Saturday, January 10, 2026

ఒక పెద్దాయన వాల్ పై.....

ఒక పెద్దాయన వాల్ పై --- "శంకరుడి తర్వాత...మళ్లీ ఈనేలలో మరెవడూ తాత్వికుడిగా పుట్టలేదు..!!" అనే మాటను విభేదించి డా. అంబేడ్కర్, ఫూలే, పెరియార్, రామస్వామి లాంటి తాత్వికులు మీకు కనిపించరా అని ప్రశ్నించాను. (ఆయనపట్ల నాకు గౌరవమే.) కానీ అక్కడ నేను ఎప్పుడెప్పుడో బ్లాక్ చేసిన అసహన పండితులందరూ చేరి నన్ను బాగానే తిట్టుకొన్నారు. Its ok. No problem.

ఇక ఈ అంశంపై కొంత వివరణ ఇది.

మనిషి, సమాజం, జీవితం, సత్యం, మానవ సంబంధాలు వంటి ప్రశ్నలపై తర్కబద్ధమైన, విమర్శనాత్మక ఆలోచనలనే తాత్వికశాస్త్రం అని అలా ఆలోచించే వ్యక్తిని తాత్వికుడు లేదా దార్శనికుడు అనీ అంటారు.
 
తత్వవేత్తలు సంప్రదాయాలను ప్రశ్నిస్తారు, కొత్త ఆలోచనా వ్యవస్థను నిర్మిస్తారు, మానవ అస్తిత్వాన్ని నిర్వచిస్తారు. ఈ పరిధిలోంచి చూసినపుడు మహాత్మా ఫూలే, డా.అంబేద్కర్, పెరియార్ లు ఇరవయ్యోశతాబ్దపు తత్వవేత్తలు.
 
1. మహాత్మా జ్యోతిరావు ఫూలే (1827–1890)
ఈయన చారిత్రిక నైతిక కారణాలు చూపి వేదాల ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. సమానత్వం ప్రాతిపదికన మానవసమాజాన్ని ఊహించాడు. పుట్టుక ఆధారంగా మనుషుల విభజన ఉండరాదని చెప్పారు. ఈయన రాసిన 'గులాంగిరీ' ఒక రాజకీయ తత్వశాస్త్ర గ్రంథం. దీన్ని రూసో లేదా మార్క్స్ రచనలతో పోల్చవచ్చు.

2. పెరియార్ ఇ.వి. రామసామి (1879–1973)
ఈయన హేతువుతో ఆలోచించి దేవుడిని, ఆత్మను, పునర్జన్మను అంగీకరించలేదు . కులం అనేది ఒక వ్యవస్థీకృత హింస అని వివరించాడు. నైతికత అనేది శాస్త్రాల నుండి కాదు, సామాజిక న్యాయం నుండి రావాలని చెప్పాడు. పెరియార్ ఆలోచనలు నీషే (Nietzsche) ఆలోచనలకు దగ్గరగా ఉంటాయి

3. డా. బి.ఆర్. అంబేద్కర్ (1891–1956): భారతదేశం అందించిన అత్యున్నత మేధావి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం వంటి పదాలకు భారతీయ పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త నిర్వచనాలు ఇచ్చారు.
ఈయన ప్రతిపాదించిన కుల నిర్మూలన అనేది కేవలం సామాజిక సంస్కరణ కాదు, ఒక నైతిక దిశానిర్ధేశనం. నవయాన బౌద్ధం ద్వారా దేవుడు లేని మానవతావాదాన్ని ప్రతిపాదించారు.
***

నేటి పండితులు తత్వశాస్త్రాన్ని ఇప్పటికీ శంకరుడు, రామానుజుడు, మాధ్వుడు, నింబార్కుడు, వల్లభాచార్యుడు వంటి కొన్ని పేర్ల చుట్టూనే తిప్పుతారు. వీరందరూ బ్రాహ్మణిజానికి కేంద్రంగా ఉండే కర్మ సిద్ధాంతం, వర్ణాశ్రమ ధర్మాలు, జన్మ ఆధారిత హెచ్చుతగ్గుల వ్యవస్థ, బ్రాహ్మణాధిక్యత లాంటివాటిని తాత్వికంగా సమర్థించినవారే. ఈ ధోరణి సమాజంలోని అసమానతలను ప్రశ్నించకుండా, అవే సహజమైనవన్నట్లుగా చూపుతుంది. తత్వచింతనను “వేదాలు–బ్రాహ్మణులు–సంస్కృతభాష” అనే పరిమితిలో బంధించి, సామాజిక అనుభవాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వదు.
 
బ్రాహ్మణీయచట్రంలో కుదురుకొనే గాంధీ, సర్వేపల్లి రాధకృష్ణ, జిడ్డు కృష్ణమూర్తి, అరవిందో లాంటివారిని సమకాలీన పండితులు తత్వవేత్తలుగా అంగీకరిస్తారు కానీ బ్రాహ్మనిజాన్ని ధిక్కరించిన బుద్ధుడు, చార్వాకులు డా. అంబేడ్కర్, ఫూలే, పెరియార్, రామస్వామి, కంచె ఐలయ్య లాంటి వారిని ఒప్పుకోలేరు.

నిజానికి నేడు తత్వశాస్త్రం అంటే – సమాజం, మానవజీవితం పై చేసే తార్కిక విమర్శనాత్మక విశ్లేషణ. ఆధిపత్యధోరణులను సమర్ధించే వేదాంతం కాదు.
 
తత్వశాస్త్రం ఆధిపత్యం నుంచి విముక్తి వైపుకు పంతొమ్మిదో శతాబ్దంలోనే మార్క్స్ సిద్ధాంతంతో దిశమార్చుకుంది. ఈ మార్పు ఇప్పటికీ ఈ పండితుల కళ్లకు కనిపించటం లేదు. ఇంకా పాచిపళ్ళ పాటలే పాడుతున్నారు.

బొల్లొజు బాబా
పిఎస్. అక్కడ చర్చలో నా తరపున రెండుమాటలు మాట్లాడిన Sreerama Murthy గారికి, Pasunoori Ravinder అన్నకు ధన్యవాదములు

No comments:

Post a Comment