Monday, January 24, 2022

సుజాత - థెరిగాథ .

 సుజాత - థెరిగాథ

.
అన్నిరోజుల్లాగే ఆరోజు కూడా మొదలైంది
చక్కని దుస్తులు ధరించాం, అల్పాహారాలు తిన్నాం
తినుబండారాలు, పానీయాలు మూటగట్టుకొని
బృందావనానికి వ్యాహ్యాళికి బయలుదేరాం
అంజనా వనాన్ని దాటేటపుడు
“ఆరామాన్ని దర్శించటానికి రా” అని ఎవరో
పిలుస్తున్నట్లు వినిపించింది
తలుపు తెరిచాం
అక్కడ ఆయన
నాకెలా తెలిసింది?
ఆ కళ్ళు
మౌనంగా ఎదురుగా కూర్చొన్నాను
బుద్ధభగవానుడు ధమ్మను బోధించారు.
నువ్వే
సిద్ధంగా ఉన్నావా మరి?
అన్నిరోజుల్లాగే ఈ రోజు కూడా మొదలయ్యిందా?
.
సుజాత ఒక సంపన్న వర్గ స్త్రీ. ఆమె తల్లిదండ్రులు ఒక చక్కని ధనవంతుడైన అబ్బాయికిచ్చి పెళ్ళి చేసారు. ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని సాగిస్తున్న సుజాత ఒకనాడు బుద్ధభగవానుని దర్శించి, ఆయన బోధనలు విని సన్యసించాలని నిర్ణయించుకొంటుంది. భర్త, అత్తమామల అనుమతితో మఠవాసినిగా మారింది.
అనువాదం
బొల్లోజు బాబా

. రోహిణి – పరిభ్రమించే నక్షత్రం



నేను ఇంతవరకూ ఎన్నో అనువాదాలు చేసాను. ఇన్నాళ్ళకు ఈ విషయంలో ఒక awe struck moment ఎదురయింది.
థేరీగాథలకు Anagarika Mahendra, Charles Hallisey, C.A.F. Rhys Davids Susan Murcott లు చేసిన ఇంగ్లీషు అనువాదాలనుండి వాటిని ఇప్పటికే పూర్తిగా అనువదించాను. ఆ గాథలకు ఎండ్ నోట్స్ లు రాస్తున్నపుడు The First Free Women (2020) పేరుతో Matty Weingast థెరిగాథలకు చేసిన అనువాదం కంటబడింది. అది చదువుతున్నప్పుడు I was so excited and spellbound.
ఇప్పటివరకూ థెరిగాథలకు నే చూసిన అనువాదాలన్నీ యధాతధానువాదాలు. Susan Murcott అనువాదం మాత్రం కొంత కవితాత్మకంగా ఉంటుంది.
ఇక Matty Weingast చేసిన అనువాదం పూర్తిగా స్వేచ్ఛగా, కవితాత్మకంగా సాగుతుంది. మాతృకలోని ఆత్మనుమాత్రమే తీసుకొని దానిని నిలువెత్తు కవితగా పోతపోసాడు. ఇది చాలా కొత్తగా మూలానికి ఏమాత్రం సంబంధంలేనట్టు కనిపిస్తున్నా, సారంమాత్రం మాతృకదే అనే విషయం పరిశీలించి చూస్తే తప్ప అర్ధంకాదు.
అనువాదం/అనుసృజన ఇంత గొప్పగా చెయ్యొచ్చా అని అనిపించింది.
రోహిణి అనే థెరిగాథకు ఆత్మ ధమ్మపథం విశిష్టతను చెప్పటం. దాన్ని Matty Weingast ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి....
.
రోహిణి – పరిభ్రమించే నక్షత్రం
.
దుస్తులు తొడుక్కునంత మాత్రాన
నువ్వు వస్త్రంగా మారిపోవు
భిక్షాపాత్రను మోసుకుతిరిగినంత మాత్రాన
నీకు నువ్వు శూన్యంగా మారవు
సూర్యుడు నీకు వందనమిడడు
చెట్లు నీ పాదాలముందు పువ్వులు కురిపించవు
పిలిచినంత మాత్రాన పక్షులు కూ అని బదులివ్వవు
పథం నీ పెద్దపెద్ద తప్పులను కూడా భరిస్తుంది
పథం నీ పశ్చాత్తాపాలకు కూడా చోటు ఇస్తుంది
అయినప్పటికీ నువ్వుమాత్రం రాత్రికి రాత్రి
నీ దుస్తుల వస్త్రంగా మారిపోలేవు
అది చాలా నెమ్మదిగా మొదలౌతుంది
చాలాసార్లు నువ్వు గమనించవు కూడా
నీ చర్మంపై వాన చుక్క స్పర్శలా
సొరుగులో కత్తిలా
నీజీవితపు ఆఖరువి కాని తదుపరి
ఐదు క్షణాల్లా- అలా
నువ్వు నీ దుస్తుల వస్త్రంగా మారటం
చాలా నిశ్శబ్దంగా మొదలౌతుంది
పథం అనేది పటంలోని గీత కాదు
అది గొప్పగా ప్రకాశించే ఒక ప్రపంచం
నువ్వు ఎక్కడనుంచైనా దానిలోకి ప్రవేశించవచ్చు
ప్రవేశించాకా
ఒకటి రెండు సార్లు నువ్వు బయటకు నెట్టివేయబడొచ్చు
దాని వెలుపలి పొరల్ని ఛేదించగలిగితే
నా సహచరీ!
అప్పుడు నీకు అందుతుంది
పథం పలికే ఆహ్వానం
అదే పథం యొక్క సారం, స్వభావం
Matty Weingast




Friday, January 21, 2022

భద్ద కుండలకేశ

 భద్ద కుండలకేశ

శిరోముండనం గావించుకొని
దుమ్ముపట్టిన దుస్తులు ధరించి
తప్పులు లేనిచోట తప్పులు ఉన్నాయని
తప్పులు ఉన్నచోట వాటికి అంధురాలినై
సంచరించేదానిని
యాభై ఐదేండ్లపాటు
అంగ, మగధ, వజ్జీ, కాశి, కోశల రాజ్యాల
నలుమూలలా పర్యటించాను
ఆ రాజ్య ప్రజలు ఇచ్చిన భిక్షను తిన్నాను
ఒకనాడు
నిర్మలమైన బుద్ధభగవానుడు శిష్యులతో కలసి వుండగా
గృధ్రకూటపర్వతం వద్ద చూసాను
ఎదురుగా మోకాళ్లపై కూర్చొని
చేతులు జోడించి భక్తితో నమస్కరించాను
“రా భద్దా” అన్నారాయన
ఆ క్షణమే నా దమ్మ దీక్షా స్వీకారం జరిగింది
తధాగతుడు ఇచ్చిన వస్త్రాన్ని ధరించిన భద్ధ
అన్ని బంధనాలనుంచి విముక్తమయింది.
***
రాజగృహలో ఒక వడ్డీవ్యాపారస్తుని కుమార్తె భద్ద. ఒకరోజు పురవీధిలో మరణదండన విధించటానికి తీసుకొని వెళుతున్న ఒక దొంగను చూసి మనసుపారేసుకొని, అతనిని తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోను అని తల్లిదండ్రులకు చెప్పటంతో- భద్ధ తండ్రి తలారులకు భారీగా లంచాలిచ్చి ఆ దొంగను రహస్యంగా విడిపించి ఇంటికి తీసుకొని వచ్చి, స్నానం చెయించి, అలంకరించి, కూతురు ముందు నిలబెట్టాడు. ఆ దొంగ పేరు సత్తుక. ఇంతచేసినప్పటికీ ఇతనిలో ఏ మార్పు రాక, భద్ధ ఒంటిపై ఉన్న నగలను ఎలా దొంగిలించాలా అని ఆలోచించసాగాడు.
మరణ దండన నుండి తప్పించుకొన్నందుకు కొండదేవతకు మొక్కుకున్నానని, అది తీర్చుకొనటానికి అని భద్దను నమ్మించి ఆమెను ఒక పెద్దకొండపైకి తీసుకొనివెళ్ళాడు సత్తుక. అక్కడ ఆమె ఒంటిపై ఉన్న నగలను దొంగిలించి ఆ కొండపైనుండి క్రిందకు త్రోసేసి చంపెయ్యాలని అతని పథకం. అతని పన్నాగాన్ని గ్రహించిన భద్ధ, మిమ్ములను చివరిసారిగా ఒకసారి కౌగిలించుకోవాలని ఉన్నది నా ఆఖరుకోర్కె తీర్చమని అని అడిగి, కౌగిలించుకొని క్షణకాలంలో అతనిని ఆ కొండపైనుంచి త్రోసి చంపివేసింది.
ఇంత జరిగాక భద్ధకు ఇంటికి వెళ్ళటానికి మొఖం చెల్లక, శ్వేతాంబర జైన మతంలో చేరి సంచార సన్యాసిగా జీవనం ప్రారంభించింది. అప్పట్లో జైనమతం తీసుకోవాలంటే తలపై జుత్తును చేతితో పెకలించుకోవాలి. ఆ విధంగా చేయటంవలన కేశాలు చిక్కులు పడటంతో అప్పటినుండి బద్ధకు బద్ధ కుండలకేశ అనే పేరు వచ్చింది. ఈమె జైనబోధనలను మొక్కవోని దీక్షతో సంపూర్ణంగా అధ్యయనం చేసి దేశసంచారానికి బయలుదేరింది.
ఏదైనా ఊరు వెళితే అక్కడ ఒక ఖాళీ స్థలంలో ఒక నేరేడు కొమ్మను పాతి తనతో ఆథ్యాత్మికంగా వాదించేవారికొరకు ఎదురుచూసేది. ఆ ఊరిలో ఎవరైనా ఈమె తో వాదించాలనుకొంటే ఆ నేరేడు కొమ్మను తొలగించి, ఈమెతో వేదాంత చర్చ చేసేవారు. అలా ఈమె యాభై ఏండ్లపాటు ప్రాచీన ఉత్తరభారతదేశంలోని అనేక పట్టణాలు సంచరించి ఎందరినో తన వాదనాపటిమతో ఓడించి దిగ్విజయయాత్ర జరుపుతూ ఒకనాడు శ్రావస్తి వచ్చింది. అక్కడ బుద్ధుని శిష్యుడైన సరిపుత్త తో వాదనకు దిగింది. వీరిరువుతూ హోరాహోరిగా వేదాంత చర్చ చేసారు.
సరిపుత్త జ్ఞానసంపత్తిని గ్రహించిన భద్ధకుండలకేశ అతనిని గురువుగా ఉండమని కోరింది. సరిపుత్త బుద్ధునివద్దకు వెళ్ళమని చెప్పటంతో, భద్ధకుండలకేశ గృద్ధకూటపర్వతంపై ఉన్న బుద్ధభగవానుని చేరి నమస్కరించగానే, ఆయన “రా భద్ధా” అన్నాడట. ఆ మాటే భద్ధ కు బుద్ధుడు నేరుగా ఇచ్చిన దీక్షగా పరిగణిస్తారు.
అనువాదం
బొల్లోజు బాబా












Tuesday, January 11, 2022

తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 7

 తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 7

[పున్నిక:]
నేను నీళ్ళు మోయు దాసిని
యజమానురాలి తిట్లకు, శిక్షలకు భయపడి
ఎంతచలిలోనైనా నేను నదిలో దిగకతప్పదు
ఓ బ్రాహ్మణుడా!
కాళ్ళుచేతులు వణికే ఇంతచలిలో
నీవు దేనికి భయపడి నీటిలో మునుగుతున్నావు?
[ఉదకసుద్ధిక:]
పున్నికా! నీకు అన్నీ తెలుసు
నదీ స్నానం సర్వపాపాలను హరిస్తుంది
దుష్కర్మలనుండి విముక్తులను చేస్తుంది
[పున్నిక:]
నీటిలో మునిగితే
పాపవిముక్తి జరుగుతుందని ఎవరన్నారు?
ఒక అంధుడు మరొక అంధునికి దారిచూపినట్లు.
అదే నిజమైతే
కప్పలు, తాబేళ్ళు, నీటిపాములు, మొసళ్లు లాంటి
జలచరాలన్నీ స్వర్గార్హత పొందిన పుణ్యజీవులేనా!.
జంతువులను వధించువారు, వలలు వేసేవారు,
ఉచ్చులు పన్నేవారు, దొంగలు, హంతకులు, దుర్మార్గులు
ఈ నీరు నెత్తిపై చల్లుకొంటే వారి వారి పాపాలు తొలగి
పుణ్యాత్ములౌతారా?
ఈ నీటికే పాపాలను తొలగించే శక్తే ఉంటే
పుణ్యాలను కూడా తీసుకుపోగలదు కదా!
అప్పుడు నీవు రెండిటినుండి విముక్తుడవు అవుతావు.
పాపభీతితో ఎముకలు కొరికే చలిలో స్నానం చేస్తూ
నీ శరీరాన్ని కష్టపెట్టుకోకు
[ఉదకసుద్ధిక:]
ఓ వనితా!
నేను తప్పు మార్గంలో వెళుతున్నాను
నీవు నన్ను ఉత్తమ మార్గం లోకి మళ్ళించావు
ఈ వస్త్రాన్ని నీకు ఇస్తున్నాను, స్వీకరించు
[పున్నిక:]
వస్త్రాన్ని నీవే ఉంచుకో, నాకు అవసరం లేదు.
దుఃఖం అంటే భయం ఉన్నప్పుడు
దుష్కర్మలు చేయవద్దు చీకట్లోనైనా లేదా వెలుగులోనైనా
చెడ్డపనులు చేసి వాటినుంచి పారిపోయినప్పటికీ
వాని తాలూకు దుఃఖం నుంచి తప్పించుకోలేవు.
దుఃఖం నుండి విముక్తి పొందాలంటే
తధాగతుడిని, ధమ్మాన్ని, సంఘాన్ని ఆశ్రయించు
ఉపదేశాలను ఆచరించు. మంచి జరుగుతుంది.
[ఉదకసుద్ధిక:]
తధాగతుడిని, ధమ్మాన్ని, సంఘాన్ని ఆశ్రయించాను
ఉపదేశాలను ఆచరించాను. మంచి జరిగింది.
ఒకప్పుడు నేను బ్రాహ్మణసంతానాన్ని మాత్రమే
నేనీనాడు త్రివిద్యలను అభ్యసించి పరిశుద్ధుడనైన
నిజమైన బ్రాహ్మణుడను.
***
పున్నిక
.
బుద్ధుని కాలంలో పట్టణాలలో నివసించే సంపన్నుల ఇండ్లలో పనిచెయటానికి పెద్ద సంఖ్యలో సేవకులు ఉండేవారు. యూరప్ లో మాదిరిగా వీరి క్రయవిక్రయాలు జరిగినట్లు కనిపించదు కానీ పాళీ భాషలో బానిసలపై సంపన్నులు యజమాన్యహక్కులు కలిగి ఉన్నట్లు, వారిగురించి దయ, క్రూరత్వంతో కూడిన వివిధ కథలు కనిపిస్తాయి.
పున్నిక ఒక దాసి కూతురు. శ్రవస్తి పట్టణంలో అనతపిండక అనే వ్యాపారి ఇంట్లో ఈమె పనిచేసేది. ఆ ఇంట్లోనే పుట్టిన వందవ బానిస ఈమె. ప్రతిరోజు నదికి పోయి గృహావసరాలకు నీరు తీసుకొని వచ్చే అంబువాహిని ఈమె. అనతపిండకుడు గొప్ప బౌద్ధావలంబి. బుద్ధుడు సంచరించిన జెతవనం అనతపిండకునిదే.
పున్నిక దాసిగా ఉంటూనే బౌద్ధ మార్గాన నడుస్తూ బుద్ధుని బోధనలను పాటించేది. ఒకనాడు బుద్ధభగవానుని కలుసుకొని, తనకు దీక్ష ఇప్పించమని అడిగింది. ఈమె దాసి కనుక యజమాని అనుమతిలేనిదే సంఘంలో చేరే అర్హతలేనికారణంగా ఈమె అభ్యర్ధన నిరాకరించబడింది. ఇది తెలుసుకొన్న అనతపిండకుడు పున్నికకు దాస్య విముక్తి ప్రసాదించటమే కాక, తనకూతురుగా దత్తత తీసుకొన్నాడు. అలా పున్నిక బౌద్ధ దమ్మాన్ని స్వీకరించి గొప్పసాధనతో అర్హంత (జీవన్మక్తి పొందటం Arahant) స్థాయిని పొందింది.
పున్నిక లో ఆత్మవిశ్వాసం, దృఢనిశ్చయం, సాధన లు మూడు దశలలో కనిపిస్తాయి. మొదట్లో బ్రాహ్మణునితో వాదించి అతనిని బౌద్ధ ధర్మంవైపు మళ్ళించటం, పిదప యజమాని వాత్సల్యాన్ని పొంది సన్యసించే అర్హతపొందటం, చివరగా అకుంఠిత సాధనతో జీవన్ముక్తి సాధించటం.
దాదాపు రెండున్నరవేల ఏండ్లక్రితం పున్నిక అనే ఒక స్త్రీ జీవనయానం ద్వారా ఆనాటి ప్రజలలో ఉండిన మత పరమైన అవగాహనను అర్ధం చేసుకొనవచ్చును.
బొల్లోజు బాబా


Saturday, January 8, 2022

నెమలీక - The Peocock's feather by Satchidanandan

 నెమలీక - The Peocock's feather by Satchidanandan

.
చిన్నప్పుడు
పుస్తకపేజీల మధ్య నెమలీకను దాచుకొని
అది పిల్లలు పెడుతుందని ఎదురుచూసేవాడిని
కౌమారంలో
నెమలీక అంటే ప్రియురాలి రాధ
నీలికనులను ప్రేమించే
అమరప్రేమికుని మోహపూరిత స్వప్నం
యవ్వనంలో
నెమలీక అడవి పిలుపు
నీలిసముద్ర స్నానం
ఇప్పుడు
నెమలీకను చూస్తే
ఎన్నో సంగతులు గుర్తుకొస్తాయి
నులిమివేయబడిన దాని నీలి మెడ పాడిన చివరిపాట;
బాణం దెబ్బకి ఆగిపోయిన దాని నాట్యం;
ఎన్నటికీ వర్షించని మేఘాలు;
అధోజగత్తులోకి అదృశ్యమైన నది;
విశ్వాసం లేని మనజాతిని నిత్యం వెంటాడేందుకు
అలా తెరుచుకొని ఉండిపోయిన దాని నేత్రం
.
Source: The Peocock's feather by Satchidanandan
అనువాదం: బొల్లోజు బాబా

Monday, January 3, 2022

విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకాలు స్టాల్ నంబర్ 25 26 27 లలో లభిస్తున్నాయి

 విజయవాడ పుస్తక ప్రదర్శనలో

ఈ పుస్తకాలు
స్టాల్ నంబర్ 25 26 27 లలో లభిస్తున్నాయి
ప్రాచీనపట్టణాలు, తూర్పుగోదావరి జిల్లా
మెకంజీ కైఫియ్యతులు, తూర్పుగోదావరి జిల్లా
పల్లవి పబ్లిషర్, శ్రీ ఎస్. వి. నారాయణ గారు
ఫోన్ నంబరు/ ఫోన్ పే నంబరు: 9866115655
దయచేసి ఆదరించగలరు.
బొల్లోజు బాబా







Saturday, December 25, 2021

పుస్తకాలు స్టాల్ నంబర్ 253 254 255 లలో లభిస్తున్నాయి

 ప్రాచీనపట్టణాలు, తూర్పుగోదావరి జిల్లా

మెకంజీ కైఫియ్యతులు, తూర్పుగోదావరి జిల్లా
పుస్తకాలు స్టాల్ నంబర్ 253 254 255 లలో లభిస్తున్నాయి
పల్లవి పబ్లిషర్, శ్రీ ఎస్. వి. నారాయణ గారు
ఫోన్ నంబరు/ ఫోన్ పే నంబరు: 9866115655
దయచేసి ఆదరించగలరు.
బొల్లోజు బాబా




అర్బన్ కవిత్వ పలుకుబడి “ నడిచే దారిలో”

 (కవిసంధ్య నిర్వహణలో అక్టోబరు 30న జరిగిన శిఖామణి యువ పురస్కార ప్రధాన సభలో చేసిన ప్రసంగపాఠమిది. ఈ వ్యాసాన్ని ప్రచురించిన కవిసంధ్య పత్రిక ఎడిటర్ గారికి ధన్యవాదములు; మా రవన్న బిడ్డ సురేంద్రకు మరొక్కసారి

అభినందనలు
తెలుపుతూ-- బొల్లోజు బాబా)
.
అర్బన్ కవిత్వ పలుకుబడి “ నడిచే దారిలో”
ముందుగా కవిసంధ్య యువపురస్కారాన్ని అందుకొంటున్న శ్రీ చెల్లి సురేంద్రదేవ్ కు అభినందనలు. శిఖామణి గారు ఈ పేరును ప్రకటించినపుడు నేనెంతో సంతోషించాను. ఎందుకంటే సురేంద్రదేవ్ ఆధునికులలో అత్యాధునికుడు. సమకాలీన అర్బన్ కవిత్వ పలుకుబడిని సాధించిన యువకవి. ఇతని మూలాలు యానాంకి చెందటం మరింత ఆనందించే సందర్భం. యానాం పేరు చెప్పగానే శ్రీ శిఖామణి, శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ చెల్లి రామ్ పేర్లు గుర్తుకు రావటం సహజం. వీరి తరానికి ముందు తరంలోని శ్రీమతి కందర్ప వెంకట నరసమ్మ, శ్రీ బొల్లోజు బసవలింగం, శ్రీ చెల్లి కృష్ణమూర్తి గార్ల పేర్లు కూడా ప్రస్తావించుకోవాలి. శ్రీ శిఖామణి, శ్రీ దేవదానం రాజు లు తమకు తెలుగు పాఠాలు చెప్పిన టీచర్ గా నరసమ్మ మాస్టారిని నేటికీ స్మరించుకొంటారు. నాటక రచయితగా పేరుగాంచిన శ్రీ బొల్లోజు బసవలింగం గారు మా తండ్రిగారు.
నేడు కవిసంధ్య యువ పురస్కారం అందుకొంటున్న చెల్లి సురేంద్రదేవ్ తాతగారు శ్రీ చెల్లి కృష్ణమూర్తి గారు. వీరు ప్రముఖ చిత్రకారుడు, అంబేద్కరిస్టు, బౌద్ధ ధర్మ ప్రచారకులు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే చెల్లి సురేంద్రదేవ్ కు ఘనమైన సాహిత్య, కళా వారసత్వం ఉన్నది అని చెప్పటానికి.
ఒక కవితలో సురేంద్ర తన తాతగారిని
సంపెంగ నూనె మీసాల మాష్టారి
ఉఛ్వాస-నిశ్వాసాల్లో
బౌద్ధం-అంబేద్కరం
జ్ఞానజ్యోతి ప్రభోధాలు (ఆకాశ దీపం) – అంటూ స్మరించుకొన్నారు.
పై వాక్యాలలో చాలా క్లుప్తంగా ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు సురేంద్ర. సంపెంగ నూనె అనే మాటలో ఆర్ధికంగా, సామాజికంగా పెద్ద స్థాయి కాకపోయినా ఆత్మ విశ్వాసంలోను, ఆత్మగౌరవప్రకటనలోను ఏమాత్రం ఎవరికీ తగ్గలేదన్న సూచన చెల్లి కృష్ణమూర్తి గారి వ్యక్తిత్వాన్ని తేజోవంతం చేస్తుంది. బౌద్ధాన్ని-అంబేద్కరిజాన్ని శ్వాసలో నింపుకున్నారనటం కూడా ఏ విలువలకై జీవించారో తెలుపుతుంది. చెల్లి కృష్ణమూర్తి గారు మాకు డ్రాయింగు టీచరు. వారు క్లాసులో అంబేద్కర్ జీవిత చరిత్రను హావభావాలతో అభినయిస్తూ చెప్పటం నాకు ఇంకా కళ్ళల్లో మెదులుతూ ఉంది.
*
చెల్లి సురేంద్ర విస్త్రుతంగా సాహిత్యాన్ని చదువుకొన్నాడు, చరిత్రను, సామాజిక పరిణామాలను ఆకళింపు చేసుకొంటున్నాడు. సమాజం పట్ల, మానవజాతి పయనం పట్ల కొన్ని నిర్ధిష్టమైన అభిప్రాయాలను నిర్మించుకొంటున్నాడు. వాటిని స్పష్టమైన గొంతుతో, సూటైన అభివ్యక్తితో తన కవిత్వంలో నింపుతున్నాడు.
సురేంద్ర కవిత్వంలో US route 50, జపాన్ Kintsugi కళాకారుడు, Death Bears, Elastin, Gecko Lizards, Ondine’s curse, JFK కొన్న 1200 Cubon cigors, The Great Swathes of British Pink, water dropwort plant లాంటి సరికొత్త పరిభాష అలవోకగా ఒదిగిపోయింది. కవి దేనిగురించి చెపుతున్నాడో అర్ధం చేసుకోవాలంటే పాఠకుడు కూడా కొంత శ్రమించాలి. కవిత్వంలో దీన్నొక ఆధునిక పోకడగా గుర్తించక తప్పదు.
గతంలో మో, త్రిపుర వంటి వారు కూడా ఇదేరీతిలో కవిత్వం వెలువరించినా అప్పటి పాఠకలోకం వారిని అందుకోలేకపోవటానికి కారణం ఆ రోజుల్లో అరచేతిలో అంతర్జాలరూపంలో ప్రపంచజ్ఞానం అందుబాటులో లేకపోవటమే. ఈనాడు పైన ఉదహరించిన అంశాల్ని కొద్దిగా శ్రమించి గూగిల్ చేస్తే వాటి అర్ధాలు, సందర్భాలు చిటికలో మనముందుంటాయి. ఏ ఉద్వేగాన్ని పొంది సురేంద్ర వాటిని తన కవితా సందర్భాన్ని ఉద్దీపింపచేయటానికి వాడుకొన్నాడో, అతని ఉద్దేశమేమిటో తద్వారా ఏ అనుభూతిని పాఠకునిలో కలిగించాలని భావిస్తున్నాడో అర్ధమౌతుంది. ఇదంతా ఇంటలెక్చువల్ వ్యవహారం. మూడు ఫైట్లు, నాలుగు డ్యుయెట్స్ సినిమాగా కాక వివిధ ఫ్రేముల్లో props, gestures, colours ద్వారా ఒక సిద్దాంతాన్ని ప్రతిపాదించటం లాంటిది కవిత్వం అంటే.
*
ది బ్రోకెన్ హార్ట్ – అనే కవిత లోని వస్తువు వియోగం వల్ల హృదయం ముక్కలవటం. హ్రుదయం తునాతునకలవ్వటం అనే ఉపమానం అనాదిగా కవులందరూ చేస్తున్నదే. ఈ భావనను కొత్త తీరాలకు చేరుస్తాడు సురేంద్ర ఇలా…
గుండె //తునాతునకలయ్యింది
ఆ పగిలిన పెంకులను గుప్పిట్లో సేకరించి
నా చితికి పోయిన గుండెకు బంగారు తాపడంతో
జ్ఞాపకాలను రిస్టోర్ చేసిన
జపాన్ Kintsugi కళాకారునికి ఒక ముద్దు
Longevity to the బ్రొకెన్ హార్డ్.
పై వాక్యాలలో పగిలిపోయిన గుండెను ఎవరో అతికించారని అర్ధమౌతూంటుంది. Kintsugi అనే పదం వద్ద ఆగిఫోతాం. Kintsugi Art అనేది జపాన్ దేశపు ప్రాచీన కళ. పగిలిపోయిన పింగాణీ పాత్రలను బంగారాన్నుపయోగించి అతికే కళ అది. విలువలేని పింగాణీని అతకటానికి విలువైన బంగారాన్ని ఉపయోగించటం ఆర్ధికంగా సరైన పని కాకపోవచ్చు. కానీ ఈ ఆర్ట్ ముఖ్యోద్దేశం విరిగిపోవటాన్ని కూడా ఒక విలాసంగా, విలువైనదిగా సెలిబ్రేట్ చేసుకోవాలని చెప్పటం. పై వాక్యాలలో ఈ తత్వం ఎక్కడా కవి చెప్పడు. కానీ Kintsugi కళాకారుడు అన్నమాట ఆధారంగా కవి హృదయాన్ని అర్ధం చేసుకోవాలి.
మూన్ బో – అనే కవితలో
నువ్వు లేని జీవితం
US Route 50 అంత నిర్మానుష్యం.
యుఎస్. రూట్ 50 అంటే ప్రపంచంలోనే అత్యంత నిర్మానుష్యమైన రహదారి. ఎడారులగుండా, నిర్జన పీఠభూములమీదుగా వెళ్ళే ఒక హైవే. నువ్వు లేని జీవితం ఒక శూన్యం అని చెప్పటానికి పై పరిభాషని వాడుకొన్నాడు.
కెడావర్ అనే కవితలో
నీకు నాకూ ఒక్కటే గోల్
తెలియని తీరాలలో జీవితం తెల్లారిపోయినా
మునిసిపాలిటీ వేన్ లో కాటికి చేరకూడదని
సో….
మోర్గాన్ ఫ్రీమాన్ లా బంగారపు
చెవిపోగులు కుట్టించుకుంటే సరిపోతుంది (కెడావర్)
మనం ఎవరికీ తెలియని చోటమరణిస్తే, మనశవం అన్ క్లైమ్డ్ డెడ్ బాడీగా మారుతుంది. అలా జరగకూడదు అనే ఊహపై వ్రాసిన కవిత ఇది. మోర్గాన్ ఫ్రీమాన్ లా బంగారపు చెవిపోగులు ధరించాలి అనే ఒక హృద్యమైన ఉదంతాన్ని సురేంద్ర ఈ కవితలో పొందుపరచాడు. ఇది ఈ కవితా వస్తువుకు చక్కగా అమరిపోయింది. ఎవరీ మోర్గాను, ఎందుకు బంగారపు చెవిపోగులు ధరిస్తున్నాడు అనే అంశం ఎక్కడా చెప్పడు. మోర్గాన్ ఫ్రీమాన్ ఒక హాలి వుడ్ నటుడు. ఎనభై ఏండ్ల వృద్ధుడు. ఇతడిని “నువు నిత్యం ఎందుకు బంగారు చెవిపోగులు ధరిస్తున్నావు” అని ఒక విలేఖరి ప్రశ్నించగా- “నేనెక్కడైనా అపరిచిత పరిస్థితులలో, అనామకుడిలా చనిపోతే ఒక శవపేటిక కొనటానికి ఆ బంగారు చెవిపోగులు సరిపోతాయి” అని బదులిచ్చాడట. దాన్నే సురేంద్ర “మునిసిపాలిటీ వేన్ లో కాటికి చేరకూడదని మోర్గాన్ ఫ్రీమాన్ లా బంగారు చెవిపోగులు ధరించు” అని అంటున్నాడు. ఈ మొత్తం వ్యక్తీకరణలోని ఉద్వేగం, బలం పాఠకునికి అర్ధం కావాలంటే ఖచ్చితంగా అతను కొంత శోధన చేయవలసి ఉంటుంది.
అలాగని సురేంద్ర కవిత్వం మొత్తం ప్రతీకాత్మక జార్గన్ తో నిండి ఉందని అనుకోవక్కరలేదు. చక్కని భావాల్ని సరళంగా, హాయిగా నోరారా చెప్పుకొన్న కవితలు చాలానే ఉన్నాయి.
బుల్లెట్లలో గన్ పౌడర్ బదులుగా
విత్తనాలను నింపాలి
అవైనా బీడుపడిన
హృదయాంతరాల్లోకి చొచ్చుకెళ్ళి
ఆశను చిగురింపచేస్తాయి. (సహజత్వ ప్లానిటోరియం)
పై వాక్యాలలో యుద్ధాలను నిరసిస్తున్నాడు కవి. యుద్ధాలు కాదు బుద్ధిగా ప్రేమించుకొమ్మని బోధిస్తున్నాడు. సృష్టిని కోరుకొంటున్నాడు. ఆశను చిగురింపచేస్తున్నాడు. ఈ అద్భుతమైన భావాలను అత్యంత సరళంగా లోతుగా చెప్పాడు.
నా అస్తికల్లో కార్బన్ ని
అండర్ ప్రెజర్ తో
డైమెండ్ గా మలిచి
నీ పెళ్ళికి నేను ఉంగరాన్నైతే బాగుండు - Hooker’s lips. చాలా చిత్రమైన ఊహ. దేహం కార్బన్ తో తయారౌతుంది. ఎముకల్లో కూడా కార్బన్ ఉంటుంది. అదే కార్బన్ ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తే డైమండ్ గా మారుతుంది. కృత్రిమ డైమెండ్స్ అలాగ తయారుచేస్తారు. ప్రియుని ఎముకలతో తయారు చేసిన డైమండ్ ప్రియురాలి పెళ్ళి ఉంగరమవ్వటం అనేది ఒక విపరీత ఊహ. ఇది సురేంద్ర గాఢ ఊహాశాలితకు అద్దం పడుతుంది.
రోహిణీకార్తి ఎండలను వర్ణించటానికి ఆకాశం నిప్పులు చెరుగుతున్నది అంటారు సాధారణంగా. సురేంద్ర అదే సందర్భాన్ని ఆకాశదేశం అగ్నిపువ్వుల/ తివాచీలా వుంది అంటూ కొత్త ఉపమానంతో దేదీప్యమానం చేస్తాడు.
*
సురేంద్ర కవిత్వంలో సామాజిక కోణం బలంగా ప్రతిబింబిస్తుంది. అనేక కవితలలో సురేంద్ర ఈ సమాజంలోని అసమానతలకు కారణాలను అన్వేషించటం కనిపిస్తుంది. వాటిని ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. వాటికి చికిత్స అవసరమని చెబుతున్నాడు.
టాక్స్ పేయర్స్ డబ్బుతో
నిర్మితమైన ఉపగ్రహాలు
అడవుల గర్భంలో దాగున్న ఖనిజాలను
లొకేట్ చేస్తాయి
ఆదివాసీ నవ్వుల పువ్వులను చిదిమేస్తాయి
అంతా కార్పొరేట్ గారడీ – అనటం ద్వారా ఈ సమాజంలో దోపిడీ ఎక్కడ జరుగుతున్నదో, ఎవరు ఎవరిని దోపిడీ చేస్తున్నారో, ఎవరికొరకు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో స్పష్టంగానే గుర్తించి పదునైన వాక్యాలలో వ్యక్తీకరించాడు.
అదే విధంగా గొడ్డుచాకిరీ తప్పలేదు… అనే కవితలో
పొట్టకూటి కొరకు తరిమివేయబడిన చోట్లోనే
పుట్టుకొస్తున్న మల్టీ కాంప్లెక్స్ నిర్మాణంలో
రోజు కూలీలుగా గొడ్డుచాకిరి తప్పలేదు … లాంటి వాక్యాలు ఈ కవి రాజకీయంగా ఎవరివైపు నిలబడి మాట్లాడుతున్నాడో అర్ధం చేయిస్తాయి. చెప్పదలచుకొన్న అంశాన్ని సూటిగా, పదునుగా స్పష్టంగా చెపుతాడు సురేంద్ర.
*
సురేంద్ర సెటైరికల్ టోన్ చాలా పదునుగా ఉంటుంది. కొన్ని కవితలు ఈ వ్యంగ్యం వలన అద్భుతమైన texture ను పొందాయి.
ఏ చట్టసభలలో/ఏమున్నది గర్వకారణం/స్టింగ్ ఆపరేషన్లలో దొరికిన/వాళ్లంతా ఒక దగ్గర చేరడం తప్ప… అనే వాక్యం నేటి రాజకీయ వ్యవస్థపై సంధించిన బలమైన వ్యంగ్యాస్త్రం.
భూమికి ఆరడుగుల క్రింద పడుకుంటే
రోదిస్తావు
పుడమికి 220 అడుగుల క్రింద గ్రాండ్ కెనియన్ గుహల్లో నివసిస్తే
స్టేటస్ సింబల్ - లాంటి వాక్యాలలో ఆధునిక మానవుడు సంపదను/హోదాను ప్రదర్శించుకోవటానికి ఎంచుకొంటున్న పద్దతులపట్ల పదునైన సెటైర్ ఉంది.
*
సురేంద్రవి పల్లెటూరి మూలాలు. దళిత అస్తిత్వం ఇతడిని వెంటాడే నీడ. సురేంద్ర కవిత్వంలో అతని పల్లెటూరి మూలాలు, దళిత అస్తిత్వమూ అనేక కవితలలో పోతపోసుకోవటం గమనిస్తాం.
పాక్డ్ డ్రింకింగ్ వాటర్
త్రాగి త్రాగి చప్పబడిన నాలుకకు
రైతు సొరబుర్రలోంచి
నా దోసెట్లో పోసిన దాహార్తి సంజీవిని
రుచిమొగ్గలకు పునర్జన్మనిచ్చింది…. అంటూ అర్బన్ జీవితానికి మనం ఎంత బానిసగా మారినప్పటికీ నిజమైన జీవన సౌందర్యం గ్రామీణ జీవితంలోనే లోనే ఉందని చెబుతున్నాడు.
అనాది వేదాల ఆవిర్భావంలో
ఉద్భవించిన అంటరానితన
గరళాన్ని మింగిన
నీలకంఠ స్వరూపులం
ఎన్నిసార్లు నన్ను హతమార్చినా
మళ్ళీమళ్ళీ పుట్టుకొస్తాను – అంటూ సెరిబ్రల్ ఘోషగా దళిత అస్తిత్వాన్ని సగర్వంగా నినదిస్తాడు సురేంద్ర.
*
సురేంద్ర దృష్టి సంప్రదాయక పరిధులను దాటి చూస్తుంది. లైంగిక దోపిడీ అనగానే స్త్రీల గురించి మాత్రమే మాట్లాడుకొనే చోట “బచ్చా బాజీ” దృక్కోణంలోంచి మాట్లాడటం సాహసమే. బచ్చాబాజీ అంటే అబ్బాయిలను లైంగిక బానిసలుగా మార్చే ప్రక్రియ. “ ఐ ఆమ్ ఏ రేప్ విక్టిమ్ టూ” అనటం patterns ని బద్దలుగొట్టే ప్రక్రియగా భావించాలి.
సురేంద్ర రాసిన “ఎంగిలి బిర్యాని చేతులు” అనే కవితలో అతని సామాజిక దృక్ఫథం, రాజకీయ అవగాహన, కవిత్వతత్వం స్పష్టంగా వ్యక్తమవటం చూడొచ్చు. ఈ కవిత కావేరి జలవివాదం గురించి. కర్ణాటకలో పుట్టి తమిళనాడులో ప్రవహించే కావేరి జలాల పంపకం ఇరురాష్ట్రాల మధ్యా వివాదంగా మారింది. దీన్ని నేపథ్యంగా తీసుకొని వ్రాసిన ఈ కవితలో, కావేరి నదికి తమిళులకు మధ్య ఉన్న చారిత్రిక, ఐతిహాసిక అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు సురేంద్ర. ఈ వివాదంపై ఇంతలోతుగా వచ్చిన తెలుగు కవిత ఇదే కావొచ్చు.
ఈ సంపుటిలో మిరిమిట్లు గొలిపే కవితా వాక్యాలు అనేక కవితలలో దర్శనమిస్తాయి. నాలోమొలకెత్తిన రేపటి ఆశల చిగురు; వైతరిణిలో రోదనలా/మా జీవితం చుట్టూ వివక్షే; రాలిన పువ్వుల ఒడిలో కూర్చుని; కాలం ఆగిన క్షణం; వెన్నెముక లేని అల; ప్రపంచీకరణ ప్రవాహం; లేలేత తామరాకుపై మార్నింగ్ డ్యూ; మడుగు మనస్సులో ఒంటరితనం; మేఘాలు భోరుమని ఏడుస్తూ; కన్నీటి లావా; గుండె గదుల్లో జ్ఞాపకాల రాక్షసస్వరూపిణి; ఒరేయ్ నాన్నా నీ నవ్వు వెన్నపూస లేపనం రా; బ్లాక్ హోల్ లో వెలుగురవ్వ; లాంటి అనేక వ్యక్తీకరణలు.
సురేంద్రకు మనుషులంటే ఇష్టం. వారితో సంభాషించటం ఇష్టం. వారు పంచే ప్రేమ అంటే ఇష్టం. ఆ కారణంగానే వరుసకు తాత అయ్యే శిఖామణిని, ప్రసాదమూర్తిని, అఫ్సర్ ని, అక్బర్ ని చక్కని కవితలుగా పోతపోసి ఈ సంపుటిలో దాచుకొన్నాడు.
సురేంద్ర తొలి సంపుటితోనే తనదైన సొంత దృక్ఫథాన్ని ఏర్పరుచుకొన్నాడు. సమకాలీన సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నాడు. ఆ సమస్యలకు కారణాలను పట్ల ఇతను చేస్తున్న అన్వేషణ కూడా సరైనమార్గంలోనే ఉంది. వ్యక్తీకరణలో పరిభాషపరంగా అక్కడక్కడా కొంత క్లిష్టత ఉన్నప్పటికీ దాన్ని ఇతని సిగ్నేచర్ స్వరంగా భావించవచ్చు.
చివరగా- శ్రీ ర్యాలి ప్రసాద్ చెప్పినట్లు- ఇతని కవిత్వంలో కన్నీటికి లిపిని వెతికే ఒక ప్రయత్నం; వెన్నెలమీద చీకటి చేసిన సంతకాల్ని చెరిపేసే ప్రయత్నం; ఒక యుద్ధం నిజరూపం దాల్ఛేటప్పుడు తానొక ఆయుధంలా మారే ప్రయత్నం - కనిపించాయి.
సురేంద్రదేవ్ చెల్లి కవిత్వ సంపుటి "నడిచే దారిలో" ఆధునిక డిక్షన్ అద్బుతంగా ఒదిగిపోయింది. తన అసమాన ప్రతిభతో తెలుగు కవిత్వ భవిష్యత్తు పట్ల భరోసాను కలిగిస్తున్న ఇతనిని కొత్తతరపు ప్రతినిధిగా గుర్తించి, కవిసంధ్య యువ పురస్కారం 2021 అందచేయటం ఎంతో సముచితమనికి భావిస్తున్నాను.
బొల్లోజు బాబా
9849320443



Tuesday, November 16, 2021

"ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా"

 "ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా" పుస్తకం ప్రెస్ నుండి విడుదలైంది.

తూర్పుగోదావరిజిల్లాకు చెందిన నాలుగు ప్రధాన ప్రాచీన పట్టణాలు ఇంకా చారిత్రిక ప్రాధాన్యత కలిగిన తొమ్మిది ఇతర పట్టణాల గురించి ఆసక్తికరమైన సమాచారంతో ఈ పుస్తకం ఉంటుంది.
.
వెల: 150 రూపాయలు
లభించు చోటు: పల్లవి పబ్లిషర్, శ్రీ ఎస్. వి. నారాయణ గారు
ఫోన్ నంబరు/ ఫోన్ పే నంబరు: 9866115655
.
"మెకంజీ కైఫియ్యతులు -తూర్పుగోదావరి జిల్లా" పుస్తకాన్ని ఆదరించినట్లుగానే ఈ పుస్తకాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
.
భవదీయుడు
బొల్లోజు బాబా