Wednesday, April 17, 2024

మనవి మాటలు

గత నాలుగేళ్ళుగా రాస్తున్న చరిత్ర వ్యాసాలను వేదబాహ్యులు అనే పేరుతో పుస్తకరూపంలోకి తీసుకొని వద్దామని నిర్ణయించుకొన్నాక రాతప్రతిని ఎవరైన రివ్యూ చేస్తే బాగుంటుందని అనిపించింది.

శ్రీ ఉరుపుటూరి శ్రీనివాస్ గారు ఈ ఫేస్ బుక్ లో పరిచయం. నాలుగేళ్ళ క్రితం హిందూ ఆలయాలకు ఏం జరిగింది అనే నా పోస్టు లో వారూ నేను మొదటి సారిగా అభిప్రాయాలు పంచుకొన్నాం. ఇటీవల భిన్నమతాలలో ఉమ్మడి పాత్రలు అనే పోస్టులో కూడా చర్చించుకొన్నాం. ఈ పరిచయంతోనే శ్రీనివాస్ గారు ఎంతో ప్రేమతో నాకు Douglas Ober రాసిన Dust on the throne అనే పుస్తకాన్ని కాన్కగా కొరియర్ లో పంపించారు. చాలా సంతోషం వేసింది. అంతర్జాల మిత్రులనుండి గిఫ్ట్ అందుకోవటం అది రెండవ సారి . ఎప్పుడో బ్లాగుల కాలంలో వేల్పూరి సుజాత గారు జరుక్ శాస్త్రి పేరడీల పుస్తకాన్ని పంపించారు.
 
శ్రీనివాస్ గారు మంచి చదువరి, బహుభాషా కోవిదులు, విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి నిర్ధారించుకొంటే తప్ప విశ్వసించరు. నేను చూసినంత మేర భద్రుడు గారి తరువాత నాకు తటస్థించిన అంతటి వొరేషియస్ రీడర్ శ్రీనివాస్ గారే.
 
శ్రీనివాస్ గారిని ఈ వ్యాసాలను ఎడిట్ చేసిపెట్టమని అడిగాను కొంత జంకుతూనే. వారు అంగీకరించి ఎంతో లోతుగా ఈ వ్యాసాలను రివ్యూ/ఎడిట్ చేసారు. చాలా అక్షరదోషాలను, వాక్యనిర్మాణ దూడలను సరిచేసారు. ప్రతీ అధ్యాయాన్ని సమీక్షించి చెప్పిన విలువైన అభిప్రాయాలు, లోచూపు ఈ రచనను ఎంతో మెరుగుపరిచాయి. ఎడిటర్ గా పేరు వేసుకొంటాను అని అడుగగా సున్నితంగా తిరస్కరించారు.
 
జనరల్ గా నా ఏ పుస్తకానికైనా ముందుమాటలలో మిత్రులందరి పేర్లు ప్రస్తావించటం పరిపాటి. ఈ పుస్తకానికి ఒక్క శ్రీ ఉరుపుటూరి శ్రీనివాస్ గారి పేరు మాత్రమే ఉండటం వెనుక కారణం ఇది.
వారికి సదా ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను

వేదబాహ్యులు పుస్తకానికి నేను రాసుకొన్న ముందుమాట ఇది.
ఈ పుస్తకం లభించుచోటు- పల్లవి పబ్లికేషన్స్, శ్రీ వి.నారాయణ గారు, ఫోన్ నంబరు. 9866115655 సంప్రదించగలరు.
*******
మనవి మాటలు
.
ప్రాచీన భారతదేశ ప్రజల విశ్వాసాల గురించి అధ్యయనం చేయటం ఒక నిరంతర శోధన. వైదిక సంప్రదాయం హిందూమతం రూపుదిద్దుకొనకముందు ఈ నేల భిన్న సంప్రదాయాలకు, విశ్వాసాలకు ఆలవాలంగా ఉంది. హిందూ మతానికి వెలుపల బౌద్ధులు, జైనులు, చార్వాకులు, ఆజీవికులు లాంటి ఎందరో ఈ నేలపై జీవించారు. ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించారు.
హిందూమతం మాత్రమే భారతదేశపు ఆత్మ అని పలికే మాటలకు ఈ వేదబాహ్య సంస్కృతి ఒక కనువిప్పు.
 
కూర్మపురాణం (CE 550-800) బౌద్ధులు, జైనులు, పాంచరాత్రికులు, కాపాలికులు, పాశుపతులు అంటూ ఐదురకాల వేదబాహ్యులను పేర్కొనింది. పాంచరాత్ర పూజావిధానం (cult) మొదట్లో వేదబాహ్యంగా ఉన్నప్పటికీ క్రమేపీ వైష్ణవంలో కలిసిపోయి వేదావలంబిగా మారిపోయింది.
వేదబాహ్యులను నీతిశాస్త్రాలు చాలా తక్కువ చేసి మాట్లాడాయి. గృహస్తులెవరూ వీరిని ఆదరించరాదని మనువు; నాస్తికులను పరిహరించాలని యాజ్ఞవల్క్యుడు; సాక్షులుగా పెట్టుకోరాదని నారదుడు; ఆపత్సమయాలలో వేదబాహ్యుల ఆస్తులను రాజు స్వాధీనం చేసుకొనవచ్చునని అంతేకాక వారితో సన్నిహితంగా ఉండేవారిపై అధికపన్నులు విధించవచ్చునని కౌటిల్యుడు; వేదబాహ్యులు రాజ్యంలోకి ప్రవేశించరాదని సౌరపురాణము; వేదబాహ్యులను రాజు శిక్షించాలని శుక్రనీతిసారము- అంటూ నీతిశాస్త్రకారులు తమ గ్రంథాలలో వీరిపట్ల సమాజం వ్యవహరించాల్సిన పద్దతులను నిర్దేశించారు.
 
ఇన్ని వెలివేతలు పెట్టినా సంఘంలో వేదాలను ధిక్కరించి జీవించేవారి సంఖ్య తక్కువ ఏమీ ఉండేది కాదు.
 
“History of India is nothing but the battle between Buddhism and Brahmanism.” – Dr. B.R. Ambedkar

ఈ వైదిక, అవైదిక విశ్వాసాలు చరిత్రలో ఘర్షించుకొన్నాయి. ఒకదానినొకటి మెరుగుపరుచుకొన్నాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. వేదబాహ్యులు భారతీయ ఆత్మను, బహుళతను తీర్చిదిద్దారు. వ్యక్తులు గతించిపోతారేమో కానీ వారు చేసిన ఆలోచన నమసిపోదు
‌‍****
బాబ్రిమసీదు కూల్చివేత ఆధునిక భారతదేశ చరిత్రలో కీలకమలుపు. ద్వేషం, విభజన నింపుకున్న రాజకీయాల కారణంగా ఒకే దేవుడు, ఒకేమతం, ఒకే సంస్కృతి లాంటి అంశాలు ముందుకు వచ్చాయి. ఇవి భారతీయ ధర్మంలోని బహుళతను విచ్ఛిన్నం చేస్తున్నాయి.
ఇప్పుడు అన్నిచోట్లా మెజారిటేరియన్ వాదం ప్రబలంగా నడుస్తూంది.
 
ఈ దేశ సంస్కృతిని నిర్మించటంలో ప్రధాన పాత్రవహించిన వేదబాహ్యులు నేడు సమాజపు అంచుల్లోకి నెట్టబడ్డారు. నిజానికి వీరు ఈ దేశమూలవాసులు.
 
చరిత్రలో వేదబాహ్యులు నెరపిన సామాజిక, సాంస్కృతిక పాత్రను గురించి ఈ వ్యాసాలు మాట్లాడతాయి. స్వేచ్ఛ, సమానత్వం, కార్యకారణ వివేచన, లౌకికత్వం కొరకు వారు ఎలా నిలబడ్డారో చెబుతాయి. నేటి మెజారిటేరియన్ భావజాలానికి ఒకనాడు సమవుజ్జీలుగా నిలిచిన భిన్న ప్రత్యామ్నాయ విశ్వాసాలకు ఈ పుస్తకం అద్దంపడుతుందని ఆశిస్తున్నాను.
ఈ పుస్తకరచనలో శ్రీ విరుపుటూరి శ్రీనివాస్ గారు చేసిన సూచనలు, సలహాలు ఎంతో విలువైనవి. ఈ పుస్తకం యొక్క ప్రతి అథ్యాయాన్ని సమీక్షించి చెప్పిన విలువైన అభిప్రాయాలు, లోచూపు ఈ రచనను మెరుగుపరచాయి. వారి మేధకు, వెచ్చించిన కాలానికి నేను ఋణపడి ఉన్నాను.
 
బొల్లోజు బాబా
17/3/2024
.
ఈ పుస్తకం లభించుచోటు- పల్లవి పబ్లికేషన్స్, శ్రీ వి.నారాయణ గారు, ఫోన్ నంబరు. 9866115655 దయచేసి ఆదరించండి.



No comments:

Post a Comment