Sunday, February 23, 2025

శంభాజి గురించి అతని సమకాలీన రచయిత ఏమన్నాడు?

ఛత్రపతి శివాజి కుమారుడు శంభాజి. (1657-1689). ఇతను శివాజి వారసునిగా మరాఠాసామ్రాజ్యాన్ని 1680 – 1689 ల మధ్య పరిపాలించాడు. వెనిస్ దేశానికి చెందిన నికలావొ మనుచ్చి అనే యాత్రికుడు, చరిత్రకారుడు రచించిన స్టోరియో దొ మొగోర్ ( Storia Do Mogor 1653—1708 By Niccolao Manucci) అనే గ్రంథంలో శంభాజి గురించిన వివరాలు లభిస్తాయి. నికొలవొ మనుచ్చి శంభాజీని నేరుగా కలిసి అతనితో సంభాషించిన వ్యక్తి. సమకాలీనులు చేసిన వ్యాఖ్యలు చారిత్రికంగా ఎంతో విలువైనవి. ఆ మేరకు వీటిని తటస్థ కథనాలుగా గుర్తించవచ్చు.

వివిధ కాలాలలో నికొలవొ మనుచ్చి శంభాజి గురించి చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.

1. శివాజి ఎన్నో విజయాలు సాధిస్తున్నప్పటికీ అతని కుమారుడు శంభాజీ పట్ల నిరంతరం చింతించేవాడు. శంభాజీ అదుపులేని దురలవాట్లు కలిగి ఉండేవాడు. ఇతరుల భార్యలను స్వాధీనపరచుకొనేవాడు. ఇతని దుశ్చర్యలగురించి అనేకమంది అధికారులు, కులీనులు శివాజికీ పిర్యాదులు చేసేవారు. ఇతనివల్ల కలిగే అసంతృప్తి వల్ల తిరుగుబాటు సంభవించవచ్చుననే ఊహతో శంభాజీని బంధించి ఏదో ఒక కోటలో ఖైదీగా పంపాలని శివాజి నిర్ణయించుకొన్నాడు.
చిన్నకుమారుడైన రామ్ రాజాను రాజ్యానికి వారసునిగా ప్రకటించాలని భావించాడు. ఈ విషయం గ్రహించిన శంభాజి ఔరంగజేబు సైన్యాధ్యక్షుడైన దిలార్ ఖాన్ తో చేతులుకలిపి అతని ఆశ్రయం పొందాడు. మనుచ్చి, పేనం 204, వాల్యూం 2

2. తన తండ్రి శివాజి మరణించాడని విన్న వెంటనే శంభాజి బీజాపూర్ నుండి బయలు దేరి తండ్రి రాజ్యంలో ప్రవేశించాడు. రాజ్యానికి తన తండ్రితన వారసునిగా ప్రకటించిన తమ్ముడు రామ్ రాజాను ఖైదుచేయించాడు. తాను అధికారం కైవశం చేసుకోవటం ఇష్టం లేని అధికారులను హతమార్చాడు. ఒకసారి శంభోజి తన కత్తి నాకు (నికొలవొ మనుచ్చికి) చూపుతు ఆ సందర్భంలో ఈ కత్తితో ముప్పై మంది తలలను నరికాను. ఇంకా అనేకమంది కళ్ళు పీకించానని చెప్పాడు. ( మనుచ్చి పేనం. 233)

(రాజ్యాన్ని హస్తగతం చేసుకోగానే శంభాజి- శివాజి వద్ద మంత్రిగా పనిచేసిన అన్నాజి దత్తు ఆస్థిని జప్తు చేయించి అతన్ని ఏనుగులతో తొక్కించి చంపించాడు; రామ్ రాజ తల్లి శివాజి రెండవభార్య అయిన సోయెరాబాయి కి మరణ దండన విధించాడు. తన తమ్ముడు రామ్ రాజాను రాజుని చేయటానికి ప్రయత్నించిన అనేక మంది అధికారులను, బంధువులను హతమార్చాడు -History Of The Mahrattas, by Grant Duff, 1878, పేనం 136-7)

4. శంభాజి విజయాలు అతని ప్రతాపం కాదు. అతని వద్ద పనిచేసే అధికారుల గొప్పదనం. (మనుచ్చి, పేనం. 258)

5. ఇతరుల భార్యల పట్ల శంభాజి అనుచితంగా ప్రవర్తించటం పై అతని అధికారులు అతనితో గొడవపడేవారు. (మనుచ్చి, పేనం. 257)

6. దురలవాట్లు స్వభావంగా మారతాయి. స్త్రీలపట్ల శంభాజికి ఉన్న వ్యామోహం ఇతనిని ఔరంగజేబుకు పట్టుబడేలా చేసింది. శంభాజీ సంగమేశ్వర్ వద్ద బసచేసినపుడు మంత్రి కాబ్ కలిష్ అక్కడకు కొద్దిదూరంలో ఒక గ్రామంలో గొప్ప అందమైన వివాహిత మహిళ ఉందని చెప్పాడు. శంభాజీ ఆ మహిళను ఎలాగైనా చేజిక్కించుకోవాలని నిర్ణయించుకొని అక్కడకు బయలుదేరాడు. ఈ విషయాన్ని కాబ్ కలిష్ ఔరంగజేబుకు ఉప్పందించటంతో అతను ఐదువేల మంది అశ్వదళాన్ని పంపి శంభాజీని పట్టి బంధించారు. ఒంటెకు కట్టి గుడారాల చుట్టూ తిప్పారు. కళ్ళు పీకి, గుండెను చీల్చి మృతదేహాన్ని చెత్తకుప్పపై కుక్కలకు ఆహారంగా వేసారు. ( మనుచ్చి pn. 310-312)

(నికొలవొ మనుచ్చి కథనంలో ఎక్కడా ఔరంగజేబు శంభాజీని మతం మారమని కోరినట్లు కానీ దాన్ని శంభాజి తిరస్కరించినట్లు కానీ లేదు. ఇలాంటి ఉద్వేగపూరిత మతాభిమాన కథనాలు ఆ తరువాత కాలంలో కల్పించినవి కావొచ్చు)

ముఘల్ సైనికులు చుట్టుముట్టినప్పుడు శంభాజి సైనికులు పారిపోయారు. ఆ కొద్దిసమయంలోనే శంభాజి గడ్డం గీసుకొని, సన్యాసి దుస్తులు ధరించి మారువేషం వేసుకొని నేలమాళిగలో దాక్కున్నాడు. సైనికులు ఆ ప్రదేశాన్ని కనిపెట్టి మెడలో ముత్యాలహారం, ఉంగరాల ఆధారంగా శంభాజీని గుర్తించి బంధించి చేతులు కట్టి జుట్టుపట్టుకొని ముఘల్ సైన్యాద్యక్షుడైన ముకర్రబ్ ఖాన్ వద్దకు తీసుకువెళ్ళారు- (House of Shivaji, Sir. Jadunath Sarkar pn231)
****

ఇది స్థూలంగా ఛత్రపతి శివాజి కుమారుడైన శంభోజిని అతని సమకాలీనుడైన నికొలవొ మనుచ్చి చూసిన విధానం.

దీని ద్వారా శంభోజి ఒక మామూలు మానవ లౌల్యాలు, ప్రాణభయం కలిగిన వ్యక్తిగా అర్ధమౌతుంది. యుద్ధాలు, ఒకరిని ఒకరు దోచుకోవటాలు, చిత్రహింసలు పెట్టటాలు, చంపుకోవటాలు మిడివియల్ కాలంలో సహజాతి సహజం. ఒకడు శాంతి కాముకుడు మరొకడు హింసావాది అని చెప్పటానికి లేదు. ఎవరూ శుద్ధపూసలు కారు. ఎవరి అవసరాలు, ఎవరి బతుకు పోరాటం వారిది. చంపటమో చావటమో ఒకటే జీవనశైలి. అన్ని మతాలదీ ఇదే దారి. ఆనాటి కాలమానపరిస్థితులను గుర్తించకుండా వీడు మంచి వీడు చెడ్డ అని తీర్పులివ్వటం ప్రజలను విభజించటం, వారి మధ్య ద్వేషం పెంచటం కొరకే.

భారతదేశ చరిత్రలో ఆ కాలానికి దేశభక్తి, స్వాతంత్ర్యం లాంటి భావనలు లేవు. ఉన్నదల్లా రాజ్యకాంక్ష. దక్కించుకొన్న దాన్ని నిలబెట్టుకోవాలనే కిల్లర్ ఇన్ స్టింక్ట్. ఇంకా కొండొకచో కార్నల్ డిజైర్స్.

అలాంటి అమానవీయ రాజకీయాలకు అవతల రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు, ఎప్పుడు ఏ ఉపద్రవం రానుందో అంటూ బిక్కుబిక్కుమంటూ అభద్రతతో బతికే వ్యాపారులు, కులీనులు ఉన్నారు. ఇవీ మధ్యయుగాల జీవితాలు.
***

సినిమా అనేది కళాత్మక వ్యక్తీకరణ. చారిత్రిక అంశాలతో సినిమాలు తీసినపుడు బాధ్యతగా ఉండటం ఎంతో అవసరం. ఒక మతానికి చెందిన వారిని వీరులుగాను, మరొక మతానికి చెందిన వారిని క్రూరులుగాను చిత్రించటం వల్ల ఆయా సామాజిక సమూహాలమధ్య వైషమ్యాలకు కారణమౌతారు. చరిత్రను శోధించి నిజాలు తెలుసుకొనే ఓపిక ఎవరికీ ఉండదు. సినిమాలో చెప్పిందే నిజమైన చరిత్ర అని భావించి సినిమాహాళ్ళలోనే ప్రతిజ్ఞలు చేస్తూ ఉద్వేగాలకు గురయి, భోరుభోరున ఏడుస్తున్న తరం ఒకటి మనముందు ఉంది. అంతటి గొప్ప మాధ్యమం సినిమా.

ఇలాంటి నేపథ్యంలో అభూతవిశ్వాసాలను, అబద్దపు ఉద్వేగాలను ప్రజలలో రగిలించటం నైతికపతనం. పసిమనసుల్ని కలుషితం చేయటం.

చరిత్ర అనేది ప్రజల సామూహిక మెమొరీ. దానిలోంచి కొందరిని సమూలంగా తుడిచివేయాలనో లేదా వారిని దుర్మార్గులుగా చిత్రించాలనో చేసే ప్రయత్నాలు కళాత్మక స్వేచ్ఛ అవదు. సామాజిక ద్రోహం అవుతుంది.
బొల్లోజు బాబా
సంప్రదించిన పుస్తకాలు
1. STORIA DO MOGOR 1653—1708 BY NICCOLAO MANUCCI
2. History Of The Mahrattas, by Grant Duff, 1878
3. House of Shivaji, Sir. Jadunath Sarkar pn231
4. History of the Mahrattas by Edward Scott Waring
5. Historical Fragments Of The Mogul Empire, by Robert Orme



No comments:

Post a Comment