకొంటూ వస్తూంది.
 
గొప్ప సమానత్వం వెల్లివిరిసిన సమాజంలోకి కులాలను బ్రిటిష్ వారు తీసుకొచ్చారట.
 
స్త్రీని గౌరవించిన ఒకే ఒక ధర్మం మనది అట.
 
సతీసహగమనం ఎన్నడూ జరగనే లేదట అలా జరిగింది అనటం బ్రిటిష్ వారి అతిశయోక్తులట.
బ్రిటిష్ వారు ధర్మశాస్త్రాలను, వేదాలను వక్రీకరించి అనువదించారట. వాటిపై ఆధారపడిన డా. అంబేద్కర్ తెలియక హిందూమతాన్ని విమర్శించారట.
 
ఒకటా రెండా.... నేడు ఏవైతే రాజ్యాంగ విరుద్దమో అవన్నీ కల్పితాలు అంటూ మాట్లాడుతున్నారు. అబద్దాలతో ప్రజల్ని ఊదరకొడుతున్నారు.

ఎంతకాలం ఇలా అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలని మోసగిస్తారు వీళ్ళు. 

ఒకె .... సరే....జరిగిందేదో జరిగిపోయింది... కాలానుగుణంగా ఈ ఈ దురాచారాలను రద్దుచేస్తున్నాం అని ఒక లిస్ట్ ఇచ్చి, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం అని పీఠాధిపతులు, ఇలాంటి ప్రవచనకారులు ప్రకటించి ముందుకు వెళితే మన మతానికి ఎంతగౌరవంగా ఉంటుంది? కానీ చెయ్యరు ఎందుకంటే అప్పుడు వీళ్ళనెవరూ వినరు, చూడరు కనుక. ధర్మం పేరుతో మూఢత్వాలను ప్రచారం చేసినప్పుడే, పరిహారాలంటూ వీరికి చేతినిండాపని, మనుగడ ఉంటుంది.
 
ఇదిగో ఈ వీడియోలో వృద్ధపతివ్రతలు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారో గమనించండి. వీళ్ళే పెద్దముత్తైదువులపాత్రలో భర్త పోయిన ఎందరి అభాగ్యునుల గాజులు బద్దలు కొట్టి ఉంటారో, నా కైతే అనుమానం లేదు. పోనీ కనీసం అలాంటి తంతులను చూసి ఉండరా? వేదికపై మాత్రం గొప్ప సుద్దులు చెబుతున్నారు. సిగ్గులేకుండా. ఈ ఆచారాలు మధ్యలో ఎలా వచ్చాసాయో వచ్చేసాయండి అంటున్నారావిడ. ఇంకా నయం. బ్రిటిష్ వారు తీసుకొచ్చారు అనలేదు. సంతోషం.
 
ఇక ఈ వీడియోలో ఆవిడ ప్రశ్నించినట్లు – వైధవ్యం పొందిన స్త్రీ బొట్టు, కాటుక గురించే కాదు, ఇంకా చాలా దుర్మార్గమైన విషయాలు శాస్త్రాలలో పండితులు చెప్పారు.
 
భర్తచనిపోయిన స్త్రీకి రెండేగతులు. ఒకటి సతీసహగమనం. రెండవది ఈ క్రింది నియమాలతో వైధవ్యాన్ని పాటించటం.
 
1. శీలమును కాపాడుకోవలెను. శీలమును కోల్పోయినచో స్వర్గములోని భర్త పితృ, సోదరులు నరకములోకి పంపబడెదరు.

2. జుట్టు ముడివేసినచో పైలోకములోని భర్తకు బంధనమగును కనుక గుండుకొట్టించుకోలెను
3. రోజుకి ఒకపూటమాత్రమే భుజించాలి

4. ఉపవాసాలుండాలి

5. మంచంపై పడుకోరాదు, నేలపై నిద్రించాలి.

6. నలుగుపెట్టుకొని తలనీళ్ళుపోసుకోకూడదు

7. సుగంధద్రవ్యములు, పన్నీరు, పైపూతలు, ఆభరణాలు, చందనాదులు లాంటి భోగములపట్ల ఆసక్తి కూడదు .

8. ఎడ్లబండిపై ఎక్కకూడదు

9. జాకెట్టు, రంగుచీరలు ధరించకూడదు.

10.తాంబూలము, కంచుపాత్రలో భోజనము నిషేదం

11. పుత్రుడు లేని విధవ స్త్రీ ప్రతిరోజు భర్తకు తిలోదకములచే తర్పణములు ఇవ్వాలి.

12. పరపురుషుల పేర్లు ఉచ్చరించరాదు.
 
వైధవ్యం పొందినవారికి సనాతన ధర్మం vidhavadharmah అనే పేరుతో అనేక ఆంక్షలు విధించింది. ఇవన్నీ సతీసహగమనానికి ప్రత్యామ్న్యాయంగా చెప్పి, అదేదో గొప్ప మానవత్వం నిండిన ఔదార్యప్రకటనగా భావించి ఉంటారు శాస్త్రకారులు. పండితులు రాసిన ఈ దుర్మార్గమైన చట్టాల వలన వైధవ్యం పొందిన హిందూ స్త్రీలు నేటికీ సున్నితమైన, చెప్పుకోలేని వివక్షకు గురవుతూండటం గమనించవచ్చు.

బుకాయించినంతమాత్రానా సనాతన చరిత్ర చిరిగిపోదు.
 
బొల్లోజు బాబా

Friday, May 16, 2025

ప్రాచీనగాథలు పరిచయం



ఆత్మీయమైన పలుకులకు దేవదానం రాజుగారికి సదా కృతజ్ఞుడను. వీరి పరిశీలనలు విలువైనవి. శిరోధార్యమైనవి....

థాంక్యూ అనేది చిన్నమాట.....
బొల్లోజు బాబా
....
ప్రాచీన గాథలు కొత్తగా
 
కొన్ని విషయాలు రాయానంటే శోధించాలి. శోధించిన దానికి ప్రామాణికత సంతరించేలా పరిశ్రమించాలి. చరిత్ర లోకి తొంగి చూసి రాయగలగడం ఒక విద్య. ఏమాత్రం తేడా ఉంటే చుట్టూరా ఉన్న వేల కళ్ళకు జవాబు చెప్పుకోవాలి. అంటే సంయమనం కోల్పోకూడదు. ఒక పక్క వాలకూడదు. నిరపేక్షంగా ఉండాలి. పక్కన వేయి కళ్ళు చూస్తుంటాయి. అవెప్పుడూ రంధ్రాన్వేషణకు ప్రయత్నిస్తాయి. మానసికంగా మనల్ని దెబ్బతీస్తాయి. చేసే పనిని చిత్తశుద్ధితో చేసినా మన రాతల్ని అనుమానిస్తారు. నేను చెప్పదలచిన విషయం ఇది కాదు. ఉపోద్ఘాతంగా మొదలెట్టానంతే. చాలా కాలంగా ‘ప్రాచీన గాథలు’ చదివే పుస్తకాల గుట్టలోంచి పలకరిస్తూనే ఉంది. చెప్పాలంటే గత కొద్ది కాలంగా బొల్లోజు బాబా వెలువరిస్తున్న వ్యాసాలు ముఖ్యంగా నాకు తెలీని లోకంలోకి విహరింప చేస్తున్నాయి. పాత దారుల్ని వెతికి కొత్తగా పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
 
మానవానుభవాలు కాలం వెంట తరలి వస్తూనే ఉంటాయి. అనుభూతుల్ని అనుభవాల్ని ఉద్వేగాల్ని ఒకనాటి సామాజిక చిత్రాల్ని శతాబ్దాల క్రితం జీవితాల్ని ప్రతిబింబించినపుడు విస్మయం కలుగుతుంది. ఇవన్నీ సామాన్యుల జీవితాల్ని నమోదు చేసిన గాధలే . మొదటిసారి చదివినపుడు వీటిలో కొన్నింటిని ‘కథలు’ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది.
 
ఆ వృద్ధురాలి కడుపు / తామరాకులా ముడుతలు పడిఉంది /ఆమె దుర్బల భుజాలపై నరాలు పైకి తేలాయి /ఆమె కొడుకు యుద్ధంలో ఓడిపోయి పారిపోయాడని /చాలామంది చెప్పిన మాటలు విని /‘అదే నిజమైతే అతనికి పాలు ఇచ్చిన ఈ రొమ్ములను / నేనే కోసి వేసుకుంటాను’ అని కోపంతో /కత్తి తీసుకుని యుద్ధరంగానికి బయలు దేరింది / అక్కడ ఛిద్రమైన కొడుకు మృతదేహాన్ని చూసి /అతనికి జన్మనిచ్చిన రోజు కంటే /ఎక్కువ సంతోషించింది. ఇదొక ప్రాచీన గాథ. దీన్ని నేటి సమాజానికి అనుగుణంగా కథ రాస్తానన్న మాట. అదేమిటో చివరి చెబుతానని మాత్రం అంటాను.
 
ఇంకోటి...
 
అతను /నన్ను పెండ్లాడినట్లు సాక్ష్యం తెమ్మంటే / ఎక్కడ్నించి తేను /అతనే సాక్షి /ఆ...గుర్తొచ్చింది / కందిజువ్వల్లాంటి సన్నని పొడవైన ఆకుపచ్చని కాళ్ళతో /ఏటి ఒడ్డున నిలుచున్న కొంగ ఒకటి /ఆ సమయంలో మమ్మల్నే తదేకంగా చూసింది. దీన్ని నేటి కథగా ఎలా రాయాలి? అదీ చెబుతాను.
 
ఊహకు హద్దులు లేవు కదా. బోలిడన్ని ఆలోచనలు గమ్మున వచ్చేస్తుంటాయి. వాటిని అదను చూసి పట్టుకుంటే ఎన్నో అక్షరాలు ఎన్నో పదాలు ఎన్నో వాక్యాలు...కాదంటారా?
మళ్ళీ ‘ప్రాచీన గాథలు’ చదవాలి. బొల్లోజు బాబా పరిశ్రమను గుర్తించాలి. తను చరిత్ర లోంచి మనుష్యుల్ని చూడటం మొదలెట్టి చాలా కాలం అయింది. కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలని కోరుకుంటున్నాను. మరో మాట చెప్పి ముగిస్తాను. ఇది విమర్శ కాదు. గమనింపు...అంతే. బొల్లోజు బాబా ఒకోసారి అనువదించి ఊరుకోకుండా కలగజేసుకుని తన అభిప్రాయాన్ని కూడా చెబుతాడు. అవి ఖచ్చితంగా ఇదే అన్నట్టు కాకుండా సంశయాత్మకంగా చెబుతుండడాన్ని గమనించాను. ‘బహుశా’ అంటూ చెప్పే వాటిని పాఠకుడు సీరియస్‌గా తీసుకుంటాడనుకోను`
 
--దాట్ల దేవదానం రాజు
 
ప్రా


 


చీన గాధలు కావాలంటే సంప్రదించండి...ఛాయ ప్రచురణలు
7093165151
https://www.amazon.in/dp/8198229310

 

Monday, May 5, 2025

ఒక కామెంటు......



ఈ మాటలో మిత్రులు శ్రీ రాణి శివశంకర శర్మ గారు "భారతీయులకు హేతు చింతన ఉందా?" అనే పేరుతో ఒక వ్యాసం రాసారు. అది క్లుప్తంగా ఇలా ఉంది....

///హేతు చింతనను ఆధునికతకు పర్యాయంగా భావించినప్పటికీ, భారతీయ హేతు చింతన గురించి కమ్యూనిస్టులు, దళితవాదులు, హిందువాదులు వలసవాద ప్రభావంతో తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాసం వాదిస్తుంది. భారతీయ దృక్పథంలో చక్రీయ కాల భావన ప్రధానమని, శంకరాచార్యులు, బౌద్ధులు స్థల-కాలాలు మనోనిర్మితమని చెప్పారు, ఇది క్వాంటం ఫిజిక్స్‌తో సమానంగా ఉంది. వలసవాద ప్రభావంతో భారతీయ తాత్విక చింతనను మేధావులు, రోమిలా థాపర్ తో సహా తక్కువగా చూసారని అభియోగం మోపుతుంది. .....
దీనిపై రాసిన విమర్శను ఈమాట వెబ్ సైటులో తీసుకోవటం లేదు. కనుక ఇక్కడ ఒక పోస్టుగా పోస్ట్ చేస్తున్నాను.

నా వ్యాఖ్య ఇది.
.
భారతీయులు సుదూర గతంలో గొప్ప హేతుబుద్ధి కలిగి ఉండేవారు, దాన్ని క్రమేపీ కోల్పోయారు....ఈ వ్యాసం మొత్తం మీద ఇదొక్కటే సత్యపూర్వక వాక్యం.
సుదూరగతంలో చార్వాకులు బౌద్ధం రూపంలో గొప్ప హేతుబుద్ది కలిగి ఉండేవారు. క్రమేపీ ఆత్మ, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, మోక్షం, స్వర్గనరకాలు, పాపపుణ్యాలు లాంటి అభౌతిక అంశాలను- పండితులు తమ అధిపత్యానికి, ఉదరపోషకు- మతలక్షణాలుగా స్థిరీకరించి జనబాహుళ్యాన్ని నమ్మించారు.
1. చార్వాకులు ఇలా అన్నారని ఆధారాలేమిటి?
/////జీవసృష్టిలో చైతన్యం (Consciousness) కూడా ఇలాంటి భౌతిక మూలకాల (భూమి, నీరు, అగ్ని, వాయువు) సంయోగం వల్ల ఉద్భవిస్తుంది. తాంబూలం యొక్క ఎరుపు రంగు లేదా రుచి ఎలా ఒక స్వతంత్ర శక్తి లేకుండా సహజంగా ఏర్పడుతుందో, అదేవిధంగా చైతన్యం కూడా శరీరంలోని భౌతిక అవయవాల సంక్లిష్ట సంయోగం ఫలితంగా ఉత్పన్నమవుతుంది.////
---- ఆత్మ, చైతన్యం లాంటివాటిని చార్వాకులు ఖండించారు. ఇవన్నీ ఆ తరువాత పండితులు చేసిన చార్వాక వ్యాఖ్యానాలలోని వక్రీకరణలు. పై వాక్యాలను చార్వాకులవని నిరూపించే ఆధారాలు చూపండి. ఉదాహరణకు; యావజ్జీవేత్సుఖం జీవేదృణం కృత్వా ఘృతం పిబేత్ । భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః లాంటి చార్వాక వాక్యాలను చూపండి. ఎవరెవరో ఆ తరువాత చేసిన పండిత వ్యాఖ్యానాలు చూపొద్దు. ముఖ్యంగా తాంబూల దృష్టాంతం.
.
2. భారతీయ తత్వశాస్త్రం కాలం సైక్లికల్ అని చెబుతుంది. కానీ దానికి సంబంధించిన ఆధారాలను చూపదు. ఉదా. ఇది కలికాలం అనుకొంటే అంతకు ముందు జరిగిన కలికాలాన్ని ఉదాహరణగా చూపి వాదించాలి. అలా చెయ్యదు కనుక అది నిరూపణ కాదు. బిగ్ బేంగ్ కూడా ఒక బిందువు నుంచే ప్రారంభమౌతుంది. అయిన్ స్టీన్ రెలటివిటీ కాలాన్ని నాలుగవ డైమెన్శన్ అని లీనియర్ గానే చూపుతుంది. సైక్లికల్ గా కాదు.
కాలం సైక్లికల్ అని చెప్పటం కర్మ సిద్ధాంతంలాగే సంస్కరణను, అభివృద్ధిని నిరోధిస్తుంది. అంతా దైవేచ్ఛ అని ప్రకటించి స్వీయ సంకల్పాన్ని నిరుత్సాహ పరుస్తుంది. కాలం సైక్లిక్ అనే భావన అశాస్త్రీయమైనది. పురాణ కల్పితమైనది. మానవాభివ్రుద్ధికి దోహదపడదు. ఇది పండితులు సమాజంపై చేసిన సామాజిక ప్రభావం. దీనిద్వారా వారి ఆధిపత్యాన్ని స్థిరపరచుకున్నారు.
కాలం చక్రీయమని చెప్పటానికి 60 సంవత్సరాలకు పేర్లు పెట్టి అవి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కదా అని చెప్పటం కురచ వాదన. నేటి కలియుగం అనేది రెండో సారో మూడో సారో ముప్పయ్యోసారో అని చెప్పి ఋజువులు చూపాలి.
.
3. కర్మ మరియు పునర్జన్మ సిద్ధాంతాలు బౌద్ధమతానికి పూర్వం నుండి ఉన్నాయి. ముఖ్యంగా జైనానికి చెందినవి ఇవి. వైదికంలో కూడా ​ఛాందోగ్య ఉపనిషత్ 5.10.7 శ్లోకంలో పునర్జన్మ భావన కనిపిస్తుంది.
జైనం కర్మను ఆత్మపై అంటుకునే భౌతిక కణాలుగా వర్ణిస్తుంది.
బౌద్ధం వీటిని అనాత్మావాదం కోణంలోంచి రీడిఫైన్ చేసింది. అంతే తప్ప కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను బౌద్ధం ప్రతిపాదించలేదు. జైన హైందవాలు చెప్పిన అర్థంలో కూడా చెప్పలేదు. వాటిని బౌద్ధానికి ఆపాదించటం ఈ వ్యాసం చేస్తున్న వక్రీకరణ.
కర్మ, పునర్జన్మ వైదికమైనవి. వాటివల్లే నేటి కులవ్యవస్థ ఏర్పడింది. (ఛాందోగ్య ఉపనిషత్ 5.10.7 శ్లోకం-- ఈ లోకంలో మంచి కర్మలు చేసిన వారు బ్రాహ్మణ, క్షత్రియ లేదా వైశ్యులుగా జన్మిస్తారు. కాని చెడు కర్మలు చేసిన వారు కుక్క, పంది లేదా చండాలులుగా జన్మిస్తారు అని అర్థం).
కులవ్యవస్థకు మూలం వైదికంలో ఉండగా బౌద్ధం కారణమనటం అతితెలివి కుటిలపండిత వ్యాఖ్యానం.
చార్వాక దర్శనం కర్మ మరియు పునర్జన్మ సిద్ధాంతాలను అనుభవసిద్ధ ఆధారాలు లేని ఊహాగానాలుగా తిరస్కరించింది.
.
4. బౌద్ధాన్ని నాశనం చేసి, మనుధర్మానికి, బ్రాహ్మణ ఆధిపత్యానికి శంకరాచార్యుడు దోహదపడినట్లు ఒక అభిప్రాయం కలదు. అందుకే నేటికీ పండితులు పల్లకీలు ఎత్తుతారు.
"శ్రవణాథ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ........." అనే బ్రహ్మసూత్రానికి శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో శూద్రునికి వేదాలు వినడం నిషిద్ధమని, ఒకవేళ వింటే అతని చెవుల్లో సీసం కరిగించి పోయాలని, వేదాలు పలికితే నాలుక కొసివేయాలని అంటూ అనేక ఉపపత్తులు ఇస్తాడు.....
ఇతనొక హెచ్చుతగ్గుల మనుధర్మ సమర్ధకుడు. ఇతనిని సమర్ధిస్తూ మాట్లాడే వారిని, ఉటంకించే వారిని సమకాలీనంగా అందరూ సమానం అని చెప్పే రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న వారిగా భావించాల్సి ఉంటుంది.
బ్రహ్మసూత్రకు శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో 9 అప శూద్రాధికరణం 34-38 లలో శూద్రునికి ఉపనయన సంస్కారం లేదు కనుక వేదాధ్యయనం లేదు. వేదాధ్యయనం లేదు కనుక బ్రహ్మ విద్యాధికారం లేదు అని స్పష్టంగా శూద్రులు విద్యనేర్చుకోవటానికి అర్హులు కారని ప్రకటించిన వ్యక్తి...... ఇతనినా! మనం ప్రామాణికంగా తీసుకోవలసింది. ఇంకా అతని భావాలు గొప్పవి, ఐన్ స్టీన్ తో సమానవైన భావాలు అవి అని ప్రకటించే వ్యక్తులవి ఎంత మలిన ఆలోచనలు
శంకరుని భావజాలం బౌద్ధుల భావజాలానికి దగ్గరగా ఉంది అని చెప్పటం కూడా అనాదిగా పండితులు చేస్తున్న ప్రభావమే. బౌద్ధులేనాడూ పైన శంకరుడు చెప్పినట్లు ప్రజలను విభజించలేదు. అందరూ సమానమే అన్నారు. బౌద్ధులను నిర్మూలించాడన్న అపప్రధను తొలగించటానికి శంకరుడే ప్రచ్ఛన్న బౌద్ధుడని ప్రచారం జరిగి ఉంటుంది.
5. భారతీయ తాత్విక చింతనలలో చార్వాకం తప్ప మరేదీ ఆధునిక హేతుచింతన/ సైన్స్ తో సరితూగలేదు. మిగిలినవి అన్నీ సామాజికంగా ప్రజలను ఆలోచనారహిత, క్రియారహిత జఢులుగా తీర్చిదిద్దిన తాత్వికతలే. ఇవేవీ ఆధునిక సైన్స్ పరిధిలోకి రానట్టె, ప్రాచీన తాత్విక చింతనలు కూడా రావు. క్వాంటం ఫిజిక్స్ ను అవి ప్రతిబింబిస్తాయి అని చెప్పటం.... అన్నీ వేదాలలో ఉన్నాయిష అని ఒక్కాణించటమే.
చార్వాకులు చెప్పిన శాస్త్రీయ సత్యాలు
అ. చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణమును మాత్రమే అంగీకరించారు. ఇంద్రియములకు అందని వాటిని అంగీకరించలేదు.చార్వాకమతం. ధర్మాధర్మములు, పాపపుణ్యములు, దేవుడు, జన్మాంతర విషయాలు లాంటివి అభౌతికాలు, ఇంద్రియగోచరములు కావు కనుక వాటిని చార్వాకులు అంగీకరించలేదు. .....
...... సైన్సు కూడా అంతే ప్రత్యక్షప్రమాణాన్నే అంగీకరిస్తుంది.
ఆ. చైతన్యం భౌతికమైనది. దేహంలో ఉండే చైతన్యమే ఆత్మ. వేరుగా ఆత్మలేదు.
ఇ. దేవుడు లేడు, స్వర్గనరకాలు లేవు. మరణానంతర జీవితం లేదు. దేహంలోంచి ప్రాణం పోవటమే మోక్షం. కనుక మోక్షం కొరకు ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు తపస్సులు చెయ్యక్కరలేదు. జీవించినంతకాలమే ఆనందించగలం. చావుతరువాత ఏమీ లేదు.
ఈ. వేదాలు, ఆగమ శాస్త్రాలు వంటి ఏ మతగ్రంథాలనైనా జ్ఞాన హేతువులుగా భావించరాదు. వేదాలను రచించినవారు విదూషకులు, మోసగాళ్ళు, రాక్షసులు.
ఉ. ఇంకా నిరూపించాల్సి ఉన్న అంశాలైన ఆత్మ, దేవుడు, మరో జన్మ, స్వర్గనరకాలువంటి వాటి ద్వారా నిష్కపట మనస్కులు ఏ కొత్త జ్ఞానాన్ని పొందలేరు
.
6. ఎవరి విశ్వాసాలను వారికి పరిమితం చేసుకోవటం విజ్ఞత. అది ఎవరికీ అభ్యంతరం కాదు. అలాకాక మా విశ్వాసాలలో ఐన్ స్టీన్ సిద్ధాంతాలు, అణుబాంబు తయారీ, పుష్పక విమానాల తయారీ, కాస్మాలజీ, క్వాంటం థీరి లాంటివి ఉన్నాయి అని మాట్లాడటం అశాస్త్రీయమని గుర్తించాలి. ఏవీ చూపించు అని ప్రశ్నిస్తారన్న ఎరుక ఉండాలి.
ఏనాటికైనా భారతీయ తాత్విక చింతనలలో చార్వాక దర్శనమే శాస్త్రీయంగా నిలబడగలిగేది. కానీ దీనిని ప్రచారంలోకి తెస్తే ఆత్మ, దేవుడు, స్వర్గనరకాలు, పాపం, పుణ్యం, మోక్షం, పూజలు, వ్రతాలు అంటూ కొందరికి ఆధిపత్యాన్ని, జీవనోపాధిని ఇచ్చే ప్రపంచం మొత్తం కుప్పకూలుతుంది.
అందుకని చార్వాకులను వెనక్కితోసి, మిమాంస, అద్వైతం, ద్వైతం, వేదాలు, ఉపనిషత్తులు, సూక్తాలు, షట్దర్శనాలు అంటూ మనిషిని, తార్కికతను వదిలి చేసే మాయాపూరిత విశ్లేషణలను, కొందరు ముందుకు తెచ్చి శతాబ్దాలుగా చేసిన అనాది మోసమే ఈ వ్యాసంలోనూ కనిపించింది.
బొల్లోజు బాబా
(పై వ్యాసం ఒక వాదనకు ప్రతివాదనగా అకడెమిక్ ఇంటరెస్ట్ తో చేసినది తప్ప ఆ వ్యాసరచయితను అఫెండ్ చేయటానికి కాదు)

Saturday, May 3, 2025

ఎవరు చొరబాటు దారులు?


భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇంట్రూడర్స్ (చొరబాటుదారులు) అంటూ ముస్లిమ్స్ ని హిందుత్వ వాదులు పదే పదే పేర్కొంటారు. సాక్షాత్తూ ‘పెద్దాయనే’---- “ప్రత్యర్ధులు ఎన్నికలలో నెగ్గితే ఈ ‘చొరబాటుదారులకు’ ప్రజల సంపదను పంచిపెడతారని, మీ మంగళసూత్రాలను కూడా వదలరని”--- పలకటం గమనార్హం. ఈ దేశంలో దాదాపు ఆరేడు శతాబ్దాలుగా జీవిస్తూ, ఇక్కడే పుట్టి ఇక్కడే మరణిస్తున్న సాటి మనిషిని ఈదేశానికి చొరబాటుదారుడు అని మాట్లాడటం మనచుట్టూ జరుగుతున్న కమ్యునల్ విభజన రాజకీయాలకు అద్దంపడుతుంది.
నిజానికి చారిత్రికంగా మధ్య ఆసియా స్టెప్పీ గడ్డి భూములనుంచి గుర్రాలపై గత 3000 సంవత్సరాలలో భారతదేశంలోకి మూడు దఫాలుగా ప్రవేశించిన చొరబాటుదారులు భారతీయసమాజాన్ని ప్రభావితం చేసారు. సనాతనులు ఆరేడు వందలేళ్ల క్రితం వచ్చిన ముస్లిమ్స్ గురించి మాత్రమే మాట్లాడతారు తప్ప వారికంటే ముందు రెండుదఫాలుగా వచ్చిన ఇతరజాతులకు చెందిన చొరబాటుదారుల గురించి మాట్లాడరు.

1. మొదటి దశ, ఆర్యుల చొరబాటు

• మధ్య ఆసియనుంచి BCE 1500 ప్రాంతంలో ఆర్యులు అనే యోధ జాతి భారత ఉపఖండానికి వలస వచ్చి ఈ ప్రాంతంపై ఆధిపత్యం పొందారు. వీరు తమతో పాటు వేదసంస్కృతి, సంస్కృత భాషను తెచ్చారు ఇవి ఆనాటి భారత ఉపఖండంలోని స్థానిక సంస్కృతులపై ప్రభావం చూపాయి.

• ఈ రోజు జన్యుశాస్త్రంలో DNA Sequencing పద్దతి ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వగలుగుతుంది. దీని ఆధారంగా ఒక జన్యువు వివిధ జనాభాలలో, వివిధ కాలాలలో ఎలా ప్రయాణం చేసింది అనే విషయం చాలా సులువుగా మేప్పింగ్ చేయగలుగుతున్నారు. ఈ అధ్యయనాలద్వారా, మధ్య ఆసియా నుండి కొన్ని జన్యువులు భరతఖండంవైపు కాలానుగుణంగా కదులుతూ వచ్చాయని కొన్ని పదుల సైంటిఫిక్ పేపర్లు నిర్ధారించాయి. అవే ఆర్యజనువులు. అలా వలసవచ్చిన వారే ఆర్యులు.

• మరొక ఆశ్చర్యం కలిగించే అంశం- ఆర్యులలో ఉండే R1 haplogroup జన్యువు ఆధునిక భారతసమాజంలో బెంగాలు బ్రాహ్మణులలో అత్యధికంగా 72.22 శాతం, ఇతర రాష్ట్రాల బ్రాహ్మణులలో 70-30% మధ్యలో కనిపించింది.

• ఇక భారతదేశ క్రిందితరగతి ప్రజలలో (Lower Castes/దళిత,బహుజనులు) ఈ ఆర్య జన్యువు 15.7 శాతం మందిలో కనిపించింది. అదే విధంగా భారతీయ గిరిజనులలో ఈ జన్యువు 7.9% మందిలో మాత్రమే గుర్తించారు.

• ఈ గమనింపు ద్వారా నేటి బ్రాహ్మణులు మధ్య ఆసియా నుంచి వచ్చిన విదేశీ ఆర్యులని, దళిత బహుజన గిరిజన ప్రజలు భరతఖండంలో సింధునాగరికతా కాలంనుండి జీవిస్తున్న స్థానికులని భావించవచ్చు.

• ఆర్యులు వర్ణవ్యవస్థను ఏర్పరచారు. సమాజాన్ని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంటూ నాలుగు శ్రేణులుగా విభజించారు. వీరిలో బ్రాహ్మణులు ఉన్నతులుగాను, మిగిలిన మూడు వర్ణాలు వారికి సేవచేయాలని ధర్మశాస్త్రాల ద్వారా నిర్ణయించారు. ధర్మశాస్త్రాలనేవి ఒకనాటి రాజ్యాంగం. ఇక వీరికి వెలుపల అతిశూద్రులు ఉండేవారు అతిశూద్రులు వూరివెలుపల నివసించే అంటరానివారు. ధర్మ శాస్త్రాలప్రకారం వీరసలు మనుషులే కారు.

• ఆర్యులు వారి స్త్రీలతో కాకుండా పురుషులు ఒక్కరే భరతఖండానికి వచ్చి స్థానిక అనార్య స్త్రీలను పెళ్ళాడారు. ఈ సందర్భంగా స్థానిక పురుషులను ఓడించి లేదా నిర్మూలించటం ద్వారా వారి స్త్రీలను గ్రహించటం జరిగి ఉండాలి.

• ఆర్యులు ప్రవేశపెట్టిన జన్మ ఆధారిత హెచ్చుతగ్గుల వర్ణవ్యవస్థ (కులవ్యవస్థ), బ్రాహ్మణాధిక్యత, మంత్రాలు, క్రతువులు, స్వర్గనరకాలు, పాపం పుణ్యం లాంటి అభౌతిక భావనలు నేటికీ సమాజంలో తమప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి.

• ఆర్యులు భారతదేశానికి చెందిన స్థానికులే అని సనాతనులు వాదిస్తారు కానీ అలా నిరూపించే జన్యు ఆధారాలు లేవు. ఇదొక సంకట స్థితిగా మారింది సనాతన హిందూ చరిత్రకారులకు.

2. రెండవ దశ యవనులు, శకులు, పార్థియన్లు, కుషాణులు చొరబాటు

• BCE 300 – CE 100 మధ్యలో యవనులు (ఇండో గ్రీక్స్), శకులు (సిథియన్స్) పార్థియన్స్, కుషాణులు మధ్య ఆసియానుంచి భారతదేశంలోకి చొరబడిన యోధులు.

• అలెగ్జాండర్ మరణం తరువాత అతని సైన్యంలో కొంతమంది గ్రీకులు BCE 300 లలో ఇక్కడే ఉండిపోయి పంజాబ్, గాంధార ప్రాంతాలను పాలించారు. వీరిని ఇండో గ్రీక్స్ (యవనులు అని పిలిచారు). వీరు బౌద్ధాన్ని స్వీకరించారు. గాంధారకళలో బౌద్ధ శిల్పాలను చెక్కించారు. మనుస్మృతి వీరిని మ్లేచ్చులగా పరిగణించి, “తక్కువరకం క్షత్రియులు”గా గుర్తించింది.

శకులు (సిథియన్స్) BCE 100 లో మధ్య ఆసియా స్టెప్పీలనుండి గుర్రాలపై వచ్చిన సంచార తెగలు. వీరు గాంధార, పంజాబ్, ఉజ్జయిని ప్రాంతాలను పాలించారు. వీరు బౌద్ధ, హైందవ మతాలను స్వీకరించారు. వీరిలో ప్రముఖుడైన రుద్రదమనుడు సంస్కృతాన్ని ఆదరించాడు. వీరిని పతనమైన క్షత్రియులు (Second class kshatriyas) గా మనుస్మృతి పరిగణించింది.

పార్థియన్స్, BCE 100 లో ఇరాన్ నుంచి వచ్చిన యోధులు. వీరు ఇండో పార్థియన్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరు సింధ్ పంజాబ్ ప్రాంతాలను (ప్రస్తుత పాకిస్తాన్) పాలించారు. ఈ వంశంలో గోండో ఫరిస్ ప్రసిద్ధిగాంచిన రాజు. వీరి పాలనలో గాంధార శిల్పకళ అభివృద్ధిచెందింది. వీరు జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించినా, క్రమేపీ భారతీయమతాలతో విలీనం అయిపోయారు. పార్థియన్లను కూడా మనుస్మృతి పతనమైన క్షత్రియులుగా గుర్తించింది.

కుషాణులు, CE 100 మధ్య ఆసియానుంచి వచ్చారు. కనిష్కుడు పేరుగాంచిన రాజు. కుషాణులు బౌద్ధమతాన్ని వ్యాప్తిచేసారు. వీరినాణాలపై బుద్ధుడు, శివుడు, గ్రీకుదేవతల చిహ్నాలు ఉండటం వీరి మతసహనాన్ని చూఫుతుంది. వీరు వాసుదేవవంటి భారతీయ కల్ట్ పేర్లను ఉపయోగించారు. వీరు కూడా క్షత్రియులుగానే గుర్తింపబడ్డారు.

మధ్యఆసియానుంచి భారతఖండంలోకి చొరబడిన స్టెప్పీ యోధులైన, యవనులు శకులు, పార్థియన్లు, కుషాణులు భారతదేశంలో స్థిరపడి, స్థానిక బౌద్ధ, హైందవ మతాలను స్వీకరించి క్రమేపీ భారతదేశ సమాజంలో మమేకం అయిపోయారు. కాలక్రమేణా వీరు స్థానిక కులాలుగా విలీనమయ్యారు. ఉదాహరణకు శకులు గుజరాత్ మధ్యప్రదేశ్ లోని క్షత్రియకులాలలోకి (రాజ్ పుత్రులు) కుషాణులు ఉత్తరదేశ రాజవంశాలలోకి కలిసిపోయారు.
.
3. మూడవ దశ చొరబాటు , ఐబక్, ఖిల్జి, తుగ్లక్, సయ్యద్, లోడి, ముఘల్స్

• CE 12-15 శతాబ్దాలమధ్య మధ్యఆసియా నుంచి కుతుబుద్ధీన్ ఐబక్, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాలు వచ్చి భారతదేశాన్ని పాలించాయి. వీరి రాజ్యాలు ఉత్తరభారతదేశానికే పరిమితం అయిన బలహీనమైన రాజ్యాలు. 1526 లో మధ్య ఆసియాకు చెందిన బాబర్ పానిపట్టు యుద్ధంద్వారా ఇబ్రహిం లోడీని ఓడించి భారతదేశంలో ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతనిని మేవాడ్ రాజపుత్రరాజు రాణా సంగా, లోడిని గద్దెదించటానికి ఇండియాకు ఆహ్వానించినట్లు కొందరు చరిత్రకారులు చెబుతారు.

బాబర్ బలమైన కేంద్రీకృతపాలన కలిగిన విశాలమైన మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దీన్ని అక్బర్ విస్తరించాడు. ఔరంగజేబు ముఘల్ సామ్రాజ్యాన్ని పతాకస్థాయికి తీసుకొని వెళ్ళి ఈ రోజు మనం దేన్నైతే అఖండ భారతదేశం అంటున్నామో దానికి ఒక రూపాన్ని ఇచ్చాడు. ఇతని పాలనలో ముఘల్ సామ్రాజ్యం ఉచ్ఛస్థితిని పొందింది. అశోకుని మౌర్యసామ్రాజ్యం ఎంతైతే విస్తరించి ఉండేదో దాదాపు అంత భూభాగాన్ని ఔరంగజేబు తిరిగి సాధించగలిగాడు. ఇది అంతకు పూర్వ ఢిల్లి సుల్తానేట్, హిందూ రాజవంశాలకు సాధ్యం కానిది.

• ముఘలులు హిందూ ముస్లిమ్ సమాజాల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహించారు. ముఖ్యంగా అక్బరు ద్వారా సూఫీ సాధువులైన చిస్టీ, భక్తి సంప్రదాయ గాయకులు ఐన కబీర్ నానక్ వంటివారు ఈ సంగమానికి దోహదపడ్డారు. అక్బర్ యొక దీన్ ఇ ఇలాహీ సిద్ధాంతం సమస్త మతాల ఐక్యతను కోరుకొంది.

• ముఘల్ పాలకులు రాజపుత్రులు, హిందూ జమిందారులు, ఇతర స్థానిక నాయకులను పరిపాలనలో భాగస్వామ్యం చేసారు.

• బ్రిటిష్ వారి రాకతో ఒత్తిడి, అంతర్గత అస్థిరతలు ఆర్ధిక సంక్షోభం కారణంగా ముఘల్ సామ్రాజ్యం క్షీణించింది. 1857 సైనికుల తిరుగుబాటు తరువాత చివరి ముఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ ను గద్దె దించి, సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వారు అధికారికంగా తీసుకోవటం జరిగింది.
నేటి భారతదేశంలోని ముస్లిములు చివరగా గత ఐదారు వందల ఏళ్ళ క్రితం భారతదేశంలోకి ప్రవేశించినవారు. నిజానికి వీరిలో ఎక్కువశాతం హిందూమతంలో స్థానికదళిత బహుజనులపట్ల ఊపిరాడనివ్వని ఆంక్షల వలన ఇస్లామ్ లోకి మారినవాళ్ళే ఎక్కువమంది ఉండొచ్చు.

ఎవరు చొరబాటు దారులు?

ఆర్యులు, యవనులు, ముస్లిములు భారతదేశంలోకి చొరబాటుదారులుగా వచ్చినప్పటికీ, వారు స్థానిక సంస్కృతులతో కలిసిపోయి, భారతీయ సమాజ బహుళతను రూపొందించారు.
ఆర్యులు బ్రాహ్మణ సమాజంలో ఎక్కువగా ఉన్నట్లు జన్యు ఆధారాలు చెబుతున్నాయి. యవనులు శకులు, కుషాణులు ఉత్తరభారత రాజపుత్రులుగా ఈ దేశ చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించారు. మధ్య ఆసియానుండి వచ్చిన ముస్లిములతో పాటు స్థానిక దళిత, బహుజన సమూహాల నుండి ఇస్లాంలోకి మారినవారై ఉండవచ్చని ఒక అభిప్రాయం ఉంది.

నేటి రాజకీయ సందర్భంలో, “చొరబాటుదారులు” అనే పదం ముస్లిములను లక్ష్యంగా చేస్తూ, వారిని విదేశీయులుగా చిత్రీకరించడానికి ఉపయోగించబడుతుంది. ఇది చరిత్రను ఏకపక్షంగా వక్రీకరించే ప్రయత్నం, ఎందుకంటే ఇది ఆర్యులు, యవనులు, శకులు ఇతర జాతుల చొరబాట్లను విస్మరిస్తుంది.

భారతదేశంలోని ముస్లిములు గత 700 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడే పుట్టి ఈ మట్టిలోనే కలిసిపోతున్నారు. వారిలో ఎక్కువ మంది స్థానిక మూలాలు కలిగినవారే.

“చొరబాటుదారులు” అనేది చారిత్రక సంఘటనలను వివరించే పదం, కానీ ఆధునిక సమాజంలో దీనిని విభజనాత్మక రాజకీయాలకు ఉపయోగించడం తప్పుదారి పట్టిస్తుంది. విభజన, ద్వేషం కాకుండా ఐక్యత సామరస్యం వైపు మనం ప్రయాణం చేయాలి.

బొల్లోజు బాబా

Sunday, April 20, 2025

ప్రాచీనభారతదేశ విద్యావిధానం

ప్రాచీన భారతదేశ విశ్వవిద్యాలయాలు అంటూ కాషాయ రంగు అఖండభారతదేశపు ఫొటో ఒకటి సనాతన హిందూ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. దానిపై 12 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 11 విశ్వవిద్యాలయాలు బౌద్ధులకు చెందినవి కాగా 1 జైనులకు చెందినది. విశ్వవిద్యాలయాలంటే కులమతాలకు అతీతంగా విద్యనందించే కేంద్రాలు. ఇవి కాక ఇంకా సుమారు 15 వివిధ విద్యా కేంద్రాల పేర్లు కలవు. ఇవి హిందూమతానికి చెందిన గురుకులాలు, మఠాలు,. వీటిలో బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.

I. ఆ ఫోటోలోఉన్న బౌద్ధ విశ్వవిద్యాలయాలు

1. తక్షశిల (BCE 6వ శతాబ్దం – CE 5వ శతాబ్దం): ప్రస్తుత పాకిస్తాన్‌లో ఉన్న తక్షశిల విశ్వవిద్యాలయం ప్రపంచంలోని పురాతన ఉన్నత విద్యా కేంద్రాలలో ఒకటి. ఇది బౌద్ధ కేంద్రంగా చక్రవర్తి అశోకునిచే అభివృద్ధి చేయబడింది. (తక్షశిల BCE15 వ శతాబ్దంలో స్తాపించబడింది అని ఫొటోలో ఉంది. అది తప్పు)

2. నలందా (CE 5 –CE 12 వ శతాబ్దం): బీహార్‌లో ఉన్న నలందా ఒక ప్రఖ్యాత బౌద్ధ విహారంతో కూడిన విశ్వవిద్యాలయం. బౌద్ధ తత్వశాస్త్రం, తర్కం, ఇతర విభాగాల అధ్యయనానికి ఇది ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. దీనిని గుప్త చక్రవర్తి కుమారగుప్త I ఐదవ శతాబ్దంలో స్థాపించాడు. ఇది 10,000 మంది విద్యార్థులను కలిగి ఉండేది. హ్యుయాన్ త్సాంగ్ ఇక్కడ చదువుకొన్నాడు.

3. తెల్హారా (CE 1 –CE 12 వ శతాబ్దం): నలందా సమీపంలో ఉన్న మరో బౌద్ధ విద్యాకేంద్రం. 1వ శతాబ్దం CE నుంచి ఉన్నదని పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. ఇది పాలరాజుల పోషణలో ఉంది.

4. పుష్పగిరి (BCE 3 –CE 12 వ శతాబ్దం): ఒడిశాలోని పుష్పగిరి, పురాతన కళింగ రాజ్యంలో ఒక ప్రముఖ బౌద్ధ విశ్వవిద్యాలయం. అశోకచక్రవర్తి దీనికి పోషకుడిగా ఉన్నాడు.

5. విక్రమశీల (CE 8 - 12 శతాబ్దం). స్థాపకుడు: పాల చక్రవర్తి ధర్మపాలుడు. ఇదిముఖ్యంగా వజ్రయాన బౌద్ధ విద్యకు ప్రసిద్ధి. టిబెట్ విద్యార్థులు ఇక్కడ ఎక్కువగా చదువుకొనేవారు.

6. రత్నగిరి (CE 6– 12 శతాబ్దం): ఒడిశాలోని రత్నగిరి, ఒక బౌద్ధ విహారంతో కూడిన ప్రముఖ విద్యా కేంద్రం. దీనిని అశోకుడు స్థాపించి ఉండొచ్చని ఒక అభిప్రాయం కలదు, అయితే 6వ శతాబ్దం నుండి భౌమకర వంశం పాలకుల పోషణలో ఇది ప్రాముఖ్యత సంతరించుకుంది.

7. ఓదంతపురి (CE 8–12వ శతాబ్దం): బీహార్‌లో ఉన్న ఓదంతపురి ఒక ముఖ్యమైన బౌద్ధ మహావిహారం. ఇది బౌద్ధ విద్యకు ప్రముఖ కేంద్రంగా ఉండి, గరిష్ఠంగా 12,000 మంది విద్యార్థులను కలిగి ఉండేది. దీనిని పాల చక్రవర్తి గోపాల I, 8 వ శతాబ్దంలో స్థాపించాడు.
8. సోమపుర (CE 8 – 12 వ శతాబ్దం): ప్రస్తుత బంగ్లాదేశ్‌లో ఉన్న సోమపుర మహావిహారం ఒక పెద్ద బౌద్ధ విద్యా కేంద్రం, దీనిని పాల రాజు ధర్మపాలుడు 8వ శతాబ్దం చివరలో స్థాపించాడు.

9. నాగార్జునకొండ (CE 2– 6వ శతాబ్దం): ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నాగార్జునకొండ, ఇక్ష్వాకు వంశం (2వ నుండి 4వ శతాబ్దం వరకు) కాలంలో ఒక ప్రముఖ బౌద్ధ విద్యా కేంద్రంగా ఉంది. బౌద్ధ తత్వవేత్త నాగార్జున పేరు మీద దీనిని నామకరణం చేశారు. ఇది మహాయాన బౌద్ధానికి ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. ఆచార్యనాగార్జునుడు ఆధ్వరంలో నెలకొల్పిన బౌద్ధవిద్యాలయం 5 అంతస్థులతో 1500 గదులు కలిగి ఉన్నదని చైనా యాత్రికుడు ఫాహియాన్ (ఐదో శతాబ్దం) పేర్కొన్నాడు.

10. జగద్దాల: 11వ శతాబ్దంలో పాల వంశాధిపతులచే స్థాపించబడిన బౌద్ధ విద్యాలయం.

11. బిక్రమపురా: బంగ్లాదేశ్‌లో ఉన్న ప్రాచీన బౌద్ధ విద్యాలయం. సమాచారం తక్కువ. పాల వంశ పాలనలో అభివృద్ధి చెందింది.

12. వల్లభి (CE 6– 12 శతాబ్దం): గుజరాత్‌లోని వల్లభి, జైన అధ్యయనాలకు కీలక కేంద్రంగా ఉండేది. దీనిని మైత్రక వంశ రాజు భట్టారకుడు 6వ శతాబ్దంలో స్థాపించాడు.

ఇవి కాక ఆ ఫొటోలో ఉన్న మిగిలినవి అన్నీ హిందూ మతానికి చెందిన వేదాధ్యయన కేంద్రాలు. వీటిలో తర్కం, వేదాలు ఉపనిషత్తులు, సంస్కృతవ్యాకరణం, వేదాంతబోధన, జ్యోతిషం, ధర్మశాస్త్రాలు బోధించబడేవి. ఇవి బ్రాహ్మణులకొరకు, బ్రాహ్మణులచే నడపబడిన విద్యాకేంద్రాలు. వీటిలో శూద్రులకు కానీ అతి శూద్రులకు కానీ ప్రవేశం లేదు.

వారణాసిలోని కాశీ విశ్వనాథుని దేవాలయం చుట్టుపక్కల ఉండే గురుకులాలు; కాశ్మీర్ లో శంకరాచార్యులు ప్రతిష్టించిన శారదాపీఠం; ఉజ్జయినిలో ఖగోళశాస్త్రాధ్యయన కేంద్రం; భోజుడు స్థాపించిన భోజ్ శాల; వేదాంత బోధన కొరకు ఆదిశంకరాచార్యులు స్థాపించిన శ్రింగేరి పీఠం; శైవ వైష్ణవ వేదాంత కేంద్రమైన కాంచిపురం; కేరళలోని సంస్కృత విద్యలు గరిపే త్రిస్సూర్; ద్వైత సిద్ధాంతాన్ని బోధించే ఉడిపి వైష్ణవ మఠం; తమిళనాడులోని వేద వాఙ్మయానికి కేంద్రమైన ఎన్నాయిరం.; హిందూ ధర్మశాస్త్రాలకు ప్రసిద్ధి గాంచిన కేరళ లోని కంథల్లార్ శాల; రాష్ట్రకూటుల కాలంలో వేదాధ్యయనం కొరకు స్థాపించబడిన మన్యఖేత మొదలగునవి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో విస్తరించిన హిందూ విద్యాకేంద్రాలు ఇవి చాలామట్టుకు గురుకులాలు మిగిలినవి సన్యాసి మఠాలు.
***
.
II. ప్రాచీన భారతదేశ విద్యా వ్యవస్థ

ప్రాచీనభారతదేశంలో శ్రమణ సంస్కృతితో బౌద్ధ, జైనాలు ఒకవైపు బ్రాహ్మణమతం (హిందూ) మరోవైపు ప్రజల జీవనవిధానాన్ని శాసించాయి. ఈ రెండు మార్గాలు భిన్న తాత్వికపునాదులు కలిగినవి. వాటి విద్యావ్యవస్థలు కూడా భిన్నమైన లక్ష్యాలతో పనిచేసాయి.

1. బౌద్ధమతంలో విద్యావ్యవస్థ:

దీనిలో బుద్ధుని బోధనలు, అష్టాంగమార్గం, బౌద్ధ గ్రంథాలు, తర్క శాస్త్రం, వైద్యం, ఆయుర్వేదం, తత్త్వశాస్త్రం, నీతి, ఆచరణాత్మక జ్ఞానం, పాళి భాష, వ్యాకరణం వంటి అంశాలను విద్యార్ధులకు నేర్పేవారు.

నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేసుకొని, నిర్ధిష్ట పాఠ్యాంశాలు, లక్షలాది పుస్తకాలు కలిగిన గ్రంథాలయాలతో బౌద్ధ విద్యాసంస్థలు అంతర్జాతీయ విద్యార్ధులను ఆకర్షించేవి. నలందాలో చైనా, టిబెట్, కొరియా, మంగోలియా దేశాలనుంచి విద్యార్ధులు వచ్చి విద్యను అభ్యసించేవారు. ఫాయియాన్, హ్యుయాన్ త్సాంగ్, ఇ-త్సింగ్ (Yijing) వంటి వారు ఎందరో అలా నలంద విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు.

ఈ విశ్వవిద్యాలయాలు ప్రధానంగా బౌద్ధపాఠ్యాంశాలు బోధించినప్పటికీ, వైదిక, జైన మతాలకు చెందిన అంశాలను కూడా అందిస్తూ సెక్యులర్ గా వ్యవహరించేవి.

నలందాలో విద్య ఉచితంగా అందించబడేదని; విద్యార్ధుల ప్రతిభను బౌద్ధగురువులు క్షుణ్ణంగా పరీక్ష చేసి ప్రవేశం ఇచ్చేవారని; ఈ పరీక్షలో పదిమందిలో 8/9 మంది విఫలమయ్యేవారని హ్యుయాన్ త్సాంగ్ రాతలద్వారా అర్ధమౌతుంది. విశ్వవిద్యాలయాలను రాజులు పోషించేవారు.
బౌద్ధం చాతుర్వర్ణాలలోని హెచ్చుతగ్గులను తీవ్రంగా ఖండించింది. గంగ, యమున సరయు, మహి లాంటి నదులు సముద్రాన్ని చేరగానే తమ పేర్లను, అస్తిత్వాలను ఎలాగైతే కోల్పోతాయో అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకు చెందిన వారెవరైనప్పటికీ దమ్మాన్ని ఆచరించటం మొదలుపెట్టగానే వారి వారి వర్ణాలను కోల్పోతారు అని వినయపిటక లో బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు.

బౌద్ధ విద్యావ్యవస్థలో కుల, వర్ణ, లింగ బేధాలు లేకుండా ప్రజాస్వామిక పద్దతులలో అందరనూ చేర్చుకొనేవారు. విద్యార్ధులను బౌద్ధికంగా, నైతికంగా, శారీరికంగా ధృఢంగా, సంపూర్ణంగా అభివృద్ధి చెందేలా చేయటం బౌద్ధవిద్యయొక్క లక్ష్యంగా ఉండేది.

ఉపాలి (క్షురక), సునీత (చండాల), సోపాక (చండాల), శివాలి (శూద్ర) ఆనంద, మాతంగ (చండాల) లాంటి శూద్ర, అతి శూద్ర జాతులకు చెందిన పలువురు విద్యనభ్యసించి గొప్ప బౌద్ధ గురువులుగా పేరు తెచ్చుకొన్నారు.

బౌద్ధ విశ్వవిద్యాలయాలు భారీస్థాయిలో ఉండేవి. నలందాలో ఏకకాలంలో రెండువేలమంది గురువులు బోధించటానికి, పదివేలమంది విద్యార్ధులు చదువుకోవటానికి సరిపడా తరగతి గదులు, నివాసగదులు, వంటగదులు ఉండేవంటే అది ఎంత పెద్దదో అర్ధం చేసుకొనవచ్చును. లక్షలకొలది రాతప్రతులు కలిగిన గ్రంథాలయాలు ఉండేవి.

2. బ్రాహ్మణమతంలో విద్యావ్యవస్థ:

బ్రాహ్మణమతం విద్యను బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం చేసింది. వైశ్యులు, క్షత్రియులు కొన్ని మినహాయింపులతో కొంతమేరకు నేర్చుకొనవచ్చును కానీ వేదాధ్యయనం చేయటానికి బ్రాహ్మణులకు మాత్రమే అర్హత. శూద్రులు కనీసం వేదాలను వినరాదని, వింటే చెవిలో కరిగించిన సీసం పోయాలంటూ అతి క్రూరమైన ఆంక్షలను బ్రాహ్మణులు స్మృతులరూపంలో రాసుకొన్నారు. శూద్రులు విద్యను నేర్చుకోకూడదని ఆంక్షలు విధించారు. అతిశూద్రులైతే స్మృతులప్రకారం అసలు మనుషులేకారు. ఏకలవ్యుడు, శంబుకుని కథలు ఆనాటి సమాజంలో శూద్రులు విద్యనేర్చుకొంటే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుపుతాయి.

వేదాలు, ఉపనిషత్తులు, వ్యాకరణం, ఖగోళశాస్త్రం, తత్త్వశాస్త్రం, జ్యోతిషశాస్త్రం, ధర్మశాస్త్రాలు మొదలగునవి హిందూ విద్యాసంస్థలలో పాఠ్యాంశాలుగా ఉండేవి.

గురుకులాలు (ఒక బ్రాహ్మణ గురువు నేతృత్వంలో నడపబడే పాఠశాల), మఠాలలో (సన్యాస కేంద్రాలు) హిందూ వేదాంత విద్య నేర్పబడేది. బట్టీవేయడం ద్వారా వేదాలను అధ్యయనం చేసేవారు. హిందూ విద్య బౌద్ధవిద్య వలే కేంద్రీకృతమై ఉండేది కాదు. ఎక్కడికక్కడ స్థానికంగా ఒక గురువు గురుదక్షిణ తీసుకొని విద్యను అందించే చిన్నచిన్న పాఠశాలలు. ఇవి బౌద్ధ విశ్వవిద్యాలయాలయాల వలే వ్యవస్థీకృతంగా విశాలమైనవి కావు.

హిందూ విద్యాకేంద్రాలు బ్రాహ్మణులచే బ్రాహ్మణులకొరకు ఏర్పాటుచేసుకొని, విద్య అనేది సమాజంలో బ్రాహ్మణ వర్గానికి మాత్రమే పరిమితంచేసి, శూద్రవర్గానికి విద్యను దూరం చేసిన ఒక దుర్మార్గ వ్యవస్థ.

III. ముగింపు

ప్రాచీన భారతదేశంలోని బౌద్ధ విశ్వవిద్యాలయాలు సామాజిక సమానత్వం, జ్ఞాన ప్రసరణ ఇంకా ప్రపంచవ్యాప్తంగా సంస్కృతులను కలిపే కేంద్రాలుగా నిలిచాయి. కాగా బ్రాహ్మణ విద్యావ్యవస్థ కుల ఆధారిత ఆంక్షలతో సామాజిక విభజనను మరింత బలపరిచింది. ఈ రెండు వ్యవస్థల చారిత్రక భిన్నత్వాన్ని గుర్తించాలి. చరిత్రను నిజాయితీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. బౌద్ధ విశ్వవిద్యాలయాలు సర్వసమాజ సమైక్యతకు చిహ్నాలుగా నిలిచి అందరూ సమానమేనని నిరూపించగా హిందూ గురుకులాలు ప్రత్యేక వర్గ ప్రయోజనాలను కాపాడాయి.

ఎనిమిదవ శతాబ్దంలో ఉద్యోతన సూరి అనే జైనాచార్యుడు రాసిన కువలయమాల అనే గ్రంథంలో వేదాధ్యయనం చేస్తున్న కొద్దిమంది విద్యార్ధులను ఎద్దేవా చేస్తూ…......"వీరు వేదాలను భట్టీయం వేస్తున్నారు; బలమైన కండలు తిరిగిన దేహంతో నిత్యం వ్యాయామం చేస్తూ లెక్కలేనితనంతో హింసాత్మక ధోరణితో జీవిస్తున్నారు; వీళ్ళంతా నైతికవిలువలు లేని మూర్ఖుల సమూహం" అని అన్నాడు ----- హిందూమతం ఇంకా పూర్తిగా స్థిరీకరింపబడని కాలంలో వేదాలను అధ్యయనం చేస్తున్న హిందు విద్యార్ధుల పట్ల జైనుడైన ఉద్యోదనసూరి చేసిన ఈ వ్యాఖ్యలు చారిత్రికంగా విలువైనవి. (రి. Kuvalayamala, Part II, A.N. Upadhye, Pn. 124)

బ్రాహ్మణులకు తప్ప సమాజంలో ఎవరికీ ఉపయోగపడని హిందూ విద్యాకేంద్రాలను, కుల లింగ బేధాలకు అతీతంగా ప్రపంచంలోని అందరికీ సమానంగా విద్యను అందించిన బౌద్ధ విశ్వవిద్యాలయాలతో కలిపి చెబుతూ సనాతనవాదులు గొప్పలు పోవటం, ఎవరికో పుట్టిన బిడ్డను సొంతబిడ్డగా చెప్పుకోవటంలాంటిది. చరిత్రను వక్రీకరించటమే.

బొల్లోజు బాబా



Thursday, April 10, 2025

ఏ మతం వద్ద ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి?



ఏ మతం వద్ద ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి?

సుమారు 9.4 లక్షల ఎకరాలతో వక్ఫ్ భూములు, ఆర్మీ (18 లక్షల ఎకరాలు) రైల్వేల (12 లక్షల ఎకరాలు) తరువాత దేశంలో మూడవ అతిపెద్ద మొత్తానికి చెందిన ఆస్తిగా నిలిచింది.

ఈ 9.4 లక్షల ఎకరాల వక్ఫ్ భూములలో సుమారు 2 లక్షల ఎకరాలలో స్మశానాలు, 1 లక్ష ఎకరాలలో మసీదు, దర్గాలు, యాభైవేల ఎకరాలలో స్కూళ్ళు, 5.9 లక్షల ఎకరాలు వ్యవసాయ సంబంధ, ఇతర భూములు గాను ఉన్నాయి.

ఈ భూములలో సుమారు 18 వేల మదరాస స్కూల్స్, 350 వరకూ కాలేజీలు, 100 వరకూ హాస్పటల్స్ నడుస్తున్నాయి.

ఇతరమతాలు కలిగి ఉన్న భూముల వివరాలు ఇలా ఉన్నాయి.

వక్ఫ్ భూములు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఆధీనంలో ఉంటాయి కనుక వాటి లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. హిందూమతానికి చెందిన ఆలయభూములు అలాకాక వివిధ రాష్ట్రాల ఆధీనంలో ఉంటాయి. కనుక ఆయా రాష్ట్రాల లెక్కల ఆధారంగా దేశంలో హిందు ఆలయాలకు చెందిన భూములు సుమారు 15 నుండి 20 లక్షల ఎకరాలు ఉండవచ్చునని ఒక అంచనా. ఇదే నిజమైతే దేశంలోనే అథ్యధికంగా భూములు కలిగి ఉండటంలో హిందూమతం మొదటి స్థానంలో ఉంటుంది.

తమిళనాడులో 4.78 లక్షల ఎకరాల ఆలయ భూములు కలవు. ఆంధ్ర ప్రదేష్ లో 4 లక్షల ఎకరాలు, తెలంగాణలో 87 వేల ఎకరాలు, కర్ణాటకలో 15 వేల ఎకరాలు, ఒడిసాలో 12 వేల ఎకరాలు, బీహార్ లో 22 ఎకరాల భూములు కలిగి ఉన్నాయి. పెద్దరాష్ట్రాలైన ఉత్తర ప్రదేష్, రాజస్తాన్, మహరాష్ట్రాలలో దేవాలయ భూములు ఏ మేరకు ఉన్నాయో అధికారిక గణాంకాలు లేవు. దేశవ్యాప్తంగా మొత్తంమీద 15 నుండి 20 లక్షల ఎకరాల హిందూ ఆలయభూములు ఉన్నాయని భావించవచ్చు.

హిందూ ఆలయభూములలో 13 వేల స్కూల్స్, 800 వరకూ కాలేజీలు, 300 వరకూ హాస్పటల్స్ నడపబడుతున్నాయి.

క్రిస్టియన్ మతానికి చెందిన భూములు దేశంలో సుమారు 10 నుంచి 15 లక్షల ఎకరాలు ఉండవచ్చునని ఒక అంచనా. ఇది ప్రధానంగా వ్యవసాయేతర భూమి. దేశంలో భారతప్రభుత్వం తరువాత అత్యధిక వ్యవసాయేతర భూమి కలిగిన వ్యవస్థగా చర్చ్ ని చెబుతారు.

చర్చ్ కి చెందిన భూములలో చర్చ్ లు, సెమెటరీలు కాక 14 వేల స్కూళ్ళు, 300 కాలేజీలు, 2500 హాస్పటల్స్ ఉన్నాయి.
ఇదే విధంగా బౌద్ధులకు 50,000 ఎకరాల వరకు భూములు, సిక్కుల వద్ద 2 లక్షల ఎకరాల వరకూ భూములు ఉన్నాయి.

ఇక వ్యక్తులవద్ద చూసినట్లయితే ఆదాని గ్రూప్ కు 16 వేల ఎకరాలు, DLF వద్ద 15 వేల ఎకరాలు, రిలయన్స్ వద్ద 9 వేల ఎకరాల భూములు ఉన్నాయి.

***

కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. కేంద్ర వక్ఫ్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.

ఇక వక్ఫ్ భూములకు సంబంధించి వక్ఫ్ కమిటీలో తప్పనిసరిగా హిందువులు కూడా ఉండాలని ఇటీవల పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం రాజకీయ ప్రేరేపిత చర్య కావచ్చు. దేశంలో మరే ఇతర మతసంస్థల ఆస్థులకు సంబంధించిన కమిటీలలో అన్యమతానికి చెందిన సభ్యులు ఉండరు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాధికారులైన కలక్టరు కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఆ ఆలయ కమిటీకి ఎక్స్ అఫిషియో మెంబరుగా ఉన్నప్పుడు- ఒకవేళ ఆ అధికారులు వేరే మతానికి చెందినవారైనప్పటికీ కమిటీలో ఉంటారు తప్ప కావాలని “కొందరు సభ్యులు తప్పని సరిగా వేరేమతానికి చెందిన వారై ఉండాలి” అనే క్లాజ్ తో ఏ ఆలయ బోర్డు కానీ ఎండో మెంటు కమిటీ కానీ ఏర్పడదు. ఉదాహరణ టిటిడి బోర్డులో అందరూ హిందువులే మెంబర్లుగా ఉంటారు. ఇతరులకు స్థానం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఒక్క క్లాజుతోనే వక్ఫ్ బోర్డ్ సవరణలు వివాదాస్పదం అవుతున్నాయి.

బొల్లోజు బాబా

(పై గణాంకాలు ఎఐ ద్వారా సేకరించినవి. సరైన ఆధారాలతో విభేదించవచ్చు)

Wednesday, April 9, 2025

ప్రాచీనగాథలు ముందుమాట



“ప్రాచీనగాథలు” పుస్తకానికి నేను రాసుకొన్న ముందుమాట. ఇవి వివిధ కావ్యాలలోంచి తీసుకొన్న మొత్తం 500 పైన గాథలకు తెలుగు అనువాదం. ఇటీవల కొన్ని గాథలను రీల్స్ గా పోస్ట్ చేసినపుడు గొప్ప ఆదరణ లభిస్తోంది. ఈ పుస్తకాన్ని ఛాయావారు ప్రచురించారు. ప్రాచీన గాథలు పుస్తకం అమజాన్ లో లభిస్తుంది. లింక్ మొదటి కామెంటులో ఉంది. దయచేసి ఆదరించగలరు

బొల్లోజు బాబా

*****

మనవి మాటలు

గాథ అనగా ఉత్తమమై, ఉదాత్తమై, రసానుకూలమైన ఒక సంఘటన అని నిర్వచించారు గాథాసప్తశతిని తెలుగుచేసిన శ్రీ గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి. ఈ పదాన్ని వివిధ ముక్తక కావ్యాలలోని పద్యాలకు కూడా వర్తింపచేయటం ఆక్షేపణీయం కాదని తలచి, ఈ పుస్తకంలోని వివిధ పద్యాలను గాథలుగా పేర్కొనటం జరిగింది.

చాన్నాళ్ళక్రితం సప్తశతిగాథలను చదివినపుడు వాటిలోని కవిత్వానికి ఆకర్షితుడనై కొన్ని గాథలను అంశాలవారిగా విభజిస్తూ అనువదించాను. ఆ తరువాత సప్తశతి గాథలలోని చారిత్రిక అంశాలను విశ్లేషిస్తూ కొన్ని వ్యాసాలు రాసాను. చరిత్రపట్ల ఆసక్తి పెరుగుతున్న కొద్దీ ప్రాచీన సాహిత్యం కొత్తకొత్త కోణాలలో దర్శనమివ్వటం మొదలైంది, ముఖ్యంగా ప్రాకృత సాహిత్యం. గౌడవహో, వజ్జాలగ్గం, కువలయమాల, లీలావాయీ, సేతుబంధ లాంటి వివిధ ప్రాకృత కావ్యాలలోని చారిత్రిక అంశాలను విశ్లేషిస్తూ వ్యాసాలు రాసాను. రెండువేల ఐదువందల సంవత్సరాల క్రితం రాసిన థేరీగాథలు, వాటి చారిత్రిక నేపథ్యం పట్టి కుదిపాయి. వాటిని అనువదించి 2022 లో పుస్తకరూపంలో తెచ్చాను.

ఇదే క్రమంలో ప్రేమస్వరాలు పేరుతో తిరుక్కురల్‌ నుంచి కొన్ని, అమరశతకం నుంచి కొన్ని గాథలను అనువదించాను. ప్రాచీన సాహిత్యంలో ఋతువర్ణనలు పేరుతో వ్యాసపరంపర రాస్తున్న సమయంలో నాకు ‘సంగం కవిత్వం’ పరిచయం అయింది. స్వచ్ఛమైన మానవానుభవాలు అవి. ఆ గాథలలోని చరిత్ర, ఉద్వేగాలు గొప్ప ఊహాతీత లోకంలోకి తీసుకొని వెళతాయి. సంగం కవిత్వం ఈ పుస్తకపు మొదటి అధ్యాయం, నా సరికొత్త మోహం.

చివరి అధ్యాయం ‘నానావిధ’ పేరుతో వివిధ సందర్భాలలో చేసిన ప్రాచీన గాథల అనువాదాలు. వీటిలో కొన్ని పదహారవ శతాబ్దానికి చెందిన గాథలు కూడా ఉన్నాయి.

నిజానికి సప్తశతి, ఇతర కావ్యాలపై నేను రాసినవి వాటిలోని చరిత్రను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలు. కానీ ఈ పుస్తకంలో గాథలన్ని ఒకచోటికి చేర్చి, విశ్లేషణా అంశాలను పుస్తకం చివర నోట్సు రూపంలో ఇచ్చాను. కవిత్వాన్ని, వచనాన్ని వేరుచేయాలనే ఉద్దేశంతో.

***

కవి తను జీవించిన కాలానికి ప్రతినిధి. ఈ ప్రాచీన కవులు తమ కాలాన్ని ఇలా నిక్షిప్తం చేసారు. శాసనాలలో దొరికే చరిత్రలో పేర్లు, తారీఖులు మాత్రమే ఉంటాయి. సాహిత్యంలో కనిపించే చరిత్రలో ప్రజలు రక్తమాంసాలతో సంచరించటం గమనించవచ్చు. ఈ గాథలలో ఎక్కువ భాగం శతాబ్దాల క్రితం జీవించిన సామాన్యుల జీవితాలను ప్రతిబింబిస్తాయి. వారి కష్టాలు సుఖాలు, ఆశలు నిరాశలు, సమాజం, సంస్కృతి, ఆచార వ్యవహారాలను తెలియచేస్తాయి. ఈ రచనలో కొంతమేరకు ఆనాటి subaltern జీవితాన్ని కూడా గుర్తించవచ్చు. సాధారణత్వమే ఈ గాథలకు అంతస్సూత్రం.

ఏ అనువాదము అంతిమం కాదని విశ్వసిస్తాను. ఈ అనువాదాలను మూల విధేయంగా ఉంటూనే భాషాంతరం చేయటంలో శక్తిమేరకు ప్రయత్నించానని అనుకొంటాను. సహృదయులు అర్థం చేసుకొంటారని ఆశిస్తాను.

ఈ పుస్తకరచనలో శ్రీ ఉరుపుటూరి శ్రీనివాస్‌ గారు చేసిన సూచనలు, సలహాలు ఎంతో విలువైనవి. ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయాన్ని సమీక్షించి చెప్పిన విలువైన అభిప్రాయాలు, సవరణలు ఈ రచనను మెరుగుపరిచాయి. వారికి నేను ఋణపడి ఉన్నాను. వారు ఈ పుస్తకానికి రాసిన చక్కని విశ్లేషణాత్మక ముందుమాటకు ఎంతో కృతజ్ఞుడను.


లభించు చోటు



భవదీయుడు

బొల్లోజు బాబా



Friday, March 21, 2025

Please subscribe to my YouTube channel

 Please kindly subscribe my YouTube channel. Please


https://www.youtube.com/@bolloju

Sunday, February 23, 2025

శంకరాచార్యుని పోస్టుపై ఒక మిత్రునితో మంచి చర్చ జరిగింది

శంకరాచార్యుని పోస్టుపై ఒక మిత్రునితో మంచి చర్చ జరిగింది. ఆ పోస్టుకు కొనసాగింపుగా ఆ కామెంట్లను ఒక పోస్టుగా పెడుతున్నాను.
.
మీరు పారమార్ధిక ప్లేన్ లోంచి మాట్లాడుతున్నారు. భౌతికంగా అలా లేదు. శంకరుడే స్వయంగా చెప్పాడు శూద్రుడు విద్యకు అనర్హుడు అని. ఎవరు ఎక్కడుండాలో వాళ్ళు అక్కడుండాలని. బౌద్ధ జైనాల్ని నిర్మూలించటంలో పాపం లేదని.
వీటిని మినహాయించి చేసే ఏ వాదనైనా, చెప్పే ఏ అన్వయమైనా నేటికీ సాగిస్తున్న మోసం అని భావిస్తాను.
.
బౌద్ధజైన సిద్ధాంతాలు కనుమరుగు అయ్యాయని చెప్పలేదు. అవి హిందూమతంలోకి అస్సిమిలేట్ అయ్యాయని పంచాయత ఆరాధన పారాగ్రాఫులో చెప్పాను.
అద్వైతాన్ని సిద్ధాంతపరంగా బౌతికవాదులు ఎదుర్కోలేరు. చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణాన్ని , బౌద్ధులు ప్రత్యక్ష మరియు అనుమాన ప్రమాణాలను మాత్రమే అంగీకరించిన భౌతికవాదులు.
వీటితో పాటు ఉపమాన, శబ్ద, అర్ధాపత్తి, అనుపలబ్ది లాంటి ప్రమాణాలను కూడా అంగీకరిస్తారు అద్వైతులు.
వీరిద్దరి మధ్యా శాస్త్ర చర్చలో అద్వైతులే విజయం సాధిస్తారు. ఎందుకంటే శబ్ద, ఉపమాన అర్ధాపత్తి లాంటి వాటికి ఆధారాలు చూపక్కరలేదు. అభౌతికమైన అంశాలను కూడా వాటిసాయంతో సత్యాలుగా చలామణీ చేయించవచ్చు.
కనుక వారిరువురి పోటీలో అద్వైతులు నెగ్గటం మోసపూరితమైనది.
శంకరుడు చేసిన పని అది. ఈ పని ద్వారా బ్రాహ్మణాధిక్యత వచ్చి, బ్రాహ్మణుడినే ఈ ఆథ్యాత్మిక క్రతువులలో అధిపతిగా నిలిపినపుడు- శతాబ్దాలుగా పండితులు ఈ మోసాన్ని అనేక తలతిక్క అన్వయాలతో సమర్ధిస్తూనే ఉన్నారు.
వ్యాసంలో ఎక్కడో చెప్పినట్టు ఈ పురాణపురుషులు చెప్పినది ఏమిటి అని కాక, దానివల్ల సమాజం ఏ ఏ మలుపులు తీసుకొంది అనేది ముఖ్యం. నాకు కనిపించేది ఏమిటో స్పష్టంగా చెప్పాను. ఈ శంకరాచార్యుని నిర్వాకం వల్ల అశాస్త్రీయత, మూఢత్వం, బ్రాహ్మణాధిక్యత, వర్ణవ్యవస్థ లాంటి అవలక్షణాల వైపు సమాజం ప్రయాణించింది. అది పండితులకు మేలు చేసింది కనుక శంకరుడిని భక్తితో నేటికీ పూజిస్తారు.
నేను అలా చూస్తున్నాను. అలా గతం నాకు కనపడుతుంది. మీకు మరోలా కనిపించవచ్చుననే అవకాశాన్ని కాదనను.
.
తత్వం నాశనం అయిందని ఎవరన్నారు. ఎందుకు పదే పదే అంటారు ఆ మాట. నేను స్పష్టంగా చెప్పాను. తత్వాలు అస్సిమిలేట్ అయ్యాయని. ఏటా శంకరజయంతులు ఎవరు చేస్తున్నారు?
వైవిధ్యం శంకరుడితో వచ్చిందా? హాస్యాస్పదం. శంకరుని కాలానికే భిన్న పాయలు ఉన్నాయి.
మీరు భౌతిక స్థాయిలో మాట్లాడండి. శంకరనిర్వాకం వల్ల సమాజంలో ఏం జరిగి ఉంటుందో చెప్పాను. అలా జరగలేదని ఉపపత్తులు ఇవ్వండి. ఏ వేవో మాట్లాడితే ఎలా?
ఇస్లాంని కానీ క్రిస్టియానిటీని గానీ గౌరవించటం, సూఫీ దర్గా కల్చర్ ని ఆదరించటం అనేది బౌద్ధజైన కాపాలికాదుల్ని నిర్మూలించిన శంకరాచార్యుని వల్ల వచ్చింది అంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది.
నిజానికి ఈ సమాదరణ అనేది భారతదేశ ఆత్మ. అశోకుని 12 వ శాసనంలో ఇలా ఉంది.
///ఒక పాషండ శాఖ/మతం కి చెందిన వ్యక్తులు అసందర్భంగాతమ శాఖను పొగుడుకోవడం, ఇతర శాఖ/మతాలను నిందించడం చేయరాదు. పరశాఖల/మతం వారిని కూడా గౌరవించవలెను. ఇట్లు చేయుట వలన తన మతాన్ని అభివృద్ధి చేసుకోవటంమే కాక ఇతర శాఖలవారికి ఉపకారం కలిగించిన వారు అయెదరు. తన వారిని స్తుతిస్తూ ఇతరశాఖల వారిని నిందించేవాడు తన శాఖకే ఎక్కువ అపకారం చేసిన వాడవుతాడు// సమస్త జనులకు ధర్మాభివృద్ధే ముఖ్యము తప్ప దానం కాని, పూజ కాని అంత ముఖ్యాలు కావు అని దేవానాం ప్రియుడు తలుస్తున్నాడు. (XII శిలాశాసనము)///
క్రీపూ 3 వ శతాబ్దానికి శంకరాచార్యుడు ఎక్కడున్నాడు. సమత, సహిష్ణుతలను ఈ నేలకు నేర్పిందే బౌద్ధ, జైనాలు. వాటిని నిర్మూలించి ఈ రోజు మనందరినీ అన్యమతాలను పీక్కుతినే జాంబీలుగా చేసింది ఎవరు? యూట్యూబ్ తెరవండి ఒకసారి అర్ధమౌతుంది.

బొల్లోజు బాబా