Sunday, February 15, 2015

కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్ – కొప్పర్తి


నువ్వెళ్లిపోయాకా రక్తకన్నీరు కార్చుకొన్నాను నేను.  నా విషాదం పెరిగిపోయింది.  నీ నిష్క్రమణ మాత్రమే కారణం కాదు. నీతో పాటు నా నేత్రాలు కూడా నన్ను విడిచిపోయాయి.  ఇపుడు నేనెలా ఏడ్చేదీ? ---- రూమీ

కవిత్వంలో రక్తం అనేది ఎక్కువగా యుద్దానికి, ప్రమాదానికి, ఉద్రేకానికి, భీభత్సానికి,  ధైర్యానికి ప్రతీకగా ఉంటుంది.  కన్నీరు దుఃఖం, వేదన, ప్రేమ, ఉప్పొంగే ఆనందం, కృతజ్ఞతలను సూచిస్తుంది.   పైనున్న రూమీ వాక్యంలో రక్తకన్నీరు అనే పదబంధంలో,  నేత్రాలు పోవటం అనే భీభత్సం, ప్రేయసి ఎడబాటు యొక్క వేదన ఏకకాలంలో ఇమిడిపోవటం చూడొచ్చు.  “గతమంతా తడిచె రక్తమున కాకుంటె కన్నీళ్ళులతో”..... అన్న శ్రీశ్రీ వాక్యంలో  రక్తమంటే యుద్ధాలనీ, కన్నీళ్ళు దాని తాలూకు దుఃఖమనీ అర్ధం చెప్పుకోవచ్చు.
          రక్తం, కన్నీళ్లను పోలుస్తూ కొప్పర్తి వ్రాసిన “కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్” అనే కవిత,  రక్తం కన్నా కన్నీరే ఉత్కృష్టమైనదని ప్రతిపాదిస్తుంది.  రక్తమనేది మనిషి అస్థిత్వానికే తప్ప మనిషితనానికి చిరునామా కాదని, కన్నీళ్ళే మనిషిని మనిషిగా నిరూపిస్తాయని ఈ కవిత చెపుతుంది.  లోతైన తాత్వికత, మంచి శిల్పం, తర్కం నిండిన ఈ కవితను చదివినపుడు గొప్ప పఠనానుభూతి కలుగుతుంది.  ఆలోచనలు విస్తరిస్తాయి. 
అవును
రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి//...... అంటూ మొదలయ్యే కవితావాక్యాలు కవిత సారాంశాన్నంతా ముందే చెప్పేస్తాయి.
 
          ఇక మొగ్గ ఒక్కొక్క రేకు విచ్చుకొన్నట్లుగా ఒక్కో వాక్యం, తేటగా, ఏ శషభిషలు లేకుండా  కవితా వస్తువును ఆవిష్కరిస్తాయి.  మెట్లు మెట్లుగా అనుభూతి శిఖరం వైపు నడిపిస్తాయి. 
          ఈ కవితను మూడు భాగాలుగా విభజిస్తే, మొదటి భాగంలో రక్తం ఏ ఏ సందర్భాలలో చిందించబడతాయో చెపుతాడు కవి,  రెండవ భాగంలో కన్నీళ్ళు ఏ ఏ సమయాల్లో చిప్పిల్లుతాయో చెపుతాడు, మూడవ భాగంలో రక్తం కన్నీళ్ళకంటే ఎందుకు గొప్పదో ముక్తాయిస్తాడు. మంచి ఎత్తుగడ, తార్కికంగా సాగే నడక, ఆలోచనాత్మక ముగింపులతో ఉండే కొప్పర్తి కవితలు తెలుగుసాహిత్యంలో  ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకొన్నాయి. ఈ కవిత మినహాయింపేమీ కాదు.
రక్తాన్నెక్కించగలరు కానీ
కన్నీళ్ళనెవరైనా ఎక్కించగలరా...... అనే ప్రశ్నతో ముగుస్తుందీ కవిత.  నిజమే కదా రక్తంతో ముడిపడిన సందర్భాలన్నీ దాదాపు బయటనుంచి వచ్చేవే, కానీ కన్నీటి సమయాల్ని మాత్రం ఎవరికి వారు తోడుకోవాల్సిందే.  అందుకనే  ఒకచోట “మనలోంచి మనం తవ్వుకొనే తెల్లటి మణులు కన్నీళ్ళు” అంటాడు కొప్పర్తి.





కెమిష్ట్రీ ఆఫ్‌ టియర్స్‌ (“యాభై ఏళ్ళ వాన” సంకలనం నుండి)

అవును
రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి
బ్లడ్‌ ఈజ్‌ థిక్కర్‌ దేన్‌ వాటర్‌
నిజమే కావచ్చు
బట్‌ నాట్‌ థిక్కర్‌ దేన్‌ టియర్స్‌

సూది గుచ్చుకున్నపుడు, బ్లేడు కోసుకున్నపుడు
రక్తం ఉబుకుతుంది
రక్తం ఉరలుతుంది
కత్తివేటుకు రక్తం ఉవ్వెత్తున లేచిపడుతుంది
రక్తం కళ్లచూడాలంటే
రాయి కర్ర సూది బ్లేడు కత్తి బుల్లెట్‌
ఏదో ఒకటి ప్రయోగింపబడాలి

అందరి రక్తం ఎర్రగానే ఉండడంతో
అందరూ ఒకటేనని ఒకప్పుడు చెప్పేవాళ్ళు
నిజమే రక్తం మనందరినీ ఒకటి చేసింది
ఒకే గొడుగు కిందకు తెచ్చింది

అందరిలోను ఒకే రక్తం ప్రవహిస్తోంది
ఎవర్ని కొట్టినా అదే రక్తం ప్రసరిస్తోంది
అమాయకుణ్ణి గుచ్చినా అదే రక్తం
నియంతను నరికినా అదే రక్తం
తెల్లవాణ్ణి నల్లవాణ్ణి
డబ్బులున్నవాణ్ణి లేనివాణ్ణి
మంచివాణ్ణి చెడ్డవాణ్ణి
ఎవర్ని ఎవర్ని నరికినా
అదే రక్తం చిందుతున్నప్పుడు
మనిషికి రక్తం అస్తిత్వాన్నిస్తున్నదే కానీ
మనిషితనానికి చిరునామా అవుతున్నదా

మంచి రక్తం చెడు రక్తం
అంటూ ఉంటాయి కానీ
మహామనిషి రక్తం
మామూలు మనిషి రక్తం అంటూ ఉంటాయా

అందుకే
రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి

లోలోపలి మనిషితనానికి
బాహ్యరూపం కన్నీళ్ళు
ఆరడుగుల మనిషికి ప్రాగ్రూపం కన్నీళ్ళు

తెలుసా
మనిషిలో కన్నీళ్ళ రహస్య తటకాలున్నాయి
నదీమూలాల్లాంటి కన్నీటి చెలమలున్నాయి
ఒకరు రాయి విసరనక్కరలేదు
మరొకరు కత్తి దూయనక్కరలేదు
గాయపరచేదైనా అనునయించేదైనా
చిన్నమాట చాలు
కళ్ళదోనెల్లో నీళ్ళు కదలాడుతాయి
చదువుతున్న పుస్తకంలో చిన్న సందర్భం చాలు, కన్నీళ్ళకి
చూస్తున్న తెరమీద ఒక్క సన్నివేశం చాలు, కన్నీళ్ళకి
కిటికీలోంచి కనిపించే ఒక జీవిత శకలం చాలు, కన్నీళ్ళకి
జీవితంలో ముంచి తీసిన కవిత్వ చరణం చాలు, కన్నీళ్ళకి
నిజానికి ఇవి కూడా అక్కరలేదు
ఒక్క ఊహ
వణికించి తొణికించే ఒక్క ఊహచాలు, కన్నీళ్ళకి

గుండె బరువెక్కి
ఒక దుఃఖపు గుటక గొంతును పట్టేసి
కన్నీళ్ళు తొణికిసలాడాయా, నువ్వు మనిషివి

కళ్ళు వర్షించినపుడు
మనిషి నల్లమబ్బుల ఆకాశం
కళ్ళల్లోకి నీళ్ళు తోడుకున్నపుడు
మనిషి జలవనరులున్న సస్యక్షేత్రం
మనలోంచి మనం తవ్వుకునే
తెల్లటి మణులు కన్నీళ్ళు

రక్తంలా కన్నీళ్ళు అనుక్షణం తయారు కావు
రక్తంలా కన్నీళ్ళు అణువణువూ ప్రవహించవు
మనిషికి ఇన్ని కన్నీళ్ళుంటాయనీ
ఉండాలని ఎవరు చెప్పగలరు
రక్తం చిందడానికి భౌతిక చర్య సరిపోతుంది
కళ్ళు చిప్పిల్లాలంటే
రసాయనిక చర్య జరగాల్సిందే

మనుషులందర్నీ ఒకటిగా కలిపిన రక్తం
కణసముదాయాలుగా విడిపోయింది
పాజిటివ్‌గా నెగిటివ్‌గా పాలిపోయింది
కన్నీళ్లు మాత్రం వర్షపు నీళ్లలా
స్వచ్ఛంగా ఉండిపోయాయి

యుద్ధ బీభత్స ప్రతీక - రక్తం
యుద్ధ విధ్వంస స్మృతి - కన్నీళ్లు
యుద్ధంలో రక్తం గడ్డకట్టుకుపోతుంది
స్మృతుల్లో కన్నీళ్లు స్రవిస్తూనే ఉంటాయి

హృదయం రక్తంలో తేలుతూ ఉంటుంది కానీ
దాని ఉనికిని చాటేది మాత్రం కన్నీళ్ళే

రక్త హీనత ఉన్నట్టే
దుఃఖ లేమి కూడా ఉంటుంది
రక్తాన్ని ఎక్కించగలరు కానీ
కన్నీళ్ళ నెవరైనా ఎక్కించగలరా
                     
                   -----కొప్పర్తి


ఈ వ్యాసం సారంగ పత్రికలో ఈ లింకులో ప్రచురితమైనది
http://magazine.saarangabooks.com/2015/02/05/%E0%B0%95%E0%B1%86%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%86%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D/

Sunday, January 18, 2015

లియొనార్డ్ కొహెన్ రెండు పద్యాలు


1. కిటికీ పైకి లేపాను
కాంతి ఈ కవితపై వాలింది.
ప్రముఖ వీధిలో
ఒక డాబాపై హింసించబడ్డ
అతని పేరు మీద వాలింది.
విరిగిన అతని కాలుకి
ప్రతీకారం తీసుకొంటానని
సూర్యకాంతిపై ప్రమాణం చేస్తున్నాను.

2. కిటికీ పైకి లేపాను
కాంతి ఈ వాక్యాలపై వాలింది
(అసంపూర్ణ వాక్యాలవి)
ముఖ్యంగా ఓ రెండు పదాలపై వాలింది
వాటిని చెరిపేయాలి.
ప్రముఖ వీధిలో
ఒక డాబాపై హింసించబడ్డ
అతని పేరు అది.
అతని సలహా తీసుకొంటానని
నా కవిత్వంలో ఆ సాక్ష్యాలు తొలగిస్తానని
గాయపడ్డ అతని కాలు గురించి మర్చిపోతానని
సూర్యకాంతిపై ప్రమాణం చేస్తున్నాను.
                    

లియొనార్డ్ కొహెన్ --- Energy of Slaves నుండి
తెలుగు అనువాదం - బొల్లోజు బాబా

Tuesday, January 13, 2015

అల్పత్వము

కోయిల గొంతులో రక్తజీర
జాతిని నిలుపుకోవటానికి
ఇదే చివరి పిలుపన్నట్లు.

పచ్చదనంతో పోటెత్తిన పత్రాలు
సూర్యుడ్ని పీల్చుకొంటాయి
రేపుండదన్నట్లు.

పువ్వులన్నీ పోటీపడతాయి
తుమ్మెద చుంబనానికై
ఈ రోజే ఆఖరన్నట్లు.

గాలిపటం వెనుక ఆ పిలగాడు
వడివడిగా పరుగెడతాడు
అదే ఈ లోకపు చివరిదైనట్లు.

చేతికందే ప్రతీక్షణమూ
కాలం అల్పత్వాన్ని
గుర్తుచేస్తూంటుంది.

బొల్లోజు బాబా

Saturday, January 10, 2015

కవుల కవి - శ్రీ ఇస్మాయిల్

          ఇస్మాయిల్ కవిత్వంలో నినాదాలు, సిద్దాంతాలు, వాదనలు కనిపించవు.   ఇంకా చెప్పాలంటే ప్రకృతి కనిపించినంతగా జీవితం కనిపించదు కూడా. అయినప్పటికీ ఆయన కవిత్వాన్ని అభిమానించే వారిలో  కవులు ముందుంటారు వారి వారి కవిత్వ కమిట్మెంట్లు వేరైనప్పటికీ.  ఆ విధంగా ఇస్మాయిల్ కవుల కవి.  
          ఇస్మాయిల్ కవిత్వంలో సౌందర్యం, కరుణ, జీవనోత్సాహాలు నిశ్శబ్దంగా శబ్దిస్తూంటాయి. జీవితంలో తారసిల్లే అనేక సందర్భాలకు, దృశ్యాలకు, వస్తువులకు ఈయన కవిత్వగౌరవం కల్పించాడు. మనుషుల రసదృష్టి పై అచంచలమైన విశ్వాసంతో కవిత్వాన్ని పలికించాడు. కవితలో దండుగ పదాల్ని శుభ్రంగా తుడిచేసి సుందర స్వరూపాన్ని మాత్రమే మిగిలేట్లు చేయటం ఇస్మాయిల్ కవిత్వశైలి.

ధనియాల తిప్ప
అంతా ఒక తెల్ల కాగితం.
అందులో ఒక మూలగా
ఒక అడ్డుగీతా
ఒక నిలువు గీతా -
తెరచాప ఎత్తిన పడవ.
కిందిది నదీ
పైది ఆకాశమూ
కావొచ్చు.

          సుమారు ముప్పై ఏళ్ళ క్రితం వ్రాసిన పై కవిత లో ఒక దృశ్యం ఇప్పటికీ సజీవంగానే కనిపిస్తుంది.  నదీ ఆకాశం కలుసుకొన్న చోట ఒక పడవ.  తెరచాప నిలువుగీత, పడవ అడ్డుగీత.  అంతే అంతకు మించేమీ లేదు.  ఇదే దృశ్యాన్ని నాబోటి వాడు నది ఆకాశాన్ని ముద్దిడే సుదూర మైదానపు దారులలో ఒంటరి పడవ ప్రయాణం అంటో వెలిసిపోయిన అలంకారాలతో, పదాల డమడమలతో కవిత్వీకరించవచ్చు.  కానీ ఇస్మాయిల్ కవితలో ఒక దృశ్యం మాత్రమే పదాల ద్వారా వ్యక్తీకరించబడింది.  అది చాలా నిశ్శబ్దంగా చదువరి హృదయంలో పడవలా సాగుతుంది.  అందుకే శ్రీ వెల్చేరు నారాయణరావు ఒకచోట “...... మాట తనను తాను నిశ్శబ్దం చేసుకుంటే ఒక అపూర్వ శక్తిని సంపాదించుకోగలదని -  ఆ పనిని మాటచేత చేయించగలిగిన వాడు ఇస్మాయిల్ ఒక్కరే  అని అంటారు.

          చట్రాలు, తిరగళ్ళు కవిత్వానికి కట్టి ఊరేగిస్తున్న కాలంలో ఆ పద్దతికి ఎదురొడ్డి  ఇస్మాయిల్ కవిత్వం  నిలబడటం ఒక చారిత్రిక సత్యం. అలా తెలుగు సాహిత్యంలో ఒక విస్మరింపజాలని అధ్యాయంలా ఇస్మాయిల్ నిలిచిపోయారు.  కవికి  అనుభవంతప్ప వేరే ఆస్తి, అస్త్రం  ఉండకూడదని ఇస్మాయిల్ భావించాడు. ఆయన కవితల్లో అనుభవసారం ఒక పదచిత్రంగా, ఒక ప్రతీకగా రూపుదిద్దుకొని పఠిత హృదయంలో దీపమై వెలుగుతుంది.

          ప్రాపంచిక సంగతులను పారలౌకిక విషయాలతో గొప్ప నేర్పుతో అనుసంధానించటం ద్వారా గొప్ప కవిత్వానుభవాన్ని కలిగించటం  ఇస్మాయిల్ కవిత్వంలో చాలా చోట్ల కనిపిస్తుంది.

పాట
సెలయేరా, సెలయేరా!
గలగలమంటో నిత్యం
ఎలా పాడగలుగుతున్నావు?
చూడు, నా బతుకునిండా రాళ్ళు.
పాడకుంటే ఏలా?

          లోపల చిరుగుల బనీనుతో కృష్ణదేవరాయుల రాజసాన్ని పలికించే రంగస్థల నటుడో లేక గొంతుమూగబోయినా  హృదయంతో అద్భుతగీతాలను గానంచేసిన కృష్ణశాస్త్రో, కళాకారుడెవరైనప్పటికీ నిత్యం గలగలమంటో పాడటంలోని అనివార్యతలాంటి జీరనేదో ఈ కవిత పట్టిచూపుతుంది.  సౌందర్యభాషలో తాత్వికతను చెప్పినట్లుంటుంది.

          కవిత్వం కరుణను ప్రతిబింబించాలని నమ్మిన వ్యక్తి ఇస్మాయిల్. జీవితాన్ని ప్రేమించి జీవనోత్సాహాన్ని గానం చేసిన సౌందర్య పిపాసి. కవిత్వంపై సామాజిక స్పృహ అనే బరువును వేసి బలవంతంగా మోయించిన రోజులవి.  మోయలేము అనే కవుల్ని అకవులు అని నిందించే కాలంలో, ఇస్మాయిల్ గారు ఒక్కరే నిరసించి మనం రోజూ చూసే విషయాలని, చిన్నచిన్న అనుభవాలనే కవిత్వంగా మార్చి ఇదీ అసలైన కవిత్వమని ప్రకటించారు.  బాగా దాహం వేసినప్పుడు చల్లని మంచినీళ్ళు తాగితే ఎంతో హాయిగా ఉంటుంది.  ఇది మనం అనేకసార్లు అనుభవించిన ఒక అత్యంత  సాధారణమైన అనుభవం.  కానీ ఈ అనుభవమే ఇస్మాయిల్ గారి చేతిలో పడి చక్కని కవితగా రూపుదిద్దుకొంది..... ఇలా.....
దాహం
వేసవి గాడ్పులకి
దాహపు ఖర్జూరచెట్టు
యెడారి గొంతులో
అమ్ములపొదిలా
విచ్చుకుని
గరగరలాడుతోంది.
చల్లటి నీళ్ళు
గొంతు దిగుతోంటే
ఎంత హాయి//

          యెడారిగొంతు, ముళ్లతో ఖర్జూరచెట్టు విచ్చుకోవటం, గొంతులో గరగర వంటి పదచిత్రాలన్నీ ఒక అనుభవాన్ని ఎంతో అందంగా, హాయిగా (గరగరగా) మన అనుభూతికి తెస్తాయి.
          ఇస్మాయిల్ కవిత్వంలో డబుల్ మెటాఫెర్స్ అద్భుతంగా ఒదిగిపోయి కవితకు అందాన్ని, లోతైన అర్ధాన్ని ఇస్తాయి.  ఆయన పదచిత్రాల సౌందర్య రహస్యం అదే కావొచ్చు.

వాన వచ్చిన మధ్యాహ్నం
బరువెక్కిన సూర్యుడు
బతకనీడు భూమిని
ఉదయమ్మొదలు
ఊపిరాడనీడు
సర్వాన్ని అదిమిపట్టి
వీర్యాన్ని విరజిమ్మాడు.
ఆకల్లాడదు.
ఏ కాకీ ఎగరని
ఏకాకి ఆకాశం.
ఇంతలో హటాత్తుగా
ఇలకు కలిగింది మబ్బుకడుపు.
వేవిళ్ళ గాలులు
వృక్షాగ్రాల్ని వూపాయి.
ధాత్రీచూచుకాలు నల్లపడ్డాయి.
తటాకాల చెంపలు తెల్లపడ్డాయి.///

          పై కవితలో వీర్యం, కడుపు, వేవిళ్ళు, నల్లబడ్డ చూచుకాలు ఇవన్నీ ఒక స్త్రీ గర్భవతి అవ్వటాన్ని సూచిస్తాయి.  అదే విధంగా విపరీతమైన ఎండకాసిన తరువాత వానపడటం అనే విషయాన్ని సూర్యుడు, భూమి, ఆకు అల్లాడకపోవటం, మబ్బులు, గాలులు, ధాత్రి నల్లపడటం, తటాకాలు తెల్లబడటం వంటి వర్ణనలు తెలియచేస్తుంటాయి.  రెంటి మధ్య సమన్వయాన్ని బరువెక్కిన సూర్యుడుమబ్బుకడుపు, ధాత్రీచూచుకాలు, తటాకాల చెంపలు అనే పదబంధాల ద్వారా సాధించి కవితకు  అద్భుతమైన లోతును వచ్చేలా చేసారు. చివరలో వర్షాగర్భంలో వర్ధిల్లే శిశుపిండాన్నిఅంటూ కవి తనను తాను ప్రకటించుకోవటం, ఆ అనుభవాన్ని హృదయానికి హత్తుకొనేలా చేస్తుంది.  ఇదే రకమైన శైలిలో వ్రాసిన సంజె నారింజ అనే కవితలో....

దినపు రేకలపైన వాలెను
ఇనుని సీతాకోకచిలుక//
గులక రాళ్ళ పిట్టలతో
కులుకు తరుశాఖ ఏరు//
వొంగిన సాయింత్రపు రంగుల ధనసు
విసిరే గాలి బాణం
          పై కవితలో దినాన్ని పుష్పంగా, సూర్యుడ్ని సీతాకోక చిలుకలా, ఏరుని వృక్షంగా, గులకరాళ్ళని పిట్టలుగా, ఇంధ్రధనస్సుని గాలి బాణంగా పోలుస్తూ ఒక దృశ్యాన్ని  పదచిత్రాలుగా పేనిన కౌశలం అబ్బురపరుస్తుంది.
          వానని అనేక మంది కవులు అనేక విధాలుగా వర్ణించారు. కానీ ఈ విధంగా వర్ణించటం ఇస్మాయిల్ కే సాధ్యం.
శ్రావణ మంగళవారం
సాయంత్రం
ఒకానొక మబ్బు డస్టరు
అకస్మాత్తుగా ప్రవేశించి
భూమ్మీది వెర్రి రంగుల్నీ పిచ్చిగీతల్నీ
పూర్తిగా తుడిచేసి,
మెరిసే వానసుద్దముక్క పట్టుకొచ్చి
వీధుల్లో కళ్ళనీ
రోడ్లపై పడెల్నీ
లోకంలో కాంతినీ
వెయ్యిపెట్టి గుణించేసి
చెయ్యూపి వెళ్ళిపోయింది///
          ఈ కవితలో కూడా మబ్బుడస్టరు, వానసుద్దముక్క వంటి పదబంధాల ద్వారా అద్భుతమైన పదచిత్రాల్ని నిర్మించి ఒక సుందరదృశ్యాన్ని కళ్లముందు నిలుపుతారు.

          స్వారీ అనే కవితలో ఒక మనోహర సందర్భాన్ని ఇస్మాయిల్ వర్ణించిన తీరు గమనిస్తే ఏ చదువరి మనసు కవిత్వ ఆర్గాజం పొందదు!
స్వారీ
కళ్ళెం లేని గుర్రమెక్కి
పళ్ళు గిట్ట కరచి
ఏ శత్రు సంహారం కోసమో
వైచిత్ర సమరంలోకి
స్వారి చేసే యోధురాలామె.
మళ్ళీ, యుద్ధాంతాన
కళ్ళు తేలేసి
నిర్వికల్ప సమాధిలో
సర్వాంగాలూ స్తంభించే
యోగిని కూడాను.

          ఇస్మాయిల్ కవిత్వంలో కనిపించేమరో గుణం సున్నితత్వం.  అనేక కవితల్లో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తూంటుంది.
చిగిర్చే చెట్లు
నడచివచ్చి నిశ్శబ్దంగా
నా కిటికీ దగ్గిరాగి
హటాత్తుగా
పటేలుమని
వంద వాయిద్యాలతో
వికసించిన బ్యాండుమేళంలా
ఒక రోజు
అకస్మాత్తుగా
చివురించిన చెట్టు
గవాక్షం వద్ద నన్ను ఆపేసింది.///
          పై కవితలో చెట్టు చివురించటాన్ని వందవాయిద్యాల బ్యాండుమేళం అంటున్నాడంటే, అది కవి దృష్టిలో ఎంత పెద్దదో, ఈ కవెంత సున్నితమనస్కుడో అర్ధం చేసుకోవచ్చును. అందుకనే ఈయన కవిత్వంలో సూర్యకిరణాలు, చందమామలు, సాయింత్రపు కలువలూ, పక్షుల కిలకిలలు, నదిలోనీడలు, గదిలో కాంతులు, ఆకాశపు దీపాలు, కొత్తచినుకులు, సొట్టబుగ్గల బావులు, చెట్టుపై వాలినచిలకలు, పసిపాపలు, గులకరాళ్లు వంటి అనేక కవితావస్తువులు కనిపిస్తూంటాయి.  వీటన్నింటిని మనం నిత్యం చూసేవే అయినా ఆధునిక జీవనపు రణగొణల్లో పడి ఆ అందాలకు అంధులం అవుతాం దాదాపుగా.  అలాంటి సున్నితమైన విషయాలతోనే ఇస్మాయిల్ కవిత రచన చేసారు.  చిన్న చిన్న అనుభవాలని అందమైన పదచిత్రాలలో బంధించి మనకందించారు.
          పడిలేచిన అనేక కవిత్వరీతుల వెల్లువల్లో కొట్టుకుపోకుండా మూడున్నర దశాబ్దాలపాటు తనదైన శైలిలోనే ఇస్మాయిల్  కవిత్వాన్ని వెలువరించారు.  రాజకీయ కవిత్వాలు తమ ప్రాసంగితను కోల్పోయాక సేదతీర్చేది ఇస్మాయిల్ మార్కు కవిత్వమే అనటంలో సందేహంలేదు.  ఆయన తను సాగిన బాటలో ఎందరో అభిమానులను పోగేసుకొన్నారు. ఆయన శిష్యులుగా ఎంతో మంది అదేబాటలో పయనించి తర్వాతికాలంలో మంచి కవులుగా పేరుతెచ్చుకొన్నారు. గోదావరి శర్మ, విన్నకోట రవిశంకర్, ఆకెళ్ళ రవిప్రకాష్, తమ్మినేని యదుకుల భూషణ్, మూలా సుబ్రహ్మణ్యం, కొండముది సాయికిరణ్, బి.వి.వి. ప్రసాద్, హెచ్చార్కె, నామాడి శ్రీథర్, శిఖామణి, అఫ్సర్ వంటి కవులకు ఇస్మాయిల్ అభిమాన కవి.  అలా ఇస్మాయిల్ కవుల కవిగా  కీర్తిశేషులయ్యారు. 


బొల్లోజు బాబా

Wednesday, January 7, 2015

ఇల్లు


ఇంటికెళ్లటం  ఒక వ్యసనం
LSD ట్రిప్ కోసం పక్షులన్నీ
సాయింత్రానికల్లా
ఠంచనుగా గూళ్లకు చేరుకొంటాయి.

ఇంటికెళ్లలేకపోవటం ఒక విషాదం
పెద్దపులిని
నమ్మించలేకపోయిన ఆవు కోసం
లేగదూడ జీవితాంతం
అరుస్తూంటుంది.


బొల్లోజు బాబా

Sunday, January 4, 2015

ఫ్రాగ్మెంట్స్ - 7


1.
రాలిన పత్రాల్ని
లోనికి లాగేసుకొని
పూవులుగా అందిస్తాయి
తరువులు

2.
ఏమివ్వాలో తెలీక
రెండు పక్కటెముకల్ని
అక్కడ పెట్టి
నిశ్శబ్దంగా
వచ్చేసాను

3.
హింసించే ఈ బరువుల్ని
వదిలించుకొని
భారరహితమౌదామా?
చూడు
ఆ సీతాకోకచిలుక
ఎంత తేలికగా
ఎగురుతోందో!

4.
నిత్యం నీ స్వప్నాలలో
నీతో సంభాషించే అమ్మాయి
ఈ రోజు నా కల్లోకి వచ్చి
ముద్దిచ్చిన విషయం
నువ్వేనాటికీ స్వప్నించలేవు

5.
ఒక సంఘటన
ముక్కలు ముక్కలుగా
వెదజల్లబడింది
ఎవరి శకలం వారిదే.
వీడికి ఏనుగు తోక
దొరికినట్టుంది


బొల్లోజు బాబా

Thursday, January 1, 2015