రెండురోజుల పాటు సాగిన ఖమ్మం కవితాంతరంగం ప్రోగ్రామ్ లో నేను కూడా పాల్గొన్నాను. 70 మంది కవితలను వారిపేరులేకుండా ఇచ్చి విశ్లేషించమని అడగటం ఒక నూతన ప్రయోగం. గ్రూపులో ఫణిమాధవి కన్నోజు, వైష్ణవిశ్రీ, గరికపాటి మణిందర్, చిక్కొండ్ర రవి, తాండా హరీష్ గౌడ్, వనపట్ల సుబ్బయ్య ఉన్నారు.
నేను రాసిన "పౌరసత్వ పత్రాలు" కవితను దాదాపు అన్ని గ్రూపులు మెన్షన్ చేసాయి. అందరకూ ధన్యవాదములు. ఈ సదస్సుకు నన్ను ఆహ్వానించినందుకు శ్రీ ప్రసేన్, శ్రీ సీతారామ్, శ్రీ రవి మారుతి లకు కృతజ్ఞతలు.
కవిత, కొన్నిఫొటోలు ఇవి.....
.
పౌరసత్వ పత్రాలు
నేను
హరప్పా వీధుల్లో
ఇటుకల మధ్య పుట్టిన జ్ఞాపకాన్ని
నిశ్శబ్దంగా నడిచిన కాలాన్ని.
వాయువ్యదిశ నుంచి వచ్చిన
వలసదారుల గుర్రాల మోతలో
సంస్కృత మంత్రాల హోరులో
నేను నా నాగరికతా పాటను కోల్పోయాను.
నా దేహంపై వర్ణాల గీతలు గీసారు
యజ్జాగ్ని వేడికి నా ఇళ్ళు కాలిపోయాయి
నా శ్రమకు బానిస సంకెళ్ళు వేసారు
నా స్వరానికి మౌనపు కచ్చడాలు బిగించారు
నేను హరప్పా వారసుడిని
ఈ దేశ మూలవాసిని
నా పౌరసత్వ పత్రాలు
ఫైళ్ళలో లేవు
నా DNA లో ఉన్నాయి
సింధునది ఒడ్డున పాతిపెట్టిన రక్తంలో ఉన్నాయి
వలసవచ్చిన వారికి ఏమున్నాయి?
పురాణాల అబద్దాలు
వర్ణవిభజన రాజకీయాలు తప్ప.
నా గోడలు ఇంకా మాట్లాడుతున్నాయి
నా మట్టి ఇంకా నిలబడి ఉంది
ఈ భూమి నాదే, ఎప్పటికీ నాదే.
బొల్లోజు బాబా

No comments:
Post a Comment