Saturday, March 29, 2025

భారతదేశ ఆధ్యాత్మిక విప్లవం - భక్తి ఉద్యమం


భారతదేశ చరిత్రలో భక్తి ఉద్యమం (7-17 వ శతాబ్దాలు) అత్యంత గొప్ప ఆధ్యాత్మిక, సామాజిక విప్లవం. బ్రాహ్మణాధిపత్యం పట్ల వ్యతిరేకత, హెచ్చుతగ్గుల కులవ్యవస్థపట్ల నిరసన, సమానత్వభావన, వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవం లాంటివి భక్తి ఉద్యమం ప్రచారం చేసిన ప్రధాన అంశాలు. ఇది తమిళ ఆళ్వార్లు, నాయనార్లతో మొదలై ఉత్తరభారతదేశంలో వ్యాపించింది.
బ్రాహ్మణాధిపత్యాన్ని, వైదిక క్రతువులను, హెచ్చుతగ్గుల వర్ణవ్యవస్థను నిరసించిన బౌద్ధం క్రమేపీ క్షిణించటంతో ఆ భావధారకు కొనసాగింపుగా ప్రజలు భక్తి ఉద్యమాన్ని నిర్మించుకొన్నారు. బౌద్ధం ఆనాటి ప్రజల భాష అయిన పాళి భాషలో తన బోధనలను ప్రచారం చేసినట్లుగానే భక్తి ఉద్యమం కూడా తమిళం, కన్నడం, మరాఠి, హిందీ, పంజాబీ లాంటి స్థానిక భాషలద్వారా ప్రజలను ప్రభావితం చేసింది. బౌద్ధం, చార్వాకం అంతరించిపోవటం వల్ల కలిగిన ఆధ్యాత్మిక శూన్యతను భక్తి ఉద్యమం భర్తీ చేసింది. నిజానికి బౌద్ధాన్ని బలవంతంగా నిర్మూలించినా, ప్రజల సామూహిక జ్ఞాపకాలలోంచి బౌద్ధం తొలగిపోలేదు. దాని తాలూకు సారం కొన్ని కొన్ని మార్పులతో భక్తి ఉద్యమం రూపంలో కొనసాగింది.

భక్తి ఉద్యమం ఏం చేసింది?

భక్తి ఉద్యమకారులు కులఅసమానతలను ఖండించారు. సంస్కృతాన్ని తిరస్కరించారు. దేవుని చేరుకోవటానికి మధ్యలో పూజారి అవసరం లేదన్నారు. పూజలు, క్రతువులు, యజ్ఞాలు, యాగాలు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రస్తావన లేదు. భక్తితో ఎవరైనా లింగ, కులాలకు అతీతంగా దేవుడిని చేరుకోవచ్చు అని చెప్పారు. ఈ ఉద్యమాన్ని కబీర్, గురునానక్, రవిదాస్, తులసీదాస్ తుకారాం, లాంటివారు తీర్చిదిద్దారు. వీరు ఈ అంశాలను ప్రజలలో బలంగా ప్రచారం చేసారు

1. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, కుల వివక్షను తిరస్కరించటం:

ఆధ్యాత్మిక ప్రపంచంలో బ్రాహ్మణుల గుత్తాధిపత్యాన్ని, వేదాచారాలను చర్మకారకుటుంబానికి చెందిన రవిదాస్, దళితుడైన చొఖమేళా లాంటి సాధువులు బహిరంగంగా ఖండించారు.
గురు రవిదాస్ 1433 CE లో జన్మించి 1528 CE లో బెనారస్ లో మరణించాడంటారు. ఇతనిపై ముస్లిం సూఫీ సాధువుల ప్రభావం ఉండేది. ఇతను గొప్ప వాగ్గేయకారుడు.
“కాశీలో పుట్టిన పండితులారా, నేను కూడా ఉన్నతకుటుంబంలోనే పుట్టాను. నా వృత్తి తోలుతో ముడిపడి ఉంది, కానీ నాహృదయం ప్రభువుని కీర్తించటంలో గర్వపడుతుంది”
పై వాక్యాల ద్వారా గురురవిదాస్ తన వృత్తిని చెప్పటమే కాక, అది ఏ రకంగాను బ్రాహ్మణ పుట్టకకు తక్కువకాదని ప్రకటిస్తున్నారు. ఇది ఒకరకంగా ఆనాడు అమలులో ఉన్న వర్ణవ్యవస్థపట్ల ధిక్కారమే.

“ఏ రాజ్యంలో అయితే ప్రజలు రెండవ మూడవ శ్రేణులుగా జీవించరో, ఆంక్షలులేక స్వేచ్చగా సంచరించగలరో, ఆ రాజ్యం రవిదాసుకు సంతోషం కలిగిస్తుంది ” లాంటి రవిదాస్ వాక్యాలు ఇరవయ్యోశతాబ్దపు మార్టిన్ లూదర్ కింగ్ “I have a dream” స్పీచ్ ను తలపిస్తాయి.

చొక్కమేళ మరాఠా భక్తిసంప్రదాయ కవి. 14 వ శతాబ్దం. ముస్లిమ్ పాలనలో ఆథ్యాత్మిక అన్వేషణ చేసిన మహర్ కులస్థుడు. విఠోబా దేవుని పట్ల అపారమైన భక్తిని ప్రదర్శించాడు. ఇతనిని బ్రాహ్మణ పండితులు ఆలయంలోకి అనుమతించలేదు. ఆ కారణంగా సొంత ఆలయాన్ని నిర్మించి సమాంతర ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించాడు. వేదాలను, హిందూ ధర్మాలను అంగీకరించలేదు. చొక్కమేళా ఒక గోడ కూలిపోవడం వల్ల మరణించాడని చెబుతారు.

భక్తికవులు అంధవిశ్వాసాలను, మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేసారు. జోతిష్యాలను, పుణ్యనదీ స్నానాలను, విపరీతమైన పూజాక్రతువులను వీరు తమ రచనలద్వారా ఖండించారు.
కబీర్ ఒకచోట- రాళ్ళకి మొక్కితే మోక్షం వస్తుందనుకొంటే నేను పర్వతానికే మొక్కుతాను; ఒక తిరగలికి మొక్కండి అది మనుషుల ఆకలితీరుస్తుంది” అంటూ విగ్రహారాధనను విమర్శిస్తాడు. అదే విధంగా “మసీదు ఎక్కి నిత్యం అలా బిగ్గరగా ఎందుకు అరుస్తావు, దేవునికేమైనా చెవుడా” అని ముల్లాలను ప్రశ్నిస్తాడు.
.
2. ఆధ్యాత్మికసాధనకు స్త్రీలు కూడా అర్హులే అనే విషయాన్ని అనేక భక్తికవయిత్రులు నిరూపిస్తారు. అక్కమహాదేవి, ఆండాళు, మీరాబాయి, జనాబాయి, సోయరా భాయ్, లల్లేశ్వరి లాంటివారు ముఖ్యులు. వీరు కులం లింగం, సామాజిక ఆంక్షలను అధికమించి దైవం పట్ల తమ అచంచలమైన భక్తిని ప్రకటించారు.
అక్కమహాదేవి అనేక వచనాలలో కులాన్ని, కుల ఆధారిత వివక్షను తిరస్కరించారు. ఈమె అనుసరించిన వీరశైవం – స్త్రీపురుషులు ఇరువురు సమానమేనని, కులవివక్ష, మూఢనమ్మకాలు, జంతుబలులు, తీర్థయాత్రలు కూడదని ప్రవచించింది.
"ఒక వ్యక్తి శీలవంతుడు కావాలంటే
అతను తన కులాన్ని విడనాడాలి" (5/691) అని స్పష్టంగా చెబుతుంది అక్కమహాదేవి.
.
3. హిందూ ముస్లిమ్ ల ఐక్యత:
భక్తి సాధువులు కొందరు హిందూ ముస్లిముల మధ్య విభజనను చెరిపివేసారు. వీరిలో కబీరు ప్రముఖుడు. ఇతను హిందువా ముస్లిమా అనేది ఎవరూ తేల్చలేకపోయారు. ఒక కథనం ప్రకారం కబీరును ఒక హిందూ వితంతువు కని గంగానది ఒడ్డున విడిచిపెట్టగా, ముస్లిమ్ నేతకుటుంబానికి చెందిన నీరు, నీమా దంపతులు ఇతనిని పెంచుకొన్నారని అంటారు. అలా కబీరును ముస్లిముగా పరిగణిస్తారు.

హిందూ ముస్లిమ్ ఐక్యతకు ఇతను ఒక్క చిహ్నంగా చెబుతారు. ఇతను హిందూ ముస్లిమ్ మతాలలోని మూఢభావాలని సమానంగా విమర్శించాడు

మసీదు దేవుడు నివసించే స్థలమైతే, మిగిలిన భూమి ఎవరిది? రాముడు విగ్రహాలలో పవిత్ర స్థలాలలో ఉంటాడా? - అయితే అక్కడ అతన్ని ఇంతవరకూ ఎవరూ ఎందుకు కనుగొనలేదు? – లాంటి కబీర్ వచనాలు ఇతని మతపరమైన విశాల దృక్ఫథాన్ని తెలుపుతాయి.

షేక్ ఫరీదుద్దీన్ గంజ్‌షకర్ (1173-1265), షా అబ్దుల్ కరిమ్ (1536-1623), షా ఇనాయతుల్లా (1655 – 1718) లాంటి సూఫీ సన్యాసులు హిందూ ముస్లిముల ఐక్యతను బోధించి ఇరుమతస్థులలో సమాన ఆదరణ పొందారు.

నానక్ సాహెబ్ (1469-1539), దాదు దయాళ్ (1544-1603), యారి షా (1668-1725), బుల్లా సాహెబ్ (యారి షా శిష్యుడు), దరియాసాహెబ్ (1700-1780), తులసి సాహెబ్ (1760- 1842) లాంటి మహనీయులు హిందూ ముస్లిమ్ ల ఆద్యాత్మిక ఐక్యత, ఐహిక సామరస్యతల కొరకు ఎంతో కృషిచేసారు.

హిందూ ముస్లిమ్ ల మధ్య సాంస్కృతిక భావనలను ఇచ్చిపుచ్చు కోవటంలో స్త్రీలు కూడా పాటుపడ్డారు. నాని బాయి, మాతా బాయి (వీరు దాదు దయాళ్ కుమార్తెలు), దయాబాయి, క్షేమాబాయి మొదలగు వారు ఒకనాటి హిందూ ముస్లిమ్ సఖ్యతను బలపరచిన సాధకురాళ్ళు
నామదేవ్ వంటి భక్తి కవులు హిందూ ముస్లిమ్ ల మధ్య ప్రేమానుబంధాలను పెంపుచేసారు. . అజ్మీర్‌లోని మొయినుద్దీన్ చిష్తీ దర్గా మరియు పంఢర్పూర్‌లోని తుకారామ్ యొక్క విఠోబా ఆలయం అన్ని మతాల భక్తులను ఆకర్షించాయి.

గౌడియ వైష్ణవ సంప్రదాయ స్థాపకుడైన శ్రీ చైతన్య మహాప్రభుకు (1486-1533) బుద్ధిమంత ఖాన్ అనే ముస్లిమ్ అత్యంత సన్నిహితుడైన సేవకునిగా వ్యవహించేవాడు.

నజీర్ మహమ్మద్ , ఫకీర్ హబీబ్, సయ్యద్ మర్తూజా లాంటి కవులు –కృష్ణభక్తితో గీతాలు రచించారు.
ముస్లిమ్ యోగి వావర్ తొ అయ్యప్ప స్వామి, బీబి నాంచారితో వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆథ్యాత్మిక సంబంధాలను ఉత్త భక్తి కథలుగా కొట్టిపారేయలేం. వాటివెనుక మన పూర్వీకులు నిర్మించదలచిన సామరస్యతను అర్ధంచేసుకోవాలి.

4. హిందుత్వ vs భక్తి ఉద్యమం

కులాలకు అతీతంగా ప్రజలందరూ సమానమని; భిన్నమతాల మధ్య సామరస్యం ఉండాలని, క్రతువులు బ్రాహ్మణాధిక్యతను తిరస్కరించటం; ప్రేమ ఆరాధన ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చునని మధ్యవర్తుల ప్రమేయం అవసరం లేదని భక్తి ఉద్యమం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇది ప్రజలలోని బహుళత్వాన్ని అంగీకరిస్తూ, అదే సమయంలో వారిని కలిపి, సహిష్ణుతతో జీవించేలా చేసే భావజాలం. దీనికి పూర్తి వ్యతిరేక భావజాలం హిందుత్వ.

హిందుత్వ అనేది 1920 లలో సావార్కర్ ప్రతిపాదించిన ఒక భావజాలం. ఇది భారతదేశాన్ని హిందూదేశంగా నిర్వచించాలని కోరుకుంటుంది. ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే భాష లాంటి మెజారిటేరియన్ భావనలపై దేశాన్ని పునర్నింమించాలని ఆకాంక్షిస్తుంది.

దీనివల్ల ఈదేశంలో అనాదిగా పరిఢవిల్లన భిన్నత్వం విచ్చిన్నమౌతుంది. భిన్నభావజాలాలు ఒకే మూసలోకి ఒదగాలి. సాంస్కృతిక వైవిద్యం నశించిపోతుంది. సామాజిక హోదాపరంగా అంచులలో ఉండే స్త్రీలు, బహుజనులు, మైనారిటీలకు హిందుత్వలో చోటు ఉండదు.

ఒకే దేవుడు (ఎక్కువగా ఉత్తరాది వైష్ణవం), ఒకే ఆరాధనా విధానం, ఒకే సంస్కృతి, ఒకే భాష లాంటివి ప్రజల స్వేచ్ఛను హరించి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. దీని ప్రభావంచే- హిందూమతం అంటే ఇతరమతాలను దూషించే మతంగా తయారుచేసారు. ఇతర విశ్వాసాలను ఎంత ద్వేషిస్తే అంత గొప్ప హిందువు అనే భావనలను చిన్నపిల్లలలో కూడా బలంగా నాటుకుపోయేలా చలామణీ చేస్తున్నారు.

భారతదేశ చరిత్రలో బౌద్ధం, చార్వాకం లాంటివి ఈ రకపు సాంస్కృతిక ఆధిపత్యాన్ని ధిక్కరించి పుట్టిన విశ్వాసాలు. వాటి కొనసాగింపే భక్తిఉద్యమాలు. – 7/8 శతాబ్దాలలో ఆది శంకరాచార్యుని ఆధ్వర్యంలో బ్రాహ్మణ మతం హిందూమతంగా స్థిరీకరింపబడుతున్న సమయంలో, మరల ఈ దేశ బహుజనులు– వేదాలులేని, కులవ్యవస్థ లేని, సంస్కృతభాష లేని, బ్రాహణ వర్గం లేని, లింగవివక్షలేని ఒక గొప్ప ఆథ్యాత్మిక సంప్రదాయాన్ని హిందూమతానికి సమాంతరంగా ఏర్పాటు చేసుకొన్నారు. చాలా స్పష్టంగా, బలంగా కులవ్యవస్థను, బ్రాహ్మణాధిక్యతను వ్యతిరేకించారు. హిందూ ముస్లిం ఐక్యతను కోరుకున్నారు.

ముగింపు

ఆథ్యాత్మికత అనేది ప్రజలందరి మానసిక అవసరం, హక్కు కూడా. దానిని సంస్కృతమంత్రాల చాటున, ఆలయప్రవేశ నిషేదం చాటున, ఆయుధాలు ధరించిన దేవుళ్ల చాటున, పెద్దఎత్తున వనరులు అవసరపడే క్రతువుల చాటున పండితులు దాచిపెట్టారు. ఒకప్పటి ఆలోచనాపరులు బౌద్ధిజం చార్వాకం లాంటి ప్రత్యామ్న్యాయ ఆలోచనలతో బ్రాహ్మనిజాన్ని, బ్రాహ్మణాధిక్యతను ఎదుర్కొన్నారు.

7/8 శతాబ్దాలకు వచ్చేసరికి క్రమేపీ భారతదేశంలో బౌద్ధాన్ని క్షీణింపచేయగలిగారు పండితులు. ఆదిశంకరాచార్యుడు చేసిన అథ్యాత్మిక దండయాత్రలో (నా బ్లాగులో చూడుడు “ఆదిశంకరాచార్యుడు-ఆథ్యాత్మిక దండయాత్ర”వ్యాసం) బౌద్ధం దాదాపు కనుమరుగైంది. దేశజనాభాలో 80 శాతం ఉండే బహుజనులు ఈ మొత్తం తతంగంలోని గుట్టును గుర్తించారు. కులవివక్ష, బ్రాహ్మణాధిక్యత కొరకే ఇదంతా అని గ్రహించారు. ఈ నేపథ్యంలో – బ్రాహ్మనిజానికి వ్యతిరేకంగా బహుజనులు నిర్మించుకొన్న ఆథ్యాత్మిక ఉద్యమం- భక్తి ఉద్యమం.

బ్రాహ్మణులతో, బ్రాహ్మనిజపు భావజాలంతో తీవ్రంగా పోరాడిన ఈ భక్తికవులలో చాలామంది అనుమానాస్పదంగా మరణించటం ఆశ్చర్యం కలిగించక మానదు.

• కబీరు (c. 1440–1518) భౌతిక దేహం దొరకలేదు. దుస్తుల లోపల దేహం బదులు పూలు కనిపించాయట. హిందూ బ్రాహ్మణులు కబీర్ ను ఎన్నో కష్టాలపాలు చేసినట్లు అనేక కథలు కలవు.

• తుకారం (c. 1608–1650) మరణించినపుడు ఆకాశం నుండి పుష్పకవిమానం వచ్చి అతనిని తీసుకొని వెళ్ళిందని ఒక కథ ఉండగా, అతనిని పండితమతవాదులు హత్యచేసారు అని మరొక కథ కూడా ఉంది

• నామ్ దేవ్ (c. 1270–1350) సాంప్రదాయవాదుల పిర్యాదుపై రాజదండనకు గురయ్యాడని కథనం కలదు.

• మీరాబాయి (c. 1498–1546/57) ద్వారకలోని కృష్ణుని విగ్రహంలో ఐక్యం చెందిందట. అప్పటికే చాలాసార్లు కొందరు బంధువులు ఆమెను నియంత్రించటానికి ప్రయత్నించారు.

• చైతన్యమహాప్రభు (1486–1534) పూరీ జగన్నాధునిలో ఐక్యం అయ్యాడట.

• నందనార్ నయమ్నార్ అగ్నిలో దహించుకొని పునీతుడయ్యాడట.

• చక్రధర స్వామి (1194), తల నరకగా అది తిరిగి దేహానికి అతుక్కొందట. అలా ఆయన చిరంజీవిగా హిమాలయాలలో సంచరిస్తున్నాడట.

• గురుబాలక్ దాస్ 19 వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో జీవించిన భక్తి సంప్రదాయానికి చెందిన సంత్. కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఇతను చేస్తున్న బోధనలు ప్రజలలో విస్తరిస్తున్నాయని తెలిసిన అగ్రవర్ణ హిందువులు ఇతన్ని కత్తులతో పొడిచి చంపేసారు.

తనకు వ్యతిరేకంగా నిర్మించిన ఏ సామాజిక ఉద్యమాన్నైనా హిందుమతం తనలో కలిపేసుకోవటం అనాదిగా జరుగుతూనే ఉంది. బుద్ధుడినే ఒక విష్ణ్వావతారంగా చేసి మింగేయబోయారు. అలాగే ఈ భక్తి ఉద్యమాన్ని కూడా బ్రాహ్మనిజం తనలో రకరకాల మార్గాలలో కలుపుకొంది. తమిళ ఆళ్వారులు, నయనారులు కులమతాలకు అతీతంగా అందరూ పాడుకోవాలని రాసుకొన్న గీతాలను నేడు ప్రధాన తమిళ ఆలయాలలో జరిగే వ్యవస్థీకృత నిత్య పూజలలోకి చేరాయి.

బహుజనులకు ఆలయ ప్రవేశం ఉండాలని పోరాడిన రామానుజాచార్యుడిని ఇప్పుడు ఒక బ్రాహ్మణ శాఖ కైవశం చేసుకొంది. కబీరు, మీరాబాయి, ఆండాల్, రవిదాస్ లాంటివారు గొప్ప యోగులుగా హిందూ మతంలో కుదురుకొన్నారు. వారు చెప్పిన బోధనలు వెనుకకు వెళిపోయాయి.

దేవుడు హృదయంలో ఉంటాడు తప్ప బ్రాహ్మణుడి జన్మ హక్కులో కాదు అంటూ నామ్ దేవ్ కులవ్యవస్థ, బ్రాహ్మణాధిక్యతపై తీవ్రమైన విమర్శ చేసాడు. భక్తి కవులు స్థానిక భాషలో గీతాలు కూర్చటం సంస్కృతాధిపత్యాన్ని ధిక్కరించటమే. కబీరు, గురునానక్ లాంటి వారు రామ్ రహీమ్ ఒక్కరే అంటూ గ్రామాలలో తిరుగుతూ తమ గీతాలద్వారా ప్రచారం చేయటం ఒకరకంగా భిన్న సమూహాల మధ్య గోడలను బద్దలుకొట్టటం, వంతెనలను నిర్మించటం. అక్కమహాదేవి శివునితో నగ్నంగా నడిచినా, ఆండాలు విష్ణువుని విభునిగా చేసుకొన్నా- అవన్నీ పురుషాధిక్యతను తిరస్కరించటం గా చూడాలి.

భక్తి ఉద్యమం - వర్ణవ్యవస్థకు, క్రతువులకు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. దీనికి ముస్లిమ్ పాలకుల సూఫీ వేదాంతం తోడయ్యింది. ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఆథ్యాత్మిక సాధన చేయవచ్చు అని చెప్పిన భక్తి ఉద్యమ నిర్మాణంలో హిందూ మత ప్రమేయం తక్కువ.

బొల్లోజు బాబా

Friday, March 21, 2025

Please subscribe to my YouTube channel

 Please kindly subscribe my YouTube channel. Please


https://www.youtube.com/@bolloju

Monday, March 17, 2025

మొఘల్ చక్రవర్తులకు జన్మనిచ్చిన హిందూ స్త్రీలు

భారతదేశం చారిత్రికంగా భిన్న మత విశ్వాసాల సమ్మేళనం. అనేక సముదాయాలు వివిధ సంస్కృతులతో కలిసిమెలిసి జీవించాయి. మనుషుల మధ్య బంధుత్వాలకు మతాలు అడ్డురాలేదు. చరిత్రలో హిందూ ముస్లిమ్ ల మధ్య అనేక వివాహాలు జరిగాయి. ఇవి భిన్న సంస్కృతుల సమ్మేళనానికి దారితీసాయి. చాలామంది మొఘల్ చక్రవర్తులు హిందూ స్త్రీలకు పుట్టారు. వారి ఆస్థాన చరిత్రకారులు ఈ విషయాన్ని ఎక్కడా దాచిపెట్టలేదు. స్పష్టంగానే రాసుకొన్నారు. వీటిని ఉత్త రాజకీయ తంత్రంగా భావించలేం. ఒక ముస్లిం రాజు హిందూ స్త్రీని పెండ్లాడి ఆమెను జనానాలో ఒకానొక దేహంగా మార్చకపోవటం; ఆమెద్వారా కలిగిన పుత్రుడు సింహాసనం అధిష్టించటం అనేవి ఉత్త రాజకీయ వ్యూహాలుగా పరిగణించలేం. రాజనీతిని మించిన మానవీయకోణాన్ని, సౌహార్దతను ఊహించాలి. భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన హిందు ముస్లిమ్ వివాహాలు కొన్ని ఇవి…….

****
1. హర్కబాయి (1542-1623) - అక్బర్ Maryam-Uz-Zamani

జైపూర్ రాజైన భర్మల్ 1562 లో తనకూతురు హర్కబాయిని అక్బరుకి ఇచ్చి వివాహం చేసాడు. ఈమె అక్బరుకు ఎంతో ఇష్టమైన రాణి అయింది. హర్కబాయి అపురూప సౌందర్యం, అద్భుతమైన మేధాశక్తి, గొప్ప దయ కలిగిన స్త్రీ. అక్బర్ చూపించిన మతసహనం, లౌకికత వెనుక ఈమె హస్తం ఉందని చరిత్రకారుల అభిప్రాయం. ఈమె కోరికపై అక్బరు గోమాంసాన్ని తినటం మానివేసాడు. ఈమె ద్వారా వైదిక క్రతువులు, బ్రాహ్మణులు, సూర్యనమస్కారాలు, శాఖాహారం, పూజలు లాంటివి ముఘల్ అంతఃపురంలోకి పవేశించాయి. హిందూస్త్రీలు సంస్థానంలో హారతి ఇస్తే స్వీకరించాలని అందరినీ ఆదేశించాడు అక్బరు. హర్కబాయి అక్బరులకు 1569లో కుమారుడు కలిగాడు. ఇతనే మొఘల్ చక్రవర్తి జహంగీరు. హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన మొదటి చక్రవర్తి జహంగీరు.

ముఘల్ సంస్థానంలో హర్కబాయి నాలుగుదశాబ్దాల సుదీర్ఘకాలంపాటు పట్టపురాణిగా ఆ పిదప రాజమాతగా ఎంతో గౌరవాన్ని పొందింది. ఈమె పేరుమీద ఒక ఓడ ఉండేది. ఈమె అనేక నౌకా వ్యాపారాలు చేసేది. వ్యాపారాభివృద్ధినిమిత్తం దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించేది. ఈమె ఓడ పేరు రహిమి (Rahimi.) 12000 మంది సైనికులను కలిగి ఉన్న నలుగురు మొఘలు సంపన్న వ్యక్తులలో ఈమె ఒకరు. స్త్రీలలో ఒకే ఒకరు. ఇదీ ఈమె హోదా.

జహంగీర్ తనతల్లి హర్కబాయిని ఎంతో గౌరవంగా Her Majesty అని సంబోధించేవాడు. పాదాలకు నమస్కరించిన పిదప మాట్లాడేవాడు.

1605 లో అక్బర్ చనిపోయేనాటికి హర్కబాయి ముఘల్ స్త్రీలలో అత్యంత సంపన్నురాలు . ఈమె తన 81 వ ఏట 1623 లో మరణించింది. హర్కబాయి గౌరవార్ధం అక్బరు సమాధిపక్కనే ఆగ్రాలో ఈమె సమాధికూడా నిర్మించారు.

2. మన్ బాయి (1570-1605)- జహంగీర్

జహంగీర్ తల్లి హర్కబాయి సోదరుని పేరు రాజ భగ్వంత్ దాస్. ఇతను జైపూర్/ అంబర్ ను పాలించిన 23 వ రాజు. ఇతని కూతురు పేరు మన్ భవతి బాయి (Man Bai). జహంగీరు, మన్ బాయిలు బావమరదళ్ళు అవుతారు. మన్ బాయి గొప్ప సౌందర్యరాశి, సౌశీల్యవతి. మేనత్త హర్కబాయిలా తెలివైనది. ఆమెను జహంగీరుకు ఇచ్చి వివాహం చేయాలని హర్కబాయి ప్రతిపాదించగా, వంశప్రతిష్టలు కలిగిన కుటుంబానికి చెందిన అమ్మాయి కనుక అక్బరు మన్ బాయిని కోడలుగా చేసుకోవటానికి వెంటనే అంగీకరించాడు. మన్ బాయి, జహంగీరుల వివాహం 1585 లో అంగరంగవైభవంగా జరిగింది. వీరిద్దరికి 1587 ఖుస్రో మిర్జా అనే కొమారుడు కలిగాక మన్ బాయికి పట్టమహిషి (Shah Begum) హోదా లభించింది.

మన్ బాయి సోదరుని పేరు మాధవ సింగ్. ఇతనితో తన కొడుకు ఖుస్రో మిర్జా కలిసి భర్త జహంగీరుపై వ్యతిరేకంగా కుట్రలు పన్నటం మన్ బాయిని తీవ్రమైన మనస్తాపానికి గురిచేసేది . కొడుకుకు భర్తకు నచ్చచెప్పలేక మన్ బాయి తీవ్రఒత్తిడికి గురయి 1605 లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మన్ బాయి, జహంగీర్ల దాంపత్యం ఎంతో అన్యోన్యమైనది. భార్య చనిపోయిందని తెలిసిన జహంగీరు నాలుగురోజులపాటు భోజనం చేయలేదు.

జహంగీరు భార్యావియోగంతో విరాగిగామారాడని తెలిసిన అక్బరు ఆ సమయంలో తను ధరించిన తలపాగ, శాలువాలను పంపించి ఓదార్చే ప్రయత్నం చేసాడు. కొడుకుపట్ల పిచ్చిప్రేమకు, భర్త పట్ల అనురాగానికి మధ్య నలిగిపోయి ఆత్మహత్య చేసుకొన్న కోడలి పట్ల ఎంతో కలత చెందాడు అక్బరు.
జహంగీరు, అలహాబాదు, Khusrau Bagh ఆవరణలో మన్ బాయి జ్ఞాపకార్థం అందమైన సమాధిని నిర్మింపచేసాడు.

3. జగత్ గోసాయిన్ (1573 – 1619) – జహంగీర్

ఈమెకే మనవతి బాయి, జోధ్ బాయి (జోదా అక్బరు జంట కాదు) అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈమె మార్వార్ (ప్రస్తుత జోధ్ పూర్) రాకుమార్తె. రాజ్ పుత్ రాజా ఉదయ్ సింగ్ కూతురు. ఈమె తాతగారైన Maldev Rathore నాయకత్వంలో మార్వార్ బలమైన రాజపుత్రుల రాజ్యంగా ఏర్పడింది.
యువరాజుగా ఉన్న జహంగీరు ఒకనాడు ఒక రాజకుటుంబ వేడుకలో అపురూపలావణ్యవతి అయిన జగత్ గోసాయిన్ ని చూసి ప్రేమించాడు. ఆమెను పెండ్లాడాలనే కోర్కెను వెలిబుచ్చాడు. ఈ పెళ్ళి ప్రతిపాదనను అక్బరు అంగీకరించలేదు. అక్బరు తల్లి హమీదాబాను అందరిని ఒప్పించింది. అలా జహంగీరుకు జగత్ గోసాయిన్ కి 1586లో వివాహమైంది. ఈ వివాహం మార్వార్ రాజు సంస్థానంలో పండితుల వేదమంత్రాలతో ముస్లిమ్ కట్టుబాట్ల మధ్య జరిగింది.

అందం, ఆకర్షణీయ సంభాషణ, చమత్కారం, సమయస్పూర్తి, ధైర్యసాహసాలతో జగత్ గోసాయిని తక్కువ కాలంలోనే జహంగీరుకు అత్యంత ప్రియమైన వ్యక్తిగా మారింది. జగత్ సంగీతంలో గొప్ప ప్రావీణ్యం కలిగిన గాయని. ఈమె 1592 లో జహంగీరుకు ఒక మగబిడ్డను ఇచ్చింది. అతనే మొఘల్ చక్రవర్తి షాజహాన్. హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన రెండవవ్యక్తి ఇతను. ఈ బిడ్డ జాతకం ప్రకారం మహర్జాతకుడని పండితులు చెప్పటంతో తాత అయిన అక్బర్ చక్రవర్తి ఈ బిడ్డకు “కుర్రం” (సంతోషకరమైన) అని నామకరణం చేసి తనవద్దే ఉంచుకొని పెంచి పెద్దచేసాడు.

1605 లో అక్బర్ మరణించాక కుర్రం తండ్రి వద్దకు వచ్చేసాడు. 1611 లో నూర్జహాన్ ను వివాహం చేసుకొన్నాకా ఆమె ఆకర్షణలోపడి జహంగీర్ జగత్ గోసాయిన్ పట్ల ఆదరణ తగ్గించేసాడు. 1619 లో జగత్ గోసాయిన్ అనారోగ్యకారణాలతో మరణించింది. ఈమె మరణానంతరం జహంగీర్ అన్ని రాజపత్రాలలో ఈమె పేరును Bilqis Makani (the Lady of Pure Abode) గా ప్రస్తావించమని ఆదేశించాడు. 1628 లో జగత్ గోసాయిన్ కుమారుడు షాజహాన్ ముఘల్ చక్రవర్తిగా సింహాసనం అధిష్టించే నాటికి ఈమె జీవించి లేదు.

4. నవాబ్ బాయి

కాశ్మీరుకు చెందిన రాజపుత్ రాజౌరి రాకుమార్తెను ఔరంగజేబు 1638 లో పెళ్ళిచేసుకొన్నాడు. ఈమె పేరు నవాబ్ బాయి. వీరిద్దరికి 1643 లో బహదూర్ షా I జన్మించాడు. ఇతను ఔరంగజేబు మరణానంతరం ముఘల్ చక్రవర్తి అయి 1707 నుండి 1712 వరకూ పరిపాలించాడు. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన మూడవ వ్యక్తి. 1662 లో ఔరంగజేబు తీవ్రంగా అస్వస్థుడవగా, అతని చెల్లెలు రోషనార రాజ్యాధికారాన్ని చేతిలోకి తీసుకొని పరిపాలించసాగింది. ఈ చర్యను నవాబ్ బాయి ప్రతిఘటించింది. ఈమె కుమారులు తండ్రికి వ్యతిరేకంగా వ్యవహరించేవారు. ఈ కారణాలతో నవాబ్ బాయి అంతఃపురంలో క్రమేపీ గౌరవాన్ని కోల్పోయి ఔరంగజేబు ప్రేమకు దూరమైంది.

కొడుకులను భర్త ఖైదు చేయించాడని తెలిసి ఎంతో మానసిక క్షోభకు గురవగా, ఔరంగజేబు స్వయంగా వచ్చి నవాబ్ బాయిని ఓదార్చాడు. ఒక బాధ్యతకలిగిన తండ్రిగా, పాలకుడిగా ఏ పరిస్థితులలో సొంతకొడుకులను ఖైదుచేయించవలసిందో ఆమెకు వివరించాడు. 1691లో నవాబ్ బాయి చనిపోయింది. ఆమె గౌరవార్థం రాజ్యంలో ఒక వారంపాటు సంతాపదినాలు ప్రకటించాడు ఔరంగజేబు

5. ఉద్దమ్ బాయి/కుడ్సియాబేగం

ఉద్దమ్ బాయి హిందూ కుటుంబానికి చెందిన ఒక సామాన్య నర్తకి. రాజాస్థానంలో చేరింది. ఈమె తన సౌందర్యం, వాక్చాతుర్యం వల్ల ముఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా (r. 1719–1748) ప్రేమను చూరగొంది. మహమ్మద్ షాకు ఉద్దమ్ బాయి పట్ల మక్కువ పెరిగి రాణి హోదాను ఇచ్చాడు. వీరిద్దరికి పుట్టిన అహ్మద్ షా బహదూర్ 1748 - 1754 మధ్య ముఘల్ చక్రవర్తిగా రాజ్యమేలాడు. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన నాల్గవ వ్యక్తి.
కొడుకు శక్తిహీనుడు, దక్షతలేనివాడు కావటంచే ఉద్దం బాయి అనధికారికంగా రాజ్యపగ్గాలు చేపట్టింది. పరిపాలకురాలిగా ఎదిగి, ప్రభుత్వ వ్యవస్థను చేతుల్లోకి తీసుకొంది. ముఘల్ సామ్రాజ్యానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకొంది. డిల్లీలో గోల్డెన్ మాస్క్, కుడ్సియా బాగ్ లాంటి గొప్పనిర్మాణాలు చేపట్టింది.
పురుషుల ప్రపంచంలో ధైర్యం, తెలివితేటలు, సమర్ధత కలిగిన గొప్ప మహిళగా; ఒక నాట్యకారిణినుండి ఒక సామ్రాజ్ఞిగా ఎదిగిన ధీశాలిగా ఉద్దమ్ బాయి చరిత్రలో నిలిచిపోయింది.

6. అనూప్ బాయి 1699- ??

తొమ్మిదవ మొఘల్ చక్రవర్తి జహందర్ షా మూడవ భార్య అనూప్ బాయి. ఈమె రాజపుత్రుల యువరాణి. ఈమె Muazzamabadi అనే బిరుదును కలిగి ఉండేది. దాని అర్థం గౌరవనీయురాలైన అని. ఈమె కుమారుడు అలంగీర్ II. ఇతను 1754 – 1759 మధ్య ముఘల్ చక్రవర్తిగా పరిపాలించాడు. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన ఐదవ వ్యక్తి. ముఘల్ రికార్డులలో 1756-1761 మధ్య ప్రభావితం చూపిన తొమ్మిది మంది మొఘల్ స్త్రీలజాబితాలో Muazzamabadi పేరు ఏడవ సంఖ్యలో ఉంది .

ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అబ్దాలి రాజు, 30 జనవరి, 1757 న ఢిల్లీ వచ్చినపుడు, అలంగీర్ II చక్రవర్తి తల్లి హోదాలో అనూప్ బాయి 121 బంగారు నాణాలు, బాదంతో చేసిన పాయసం (లవజత్) ను అతనికి పంపించింది . ఆ సమయం మొఘల్ సామ్రాజ్యం అంతర్గత కలహాలతో సంక్షోభంలో ఉంది. బహుసా అబ్దాలి వంటి రాజుల సహకారం పొందటం కొరకు అనూప్ బాయి ఆ కానుకలను పంపిఉండవచ్చు. ఇదొక దౌత్యపరమైన కూటనీతి. ఈ ఉదంతాన్ని బట్టి అనూప్ బాయి తెరవెనుక పోషించినపాత్ర కొంతమేరకు అర్ధమౌతుంది. ఇంతకు మించి ఈమె గురించిన చారిత్రిక వివరాలు పెద్దగా తెలియరావు. అనూప్ బాయి 1735 లోనే మరణించిందని మరొక కథనం కలదు.

7. బిలాల్ కన్వర్ / జినత్ మహల్

బిలాల్ కన్వర్ అలంగీర్ II భార్య. ఈమె హిందూ స్త్రీ. బిలాల్ కన్వర్ 1728 లో షా ఆలమ్ II కు జన్మనిచ్చింది . ఇతను 1760 – 1806 మధ్య ముఘల్ సామ్రాజ్యాన్ని పాలించాడు. షా ఆలమ్ II హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన ఆరవ వ్యక్తి. ఇంతకు మించి బిలాల్ కన్వర్ గురించిన సమాచారం పెద్దగా లభించదు.

8. లాల్ బాయి

బహదూర్ షా II చివరి మొఘల్ చక్రవర్తి. ఇతని తల్లి పేరు లాల్ బాయి. ఈమె హిందూ స్త్రీ. 1775 లో లాల్ బాయి బహదూర్ షా II జన్మనిచ్చింది. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన ఏడవ వ్యక్తి.
బహదూర్ షా II బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిపిన మొదటి స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించాడు. బ్రిటిష్ వారు ఇతనిని రంగూన్ తరలించి మరణించేవరకూ గృహనిర్భంధంలో ఉంచారు.
****

9. మరికొన్ని ప్రముఖ వివాహాలు

కమలాదేవి - అల్లావుద్దిన్ ఖిల్జి: కమలాదేవి గుజరాత్ లోని వఘేలా రాజ్ పుత్ కరణ్ దేవ్ II భార్య. ఈమె గొప్ప అందగత్తె. విదుషీమణి. అల్లావుద్దిన్ ఖిల్జీ 1298 లో గుజరాత్ ను ఓడించినపుడు ఈమెను ఢిల్లీసంస్థానానికి తీసుకువెళ్ళి పెళ్ళిచేసుకొన్నాడు. ఇది చరిత్రలో నమోదైన హిందూ-ముస్లిమ్ ల మధ్య జరిగిన మొదటి వివాహం. అప్పటికి ఈమెకు దేవలాదేవి అనే ఆరు నెలల కుమార్తె కలదు. ఆమె తండ్రి సంరక్షణలో ఉండి పెరిగి పెద్దదయింది. కమలాదేవి క్రమేపీ అల్లావుద్దిన్ ఖిల్జి విశ్వాసాన్ని చూరగొని, అతని రాజకీయ నిర్ణయాలలో సలహాలు ఇచ్చేస్థాయికి చేరుకొంది. కమలాదేవి చొరవతో ఆమె కూతురైన దేవలాదేవిని ఢిల్లీకి తెప్పించాడు అల్లావుద్దిన్ ఖిల్జి, దేవలాదేవిని అల్లావుద్దిన్ ఖిల్జి కొడుకు ఖిజ్ర ఖాన్ కు ఇచ్చి వివాహం జరిపించారు.

జహంగీరు చక్రవర్తి మరొక భార్య మలిక జహన్ హిందూ స్త్రీ. ఈమె జసల్మార్ కు చెందిన రావల్ భీమ్ కూతురు.

ఔరంగజేబ్ కొడుకైన బహదూర్ షా I, రాజా రూప్ సింగ్ కూతురును పెండ్లాడాడు.

1351 లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన ఫిరోజ్ షా తల్లి పేరు నైలా. ఈమె భట్నేర్ హిందూ రాజ కుమార్తె .

విజయనగర రాజు దేవరాయ I తన కూతురుని 1407 బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా కు ఇచ్చి అంగరంగవైభవంగా పెళ్ళిచేసాడు.

ఖేర్లా రాజైన నరసింహరాయ్ 1417 లో తన కుతురును ఫిరోజ్ షాకు ఇచ్చి వివాహం జరిపించాడు. అపురూపసౌందర్యరాశి అయిన ఈమె ఆ తదుపరికాలంలో బహుమని సుల్తాను పట్టపురాణి హోదాను పొందింది.

వారణాసిలో ఇరవైముగ్గురు ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ప్రేమించి హిందూమతంలోకి మారిపోయిన ఉదంతాన్ని మధ్య ఆసియా యాత్రికుడు అమిర్ అలి బాల్కి తన రాతలలో పేర్కొన్నాడు. ఇది ఆనాటి సామాన్యప్రజలలో ఉండిన మత స్వేచ్ఛను తెలియచేస్తుంది
****

అదే విధంగా మొఘల్ రాజస్త్రీలను హిందూ రాజులకు ముఖ్యంగా రాజపుత్రులకు ఇచ్చి పెండ్లిచేసిన ఉదంతాలుకూడా చరిత్రలో కనిపిస్తాయి. అక్బరుకుమార్తెకు- మేవాడ్ యువరాజు అమర్ సింగ్ కు; అక్బర్ మేనకోడలుకు రాజామాన్ సింగుకు; రూహాని బాయికు మహారాజా ఛత్రసాల్ కు; వజీర్ ఖాన్ కుమార్తె మహారాణా కుంభకు: ఒకముస్లిం సైన్యాద్యక్షుని కుమార్తెకు రాజపుత్ర రాణాసంగకు జరిగిన వివాహాలు ముస్లిం రాచస్త్రీలకు హిందూ యువరాజులకు మధ్య జరిగిన వివాహాలకు కొన్ని ఉదాహరణలుగా చెబుతారు.

10. ముగింపు

నేడు భిన్న విశ్వాసాల మధ్య వివాహాలను లవ్ జిహాద్ అని, బలవంతపు మతమార్పిడులు అని మాట్లాడటం శోచనీయం. అలాంటి ఆరోపణలు రాజకీయ ప్రేరేపితం. ఈ రోజు ముఘల్స్ అంటే రక్తపిపాసులుగా, మతం పేరుతో ప్రజల్ని ఊచకోత కోసిన రాక్షసులుగా చిత్రిస్తున్నారు. కల్పితాలతో కట్టుకథలతో ఒక అబద్దపు నెరేటివ్ ను సృష్టిస్తున్నారు. వారి పేరు ఎవరైనా ఎత్తితే తీవ్రమైన దుర్భాషలతో, అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఊరూ పేరు, ఫొటో లేని సోషల్ మీడియా అనామకుల నుండి అత్యంత ఉన్నతమైన పదవులలో ఉన్నవారు వరకూ ఇదే ధోరణి. ఈ ద్వేషం బౌద్ధికంగా చాలా బలంగా ప్రజల మనసుల్లో నాటబడుతోంది. ఇక ఇలాంటి ద్వేషం భౌతికంగా ప్రతిఫలించటానికి ఎంతో దూరంలో లేము.

సాటి మనుషుల పట్ల ఎందుకింత ద్వేషమో అర్థం కాదు. ఈ ద్వేషం పునాదులపై ఏం నిర్మించాలని కోరుకొంటున్నారో ఊహకు అందదు. భిన్న అభిప్రాయాలు పరిఢవిల్లడం ప్రజాస్వామ్యం. మెజారిటేరియన్ భావజాలం మాత్రమే ఉండాలనుకోవటం ఫాసిజం. మానవజాతి పరిణామక్రమంలో మతం అనేది ఆదిమ అనాగరిక లక్షణమని, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం అనేవి నాగరిక లక్షణాలనీ ఎప్పటికి అర్ధం చేసుకొంటారూ?

ఎవరైతే ముస్లిమ్ పాలనవల్ల నష్టపోయారో వారే సమాజంలో ముస్లిముల పట్ల ఇంతటి ద్వేషానికి కారకులు అనటం సహజమైన అభియోగం. ఎవరు ముస్లిమ్ పాలనవల్ల నష్టపోయారు అని భిన్న సామాజిక వర్గాలను పరిశీలిస్తే---

రాజపుత్రులు, చోళులు, కాకతీయులు, పాండ్యులు, హొయసల రాజులు లాంటివారు సార్వభౌమత్వాన్ని కోల్పోయినా ముస్లిమ్ రాజులకు సామంతులుగా మారి అధికారాన్ని కోల్పోలేదు. అదే విధంగా స్థానిక జమిందార్లు/కౌలుదార్లకు వారి వారి హోదాలు పోలేదు చాలాచోట్ల. వ్యాపారులకు ముస్లిముల ద్వారా మధ్య ఆసియా వ్యాపారావకాశాలు పెరిగాయి. చేతివృత్తికారులకు ఆ వ్యాపారాల వల్ల పనులు పెరిగాయి.

ముస్లిమ్ పాలనలో వర్ణవ్యవస్థ కొంతమేర సడలటంతో దళిత బహుజనులు కొద్దిగా ఊపిరి పీల్చుకొన్నారు. అతిశూద్రులు కొంతమంది వివక్షనుంచి తప్పించుకోవటానికి ఇస్లాంలోకి మారారు. అధికజనాభా గ్రామాలలో నివసించేవారు. కేంద్రీయ ముస్లిం పాలనతో సంబంధంలేకుండా ఈ గ్రామీణ ప్రజలు స్వయంపోషణతో జీవించారు.

భక్తి ఉద్యమప్రభావంతో ముస్లిమ్ హిందూ ఐక్యత గ్రామాలలో బలపడింది. హోలి, దివాలి, సూఫీ, దర్గా, పీర్ల పండుగ లాంటి పండుగలలో హిందూముస్లిములమధ్య ఒకరకమైన సాంస్కృతిక సమ్మేళనం ఉండేది. దీనివల్ల కింది స్థాయి ప్రజలు ఒకరిపట్ల ఒకరు ప్రేమానురాగాలతో ఉండేవారు.
ఇక సమాజంలో ఎవరు ముస్లిమ్ పాలన వల్ల నష్టపోయారు అంటే కొంతమేరకు పండితవర్గం కనిపిస్తుంది. వీరు జనాభాలో 5%. ఒక పండితుడు సభకు రాగా, ఏ మహారాజైనా లేచి వెళ్ళి అతనిని ఆహ్వానించి ఉచితాసనంపై కూచుండబెట్టి, పాదాలు కడిగి ఆ నీళ్ళు నెత్తిన చల్లుకోవటం హిందూ ధర్మంలో భాగం. ముస్లిమ్ పాలనలో ఈ రకపు గౌరవాన్ని పండితులు కోల్పోయారు.

యజ్ఞయాగాదులు, Temple patronage తగ్గిపోయాయి. ఔరంగజేబు అయితే దర్బారులో కవులు, కళాకారులను నిషేదించాడు. అలా అంతవరకూ. ప్రభువు మెల్లకన్నుపై పద్యాలు చెప్పి మాన్యాలు పొందిన వైభోగం కోల్పోయారు పండితులు.

యజ్ఞయాగాదులు లేక శూద్రులు, అతిశూద్రులనుండి అతికష్టంగా కాపాడుకొన్న సంస్కృతం, వేదాలు పనికిరాకుండాపోయాయి.

ఈ వర్గం సమాజంలో శిష్టవర్గం. ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయగలిగిన వర్గం. వీరికి జరిగిన నష్టం మొత్తం సమాజానికి జరిగిన నష్టంగాను, వీరి శత్రువులు యావత్ సమాజపు శత్రువులుగాను చేయబడ్డారు. దీన్నే గ్రామ్సీ "కల్చరల్ హెగిమొని" అని వ్యవహరించాడు – సమాజంలోని ప్రభావశీల వర్గం తన విలువలు, నమ్మకాలను మిగిలిన ప్రజలచే వారికి తెలియకుండానే ఆమోదింపచేయటం.
.
బొల్లోజు బాబా
16/3/2025



Saturday, March 8, 2025

ఆర్యుల దండయాత్ర – శాస్త్రీయ అవగాహన

ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని మొదటగా 1870 లలో జర్మన్ పండితుడు మాక్స్ ముల్లర్ ప్రతిపాదించాడు. ఇది BCE 1500 ప్రాంతంలో మధ్య ఆసియానుండి ఆర్యులు అనే యోధ జాతి భారత ఉపఖండానికి వలసవచ్చి ఈ ప్రాంతం పై ఆధిపత్యం పొందారని చెబుతుంది. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం ప్రకారం ఈ వలస వచ్చిన ఆర్యులు తమతో పాటు వేదసంస్కృతి, సంస్కృతభాషను తెచ్చారని ఇవి భారత ఉపఖండంలోని స్థానిక సంస్కృతులపై ప్రభావం చూపాయని ముల్లర్ అభిప్రాయపడ్డాడు.

మాక్స్ ముల్లర్ వివిధ భాషలను తులనాత్మకంగా అధ్యయనం చేసిన వ్యక్తి. మధ్య ఆసియాప్రాంతపు అవెస్తా భాషకు, సంస్కృత భాషకు గల పోలికలను ఇతను గమనించాడు. వాటి ఆధారంగా సంస్కృతబాష మాట్లాడే ఆర్యులు, మధ్యఆసియానుండి వలస వచ్చి ఉండవచ్చు అని ఊహించాడు. వేదాలలోపలి ఆధారాలు భీకరమైన దండ యాత్రలను సూచించటాన్ని గుర్తించాడు. ఈ రెండు దృగ్విషయాలను కలిపి "ఆర్యుల దండయాత్ర" సిద్ధాంతంగా చెప్పాడు.
ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు ఇన్నేళ్లతరువాత కూడా మాక్స్ ముల్లర్ ని పండితులు తీవ్రంగా విమర్శిస్తారు, ఎందుకంటే ఆర్యులు స్వదేశీయులు అని, బయటనుంచి వలసవచ్చిన వారు కారని వీరి విశ్వాసం.

కానీ నేడు ఈ ఆర్యులు The Eurasian Steppe ప్రాంతాలనుంచి c 1900 BCE and 1500 BCE మధ్య భరతఖండానికి వలసవచ్చినట్లు జన్యు అధ్యయనాల ద్వారా నిరూపించబడింది.

I. మనుషుల వలసలను జన్యువులు ఎలా నిర్ధారిస్తాయి?

ఈ రోజు ఒక జన్యువు వివిధ జనాభాలలో, వివిధ కాలాలలో ఎలా ప్రయాణం చేసింది అనే విషయం చాలా సులువుగా మేప్పింగ్ చేయగలుగుతున్నారు.

గత 15-20 ఏళ్ళుగా జన్యుశాస్త్రంలో DNA Sequencing పద్దతి ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వగలుగుతుంది. దీని ఆధారంగా ఏదేని ఆర్కియలాజికల్ సైటులో దొరికిన ఒక ప్రాచీన మానవ అవశేష సాంపిల్ లోని DNAను (జన్యువులను) గుర్తించగలుగుతున్నారు. ఒక వ్యక్తిసాంపిల్ లోని జన్యు అవశేషాలలో సుమారు 6 లక్షల జెనిటిక్ మార్కర్స్ ఉంటాయి. అంటే ఆ వ్యక్తికి మాత్రమే ఉండే DNA లక్షణాలు. ఈ మార్కర్స్ సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే పరీక్షలలో వివిధ సాంపిల్స్ మధ్య అంత ఖచ్చితత్వం ఉంటుంది. ఈ సాంపుల్స్ కి కార్బన్ డేటింగ్ చేయటం ద్వారా వాటి యొక్క ఖచ్చితమైన కాలాన్ని నిర్ణయించ గలుగుతున్నారు.

ఈ మొత్తం విషయాన్ని ఇలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ ప్రాంతంలో వివిధ శతాబ్దాల వ్యత్యాసంతో దొరికిన అనేక ప్రాచీన మానవ అవశేషాల సాంపిల్స్ ABCD అనే జన్యు మార్కర్లను ఏ మార్పు లేకుండా చూపుతున్నాయి. అదే కాలానికి భరత ఖండంనుంచి సేకరించిన ప్రాచీనమానవ అవశేషాలలో మొదట్లో EFGH జన్యు మార్కర్లు కనిపిస్తూ, ఒక్కసారిగా c 1900 BCE and 1500 BCE మధ్య నుంచి ఇరాన్ కు చెందిన AB జన్యువులు కనిపించటం మొదలైంది.

దీనిని బట్టి ఇరాన్ నుంచి ఆ జన్యువులు కలిగిన మనుషులు భరతఖండంలోకి c 1900 BCE and 1500 BCE మధ్య వచ్చినట్లు నిర్ధారించవచ్చు. (అలాకాక EFGH మార్కర్స్ ఇరాన్ లో కనిపించినట్లయితే భారతదేశం నుండి ఇరాన్ కు వలసలు జరిగాయని భావించవచ్చు. కానీ అలా జరగలేదు).

ఆ విధంగా జన్యు శాస్త్ర అధ్యయనాలు ఆర్యుల వలసను శాస్త్రీయంగా దృవీకరించాయి. జన్యువుల కదలికల ఆధారంగా వలసలు జరిగాయి అని ఎలా నిర్థారిస్తారనేదానికి ఇది ఒక ఊహా నమూనా. (చూడుడు. ఊహాచిత్రం).

నిజానికి ఈ మార్కర్లు ఉదాహరణలో చెప్పినట్లు అనేవి నాలుగైదు కాదు. ముందుగా చెప్పినట్లుగా ఆరులక్షల మార్కర్ల ఆధారంగా చేసిన నిర్థారణలు ఇవి.
మధ్య ఆసియా నుండి కొన్ని జన్యువులు భరతఖండంవైపు కాలానుగుణంగా కదులుతూ వచ్చాయని కొన్ని పదుల సైంటిఫిక్ పేపర్లు నిర్ధారించాయి.

II. ఆర్యుల వలస వచ్చారని నిర్ధారించిన కొన్ని అధ్యయనాలు.

భారతఉపఖండంలోకి ప్రధానంగా మూడు విడతలుగా జరిగిన వలసల వలన అది జనావాసంగా మారింది. 65 వేలఏండ్లక్రితం “Out of Africa” వలస ద్వారా ఆఫ్రికానుంచి ప్రపంచంలోని పలు చోట్లకు ఆఫ్రికా ప్రజలు విస్తరించారు. ఇది మొదటి వలస.
 
అలా భారతదేశంలోకి వచ్చిన “మొదటి భారతీయుల జన్యువులు” నేటి భారతదేశ జనాభాలో 50-65% వరకూ ఉన్నాయి. రెండవ వలస 9000-5000 వేల ఏండ్ల క్రితం మధ్య ఇరాన్ పీఠభూమినుంచి వచ్చిన Iranian Agriculturalists. వీరు భరతఖండలోకి వ్యవసాయాన్ని తీసుకొనివచ్చారు. వీరి వల్ల బార్లి, గోధుమ వ్యవసాయం భారతదేశంలో విస్తరించింది. సింధులోయ నాగరికత అభివృద్ధిచెందింది.

ఆర్యుల వలస సిద్ధాంతాన్నిబలపరుస్తూ వచ్చిన పరిశోధనా పత్రాలలో ముఖ్యమైనవి ఇవి.


1. "The formation of human populations in South and Central Asia", Authors: Vagheesh M. Narasimhan, Nick J. Patterson, Priya Moorjani, Iosif Lazaridis, ఇంకా భారతదేశంతో సహా 18 దేశాలనుంచి 114 మంది జన్యు శాస్త్రవేత్తలు. ఇది Science, September 2019 లో ప్రచురితమైంది.

ఈ అధ్యయనం ఆర్యుల వలస సిద్ధాంతాన్ని సమర్ధించింది. 8000 వేల సంవత్సరాలలో, 19 వివిధ భౌగోళిక ప్రాంతాలలో, 269 భిన్న కాలాలకు సంబంధించిన (points of times) మొత్తం 524 మంది పురాతన మానవుల జన్యు సాంపిల్స్ లోతుగా పరిశోధించి రాసిన పేపరు ఇది.

ఈ పేపరు ఈ క్రింది విషయాలను నిష్కర్ష చేసింది.

A. మూడవ విడత వలస వలన భారతదేశ సాంస్కృతిక సామాజిక రాజకీయ రంగాలలో పెనుమార్పులు వచ్చాయి. భారతీయ ఉపఖంఢంలోకి మూడవ విడత వలస ద్వారా c 1900 BCE and 1500 BCE మధ్యలో Pontic-Caspian steppe (ఉక్రయిన్, రష్య, కజకిస్తాన్) ప్రాంతాలనుంచి Yamnaya Steppe pastoralist లు భారతదేశంలోకి ప్రవేశించారు . వీరు పశుపాలకులు. వీరు తమతో సంస్కృత భాషను, వైదిక సంస్కృతిని తీసుకొని వచ్చారు. వీళ్ళే ఆర్యులు. (ఇకపై Steppe pastoralist కు ఈ పదమే ఉంటుంది స్పష్టత కొరకు)

B. ఈ ఆర్యులను- Y-DNA మార్కర్స్ అయిన R1a-M417, R1b-M269 ద్వారాను; Autosomal DNA మార్కర్స్ అయిన Steppe_EMBA (Early Middle Bronze Age) component, steppe_MLBA (Middle to Late Bronze Age) component ల ద్వారాను గుర్తించారు.

C. ఈ ఆర్యులు వచ్చిన కాలంలోనే భరతఖండంలో కాస్త అటూ ఇటూగా సింధులోయనాగరికత అంతర్ధానం, సంస్కృతభాష (Proto-Indo-Aryan language), వైదిక సంస్కృతి మొదలవటం లాంటి అనేక సాంస్కృతిక పరిణామాలు సంభవించాయి. వీటన్నిటికీ ఈ ఆర్యులరాకకు సంబంధం ఉంది.

2. “An Ancient Harappan Genome Lacks Ancestry from Steppe Pastoralists or Iranian Farmers”. Authors: Vasant Shinde, Vagheesh M. Narasimhan, Nadin Rohland నాలుగుదేశాలకు చెందిన మొత్తం 26 మంది. ఈ పరిశోధనా పత్రం Cell జర్నల్ అక్టోబర్ 2019 సంచికలో ప్రచురింపబడింది.

ఈ అధ్యయనం హరప్పా (సింధులోయనాగరికత) లోని రాఖిగరి ప్రదేశానికి చెందిన ప్రాచీనవ్యక్తి అవశేషాలలోని DNA ను విశ్లేషణ చేసి ఈ క్రింది పరిశీలనలు తెలియచేసింది.

A. సింధులోయ నాగరికత ప్రజలలో ఆర్యుల జన్యువులు లేవు. అప్పటికే గొప్ప నగరనిర్మాణ కౌశలాన్ని కలిగి ఉన్న సింధులోయ నాగరికత ఈ ఆర్యులు వచ్చే c2000 BCE కాలానికి క్షీణదశలో ఉంది. సింధులోయ ప్రజలలో పైన చెప్పిన ఆర్యుల జన్యువులు లేకపోవటాన్ని బట్టి సింధులోయ ప్రజలు ఆర్యులు రాకముందునించే ఇక్కడ అభివృద్ధిచెందిన నాగరికతతో జీవిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి.

B. స్టెప్పీ ప్రాంతాలనుండి ఆర్యులద్వారా భరతఖండంలోకి వేదసంస్కృతి, సంస్కృత భాష c2000 BCE ప్రాంతంలో వచ్చింది.

C. ఈ అధ్యయనం ఆర్యులు సింధులోయనాగరికత అనంతరం భారతఖండంలోకి ప్రవేశించినట్లు నిరూపించింది.

3. "Massive Migration from the Steppe was a Source for Indo-European Languages in Europe" (2015), Authors: Wolfgang Haak, Iosif Lazaridis, Nick Patterson, et al. Journal: Nature, March 2025.

ఈ అధ్యయనం ద్వారా స్టెప్పీ ప్రాంతాలనుండి Y-chromosome haplogroups R1a and R1b జన్యువులు కలిగిన ఆర్యులు పెద్ద సంఖ్యలో యూరప్, దక్షిణ ఆసియావైపు (ఇండియా వైపు) వలసలు వెళ్ళారని జన్యువుల కదలికల ఆధారంగా నిర్ధారించింది. ఈ పాయింటు ఆర్యుల వలసను సమర్ధిస్తుంది.

4. "Population genomics of Bronze Age Eurasia" by Allentoft et al. (2015)

Bronze Age (3000-1000 BCE) లో యూరప్, మధ్య ఆసియాలో పెద్ద ఎత్తున్న వలసలు జరిగాయని, ఈ వలసల వల్ల జన్యువుల తొలగింపు మరియు జన్యువుల సమ్మేళనం జరిగినట్లు నిర్ధారించింది. (genetic replacement and admixture). ఈ జన్యు అధ్యయనంద్వారా ఆర్యులు-అనార్యుల మధ్య కూడా జన్యువుల తొలగింపు, సమ్మేళనం జరిగి ఉంటుందని భావించవచ్చు.

5. "Early 'Aryans' and their Neighbors outside and inside India" Author: Michael Witzel, Published in: Journal of Biosciences, October 2019

Michael Witzel ప్రఖ్యాతిగాంచిన ప్రాచీన జన్యువుల పరిశోధకుడు. ఈ పత్రం పురాతత్వశాస్త్రం, భాషాశాస్త్రం, పాపులేషన్ జెనిటిక్స్, వేదాలనుంచి ఉటంకింపులు లాంటి వివిధ రంగాలనుంచి ఆధారాలను ఈ క్రిందివిధంగా క్రోడీకరించి ఆర్యుల వలస జరిగిందని నిరూపిస్తుంది.

A. ఆర్యులు మధ్య ఆసియానుంచి క్రమక్రమంగా భరతఖండంలోకి వలస వచ్చి ఇక్కడి ప్రజలతో కలిసిపోయారు. స్వాత్ లోయలో (పాకిస్తాన్) 1250 BCE నాటి పురాతన జన్యు సాంపిల్స్ లో భరతఖండానికి సంబంధించి మొదటి ఆర్యుల ఆనవాళ్లు కనిపించాయి.

B. హరప్పాలో సంస్కృత భాష కానీ వైదిక సంస్కృతికి చెందిన ఆధారాలు లభించలేదు. వైదిక సంస్కృతిలో హరప్పానాగరికతలో ఉన్నట్లు పట్టణాలు, అంతర్జాతీయ వాణిజ్యాలకు సంబంధించిన వర్ణనలు లేవు. ఈ పరిశీలనలు హరప్పానాగరికత, వైదిక సంస్కృతి వేరు వేరు అని నిరూపిస్తాయి.

C. ఆర్యసంస్కృతిలో గుర్రాలు కీలకం.. అందుకనే భరతఖండంలో గుర్రాలు, రథాలు 1800 BCE తర్వాత మాత్రమే కనిపిస్తాయి. ఇది ఆర్యులరాకతో సరిపోతుంది. గుర్రాలు స్థానిక జాతులు కావు. వీటిని ఆర్యులు తమతో పాటు తీసుకొని వచ్చారు

D. ఘగ్గర్-హక్రానది (దీనినే తదుపరి వచ్చిన సంస్కృతంలో సరస్వతి నది అని భావిస్తారు) వ్యవసాయ ఆధారిత హరప్పానాగరికత ఉచ్ఛదశలో కూడా నిరంతరం ప్రవహించే జీవనది కాదు. మరి హరప్పా ప్రజలు వ్యవసాయం ఎలా చేసారు అనేదానికి- పంజాబు ప్రాంతంలో అనేక నదీమడుగులు (oxbow lakes), ఇంకా హరప్పా ముద్రలలో కనిపించే నీటివాహకులు (కుండలలో నీరు మోసుకెళ్ళే నీటివాహకులు) సమాధానంగా కనిపిస్తాయి. 2000 BCE లో మిడిల్ ఈస్ట్, ఓమన్, ఇరాన్ ప్రాంతాలలో వచ్చిన వాతావరణ మార్పుల ప్రభావంచే హరప్పా ప్రజలు వలసబాట పట్టారు. అలా హరప్పానాగరికత క్షీణించింది.
 

III. ఆర్యుల వలస – భారతసమాజంపై వేసిన ముద్ర

1. ఆర్యులు వర్ణవ్యవస్థను ఏర్పరచారు. సమాజాన్ని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంటూ నాలుగు శ్రేణులుగా విభజించారు. వీరిలో బ్రాహ్మణులు ఉన్నతులుగాను, మిగిలిన మూడు వర్ణాలు వారికి సేవచేయాలని ధర్మశాస్త్రాల ద్వారా నిర్ణయించారు. ధర్మశాస్త్రాలనేవి ఒకనాటి రాజ్యాంగం. ఇక వీరికి వెలుపల అతిశూద్రులు ఉండేవారు అతిశూద్రులు వూరివెలుపల నివసించే అంటరానివారు. ధర్మ శాస్త్రాలప్రకారం వీరసలు మనుషులే కారు.

2. ఆర్యులు తమతో పాటు సంస్కృత భాషను తెచ్చుకొన్నారు. ఇది అప్పటికే ప్రజలలో ఉన్న పాలి, పైశాచి, మగధి, మహారాష్ట్రి, కామరూపి, అపభ్రంశ, శౌరసేని, గాంధారి లాంటి అనేకరూపాలలో ఉన్న ప్రాకృతభాషను క్రమేపీ తొలగించి రాజభాషగా స్థిరపడింది. క్రమేపీ స్థానికంగా ఉండిన ప్రాకృతభాషలు అంతరించిపోయాయి. (నా బ్లాగు చూడుడు: ప్రాకృత, సంస్కృత భాషల మధ్య జరిగిన మత రాజకీయాలు)

3. యజ్ఞాలు, క్రతువులు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు వంటి దేవతల ఆరాధన, బ్రాహ్మణాధిపత్యం, షోడశ సంస్కారాలు, కర్మ, పునర్జన్మ, మోక్షం, వేదాలనుప్రమాణంగా అంగీకరించటం లాంటి భావనలతో రూపుదిద్దుకొన్న ఆర్యుల బ్రాహ్మణ(వైదిక) మతం క్రమేపీ హిందూమతంగా స్థిరపడింది.
4. సింధునాగరికత పతనానికి ఆర్యులు నేరుగా కారణం కాదని భావిస్తారు. జన్యు విశ్లేషణలు వలసలను నిర్ధారించగలవు కానీ అలా వలస వచ్చిన ఆర్యులు స్థానికులపై దాడులు చేసారా లేదా అనేది చెప్పవు. దాడులు జన్యువులలో కనిపించవు, వాఞ్మయంలో కనిపిస్తాయి. ఇదొక సమాంతర ఆధారం.

వేదాలు ఆర్యుల రచన. ముఖ్యంగా ఋగ్వేదం. ఆర్యులు రాసుకొన్న ఈ వేదసాహిత్యంలో శత్రువుల పురాలను/మూలవాసుల నగరాలను నాశనం చేయమని ఇంద్రుని ప్రార్థించే సూక్తాలు అనేకం ఉన్నాయి. ఇంద్రునికి పురందరుడు (నగరాలను ధ్వంసం చేసేవాడు) అని పేరు.
ఈదేశ మూలవాసులైన అనార్య స్థానిక తెగలకు చెందిన వ్యక్తులను, అసురులు, దస్యులు అని వేదాలలో పిలిచారు ఆర్యులు.

ఇంద్రుడు 30 వేలమంది దాసుల్ని., వృత్రాసురుడిని చంపినట్లు ఋగ్వేదంలో ఉంది. (4.30.210). మధ్య ఆసియానుంచి వలస వచ్చిన ఆర్యులు స్థానిక హరప్పా నగరాలను, ప్రజలను ధ్వంసంచేయటంగా ఈ ఉదంతాలను అర్ధం చేసుకోవాలి.

శత్రువుల గర్భంలోని పిండాలను కూడా నాశనం చెయ్యాలని దేవతలను కోరుతూ ఆర్యులు రాసిన సూక్తాలు వేదాలలో ఉన్నాయి. అనార్య రాజైన శంబరాసురుడు తమ సంస్కృతిని కాపాడుకోవటం కొరకు ఇంద్రునితో పోరాడినట్లు వేదాలలో ఉంది. ఆవిధంగా ఆర్యులు స్థానిక అనార్యులపై సాగించిన దండయాత్రలు వేదాలలో విపులంగా వర్ణించబడ్డాయి. ఆర్యులు స్థానికులపై దండయాత్ర జరిపినట్లు చెప్పటానికి వేదాలే గొప్ప సాక్ష్యం. ఆ విధంగా మాక్స్ ముల్లర్ చెప్పిన ఆర్యుల దాడి సిద్ధాంతం నిరూపితమైనట్లే.

5. ఆర్యులు వారి స్త్రీలతో కాకుండా పురుషులు ఒక్కరే భరతఖండానికి వచ్చి స్థానిక అనార్య స్త్రీలను పెళ్ళాడారు. ఈ సందర్భంగా స్థానిక పురుషులను ఓడించి లేదా నిర్మూలించటం ద్వారా వారి స్త్రీలను గ్రహించటం జరిగి ఉండాలి. స్త్రీలకొరకు ఆర్య పురుషులు, స్థానిక పురుషుల మధ్య ఘర్షణలు జరిగాయనటానికి ఇది ఒక సంకేతం. ఆర్యసమాజం క్రమేపీ పితృస్వామ్య సమాజంగా రూపుదిద్దుకొంది స్త్రీలకు హక్కులు తగ్గాయి. బాల్యవివాహాలు, విద్యాపరమైన పరిమితులు, సతీసహగమనాలు వంటి ఆంక్షలు పెరిగాయి.

6. ఆర్యుల బ్రాహ్మణ మతం భారతీయ సమాజంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. దానిలోని వేదాలను, యజ్ఞయాగాదులను, జంతుబలులను, బ్రాహ్మణాధిక్యతను, కర్మసిద్ధాంతాన్ని, స్వర్గనరకాలు వంటి అభౌతిక అంశాలను తిరస్కరిస్తూ చార్వాక, ఆజీవిక, బౌద్ధ మతాలు వచ్చాయి. వీటిని కాలక్రమేణా తొలగించి బ్రాహ్మణమతం 600-1000 AD నాటికి పూర్తి స్థాయి హిందూమతం రూపుదిద్దుకొంది.

7. ఆర్యులు ప్రవేశపెట్టిన జన్మ ఆధారిత హెచ్చుతగ్గుల వర్ణవ్యవస్థ (కులవ్యవస్థ), బ్రాహ్మణాధిక్యత, మంత్రాలు, క్రతువులు, స్వర్గనరకాలు, పాపం పుణ్యం లాంటి అభౌతిక భావనలు నేటికీ సమాజంలో తమప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి.

8. మరొక ఆశ్చర్యం కలిగించే అంశం- ఆర్యులలో ఉండే R1 haplogroup జన్యువు ఆధునిక భారతసమాజంలో బెంగాలు బ్రాహ్మణులలో అత్యధికంగా 72.22 శాతం, ఇతర రాష్ట్రాల బ్రాహ్మణులలో 70-30% మధ్యలో కనిపించింది. 
( రి: Y-DNA_haplogroups_in_populations_of_South_Asia)

ఇక భారతదేశ క్రిందితరగతి ప్రజలలో (Lower Castes/దళిత,బహుజనులు) ఈ ఆర్య జన్యువు 15.7 శాతం మందిలో కనిపించింది. అదే విధంగా భారతీయ గిరిజనులలో ఈ జన్యువు 7.9% మందిలో మాత్రమే గుర్తించారు.

ఈ గమనింపు ద్వారా నేటి బ్రాహ్మణులు మధ్య ఆసియా నుంచి వచ్చిన విదేశీ ఆర్యులని, దళిత బహుజన గిరిజన ప్రజలు భరతఖండంలో సింధునాగరికతా కాలంనుండి జీవిస్తున్న స్థానికులని భావించవచ్చు.

IV. ఆర్యుల వలస సిద్ధాంతంతో సమస్య ఏంటి?

1. ఆర్యుల దాడి సిద్ధాంతాన్ని బ్రాహ్మణులు అంగీకరించరు. మాక్స్ ముల్లర్ కలోనియల్ ఏజంటని, అతనికి సంస్కృతం రాదని, డబ్బులు తీసుకొని అనువాదాలు చేసాడని అంటూ అతనిపై తీవ్రమైన విష ప్రచారం చేసి ఆర్యులు వలస అనేమాట నూటయాభై ఏండ్లపాటు ప్రజలకు వినబడకుండా ఎవరూ చర్చించకుండా చేసారు. నేటికీ బ్రాహ్మణులు అనాదిగా వారు ఈ నేలకు స్థానికులని చెప్పుకొంటారు. తమ విదేశీమూలాలను అంగీకరించరు. ఈ రోజు జన్యుపరీక్షలమూలంగా ఆర్యబ్రాహ్మణులు ఈ దేశానికి మధ్య ఆసియా ప్రాంతంనుండి వలస వచ్చారని నిర్ధ్వంద్వంగా నిరూపించబడింది.

2. c 1900 BCE and 1500 BCE మధ్య ఆర్యబ్రాహ్మణులు, సంస్కృతం భారతదేశంలోకి వలస వచ్చినట్లు అంగీకరించాల్సిన పరిస్థితులలో హిందూ పురాణ ఇతిహాసాలలో చెప్పిన కాలక్రమణికను (Time line) ఆమేరకు సవరించుకోవాలి. అంటే భారతం 5 వేల ఏండ్లక్రితానిది, రామాయణం 10 వేల సంవత్సరాల క్రితం జరిగిందని అంటూ చెప్పే కథనాలు మార్చుకోవాలి.
3. అనాదిగా ఈ దేశంలో పాటింపబడుతున్న హిందూధర్మమే సనాతన ధర్మం అని చెబుతున్న నిర్వచనం కూడా మారిపోతుంది. ఎందుకంటే ఈ దేశంలో హిందూధర్మం కంటే ముందు సింధునాగరికత వర్ధిల్లింది. అదే నిజమైన సనాతన ధర్మం అవుతుంది. హరప్పా ముద్రలలో కనిపించే నాగారాధన, యోగ ముద్రలు, అమ్మదేవతల ఆరాధన లాంటివి నిజమైన సనాతనధర్మం అని అంగీకరించాల్సి ఉంటుంది. ఆ సంస్కృతి పండితులది కాదు. ఈనాటికీ హరప్పా సంస్కృతిని గ్రామదేవతల రూపంలో బతికించుకొన్న బహుజనులది

4. ఆర్యుల వలస సిద్ధాంతాన్ని అంగీకరించినపుడు, చరిత్రలో ఈ ఆర్యపండితులు జన్మాధారిత వర్ణ/కుల వ్యవస్థను కల్పించి దానితో ఇంతకాలం ఈ సమాజాన్ని వర్ణాలుగా విభజించి తమను ఉన్నత స్థానంలో పెట్టుకొని సాగించిన దుర్మార్గపు ఆధిపత్యపు గుట్టు రట్టవుతుంది.
5. ఆర్యులు విదేశీయులైతే వారి జన్యువులు కలిగిన ఈ పండితులు కూడా టర్కీనుంచి వలసవచ్చిన తురకలతో సమానమౌతారు.

భరతఖండం అంటే మేమే అని ఇన్నాళ్ళూ చెప్పుకొన్న వారికి ఇది చాలా అవమానకరమైన స్థితి. కనుక ఆరు నూరైనా నూరు ఆరైనా ఆర్యులవలస సిద్ధాంతం తప్పు అని నిరూపించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా హరప్పాలిపిలో సంస్కృత ఛాయలు ఉన్నాయని, హరప్పా సంస్కృతి వేద సంస్కృతే అని ప్రచారం ఎత్తుకొన్నారు.

Out of India Theory పేరుతో ఓ అబద్దపు సిద్ధాంతాన్ని తెరమీదకు తెచ్చి -- ఆర్యులు భరతఖండంలో పుట్టినవారే, ఇక్కడనుంచి మధ్య ఆసియాకు వలస వెళ్ళి మరలా తిరిగి BCE 1500లో భరతఖండంలోకి వెనక్కు వలస వచ్చారని గొప్ప అతి తెలివి వాదన ఒకటి మొదలుపెట్టారు. దీనికి జన్యువుల వలసలను నిర్ధారించే ఆధారాలను చూపలేకపోయారు.

హిందూ పండిత చరిత్రకారులు చెబుతున్న సిద్ధాంతాలను ప్రపంచవ్యాపిత ఇండాలజిస్టులు నమ్మటంలేదు. అదొక సంకట స్థితిగా మారింది సనాతనహిందూ చరిత్రకారులకు. మాక్స్ ముల్లర్ ని బుకాయించినట్లు బుకాయించటం ఇప్పుడు సాగటం లేదు. ఈ నిర్ధారణలు అన్నీ ఖచ్చితత్వంతో చెప్పే జన్యుశాస్త్రం పరిధిలోకి వెళ్ళిపోయాయి.


V. ముగింపు

భారతదేశానికి ఆర్యుల రాక అత్యంత ప్రభావశీలమైన సంఘటన. భారతీయ మత, సామాజిక, భాష, రాజకీయ వ్యవస్థలపై బలమైన ముద్ర వేసింది.. ఆర్యుల రాక అనార్యప్రజల జీవితాల్ని పూర్తిగా మార్చివేసింది. సమాజంలో జన్మ ఆధారిత హెచ్చుతగ్గుల కులవ్యవస్థ ప్రభావం మామూలిది కాదు. ఈనాటికీ భారతసమాజానికి దానినుండి విముక్తి లేదు. అనార్యుల భాషలు (?), మతాలు ఆచారాలు క్రమంగా నశించాయి లేదా ఆర్యబ్రాహ్మణ సంస్కృతిలో కలిసిపోయాయి.

కొన్ని ఆచారాలు పండితులచే పామర విషయాలు అంటూ తృణీకరణకు గురయి- అమ్మదేవతలు, నాగారాధన లాంటి ఆచారాలుగా అక్కడక్కడా మనుగడ సాగిస్తూ ఉండవచ్చు.

ఆర్యుల వలసకు ఉన్నట్లు ఆర్యుల దండయాత్రకు శాస్త్రీయమైన ఆధారాలు లేవు కానీ ఆర్యులు స్థానికులపై దండయాత్ర చేసినట్లు వేదాలలో కొన్ని ఆధారాలు కనిపిస్తాయి.

ఆర్యసంస్కృతి స్త్రీల స్థితిని కిందకు జార్చింది. సంప్రదాయాలపేరిట పురుషుని కన్నా తక్కువ సమానురాలను చేసింది.

ఆర్యబ్రాహ్మణ సంస్కృతిని తిరస్కరించిన చార్వాక, ఆజీవిక, బౌద్ధ జైన సంస్కృతులు ఒకనాటి సామాజిక తిరుగుబాట్లు. వాటి ప్రభావం దాదాపు వెయ్యేళ్ళు ఈ సమాజంపై ఉండింది. 600-1000 CE మధ్య శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు ఆ పిదప మధ్వాచార్యులు వంటి పండితుల కృషివల్ల బౌద్ధజైనాలు కాలగర్భంలో కలిసిపోయాయి. వైదికమతం హిందూమతంగా స్థిరపడింది మరీ ముఖ్యంగా బలమైన వైష్ణవమతంగా.

సంస్కృతం నేర్చుకోకూడదు, ఆలయప్రవేశం లేదు, ఉపనయనం కూడదు, వేదాలు వినరాదు అంటూ హిందూమతం దళిత, బహుజనులకు వివిధ ఆంక్షలు పెట్టి ఉక్కిరిబిక్కిరిచేసిన నేపథ్యంలో మధ్య యుగాలలో అనేక భక్తి ఉద్యమాలు వచ్చాయి. ఇవి వేదాలను, సంస్కృతాన్ని తిరస్కరించాయి. అందరూ సమానము, ఆరాధనే ముఖ్యం అని ప్రవచించాయి. ముస్లిం పాలనలో సూఫీఉద్యమాలు కూడా భక్తి, ప్రేమలతో భగవంతుడిని చేరవచ్చునని బోధించాయి. సూఫీలను హిందువులు కూడా అనుసరించారు.

ఇవన్నీ భారతదేశ చరిత్రలో బయటనుంచి వచ్చిన ఆర్యసంస్కృతికి స్థానిక అనార్య సంస్కృతికీ అనాదిగా జరిగిన ఘర్షణలు. నేటికీ మహాత్మా ఫూలే, డా. అంబేద్కర్, పెరియార్ భావజాలాల రూపంలో ఈ ఘర్షణ కొనసాగుతూనే ఉంది.

ఆఫ్టర్ ఆల్ ఆథ్యాత్మిక అనేది ప్రతిమనిషికి మానసికావసరం.


బొల్లోజు బాబా







Sunday, March 2, 2025

ఔరంగజేబు మతవిధానం


భారతదేశం అనాదిగా మతవైవిధ్యానికి, భిన్న సంస్కృతుల మేళవింపుకు ప్రసిద్ధి. హిందూ ముస్లిమ్, క్రిస్టియన్ ల మధ్య సామరస్యాన్ని సూచించే, దర్గాలు, సూఫీ సంతుల పండగలు, ఫీర్ల ఉత్సవాలు, వేళాంకన్ని లాంటి సంస్కృతులతో ప్రజలందరూ పరస్పరసహకారం, సహనంతో జీవించారు. ఇటివల హిందుత్వ శక్తులు ఈ సామరస్యాన్ని ధ్వంసం చేసి సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంచటానికి ప్రణాళికాబద్దంగా ప్రయత్నిస్తున్నాయి.

అజ్మీర్ లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ, ఢిల్లీకి చెందిన హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా వంటి సూఫీ సంతుల దర్గాలను హిందువులు ముస్లిములు వచ్చి దర్శించుకొంటారు. ఇవి ఒకరకంగా ఈ రెండు మతాలు కలుసుకొనే చోట్లు. ఈ సహిష్ణుతను నాశనం చేసే ప్రయత్నాలు ఇటీవల చూస్తున్నాం.

ఈ మధ్యకాలంలో చర్చిలపై, క్రైస్తవ విశ్వాసులపై దాడులు జరుగుతున్నట్లు పేపర్లలో చూస్తున్నాం. ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే మసీదుకు వెళ్ళి తాయత్తు కట్టించుకోవటమో, ఏ చర్చి ఫాదరునో ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవటమో బహుజనులలో అనాదిగా వస్తున్న ఆచారం. కానీ ఈనాడు ఇలాంటి కలయికలు జరగకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు కొందరు. ఇవన్నీ మనుషులమధ్య చిచ్చులు పెట్టి, వారిని విభజించే కుట్రలుగా అర్ధం చేసుకోవాలి.

అంతేకాక ఔరంగజేబులాంటి ముస్లిమ్ పాలకులను కొందరు క్రూరపాలకులుగా చిత్రించే ప్రయత్నాలు పదే పదే జరుగుతున్నాయి. అతని పాలనలో జరిగిన కొన్ని సంఘటనలను ముందుకు తీసుకొచ్చి వాటికి లేని పోని కల్పనలు జోడించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవి ప్రజలను విభజించి, వారిలో ద్వేషభావాలను పెంపొందించటానికి ఉద్దేశించిన ఎత్తుగడలు.
ఔరంగజేబు ఆరవ మొఘల్ చక్రవర్తి. దాదాపు యాభై ఏండ్లు పాలించాడు. భారతదేశ చరిత్రలో ఔరంగజేబు లక్షలాది హిందువులను ఊచకోత కోసాడని, వేలాది ఆలయాలను ధ్వంసం చేసాడని చెబుతారు కానీ వాటికి సరైన చారిత్రిక ఆధారాలు లభించవు.******


ఔరంగజేబును ఎందుకు ద్వేషిస్తున్నారని ఎవరినైనా హిందుత్వ వాదులను అడిగితే- ఔరంగజేబు సోదరులను, సంతానాన్ని హత్యలు చేయించాడని, హిందువులపై జిజియాపన్ను విధించాడని చెబుతారు. ఇంతకు మించి ఔరంగజేబు గురించి చెడు చెప్పటానికి వారివద్ద కూడా ఏమీ ఉండదు.
రాజ్యాధికారం స్థిరపరచుకొనే క్రమంలో దాయాదులను తొలగించటం రాచరిక వ్యవస్థలో సహజం. ఈ పని ఔరంగజేబు ఒక్కడే కాదు బాబర్, హుమాయున్, అక్బర్, షాజహాన్ లాంటి ముఘల్ పాలకులందరూ చేసారు. శత్రుశేషం లేకుండా చూడటం రాజ్యంలో అంతర్యుద్ధాన్ని, తిరుగుబాట్లను, అస్థిరతను నివారించటం కొరకేనని రాజకీయనిపుణులు చెబుతారు.

జిజియా పన్ను అనేది ఇస్లామేతర విశ్వాసులు- రాజ్య రక్షణ, మతపరమైన స్వేచ్ఛ పొందేందుకు, మిలటరీ సర్వీసు నుండి మినహాయింపు కొరకు చెల్లించాల్సిన పన్ను. ఇది అల్లాఉద్దిన్ ఖిల్జి కాలంనుండి (1296–1316) అమలులో ఉన్న విధానం. దీనిని1564 లో అక్బర్ నిషేదించాడు. ఔరంగజేబు 1678 లో ఆర్థికకారణాలతో జిజియాపన్నును తిరిగి విధించాడు.

స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, పేదవారు, సన్యాసులు, బిచ్చగాళ్ళు, పిచ్చివాళ్ళు, బ్రాహ్మణులు (అభ్యర్ధనలమేరకు) జిజియాపన్ను నుండి మినహాయించబడ్డారు. అదే సమయంలో ముస్లిములు జకాత్ పన్ను (Alms Tax) చెల్లించేవారు. మధ్యయుగాల యూరప్ లో ప్రజలు స్వేచ్ఛగా జీవించటానికి Chevage, pogroms లాంటి పన్నులు ఉండేవి. ఇంతా చేసి ఈ జిజియాపన్ను ఖజానా ఆదాయంలో 1% మాత్రమే.

పై రెండు అంశాలపై పండితులు చేసిన విషప్రచారం మాటున ఔరంగజేబు చేసిన ఎన్నో పరిపాలనా సంస్కరణలు మరుగున పడిపోయాయి. ఉదాహరణకు: హిందువులు పుణ్యక్షేత్రాలు సందర్శించుకొనేటపుడు చెల్లించాల్సిన Pilgrim Tax (Ziyarat Tax), వస్తురవాణాపై విధించే Rahdari (Transit Tax), చిరువ్యాపారాలు చేసుకొనేవారిపై విధించే Pandari (Market Tax), వృత్తిపన్ను, వివాహపన్ను లాంటి సుమారు 80 రకాల పన్నులను ఔరంగజేబు రద్దుపరిచాడు. రోజు ప్రజలకు దర్బారు దర్శనం ఇచ్చి అనేక సమస్యలను అక్కడకు అక్కడ పరిష్కరించేవాడు.
ఈ రోజు అఖండ భారతదేశం అని దేనినైతే భావిస్తున్నామో దానిలో 90% భూమిని ఔరంగజేబు ఒకే గొడుగుకిందకు తీసుకు వచ్చినట్లు " The Mughal Empire at its height 1707" అనే వికిపీడియా మేప్ చూస్తే అర్ధమౌతుంది.

మద్యపానం, నల్లమందులకు ఔరంగజేబు దూరంగా ఉన్నాడు. వాటిని రాజాస్థానంలో నిషేదించాడు. రాజ్యంలో కూడా మద్యపాన నిషేదం ఉండేది. చక్రవర్తులకు సహజంగా ఉండే విలాసవంతమైన జీవితాన్ని తిరస్కరించాడు. ఖురాన్ కు రాతప్రతులు తీసి వాటిద్వారా వచ్చిన ఆదాయంతో జీవించేవాడు. ఖజానా నుంచి సొంతఖర్చులకు ధనాన్ని తీసుకొనేవాడు కాదు.
******
ఔరంగజేబు సుమారు మూడు శతాబ్దాల క్రితం 23, మార్చ్ 1707 న మహారాష్ట్ర లో చనిపోయాడు. అతని చివరి కోర్కెమేరకు అతని గురువైన Sayyad Zainoddin Shiraizi సూఫీ వేదాంతి సమాధి మందిరములో అతి సామాన్యంగా ఖననం చేసారు.
నేను ఇక్కడికి ఒక అనామకుడిలా వచ్చాను, ఒక అనామకుడిలా నిష్క్రమిస్తున్నాను – ఔరంగజేబు.
హుమాయాన్, షాజహాన్ సమాధులతో పోల్చితే ఔరంగజేబు సమాధి అతను కోరుకొన్నట్లుగానే అనామకంగా మిగిలిపోయింది చరిత్రలో. బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఔరంగజేబు సమాధిని పాలరాతితో నేడు మనం చూస్తున్న విధంగా నిర్మింపచేసాడు.

ఔరంగజేబు గతించిన మూడు శతాబ్దాలతరువాత కూడా రాజకీయాలకు ఒక గొప్ప ముడిసరుకుగా మిగిలాడు. తవ్వేకొద్దీ ఓట్లు రాల్చే సాధనమయ్యాడు.
****

ఈ మధ్య యుట్యూబ్ లో Dr Ram Puniyani వీడియో ఒకటి చూసాను. దానిలో ఔరంగజేబు వివిధ రాజకీయ కారణాలవల్ల 12 ఆలయాలను, కొన్ని మసేదులను ధ్వంసం చేసాడని, వందకు పైగా హిందూఆలయాల నిర్మాణానికి, పోషణకు సహాయపడ్డాడని ఈ అంశాలను శోధించి డా.బి.ఎన్ పాండే పుస్తకం రచించాడని చెప్పాడు. కొద్దిగా వెతకగా Aurangzeb And Tipu Sultan Evaluation Of Their Religious Policies అనే పేరుతో డా. బి.ఎన్. పాండే రాసిన పుస్తకం (1996) కనిపించింది.

నిజానికి ఈ పుస్తకంలోని వివరాలన్ని Audrey Truschke, Richard M. Eaton లాంటి వారు తమ రచనలలో అనేక సార్లు ప్రస్తావించారు. (వాటన్నిటికి ఒరిజినల్ సోర్స్ ఈ బి.ఎన్ పాండే రచన).

ఈ పుస్తకంలో డా. బి.ఎన్ పాండే ఔరంగజేబు మతపరమైన తటస్థతను పాటించాడని, అనేక హిందూ దేవాలయాలకు, మఠాలకు ఆర్థిక సహాయం చేసాడని ఆధారాలతో నిరూపించారు. డా.బి.ఎన్ పాండే రాసిన Aurangzeb Religious Policies భాగానికి ఈ క్రింది వ్యాసం ఉరామరి అనువాదం. యధాతథ అనువాదం కాదు. సంక్షిప్తీకరించబడినది. ప్రధమ పురుషలో ఉంటుంది.
అదనపు వివరాలకొరకు డా. పాండే గారి పుస్తకం లింకులో ఇచ్చాను చదువుకొనగలరు.

ఈ పుస్తకంలో నన్ను ఆకర్షించినది ఏమిటంటే…. ఔరంగజేబు హిందువులకు జారీ చేసిన ప్రతి ఫర్మానులోను “సామ్రాజ్యం శాశ్వతంగా నిలిచేందుకు వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి” అనే వాక్యం. ఔరంగజేబుకు హిందూ దేవుళ్ళపట్ల వ్యతిరేకభావన లేదని ఈ వాక్యం తెలియచేస్తుంది.

ఔరంగజేబు హిందూ ద్వేషి అనే ప్రచారం పండితుల సృష్టి. ఔరంగజేబు అన్న అయిన దారాషికో పండితుల సాంగత్యంలో సంస్కృతం నేర్చుకొన్నాడు. ఇతనితో, ఉపనిషత్తులు, ఇతరకావ్యాల అనువాదాలు చేయించారు. ఇతను రాజైతే తమకు తిరుగులేదని పండితులు భావించి ఉంటారు. ఇది ఔరంగజేబుకు నచ్చలేదు అన్నను తొలగించి, కళలు కవులను ఆస్థానంలో నిషేదించటం ద్వారా పండితులను దూరంపెట్టాడు. ఔరంగజేబుపై అనాదిగా పండితులకు ఉన్న ద్వేషానికి గల కారణమిది . ( బ్లాగులో చూడుడు: మొఘల్ పాలకులు -సంస్కృత పండితులు వ్యాసం)

ఇప్పటివరకు ఈ పండితులు చేసిన దుష్ప్రచారాన్ని పక్కనపెట్టి, ఔరంగజేబును చారిత్రిక దృష్టికోణంలోంచి పునర్మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఉంది.
******
.
.
ఔరంగజేబు మతవిధానం- డా. బి.ఎన్ పాండే రచన ఉరామరి అనువాదం.
.
1948-53 మధ్య, నేను అలహాబాద్ మున్సిపాలిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలో, ఒక దాఖిల్ ఖారిజ్ (మ్యూటేషన్) కేసు నా పరిశీలనకు వచ్చింది. ఇది గంగా, యమునా సంగమంలో ఉన్న సోమేశ్వర్ నాథ్ మహాదేవ్ ఆలయానికి అంకితమైన ఆస్తిపై జరిగిన వివాదం. మహంత్ మరణించిన తరువాత, ఆస్తిపై ఇద్దరు హక్కుదారులు ప్రత్యర్థులుగా నిలిచారు. వారిలో ఒకరు, అతనివద్ద వంశపారంపర్యంగా ఉన్న కొన్ని పత్రాలను సమర్పించారు. ఆ పత్రాలు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ జారీ చేసిన ఫర్మాన్లు (రాజాజ్ఞ). ఔరంగజేబ్ ఆ ఆలయానికి జాగీర్ (భూమి), కొంత నగదు బహుమతి అందజేశాడని పేర్కొంది. నేను ఆశ్చర్యపోయాను. నాకు అనుమానం కలిగింది. ఆ ఫర్మాన్లు నకిలీవిగా అనిపించాయి.

విగ్రహాలను ధ్వంసం చేసే వ్యక్తిగా పేరుగాంచిన ఔరంగజేబ్, ఒక హిందూ ఆలయానికి పూజ, భోగం కోసం జాగీర్ ఇవ్వడం ఎలా సాధ్యం? అతను విగ్రహారాధనను ఎలా సమర్ధించగలడూ? లాంటి ప్రశ్నలు నాకు కలిగాయి.

నిజానికి ఆ పత్రాలు నకిలీవేనని నాకు నమ్మకం కుదిరింది. కానీ, తుది నిర్ణయం తీసుకునే ముందు, పర్షియన్ మరియు అరబిక్‌లో మహా పండితుడైన సర్ తేజ్ బహదూర్ సప్రూ అభిప్రాయం తీసుకోవాలని భావించాను. నా ఆఫీసు ముగిసాకా, నేరుగా ఆయన వద్దకు వెళ్లాను. ఆ పత్రాలను ఆయన ముందు ఉంచి, ఆయన అభిప్రాయాన్ని కోరాను. ఆ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించిన తరువాత, డాక్టర్ సప్రూ అవి నిజమైన ఫర్మాన్లే అని నిర్ధారించారు. ఆపై, ఆయన తన సహాయకుడిని, గత 15 సంవత్సరాలుగా అలహాబాద్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న వారణాసి జంగంబాడి శివాలయం కేసు ఫైలును తెప్పించమని ఆదేశించారు. ఆ ఆలయ మహంత్ కూడా ఔరంగజేబ్ జారీ చేసిన అనేక ఫర్మాన్లను కలిగి ఉన్నట్లు తెలిసింది.

దీంతో, నాకు ఔరంగజేబ్ వ్యక్తిత్వం కొత్తగా కనిపించటం మొదలైంది.  ఎంతో ఆశ్చర్యపోయాను.

డాక్టర్ సప్రూ సూచన మేరకు, నేను భారతదేశంలోని వివిధ ప్రధాన ఆలయాల మహంత్‌లకు లేఖలు రాసి, ‘వారి ఆలయాలకు సంబంధించి, ఔరంగజేబ్ ఫర్మాన్లు జారీ చేసి ఉంటే, వాటి ఫోటోకాపీలు పంపమని’ కోరాను. ఇంకా పెద్ద ఆశ్చర్యం ఎదురైంది. మహాకాళేశ్వర ఆలయం (ఉజ్జయిని), బాలాజీ ఆలయం (చిత్రకూట్), ఉమానంద ఆలయం (గౌహతి), శత్రుంజయ జైన ఆలయాలు, మరియు ఉత్తర భారతదేశంలోని అనేక ఇతర ఆలయాలు, గురుద్వారాల నుండి ఔరంగజేబ్ జారీ చేసిన ఫర్మాన్ల ప్రతులు నాకు అందాయి. ఈ ఫర్మాన్లు 1659 A.D నుండి 1685 A.D. మధ్య జారీ చేయబడ్డాయి.

ఇవి కొద్ది ఉదాహరణలు మాత్రమే అయినప్పటికీ, ఔరంగజేబ్‌పై చరిత్రకారులు వ్రాసినది పాక్షికం మాత్రమే, అది పూర్తిగా ఏకపక్షంగా ఉందని అర్ధమైంది. భారతదేశం విస్తారమైన దేశం, వేలాది ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. తగిన పరిశోధన చేస్తే, మరిన్ని ఉదాహరణలు బయటపడతాయి, ఇవన్నీ ఔరంగజేబ్ హిందువుల పట్ల ఉదారభావంతో వ్యవహరించినట్లు నిరూపిస్తాయి.

ఈ ఫర్మాన్లపై పరిశోధన చేస్తూ, నేను శ్రీ గ్యాన్ చంద్ మరియు పాట్నా మ్యూజియం మాజీ క్యూబేటర్ డాక్టర్ పి.ఎల్. గుప్తా వంటి ప్రముఖ చరిత్ర పరిశోధకులను కలిశాను. వారు కూడా ఔరంగజేబ్ చరిత్రపై విశేష పరిశోధనలు చేస్తున్నారు. నాకు సంతోషం కలిగించింది. ఎందుకంటే, మరికొందరు విజ్ఞానవేత్తలు, నిజమైన చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. పక్షపాతంగల చరిత్రకారులు, మొఘల్ పాలనను పూర్తి ముస్లిం పరిపాలనగా చూపిస్తూ, ఔరంగజేబ్‌ను కేవలం క్రూర ముస్లిం పాలకునిగా మాత్రమే చిత్రీకరించారు.
ఒక కవి వ్యథతో ఇలా వ్రాశాడు:

"తుమ్ హేన్ లేఖ్ కె సారీ దస్తాన్ మేన్ యాద్ హై ఇత్నా;
కే ఆలంగీర్ హిందు కుష్ థా, జాలిమ్ థా, సితం గర్ థా..."

(భారతదేశంలో వెయ్యి సంవత్సరాల ముస్లిం పాలన గురించి మాట్లాడేటప్పుడు, వాళ్లు కేవలం ఇంతే గుర్తు పెట్టుకుంటారు – ఆలంగీర్ (ఔరంగజేబ్) హిందువులను హత్య చేసిన వాడు, క్రూరుడైన పాలకుడు అని!)

ఔరంగజేబ్‌ను హిందూ వ్యతిరేక పాలకుడిగా ముద్ర వేసిన వాటిలో, "బనారస్ ఫర్మాన్" అనే ప్రసిద్ధ ఫర్మాన్‌ను ప్రస్తావిస్తారు. ఇది వారణాసిలోని మోహల్లా గౌరీ ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబానికి ఇచ్చిన ఉత్తర్వు. 1905లో ఒక వివాదంలో ఈ ఫర్మాన్ నగర మేజిస్ట్రేట్ ఎదుట సమర్పించబడింది. 1911లో "జర్నల్ ఆఫ్ ది ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్" లో ఇది ప్రచురితమైంది. అప్పటి నుంచి చరిత్రకారులు దీనిని తరచూ ప్రస్తావిస్తూ వస్తున్నారు.

ఈ ఫర్మాన్ మార్చి 10, 1659 నాడు, వారణాసిలోని స్థానిక అధికారికి జారీ చేయబడింది. ఒక బ్రాహ్మణుడు తన ఆలయంపై కొందరి వేధింపులను ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశాడు. ఈ ఫర్మాన్‌లో, "పురాతన ఆలయాలను కూల్చకూడదు, కొత్త ఆలయాలు నిర్మించకూడదు" అని ఉంది. మరీ ముఖ్యంగా, హిందువులకు ఉపద్రవం జరగకుండా చూడాలని, వారు శాంతిగా నివసిస్తూ, రాజ్యం కొనసాగడానికి దేవునికి ప్రార్థనలు చేయాలని పేర్కొనబడింది.

ఔరంగజేబ్ హిందువులను వేధించేందుకు ఈ ఫర్మాన్‌ను జారీ చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. అప్పటివరకు ఉన్న ఆచారం ప్రకారం, కొత్త ఆలయాలను నిర్మించకూడదని మాత్రమే పేర్కొన్నాడు. కానీ, హిందువుల భద్రత విషయంలో అతను చాలా కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

బనారస్‌లోని మరో ఫర్మాన్ కూడా అదే సూచిస్తుంది:

"మహారాజ ధీరాజ్ రాజా రామ్ సింగ్ (బనారస్) తన తండ్రి నిర్మించిన భవనాన్ని భగవత్ గోసాయి అనే గురువుకు నివాసంగా ఇచ్చిన సంగతి, కానీ కొందరు ఆయనను వేధిస్తున్నారని తెలుపుతూ, వారి హక్కులను పరిరక్షించాలని కోరిన మీదట” – అలా జరిపించాలని అధికారులను ఆదేశిస్తూ ఔరంగజేబు ఫర్మానా జారీచేసాడు.
ఇలాంటి మరికొన్ని ఫర్మాన్లు కూడా ఉన్నాయి. జంగంబారి మఠాన్ని కొందరు ముస్లిములు ఆక్రమించుకొన్నారని కొందరు జంగములు ఔరంగజేబు దర్బారులో మొరపెట్టుకోగా, “ విచారణ చేసి ఆ ముస్లిములదే తప్పయినట్లు తేలినచో వారిని అక్కడనుంచి తొలగించి తగిన విధంగా శిక్షింవలసిందని అధికారులను ఆదేశించాడు. అలా కొన్ని ఫర్మాన్లు, హిందువుల హక్కులను కాపాడటానికి ఔరంగజేబ్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు సూచిస్తున్నాయి.

ఇదంతా చూస్తే, ఔరంగజేబ్‌ను కేవలం హిందూ వ్యతిరేక పాలకుడిగా ముద్ర వేసే చరిత్ర పాక్షికమని తెలుస్తుంది. అతడు హిందువులకు న్యాయం చేయడంలోనూ, వారి ఆలయాలను రక్షించడంలోనూ శ్రద్ధ వహించినట్టు స్పష్టమవుతోంది. ఇలాంటి నిజమైన చరిత్రను వెలుగులోకి తేవడం చాలా అవసరం!

ఈ ఫర్మాన్ అతను హిందూ మతం పట్ల సమ న్యాయం పాటించటమే కాక , హిందూ భిక్షువులకు నిసార్ (ద్రవ్య సహాయం) పంపిణీ చేయడంలో ఆయన ఏ భేదాభిప్రాయం చూపలేదనే విషయాన్ని కూడా వెల్లడిస్తుంది. 178 బీఘాల భూమిని (110 ఎకరాలు) జంగములకు ఔరంగజేబ్ స్వయంగా దానం చేసినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ భూమిని గురించి మరొక ఫర్మాన్ 1661 CE. 29th April తేదీన జారీ చేయబడింది, ఇందులో ఈ విధంగా ఉంది:

"పర్గనా హవేలీ, బనారస్ (సుభా అలహాబాద్‌కి చెందిన) ప్రస్తుత, భవిష్యత్ అధికారులందరికీ తెలియజేయునది ఏమనగా… చక్రవర్తి ఆదేశాల ప్రకారం, బనారస్‌ పరగణాలో 178 బీఘాల భూమి జంగముల జీవనోపాధికి కేటాయించబడింది. దానిపై ఇతరులు ఎవరికీ హక్కులు లేవు. జంగములు హక్కులు నిరూపించబడ్డాయి, వారు ఇంకా జీవించి, భూమిని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి, గతంలాగే మళ్లీ ఈ భూమిని వారికి బహుమతిగా కేటాయిస్తున్నాము. ఈ భూమిని పన్నురహిత భూమిగా ప్రకటించడమైనది, వారు వారి వారసులు పరంపరానుగతంగా ఉపయోగించుకోవాలి. అలాగే, ఆ జంగములు చక్రవర్తి సామ్రాజ్యం శాశ్వతంగా నిలిచేలా దేవుని ప్రార్థన చేయాలి."
****
బనారస్ పట్టణంలో ఒక హిందూ మత గురువుకు భూమిని 1687 CE .లో ఔరంగజేబ్ అనుగ్రహించినట్లు మరో ఫర్మాన్ ఉంది:

"ఈ శుభ సమయంలో ఒక ఫర్మాన్ జారీ చేయబడింది. బనారస్‌లోని బెణీమాధో ఘాట్ వద్ద గంగా తీరాన ఉన్న 5.8 దిరా కొలత గల కొంతభూమి నిర్మాణరహితంగా ఖాళీగా ఉంది. ఇది బైతుల్ మాల్ (రాజకీయ ఖజానా) ఆధీనంలో ఉంది. కాబట్టి, ఈ భూమిని రామ్ జీవన్ గోసాయిన్ మరియు అతని కుమారునికి ఈనాం భూమిగా మంజూరు చేస్తున్నాము.

పవిత్ర బ్రాహ్మణులు, భక్తులు నివసించడానికి గృహాలు నిర్మించేందుకు వీలుగా ఈ భూమిని ఉపయోగించాలి. అలాగే, వారు భగవంతుని ధ్యానంలో లీనమై, మా దివ్య సామ్రాజ్యం శాశ్వతంగా నిలిచి ఉండేందుకు ప్రార్థనలు చేయాలి. మా కుమారులు, మంత్రులు, ఉమరా (ఉన్నత అధికారులు), దర్బార్ అధికారి, కోత్వాల్‌లు (స్థానిక పాలకులు) – ప్రస్తుత, భవిష్యత్ శాసనాధికారులు – ఈ ఫర్మాన్‌ను నిరంతరంగా పాటించేందుకు కృషి చేయాలి. పై పేర్కొన్న భూమి, మంజూరు పొందిన వ్యక్తి మరియు అతని వారసుల అధీనంలో ఉండాలని, అన్ని రకాల పన్నులు, రుసుముల నుండి మినహాయించాలని మరియు ప్రతీ సంవత్సరం కొత్త సనద్ (అధికార పత్రం) కోరవద్దని ఆదేశిస్తున్నాము."
*****

ఔరంగజేబ్ తన ప్రజల మతపరమైన భావోద్వేగాలను గౌరవించేందుకు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాడో మరొక ఉదాహరణ చూస్తే స్పష్టమవుతుంది.

ఆయన తన పాలన తొమ్మిదో సంవత్సరంలో గౌహతిలోని ఉమానంద ఆలయ పూజారి సుదామన్ బ్రాహ్మణునికు జారీ చేసిన ఫర్మాన్ దీనికి నిదర్శనం. ఈ ఆలయానికి, దాని పూజారికి, అస్సాంలోని హిందూ పాలకులు గతంలో కొంత భూమి కొంత అటవీ ఆదాయం అందజేసి పోషించారు. ఔరంగజేబ్ అస్సాంను జయించిన వెంటనే, ఈ హక్కులను పునరుద్ధరించి, ఆలయ భూమి మరియు ఆదాయాన్ని ఆ బ్రాహ్మణునికి మంజూరు చేస్తూ ప్రత్యేక ఫర్మాన్ జారీ చేశాడు.

గౌహతి ఫర్మాన్‌లో ఇలా ఉంది:
"సర్కార్ దక్షిణ పరిధిలోని పటా బెంగేసర్ గ్రామంలో పరగణా పండు ప్రాంతానికి చెందిన రైతులందరికీ తెలియజేయునది ఏమనగా…. గ్రామ సకారా నుండి 2½ బిస్వా భూమి, దీనికి 30 రూపాయల ఆదాయం ఉండేది, గత పాలకుల ఆదేశాల ప్రకారం సుదామన్ కు, అతని కుమారుడు ఉమానందకు ఆలయ పూజారిగా సేవలందించినందుకు ఇది కేటాయించబడింది. అప్పటి హక్కుదారులు ఇప్పటికీ ఉన్నారని నిర్ధారించబడింది. కాబట్టి, ఈ భూమిని, ఆదాయాన్ని మేము వారికే తిరిగి మంజూరు చేస్తున్నాము.

అధికారులు దీన్ని శాశ్వతంగా వారి అధీనంలోనే ఉంచాలి, భోగార్ధం ఉపయోగించుకునేందుకు వీలు కల్పించాలి. అలాగే, మేం పాలించే సామ్రాజ్యం శాశ్వతంగా నిలిచేందుకు వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ భూమిపై ఎటువంటి పన్నులు, రుసుములు విధించరాదు. ఏటా కొత్త సనద్ ఇవ్వాలని కోరరాదు. ఈ ఆదేశం మా పాలన తొమ్మిదవ సంవత్సరంలోని 2వ సఫర్ (ఆగస్టు 20, 1666 CE) తేదీన జారీ చేయబడింది."
*****

ఔరంగజేబ్ హిందువుల మత విశ్వాసాల పట్ల సహనభావం కలిగి ఉన్నాడని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయ పూజారుల వాదనలు మరింత బలపరుస్తాయి.

శివునికి అంకితమైన ప్రధాన దేవాలయాల్లో మహాకాళేశ్వర ఆలయం ఒకటి. ఇక్కడ అఖండ దీపం నిరంతరం వెలుగుతూ ఉండటానికి నాలుగు శేర్ల నెయ్యి ఈ దీపానికి సమకూర్చబడేది. ముఘల్ పాలనలో కూడా ఇది కొనసాగించబడినట్లు పూజారులు చెబుతున్నారు. ఔరంగజేబ్ కూడా ఈ సంప్రదాయాన్ని గౌరవించాడని వారు పేర్కొంటున్నారు. అయితే, దీనిని నిర్ధారించడానికి వారి వద్ద ముఘల్ చక్రవర్తుల అధికారిక ఉత్తర్వులు లేవు. కానీ, 26 సెప్టెంబర్ 1651 CE న ఔరంగజేబ్ తండ్రి పాలనలోని మురాద్ బక్ష్ ఈ ఉత్తర్వు ఇచ్చినట్లు వారు తెలియజేశారు.

హకీమ్ ముహమ్మద్ మెహ్దీ అనే అధికారిక చరిత్రకారుడు పాత పత్రాలను పరిశీలించి, ఈ పూజారి వేసిన పిటిషన్ నిజమేనని ధృవీకరించాడు. దాని ప్రకారం, స్థానిక తహసీల్దార్ ఈ అఖండ దీపానికి నాలుగు శేర్ల అక్బరీ నెయ్యి అందజేయాలని ఉత్తర్వు ఉంది.

ఈ ఉత్తర్వు ముహమ్మద్ సాదుల్లా చేత 1740.లో మళ్లీ నకలు చేయబడింది. అంటే, అసలు ఉత్తర్వు జారీ చేయబడిన 92 సంవత్సరాల తర్వాత దీనికి నకలు తీసారు.
*****

ఈ వాస్తవాలు పరిశీలిస్తే, ఔరంగజేబ్ పూర్తిగా హిందూ వ్యతిరేకుడని చెప్పడం తగదు. అతను అనేక ఆలయాలకు రక్షణ కల్పించాడు, హిందూ పూజారులను గౌరవించాడు, మరియు వారి జీవనోపాధిని కొనసాగించేందుకు భూములు కేటాయించాడు. మఘల్ చరిత్రను పూర్తిగా ఒకే కోణంలో చూడకుండా, మరింత సమగ్ర దృష్టితో పరిశీలించాలి.

ఆ ఆలయంలో భద్రపరిచిన మరికొన్ని రాజసంబంధ పత్రాలు అప్పటి మహంత్ లక్ష్మీ నారాయణ ద్వారా నాకు తెలిసాయి. అతని వద్ద కూడా ఔరంగజేబు కాలానికి చెందిన కొన్ని పత్రాలు ఉన్నాయి.
ఇతిహాసకారులు సాధారణంగా అహ్మదాబాద్ నగరసేఠ్ నిర్మించిన చింతామణి దేవాలయం విధ్వంసం గురించి మాత్రమే మాట్లాడుతారు. కానీ అదే ఔరంగజేబు శత్రుంజయ మరియు అబూ దేవాలయాలు నిర్మించటానికి అదే నగరసేఠ్‌కు భూములను ఇచ్చిన విషయాన్ని మౌనంగా వదిలేస్తారు.

శత్రుంజయ దేవాలయానికి భూమిని మంజూరు చేసిన సనద్ (రాజాజ్ఞ):

సతీదాస్ అనే నగల వ్యాపారికి పాలితానా జిల్లాలోని (సోరఠ్ సర్కార్ పరిపాలనా కింద ఉన్న) శత్రుంజయ అనే ప్రాంతంలో కొంత భూమి అతనికి శాశ్వతంగా ఇవ్వబడింది.

ఈ భూమి తదుపరి తరాలకు కూడా కొనసాగాలని, భవిష్యత్ పరిపాలకులు ఈ ఫర్మాన్‌ను ఖచ్చితంగా పాటించాలని, ప్రతీ సంవత్సరం కొత్త సనద్ కోరాల్సిన అవసరం లేకుండా ఈ భూమిని శాశ్వతంగా ఆ స్వాములకు అప్పగించామని పేర్కొన్నారు.

ఔరంగజేబు సేవలకు ప్రతిఫలంగా నగరసేఠ్‌కు మరో భూదానం:
సంతిదాస్ జవహరి, శ్రావక వర్గానికి ( వ్యాపార?) చెందిన వ్యక్తి, తన విశేష సేవల కారణంగా పాలితానా గ్రామాన్ని, శత్రుంజయ కొండను, అక్కడి దేవాలయాన్ని, ఇంకా అక్కడ లభించే కలపను స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కును పొందాడు.
అదేవిధంగా, జునాగఢ్‌లోని గిర్నార్ కొండను, సిరోహి పరిపాలనలోని అబూ కొండను కూడా శ్రావక సముదాయానికి బహుమతిగా ఇచ్చారు. ఈ భూముల పరిపాలనలో ఎవరూ అంతరాయం కలిగించరాదని, ఎవరైనా ఆ భూములపై హక్కు వాదిస్తే, దేవుని శాపానికి గురికావలసి వస్తుందని రాజు ప్రకటించాడు.
*****

ఔరంగజేబు విశ్వనాథ దేవాలయం విధ్వంసం & గోల్కొండ మసీదు కూల్చివేత:

వారణాసి వద్ద ఔరంగజేబు బసచేసినపుడు చేస్తున్నప్పుడు, హిందూ రాజులు విశ్వనాథ దేవాలయంలో పూజలు నిర్వహించాలని కోరారు. కానీ, అక్కడ ఒక మహారాణి అదృశ్యమవడంతో గందరగోళం ఏర్పడింది. తన అధికారుల ద్వారా ఔరంగజేబు విచారణ జరిపిస్తే, గణేశుడి విగ్రహం వెనుక ఉన్న ఒక రహస్య సొరంగంలో అపహరణకు గురైన రాణిని దాచిఉంచారని తెలిసింది. రాణిపై అంతటి కుట్రకు పాల్పడినందుకు శిక్షగా ఆలయాన్ని పూర్తిగా తొలగించాలని ఔరంగజేబు ఆదేశించాడు.

గోల్కొండ మసీదు విధ్వంసం:
గోల్కొండ పాలకుడు తన కప్పాన్ని చక్రవర్తికి సమర్పించలేదు. దీంతో, ఔరంగజేబు గోల్కొండపై దండయాత్ర చేసి, ఖజానాను స్వాధీనం చేసుకున్నాడు. ఈ సందర్భంగా, అక్కడి మసీదును కూడా ధ్వంసం చేయించాడు.

ఈ సంఘటనలు, ఔరంగజేబు ఆలయాలైనా, మసీదులైనా చట్టం ముందు సమానంగా చూడాలని నడిచినతీరు తెలిపే ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

*****
బిషంబర్ నాథ్ పాండే (23 డిసెంబర్ 1906 – 1 జూన్ 1998) ఒక స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక సేవకుడు, మరియు భారత పార్లమెంటులో సభ్యుడు. పాండే తన జీవితాన్ని జాతీయ సమగ్రత (నేషనల్ ఇన్¬teగ్రేషన్) కోసం అంకితం చేశారు మరియు గాంధేయ మార్గాన్ని విస్తరించేందుకు కృషి చేశారు. బి.ఎన్ పాండే కు చరిత్రపట్ల విశేషమైన ఆసక్తి. భారతదేశంలో మతసామరస్యం గురించి చారిత్రిక ఆధారాలతొ ప్రచారం చేసారు.
.
బొల్లోజు బాబా




Sunday, February 23, 2025

శంభాజి గురించి అతని సమకాలీన రచయిత ఏమన్నాడు?

ఛత్రపతి శివాజి కుమారుడు శంభాజి. (1657-1689). ఇతను శివాజి వారసునిగా మరాఠాసామ్రాజ్యాన్ని 1680 – 1689 ల మధ్య పరిపాలించాడు. వెనిస్ దేశానికి చెందిన నికలావొ మనుచ్చి అనే యాత్రికుడు, చరిత్రకారుడు రచించిన స్టోరియో దొ మొగోర్ ( Storia Do Mogor 1653—1708 By Niccolao Manucci) అనే గ్రంథంలో శంభాజి గురించిన వివరాలు లభిస్తాయి. నికొలవొ మనుచ్చి శంభాజీని నేరుగా కలిసి అతనితో సంభాషించిన వ్యక్తి. సమకాలీనులు చేసిన వ్యాఖ్యలు చారిత్రికంగా ఎంతో విలువైనవి. ఆ మేరకు వీటిని తటస్థ కథనాలుగా గుర్తించవచ్చు.

వివిధ కాలాలలో నికొలవొ మనుచ్చి శంభాజి గురించి చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.

1. శివాజి ఎన్నో విజయాలు సాధిస్తున్నప్పటికీ అతని కుమారుడు శంభాజీ పట్ల నిరంతరం చింతించేవాడు. శంభాజీ అదుపులేని దురలవాట్లు కలిగి ఉండేవాడు. ఇతరుల భార్యలను స్వాధీనపరచుకొనేవాడు. ఇతని దుశ్చర్యలగురించి అనేకమంది అధికారులు, కులీనులు శివాజికీ పిర్యాదులు చేసేవారు. ఇతనివల్ల కలిగే అసంతృప్తి వల్ల తిరుగుబాటు సంభవించవచ్చుననే ఊహతో శంభాజీని బంధించి ఏదో ఒక కోటలో ఖైదీగా పంపాలని శివాజి నిర్ణయించుకొన్నాడు.
చిన్నకుమారుడైన రామ్ రాజాను రాజ్యానికి వారసునిగా ప్రకటించాలని భావించాడు. ఈ విషయం గ్రహించిన శంభాజి ఔరంగజేబు సైన్యాధ్యక్షుడైన దిలార్ ఖాన్ తో చేతులుకలిపి అతని ఆశ్రయం పొందాడు. మనుచ్చి, పేనం 204, వాల్యూం 2

2. తన తండ్రి శివాజి మరణించాడని విన్న వెంటనే శంభాజి బీజాపూర్ నుండి బయలు దేరి తండ్రి రాజ్యంలో ప్రవేశించాడు. రాజ్యానికి తన తండ్రితన వారసునిగా ప్రకటించిన తమ్ముడు రామ్ రాజాను ఖైదుచేయించాడు. తాను అధికారం కైవశం చేసుకోవటం ఇష్టం లేని అధికారులను హతమార్చాడు. ఒకసారి శంభోజి తన కత్తి నాకు (నికొలవొ మనుచ్చికి) చూపుతు ఆ సందర్భంలో ఈ కత్తితో ముప్పై మంది తలలను నరికాను. ఇంకా అనేకమంది కళ్ళు పీకించానని చెప్పాడు. ( మనుచ్చి పేనం. 233)

(రాజ్యాన్ని హస్తగతం చేసుకోగానే శంభాజి- శివాజి వద్ద మంత్రిగా పనిచేసిన అన్నాజి దత్తు ఆస్థిని జప్తు చేయించి అతన్ని ఏనుగులతో తొక్కించి చంపించాడు; రామ్ రాజ తల్లి శివాజి రెండవభార్య అయిన సోయెరాబాయి కి మరణ దండన విధించాడు. తన తమ్ముడు రామ్ రాజాను రాజుని చేయటానికి ప్రయత్నించిన అనేక మంది అధికారులను, బంధువులను హతమార్చాడు -History Of The Mahrattas, by Grant Duff, 1878, పేనం 136-7)

4. శంభాజి విజయాలు అతని ప్రతాపం కాదు. అతని వద్ద పనిచేసే అధికారుల గొప్పదనం. (మనుచ్చి, పేనం. 258)

5. ఇతరుల భార్యల పట్ల శంభాజి అనుచితంగా ప్రవర్తించటం పై అతని అధికారులు అతనితో గొడవపడేవారు. (మనుచ్చి, పేనం. 257)

6. దురలవాట్లు స్వభావంగా మారతాయి. స్త్రీలపట్ల శంభాజికి ఉన్న వ్యామోహం ఇతనిని ఔరంగజేబుకు పట్టుబడేలా చేసింది. శంభాజీ సంగమేశ్వర్ వద్ద బసచేసినపుడు మంత్రి కాబ్ కలిష్ అక్కడకు కొద్దిదూరంలో ఒక గ్రామంలో గొప్ప అందమైన వివాహిత మహిళ ఉందని చెప్పాడు. శంభాజీ ఆ మహిళను ఎలాగైనా చేజిక్కించుకోవాలని నిర్ణయించుకొని అక్కడకు బయలుదేరాడు. ఈ విషయాన్ని కాబ్ కలిష్ ఔరంగజేబుకు ఉప్పందించటంతో అతను ఐదువేల మంది అశ్వదళాన్ని పంపి శంభాజీని పట్టి బంధించారు. ఒంటెకు కట్టి గుడారాల చుట్టూ తిప్పారు. కళ్ళు పీకి, గుండెను చీల్చి మృతదేహాన్ని చెత్తకుప్పపై కుక్కలకు ఆహారంగా వేసారు. ( మనుచ్చి pn. 310-312)

(నికొలవొ మనుచ్చి కథనంలో ఎక్కడా ఔరంగజేబు శంభాజీని మతం మారమని కోరినట్లు కానీ దాన్ని శంభాజి తిరస్కరించినట్లు కానీ లేదు. ఇలాంటి ఉద్వేగపూరిత మతాభిమాన కథనాలు ఆ తరువాత కాలంలో కల్పించినవి కావొచ్చు)

ముఘల్ సైనికులు చుట్టుముట్టినప్పుడు శంభాజి సైనికులు పారిపోయారు. ఆ కొద్దిసమయంలోనే శంభాజి గడ్డం గీసుకొని, సన్యాసి దుస్తులు ధరించి మారువేషం వేసుకొని నేలమాళిగలో దాక్కున్నాడు. సైనికులు ఆ ప్రదేశాన్ని కనిపెట్టి మెడలో ముత్యాలహారం, ఉంగరాల ఆధారంగా శంభాజీని గుర్తించి బంధించి చేతులు కట్టి జుట్టుపట్టుకొని ముఘల్ సైన్యాద్యక్షుడైన ముకర్రబ్ ఖాన్ వద్దకు తీసుకువెళ్ళారు- (House of Shivaji, Sir. Jadunath Sarkar pn231)
****

ఇది స్థూలంగా ఛత్రపతి శివాజి కుమారుడైన శంభోజిని అతని సమకాలీనుడైన నికొలవొ మనుచ్చి చూసిన విధానం.

దీని ద్వారా శంభోజి ఒక మామూలు మానవ లౌల్యాలు, ప్రాణభయం కలిగిన వ్యక్తిగా అర్ధమౌతుంది. యుద్ధాలు, ఒకరిని ఒకరు దోచుకోవటాలు, చిత్రహింసలు పెట్టటాలు, చంపుకోవటాలు మిడివియల్ కాలంలో సహజాతి సహజం. ఒకడు శాంతి కాముకుడు మరొకడు హింసావాది అని చెప్పటానికి లేదు. ఎవరూ శుద్ధపూసలు కారు. ఎవరి అవసరాలు, ఎవరి బతుకు పోరాటం వారిది. చంపటమో చావటమో ఒకటే జీవనశైలి. అన్ని మతాలదీ ఇదే దారి. ఆనాటి కాలమానపరిస్థితులను గుర్తించకుండా వీడు మంచి వీడు చెడ్డ అని తీర్పులివ్వటం ప్రజలను విభజించటం, వారి మధ్య ద్వేషం పెంచటం కొరకే.

భారతదేశ చరిత్రలో ఆ కాలానికి దేశభక్తి, స్వాతంత్ర్యం లాంటి భావనలు లేవు. ఉన్నదల్లా రాజ్యకాంక్ష. దక్కించుకొన్న దాన్ని నిలబెట్టుకోవాలనే కిల్లర్ ఇన్ స్టింక్ట్. ఇంకా కొండొకచో కార్నల్ డిజైర్స్.

అలాంటి అమానవీయ రాజకీయాలకు అవతల రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు, ఎప్పుడు ఏ ఉపద్రవం రానుందో అంటూ బిక్కుబిక్కుమంటూ అభద్రతతో బతికే వ్యాపారులు, కులీనులు ఉన్నారు. ఇవీ మధ్యయుగాల జీవితాలు.
***

సినిమా అనేది కళాత్మక వ్యక్తీకరణ. చారిత్రిక అంశాలతో సినిమాలు తీసినపుడు బాధ్యతగా ఉండటం ఎంతో అవసరం. ఒక మతానికి చెందిన వారిని వీరులుగాను, మరొక మతానికి చెందిన వారిని క్రూరులుగాను చిత్రించటం వల్ల ఆయా సామాజిక సమూహాలమధ్య వైషమ్యాలకు కారణమౌతారు. చరిత్రను శోధించి నిజాలు తెలుసుకొనే ఓపిక ఎవరికీ ఉండదు. సినిమాలో చెప్పిందే నిజమైన చరిత్ర అని భావించి సినిమాహాళ్ళలోనే ప్రతిజ్ఞలు చేస్తూ ఉద్వేగాలకు గురయి, భోరుభోరున ఏడుస్తున్న తరం ఒకటి మనముందు ఉంది. అంతటి గొప్ప మాధ్యమం సినిమా.

ఇలాంటి నేపథ్యంలో అభూతవిశ్వాసాలను, అబద్దపు ఉద్వేగాలను ప్రజలలో రగిలించటం నైతికపతనం. పసిమనసుల్ని కలుషితం చేయటం.

చరిత్ర అనేది ప్రజల సామూహిక మెమొరీ. దానిలోంచి కొందరిని సమూలంగా తుడిచివేయాలనో లేదా వారిని దుర్మార్గులుగా చిత్రించాలనో చేసే ప్రయత్నాలు కళాత్మక స్వేచ్ఛ అవదు. సామాజిక ద్రోహం అవుతుంది.
బొల్లోజు బాబా
సంప్రదించిన పుస్తకాలు
1. STORIA DO MOGOR 1653—1708 BY NICCOLAO MANUCCI
2. History Of The Mahrattas, by Grant Duff, 1878
3. House of Shivaji, Sir. Jadunath Sarkar pn231
4. History of the Mahrattas by Edward Scott Waring
5. Historical Fragments Of The Mogul Empire, by Robert Orme



శంకరాచార్యుని పోస్టుపై ఒక మిత్రునితో మంచి చర్చ జరిగింది

శంకరాచార్యుని పోస్టుపై ఒక మిత్రునితో మంచి చర్చ జరిగింది. ఆ పోస్టుకు కొనసాగింపుగా ఆ కామెంట్లను ఒక పోస్టుగా పెడుతున్నాను.
.
మీరు పారమార్ధిక ప్లేన్ లోంచి మాట్లాడుతున్నారు. భౌతికంగా అలా లేదు. శంకరుడే స్వయంగా చెప్పాడు శూద్రుడు విద్యకు అనర్హుడు అని. ఎవరు ఎక్కడుండాలో వాళ్ళు అక్కడుండాలని. బౌద్ధ జైనాల్ని నిర్మూలించటంలో పాపం లేదని.
వీటిని మినహాయించి చేసే ఏ వాదనైనా, చెప్పే ఏ అన్వయమైనా నేటికీ సాగిస్తున్న మోసం అని భావిస్తాను.
.
బౌద్ధజైన సిద్ధాంతాలు కనుమరుగు అయ్యాయని చెప్పలేదు. అవి హిందూమతంలోకి అస్సిమిలేట్ అయ్యాయని పంచాయత ఆరాధన పారాగ్రాఫులో చెప్పాను.
అద్వైతాన్ని సిద్ధాంతపరంగా బౌతికవాదులు ఎదుర్కోలేరు. చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణాన్ని , బౌద్ధులు ప్రత్యక్ష మరియు అనుమాన ప్రమాణాలను మాత్రమే అంగీకరించిన భౌతికవాదులు.
వీటితో పాటు ఉపమాన, శబ్ద, అర్ధాపత్తి, అనుపలబ్ది లాంటి ప్రమాణాలను కూడా అంగీకరిస్తారు అద్వైతులు.
వీరిద్దరి మధ్యా శాస్త్ర చర్చలో అద్వైతులే విజయం సాధిస్తారు. ఎందుకంటే శబ్ద, ఉపమాన అర్ధాపత్తి లాంటి వాటికి ఆధారాలు చూపక్కరలేదు. అభౌతికమైన అంశాలను కూడా వాటిసాయంతో సత్యాలుగా చలామణీ చేయించవచ్చు.
కనుక వారిరువురి పోటీలో అద్వైతులు నెగ్గటం మోసపూరితమైనది.
శంకరుడు చేసిన పని అది. ఈ పని ద్వారా బ్రాహ్మణాధిక్యత వచ్చి, బ్రాహ్మణుడినే ఈ ఆథ్యాత్మిక క్రతువులలో అధిపతిగా నిలిపినపుడు- శతాబ్దాలుగా పండితులు ఈ మోసాన్ని అనేక తలతిక్క అన్వయాలతో సమర్ధిస్తూనే ఉన్నారు.
వ్యాసంలో ఎక్కడో చెప్పినట్టు ఈ పురాణపురుషులు చెప్పినది ఏమిటి అని కాక, దానివల్ల సమాజం ఏ ఏ మలుపులు తీసుకొంది అనేది ముఖ్యం. నాకు కనిపించేది ఏమిటో స్పష్టంగా చెప్పాను. ఈ శంకరాచార్యుని నిర్వాకం వల్ల అశాస్త్రీయత, మూఢత్వం, బ్రాహ్మణాధిక్యత, వర్ణవ్యవస్థ లాంటి అవలక్షణాల వైపు సమాజం ప్రయాణించింది. అది పండితులకు మేలు చేసింది కనుక శంకరుడిని భక్తితో నేటికీ పూజిస్తారు.
నేను అలా చూస్తున్నాను. అలా గతం నాకు కనపడుతుంది. మీకు మరోలా కనిపించవచ్చుననే అవకాశాన్ని కాదనను.
.
తత్వం నాశనం అయిందని ఎవరన్నారు. ఎందుకు పదే పదే అంటారు ఆ మాట. నేను స్పష్టంగా చెప్పాను. తత్వాలు అస్సిమిలేట్ అయ్యాయని. ఏటా శంకరజయంతులు ఎవరు చేస్తున్నారు?
వైవిధ్యం శంకరుడితో వచ్చిందా? హాస్యాస్పదం. శంకరుని కాలానికే భిన్న పాయలు ఉన్నాయి.
మీరు భౌతిక స్థాయిలో మాట్లాడండి. శంకరనిర్వాకం వల్ల సమాజంలో ఏం జరిగి ఉంటుందో చెప్పాను. అలా జరగలేదని ఉపపత్తులు ఇవ్వండి. ఏ వేవో మాట్లాడితే ఎలా?
ఇస్లాంని కానీ క్రిస్టియానిటీని గానీ గౌరవించటం, సూఫీ దర్గా కల్చర్ ని ఆదరించటం అనేది బౌద్ధజైన కాపాలికాదుల్ని నిర్మూలించిన శంకరాచార్యుని వల్ల వచ్చింది అంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది.
నిజానికి ఈ సమాదరణ అనేది భారతదేశ ఆత్మ. అశోకుని 12 వ శాసనంలో ఇలా ఉంది.
///ఒక పాషండ శాఖ/మతం కి చెందిన వ్యక్తులు అసందర్భంగాతమ శాఖను పొగుడుకోవడం, ఇతర శాఖ/మతాలను నిందించడం చేయరాదు. పరశాఖల/మతం వారిని కూడా గౌరవించవలెను. ఇట్లు చేయుట వలన తన మతాన్ని అభివృద్ధి చేసుకోవటంమే కాక ఇతర శాఖలవారికి ఉపకారం కలిగించిన వారు అయెదరు. తన వారిని స్తుతిస్తూ ఇతరశాఖల వారిని నిందించేవాడు తన శాఖకే ఎక్కువ అపకారం చేసిన వాడవుతాడు// సమస్త జనులకు ధర్మాభివృద్ధే ముఖ్యము తప్ప దానం కాని, పూజ కాని అంత ముఖ్యాలు కావు అని దేవానాం ప్రియుడు తలుస్తున్నాడు. (XII శిలాశాసనము)///
క్రీపూ 3 వ శతాబ్దానికి శంకరాచార్యుడు ఎక్కడున్నాడు. సమత, సహిష్ణుతలను ఈ నేలకు నేర్పిందే బౌద్ధ, జైనాలు. వాటిని నిర్మూలించి ఈ రోజు మనందరినీ అన్యమతాలను పీక్కుతినే జాంబీలుగా చేసింది ఎవరు? యూట్యూబ్ తెరవండి ఒకసారి అర్ధమౌతుంది.

బొల్లోజు బాబా

Saturday, February 8, 2025

ఆది శంకరాచార్యుడు - ఆథ్యాత్మిక దండయాత్ర


వైదికమతంలోని వర్ణవ్యవస్థ, యజ్ఞయాగాదులు, బ్రాహ్మణాధిక్యతను నిరసిస్తూ బౌద్ధ, జైన మతాలు ఆవిర్భవించాయి. వైదికమతాన్ని (బ్రాహ్మణమతం) ధిక్కరించి బౌద్ధం ఒక ప్రత్యామ్నాయ ఆథ్యాత్మికమార్గాన్ని ఏర్పరచింది. బ్రాహ్మణులను అత్యున్నతవర్గంగా పరిగణించే కులవ్యవస్థను బుద్ధుడు ఖండించాడు. మనుషులందరూ సమానమేనని, జన్మత హెచ్చుతగ్గులు ఉండవని ప్రకటించాడు. ఆత్మ, దేవుడు ఉనికిని అంగీకరించలేదు. మౌర్యులు, కుషానులు, కొంతమేరకు గుప్తులు బౌద్ధమతాన్ని ఆదరించటంతో బౌద్ధం సుమారు వెయ్యేళ్లకుపైన (BCE 6 నుండి CE 8 వ శతాబ్దం) భారతదేశంలో అప్రతిహతంగా మనుగడ సాగించింది. క్రతువులు జంతుబలులు కాక ధ్యానం అంతఃచేతన ద్వారా ప్రజలు నైతిక వర్తనను, మెరుగైన జీవితాన్ని పొందాలని బౌద్ధం ప్రవచించింది. ధర్మకీర్తి, శాంతిరక్షిత, నాగార్జునుడు వంటి వారు బౌద్ధబోధనలను సర్వోత్కృష్ట స్థాయికి తిర్చిదిద్దారు.

బౌద్ధమతం వర్ణాలకు అతీతంగా ప్రజలందరినీ సమానంగా చూడటంతో సామాన్యప్రజలు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. జనాభాలో అధికశాతం బౌద్ధం ఆచరించారు. ఇది ఒకరకంగా వైదిక/బ్రాహ్మణ మతానికి సైద్ధాంతిక సవాలు. జీవన్మరణ సమస్య.

బ్రాహ్మణమతానికి బౌద్ధం విసిరిన ఈ సవాలును మొదటగా స్వీకరించింది ఆదిశంకరాచార్యుడు. చరిత్రకారులు ఇతను c. 788-820 CE మధ్య జీవించిన వ్యక్తి అని నిర్ణయించారు. కోటవెంకటాచలం లాంటి వారు శంకరాచార్యుని కాలం BCE 509-477 గా చెబుతారు. నిజానికి శంకరాచార్యుని ప్రచ్ఛన్న బౌద్ధుడని (crypto buddha) అందరూ అన్నారు కనుక బుద్ధుని తరువాత పెట్టవలసి వచ్చింది కానీ లేకపోతే తీసుకువెళ్ళి బుద్ధుడికన్నా పూర్వుడని చెప్పేవారే ఈ పండితులు.
 
1. జీవిత చరిత్ర

శంకరుని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చారిత్రిక ఆధారాలు పెద్దగా లభించలేదు. అతని పుట్టుక, వ్యక్తిత్వం, అతను చేసిన ఆథ్యాత్మిక దండయాత్ర, మఠాల స్థాపన, అతని మరణం లాంటి విషయాలు – 14 వ శతాబ్దం నుంచి లభించే “శంకరవిజయాలు” పేరిట విద్యారణ్యుడు, ఆనందగిరి, చిద్విలాసుడు లాంటి కవులు రచించిన శంకరుని జీవితచరిత్రలు, ఇంకా శంకర విరచితమని చెప్పబడే వివిధ వ్యాఖ్యాన గ్రంథాల ద్వారా తెలుస్తాయి.

ఆది శంకరాచార్యుడు కేరళలోని కాలడి గ్రామంలో సంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు శివగురు, తల్లి పేరు ఆర్యాంబ. చిన్న వయస్సులోనే వేదాలు, ఉపనిషత్తులు మరియు తర్కశాస్త్రంలో ప్రావీణ్యం సాధించాడు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి, గురువు గోవింద భగవత్పాదుల చెంతకు వెళ్లి వేదాంత విద్యను అభ్యసించారు.

ఆది శంకరాచార్యుడు అద్వైత వేదాంతాన్ని ప్రబలంగా ప్రచారం చేశారు. బ్రహ్మమే పరమ సత్యం, జగత్ మిథ్య (మాయ), జీవాత్మ పరమాత్మలు ఒక్కటే అనే భావనల్ని అద్వైతతత్వంగా చెబుతారు.
శంకరాచార్యుడు భారతదేశమంతా తిరిగి తన బోధనలను వ్యాప్తి చేశాడు. నాలుగు మఠాలను స్థాపించారు: అవి కర్ణాటకలో శృంగేరి మఠం, గుజరాత్ లో ద్వారకా మఠం, ఉత్తరాఖండ్ లో జ్యోతిర్ మఠం (జోషిమఠం), ఒడిశాలో పూరీ మఠం. శంకరాచార్యుడు ఈ మఠాలను ధార్మిక నాయకత్వం, సనాతన హిందూ ధర్మపరిరక్షణ కొరకు స్థాపించారు. వీటికి అధిపతులుగా వేదాధ్యయనం చేసిన పండితులే ఉంటారు.
 
శంకరాచార్యుడు ఉపనిషత్తుల, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు; భజ గోవిందం, సౌందర్యలహరి, నిర్వాణ షట్కమ్ వంటి రచనలు చేసాడు.  శంకరాచార్యుడు తన 32వ ఏట   హిమాలయాలో కేదారనాథ్ వద్ద వెళ్లి జీవ సమాధిని పొందాడు.
ఇదీ స్థూలంగా శంకరాచార్యుని జీవిత చరిత్ర.

2. బౌద్ధంపై ఆథ్యాత్మిక దండయాత్ర

శంకరాచార్యుడు బౌద్ధ మరియు జైన ప్రభావాలకు వెనుకబడ్డ హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించాడు.
 
శంకరాచార్యుని కాలానికి బౌద్ధం భారతదేశంలో బలంగానే ఉంది. ఏడో శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన యవాన్ చ్వాంగ్ దేశంలో దేవాలయాలతో పాటు బౌద్ధారామాలు, బౌద్ధబిక్కులు పెద్దసంఖ్యలో ఉన్నట్లు నమోదు చేసాడు. 
****

బౌద్ధులు చార్వాకులు ఈ సమాజంలో హేతుబద్దమైన ఆలోచనలను ప్రోత్సహించారు. వారు ఈ ప్రపంచానికి ఆధారమేమిటని సత్యాన్వేషణ చేసారు. ఈ ప్రపంచం ఇంద్రియాల ద్వారా తెలుసుకోగలిగే సత్యంగా భావించారు.
 
శంకరాచార్యుడు జగత్తు మిథ్య అని ప్రకటించటం వల్ల ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకొనే ప్రయత్నానికి విలువలేకుండా అయిపోయింది. సత్యాన్వేషణను మొగ్గలోనే తుంచేసాడు. వైద్యం, రసాయిన శాస్త్రం ఖగోళ శాస్త్రం వంటి వివిధ శాస్త్రాల అథ్యయనం శంకరాచార్యుని తరువాత కుంటుపడింది. భారతీయ ప్రాచీన ఆవిష్కరణలు చాలామట్టుకు శంకరాచార్యునికి ముందు బౌద్ధ జైన లేదా వైదిక ఋషులు సాధించినవే. శంకరాచార్యుడు ప్రతిపాదించిన అద్వైతసిద్ధాంతం సమాజాన్ని మిథ్యావాదం, అలౌకిక అంశాలవైపు నడిపించి శాస్త్రీయ ఆవిష్కరణలను తిరోగమింపచేసింది.
 
దుఃఖం వాస్తవమైనది కాబట్టి దానినుండి విముక్తి పొందటమే జీవితలక్ష్యంగా బౌద్ధులు చెప్పారు. దుఃఖాన్ని ఒప్పుకొని దానిని అధిగమించే మార్గాలను సూచించారు. శంకరాచార్యుడు జగత్ మిథ్య అనటం వల్ల దుఃఖం కూడా ఒక అబద్దం అయిపోయింది. ఇది మానవ దుఃఖాన్ని ఒక మాయగా తోసిపుచ్చుతుంది. దీనివల్ల అమానుషమైన వర్ణ వ్యవస్థ లోని నిచ్చెనమెట్లలో కిందనున్న సాటిమానవుడు అత్యంత హేయమైన దుర్భర జీవనాన్ని గడపటం పట్ల ఇతరులకు ఏ రకమైన సహానుభూతి లేకుండా పోవటమే కాక ఈ భావన వర్ణ వ్యవస్థను సమర్ధించటానికి దోహదపడుతుంది. సమాజంలో ఉన్న అసమానతలు, దారిద్ర్యం, వివక్షను పట్టించుకోదు. ఈ జగమేమాయ అయినప్పుడు ఈ వివక్షపట్ల బాధితులు పోరాటం చేయాలన్న స్పృహను కూడా కోల్పోయేలా చేస్తుంది.
****

బౌద్ధసూత్రాలను కొన్నింటిని శంకరాచార్యుడు కాపీ కొట్టటంచేత శంకరాచార్యుడిని ప్రచ్ఛన్న బౌద్ధుడని చెబుతారు. అలా బుద్ధునితో పోలిక తీసుకురావటం ఒక కుట్ర. శంకరాచార్యునికి బుద్ధునికి ఆచరణలో నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. బుద్ధుడు వైదిక క్రతువులను వర్ణ వ్యవస్థను ఖండించగా, శంకరాచార్యుడు వాటికి మసిపూసి మారేడు కాయ చేసి వేదాలను ఉల్లంఘించరాదని, వర్ణ వ్యవస్థ సదా ఆచరణీయం అని చెప్పాడు. బౌద్ధారామాలలో శూద్ర, అతిశూద్ర స్త్రీలకు ప్రవేశం ఉండగా శంకరమఠాల్లో బ్రాహ్మణ పురుషులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. నిజానికి బౌద్ధాన్ని నిర్మూలించటంలో శంకరాచార్యుని పాత్ర గణనీయమైనది. అలాంటి శంకరాచార్యుడిని ప్రచ్ఛన్న బౌద్ధుడని అనటం- వ్యాసుడు శూద్రుడు, వాల్మీకి బోయ అనటం లాంటి వక్రీకరణ. వారు చెప్పే మాటలకు లెజిటమసీ కల్పించటం కొరకు పండితులు చెప్పే అసత్యాలు అవి.
****

14 వ శతాబ్దంలో మాధవాచార్యులు (విద్యారణ్యస్వామి) రచించిన శంకర దిగ్విజయ లోని 1.27-56 శ్లోకాల సారాంశం ఇలా ఉంది.
 
“లోకంలో బౌద్ధులు, జైనులు శైవ కాపాలికులు ఎక్కువకావటం చేత వైదిక ధర్మం నిర్లక్ష్యం చేయబడుతున్నదని దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకొన్నారట. దానికి శివుడు “నేను ఆది శంకరాచార్యునిగాను, తనకుమారుడైన కార్తికేయుడు కుమారిల భట్టుగాను అవతరించి తర్కశక్తితో ఆ మతాలను ఖంఢిస్తామని అదే విధంగా ఇంద్రుడు సుధన్వ రాజుగా జన్మించి వైదికధర్మ పునరుద్ధరణకు తోడ్పడతాడని” చెప్పాడు. ఈ ఉదంతం ద్వారా శంకరాచార్యుడు సాక్షాత్తూ శివావతారం అని, బౌద్ధ, జైన కాపాలికా ధర్మాలను నిర్మూలించటం కొరకే అతను జన్మించాడని అర్ధమౌతుంది
 
ఉజ్జయినిని పాలించిన సుధన్వ రాజు శంకరాచార్యుడు, కుమారిల భట్టుల ప్రోత్సాహంతో హిమాలయాలనుండి రామేశ్వరం వరకూ గల అనేక వేల బౌద్ధారామాలను, బౌద్ధులను నిర్మూలించాడని శంకర దిగ్విజయంలో మాధవాచార్యుడు చెప్పాడు. ఏడవ శతాబ్దపు చైనాయాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ రాతలలో ఉజ్జయినిని ఒక బ్రాహ్మణ రాజు పాలిస్తున్నాడని ప్రస్తావించాడు. మృచ్చకటిక నాటకంలో ఉజ్జయిని రాజుయొక్క బావమరిది బౌద్ధులను పీడించసాగాడు అనే మాట ఉంటుంది. ఈ రెండు ఆధారాలు శంకరదిగ్విజయ గ్రంథంలో చెప్పిన బ్రాహ్మణ సుధన్వ రాజు చారిత్రికతను తెలియచేస్తాయి .
 
శంకరదిగ్విజయ ఏడో సర్గ లో- కుమారిల భట్టు శంకరునితో "ఈ భూమి బౌద్ధులతో నిండిపోయింది వేదాలను పట్టించుకొనేవారు లేరు. నేను బౌద్ధులను జయించి వేదాలకు పునర్వైభవం తీసుకొని వస్తాను" అనగా దానికి శంకరాచార్యుడు "భట్టా నీవు బౌద్ధులను నిర్మూలించటానికి అవతరించిన కారణ జన్ముడవు. నీకు ఏ పాపము అంటదు" అని అంటాడు. (7- 77-121 Sankara Digvijaya,Translated by Swamy Tapasyananda, Ramakrishna math publication)

“శంకరాచార్యుడు బౌద్ధసన్యాసులను వాదనలో ఓడించి వారిని సజీవంగా కాల్చి చంపాడు. దీన్ని మత పిచ్చి కాక మరెలా పిలవగలం” అంటాడు స్వామి వివేకానందుడు.
 
శంకరాచార్యుడు దేశం అంతా తిరిగి బౌతికవాదులైన బౌద్ధులతో శాస్త్ర చర్చలు జరిపి – జగం మిథ్య, అహం బ్రహ్మస్మి, జీవాత్మే పరమాత్మ అంటూ పొంతనలేని పారమార్ధిక వాదనలతో ఓడించి వారిని సామూహిక దహనాలలో హతమార్చాడు. ఇది దుర్మార్గమైన క్రూసేడ్లతో సమానం.
శంకరాచార్యుని బృందం ఒక క్రమపద్దతిలో బౌద్ధ, జైన, కాపాలిక లాంటి హైందవేతర మతాలపై దాడి జరిపింది. ఈ రోజు దేశం అంతటా ఎక్కడ తవ్వితే అక్కడ లభించే విరూపమైన బుద్ధుని విగ్రహాలు శంకరాచార్యుని కాలం నాటివే.
 
అప్పటికి ఉన్న బౌద్ధ ఆరామాన్ని శంకరాచార్యుడు తొలగించి శృంగేరి పీఠాన్ని ఏర్పరచాడంటారు. CE రెండు మూడు శతాబ్దాలలో నాగార్జునకొండ వద్ద విజయపురి అనే పట్టణం గొప్ప బౌద్ధఆరామంగా విలసిల్లినట్లు శాసనాధారాలు కలవు. శంకరాచార్యుడు తన అసంఖ్యాకమైన అనుచరులతో నాగార్జున కొండవచ్చి అక్కడి బౌద్ధఆరామాలను ధ్వంసం చేసాడని నాగార్జున కొండ వద్ద జరిపిన తవ్వకాల రిపోర్టులో A.H.Longhurst అన్నాడు . అదే విధంగా బౌద్ధక్షేత్రమైన శ్రీశైలం, బద్రినాథ్, పూరి, శబరిమలై, తిరుపతి లాంటి బౌద్ధ ఆరామాలను హిందూ ఆలయాలుగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
నేడు సంఘీయులు జరుపుతున్నట్లుగా ఒకప్పుడు శంకరాచార్యుడు హైందవేతర మతాలపై జరిపిన ఆథ్యాత్మిక దండయాత్ర ఇది.
 
3. కరడు కట్టిన మనువాది శంకరాచార్యుడు

శంకరాచార్యుడు దేశంనాలుగు వైపులా స్థాపించిన పీఠాలకు ఒక్కో ఆచార్యుని నియమించాడు. ఎవరి పీఠపరిథిలో వారు అక్కడి ప్రజలలో వర్ణాశ్రమ ధర్మాలను కాపాడాలని 26 శ్లోకాల “మహానుశాసనం” ను రచించాడు. దానిలోని కొన్ని శ్లోకాల అర్థాలు ఇవి…..

మేము సాధించిన వర్ణాశ్రమ ధర్మములను తమ పరిధులలోని ప్రజలలో రక్షితములు అగునట్లు చూడవలెను (శ్లోకం నంబరు 3) ఇక్కడ మేము సాధించిన అనే పదం ప్రధానము.
 
నా చే నిర్మించబడిన ఈ ఆర్యమర్యాద యధావిధిగా నాలుగు మఠములద్వారా రక్షింపబడునట్లు పీఠాధిపతులు తమ శక్తిని వినియోగించవలెను. (8 వ శ్లోకం)

ధర్మసంరక్షణార్ధము సుధన్వ మహారాజునకు గల అధికారమును ఇంద్రాజ్ఞవలె పాలింతురు గాక (14 వ శ్లోకము).
 
చాతుర్వర్ణములవారు యధాశక్తి ఈ గురుపీఠములను అర్చింతురుగాక (17 వ శ్లోకము)

ఈ నియమములన్నియు మనువు, గౌతముడు మొదలైన వారు చెప్పినవే (22 వ శ్లోకము)

కృతయుగమును బ్రహ్మదేవుడును, త్రేతాయుగమందు వశిష్ఠమహర్శియును, ద్వాపరయుగమున వ్యాసమహర్షియును జగద్గురువులై యుండిరి. ఈ కలియుగమున నేనే జగద్గురువునై అవతరించితిని. (శ్లోకం 25)
 
బౌద్ధం వల్ల ఒడిదుడుకులకు గురైన సనాతన హిందూవర్ణ వ్యవస్థను తానే తిరిగి స్థాపించానని; దానిని మీరు కాపాడుకోవాలని; చాతుర్వర్ణాలు ఈ గురుపీఠాలను యధాశక్తి సేవించుకోవాలని “మహానుశాసనం” ద్వారా చెప్పాడు. ఇది ఒకరకంగా ఆయామఠాలను నడిపించటానికి రాసుకొన్న "corporate governance manual" లాంటిది.
 
శంకరమఠాలు నేటికీ ఈ సూత్రాలపైనే నడుస్తున్నాయి. శంకరాచార్యుడు ఈ మఠాలను వర్ణాశ్రమధర్మాన్ని కాపాడటానికి, దానికి ప్రచారం కల్పించటానికి స్థాపించాడు. ఇతను దేశంలో వివిధ ప్రాంతాలు తిరుగి, మండనమిశ్ర, భాస్కర, కుమారిల భట్ట, భాస్కర వంటి పండితులతో శాస్త్ర చర్చలు జరిపి వారిని ఓడించి తన బోధనలకు విస్త్రుత ప్రచారం కల్పించినట్లు శంకరవిజయాలు చెబుతాయి.
****

బౌద్ధం ప్రభావంచే వేదాలు ఉపనిషత్తులు తీవ్రమైన విమర్శకు గురయ్యాయి. ఆ సమయంలో శంకరాచార్యుడు ఉపనిషత్తులకు వ్యాఖ్యానం చెప్పాడు. వేదాలను తిరిగి చర్చలోకి తీసుకొని వచ్చి వైదిక పునర్వికాసానికి దోహదపడ్డాడు. ఇతను ఈ పని చేయకపోయి ఉన్నట్లయితే బౌద్ధం ఘాతానికి వైదికమతం కాలగర్భంలో కలిసిపోయి ఉండేది.
*****

"శ్రవణాథ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ........." అనే బ్రహ్మసూత్రానికి శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో శూద్రునికి వేదాలు వినడం నిషిద్ధమని, ఒకవేళ వింటే అతని చెవుల్లో సీసం కరిగించి పోయాలని, వేదాలు పలికితే నాలుక కొసివేయాలని అంటూ అనేక ఉపపత్తులు ఇస్తాడు. శంకరాచార్యుడు చేసిన ఇలాంటి వ్యాఖ్యానాలను అంతవరకు బౌద్ధమతం మనుషులందరూ ఒకటే అంటూ వెయ్యేళ్ళుగా తన బోధనల ద్వారా సాధించిన సమతను కాలరాసి సమాజంలో వర్ణవ్యవస్థను పునర్ ప్రతిష్టించే ప్రయత్నంగా అర్ధం చేసుకోవాలి. శూద్రునికి చదువు నిషిద్ధం అంటూ శంకరాచార్యుని చేసిన ఈ దిశానిర్ధేశం అనంతరం రాసిన అనేక పురాణేతిహాస వ్యాఖ్యానాలలో ప్రతిబింబించింది.

బ్రహ్మసూత్రకు శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో 9 అపశూద్రాధికరణం 34-38 లలో శూద్రునికి ఉపనయన సంస్కారం లేదు కనుక వేదాధ్యయనం లేదు. వేదాధ్యయనం లేదు కనుక బ్రహ్మ విద్యాధికారం లేదు అని స్పష్టంగా శూద్రులు విద్యనేర్చుకోవటానికి అర్హులు కారని ప్రకటించాడు.
ప్రాచీనకాలంలో ఆర్య అనార్య జాతులందరికీ ఉపనయన సంస్కారం ఉండేది. క్రమేపీ ఇది శూద్రులకు నిరాకరింపబడింది. ఉపనయనం ఉండటం ఒక గౌరవ సూచనగాను, లేకపోవటం దాసత్వం గాను మారిపోయింది. ఇది సమాజాన్ని నిలువునా చీల్చింది. ఉపనయనం ఉన్న పైమూడు వర్ణాలు అధికులుగాను, ఉపనయనం లేని శూద్రులు వారి సేవకులుగాను మిగిలిపోయారు. ఆ విధంగా శూద్రులు దాదాపు పరాజితులైనారు. ఇక అతిశూద్రులైతే ఈ మొత్తం ప్రక్రియలో పూర్తిగా బహిష్కృతులు.
****
 
శంకరాచార్యుడు భగవద్గీతలోని 18.41 శ్లోకానికి ఇచ్చిన వ్యాఖ్యానంలో గత కర్మల ఫలితంగా బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య శూద్రుల జన్మలు నిర్ణయమౌతాయని కర్మ సిద్ధాంతాన్ని సమర్ధిస్తాడు. కర్మ భావన అనేది ఈ జన్మలో జరుగుతున్న విషయాలకు గతజన్మలో చేసిన కర్మలే కారణం అనే వాదన. ఇది జాతిలో స్వేచ్ఛా సంకల్పం, వ్యక్తిగత ప్రయత్నాల అవసరాన్ని తగ్గిస్తుంది. ప్రజల మధ్య విభజనలు, హెచ్చుతగ్గుల పట్ల వారు ఏ పోరాటమూ చేయక అన్యాయాన్ని నిష్క్రియంగా స్వీకరించేలా చేస్తుంది. నా బ్రతుకు ఇంతే అనే నిరాశావాద ధోరణి ప్రబలుతుంది. నిజానికి వర్ణవ్యవస్థ ద్వారా 80% ప్రజలను బానిసలుగా రెండువేల సంవత్సరాలుగా కిక్కురుమనకుండా తొక్కిపెట్టటానికి దోహదపడిన మంత్రాంగంలో కర్మ సిద్ధాంతం ఒకటి.
 
భగవద్గీతలో “చాతుర్వర్ణం మయా సృష్టం….4.13 అనే శ్లోకంలో కృష్ణుడు బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య శూద్రవర్ణాలను వారి వారి గుణములు, కర్మలను బట్టి నాచే సృష్టించబడ్డాయి అంటాడు. ఈ శ్లోకానికి శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో తమోగుణము కలిగిన శూద్రులు పై మూడు వర్ణాలైన బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య వర్ణాలకు అవసరమగు సేవలు చేస్తూ జీవించాలని అన్వయం చెప్పాడు. ఇది మనుధర్మాన్ని సమాజంలో స్థిరపరచటం.
****

3. హిందూమత ఆవిర్భావం

1500–500 BCE మధ్య కాలంలో ఇంద్రుడు, అగ్ని వరుణుడు, సోముడు వంటి దేవతలు, యజ్ఞయాగాదులు, వేదాలు, ఉపనిషత్తులు ప్రభావంతో నడిచిన మతాన్ని వైదికమతం గా చెబుతారు. 600 BCE లో ఈ వైదికమతంలో విచ్చలవిడిగా సాగిన యజ్ఞయాగాదులు, బలులకు నిరసనగా బౌద్ధ, జైన, చార్వాక, ఆజీవిక లాంటి అనేక మతాలు పురుడుపోసుకొన్నాయి. వీటిలో బౌద్ధం సామాజిక సమానత్వం కలిగిఉండటం, కర్మకాండల ఒత్తిడి, జాతి ఆధిపత్యం లేకపోవటం, సరళమైన నైతిక జీవనం లాంటి అంశాలతో ప్రజలను ఆకట్టుకొంది. ఎక్కువమంది సామాన్యులు బౌద్ధంలో చేరారు. బౌద్ధం తాకిడికి వైదికమతం తన ప్రాభవాన్ని కోల్పోయింది. 600 CE నాటికి వైదిక మతం శైవం, వైష్ణవం, శాక్తేయం (శక్తి ఆరాధన), సౌర్యం (సూర్యారాధన), గణాపత్యం (గణపతి ఆరాధన), స్కంద (కార్తికేయ ఆరాధన) ఇంకా కాపాలిక, పాశుపత అంటూ శాఖోపశాఖలుగా చీలిపోయింది. అనైక్యత ఆవరించింది. శంకరుని కాలానికి 72 రకాల మతాలు ఉండేవని అంటారు.
ఇలాంటి నేపథ్యంలో శంకరాచార్యుడు తెరపైకి వచ్చాడు. బౌద్ధాన్ని మాయావాదనలతో కర్కశంగా అణచివేసాడు. వేదాలకు ఉపనిషత్తులకు భాష్యాలు రచించి వాటికి పునర్వైభవం కల్పించాడు. చీలిపోయిన వైదిక మతశాఖలన్నింటిని ఒక్కటిగా చేసి “పంచాయతన ఆరాధన” విధానాన్ని ప్రవేశపెట్టి దానికి బ్రాహ్మణుడిని అధిపతిని చేసాడు.

శివుడు, సూర్యుడు గణేషుడు, పార్వతీ దేవి, విష్ణువులను ప్రధానదేవతలుగా ఆరాధించటాన్ని పంచాయత పూజావిధానం అంటారు. ఈ విధంగా చేయటం వల్ల వేదాలను అనుసరించే శాఖలన్నీ ఒక్కటి అయ్యి బలంపుంజుకొన్నాయి. బుద్ధుడిని విష్ణువుయొక్క అవతారంగా కట్టుకథలు కల్పించారు. ఈ విధానం ప్రాచీనభారతదేశపు మతపరమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని క్షీణింపచేసింది. ఆథ్యాత్మికామార్గాలలోని భిన్నత్వాన్ని చెరిపేసింది. ఆయా మతాల అవలంబులను బలవంతంగా హిందు ధర్మంలోకి కలిపేయటం లేదా నిర్మూలించటం జరిగింది. ఇదొకరకమైన ఆథ్యాత్మిక క్రూసేడ్.

వైదిక మతం బౌద్ధమతంలోని ధ్యానం, ఆరామసంస్కృతి, విగ్రహారాధనలను స్వీకరించింది. జైనంనుంచి అహింస, సన్యాసి జీవితం, కర్మ సిద్ధాంతం లాంటి అనుకూల అంశాలను గ్రహించింది. వేదాలకు, ధర్మశాస్త్రాలకు సాంస్కృతిక రూపంగా అష్టాదశ పురాణాలను, రామాయణ, మహాభారత పురాణాలను సృష్టించుకొంది. అలా వైదిక మతం క్రమేపీ నేడు మనం చెప్పుకొంటున్న హిందూమతంగా రూపాంతరం చెందింది.

ఈ ప్రక్రియలో శంకరాచార్యుడు పోషించిన పాత్ర రాజకీయమైనది. ఈ క్రమంలో హిందూమతం స్థిరీకరించబడిందని మాట్లాడతారు తప్ప ఏరకమైన అసమానతలు, వివక్ష లేకుండా సమాజాన్ని- సమానత్వం వైపు, శాస్త్రీయతవైపు నడిపించిన బౌద్ధమతం తొలగించబడిందని ఎవరూ మాట్లాడుకోరు. బౌద్ధమతం క్షీణించటానికి ఉన్న అనేక కారణాలలో శంకరాచార్యుడు జరిపిన దాడి కూడా ముఖ్యమైనదే.

4. ముగింపు

శంకరాచార్యుడు 8 వ శతాబ్దపు వ్యక్తి అని మనకు 14వ శతాబ్దంలో వివిధ వ్యక్తులు రాసిన అతని జీవిత చరిత్రల ద్వారా అర్ధమౌతుంది. మధ్యలో ఉండిన ఆరు శతాబ్దాల ఖాళీకి సంబంధించి ఏ రకమైన ఆధారాలు లభించవు. శంకరాచార్యుడు స్థాపించినట్లు చెబుతున్న మఠాలలో కూడా శాసనాలు 14 వ శతాబ్దం నుండి మాత్రమే లభిస్తాయి. శంకరాచార్యుని సమకాలీన శాసనాలు కానీ ఉటంకింపులు కానీ దొరకలేదు. ఇతను ఒక వ్యక్తా అనేక వ్యక్తులా అనేది కూడా చెప్పలేం. ఇతను చాణుక్యుడిలా కల్పిత పాత్రకావచ్చుననే సందేహం కూడా ఉంది. సాధారణంగా చారిత్రిక వ్యక్తుల కన్నా పురాణవ్యక్తులే శక్తివంతంగా ఉంటారు. అలా శంకరాచార్యుడు నేడు శ్రీరామచంద్రునిలా పురాణపురుషుడు. పూజనీయుడు. చరిత్రను దాటి పురాణపురుషునిగా ఎదిగిన వ్యక్తి చరిత్రాతీతుడు అయిపోతాడు. ఇక అతనికి ఆపాదించబడ్డ శక్తులను నిరూపించటం చారిత్రికంగా అసాధ్యం. వారిపై చర్చను ఈ మహిమలపైనకాక ఆ మహిమలు సమాజాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయనే చారిత్రిక సత్యాలపైనే చెయ్యాల్సి ఉంటుంది. అంతమాత్రానా అతన్నీ అతని మహిమల చారిత్రికతను ఒప్పుకొన్నట్లు కాదు.
****

శంకరాచార్యుడు సామాన్యప్రజలతో సంబంధాలు పెట్టుకోలేదు. ఇతని బుధజనవర్గం వేదపండితులు. వైదికరచనలకు వ్యాఖ్యానాలు రాయటం; వర్ణాశ్రమ ధర్మాలను స్థిరీకరించటం; మఠాలు క్రతువుల ద్వారా బ్రాహ్మణాధిక్యతను స్థాపించటం; స్త్రీలకు శూద్రులకు చదువును నిరాకరించటం; బౌద్ధులను నిర్మూలించి బౌద్ధారామాల ఆక్రమణ చేయటం లాంటివి శంకరాచార్యుడు చేసిన పనులు. వీటిలో ఏవీ 90 శాతం దేశ ప్రజలకు ఉపయోగకరం కావు సరికదా వారిని పీడించేవే.

శంకరాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు చేసిన వ్యాఖ్యానాలు బౌద్ధ జైన మతాల తాకిడికి రెపరెపలాడుతున్న వైదిక ధర్మాన్ని నిలబెట్టిందని పండితులు పదే పదే చెబుతారు. “రాముడు రాక్షసులందరిని నాశనం చేసి సీతను రక్షించినట్లే, శంకరాచార్యుడు వేదాలను దూషించే బౌద్ధులను ఓడించి, ఉపనిషత్తుల సత్యమైన సీతకు పూర్వపు వైభవాన్ని పునరుద్ధరించాడు. మూడు లోకాలకు మేలు చేసిన గొప్ప శంకరునికి విజయం కలుగుగాక!” అని శంకరదిగ్విజయలో మాధవాచార్యుడు శంకరుని వేనోళ్ళ కొనియాడతాడు. (4-110)

శంకరాచార్యుని అద్వైత సిద్ధాంతం సామాన్యప్రజలకు అర్ధం కాదు. నేటికీ దానికి అన్వయం చెప్పటం సులభం కాదు. అయినప్పటికీ పండితులు అదేదో మానవేతిహాసపు మహావిష్కరణ అంటూ ప్రచారం చేసారు. శంకరుని వ్యాఖ్యానాలను చూపి వర్ణవ్యవస్థ, కర్మ సిద్ధాంతం, బ్రాహ్మణాధిక్యతను బతికించుకొని సమాజాన్ని మూఢనమ్మకాలలోకి, అసమానతలలోకి నడిపించి ధర్మం పేరుతో శూద్ర అతి శూద్ర వర్గాలను, వారి శ్రమను దోచుకుతినడానికి తెరలేపారు పండితులు.

ఈ మొత్తం చారిత్రిక మలుపులో పండితులు పోషించినపాత్ర, వారు పొందిన సామాజిక హోదా అత్యంత అమానవీయమైనది.

శంకరాచార్యునిచే ప్రవేశపెట్టబడినదిగా చెప్పే పంచాయతన ఆరాధనా విధానం వల్ల ఈదేశపు సాంస్కృతిక వైవిధ్యం అంతరించింది. బ్రాహ్మణుడు ప్రధానంగా జరిగే రిచువల్స్ కి ప్రాధాన్యత పెరిగింది.

శంకరాచార్యులు కాశీలో గంగానదిలో స్నానం చేసి వస్తుండగా ఒక చండాలుడు ఎదురుపడతాడు. అప్పటి ఆచారం ప్రకారం శంకరాచార్యులు అతన్ని దూరంగా ఉండమని చెబుతాడు. చండాలుడు శంకరాచార్యుని దేహాన్ని చూసి "మీరు దేహాన్ని దూరంగా ఉండమంటున్నారా లేక ఆత్మను దూరంగా ఉండమంటున్నారా?" అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నకు శంకరాచార్యులు తన అజ్ఞానాన్ని తెలుసుకొని చండాలుని సాక్షాత్తు శివునిగా గుర్తించి నమస్కరిస్తాడు. శంకర దిగ్విజయంలో చెప్పిన ఈ చండాలుని వృత్తాంతం చూపుతూ శంకరాచార్యుడు అంటరానితనాన్ని నిరసించాడని, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలిచాడని కొందరు పండితులు వాదిస్తారు. నిజానికి పై ఘట్టంలో సమానభావన ఎక్కడ ఉంది? అదే శంకరదిగ్విజయంలో శంకరాచార్యుడు సాక్షాత్తూ శివావతారమని చెప్పినప్పుడు చండాలుని రూపంలో వచ్చిన మరొక శివుడు ఎవరు? ఇవన్నీ అన్వయాలపేరుతో పండితులు చేసే మోసాలు.

శంకరాచార్యుని ప్రభావం నేటికీ సమాజంలో ఉంది. ఉదాహరణకు డా. అంబేద్కర్ మహాసయుడు పార్లమెంటులో హిందూకోడ్ బిల్ ప్రవేశపెడుతున్నప్పుడు కర్ణాటకలోని శంకరాచార్యుని స్కూల్ కు చెందిన సంకేశ్వర మఠాధిపతి "గంగాజలం పవిత్రమైనది కావచ్చు, కానీ అది వీధి కుళాయి ద్వారా వస్తే, దానిని పవిత్రంగా పరిగణించలేము. అదేవిధంగా, 'ధర్మశాస్త్రం' (హిందూకోడ్ బిల్) ఎంత ప్రామాణికమైనదైనా, డాక్టర్ అంబేద్కర్ వంటి 'మహర్' నుండి వచ్చినందున దానిని ప్రామాణికంగా పరిగణించలేము" అన్నాడు. శతాబ్దాలతరువాత కూడా శక్తివంతంగా నిలిచిన శంకరాచార్యుని “మహానుశాసనం” అది.

వర్ణవ్యవస్థను సమాజంలో స్థిరపరచి బౌద్ధం వల్ల మసకబారిన బ్రాహ్మణాధిక్యతకు పునర్వైభవం తెప్పించినందుకు నేటికీ పండితులు శంకరాచార్యుడిని “శంకరభగవత్పాదులు” అనీ, సాక్షాత్తూ శివావతారమనీ గొప్ప భక్తి ప్రపత్తులతో, కృతజ్ఞతాపూర్వకంగా పిలుచుకొంటారు. శంకర జయంతి పేరిట ఏటా పెద్దఎత్తున పూజలు, వేడుకలు జరుపుకొంటారు.
***

ఈరోజు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛతో చదువుకొని గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్న బహుజనులు, ఒకప్పుడు తాము బానిసత్వపు చీకటిలోకి ఎలా నెట్టబడ్డారో, శతాబ్దాలుగా అక్కడే ఎలా ఉంచబడ్డారో ఆ మంత్రాంగాన్ని అర్థం చేసుకునే క్రమంలో శంకరాచార్యుడు పోషించిన పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలించాలి. గతమెంతో గొప్పది, అందరినీ అక్కడికే నడిపిస్తాం అంటూ పండితులు ప్రచారిస్తున్న నేపథ్యంలో ఇలాంటి అవగాహన అవసరం.

బొల్లోజు బాబా


సంప్రదించిన పుస్తకాలు
1. 1. Brahma Sutra Bhasya Of Shankaracharya by Swami Gambhirananda, pn233
2. శ్రీశంకరావతార చరితము, యఱ్ఱాప్రగడ వేంకట సూర్యనారాయణ మూర్తి
3. The Buddhist Antiquities of Nagarjunkonda, by A.H.Longhurst, Delhi, 1938, p.6.
4. complete Works of Swami Vivekananda, vol. VII, p.116
5. Tirupati Balaji was a Buddhist Shrine, by K. Jamanadas
6. Sankara Digvijaya, Translated by Swamy Tapasyananda, Ramakrishna math publication.
7. శ్రీశంకర విజయము, చిలుకూరు వెంకటేశ్వర్లు
8.ఆదిశంకరాచార్య వ్యక్తిత్వం తత్వం – రావిపూడి వెంకటాద్రి
9. Decline and Fall of Buddhism, by Dr.KJamnadas
10. Slavery, Jyothirao Phule
11. On Hinduism, Wendy Doniger
12. వేదబాహ్యులు, బొల్లోజు బాబా