ఫరిదుద్దీన్ అత్తర్ ( అబు హమీద్ బిన్ అబుబక్ర్ ఇబ్రహీం) 1120-1229
1229 లో పెర్షియాను చెంఘీస్ ఖాన్ ఆక్రమించుకొన్నపుడు, ఓ వృద్దుని యుద్దఖైదీగా రాజుగారి వద్దకు తీసుకొచ్చారు. ఆ వృద్దుని పట్ల జాలిపడ్డ ఒక పౌరుడు ఆతనిని ఒదిలివేయండి, అందుకు ప్రతిఫలంగా నేను వెయ్యి వెండినాణాలు ఇస్తాను అన్నాడట. అపుడా వృద్దుడు " నన్ను అంత తక్కువకు అమ్మకండి, నా నిజమైన విలువను కట్టేవారు రావొచ్చు" అన్నాడట. మరొక వ్యక్తి ఒక మోపుడు ఎండు గడ్డి ఇస్తాను ఆ వృద్దుడిని వదిలివేయండి అన్నాడు. అపుడా వృద్దుడు " నా విలువ ఇదే ప్రభూ నన్ను ఇప్పుడు అమ్మివేయవచ్చు" అని చెప్పగా తాను మోసపోయినట్లు భావించిన రాజుగారు ఆ వృద్దుని శిరచ్ఛేదనం గావించమని ఆదేశించాడట.
ఆ వృద్దుడే ప్రముఖ సూఫీ కవి ఫరిదుద్దీన్ అత్తర్.
ఈ ఉదంతం జరిగిందో లేదో చారిత్రిక ఆధారాలైతే లేవు కానీ అత్తర్ కవిత్వం దానికి సాక్ష్యంగా నిలుస్తుంది. అత్తర్ కవిత్వంలో ప్రాపంచిక సంపదల పట్ల తృణీకారము కనపడుతుంది. అధికారము, కీర్తి, భోగలాలస భక్తిమార్గానికి మనిషిని దూరంచేస్తాయని చెపుతుంది.
భూమిపై ఉండే సంపదల అశాశ్వత గురించి , ఒక చోట అత్తర్
" ఈ ప్రపంచైశ్వర్యం అంతా నీదైనప్పటికీ
అది రెప్పపాటులో నీనుంచి అదృశ్యం కాగలదు" అంటాడు
ఈ దేహంలో బంధింపబడ్డ ఆత్మ ను ప్రక్షాళనం చేసుకోవటం ద్వారానే దైవసాయుజ్యం పొందగలమన్న సూఫీ తత్వాన్ని అత్తర్ తన గీతాలద్వారా ప్రవచించాడు. అత్తర్ రచనల్లో కాన్ఫరెన్స్ ఆఫ్ బర్డ్స్ ఒక గొప్ప సృష్టి.
అత్తర్ గురించి మరింత సమాచారాన్ని ఈ క్రింది లింకులో చూడవచ్చును.
http://en.wikipedia.org/wiki/Farid_al-Din_Attar
1.
నడిరేయిలో ఓ సూఫీ ఇలా విలపిస్తున్నాడు.
ఈ ప్రపంచం మూత వేసిన ఓ శవపేటిక
దానిలోనే మనమందరమూ ఉన్నాం.
అజ్ఞానం కొద్దీ మనజీవితాల ను
అవివేకంతో అధ్వాన్నంగా గడిపేస్తున్నాం.
మృత్యువు ఈ పేటిక మూత తెరువంగానే
రెక్కలు ధరించిన వారు అనంతంలోకి
ఎగిరిపోతారు.
లేని వారు పేటికలోనే మిగిలిపోతారు.
కనుక మిత్రులారా!
ఈశ్వరుని చేరే త్రోవలో పక్షిగా మారటానికై
అవసరమైనవన్నీ చేయండి.
రెక్కలు , తూలికలు పొందటానికి
ఏంచేయాలో అన్నీ చేయండి.
అత్తర్ --- "పెర్ఫ్యూం ఆఫ్ ద డిసర్ట్ " నుండి
2.
హృదయం చొక్కా పట్టుకొని
ఈ ప్రపంచపు తలను కాలితో తంతాను.
భూమిని, ఆకాశాన్ని నా గుర్రం కాళ్లక్రింద పడేసి తొక్కిస్తాను.
అందరినీ మించి బిగ్గరగా అరుస్తాను.
మరుక్షణం నేను ఈశ్వరుని ఎదుట
ఒంటరిగా మౌనంగా నిలుచుని ఉంటాను.
-- అత్తర్
హతీమ్ అల్ అసామ్
"నేను నాలుగువిషయాలు ఎంచుకొని
మిగిలిన జ్ఞానాన్నంతా వదిలేసాను" అన్నాడు.
మొదటిది: నా దినసరి తిండి నిర్ణయింపబడ్డది.
కనుక నేను దానిని పెంపుచేసే
ప్రయత్నాలు విరమించుకొన్నాను.
రెండవది: ఈశ్వరునికి నే పడ్డ బాకీ
మరెవరూ తీర్చరని తెలుసుకొన్నాను.
కనుక దానిని తీర్చటంలో నిమగ్నమయ్యాను.
మూడవది: నేనెప్పటికీ తప్పించుకోలేని,
ఒకరు తరుముతున్నారు , అదే మృత్యువు.
అందుకే తనను కలసుకోవటానికి
సిద్దపడుతున్నాను.
నాల్గవది: నాకు తెలుసు ఈశ్వరుడు
నన్ను పరిశీలిస్తున్నాడని.
అందుకే నేను చేయకూడని పనులు
చేయటానికి సిగ్గు పడతాను.
అత్తర్ --- "పెర్ఫ్యూం ఆఫ్ ద డిసర్ట్ " నుండి
4.
నీ మొఖము
అనంతమూ కాదు తాత్కాలికమూ కాదు.
నీ మొఖాన్ని నీవేనాడూ చూడలేవు,
నీవు చూసేది దాని ప్రతిబింబాన్ని మాత్రమే.
దర్పణం ముందు నిట్టూరుస్తూ
నీ ఊపిరి గాలులతో దాని ఉపరితలాన్ని
మసకబారేలా చేస్తున్నావు.
శ్వాసను నిదానముగా ఉంచు.
బంధించు, సాగర గజఈతగాని వలె.
కదిలావా, దర్పణ ప్రతిబింబం చెదిరిపోతుంది.
చనిపోకు, నిదురపోకు, మేల్కొనీ ఉండకు
ఏమీ చేయకు.
ప్రేమికులు ఒకరికొరకు మరొకరు ఓడినట్లుగా
నిన్ను నీవు పోగొట్టుకో,
అదే నీవు.
అదే నీకు కావలసినది.
దానికోసమే నీవు అన్వేషిస్తున్నావు.
-- అత్తర్
అహాన్ని చంపుకోనంత కాలమూ
ఇతరులతో పోల్చుకొంటూ ఉన్నంత కాలమూ
మనం స్వేచ్ఛ నొందలేము.
బాహ్య ప్రపంచాన్ని తొడుక్కొన్నవారు
భక్తి మార్గంలో నడవలేరు.
-- అత్తర్
6.
నీ నుంచి జీవితాన్ని లాగేసుకొనే లోపే
ఈ మర్మాన్ని ఛేదించటానికి శ్రమించు.
నీవేమిటో బతికుండగా తెలుసుకోలేకపోతే
నీ ఉనికి రహస్యాన్ని ఎలా
అర్ధం చేసుకోగలవూ? చచ్చాకా!
----అత్తర్
