Saturday, March 5, 2022

‘కవిత్వ భాష’లో విహారయాత్ర (Book Review)

thank you Lenin Babu gaaru

మీ క్లోజ్ రీడింగ్ కు థాంక్యూ అన్నమాట చాలా చిన్నది. మీ పఠనాశక్తి గొప్పది. ఈ నాలుగు ప్రశంసాపూర్వక వాక్యాలకు ధన్యుడను
ఈ పుస్తకాన్ని ఇక్కడనుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును https://archive.org/details/kavithva-bhasha-by-bolloju-baba


భవదీయుడు
బొల్లోజు బాబా


.
‘కవిత్వ భాష’లో విహారయాత్ర

“చాలా కాలం తరువాత ఒక పుస్తకంలోకి దూకి ప్రతీ పదాన్నీ కౌగిలించుకుంటున్నాను…ఒడ్డుకు చేరాక ఇంకోసారి మిమ్మల్ని పలకరిస్తాను ” అని శ్రీ బొల్లోజు బాబా గారికి facebookలో కామెంట్ పెట్టాను…దానికి పూర్వరంగం ఏమిటంటే, “కవిత్వ లక్షణాలు ఏమిటి?…కవితాత్మక గద్యానికీ, కవిత్వానికీ తేడా ఏమిటి?…ఈ రెంటినీ గుర్తించటం ఎలా?…” అని నేను facebookలో అడిగిన ఒక ప్రశ్నకి వారు ఈ పుస్తకం పంపి, అందులో ఫలానా చోట మీ ప్రశ్నకి సమాదానం లభిస్తుంది అని చెప్పటం…నేను పుస్తకంలో వారు చెప్పిన భాగం చదివి తక్షణ స్పందనగా పై కామెంట్ పెట్టాను… పుస్తకం చదివాక,వారికి కృతజ్ఞతగా ఈ పోస్టు రాయకుండా ఉండలేకపోయాను…

సామాజిక మాధ్యమాలలో ఒకరి వీపు ఒకరు చరుచుకుంటూ ఉండే కవికూటములలోని కవుల లక్షణం బొల్లోజు బాబాగారికి  లేదు అని అనిపిస్తోంది …పొగడ్తలు ఆశించే చోట ప్రశ్నలు ఎదురైతే,చూసీ చూడనట్టు తప్పుకుపోవటమో, ప్రశ్న వేసిన వారిని ‘మీ తలం వేరు, మా తలం వేరు’ అని జవాబు ఇచ్చినట్లే ఇచ్చి,అసలు ప్రశ్నకి జవాబు దాటవేసి తమ భద్రజీవితపు బావులలోకి మునిగి పోవటమో వీరు చెయ్యలేదు …ఒక పాఠకుడికి మేలు చేసే సంకల్పాన్ని చూపించారు… సులక్షణాలు లేకుంటే, అభినందిస్తూ నెత్తిన ప్రేమతో నిమిరినా, మొట్టికాయలూ వెయ్యటానికి  మొహమాటపడని శ్రీ రెంటాల వెంకటేశ్వరరావు గారిని ఈ పుస్తకంలోకి పెద్దపీట వేసి ఆహ్వానించి ఉండేవారు కాదు …ఆ నిజాయితీతో కూడిన  ఒద్దిక నాచేత వీరికీ, వారికీ  నమస్కారం చేయించింది…వారి మధ్య అవ్యక్త గురుశిష్య భావనా వీచికలు నా  హృదయానికి వెచ్చదనపు హాయినిచ్చాయి…’కవిత్వ భాష’లో నా విహార యాత్రకి ఆత్మీయంగా పొద్దు పొడిచింది…

బాలుడినైన నన్ను చెయ్యి పట్టి నడిపించే కవిత్వ గైడ్ లాగా అనిపించారు శ్రీ బొల్లోజు బాబా…

ఒక గదిలో కొండేపూడి నిర్మలగారు ‘మేకులు వంగాయి’ అంటుంటే, ‘మేకులే వంగితే, మానవ హృదయం ఎంత?’ అని గుసగుసలాడారు నా విభ్రమం సంబ్రమంగా మారేటట్టు…

ఇంకాస్త ముందుకు నడిపించి కరెన్సీ నోటులో కత్తిని చూస్తున్న అలిశెట్టి ప్రభాకర్ గారి చూపులో నా చూపుని సంలీనం చేయించారు…

అడవిలో చెట్టు దుంగల్లో తల లేని మొండాలను చూపించే అరణ్యకృష్ణ గారి ఆవేదనా ప్రకంపనలకు నా  హృదయాన్ని శృతి చేశారు…

ఒక చోట పాటిబండ్ల రజని గారు మనస్సు ఇంకిపోయే మందుకై తపించడాన్ని చూపించారు…

ఎండ్లూరి సుధాకర్ గారు తమ గుప్పిట్లో దాచుకున్న బొటనవేలిలో, దాచేస్తే దాగని  వివక్షాచరిత చీకటిలా విస్ఫోటించడాన్ని విప్పార్చిన నా కళ్ళకు సాక్షాత్కరింపచేశారు …

కొందరు పుట్టుకతోనే కొన్ని పుట్టుమచ్చల అమానవీయ బరువును మొయ్యవలసిన పరిస్థితిని చూపించే ఖాదర్ మోహిద్దీన్ గారిని పరిచయం చేశారు…ఇంకొన్ని అడుగులు వేశాక, ఇస్మాయిల్ గారు ఎండా, నీడలతో చిత్రించిన ఆకుని పరిశీలించమన్నారు…

అంతలో,తనంటే ఇష్టపడే పాపని ఎత్తుకున్న వానై వచ్చిన తెలుగు వెంకటేష్ గారిలో తడిచేలా చేశారు…

ఆ తరువాత మండే గుండెతో ఉన్న కలేకూరి ప్రసాద్ గారి ఎగిరే ధిక్కార పతాకంలా ఉన్న కవిత్వాన్ని తలవంచి చదవమన్నారు…

కాస్త ముందుకు కదిలి, అత్యాచార బాధితురాలికి ధైర్యాన్ని కలిగిస్తూ కవన ఖడ్గం అందించే కె.క్యూబ్ వర్మ గారిని చూపిస్తూనే, నగలు పెట్టుకుని నడిచే గాయాలని చూపించే కొండేపూడి నిర్మల గారినీ వినమన్నారు…

జయప్రభ గారు, జూపాక సుభద్ర గారు పైట/కొంగు ని చూసిన విధానాన్ని తరిచి చూపిస్తూ, శవపేటికలను తుపాకులతో కొలిచి తాలిబన్లపై కాల్పులు జరిపిన అనంతు గారినీ  చూపించారు…

చూపుడు వేలినుండి వెలిగించే ఖడ్గాలను మొలిపించిన సరికొండ నరసింహ రాజు గారిని, పిల్లలను నీలిగోళ్ళ దగ్గరితనం గురించి హెచ్చరించే నిరంతర గారిని, గతాన్ని చదివించే కొప్పర్తిగారినీ,తరాల పాటు స్థిరంగా ఉన్న  కుడి ఎడమలని తిరగేస్తున్న శివసాగర్ గారినీ చూపించారు…

కొంచెం ముందుకు నడిచి చీకటి చరిత్ర మీద చెరగని వెలుగు పాదముద్రలతో నడుస్తూ మినుములు మొలిపిస్తున్న  శిఖామణి గారినీ,కూలీలు వేసుకున్న స్వేదబిందువుల దండలను చూపించే గుంటూరు శేషేంద్రశర్మ గారినీ చూశాను…

ఆ పక్కనే,రాత్రి వేళ మిణుగురుల సంగీతాన్ని వాయించే సూర్యుడిని చూపించే డాక్టర్ ఎన్.గోపి గారు, ప్రతీ మనిషీ ఊరికొయ్యే అని ఉచ్చ స్వరంలో అరుస్తున్న భగ్వాన్ గారు, పిడికిలి బిగించి, “నాక్కొంచెం నమ్మకమివ్వు” అంటున్న ఆలూరి భైరాగి గారూ  కనపడ్డారు…

అక్కడినుండి సముద్ర తీరానికి వస్తే , “ఈ సముద్రపు నీరు ఇంత ఉప్పగా ఉందేమిటి?ఈ జలసానువుల మీద తెల్లగుడ్డ కప్పింది ఎవరు?”అని నిలదీస్తూ సిరికి స్వామినాయుడు గారు కనిపించారు…

అటుచూస్తే, దేవుని కన్నీళ్లను తుడుస్తున్న తిలక్ గారు… ఇటు చూస్తే, పాపుల్ని కరుణించేవరకూ నువ్వు నిదురించవు కదా అని ప్రపంచీకరణపై వక్రోక్తులు విసురుతూ అద్దేపల్లి ప్రభు గారు కనిపించారు…

సముద్రాన్నే,ఆస్తి అనుకున్న ఏమీలేని అమాయకపు అమ్మని చూపిస్తూ ఎం.వెంకట్ గారు,కాగితాలపై పెరిగే అభయారణ్యాల గుట్టుని పట్టిస్తూ యశస్వి సతీష్ గారు, పొలాలకు తాళాలు వేస్తూ దర్భశయనం శ్రీనివాసాచార్య గారు సంచలిస్తున్నారు…

అంతేనా,స్వీట్ డిస్టర్బెన్స్ మధ్య పాఠాలు చెబుతూ గోదావరి శర్మ గారు, కనుకొనుకులలో నిప్పుకణికలతో ఎదురుచూస్తూ నారాయణస్వామి గారు, ఏమీ లేకపోవటాన్ని కాపలా కాస్తున్న హెచ్చార్కే గారు, వానలకు తడిసిన కొన్ని ఎండలను చూపిస్తూ త్రిపురనేని శ్రీనివాస్ గారు మనస్సులో అలజడి రేపుతూ కనిపించారు…

వీటన్నిటి మధ్యలో నా చేతులు తన చేతుల నుండి విడివడిన క్షణాలూ,జతపడిన క్షణాలూ ఉన్నాయి… ఇమేజరీ,సినక్డకి,అల్లిగొరి మొదలైన తూకపు రాళ్ళు నా హృదయంలో పెడుతూ భుజం తడుతూ శ్రీ బొల్లోజు బాబా నన్ను ముందుకు నడిపించారు…

 భూగోళానికి అటూ ఇటూ ఉన్న కవులు చేసిన కృషినీ, పూర్వపు సిద్ధాంత  తరకలను రుచి చూపించారు…వాటి నడుమ సామ్యాల, వైవిధ్యాల  అధ్యయన సారాలను చవి చూపించారు…పాత పనిముట్లను,కవిత్వ తూకపు రాళ్ళను  ఆధునీకరించుకోవలసిన ఆవశ్యకతను చెప్పడం నాకు వ్యక్తిగతంగా నచ్చింది…

ఆ పక్కనే, ఆత్మకు లంగరు వేస్తూ కలవరిస్తున్నాడేమో అని అనుమానం కలిగిస్తూ వేగుంట మోహన ప్రసాద్ గారు…ఆయనను చూస్తూ తిక్కగా ఉన్నా కవిత్వం ఉంటే క్షమించేస్తాం అని సాలోచనగా అంటూ, చేరా గారు కనిపించారు…

కొంచెం ముందుకు నడిపించి, పదాలతో కవితా ప్రహేళికలు సృష్టిస్తున్న  ఎమ్మెస్ నాయుడు మరియు బి.ఎస్.ఎం కుమార్ గార్లను చూపించారు …వారిని ఓరకంట చూస్తూ ”కవిత రాయటం పూర్తయ్యింది…ఇక అర్థం చేసుకోవటమే మిగిలుంది” అంటూ తమ్మినేని యదుకుల భూషణ్ గారు అంటున్న మాటలనూ వినమని సైగ చేశారు…

కాస్త దూరంలో “దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తాం” అంటూ కాళోజీ గారు కన్నెర్ర చేస్తూ కనిపించారు…అటుపక్కనే, ఆ నీళ్ళు ఉల్లిపాయలు తరిగితే వచ్చినవి కావని భావన గారి బాధని మన భాషలోకి తర్జుమా చేసి వివరించే వాడ్రేవు చినవీరభద్రుడు గారు…కవిత్వం చదవటం ఒక performing art అని చెబుతూ శివారెడ్డి గారు గంభీరంగా కవితాలీనులై ఉండటం చూపించారు…అలంకార రహితులై  నిరాడంబరంగా వెలగటం చూపించారు…

“నిప్పులు చిమ్ముతూ నింగికి నేనెగిరిపోతే ” అంటున్న శ్రీ శ్రీ గారు, “పంజరంలో ఇమడలేని విశ్వనరుడను నేను ” అంటూ జాషువా గారు, ‘ప్రపంచమే ఒకటి ’  అంటూ దాశరధి గారు, ఎంకిని ముద్దు చేస్తూ నండూరి గారు,’బండరాళ్ళ పై మొక్కలు ఎదగవంటూ ’ భైరాగి గారూ కనిపించారు…

అంతేనా, ఇంకా ఎందరో కనిపించారు…ఎన్ని వెలిగే హృదయాలో!…ఎన్ని నివురుగప్పిన మాణిక్యాలో!… కవిత్వాన్ని పలు విధాలుగా వాడిన ఎన్ని మచ్చుతునకలో!…ఇవి కాక,కాలంతో పాటు కవిత్వంలో వచ్చిన మార్పులు, తారీఖులు దస్తావేజుల జోలికి పోకుండా వివరించారు…

చాలా కొత్త పదాలు పరిచయమయ్యాయి…పాఠకుల ఆస్వాదనా శక్తిని పెంచే పుస్తకమిది…చిన్నప్పుడు మిత్రులతో ఆటలలో పడితే ఆకలి తెలిసేది కాదు…పెద్దయ్యాక, క్లాసులో పాఠం చెప్పటానికి నోట్సు తయారు చేసుకోవటానికి మంచి ముడి సరుకు దొరికితే ఆకలి అయ్యేది కాదు…అలా,చదవటం మొదలయ్యాక  ఆకలిని దూరం చేసి, మరొక ఆకలిని తీర్చిన పుస్తకం ఇది…

పత్రికలలో ప్రచురితమయ్యే, చాలా కవితలను చూసి, ఇదేమి కవిత్వం? గద్యాన్ని శకలాలుగా చేసి కవిత్వంగా చలామణి చేస్తున్నారు…అని చిరాకు పడే నేను ఇప్పుడు కాస్త educated పాఠకుడిని అయ్యానని అనిపిస్తుంది…ఇందుకు కారకులు శ్రీ బొల్లోజు బాబాగారు…ఇటువంటి వ్యాసాలు వ్రాయాలంటే,ఎంతటి అధ్యయనం,జ్వలన కావాలో కొంత ఊహించగలను…వారికి చాలా కృతజ్ఞతలు…నా ప్రశ్నకి సమాధానాన్ని మించి చాలా ఇచ్చిన పుస్తకం ‘కవిత్వ భాష’…నాబోటి వారు చదవవలసిన పుస్తకం…

***లెనిన్ బాబు***




Friday, March 4, 2022

జీవితమనే దుఃఖ సందర్భానికి పది వెర్షన్స్ రాసిచ్చిన కవిగారు


.
1.
జీవితం
చెట్టుకొమ్మల్లో చిక్కుకొన్న
సాయింత్రపు గాలిపటం
2.
వాన చినుకుల్లో తడిచే
నల్లగేదెపై తెల్లకొంగ
3
మృత్యులోయకు నలగని దారిపై
భుజం తొక్కే ప్రయాణం
4.
బొగ్గులపై మాంసం ముక్కల్ని
పైకి క్రిందకీ కదపటం
5.
కబోది అంధకారంలోకి
కూలిపోయే వందల నల్లని కాకులు
6.
డ్రింకు సీసాలో చిక్కుకొన్న
మిణుగురుల దుఃఖ కాంతి
7.
కాలివేలు నోటిలో పెట్టుకొని
వటపత్రంపై శయనించే ఎలక్షన్లు
8.
శిథిలాలయంలో దుండగులు
చెక్కేసిన శాసన వాక్యాలు
9.
శవపేటికలో ఊపిరాడని
ఉక్కపోత
10.
జీవితం
తొలగించినా మరలా మరలా
పుట్టుకొచ్చే కాన్సర్ కణితి
.
బొల్లోజు బాబా

Tuesday, March 1, 2022

ఎవరికీ పట్టని విషాదం .


ఈ సంవత్సరం
ఒక్క వలసపక్షీ రాలేదని
స్థానిక పత్రికలో
ఒక మూల చిన్న వార్త.
రేపు
గూడకొంగల రెక్కలనీడలో
విచ్చుకొనే వసంతం కూడా రాదని
సారసపక్షుల దేహకాంతులను
ధరించే శరత్తు కూడా కనిపించదని
ఉల్లంకి పిట్టలు విడిచివెళ్ళే
పసిడి వెలుగుల
హేమంతం కూడా కరుణించబోదని
ఎవ్వరూ
మాట్లాడుకోవటం లేదు
ఆశ్చర్యంగా
బొల్లోజు బాబా

అతని కవిత్వమొక అనుభూతి

 ప్రముఖ కవి శ్రీ ఎమ్మెస్ సూర్యనారాయణ తాజా కవిత్వ సంకలనం "నేనొక అనుభూతి" ఆవిష్కరణ నిన్న కాకినాడ సాహితీస్రవంతి ఆధ్వర్యంలో జరిగింది. ఆ సభతాలూకు ప్రెస్ కవరేజ్...

ఆ సందర్భంగా నేను చేసిన ప్రసంగంలోంచి కొన్ని వాక్యాలు ఇవి.
.
అతని కవిత్వమొక అనుభూతి
.
ఎమ్మెస్ కవిత్వం ఎన్నడూ వాచ్యంగా ఉండదు. ఎమ్మెస్ ఏనాడూ ఎంగిలి ప్రయోగాలు చేయలేదు, డెడ్ మెటఫర్స్ వాడలేదు. ఏం చెప్పినా నవ్యంగానే చెప్పాడు, సొంతస్వరంలోనే రాసాడు. కవిత్వం అనేది ధ్వన్యాత్మకంగా, ప్రతీకాత్మకంగా మాత్రమే చెప్పాలని కంకణం కట్టుకొని మూడు దశాబ్దాలుగా కవిత్వాన్ని వెలువరిస్తున్నాడు. ఇతనిది జీవనానుభవాల కవిత్వం. కవిగా ఎమ్మెస్ నిజాయితీపరుడు. తాను చూచినది, తాను అనుభవించినది మాత్రమే కవిత్వంలోకి తీసుకొని వచ్చాడు. తన అనుభవానికి వెలుపల ఉన్నదానిని ఏనాడూ స్పృశించలేదు.
.
జీవితం
కిటికీపై
వాలిన పిట్ట
ఎగిరిపోయేలోగా
మిగిలిపోయే
నేనొక అనుభూతి…
.
రామో విగ్రహవాన్ ధర్మః అంటే ధర్మానికి ఒక ఆకారాన్ని ఇస్తే అది రాముడు అని అర్ధం. అదే రీతిగా, అనుభూతికి ఒక ఆకారాన్ని ఇస్తే ఎమ్మెస్ కవిత్వం అని అర్ధం చెప్పుకోవచ్చు. అందుకనే జీవితం కిటికీ పై వాలిన పిట్ట ఎగిరిపోయేలోపు నేనొక అనుభూతిగా మిగిలిపోతాను అని ప్రకటించుకొన్నాడు- మనకున్న గొప్ప కవి శ్రీ ఎమ్మెస్ సూర్యనారాయణ.
.
బొల్లోజు బాబా







ప్రాచీనపట్టణాలు

thank you అంకిత గారు for this wonderful writeup on my book.
thanks alot for the editor.

లభించు చోటు: పల్లవి పబ్లిషర్, శ్రీ ఎస్. వి. నారాయణ గారు
ఫోన్ నంబరు/ ఫోన్ పే నంబరు: 9866115655



















ఒఖడినే....


నా యవ్వనంలో
నన్ను ఉద్రేకపరచి
నేలపై నిలబడనివ్వకుండాచేసిన
కవులందరూ
ఏనాడో చచ్చిపోయారు
ఒకరు ఏదో ఆశ్రమంలో
మరొకరు
తళుకుబెళుకుల సినీగీతాల్లో
ఇంకొకరు మరీ పిచ్చెక్కి
నేనొక్కడినే ఇక్కడ
ఒంటరిగా మిగిలిపోయాను
బొల్లోజు బాబా

కవులను ప్రభావితం చేసే "చిలక్కొయ్య"

 కవులను ప్రభావితం చేసే "చిలక్కొయ్య"

.
“మువ్వలచేతికర్ర” తో తెలుగు సాహిత్యలోకంలోకి ఒక మెరుపులా ప్రవేశించారు శిఖామణి. “చిలక్కొయ్య” ఆయన రెండవ కవితాసంపుటి. 1993 లో వెలువరించిన ఈ సంపుటిలో మొత్తం 33 కవితలున్నాయి. దేనికదే వస్తువైవిధ్యంతో, విలక్షణమైన అభివ్యక్తితో కనిపిస్తాయి.
అనుభూతికి భాషనివ్వటం అంత తేలికేమీ కాదు.ఎందుకంటే కొన్ని అనుభూతులను వ్యక్తీకరించటానికి భాష సరిపోదు. ఈ రెంటినీ సమన్వయపరచి, ఒక అనుభూతిని అంతే శక్తిమంతంగా చదువరిలో ప్రవేశపెట్టటంలో శిఖామణి నేర్పరి.
ఈ సంపుటిలో మొదటి కవిత పేరు చిలక్కొయ్య. గోడకు ఉండే చిలక్కొయ్యపై వ్రాసిన వస్తుకవితైనప్పటికీ, ఒక సంపూర్ణజీవితాన్ని అంతర్లీనంగా చెపుతూంటుంది. కవి బాల్యంలో చిలక్కొయ్యతో తనకు గల అనుభవాలతో కవిత మొదలౌతుంది.
చిలక్కొయ్యపై పిచ్చుకలు వాలటం, కవి తల్లిగారు ఉత్త పసుపు పుస్తెలతాడు వేలాడదీయటం, దానికి తగిలించిన సీమవెండి కేరేజీలో చప్పరింపు చప్పరింపుకు రంగులు మారే బిళ్లలను వారి అమ్మగారు దాయటం, మూడో పురుషార్థ సాధనలో ఉన్న దంపతులను ఆ చిలక్కొయ్య నిర్వికారంగా చూడటం, ఈ ఒంటరి ప్రయాణంలో ఈదలేక నిష్క్రమిస్తూ అదే చిలక్కొయ్యకు ఆత్మను తగిలించటం -ఇవీ ఈ కవితలో కనిపించే వివిధ దృశ్యచిత్రాలు. అతి సామాన్యంగా కనిపించే వాక్యాలతో కవిత మొదలై ముగింపుకు వచ్చేసరికి అవే పదాలు మరో గొప్ప అర్థాన్నిచ్చే విధంగా మారతాయి. కవిత ప్రారంభంలో కనిపించిన కొయ్య చిలుక నెమ్మది నెమ్మదిగా కనుమరుగవుతూ, ఓ జీవితం కనిపించటం మొదలవుతుంది.
వీధిలో నగ్నంగా తిరిగే పిచ్చివాని గురించి వ్రాసిన “దిశమొల” అనే కవితలో అతనలా నగ్నంగా తిరగటాన్ని అనేక పదచిత్రాలలో హృదయానికి హత్తుకొనేలా వర్ణిస్తారు శిఖామణి.
దిగంబరంగా తిరుగుతున్న ఆ వ్యక్తి దేహాన్ని కప్పలేనందుకు, దుస్తుల తో సంబందం ఉన్న వివిధ నేపథ్యాల్ని ఈ కవితలో గొప్ప ప్రతిభతో ఇముడ్చుతాడు కవి.
- పల్లెల్లో పూతకొచ్చిన పత్తితోట తనమొదళ్లను తనే నరుక్కొంటుందట.
- మగ్గంలో అటూ ఇటూ తిరుగుతున్న కండె నిలువునా రెండుగా చీలుతుందట
- పట్టుపురుగు పట్టుగూడులో ఆత్మబలిదానం చేసుకొంటుందట
- దేవదేవుని శేషవస్త్రపు కొంగుకు నిప్పంటుకొంటుందట
- సాలెపురుగు దీపపు కొస శూలాగ్రం మీద శిరచ్ఛేదనం చేసుకొంటుందట
- ఎవరికి వారు రహస్యంగా తమతమ మర్మావయవాలను మనసుల్లోనే తడిమిచూసుకొంటారట
- కన్నీళ్లను ఒత్తవలసిన చేతిరుమాలు జేబులోనే చెమరుస్తుందట
ఒక్కో పదచిత్రమూ ఆ దృశ్యాన్ని సన్నగా వర్షించటం మొదలెట్టి నెమ్మదినెమ్మదిగా కరుణార్ద్ర కుంభవృష్టిలో పాఠకుణ్ణి తడిచేట్లు చేస్తుంది. అందమైన గూడును అల్లుకొనే సాలెపురుగును కూడా వాడుకోవటంద్వారా ఈ కవి దృష్టి ఎంత నిశితమో అర్థమవుతుంది. సునిశిత దృష్టి, కరుణ, మానవత్వాలు అంతర్లీనంగా ప్రవహించే ఈ కవిత, శిఖామణి కవిత్వ తత్వానికి ఒక మినియేచర్ రూపమనవచ్చు.
ఒక పదచిత్రంలోనే రెండుమూడు చిత్రాల్ని ఇమడ్చటం చాలా కష్టం. శిఖామణి తన కవిత్వంలో ఇలాంటివి అలవోకగా సాధిస్తాడు. పల్లెటూరివ్యక్తి చేసే పట్నవాసాన్ని వస్తువుగా తీసుకొని వ్రాసిన “ఆంతరంగికుని ఉత్తరం” లో ఒకచోట
“అక్కడ చలిపెట్టే అధికారులుండవచ్చు
వినయపు ఉన్ని శాలువా మర్చిపోలేదు కదా”
అంటాడు. ఇక్కడ చలికి ఉన్నిశాలువా, అధికారులకు వినయం అనే రెండు భిన్న విషయాల్ని ఒకే చిత్రంద్వారా సాధించాడు. చలిపెట్టే అధికారులు అనటం కూడా ఒక వ్యంగ్యం. దీనివల్ల గాఢత, క్లుప్తత వచ్చి చెప్పాలనుకొన్న విషయం వెన్నుకు చలిచలిగ తగిలేట్టు చేస్తుంది.
“మేఘనా” అనే మరో కవితలో
“వెన్నెల మబ్బుల మెట్లమీదుగా నేలకు దిగే సమయాన
పూలగొంతుల్లో పరిమళపు పాట కూనిరాగాలు తీసేవేళ ”
వంటి వాక్యాలలో కూడా ఇలాంటి ప్రతిభే కనిపిస్తుంది.
పేవ్ మెంట్ పై బతికే వృద్ధవనిత గురించి వ్రాసిన “వెన్నెల దుప్పటి” అనే కవిత శ్రీశ్రీ బిక్షువర్షీయసీ కవితను జ్ఞప్తికి తెస్తుంది. లోతైన పదచిత్రాలతో ఈ కవిత చదువరి హృదయాన్ని బరువెక్కిస్తుంది.
“ఆర్ధ్రత నీరెండిన నగరం నదిలో
ఆమె ఓ శిధిల నౌక …..
అర్ధరాత్రి దాటాకా
ఏ శీతలపవనమో ఆమెను ఒణికిస్తే
ముడుచుకుపడుకొన్న ఆమె దేహంమీద
చంద్రుడు వెన్నెల దుప్పటి కప్పి
చెట్టుకొమ్మకు లాంతరు దీపమై వేలాడుతాడు.”...........వంటి వర్ణనల వల్ల, శ్రీశ్రీ కవితలో కనిపించని లక్షణమేదో ఈ కవితలో ఉన్నట్టనిపిస్తుంది.
.
కర్ణాటకలో దేవాలయ ప్రవేశం చేసిన ఓ దళితునిచే మలం తినిపించారన్న వార్తకు శిఖామణి ఎంతో తీవ్రంగా స్పందించి వ్రాసిన “వాడే అశుద్ధమానవుడు ” అన్న కవితనిండా ఆవేశం భుగభుగలాడుతూ, చదువరి రక్తాన్ని మరిగించేలా చేస్తుంది.
“వాణ్ని కన్న నేరానికి
నిన్ను తూలనాడుతున్నాను క్షమించుతల్లీ.
….
ఒరే లంజా కొడకా
నీ పేరు మనిషా?”
అని మొత్తం మానవత్వాన్నే ప్రశ్నిస్తాడు. ఈ కవిత వ్రాసిన సమయానికి (1989) తెలుగు సాహిత్యంలో దళితకవిత్వం ఇంకా ఉద్యమస్థాయిలో మొదలవలేదు. ఈ కవితలో కులస్పృహకంటే మానవత్వమే కనిపిస్తుంది. ఒక సాటిమానవునికి జరిగిన అమానుషావమానాన్ని, ఈ కవిత అంతే ఫెరోషియస్‌గా ఎత్తి చూపుతుంది.
శిఖామణి కొన్ని కవితలలో తన గ్రామీణనేపథ్యం, బాల్యం తాలూకు జ్ఞాపకాలు కనిపిస్తూ ‘ఈయన తన బాల్యపు ముగ్ధత్వాన్ని ఎంత అందంగా దాచుకొన్నాడూ!’ అనిపిస్తాయి. ఉదాహరణకు, తుమ్మచెట్టునీడలు, బొరియల్లో పీతలు, పాతబడ్డ టైరుని దొర్లించుకొంటూ సాగడాలు, మట్టిని పిసికి చేసే బళ్లూ, కొత్తనీటికి ఎదురెక్కి కిలకలు వేసే చేపపిల్లలు, కొలను గర్భంలో తామరతూడు తెగిన శబ్ధాలు, జామెట్రీ బాక్సులో దొంగిలించిన రబ్బరుముక్కలు మొదలైనవి.
ఇంకా ఈ కవితా సంపుటిలో
-బాల్యాన్ని ఈతాకుల చీపురు చేసి రైలు పెట్టి ఊడ్చే కుర్రాళ్లు (పాటల బండి),
-బాల్యాన్ని మూరమూరచొప్పున కోసి అమ్ముకొనే పూలబ్బాయిలు (పూలబ్బాయి),
-చీకటి ఆకాశపు ఆసుపత్రిలో చందమామలా వెలిగే నైట్ డ్యూటీ నర్సులు (ప్రమిదక్రింది చీకటి),
-చీకటి కొండచిలువ నగరం చెట్టుకు చుట్టుకోవటం (వెన్నెల దుప్పటి),
-నిద్రతో ప్రమేయం లేకుండానే ఒక మండే స్వప్నం కొరడాలతో హింసించటం (కలలనెమలి)
వంటి పదునైన అభివ్యక్తులెన్నో ఉన్నాయి.
పూలకుర్రాడు, కలలనెమలి, దేహి, పాటలబండి, మేఘనా, వెన్నెల దుప్పటి, ఆంతరంగికుని ఉత్తరం వంటి కవితలలో ఈ కవి ఎంతైతే భావుకతా, సున్నితత్వం చూపిస్తారో.. నిషేధాజ్ఞ, జలసర్పం, వాడే అశుద్ధమానవుడు, మాట డైనమైట్ అవుతుంది, కక్కుళ్లు, యుద్ధమూ అనివార్యమే వంటి కవితల్లో అంతకు మించిన వాస్తవికత, ఉద్వేగాన్ని ప్రతిబింబిస్తారు. అంటే రియాలిటీ తో తలపడవలసివచ్చినపుడు ఊహల్లోకి జారిపోయే తత్వం కాదీ కవిది.
ఈ పుస్తకం అనేక దారులమధ్య ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవలసిన పరిస్థితి వచ్చిన అనేక మందిని వర్ధమాన కవుల్ని ప్రభావితం చేసి ఉంటుంది.
ఎందుకంటే ...
కవిత్వం అంటే - జీవితపు రణగొణధ్వనుల మధ్య జారిపోయే సున్నితానుభవాలను నేర్పుగా ఒడిసిపట్టుకోవటమని
కవిత్వం అంటే – నడచి వచ్చేసిన మార్గంలోని రాలుపూల పరిమళాల్ని నెమరువేసుకొంటూ కలల మాలలల్లటమనీ
కవిత్వం అంటే – మనిషితనం తగలకపోతుందా అంటూ లోలోపలికి తవ్వుకుంటూ పోయేతత్వమనీ
కవిత్వం అంటే – కాస్త అమాయకత్వం, లోకం మీద ఇంత దయా తప్ప మరే అలంకారాలూ లేకపోవటమనీ
కవిత్వం అంటే – కరుణ, తాత్వికతలు అంతర్జలలై ప్రవహించటమనీ
కవిత్వం అంటే – సామాజిక వాస్తవాల్ని ధైర్యంగా ఎదుర్కొని సాటి మనిషికి నమ్మకాన్నివటమనీ
కవిత్వం అంటే – మనచుట్టూ జరుగుతున్న అన్యాయాలపట్ల ధర్మాగ్రహం ప్రకటించటమనీ
కవిత్వం అంటే– స్వప్నాన్ని కమ్మిచ్చుగుండా సాగదీసి సాగదీసి బంగారు తీగలాంటి ఓ వాక్య చిత్రాన్ని నిర్మించటమనీ– వంటి అనేక సూత్రీకరణలకు “చిలక్కొయ్య” లోని వివిధ కవితలు సాక్ష్యాలుగా, ఉదాహరణలుగా నిలుస్తాయి.
చిలక్కొయ్య కవిత్వ సంపుటి తరువాత శిఖామణి గారు అనేక పుస్తకాల్ని వెలువరించారు. తెలుగు సాహిత్యంలో, ఆర్థ్రత, తాత్వికత, సామాజిక బాధ్యత తో రచనలు సాగించే కవిగా సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకొన్నారు. ఆధునిక కవిత్వంలో ఉపమ, రూపక అలంకారాల్ని ప్రతిభావంతంగా ప్రయోగించే కవిగా ప్రసిద్ధికెక్కారు.
ఈ పుస్తకాన్ని చదివి ఆస్వాదించి, ఆనందించి, ప్రభావితమైన ఎంతో మందిలో నేనొకణ్ణి అని చెప్పుకోవటానికి గర్వపడతాను.
***
భవదీయుడు
బొల్లోజు బాబా


.
(ఈ సంవత్సరం అజో-విభో కందాళం ఫౌండేషన్ వారి పురస్కారాలు శ్రీ తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి, శ్రీ శిఖామణి, శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ లు అందుకొన్నారు. వారి సాహితీ కృషిని పురస్కరించుకొని విడుదలచేసిన సావనీర్లలో ఆ ముగ్గురిపైనా వ్యాసాలు రాసే అదృష్టం నాకు ఇచ్చిన ఆ యా సావనీర్ల సంపాదకులైన శ్రీ రెంటాల వెంకటేశ్వరరావు, శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ అద్దేపల్లి ప్రభు గార్లకు ధన్యవాదములు. ఫౌండేషన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు.)

ఆర్థ్రకవిత్వపు చిరునామా శ్రీ మాకినీడి సూర్యభాస్కర్

 ఆర్థ్రకవిత్వపు చిరునామా శ్రీ మాకినీడి సూర్యభాస్కర్

.
శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ బహుముఖీన ప్రజ్ఞకలిగిన వారు. కవిగా, కథకునిగా, విమర్శకునిగా, చిత్రకారునిగా వారు చేసిన సాహిత్యప్రయాణం ఎంతో ఫలవంతమైనది.
సుమకవితాంజలి (1997), ప్రకృతి గీసిన వికృత చిత్రం (2002), సెలవ రోజు (2003), కలల పెదవుల నవ్వుల్లోకి (2009), సామెతకో పద్యం (2009), పాపికొండల్లో పడవ పాట (2011), ఆమె (2012), తడితడిగా ఆలోచించే (2013), నాకు నేను దొరికిన క్షణాలు (2016). అనేకులుగా (2019) అనే పేర్లతో పది కవిత్వ సంపుటాలు వెలువరించారు శ్రీ మాకినీడి. ఇవి కాక హైకు చిత్రాలు, ప్రకృతి, రాలిన పుప్పొడి, రుతురాగాలు అనే ఐదు హైకూ కవితా సంపుటులను కూడా తీసుకొచ్చారు.
కవిగా మాకినీడి ఏ తాత్విక భావజాలానికి బంధీకాకుండా స్వేచ్ఛగా కవిత్వాన్ని వెలువరించారు. కవిత్వానికి జీవితమే ప్రమాణమని నమ్మిన వ్యక్తి శ్రీ మాకినీడి. పరాయీకరణకు గురవుతున్న ఆధునిక జీవనం, మానవసంబంధాల పట్ల విశ్వాసం, ప్రాపంచిక సంఘటనలపట్ల స్పందించే తత్వం, అంతర్లీనంగా ప్రవహించే మానవ దుఃఖం లాంటి అంశాలు శ్రీ మాకినీడి కవిత్వానికి భూమిక. వీరి కవిత్వంలో ఆధునిక జీవితం గొప్ప పదచిత్రాలతో, ఆర్థ్రం గా ఆవిష్కరించబడుతుంది.
శ్రీ మాకినీడి రచించిన సుమకవితాంజలి పుస్తకంలోని వీరి పద్యాల గురించి శ్రీ నాగభైరవ కోటేశ్వర రావు “ఈ పద్య ప్రసూనాలకి మంచి రంగు ఉంది, మంచి రుచీ ఉంది. మంచి వాసన ఉంది. చిత్రకారుడు కాబట్టి రంగును అద్దాడు. రుషీత్వం ఆవహించి రుచిని అద్దాడు. వాక్సతీ కటాక్షవీక్షణంలో తడిసి వాసననూ రుద్దాడు” అంటారు. ఈ కితాబు శ్రీ మాకినీడి కవిత్వానికి, సాహితీ కృషికి అక్షరాలా సరిపోతుంది.
***
మాకినీడి కవిత్వంలో సామాజిక గమనింపు
మన జీవన విధానం, అలవాట్లు, సంప్రదాయాలు, పండుగలు, భాష, సాహిత్యం, కళలు అన్నింటిని కలిపి సంస్కృతి అంటాం. ప్రపంచీకరణ ప్రభావం వల్ల ఇవన్నీ మార్కెట్ సరుకులుగా మారిపోతున్నాయి. ఇది మన అస్థిత్వం పై జరిగే దాడి. దీన్ని కవులు గుర్తించి, తమ నిరసనను కవిత్వంలోకి తీసుకొస్తారు. శ్రీ మాకినీడి తన కవిత్వంలో ప్రపంచీకరణ దుష్పరిణామాలను లోతైన ప్రతీకలతో ఆవిష్కరించారు.
రెండుదశాబ్దాల క్రితం భారతదేశానికి చెందిన స్త్రీలు అంతర్జాతీయ అందాలపోటీలలో విజేతలుగా రావటం వెనుక, భారతదేశంలో అందాలను పెంచే ఉత్పత్తుల మార్కెట్టు 80 వేలకోట్ల మేరకు పెరగడం వెనుకా ఉండే సంబంధమే ప్రపంచీకరణ.
ప్రపంచీకరణ వల్ల మనిషితనం పోయి వస్తువులకు ప్రాధాన్యం పెరిగింది. గుంపులో ఏకాకితనం, అమానవీకరణ, హిపొక్రిసి, నగరంలో ఉంటూనే నగరం పట్ల విముఖత, పల్లె, లేదా బాల్యజ్ఞాపకాలను తలచుకోవటం, నిరాశ వంటివి పరాయికరణ స్థాయీ భావాలు. నేడు మనిషెంత పరాయీకరణకు గురయ్యాడో చెప్పకుండా ఆధునిక జీవనాన్ని కవిత్వీకరించటం సాధ్యపడదు. శ్రీ మాకినీడి 2000 వ సంవత్సరంలో వ్రాసిన అందాల అందలం అనే కవిత ద్వారా, ప్రపంచీకరణపై శ్రీ మాకినీడి కి ఉన్న దృక్ఫథాన్ని అర్ధం చేసుకొనవచ్చును.
అందాల అందలం
విశ్వమేథస్సులో
నాలుగోవంతు భారతీయం...
అందచందాల్లోను!
భారత మహిళ అందం
సుస్మితం... సౌందర్య ఐశ్వర్యం!
అయినా, అయిదేళ్ళుగానే
అయిపు కొచ్చిందెందుకనో?
కానీ, అయితే
భారతీయ సౌందర్యం
ప్రపంచ అందాల అందలానికి
మహరాణిత్వం అందిస్తోంది...
ఈ మధ్యీ మధ్యే
అందాలపోటీలకు మన అందమూ
యుక్తాముఖ మవుతోంది!
ఇపుడు లా(ధా)రాదత్త మైంది కదా,
అందాల అందలం ఇకపై మనదే!
ఆలోచిస్తే తెలుస్తుంది.
గ్లోబలీకరణ మాయాజాలం
ఆర్ధిక సంస్కరణల అమలులో
రూపొందిన భామాకలాపం
అయిదేళ్లలో రెట్టింపైన బ్యూటీ బిజినెస్
లావోరెల్, మేబెలైన్, ఎలియన్స్, గార్నియర్
ఎక్స్ క్లూజివ్ షో రూంల
సంపన్న దేశాల బ్యూటీ మార్కెట్ తరలింపు
వీధి వీధినా వెలుస్తున్న బ్యూటీ పార్లర్లు
అంటూ సాగుతుంది కవిత... ఇందులో గ్లోబలైజేషన్ వల్ల మనిషి ఏ విధంగా ఒక వస్తువుగా మారిపోతున్నాడో ఆ క్రమం చెప్పబడింది. ఇంతవరకూ ఇది విశ్లేషణకు సంబంధించిన అంశం. దీనికి వివేచనకు సంబంధించిన అంశాన్ని జోడించినపుడే ఇది కవిత్వమౌతుంది. ఆ విషయం తెలిసిన వాడు శ్రీ మాకినీడి. అందుకనే జీవితానికి చదువు, సంస్కారం, హృదయ నిర్మాలిన్యం లాంటివి నిజమైన అందాలు అంటూ కవితను ముగిస్తాడు.
అందం కాదు..
డబ్బూ కాదు, జీవితం
జీవితం అందగించాలి
చదువుతో... సంస్కారంతో
నందనవనిగా విరబూయాలి
అందమైన హృదయ నిర్మాలిన్యంతో
అచ్చమైన...స్వచ్చమైన
అందాల అందలం అదే
అందుకొనే ప్రయత్నం మీదే. (అందాల అందలం – సెలవ రోజు)
మాకినీడి కవిత్వంలో తాత్వికత
మాకినీడి కవిత్వంలో కరుణ తాత్వికతలు అంతర్జలలై ప్రవహిస్తూంటాయి.
శీర్షాసనం
లోనికి
లోలోనికి…నీలోనికి
శీర్షాసనం వేస్తేనే
కని, పాలిచ్చి
కని రక్షించే
పశుధర్మం ముఖ్యమే!
కానీ-
అంతకు మించిన
కని, ఆనందించే
కని, సంస్కృతిగా మిగిలిపోయే
కళలున్నయ్…కలున్నయ్!
పువ్వుల్లో శీర్షాసనం వేస్తేనే
తేనెటీగలకు మధువు దొరికేది
తలకిందులై ముక్కుతో
జలగర్భం చీలిస్తేనే
కింగ్ ఫిషర్లకు చేపలు దొరికేది
మనిషీ!
నువ్వూ, లోనికి
లోలోనికి…నీలోనికి
శీర్షాసనం వెయ్యాలి (శీర్షాసనం- సెలవు రోజు)
మనిషికి పశువుకు ఉండే తేడా కళలు, సంస్కృతి అని చెపుతున్నాడు కవి. ఒక కల కళగా మారాలంటే లోనికి ప్రయాణించాలి అని సూచిస్తున్నాడు. తేనెటీగా, కింగ్ ఫిషరు అనే రెండు దుష్టాంతాలను చూపుతున్నాడు. బాహ్యదృష్టే ప్రధానమనీ అంతర్ దృష్టి పనికిమాలినిదిగా స్థిరపడుతున్న ఆధునిక సంస్కృతికి ఈ వాక్యాలు చెంపపెట్టు.
అంతర్యానం ద్వారా మనిషి ఆలోచనలు సంస్కరించబడతాయి. అలా సంస్కరించబడిన ఆలోచనలే సాహిత్యం. ఈ సాహిత్యమే మన సంస్కృతిగా మిగిలిపోతుంది అనే లోతైన తాత్వికత ఈ చిన్ని కవితలో ఇమిడిపోయింది.
పౌత్రపు మొలకలు
బాల్యం నుండీ యౌవనం వరకూ
ఒకటే దిగులు
వృద్ధాప్యం మీద పడుతుందని
పడనే పడింది
వసంతం నుండి
హేమంతం దాకా
ఎంతభయపడినా రానే వచ్చింది శిశిరం
శిశిరం తిరిగి
చిగురించింది వసంతమై
పండిన వృద్ధాప్యం
మోసులెత్తింది పౌత్రపు మొలకలై (పౌత్రపు మొలకలు).
భారతీయ తాత్విక చింతన జీవితం యొక్క అవిచ్ఛిన్నతను చెబుతుంది. పునరపి జననం, పునరపి మరణం అర్ధమిదే. తాత పేరు మనవడికి పెట్టడం అనేది ఆ అవిఛ్ఛిన్నతను ప్రతిబింబించటానికే. అందుకే చరిత్ర నిండా రాజ్యాలేలిన రాజులలో మొదటి, రెండు, మూడు అంటూ వివిధ సంఖ్యలు ఉంటాయి. ఇదంతా మన సంస్కృతి. మన తాత్విక చింతన. పై కవితలో పండిన వృద్ధాప్యం మనవడి రూపంలో మొలకలెత్తింది అనటం ఆ అవిచ్ఛిన్నతను చెప్పటమే.
***
అన్నివేళలా అందరూ విజయాలు సాధించలేరు. జయాపజయాల జమిలినేతే ఈ జీవన యానం. ఆధునిక ప్రపంచం దృష్టి ఎపుడూ విజయాలపైనే. విజయం సాధిస్తేనే నువ్వు బ్రతికున్నట్లు అంటూ జీవితాలను ప్రభావితం చేస్తూంటాయి వ్యక్తిత్వ వికాస ప్రసంగాలు. ఇలాంటి నేపథ్యంలో అపజయం కూడా నీ భవిష్యత్ విజయాలకు సోపానం అని చెప్పటం మనిషికి ఒక కవి ఇచ్చే భరోసా.
చింతేల?
తప్పానని చింతేల?
తప్పాలి, తప్పే తీరాలి
అప్పుడే
కొత్తదారులు కొలుస్తావు
క్రొంగొత్త తీరాలు చేరతావు
గహనాటవుల్లోనైనా… మనః
కుహరాంధకార గుహల్లోనైనా (చింతేల?)
***
ఇలాంటిదే మరో కవిత….
నువ్వూ-నీ నీడా
నీడ
నీ వెంట పడితే
నువ్వు బతికున్నట్టే
మానిసిత్వం హసిస్తుంది
నువ్వు
నీడవెంట పడితే
నువ్వు చచ్చినట్టే!
బానిసత్వం హరిస్తుంది. (నువ్వూ-నీ నీడా)
లోతైన చింతన కలిగిన కవిత ఇది. ఇది ఆత్మ విశ్వాసానికి సంబంధించిన అంశం. నీడ అనేది మన అస్తిత్వంగా భావించుకొంటే మనం ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడు మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. అలా కాక మనం మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నీడల్లాంటి ఎండమావుల వెంట పరిగెడితే అది బానిసత్వం తో సమానం… అది నీ మృత్యువు అని చెబుతున్నాడు కవి. తక్కువ వాక్యాలలో భిన్న అర్ధాలు ఒదిగిపోయాయీ కవితలో.
మాకినీడి కవిత్వంలో పదచిత్రాలు
ఒక ఆలోచననో, దృశ్యాన్నో, అనుభూతినో లేక అన్నింటినో క్లుప్తతతో చేసే వర్ణననే పద/భావచిత్రమని అంటారు. వైయక్తికమైన అనుభూతిని కళాత్మకంగా, ప్రయోజనవంతంగా వ్యక్తీకరించటానికి పదచిత్రాలు అత్యున్నతమైన సాధనాలు. ఈ సంకలనంలో అనేక పదచిత్రాలు ఆయా కవితావస్తువులను ప్రకాశవంతం చేస్తూంటాయి.
1.
నుదుట మూగే చినుకుల ఈగల్ని
వైపరు ముంగురుల్తో తోలుకుంటూ
చక్రాల తెడ్లతో ఈదే వాహనాలు (జీవాణువులై)
2.
అంతవరకూ మసిబారిన
ఆకాశపు కారడవిలో చిక్కిన సూర్యుడు
తడి ఆకుల మాటునుంచి
తడి, సడి గా తొంగి పలకరిస్తాడు
3.
కాలువల్లోకి ప్రవహించే ఇంద్రచాపాలై
పెట్రోలు కంపుతో వర్షం ముగుస్తుండగా (జీవాణువులై)
4.
రైతుల కళ్ల మేఘాలు వర్షిస్తయ్
వానరాని కాలంలో సైతం! (రైతు ఆత్మహత్య)
5.
చెట్టు
మొదట్లో
రాళ్ళ గుట్ట
బాగా
కాచిందనటానికి
సాక్ష్యం (సాక్ష్యం)
6.
మెల్లగా కిటికీ రెక్కని తోసి
సన్నగా పరదా తెరని తీసి
ప్రవేశిస్తుంది చిరుగాలి//
తోడ్కొని వచ్చిన తొలికిరణం
నేరుగా చీకటి గుప్పట్లు పరచిన
మూసిన కనురెప్పలను తాకుతుంది
సుతారంగా… తారంగంలా (మెలకువ- తడితడిగా)
7.
నిద్రపక్షులు జంటగా
గూళ్ళువెతుక్కుంటూ వచ్చి
చెరోకంటిమీదా వాల్తాయి ( కలల పిల్లలు). నిద్రని ధ్వంద్వంగా చెప్పటం వినూత్నమైన ప్రయోగం.
8.
మండే ఎండను తాగి
నీడను కక్కడమే నైజం (చెట్టు చెట్టే) అంటూ చెట్టు లక్షణాన్ని వ్యక్తీకరిస్తారు.
9.
బ్రతికిన క్షణాలు
సందిట చేరి
పొందుతాయి విశ్రాంతి
అందుకేనేమో
మట్టికి
ఆ జీవ పరీమళం (జీవ పరీమళం)
10.
హఠాత్తుగా ఇసుకనీటి నది
ధడధడధడధడ లాడుతూ
చక్రాల కింద పారుతుంది (వీడ్కోలు).
రాజమండ్రి వద్ద రైలులో గోదావరి బ్రిడ్జిని దాటడం అందరకీ అనుభవైకవేద్యమే. ఆ అనుభవం అద్భుతమైన పదచిత్రంగా ఒదిగిపోయింది.
11.
ప్రాణం లేని బాట
రాలిన పూలను
మేనున దాల్చిన పారవశ్యాన్ని
గమకాలుగా అనువదించుకొని
సుగంధగానం చేస్తోంది
అటు ఇటూ పోయేవారిని ఆహ్లాదపరుస్తూ! (బాటతో బాటే) ఇక్కడ సుగంధగానం అనే మాట కీలకమైనది, పదచిత్రానికి లోతైన గాఢతను ఇస్తోంది.
12.
బాల్యం పుప్పొడి రాలిన
వృద్ధాప్యపు పుష్పాలు
వంగి ప్రశ్నలుగా మిగిలిపోయిన
ఆశ్చర్యార్ధకాలు! (వృద్ధాప్యపు పుష్పాలు) వృద్దాప్యాన్ని వర్ణించే చక్కని పదచిత్రం. దీనిలోని ఆర్ధ్రత, వ్యంజన కదిలిస్తాయి.
ప్రతిభావంతమైన పదచిత్రాలు గొప్ప కవిత్వానికి చిహ్నాలు. ఉత్తమ కవి పదచిత్రాల ద్వారా తాను చెప్పదలచుకొన్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా మూర్తవంతంగా చెప్పగలుగుతాడు. పైన చెప్పినవి శ్రీమాకినీడి కవిత్వంలో కనిపించే అసంఖ్యాకమైన పదచిత్రాలలో కొన్ని మచ్చుతునకలు. ఇవి మాకినీడి చక్కని ప్రతిభ వ్యుత్పత్తి కలిగిన కవి అని నిరూపిస్తాయి.
మానవ సంబంధాలు
మానవ సంబంధాలను వ్యక్తీకరించే సాహిత్యం ఉత్తమసాహిత్యంగా నిలిచిపోతుంది. సంక్లిష్ట సమాజానికి అద్దంపట్టేది దాని మారుతున్న మానవవిలువలే. ఈ ప్రక్రియను సాహిత్యంలోకి తీసుకురావటం సాహిత్యకారుల బాధ్యత. శ్రీమాకినీడి కవిత్వంలో మానవసంబంధాలు ఉదాత్తంగా ఆవిష్కరించబడ్డాయి.
కూతురు స్వరంలోంచి శ్రీమాకినీడి చెప్పిన అనేక కవితలు వ్రాసారు. నిజానికి చిన్నారులు పలికిన పలుకులుగా చెప్పే సంగతులన్నీ ఆ కవి పసిహృదయం పలుకుతున్న వాక్కులుగా గ్రహించాలి. పిల్లలను వాడుకోవటం ఒక వంక అంతే. పిల్లలు మాటలలో ఆ కవి ఒక నిష్కల్మష ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాడు. దానిలోకి అందరినీ ఆహ్వానిస్తాడు.
నిద్రపోకుండా పెద్దారిందాలా, రాత్రంతా మేలుకుని
చేతుల్లోంచి మెత్తగా చేతుల్లోకి జారుతూ
మొఖమల్ నవ్వుల కాంతులతో
కళ్యాణ మండపాన్ని వెలిగించింది (చాందినీ) ఒక అందమైన సంఘటనని, చిన్నారి మెత్తని నవ్వులని మించిన సౌకుమార్యంతో వర్ణించారు.
అమ్మనీకెందుకు నచ్చింది అని అమాంతంగా, అమాయికంగా అడిగిన పాపాయికి “ అమ్మ నీకు అమ్మయినందుకు” అని సమాధానం ఇవ్వటంలో లౌక్యం కన్నా మానవ బంధాలను దృఢం చేసుకొనే సంకల్పమే కనిపిస్తుంది.
చిన్నపిల్లలకు జ్వరం వచ్చి, ఆ జ్వరతీవ్రతలో వారు బాధపడుతుంటే ఇంట్లో ఉన్నవారంతా బెంగటిల్లుతాం. ఆ అనుభవాన్ని ఒక కవితలో ఇలా వర్ణించారు
మూడు వత్సరాల బాల్య నిత్యచైతన్యం
మూడంకేసి ముసుగేసి పడుకొంది
అందుకే
మా ఇంటికంతకీ జ్వరమొచ్చింది
ఇంటిల్లిపాదీ వణుకుతోంది
బెంగచలిలో ముణగదీసుకుని
వజవజ గిజగిజలాడుతోంది ఇల్లు (ఇంటికి జ్వరమొచ్చింది)
చాలా తేటగా అనిపిస్తున్నా, ఈ కవితలోని ఉద్వేగాన్ని ప్రతిఒక్కరో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే ఉంటాం. దానిని అక్షరాలలో బంధించటానికి శ్రీమాకినీడికి మానవసంబంధాలపట్ల ఉన్న అచంచలమైన అనురక్తే కారణం.
***
మనచుట్టూ ఉండే చిన్నపిల్లల మాటలలో ఒక ఇంద్రజాలిక లోకం ఉంటుంది. ఈ లోకం హఠాత్తుగా అలాంటి అకలుషిత ప్రపంచంగా మారిపోవాలని కవులు కోరుకుంటారు. శ్రీమాకినీడి సుద్దుల మూటలు అనే కవితలో తన చుట్టూ ఉండే సన్నిహితుల పిల్లలు పలికిన అమాయికమైన మాటలను అద్భుతంగా అక్షరీకరించారు.
అమ్మస్నానం చేస్తూ
పొయ్యిమీద పాలకి కాపలా పెడితే
మూడేళ్ళ పిల్లాడి ముద్దుమాట
“పాలు డాబా ఎక్కేస్తున్నాయి”
ఈ మాటముందు వేణునాదం వెలవెలబోదా?
రెండో తరగతికి ప్రమోట్ అయిన
అమ్మాయి దిగులు
టీచర్ ఒకటో తరగతిలోనే ఉండిపోయిందనే
ఈ మాటముందు
వీణా నాదం విలవిల లాడదా?
చీమలు మూగడం చూసి
ప్రసాదాన్ని చీమలు కరిచేస్తున్నాయంటే
ఈ మాటముందు గిటారుగేయం గిల గిల లాడదా?
క్యాలెండరు అంకెలన్నింటినీ
ఎర్రరంగుతో చుడుతున్న చిన్నారినడిగితే
రోజులన్నీ ముఖ్యమైనవే కదా’ని విస్మయపడితే
ఈ మాటముందు సితారగీతం చిన్నబోదా? (సుద్దుల మూటలు)
జీవం తొణికిసలాడే అనుభవాలు అనేకం శ్రీ మాకినీడి కవిత్వంలో పోతలు పోసుకొన్నాయి. ఏదో మాటల సందర్భంలో మణీబాబు తన అమ్మాయి ముద్దుమాటల్ని చెబితే వాటిని కవిత్వీకరించారు, బొల్లోజు బాబా ఈ కవిని కలిసి తన పుస్తకాల్ని ఇచ్చిన సందర్భాన్ని కవితగా మలచారు. వారి అమ్మాయి సౌమ్య పడుకొన్నతీరు, వారి పెద్దమ్మ గారు దివంగతులైనసందర్భమూ, ఆత్మీయమిత్రుడు నాగరాజు గురించీ – ఇలా అనేక జీవనానుభవాలకు సాహిత్యగౌరవం కల్పించారు శ్రీ మాకినీడి. ఇవన్నీ వీరిని జీవనానుభవాల కవిగా నిరూపిస్తాయి.
తాను నడచిన మార్గపు ఆనవాళ్ళని కవి తన కవిత్వంలో జారవిడిచి జీవన సందర్భాలపై వెలుగును ప్రసరింపచేస్తాడు అనటానికి ఆ యా కవితలే చక్కని ఉదాహరణలు.
చివరగా శ్రీ మాకినీడి రచించిన కొన్ని హైకూలు
1. అద్దం మీద పిచ్చుక
పొడుస్తోంది తన నీడని
విడిచి వెళ్ళిన ప్రియురాలి జ్ఞాపకం
2. పాప ఏడ్చింది నిద్దట్లో
జోకొడుతూ
నిద్దరోయాను నేనూ!
3. పాపకు రంగు బొమ్మలిచ్చాను
రంగురంగుల పూలెందుకు
విరుస్తాయో అర్ధమైంది.
4. చీకట్లో పథికుడు
పోతున్నాడు పాడుతూ
నిశీధికి బాటగా ఆ పాట
హైకూ నిర్మాణం పై తెలుగులో మొట్ట మొదటి విమర్శనా పుస్తకం వెలువరించింది శ్రీ మాకినీడి. హైకూ అంటేనే క్లుప్తత, గాఢత. ఆ లక్షణాలను పుణికిపుచ్చుకొని సాగుతాయి పై హైకూలు.
***
శ్రీ మాకినీడి సుమకవితాంజలి నుండి “అనేకులుగా” వరకూ చేసిన ప్రయాణంలో వీరు -సామాజిక స్పృహ, మానవసంబంధాలు, తన లోలోపలకి చేసుకొన్న తవ్వకం- అనే మూడు అంశాలను ఒక అంతర్లయలా చేసుకొని మంచి కవిత్వాన్ని సృజించారు.
ఈ సంపుటాలలోని కవిత్వం ఒక ఆధునిక మానవుని జ్ఞాపకాలను, వర్తమాన సంక్షోభాలను గానం చేస్తుంది. అనుభూతి, మానవత, తాత్వికతలు శ్రీ మాకినీడి కవిత్వంలో పుష్కలంగా పొటమరించే అందాలు
అజో-విభో కందాళం ఫౌండేషన్ వారి పురస్కారం అందుకొంటున్న సందర్భంగా శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, రానున్నకాలంలో మరిన్ని కవిత్వసంపుటులుగా విస్తరించాలని కోరుకొంటున్నాను.
భవదీయుడు
బొల్లోజు బాబా


(ఈ సంవత్సరం అజో-విభో కందాళం ఫౌండేషన్ వారి పురస్కారాలు శ్రీ తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి, శ్రీ శిఖామణి, శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ లు అందుకొన్నారు. వారి సాహితీ కృషిని పురస్కరించుకొని విడుదలచేసిన సావనీర్లలో ఆ ముగ్గురిపైనా వ్యాసాలు రాసే అదృష్టం నాకు ఇచ్చిన ఆ యా సావనీర్ల సంపాదకులైన శ్రీ రెంటాల వెంకటేశ్వరరావు, శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ అద్దేపల్లి ప్రభు గార్లకు ధన్యవాదములు. ఫౌండేషన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు.)