Tuesday, May 20, 2025

భర్తపోయిన స్త్రీలకు గాజులు, బొట్టు తియ్యమని ఏ శాస్త్రాలలో ఉంది?

భర్తపోయిన స్త్రీలకు గాజులు, బొట్టు తియ్యమని ఏ శాస్త్రాలలో ఉంది అని ఢంకాభజాయించి మరీ ప్రశ్నిస్తున్నారు ఈవిడ. (see video link in comment).
 
వీళ్ళు తెలియక ఇలా మాట్లాడుతున్నారని అనుకోను. హిందూ ధర్మంలో ఎలాంటి దురాచారాలు లేవు అని బుకాయించటం నేడు ఫాషన్. 

యజ్ఞాలలో మాంస, మద్యసేవనాలని కందమూలాల సేవనంగా గీతా ప్రెస్ ఇటీవలి ప్రచురణలలో క్రమేపీ మార్చుకొంటూ వస్తూంది.
 
గొప్ప సమానత్వం వెల్లివిరిసిన సమాజంలోకి కులాలను బ్రిటిష్ వారు తీసుకొచ్చారట.
 
స్త్రీని గౌరవించిన ఒకే ఒక ధర్మం మనది అట.
 
సతీసహగమనం ఎన్నడూ జరగనే లేదట అలా జరిగింది అనటం బ్రిటిష్ వారి అతిశయోక్తులట.
బ్రిటిష్ వారు ధర్మశాస్త్రాలను, వేదాలను వక్రీకరించి అనువదించారట. వాటిపై ఆధారపడిన డా. అంబేద్కర్ తెలియక హిందూమతాన్ని విమర్శించారట.
 
ఒకటా రెండా.... నేడు ఏవైతే రాజ్యాంగ విరుద్దమో అవన్నీ కల్పితాలు అంటూ మాట్లాడుతున్నారు. అబద్దాలతో ప్రజల్ని ఊదరకొడుతున్నారు.

ఎంతకాలం ఇలా అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలని మోసగిస్తారు వీళ్ళు. 

ఒకె .... సరే....జరిగిందేదో జరిగిపోయింది... కాలానుగుణంగా ఈ ఈ దురాచారాలను రద్దుచేస్తున్నాం అని ఒక లిస్ట్ ఇచ్చి, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం అని పీఠాధిపతులు, ఇలాంటి ప్రవచనకారులు ప్రకటించి ముందుకు వెళితే మన మతానికి ఎంతగౌరవంగా ఉంటుంది? కానీ చెయ్యరు ఎందుకంటే అప్పుడు వీళ్ళనెవరూ వినరు, చూడరు కనుక. ధర్మం పేరుతో మూఢత్వాలను ప్రచారం చేసినప్పుడే, పరిహారాలంటూ వీరికి చేతినిండాపని, మనుగడ ఉంటుంది.
 
ఇదిగో ఈ వీడియోలో వృద్ధపతివ్రతలు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారో గమనించండి. వీళ్ళే పెద్దముత్తైదువులపాత్రలో భర్త పోయిన ఎందరి అభాగ్యునుల గాజులు బద్దలు కొట్టి ఉంటారో, నా కైతే అనుమానం లేదు. పోనీ కనీసం అలాంటి తంతులను చూసి ఉండరా? వేదికపై మాత్రం గొప్ప సుద్దులు చెబుతున్నారు. సిగ్గులేకుండా. ఈ ఆచారాలు మధ్యలో ఎలా వచ్చాసాయో వచ్చేసాయండి అంటున్నారావిడ. ఇంకా నయం. బ్రిటిష్ వారు తీసుకొచ్చారు అనలేదు. సంతోషం.
 
ఇక ఈ వీడియోలో ఆవిడ ప్రశ్నించినట్లు – వైధవ్యం పొందిన స్త్రీ బొట్టు, కాటుక గురించే కాదు, ఇంకా చాలా దుర్మార్గమైన విషయాలు శాస్త్రాలలో పండితులు చెప్పారు.
 
భర్తచనిపోయిన స్త్రీకి రెండేగతులు. ఒకటి సతీసహగమనం. రెండవది ఈ క్రింది నియమాలతో వైధవ్యాన్ని పాటించటం.
 
1. శీలమును కాపాడుకోవలెను. శీలమును కోల్పోయినచో స్వర్గములోని భర్త పితృ, సోదరులు నరకములోకి పంపబడెదరు.

2. జుట్టు ముడివేసినచో పైలోకములోని భర్తకు బంధనమగును కనుక గుండుకొట్టించుకోలెను
3. రోజుకి ఒకపూటమాత్రమే భుజించాలి

4. ఉపవాసాలుండాలి

5. మంచంపై పడుకోరాదు, నేలపై నిద్రించాలి.

6. నలుగుపెట్టుకొని తలనీళ్ళుపోసుకోకూడదు

7. సుగంధద్రవ్యములు, పన్నీరు, పైపూతలు, ఆభరణాలు, చందనాదులు లాంటి భోగములపట్ల ఆసక్తి కూడదు .

8. ఎడ్లబండిపై ఎక్కకూడదు

9. జాకెట్టు, రంగుచీరలు ధరించకూడదు.

10.తాంబూలము, కంచుపాత్రలో భోజనము నిషేదం

11. పుత్రుడు లేని విధవ స్త్రీ ప్రతిరోజు భర్తకు తిలోదకములచే తర్పణములు ఇవ్వాలి.

12. పరపురుషుల పేర్లు ఉచ్చరించరాదు.
 
వైధవ్యం పొందినవారికి సనాతన ధర్మం vidhavadharmah అనే పేరుతో అనేక ఆంక్షలు విధించింది. ఇవన్నీ సతీసహగమనానికి ప్రత్యామ్న్యాయంగా చెప్పి, అదేదో గొప్ప మానవత్వం నిండిన ఔదార్యప్రకటనగా భావించి ఉంటారు శాస్త్రకారులు. పండితులు రాసిన ఈ దుర్మార్గమైన చట్టాల వలన వైధవ్యం పొందిన హిందూ స్త్రీలు నేటికీ సున్నితమైన, చెప్పుకోలేని వివక్షకు గురవుతూండటం గమనించవచ్చు.

బుకాయించినంతమాత్రానా సనాతన చరిత్ర చిరిగిపోదు.
 
బొల్లోజు బాబా

Friday, May 16, 2025

ప్రాచీనగాథలు పరిచయం



ఆత్మీయమైన పలుకులకు దేవదానం రాజుగారికి సదా కృతజ్ఞుడను. వీరి పరిశీలనలు విలువైనవి. శిరోధార్యమైనవి....

థాంక్యూ అనేది చిన్నమాట.....
బొల్లోజు బాబా
....
ప్రాచీన గాథలు కొత్తగా
 
కొన్ని విషయాలు రాయానంటే శోధించాలి. శోధించిన దానికి ప్రామాణికత సంతరించేలా పరిశ్రమించాలి. చరిత్ర లోకి తొంగి చూసి రాయగలగడం ఒక విద్య. ఏమాత్రం తేడా ఉంటే చుట్టూరా ఉన్న వేల కళ్ళకు జవాబు చెప్పుకోవాలి. అంటే సంయమనం కోల్పోకూడదు. ఒక పక్క వాలకూడదు. నిరపేక్షంగా ఉండాలి. పక్కన వేయి కళ్ళు చూస్తుంటాయి. అవెప్పుడూ రంధ్రాన్వేషణకు ప్రయత్నిస్తాయి. మానసికంగా మనల్ని దెబ్బతీస్తాయి. చేసే పనిని చిత్తశుద్ధితో చేసినా మన రాతల్ని అనుమానిస్తారు. నేను చెప్పదలచిన విషయం ఇది కాదు. ఉపోద్ఘాతంగా మొదలెట్టానంతే. చాలా కాలంగా ‘ప్రాచీన గాథలు’ చదివే పుస్తకాల గుట్టలోంచి పలకరిస్తూనే ఉంది. చెప్పాలంటే గత కొద్ది కాలంగా బొల్లోజు బాబా వెలువరిస్తున్న వ్యాసాలు ముఖ్యంగా నాకు తెలీని లోకంలోకి విహరింప చేస్తున్నాయి. పాత దారుల్ని వెతికి కొత్తగా పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
 
మానవానుభవాలు కాలం వెంట తరలి వస్తూనే ఉంటాయి. అనుభూతుల్ని అనుభవాల్ని ఉద్వేగాల్ని ఒకనాటి సామాజిక చిత్రాల్ని శతాబ్దాల క్రితం జీవితాల్ని ప్రతిబింబించినపుడు విస్మయం కలుగుతుంది. ఇవన్నీ సామాన్యుల జీవితాల్ని నమోదు చేసిన గాధలే . మొదటిసారి చదివినపుడు వీటిలో కొన్నింటిని ‘కథలు’ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది.
 
ఆ వృద్ధురాలి కడుపు / తామరాకులా ముడుతలు పడిఉంది /ఆమె దుర్బల భుజాలపై నరాలు పైకి తేలాయి /ఆమె కొడుకు యుద్ధంలో ఓడిపోయి పారిపోయాడని /చాలామంది చెప్పిన మాటలు విని /‘అదే నిజమైతే అతనికి పాలు ఇచ్చిన ఈ రొమ్ములను / నేనే కోసి వేసుకుంటాను’ అని కోపంతో /కత్తి తీసుకుని యుద్ధరంగానికి బయలు దేరింది / అక్కడ ఛిద్రమైన కొడుకు మృతదేహాన్ని చూసి /అతనికి జన్మనిచ్చిన రోజు కంటే /ఎక్కువ సంతోషించింది. ఇదొక ప్రాచీన గాథ. దీన్ని నేటి సమాజానికి అనుగుణంగా కథ రాస్తానన్న మాట. అదేమిటో చివరి చెబుతానని మాత్రం అంటాను.
 
ఇంకోటి...
 
అతను /నన్ను పెండ్లాడినట్లు సాక్ష్యం తెమ్మంటే / ఎక్కడ్నించి తేను /అతనే సాక్షి /ఆ...గుర్తొచ్చింది / కందిజువ్వల్లాంటి సన్నని పొడవైన ఆకుపచ్చని కాళ్ళతో /ఏటి ఒడ్డున నిలుచున్న కొంగ ఒకటి /ఆ సమయంలో మమ్మల్నే తదేకంగా చూసింది. దీన్ని నేటి కథగా ఎలా రాయాలి? అదీ చెబుతాను.
 
ఊహకు హద్దులు లేవు కదా. బోలిడన్ని ఆలోచనలు గమ్మున వచ్చేస్తుంటాయి. వాటిని అదను చూసి పట్టుకుంటే ఎన్నో అక్షరాలు ఎన్నో పదాలు ఎన్నో వాక్యాలు...కాదంటారా?
మళ్ళీ ‘ప్రాచీన గాథలు’ చదవాలి. బొల్లోజు బాబా పరిశ్రమను గుర్తించాలి. తను చరిత్ర లోంచి మనుష్యుల్ని చూడటం మొదలెట్టి చాలా కాలం అయింది. కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలని కోరుకుంటున్నాను. మరో మాట చెప్పి ముగిస్తాను. ఇది విమర్శ కాదు. గమనింపు...అంతే. బొల్లోజు బాబా ఒకోసారి అనువదించి ఊరుకోకుండా కలగజేసుకుని తన అభిప్రాయాన్ని కూడా చెబుతాడు. అవి ఖచ్చితంగా ఇదే అన్నట్టు కాకుండా సంశయాత్మకంగా చెబుతుండడాన్ని గమనించాను. ‘బహుశా’ అంటూ చెప్పే వాటిని పాఠకుడు సీరియస్‌గా తీసుకుంటాడనుకోను`
 
--దాట్ల దేవదానం రాజు
 
ప్రా


 


చీన గాధలు కావాలంటే సంప్రదించండి...ఛాయ ప్రచురణలు
7093165151
https://www.amazon.in/dp/8198229310

 

Monday, May 5, 2025

ఒక కామెంటు......



ఈ మాటలో మిత్రులు శ్రీ రాణి శివశంకర శర్మ గారు "భారతీయులకు హేతు చింతన ఉందా?" అనే పేరుతో ఒక వ్యాసం రాసారు. అది క్లుప్తంగా ఇలా ఉంది....

///హేతు చింతనను ఆధునికతకు పర్యాయంగా భావించినప్పటికీ, భారతీయ హేతు చింతన గురించి కమ్యూనిస్టులు, దళితవాదులు, హిందువాదులు వలసవాద ప్రభావంతో తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాసం వాదిస్తుంది. భారతీయ దృక్పథంలో చక్రీయ కాల భావన ప్రధానమని, శంకరాచార్యులు, బౌద్ధులు స్థల-కాలాలు మనోనిర్మితమని చెప్పారు, ఇది క్వాంటం ఫిజిక్స్‌తో సమానంగా ఉంది. వలసవాద ప్రభావంతో భారతీయ తాత్విక చింతనను మేధావులు, రోమిలా థాపర్ తో సహా తక్కువగా చూసారని అభియోగం మోపుతుంది. .....
దీనిపై రాసిన విమర్శను ఈమాట వెబ్ సైటులో తీసుకోవటం లేదు. కనుక ఇక్కడ ఒక పోస్టుగా పోస్ట్ చేస్తున్నాను.

నా వ్యాఖ్య ఇది.
.
భారతీయులు సుదూర గతంలో గొప్ప హేతుబుద్ధి కలిగి ఉండేవారు, దాన్ని క్రమేపీ కోల్పోయారు....ఈ వ్యాసం మొత్తం మీద ఇదొక్కటే సత్యపూర్వక వాక్యం.
సుదూరగతంలో చార్వాకులు బౌద్ధం రూపంలో గొప్ప హేతుబుద్ది కలిగి ఉండేవారు. క్రమేపీ ఆత్మ, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, మోక్షం, స్వర్గనరకాలు, పాపపుణ్యాలు లాంటి అభౌతిక అంశాలను- పండితులు తమ అధిపత్యానికి, ఉదరపోషకు- మతలక్షణాలుగా స్థిరీకరించి జనబాహుళ్యాన్ని నమ్మించారు.
1. చార్వాకులు ఇలా అన్నారని ఆధారాలేమిటి?
/////జీవసృష్టిలో చైతన్యం (Consciousness) కూడా ఇలాంటి భౌతిక మూలకాల (భూమి, నీరు, అగ్ని, వాయువు) సంయోగం వల్ల ఉద్భవిస్తుంది. తాంబూలం యొక్క ఎరుపు రంగు లేదా రుచి ఎలా ఒక స్వతంత్ర శక్తి లేకుండా సహజంగా ఏర్పడుతుందో, అదేవిధంగా చైతన్యం కూడా శరీరంలోని భౌతిక అవయవాల సంక్లిష్ట సంయోగం ఫలితంగా ఉత్పన్నమవుతుంది.////
---- ఆత్మ, చైతన్యం లాంటివాటిని చార్వాకులు ఖండించారు. ఇవన్నీ ఆ తరువాత పండితులు చేసిన చార్వాక వ్యాఖ్యానాలలోని వక్రీకరణలు. పై వాక్యాలను చార్వాకులవని నిరూపించే ఆధారాలు చూపండి. ఉదాహరణకు; యావజ్జీవేత్సుఖం జీవేదృణం కృత్వా ఘృతం పిబేత్ । భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః లాంటి చార్వాక వాక్యాలను చూపండి. ఎవరెవరో ఆ తరువాత చేసిన పండిత వ్యాఖ్యానాలు చూపొద్దు. ముఖ్యంగా తాంబూల దృష్టాంతం.
.
2. భారతీయ తత్వశాస్త్రం కాలం సైక్లికల్ అని చెబుతుంది. కానీ దానికి సంబంధించిన ఆధారాలను చూపదు. ఉదా. ఇది కలికాలం అనుకొంటే అంతకు ముందు జరిగిన కలికాలాన్ని ఉదాహరణగా చూపి వాదించాలి. అలా చెయ్యదు కనుక అది నిరూపణ కాదు. బిగ్ బేంగ్ కూడా ఒక బిందువు నుంచే ప్రారంభమౌతుంది. అయిన్ స్టీన్ రెలటివిటీ కాలాన్ని నాలుగవ డైమెన్శన్ అని లీనియర్ గానే చూపుతుంది. సైక్లికల్ గా కాదు.
కాలం సైక్లికల్ అని చెప్పటం కర్మ సిద్ధాంతంలాగే సంస్కరణను, అభివృద్ధిని నిరోధిస్తుంది. అంతా దైవేచ్ఛ అని ప్రకటించి స్వీయ సంకల్పాన్ని నిరుత్సాహ పరుస్తుంది. కాలం సైక్లిక్ అనే భావన అశాస్త్రీయమైనది. పురాణ కల్పితమైనది. మానవాభివ్రుద్ధికి దోహదపడదు. ఇది పండితులు సమాజంపై చేసిన సామాజిక ప్రభావం. దీనిద్వారా వారి ఆధిపత్యాన్ని స్థిరపరచుకున్నారు.
కాలం చక్రీయమని చెప్పటానికి 60 సంవత్సరాలకు పేర్లు పెట్టి అవి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కదా అని చెప్పటం కురచ వాదన. నేటి కలియుగం అనేది రెండో సారో మూడో సారో ముప్పయ్యోసారో అని చెప్పి ఋజువులు చూపాలి.
.
3. కర్మ మరియు పునర్జన్మ సిద్ధాంతాలు బౌద్ధమతానికి పూర్వం నుండి ఉన్నాయి. ముఖ్యంగా జైనానికి చెందినవి ఇవి. వైదికంలో కూడా ​ఛాందోగ్య ఉపనిషత్ 5.10.7 శ్లోకంలో పునర్జన్మ భావన కనిపిస్తుంది.
జైనం కర్మను ఆత్మపై అంటుకునే భౌతిక కణాలుగా వర్ణిస్తుంది.
బౌద్ధం వీటిని అనాత్మావాదం కోణంలోంచి రీడిఫైన్ చేసింది. అంతే తప్ప కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను బౌద్ధం ప్రతిపాదించలేదు. జైన హైందవాలు చెప్పిన అర్థంలో కూడా చెప్పలేదు. వాటిని బౌద్ధానికి ఆపాదించటం ఈ వ్యాసం చేస్తున్న వక్రీకరణ.
కర్మ, పునర్జన్మ వైదికమైనవి. వాటివల్లే నేటి కులవ్యవస్థ ఏర్పడింది. (ఛాందోగ్య ఉపనిషత్ 5.10.7 శ్లోకం-- ఈ లోకంలో మంచి కర్మలు చేసిన వారు బ్రాహ్మణ, క్షత్రియ లేదా వైశ్యులుగా జన్మిస్తారు. కాని చెడు కర్మలు చేసిన వారు కుక్క, పంది లేదా చండాలులుగా జన్మిస్తారు అని అర్థం).
కులవ్యవస్థకు మూలం వైదికంలో ఉండగా బౌద్ధం కారణమనటం అతితెలివి కుటిలపండిత వ్యాఖ్యానం.
చార్వాక దర్శనం కర్మ మరియు పునర్జన్మ సిద్ధాంతాలను అనుభవసిద్ధ ఆధారాలు లేని ఊహాగానాలుగా తిరస్కరించింది.
.
4. బౌద్ధాన్ని నాశనం చేసి, మనుధర్మానికి, బ్రాహ్మణ ఆధిపత్యానికి శంకరాచార్యుడు దోహదపడినట్లు ఒక అభిప్రాయం కలదు. అందుకే నేటికీ పండితులు పల్లకీలు ఎత్తుతారు.
"శ్రవణాథ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ........." అనే బ్రహ్మసూత్రానికి శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో శూద్రునికి వేదాలు వినడం నిషిద్ధమని, ఒకవేళ వింటే అతని చెవుల్లో సీసం కరిగించి పోయాలని, వేదాలు పలికితే నాలుక కొసివేయాలని అంటూ అనేక ఉపపత్తులు ఇస్తాడు.....
ఇతనొక హెచ్చుతగ్గుల మనుధర్మ సమర్ధకుడు. ఇతనిని సమర్ధిస్తూ మాట్లాడే వారిని, ఉటంకించే వారిని సమకాలీనంగా అందరూ సమానం అని చెప్పే రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న వారిగా భావించాల్సి ఉంటుంది.
బ్రహ్మసూత్రకు శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో 9 అప శూద్రాధికరణం 34-38 లలో శూద్రునికి ఉపనయన సంస్కారం లేదు కనుక వేదాధ్యయనం లేదు. వేదాధ్యయనం లేదు కనుక బ్రహ్మ విద్యాధికారం లేదు అని స్పష్టంగా శూద్రులు విద్యనేర్చుకోవటానికి అర్హులు కారని ప్రకటించిన వ్యక్తి...... ఇతనినా! మనం ప్రామాణికంగా తీసుకోవలసింది. ఇంకా అతని భావాలు గొప్పవి, ఐన్ స్టీన్ తో సమానవైన భావాలు అవి అని ప్రకటించే వ్యక్తులవి ఎంత మలిన ఆలోచనలు
శంకరుని భావజాలం బౌద్ధుల భావజాలానికి దగ్గరగా ఉంది అని చెప్పటం కూడా అనాదిగా పండితులు చేస్తున్న ప్రభావమే. బౌద్ధులేనాడూ పైన శంకరుడు చెప్పినట్లు ప్రజలను విభజించలేదు. అందరూ సమానమే అన్నారు. బౌద్ధులను నిర్మూలించాడన్న అపప్రధను తొలగించటానికి శంకరుడే ప్రచ్ఛన్న బౌద్ధుడని ప్రచారం జరిగి ఉంటుంది.
5. భారతీయ తాత్విక చింతనలలో చార్వాకం తప్ప మరేదీ ఆధునిక హేతుచింతన/ సైన్స్ తో సరితూగలేదు. మిగిలినవి అన్నీ సామాజికంగా ప్రజలను ఆలోచనారహిత, క్రియారహిత జఢులుగా తీర్చిదిద్దిన తాత్వికతలే. ఇవేవీ ఆధునిక సైన్స్ పరిధిలోకి రానట్టె, ప్రాచీన తాత్విక చింతనలు కూడా రావు. క్వాంటం ఫిజిక్స్ ను అవి ప్రతిబింబిస్తాయి అని చెప్పటం.... అన్నీ వేదాలలో ఉన్నాయిష అని ఒక్కాణించటమే.
చార్వాకులు చెప్పిన శాస్త్రీయ సత్యాలు
అ. చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణమును మాత్రమే అంగీకరించారు. ఇంద్రియములకు అందని వాటిని అంగీకరించలేదు.చార్వాకమతం. ధర్మాధర్మములు, పాపపుణ్యములు, దేవుడు, జన్మాంతర విషయాలు లాంటివి అభౌతికాలు, ఇంద్రియగోచరములు కావు కనుక వాటిని చార్వాకులు అంగీకరించలేదు. .....
...... సైన్సు కూడా అంతే ప్రత్యక్షప్రమాణాన్నే అంగీకరిస్తుంది.
ఆ. చైతన్యం భౌతికమైనది. దేహంలో ఉండే చైతన్యమే ఆత్మ. వేరుగా ఆత్మలేదు.
ఇ. దేవుడు లేడు, స్వర్గనరకాలు లేవు. మరణానంతర జీవితం లేదు. దేహంలోంచి ప్రాణం పోవటమే మోక్షం. కనుక మోక్షం కొరకు ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు తపస్సులు చెయ్యక్కరలేదు. జీవించినంతకాలమే ఆనందించగలం. చావుతరువాత ఏమీ లేదు.
ఈ. వేదాలు, ఆగమ శాస్త్రాలు వంటి ఏ మతగ్రంథాలనైనా జ్ఞాన హేతువులుగా భావించరాదు. వేదాలను రచించినవారు విదూషకులు, మోసగాళ్ళు, రాక్షసులు.
ఉ. ఇంకా నిరూపించాల్సి ఉన్న అంశాలైన ఆత్మ, దేవుడు, మరో జన్మ, స్వర్గనరకాలువంటి వాటి ద్వారా నిష్కపట మనస్కులు ఏ కొత్త జ్ఞానాన్ని పొందలేరు
.
6. ఎవరి విశ్వాసాలను వారికి పరిమితం చేసుకోవటం విజ్ఞత. అది ఎవరికీ అభ్యంతరం కాదు. అలాకాక మా విశ్వాసాలలో ఐన్ స్టీన్ సిద్ధాంతాలు, అణుబాంబు తయారీ, పుష్పక విమానాల తయారీ, కాస్మాలజీ, క్వాంటం థీరి లాంటివి ఉన్నాయి అని మాట్లాడటం అశాస్త్రీయమని గుర్తించాలి. ఏవీ చూపించు అని ప్రశ్నిస్తారన్న ఎరుక ఉండాలి.
ఏనాటికైనా భారతీయ తాత్విక చింతనలలో చార్వాక దర్శనమే శాస్త్రీయంగా నిలబడగలిగేది. కానీ దీనిని ప్రచారంలోకి తెస్తే ఆత్మ, దేవుడు, స్వర్గనరకాలు, పాపం, పుణ్యం, మోక్షం, పూజలు, వ్రతాలు అంటూ కొందరికి ఆధిపత్యాన్ని, జీవనోపాధిని ఇచ్చే ప్రపంచం మొత్తం కుప్పకూలుతుంది.
అందుకని చార్వాకులను వెనక్కితోసి, మిమాంస, అద్వైతం, ద్వైతం, వేదాలు, ఉపనిషత్తులు, సూక్తాలు, షట్దర్శనాలు అంటూ మనిషిని, తార్కికతను వదిలి చేసే మాయాపూరిత విశ్లేషణలను, కొందరు ముందుకు తెచ్చి శతాబ్దాలుగా చేసిన అనాది మోసమే ఈ వ్యాసంలోనూ కనిపించింది.
బొల్లోజు బాబా
(పై వ్యాసం ఒక వాదనకు ప్రతివాదనగా అకడెమిక్ ఇంటరెస్ట్ తో చేసినది తప్ప ఆ వ్యాసరచయితను అఫెండ్ చేయటానికి కాదు)

Saturday, May 3, 2025

ఎవరు చొరబాటు దారులు?


భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇంట్రూడర్స్ (చొరబాటుదారులు) అంటూ ముస్లిమ్స్ ని హిందుత్వ వాదులు పదే పదే పేర్కొంటారు. సాక్షాత్తూ ‘పెద్దాయనే’---- “ప్రత్యర్ధులు ఎన్నికలలో నెగ్గితే ఈ ‘చొరబాటుదారులకు’ ప్రజల సంపదను పంచిపెడతారని, మీ మంగళసూత్రాలను కూడా వదలరని”--- పలకటం గమనార్హం. ఈ దేశంలో దాదాపు ఆరేడు శతాబ్దాలుగా జీవిస్తూ, ఇక్కడే పుట్టి ఇక్కడే మరణిస్తున్న సాటి మనిషిని ఈదేశానికి చొరబాటుదారుడు అని మాట్లాడటం మనచుట్టూ జరుగుతున్న కమ్యునల్ విభజన రాజకీయాలకు అద్దంపడుతుంది.
నిజానికి చారిత్రికంగా మధ్య ఆసియా స్టెప్పీ గడ్డి భూములనుంచి గుర్రాలపై గత 3000 సంవత్సరాలలో భారతదేశంలోకి మూడు దఫాలుగా ప్రవేశించిన చొరబాటుదారులు భారతీయసమాజాన్ని ప్రభావితం చేసారు. సనాతనులు ఆరేడు వందలేళ్ల క్రితం వచ్చిన ముస్లిమ్స్ గురించి మాత్రమే మాట్లాడతారు తప్ప వారికంటే ముందు రెండుదఫాలుగా వచ్చిన ఇతరజాతులకు చెందిన చొరబాటుదారుల గురించి మాట్లాడరు.

1. మొదటి దశ, ఆర్యుల చొరబాటు

• మధ్య ఆసియనుంచి BCE 1500 ప్రాంతంలో ఆర్యులు అనే యోధ జాతి భారత ఉపఖండానికి వలస వచ్చి ఈ ప్రాంతంపై ఆధిపత్యం పొందారు. వీరు తమతో పాటు వేదసంస్కృతి, సంస్కృత భాషను తెచ్చారు ఇవి ఆనాటి భారత ఉపఖండంలోని స్థానిక సంస్కృతులపై ప్రభావం చూపాయి.

• ఈ రోజు జన్యుశాస్త్రంలో DNA Sequencing పద్దతి ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వగలుగుతుంది. దీని ఆధారంగా ఒక జన్యువు వివిధ జనాభాలలో, వివిధ కాలాలలో ఎలా ప్రయాణం చేసింది అనే విషయం చాలా సులువుగా మేప్పింగ్ చేయగలుగుతున్నారు. ఈ అధ్యయనాలద్వారా, మధ్య ఆసియా నుండి కొన్ని జన్యువులు భరతఖండంవైపు కాలానుగుణంగా కదులుతూ వచ్చాయని కొన్ని పదుల సైంటిఫిక్ పేపర్లు నిర్ధారించాయి. అవే ఆర్యజనువులు. అలా వలసవచ్చిన వారే ఆర్యులు.

• మరొక ఆశ్చర్యం కలిగించే అంశం- ఆర్యులలో ఉండే R1 haplogroup జన్యువు ఆధునిక భారతసమాజంలో బెంగాలు బ్రాహ్మణులలో అత్యధికంగా 72.22 శాతం, ఇతర రాష్ట్రాల బ్రాహ్మణులలో 70-30% మధ్యలో కనిపించింది.

• ఇక భారతదేశ క్రిందితరగతి ప్రజలలో (Lower Castes/దళిత,బహుజనులు) ఈ ఆర్య జన్యువు 15.7 శాతం మందిలో కనిపించింది. అదే విధంగా భారతీయ గిరిజనులలో ఈ జన్యువు 7.9% మందిలో మాత్రమే గుర్తించారు.

• ఈ గమనింపు ద్వారా నేటి బ్రాహ్మణులు మధ్య ఆసియా నుంచి వచ్చిన విదేశీ ఆర్యులని, దళిత బహుజన గిరిజన ప్రజలు భరతఖండంలో సింధునాగరికతా కాలంనుండి జీవిస్తున్న స్థానికులని భావించవచ్చు.

• ఆర్యులు వర్ణవ్యవస్థను ఏర్పరచారు. సమాజాన్ని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంటూ నాలుగు శ్రేణులుగా విభజించారు. వీరిలో బ్రాహ్మణులు ఉన్నతులుగాను, మిగిలిన మూడు వర్ణాలు వారికి సేవచేయాలని ధర్మశాస్త్రాల ద్వారా నిర్ణయించారు. ధర్మశాస్త్రాలనేవి ఒకనాటి రాజ్యాంగం. ఇక వీరికి వెలుపల అతిశూద్రులు ఉండేవారు అతిశూద్రులు వూరివెలుపల నివసించే అంటరానివారు. ధర్మ శాస్త్రాలప్రకారం వీరసలు మనుషులే కారు.

• ఆర్యులు వారి స్త్రీలతో కాకుండా పురుషులు ఒక్కరే భరతఖండానికి వచ్చి స్థానిక అనార్య స్త్రీలను పెళ్ళాడారు. ఈ సందర్భంగా స్థానిక పురుషులను ఓడించి లేదా నిర్మూలించటం ద్వారా వారి స్త్రీలను గ్రహించటం జరిగి ఉండాలి.

• ఆర్యులు ప్రవేశపెట్టిన జన్మ ఆధారిత హెచ్చుతగ్గుల వర్ణవ్యవస్థ (కులవ్యవస్థ), బ్రాహ్మణాధిక్యత, మంత్రాలు, క్రతువులు, స్వర్గనరకాలు, పాపం పుణ్యం లాంటి అభౌతిక భావనలు నేటికీ సమాజంలో తమప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి.

• ఆర్యులు భారతదేశానికి చెందిన స్థానికులే అని సనాతనులు వాదిస్తారు కానీ అలా నిరూపించే జన్యు ఆధారాలు లేవు. ఇదొక సంకట స్థితిగా మారింది సనాతన హిందూ చరిత్రకారులకు.

2. రెండవ దశ యవనులు, శకులు, పార్థియన్లు, కుషాణులు చొరబాటు

• BCE 300 – CE 100 మధ్యలో యవనులు (ఇండో గ్రీక్స్), శకులు (సిథియన్స్) పార్థియన్స్, కుషాణులు మధ్య ఆసియానుంచి భారతదేశంలోకి చొరబడిన యోధులు.

• అలెగ్జాండర్ మరణం తరువాత అతని సైన్యంలో కొంతమంది గ్రీకులు BCE 300 లలో ఇక్కడే ఉండిపోయి పంజాబ్, గాంధార ప్రాంతాలను పాలించారు. వీరిని ఇండో గ్రీక్స్ (యవనులు అని పిలిచారు). వీరు బౌద్ధాన్ని స్వీకరించారు. గాంధారకళలో బౌద్ధ శిల్పాలను చెక్కించారు. మనుస్మృతి వీరిని మ్లేచ్చులగా పరిగణించి, “తక్కువరకం క్షత్రియులు”గా గుర్తించింది.

శకులు (సిథియన్స్) BCE 100 లో మధ్య ఆసియా స్టెప్పీలనుండి గుర్రాలపై వచ్చిన సంచార తెగలు. వీరు గాంధార, పంజాబ్, ఉజ్జయిని ప్రాంతాలను పాలించారు. వీరు బౌద్ధ, హైందవ మతాలను స్వీకరించారు. వీరిలో ప్రముఖుడైన రుద్రదమనుడు సంస్కృతాన్ని ఆదరించాడు. వీరిని పతనమైన క్షత్రియులు (Second class kshatriyas) గా మనుస్మృతి పరిగణించింది.

పార్థియన్స్, BCE 100 లో ఇరాన్ నుంచి వచ్చిన యోధులు. వీరు ఇండో పార్థియన్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరు సింధ్ పంజాబ్ ప్రాంతాలను (ప్రస్తుత పాకిస్తాన్) పాలించారు. ఈ వంశంలో గోండో ఫరిస్ ప్రసిద్ధిగాంచిన రాజు. వీరి పాలనలో గాంధార శిల్పకళ అభివృద్ధిచెందింది. వీరు జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించినా, క్రమేపీ భారతీయమతాలతో విలీనం అయిపోయారు. పార్థియన్లను కూడా మనుస్మృతి పతనమైన క్షత్రియులుగా గుర్తించింది.

కుషాణులు, CE 100 మధ్య ఆసియానుంచి వచ్చారు. కనిష్కుడు పేరుగాంచిన రాజు. కుషాణులు బౌద్ధమతాన్ని వ్యాప్తిచేసారు. వీరినాణాలపై బుద్ధుడు, శివుడు, గ్రీకుదేవతల చిహ్నాలు ఉండటం వీరి మతసహనాన్ని చూఫుతుంది. వీరు వాసుదేవవంటి భారతీయ కల్ట్ పేర్లను ఉపయోగించారు. వీరు కూడా క్షత్రియులుగానే గుర్తింపబడ్డారు.

మధ్యఆసియానుంచి భారతఖండంలోకి చొరబడిన స్టెప్పీ యోధులైన, యవనులు శకులు, పార్థియన్లు, కుషాణులు భారతదేశంలో స్థిరపడి, స్థానిక బౌద్ధ, హైందవ మతాలను స్వీకరించి క్రమేపీ భారతదేశ సమాజంలో మమేకం అయిపోయారు. కాలక్రమేణా వీరు స్థానిక కులాలుగా విలీనమయ్యారు. ఉదాహరణకు శకులు గుజరాత్ మధ్యప్రదేశ్ లోని క్షత్రియకులాలలోకి (రాజ్ పుత్రులు) కుషాణులు ఉత్తరదేశ రాజవంశాలలోకి కలిసిపోయారు.
.
3. మూడవ దశ చొరబాటు , ఐబక్, ఖిల్జి, తుగ్లక్, సయ్యద్, లోడి, ముఘల్స్

• CE 12-15 శతాబ్దాలమధ్య మధ్యఆసియా నుంచి కుతుబుద్ధీన్ ఐబక్, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాలు వచ్చి భారతదేశాన్ని పాలించాయి. వీరి రాజ్యాలు ఉత్తరభారతదేశానికే పరిమితం అయిన బలహీనమైన రాజ్యాలు. 1526 లో మధ్య ఆసియాకు చెందిన బాబర్ పానిపట్టు యుద్ధంద్వారా ఇబ్రహిం లోడీని ఓడించి భారతదేశంలో ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతనిని మేవాడ్ రాజపుత్రరాజు రాణా సంగా, లోడిని గద్దెదించటానికి ఇండియాకు ఆహ్వానించినట్లు కొందరు చరిత్రకారులు చెబుతారు.

బాబర్ బలమైన కేంద్రీకృతపాలన కలిగిన విశాలమైన మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దీన్ని అక్బర్ విస్తరించాడు. ఔరంగజేబు ముఘల్ సామ్రాజ్యాన్ని పతాకస్థాయికి తీసుకొని వెళ్ళి ఈ రోజు మనం దేన్నైతే అఖండ భారతదేశం అంటున్నామో దానికి ఒక రూపాన్ని ఇచ్చాడు. ఇతని పాలనలో ముఘల్ సామ్రాజ్యం ఉచ్ఛస్థితిని పొందింది. అశోకుని మౌర్యసామ్రాజ్యం ఎంతైతే విస్తరించి ఉండేదో దాదాపు అంత భూభాగాన్ని ఔరంగజేబు తిరిగి సాధించగలిగాడు. ఇది అంతకు పూర్వ ఢిల్లి సుల్తానేట్, హిందూ రాజవంశాలకు సాధ్యం కానిది.

• ముఘలులు హిందూ ముస్లిమ్ సమాజాల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహించారు. ముఖ్యంగా అక్బరు ద్వారా సూఫీ సాధువులైన చిస్టీ, భక్తి సంప్రదాయ గాయకులు ఐన కబీర్ నానక్ వంటివారు ఈ సంగమానికి దోహదపడ్డారు. అక్బర్ యొక దీన్ ఇ ఇలాహీ సిద్ధాంతం సమస్త మతాల ఐక్యతను కోరుకొంది.

• ముఘల్ పాలకులు రాజపుత్రులు, హిందూ జమిందారులు, ఇతర స్థానిక నాయకులను పరిపాలనలో భాగస్వామ్యం చేసారు.

• బ్రిటిష్ వారి రాకతో ఒత్తిడి, అంతర్గత అస్థిరతలు ఆర్ధిక సంక్షోభం కారణంగా ముఘల్ సామ్రాజ్యం క్షీణించింది. 1857 సైనికుల తిరుగుబాటు తరువాత చివరి ముఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ ను గద్దె దించి, సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వారు అధికారికంగా తీసుకోవటం జరిగింది.
నేటి భారతదేశంలోని ముస్లిములు చివరగా గత ఐదారు వందల ఏళ్ళ క్రితం భారతదేశంలోకి ప్రవేశించినవారు. నిజానికి వీరిలో ఎక్కువశాతం హిందూమతంలో స్థానికదళిత బహుజనులపట్ల ఊపిరాడనివ్వని ఆంక్షల వలన ఇస్లామ్ లోకి మారినవాళ్ళే ఎక్కువమంది ఉండొచ్చు.

ఎవరు చొరబాటు దారులు?

ఆర్యులు, యవనులు, ముస్లిములు భారతదేశంలోకి చొరబాటుదారులుగా వచ్చినప్పటికీ, వారు స్థానిక సంస్కృతులతో కలిసిపోయి, భారతీయ సమాజ బహుళతను రూపొందించారు.
ఆర్యులు బ్రాహ్మణ సమాజంలో ఎక్కువగా ఉన్నట్లు జన్యు ఆధారాలు చెబుతున్నాయి. యవనులు శకులు, కుషాణులు ఉత్తరభారత రాజపుత్రులుగా ఈ దేశ చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించారు. మధ్య ఆసియానుండి వచ్చిన ముస్లిములతో పాటు స్థానిక దళిత, బహుజన సమూహాల నుండి ఇస్లాంలోకి మారినవారై ఉండవచ్చని ఒక అభిప్రాయం ఉంది.

నేటి రాజకీయ సందర్భంలో, “చొరబాటుదారులు” అనే పదం ముస్లిములను లక్ష్యంగా చేస్తూ, వారిని విదేశీయులుగా చిత్రీకరించడానికి ఉపయోగించబడుతుంది. ఇది చరిత్రను ఏకపక్షంగా వక్రీకరించే ప్రయత్నం, ఎందుకంటే ఇది ఆర్యులు, యవనులు, శకులు ఇతర జాతుల చొరబాట్లను విస్మరిస్తుంది.

భారతదేశంలోని ముస్లిములు గత 700 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడే పుట్టి ఈ మట్టిలోనే కలిసిపోతున్నారు. వారిలో ఎక్కువ మంది స్థానిక మూలాలు కలిగినవారే.

“చొరబాటుదారులు” అనేది చారిత్రక సంఘటనలను వివరించే పదం, కానీ ఆధునిక సమాజంలో దీనిని విభజనాత్మక రాజకీయాలకు ఉపయోగించడం తప్పుదారి పట్టిస్తుంది. విభజన, ద్వేషం కాకుండా ఐక్యత సామరస్యం వైపు మనం ప్రయాణం చేయాలి.

బొల్లోజు బాబా