ఈ మాటలో మిత్రులు శ్రీ రాణి శివశంకర శర్మ గారు "భారతీయులకు హేతు చింతన ఉందా?" అనే పేరుతో ఒక వ్యాసం రాసారు. అది క్లుప్తంగా ఇలా ఉంది....
///హేతు చింతనను ఆధునికతకు పర్యాయంగా భావించినప్పటికీ, భారతీయ హేతు చింతన గురించి కమ్యూనిస్టులు, దళితవాదులు, హిందువాదులు వలసవాద ప్రభావంతో తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాసం వాదిస్తుంది. భారతీయ దృక్పథంలో చక్రీయ కాల భావన ప్రధానమని, శంకరాచార్యులు, బౌద్ధులు స్థల-కాలాలు మనోనిర్మితమని చెప్పారు, ఇది క్వాంటం ఫిజిక్స్తో సమానంగా ఉంది. వలసవాద ప్రభావంతో భారతీయ తాత్విక చింతనను మేధావులు, రోమిలా థాపర్ తో సహా తక్కువగా చూసారని అభియోగం మోపుతుంది. .....
దీనిపై రాసిన విమర్శను ఈమాట వెబ్ సైటులో తీసుకోవటం లేదు. కనుక ఇక్కడ ఒక పోస్టుగా పోస్ట్ చేస్తున్నాను.
నా వ్యాఖ్య ఇది.
.
భారతీయులు సుదూర గతంలో గొప్ప హేతుబుద్ధి కలిగి ఉండేవారు, దాన్ని క్రమేపీ కోల్పోయారు....ఈ వ్యాసం మొత్తం మీద ఇదొక్కటే సత్యపూర్వక వాక్యం.
సుదూరగతంలో చార్వాకులు బౌద్ధం రూపంలో గొప్ప హేతుబుద్ది కలిగి ఉండేవారు. క్రమేపీ ఆత్మ, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, మోక్షం, స్వర్గనరకాలు, పాపపుణ్యాలు లాంటి అభౌతిక అంశాలను- పండితులు తమ అధిపత్యానికి, ఉదరపోషకు- మతలక్షణాలుగా స్థిరీకరించి జనబాహుళ్యాన్ని నమ్మించారు.
1. చార్వాకులు ఇలా అన్నారని ఆధారాలేమిటి?
/////జీవసృష్టిలో చైతన్యం (Consciousness) కూడా ఇలాంటి భౌతిక మూలకాల (భూమి, నీరు, అగ్ని, వాయువు) సంయోగం వల్ల ఉద్భవిస్తుంది. తాంబూలం యొక్క ఎరుపు రంగు లేదా రుచి ఎలా ఒక స్వతంత్ర శక్తి లేకుండా సహజంగా ఏర్పడుతుందో, అదేవిధంగా చైతన్యం కూడా శరీరంలోని భౌతిక అవయవాల సంక్లిష్ట సంయోగం ఫలితంగా ఉత్పన్నమవుతుంది.////
---- ఆత్మ, చైతన్యం లాంటివాటిని చార్వాకులు ఖండించారు. ఇవన్నీ ఆ తరువాత పండితులు చేసిన చార్వాక వ్యాఖ్యానాలలోని వక్రీకరణలు. పై వాక్యాలను చార్వాకులవని నిరూపించే ఆధారాలు చూపండి. ఉదాహరణకు; యావజ్జీవేత్సుఖం జీవేదృణం కృత్వా ఘృతం పిబేత్ । భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః లాంటి చార్వాక వాక్యాలను చూపండి. ఎవరెవరో ఆ తరువాత చేసిన పండిత వ్యాఖ్యానాలు చూపొద్దు. ముఖ్యంగా తాంబూల దృష్టాంతం.
.
2. భారతీయ తత్వశాస్త్రం కాలం సైక్లికల్ అని చెబుతుంది. కానీ దానికి సంబంధించిన ఆధారాలను చూపదు. ఉదా. ఇది కలికాలం అనుకొంటే అంతకు ముందు జరిగిన కలికాలాన్ని ఉదాహరణగా చూపి వాదించాలి. అలా చెయ్యదు కనుక అది నిరూపణ కాదు. బిగ్ బేంగ్ కూడా ఒక బిందువు నుంచే ప్రారంభమౌతుంది. అయిన్ స్టీన్ రెలటివిటీ కాలాన్ని నాలుగవ డైమెన్శన్ అని లీనియర్ గానే చూపుతుంది. సైక్లికల్ గా కాదు.
కాలం సైక్లికల్ అని చెప్పటం కర్మ సిద్ధాంతంలాగే సంస్కరణను, అభివృద్ధిని నిరోధిస్తుంది. అంతా దైవేచ్ఛ అని ప్రకటించి స్వీయ సంకల్పాన్ని నిరుత్సాహ పరుస్తుంది. కాలం సైక్లిక్ అనే భావన అశాస్త్రీయమైనది. పురాణ కల్పితమైనది. మానవాభివ్రుద్ధికి దోహదపడదు. ఇది పండితులు సమాజంపై చేసిన సామాజిక ప్రభావం. దీనిద్వారా వారి ఆధిపత్యాన్ని స్థిరపరచుకున్నారు.
కాలం చక్రీయమని చెప్పటానికి 60 సంవత్సరాలకు పేర్లు పెట్టి అవి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కదా అని చెప్పటం కురచ వాదన. నేటి కలియుగం అనేది రెండో సారో మూడో సారో ముప్పయ్యోసారో అని చెప్పి ఋజువులు చూపాలి.
.
3. కర్మ మరియు పునర్జన్మ సిద్ధాంతాలు బౌద్ధమతానికి పూర్వం నుండి ఉన్నాయి. ముఖ్యంగా జైనానికి చెందినవి ఇవి. వైదికంలో కూడా ఛాందోగ్య ఉపనిషత్ 5.10.7 శ్లోకంలో పునర్జన్మ భావన కనిపిస్తుంది.
జైనం కర్మను ఆత్మపై అంటుకునే భౌతిక కణాలుగా వర్ణిస్తుంది.
బౌద్ధం వీటిని అనాత్మావాదం కోణంలోంచి రీడిఫైన్ చేసింది. అంతే తప్ప కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను బౌద్ధం ప్రతిపాదించలేదు. జైన హైందవాలు చెప్పిన అర్థంలో కూడా చెప్పలేదు. వాటిని బౌద్ధానికి ఆపాదించటం ఈ వ్యాసం చేస్తున్న వక్రీకరణ.
కర్మ, పునర్జన్మ వైదికమైనవి. వాటివల్లే నేటి కులవ్యవస్థ ఏర్పడింది. (ఛాందోగ్య ఉపనిషత్ 5.10.7 శ్లోకం-- ఈ లోకంలో మంచి కర్మలు చేసిన వారు బ్రాహ్మణ, క్షత్రియ లేదా వైశ్యులుగా జన్మిస్తారు. కాని చెడు కర్మలు చేసిన వారు కుక్క, పంది లేదా చండాలులుగా జన్మిస్తారు అని అర్థం).
కులవ్యవస్థకు మూలం వైదికంలో ఉండగా బౌద్ధం కారణమనటం అతితెలివి కుటిలపండిత వ్యాఖ్యానం.
చార్వాక దర్శనం కర్మ మరియు పునర్జన్మ సిద్ధాంతాలను అనుభవసిద్ధ ఆధారాలు లేని ఊహాగానాలుగా తిరస్కరించింది.
.
4. బౌద్ధాన్ని నాశనం చేసి, మనుధర్మానికి, బ్రాహ్మణ ఆధిపత్యానికి శంకరాచార్యుడు దోహదపడినట్లు ఒక అభిప్రాయం కలదు. అందుకే నేటికీ పండితులు పల్లకీలు ఎత్తుతారు.
"శ్రవణాథ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ........." అనే బ్రహ్మసూత్రానికి శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో శూద్రునికి వేదాలు వినడం నిషిద్ధమని, ఒకవేళ వింటే అతని చెవుల్లో సీసం కరిగించి పోయాలని, వేదాలు పలికితే నాలుక కొసివేయాలని అంటూ అనేక ఉపపత్తులు ఇస్తాడు.....
ఇతనొక హెచ్చుతగ్గుల మనుధర్మ సమర్ధకుడు. ఇతనిని సమర్ధిస్తూ మాట్లాడే వారిని, ఉటంకించే వారిని సమకాలీనంగా అందరూ సమానం అని చెప్పే రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న వారిగా భావించాల్సి ఉంటుంది.
బ్రహ్మసూత్రకు శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో 9 అప శూద్రాధికరణం 34-38 లలో శూద్రునికి ఉపనయన సంస్కారం లేదు కనుక వేదాధ్యయనం లేదు. వేదాధ్యయనం లేదు కనుక బ్రహ్మ విద్యాధికారం లేదు అని స్పష్టంగా శూద్రులు విద్యనేర్చుకోవటానికి అర్హులు కారని ప్రకటించిన వ్యక్తి...... ఇతనినా! మనం ప్రామాణికంగా తీసుకోవలసింది. ఇంకా అతని భావాలు గొప్పవి, ఐన్ స్టీన్ తో సమానవైన భావాలు అవి అని ప్రకటించే వ్యక్తులవి ఎంత మలిన ఆలోచనలు
శంకరుని భావజాలం బౌద్ధుల భావజాలానికి దగ్గరగా ఉంది అని చెప్పటం కూడా అనాదిగా పండితులు చేస్తున్న ప్రభావమే. బౌద్ధులేనాడూ పైన శంకరుడు చెప్పినట్లు ప్రజలను విభజించలేదు. అందరూ సమానమే అన్నారు. బౌద్ధులను నిర్మూలించాడన్న అపప్రధను తొలగించటానికి శంకరుడే ప్రచ్ఛన్న బౌద్ధుడని ప్రచారం జరిగి ఉంటుంది.
5. భారతీయ తాత్విక చింతనలలో చార్వాకం తప్ప మరేదీ ఆధునిక హేతుచింతన/ సైన్స్ తో సరితూగలేదు. మిగిలినవి అన్నీ సామాజికంగా ప్రజలను ఆలోచనారహిత, క్రియారహిత జఢులుగా తీర్చిదిద్దిన తాత్వికతలే. ఇవేవీ ఆధునిక సైన్స్ పరిధిలోకి రానట్టె, ప్రాచీన తాత్విక చింతనలు కూడా రావు. క్వాంటం ఫిజిక్స్ ను అవి ప్రతిబింబిస్తాయి అని చెప్పటం.... అన్నీ వేదాలలో ఉన్నాయిష అని ఒక్కాణించటమే.
చార్వాకులు చెప్పిన శాస్త్రీయ సత్యాలు
అ. చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణమును మాత్రమే అంగీకరించారు. ఇంద్రియములకు అందని వాటిని అంగీకరించలేదు.చార్వాకమతం. ధర్మాధర్మములు, పాపపుణ్యములు, దేవుడు, జన్మాంతర విషయాలు లాంటివి అభౌతికాలు, ఇంద్రియగోచరములు కావు కనుక వాటిని చార్వాకులు అంగీకరించలేదు. .....
...... సైన్సు కూడా అంతే ప్రత్యక్షప్రమాణాన్నే అంగీకరిస్తుంది.
ఆ. చైతన్యం భౌతికమైనది. దేహంలో ఉండే చైతన్యమే ఆత్మ. వేరుగా ఆత్మలేదు.
ఇ. దేవుడు లేడు, స్వర్గనరకాలు లేవు. మరణానంతర జీవితం లేదు. దేహంలోంచి ప్రాణం పోవటమే మోక్షం. కనుక మోక్షం కొరకు ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు తపస్సులు చెయ్యక్కరలేదు. జీవించినంతకాలమే ఆనందించగలం. చావుతరువాత ఏమీ లేదు.
ఈ. వేదాలు, ఆగమ శాస్త్రాలు వంటి ఏ మతగ్రంథాలనైనా జ్ఞాన హేతువులుగా భావించరాదు. వేదాలను రచించినవారు విదూషకులు, మోసగాళ్ళు, రాక్షసులు.
ఉ. ఇంకా నిరూపించాల్సి ఉన్న అంశాలైన ఆత్మ, దేవుడు, మరో జన్మ, స్వర్గనరకాలువంటి వాటి ద్వారా నిష్కపట మనస్కులు ఏ కొత్త జ్ఞానాన్ని పొందలేరు
.
6. ఎవరి విశ్వాసాలను వారికి పరిమితం చేసుకోవటం విజ్ఞత. అది ఎవరికీ అభ్యంతరం కాదు. అలాకాక మా విశ్వాసాలలో ఐన్ స్టీన్ సిద్ధాంతాలు, అణుబాంబు తయారీ, పుష్పక విమానాల తయారీ, కాస్మాలజీ, క్వాంటం థీరి లాంటివి ఉన్నాయి అని మాట్లాడటం అశాస్త్రీయమని గుర్తించాలి. ఏవీ చూపించు అని ప్రశ్నిస్తారన్న ఎరుక ఉండాలి.
ఏనాటికైనా భారతీయ తాత్విక చింతనలలో చార్వాక దర్శనమే శాస్త్రీయంగా నిలబడగలిగేది. కానీ దీనిని ప్రచారంలోకి తెస్తే ఆత్మ, దేవుడు, స్వర్గనరకాలు, పాపం, పుణ్యం, మోక్షం, పూజలు, వ్రతాలు అంటూ కొందరికి ఆధిపత్యాన్ని, జీవనోపాధిని ఇచ్చే ప్రపంచం మొత్తం కుప్పకూలుతుంది.
అందుకని చార్వాకులను వెనక్కితోసి, మిమాంస, అద్వైతం, ద్వైతం, వేదాలు, ఉపనిషత్తులు, సూక్తాలు, షట్దర్శనాలు అంటూ మనిషిని, తార్కికతను వదిలి చేసే మాయాపూరిత విశ్లేషణలను, కొందరు ముందుకు తెచ్చి శతాబ్దాలుగా చేసిన అనాది మోసమే ఈ వ్యాసంలోనూ కనిపించింది.
బొల్లోజు బాబా
(పై వ్యాసం ఒక వాదనకు ప్రతివాదనగా అకడెమిక్ ఇంటరెస్ట్ తో చేసినది తప్ప ఆ వ్యాసరచయితను అఫెండ్ చేయటానికి కాదు)