Wednesday, July 8, 2009

సూఫీ కవిత్వం - - అత్తర్


ఫరిదుద్దీన్ అత్తర్ ( అబు హమీద్ బిన్ అబుబక్ర్ ఇబ్రహీం) 1120-1229

1229 లో పెర్షియాను చెంఘీస్ ఖాన్ ఆక్రమించుకొన్నపుడు, ఓ వృద్దుని యుద్దఖైదీగా రాజుగారి వద్దకు తీసుకొచ్చారు. ఆ వృద్దుని పట్ల జాలిపడ్డ ఒక పౌరుడు ఆతనిని ఒదిలివేయండి, అందుకు ప్రతిఫలంగా నేను వెయ్యి వెండినాణాలు ఇస్తాను అన్నాడట. అపుడా వృద్దుడు " నన్ను అంత తక్కువకు అమ్మకండి, నా నిజమైన విలువను కట్టేవారు రావొచ్చు" అన్నాడట. మరొక వ్యక్తి ఒక మోపుడు ఎండు గడ్డి ఇస్తాను ఆ వృద్దుడిని వదిలివేయండి అన్నాడు. అపుడా వృద్దుడు " నా విలువ ఇదే ప్రభూ నన్ను ఇప్పుడు అమ్మివేయవచ్చు" అని చెప్పగా తాను మోసపోయినట్లు భావించిన రాజుగారు ఆ వృద్దుని శిరచ్ఛేదనం గావించమని ఆదేశించాడట.

ఆ వృద్దుడే ప్రముఖ సూఫీ కవి ఫరిదుద్దీన్ అత్తర్.

ఈ ఉదంతం జరిగిందో లేదో చారిత్రిక ఆధారాలైతే లేవు కానీ అత్తర్ కవిత్వం దానికి సాక్ష్యంగా నిలుస్తుంది. అత్తర్ కవిత్వంలో ప్రాపంచిక సంపదల పట్ల తృణీకారము కనపడుతుంది. అధికారము, కీర్తి, భోగలాలస భక్తిమార్గానికి మనిషిని దూరంచేస్తాయని చెపుతుంది.

భూమిపై ఉండే సంపదల అశాశ్వత గురించి , ఒక చోట అత్తర్


" ఈ ప్రపంచైశ్వర్యం అంతా నీదైనప్పటికీ
అది రెప్పపాటులో నీనుంచి అదృశ్యం కాగలదు"
అంటాడు

ఈ దేహంలో బంధింపబడ్డ ఆత్మ ను ప్రక్షాళనం చేసుకోవటం ద్వారానే దైవసాయుజ్యం పొందగలమన్న సూఫీ తత్వాన్ని అత్తర్ తన గీతాలద్వారా ప్రవచించాడు. అత్తర్ రచనల్లో కాన్ఫరెన్స్ ఆఫ్ బర్డ్స్ ఒక గొప్ప సృష్టి.

అత్తర్ గురించి మరింత సమాచారాన్ని ఈ క్రింది లింకులో చూడవచ్చును.
http://en.wikipedia.org/wiki/Farid_al-Din_Attar

1.

నడిరేయిలో ఓ సూఫీ ఇలా విలపిస్తున్నాడు.
ఈ ప్రపంచం మూత వేసిన ఓ శవపేటిక
దానిలోనే మనమందరమూ ఉన్నాం.
అజ్ఞానం కొద్దీ మనజీవితాల ను
అవివేకంతో అధ్వాన్నంగా గడిపేస్తున్నాం.

మృత్యువు ఈ పేటిక మూత తెరువంగానే
రెక్కలు ధరించిన వారు అనంతంలోకి
ఎగిరిపోతారు.
లేని వారు పేటికలోనే మిగిలిపోతారు.

కనుక మిత్రులారా!
ఈశ్వరుని చేరే త్రోవలో పక్షిగా మారటానికై
అవసరమైనవన్నీ చేయండి.
రెక్కలు , తూలికలు పొందటానికి
ఏంచేయాలో అన్నీ చేయండి.

అత్తర్ --- "పెర్ఫ్యూం ఆఫ్ ద డిసర్ట్ " నుండి


2.
హృదయం చొక్కా పట్టుకొని
ఈ ప్రపంచపు తలను కాలితో తంతాను.
భూమిని, ఆకాశాన్ని నా గుర్రం కాళ్లక్రింద పడేసి తొక్కిస్తాను.
అందరినీ మించి బిగ్గరగా అరుస్తాను.
మరుక్షణం నేను ఈశ్వరుని ఎదుట
ఒంటరిగా మౌనంగా నిలుచుని ఉంటాను.

-- అత్తర్


3.

హతీమ్ అల్ అసామ్
"నేను నాలుగువిషయాలు ఎంచుకొని
మిగిలిన జ్ఞానాన్నంతా వదిలేసాను" అన్నాడు.

మొదటిది: నా దినసరి తిండి నిర్ణయింపబడ్డది.
అది పెంచబడదు, తగ్గించబడదు.
కనుక నేను దానిని పెంపుచేసే
ప్రయత్నాలు విరమించుకొన్నాను.

రెండవది: ఈశ్వరునికి నే పడ్డ బాకీ
మరెవరూ తీర్చరని తెలుసుకొన్నాను.
కనుక దానిని తీర్చటంలో నిమగ్నమయ్యాను.

మూడవది: నేనెప్పటికీ తప్పించుకోలేని,
ఒకరు తరుముతున్నారు , అదే మృత్యువు.
అందుకే తనను కలసుకోవటానికి
సిద్దపడుతున్నాను.

నాల్గవది: నాకు తెలుసు ఈశ్వరుడు
నన్ను పరిశీలిస్తున్నాడని.
అందుకే నేను చేయకూడని పనులు
చేయటానికి సిగ్గు పడతాను.

అత్తర్ --- "పెర్ఫ్యూం ఆఫ్ ద డిసర్ట్ " నుండి


4.

నీ మొఖము
అనంతమూ కాదు తాత్కాలికమూ కాదు.
నీ మొఖాన్ని నీవేనాడూ చూడలేవు,
నీవు చూసేది దాని ప్రతిబింబాన్ని మాత్రమే.

దర్పణం ముందు నిట్టూరుస్తూ
నీ ఊపిరి గాలులతో దాని ఉపరితలాన్ని
మసకబారేలా చేస్తున్నావు.
శ్వాసను నిదానముగా ఉంచు.
బంధించు, సాగర గజఈతగాని వలె.

కదిలావా, దర్పణ ప్రతిబింబం చెదిరిపోతుంది.

చనిపోకు, నిదురపోకు, మేల్కొనీ ఉండకు
ఏమీ చేయకు.

ప్రేమికులు ఒకరికొరకు మరొకరు ఓడినట్లుగా
నిన్ను నీవు పోగొట్టుకో,
అదే నీవు.
అదే నీకు కావలసినది.
దానికోసమే నీవు అన్వేషిస్తున్నావు.

-- అత్తర్


5.

అహాన్ని చంపుకోనంత కాలమూ
ఇతరులతో పోల్చుకొంటూ ఉన్నంత కాలమూ
మనం స్వేచ్ఛ నొందలేము.

బాహ్య ప్రపంచాన్ని తొడుక్కొన్నవారు
భక్తి మార్గంలో నడవలేరు.

-- అత్తర్

6.

నీ నుంచి జీవితాన్ని లాగేసుకొనే లోపే
ఈ మర్మాన్ని ఛేదించటానికి శ్రమించు.

నీవేమిటో బతికుండగా తెలుసుకోలేకపోతే
నీ ఉనికి రహస్యాన్ని ఎలా
అర్ధం చేసుకోగలవూ? చచ్చాకా!

----అత్తర్

బొల్లోజు బాబా




Saturday, July 4, 2009

సూఫీ కవిత్వం - - హాఫీజ్

ఖ్వాజా షామ్సుద్దీన్ మొహమ్మద్ హాఫీజ్ సిరాజి (1315-1390)

ఒక పర్షియన్ కవిగా హాఫీజ్ కు మంచి పేరు ఉంది. అది ఎంతంటే ఈతని పుస్తకాలు, ఖురాను కంటే ఎక్కువగా అమ్ముడు పోయేవట. 

హాఫీజ్ కవిత్వంలో సౌందర్యం, మార్మికత, ప్రేమ, కరుణ వంటి విశ్వజనీన భావాలు పరిమళిస్తూంటాయి. నిశిత దృష్టి, ఆహ్లాదమైన శైలి, లయ, సరళ భాషతొ ఉండే హాఫీజ్ కవిత్వం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది.    మరో పర్షియన్ కవి, అత్తర్ వద్ద హఫీజ్ శిష్యరికం చేసాడు.

భారతదేశపు యోగి శ్రీమెహర్ బాబా , హఫీజ్ గీతాలను పాడేవారట.

హఫీజ్ " అశరీర వాణి" అనీ (Tongue of the Invisible), "కవులకే కవి" అని కీర్తి గడించాడు. దేవునిలో లీనమయ్యే మార్గాలను అన్వేషిస్తూ హఫీజ్ ఎన్నో వందల గీతాలను రచించాడు. హఫీజ్ సుమారు 5000 గీతాలు వ్రాసినట్లు ఒక అంచనా. హఫీజ్ తన గీతాలలో ఎక్కడో ఒక చోట తన పేరును పొందుపరచుకొనే వాడు. 

మతపెద్దల ధ్వంధ్వ ప్రవృత్తులను తన వ్రాతలలో విమర్శించినందుకు హఫీజ్ తన చరమాంకంలో రాజదండనకు గురి అయ్యాడని అంటారు. 

హాఫీజ్ కొరకు మరింత సమాచారం ఇక్కడ 
http://en.wikipedia.org/wiki/Hafez

1.

నీ చేతులలో ఒక శిశువు

నా ప్రేమ కెరటం
ఎంతో ఎత్తుకు లేచింది
నిన్ను ఉప్పెనలా ముంచెత్తనీ.

కనులు మూసుకో
బహుసా నీ భయాలు, కల్పనలు
ముగియవచ్చేమో!

అదే కనక జరిగితే
ఈశ్వరుడే నీ చేతులలో 
ఓ శిశువు అవుతాడు.

అపుడు 
ఈ సృష్టినంతా నీవే
లాలించవలసి ఉంటుంది.

హఫీజ్ -- 'సబ్జక్ట్ టునైట్ ఈజ్ లవ్' నుండి 


2.

ఒకే ఒక నియమం

ఆకాశం
ఓ వేలాడదీయబడ్డ నీలి సంద్రం
నక్షత్రాలు ఈదులాడే చేపలు.
ఒక్కోసారి నేను స్వారీచేసే గ్రహాలేమో 
తెల్లని తిమింగలాలు.

సూర్యుడు, కాంతి మొత్తమూ
నా హృదయంలో, నా దేహంతో
శాశ్వతంగా పెనవేసుకున్నాయి.

ఈ ఎడారి క్రీడాస్థలంలో
హఫీజ్ కి ఒకే ఒక నియమం 
ఇంతవరకూ కనిపించింది.

అదేమిటంటే
ఈశ్వరుని ఆటలో 
ఆనందించు మిత్రమా ఆనందించు.
ప్రియవిభుని అద్బుతమైన ఆటలో
ఆనందించు.

హఫీజ్ -- 'సబ్జక్ట్ టునైట్ ఈజ్ లవ్' నుండి 


3.

సూర్యుడు ఏనాడూ అనలేదు

ఇంతకాలంగా
సూర్యుడు భూమితో 
నీవు నాకు ఋణపడి ఉన్నావని
ఏనాడూ అనలేదు.

అటువంటి ప్రేమలో 
ఏం జరుగుతున్నదో గమనించావా!

మొత్తం ఆకాశం అంతా వెలుగే

హఫీజ్ - 'ది గిఫ్ట్ ' నుండి


4.

సూర్యుడు సౌందర్యపోటీలో నెగ్గి
ఈశ్వరుని చేతి రత్నమై నిలిచాడు.

భూమి తన విభుని కాలి కడియమై
ఉండటానికి అంగీకరించింది.
తన నిర్ణయానికి ఏనాడూ చింతించలేదు.

నిదురించే ప్రేక్షకుల మధ్య కూర్చొని కూర్చొని
పర్వతాలు విసిగిపోయాయి.
తమ చేతులను పైకప్పు వైపు సారిస్తున్నాయి.

మబ్బులు నా ఆత్మ కి ఓ సలహా ఇచ్చాయి.
వెంటనే నేను నా మధుపాత్రను తాకట్టు పెట్టి
రెక్కలు తొడుక్కొన్న వజ్రమై పైకి ఎగసాను.
నా ప్రయత్న్మమంతా ముంచెత్తే ప్రేమకు 
దగ్గరగా ఉండటానికే -- నీలానే.

నాలోని నిదురించే జనాల మధ్య ఉండటం
పర్వతానికి విసుగనిపించిందేమో!
సూర్యునిలా నా కనులలోకి ఎగసింది.
నా ఆత్మ నా హృదయానికిచ్చిన గొప్ప సలహాతో
హఫీజ్ రెక్కల వజ్రమై పైకి లేస్తున్నాడు. 

హఫీజ్ - 'ది గిఫ్ట్ ' నుండి


5.

రావోయి మిత్రమా!
గులాబీలను వెదజల్లి, గ్లాసులనిండా 
ద్రాక్షమధువుని నింపుకుందాం.

స్వర్గలోకపు పై కప్పును ధ్వంసం చేసి 
కొత్త పునాదులు నిర్మిద్దాం.

విషాదం తన సైన్యంతో దండెత్తి 
ప్రేమికుల రక్తాన్ని చిందిస్తే
సాకితో చేయికలిపి, దానిని మట్టి కరిపిద్దాం.
మిత్రమా, చేత వాయిద్యముతో, 
మధుగీతాన్ని పాడుతూ
ఆనంద నృత్యంలో సోలిపోదాం.

హఫీజ్ ' పెర్షియన్ పోయమ్స్ ' నుండి 


6.

నేను చాలా తెలుసుకొన్నాను


నేను ఈశ్వరుని ద్వారా 
ఎంతో తెలుసుకొన్నాను.
ఇకపై నన్ను నేను
ఓ క్రిష్టియననో, హిందువుననో, ముస్లిముననో
బౌద్దుడననో, యూదుడిననో
పిలిపించుకోను.

సత్యం తనని తాను 
ఎంతగానో నాతో పంచుకొంది.

ఇకపై నన్ను నేను
ఓ పురుషునిగానో, స్త్రీగానో, దేవదూతగానో
లేదా ఒక స్వచ్చమైన ఆత్మగానో 
అనుకోవటం లేదు.

హఫీజ్ తో ప్రేమ ఎంతో స్నేహించి
తాను దహింపబడి, 
నామనసు తెలుసుకొన్న 
ప్రతిఒక్క ఆలోచన, స్వరూపాల నుండి
నన్ను విముక్తుడిని చేసింది 

హఫీజ్ - 'ది గిఫ్ట్ ' నుండి


7.

ఆతని సౌందర్యానికి మనం కావలిదారులం
తేజో మూర్తికి మనం రక్షకులం.

కారణమొకటే
మనం ఈశ్వరుని అనుసరిస్తూ 
ఈ లోకంలోకి వచ్చాం. 
ఆనందాన్ని, స్వేచ్ఛను, నాట్యాన్ని
ప్రేమను పెంపొందించటానికి. అంతే.

నీలో ఏదో ఓ ఉన్నత స్వరం 
నాతో ఇలా మాట్లాడనీ!

"హఫీజ్! ఈ వెన్నెల రాత్రి అలా ఖాళీగా కూర్చోకు
నా హృదయాన్ని మన విభుని 
మనసులో విచ్చుకొనేలా చేయి. 
గాయపడిన నా రెక్కలను స్వస్థపరచు."

మనమాతని సౌందర్యానికి సహచరులము.
సత్యానికి సంరక్షకులము.
ప్రతి పురుషుడు, మొక్క, క్రిమి
ప్రతి స్త్రీ, శిశువు, నరము , నాదము 
మన ప్రియ విభుని సేవకులే.

అదిగొ ఆనందము
అల్లదిగో వెలుతురు. 

హఫీజ్ -- 'సబ్జక్ట్ టునైట్ ఈజ్ లవ్' నుండి 

బొల్లోజు బాబా


Friday, July 3, 2009

సూఫీ కవిత్వం - - రూమి


ఇస్లాం మతంలో ఒక ఆద్యాత్మిక అధ్యాయం సూఫీతత్వం. ఈ తత్వం ప్రకారం స్వీయ ఆధ్యాత్మికా మార్గాన ఈశ్వర ప్రేమను పొందటం ధ్యేయం. ఐహిక బంధాల నుంచి విముక్తమై మనసును దేవుని వైపు ప్రయాణింపచేయటం సూఫీల జీవన విధానంగా ఉంటుంది.
సూఫీలు ఆడంబరాలకు దూరంగా ముతక దుస్తులు ధరించి స్వాములుగా జీవితాన్నిగడిపేవారు. సూఫీకవులు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, దైవచింతనను ప్రతిబింబిస్తూ అనేక రచనలు చేసారు. రూమీ, అత్తర్, హఫీజ్, జామీ, సనాయ్, సాదీ, రబియా మొదలగువారు ప్రముఖులు.
వారు వ్రాసిన కవితలలో నాకు నచ్చిన కొన్నింటి అనువాదాలు ఇవి. మిగిలినవారిగురించి మరో సారి......

జలాలుద్దీన్ మహమ్మద్ రూమి (1207-1273)
రూమి పదమూడవ శతాబ్ధానికి చెందిన పర్షియన్ కవి. దేవుని చేరటానికి కవిత్వం, సంగీతం, నృత్యం ప్రధాన సాధనాలని రూమీ భావించాడు. ఈతని కవిత్వం ఏమతానికి చెందక మానవత్వాన్ని ప్రతిబింబించటం ఒక ప్రత్యేకత. జీవితాన్ని అక్షరాలుగా మలచి అందించాడు రూమి. ఆయనకవితలలో మార్మికత, భావుకత, మానవత్వంపై అచంచల విశ్వాసం, దేవుని పై ఆరాధనా కనిపిస్తాయి. ఈ నాటికీ ప్రపంచవ్యాప్తంగా రూమీ కవిత్వానికి ఆదరణ ఉన్నదంటే దానికి కారణం ఆయన కవిత్వంలో పరచుకొన్న మానవజీవన చిత్రణే.

రూమీ గురించి మరిన్ని వివరాలు ఈ లింకులో చూడవచ్చును. http://te.wikipedia.org/wiki/జలాలుద్దీన్_ముహమ్మద్_రూమి
రూమీ పూర్తి రచనలను శ్రీ దీవి సుబ్బారావు అనువదించారట.

1.
వెలిగించటానికి సిద్దంచేసిన
ఓ దీపముంది నీ హృదయంలో.
నింపేందుకు సిద్దంగా
శూన్యముంది నీ ఆత్మలో
నీకూ తెలుస్తూంది కదూ!


ఈశ్వరునితో నీ వియోగం
నీకు అర్ధమౌతూంది కదూ!
నిను నింపటానికి అతనిని ఆహ్వానించు.
అగ్నిని కౌగిలించుకో.


ప్రేమ తనంత తానే వస్తుందనీ
దానికై నీ తపన పాఠశాలల్లో నేర్పరనీ

గుర్తుచేసుకో.

రూమి - పాషనేట్ పోయమ్స్ ఆఫ్ రూమి" నుండి

2.
ఉదయపు గాలులు వీస్తున్నాయి.
ఉదయపు గాలులు తమ తాజా
వాసనలను పంచుతున్నాయి.
నిదుర లేచి వాటిని ఆహ్వానించు.
మనలను బ్రతికించే గాలులవి.
అవి వెళ్లిపోయే లోగా పీల్చుకో.

రూమీ - "ది ఎస్సెన్సియల్ రూమి" నుండి.

3.
నదిని ఆలకించు
ఈ ఒడ్డుపై మరణించి
సముద్రాన్ని చేరే
నదుల మార్గాన్ని
అనుసరించమని
చెపుతూంది అది


రూమీ - " సే ఐ ఆమ్ యూ" నుండి

4.
నీకు ఏదైనా కానుక నీయాలని
నేనెంత అన్వేషించానో నీకు తెలియదు.
సరైనదేదీ దొరకలేదు.
బంగారు గనికి బంగారాన్నీ,
జలనిధికి నీటినీ కాన్కలుగా ఈయటం
ఏం బాగుంటుంది.
అన్నీ అలానే అన్పించాయి.
నా హృదయాన్నో, ఆత్మనో ఇవ్వాలనుకోవటం
ఉచితం కాదు, ఎందుకంటే
అవి ఇప్పటికే నీకు సమర్పించేసాను.


అందుకే, ఒక దర్పణాన్ని తీసుకొచ్చాను.
దానిలో నిన్ను చూసుకొని
నన్ను గుర్తుచేసుకో.


రూమీ - "ది ఎస్సెన్సియల్ రూమి" నుండి.

5.
ఆశే ఈ రహస్యానికి కేంద్రబిందువు
ఆశే స్వస్థత నిస్తుంది కూడా చిత్రంగా.


నియమేమిటంటే
బాధ అనుభవించాలి.
నీ కోర్కె క్రమశిక్షనొందాలి.
భవిష్యత్తులో ఏమి జరగాలనుకొంటావో
దానిని త్యాగం చేయాలి.


రూమీ - "ది ఎస్సెన్సియల్ రూమి" నుండి.

6.
ఒంటరిగా దుఖించే ఈ జనులు నన్ను
అలసిపోయేలా చేస్తున్నారు.
మత్తెంక్కించే నీ ప్రేమ మైకంలో తేలియాడాలని
యోధుని బలాన్ని నా చేతులతో తాకాలని నా ఆశ.


ఈ అశాశ్వత రాజులతో విసిగిపోయాను.
నీ కాంతిని చూడాలనుకొంటున్నాను.

ఈ షేకులు, ముల్లాలు దీపాలు చేతబూని
వారువెతికేది ఎంతకీ దొరకక
చీకటి సందుగొందులలో
తిరుగాడుతున్నారు.

నీవు తత్వ సారానివి. ప్రేమ మైకానివి.
నీ కీర్తనలు పాడాలనుకొంటాను.
కానీ, హృదయంలో బాధించే కోర్కెతో
మౌనంగా నిలుచుండిపోతాను.


రూమి -- ద లవ్ పోయమ్స్ ఆఫ్ రూమి నుండి.

7.
ఈ నూతన ప్రేమలో మరణించు.
ఆవలి వైపున నీ దారి మొదలవుతుంది.
ఆకాశంలా మారిపో.
చేత గొడ్డలిపూని కారాగార తలుపులను చేధించు.
పారిపో!
కొత్తగా జన్మించినవానిలా ముందుకు సాగు.
ఆ పని ఇప్పుడే చేయి.


నీవు దట్టమైన మేఘంతో కప్పబడ్డావు.
పక్కకు జరుగు. మరణించు.
మౌనంగా ఉండు.
నీవు మరణించావనటానికి మౌనమే ఋజువు.
నీ పాత జీవితమనేది
మౌనంనుండి చేసిన ఓ పిచ్చి పరుగు.

మౌన చందమామ ఇప్పుడు ఉదయించింది.


రూమీ - "ది ఎస్సెన్సియల్ రూమి" నుండి.

బొల్లోజు బాబా


Thursday, June 25, 2009

ప్చ్


బలాన్నంతా కూడదీసుకొని
దూరంగా విసిరేసిన ఓ స్వప్నం
మెల్లమెల్లగా కనుమరుగైంది
ఎగిరే పక్షికూతలా.

అక్కడ ఆ చీకటి చలిలో
అదిచేసే దుర్భల ఆర్తనాదం
లీలగా వినిపిస్తోంది.
లేదు అవును లేదు అవును అవును.
అవును అదింకా నన్ను ప్రేమిస్తూనే ఉంది.

ఎపుడో ఒకప్పుడు
అది ఓ రెక్కల గుర్రమై
ఎగురుకుంటూ వచ్చి
నన్నెక్కించుకొని
ఆ కొండపై దింపుతాది.

అప్పటికి ఈ ప్రపంచం
ఇంకా లోయలోనే ఉంటుంది.

బొల్లోజు బాబా

Saturday, June 20, 2009

పోలవరం నిర్వాసితుల కోసం....

నాకు పెద్దగా లెక్కలు రావు
ఎన్నివందల స్మశానాలో
ఎన్ని లక్షల శవాలో
ఎన్నికోట్ల వెలుతురు గింజలో
నే చెప్పలేను.


రెండు కొండల మధ్య సూర్యుని చూపి
అది ఏ సంధ్యంటే ఎవరుమాత్రం
ఏం చెప్పగలరు!


లక్షల సంవత్సరాల
కన్నీళ్లు, నెత్తురులు
ఇంకించుకొన్న ఈ నేల
ఇకపై తన పరిమళాల తూనీగల్ని
ఎగరేయదంటే, ఎందుకో
హృదయంలో ఇసుక నింపినట్టుంది.
ఇంకా తవ్వబడని ఓ నాగరికతను
జల సమాధి చేసేస్తుందీ నేల.


ఏడుతరాల అన్వేషణలో ఎవరో
ఓ మానవుడు ఇక్కడకు వస్తే
ఇక ఈ నేల ఏమిచూపగలదూ
నిలువెత్తు అంధకార జలస్థంభాన్ని తప్ప.

ఈ మట్టినే నమ్ముకొన్న
చెట్టు ఇకపై పాడదు.
పిట్ట ఇకపై పూయదు.

మనిషి మాత్రం
ఇక్కడ తన్ను తాను నరుక్కొని
మరెక్కడో పాతుకొంటున్నాడు.
ఆ రక్తరహిత జననం కోసం
తట్టా బుట్టా సర్ధుకొంటూ, ఈ నేలతో
తన అనుబంధాల్ని, అనుభవాల్ని
ఎలా తీసుకెళ్లాలో తెలీక
అలా వానలో తడుస్తున్నాడు.

సుళ్లుతిరిగే మౌనంపై
శూన్యంలోంచి కురిసే వాన
సూదులతో గుచ్చే ముళ్లవాన.


తడిచేవానికే తెలుస్తుంది
తడి పదునెలా ఉంటుందో.


బొల్లోజు బాబా

(పోలవరం ప్రోజెక్టు నిర్మాణంలో కనుమరుగయ్యే వందల ఊళ్లను, నిర్వాసితులయ్యే లక్షల స్థానికులను తలచుకొని)

Wednesday, June 17, 2009

ఫ్రాగ్మెంట్స్ 4


1

"బాబూ! ఒక స్ట్రిప్ పిల్స్ ఇవ్వు"
జీన్స్ లో ఆమె
బైక్ పై అతను.
రసాయిన సమానత్వం.
*******

2

పాతికేళ్లలో ప్రపంచం
ఎంతమారిపోయినా
మావూరి తాటి ముంజెలకు
ఇంకా అదే రుచి.
*******

3

సీసాలో ద్రవంలా
లోకపు అన్ని వంకరలనూ
ఇముడ్చుకొన్న నాడు
సంకెళ్లు కూడా సుఖంగా ఉంటాయి.
*********

4

ఖాళీ చేసిన ఇంటివాసన
గుండెగొంతులో
బిలబిలా జారే
సారాయి గరగర.
*******


బొల్లోజు బాబా

Friday, June 5, 2009

అప్పుడు - ఎందుకు (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

నా బుజ్జాయీ,
నీకు నేను రంగుల బొమ్మలు తెచ్చినపుడు అర్ధమయింది
మేఘాలు, జలాలపై అట్టి రంగుల నాట్యం ఎందుకుందో
పూవులు భిన్న వర్ణాలను ఎందుకు అద్దుకొన్నాయో!
నీకు రంగుల బొమ్మలు ఇచ్చినపుడు నాకర్ధమయింది.

నిన్ను ఆడించేందుకు నేపాడినపుడు తెలుసుకొన్నాను.
ఆకులలో సంగీతం ఎందుకుందో! ఆలకించే పుడమి హృదయానికి
అలలు తమ బృందగానాన్ని ఎందుకు వినిపిస్తాయో!
నిన్ను ఆడించేందుకు నేపాడినపుడు అర్ధమయింది.

మధురపదార్ధాలను నీ చేతికి అందించినపుడు తెలిసింది.
సుమపాత్రికలో మధువు ఎందుకుందో!
రహస్యంగా ఫలాలు అమృతంతో ఎందుకు నింపబడతాయో!
మధురపదార్ధాలను నీ చేతికి అందించినపుడు నాకు తెలిసింది.

నా ప్రియమైన బుజ్జాయీ
నిన్ను నవ్వించటానికి నీ మోమును ముద్దిడినపుడు
నాకు నిశ్చయముగా అర్ధమయింది.
ఎంతటి సంతసం ఆకాశం నుండి ఉదయకాంతిలో ప్రవహిస్తున్నదో!
నా దేహానికి వేసవి తెమ్మెర ఎంతటి హాయినిస్తుందో!
నిన్ను నవ్వించటానికి నీ మోమును ముద్దిడినపుడు తెలిసింది.

బొల్లోజు బాబా

మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని
WHEN AND WHY అనే గీతం

Monday, June 1, 2009

మహాప్రస్థానం - చలం యోగ్యతాపత్రం

పిచ్చిరెడ్డి, ఎమ్‌.. విధ్యార్ధి ప్రశ్న: యోగ్యతాపత్రం చదివితే మహా ప్రస్థానం గీతాలు మరి చదవక్కరలేదు అనుకుంటా. మీరేమంటారు?
శ్రీశ్రీ జవాబు : ఏమంటాను? మీరు సార్ధకనామధేయులంటాను.

******

శ్ర్రీశ్రీ ని కాస్తంత అసహనానికి గురిచేసిన ప్రశ్న సామాన్యమైనదేమీ కాదు. కారణాలు తెలియవు కానీ మహాప్రస్థానం కొన్ని ముద్రణలను చలం యోగ్యతా పత్రం లేకుండానే ప్రచురించారు.

తెలుగు సాహిత్య చరిత్రల్లో వేళ్లపై లెక్కించదగిన కొన్ని ముందుమాటల్లో, చలం మహాప్రస్థానానికి వ్రాసిన యోగ్యతాపత్రం ముందుంటుంది.

శ్రీశ్రీ పేరు తలచుకోగానే మహాప్రస్థానం ఎలాగ గుర్తుకు వస్తుందో, మహాప్రస్థానాన్ని గుర్తుచేసుకొంటే, దానికి చలం వ్రాసిన యోగ్యతాపత్రం తలపుకు వస్తుంది. మహాప్రస్థానానికి చలం వ్రాసిన ముందుమాటను మొదట " మహాప్రస్థానానికి జోహార్లు" అని పేరుపెట్టినట్లు, దానిని శ్రీశ్రీ యోగ్యతాపత్రంగా మార్చారని అంటారు.

గీతాంజలికి వ్రాసుకొన్న ముందుమాటలో చలం ఇలా అంటాడు. "గీతాంజలి గురించి చలానికి ఏమితెలుసు? అసలు టాగోర్ కు ఏమి తెలుసు?" మొదటి ప్రశ్న వద్ద ఆహా ఏమి వినయం అనుకొంటాం. రెండో వాక్యం పూర్తయ్యేసరికి షాక్ లాంటిదేదో తగిలి, పుస్తకం ఒక్కక్షణం పక్కన పెట్టి ఆలోచించవలసిందే. అదే చలం గొప్పతనం. ఏదైనా ఒక విషయాన్ని (ఇక్కడ గీతాంజలి గొప్పతనాన్ని) చదువరి హృదయంలోకి గొప్ప ఒడుపుతో ప్రవేశపెట్టగలడు.

యోగ్యతాపత్రం కూడా అలాంటిదే. 1940 లో వ్రాసిన యోగ్యతాపత్రంలో చలం చేసిన పరిశీలనలు ఈనాటికీ నిలబడ్డాయంటే, అది ఆయన దార్శనికతకు నిదర్శనం.

కవిత్వాన్ని తూచే రాళ్లు నావద్ద లేవంటూ, అత్యంత మోడెస్టీ తో ప్రారంభించి, ఒక యుగాన్ని శాసించబోయే కవిని, ఆతని కవిత్వతత్వాన్ని గొప్పగా ఆవిష్కరిస్తాడు.

"కవిత్వంలోనూ జీవితంలోనూ, economy of words and thoughts లేకపోవటం దేశభక్తి కన్న హీనమైన పాపం, ఆత్మలోకంలో దివాలా" అన్న మాటలు జీవితానికి, కవిత్వానికి ప్రామాణిక సూత్రాలే. ఇక్కడ చలం దేశభక్తి అంటున్నది, హిపోక్రిసీతో ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే కుహనా రాజకీయనాయకుల గురించేనని వేరే చెప్పుకోనక్కరలేదు. విషయం లేకుండా చెప్పిందే చెప్పుకుంటూ పోయే గాఢత లోపించే కవిత్వం గురించీను.

తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వమంటాడు చెలం. కవి తన సమాజంలో ఉన్న విషయాలను, తన అనుభవాలను కలగలిపి కవిత్వాన్ని సృష్టిస్తాడు. దాన్నే యుద్దారావమని చలం, పురిటినొప్పులని శ్రీశ్రీ అన్నారు. ఇదేమాట చలం సాహిత్యానికి కూడా వర్తిస్తుంది.

కృష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే, శ్రీశ్రీ అందరిబాధనూ తనలో పలికిస్తాడు.
కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ.

అప్పటి ప్రముఖ కవి అయిన కృష్ణ శాస్త్రికి శ్రీశ్రీకి ఉన్న ప్రధానమైన వ్యత్యాసాన్ని చాలా చిన్న చిన్న మాటలలో చలం చెప్పిన వాక్యాలు వారి కవిత్వతత్వాన్ని బహు లాఘవంగా ఇముడ్చుకొన్నాయనే అనుకోవచ్చు. వాక్యాలు తెలుగు సాహిత్యరంగంలో వారి సాహిత్యాలకు నిర్వచనాలవలె నిలచిపోయాయి.


సొంత ఇల్లూ, అణగారిన భార్య, ప్రతి సంవత్సరం పై క్లాసులోకి వెళ్ళే కొడుకూ, bank-account, వొట్టిపోని ఆవుతో తృప్తిపడే సంసారుల శాంత హృదయాలమీదినుంచి యీ గీతాల్లోని ఉద్రేక ఉత్సాహాలు విశాఖ పట్నం సముద్రంలో నల్లరాళ్ళ మీద అలలు విఫలమైనట్లు దొర్లిపోతాయి. తాంబూలం వేసుకుంటో, పుస్తకాన్ని ముడిచిపెట్టి "దేనికోసం? ఎందుకు? ఏమిటి కావాలంటాడు? ఏమిటి వేదన పాపం?" అని కొంచెం ఆలోచిస్తారేమో!

మధ్యతరగతి ప్రజల నిర్లిప్తత, మార్పును స్వీకరించలేనితనం పై చలం సంధించిన వ్యంగ్యాస్త్రాలు ఇవి. చలానికి ఇలాంటివారిపై అవకాసమొచ్చినప్పుడల్లా విసుర్లు విసురుతూనే ఉన్నాడు. చలాన్ని, చలం సాహిత్యాన్ని అర్ధంచేసుకోలేక అదంతా బూతంటూ ప్రచారం చేసి, చలాన్ని తెలుగునేలపై నిలువనీయకుండా తరిమేసిన వర్గమది మరి. అందుకనే బహుసా సందర్భం కుదిరినప్పుడల్లా వారి వైఖరికి వ్యతిరేకంగా, చలం తనగళాన్ని వినిపిస్తూనే సాగాడు

శ్రీశ్రీ కవిత్వాన్ని analyse చేసి, ముక్కల కింద ఎత్తి చూపి, కవీ, మనిషీ, శైలీ, బాల్యం, కవిత్వం, ఛందస్సు, ఎదిరింపు, కొత్తపోకడలు, పాత influences అంటో వాటి శ్రేష్టత్వాన్ని explain చెయ్యడానికి చెలానికి అధికారమూ, అర్హతా లేవు. చెలానికి విమర్శే చాతనైతే కొత్త వ్రాతల్ని పాత పత్రికల్లో చీల్చి, చెండాడి గొప్పతనం లేదని నిరూపించి, ఘనత సంపాయించి, సంవత్సరానికోసారి నిండు భోజనాలు చేసే ఒక డజన్ సారస్వత, కళా, నాటక, నృత్య, గాన సినిమా పరిషత్తులలో సభ్యత్వం, ఏమో అదృష్టం అపూర్వంగా కలసివస్తే జాయింటు సెక్రటరీ కూడా సంపాయించేవాడు కాడా

పై వాక్యాలు శ్రీశ్రీ కవిత్వం కన్నా చలం తత్వాన్ని మనకు చెపుతూంటాయి. నిజమే మరి చలం అలా చేయకపోవటం వలననే ఈనాటికీ స్మరణీయుడయ్యాడేమో! ఎంతమంది విమర్శకులు కాలగర్భంలో కలసిపోలేదు. కనీసం వారి పేర్లు కూడా తరానికి తెలీకుండా.

శ్రీశ్రీ పుస్తకం కొని తీరికగా చదవండి, పద్యం పదిసార్లు చదవండి, ఏమీ అర్థం కాలేదా - యువకుడికో, భిక్షుకుడికో, death-bed present గా పంపండి. పారెయ్యకండి. అంతకన్నా దాచుకోకండి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి మీ చేతులో పుస్తకం.

చిన్నినాబొజ్జకు శ్రీరామరక్ష అనుకొంటూ, గిరిగీసుకొని జీవించేవారికి, మహాప్రస్థాన గేయాలు పెద్దగా రుచించవు, సమాజంపట్ల ఇంకా నిశ్చితాభిప్రాయాలను ఏర్పరచుకోని యువకునికిచ్చినట్లయితే పుస్తక ప్రయోజనం నెరవేరుతుందని చెప్పటం శ్రీశ్రీ కవితోద్దేశ్యాన్ని పరోక్షంగా చెప్పటమే.

తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి గా శ్రీశ్రీ కవిత్వాన్ని ఆనాడే అంచనా వేయటం, చలం ద్రష్ట అనటానికి ఉదాహరణ. అలానే శతాబ్ధం శ్రీశ్రీది అని చెప్పగలిగేస్థాయిలో కవిత్వం తదనంతరం పేరుతెచ్చుకోవటం గమనార్హం.


కొద్దిరోజుల్లో నేడు విర్రవీగే కవులు ప్రతి ఒక్కరూ శ్రీశ్రీ నీడ కింద నించుని తమ ఉనికిని సమర్థించుకో వలసిన గతి వస్తుంది.

శ్రీశ్రీ కవిత్వం ప్రారంభరోజుల్లో చలం వ్రాసిన వాక్యాలు తరువాతకాలంలో అక్షరసత్యాలైనాయి. నలభైలనుంచి ఎనభైలవరకూ ప్రతీకొత్త కవి శ్రీశ్రీని అనుకరించాలని ప్రయత్నించినవారే. చాలామంది తుఫానులో కొట్టుకుపోయారు లేదా శ్రీశ్రీ గొడుగుక్రింద తలదాచుకొన్నారు. ఈనాటివరకూ కూడా తెలుగు సాహిత్యంలోవచ్చిన నూతన ప్రక్రియలుగా పిలవబడేవాటికి శ్రీశ్రీ ఆనాడే తన కవితలలో బీజం వేసాడన్నది ఒక విస్మయం గొలిపే విషయం. ఉదా: మినీకవిత్వం, మాండలికంలో కవిత్వం వ్రాయటం వంటివి.

ఎవరినించి దొంగిలించామో వాళ్ళని క్షమించడం కష్టం.

అని చలం వ్రాసిన వాక్యం పై డబ్బ్దైలలో రగడజరిగింది. రుధిరజ్వాల వ్రాసిన నారాయణబాబు కవిత్వాన్ని శ్రీశ్రీ అనుకరించాడని దానిని పై వాక్యం సమర్ధిస్తుందనీ వాదోపవాదనలు జరిగాయి. నారాయణ బాబుకు శ్రీశ్రీ కి ఉన్న వైషమ్యాలు కూడా వాదనకు బలాన్నిచ్చాయి.
నారాయణ బాబు మంచికవి. కానీ శ్రీశ్రీలా ఆయన అప్రతిహతంగా తన సాహితీయానాన్ని కొనసాగించలేకపోవటం వల్ల అతనికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఇద్దరినీ పోల్చినప్పుడు, నారాయణబాబుకన్నా శ్రీశ్రీ చాలా ముందు ఉంటాడు. వివాదాన్ని అప్పట్లో రేపింది ఆరుద్ర, సోమసుందర్ వంటి ప్రముఖులు. దానివెనుకకూడా అనేక రాజకీయ కారణాలుండవొచ్చు.

మెరీనాలో గాలిలో ఊగే (రేడియోలేని రోజులవి) flower-bed పుష్పశయ్య కేసి చూస్తున్న నన్ను చూచి, " పువ్వులు పాడు పువ్వులు: ఎక్కడ చూసినా రోడ్డు ప్రక్కన అంతా పువ్వులే" అని నన్ను నిందిస్తున్న మిత్రుడికి ఏం జవాబు చెప్పగలిగాను.
"ఏమిటి వంతెన మీద నుంచుని చూస్తున్నావు?"
"సంధ్య కేసి"
"ఎవరు ఆమె?"
అంటే ఏం మాట్లాడగలిగాను?

ప్రజల్లో ఉండే అరాసిక్యం గురించి చలం చెప్పిన పై మాటలలోని వ్యంగ్యం, ఆలోచనల్లో తగ్గిపోతున్న సున్నితత్వాన్ని ఎత్తిచూపుతుంది. ఇది కాలానికి మరింతబలపడిందనే అనుకోవాలి. బహుసా చలాన్ని అర్ధం చేసుకోవటంలో చాలామంది ఇక్కడే విఫలమయ్యారనిపిస్తుంది.

శ్రీశ్రీ ఎందుకు నచ్చుతాడు?
ఇంకా రాత్రి చీకట్లో, లోకం నిద్రలో భయంకర స్వప్నాలు కంటో, దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతమిచ్చే వైతాళికుడు శ్రీశ్రీ!

పై వాక్యాలు శ్రీశ్రీ కవితాత్మను చక్కగా ఇముడ్చుకొంటాయి. నిరాశను, విరహాల్ని గానం చేసే భావకవిత్వానికీ, కొత్తనెత్తురును ప్రవహింపచేసే శ్రీశ్రీ కవిత్వానికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం అదే. అందుకనే శ్రీశ్రీ చలానికి నచ్చుతాడు. ఎంత మేన్ ఆఫ్ లిటిల్ ఫైత్ అయినప్పటికీ.

అరుగో మూల పాతగోరీల కేసి మొహాలు తిప్పుకొని నగిషీలు చెక్కుతున్నారు -పాత పదాలకీ, ఊహలకీ చిత్రికలు పట్టి- ప్రేయసి మెల్లకన్నుల మీద పద్యాలు అల్లుతున్నారు -రామాయణాలూ, శర్మిష్ఠలూ వృద్ధ మునులు వ్రాసి అర్పిస్తున్నారు, "భారతి" కి నైవేద్యంగా.
వాళ్ళలో చేరండి. వాళ్ళ ధైర్యవచనాలను విని మళ్ళీ నిద్రపొండి.

అంటూ ఇంకా పాతపదాలు, వర్ణనలు, అలంకారాలు, ఛందస్సు, ఉపమానాలు, ఆచారాలను పట్టుకొని వేళ్లాడే కవులను,వారి శిష్య పరంపరను, చలం ఎద్దేవా చేస్తున్నాడు. (మరో ఆశక్తికరమైన విషయం ఏమిటంటే అప్పటికింకా రామాయణ కల్పవృక్షం వ్రాయలేదు). భారతి అప్పట్లో వెలువడే సాహిత్య మాసపత్రిక. ఎనభైలలో అది నిలచిపోయింది. భారతిలో అచ్చయిందంటే అలాంటి కవిత్వానికి ఒక ప్రామాణికత, కవికో గుర్తింపు ఉండేదట. వారిని విమర్సించటం ద్వారా, శ్రీశ్రీ కవిత్వం యొక్క గొప్పతనాన్ని, నవ్యతను, అది తీసుకురాబోయే విప్లవాన్ని అన్యాపదేశంగా చలం చెప్పాడనిపిస్తుంది.

శ్రీశ్రీ కవిత్వాన్ని ఇష్టపడని వారిని సోమరులు, వృద్దులు, ఛావ లేనివారు, చాందసులు అంటూ ప్రకటించటం ఒకరకంగా పుస్తకం ఎవరికైతే చేరాలో వారికి చేర్చటానికి పన్నిన వ్యూహం లా అనిపిస్తుంది. ఆవిషయంలో చలం నూరుశాతం సఫలమయ్యాడు. ఎందుకంటే అప్పుడు పుస్తకాన్ని హృదయానికెత్తుకొన్న యువకులు, దానిపట్ల తమ నిబద్దతను చివరివరకూ కొనసాగించారనే భావించవచ్చు.
అదే క్రమంలో అప్పటి భావకవిత్వంపైనా, సాంప్రదాయ రచనలపైనా చలం సంధించిన విమర్శనాస్త్రాలు కూడా.

చలం వ్రాసిన యోగ్యతాపత్రంలో, దైవదూషణ, పూర్వకవులపై నిందలు, సొంతగొడవలు, వెటకారాలు, కృష్ణశాస్త్రి కవిత్వంపై విసుర్లు తప్ప శ్రీశ్రీ కవిత్వం గురించి ఉన్నది తక్కువేనన్న విమర్శలు ఉన్నాయి. బహుసా అలాంటి విమర్శను ముందే ఊహించి "ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు పేజీలు తిప్పేసుకోవచ్చని" ముందే చెప్పుకొంటాడు చలం.

తెలుగు సాహిత్యంలో మహాప్రస్థానం ఉన్నంతకాలమూ యోగ్యతాపత్రం కూడా ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహంలేదు.

బొల్లోజు బాబా

లింకులో చలం యోగ్యతాపత్రాన్ని చదువుకొనవచ్చును




Saturday, May 30, 2009

ప్రారంభం (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

"నేనెక్కడి నుండి వచ్చాను? నేను నీకు ఎక్కడ దొరికానూ?" పాపాయి అమ్మనడిగింది.
పాపాయిని గుండెలకదుముకొని
" నీవు నా హృదయంలో దాని వాంఛై ఉండినావు చిన్నారీ"
నవ్వుతూ, కనులనీరు నించుకుంటో అమ్మ బదులిచ్చింది.

నీవు నా బాల్యపు ఆటలలో బొమ్మవై ఉండే దానవు.
ప్రతి ఉదయమూ నా దేవుని ప్రతి రూపాన్ని మట్టితో చేసే దానిని.
అపుడే నిన్ను కూడా తయారు చేసి చేజార్చుకొనే దానిని.
మా కులదైవంతో సమానంగా నీకు కొలువుండేది.
ఆతని పూజలో నిను సేవించే దానిని.
నా అన్ని ఆశలలో, ప్రేమలలో, జీవితంలో, నా తల్లి జీవితంలో నీవు సంచరించావు.
మా ఇంటిని పాలించే అమృతమూర్తి ఒడిలో నీవు అనాదిగా సాకబడుతున్నావు.
కౌమార్యంలో నాహృదయం తన రేకలు విచ్చుకొన్నప్పుడు
నీవు దాని సుగంధానివై పరిమళించావు.
నీ సౌకుమార్యం నా యవ్వనాంగాలలో వేకువవెలుగులా వికసించింది.

స్వర్లోకపు ఆదిమ సఖి, ఉదయకాంతికి సహోదరివి అయిన నీవు
ఈ ప్రపంచ జీవన వాహినిపై తేలియాడ దిగివచ్చావు,
చివరకు నాహృదయానికి చిక్కావు.
నిన్నలా తేరిపార చూస్తే రహస్యమేదో ముంచెత్తుతుంది.
అందరకూ చెందిన నీవు నాకే సొంతమైనావు.
ఏ ఇంద్రజాలం నా దుర్భల చేతులలో
ఇంతటి భువనైక సౌందర్యాన్ని బంధించగలదు?

మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Beginning అనే గీతం

Sunday, May 24, 2009

స్వస్థానము (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

పిసినారి సాయింసంధ్య తన స్వర్ణ వర్ణాలను వెనక్కి తీసేసుకొంటున్నవేళ,
మైదానపు మార్గాన ఏకాకినై నేను సాగుతున్నాను.

పంటకోసిన పొలాలు బోసిపోయి, మౌనంగా పడిఉన్నాయి.
చీకటి లోలోతుల్లోకి, పగటి కాంతి మునిగిపోతోంది.

ఉన్నట్టుండి ఒక పిల్లగాని కీచు స్వరం గాలిలోకి లేచింది.
సాయింత్రపు నిశ్శబ్ధంలోకి తన పాట జాడను విడిచి
అగుపించని చీకట్లలోకి వాడు కనుమరుగయ్యాడు.

మైదానపు ఆవలి అంచున , చెరుకు తోటల కవతల కనిపిస్తున్న
పోక, పనస, కొబ్బరి చెట్ల నీడల మధ్య దాగొని ఉన్నదట వాని ఇల్లు.

తారల కాంతిలో సాగుతున్న నా ఏకాకి యానాన్ని ఒక క్షణం నిలిపి పరికించాను.
నల్లని నేల బాహువులు అక్కున చేర్చుకొన్న గృహ సముదాయం

కనిపించింది.
ఊయలలు, మంచాలు, సాయింత్రపు దీపాలు, మాతృహృదయాలు,
తమ విలువ తమకే తెలియని బ్రహ్మానందంతో నిండిన పసి హృదయాలతో
అది పరిమళిస్తోంది.

బొల్లోజు బాబా
మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Home. అనే గీతం