Tuesday, July 14, 2020

మూడో కన్నీటి చుక్క పుస్తకానికి అఫ్సర్ గారి ముందుమాట

అలా మొదలై, చాలా దూరం వెళ్ళే బాబా కథన కవిత్వం!

బొల్లోజు బాబా “మూడో కన్నీటి చుక్క”కి స్వాగతం!
వొక సంపుటి వెలువడిన తరవాత కవి ముందు మహాద్వారమేదో తెరుచుకుంటుంది.
ఆ ద్వారాన్ని దాటుకొని అతను యెటు వైపు అడుగేస్తాడా అని లోకం కనీసం పది కళ్ళతో యెదురుచూస్తుంది. అందులో కొన్ని కళ్ళు పచ్చగా అసూయతో- కొన్ని కనిపించీ, యింకొన్ని కనిపించని- చూస్తూ వుంటాయి. చాలా కష్టం! చాలా అయిష్టంగా కూడా వుంటుంది. అట్లా అని తెరుచుకున్న తలుపుని మూసేసి వెనక్కి వెళ్లలేడు కవి. ముందుకే వెళ్ళాలి. ముఖ్యంగా చాలా కవిత్వ పుస్తకాలు వెలువడుతున్న కాలంలో తనదే అయిన దారీ, చూపూ వుంటే తప్ప అట్లా ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. అవేమీ లేకుండానే కొంతమంది ముందుకు వెళ్తున్నామన్న భ్రమలో బతికేస్తూ వుంటారు. ఆ భ్రమని పాఠకులు బ్రేక్ చేసి, వాస్తవంలోకి ఈడ్చి కొడ్తారు, నిశ్శబ్దమైన నిరాకరణతో-
నన్ను నేను కూడదీసుకునే ప్రయత్నంలో ఇద్దరు కవుల్ని ఈ మధ్య మార్చి మార్చి చదువుతున్నాను. మార్చి మార్చి చదవడం అంటే కాసేపు ఈ కవి పేజీలు కొన్ని, ఇంకాసేపు ఆ కవి పేజీలు కొన్ని- ఇద్దరినీ వొకేసారి చదువుతున్నా. ఆ ఇద్దరు: వొకరు మన కవి బాబాజీ. మరొకరు: వాల్ట్ విట్మన్.
1
బాబా రెండో కవిత్వ పుస్తకం  అంది, చాలా కాలమే అయింది. ఈ లోపు నా జీవితంలో వూహించని విషాదం ఎదురైంది. అమ్మ పోయింది. కవిత్వం చదివే మనసూ లేదు. ఇక నాలుగు మాటలు రాసే చేతులేవో పడిపోయినట్టుగా అనిపించింది. కానీ, బాబా కవిత్వం మధ్యలో చదువుతూనే వున్నాను. చదువుతూ చదువుతూ ఆగిపోతున్నాను. ఆగిపోయిన చోట యేదో వెతుక్కుంటూ వున్నా. అట్లా వెతుక్కుంటున్నప్పుడు మరీ ముఖ్యంగా వొక కవిత దగ్గిర కాస్త యెక్కువ సేపు నిలిచి వున్నాను.
ఆ కవిత శీర్షిక: ఒక కవిని కలిశాను
రేపతను తన ఇంటిలో ఉండకపోవచ్చు
రేపతను తన దేహంలో ఉండకపోవచ్చు
రేపతను తన ఆత్మలో ఉండకపోవచ్చు
కానీ తన పేరులో సజీవంగా ఉంటాడు
ఇన్ని సంవత్సరాల జీవితాన్నీ
తన పేరులో దాచుకొన్నాడు
అక్షరాలుగా, వాక్యాలుగా, కవిత్వంగా….
మరణాలూ, జననాలూ, ఉత్సవాలూ, నిరుత్సాహాలూ మామూలు మనిషికీ వుంటాయి. వాటిని గుర్తు పెట్టుకోడానికో, మరచిపోడానికో అతనూ యేదో చేస్తాడు. బహుశా, వొక స్నేహితుడి దగ్గిరకెళ్లి భోరున ఏడుస్తాడు లేదంటే కడుపారా నవ్వుకుంటాడు. గుంభనగా వుండే మనిషి అయితే లోలోపలే వుండిపోయి, బయటికి రాలేక తనలో తాను పోరాడుతూ వుండిపోతాడు. కానీ, కవి మామూలు మనిషి కాదు. కవి దగ్గిర కొన్ని పదాలుంటాయి. వాటిని వాక్యాలుగా అల్లే శక్తి వుంటుంది. ఆ శక్తి కొన్ని సార్లు కవిని ఆదుకుంటుంది లేదా కవి మనసుతో ఆడుకుంటుంది. ఆ పదాలతో కవి నిజంగానే తన ఏడుపూ, సంతోషమూ చెప్పచ్చు. లేదంటే, పదాలకు రంగులద్ది మోసం చేయచ్చు. Replacement జరగాలి. అది యెట్లా అయినా జరగచ్చు. అది యెట్లాంటి Replacement?
బాబా అంటున్నాడు:
రేపతను తన ఇంటిలో ఉండకపోవచ్చు
రేపతను తన దేహంలో ఉండకపోవచ్చు
రేపతను తన ఆత్మలో ఉండకపోవచ్చు
మూడు రకాల Replacement- ఇల్లు, దేహం, ఆత్మ! అది తేలిక కాదు. కవికే కాదు, మామూలు మనిషికి కూడా తేలిక కాదు.
2
కొంత దూరం నడిచాక కవికి భాష విధించే ఖైదు భారమైపోతుంది.
అంటే, తను వాడుతున్న భాష కటకటాలయం అవుతుంది. ఆ కొద్ది దూరం తరవాత కవి వెతుకులాట అంతా భాష గురించే. భాషని శుభ్రం చేసుకోవాలన్న పట్టుదల పెరుగుతుంది. అప్పుడు ఆ కవి యే భాష వైపు కదులుతాడన్నది అతని దృక్పథాన్ని బట్టి వుంటుంది. నా మటుకు నేను colloquial అంటే రోజువారీ జీవితం వైపు మళ్లే కవిత్వం మీద వొక రకమైన పక్షపాతం. ఎందుకంటే, సాహిత్య భాషకి ఎదురుగా సాధారణ భాషని నిలబెట్టడం పెద్ద యుద్ధం కాబట్టి!
బాబా మొదట బుద్ధిజీవి. అతనికి స్థానిక చరిత్రలూ, సంస్కృతుల మీద వున్న ఆసక్తీ, పరిశోధనా అనుభవం చాలా మటుకు తన కవిత్వ వ్యక్తిత్వాన్ని కూడా ప్రభావితం చేస్తూ వుంటాయి. అట్లాగే, కవిత్వ విమర్శ మీద గత కొంతకాలంగా నిక్కచ్చిగా గొంతు విప్పి, పరిభాష వెతుక్కుంటున్న poet-critic బాబా. యిక్కడ ఆ రెండు కాళ్లే అనేక పడవల మీదకి వెళ్ళి, నదిని దాటుకొని రావాలని ప్రయత్నించడం మనం ఈ కొంతకాలంగా చూస్తున్నాం. స్థానిక చరిత్రల మీద పనిచేస్తున్న శోధకుడికి వెంటనే నచ్చే మరో సాహిత్య శిల్ప ధోరణి: narration.
Narrative poetry మనకేమీ కొత్త కాదు. అయితే, అత్యాధునిక సందర్భంలో ఈ విధమైన నిర్మాణం వెంట ముఖ్యంగా రెండు ప్రయోజనాలున్నాయి. వొకటి: సంప్రదాయ కవిత్వ శైలిని నిరాకరించడం; రెండు- కవిత్వంలో వొదగని సాంస్కృతిక లక్షణాలను స్వీకరించడం. ఈ రెండు పనులూ చక్కగా చక్కదిద్దుతున్నాడు బాబా.
ముఖ్యంగా- ఈ కొత్త కవిత్వ సంపుటిలో బాబా Narrative poetry కి సంబంధించిన అనేక కోణాలని మనకి పరిచయం చేస్తున్నాడు. బహుశా, ఈ సంపుటి ప్రధానంగా తలపెట్టిన task అదే! పైన చెప్పిన కవితలో ఇతర అంశాలు అనేకం వున్నా, అందులోని narration మనల్ని కట్టిపడేస్తుంది.
కనీసం మూడు రకాల narrative పద్ధతుల్ని బాబా వాడుతున్నాడు. నేరుగా కథనం చేయడం ఇందులో ఎక్కువగా కనిపిస్తున్న పద్ధతి.
ఉదాహరణకు:
జీవించటమే…….అనే కవిత చూడండి:
 రోజు హఠాత్తుగా ఒకదారి తన గమ్యాన్ని మరచిపోయిందిచాలా బెంగ పట్టుకొంది దానికిగమ్యం లేని జీవితమేమిటనితన గమ్యాన్ని వెతుక్కొంటూ ప్రయాణం కట్టిందా దారికనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతోంది.
యిలా మొదలై ఈ కథ చాలా దూరం వెళ్తుంది. చివరికొచ్చేసరికి బాబా అసలు కథ చెప్తాడు. ఇది నేరుగా కథ చెప్పినట్టే వుండి, కొన్ని జీవన దృశ్యాలను ఆవిష్కరించే ప్రతీకల మీదుగా తుది మజిలీ చేరుకుంటుంది.
ఫ్రాగ్మెంట్స్ అనే శీర్షిక కింద రాసిన శకలాల్లో కూడా కథనాత్మకతే కనిపిస్తుంది. అయితే, ఈ కథనాత్మకత యింకొంచెం గాఢంగా రూపం దిద్దుకుంటుంది.
అందమైన సీతాకోకలు
గాల్లో తేలిగ్గా అలా ఎగిరే దృశ్యం
హాయిగా అనిపించేది
ఒకరోజు
రైల్వే ట్రాక్ పై చెత్త ఏరుకొంటున్న
మురికిబట్టల సీతాకోకను
చూసే వరకూ…..
ఈ కవిత నిజానికి శకలం కాదు. కొద్ది వాక్యాల్లోనే వొక దీర్ఘ కథకి కావలసిన సామగ్రి నింపుకున్న నిర్మాణ చాతుర్యం ఇందులో వుంది. ప్రతి కవీ కొన్ని పాత్రల చుట్టూ తన కథే చెప్తాడు. అయితే, బాబా కవితల్లో పాత్రలకు ఆ ఆత్మకథాత్మకతని మించిన లక్షణాలు కనిపిస్తాయి. ఈ విధంగా సమకాలీన కవిత్వంలో కవులు చేస్తున్న ప్రయోగాలకు భిన్నమైన ధోరణిలో వెళ్తున్నాడు బాబా.
3
ఆశ్చర్యం యేమిటంటే, క్రమంగా తెలుగు కవిత్వంలో కవిత్వాన్ని మాత్రమే విశ్లేషించే సాధనాలు లేవు. ఎంతోమంది కవిత్వ విమర్శకులు ఆధునిక కవిత్వ ప్రారంభ దశ నుంచీ వస్తున్నప్పటికీ ఇప్పటికీ కవిత్వ విమర్శ సాధనాలను సృష్టించుకోలేకపోయాం. చేకూరి రామారావు లాంటి వారు భాష శాస్త్రం కోణం నుంచి చేసిన ప్రయత్నాలు ఆ తరవాత అంతగా అనుసరించిన వాళ్ళు కూడా లేరు. ఆ రకంగా చూస్తే, కవిత్వ విమర్శ పరిభాష మనకింకా ఏర్పడలేదు. అదొకటి ఏర్పడాల్సి వుందన్న ఆలోచన కూడా నెమ్మదిగా పోతోంది.
బాబాలో కవీ, విమర్శకుడూ ఇద్దరూ పుష్కలంగా వున్నారు. వాళ్ళ ప్రపంచాలు అంత భిన్నమైనవేమీ కాదు. అయితే, వాళ్ళిద్దరి మధ్యా సరిగా వంతెన కట్టే విశ్లేషణ ఏదో జరగాల్సిన సందర్భం దగ్గిర పడిందని ఈ కొత్త కవిత్వ సంపుటి చదువుతున్నప్పుడు అర్థమైంది. కవిగా తన దారి ఏమిటో వెతుక్కోడానికి బాబా కవిత్వ విమర్శలోకి వచ్చాడనీ నాకు గట్టిగానే అనిపిస్తుంది.
సృజన అనే కవితలో బాబా అంటాడు:
అంతకు ముందు ఏవి లేవో
వాటిని కొందరు
గొప్ప కాంక్షతోదయతో
అన్వేషించి
అక్షరాల్లో మరోప్రపంచాల్ని
శిలల్లో భంగిమల్ని
రంగుల్లో ప్రవహించే దృశ్యాల్ని
ఆవిష్కరిస్తూంటారు
ఇది కవిత్వంలో పొదిగిన తన ఆత్మకథ. ఇది బాబా కవిత్వ విమర్శకి కూడా వర్తించే అంశమే. బాబా వొక గొప్ప కాంక్షతో కవిత్వంలోకీ, కవిత్వ విమర్శలోకీ బయలుదేరాడు. వొక సామాజిక శాస్త్రజ్నుడిగా అతనికి అన్వేషణా, ఆవిష్కరణ అనే రెండు concepts కూడా తోడవుతున్నాయి. అంతమంది వొక చోట కలిసే బహుళత్వం తెలుగు కవిత్వానికి గొప్ప బహుమతి.
నవంబర్ 27, 2019

"వెలుతురు తెర" పుస్తకంపై వచ్చిన సమీక్ష



ఆంధ్రభూమిలో నా "వెలుతురు తెర" పుస్తకంపై వచ్చిన సమీక్ష. మిత్రులు శ్రీ రవికాంత్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
వెలుతురుతెర పుస్తకం కినిగెలో ఈ క్రింది లింకులో లభిస్తుంది.

No photo description available.

గోళకి మఠము - రాజకీయ సామాజిక ప్రస్థానం



1. చరిత్ర
గోళకి మఠము శైవమతానికి చెందిన ఒక ధార్మిక మఠము. దీని ప్రధాన కేంద్రం నర్మదా, గంగా నదుల మధ్యకల త్రిపురి అనే పట్టణంలో ఉండేది. ఇది ప్రస్తుత జబల్ పూర్ సమీపంలోని తివూరు పట్టణం.
పదో శతాబ్దం లో "సద్బవ శంభు" గోళక మ ఠానికి ప్రధాన గురువు. కాలచూరి రాజైన యువరాజదేవుడు ఈ మఠానికి మూడు లక్షల గ్రామాలు దానం ఇచ్చాడు. (మధ్యభారత దేశాన్ని పాలించిన ఒక రాజవంశం పేరు కాలచూరి).
సద్బవ శంభు తరువాత వచ్చిన "సోమ శంభు" అనే గురువు "సోమ శంభు పద్దతి" పేరుతో గోళకీ మఠాల నిర్వహణ విధానాలను, సంప్రదాయ పద్దతులను రచించాడు.
సోమ శంభు తరువాత మఠగురువుగా వచ్చిన "వామ శంభు" కాలచూరి రాజులకు (క్రీశ 1052 ) రాజ గురువుగా ఉన్నాడు.
ఈ మఠానికి చెందిన తదనంతర పీఠాధిపతులలో "విశ్వేశ్వర దేవ" ప్రముఖుడు. ఇతను కాకతీయ రాజైన గణపతి దేవునికి దీక్షా గురువుగా ఉండేవాడు. ఇతని ప్రస్తావన ప్రసిద్ధ మల్కాపుర శాసనంలో ప్రముఖంగా ఉంది. ఇతనికి గల వివిధ బిరుదులు - గోళకి వంశ క్రితాభిషేక, మహిసుర, నైష్టిక దేశికేంద్ర, శైవాచార్య మొదలగునవి.
గోళకి మఠాలు గౌడదేశం (బెంగాలు) లో పదవశతాబ్దానికి ముందే విస్తరించి ఉన్నాయని వేటూరి ప్రభాకరశాస్త్రి బసవపురాణానికి వ్రాసిన ముందుమాటలో అన్నారు.
***
దక్షిణభారతదేశంలో శైవమతం ప్రాచీనకాలంనుండీ చిలవలు పలవలుగా విస్తరించి ఉంది. పురాతన పశుపతినాథ ఆరాధన నుండి అతి వికృతమైన కాపాలిక తెగ వరకూ అనేక పాయలు కనిపిస్తాయి. పదో శతాబ్దానికి వచ్చేసరికి శుద్ధ శైవము, కాలముఖము ప్రముఖ శాఖలుగా మిగిలాయి. గోళకి మఠం శుద్ధశైవానికి చెంది రాజాశ్రయాన్ని పొంది పదకొండు పన్నెండు శతాబ్దాలలో ప్రాచుర్యంలో ఉండింది. కానీ కాలక్రమేణా ఈ రెండు శాఖలు కలిసిపోయినట్లు తెలుస్తుంది. గోళకి మఠ గురువులైన ఈశాన దేవ, క్రియాశక్తి లు వారు శుద్ధశైవులైనప్పటికీ తదనంతరం కృష్ణదేవరాయుల సమయానికి కాలముఖులుగా పేర్కొనబడ్డారు.
గోళకి మఠం వీరశైవ అఘోరా పద్దతులకు-వేదాలకు మధ్యేమార్గంగా అవతరించిన సంప్రదాయపద్దతి అని వేటూరి ప్రభాకర శాస్త్రి అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కొన్ని చోట్ల ఈ మఠాధిపతులు వీరశైవులని, అఘోరాలని, తాంత్రిక వాదులనీ పేర్కొనబడ్డారు. (రి. పుష్పగిరి శాసనం)
అప్పట్లో ప్రతిశివాలయములోను గోళకి మఠం ఉండేది. దీనిని మహేశ్వరి, శైవయోగిని ల పేరుతో పిలువబడే శైవ సన్యాసినిలు నిర్వహించే వారు. వీరి వివరాలు పదమూడవ శతాబ్దానికి చెందిన కర్నూలు శాసనాలలో విరివిగా కనిపిస్తాయి. పూజాదికాలు మాత్రం లింగధారులు, జంధ్య ధారులు అయిన బ్రాహ్మణులు జరిపేవారు. వీరు శైవాగమన పద్దతులు మరియు వేదాలకు అనుగుణంగ పూజలు చేసేవారు. వీరిని శుద్ధశైవ బ్రాహ్మణులుగా మల్కాపుర శాసనంలో పేర్కొనబడ్డారు. కాల క్రమంలో వీరు వేదాలను ఎక్కువగా అనుసరించటంతో ఆరాధ్య బ్రాహ్మణులు అని పిలవబడ్డారు.
శైవమత పునరుద్దరణకు పూనుకొన్న పండిత త్రయంలోని "శివలెంక మంచన" గోళకిమఠ నియమనిబంధల గ్రంధమైన "సోమ శంభు పద్దతి" ని వ్రాసిన సోమశంభుని మనుమడు.
****
2. గోళకిమఠానికి చెందిన ప్రముఖులు
ఈ మఠానికి చెందిన ప్రముఖులు దక్కను నుండి కేరళ వరకు విస్తరించారు వారిలో ముఖ్యులు
* పన్నెండో శతాబ్దపు కాలచూరి వంశానికి చెందిన బిజ్జల దేవునికి దీక్ష ఇచ్చిన కాలచూరి క్షంపాల దీక్ష గురువు
* కేరళకు చెందిన ఈశాన శివాచార్య. ఇతను రాజరాజ చోళునికి రాజ గురువు
* కాకతి గణపతిదేవుని దీక్షనిచ్చిన విశ్వేశ్వర శివ. ఇతనిని గణపతిదేవుడు తన తండ్రిలాగ పేర్కొన్నాడు. ఇతను కృష్ణా తీరంలో మంధర (నేటి మందటం) ప్రాంతంలో ఆశ్రమం కట్టుకొని స్థిరపడ్డాడు.
గోళకిపీఠాధిపతి విశ్వేశ్వర శివుడు కాకతీయ రాజులకు గురువే కాక- చోళులకు, మాళవులకు, కాలచూరి రాజులకు కూడా గురువేనని ఇంకా వందలాది వీరశైవ ఆచార్యులకు అధిపతి అని చెప్పబడ్డాడు.
* పుష్పగిరి మఠాన్ని స్థాపించిన "సోమశివాచార్య" గోళకి సంప్రదాయానికి చెందిన గురువు. ఇతని విగ్రహం వెడికల్లి లో కలదు. (పుష్పగిరి ? పుష్పగిరి చెన్నకేశవ ఆలయంలో క్రీ.శ. 1501 నాటి శాసనం లో అఘోరశివాచార్యులు శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ శిఖరాన్ని నిర్మించట్లు ఉన్నది)
*శ్రీనాథుడు ఓడించిన డిండిమ భట్టు గోళకి పరంపరకు చెందిన వ్యక్తి.
* విరూపాక్ష, పుష్పగిరి అద్వైత మఠాలు గోళకి వంశస్థులు నెలకొల్పినవే.
* ఆంధ్ర ప్రాంతంలో పుష్పగిరి, త్రిపురాంతక ఆలయాలలో గోళకి మఠాలు ఉండేవి.
* విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన విద్యారణ్య స్వామి గోళకి మఠ సంప్రదాయానికి చెందిన వ్యక్తి.
గోళకి వంశస్థులు ఆ తరువాత అనేక శతాబ్దాలు ఆంధ్ర దేశంలో తమ ఉనికిని నిలుపుకొన్నారు. కాళేశ్వరం, శ్రీశైల ఆలయాలలో తమ మఠాలను నెలకొల్పి తమ సంప్రదాయాలను ప్రచారం చేసుకొన్నారు.
****
3. గోళకి మఠం - సామాజిక సంస్కరణ
శ్రీకంఠ శివాచార్యుడు ఆలయంలోకి కులాలతో సంబంధంలేకుండా భక్తులందరకీ ప్రవేశం కల్పించాడు. (మల్కాపుర శాసనంలో కూడా బ్రాహ్మణులమొదలు చండాలుర వరకూ అందరకూ ఉపయోగపడే సత్ర నిర్మాణం చేసినట్లు ఉంది). శివుని నామోచ్ఛారణ ద్వారా చండాలుడు కూడా ఉత్తముడౌతాడని ప్రభోదించాడు.
ఒక చండాలుడు శివుని నామాన్ని ఉఛ్ఛరించాకా ఇతరులందరూ అతనితో మాట్లాడవచ్చు, కలిసి జీవించవచ్చు, కలిసి భుజించవచ్చు " అని ముండకోపనిషత్తులో చెప్పబడింది అని శ్రీకంఠుడు ప్రవచించేవాడట (ఈ శ్లోకం లభించటం లేదు, బహుసా తొలగించి ఉంటారు అని టి.ఎన్. మల్లప్ప అన్నారు)
ఆ తరువాత వచ్చిన బసవేశ్వరుడు: శివదీక్ష తీసుకొన్న స్త్రీలు, పురుషులు; బ్రాహ్మణులు, శూద్రులు; అంటతగినవారు, అంటరానివారు; - అందరూ ఒకేరకమైన హక్కులు కలిగి ఉంటారని; లింగము, కులము, వర్ణములకు అతీతంగా అందరూ మోక్షమును పొందే అర్హత కలిగి ఉంటారని ప్రవచించాడు. బసవేశ్వరుని బోధనలుగా చెప్పబడుతున్న పై అంశాలన్నీ అప్పటికే అమలులో ఉన్న గోళకి మఠ సంప్రదాయాలని వేటూరి ప్రభాకరశాస్త్రి అభిప్రాయపడ్డారు.
ప్రతాపరుద్రుని మరణంతో కాకతీయ సామ్రాజ్యం కూలిపోయినపుడు ఈ గోళకిమతస్థులు ఆంధ్రనుంచి, కర్ణాటకవైపు వలసపోయి విద్యారణ్య స్వామి ఆశీర్వాదాలతో హరిహర, బుక్కరాయల సారధ్యంలో విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించారు.
***
4. గోళకి మఠం తాంత్రిక పీఠమా?
గోళకిమఠం (Circular Lodge) ప్రారంభదశలలో శక్తి ఆరాధనకు, తాంత్రిక విద్యలకు నిలయంగా ఉండేదనే ఒక అభిప్రాయం కలదు.
గోళకిమఠానికి మూడులక్షల గ్రామాలను దానం చేసిన కాలచూరి రాజులు పదోశతాబ్దంలో (975-1025 క్రీశ) జబల్ పూర్ లో నిర్మించిన Chausath Yogini Temple/Bhedaghat temple ఈ వాదనకు సాక్ష్యంగా నిలుస్తుంది. (చూడుడు: గోళాకార యోగిని ఆలయ ఫొటో)
ఈ ఆలయంలో శివుడు, దుర్గమాత, అరవైనాలుగు యోగినిలు కొలువై ఉన్నారు. యోగినుల విగ్రహాలు శృంగారోద్దీపన కలిగించే విధంగా ఉంటాయి. ఈ ఆలయంలో- తాంత్రిక విద్యలుగా భావించబడే మూలాధార చక్రం, కుండలిని స్థానాల ఆధారంగా వివిధ యోగినిల పేరుతో అరవై నాలుగు ఆలయగదులు ఉన్నాయని, ఇవన్నీ తంత్రసాధనకొరకు ఉపయోగపడి ఉండొచ్చని RK Sharma అభిప్రాయపడ్డాడు. (Kiss of the Yogini by Gordan White)
****
గోళకిమఠం ఎలా ప్రారంభమైనా దాని కల్ట్ ఒక గొప్ప రాజకీయ సామాజిక మార్పులకు ఆధారమయ్యిందనేది ఒక చారిత్రిక సత్యం.
గోళకి మఠం ఉత్తరాదిలో స్థాపించబడినదైనప్పటికీ రాజకీయ ఒడిదుడుకుల వల్ల క్రమక్రమంగా దక్షిణాదివైపుకు జరుగుతూ వచ్చింది.
అలా కర్ణాటక, కేరళ, తమిళ ఆంధ్రదేశాలలో విస్తరించినపుడు ఇక్కడి శైవ సంప్రదాయాన్ని ప్రభావితం చేసి ఒక ప్రత్యేకమైన "Golaki School of Shaivism" గా రూపాంతరం చెందింది.
శైవం లోని దుష్ట సంప్రదాయాలను (అఘోరాలు, శక్తి ఆరాధన, శారీరిక హింస, యోగినీ ఆరాధన లాంటివి) క్రమక్రమంగా వదిలించుకొని ఈ సమాజంలోని ప్రజలందరూ సమానమేననే సిద్ధాంతాన్ని ఉద్భోదించిన ఒక ఉత్తమ మత సంప్రదాయంగా గోళకిమఠాన్ని నేడు గుర్తించవచ్చు.
కృష్ణదేవరాయుల కాలంలో గోళకి మత సాంప్రదాయం హిందువులను అప్పటి ఉమ్మడి శతృవులకు వ్యతిరేకంగా ఏకీకృతం చేయటంలో సహాయపడింది.
శివదీక్ష తీసుకొన్న ప్రజలందరూ దేవుడిముందు సమానమే అని చెప్పిన హిందూశాఖ ఈ గోళకిమఠం. మరి అంతటి గొప్ప ప్రభోధనలనుండి మరలా ఇంతదూరం ఎందుకు జరిగిపోయామో ప్రతిఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం.
Uploading: 1100096 of 1100096 bytes uploaded.






రిఫరెన్సులు
1. Kriya Sakti Vidyaranya by T.N Mallappa)
2. Kiss of the Yogini by Gordan White
3. http://mahavarnam.blogspot.com/2010/03/blog-post_05.html
4. వికిపిడియ
బొల్లోజు బాబా

తెలుగునాట జైన బౌద్ధాలను అణచివేసిన రాజు – ముక్కంటీశ్వరుడు


Bolloju Baba
23 March ·



తెలుగునాట జైన బౌద్ధాలను అణచివేసిన రాజు – ముక్కంటీశ్వరుడు
ముక్కంటీశ్వరుడు అనే రాజు ప్రస్తావన వివిధ మెకంజీ కైఫియత్ లలో కనిపిస్తుంది. తెలుగునేలపై విలసిల్లుస్తున్న జైన మతాన్ని సమూలంగా నిర్మూలించటంలో భాగంగా, అనేక వేలమంది జైన బ్రాహ్మణులను ఈ ముక్కంటీశ్వరుడు చంపించాడని వివిధ కైఫియత్ లు చెపుతున్నాయి. ఇతను అయిదో శతాబ్దంలో నెల్లూరునుంచి కృష్ణా వరకూ గల ఆంధ్రప్రాంతాన్ని పరిపాలించాడు. ఇతనికి సంబంధించిన శాసనాధారాలు చాలా తక్కువ. కొంతమంది చరిత్రకారులైతే అసలీ పేరుగల రాజే లేడని, అదొక పురాణ పాత్ర అని కొట్టిపడేసారు కూడా. మరికొందరు ఇతను సాతవాహన వంశస్థుడని మరికొందరు పల్లవరాజని అభిప్రాయపడ్డారు. ఇతనికే త్రిలోచన పల్లవుడు, త్రినయన, త్రినేత్ర ఇంకా ముక్కంటి అనే వివిధ పేర్లు కలవు.
 
తెలుగునేలను పాలించిన రాజులలో ఈ ముక్కంటీశ్వరుడిని అత్యంత వివాదాస్పదుడుగా భావించవచ్చు. ఇతని తండ్రి పేరు ఎక్కడా కనిపించదు. తల్పగిరి గ్రామ కైఫియత్తు ద్వారా ఇతను శివానుగ్రహం వల్ల ఒక బ్రాహ్మణ కన్యకు జన్మించాడని తెలుస్తుంది. అకస్మాత్తుగా తెర పైకి వచ్చిన శైవమతానికి చెందిన రాజు కావొచ్చు. ఇతను అధికారం చేపట్టే సమయానికి తెలుగునాట జైనం, బౌద్దం, ప్రధానమతాలుగా ఉండేవి. జైనులే అధికారం లో ఉండేవారని తెలుస్తుంది. శైవం ఇంకా వైదిక సాంప్రదాయపద్దతులను ఒంటపట్టించుకోలేదు. శూద్రులైన జంగములే పూజారులుగా ఉండేవారు. బహుసా అది క్రింది తరగతి ప్రజల మతం గా మనుగడ సాగిస్తూ ఉండవచ్చు.
అలాంటి రాజకీయ పరిస్థితులలో, హైందవేతర మత నేపథ్యంలో ముక్కంటి మహరాజు అధికారం చేపట్టి జైనులను ఊచకోత కోయించాడని, గానుగులలో వేసి తొక్కించాడని, బౌద్ధ బస్తిలను నేలమట్టం చేసాడని మెకంజీ కైఫియత్తులలో పదే పదే ప్రస్తావనలు కనిపిస్తాయి. ఉత్తరభారతదేశం నుంచి పెద్ద ఎత్తున బ్రాహ్మణులను రప్పించి వారికి అగ్రహారాలు, మాన్యాలు ఇచ్చి హిందూ మతాన్ని ఆంధ్రదేశంలో స్థిరీకరించే ప్రయత్నం చేసాడు. శైవాలయాలలోని శూద్రపూజారులను తొలగించి వాటిని హైందవీకరించి బ్రాహ్మణులకు అప్పగించాడు. వైష్ణవాలయాలను కట్టించాడు.
తెలుగువారి చరిత్ర లో ఇవేవీ సామాన్యమైన విషయాలు కావు. మతపరంగా, రాజకీయపరంగా తెలుగుజాతిని మలుపు తిప్పిన సందర్భాలివి. చరిత్రను విశ్లేషించేటపుడు పర్యవసానాలను పరిశీలించాలి తప్ప మంచి, చెడుల తీర్పులు చేయకూడదంటారు. ముక్కంటి చేసింది మంచా చెడా అన్న చర్చ అనవసరం. ముక్కంటి మహరాజు చేసిన చర్యలవలన తెలుగునేలపై జైన బౌద్ధాలు కనుమరుగయ్యాయనేది ఒక చారిత్రిక సత్యం. శైవ సంప్రదాయం హైందవీకరణకు (Sanskritization) గురయ్యింది. ఈ ముక్కంటి మహరాజు ఒకే వ్యక్తా లేక అనేకులా అనేది కూడా సందేహాస్పదమే!
 
చరిత్రకారులు ముక్కంటీశ్వరుని ఉనికిని ఒక పురాణపాత్రగా భావించటానికి కారణం- ఆధారాల లేమి, ఉన్న ఆధారాలలో పొంతనలేకపోవటమూ. ముక్కంటీశ్వరుడు అయిదో శతాబ్దానికి చెందిన చాళుక్యరాజైన విజయాదిత్యుని యుద్ధంలో సంహరించినట్లు తెలుగునాట లభించిన ఆధారాలు చెపుతున్నాయి. రెండో శతాబ్దానికి చెందిన కరికాల చోళుని చేతిలో ఓడిపోయి ఘోరంగా అవమానించబడినట్లు తమిళనాట లభించిన ఆధారాలు చెపుతున్నాయి. ఈ రెంటి మధ్యా కనీసం రెండు శతాబ్దాల అంతరం ఉండటం వల్ల ముక్కంటీశ్వరుడిని ఒక మిథికల్ పాత్రగా తేల్చారు కొంతమంది చరిత్రకారులు.
***
అయినప్పటికీ ముక్కంటీశ్వరుని చారిత్రికతకు అనేక ఆధారాలు లభిస్తాయి.
 
1. శాసనాలు
ముక్కంటి మహరాజు చేసిన దానాల కాల గడువు ముగిసిపోయాక తరువాత వచ్చిన రాజులు వాటిని పునరుద్దరణ చేసినట్లు వేయించిన శాసనాలు అనేకం కనిపిస్తాయి. వీటిలో మొదటిది పశ్ఛిమచాళుక్యరాజైన విక్రమాదిత్యుడు- ముక్కంటి మహరాజు చేసిన అన్నవరం గ్రామ దానం కొనసాగేలా క్రీశ 660 లో నెల్లూరులో ఒక శాసనం వేయించాడు.
అదే విధంగా కేత మహారాజు - ముక్కంటి మహరాజు సప్తరుషుల పేర్లమీదుగా చేసిన (కారసాల కైఫియత్తు) దానాలను పునరుద్ధరణ చేస్తున్నట్లు క్రీశ. 1197 లో వేయించిన శాసనం ముక్కంటి చారిత్రికతను నిర్ధారించే అతి ముఖ్యమైన శాసనము.
భీమనాయకుడు, మహామండలలీకుడు, అల్లాడ సుద్ధదేవుడు లాంటి వివిధ చిన్న చిన్న రాజులు తాము ముక్కంటి మహరాజు వారసులమని ద్రాక్షారామ ఆలయ శాసనాలలో చెప్పుకొన్నారు.
ముక్కంటి మహరాజు నుండి కృష్ణకు దక్షిణాన కల ఆరువేల గ్రామాలను దానంగా పొందినట్లు- మల్లరాజు, కోటరాజులు, ఒకేరకమైన శాసనాలను కలిగి ఉండటం చరిత్రకారులను తికమక పెట్టే ఒక అంశం.
త్రిలోచన పల్లవుడు, తెనాలిలో జైన వసతిని నిర్మూలించి, ఆ ప్రదేశంలో ముక్కంటి రామలింగేశ్వర ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తుంది. నేటి రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో వర్ధమాన మహావీరుని ప్రతిమ దొరకడం ఆ అంశాన్ని బలపరుస్తున్నది. (''ఆంధ్రదేశంలో జైన, బౌద్ధ మతాలు'' గ్రంథం నుండి, రచన ప్రొ||బి.ఎస్‌.ఎల్‌. హనుమంతరావు, పేజీ 145)
ముక్కంటి అనే పల్లవరాజు తనతో పాటు మంచి, కొండ అనే ఇద్దరు నాయకులను వెంటతెచ్చుకొన్నాడు. వీరిద్దరు మంచికొండ అనే పట్టణాన్ని నిర్మించారని, వీరి వంశస్థులకు మంచికొండ గోత్రనామంగా స్థిరపడిందని శ్రీరంగం తామ్రపత్రాలద్వారా తెలుస్తున్నది. (history of the reddi kingdoms, M. Somasekhara Sarma)
 
2. సాహిత్యం
కరికాల చోళుడు క్రీస్తు శకం రెండో శతాబ్దం నాటి తమిళ చోళ రాజు. ఇతను హిమాలయాలవరకూ తన సామ్రాజ్యాన్ని విస్తరించాడని అంటారు. సాగునీటికోసం కావేరి నదిపై కల్లణై అనే ఆనకట్ట నిర్మించాడు. ఇది నేటికీ పనిచేస్తూ ఉన్న ప్రపంచంలోని రెండవ అత్యంత పురాతనమైన ఆనకట్టగా పేరుతెచ్చుకొంది. దీనిని బ్రిటిష్ వారు పంతొమ్మిదో శతాబ్దంలో రినోవేట్ చేసారు.
కరికాల చోళుడు కల్లణై ఆనకట్ట నిర్మించే సమయంలో సమీప సామంతులను, రాజులను వచ్చి సహాయపడమని ఆజ్ఞాపించాడు. ధరణికోటను కేంద్రంగా చేసుకొని రాజ్యం చేస్తున్న ముక్కంటి మహరాజు నేను అతనికి బానిసను కాను అని ఎదురితిరిగితే, కరికాల చోళుడు అతని గర్వాన్ని అణచి అతనితో తట్టలతో మట్టి మోయించినట్లు ఒక నేరేటివ్ అనేక కావ్యాలలో కనిపిస్తుంది. ఈ కథనాన్ని జయంగోండన్, ఇరంగేశ వేంబ లాంటి తమిళ కవులు, పండితారాధ్యచరిత లో పాల్కురికి సోమనాథుడు తమరచనలలో ప్రస్తావించారు.
 
3. మెకంజి కైఫియత్తులలో ముక్కంటి మహరాజు
అనూచానంగా చెప్పబడుతూ వస్తున్న విషయాలకు సరైన ఇతర ఆధారాలు లేనిదే చరిత్రకారులు పరిగణలోకి తీసుకోరు. కాలిన్ మెకంజీ సేకరించిన కైఫియత్తులను యధాతథంగా తీసుకోవటానికి చాలామంది చరిత్రకారులు సందేహిస్తారు. అయినప్పటికీ మెయిన్ స్ట్రీమ్ చరిత్రలో కనిపించని అనేక విషయాలు వీటిద్వారా తెలుస్తాయి.
క్రిందచెప్పబడిన కైఫియత్తులలోని మాయాపాదుకలు, మూడోకన్ను లాంటి కొన్ని విషయాలు మిథికల్ గా అనిపించినా వాటిద్వారా దేనినో మెటఫోరికల్ గా చెప్పటానికి ప్రయత్నిస్తున్నట్లు భావించాలి. ఉదాహరణకు ముక్కంటి ఈశ్వరానుగ్రహంతో ఒక బ్రాహ్మణ కన్యకు పుట్టాడని చెప్పే కథనం ద్వారా ఇతను బహుసా ఏదో పల్లవరాజు ఉంపుడు కత్తెకు పుట్టి ఉండవచ్చని కనుక తండ్రి పేరు చెప్పుకోలేని పరిస్థితి అయి ఉంటుందని అంటారు చరిత్రకారుడు ఎం. వెంకట రమణయ్య.
ముక్కంటీశ్వరుని గురించిన ఈ సమాచారం అంతా కడప, కర్నూలు, నెల్లూరు, క్రిష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల కైఫీయత్తులలో ఎక్కువగా కనిపించటం గమనార్హం.
 
*. బందరు కైఫియత్తు:
ముక్కంటి మహరాజు నిర్మించిన బందరు పట్టణ శివాలయాలలో జంగం వారు పూజారులుగా ఉండేవారు. వారు వైదిక సంప్రదాయానికి విరుద్ధంగా పూజలు నిర్వహించేవారు. ముక్కంటి మహరాజు ఆ జంగములను తొలగించి బ్రాహ్మణులను నియమించి వైష్ణవాలయాలలో వలే వేదనియమానుసారం పూజలు జరిపించమని ఆజ్ఞాపించాడు.
*జల్లూరు కైఫియత్తు:
చాళుక్యరాజైన విజయాదిత్యుడు తన చతురంగబలాలతో దిగ్విజయయాత్ర జరుపుతున్నప్పుడు, పశ్చిమదేశమందు త్రిలోచనపల్లవుడితో తలపడి విధివశాత్తు మరణించెను. ఆ సమయంలో విజయాదిత్యుని భార్య ఆరునెలల గర్భవతి. ఈమె “ముడిలేము” అనే అగ్రహారమునకు పోయి అక్కడి వాస్తవ్యుడు అయిన విష్ణుభట్ట సోమయాజి అనే ముని సంరక్షణలో విష్ణువర్ధనుడు అనే కుమారుడిని కన్నది.
* చందవోలు కైఫియత్తు:
కావేరి నదిపై ఆనకట్ట కట్టిన కరికాల చోళుడు ముక్కంటీశ్వరుని, ఇతర రాజులను జయించాడు.
*పల్లి కులం పుట్టుపూర్వోత్తరాలు కైఫీయతు:
కరికాల చోళుడు కావేరినదిపై ఆనకట్ట కడుతున్న సమయములో వివిధ ప్రాంతాలను ఏలే రాజులను ఆ నిర్మాణానికి సహాయపడ వలసినది అని ఆజ్ఞాపించాడు.
అప్పట్లో ధరణి కోటలో అమరేశ్వర మహాప్రసాదంబున నుదుట కన్నుగలిగిన ముక్కంటీశ్వరుండనే రాజు వద్దకు కరికాల చోళుని భటులు వచ్చినపుడు "నేను మూడు కన్నులు కలిగిన వాడను, రెండుకన్నులు కలిగిన వాడికి (కరికాలునికి) ఎందుకు వెట్టి చేస్తానని" ఆగ్రహించి పలికెను. ఈ విషయాన్ని ఆ భటులు కరికాలునికి విన్నవించినపుడు అతడు ముక్కంటీశ్వరుని ఆకారమును నేలపై వ్రాయించి, బొటనవ్రేలుతో నుదుటకన్నును ద్రొక్కిన అక్కడ అతని కన్ను రక్తంబు మెరుగ దర్పంబుమాని వచ్చి వెట్టి చేసెను.
*చౌడేశ్వరీ నందవరీకుల సారాంసం కైఫియతు:
త్రిలోచనమహారాజు గంగాస్నాన నిమిత్తమై వారణావర్తమునకు పోయి యుండగా స్నానకాలమందు అనేక బ్రాహ్మణ్యులు వచ్చి తమకు ఒక అగ్రహారం కావలెనని యాచించగా, వారిని మహారాజు మీకు ఏ సీమలో కావలెను అని అడుగగా, వారు శ్రీశైల ప్రాంత్యమునందు కావలెనని యాచించినారు.
పిమ్మట పద్దెనిమిది గోత్రాలకు చెందిన నూట ఎనిమిదిమంది ఆ బ్రాహ్మణులను త్రిలోచన మహారాజు తన వెంటబెట్టుకొని శ్రీశైల పర్వతసమీపములో, అహోబిల నరసింహాలయనకు పశ్చిమభాగమునందు కల అరణ్యములను నరికించి గ్రామనిర్మాణము చేయించి, అక్కడ ముక్కంటీశ్వరుడు అనే యీశ్వరదేవాలయము కట్టించి ఆ ఊరికి త్రిలోచన పురమనే నామధేయము చేసి, నూట ఎనిమిది వృత్తులవారిని అమర్చి ఆ గ్రామమును ఆ బ్రాహ్మణులకు దానమిచ్చెను.
*సంతరావూరు-శాసనములు కైఫియత్తు:
ఇది ప్రకాశం జిల్లా సంతరావూరు గ్రామానికి చెందిన కైఫియత్తు. ఈ ప్రాంతమున జైనులు ప్రాలులై (మంగళకరముగా) చాలాదినములు ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. అటుపిమ్మట యీశ్వరాంశం చేతను ముక్కంటి మహారాజు- జైనులను, బౌద్దులను, చార్వాకులను తరిమివేసి, వారి రాజ్యములను జయించి, దివ్యప్రభావ సంపన్నుడై యోగవాగములు గ్రహించి, గంస్నానమున్ను, విశ్వేశ్వర ఆరాధనలు చేస్తూ చాలా దినములు ప్రభుత్వము చేసెను.
*ఉప్పుటూరు (గుంటూరు) కైఫియత్తు:
ముక్కంటి మహారాజు వద్ద మాయాపాదుకలు ఉండేవి. వీటి సహాయంతో ప్రతీరోజు ధరణికోటనుండి కాశి వెళ్లి విశ్వేశ్వరుని దర్శించుకొని పూజచేసుకొని తిరిగి వచ్చేవాడట. ఒకరోజు అలా కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి బయటకు వచ్చేసరికి తన మాయాపాదుకలు కనిపించలేదట. తిరిగి తన రాజ్యానికి ఎలా చేరుకోవాలో తెలియని మహారాజు దుఃఖితుడై ఉండగా, కొంతమంది బ్రాహ్మణులు వచ్చి తమ యోగబలంతో ఆ మాయాపాదుకలను కనుగొని మహారాజుకు ఇచ్చారట. దీనికి సంతసించిన ముక్కంటి మహారాజు ఆ బ్రాహ్మణులను ధరణికోట రప్పించుకొని వారికి వందగ్రామాలను కలిగి ఉన్న ఉప్పుటూరు అనే అగ్రహారాన్ని సర్వమాన్యంగా ఇచ్చినాడు.
*మోటుపల్లి (కృష్ణా) కైఫియత్తు:
ముక్కంటి మహరాజు ధరణికోటను రాజధానిగా చేసుకొని పాలిస్తున్న కాలంలో, కొంతమంది బౌద్ధులు వచ్చి ద్వేలానగరం పేరుతో ఒక నగరాన్ని ఏర్పరచుకొని అక్కడ ప్రాకారంతో కూడిన ఒక బుద్ధుని ఆలయాన్ని నిర్మించుకొని నివసించుచున్నారు. ముక్కంటి మహరాజు తనరాజ్యంలో బౌద్ధులను నిర్మూలించే క్రమంలో ఈ ద్వేలానగరానికి వచ్చినపుడు దానిని ధ్వంసం చేసి, ఆ ప్రాంతానికి ముకుళానగరమని పేరు పెట్టి (మోటుపల్లి) అక్కడ కోదండరామస్వామి, మల్లికేశ్వరుల ఆలయాలను నిర్మించి బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. కొంతకాలానికి ఆ ప్రాంతం సముద్రంలో మునిగిపోయింది.
*కారసాల గ్రామ కైఫియత్తు:
చిల్కలూరిపాడు తాలుకా కారసాల గ్రామంలో కలియుగం ప్రవేశమైన తర్వాత జయినులు ప్రబలులై బస్తిలు ఏర్పరచుకొని దేశం యొక్క ప్రభుత్వములు ఆక్రమించుకొని అధికారం చేసే సమయమందు, కొంతమంది జయినులు ఈ కారసాల గ్రామం కట్టి నివాసం చేసిరి.
తదనంతరం రుద్రవరప్రసోదోద్భవులయినషువంటి ముక్కంటి మహారాజులుంగారు ప్రభుత్వానకు వచ్చి జయన బౌద్ధ చార్వాక మతస్తులను ఖిలపరచి గంగాతీరమందు వున్న బ్రాహ్మణులను యీ దేశానకు రప్పించి 700 అగ్రహారములిచ్చినారు. అంతే కాక సప్తరుషుల పేర్లు మీదుగా- వశిష్టస్థానంగా వుప్పుటూరు, కశ్యప స్థానంగా మగ్గిపురం, ఆత్రేయ స్థానంగా కారంచేడు, భరద్వాజ స్థానంగా సొలస, గౌతమ స్థానంగా గుంటూరు, జమదగ్ని స్థానంగా ఇనగల్లు ఇచ్చి ఈ కారసాల గ్రామమును విశ్వామిత్రుని స్థానంగా దానం ఇచ్చాడు. ఇక్కడ శ్రీలక్ష్మి నారాయణ స్వామి, లక్ష్మి నరశింహస్వామి, కేశవ స్వామి అనే మూడు విష్ణ్వాలయాలను, శ్రీ మల్లేశ్వరస్వామి వారనే లింగమూర్తిని ప్రతిష్టచేసి ఆలయములు కట్టించి, యీ గ్రామానకు ఉత్తరాన చెర్వు తవ్వించినారు.
*యాబుతి గ్రామ కైఫియత్తు:
సత్తెనపల్లి తాలుకాలో కల యాబుతు గ్రామం సమీపంలో పూర్వం బుద్ధ అనే పేరుతో బౌద్దుల బస్తీ ఉండెడిది. ఈశ్వరాంశశంభూతుడయిన ముక్కంటి మహరాజు జయిన, బౌద్ధాచార్యులను నిర్మూలించి దేశం స్వాధీనం చేసుకొని ప్రభుత్వం చేసినపుడు ఆ బస్తీ పాడుపడినది.
*రేటూరు (గుంటూరు) గ్రామ కైఫియత్తు:
ఈ గ్రామానికి ఈశాన్యమందు పూర్వము జయనులు రాజ్యము చేసేటపుడు కొండ్రాజుపాలెం అనే గ్రామం జయిన బస్తిగా ఉండేది. ముక్కంటి రాజ్యకాలమందు కాశీనుంచి వచ్చిన బ్రాహ్మణులకున్ను, జయినులకున్ను సిద్ధాంత వివాదములు జరిగినపుడు జయినులు హీనవాదులు (ఓడిపోయారు) అగుట వలన ఈ కొండ్రాజుపాలెం అనే జయిన బస్తి పాడయిపోయినది.
*అనంతవరం (గుంటూరు) కైఫియత్తు: మాధవవర్మ గతించినతరువాత ఈశ్వరానుగ్రహముతో ముక్కంటి జన్మించాడు. ఇతను తపోధన సంపన్నులైన బ్రాహ్మణులను దక్షిణభారతదేశానికి రప్పించి వారికి స్థిరనివాసములు కల్పించాడు. ఇతను జైనులను, బౌద్దులను, చార్వాకులను నిర్మూలించి ధరణికోటను, వరంగల్ ను కేంద్రంగా చేసుకొని పరిపాలన సాగించాడు.
***
చారిత్రికంగా ముక్కంటి/త్రిలోచన పల్లవ రాజుగురించిన సమాచారం పెద్దగా లభించదు. ఆ తరువాత వచ్చిన వివిధ శతృరాజులు పూర్వరాజుల ఆనవాళ్లను చెరిపేసే పద్దతి ఒకటి సహజంగానే ఉండటం దీనికి కారణం కావొచ్చు. అయినప్పటికీ ఈ మహరాజు గురించి ఈ క్రింది అంశాలను అంగీకరించవచ్చు
1. ముక్కంటి/త్రిలోచన పల్లవుడు అయిదో శతాబ్దాంతంలో తెలుగు నేలను ధరణికోటను కేంద్రంగా చేసుకొని పరిపాలించిన ఒక రాజు.
2. ఇతను తెలుగునాట ప్రబలంగా ఉండి జైన, బౌద్ధ, చార్వాక మతాలను అణచివేసి, వైదిక హిందూ మతాన్ని ప్రవేశపెట్టటానికి విశేషంగా కృషి చేసాడు. ఉత్తరాదినుంచి బ్రాహ్మణులను పెద్దఎత్తున రప్పించాడు. శైవుడైనప్పటికీ శైవ, వైష్ణవాలను సమాదరించాడు.
3. క్రీశ 486 లో ముక్కంటి మహరాజు, చాళుక్యరాజైన విజయాదిత్యుని యుద్ధంలో సంహరించి ఉండొచ్చని ఎన్. వెంకట రమణయ్య అభిప్రాయపడ్డారు.
4. ఈ ముక్కంటి మహరాజు కరికాల చోళుని సమకాలీనుడని చెప్పే ఒక గాథ "పల్లెకులం పుట్టుపూర్వోత్తరాలు" కైఫియత్తులో కనిపిస్తుంది. ముక్కంటి మహరాజు పాలించిన సమయంలో కరికాల చోళుడు అప్పటి ముక్కంటి రాజ్యాలైన నెల్లూరు, శ్రీశైలం ప్రాంతాలలో అడవులను నరికించి గ్రామాలను ఏర్పరచాడని తమిళ శాసనాలు చెపుతున్నాయి. బహుసా అనంతవరం, చందవోలు కైఫియత్తులలో చెప్పబడినట్లు ముక్కంటి మహరాజు కారవేలుని చేతిలో ఓడిపోయి అతనికి సామంతుగా వ్యవహరించి ఉండాలి.
ముక్కంటి మహరాజు కావేరినదిపై ఆనకట్టకట్టిన కరికాల చోళుని సమకాలీనుడా కాదా అనే అంశంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఎందుకంటే వీరిద్దరిమధ్యా కనీసం రెండు శతాబ్దాల అంతరం ఉంది. జర్నల్ ఆఫ్ ఆంధ్ర హిస్టారికల్ రీసర్చ్ సొసైటి వాల్యూమ్ 4 పే.నం 122 లో బి.వి.కె వ్రాసిన ఒక రివ్యూలో- ముక్కంటిని కరికాలచోళుని సమకాలీనులుగా అంగీకరిస్తే తమిళ సంగం యుగపు తేదీలన్నీ మొత్తం తలక్రిందులవుతాయి, కనుక చరిత్రకారులు అంగీకరించలేరు అంటాడు. చరిత్రకారులకు ఈ అంశం ఒక బండరాయి.
5. ఒకప్పుడు దుర్గమారణ్యాలుగా ఉండే తెలుగు ప్రాంతాలలోని అరణ్యాలను తొలగించి వ్యవసాయభూములుగా మార్చినందుకు ఇతనికి కాడువెట్టి (అడవులు నరికిన) ముక్కంటి అనే పేరుకూడా కలదు
6. చాలా కైఫియత్తులలో ముక్కంటి మహరాజు ధరణికోటను రాజధానిగా చేసుకొని పాలించినట్లు ఉంది, కానీ అనంతవరం కైఫియతులో వరంగల్ ను రాజధానిగా చేసుకొని కూడా పాలించినట్లు ఉండటాన్ని బట్టి ఇతను కృష్ణానదికి దక్షిణం వైపు మాత్రమే కాక దక్కనులో కూడా కాలుమోపాడని అనుకోవాలి.
( రానున్న నా తదుపరి పుస్తకం “తూర్పుగోదావరి జిల్లా- మెకంజీ కైఫియత్తులు” నుండి)
బొల్లోజు బాబా
సంప్రదించిన పుస్తకాలు
1. Trilochana pallava and karikala chola by N. Venkata ramanayya
2. History of the Tamils from the earliest times to 600 A.D by Srinivas Iyengar,P.T
3. A P Archives Kaifiyats R No 1083__pallikulam kaiphiyat
4. A P Archives Kaifiyats R No 1426_ చౌడేశ్వరినందవరీకుల సారాంసం
5. A P Archives Kaifiyats R No 1222_ సంతరావూరు
6. Mackenzie Vol 001_1963_ కారసాల, యబూతి
7. Journal Of The Andhra Historical Research Society,vol.vii,pt.1 To 4
8. ''ఆంధ్రదేశంలో జైన, బౌద్ధ మతాలు'' గ్రంథం , రచన ప్రొ||బి.ఎస్‌.ఎల్‌. హనుమంతరావు, పేజీ 145
9. వికిపీడియా
10. History of the Reddi kingdoms, M. Somasekhara Sarma

its a great memory

its a great memory..... "ఫ్రెంచిపాలనలో యానాం" పుస్తకావిష్కరణ 2012 లో...
ఈ పుస్తకాన్ని ఈ లింకునుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకొనవచ్చును

"యానాం ఉగాది ఉత్సవాలలో నా పుస్తకావిష్కరణ, శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి చే జరిగింది. నా పుస్తకంపై ప్రముఖ కవి, రచయిత శ్రీ దాట్ల దేవదానం రాజు గారు ప్రసంగించారు.  ఒక పెద్ద సభలో నాకొరకు పావుగంట సమయం కేటాయించిన యానాం ఎమ్మెల్యే శ్రీ కృష్ణారావు గారికి కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.  

(ఫొటోలో మధ్యలో తెల్ల డ్రెస్ లో ఉన్నది శ్రీ కృష్ణారావు, శ్రీ గిరిబాబు, శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ యండమూరి, శ్రీ పి.ఆర్. ఎల్. స్వామి )"

ఇద్దరు సితాఫ్ ఖాన్ లు

ఇద్దరు సితాఫ్ ఖాన్ లు
సీతాఫిఖానుడు, సీతాపతి, సీతడు, సీతాపతి రాజు అనే వివిధ పేర్లతో పిలువబడ్డ సితాప్ ఖాన్ గురించి రాజమహేంద్రవరం, బోయినపూడి, కిమ్మూరు కైఫీయత్తులలో వస్తుంది. ఈ కైఫీయత్తులన్నింటిలో సితాప్ ఖాన్ వృత్తాంతం దాదాపు ఒకే విధంగా ఉంటుంది. కొంత కల్పన, కొన్ని వాస్తవాల కలగలుపు అది.
చరిత్రలో మూడు చోట్ల సితాఫ్ ఖాన్ పేరును స్పష్టంగా పోల్చుకోవచ్చు.
1504 నాటి వరంగల్ శాసనంలోని షితాబు ఖాను. ఇతనే ఖుష్ మహల్ నందు దర్బార్ నిర్వహించేవాడు.
1516 లో శ్రీకృష్ణదేవరాయలను ఎదిరించిన చితాపుఖానుడు
1572 లో ఇబ్రహిమ్ కుతుబ్ షా (మల్కిభరాముడు) కాలంలో, రాజమహేంద్రవరం లో ఓడిపోయి పారిపోయిన సీతాఫిఖానుడు.
పై మూడు సందర్భాల కాలాలను గమనిస్తే మొదటి రెండు చోట్ల కనిపించే సితాఫ్ ఖానుడు ఒకవ్యక్తే కావచ్చని, రాజమహేంద్రవరంలోని సితాఫ్ ఖాన్ వేరే వ్యక్తి కావచ్చనేది స్పష్టమౌతుంది.
ఎందుకంటే 1504 నాటి శాసనంలోని సితాఫ్ ఖాన్ కు కల భార్యలలో దేవాంబికకు అవధూత ఖాన్, పురాంతక పేర్లతో ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరిలో పురాంతక అనే కొడుకు వివిధ యుద్ధాలలో అనేకమంది వీరులను సంహరించాడట. మరొక భార్య అయిన అనుమాంబ కు అమర, బోగి, రామ అనే ముగ్గురు కొడుకులు. వీరిలో పెద్దకొడుకు యుద్ధంలో చనిపోయాడట. ఈ వివరాలను బట్టి వరంగల్ శాసనం వేయించిన సితాఫ్ ఖాన్ వయసు నలభై- ఏభై ఏళ్ళ మధ్యలో ఉండొచ్చు. 1516 లో కృష్ణదేవరాయలితో యుద్ధం చేసే నాటికి ఇతనికి అరవై ఏళ్ల వయసు ఉండొచ్చు. అది సంభవమే కనుక వరంగల్ శాసనం వేయించిన సితాఫ్ ఖాన్, కృష్ణదేవరాయలతో యుద్ధం చేసిన సీతాఫ్ ఖాన్ ఒకడే అయ్యే అవకాసాలు ఎక్కువ.
ఇక 1572 లో ఇబ్రహిమ్ కుతుబ్ షా సమకాలీనుడిగా చెప్పబడిన రాజమహేంద్రవరం సితాఫ్ ఖాన్ ఖచ్చితంగా మరొక వ్యక్తి అయి ఉండాలి. ఇతను ఎవరనే ప్రశ్నకు సరైన చారిత్రిక సమాధానాలు కనిపించవు. వరంగల్ సితాఫ్ ఖాన్ ను 1512 లో Quli Qutb-ul-Mulk ఓడించాకా ఇతను ఒరిస్సా పారిపోయి గజపతి రాజుల వద్దకు వెళ్ళితలదాచుకొన్నాడు. బహుసా గజపతి రాజులవద్ద సేనాధిపతిగా కుదిరి ఉంటాడు. అందుకనే కృష్ణదేవరాయలు గజపతి రాజులపై దండెత్తి వస్తున్నప్పుడు నిలువరించటానికి వీరోచితంగా ప్రయత్నించాడు. ఆ యుద్ధంతరువాత ఇతని ప్రస్తావన ఎక్కడా వినిపించదు బహుసా ఆ యుద్ధంలో ఇతను చనిపోయి ఉండాలి.
1572 ల నాటి రాజమహేంద్రవరం సితాఫ్ ఖాన్ వరంగల్ సితాఫ్ ఖాన్ మనవడు అవటానికి అవకాశాలు కనిపిస్తాయి. తాత వలే తనుకూడా గజపతి రాజుల వద్దే కొలువులో ఉండి, సేవలందిస్తూ పేరుతెచ్చుకొని రాజమహేంద్రవరానికి అధికారిగా నియమితుడై ఉంటాడు.
***
I. వరంగల్ సితాఫ్ ఖాన్ హిందువా ముస్లిమా?
వరంగల్ శాసనాన్ని బట్టి సితాఫ్ ఖాన్ ను హిందువుగా పరిగణించాలి. ఎందుకంటే ఈ శాసనంలో – ఇతను భోగి (బోయి ?) కులానికి చెందిన వ్యక్తిగా చెప్పబడ్డాడు. ఇతని భార్యలు, పిల్లల పేర్లన్నీ హిందూ నామాలే. ముస్లిములు నాశనం చేసిన కృష్ణుని విగ్రహాన్ని (పాంచాలరాయుడు), కాకతీయుల కులదైవమైన కాకతి విగ్రహాన్ని తిరిగి పునప్రతిష్ట గావించాడని చెప్పబడింది. అంతే కాక శాసనం ఆఖరున ఏకశిలానగరంలో (వరంగల్) ఉన్న శివాలయములో నిత్యం పూజలు చేయటం వలన సితాఫ్ ఖాన్ కు ఇన్ని సుగుణాలు, ఐశ్వర్యాలు సిద్ధించాయి అని ఉంది.
Shitab Khan of Warangal అనే పుస్తకాన్ని వ్రాసిన Dr. Hirananda Sastri – సీతాఫ్ ఖాన్ హిందువని, ఇతను బోయకులానికి చెందినవాడు కావొచ్చునని అన్నారు.
దక్కను సుల్తానుల చరిత్రను వ్రాసిన ఫెరిష్టా సితాఫ్ ఖాన్ గురించి “ఖమ్మంమెట్టు రాజు, Fearless infidel (అవిశ్వాసి) అన్నాడు. 1829 లో ఫెరిస్టా రాతలను ఇంగ్లీషులోకి అనువదించిన Col. Briggs కు సితాప్ ఖాను ను హిందువుగా పరిగణించి అతని గురించిన ప్రస్తావనలను అన్నింటిని మూలంలో సితాప్ ఖాను అని ఉన్నప్పటికీ సీతాపతి (Seetaputty) గా అనువదించాడు.
సితాఫ్ ఖాన్ ఒరిస్సాకు చెందిన గజపతి రాజులకు సన్నిహితుడైన హిందువని, ముస్లిం రాజ్యంలో మనుగడకొరకు ముస్లిమ్ పేరు పెట్టుకొన్నాడని అంటారు మరికొందరు చరిత్రకారులు.
సితాఫ్ ఖాన్ హిందు ద్వేషిగా, చతుర్ముఖేశ్వర, ఇంకా ఇతర ఆలయాలను ధ్వంసం చేసినవాడిగా ఏకశిలానగర కైఫియత్తు లో ఉన్నది.
Glimpses of the Nizam’s Dominions (1898) లో Campbell, A. Claude వరంగల్ ను చేజిక్కించుకొన్న “మొదటి ముసల్మాన్” సితాఫ్ ఖాన్ అని పేర్కొన్నాడు.
బహుమని సుల్తానులకు సితాఫ్ ఖాన్ ఒక సామంతుగా ఉంటూ ఆ సామ్రాజ్యం కూలిపోతున్న సమయంలో హిందూ రాజుల ప్రాపకం సంపాదించుకొని వరంగల్, హనుమకొండ ప్రాంతాలకు తానొక స్వతంత్ర రాజుగా ప్రకటించుకొన్న renegade Musalman (ముస్లిం మతభ్రష్టుడు) అని అభిప్రాయపడతాడు col T.W. Haig తన Landmarks of the Deccan అనే పుస్తకంలో.
ఇలా పొంతన లేని ఆధారాల వల్ల సితాఫ్ ఖాన్ హిందువా, ముస్లిమా అన్న ప్రశ్నకు నేటికీ స్పష్టమైన సమాధానం లభించదు.
II. కృష్ణదేవరాయలను నిలువరించిన వరంగల్ సితాఫ్ ఖాన్
కృష్ణదేవరాయలు కళింగదేశంపై దండయాత్ర చేసిన సమయంలో 1516 లో సితాఫ్ ఖాన్ తన అరవై వేల మంది సైన్యంతో కృష్ణదేవరాయలును నిలువరించటానికి ప్రయత్నించాడనే విషయం “రాయవాచకం” లో ఇలా ఉంది.
//చితాపుఖానుడనేవాడు అరవై వేలు సింగ్గాణి రౌతులతోడట్టు కనుమ మార్గమున పొయ్యే రౌతు రాణువమీద చిత్త వాన గురిసినరీతి అమ్ముల గురియించ్చగా అంమ్ముల నుండ్డి తప్పించుకొనువారున్ను ఆయంమ్ములకు యెదురై నిలిచిన వారున్ను ముంద్దు వెనక తెలియక నిలిచిన వారున్ను ఆడాడ దిగ్బ్రమ పడివున్న వారున్ను యీరీతిని వుండ్డగా చితాపుఖానునికి యెదురులేదు గనక జగడం శేయగా ఆ సమయాన కర్నాటకం కైజీతం రౌతులు చితాపుఖానునికి పెడతలపోటుగా యిరుపార్శ్వాల కనమల పొడువున నెక్కి చితాపు ఖానుని వెనకదిక్కులకై వచ్చి సింగ్గాణులమతనున్ను, కడ్గముల చేతనున్ను బరిజీల చేతనున్ను వేటారు తునకలుగా నరకగా చితాపుఖానుని తెగలకు కనుమలో నిలువకూడక విరిగి పొరగ వెంబ్బడించ్చి తరుముకబోయి వారిని దుర్గంచొర దోలి తిరుగా వచ్చిరి.// (రాయల సైన్యం అడవిమధ్యలో వెళుతుండగా అకస్మాత్తుగా సితాఫ్ ఖాన్ సైన్యం బాణాల వాన కురిపిస్తే మొదట్లో కంగారు పడ్డ రాయల సైన్యం, కొండలపైకెక్కి సితాఫ్ ఖాన్ సైన్యంపై బాణాలతో, బరెసెలతో దాడిచేసి వారిని తునకలుగా నరికి, సుదూరంగా తరిమివేసిందట)
రాయలను కళింగవైపు రాకుండా అడ్డుకోవటానికి కటకం గజపతి రాజుల ఆదేశాలతో, సితాఫ్ ఖాన్ ఈ దాడి చేసి ఉండొచ్చు. ఈ దాడి తరువాత సితాఫ్ ఖాన్ వివరాలు ఎక్కడా కనిపించకపోవటాన్ని బట్టి రాయల సైన్యం ఎదురుదాడిలో వరంగల్ సితాఫ్ ఖాన్ మరణించి ఉంటాడని భావించవచ్చు.
III. రాజమహేంద్రవరం సితాఫ్ ఖాన్
కటకంలో సింహాసనం అధిష్టించి పాలిస్తున్న ముకుందదేవు గజపతి మేనల్లుడైన రాజవిద్యాధరుడు, సీతాభిఖానుడు కలిసి రాజమహేంద్రవరాన్ని కేంద్రం గా చేసుకొని ఆ ప్రాంతాన్ని పాలించేవారు.
తెలుగు కవులచే కీర్తించబడిన గోల్కొండ పాలకుడు ఇబ్రహిమ్ కుతుబ్ షా ఆదేశాలమీద అతని దండనాయకుడు, రుస్తుంఖాన్ పదివేలమంది అశ్వదళంతో 1572లో రాజమండ్రిని జయించటానికి వచ్చాడు. మొదటగా పెద్దాపురం (Pentapoor) కోటను ముట్టడించి వశపరచుకొన్నాడు. అక్కడ ఉన్న సీతాభిఖానుడు రాజపూడి కోటకు పారిపోయాడు. రుస్తుం ఖాన్ రాజపూడి కోటపై దాడి చేయగా, సీతాభిఖానుడు అక్కడనుంచి తప్పించుకొని రాజమండ్రి కోటను చేరుకొని అక్కడ ఉంటున్న విద్యాధరునితో కలసి రుస్తుం ఖాన్ సైన్యం పై ఎదురుదాడి చేయటం మొదలు పెట్టాడు. అలా నాలుగునెలల పాటు యుద్ధం జరిగింది. చివరకు సీతాపతి, విద్యాధరులు, రుస్తుం ఖాన్ తో సంధి కుదుర్చుకొని, విద్యాదరుడు కంశింకోటకు, సీతాపతి బీజానగర్ కు ప్రాణాలు దక్కించుకొని వెళ్ళిపోయారు.
రాజమండ్రి సీతాభిఖానుడి గురించి క్లుప్తంగా లభించే చారిత్రిక సమాచారం.
IV. మెకంజీ కైఫియత్తులలో వర్ణించబడిన సితాఫిఖానుడు
1. అవసరాల పెద్దిరాజు అనే బ్రాహ్మణుడి ఇంట సీతడు అనే ఒక శూద్రదాని కొడుకు దూడలు కాస్తూ ఉండేవాడు. ఒకనాడు సీతడు తాడిచెట్టునీడను పడుకొని ఉండగా ఒక పెద్ద సర్పము తనపడగను విప్పి అతనిపై ఎండపడకుండా గొడుగుపట్టటం పెద్దిరాజు చూసి, వీడు ఏనాటికైనా గొప్ప అదృష్టవంతుడు అవుతాడని ఊహించి ఆరోజునుంచి అతనితో దూడలు కాయించటం మాని విద్యలు చెప్పించటం మొదలెట్టాడు.
2. అలా విద్యలు నేర్చుకొన్న సీతడు ఓరుగల్లు వెళ్ళి సైన్యంలో చేరి చురుకుగా పనిచేస్తూ ప్రభువు ఆదరణకు పాత్రుడైనాడు. సీతడు సీతాఫిఖానుడు అనే బిరుదు పొందాడు.
3. కొన్నాళ్ళకు ఓరుగల్లుని తురకలు ఆక్రమించుకోగా, సీతాఫిఖానుడు ఓరుగల్లు విడిచి కటకం చేరాడు. అక్కడి గజపతి ముకుందదేవుని విశ్వాసం చూరగొనటంతో ఆయన సీతాఫిఖానుడికి రాజమహేంద్రవరం సంరక్షణా బాధ్యతలను అప్పగించాడు.
4. సీతాఫిఖానుడు రాజమహేంద్రవరం వచ్చి, తనకు చిన్నతనంలో సహాయం చేసిన అవసరాల పెద్దిరాజును పిలిపించి అతనికి దివానుగిరీ ఇచ్చి రాజమహేంద్రవరాన్ని గజపతిరాజు ప్రతినిధిగా పాలించటం మొదలెట్టాడు.
5. వీరిద్దరికి పొరపొచ్చాలు రావటంతో పెద్దిరాజు కనుగుడ్లు పీకించాడు సీతాఫిఖానుడు.
6. గుడ్డివాడైన పెద్దిరాజు పల్లకిలో రాజమహేంద్రవరం నుండి గోలకొండకు పోయి అక్కడ విభురాం పాదుషా (ఇబ్రహిమ్ కుతుబ్) గారిని దర్శించుకొని, సీతాఫిఖానుడు తనకు చేసిన అన్యాయాన్ని చెప్పుకొని, తనకు సైనిక మద్దతు ఇచ్చినట్లయితే రాజమహేంద్రవరం కోటను మీ పరం చేస్తాను అని విన్నవించుకొన్నాడు. దీనికి పాదుషా గారు అంగీకరించి, పెద్దిరాజుకి సహాయంగా పటాలాన్ని పంపించాడు.
7. గోల్కొండ నవాబు సేనలు 1572 క్రీ.శ. లో రాజమహేంద్రవరం కోటను ముట్టడించినపుడు సీతాఫిఖానుడు వారి ధాటికి తాళలేక కోట విడిచి పారిపోయాడు.
8. రాజమహేంద్రవరం నుంచి పారిపోయి తోటపిల్లి అడవిలో దాక్కొన్న సీతాఫిఖానుడిని తురకసైన్యం పట్టుకొని తలనరికి చంపేసారు. (బోయినపూడి, రాజమహేంద్రవరం, కిమ్మూరు కైఫీయతులు)
***
V. మెకంజీ కైఫీయత్తులు మౌఖిక సాంప్రదాయంలో భద్రపరచబడిన చరిత్ర. నిజానికి సితాఫ్ ఖాన్ కు సంబంధించి మెయిన్ స్ట్రీమ్ చరిత్రే అష్టవంకరలు పోయిన పరిస్థితి ఉంది. అలాంటపుడు కైఫియత్తులలో నిర్ధిష్టమైన తారీఖులు, పేర్లు ఉంటాయని ఆశించలేం.
పై ఎనిమిది పాయింట్లను గమనిస్తే…
మొదటి పాయింటులో కనిపించే పాము పడగ విప్పి నీడపట్టటం అనే కథనం ఒక వ్యక్తి దైవాంశసంభూతుడు అని చెప్పటానికి ఉద్దేశించబడే ఒక మెటాఫర్. ఇది సర్వాయి పాపన్న, ముమ్మిడివరం బాలయోగి లాంటి వ్యక్తుల జీవితచరిత్రలలో కూడా కనిపిస్తుంది.
రెండు మూడు పాయింట్లలో ఈ కైఫియత్ వ్రాయసగాడు వరంగల్ సీతాఫ్ ఖాన్ , రాజమండ్రి సీతాఫ్ ఖాన్ ల చరిత్రను కలగాబులగం చేసినట్లు అనిపిస్తుంది.
అయిదు, ఆరు, ఎనిమిది పాయింట్లలో చెప్పబడిన కథనాలు పూర్తిగా స్థానీయమైనవి.
ఇవి విశ్వసనీయంగా ఉంటూ ఇతర చారిత్రిక సంఘటనలతో సరిపోతూంటాయి. ప్రధానస్రవంతి చరిత్రలోకి ఎక్కని ఇలాంటి వందలకొలదీ సంఘటనలు కైఫీయత్తులలో దొరుకుతాయి. వీటికోసమైనా కైఫీయత్తులను అధ్యయనం చేయాలి.
( రానున్న నా తదుపరి పుస్తకం “తూర్పుగోదావరి జిల్లా- మెకంజీ కైఫియత్తులు” నుండి)Image may contain: Bolloju Baba, text
బొల్లోజు బాబా
సంప్రదించిన పుస్తకాలు
1. Shitab Khan of Warangal - Dr Hirananda Sastri
2. Andhra Pradesh District Gazetteers: East Godavari
3. Historic Land Marks Of The Deccan by Lt. Col. T. W. Haig
4. The Qutb Shahi Kings of Golconda by S. Hanumanth Rao (Essay)
5. రాయవాచకము- సివి రామచంద్రరావు
6. History Of The Rise Of The Mahomedan Power In India Vol. 3 by Briggs, John
7. Warangal inscription of Annul Report Of The Archaeological Department Of His Highness The Nizams Dominions 1934-35 p.no 33
8. Inscribing the Self: Hindu-Muslim Identities in Pre-Colonial India - Cynthia Talbot

అనితర సాధ్యుడు ఆరుద్ర


గతపదేళ్ళుగా యూరోపియన్ రీసర్చర్స్ బ్రిటిష్ మ్యూజియం లో ఉన్న కాలిన్ మెకంజి సేకరణలపై పుస్తకాల మీద పుస్తకాలు తీసుకొస్తున్నారు.
గొప్ప రీసర్చ్ జరుగుతోంది.
ఇటీవల కాలిన్ మెకంజి గురించి నెట్ లో వెతుకుతూంటే - మెకంజి సేకరించిన రోమన్ నాణాలగురించి పరిశోధన చేస్తున్న Sushma Jansari అనే ఆవిడ బ్లాగ్ (https://thewonderhouse.co.uk/) కనిపించింది. తన రీసర్చ్ లో భాగంగా ఈమె 2017 లో మెకంజి పుట్టిన ఊరైన Stornoway కు వెళ్ళినప్పుడు అక్కడ తను చూసిన మెకంజీ కుటుంబసభ్యుల సమాధి మందిరాన్ని, జ్ఞాపికా ఫలకాలను గురించి వ్రాసిన వ్యాసాలు కనిపించాయి.
మెకంజీ కలకత్తాలో చనిపోయినా అతను పుట్టిన ఊరిలో అతని అక్క వేయించిన జ్ఞాపికా ఫలకాలు రెండువందల ఏళ్ళ తరువాతకూడా పదిలంగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది.
ఆ ఫొటోలను ఎక్కడో చూసినట్లు అనిపించి ఆరుద్ర సమగ్రాంధ్రసాహిత్యం పుస్తకం తిరగేస్తే - ఆ మహాను భావుడు నలభై ఏళ్లక్రితమే అక్కడకు వెళ్ళి ఆ వివరాలు మనకు అందించారు.
ఆరుద్ర ను మనం పునర్ నిర్వచించుకోవాల్సిన సమయం వచ్చిందేమో అనిపిస్తూంది.
బొల్లోజు బాబాImage may contain: 1 person, standingImage may contain: plant, tree and outdoorImage may contain: one or more people, people standing, sky, outdoor and textImage may contain: cloud, sky, grass, plant, outdoor and nature

కరోనా పద్యం

కరోనా పద్యం
కొన్ని పుస్తకాలు
జీవితాన్ని కొత్తగా చూపిస్తాయి
నిర్మానుష్య ద్వీపాంతరవాసంలా
నౌకాభంగపు అంతర్యానంలా
పుస్తకం చివరి పేజీకి చేరుకొన్నాక
కొన్ని వాక్యాలో లేక ఉద్వేగాలో
కొమ్మచివర వేలాడే పిట్టగూడులాంటి
చిక్కని అల్లికతో
హృదయాన్ని పెనవేసుకొంటాయి.
జోళ్ళు విప్పి ఇంట్లోకి రమ్మనే
అమ్మ జ్ఞాపకాలు
చేతులు కడుక్కొని అన్నం తినమనే
నాన్న మందలింపులు
వాక్యాలై, ఉద్వేగాలై ప్రవహిస్తాయి
నీటిపై పొడవైన కాళ్లతో
సాలీడల్లే నడిచిపోయే కాలం
ఇదే నా చివరి పేజీ అని ఏనాడూ చెప్పదు
మనమే గ్రహించాలి.
బిడ్డ ఆకలెరిగి రైక విప్పి నోటికి
స్తన్యం అందించే తల్లిలా
ఎవరి జీవితాలను వారిపుడు
భద్రంగా చేతుల్లోకి తీసుకొని
కాపాడుకోవాల్సిన సమయమిది.
బొల్లోజు బాబా

రుద్రమదేవికి అసలు వివాహం అయ్యిందా?


రుద్రమదేవి కాకతీయ పదమూడవ శతాబ్దంలో సుదీర్ఘకాలంపాటు పాలించిన సామాజ్ఞి. గణపతిదేవుని తరువాత ఈమె రాజ్యనిర్వహణ బాధ్యతలను చేపట్టింది. ఈమె వ్యక్తిగత జీవితం అంటే ఎక్కడ పుట్టింది, తల్లిదండ్రులు, భర్త వివరాలు లాంటి సమాచారం చాలా తక్కువగా లభిస్తుంది. ఈమె వేయించిన శాసనాలు కూడా స్వల్పం. అందువల్ల రుద్రమదేవి గురించి అనేక పరస్పర విరుద్ధమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది ఈమె వివాహం గురించి.
అక్కడక్కడా లభిస్తున్న శాసనాలను బట్టి రుద్రమదేవి భర్త పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చాళుక్య వంశజుడైన వీరభద్రా అని చాలా మంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.
***
I రుద్రమదేవి వీరభద్రుని భార్య అని చెప్పే శాసనాలు
ఎ. తణుకు తాలూక సోమేశ్వరాలయములో లభించిన 1258 సంవత్సరానికి చెందిన ఒక అసంపూర్ణ శాసనములో- రుద్రమ మహాదేవిని పెండ్లాడిన చాళుక్య వంశ వీరభధ్రేశ్వరుని యొక్క మంత్రిగా చెప్పుకొన్న విష్ణు అనే వ్యక్తి అఖండదీపారాధన ఏర్పాటు చేసినట్లు ఉంది (740 of 1920)
బి. పాలకొల్లు క్షీరారామ ఆలయంలో లభించే శాసనంలో (509 of 1893) వీరభద్రా కుటుంబము గురించి కొంత సమాచారం లభిస్తుంది. ఇది 1266 నాటిది. ఇందులో విష్ణువర్ధుని(Mahadeva I) కొడుకైన ఇందుశేఖరుని కుమారుడైన వీరభద్రా తన తల్లి అంబ పేరిట దీపదానం చేసినట్లు చెప్పబడింది. అంతకు మించి వివరాలు తెలియరావు.
సి. Hyd Arch. Series 18 నంబరుతో ఉన్న కొలనుపాక శాసనంలో గణపతిదేవుని కూతురైన రుద్రమదేవికి సర్వజనరంజకంగా వీరభద్రా భర్త అయ్యాడని; ఇతడు ఇందుశేఖరుని పెద్దకుమారుడని; ఈ ఇందుశేఖరుడు మహదేవరాజు, లక్కాంబల పుత్రుడని స్పష్టంగా ఉంది. కొలనుపాకలో ఒక పంటకాలువ తవ్వించిన సందర్భంగా ఇందుశేఖరుని సేవకుడైన పోతినాయకుడు ఈ శాసనాన్ని వేయించినట్లు తెలుస్తుంది.
రుద్రమదేవి వీరభద్రా లు దంపతులని తెలిపే అత్యంత ముఖ్యమైన శాసనం ఇది. ఎందుకంటే ఇందులో రుద్రమదేవి గణపతిదేవుల ప్రస్తావన, వీరభద్రా తల్లిదండ్రుల వివరాలు ఉన్నాయి. వీరు బహుశా కాకతీయులకు సామంతులు కావొచ్చు. అయితే దీని కాలం తెలియరాదు. (1279? ఖండవల్లి లక్ష్మి రంజనం)
II వీరభద్రా అతని కుటుంబ వివరాలు
Mahadeva I వేంగిని పాలిస్తున్న చాళుక్య వంశరాజు. ఇతనికే విష్ణువర్ధనుడు అనే పేరుకూడా కలదు. ఇతను నిడదవోలు కేంద్రంగా చేసుకొని ప్రస్తుత పశ్ఛిమగోదావరి జిల్లా ప్రాంతాన్ని 1266-1300 మధ్య పాలించాడు. ఇతను కాకతీయులతో సత్సంభంధాలను కలిగి ఉన్నాడు.
1266 లోని పాలకొల్లు శాసనాన్ని బట్టి ఈ మహదేవుని కొడుకు ఇందుశేఖరుడని, కోడలు అంబ యని, మనుమని పేరు వీరభద్రా అని తెలియుచున్నది. కొలను పాక శాసనం ద్వారా ఇతని భార్యపేరు లక్కాంబ అని తెలుస్తున్నది. ఇందుశేఖరుడు క్రీశ 1300 నుండి 1306 వరకూ నిడదవోలు కేంద్రంగా పరిపాలించాడు. వీరభద్ర పాలనా వివరాలు తెలియరావు.
Mahadeva I క్రీశ 1300 లో చనిపోయేనాటికి (గరిష్టంగా) తొంభై ఏండ్లు అనుకొంటే అతను 1210 లో పుట్టి ఉండాలి. ఇతనికి 1230 లో ఇందుశేఖరుడు పుట్టాడనుకొంటే, అతనికి వీరభద్రా పుట్టేసరికి కనీసం 1250 అవుతుంది. అంటే పాలకొల్లు శాసనం వేయించిన 1266 నాటికి Mahadeva I మనవడైన వీరభద్రా వయసు సుమారు 16 సంవత్సరాలు ఉండవచ్చుననే ఊహ తర్కదూరం కాదు.
III. రుద్రమదేవి, వీరభద్రా వివాహం అసంభవం
ఇటీవల బయటపడ్డ చందుపట్ల శాసనం ఇంకా మేడి మల్కల్ శాసనాల ద్వారా, రుద్రమ దేవి 1289 లో తన 82 వ ఏట మరణించి ఉండవచ్చని డా. ద్యావనవల్లి సత్యనారాయణ వంటి చరిత్రకారులు నిర్ధారించారు. అంటే ఈమె 1207 ప్రాంతంలో పుట్టి ఉండాలి.
1266 నాటికి వీరభద్రా కు పదహారేండ్లయితే అప్పటికి రుద్రమదేవి వయసు 60 ఏండ్లు. లభిస్తున్న శాసనాధారాలను బట్టి రుద్రమదేవికి వీరభద్రాకు వివాహం జరిగి ఉండకపోవచ్చునని నిర్ధారించవచ్చును.
రుద్రమదేవి, వీరభద్రా లు దంపతులని చెపుతున్న తణుకు, కొలనుపాక శాసనాలు గణపతిదేవుడు కాని, రుద్రమదేవి కానీ వేయించినవి కావు. ఇతర సేవకులు వేయించటం గమనార్హం. బహుసా ఈ వీరభద్రా, కాకతి వంశీయులలోని రాణిరుద్రమను కాక రుద్రమ పేరుతో ఉన్న మరొక చిన్నదానను పెండ్లి చేసుకొని ఉండవచ్చు.
***
గణపతిదేవుడు 1240 లో వేంగిని జయించాడు. బహుసా ఇదే సమయంలో ఇతను వేంగిచాళుక్య వంశానికి చెందిన వీరభద్ర తో రుద్రమదేవి వివాహాన్ని జరిపించి ఉండవచ్చునని ప్రరబ్రహ్మ శాస్త్రి అభిప్రాయపడ్డారు. ఈ ఊహ కూడా సరైనది కాకపోవచ్చు.
JAHRS Vol 8 లో ఇవ్వబడిన Hyd Arch. Series. 17 నంబరు గల పమ్మి శాసనంలో 1236 నాటికే రుద్రమదేవి పరిపాలన చేస్తున్నట్లు చెప్పబడింది. అంటే రుద్రమదేవి 1236 నుంచే గణపతి దేవునితో కలిసి రాజ్యపాలనలో పాలుపంచుకొంటూ, తర్ఫీదు పొందుతూ ఉండేదని భావించాలి. బహుసా ఈ సమయానికి రుద్రమదేవికి వయసు పై లెక్కప్రకారం చూసుకొన్నట్లయితే 30 ఏండ్లు, 1240 నాటికి 35 ఏండ్ల వయసు ఉంటుంది. అప్పటికి వీరభద్రా ఇంకా పుట్టనేలేదు.
IV. రుద్రమ దేవి గణపతిదేవుని కూతురా లేక భార్యా?
ఈ ప్రశ్నపై చరిత్రకారుల మధ్య నాలుగైదు దశాబ్దాలపాటు వాదోపవాదాలు జరిగాయి. రుద్రమదేవి గణపతిదేవుని పుత్రిక అని చెపుతూ ఆనాటికాలానికి చెందిన అనేక శాసనాలు ఉన్నాయి. ఉదాహరణకు 1261 నాటి ప్రసిద్ధ మల్కాపుర శాసనంలో రుద్రమ దేవి గణపతి దేవుని పుత్రిక అని స్పష్టంగా రెండుసార్లు వస్తుంది.
అయినప్పటికీ అనూచానంగా, గాధలరూపంలో, జనశృతిలో రుద్రమదేవి గణపతిదేవుని భార్యగా ఎందుకు చెప్పబడింది అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. రుద్రమదేవి నిజంగా ఒకవేళ గణపతిదేవుని కూతురు అయితే భార్య అంటోనో; భార్య అయితే కూతురు అంటోనో నిర్మించబడ్డ నేరేటివ్స్ కు ఏవో సామాజిక, రాజకీయ ఉద్దేశాలు ఉండే ఉంటాయి.
ఎ. మార్కోపోలో కథనం
1293 లో ప్రకాశం జిల్లాలోని మోటుపల్లి వద్ద ఆగిన మార్కొపొలో “ఈ రాజ్యాన్ని అప్పటికి నలభై ఏళ్ళుగా భర్తవిహీన అయిన స్త్రీ అద్భుతంగా పరిపాలిస్తున్నది” అని రాసుకొన్నాడు.
ఈ భర్తవిహీన స్త్రీ బహుసా గణపతిదేవుని కోల్పోయిన రుద్రమదేవి కావొచ్చునని కొందరు అభిప్రాయపడగా- జయంతి రామయ్యపంతులు గారు ఆమె రుద్రమదేవి సోదరి అయిన గణపాంబ కావొచ్చునని అన్నారు. కానీ గణపాంబ భర్త చనిపోగా 13 సంవత్సరాలు మాత్రమే పాలించింది అంతే కాక ఆమె పాలన 1264 లో ముగిసిపోయింది. మార్కో పోలో సమయానికి నాలుగు దశాబ్దాలు పాలించిన “భర్తవిహీన” రుద్రమదేవి ఒక్కరే కనిపిస్తుంది. కనుక పంతులుగారి అభిప్రాయాన్ని త్రోసిపుచ్చవచ్చు.
బి. ప్రతాపరుద్రీయము, సోమరాజీయము కావ్యాలు
ప్రతాపరుద్రీయం పై వ్యాఖ్యానం వ్రాసిన కుమారస్వామి రుద్రమదేవిని గణపతి దేవుని భార్యగా పేర్కొన్నాడు. అదేవిధంగా సోమదేవరాజీయం అనే గ్రంధంలో గణపతిదేవుడు యాదవరాజులను గెలిచి, ఆ రాజు కుమార్తె అయిన రుద్రమ్మను పెండ్లాడాడు అని ఉన్నది.
సి. మెకంజీ కైఫియత్తులు
ఏకశిలానగర మెకంజీ కైఫియతు. దీనికె అనుమకొండ మరియు ఓరుగల్లు కైఫియతు పేరు కలదు. దీనిలోని కొన్ని ముఖ్యాంశాలు ఇవి.
……. కాకతి రుద్రరాజు కొడుకు పేరు గణపతి రాజు. రుద్రరాజు తమ్ముడి పేరు మహదేవరాజు. ఈ మహదేవ రాజు దేవగిరి పై జరిగిన యుద్ధంలో మరణించాడు.
గణపతి రాజు తన పినతండ్రి అయిన మహదేవరాజును చంపిన దేవగిరి రాజులపై దండయాత్ర చేసినపుడు దేవగిరి రాజు గణపతిరాజుని నిభాయించలేక సంధికి ఒప్పుకొని దేవగిరి రాజు కుమార్తె అయిన “రుద్రమ దేవి” అనే కన్యకను గణపతి రాజు కు యిచ్చి వివాహంబు చేశి యిచ్చెను. కాకతి గణపతి రాజు మంత్రి పేరు శివదేవయ్య.
కాకతి గణపతికి పుట్టిన కూతురి పేరు వుంమ్మక్క. ఈమెను వీరభద్ర రాజు కి ఇచ్చి వివాహం చేసాడు. గణపతి తనమంత్రి అయిన శివదేవయ్యకు రాజ్యం అప్పగించి క్రీశ. 1257 కాలం చేసాడు.
కాకతి గణపతి రాజు గారి భార్య అయిన రుద్రమదేవి తన పెనిమిటి కాలం చేసిన పిమ్మట తానున్ను పెనిమిటితో కూడా సహగమనానికి సిద్ధపడింది. మంత్రి శివదేవయ్య ఆ రుద్రమదేవుల్కు (రుద్రమదేవికి) దుఃఖోపశమనం గావించి, రాజ్యం అరాజకం అవుతుంది అని హెచ్చరించగా రుద్రమ దేవి జ్ఞానవంతురాలై తన పెనిమిటి అయిన గణపతి రాజుకు ఉత్తర క్రియలు సాంత్తంగా చేసినది. పిమ్మట కాకతి గజపతి ఖడ్గమును, రాజముద్రికను సింహాసనమందు ఉంచి శివదేవయ్య అనుమతితో రాజ్యభారము చేయసాగెను.
రుద్రమదేవి కూతురైన ఉంమ్మక్క, వీరభద్రరాజు దంపతులకు క్రీశ 1279 లో ప్రతాపరుద్రుడు జన్మించాడు. రుద్రమదేవి మనవడైన ప్రతాపరుద్రుడిని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని అతనితో ప్రతిరోజు మూడువేల వరహాలు ప్రజలకు పంచిపెట్టించేదట.
అటు పిమ్మట ఉంమ్మక్క కు మరియొక సుతుడు జన్మించగా అతనికి అన్నమదేవుడు అనే పేరుపెట్టారు. అలా ముప్పై ఎనిమిది ఏండ్లు పాలించిన రుద్రమదేవి క్రీశ . 1294 లో ఒకనాడు ప్రతాపరుద్రుడిని శివదేవయ్య చేతులలో పెట్టి అతణ్ణి సింహాసనాసీనుం జేయవలసినది అని చివరికోర్కెగా చెప్పి మరణించెను.
***
ఉపసంహారం
*. రుద్రమదేవి ఎనభై ఏండ్లు జీవించినది సత్యమే అయితే ఆమె భర్తగా చెప్పబడుతున్న వీరభద్రా ఈమె కంటే కనీసం నలబై ఏండ్లు చిన్నవాడు కనుక వీరిద్దరి వివాహం అసంభవము. అలాగని వేరొక వ్యక్తితో వివాహమైనట్లు ఆధారాలు లభించవు.
*. మెకంజీ కైఫియత్తులనేవి క్రిందనుంచి స్థానికులు రాసుకొన్న చరిత్రలు. ఇవి పైనుంచి చక్రవర్తి లేఖకులు రాసిన చరిత్రలు కావు. ప్రధానస్రవంతి చరిత్రతో పోల్చినపుడు ఈ కైఫియత్తుల చారిత్రికత చాలా సందర్భాలలో వివాదాస్పదము. అయినప్పటికీ వీటికి సోషలాజికల్, ఆంత్రొపొలాజికల్ విలువ ఉంటుంది. కైఫియత్తులన్నీ సామాన్య ప్రజలు నిర్మించుకొన్న నేరేటివ్స్. రుద్రమదేవి గణపతిదేవుని భార్యగా జనశృతిలో ఎందుకు ప్రచారం పొందిందో, దానిలో ఏ రాజకీయ, సామాజిక ప్రయోజనాలున్నాయో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
*. ఒక మహా సామ్రాజ్యాన్ని లోపలనుంచి, బయటనుంచి వచ్చే దాడులనుండి కాపాడుకోవటం సామాన్యమైన విషయం కాదు. అలాంటి అనేక తిరుగుబాట్లను రుద్రమదేవి సమర్ధవంతంగా ఎదుర్కొన్న అసమాన్య వీరనారి. కాకతీయ వంశంలో రుద్రమదేవే కాక మరికొందరు రాణులు కూడా రాజ్యభారాన్ని వహించి రాజ్యసంరక్షణ గావించిన సందర్భాలు మరికొన్ని కనిపిస్తాయి.
తండ్రి చనిపోయే సమయానికి యెరుకదేవరాజు పిన్నవయస్కుడు. అతని తల్లి కొంతలదేవి పాలనా పగ్గాలు చేపట్టి 19 సంవత్సరాలు పరిపాలించి, కటకం రాజులతో జరిగిన అనేక యుద్ధాలను జయించి, రాజ్యాన్ని నిలబెట్టి తిరిగి కొడుకుకు అప్పగించింది.
రుద్రమదేవి సోదరి గణపాంబ తన భర్త బేతరాజు చనిపోగా రాజ్యాధికారం చేపట్టి 13 సంవత్సరాలు పరిపాలించింది. కొడుకు యుక్తవయస్సుకు వచ్చాక రాజ్యాన్ని అతనికి అప్పగించింది.
*. పై ఇద్దరూ రాణులు రాజ్యాలను సంరక్షించి వారసులకు అప్పగించిన భర్తవిహీనులే కావటం గమనార్హం.
బొల్లోజు బాబా
సంప్రదించిన గ్రంధాలు
1. South Indian Inscriptions Vol 10
2. Journal Of The Andhra Historical Research Society,vol.8,pt-1 To 3
3. The Historical Inscriptions of Southern India by Robert Sewell
4. South Indian Inscriptions Vol V edition 1986
5. History of Andhra Country 1000-1500 by Yashoda Devi
6. The Early History Of The Deccan Pts. 1 To 6 G. Yazdani 1960
7. కాకతీయ యుగము – ఖండవల్లి లక్ష్మి రంజనం
8. Travels Of Marco Polo by Frampton, John