Friday, September 10, 2021

కువలయమాల Part 2

 కువలయమాల Part 2

.
కువలయమాల లో పూర్వకవుల ప్రశస్థిని చెప్పే అంకంలో ఉద్యోతనసూరి తాను ఇష్టపడే కవులపట్ల వినయాన్ని ఇలా ప్రకటించుకొన్నాడు.
.
పాలితుడు, శాతవాహనుడు, చప్పన్నయ రచనలు
సింహగర్జనల వలె ఉంటాయి
నేనో జింకపిల్లను
ఒక్క అడుగు ముందుకు ఎలా పడుతుంది?
.
పైన ప్రస్తావించిన ముగ్గురు ప్రాకృత కవులలో పాలితుడు తరంగవతి పేరుతో గొప్ప ప్రాకృత కావ్యాన్ని రచించిన జైన కవి. ఒకటో శతాబ్దానికి చెందినవాడు. ఈ రచన నేడు అలభ్యం. ఇతను గాథాసప్తశతి సంకలనకర్త అయిన హాల చక్రవర్తి ఆస్థాన కవి.
శాతవాహనుడు అంటే హాలచక్రవర్తి. శాతవాహనుల కాలంలో చప్పన్నయల పేరుతో కొంతమంది కవులు ఉండేవారని; వీరి గురించిన ప్రస్తావనలు దండి, అభినవగుప్తుని రచనలలో కనిపిస్తాయని; వీరు మొత్తం 56 మంది అని పండితుల అభిప్రాయం. Chappaṇṇayagāhāo అనేది వీరి గాథల సంకలనం. ఇవి కూడా సప్తశతి గాథలవలె ఉంటాయి. ఈ రచన నేడు అలభ్యం.
***
కువలయమాల ఒక చారిత్రిక సంధికాలంలో వ్రాసిన కావ్యం. అంతవరకూ ప్రజల భాషగా, కావ్యభాషగా చలామణీ అయిన ప్రాకృత భాషను సంస్కృతభాష క్రమేపీ తొలగించుకొంటూ వస్తున్నకాలమది. ప్రాకృతభాష జైన బౌద్ధాల మతభాష. సంస్కృతం హిందూమతభాష. సామాజికంగా సనాతనధర్మం/వైదికమతం హిందూమతంగా స్థిరీకరింపబడుతున్న కాలం కూడా అది.
ప్రాకృతభాషను ప్రేమించి, దానిలో గొప్ప సాహిత్యాన్ని సృజించిన ఉద్యోతనసూరి, వాక్పతిరాజు లాంటి కవులకు ప్రాకృతభాష అలా అప్రాధాన్యమవటం బాధకలిగించి ఉండవచ్చు. గౌడవహోలో వాక్పతిరాజు తన ఆవేదనను ఆత్మగౌరవ ప్రకటనారూపంగా ఒక గాథలో ఇలా నిక్షిప్తం చేసాడు.
.
ప్రాకృతభాషలోని అద్భుతసౌందర్యాన్ని
తృణీకరించే వారిని చూసి
మేము జాలిపడతాం, నవ్వుకొంటాం తప్ప బాధపడం;
గొప్పకవిత్వాన్ని విస్మరిస్తున్నందుకు
మేమెందుకు దుఃఖపడాలి? (95)
.
పై గాథను బట్టి ప్రాకృత రచనలను విస్మరించటం ఏడవశతాబ్దం నాటికే మొదలైందని అర్ధం చేసుకొనవచ్చును. దూసుకొస్తున్న సంస్కృతం ధాటికి ప్రాకృతంలో ఉండిన గొప్పసాహిత్యం కనుమరుగు అవ్వొచ్చు అనే ఊహ ప్రాకృతకవులను బాధించింది. అయినప్పటికీ ప్రాకృతసాహిత్యాన్ని తృణీకరించటం వల్ల సమాజమే నష్టపోతోంది మాకేం బాధ అనటం ఒక చారిత్రిక సందర్భాన్ని ఘనీభూతం చేయటమే.
***
ఉద్యోతనసూరి కూడా ఒకనాటి సంస్కృత, ప్రాకృత భాషల మధ్య నడిచిన రాజకీయాలను ఒక ఘట్టం ద్వారా కువలయమాలలో నిక్షిప్తం చేసాడు.
ధనదేవుడు అనే వ్యాపారి నౌకాభంగం వల్ల ఒడ్డుకు కొట్టుకొని వచ్చి ఒక అడవి చేరతాడు. అక్కడ అతను నరమాంసభక్షకులను భీకరమైన గంఢభేరుండ పక్షులను తప్పించుకొని ఒక చెట్టుక్రిందకు చేరి విశ్రమించగా కొద్దిసేపటికి అతనికి వింతైన భాషలో సంభాషణలు వినిపిస్తాయి. ఆ సంభాషణలు ఏ భాషకు చెందినవో అర్ధం కాక పరిపరివిధాలుగా ఇలా తర్కించుకొంటాడు.
“““““““““నేను వింటున్నది ఏ భాష? సంస్కృతం కాదు. ఎందుకంటే సంస్కృతం దుష్టుని హృదయంలా కఠినంగా ఉంటుంది; పదాలకు నానార్ధాలతో, వాక్యనిర్మాణానికి వందల మెలికలతో; అర్ధం చేసుకోవటానికి కష్టంగా ఉంటుంది. ఇది అలా లేదు.
ఇది ప్రాకృతమా? కాదు. ఎందుకంటే ప్రాకృతం మంచివారి పలుకుల్లా ఆనందాన్నిస్తుంది; గొప్ప వ్యక్తులు జీవితసాగరాన్ని మధిస్తూంటే, ఎగసిపడే జ్ఞాన కెరటాలతో, పైకి ఉబికే అమృతంతో ప్రాకృతభాష నిండి ఉంటుంది. పదాల శబ్దార్ధాలు పరస్పరం పరిపూర్ణతనొంది ఉంటాయి. వింటున్న ఈ భాష అలా లేదు.
కాకపోతే ఇది అపభ్రంశమా? అదీ కాకపోవచ్చు. ఎందుకంటే అపభ్రంశ భాష సెలయేటి గలగలల సౌకుమార్యాన్ని, వరద ప్రవాహపు భీకరత్వాన్ని కలగలుపుకొని ఉంటుంది. సంస్కృత, ప్రాకృత పదాలను ఇముడ్చుకొని ఉండే ప్రియుని కల్లాపంలా ఏకకాలంలో కఠినంగాను, సున్నితంగానూ ఉండగలదు. ఇది అలా లేదు””””””””””
ఉద్యోతనసూరి పై సంఘటన ద్వారా సంస్కృతం, ప్రాకృతం, అపభ్రంశ (సంస్కృత, ప్రాకృతాల మిశ్రమ భాష) భాషలపై తనకున్న అభిప్రాయాలను చెప్పాడు. జాగ్రత్తగా గమనిస్తే సంస్కృతం పట్ల ఉద్యోతనసూరి అసహనం, ప్రాకృతం పట్ల అవ్యాజప్రేమను సులభంగానే పోల్చుకోవచ్చు. ఇక సంస్కృత భాష అనేది దుష్టుల భాషగా ప్రాకృతం మంచివారి భాషగా చెప్పటం కూడా గమనార్హమే.
Rogue Stories (Dhūrtākhyāna) అనే పేరుతో హిందు పురాణగాథలలోని తర్కరాహిత్యాన్ని, అసంబద్దతలను విమర్శిస్తూ వివాదాస్పద వ్యంగ్య రచన చేసిన జైన హరిభద్రసూరి శిష్యుడైన ఉద్యోతనసూరి అభిప్రాయాలు అంతకు భిన్నంగా ఎలా ఉండగలవు?
***
ధ్వన్యాలోక, కావ్యప్రకాశ, కావ్యాలంకార, అలంకార రత్నాకర, రసగంగాథర లాంటి అలంకారగ్రంథాలలో; కాళిదాసు, దండి, భవభూతి లాంటి ప్రముఖ సంస్కృత కవుల రచనలలో వేలాది ప్రాకృత గాథలను నేడు గుర్తించగలుగుతున్నారు. (Ref: Prakrit verses in Sanskrit works on Poetics by V.M. Kulkarni). ప్రాకృతంలోని అందమైన సాహిత్యాన్ని కొందరు రసజ్ఞులు రాజకీయాలు పక్కనపెట్టి సంస్కృతంలోకి తెచ్చి ఉంటారు బహుసా.
.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment