Friday, September 10, 2021

కువలయమాల Part 1

 కువలయమాల Part 1

కువలయమాల ఉద్యోతన సూరి అనే జైనాచార్యుడు CE 779 లో ప్రాకృతభాషలో వ్రాసిన కావ్యం పేరు. కువలయమాల అంటే “నీలి కలువల మాల” అని అర్ధం. కువలయమాల చంపూ లక్షణాలు కలిగిన కావ్యం. చంపూ లక్షణం అంటే పద్యము గద్యము కలగలిసి ఉండటం. ఈ తరహా శైలికి ఇదే ప్రధమమని ఆ తరువాత ఇదే బాణీలో అనేక కావ్యాలు వెలువడ్డాయి అంటారు.
చంద్రపాలుడనే యువరాజు, కువలయమాల అనే కధానాయికని పెండ్లాడటం కావ్య ఇతివృత్తం. కథాగమనంలో క్రోధం, గర్వం, వంచన, లోభం, మోహం లాంటి మానవ లౌల్యాలను వరుసగా చంద్రసోము, మానభట్టు, మాయాదిత్యుడు, లోభదేవుడు, మోహదత్తుడు అనే ప్రతీకాత్మక (allegorical) పాత్రలుగా చేసి వారితోనే వారి జీవిత అనుభవాలను చెప్పించి తద్వారా జైనమత ధర్మాలను బోధింపచేసాడు ఉద్యోతనసూరి.
కువలయమాలలో సాహిత్య అంశాలకన్న ఒకనాటి సామాజిక, రాజకీయ అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. వీటిలో కొన్ని ఆంధ్రదేశానికి చెందినవై ఉండటం మరింత ఆసక్తిదాయకం.
.
ఉద్యోదనసూరి
ఉద్యోతన సూరి క్షత్రియ వర్ణానికి చెందిన వ్యక్తి. ఇతనికి దాక్షిణ్యసింహ అనే మరోపేరు కూడా కలదు. ఇతను ఈ కువలయమాల కావ్యాన్ని నేటి జోధ్ పూర్ పట్టణానికి 75 మైళ్ళ దూరంలో ఉన్న సుక్రి నది ఒడ్డున కల జాబాలిపుర అనే ఊరిలో నివసిస్తూ రాసినట్లు, రాజహస్తిన్ వత్సరాజు తన ప్రభువు గాను చెప్పుకొన్నాడు. రానహస్తిన్ వత్సరాజుకి చెందిన 9 నాణాలు కానౌజ్ వద్ద లభించాయి. ఉద్యోదనసూరి గురువు జినాచార్య హరిగుప్తుడు.
***
కువలయమాల కథానాయకుడు కథానాయికిని వెతుక్కొంటూ విజయపురి అనే పట్టణాన్ని చేరుకొంటాడు. ఈ విజయపురి కృష్ణా నది ఒడ్డున, సముద్రయానానికి అనువైన నౌకాశ్రయానికి కొద్దిమైళ్ళ దూరంలో ఉండి అయోధ్యనుంచి ఒక నెల మూడురోజుల వ్యవధిలో చేరుకోగలిగే నగరంగా వర్ణించబడింది. కువలయమాల రచనా కాలానికి ఆంధ్రప్రాంతంలో ఇక్ష్వాకుల పాలన, నాగార్జున కొండ వైభవం చారిత్రికంగా కనిపించే విశేషాంశాలు. అప్పట్లో ఈ ప్రాంతం వ్యాపారరంగంలో, విద్యాపరంగా ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానంలో ఉండేది. కథానాయకుడు విజయపురి నగరసంచారం చేసి అనేక విషయాలను గమనించినట్లు చెప్తూ ఆనాటి అనేక సమకాలీన అంశాలను తన రచనలో పొందుపరిచాడు ఉద్యోతనసూరి.
విజయపురిలో ఉన్న ఒక ఆశ్రమపాఠశాలలో కర్ణాటక, లాట, మాళవ, కన్యాకుబ్జ, నాసిక్, మహరాష్ట్ర, సౌరాష్ట్ర, డక్క, సింధు లాంటి దేశాలనుంచి వచ్చిన విద్యార్ధులు వ్యాకరణం, బౌద్ధం, సాంఖ్యం, జైన, చార్వాక దర్శనాలు, 72 కళలు, 64 విజ్ఞానాలు (నిమిత్త, మంత్ర, యోగ, Ajñana (ప్రాచీన నాస్తికవాదం), బ్లాక్ మాజిక్, ధాతువాదం, యక్షిణిసిద్ధి, యుద్ధవిద్య, యోగమాల, యంత్రమాల, జ్యోతిష్య, రసాయిన, చందస్సు, వృత్తినిరుక్త, పాత్రచ్ఛేధ లాంటి విద్యలు) నేర్చు కొంటున్నారట. (150-151 verse).
ఈ సందర్భంగా వేదాధ్యయనం చేస్తున్న కొద్దిమంది విద్యార్ధులను ఎద్దేవాచేస్తూ ఉద్యోతన సూరి కొన్ని వ్యాఖ్యలు చేసాడు.
““““““““వీరు వేదాలను భట్టీయం వేస్తున్నారు; బలమైన కండలు తిరిగిన దేహంతో నిత్యం వ్యాయామం చేస్తూ లెక్కలేనితనంతో హింసాత్మక ధోరణితో జీవిస్తున్నారు; వీళ్ళంతా నైతికవిలువలు లేని మూర్ఖుల సమూహం””””””””.
.
హిందూమతం ఇంకా పూర్తిగా స్థిరీకరింపబడని కాలంలో వేదాలను అధ్యయనం చేస్తున్న హిందు విద్యార్ధుల పట్ల జైనుడైన ఉద్యోదనసూరి చేసిన ఈ వ్యాఖ్యలు చారిత్రికంగా విలువైనవి.
పైన చెప్పిన ఆశ్రమపాఠశాల ఆంద్రదేశంలో అప్పటికే ప్రసిద్ధిచెందిన ఆచార్యనాగార్జునిని విశ్వవిద్యాలయం కావొచ్చును. ఆచార్యనాగార్జునుడు (150-250 CE) ఆధ్వరంలో నెలకొల్పిన బౌద్ధవిద్యాలయం 5 అంతస్థులతో 1500 గదులు కలిగి ఉన్నదని చైనా యాత్రికుడు ఫాహియాన్ (ఐదో శతాబ్దం) పేర్కొన్నాడు.
***
విజయపురి విఫణివీధులలో వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారస్తులను కథానాయకుడు పరిశీలించి వారు 18 రకాల భాషలు మాట్లాడుతున్నట్లు గుర్తిస్తాడు. వీరిలో ఆంధ్రుల గురించి ఇలా ఉన్నది…....... ఆంధ్రులు రసికులు, యుద్ధప్రియులు, అందగాళ్లు, భోజనప్రియులు. వారు అతి పుతి రతిమ్ అని మాట్లాడుకొంటున్నారు (They utter ati puti ratim). ఇంతే కాక ఈ విఫణివీధి ఘట్టంలో – మధ్యదేశస్థులు మాటకారులని; మగథవారు అందవికారులని; సైంధవులు సున్నితులని; గుర్జరులు దైవభక్తులని; మాళవులు ఉద్రేకస్వభావులని; కర్ణాటకులు గర్విష్టులని; మహరాష్ట్రీయులు కలహప్రియులని అంటూ చేసిన పరిశీలనల ద్వారా ప్రాంతాన్ని బట్టి అక్కడి వ్యక్తుల ప్రవర్తనను కల్పన చేయటం విశ్వసనీయంగా అనిపించకపోయినా, ఒకనాటి ఆంధ్రదేశంలో కృష్ణానది ఒడ్డున ఉండిన విజయపురి అనేక జాతులు నివసించిన కాస్మొపొలిటన్ నగరమని మాత్రం అవగతమౌతుంది.
ఇంకాఉంది
References
Kuvalayamala by A.N. Upadhye
Language of snakes by Andrew Ollett

No comments:

Post a Comment