Friday, January 21, 2022

భద్ద కుండలకేశ

 భద్ద కుండలకేశ

శిరోముండనం గావించుకొని
దుమ్ముపట్టిన దుస్తులు ధరించి
తప్పులు లేనిచోట తప్పులు ఉన్నాయని
తప్పులు ఉన్నచోట వాటికి అంధురాలినై
సంచరించేదానిని
యాభై ఐదేండ్లపాటు
అంగ, మగధ, వజ్జీ, కాశి, కోశల రాజ్యాల
నలుమూలలా పర్యటించాను
ఆ రాజ్య ప్రజలు ఇచ్చిన భిక్షను తిన్నాను
ఒకనాడు
నిర్మలమైన బుద్ధభగవానుడు శిష్యులతో కలసి వుండగా
గృధ్రకూటపర్వతం వద్ద చూసాను
ఎదురుగా మోకాళ్లపై కూర్చొని
చేతులు జోడించి భక్తితో నమస్కరించాను
“రా భద్దా” అన్నారాయన
ఆ క్షణమే నా దమ్మ దీక్షా స్వీకారం జరిగింది
తధాగతుడు ఇచ్చిన వస్త్రాన్ని ధరించిన భద్ధ
అన్ని బంధనాలనుంచి విముక్తమయింది.
***
రాజగృహలో ఒక వడ్డీవ్యాపారస్తుని కుమార్తె భద్ద. ఒకరోజు పురవీధిలో మరణదండన విధించటానికి తీసుకొని వెళుతున్న ఒక దొంగను చూసి మనసుపారేసుకొని, అతనిని తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోను అని తల్లిదండ్రులకు చెప్పటంతో- భద్ధ తండ్రి తలారులకు భారీగా లంచాలిచ్చి ఆ దొంగను రహస్యంగా విడిపించి ఇంటికి తీసుకొని వచ్చి, స్నానం చెయించి, అలంకరించి, కూతురు ముందు నిలబెట్టాడు. ఆ దొంగ పేరు సత్తుక. ఇంతచేసినప్పటికీ ఇతనిలో ఏ మార్పు రాక, భద్ధ ఒంటిపై ఉన్న నగలను ఎలా దొంగిలించాలా అని ఆలోచించసాగాడు.
మరణ దండన నుండి తప్పించుకొన్నందుకు కొండదేవతకు మొక్కుకున్నానని, అది తీర్చుకొనటానికి అని భద్దను నమ్మించి ఆమెను ఒక పెద్దకొండపైకి తీసుకొనివెళ్ళాడు సత్తుక. అక్కడ ఆమె ఒంటిపై ఉన్న నగలను దొంగిలించి ఆ కొండపైనుండి క్రిందకు త్రోసేసి చంపెయ్యాలని అతని పథకం. అతని పన్నాగాన్ని గ్రహించిన భద్ధ, మిమ్ములను చివరిసారిగా ఒకసారి కౌగిలించుకోవాలని ఉన్నది నా ఆఖరుకోర్కె తీర్చమని అని అడిగి, కౌగిలించుకొని క్షణకాలంలో అతనిని ఆ కొండపైనుంచి త్రోసి చంపివేసింది.
ఇంత జరిగాక భద్ధకు ఇంటికి వెళ్ళటానికి మొఖం చెల్లక, శ్వేతాంబర జైన మతంలో చేరి సంచార సన్యాసిగా జీవనం ప్రారంభించింది. అప్పట్లో జైనమతం తీసుకోవాలంటే తలపై జుత్తును చేతితో పెకలించుకోవాలి. ఆ విధంగా చేయటంవలన కేశాలు చిక్కులు పడటంతో అప్పటినుండి బద్ధకు బద్ధ కుండలకేశ అనే పేరు వచ్చింది. ఈమె జైనబోధనలను మొక్కవోని దీక్షతో సంపూర్ణంగా అధ్యయనం చేసి దేశసంచారానికి బయలుదేరింది.
ఏదైనా ఊరు వెళితే అక్కడ ఒక ఖాళీ స్థలంలో ఒక నేరేడు కొమ్మను పాతి తనతో ఆథ్యాత్మికంగా వాదించేవారికొరకు ఎదురుచూసేది. ఆ ఊరిలో ఎవరైనా ఈమె తో వాదించాలనుకొంటే ఆ నేరేడు కొమ్మను తొలగించి, ఈమెతో వేదాంత చర్చ చేసేవారు. అలా ఈమె యాభై ఏండ్లపాటు ప్రాచీన ఉత్తరభారతదేశంలోని అనేక పట్టణాలు సంచరించి ఎందరినో తన వాదనాపటిమతో ఓడించి దిగ్విజయయాత్ర జరుపుతూ ఒకనాడు శ్రావస్తి వచ్చింది. అక్కడ బుద్ధుని శిష్యుడైన సరిపుత్త తో వాదనకు దిగింది. వీరిరువుతూ హోరాహోరిగా వేదాంత చర్చ చేసారు.
సరిపుత్త జ్ఞానసంపత్తిని గ్రహించిన భద్ధకుండలకేశ అతనిని గురువుగా ఉండమని కోరింది. సరిపుత్త బుద్ధునివద్దకు వెళ్ళమని చెప్పటంతో, భద్ధకుండలకేశ గృద్ధకూటపర్వతంపై ఉన్న బుద్ధభగవానుని చేరి నమస్కరించగానే, ఆయన “రా భద్ధా” అన్నాడట. ఆ మాటే భద్ధ కు బుద్ధుడు నేరుగా ఇచ్చిన దీక్షగా పరిగణిస్తారు.
అనువాదం
బొల్లోజు బాబా












No comments:

Post a Comment