Sunday, September 29, 2024

సమకాలీన తెలుగు లాక్షణికుడు - శ్రీ ఇస్మాయిల్

ఈ వ్యాసాన్ని కవిసంధ్య స్వర్ణోత్సవసంచికలో ప్రచురించిన గురువుగారు, శిఖామణి కి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

బొల్లోజు బాబా


సమకాలీన తెలుగు లాక్షణికుడు - శ్రీ ఇస్మాయిల్

చాన్నాళ్ళ క్రితం ప్రముఖ విమర్శకులు శ్రీ సీతారాం "కావ్యసౌందర్యశాస్త్రం లేదా భారతీయ లాక్షణిక సిద్ధాంతాలు వినా, మనవీ అని చెప్పుకోదగిన సాహిత్య సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా?" అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీనికి ప్రముఖ విమర్శకులు శ్రీ లక్ష్మి నరసయ్య "దళిత, బహుజన, ముస్లిం వాద సాహిత్య దృక్పథాలు వాటికి సంబంధించిన ఈస్థటిక్స్ లాంటివి దేశీయ సాహిత్య సిద్ధాంతాలు" అన్నారు.
షేక్ పీర్ల మొహమ్మద్" ఏ సిద్దాంతానికైనా యూనివర్సల్ అప్పీల్ ఉండాలి కదా" అనే కోణాన్ని గుర్తుచేసారు.
సోషల్ మీడియాలో ఈ అంశంపై జరిగిన చర్చ చాలా ఆలోచనల్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు ప్రముఖ కవి శ్రీ ఇస్మాయిల్ సమకాలీన తెలుగు లాక్షణికుడిగా కనిపించారు.
***
1. Literary theory అంటే ఏమిటి?

Literary theory సాహిత్యంలో ఉండే "సాహిత్యసంబంధి" (Literary) ఏమిటి? అని ప్రశ్నించి దానికి సమాధానాలు రాబడుతుంది. అంటె రసము, ఔచిత్యం, ధ్వని, Tension, Texture, Ambiguity లాంటి ఏ ప్రక్రియ వల్ల ఒక కవిత ఎలా గొప్పకవిత అయ్యిందో/అవ్వగలదో సిద్ధాంతీకరిస్తుంది. లిటరరీ సిద్ధాంతం అంటే సాహిత్యాన్ని అర్ధం చేసుకోవటానికి, విశ్లేషించటానికి, సృజించటానికి ఉపయోగపడే ఆలోచనలు, పద్దతులు
Literary Criticism సాహిత్యాన్ని విశ్లేషిస్తుంది, తూకంవేస్తుంది మంచి చెడ్డలు విడమరచి చెపుతుంది. ఈ విమర్శలో ఒక కవిత ఎందువల్ల మంచికవితో లేక అకవితో పై సిద్ధాంతాల ఆధారంగా నిరూపిస్తుంది. ఎక్కడ రసభంగం జరిగింది, ఎక్కడ ఔచిత్యదోషం ఉంది, ఉద్దేశించిన ధ్వనికి ఎలా అన్వయం కుదరలేదు అనే విషయాలను విపులీకరిస్తుంది.
Literary theory, Literary Criticism లు పరస్పరాధారితాలు. ముందు theory పుడుతుంది, దానికనుగుణంగా విమర్శ జరుగుతుంది. ఉదాహరణకు సాహిత్యమనేది ఒక సాంఘిక కార్యక్రమమని, కవి సామాజిక మార్పుకు దోహదపడాలనే మార్క్సిజసిద్ధాంతం మొదటగా పుట్టింది. ఆ సిద్దాంతాన్ని ఉపయోగించుకొని ఒక కవితలో "సామాజిక ప్రయోజనం" ఏమేరకు ఉంది అంటూ విమర్శ సాగుతుంది. అలాగన్నమాట.
నిజానికి ఈ సిద్ధాంతకర్తకు, విమర్శకుడి కన్నా ముందు సృజనకారుడు అనే వాడు ఒకడుంటాడు. వాడికీ గొడవలేమీ పట్టవు. వాడిమానాన వాడు రాసుకొంటూ పోతాడు. వాడు రాసినవాటిలోంచే ఈ సిద్దాంతాలు, విమర్శలు పుట్టుకొస్తాయి.
***
2. దేశీయ లాక్షణిక సిద్ధాంతాలు

సాహిత్యం ఎలా ఉండాలి ఏవేం అంశాల వలన ఒక రచన సాహిత్యవిలువలను పొందుతుంది అనే విషయాలను లోతుగా శోధించి, కొన్ని ప్రతిపాదనలను చేసారు మన పూర్వీకులు. ప్రాచీన భారతీయ సిద్ధాంతాలలో ప్రధానంగా అలాంటివి ఆరింటిని గుర్తించవచ్చు

• భరతుని రస సిద్ధాంతం: రసాత్మకమైనదే కావ్యమని ప్రతిపాదిస్తుంది.
• భామహుని అలంకార సిద్ధాంతం: కావ్యానికి అలంకారాలు ప్రధానం అంటుంది
• వామనుడి రీతి సిద్ధాంతం: మంచి కావ్యానికి మంచి గుణాలుండాలంటుంది.
• ఆనందవర్ధనుని ధ్వని సిద్ధాంతం: వాచ్యంగా చెప్పిన విషయం కన్నా చెప్పకుండా వదిలేసిన విషయం ప్రధానమంటుంది.
• కుంతకుని వక్రోక్తి సిద్ధాంతం: వక్రోక్తి అంటే అలంకారములతో నర్మగర్భంగా చెప్పటం. ఇది ఆనందవర్ధనుని ధ్వనిని పోలి ఉంటుంది.
• క్షేమేంద్రుని ఔచిత్య సిద్ధాంతం: ఏది దేనికి తగి ఉంటుందో దాన్ని ఔచిత్యం అంటారు. కావ్యానికి ఔచిత్యం ఉండాలంటుందీ సిద్దాంతం.

ఇరవయ్యోశతాబ్దంలో పాశ్చాత్య Literary theory లలో అనేక దృక్పథాలు ప్రవేశించి Literary criticism ను నడిపించాయి. దేశీయ లాక్షణిక సిద్ధాంతాలకు పాశ్చాత్య సిద్ధాంతాలకు పొంతన ఉండదు. భారతీయ, పాశ్చాత్య సంస్కృతులు పూర్తిగా భిన్నమైనవి కనుక ఈ రెండిటి మధ్య పోలికలు తేవటం దాదాపు అసాధ్యం.

మొదట్లో అరిస్టాటిల్ లాంటివారు జీవితాన్ని అనుకరించేదే కళ అన్నారు. తరువాత మిల్టన్ కాలంలో చందస్సును అనుసరించి చెప్పటమే సాహిత్యం అన్నారు కాల్పనికతే (romanticism) సాహిత్యమని షెల్లీ, కీట్స్ కవిత్వం చెప్పింది.

3. ఆధునిక సిద్ధాంతాలు
• అభ్యుదయ, సామాజిక ప్రయోజనం కలిగి ఉండటం (మార్క్సిస్ట్ సిద్ధాంతం)
• భిన్నత్వాలను celebrate చేస్తూ చరిత్రను నిరాకరించటం ద్వారా స్వీయ అస్తిత్వాన్ని ప్రకటించుకోవటం (పోస్ట్ మోడర్న్)
• మనో వైజ్ఞానిక అంశాలను పొదువుకోవటం (ఫ్రాయిడియన్)
• స్త్రీవాద (gender and Queer theories)
• సాంస్కృతిక వైవిధ్యాలను ప్రతిబింబించటం (Cultural theory)
• పాఠంలోనే అన్ని అర్ధాలు ఉంటాయి అనే ప్రతిపాదన (Structuralism)
• పాఠం వెలుపల సోషల్ పొలిటికల్, హిస్టారికల్ కారణాల వల్ల చాలా కనిపించని అర్ధాలు ఉంటాయి అనే ప్రతిపాదన (Post structuralism)
• రచనలో బహుళార్ధాలను వెతకటం (Deconstruction)
• వలసపాలనానంతర ప్రభావం (Post Colonial)-- లాంటి రకరకాల లిటరరీ సిద్ధాంతాలు సాహిత్యంలో "సాహిత్యసంబంధి" ఏదో తేల్చి చెప్పటం కొరకు ప్రతిపాదించబడ్డాయి. ఒక్కోక్కటీ అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్న రీతిలో సాగుతాయి.

పైన చెప్పిన ఆధునిక లిటరరీ థీరీలను గమనిస్తే, భారతదేశానికి సంబంధించి ఎప్పుడో వందల సంవత్సరాలక్రితం ఏర్పరచిన లాక్షణిక సిద్ధాంతాలే తప్ప ఆధునిక కాలంలో మనం సృష్టించుకొన్న ఆధునిక దేశీయ సాహిత్య సిద్ధాంతాలు ఏమున్నాయి అని ప్రశ్నించుకోవటం సందర్భోచితమే కాదు అవసరం కూడా. ఆమేరకు లక్ష్మి నరసయ్య గారు చెప్పిన దళిత,బహుజన ఈస్థటిక్స్ కొంతమేరకు ఆ లోటును తీర్చిందని భావించవచ్చు.

మన తరంలో తెలుగులో అంత స్పష్టంగా కవిత్వానికి చక్కని నిర్వచనాన్ని, అసలు ఏది కవిత్వం అన్నదానికి సమాధానాన్ని, కవిత్వపు పరిధులు, బలహీనతలను విస్పష్టంగా చెప్పిన ఒక సిద్ధాంతకర్తగా శ్రీ ఇస్మాయిల్ కనిపిస్తారు. ఈయన వెలిబుచ్చిన అభిప్రాయాలపై పాశ్చాత్యప్రభావం లేదని చెప్పలేం అయినప్పటికీ ఇస్మాయిల్ గారి అభిప్రాయాలు స్వతంత్రంగా, స్థానీయంగా ఉండటం గమనించవచ్చు.

4. సమకాలీన లాక్షణికుడు - శ్రీ ఇస్మాయిల్

తెలుగుకు సంబంధించినంత వరకూ కవిత్వాన్ని నిర్వచించి, కొన్ని లక్షణాలను ప్రతిపాదించిన ఆధునిక కవులలో ఇస్మాయిల్ కనిపిస్తారు. నేనొక లాక్షణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాను అని ఆయన ఎక్కడా చెప్పుకోకపోయినా ఆయన వదిలివెళ్ళిన ప్రతిపాదనలు, చేసిన చర్చలు, వాదప్రతివాదనలను ఈ రోజు మనముందే ఉన్నాయి. వాటి ద్వారా, ఇస్మాయిల్ తనజీవితకాలమంతా తపస్సుచేసి ఆధునిక కవిత్వంలోని "సాహిత్యసంబంధి" లక్షణాలను నిర్వచించారని, కవిత్వాన్ని విశ్లేషించటానికి కావాల్సిన పనిముట్లను గుర్తించారని తెలుసుకోవచ్చు.


ఒక లాక్షణికుడిగా ఇస్మాయిల్ చేసిన ప్రతిపాదనలు

1. కవిత్వంలో నిశ్శబ్దం:
మన చుట్టూ ఉన్న అనుభవిక ప్రపంచాన్ని ఆవిష్కరించటమే కవిత్వ లక్ష్యం. అనుభవాన్ని అనుభవంగానే ప్రత్యక్షం గా అందించటం కవిత్వం పని. అనుభూతి సామాన్య భాషకు అందదు. ఆ అనిర్వచనీయమైన ఆ నిశ్శబ్దాన్ని వాక్యాలలోకి ప్రవేశపెట్టటమే కవిత్వ లక్షణం. కవిత్వానికి శబ్దమెంత ముఖ్యమో నిశ్శబ్దం కూడా అంతే. (ఇది కొంతమేరకు ధ్వని సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. శబ్దం అంటే ఒక కవితలో పైకి చెపుతున్న విషయంగాను, నిశ్శబ్దం అంటే అన్యాపదేశంగా చెపుతున్న లేదా చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంచిన విషయంగాను అర్ధం చేసుకోవాలి)

2. కవిత్వం హృదయ సంబంధి:
కవిత్వం హృదయ సంబంధి. ఆలోచనా వ్యవస్థ బుద్ధికి సంబంధించినది. కవిత్వాన్ని బుద్ధి (Reason) శాసించలేదు. దాని సామ్రాజ్యమే వేరు. కవిత్వానికి "కరుణ ముఖ్యం".
అసలు సృజనాత్మకతకి మూలమేమిటి? కవి యొక్క దర్శనం (vision). ఇది పూర్తిగా వైయక్తికమైనది. ఏ కవి దర్శనం వానిది. దీన్నించే అతని కవిత్వం ఉద్భవిస్తుంది. కనక, కవి నిబద్ధుడై ఉండవలసింది తన సొంత దర్శనానికే!
కవిత్వం తల్లివేరు కవి అంతర్లోకమూ, బహిర్లోకమూ కలిసేచోట తన్ని ఉంటుంది.

3. కవిత్వం చేసే పని చదువరి మనస్సులో దీపం వెలిగించడం:
కవిత్వం చేసే పనల్లా చదువరి మనస్సులో దీపం వెలిగించడమే. దీని వల్ల అతని అవగాహన పరిధి విస్తరిస్తుంది. తన మనస్సులో వెలిగిన దీపం వెలుతురు తన దారి తను వెతుక్కోవడానికి సహాయపడుతుంది. ఫలానా దారినే నడవమని ఒకరు చెబితే వినడు మనిషి. అది తనకు తోచాలి. తన దారేదో తను నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయానికి కవిత్వం తోడ్పడుతుంది.
“కళ కళ కోసమే” అనే వాదనా, “కళ సాంఘిక రాజకీయ ప్రయోజనాల కోసం” అనే వాదనా – రెండూ అతి వాదాలే! ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఏదీ వుండదు. ఐతే దేని ప్రయోజనం దానికుంటుంది. ఇది గుర్తించడం ముఖ్యం. ప్రపంచాన్ని అవగాహన చేసికోవటమూ, తద్వారా ప్రపంచంతో అనుభౌతిక అనుసంధానం (emotional adjustment) సాధించటమూ – అనాది నుంచీ కళా ప్రయోజనమని ఇస్మాయిల్ గారి ప్రతిపాదన.

4. భాషని శుభ్రపరచటం:
నేను (ఇస్మాయిల్) కవిత్వంలో ఒక ముఖ్యమైన పని చేయడానికి పూనుకున్నాను. భాషని శుభ్రపరచడానికి ప్రయత్నించాను. చాలా మాటలకు మాసిన రంగులు, పాత వాసనలు ఉంటాయి. అలాంటి మాటల్ని కవిత్వంలో వాడలేదు. పాత కావ్యాల్లోనివి, పురాణాల్లోని పదాలు, సమాసాలు, పేర్లూ, కథలూ నా కవిత్వం జోలికి రాకుండా జాగ్రత్తపడ్డాను. నా స్వంతమైన, సరికొత్త అనుభవాల్ని వ్యక్తపరచటానికి, వ్యావహారికప్రపంచంలోని సరికొత్త మాటల్నే కోసుకొచ్చి వాడుకున్నాను.

5. కవిత్వానికి లేబుల్స్ ఉండకూడదు:
కవిత్వానికి లేబిల్స్ అంటించడం నాకిష్టం ఉండదు. ఆలోచన నుంచి తప్పించుకొనే మార్గాలు లేబిల్స్. అర్థం చేసుకొనే కష్టానికి పాల్పడకుండా, తేలిగ్గా కొట్టిపారెయ్యడానికి లేబిల్స్ ఉపయోగిస్తారు. ‘బూర్జువా, శ్రామికవర్గం, రివిజనిస్టు లాంటి లేబిల్స్ అంటించి ఇక ఆ విషయం గురించి ఆలోచించడం మానేయవచ్చు.
***

పైన చెప్పిన అయిదు పాయింట్లు ఆధునిక కవిత్వాన్ని అర్ధం చేసుకోవటానికి, విశ్లేషించటానికి దోహదపడే అంశాలు. పై అయిదు పాయింట్లు స్వేచ్ఛాప్రతిపాదనలు.

కవిత్వంలో నిశ్శబ్దం అనే ప్రతిపాదనకు ధ్వనిసిద్ధాంతం మూలాలు కనిపిస్తున్నా, చెప్పిన విధానం కొత్తది.

కవిత్వం హృదయసంబంధి అన్నటువంటి మాట emotions recollected in tranquility అన్న మాటకు దగ్గరగా అనిపించవచ్చు. కవిత్వం పూర్తిగా వైయక్తికఅనుభవంగా, దర్శనంగా ఆమేరకు తన సృజనను కొనసాగించటం ఇస్మాయిల్ నిబద్దతగా భావించాలి. సాహిత్యప్రయోజనం ఆనందోపదేశాలు అని మనవాళ్లు, పాశ్చాత్యులు అంగీకరించారు. ఆ మాటకు భిన్నంగా కవిత్వం చదువరి మనస్సులో దీపం వెలిగించడం అనటం నవ్యమైన ప్రతిపాదన

అదే విధంగా భాషను శుభ్రపరచటం తెలుగుకు మాత్రమే అన్వయించబడే ఒక విషయంగా భావించవచ్చు. ఈ ప్రతిపాదనకు మూలాలు వాడుకభాషోద్యమంలో ఉంటాయి. అలాంటి క్లిష్టపదాలను వాడటం గురించి, డెడ్ మెటఫర్లను ఒదిలించుకోవటం గురించి ఈ ప్రతిపాదన మాట్లాడుతుంది.

కవిత్వానికి లేబుల్స్ ఉండకూడదు అన్నటువంటి ప్రతిపాదనకూడా పూర్తిగా ఆధునికమైనదే. కామెడిలని, ట్రాజెడీలని సాహిత్యాన్ని లేబ్లింగ్ చేసే పద్దతి పాశ్చాత్యులది. దేశీయమైన ప్రాచీన సాహిత్యంలో ఈ పద్దతిలేదు. ఒక కావ్యం జీవితసామస్త్యాన్ని ప్రతిబింబించేవిధంగా ఉండటంచే లేబ్లింగ్ అవసరపడలేదు భారతీయ లక్షణకారులకు. ఆధునిక కాలంలో కవిత్వాలకు వేసే లేబ్లింగ్ వలన జరిగే నష్టం గురించి మాట్లాడటం కూడా "సాహిత్య సంబంధి" కి లేబుల్స్ తో పనిలేదు అని చెప్పటమే.
.
ఈ అయిదు ప్రతిపాదనలతో కూడిన "Ismayil Literary theory" సాహిత్యంలో ఉండే "సాహిత్యసంబంధి" (Literary) ని నిర్వచిస్తుంది.

బొల్లోజు బాబా





Monday, September 16, 2024

కవిత్వంలో అస్పష్టత - సంక్లిష్టత


‘‘కవిత్వమనేది
ఆత్మలోకంలో ఇద్దరి సంభాషణ
అది
స్వగతమూ కాదు
ఊదరగొట్టే ఉపన్యాసం
అంతకంటే కాదూ’’

కవిత్వం ఒక సామాజిక వ్యవహారం. నా ఆత్మతృప్తికోసం వ్రాసుకొంటాను అనటం ఒక హిపొక్రిసి. ఒక ఊహకు అక్షరరూపమివ్వగానే అది రచన అయిపోదు. దాన్ని మరొకరు చదివినప్పుడే అవుతుంది. కవికి కలిగిన ఊహను అదే స్థాయిలో పాఠకునిలో ప్రవేశపెట్టినపుడు ఏ పేచీ ఉండదు. కవిచేసిన కల్పనను పాఠకులు అందుకోలేకపోతే ఆ కవిత అస్పష్టంగా (Obscurity) ఉందని అర్ధం. అలా కాక పాఠకుడి కొంత శ్రమించి అందులో ఉన్న గూఢార్ధాన్ని విప్పుకొని ఆనందించినపుడు ఆ కవిత సంక్లిష్టంగా (Difficulty/Complexity)) ఉందని భావించాలి.

ఒక కవిత అర్ధం కాకపోవటానికి అనేక కారణాలుంటాయి. ‘‘పాఠకులే నా స్థాయికి ఎదిగి కవితను అర్ధం చేసుకోవాలని’’ కవి కోరుకోవటం సహజమైనా అదంత మర్యాదకరమైన వాదన కాదు. తన కవిత్వంలో తనకు తెలియకుండా దొర్లిన లోపాలను పరిశీలించుకోవటం అవసరం.
స్పష్టాస్పష్టంగా ఉండటం కూడా ఒక కవిత్వ లక్షణమే అయినప్పటికీ హద్దులు దాటకుండా చూడటం కవి బాధ్యత. కొన్ని కవితలు పూర్తిగా అర్ధమవ్వకపోయినా ఏదో అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించటం చేస్తాయి. దానికి కారణం ఆ కవితలలో కవి వాడిన ట్రోప్స్‌ చేసే మాయ అనుకోవచ్చు.

కవి భావం పాఠకునికి అందకపోవటాన్ని అస్పష్టతగా నిర్వచించు కొనవచ్చును.
రమణీయార్ధ ప్రతిపాదనే కవిత్వం అన్నారు ప్రాచీనులు. వివిధ రకాలైన శబ్ద, అర్ధ కావ్యదోషాలను ప్రతిపాదించి కావ్యం రమణీయంగా, స్పష్టమైన అర్ధం కలిగి ఉండేలా శాసించారు. ఆధునిక కవిత్వం ఆ శృంఖలాలను ఛేదించుకొంది. ఇది యుగధర్మం.

ఒకప్పుడు కవిత్వం ఏదో ఒక కథతో ముడిపడి ఉండేది. నేడు కవిత్వం నుండి కథ వేరుపడి స్వతంత్రంగా ప్రయాణిస్తున్నది. కవిత్వం అనేది ఒక సంపూర్ణమైన కథను కాక భావాలను, అనుభూతులను మాత్రమే వ్యక్తీకరించే సాధనంగా మారింది.

ఈ నేపథ్యంలో- జీవితం నుంచి వస్తువును తీసుకొని మూర్త వర్ణణలతో వ్రాసిన కవిత్వం సులభంగా అర్ధమౌతుంది. కుందుర్తి, తిలక్‌, శేషేంద్ర శర్మ, శిఖామణి, శివారెడ్డి, ఇస్మాయిల్‌ లాంటి కవులు ఆ కోవకు చెందిన కవిత్వాన్ని వ్రాసారు. అలాకాక అమూర్త/నైరూప్య భావాలద్వారా కవిత్వం చెప్పినప్పుడు భావప్రసరణలో కొంత సంక్లిష్టత ఏర్పడుతుంది.

ఎందుకంటే ఇక్కడ కవి వాడే ప్రతీకలు, ఉపమానాలు, భాష, చేసే ప్రయోగాల వల్ల అభివ్యక్తి జటిలమౌతుంది. ఆరుద్ర, మో, సిద్దార్థ, ఎమ్మెస్‌ నాయుడు, ఎమ్మెస్‌ సూర్యనారాయణ, అనంతు లాంటి కవుల కవిత్వం ఈ బాపతు.

కవిత్వంలో కనిపించే అస్పష్టతను - భాషాపరమైన అస్పష్టత, వస్తుపరమైన అస్పష్టత, భావపరమైన అస్పష్టతలుగా పరిశోధకులు విభజించారు.

నువ్వు దగ్గరుంటే
కోటినక్షత్రాల వెలుగునౌతాను
నువ్వు దూరమైతే
తోకచుక్కలా నేల రాల్తాను `` అంటూ తన ప్రేయసిని గురించి వర్ణించాడో యువకవి. ఇది చదివిన పాఠకుడు అయోమయానికి గురవుతాడు ఎందుకంటే తోకచుక్కలు నేల రాలవు, ఉల్కలు రాల్తాయి. పాపం ఆ యువకవికి తోకచుక్కలకు, ఉల్కలకు భేధం తెలియక చక్కని అనుభూతిని పాడుచేసాడు. ఇది భాషాగతమైన అస్పష్టత.

కవిత్వంలో అస్పష్టతను గురించి మాట్లాడుకొనేపుడు వేగుంట మోహన ప్రసాద్‌ ప్రస్తావన రాక మానదు. మో అధివాస్తవిక కవిత్వానికి చిరునామ.

రెబెకా
ప్రజాపతి ఉరుముతాడు
ఐవీ శంపాలత క్రీపర్‌ మెరుస్తుంది
ఇసిరిస్‌ వినాయకుడు చెర్లో మునుగుతాడు
కప్ప తల్లి పెళ్ళి అయిపోతుంది
బతకమ్మ పండగ చేసుకుంటాం
నీ ప్రప్రధమ అధమాధమ ప్రేయసి
చాటల్ని పంచుతుంది
కదలని అకతా నదిలో
ఆత్మకు లంగరు వేస్తాం
అక్షరం క్షయమవుతుంది
ఆత్మ శరీరమవుతుంది (రహస్తంత్రి - వేగుంట మోహన ప్రసాద్‌)

ఇది ఒక పూర్తి కవిత. క్రింద ఇచ్చిన ఫుట్‌ నోట్సులో రెబెకా అంటే Daphne Du Maurier నవల అని, ఇసిరిస్‌ అంటే ఇలియట్‌ ‘వేస్ట్‌ లాండ్‌’ లో ఫెర్టిలిటీ గాడ్‌ అని ఇంకా ఇ.ఎం.ఫార్‌ స్టర్‌ తన నవలలో ఉపయోగించిన ‘కనక్ట్‌’ థీరీ ఈ కవితలో వాడాను అని చెప్తాడు కవి. ఇవేవీ కవితను అర్ధం చేసుకోవటానికి ఏమాత్రం సహాయపడవు సరికదా మరింత క్లిష్టతరం చేస్తాయి. కవితా వస్తువు అంతుచిక్కదు. కవితమొత్తం ఒక ఆత్మాశ్రయ అంతర్ముఖత్వ మేధావితన ప్రకటనలా అనిపిస్తుంది. వస్తుపరమైన అస్పష్టతకు రెబెకా ఉదాహరణగా నిలుస్తుంది. అయినప్పటికీ కవితలో మెరిసే విభ్రమ ఆకట్టుకొంటుంది. విభ్రమను కావ్యలక్షణంగా ప్రాచీనులు గుర్తించారు. ‘‘తిక్కగా ఉన్నా కవిత్వం ఉంటే క్షమిస్తాం’’ అని మో గురించి ఇందుకే అన్నాడేమో చేరా.

“To be or not to be” షేక్స్‌పియర్‌ హామ్లెట్‌ స్వగతం లోని ప్రసిద్ధ వాక్యం. ఒక డోలాయమాన మానసిక స్థితిని అద్భుతంగా వ్యక్తీకరిస్తుంది.

ఆలూరి బైరాగి ‘‘హామ్లెట్‌ స్వగతం’’ కవిత ఇలా మొదలౌతుంది
తీగలు త్రెంచిన తుఫాను తగ్గిన తరువాత నేడు
తెలుస్తున్నది విధ్వంసపు టడుగుజాడల రాలుటాకుల పూల మధ్య
వేసిన ప్రశ్న ఒప్పైన ప్రత్యుత్తరం తప్పేనని
ప్రత్యుత్తరం తప్పైతే వేసిన ప్రశ్న తప్పేనని
వానకు తడిసి ఎండకెండి చేరుకొన్నది నావ నేడు తీరాన్ని
పగిలి చెదిరి చిద్రుపలై మునిగి దూరపారాన్ని
యిప్పుడిరక పగమరచిన సెగలారిన చీకటిలో
నీడల నటన బాధించదు ఇంద్రియాలను
ఆవేశం అలసటగా, చైతన్యం వేడిలేని వెలుతురుగా,
కలగా, అలగా, ఒక తీయని జలగా మారిన ఈ వేళలందు
తెలుస్తున్నది చావు బ్రతుకులిక్కడ లెక్కకు రావని
లెక్కకు వచ్చేవిచ్చట ఒక చూపని,
ఒక నవ్వని, ఒక కిరణం, ఒక పూవని,
తెలుస్తున్నది//......... అంటూ ఒక ప్రవాహగతిలో సాగిపోతుంది కవిత.

తీగలు తెంచిన తుఫాను అన్న ఊహే బుద్దికి అందదు. ఏం ప్రశ్నో, ఎవరు వేశారో అర్ధం కాదు. ఒక వేళ టుబి ఆర్‌ నాటుబి ప్రశ్నే అనుకొన్నా ఆ ప్రశ్నెందుకు తప్పో, జవాబెందుకు తప్పవుతుందో అర్ధం కాదు. నీడల నటన, అలసట చెందే ఆవేశం, వేడిలేని వెలుతురు చైతన్యం, లెక్కకు వచ్చే చూపు- లాంటి అమూర్తభావనలు కవితను అర్ధం చేసుకోవటంలో అడ్డుతగుల్తాయి. మొత్తం కవితలో వేదనలాంటి అనుభూతి స్పష్టాస్పష్టంగా తెలుస్తూంటుంది తప్ప విషయం అర్ధం కాదు. దీన్ని భావపరమైన అస్పష్టతగా భావించవచ్చు.

ఎమ్మెస్‌ నాయుడు తెలుగు సాహిత్య రంగంలో పేర్గాంచిన కవి. ‘‘ఒక వెళ్లిపోయాను’’ కవితా సంకలనంతో అలజడి రేపి తనని తాను నిరూపించుకొన్న భావుకుడు. ‘గాలి అద్దం’ ఇతని రెండవ సంపుటి. నాయుడు కవిత్వంలో అద్బుతమైన పదచిత్రాలు ఉంటాయి. ఒక మత్తులోకి లాక్కెళ్తాయి. భావం కనపడీ కనపడకుండా దోబూచులాడి నేను చెప్పేది ఇంతవరకే ఆపై నీ ఊహకు పనిపెట్టుకో అంటూ అదృశ్యమైపోతూంటుంది.

ఆధునిక జీవితంలో ఎన్ని అసంగతాలు, మార్మికతలు, అస్ఫష్టతలూ ఉన్నాయో అన్నీ ఇతని కవిత్వంలో ప్రతిబింబిస్తాయి. చెప్పేది ఎంతైతె ఉంటుందో చెప్పనిదీ రెట్టింపు ఉంటుంది.

(( మరల తల ))
ముఖమొహ్హటే
చలామణి గారడి
చలనం చలచలన
మరో మర
మరల తల
తాటకతై
మోహ మొహాల దడబడ
నయన ఖార్ఖానాలో మకమక
దాటని కన్నీటి పొలిమేర
ఆలోచనల పశువు
చిద్విలాస సంఘర్షణలో
దిగంబరై `` (ఎమ్మెస్‌ నాయుడు).

కవితా శీర్షికే తిరకాసుగా ఉంది. ఇక లోపలకు వెళితే పదాలను ఓ డబ్బాలో వేసి తిప్పి తిప్పి పేపరుపై బోర్లించినట్లు అనిపిస్తుంది.

బి.ఎస్‌.ఎం కుమార్‌ కవిత్వం మరీ అరాచకంలా అనిపిస్తుంది. అస్పష్టతకు మించిన పేరేదైనా ఉంటే సరిగ్గా సరిపోతుంది. ఆయన ఒక కవితలో కొంతభాగం ఇది. (పూర్తికవితలు కూడా ఇలానే ఉన్నాయి)

//తరగని నడకల్ని వేలాడేసిన సమయాన్ని పీలుస్తూ
రాత్రి మెల్లగా కూల్చే సంభాషణ
ఇద్దరమూ ఎదురుగానే కూర్చున్నాం
తన గాజు బిందువుల్ని నా తలమీదుగా ఒదులుతూ
అరచేతులు కలగనే కన్నీళ్లు బయటపడని రోడ్డు పగులుతూ.... (పేజి.నం: 3 నిఘాలు, వృత్తాలూ, వెల్తురారిన కళ్లు)

కుమార్‌ మంచి ప్రతిభాశాలి భాషాపటిమా, నూత్నపదబంధాల్ని సృష్టించగలిగే శక్తి కలిగినవాడు. అయినప్పటికీ పదానికి పదానికి పొంతన కానీ, వాక్యానికి వాక్యానికీ మధ్య ఒక క్రమం కానీ, భావానికి భావానికి మధ్య ఒక అన్వయం కానీ ఉండదు ఇతని కవిత్వంలో. ప్రముఖ విమర్శకుడు శ్రీ తమ్మినేని యదుకుల భూషణ్‌ అన్నట్లు ‘‘కవిత వ్రాయటం పూర్తయింది, ఇక అర్ధం చేసుకోవటమే మిగిలుంది’’ అనుకోవాలి.

నేడు వస్తువినిమయ ధోరణులు, ఉపాధులు విచ్ఛిన్నం కావటం, జీవికకోసం వలసలు తప్పని సరి అవ్వటం, రాజకీయ అవినీతి పెచ్చరిల్లటం లాంటి సాంస్కృతిక సామాజిక మార్పులు అనేకం చోటుచేసుకోవటం వల్ల జీవనం సంక్లిష్టమైపోయింది. ఆధునిక కవులు వైయక్తికమైన తమ విరక్తిని, అసంతృప్తిని, బాధను వ్యక్తీకరించటానికి చేసే ప్రయత్నంలో జీవితంలోని అస్పష్టత కవిత్వంలోకి వచ్చి చేరింది.

కవి మానసిక సంక్షోభం, అతి ప్రతీకాత్మకత, భావాలను నియంత్రించలేక పోవటం, మితిమీరిన నైరూప్య భావచిత్రణ మొదలగునవి కవిత్వంలో అస్పష్టతకు కారణాలుగా చెప్పుకోవచ్చు.
కవిత్వంలో అవిచ్ఛిన్నత, అసంబద్దత పోస్ట్‌మోడర్న్‌ లక్షణాలుగా చెపుతారు. అలాంటి కవిత్వం సామాన్య పాఠకునికి అస్పష్టంగా ఉంటుందని యువకవులు గుర్తించాలి.
****
కొంతమంది పాఠకులు కవిత్వాన్ని అర్ధం చేసుకోవటానికి ఏమాత్రం ప్రయత్నం చేయరు. కవిత్వం అంటే న్యూస్‌ పేపర్‌ కథనంలా సుభోధకంగా ఉండాలని భావిస్తారు. ఇలాంటి వారికి కవితలోని ‘కవిత్వభాష’ అర్ధం కాక ఆ కవిత అస్పష్టంగా ఉందని ఆరోపిస్తారు. నిజానికి అది అస్పష్టత కాదు సంక్లిష్టత. ఒకే కవితలో విభిన్న ఆలోచనలను, కోణాలను, సన్నివేశాలను చొప్పించటం సంక్లిష్టతకు దారి తీస్తుంది. అలాంటి కవిత్వాన్ని పొరలు పొరలుగా విప్పుకొని చదువుకొన్నప్పుడు రససిద్ధి కలుగుతుంది. వాక్యాల మధ్య అర్ధాలను వెతుక్కొని, కలుపుకొని హృదయగతం చేసుకొన్నప్పుడు ఆ కవిత తాలూకు సంపూర్ణ చిత్రం ఏర్పడుతుంది. కవి ఉద్దేశించిన భావాలు అవగతమౌతాయి. ఒక పజిల్‌ ను విప్పుకొన్నప్పుడు కలిగినటువంటి ఆనందం కలుగుతుంది.

ఒక కవి ఎంతో శ్రమించి కవిత్వాన్ని సృజించినపుడు, పాఠకులు కూడా కొంత శ్రమించి ఆ కవితాఫలాన్ని అందుకోవటం వారి బాధ్యత. అలాంటి పాఠకులే కవిత్వానికి సహృదయులు. ఈ ప్రక్రియలో ఒక రచనలోని మంచి చెడ్డలను విశ్లేషించే విమర్శకుల పాత్రకూడా ముఖ్యమైనది.
కవి ఊహలను అందుకోవటానికి ఒక పాఠకుడు ఏమేరకు శ్రమించాలో, చెల్లి సురేంద్రదేవ్‌ వ్రాసిన ‘‘ ఎంగిలి బిర్యాని చేతులు’’ అనే కవితను ఉదాహరణగా తీసుకొని పరిశీలిద్దాం.

ఈ కవిత కావేరి జలవివాదం గురించి. దీనిలో అతని సామాజిక దృక్ఫథం, రాజకీయ అవగాహన, కవిత్వతత్వం స్పష్టంగా వ్యక్తమవటం గమనించవచ్చు. కర్ణాటకలో పుట్టి తమిళనాడులో ప్రవహించే కావేరి జలాల పంపకం ఇరురాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. తమిళనాడు దిగువ రాష్ట్రం కనుక కర్ణాటక విడుదల చేస్తేనే నీరు పొందే పరిస్థితి. దీన్ని నేపథ్యంగా తీసుకొని వ్రాసిన ఒక కవితలో, కావేరి నదికి తమిళులకు మధ్య ఉన్న చారిత్రిక, ఐతిహాసిక అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు సురేంద్ర.

ఎంగిలి బిర్యానీ చేతులు

ఎవడో గిట్టనివాడు
మన గడ్డివాములపైన
పూరిగుడెసెల పైన
లంకచుట్ట విసిరినట్లు
ఈ రెండు రాష్ట్రాల నడుమ
ఏ ఫారిన్‌ సిగరెట్‌ చిచ్చుపెట్టిందో
బెంగుళూరు నడిబడ్డున తగలబడిపోయిన
వాహనాల అస్తికలను పశ్చిమవాహిని లో
ఎవరు కలుపుతారో?

ఎంగిలి బిర్యానీ చేతులు అనే కవితా శీర్షిక- కావేరి వివాదం కారణంగా కర్ణాటకలో తమిళులపై జరుగుతున్న దాడులు అన్నీ రాజకీయ ప్రేరేపితమని, కవి తీసుకొన్న స్టాండ్‌ ని ముందే బలంగా వ్యక్తీకరిస్తుంది.

తమిళనాడులోని శ్రీరంగపట్నం వద్ద ప్రవహించే కావేరినదిని పశ్చిమ వాహిని అంటారు. దీన్ని దక్షిణ గంగగా భావించి పితృదేవతలకు తర్పణం విడువడం అనాదిగా ఆ నాటలో ఒక ఆచారం. సురేంద్ర పై కవితా వాక్యాలలో బెంగళూరులో తగులబడిన అస్తికలు తమిళులవని అన్యాపదేశంగా చెపుతున్నాడు.

చోళరాజు కంఠమండు నీటి కొరకు
అగస్త్య మహర్షిని ప్రార్ధిస్తే
జంభాపతి దేవత
వెనవా తీర్థ విళక్కువా...!
అంటూ స్వాగతించిన కావేరి నది...
గుర్తుచేస్తున్నాడు కవి.
తన రాజ్యంలోని ప్రజలు నీరులేక కరువులతో అల్లాడుతున్నప్పుడు కంఠమాన్‌ అనే తమిళ చోళ రాజు తన సమకాలీనుడైన అగస్త్య మహామునిని వేడుకొన్నాడట. అపుడు అగస్త్యుడు తన కమండలం నుంచి నీరును నేలపై చల్లగా కావేరి నది ఏర్పడిరదని, ఆ నదిని జంభాపతి అనే దేవత ‘‘ఈ రాజ్య ప్రజల దాహాన్ని తీర్చే కాంతిపుంజం’’ గా ఆహ్వానించినట్లు - ఒక తమిళ ఇతిహాసం చెపుతుంది.

పై ఖండికల ద్వారా తమిళుల సంస్కృతి, చరిత్రలలో కావేరినది ఒక భాగంగా ఎప్పటినుంచి ఉన్నదో స్పష్టపరుస్తున్నాడు కవి.

/నాడు తైత్తరీయ ఉపనిషద్‌ లో ‘‘అన్నం బహు కుర్వీత’’
అంటూ కావేరిని కీర్తించారు
నేడు
శ్రీరంగనాథలో ఎండిన కావేరినదిని చూడు
ఇప్పటికైనా సిగ్గేస్తుందా...?

భారతీయులకు నది అంటే దైవం. ఆవిషయాన్ని మన పూర్వీకులు ఏనాడో గుర్తించి తైత్తరీయ ఉపనిషద్‌ లో నదీ వనరుల్ని ప్రస్తావిస్తూ let us share, let us produce and share”అన్నారు. కానీ ఈరోజు పంచుకోవటానికి ఇన్ని యుద్ధాలా అన్న సూటి ప్రశ్న ఆలోచింపచేస్తుంది.
కర్నాటిక్‌ సంగీత విద్వాంసులు

త్యాగరాజు... ముత్తుస్వామి దీక్షితార్‌..
శ్యామశాస్త్రి
ఈ నీళ్ళు త్రాగిన వాళ్ళే//
ఎక్కడో కొడగు కనుమలలో జన్మించి
తమిళుల దాహార్తిని తీరుస్తూ
పుదుచ్చేరి తీరానా పూమ్బుహార్‌ లో
కావేరి బంగాళాఖాతంలో కలిసిపోతుంది
పెట్రోల్‌ బాంబ్స్‌ వేసిన ఎంగిలి బిర్యానీ చేతులకు
కనీసం ఇదైనా తెలిసిందా!
‘బిలగుండ్లు’ భద్రంగా ఉండాలి. /

తమిళనాట స్థిరపడిన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రిలను కర్ణాటక సంగీతానికి కావేరినది అందించిన కానుకలు. వీరు కావేరిఒడ్డున నివసిస్తూ, అనేక కీర్తనలలో కావేరిని స్తుతించారు.

కావేరి నది కర్ణాటకలో పుట్టి, తమిళనాడులో ప్రవహించి, పుదుచ్చేరి వద్ద సముద్రంలో కలుస్తోన్నదనే సంగతైనా కనీసం ఈ అలజడులు చేస్తున్న వారికి తెలుసా- ఇది మూడు రాష్ట్రాల ఉమ్మడి సొత్తని ప్రశ్నిస్తున్నాడు కవి.

తమిళుల పక్షాన నిలబడి ఇంత గొప్పగా చెప్పిన కవి చివరలో కర్ణాటకకు ఒక హెచ్చరిక కూడా చేస్తాడు ‘‘బిలగుండ్లు భద్రం గా ఉండాలి’’ అని.

బిలగుండ్లు అనేది కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతం. అక్కడ తమిళనాడుకు ఎంతనీరు వస్తుందో నీటిపారుదల నిపుణులు బొట్టు బొట్టు లెక్కిస్తారు. బిలగుండ్లు జోలికి వస్తే ఊరుకోమన్న హెచ్చరిక ఆఖరి వాక్యంలో ధ్వనిస్తుంది.

అనేక మంది చారిత్రిక వ్యక్తులు, సంఘటనలు, ఉటంకింపులతో కవిత రాయాలంటే ఆయా అంశాలపట్ల కవి రీసెర్చ్‌ చేయాలి. చదవాలి, అవగాహన పెంచుకోవాలి. తనదైన వ్యాఖ్యానం చేయగలగాలి. ఇవన్నీ పై కవితలో కనిపిస్తాయి. యధాలాపంగా చదివితే ఇలాంటి కవితలు అర్ధం కావు. అలాగని అస్ఫష్టత ఉందని కాదు. ఇది సంక్లిష్టత. కవిత్వంలో సంక్లిష్టతను విప్పుకోవాలంటే పాఠకుడు కొంచెం శ్రమించాలి. కవి స్థాయిని అందుకోవటానికి ప్రయత్నించాలి.

పై కవితలో కవిత్వాంశ ఎక్కడ ఉంది అనే అనుమానం కలగవచ్చు. కావేరి అల్లర్లను ‘‘ఎంగిలి బిర్యాని చేతులు’’ అనటం లోనే ఉంది. నేడు సమాజంలో ఉండే రాజకీయ వ్యూహాలు, ఈ సమస్య పట్ల కవికి ఉన్న దృక్ఫధం సూటిగా స్పష్టంగా ఆవిష్కృతమై కవితను ఊహించని ఎత్తులకు తీసుకువెళ్ళింది. మిగిలిన వాక్యాలన్నీ ఆ దృక్ఫధానికి రక్తమాంసాలుగా మారిపోయి గొప్ప ఉద్వేగభరితమైన అనుభవాన్ని అందిస్తాయి.

(కవిత్వంలో ఉండే సంక్లిష్టతను వివరించటానికి పై కవితను ఉదాహరణగా తీసుకొన్నాను తప్ప కవిత్వపఠనం ఇంత శ్రమతో కూడుకున్నది అని భయపెట్టటానికి కాదు. కవి ఎంతో శ్రమించి ఒక సృజన చేస్తున్నపుడు పాఠకుడు కూడా కొంత శ్రమించాల్సిన భాద్యత ఉండాలని చెప్పటానికి మాత్రమే. అదే లేకపోతే భాషపుట్టినపుడు పుట్టిన కవిత్వం ఇంతకాలం మనగలదా?)

రాత్రి హోరున వర్షం
ఉదయం లేచి చూస్తే
ఎదురింటాయనకు రెండు మేడలు. (ఇస్మాయిల్‌ హైకు)

యాధాలాపంగా చదివితే వర్షానికి రెండుమేడలకు సంబంధం తెలియదు. సాధారణంగా భారీ వర్షం వచ్చినపుడు రోడ్లపై నీళ్లు నిలబడటం సాధారణం. అలా నీళ్లు నిలిచినపుడు ఎదురింటాయన మేడ ఆ నీళ్లలో ప్రతింబింబంగా ఏర్పడి రెండు గా కనిపిస్తున్నదనే చక్కని ఊహను ఈ హైకూ దృశ్యమానం చేస్తుంది.
****

కొన్ని కవితలు ఒకే అర్ధాన్ని కాక భిన్న అర్ధాలను ఊహించుకొనేలా ఉంటాయి. ఆలా ఉండటాన్ని అనిర్వచనీయత (Ambiguity) అని కొందరు నిర్వచించారు. కవిత్వం ప్రధానంగా అర్ధకళ. బహుళార్ధాలు వచ్చేలా రాయటం కవిత్వంలో సామాన్యమే. కవిత్వాన్ని ఎలా వ్రాసినా ఇస్మాయిల్‌ గారు అన్నట్లు ‘‘కవిత్వం చేసే పనల్లా చదువరి మనస్సులో దీపం వెలిగించడమే. దీని వల్ల అతని అవగాహన పరిధి విస్తరిస్తుంది. తన మనస్సులో వెలిగిన దీపం వెలుతురు తన దారి తను వెతుక్కోవడానికి సహాయపడుతుంది’’.

మామూలు భాషవేరు కవిత్వభాష వేరు. కప్పిచెప్పేది కవిత్వం అన్నారు. కవిత్వం కొంత గూఢతను సహజంగానే కలిగిఉంటుంది. పాఠకునిలో హృదయాన్ని కదిలించగలిగే ఉద్వేగాలను/అనుభూతులను ఇవ్వగలిగితే అది మంచి కవిత్వమౌతుంది. ఈ ప్రక్రియలో కవిత అర్ధమైందా లేదా అనేది కొంత అప్రస్తుతం అయినప్పటికీ అస్పష్టకవిత్వం ఉత్తమ కవిత్వమనిపించుకోదు.
కవి, ఒక భావ వాహిక, పాఠకుడు ముగ్గురూ కలిసినపుడే రచన అవుతుంది. భావాలు కవి వద్దే ఆగిపోతే దాన్ని కవిత్వం అనలేం. కవిత్వంలో అస్పష్టతకు కవిని నిందించరాదు. అస్పష్టత అనేది భావప్రసార సంబంధమైన సమస్య. ఈ అంశానికి సంబంధించి ఆధునిక కవిత్వం మరిన్ని మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది.

బొల్లోజు బాబా

(కవిత్వభాష పుస్తకంలోని “అస్పష్టత-సంక్లిష్టత” పేరుతో రాసిన వ్యాసం.
పూర్తిపుస్తకాన్ని కింది లింకులోనుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును).

Saturday, September 7, 2024

మిత్రుని వాల్ పై చేసిన కామెంటు....(ఎడిటెడ్)


బ్రాహ్మణ భక్తి బ్రాహ్మణ ద్వేషం కవలలు ---కొంతవరకూ నిజమే కావొచ్చు.

రెండో శతాబ్దానికి చెందిన సంస్కృత వ్యాకరణ వేత్త పతంజలి అతని మహాభాష్య అనే గ్రంధంలో – బ్రాహ్మణులు శ్రమణులు(బౌద్ద, జైన, ఆజీవికులు) పాము ముంగిసల్లా ఆగర్భ శత్రువులని అన్నాడు.
కాపాలికా మతంలో చేరిన ప్రతీ వ్యక్తి ఒక బ్రాహ్మణుడిని చంపి అతని పుర్రెలో భిక్షాటన చేయాలని ఒక నియమం ఉండేది.

చార్వాకులు బ్రాహ్మణుల పట్ల సెటైర్స్ వేసారు "తోడేలు పాదముద్ర" అనే పిట్టకథ పేరుతో. వారు అభూతకల్పనలతో మాయమాటలు చెబుతారని అన్నారు. వేదాలను రచించినవారు విదూషకులు, మోసగాళ్ళు, రాక్షసులు అన్నారు.

వేదాలను అధ్యయనం చేస్తున్నవారిని "మూర్ఖుల సమూహం" గా వర్ణించాడు, ఏడవ శతాబ్దానికి చెందిన జైన మత ఉద్యోదన సూరి తన కువలయమాల కావ్యంలో.
 
బౌద్ధులు బ్రాహ్మణీయ సిద్ధాంతాలను అంగీకరించలేదు. బుద్ధుడు బ్రాహ్మణులు చెప్పుకొనే ఉత్తమజన్మ భావనను విమర్శించాడు. వారు కూడా మామూలు మనుషులే అన్నాడు. అది ద్వేషంగా పరిణమించిందో లేదో తెలియదు కానీచాలామంది హిందూ బ్రాహ్మణులు బౌద్ధంలో చేరారు
.
అశోకుడు లౌకిక భావనలని అవలంబించాడు. బ్రాహ్మణులకు అగ్రపీఠం ఇవ్వలేదు. అందరినీ సమాదరించాడు. ఈ రాజనీతి బ్రాహ్మణవాదుల సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను సవాలు చేసింది.

బ్రాహ్మణుల పట్ల ద్వేషం అనేది సైద్ధాంతికంగా వారు చేస్తున్న అశాస్త్రీయ అరాచకాల పట్ల అని ఊహిస్తాను ముఖ్యంగా జన్మ ఆధారిత హెచ్చుతగ్గుల వ్యవస్థ పట్ల.
 
కిందనున్నవారు పైకి చేరలేక, ఒక వర్ణంలో పుట్టినందుకు జీవితాంతం బానిస జీవితాన్ని గడపాల్సి రావటం, దానికి కారణమైన "బ్రాహ్మనిజం" పై కలిగిన ద్వేషం అది.

ఈ ద్వేషం నుండి తప్పించుకోవటానికి ధర్మశాస్త్రాలలో బ్రాహ్మణుని సేవించాలి. దూషించరాదు, తాకరాదు, దండించరాదు (రాజుకూడా), గాయపరిస్తే మరణ శిక్ష, ఇక హత్య అయితే వేయి జన్మలవరకూ విముక్తే ఉండదు (ఈశ్వరునికూడా బ్రహ్మహత్యాపాతకదోషం అంటుతుంది అనే పురాణాలతో) అంటూ చాలా చాలా బలమైన రాతలు రాసుకొన్నారు. బ్రాహ్మణాధిక్యతను చాటి చెప్పే పురాణాలు ఇతిహాసాలు రాసుకొన్నారు.
 
సమాజంనుంచి ప్రతిఘటన రాకుండా. ధర్మశాస్త్రాలను రాజుచే బలంగా అమలుచేయించుకొన్నారు.
 
బ్రాహ్మనిజానికి- ఇతర సాంస్కృతిక జీవనాలకు మధ్య జరిగిన సంఘర్షణే మన చరిత్ర. ఇది ముఖ్యంగా బౌద్ధ హిందూ మతాల ఘర్షణ అంటారు డా. అంబేద్కర్ గారు.

 
బొల్లోజు బాబా

Tuesday, July 23, 2024

Stray thoughts...



రాణి శివశంకర గారి వాల్ పై ఒక చర్చలో నేను చేసిన కామెంట్లు ఇవి. ఒక చోట ఉంటాయని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
 
1.దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మనాదీనం అనే భావాన్ని అందరిలో ప్రవేశపెట్టి, రాజుతో సహా అందరినీ అధీనంలోకి తెచ్చుకొన్న బ్రాహ్మణుని పాత్ర చరిత్రలో అత్యంత ప్రభావశీలమైనది
2.అజ్ఞాతంలోంచి రామానుజుడు బయటకు వచ్చిన తరువాత లోకాన్ని ఆధీనంలోకి తెచ్చుకొని, ఎన్నో ఆలయాలని విష్ణ్వాలయాలుగా మార్చాడుగా..... ఏవేవో స్థానిక న్యుయాన్సెస్ ఉంటాయి వాటిని పరిగణలోకి తీసుకోవాలి అనే వాదనలు స్థూలంగా జరిగిన బ్రాహ్మణాధిపత్యాన్ని చరిత్రలోంచి చెరిపేయలేవు.

3. గుడి క్షత్రియ ప్రదానం. శూద్రులకు చెందినది కూడా. ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది.
రాజుని, ఇతర శూద్ర కులీనుల్ని ఆధీనం లోకి తీసుకోవటానికి గుడిని ప్రధానం చేసారు. దానిలోనికి ఇతరుల ప్రవేశం శాస్త్రాల ద్వారా నిషేదించారు. ఇది ఎంతెలా అంటే విగ్రహాన్ని సృజించిన శిల్పిని కూడా బయటే నిలబెట్టారు.
ఇది కాదా చరిత్రలో బ్రాహ్మణులు పొందిన ప్రాధాన్యత.

4. ఇప్పుడు నడుస్తున్న హిందుత్వా అంతా వైష్ణవమే. నిజానికి చరిత్రలొ కూడా అగ్రెస్సివ్ గా ఉన్నది వైష్ణవమే. శైవం సింధులోయనాగరికత నుంచీ ఉన్నప్పటికీ 5/6 శతాబ్దాలలో రూపుదిద్దుకొన్న వైష్ణవం ధాటికి నిలబడలేకపోయింది. ఎంత వీరశైవం పేరుతో ప్రతిహింస చేసినప్పటికీ.
బౌద్ధ, జైనాల స్థానాన్ని వైష్ణవం తీసుకొంది.

స్థూలంగా జరిగే ఒక క్రమం ఉంటుంది. ఇది చరిత్ర నడిచిన మార్గంగా అనుకోవచ్చు. దీనిలో బ్రాహ్మణ తంత్రం చే ఒక రకమైన హిందూ ఆధిపత్యం నడిచింది. ఇప్పటికీ నడుస్తూ ఉంది.
ఇక అంచులలో న్యుయాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు తెలివిగా హిందుత్వ చరిత్రకారులు, ఆ న్యుయాన్సెస్ చూపుతూ అదే నిజంగా మెయిన్ స్ట్రీమ్ చరిత్ర అని వాదిస్తున్నారు. మీరు కూడా చూడండి...గర్భాలయంలోకి ఎవరూ వెళ్ళరాదు (ఎందుకు ఆ రూలు వచ్చిందో ఆలోచించకుండా) అయినా శివాలయాల్లో వెళతారుగా అంటూ మినహాయింపులు చెబుతున్నారు.
శూద్రులు ఆలయాల్లో ఉండేవారు అని మరో వాదన తెచ్చారు. శూద్రుల ఆలయాలు నేడు బ్రాహ్మణీకరణ ఎందుకు జరుగుతున్నాయో మాట్లాడుతున్నారా?
మీరు చెబుతున్న న్యుయాన్సెస్ అంచులలో ఉంటాయి తప్ప ప్రధాన స్రవంతి చరిత్రను (బ్రాహ్మణాధిక్యత చరిత్ర) ప్రభావితం చేసినట్లు భావించలేం. వాటిని చూపి చరిత్ర ఇలా జరిగింది అని చెప్పబూనటం నా దృష్టిలో వక్రీకరణ.
నాకేమీ ఉద్యమశీలత లేదు. ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడని విషయాలు నేను మాట్లాడతాను. అంతే. ఇదేమీ ఉద్యమం కాదు.
 
5. ఆ పార్టీ బలహీనపడినప్పాటికీ అది చొప్పించిన ద్వేషం, హింస ప్రజల బుర్రల్లోంచి తొలగిపోవటానికి కనీసం రెండు తరాలు పడతాయనిపిస్తోంది. నేటి యువతతో మాట్లాడండి. (నేను డిగ్రీ పిల్లలతో నిత్యం సవాసం చేస్తుంటాను) వాళ్ళు ఈ వాట్సప్ అబద్దాలను ఎలా విశ్వసిస్తున్నారో అర్ధమౌతుంది. ఇంత చిన్న వయసులో వాళ్ళు ఏర్పరుచుకొన్న అబిప్రాయాలు చాలబలమిన ముద్ర వేస్తాయి వారి జీవితాలపై.
ముస్లిమ్ ద్వేషం, హిందూ ఔన్నత్యం, మతం ప్రమాదంలో ఉంది అనే విషబీజాలు అంత తొందరగా నమసిపోతాయని అనుకోను.
 
ఇవన్నీ రాజకీయ ప్రేరేపితాలు అని చెప్పటంలో మనతరం విఫలమైంది.

బొల్లోజు బాబా

Saturday, July 13, 2024

ఈ క్షణం - Now by K. Satchidanandan


ఎక్కడో ఒక వ్యక్తి వేణుగానాన్ని వింటో
గొప్ప భావోద్వేగానికి గురవుతాడు
ఒక స్త్రీ నేలకు ఒంగి గడ్డి కోస్తుంది
ఒక చెట్టు రాలిపడే ఆకును చూస్తూ జాలిపడుతుంది
ఒక ఆవు అప్పుడేపుట్టిన దూడను తన ప్రేమనిండిన నాలుకతో
శుభ్రం చేస్తుంది.
ఒక సాలీడు తదుపరి ఎక్కడకు వెళ్ళాలి అనుకొంటు
గాలిలో తడుముకొంటుంది
కూర్చున్న నేను ఖాళీ పేజీని అలా చూస్తూ ఉంటాను

విడివిడి సంఘటనలే
ఈ ప్రపంచాన్ని ఉనికిలోకి తీసుకొస్తాయి.
ప్రేమ, రక్తం, యుద్ధం లతో చరిత్ర లిఖించబడినట్లు.
కానీ ప్రతీది దాని మూలాలవద్ద ఎక్కడో చిక్కువడి ఉంటుంది
రక్తము, భాష
పర్వతాలు, గిట్టలు,
నదులు పక్షులు
నక్షత్రాలు దేహాలు లా .

హొటల్ బేరర్ ప్లేట్లు, స్పూన్లు, ఫోర్కులు
మృత్యువనే డైనింగ్ టేబుల్ పై పడకుండా
ఎలా అయితే ఒంటిచేత్తో పట్టుకొంటాడొ అలాగే
ఎవరోఒకరు ఈ భూమిని ఆకాశాన్ని
పడిపోకుండా పట్టుకొంటూ ఉంటారు.
నా రాలిపడిన వెంట్రుకలు
గురుగ్రహం వైపు ఎగిరిపోతున్నాయి.
 
మూలం: Now by K. Satchidanandan
అనువాదం: బొల్లోజు బాబా

Sunday, July 7, 2024

On the branch of my Heart, by K.Satchidanandan

(రేప్ కు గురయి ఆత్మహత్య చేసుకొన్న ఇద్దరు బాలికల జ్ఞాపకాలతో )
.
ఆకులు కత్తిరించబడిన నా హృదయ తరుశాఖపై
రెండు చిట్టి మృతదేహాలు వేలాడి గాలికి ఊగుతున్నాయి
వాటి చిరిగిన గౌనులు పరాజితుల జెండాల వలే
చిరిగిపోయి, ముడుతలు పడి ఉన్నాయి.
లేతరక్తంతో నా అన్నం కంచం ఎర్రబడింది
నా హ్రుదయం వసంతకాల కలలను
కనటం మానేసింది.
ఎర్రగాకాల్చిన ఈటెలతో దానికి చేసిన రంద్రాలలోంచి
ఆ రేపిస్టులను చూసాను నేను:
అందరూ నా ముఖాన్నే కలిగి ఉన్నారు

On the branch of my Heart, by K.Satchidanandan
 
తెలుగు: బొల్లోజు బాబా

Wednesday, June 12, 2024

యోగేశ్వర కవి



యోగేశ్వర కవి – పార్ట్ 1
.
యోగేశ్వరుడు తొమ్మిదో శతాబ్దంలో జీవించిన సంస్కృత కవి. ఇతను పాల రాజుల ఆస్థాన కవి. బెంగాలు ప్రాంతానికి చెందినవాడు. ఇతని కవిత్వం రాజాశ్రయరీతిలో కాక కొంత దేశద్రిమ్మరి తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇతను బహుశా దేశమంతా సంచరించి ఉంటాడు. అందుకనే అనేక పద్యాలలో గ్రామీణవాతావరణం, పేదరికం ప్రకృతి వర్ణనలు, మానవ సంబంధాల మెరుపులు ఎక్కువగా కనిపిస్తాయి.
పదాలతో ఒక చిత్రాన్ని రూపుకట్టటం యోగేశ్వరుని కవిత్వశైలి. ఇతను రచించిన కావ్యాలేవీ లభించలేదు. ఇతని కవిత్వం కూడా విద్యాకరుని సుభాషితరత్నకోశము, శ్రీధరుని సదుక్తికర్ణామృతము వంటి ఇతర సంకలనాలద్వారా ముక్తకాలరూపంలో మాత్రమే దొరుకుతున్నది. వీటిద్వారా యోగేశ్వరుడు గొప్ప ప్రతిభ కలిగిన కవి అని గుర్తించవచ్చు.
ఇతని కొన్ని పద్యాలకు నా అనువాదాలు ఇవి
1.
మేఘమనే గండుపిల్లి
మెరుపు అనే నాలుకతో
ఆకాశమనే పళ్ళెంలోంచి
వెన్నెల అనే పాలని తాగుతోంది. -- యోగేశ్వరుడు

2.
తొలకరి పంట చేతికొచ్చాకా
గాదులలో నిల్వ చేసిన ధాన్యం సువాసనలతో
ఇంటి పడుచులు రోకళ్లతో కొత్త వడ్లను దంచుతున్నపుడు
వారి చేతులు పైకి కిందకూ ఆడేవేళ వారి గాజులు చేసే చప్పుళ్ళతో
రైతుల ఇళ్ళు ఎంత సందడిగా ఉంటాయో కదా! -- యోగేశ్వరుడు

3.
వానవెలిసాక మెత్తని గాలి చల్లగా తాకుతుంది
మేఘాలు నిండిన ఆకాశంలో ఒక మూల మెరుపు మెరుస్తుంది
చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు నిద్రలోకి జారుకొంటాయి
తడిచిన కదంబ పుష్పాలనుండి సువాసన పైకిలేస్తుంది
చిమ్మచీకటిలో కప్పల బెకబెకల శబ్దాలు విస్తరిస్తాయి
ఒంటరి ప్రేమికుడు ఈ రాత్రులు ఎలా గడపగలడూ?-- యోగేశ్వరుడు

4.
అంతవరకూ సందడి చేసిన
కంపజిట్ట పిట్టలన్నీ ఎగిరిపోయాయి
నీటికాకులు కొత్తచోట్లకు వలసపోయాయి
కంకపక్షులు, చిలువబాయిలు శుష్కించిపోయాయి
నీరుకోళ్ళ, బాతుల సందడి లేదు
పొన్నంగిపిట్టలు చలాకీదనం కోల్పోయాయి
దోరువాలు కదలటం లేదు
లొట్టకన్ను జిట్టలు, వెదురు పిచ్చుకలు, రెక్కలపోతులు కనిపించవు
వేసవిలో నీరు అడుగంటగానే చెరువు అలా మిగిలింది – యోగేశ్వరుడు

5.
చెరువు నీరు పైన వేడిగా
లోలోతుల్లో చల్లగా ఉంటుంది
దారి బావులు ఎండిపోగా బాటసారులు
మధ్యాహ్నపువేళ వచ్చి
పొర్లాడే గేదెలవల్ల బురదగా మారి, నాచుతో కప్పబడిన నీటిని
చేతులతో కదలించి దోసిళ్ళతో తాగుతారు -- యోగేశ్వరుడు
6.
రైతులవద్దకు బాటసారులు ఎండుగడ్డికొరకు వచ్చి
వారిని బతిమాలుతూ పొగుడుతూంటే ఉప్పొంగిపోయి
ఉదారంగా దానం చేసి
రాత్రిపూట నెమరువేసుకొనే పశువులనుంచి వచ్చే
వేడి శ్వాసలలో వెచ్చదనాన్ని పొందుతారు వారు.
కనురెప్పల వెంట్రుకలపై మంచుబిందువులతో
వీపున ఆవపూలతో శోభిల్లే నందీశ్వరునిపై
ప్రాతఃకాలపు తొలి కిరణాలు పడి పల్లె తెల్లవారుతుంది.-- యోగేశ్వరుడు

7.
ఆమె విరహజ్వరం
నీరు మరిగేంత వేడిగా ఉంది
చేతులకు నూనె పూసుకునైనా
ఆమెను పరీక్షించే సాహసం ఎవరూ చేయలేదు
దహించుకుపోతామనే భయంవల్ల.
మూలికలు, చందనపు పూతలు
పనికిరాకుండా పోయాయి
ఆమె హారంలోని ముత్యాలు
పేలాల్లా పేలిపోవటంచూసి
మేమెంతో ఆశ్చర్యపోయాం-- యోగేశ్వరుడు


8.
ఆ రైతుల వెచ్చదనం చలిగాలులకు కరిగిపోతోంది
గడ్డిమంటను కర్రలతో కెలుకుతూ పదే పదే రగిలిస్తున్నారు
మంటలు రేగినట్లే రేగి ఆరిపోతున్నాయి
ఆవపంట గడ్డిని మండించే కొద్దీ దట్టమైన గొట్రు
కుప్పనూర్పిడి నేల నలుమూలలకూ వ్యాపిస్తోంది-- యోగేశ్వరుడు


9.
చలికాలంలో ఒడ్లు దంచుతూ ఆడువారు పాడుకొనే
దంపుడు పాటలు ఎంత మనోహరంగా ఉంటాయి!
పైకి క్రిందకూ కదిలే వారి చేతి గాజులు చేసే
గలగలల శబ్దాల మధ్య సాగే పాటలు
పైకి క్రిందకూ ఊగే వారి చన్నుల లయను అనుసరిస్తూ
ఆ హుం, ఆహుం అంటూ చేసే ఊర్పులతో సాగే పాటలు-- యోగేశ్వరుడు


10.
నువ్వు చెలకలు పండాయి
పిట్టలు సందడి మొదలైంది
ఆవపంట ముదురు గోధుమ రంగుతేరింది
పూలు గింజలుగా మారుతున్నాయి
ఎండిన పైరు గాలికి ఊగుతుంటే
మంచు బిందువులు రాలి చెదురుతున్నాయి
బాటసారులు ఊరి మంట వద్ద చేరి
పనిలేని ముచ్చట్లు చెప్పుకొంటున్నారు-- యోగేశ్వరుడు


11.
ప్రేమికుల ఆటలు
.
మొదట ఒక కౌగిలింత
ఓటమిని అంగీకరించి అతను తన పణాన్ని ఒదులుకొని
జూదనియమాలను అనుసరించి మరొక పందెం కోరాడు
తన ఉద్వేగాన్ని ఎంత దాచాలని ప్రయత్నించినా
ఆమె ఒణికే పెదవులు దాచలేవు
చెమర్చిన చేతులలోకి పాచికలను
తీసుకొందామె మారుమాట్లాడక. -- యోగేశ్వరుడు


12.
కలయిక
.
ఓ స్నేహితుడా!
కాలి అందియల తెరుచుకొన్న నోళ్ళలో
దూది కూరి వాటి నోరుమూయించాను
వడ్డాణం చుట్టూ వస్త్రాన్ని చుట్టి
దాని మువ్వల గలగలల సద్దుమణిచాను
పంజరపు చిలుకలు నిద్రిస్తున్నాయి
పనివాళ్ళు కలల్లో విహరిస్తున్నారు
రహదారి నిర్జనంగా ఉంది
చీకటి చిక్కగా ఉంది
రా… వచ్చేయి… లేచిపోదాం -- యోగేశ్వరుడు


13.
ఎండి గట్టిబడిన పేడకుప్పలను కార్చిచ్చు
తప్పించుకొని సాగి పోతుంది
గడ్డితో దట్టంగా కప్పబడిన చీమల పుట్టలను కూడా
పెద్దగా దహించదు
చెట్లకొమ్మలపై ఎండు ఆకులు, పుల్లలతో కట్టుకొన్న
పక్షిగూళ్లను మాత్రం వదిలిపెట్టదు
నూనె నిండిన గుడ్ల సొనను బహుశా
యజ్ఞంలో అగ్నికి సమర్పించే నేయిగా భావిస్తుందేమో! – యోగేశ్వరుడు


బొల్లోజు బాబా

Monday, June 10, 2024

"ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా" రెండవ ముద్రణ

"ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా" పుస్తకం రెండో ముద్రణకు వచ్చింది. పల్లవి పబ్లిషర్ నారాయణ గారికి ధన్యవాదములు.
ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాకు చెందిన నాలుగు ప్రధాన ప్రాచీన పట్టణాలు ఇంకా చారిత్రిక ప్రాధాన్యత కలిగిన తొమ్మిది ఇతర పట్టణాల గురించి ఆసక్తికరమైన సమాచారంతో ఈ పుస్తకం ఉంటుంది.
దయచేసి ఆదరించండి.
.
వెల: 200 రూపాయలు
లభించు చోటు: పల్లవి పబ్లిషర్, శ్రీ ఎస్. వి. నారాయణ గారు
ఫోన్ నంబరు/ ఫోన్ పే నంబరు: 9866115655

భవదీయుడు
బొల్లోజు బాబా



Monday, June 3, 2024

శ్రమను లాలించే దయా దీవి - శ్రీ వెంకట కృష్ణ చినుకు దీవి


 
జి. వెంకట కృష్ణ ప్రసిద్దకథకుడు, కవి, విమర్శకుడు. వీరు ఇటీవల చినుకు దీవి” పేరుతో కవిత్వ సంఫుటి వెలువరించారు. “చినుకు దీవి” పదబంధం ఆకట్టుకొనేలా ఉంది. కొంత అస్ఫష్టంగానూ అనిపిస్తుంది. అదే శీర్షికతో ఉన్న ఓ కవితలో ఆ పదబంధాన్ని విప్పుకొనే తాళం చెవి దొరుకుతుంది.
 
చినుకు సృష్టికి ఆది
శ్రమను లాలించే దయా దీవి — (చినుకు దీవి).
 
ఎంతగొప్ప భావన ఇది. చినుకు పడితేనే వ్యవసాయం నడుస్తుంది, రైతుల శ్రమ ఫలిస్తుంది, సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా ప్రజలు చేసుకొంటారు. మరీ ముఖ్యంగా వర్షాభావంతో కరువు పరిస్థితులను ఎదుర్కొనే ప్రాంతాలకు చినుకు అనేది ఎంత అపురూపమో, అవసరమో, చినుకు వాలటం ఎంతటి దయాపూరిత చర్యో పై వర్ణన తెలియచేస్తుంది. అలాంటి చినుకుని ఒక దయాదీవి గా పోల్చటం, ఆ పోలికనే కవితా సంపుటి శీర్షికగా ఎంచుకోవటం వెంకట కృష్ణ అభిరుచిని తెలియచేస్తుంది.
 
తెలుగు సాహిత్యాన్ని ప్రాంతాలవారీగా విడదీసి మాట్లాడటం ఒక అలవాటుగా మారింది. ఉత్తరాంధ్రనుంచి వచ్చే సాహిత్యానికి ఉద్యమనేపథ్యముంటుందని, గోదావరి జిల్లాల కవిత్వంలో కడుపు నిండిన వ్యవహారం కనిపిస్తుందని, సీమ సాహిత్యం కరువు, పంటలెండిపోవటం లాంటి అంశాలను వ్యక్తీకరిస్తుందని తెలుగు సాహిత్యకారుల్లో కొన్ని నిశ్చితాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. దీనికి కారణం, ఒక కవి తాను సృజించే కవిత్వంలో తాను బ్రతుకు తున్న ప్రాంతం యొక్క అస్థిత్వం, తాను జీవించే జీవితం తాలూకు పదచిత్రాలు ప్రవహించక తప్పదు. అదొక అనివార్యత. ఆ కారణంగా పరిణామ క్రమంలో అటువంటి నిశ్చితాభిప్రాయాలు ఏర్పడి ఉండొచ్చు. కానీ అదే సంఫూర్ణ సత్యం కాబోదు.
 
వెంకట కృష్ణ కవిత్వం అలాంటి పడికట్టు అభిప్రాయాల్ని బద్దలు కొట్టిందనిపిస్తుంది. సీమ కరువును, రైతు అస్థిత్వాన్ని ఎంతైతే బలంగా వ్యక్తీకరించిందో అంతే బలంగా చిక్కని భావుకతా, సౌందర్యం, సౌకుమార్యాలు కూడా అనేక కవితలలో అలవోకగా అంతే ప్రాధాన్యతతో ప్రతిబింబించాయి. దుఃఖమమయమైన సందర్భాల్ని చెప్పేకవితలకు కూడా చక్కని ఆశావహముగింపు ఇవ్వటం కూడా వెంకట కృష్ణ కవిత్వప్రత్యేకతగా భావించవచ్చు.
 
వెన్నెలను వర్ణిస్తూ…..
ఆకసం పొయ్యి లోన
పగలు మణిగిన జాబిల్లి పిల్లి
రాత్రి సంచారానికి లేచి
అంటిన బూదిని దులిపనట్లు వెన్నెలా — (వెన్నెల) — అంటూ చేసిన వర్ణన అపూర్వమైనది. అనాదిగా వెన్నెలను ఎంతమంది కవులు ఎన్నిరకాలుగా వర్ణించినా ఇంకా చాలానే మిగిలిఉందన్న భావన కలిగిస్తుంది.
 
ఇంటి మెట్ల అరుగులమీద కూచుని మూడు తరాల స్త్రీలు ఒకరి జడ ఒకరు అల్లుతూ కనిపించే దృశ్యం ప్రస్తుతం ఒక పురాస్మృతి. పల్లెటూర్లలో అయినా కనిపిస్తుందో లేదో!. జడ అల్లటాన్ని వస్తువుగా చేసి వ్రాసిన “జత పదార్ధం” అనే కవిత వెంకట కృష్ణ ప్రతిభకు గీటు రాయి. సామాన్యమైన వస్తువును కవిత్వీకరించటం కత్తిమీద సాములాంటిది.
 
ఇద్దరు తనూ లతలు – వొకరిలో ఒకరు చుట్టుకున్న వాళ్ళు
తమనవ్వులను పురితిప్పి అనుబంధాలను కదా అల్లటం//
జడ అల్లడమంటే
ముచ్చటగా ప్రేమను తురమటం// — (జత పదార్థం) — తనూలతలు, తురమటము అన్న పదాలు ఎంత అందంగా ఒదిగిపోయాయీ సందర్భానికి. నిజమే కదా! జడ అల్లటం అంటే ప్రేమను తురమటమే!
 
ఒక బైరాగిని వర్ణిస్తూ వ్రాసిన ఈ వాక్యాలలో పొంగే ఊహాశాలిత చాలాబాగుంది
 
అప్పుడప్పుడూ అతని పెదవులు తాకి
పరవశించి పాడుతాయి వెదురు కన్నులు
ఆ పాటలు వినడానికి భూమిలో నుండీ
తొంగి చూస్తాయి వజ్రపు తునకలు (రవ్వల దీవి)— వెదురుకన్నులు పరవశించి పాడుతాయనటం, వజ్రపుతునకలు ఆ గానాన్ని వింటున్నాయనటం నూతన అభివ్యక్తి.
వెంకట కృష్ణ కవిత్వంలో కాల స్పృహ అనేక కవితలలో బలంగా వినిపిస్తుంది.
 
లో-హితుడు అనే కవితలో—
 
ఒక గొంతుకు వురి బిగించి
పెళపెళ పెటిళ్ళున
ఎన్ని గొంతుల గొలుసులు తెంపి
యిలాగైనా యీ దళపతుల నోటి కుట్లు
తెంపావురా! — (లో-హితుడు) — కుల వివక్షకు బలైన రోహిత్ ఆత్మహత్య వృధా కాలేదని కొన్ని కోట్ల గొంతులు ఎలుగెత్తి అన్యాయాన్ని ప్రశ్నించాయనటం, రోహిత్ మరణంలో మనంచూడాల్సిన మరోకోణంగా భావించవచ్చు.
ఈ మధ్యకాలంలో ఎక్కువగా చర్చింపబడుతున్న అంశం రైతు ఆత్మహత్యలు. రైతు ఆత్మహత్యల నేపథ్యంలో వ్రాసిన మూగ బాసట అనే కవితలో రైతుకు ఎద్దుకూ ఉన్న అవినాభావసంబంధాన్ని అత్యంత కరుణరసార్థ్రభరితంగా వర్ణిస్తారు.
 
పాదయాత్రలు చేసే వాళ్ళంతా
సింహాసనాల పైకే చేరుకుంటుంటే
ఎన్ని వేల పాదముద్రలో విత్తిన వాడు
చెట్టెందుకెక్కాడో
అట్నుంచీ పాడెందుకెక్కాడో
అర్ధంకాని మూగెద్దులు సలిపే సంభాషణ — (మూగ బాసట) రాజకీయ తంత్రంలో రైతు స్థానం కడపంక్తే. రైతు పిడికెడు మట్టై చెట్టుకు వేలాడాల్సి రావటం ఒక సామాజిక వాస్తవం. రైతు నేస్తం ఎద్దు. అలాంటి ఎద్దు కళ్ళనుండి “బాధా సర్పం జారిపడ్డదట”, “ఎద్దు పుండు ఎవరికిష్టం” అంటూ కవిత ముగుస్తుంది. రైతుకి ఎద్దుతో ఉండే ప్రేమానుబంధాన్ని అత్యంత అనుకంపనతో వ్రాసిన గొప్ప కవిత ఇది.
 
తండ్రులు-కూతుళ్ళు” కవిత టీనేజ్ కూతుర్లున్న తండ్రులను తప్పక కదిలిస్తుంది. ప్రతీ వాక్యమూ గొండెలోపొరల్ని స్పృశిస్తుంది. గొప్ప ఆర్థ్రత నిండిన కవిత ఇది. (ఈ కవిత చదివినప్పుడల్లా ఇంటర్ చదువుతున్న మా అమ్మాయే నా తలపుల్లో మెసలుతాఉంది.)
 
కవిత్వం మానవజీవితాన్ని ఆశ్రయించి ఉద్భవించిన కళ” అంటారు పింగళి లక్ష్మీ కాంతంగారు. కవి తాను జీవించే జీవితం, అనుభూతులు, తానునమ్మిన దృక్పథాలు తనకవిత్వంలో స్వాభావికంగానే ప్రకటితమౌతూంటాయి. ఎందుకంటే కవిత్వం ఎక్కువగా అంతశ్చేతనకు సంబంధించింది కనుక. వెంకట కృష్ణ కవిత్వంలో దళిత, బహుజన దృక్పథం , సమాజాన్ని చైతన్యపరచాలనే ఆకాంక్ష, బలహీనులపట్ల సహానుభూతి వంటివి అనేక కవితలలో కనిపిస్తాయి. ఇది ఇతని కవిత్వ తత్వం.
 
అరఅడుగు వొరలో వొదిగిన
ఆరడుగుల చీర
తనకంటే వొద్దికైన వాణ్ణి చూపించనా అంటుంది (కళతన నేతన్నా) అంటూ నేటి చేనేతకార్మికుల వెతలను అక్షరీకరిస్తాడు. ధనంనిండిన మార్కెట్ మాయాజాలం లో చిక్కుకొన్న నేతన్నలో స్థైర్యం, చైతన్యం నింపేలా కవిత ముగుస్తుంది.
 
పర్వాంతం అనే కవితలో ఈ దేశపు కర్షక, కార్మికులు సామాజికంగా, రాజకీయంగా ఎలామోసానికి గురవుతున్నారో, న్యాయం చేయమని తట్టిన న్యాయాలయాలు కూడా ఏ రకమైన తీర్పులు చెపుతున్నాయో చాలా వాస్తవికంగా ఆవిష్కరించారు వెంకట కృష్ణ
 
దేశంలోని ప్రతి రైతుదేహానికీ
ఒక తెల్లగుడ్డ
ప్రతి కార్మికుడి దేహానికీ
ఒక ఎర్రగుడ్డ
పరిహారం పంపిణీగా కోర్టు తీర్పు (పర్వాంతం) అంటూ ఆధునిక జీవనపోరాటంలో బలహీనుల పక్షాన నిలిచారు. ఈ కవితను ముగిస్తూ ఈ నాటకాన్ని మలుపు తిప్పాలనుకొనే ఔత్సాహికుడు, సాహసికుడు, ఉద్యమకారుడు అయిన ఒక పాత్ర ప్రవేశిస్తుంది అనటం ద్వారా ఒక ఆశావహ దృక్కోణం ఆవిష్కృతమౌతుంది.
 
సాధారణంగా ఉగాది కవితలు సౌందర్యంతో మెత్తమెత్తగా చక్కని ఉపమానాలతో సాగుతాయి. సమాజం పట్ల నిబద్దత, మార్పురావాలనే ఆకాంక్ష హృదయాంతరాళాలో పొదువుకొన్న ఈ కవి ఆ వచ్చిన ఉగాది అతిథికి….
 
శ్రమజీవన సౌందర్యానికి శ్రమదానం చెయ్యమని
నేల పాతరేసిన ఉషస్సును
జనానికి పంచమని! (అతిథి)— ఉపదేశిస్తాడు. గొప్ప సామాజిక చైతన్యం, ఈ వ్యవస్థ బాగుపడాలన్న నిబద్దత కలిగిన కవిమాత్రమే వ్రాయగల వాక్యాలివి.
 
ఒక హిజ్రా పై వ్రాసిన “స్వదేహ పరాయీకరణ” కవిత తీసుకున్న వస్తువులోని భిన్న పార్శ్వాలను స్పృశించిన తీరు అద్భుతమనిపించక మానదు. . చాలా గాఢత కలిగిన కవిత అది. అందులో ఒకచోట
 
జీవితమంతా అజ్ఞాతవాసంలో వుండటం
ఏ బృహన్నలకు మాత్రం సాధ్యం
రణరంగమొకటి రోజూ ఎదురొస్తుంటే
ఏ వొక్క క్షణాన్నీ ఎలా శాంతిగా గడపటం — అన్న వాక్యాల వద్ద తడిలాంటిదేదో చదువరుల హృదయాల్ని తాకుతుంది. వెంకట కృష్ణను- వాస్తవిక వాదిగా, వస్తువును శిల్పంగా, ఉద్వేగంగా, ఉదాత్త వాక్యాలుగా మార్చగలిగే శక్తి కలిగిన గొప్ప కవిగా నిరూపిస్తుందీ కవిత.
 
ఇంకా ఈ సంపుటిలో, యస్. ఆర్. శంకరన్, అరుణ్ సాగర్, కొండేపూడి నిర్మల, మార్క్వెజ్, కొప్పర్తి లపై వ్రాసిన ప్రేమపూర్వక కవితలున్నాయి.
 
ఈ సంపుటిలో మొత్తం 49 కవితలున్నాయి. ఈ పుస్తకానికి  కాశీభట్ల వేణుగోపాల్, శ్రీ జి.ఎస్. రామ్మోహన్ లు ఆప్తవాక్యాలు వ్రాసారు.
 
రఫీక్ అహ్మద్ అందమైన ముఖచిత్రాన్ని అందించారు.
పుస్తకం వెల: 100/-
కాపీల కొరకు: 8985034894