Wednesday, September 17, 2025

ఫ్రెంచి యానాంలో జరిగిన బానిసల వ్యాపారం

పంతొమ్మిదవ శతాబ్దం చివరవరకూ జరిగిన బానిస వ్యాపారం మానవజాతి ఎన్నటికీ చెరుపుకోలేని మరక. స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాల ఆవశ్యకతను ప్రపంచానికి తెలియచెప్పిన ఫ్రాన్స్‌ ఒకానొక సమయంలో బానిస వ్యాపారంలో ప్రధాన పాత్ర వహించటం అశ్చర్యం కలిగించే విషయం. 1794 లోనే ఫ్రెంచి రిపబ్లిక్‌ బానిసవ్యాపారాన్ని నిషేధించింది. కానీ 1802 లో నెపోలియన్‌ ఆ నిషేదాన్ని ఎత్తివేసాడు. ఈ వెసులుబాటు వల్ల 1830 లో లూయిస్‌ ఫిలిప్‌ బానిస వ్యాపారాన్ని నేరమని చట్టం తీసుకువచ్చే వరకూ అది చట్టబద్దంగానే కొనసాగింది. ఇక అనధికారంగా 1850 ల వరకూ కూడా అక్కడక్కడా నడిచింది. బానిస వ్యాపారాన్ని 1772 లోనే ఇంగ్లాండ్‌ నిషేదించి ఫ్రాన్స్‌ కంటే ముందుండటం గమనార్హం. ఈ విషయంలో ఫ్రెంచి వారిపై బ్రిటిష్‌ వారు ఆ కాలంలో ఒక విధమైన మోరల్‌ పోలీసింగ్‌ పాత్రను పోషించారు. 

ఫ్రాన్స్‌ కు స్థానికంగా ఈ అనాగరీకమైన బానిస వ్యాపారం పట్ల ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ దానిని నిషేదించలేకపోవటానికి ఫ్రెంచి కాలనీఅయిన రీయూనియన్‌ (మడగాస్కర్‌ సమీపంలో ఫ్రెంచివారు ఆక్రమించుకొన్న ఒక ద్వీపం) మంచి లాభాల్నిచ్చే చెరకుతోటల సాగుకు వేల సంఖ్యలో కూలీలు అవసరం కావటం, ఆ తోటలు సమకూర్చే ఆర్ధికవనరులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సుమారు యాభైలక్షలమంది ఫ్రెంచి వారికి జీవనోపాధి కలిగించటం (1763 నాటికి) వంటివి ప్రధాన కారణాలు. అందుకనే ఫ్రెంచి ప్రభుత్వం బానిస వ్యాపారానికి సబ్సిడీలు ఇచ్చి మరీ ప్రోత్సహించవలసి వచ్చేది. ఈ కారణాల దృష్ట్యా, 1672 లో 10 లీవ్ర్‌ లు (లీవ్ర్‌ R ప్రాచీన ఫ్రెంచి కరెన్సీ. ఒక లీవ్ర్‌ సుమారు 450 గ్రాముల వెండి విలువతో సమానం) ఉండే ఒక బానిస వెల 1730 లో 100 లీవ్ర్‌లకు, 1787 నాటికి 160 లీవ్ర్‌లకు క్రమంగా చేరింది. 

ఫ్రెంచి వారు తమ బానిసలను మొదట్లో ఆఫ్రికా నుంచి సేకరణ జరిపినా కాలక్రమేణా ఇండియాలోని తమ కాలనీలనుంచి కూడా తరలించటం మొదలెట్టారు. 1760 లో ఏడాదికి సగటున 56 షిప్పులలో బానిసల ఎగుమతి జరిగేది. ఒక్కో షిప్పు మూడు నుంచి నాలుగొందల మంది బానిసలు పట్టే సామర్ధ్యం కలిగుండేవి. 1767 లో చక్కెర ఉత్పత్తిలో ఫ్రెంచి వారు ప్రపంచంలో అగ్రగామిగా నిలిచారు. రీయూనియన్‌ లో చెరకు తోటల్లో పనిచేసే బానిసల జీవనం కడు దయనీయంగా ఉండేది. వారు రోజుకు దాదాపు ఇరవై గంటలు పనిచేసేవారు. స్త్రీలు కొద్ది సంఖ్యలో ఉండేవారు. కుటుంబాలు ఉండేవి కావు. ఆ కారణాల వల్ల మరణ రేటు అధికంగా ఉండటంతో బానిసల కొరత నిరంతరం ఉండేది. బానిసలను చేరవేసే నౌకలకు Amity, Liberte వంటి గొప్ప పేర్లు ఉండటం దురదృష్టకరం.

యానాంలో ఫ్రెంచి వారు జరిపిన బానిస వ్యాపారానికి ఆధారాలు 1792 లో యానాం సమీపంలో కల ఇంజరం అనే గ్రామంలో నివసించే Mr. Yates అనే ఓ బ్రిటిషర్‌ పాండిచేరీలోని ఫ్రెంచి గవర్నర్‌ జనరల్‌ కి (Colo De Fresne) వ్రాసిన ఓ లేఖలో దొరుకుతాయి. (Ref. Asiatic Journal Vol. 26 No. 156 - printed in 1828, Chapter Slavery in India, Pages from 665 to 670)

యేట్స్‌ ఎపిసోడ్‌ (1792): బానిసలను ఎక్కించుకొనే ఫ్రెంచి నౌకలు కోరంగి నుంచి బయలు దేరే తారీఖు దగ్గర పడేకొద్దీ బానిసలను సరఫరా చేసే మధ్యవర్తులు రకరకాల పద్దతులకు పాల్పడేవారు. కొంతకాలం క్రితం ఈ ప్రాంతంలో విపరీతమైన కరువు విలయతాండవం చేయటం వల్ల తిండిలేక చచ్చిపోవటం కంటే బానిసగా బతకటమే మేలనే ఉద్దేశ్యంతో ప్రజలుండేవారు. కానీ ప్రస్తుతం కొద్దో గొప్పో తిండి గింజలు దొరికే పరిస్థితి ఉండటం చే బానిసల సేకరణ ఫ్రెంచి వారికి కష్టమై హింసాత్మక పద్దతులకు పాల్పడటం మొదలెట్టారు. యానాం వీధులలో తిరిగే యాచకులను యానాంలో సరుకులు కొనుగోలు కోసం వచ్చిన ఇతర గ్రామస్తులను పట్టి బంధించి, రహస్య ప్రదేశాలకు తరలించి అక్కడి నుంచి రాత్రివేళలలో ఫ్రెంచి నౌకలలోకి ఎక్కించేవారు. ఈ వ్యక్తులను వారి కుటుంబాలనుంచి అతి కిరాతకంగా విడదీయటం అనేది ఆయా ఫ్రెంచి నౌకల యజమానుల కనుసన్నల్లో జరిగేది ......... అంటూ యేట్స్‌ యానాంలో ఫ్రెంచి వ్యాపారులు జరుపుతున్న బానిస వ్యాపారం గురించి తన లేఖలో పేర్కొన్నాడు. 

ఈ అభియోగాలను సమర్ధిస్తూ అయిదుగురు ఇంజరం వాస్తవ్యులు లిఖిత పూర్వకంగా ధృవీకరించారు. వీరిలో బొండాడ వెంకటరాయలు అనే ఓ వైశ్యుడు వ్రాసిన మరో లేఖ ఈ ఉదంతం పై మరింత వెలుగును ప్రసరింపచేస్తుంది.

బొండాడ వెంకటరాయలు ఫ్రెంచి ఈస్ట్‌ ఇండియా కంపెనీచే గుర్తింపు పొందిన ఒక యానాం వ్యాపారి. ఈయన తన ఉత్తరంలో...... M. de Mars, M. La Blanche మరియు M. Ellardine అనే ముగ్గురు ఫ్రెంచి నౌకయజమానులు బానిసలను కొనుగోలు చేయటానికి మధ్యవర్తులను ఏర్పాటుచేసుకొని వారి ద్వారా యానాంలోని ముష్టివారిని, పొరుగూరి వారిని బలవంతంగా నిర్బంధించి కోరంగి రేవులో నిలిపిన వారి నౌకలలోకి ఎగుమతి చేయిస్తున్నారని` అంతే కాక యానాం చుట్టుపక్కల గ్రామాలకు మనుషులను పంపించి అక్కడి కూలీలకు, దర్జీలకు పని ఇప్పిస్తామని నమ్మబలికి వారిని యానాం తీసుకువచ్చి బంధించి రాత్రివేళలలో ఎవరికీ తెలియకుండా నౌకలలోకి తరలిస్తున్నారనీ` ప్రతిఘటించేవారి నోటిలో గుడ్డలు కుక్కి లేదా సారాయిని బలవంతంగా తాగించి ఆ నిస్సహాయ స్థితిలో వారిని నౌకలోకి మోసుకుపోవటం జరుగుందనీ .......అంటూ బొండాడ వెంకటరాయలు తన లేఖలో ఆనాటి సంఘటనలను వర్ణించాడు.  

ఆతేరు గ్రామానికి చెందిన ఒక బ్రాహ్మల అబ్బాయిని, నీలపల్లి కి చెందిన ఒక భోగం పిల్లని ఏ ఊరో తెలియని ఓ బ్రాహ్మణ అమ్మాయిని కూడా ఈ విధంగానే కిడ్నాప్‌ చేసి నౌకలోకి తరలించారు. ఈ ముగ్గురి విషయం తన మిత్రుల ద్వారా తెలుసుకొన్న యానాం పెద్దొర (సొన్నరెట్‌) ఆ నౌక కెప్టెన్‌ కు ఆదేశాలు జారీ చేసి వారిని విడుదల చేయించాడు. 

అలా ఆ ఫ్రెంచి నౌక ఎక్కి తిరిగొచ్చిన ఆ ముగ్గురూ, ఆ నౌకలో అనేక మంది కూలీలు, కుటుంబ స్త్రీలు, కొద్దిమంది బ్రాహ్మణులు ఉన్నారని చెప్పటంతో ఆగ్రహించిన స్థానికులు, ఆ మిగిలిన వారిని కూడా విడిపించమని సొన్నరెట్‌ ను అడిగారు. కానీ సొన్నరెట్‌ ఏ రకమైన హామీ ఇవ్వకపోవటం, నౌక బయలుదేరే తారీఖు దగ్గరపడుతూండటంతో వారంతా పొరుగునే ఉన్న బ్రిటిష్‌ అధికారులను ఆశ్రయించారు.  

ప్రజల వద్దనుండి వచ్చిన విజ్ఞప్తులపై విచారణ నిమిత్తం యేట్స్‌ యానాం వెళ్లగా, చాలామంది యానాం ప్రజలు ఆయనను చుట్టు ముట్టి సుమారు మూడువందలకు పైగా వారి బంధువులను ఎత్తుకుపోయారని గగ్గోలు పెడుతూ తమ గోడును వెళ్ళబోసుకొన్నారు. చిన్న పిల్లలను కూడా విడిచిపెట్టలేదని కన్నీరు మున్నీరై వారు విలపించారు. ఈ మొత్తం ఉదంతంపై సొన్నరెట్‌ ను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని మొదట్లో వాదించి, చివరకు కావాలంటే నౌకను తనిఖీ చేసుకోవచ్చునని అనుమతినిచ్చాడు. దరిమిలా ఒక ఫ్రెంచి అధికారి, స్కోబీ అనే ఒక ఇంగ్లీషు అధికారి పర్యవేక్షణలో ఒక కమిటీ ఏర్పడి నౌక తనిఖీ కి కోరంగి వెళ్ళారు. కానీ నౌక కెప్టెన్‌ వీరిని నౌక లోపలకు రాకుండా అడ్డుకొని ఏ విధమైన వివరణలు ఇవ్వకుండా కమిటీని వెనక్కు పంపించేసి కోరంగి రేవునుండి నౌకతో సహా జారుకొన్నాడు.  

యానాం పెద్దొర తన విచక్షణాధికారాలను ఉపయోగించి నౌకను నిలుపు చేసి ఉన్నట్లయితే ఆ స్థానికుల తరలింపు నివారింపబడి ఉండేదని యేట్స్‌, Major Wynch అనే మరో బ్రిటిష్‌ అధికారికి వ్రాసిన ఒక లేఖలో పేర్కొన్నాడు. 

పాండిచేరిలోని ఫ్రెంచి గవర్నరు (M.De Fresne) ఈ విషయాలనన్నీ బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ Lord (Cornwallis) ద్వారా తెలుసుకొని ఇలాంటి వ్యవహారాలకు పాల్పడే వారిని అరెస్టు చేసి పాండిచేరీ పంపవలసినదిగా ఆదేశాలు జారీచేసాడు. అంతే కాక వీటిని నియంత్రించలేని తన నిస్సహాయతను కూడా తెలియచేసాడు. (సరైన పర్యవేక్షణా యంత్రాంగం లేకపోవటం వల్ల) అలాంటి అనుమతుల కోసమే ఎదురుచూస్తున్న బ్రిటిష్‌ ప్రభుత్వం వెంటనే కోరంగి, భీమిలిపట్నం ల వద్ద సిపాయిలను నియమించి తీర ప్రాంతంలో ఫ్రెంచి వారు జరిపే దారుణ బానిస వ్యాపారం అరికట్టటానికి పూనుకొంది. 

యానాం పెద్దొర సొన్నరెట్‌ మాత్రం ఒక లేఖలో ‘‘ఇంగ్లీషువారు కూడా ఈ బానిస వ్యాపారంలో ఉన్నారనీ, ఒకసారి ఇంగ్లీషునౌకలో బానిసలుగా తరలింపబడుతున్న 12 మంది యానాం వాసులను తాను విడిపించానని’’ చెప్పటం ఈ మొత్తం ఉదంతానికి కొసమెరుపు. 

1793 నుండి 1816 వరకూ యానాం బ్రిటిష్‌ వారి ఆధీనంలో ఉండటం వల్ల ఆ కాలంలో యానాంలో జరిగిన విషయాలు తెలియరావు.

ఫ్రెంచి వారు చేసే ఈ బానిస వ్యాపారంపై బ్రిటిష్‌ వారి పహారా ఎంతెలా ఉండేదో 1820 లో జరిగిన ఒక సంఘటన తెలియచేస్తుంది.


 La Jeune Estele  అనే ఫ్రెంచి నౌకను బ్రిటిష్‌ పడవలు వెంబడిరచగా ఆ నౌక కెప్టెన్‌ కొన్ని పీపాలను సముద్రంలోకి విసిరేయటం మొదలెట్టాడు. అలా విసిరేసిన ఒక్కో పీపాలో 12 నుండి 14 సంవత్సరముల వయసు కలిగిన బానిసలు ఉండటం పట్ల యావత్‌ప్రపంచం నివ్వెరబోయింది. ఈ సంఘటన తరువాత ఫ్రెంచి నౌకలపై బ్రిటిష్‌ వారి కాపలా మరింత ఉదృతమైంది. అయినప్పటికీ ఈ కాలంలో 3211 మంది కూలీలను పంతొమ్మిది నౌకలలో యానాం నుంచి రీయూనియన్‌ కు పంపించటం జరిగింది. వీరిలో అధికశాతం ఇంగ్లీషు టెరిటరీనుంచి సమీకరించటం గమనార్హం. (Article of Mr. Jacques Weber - L’emigration Indeienne vers les colonies francaises)

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ ఫ్రెంచి ప్రభుత్వం పాత పద్దతులకు స్వస్థి పలికి కూలీల సేకరణ కొరకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.

యానాంలో కాంట్రాక్టు పద్దతిపై కూలీల ఎగుమతి

రీ యూనియన్‌ లోని చెరుకు తోటలలో పనిచేయటానికి కార్మికుల అవసరం రోజు రోజుకూ పెరగటం, ఇండియానుంచి కూలీలను తీసుకుపోవటానికి, పొరుగు రాజ్యాన్ని ఏలే బ్రిటిష్‌ వారు ఎక్కడికక్కడ అనేక ఆంక్షలు విధించటం వల్ల ఫ్రెంచి ప్రభుత్వం 1828 లో కాంట్రాక్టు పద్దతి ద్వారా కూలీలను రిక్రూట్‌ చేసుకోవటం మొదలెట్టింది. ఫ్రెంచి ప్రభుత్వం నియమించిన ఏజెంటుకు, పనిచేయటానికి ముందుకొచ్చిన కూలీకి మధ్య జరిగే కాంట్రాక్టులో ఈ క్రింది హామీలుండేవి.

1. కాంట్రాక్టు కాల పరిమితి మూడు సంవత్సరాలు

2. ప్రతి కూలీకి నెలకు 7 రూపాయిల జీతం ఇవ్వబడుతుంది.

3. తిండి, వసతి, ఆరోగ్య సదుపాయాలు కల్పించబడతాయి.

4. వారి వారి ఆచారాలను, మతపరమైన సాంప్రదాయాలను గౌరవించటం జరుగుతుంది.

5. రాను, పోను ఖర్చులను మరియు కాంట్రాక్టు ముగియక ముందే అనారోగ్య లేదా ఇతర కారణాల వల్ల స్వదేశానికి వెళ్లాలనుకొనేవారి తిరుగు ప్రయాణ ఖర్చులను కూడా యజమానే భరిస్తాడు.

6. ప్రతి కూలీకి ముందుగా మూడు నెలల జీతం అడ్వాన్సుగా ఇవ్వబడుతుంది.

7. పనిలో చేరాకా ఇచ్చే జీతంలో 3 రూపాయిలను కూలీ చేతికి, మిగిలిన 4 రూపాయిలు ఇక్కడ అతని కుటుంబ సభ్యులకు నెల నెలా అందించబడుతుంది. 

Lకాంట్రాక్టు లోని చివరి రెండు హామీలకు యానాం వాసులే కాక పొరుగు ప్రాంతాల వారు కూడా ఆకర్షితులై అధిక సంఖ్యలో ముందుకొచ్చారు. ఆ విధంగా కాంట్రాక్టు కుదుర్చుకొన్న మొత్తం 268 మంది కార్మికులు 1829 ఆగస్టు, 7 న యానాం నుంచి రీయూనియన్‌ కు బయలు దేరారు. వారిలో 197 మంది దళితులు, 27 మంది ముస్లిములు, పదముగ్గురు చేనేత కార్మికులు, అయిదుగురు పల్లీయులు, ఇద్దరు అగ్రకులస్థులు (మిగిలిన వారి వివరాలు తెలియరావు) ఉన్నారు(]. Personal state of Indians embarking at Yanam for Bourbon from 16 March 1828 to 6 August 1829, COR.GLE, India V. 29).

అలా బోర్బన్‌ (రీయూనియన్‌) కు పంపించబడిన యానాం కూలీల కుటుంబాలకు నెల నెలా ఇచ్చే చెల్లింపులను రీయూనియన్‌ లోని వారి యజమాని అయిన Mr. Argand తరపున తాను చెల్లిస్తానని యానాంలో ఉండే ఫ్రెంచి ఏజన్సీ De Courson and Co వారు హామీ ఉన్నారు. మొదటి వాయిదా డిశంబరు 1829 నాటికి చెల్లించవలసి ఉంది. కానీ జనవరి వచ్చేసినా వారికి ఒక్క పైసా కూడా ముట్టలేదు. వారందరూ యానాం పెద్దొర అయిన Mr. De Lesparda వద్దకు వచ్చి విన్నవించుకొన్నారు. ‘‘ఆర్గాండ్‌ నుంచి మాకేమీ డబ్బులు ముట్టలేదు కనుక మేము వీరికి ఏ రకమైన చెల్లింపులు చేయలేము’’ అని కుర్‌సన్‌ అండ్‌ కో వారు చేతులెత్తేయటంతో` ఎనిమిదిరోజులుగా పస్తులతో పెద్దొర బంగ్లా వద్ద ఎదురుచూస్తున్న ఆ కూలీల కుటుంబాలకు యానాం పెద్దొరే, 1830 జనవరి, 17 నుంచి కొద్దిపాటి చెల్లింపు చేయటం మొదలెట్టాడు.  

యానాంలో ఇలా ఉండగా, అక్కడ రీయూనియన్‌ లోని చెరుకు తోటలు ఆ సమయంలో భారీ నష్టాలను ఎదుర్కోవటంతో యానాం కూలీలు సంతృప్తికరంగా లేరనే సాకు చూపి తాము కుదుర్చుకొన్న ఆర్ధిక ఒప్పందాలు నెరవేర్చలేమని అక్కడి తోటల యజమానులు తెగేసి చెప్పి, వారిని తిరిగి ఇండియా పంపించివేసారు. ఆ విధంగా యానాంలో జరిగిన కాంట్రాక్టు కూలీల ఎగుమతి వ్యవహారం అర్ధాంతరంగా ముగిసిపోయింది. కాంట్రాక్టు పద్దతిలో కల ఆమోదయోగ్యమైన అంశాలకు ఆశ్చర్యపడిన బ్రిటిష్‌ వారు ఈ రకపు కూలీల తరలింపును ఏ విధంగానూ ఆటంక పరచలేకపోయారు. అయినప్పటికీ ఈ పద్దతి విజయం సాధించలేకపోవటం తో మరలా మరో ఇరవై ఏళ్ల వరకూ యానాం నుంచి ఏ విధమైన వలసలూ జరిగినట్లు తెలియరాదు.

కూలీల సేకరణలో ఫ్రెంచి వారిపై బ్రిటిష్‌ వారి ఆంక్షలు

కాలక్రమేణా కూలీల సేకరణ, వారి తరలింపు అనేది అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా మారటంతో పాండిచేరి, కారైకాల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ లలో ఇదొక ప్రధాన పాత్ర వహించటం మొదలైంది. ఫ్రెంచి ప్రభుత్వం కూడా »»Society for Emigrationµµ అనే సంస్థకు ఈ విషయంలో సర్వాధికారాలు కట్టబెట్టింది. ఈ సొసైటీ అధిపతి అయిన Jouls Bedier Priery ఈ వ్యాపారంలో విపరీతమైన లాభాలార్జించి అప్పటి ఫ్రెంచ్‌ ఇండియాలో అత్యంత ధనికుడిగా పేర్గాంచాడు. ఒకానొక దశలో పాండిచేరి, కారైకాల్‌ లలో కూలీలు ఇక దొరకని పరిస్థితి రావటంతో బెడియర్‌ కళ్లు యానాం పై పడ్డాయి. దరిమిలా బెడియర్‌ కోరిక మేరకు ఫ్రెంచి ప్రభుత్వం, యానాంలో కూలీల సేకరణ జరుపుకోవటానికి అనుమతినిస్తూ 1849 సెప్టెంబరు, 1న ఉత్తర్వులు జారీచేసి, అప్పటి యానాం పెద్దొర జోర్డైన్‌ కు రెండువేల పాస్‌పోర్టులను పంపించింది. (ఒక ఫ్రెంచి పౌరుడు విదేశాలకు వెళ్లటానికి పాస్‌పోర్టులు అవసరం) ( India card 464, D 591 and the article of Jaques Weber)

లె పికార్డ్‌ అనే ఫ్రెంచ్‌ నౌకలో బెడియర్‌ తన మందిమార్బలంతో 1849 సెప్టెంబరు, 11 న పాండిచేరీలో బయలుదేరి 14 సెప్టెంబరుకు యానాం చేరుకొన్నాడు. ఈ ప్రాంతమంతా ఘోరమైన వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్థమై ఉండటం వల్ల వారికి కూలీల సేకరణ పెద్ద కష్టం కాలేదు. 30 సెప్టెంబరు కల్లా మొదటి దఫా కూలీల సేకరణ పూర్తయింది. వారికి (60 మంది) యానాం పెద్దొర జోర్డైన్‌ సంతకం చేసిన పాస్‌ పోర్టులు జారీ చేయబడ్డాయి. వీరందరినీ కోరింగి రేవులో ఫ్రాన్స్‌ జాతీయపతాకాన్ని అతిశయంతో రెపరెపలాడిస్తున్న తన నౌకలోకి చేరుస్తూండగా మొదలైంది అసలు కధ.

అక్టోబరు 1 న ఒక బ్రిటిష్‌ అధికారి ఓ కానిస్టేబుల్‌ని వెంటేసుకొని వచ్చి ఈ కూలీలు స్వచ్చందంగా వెళుతున్నారా లేక బలవంతంగా తరలించబడుతున్నారా అన్న విషయం తెలుసుకురమ్మని రాజమండ్రి కలక్టరు జారీ చేసిన ఒక ఉత్తర్వును చూపి, ఆ 60 మంది కూలీలను ఒక్కొక్కరినీ విచారించటం మొదలెట్టాడు. ఆ మరునాడు కలక్టరు ప్రెస్‌ డెర్గాస్త్‌ గారే స్వయంగా వచ్చి కూలీలను ప్రశ్నించి వారందరూ ‘‘మేము ఇష్టపూర్వకంగానే వెళుతున్నామని’’ చెపుతున్నా సంతృప్తి చెందక, పౌరులకు కోరంగి రేవు నుండి విదేశాలకు వెళ్ళే అనుమతి లేదన్న కారణంచే బెడియర్‌ తో సహా అందరినీ జగన్నాయకపురం తరలించి అరెస్టు చేయించాడు. వీరందరూ 10 అక్టోబరు వరకూ కటకటాల వెనుకే ఉన్నారు. 

అవమాన భారంతో పాండిచేరీకి వెనుదిరిగిన బెడియర్‌` ఫ్రెంచి ప్రభుత్వం కూలీలకు జారీచేసిన పాస్‌ పోర్టులను మరియు ఇతర చట్టపరమైన అనుమతులను బ్రిటిష్‌ కలక్టరు ఖాతరుచేయకపోవటం వల్ల తనకు జరిగిన ఆర్ధిక, పరువు నష్టాలకు 1,80,000 ఫ్రాంకుల పరిహారాన్ని ఇప్పించమని ఫ్రెంచి ప్రభుత్వాన్ని కోరాడు. కోరంగి రేవును తటస్థ రేవుగా (బ్రిటిష్‌ మరియు ఫ్రెంచి నౌకల ప్రయాణానికి) ఉంచాలని పూర్వం ఫ్రెంచి మరియు బ్రిటిష్‌ వారు చేసుకొన్న ఒప్పందాలను బ్రిటిష్‌ వారు ఉల్లంఘించారని బెడియర్‌ ఆరోపించాడు. (దీనికి స్పందిస్తూ ఆ ఒప్పందాలేమిటి అని బ్రిటిష్‌ వారు అడిగినపుడు ఫ్రెంచి వారు ఏమీ చూపలేకపోవటం వల్ల కోరంగి రేవు పూర్తిగా బ్రిటిష్‌ వారి ఆధీనంలోకి పోవటం ఆ తరువాత జరిగిన ఒక దురదృష్టకర పరిణామం ఫ్రెంచివారికి సంబంధించి).

బెడియర్‌ వంటి పెద్ద వ్యాపారికే అంత అవమానం జరిగిన తరువాత పాండిచేరీలోని మరే ఇతర వర్తకులు యానాంలో కూలీల సేకరణ జరపటానికి మరో పదేళ్ల వరకూ సాహసించలేదు

బ్రిటిష్‌`ఫ్రెంచి ప్రభుత్వాల ఒప్పందం 1861

బెడియర్‌ అవమానోదంతం ఫ్రెంచి ప్రభుత్వాన్ని కుదిపివేసింది. ఫ్రెంచి రాజ్యానికి గౌరవభంగం జరిగినట్లు భావించింది. దీనితో ఫ్రెంచి వారు బ్రిటిష్‌ ప్రభుత్వంతో పై స్థాయిలో చర్చలు జరిపి 1861 జూలై, 1 న ఒక ఒప్పందాన్ని చేసుకొన్నారు. దీని ప్రకారం బ్రిటిష్‌ వారి అన్ని పోర్టుల నుంచీ ఫ్రెంచివారికి కూలీలను పంపించుకొనే అధికారం పొందింది. ఆ యా సెంటర్లలో ఒక బ్రిటిష్‌ అధికారి ఉండి కూలీలు స్వచ్చందంగా వెళుతున్నారా లేక బలవంతంగా తరలింపబడుతున్నారా అనే విషయాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. (]. Year book of India 1866, Pondy, Govt.printing)

ఆ విధంగా 1861 నుంచి యానాంలో చట్టబద్దంగా కూలీల తరలింపుకు మరలా తెరలేచింది. 1861 నుండి 1870 మధ్య యానాం నుంచి సుమారు 3500 మంది కూలీలు రీయూనియన్‌ లోని చెరకు తోటలలో పనిచేయటానికి పంపించబడ్డారు. యానాం నుంచి బయలుదేరిన నౌకల కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి.

సంవత్సరం నౌక పేరు యానాం నుంచి బయలుదేరిన తేదీ తీసుకెళ్లిన కూలీల సంఖ్య చూడుడు ఫొటో

యానాం నుంచి బయలుదేరిన నౌకల వివరాలలో పైన ఉదహరించినవి కొన్ని మాత్రమే. మొత్తం మీద ఇరవై సంవత్సరాల కాలంలో యానాం నుంచి బయలు దేరిన పద్నాలుగు నౌకలలో సుమారు 3500 మంది, పాండిచేరీ నుంచి 13,000 మంది కలకత్తా నుంచి 9,000 మంది కూలీలు రీయూనియన్‌కు ఎగుమతి అయినట్లు రికార్డుల ద్వారా తెలుస్తున్నది. (రి. Mme. Mazard in her memoire de Maitrise “L’emigration indienne vers les colonies francaises from 1860 to 1880).


ఈ కాలంలో కూలీల సేకరణ మేస్త్రీల ద్వారా జరిగేది. వీరు యానాం నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాలనుంచి కూడా కూలీలను తీసుకువచ్చి యానాంలో కల ఏజెంట్లకు అప్పచెప్పేవారు. ఆ కూలీలకు ముందుగా మెడికల్‌ చెకప్‌ జరిగేది. చిన్న చిన్న వ్యాధులకు మందులు ఇచ్చేవారు. వృద్ధులను, పిల్లలను తీసుకొనేవారు కాదు. ఈ ప్రక్రియ అంతా ఒక ఇంగ్లీషు అధికారి సమక్షంలో జరిగేది. ఇలా ఎంపిక చేయబడిన కూలీలందరూ తాము ఐచ్ఛికంగానే జీవనోపాధికొరకు రీయూనియన్‌కు వెళుతున్నట్లు ఆయనకు ఒక అంగీకార పత్రాన్ని వ్రాసి ఇచ్చేవారు. తదుపరి ఆ కూలీలకు రెండునెలల జీతం (నెలకు 5 రూపాయిల చొప్పున మొత్తం 10 రూపాయిలు) ముందుగా చెల్లించి, నౌక బయలుదేరే తారీఖు వరకూ వారికి తిండి వసతులు కల్పించటం జరిగేది. ఈ మొత్తం వ్యవహారంలో ఏ రకమైన నిర్బంధాలు లేవని నిర్ధారించే బ్రిటిష్‌ అధికారికి నెలకు 250 రూపాయిల జీతం, సరఫరా చేసిన ఒకొక్క కూలీకు 3 రూపాయిల చొప్పున మేస్త్రీలకు, 24 రూపాయిల చొప్పున ఫ్రెంచి ఏజెంటుకు ముట్టేవి. 

1830 నాటి కాంట్రాక్టు పద్దతిలో ఒక్కొక్క కార్మికునకు నెలకు 7 రూపాయిల జీతం కాగా 1860 లో అది నెలకు 5 రూపాయిలు మాత్రమే కావటం గమనార్హం. ఏదైనా ఒక కుటుంబం అంతా ఈ విధమైన పద్దతిలో కూలీలుగా వెళ్ళేటపుడు, స్త్రీలకు పిల్లలకు నెలకు రెండు రూపాయిల యాభై పైసల చొప్పున జీతం ఉండేది. 1830 లో కూలి అడ్వాన్సుగా 21 రూపాయిలు ముందుగానే ఇచ్చేవారు, కానీ 1860 వచ్చేసరికి ఈ మొత్తం పదిరూపాయిలకు తగ్గిపోయింది. అయినప్పటికీ ఈ పద్దతిన వెళ్ళటానికి యానాం వాసులే కాక శ్రీకాకుళం, ఏలూరు, మచిలీపట్నం వంటి దూర ప్రాంతవాసులు కూడా వచ్చేవారు. 1862 లో యానాంలో Quillet Victor de Possel et Cie పేరుగల ఒక ఫ్రెంచి ఏజెన్సీ ద్వారా ఈ కూలీల లావాదేవీలు జరిగేవి. 

ఇదే సమయంలో ఇంగ్లీషువారు చేపట్టిన రైలు మార్గాల ఏర్పాటు, సాగునీటి కాలువల తవ్వకం (ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం చివరిదశకు చేరింది), బీడుభూముల్ని సాగులోకి తీసుకురావటం వంటి వివిధ పనులకు తీవ్రమైన కూలీల కొరత ఏర్పడటంతో, బ్రిటిష్‌ ప్రభుత్వం ఫ్రెంచివారు సాగిస్తున్న ఈ కూలీల ఎగుమతికి అనేక విధాలైన ఆటంకాలను కలిగించటం మొదలు పెట్టారు. మేస్త్రీలపై ఏడాదికి పదిరూపాయిల టాక్స్‌ విధించటం, మేస్త్రీలకు లైసెన్సులు జారీ చేసి వాటిని ప్రతీ సంవత్సరం మద్రాసులో ఉండే బ్రిటిష్‌ ఉన్నతాధికారిచే కౌంటర్‌సైన్‌ చేయించుకోవాలన్న నిబంధన విధించటం వంటివి వాటిలో ముఖ్యమైనవి.

1866 లో యానాం నుంచి ఆఖరు సారిగా కూలీలు పంపించబడ్డారు. తరువాత అలాంటి వ్యాపారం జరగలేదు. 1863 లో 775 మంది, 1864 లో 621 మంది, 1865 లో 184 మంది కూలీలను తరలించగా, 1865 లో మాత్రం సుమారు 1500 మంది యానాంనుంచి పంపించబడ్డారు. దీనికి కారణం అప్పట్లో ఒరిస్సాలో భయంకరమైన కరువు విలయతాండవం చేయటం వల్ల చాలా మంది ప్రజలు ఇలా వలస పోవటానికి సిద్దపడినట్లు అనుకోవాలి. 

ముగింపు

ఫ్రెంచి వారు తమ అవసరాల దృష్ట్యా కూలీలను తరలించటంలో మొదట కొన్ని అనాగరిక పద్దతులు పాటించినా (యేట్స్‌ ఉదంతం), కాలానుగుణంగా మానవీయ దృక్పధంతో వ్యవహరించినట్లే కనపడుతుంది. మరీ ముఖ్యంగా 1828 లో ప్రతిపాదించిన కాంట్రాక్టు పద్దతి ఈనాటికీ ఆదర్శప్రాయమే అనటం అతిశయోక్తి కాదు. షిప్పులో రవాణా సమయంలో ప్రతీ కూలీకి రోజుకు ఒక కేజీ బియ్యం తో వండిన అన్నం, 120 గ్రాముల పప్పులు, 200 గ్రాముల మాంసం లేక చేపలు మరియు మూడు లీటర్ల మంచినీరు ఇవ్వాలని నిబంధన ఉండేది. 1853 లో కారైకాల్‌ కు చెందిన కూలీలు సేకరించే ఒక మేస్త్రీ మైనారిటీ తీరని పిల్లలను కూలీలుగా ఎగుమతి చేయటానికి ప్రయత్నించినందుకు ఫ్రెంచి కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించటాన్ని బట్టి ఈ కూలీల సేకరణ ఇష్టమొచ్చినట్లు కాక, నిబంధనలకు లోబడే జరిగేదని అర్ధంచేసుకొనవచ్చును. 1854 లో పాండిచేరీ నుంచి బయలుదేరిన ఆగస్టస్‌ అనే షిప్పులో కూలీలు అనేక ఇబ్బందులకు గురయ్యారని పిర్యాదులు రావటంతో, ఫ్రెంచి ప్రభుత్వం రెజెల్‌ హ్యూబర్‌ అనే జడ్జితో విచారణ జరిపించి, షిప్పులో ప్రయాణించే కూలీలకు కనీస వసతి సౌకర్యాల కల్పనకు అనేక నిబంధనలను విధించింది. వీటి ఫలితంగా ఫ్రెంచి నౌకలలో తరలింపబడే కూలీలలో గమ్యస్థానాలకు చేరే లోపు జరిగే మరణాల శాతం 2.7 కు తగ్గింపబడిరది. కాగా బ్రిటిష్‌ నౌకలలో ఇది 7.8 గా ఉండేది. (]. Treaty Between Trade and Coolie: the case of Augustus (1854) by Jacques Weber CIDIF). 1885 నాటికి ఫ్రాన్స్‌ కూలీల సేకరణను పూర్తిగా నిలిపివేసింది.

ఫ్రెంచి మరియు బ్రిటిష్‌ వారు భారతదేశంలో వ్యాపారం చేయటానికి వచ్చారు. ఇరువురికీ మధ్య జరిగిన అనేక కలోనియల్‌ రాజకీయాలలో భాగంగా ఈ కూలీల ఎగుమతి విషయంలో ఫ్రెంచి వారిని ఇంగ్లీషువారు సమర్ధవంతంగా ఇరుకున పెట్టగలిగారు. యానాం నుంచి ఫ్రెంచివారు కూలీలను తరలించిటం అనేది ఈ ప్రాంతపు ఒక చారిత్రక సత్యం. ఏ దేశచరిత్రను తీసుకొన్నా ఇలాంటి నీలినీడలు కనిపిస్తాయనటంలో సందేహం లేదు. 

ఫ్రెంచి కరీబియన్‌ ద్వీపకల్పం లోని Sucre Island జనాభా ఏర్పడటంలో యానాం నుంచి 1849`1869 ల మధ్య ఎగుమతి చేయబడిన కూలీలు ప్రధాన పాత్ర వహించినట్లు ప్రొ. జాబ్స్‌ వీబర్‌ అభిప్రాయపడ్డాదు. (].GHC Bulliten, 16 May, 1990, page no. 134). అలా తరలించబడిన వారిలో ఎంత మంది తిరిగి వచ్చారో, ఎంత మంది అక్కడే స్థిరపడి పోయారో......

(ఈ వ్యాసం నేను రచించిన "ఫ్రెంచిపాలనలో యానాం" (2010) నుండి)

బొల్లోజు బాబా

No comments:

Post a Comment