Saturday, September 16, 2023

గోపాల్ పరిశోధన గొప్ప కాన్క....


ఆప్తులు మరణించినపుడు కవులు తమకు వారితో ఉన్న అనుబంధాలను, జ్ఞాపకాలను నెమరువేసుకొంటు రాసే కవితలను స్మృతి కవితలు అంటారు.

ప్రముఖ కవి, విమర్శకుడు డా. సుంకర గోపాల్ తన డాక్టరేట్ గ్రంధాన్ని "వచన కవిత్వంలో స్మృతి" పేరుతో పుస్తకంగా తీసుకొని వచ్చారు.

ఏదైనా సిద్ధాంతవ్యాసం వెర్టికల్ అధ్యయనం కాక హారిజాంటల్ అధ్యయనంతో ఉన్నప్పుడు ఎక్కువ ఆసక్తి కలిగిస్తుంది. డా.గోపాల్ సిద్ధాంత గ్రంధం హారిజాంటల్ అధ్యయనం. ఈ పుస్తక రచన కొరకు 163 కవిత్వ సంపుటాలు, 22 కవిత్వ సంకలనాలు, 12 స్మృతి సంచికలు, 17 మాసపత్రికలు, 7 పరిశోధనా గ్రంథాలు సంప్రదించారంటే ఇది ఎంత విస్త్రుతమైన అధ్యయనమో అర్ధం చేసుకొనవచ్చును.

దీనిలో 230 మంది కవులు రాసిన సుమారు ఆరువందలకు పైన వివిధ స్మృతి కవితలను ఉటంకించారు. చాలా లోతైన పరిశోధన.

ఈ స్మృతి కవితలను- కుటుంబసభ్యుల స్మృతి, ఆత్మీయుల స్మృతి, కళారంగం, సామాజిక రంగం, రాజకీయరంగం, మరలా ఒక్కోదానిలో ఏడెనిమిది విభాగాలు అంటూ ఇన్ని రకాలుగా వర్గీకరించవచ్చా అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజాయితీతో, ఎంతో శ్రమించి చేసిన పని ఇది.
తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ గ్రంధాలు పుస్తకాలుగా వచ్చినవాటిలో సినారె "ఆధునికాంధ్ర కవిత్వము-సంప్రదాయములు ప్రయోగములు" చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఇటీవలి కాలంలో అదే స్థాయిలో కొని దాచుకోదగినది డా. సుంకర గోపాల్ రచించిన ""వచన కవిత్వంలో స్మృతి" గ్రంధం. ఎందుకంటే దీనిలో గత యాభై అరవై సంవత్సరాలలో తెలుగు వచన కవిత్వంలో వచ్చిన స్మృతి కవితలన్నీ దాదాపు కొలువుతీరినట్లే .

ఈ పరిశోధనకు ఆచార్య డా. మేడిపల్లి రవి కుమార్ పర్యవేక్షణ వహించారు.
డా. సుంకర గోపాల్ కు అభినందనలు.

****
ఈ పుస్తకంలోని అన్ని వాక్యాలనూ ఊరడించే వాక్యమిది.
.
అంతే కదా!
మృత్యువుతో యుద్ధం చేసి
ఎవరు మాత్రం గెలవ గలరు
.
(అనుపమ, బండ్ల మాధవరావు)
.
పుస్తకము లభించు చోటు: 9492638547
వెల : 400/-
ఆసక్తి కలిగిన వాళ్ళు
9492638547 నెంబర్ కి 400/- ఫోన్ పే చేసి
చిరునామా పంపితే పోస్ట్ చేస్తారు.
Facebook ID Gopal Sunkara
బొల్లోజు బాబా

No comments:

Post a Comment