Saturday, February 8, 2025

ఆది శంకరాచార్యుడు - ఆథ్యాత్మిక దండయాత్ర


వైదికమతంలోని వర్ణవ్యవస్థ, యజ్ఞయాగాదులు, బ్రాహ్మణాధిక్యతను నిరసిస్తూ బౌద్ధ, జైన మతాలు ఆవిర్భవించాయి. వైదికమతాన్ని (బ్రాహ్మణమతం) ధిక్కరించి బౌద్ధం ఒక ప్రత్యామ్నాయ ఆథ్యాత్మికమార్గాన్ని ఏర్పరచింది. బ్రాహ్మణులను అత్యున్నతవర్గంగా పరిగణించే కులవ్యవస్థను బుద్ధుడు ఖండించాడు. మనుషులందరూ సమానమేనని, జన్మత హెచ్చుతగ్గులు ఉండవని ప్రకటించాడు. ఆత్మ, దేవుడు ఉనికిని అంగీకరించలేదు. మౌర్యులు, కుషానులు, కొంతమేరకు గుప్తులు బౌద్ధమతాన్ని ఆదరించటంతో బౌద్ధం సుమారు వెయ్యేళ్లకుపైన (BCE 6 నుండి CE 8 వ శతాబ్దం) భారతదేశంలో అప్రతిహతంగా మనుగడ సాగించింది. క్రతువులు జంతుబలులు కాక ధ్యానం అంతఃచేతన ద్వారా ప్రజలు నైతిక వర్తనను, మెరుగైన జీవితాన్ని పొందాలని బౌద్ధం ప్రవచించింది. ధర్మకీర్తి, శాంతిరక్షిత, నాగార్జునుడు వంటి వారు బౌద్ధబోధనలను సర్వోత్కృష్ట స్థాయికి తిర్చిదిద్దారు.

బౌద్ధమతం వర్ణాలకు అతీతంగా ప్రజలందరినీ సమానంగా చూడటంతో సామాన్యప్రజలు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. జనాభాలో అధికశాతం బౌద్ధం ఆచరించారు. ఇది ఒకరకంగా వైదిక/బ్రాహ్మణ మతానికి సైద్ధాంతిక సవాలు. జీవన్మరణ సమస్య.

బ్రాహ్మణమతానికి బౌద్ధం విసిరిన ఈ సవాలును మొదటగా స్వీకరించింది ఆదిశంకరాచార్యుడు. చరిత్రకారులు ఇతను c. 788-820 CE మధ్య జీవించిన వ్యక్తి అని నిర్ణయించారు. కోటవెంకటాచలం లాంటి వారు శంకరాచార్యుని కాలం BCE 509-477 గా చెబుతారు. నిజానికి శంకరాచార్యుని ప్రచ్ఛన్న బౌద్ధుడని (crypto buddha) అందరూ అన్నారు కనుక బుద్ధుని తరువాత పెట్టవలసి వచ్చింది కానీ లేకపోతే తీసుకువెళ్ళి బుద్ధుడికన్నా పూర్వుడని చెప్పేవారే ఈ పండితులు.
 
1. జీవిత చరిత్ర

శంకరుని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చారిత్రిక ఆధారాలు పెద్దగా లభించలేదు. అతని పుట్టుక, వ్యక్తిత్వం, అతను చేసిన ఆథ్యాత్మిక దండయాత్ర, మఠాల స్థాపన, అతని మరణం లాంటి విషయాలు – 14 వ శతాబ్దం నుంచి లభించే “శంకరవిజయాలు” పేరిట విద్యారణ్యుడు, ఆనందగిరి, చిద్విలాసుడు లాంటి కవులు రచించిన శంకరుని జీవితచరిత్రలు, ఇంకా శంకర విరచితమని చెప్పబడే వివిధ వ్యాఖ్యాన గ్రంథాల ద్వారా తెలుస్తాయి.

ఆది శంకరాచార్యుడు కేరళలోని కాలడి గ్రామంలో సంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు శివగురు, తల్లి పేరు ఆర్యాంబ. చిన్న వయస్సులోనే వేదాలు, ఉపనిషత్తులు మరియు తర్కశాస్త్రంలో ప్రావీణ్యం సాధించాడు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి, గురువు గోవింద భగవత్పాదుల చెంతకు వెళ్లి వేదాంత విద్యను అభ్యసించారు.

ఆది శంకరాచార్యుడు అద్వైత వేదాంతాన్ని ప్రబలంగా ప్రచారం చేశారు. బ్రహ్మమే పరమ సత్యం, జగత్ మిథ్య (మాయ), జీవాత్మ పరమాత్మలు ఒక్కటే అనే భావనల్ని అద్వైతతత్వంగా చెబుతారు.
శంకరాచార్యుడు భారతదేశమంతా తిరిగి తన బోధనలను వ్యాప్తి చేశాడు. నాలుగు మఠాలను స్థాపించారు: అవి కర్ణాటకలో శృంగేరి మఠం, గుజరాత్ లో ద్వారకా మఠం, ఉత్తరాఖండ్ లో జ్యోతిర్ మఠం (జోషిమఠం), ఒడిశాలో పూరీ మఠం. శంకరాచార్యుడు ఈ మఠాలను ధార్మిక నాయకత్వం, సనాతన హిందూ ధర్మపరిరక్షణ కొరకు స్థాపించారు. వీటికి అధిపతులుగా వేదాధ్యయనం చేసిన పండితులే ఉంటారు.
 
శంకరాచార్యుడు ఉపనిషత్తుల, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు; భజ గోవిందం, సౌందర్యలహరి, నిర్వాణ షట్కమ్ వంటి రచనలు చేసాడు.  శంకరాచార్యుడు తన 32వ ఏట   హిమాలయాలో కేదారనాథ్ వద్ద వెళ్లి జీవ సమాధిని పొందాడు.
ఇదీ స్థూలంగా శంకరాచార్యుని జీవిత చరిత్ర.

2. బౌద్ధంపై ఆథ్యాత్మిక దండయాత్ర

శంకరాచార్యుడు బౌద్ధ మరియు జైన ప్రభావాలకు వెనుకబడ్డ హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించాడు.
 
శంకరాచార్యుని కాలానికి బౌద్ధం భారతదేశంలో బలంగానే ఉంది. ఏడో శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన యవాన్ చ్వాంగ్ దేశంలో దేవాలయాలతో పాటు బౌద్ధారామాలు, బౌద్ధబిక్కులు పెద్దసంఖ్యలో ఉన్నట్లు నమోదు చేసాడు. 
****

బౌద్ధులు చార్వాకులు ఈ సమాజంలో హేతుబద్దమైన ఆలోచనలను ప్రోత్సహించారు. వారు ఈ ప్రపంచానికి ఆధారమేమిటని సత్యాన్వేషణ చేసారు. ఈ ప్రపంచం ఇంద్రియాల ద్వారా తెలుసుకోగలిగే సత్యంగా భావించారు.
 
శంకరాచార్యుడు జగత్తు మిథ్య అని ప్రకటించటం వల్ల ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకొనే ప్రయత్నానికి విలువలేకుండా అయిపోయింది. సత్యాన్వేషణను మొగ్గలోనే తుంచేసాడు. వైద్యం, రసాయిన శాస్త్రం ఖగోళ శాస్త్రం వంటి వివిధ శాస్త్రాల అథ్యయనం శంకరాచార్యుని తరువాత కుంటుపడింది. భారతీయ ప్రాచీన ఆవిష్కరణలు చాలామట్టుకు శంకరాచార్యునికి ముందు బౌద్ధ జైన లేదా వైదిక ఋషులు సాధించినవే. శంకరాచార్యుడు ప్రతిపాదించిన అద్వైతసిద్ధాంతం సమాజాన్ని మిథ్యావాదం, అలౌకిక అంశాలవైపు నడిపించి శాస్త్రీయ ఆవిష్కరణలను తిరోగమింపచేసింది.
 
దుఃఖం వాస్తవమైనది కాబట్టి దానినుండి విముక్తి పొందటమే జీవితలక్ష్యంగా బౌద్ధులు చెప్పారు. దుఃఖాన్ని ఒప్పుకొని దానిని అధిగమించే మార్గాలను సూచించారు. శంకరాచార్యుడు జగత్ మిథ్య అనటం వల్ల దుఃఖం కూడా ఒక అబద్దం అయిపోయింది. ఇది మానవ దుఃఖాన్ని ఒక మాయగా తోసిపుచ్చుతుంది. దీనివల్ల అమానుషమైన వర్ణ వ్యవస్థ లోని నిచ్చెనమెట్లలో కిందనున్న సాటిమానవుడు అత్యంత హేయమైన దుర్భర జీవనాన్ని గడపటం పట్ల ఇతరులకు ఏ రకమైన సహానుభూతి లేకుండా పోవటమే కాక ఈ భావన వర్ణ వ్యవస్థను సమర్ధించటానికి దోహదపడుతుంది. సమాజంలో ఉన్న అసమానతలు, దారిద్ర్యం, వివక్షను పట్టించుకోదు. ఈ జగమేమాయ అయినప్పుడు ఈ వివక్షపట్ల బాధితులు పోరాటం చేయాలన్న స్పృహను కూడా కోల్పోయేలా చేస్తుంది.
****

బౌద్ధసూత్రాలను కొన్నింటిని శంకరాచార్యుడు కాపీ కొట్టటంచేత శంకరాచార్యుడిని ప్రచ్ఛన్న బౌద్ధుడని చెబుతారు. అలా బుద్ధునితో పోలిక తీసుకురావటం ఒక కుట్ర. శంకరాచార్యునికి బుద్ధునికి ఆచరణలో నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. బుద్ధుడు వైదిక క్రతువులను వర్ణ వ్యవస్థను ఖండించగా, శంకరాచార్యుడు వాటికి మసిపూసి మారేడు కాయ చేసి వేదాలను ఉల్లంఘించరాదని, వర్ణ వ్యవస్థ సదా ఆచరణీయం అని చెప్పాడు. బౌద్ధారామాలలో శూద్ర, అతిశూద్ర స్త్రీలకు ప్రవేశం ఉండగా శంకరమఠాల్లో బ్రాహ్మణ పురుషులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. నిజానికి బౌద్ధాన్ని నిర్మూలించటంలో శంకరాచార్యుని పాత్ర గణనీయమైనది. అలాంటి శంకరాచార్యుడిని ప్రచ్ఛన్న బౌద్ధుడని అనటం- వ్యాసుడు శూద్రుడు, వాల్మీకి బోయ అనటం లాంటి వక్రీకరణ. వారు చెప్పే మాటలకు లెజిటమసీ కల్పించటం కొరకు పండితులు చెప్పే అసత్యాలు అవి.
****

14 వ శతాబ్దంలో మాధవాచార్యులు (విద్యారణ్యస్వామి) రచించిన శంకర దిగ్విజయ లోని 1.27-56 శ్లోకాల సారాంశం ఇలా ఉంది.
 
“లోకంలో బౌద్ధులు, జైనులు శైవ కాపాలికులు ఎక్కువకావటం చేత వైదిక ధర్మం నిర్లక్ష్యం చేయబడుతున్నదని దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకొన్నారట. దానికి శివుడు “నేను ఆది శంకరాచార్యునిగాను, తనకుమారుడైన కార్తికేయుడు కుమారిల భట్టుగాను అవతరించి తర్కశక్తితో ఆ మతాలను ఖంఢిస్తామని అదే విధంగా ఇంద్రుడు సుధన్వ రాజుగా జన్మించి వైదికధర్మ పునరుద్ధరణకు తోడ్పడతాడని” చెప్పాడు. ఈ ఉదంతం ద్వారా శంకరాచార్యుడు సాక్షాత్తూ శివావతారం అని, బౌద్ధ, జైన కాపాలికా ధర్మాలను నిర్మూలించటం కొరకే అతను జన్మించాడని అర్ధమౌతుంది
 
ఉజ్జయినిని పాలించిన సుధన్వ రాజు శంకరాచార్యుడు, కుమారిల భట్టుల ప్రోత్సాహంతో హిమాలయాలనుండి రామేశ్వరం వరకూ గల అనేక వేల బౌద్ధారామాలను, బౌద్ధులను నిర్మూలించాడని శంకర దిగ్విజయంలో మాధవాచార్యుడు చెప్పాడు. ఏడవ శతాబ్దపు చైనాయాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ రాతలలో ఉజ్జయినిని ఒక బ్రాహ్మణ రాజు పాలిస్తున్నాడని ప్రస్తావించాడు. మృచ్చకటిక నాటకంలో ఉజ్జయిని రాజుయొక్క బావమరిది బౌద్ధులను పీడించసాగాడు అనే మాట ఉంటుంది. ఈ రెండు ఆధారాలు శంకరదిగ్విజయ గ్రంథంలో చెప్పిన బ్రాహ్మణ సుధన్వ రాజు చారిత్రికతను తెలియచేస్తాయి .
 
శంకరదిగ్విజయ ఏడో సర్గ లో- కుమారిల భట్టు శంకరునితో "ఈ భూమి బౌద్ధులతో నిండిపోయింది వేదాలను పట్టించుకొనేవారు లేరు. నేను బౌద్ధులను జయించి వేదాలకు పునర్వైభవం తీసుకొని వస్తాను" అనగా దానికి శంకరాచార్యుడు "భట్టా నీవు బౌద్ధులను నిర్మూలించటానికి అవతరించిన కారణ జన్ముడవు. నీకు ఏ పాపము అంటదు" అని అంటాడు. (7- 77-121 Sankara Digvijaya,Translated by Swamy Tapasyananda, Ramakrishna math publication)

“శంకరాచార్యుడు బౌద్ధసన్యాసులను వాదనలో ఓడించి వారిని సజీవంగా కాల్చి చంపాడు. దీన్ని మత పిచ్చి కాక మరెలా పిలవగలం” అంటాడు స్వామి వివేకానందుడు.
 
శంకరాచార్యుడు దేశం అంతా తిరిగి బౌతికవాదులైన బౌద్ధులతో శాస్త్ర చర్చలు జరిపి – జగం మిథ్య, అహం బ్రహ్మస్మి, జీవాత్మే పరమాత్మ అంటూ పొంతనలేని పారమార్ధిక వాదనలతో ఓడించి వారిని సామూహిక దహనాలలో హతమార్చాడు. ఇది దుర్మార్గమైన క్రూసేడ్లతో సమానం.
శంకరాచార్యుని బృందం ఒక క్రమపద్దతిలో బౌద్ధ, జైన, కాపాలిక లాంటి హైందవేతర మతాలపై దాడి జరిపింది. ఈ రోజు దేశం అంతటా ఎక్కడ తవ్వితే అక్కడ లభించే విరూపమైన బుద్ధుని విగ్రహాలు శంకరాచార్యుని కాలం నాటివే.
 
అప్పటికి ఉన్న బౌద్ధ ఆరామాన్ని శంకరాచార్యుడు తొలగించి శృంగేరి పీఠాన్ని ఏర్పరచాడంటారు. CE రెండు మూడు శతాబ్దాలలో నాగార్జునకొండ వద్ద విజయపురి అనే పట్టణం గొప్ప బౌద్ధఆరామంగా విలసిల్లినట్లు శాసనాధారాలు కలవు. శంకరాచార్యుడు తన అసంఖ్యాకమైన అనుచరులతో నాగార్జున కొండవచ్చి అక్కడి బౌద్ధఆరామాలను ధ్వంసం చేసాడని నాగార్జున కొండ వద్ద జరిపిన తవ్వకాల రిపోర్టులో A.H.Longhurst అన్నాడు . అదే విధంగా బౌద్ధక్షేత్రమైన శ్రీశైలం, బద్రినాథ్, పూరి, శబరిమలై, తిరుపతి లాంటి బౌద్ధ ఆరామాలను హిందూ ఆలయాలుగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
నేడు సంఘీయులు జరుపుతున్నట్లుగా ఒకప్పుడు శంకరాచార్యుడు హైందవేతర మతాలపై జరిపిన ఆథ్యాత్మిక దండయాత్ర ఇది.
 
3. కరడు కట్టిన మనువాది శంకరాచార్యుడు

శంకరాచార్యుడు దేశంనాలుగు వైపులా స్థాపించిన పీఠాలకు ఒక్కో ఆచార్యుని నియమించాడు. ఎవరి పీఠపరిథిలో వారు అక్కడి ప్రజలలో వర్ణాశ్రమ ధర్మాలను కాపాడాలని 26 శ్లోకాల “మహానుశాసనం” ను రచించాడు. దానిలోని కొన్ని శ్లోకాల అర్థాలు ఇవి…..

మేము సాధించిన వర్ణాశ్రమ ధర్మములను తమ పరిధులలోని ప్రజలలో రక్షితములు అగునట్లు చూడవలెను (శ్లోకం నంబరు 3) ఇక్కడ మేము సాధించిన అనే పదం ప్రధానము.
 
నా చే నిర్మించబడిన ఈ ఆర్యమర్యాద యధావిధిగా నాలుగు మఠములద్వారా రక్షింపబడునట్లు పీఠాధిపతులు తమ శక్తిని వినియోగించవలెను. (8 వ శ్లోకం)

ధర్మసంరక్షణార్ధము సుధన్వ మహారాజునకు గల అధికారమును ఇంద్రాజ్ఞవలె పాలింతురు గాక (14 వ శ్లోకము).
 
చాతుర్వర్ణములవారు యధాశక్తి ఈ గురుపీఠములను అర్చింతురుగాక (17 వ శ్లోకము)

ఈ నియమములన్నియు మనువు, గౌతముడు మొదలైన వారు చెప్పినవే (22 వ శ్లోకము)

కృతయుగమును బ్రహ్మదేవుడును, త్రేతాయుగమందు వశిష్ఠమహర్శియును, ద్వాపరయుగమున వ్యాసమహర్షియును జగద్గురువులై యుండిరి. ఈ కలియుగమున నేనే జగద్గురువునై అవతరించితిని. (శ్లోకం 25)
 
బౌద్ధం వల్ల ఒడిదుడుకులకు గురైన సనాతన హిందూవర్ణ వ్యవస్థను తానే తిరిగి స్థాపించానని; దానిని మీరు కాపాడుకోవాలని; చాతుర్వర్ణాలు ఈ గురుపీఠాలను యధాశక్తి సేవించుకోవాలని “మహానుశాసనం” ద్వారా చెప్పాడు. ఇది ఒకరకంగా ఆయామఠాలను నడిపించటానికి రాసుకొన్న "corporate governance manual" లాంటిది.
 
శంకరమఠాలు నేటికీ ఈ సూత్రాలపైనే నడుస్తున్నాయి. శంకరాచార్యుడు ఈ మఠాలను వర్ణాశ్రమధర్మాన్ని కాపాడటానికి, దానికి ప్రచారం కల్పించటానికి స్థాపించాడు. ఇతను దేశంలో వివిధ ప్రాంతాలు తిరుగి, మండనమిశ్ర, భాస్కర, కుమారిల భట్ట, భాస్కర వంటి పండితులతో శాస్త్ర చర్చలు జరిపి వారిని ఓడించి తన బోధనలకు విస్త్రుత ప్రచారం కల్పించినట్లు శంకరవిజయాలు చెబుతాయి.
****

బౌద్ధం ప్రభావంచే వేదాలు ఉపనిషత్తులు తీవ్రమైన విమర్శకు గురయ్యాయి. ఆ సమయంలో శంకరాచార్యుడు ఉపనిషత్తులకు వ్యాఖ్యానం చెప్పాడు. వేదాలను తిరిగి చర్చలోకి తీసుకొని వచ్చి వైదిక పునర్వికాసానికి దోహదపడ్డాడు. ఇతను ఈ పని చేయకపోయి ఉన్నట్లయితే బౌద్ధం ఘాతానికి వైదికమతం కాలగర్భంలో కలిసిపోయి ఉండేది.
*****

"శ్రవణాథ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ........." అనే బ్రహ్మసూత్రానికి శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో శూద్రునికి వేదాలు వినడం నిషిద్ధమని, ఒకవేళ వింటే అతని చెవుల్లో సీసం కరిగించి పోయాలని, వేదాలు పలికితే నాలుక కొసివేయాలని అంటూ అనేక ఉపపత్తులు ఇస్తాడు. శంకరాచార్యుడు చేసిన ఇలాంటి వ్యాఖ్యానాలను అంతవరకు బౌద్ధమతం మనుషులందరూ ఒకటే అంటూ వెయ్యేళ్ళుగా తన బోధనల ద్వారా సాధించిన సమతను కాలరాసి సమాజంలో వర్ణవ్యవస్థను పునర్ ప్రతిష్టించే ప్రయత్నంగా అర్ధం చేసుకోవాలి. శూద్రునికి చదువు నిషిద్ధం అంటూ శంకరాచార్యుని చేసిన ఈ దిశానిర్ధేశం అనంతరం రాసిన అనేక పురాణేతిహాస వ్యాఖ్యానాలలో ప్రతిబింబించింది.

బ్రహ్మసూత్రకు శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో 9 అపశూద్రాధికరణం 34-38 లలో శూద్రునికి ఉపనయన సంస్కారం లేదు కనుక వేదాధ్యయనం లేదు. వేదాధ్యయనం లేదు కనుక బ్రహ్మ విద్యాధికారం లేదు అని స్పష్టంగా శూద్రులు విద్యనేర్చుకోవటానికి అర్హులు కారని ప్రకటించాడు.
ప్రాచీనకాలంలో ఆర్య అనార్య జాతులందరికీ ఉపనయన సంస్కారం ఉండేది. క్రమేపీ ఇది శూద్రులకు నిరాకరింపబడింది. ఉపనయనం ఉండటం ఒక గౌరవ సూచనగాను, లేకపోవటం దాసత్వం గాను మారిపోయింది. ఇది సమాజాన్ని నిలువునా చీల్చింది. ఉపనయనం ఉన్న పైమూడు వర్ణాలు అధికులుగాను, ఉపనయనం లేని శూద్రులు వారి సేవకులుగాను మిగిలిపోయారు. ఆ విధంగా శూద్రులు దాదాపు పరాజితులైనారు. ఇక అతిశూద్రులైతే ఈ మొత్తం ప్రక్రియలో పూర్తిగా బహిష్కృతులు.
****
 
శంకరాచార్యుడు భగవద్గీతలోని 18.41 శ్లోకానికి ఇచ్చిన వ్యాఖ్యానంలో గత కర్మల ఫలితంగా బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య శూద్రుల జన్మలు నిర్ణయమౌతాయని కర్మ సిద్ధాంతాన్ని సమర్ధిస్తాడు. కర్మ భావన అనేది ఈ జన్మలో జరుగుతున్న విషయాలకు గతజన్మలో చేసిన కర్మలే కారణం అనే వాదన. ఇది జాతిలో స్వేచ్ఛా సంకల్పం, వ్యక్తిగత ప్రయత్నాల అవసరాన్ని తగ్గిస్తుంది. ప్రజల మధ్య విభజనలు, హెచ్చుతగ్గుల పట్ల వారు ఏ పోరాటమూ చేయక అన్యాయాన్ని నిష్క్రియంగా స్వీకరించేలా చేస్తుంది. నా బ్రతుకు ఇంతే అనే నిరాశావాద ధోరణి ప్రబలుతుంది. నిజానికి వర్ణవ్యవస్థ ద్వారా 80% ప్రజలను బానిసలుగా రెండువేల సంవత్సరాలుగా కిక్కురుమనకుండా తొక్కిపెట్టటానికి దోహదపడిన మంత్రాంగంలో కర్మ సిద్ధాంతం ఒకటి.
 
భగవద్గీతలో “చాతుర్వర్ణం మయా సృష్టం….4.13 అనే శ్లోకంలో కృష్ణుడు బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య శూద్రవర్ణాలను వారి వారి గుణములు, కర్మలను బట్టి నాచే సృష్టించబడ్డాయి అంటాడు. ఈ శ్లోకానికి శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో తమోగుణము కలిగిన శూద్రులు పై మూడు వర్ణాలైన బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య వర్ణాలకు అవసరమగు సేవలు చేస్తూ జీవించాలని అన్వయం చెప్పాడు. ఇది మనుధర్మాన్ని సమాజంలో స్థిరపరచటం.
****

3. హిందూమత ఆవిర్భావం

1500–500 BCE మధ్య కాలంలో ఇంద్రుడు, అగ్ని వరుణుడు, సోముడు వంటి దేవతలు, యజ్ఞయాగాదులు, వేదాలు, ఉపనిషత్తులు ప్రభావంతో నడిచిన మతాన్ని వైదికమతం గా చెబుతారు. 600 BCE లో ఈ వైదికమతంలో విచ్చలవిడిగా సాగిన యజ్ఞయాగాదులు, బలులకు నిరసనగా బౌద్ధ, జైన, చార్వాక, ఆజీవిక లాంటి అనేక మతాలు పురుడుపోసుకొన్నాయి. వీటిలో బౌద్ధం సామాజిక సమానత్వం కలిగిఉండటం, కర్మకాండల ఒత్తిడి, జాతి ఆధిపత్యం లేకపోవటం, సరళమైన నైతిక జీవనం లాంటి అంశాలతో ప్రజలను ఆకట్టుకొంది. ఎక్కువమంది సామాన్యులు బౌద్ధంలో చేరారు. బౌద్ధం తాకిడికి వైదికమతం తన ప్రాభవాన్ని కోల్పోయింది. 600 CE నాటికి వైదిక మతం శైవం, వైష్ణవం, శాక్తేయం (శక్తి ఆరాధన), సౌర్యం (సూర్యారాధన), గణాపత్యం (గణపతి ఆరాధన), స్కంద (కార్తికేయ ఆరాధన) ఇంకా కాపాలిక, పాశుపత అంటూ శాఖోపశాఖలుగా చీలిపోయింది. అనైక్యత ఆవరించింది. శంకరుని కాలానికి 72 రకాల మతాలు ఉండేవని అంటారు.
ఇలాంటి నేపథ్యంలో శంకరాచార్యుడు తెరపైకి వచ్చాడు. బౌద్ధాన్ని మాయావాదనలతో కర్కశంగా అణచివేసాడు. వేదాలకు ఉపనిషత్తులకు భాష్యాలు రచించి వాటికి పునర్వైభవం కల్పించాడు. చీలిపోయిన వైదిక మతశాఖలన్నింటిని ఒక్కటిగా చేసి “పంచాయతన ఆరాధన” విధానాన్ని ప్రవేశపెట్టి దానికి బ్రాహ్మణుడిని అధిపతిని చేసాడు.

శివుడు, సూర్యుడు గణేషుడు, పార్వతీ దేవి, విష్ణువులను ప్రధానదేవతలుగా ఆరాధించటాన్ని పంచాయత పూజావిధానం అంటారు. ఈ విధంగా చేయటం వల్ల వేదాలను అనుసరించే శాఖలన్నీ ఒక్కటి అయ్యి బలంపుంజుకొన్నాయి. బుద్ధుడిని విష్ణువుయొక్క అవతారంగా కట్టుకథలు కల్పించారు. ఈ విధానం ప్రాచీనభారతదేశపు మతపరమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని క్షీణింపచేసింది. ఆథ్యాత్మికామార్గాలలోని భిన్నత్వాన్ని చెరిపేసింది. ఆయా మతాల అవలంబులను బలవంతంగా హిందు ధర్మంలోకి కలిపేయటం లేదా నిర్మూలించటం జరిగింది. ఇదొకరకమైన ఆథ్యాత్మిక క్రూసేడ్.

వైదిక మతం బౌద్ధమతంలోని ధ్యానం, ఆరామసంస్కృతి, విగ్రహారాధనలను స్వీకరించింది. జైనంనుంచి అహింస, సన్యాసి జీవితం, కర్మ సిద్ధాంతం లాంటి అనుకూల అంశాలను గ్రహించింది. వేదాలకు, ధర్మశాస్త్రాలకు సాంస్కృతిక రూపంగా అష్టాదశ పురాణాలను, రామాయణ, మహాభారత పురాణాలను సృష్టించుకొంది. అలా వైదిక మతం క్రమేపీ నేడు మనం చెప్పుకొంటున్న హిందూమతంగా రూపాంతరం చెందింది.

ఈ ప్రక్రియలో శంకరాచార్యుడు పోషించిన పాత్ర రాజకీయమైనది. ఈ క్రమంలో హిందూమతం స్థిరీకరించబడిందని మాట్లాడతారు తప్ప ఏరకమైన అసమానతలు, వివక్ష లేకుండా సమాజాన్ని- సమానత్వం వైపు, శాస్త్రీయతవైపు నడిపించిన బౌద్ధమతం తొలగించబడిందని ఎవరూ మాట్లాడుకోరు. బౌద్ధమతం క్షీణించటానికి ఉన్న అనేక కారణాలలో శంకరాచార్యుడు జరిపిన దాడి కూడా ముఖ్యమైనదే.

4. ముగింపు

శంకరాచార్యుడు 8 వ శతాబ్దపు వ్యక్తి అని మనకు 14వ శతాబ్దంలో వివిధ వ్యక్తులు రాసిన అతని జీవిత చరిత్రల ద్వారా అర్ధమౌతుంది. మధ్యలో ఉండిన ఆరు శతాబ్దాల ఖాళీకి సంబంధించి ఏ రకమైన ఆధారాలు లభించవు. శంకరాచార్యుడు స్థాపించినట్లు చెబుతున్న మఠాలలో కూడా శాసనాలు 14 వ శతాబ్దం నుండి మాత్రమే లభిస్తాయి. శంకరాచార్యుని సమకాలీన శాసనాలు కానీ ఉటంకింపులు కానీ దొరకలేదు. ఇతను ఒక వ్యక్తా అనేక వ్యక్తులా అనేది కూడా చెప్పలేం. ఇతను చాణుక్యుడిలా కల్పిత పాత్రకావచ్చుననే సందేహం కూడా ఉంది. సాధారణంగా చారిత్రిక వ్యక్తుల కన్నా పురాణవ్యక్తులే శక్తివంతంగా ఉంటారు. అలా శంకరాచార్యుడు నేడు శ్రీరామచంద్రునిలా పురాణపురుషుడు. పూజనీయుడు. చరిత్రను దాటి పురాణపురుషునిగా ఎదిగిన వ్యక్తి చరిత్రాతీతుడు అయిపోతాడు. ఇక అతనికి ఆపాదించబడ్డ శక్తులను నిరూపించటం చారిత్రికంగా అసాధ్యం. వారిపై చర్చను ఈ మహిమలపైనకాక ఆ మహిమలు సమాజాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయనే చారిత్రిక సత్యాలపైనే చెయ్యాల్సి ఉంటుంది. అంతమాత్రానా అతన్నీ అతని మహిమల చారిత్రికతను ఒప్పుకొన్నట్లు కాదు.
****

శంకరాచార్యుడు సామాన్యప్రజలతో సంబంధాలు పెట్టుకోలేదు. ఇతని బుధజనవర్గం వేదపండితులు. వైదికరచనలకు వ్యాఖ్యానాలు రాయటం; వర్ణాశ్రమ ధర్మాలను స్థిరీకరించటం; మఠాలు క్రతువుల ద్వారా బ్రాహ్మణాధిక్యతను స్థాపించటం; స్త్రీలకు శూద్రులకు చదువును నిరాకరించటం; బౌద్ధులను నిర్మూలించి బౌద్ధారామాల ఆక్రమణ చేయటం లాంటివి శంకరాచార్యుడు చేసిన పనులు. వీటిలో ఏవీ 90 శాతం దేశ ప్రజలకు ఉపయోగకరం కావు సరికదా వారిని పీడించేవే.

శంకరాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు చేసిన వ్యాఖ్యానాలు బౌద్ధ జైన మతాల తాకిడికి రెపరెపలాడుతున్న వైదిక ధర్మాన్ని నిలబెట్టిందని పండితులు పదే పదే చెబుతారు. “రాముడు రాక్షసులందరిని నాశనం చేసి సీతను రక్షించినట్లే, శంకరాచార్యుడు వేదాలను దూషించే బౌద్ధులను ఓడించి, ఉపనిషత్తుల సత్యమైన సీతకు పూర్వపు వైభవాన్ని పునరుద్ధరించాడు. మూడు లోకాలకు మేలు చేసిన గొప్ప శంకరునికి విజయం కలుగుగాక!” అని శంకరదిగ్విజయలో మాధవాచార్యుడు శంకరుని వేనోళ్ళ కొనియాడతాడు. (4-110)

శంకరాచార్యుని అద్వైత సిద్ధాంతం సామాన్యప్రజలకు అర్ధం కాదు. నేటికీ దానికి అన్వయం చెప్పటం సులభం కాదు. అయినప్పటికీ పండితులు అదేదో మానవేతిహాసపు మహావిష్కరణ అంటూ ప్రచారం చేసారు. శంకరుని వ్యాఖ్యానాలను చూపి వర్ణవ్యవస్థ, కర్మ సిద్ధాంతం, బ్రాహ్మణాధిక్యతను బతికించుకొని సమాజాన్ని మూఢనమ్మకాలలోకి, అసమానతలలోకి నడిపించి ధర్మం పేరుతో శూద్ర అతి శూద్ర వర్గాలను, వారి శ్రమను దోచుకుతినడానికి తెరలేపారు పండితులు.

ఈ మొత్తం చారిత్రిక మలుపులో పండితులు పోషించినపాత్ర, వారు పొందిన సామాజిక హోదా అత్యంత అమానవీయమైనది.

శంకరాచార్యునిచే ప్రవేశపెట్టబడినదిగా చెప్పే పంచాయతన ఆరాధనా విధానం వల్ల ఈదేశపు సాంస్కృతిక వైవిధ్యం అంతరించింది. బ్రాహ్మణుడు ప్రధానంగా జరిగే రిచువల్స్ కి ప్రాధాన్యత పెరిగింది.

శంకరాచార్యులు కాశీలో గంగానదిలో స్నానం చేసి వస్తుండగా ఒక చండాలుడు ఎదురుపడతాడు. అప్పటి ఆచారం ప్రకారం శంకరాచార్యులు అతన్ని దూరంగా ఉండమని చెబుతాడు. చండాలుడు శంకరాచార్యుని దేహాన్ని చూసి "మీరు దేహాన్ని దూరంగా ఉండమంటున్నారా లేక ఆత్మను దూరంగా ఉండమంటున్నారా?" అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నకు శంకరాచార్యులు తన అజ్ఞానాన్ని తెలుసుకొని చండాలుని సాక్షాత్తు శివునిగా గుర్తించి నమస్కరిస్తాడు. శంకర దిగ్విజయంలో చెప్పిన ఈ చండాలుని వృత్తాంతం చూపుతూ శంకరాచార్యుడు అంటరానితనాన్ని నిరసించాడని, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలిచాడని కొందరు పండితులు వాదిస్తారు. నిజానికి పై ఘట్టంలో సమానభావన ఎక్కడ ఉంది? అదే శంకరదిగ్విజయంలో శంకరాచార్యుడు సాక్షాత్తూ శివావతారమని చెప్పినప్పుడు చండాలుని రూపంలో వచ్చిన మరొక శివుడు ఎవరు? ఇవన్నీ అన్వయాలపేరుతో పండితులు చేసే మోసాలు.

శంకరాచార్యుని ప్రభావం నేటికీ సమాజంలో ఉంది. ఉదాహరణకు డా. అంబేద్కర్ మహాసయుడు పార్లమెంటులో హిందూకోడ్ బిల్ ప్రవేశపెడుతున్నప్పుడు కర్ణాటకలోని శంకరాచార్యుని స్కూల్ కు చెందిన సంకేశ్వర మఠాధిపతి "గంగాజలం పవిత్రమైనది కావచ్చు, కానీ అది వీధి కుళాయి ద్వారా వస్తే, దానిని పవిత్రంగా పరిగణించలేము. అదేవిధంగా, 'ధర్మశాస్త్రం' (హిందూకోడ్ బిల్) ఎంత ప్రామాణికమైనదైనా, డాక్టర్ అంబేద్కర్ వంటి 'మహర్' నుండి వచ్చినందున దానిని ప్రామాణికంగా పరిగణించలేము" అన్నాడు. శతాబ్దాలతరువాత కూడా శక్తివంతంగా నిలిచిన శంకరాచార్యుని “మహానుశాసనం” అది.

వర్ణవ్యవస్థను సమాజంలో స్థిరపరచి బౌద్ధం వల్ల మసకబారిన బ్రాహ్మణాధిక్యతకు పునర్వైభవం తెప్పించినందుకు నేటికీ పండితులు శంకరాచార్యుడిని “శంకరభగవత్పాదులు” అనీ, సాక్షాత్తూ శివావతారమనీ గొప్ప భక్తి ప్రపత్తులతో, కృతజ్ఞతాపూర్వకంగా పిలుచుకొంటారు. శంకర జయంతి పేరిట ఏటా పెద్దఎత్తున పూజలు, వేడుకలు జరుపుకొంటారు.
***

ఈరోజు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛతో చదువుకొని గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్న బహుజనులు, ఒకప్పుడు తాము బానిసత్వపు చీకటిలోకి ఎలా నెట్టబడ్డారో, శతాబ్దాలుగా అక్కడే ఎలా ఉంచబడ్డారో ఆ మంత్రాంగాన్ని అర్థం చేసుకునే క్రమంలో శంకరాచార్యుడు పోషించిన పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలించాలి. గతమెంతో గొప్పది, అందరినీ అక్కడికే నడిపిస్తాం అంటూ పండితులు ప్రచారిస్తున్న నేపథ్యంలో ఇలాంటి అవగాహన అవసరం.

బొల్లోజు బాబా


సంప్రదించిన పుస్తకాలు
1. 1. Brahma Sutra Bhasya Of Shankaracharya by Swami Gambhirananda, pn233
2. శ్రీశంకరావతార చరితము, యఱ్ఱాప్రగడ వేంకట సూర్యనారాయణ మూర్తి
3. The Buddhist Antiquities of Nagarjunkonda, by A.H.Longhurst, Delhi, 1938, p.6.
4. complete Works of Swami Vivekananda, vol. VII, p.116
5. Tirupati Balaji was a Buddhist Shrine, by K. Jamanadas
6. Sankara Digvijaya, Translated by Swamy Tapasyananda, Ramakrishna math publication.
7. శ్రీశంకర విజయము, చిలుకూరు వెంకటేశ్వర్లు
8.ఆదిశంకరాచార్య వ్యక్తిత్వం తత్వం – రావిపూడి వెంకటాద్రి
9. Decline and Fall of Buddhism, by Dr.KJamnadas
10. Slavery, Jyothirao Phule
11. On Hinduism, Wendy Doniger
12. వేదబాహ్యులు, బొల్లోజు బాబా



9 comments:

  1. మంచి శోధన.
    ఇల్లాంటిదే మరో రెండు ఇస్లామీయుల క్రూసేడ్, క్రిస్టియానిటీ క్రూసేడ్లను కూడా పరిశోధించి వ్రాయండి.

    చదవటానికి ఉత్సుకత కలిగించేలా వుంది.



    ReplyDelete
    Replies
    1. నాకేం పని?. అది రాసేవాళ్ళు ఉంటారు అవి వెతుక్కొని వెళ్ళి చదూకోండి.
      నేనేం రాయాలో కూడా చెబుతారా?

      Delete
    2. అంటే మీరు బాగా శోధన చేసి బ్యాలెన్సుడు గా రాస్తారని‌ అడిగామండి మిగిలిన వార్ల వి‌వుంటాయనుకోండి అవైతే ఏదో అజెండా పెట్టుకుని‌ రాసేరేమో‌ అనిపించేలా వుంటాయి. అందుకని‌ అడిగినట్లు.

      కాదంటే వద్దులెండి


      Delete
    3. వాటిపై నాకు అవగాహన లేదు. శంకరాచార్యుని గురించి హైస్కూలునించీ వింటున్నాను. చదూకున్నాను. ఆ పునాదుల్లోంచి మరింత లోతుగా అధ్యయనం చేసి ఈ వ్యాసం రాసాను. అయినా నా మతం గురించి నేను రాయగలను కానీ ఇతరమతాలలో వేళ్ళు పెటటం ఉచితం కాదని భావిస్తాను. ఆ పని ఆ మతంవాళ్ళు చేయటమే భావ్యం. మనకెందుకు వారి విషయాలు అనుకొంటాను. మంచి అనుకోండి ఎవరైనా చెప్పొచ్చు. ఇలాంటి గ్రే ఏరియాస్ ను ఆ మతానికి చెందిన వారే చెప్పుకోవటం మర్యాద.

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Please excuse this comment being in English. While I'm more comfortable expressing myself in Telugu, typing in that language is difficult for me, and I want to ensure clarity. Also, some of the content I'm referencing is in English, and I want to quote it directly.

    I was surprised to read the claim that Shankara burned Buddhists to death. In researching this, I found the following discussion, including a link and excerpt:

    https://www.advaita-vedanta.org/archives/advaita-l/2004-March/012857.html

    This discussion highlights a crucial point: the quote often used to support this claim is incomplete and misleading. A common version reads:

    “> 'And, such was the heart of Sankara that he burnt to death lots of Buddhist monks by defeating them in argument. What can you call such action on Sankara's part except fanaticism.' (Complete works of Swami Vivekananda, Vol. III, p. 118, Calcutta, 1997)."

    However, the complete quote from Swami Vivekananda (Vol. 7, p. 118) is:

    'And such was his (i.e. Shankara's) heart that he burnt to death lots of Buddhist monks - by defeating them in argument! And the Buddhists, too, were foolish enough to burn themselves to death, simply because they were worsted in argument! What can you call such an action on Shankara's part except fanaticism?'

    The omitted sentence drastically changes the meaning. The full quote suggests that the Buddhists, not Shankara, were responsible for the burnings—likely acts of self-immolation after their defeat in debate. This is a significant difference.

    Furthermore, I consulted the Shankara Digvijaya by Swami Tapasyananda (Ref 6, as you mentioned), available on archive.org. The foreword explains that many Shankara Digvijayas exist, but most are considered inauthentic. The Madhaviya Shankara Digvijaya is generally regarded as the most reliable. I reviewed the chapter detailing Shankara's Digvijaya Yatra with King Sudhanwa and found no mention of him burning Buddhists.

    Therefore, the claim that Shankara burned Buddhists to death appears to be unsubstantiated, likely based on a misquotation and unsupported by authoritative historical accounts like the Madhaviya Shankara Digvijaya.

    ReplyDelete
    Replies
    1. thank you for telling your point in well mannered way sir. I respect your views.
      regarding my point of view

      I gave the book and page no of Vivekananda in the end references.

      I read the paragraph

      'And such was his (i.e. Shankara's) heart that he burnt to death lots of Buddhist monks - by defeating them in argument! And the Buddhists, too, were foolish enough to burn themselves to death, simply because they were worsted in argument! What can you call such an action on Shankara's part except fanaticism?'

      in this paragraph "that he burnt to death" is the main clause of the sentence. after exclamatory another sentence starts with "and the Buddhists too....

      I dont think they change the meaning any way as you proposed. Even the last sentence fanatism refers to shankara not Buddhists just read again sir.


      ok. There are many internal evidences for execution or termination of Buddhists jains and kapalikas in the shakara digvijaya of Madhava

      I gave enough examples you may kindly refer


      1. 1.27-56 శ్లోకాల సారాంశం పేజెస్ 5-7 ఫ్రం SWAMI TAPASYANANDA

      2. (7- 77-121) Sankara Digvijaya,Translated by Swamy Tapasyananda, Ramakrishna math publication.

      3. నాగార్జునకొండ రిఫరెన్స్: The Buddhist Antiquities of Nagarjunkonda, by A.H.Longhurst, Delhi, 1938, p.6.

      4.శ్రీశంకరావతార చరితము, యఱ్ఱాప్రగడ వేంకట సూర్యనారాయణ మూర్తి మహానుశాసనం 302-303

      5. I-3-38. Brahma Sutra Bhasya Of Shankaracharya by Swami Gambhirananda, pn233


      ఇవన్నీ నేను శంకరాచార్యుని కొటేషన్స్ కి తీసుకొన్న రిఫరెన్సులు.

      మాధవాచార్యుని అంతర్గత ఆధారాలలో బౌద్ధుల నిర్మూలన లేదూ జయించటం జరిగిందని అనేక ప్రస్తావనలు కనిపిస్తాయి.

      ప్రతి చొటా ఆయాశ్లోకాల నంబర్లు ఇచ్చను. చూడగలరు.

      ఎంత చేసిన చివరకు ఇవి నా అభిప్రాయాలు, నాకు అలా కనిపిస్తుంది అని మాత్రమే అనగలను. మీకు భిన్నమైన అభీప్రాయాలుండొచ్చనే అవకాశాన్ని కాదనను. ఇంటలెక్చువల్ ప్లేన్ లో దృక్కోణాలు అనేకం ఉంటాయని నమ్మే వ్యక్తిని.

      థాంక్యూ సర్.

      బొల్లోజు బాబా

      Delete
  4. Sir,
    Regarding the claim that Shankaracharya demolished Nagarjunakonda:
    I spent my formative years and intermediate schooling in Mangalagiri. I was drawn to left-leaning ideology and rationalism (Hetuvadam), and many of our lecturers admired Gora. I was an avid reader, participated in debates, and my teachers and peers were supportive. I read extensively from Nastika Kendram and Charvaka Vidya Peetham, among others.
    In the numerous lectures and debates I attended, I never heard anyone claim that Shankaracharya destroyed Nagarjunakonda. While there was discussion about Hindu kings potentially destroying Buddhist viharas, Shankaracharya's name was never mentioned in this context.
    Nagarjunakonda is in the same district, and I visited the site twice. Once was during my college years, and the second time was a few years later, after the site was reconstructed near Nagarjuna Sagar. Neither the locals nor the tour guide ever mentioned Shankaracharya as the destroyer of Nagarjunakonda.
    My online searches have yielded only one reference to this claim: the one you provided, by A.H. Longhurst.
    He states, "Local tradition relates that the great Hindu philosopher and teacher Sankaracharya of medieval times came to Nagarjunakonda with a host of followers and destroyed the Buddhist monuments."
    However, he attributes this to local lore without providing any definitive sources.
    Therefore, I believe there is no convincing evidence to support the claim that Shankaracharya destroyed Nagarjunakonda.

    ReplyDelete
    Replies
    1. sir,
      as I told you in my earlier comment, I can only give sources for my narrative.
      No one can prove vividly what really happend after a 1200 years that run by the winners.

      Please, Read all my references. I believe, If all dots are connected, persecution of buddhists might have happend.

      thank you sir

      Delete