Monday, January 15, 2024

లేని గుర్రం కొరకు వెతుకులాట


భారతదేశానికి సంబంధించిన సామాజిక పరిణామక్రమంలో సింధులోయ నాగరికత (హరప్పా) అత్యంత పురాతనమైనది. దీని పరిపక్వ దశ 2600 - 1900 BCE మధ్య నడిచింది.
దీని తరువాత 1500–500 BCE మధ్య చారిత్రిక వేదికమతం విలసిల్లింది. వేదాలు రచింపబడ్డాయి. వేదాలు బ్రాహ్మణవాదానికి పునాదులు వేసాయి. ఋగ్వేద ఆర్యులు మొదట్లో పశుపాలకులుగా జీవనం సాగించి క్రమేపీ అడవులు నరికి వ్యవసాయిక జీవనంకూడా చేపట్టారు. వేదికమతం క్షీణదశకు వచ్చేకాలానికి నగరాలు, పట్టణాలు పెరిగి జైన, బౌద్ధ శ్రమణ సంస్కృతి అభివృద్ధి చెందింది. ఇవి సంప్రదాయిక వేదికమతానికి పోటీగా నిలిచాయి. మరలా ఆరో శతాబ్దం తరువాత వేదిక మతం అప్పటికి ఉన్న అన్ని ఆరాధనవిధానాలను కలుపుకొని పురాణ హిందూమతంగా అవతరించింది.
 
బ్రాహ్మణవాదులు పురాణహిందూమతం అత్యంతపురాతనమైనదని, దాని నుంచే అన్ని మతాలు ఆవిర్భవించాయని అది అనేక వేల లక్షల సంవత్సరాల క్రితానిదని వాదిస్తారు. తమ విశ్వాసాలు అత్యంతప్రాచీనవైనవని చెప్పటం కొరకు, వైదికమత కాలాన్ని (1500BCE) దాటి మరింత వెనక్కు వెళ్ళి సింధులోయ నాగరికత ప్రజలుకూడా కూడా వేదిక ధర్మం పాటించేవారని చెబుతారు.
ఇది నిజం అవ్వాలంటే వేదాలలో విరివిగా వర్ణించబడిన గుర్రాలు, ఆకులచక్రాల రథాలు సింధులోయనాగరికతలో కూడా కనిపించాలి. ఇలాంటి ప్రయత్నాలకు “గుర్రం” అడ్డుకట్ట వేస్తుంది. ఎందుకంటే గుర్రం భరతఖండానికి దేశీయమైన ప్రాణి కాదు. బయట నుంచి ఆర్యులచే తీసుకురాబడింది.

వేదికఆర్యసమాజం గుర్రం కలిగి ఉన్న, పశుపాలక సమాజము కాగా సింధులోయ ప్రజలు వ్యవసాయక సమాజం. వీరికి గుర్రం తెలియదు.
 
శాస్త్రీయ ఆధారాలను పరిశీలించినపుడు సింధునాగరికత అంతరించిపోయాక మాత్రమే గుర్రం కనిపిస్తుంది. ఇది బ్రాహ్మణవాదులకు మింగుడు పడదు. వేదిక ఆర్యులు సింధులోయ ప్రజల కంటే తరువాత జీవించిన సమాజమని Sir. John Marshal 1931లోస్పష్టంగా చెప్పాడు.
.
1. గుర్రం ఎక్కడినుంచి వచ్చింది?

నేడు మనం చూస్తున్న గుర్రం Pontic-Caspian steppe (నేటి ఉక్రైన్, రష్యా, కజకిస్తాన్ ప్రాంతాలు) అనే ప్రాంతంలో మచ్చికచేయబడి BCE 2200 లో అక్కడినుండి వివిధ ప్రాంతాలకు విస్తరించి, త్వరలోనే ఇది ఆసియా, యూరోప్ ప్రాంతాలకు చేరిందని - Ludovic Orlando నేతృత్వంలో 162 మంది శాస్త్రజ్ఞులు, 273 వివిధ గుర్రాల జీనోమ్ లను పరిశీలించి నిర్ధారించారు. [1]
BCE 1800 నుంచి క్రమక్రమంగా ఆసియాలో ఆకులచక్రాలు కలిగిన రథాల అవశేషాలు, గుర్రాల అస్థిపంజరాలు ఆర్కియలాజికల్ తవ్వకాలలో కనిపించటం మొదలైంది. ఈ కాలానికి సింధులోయ నాగరికత పూర్తిగా క్షీణించింది. అంటే సింధులోయనాగరికత అంతరించాకా గుర్రాలు ప్రవేశించాయి. ఇది చారిత్రికంగా ఆర్యుల వలస వాదాన్ని సమర్ధిస్తుంది. ఎలాగంటే -
భారతీయ ఉపఖంఢంలోకి మూడవ విడత వలస ద్వారా c2000 BCE లో Pontic-Caspian steppe (ఉక్రయిన్, రష్య, కజకిస్తాన్) ప్రాంతాలనుంచి Yamnaya Steppe pastoralist లు గుర్రాలు కట్టిన రథాలపై భారతదేశంలోకి ప్రవేశించారు . వీరు పశుపాలకులు. వీరు తమతో pre-Sanskrit and pre-Indo-Aryan భాషలను తీసుకొని వచ్చారు. వీటినుంచి సంస్కృతం, ఇతర భారతీయ భాషలు ఆవిర్భవించాయి. వీరు ఋగ్వేద ఆర్యులు. అందుకనే ఋగ్వేదంలో గుర్రాలను వర్ణిస్తూ రెండువందలకు పైన శ్లోకాలు ఉన్నాయి.

2. సింధులోయ నాగరికతలో గుర్రం లేదు


సింధులోయ నాగరికత అవశేషాలు లభించిన చోట్ల ఇంతవరకూ జరిగిన తవ్వకాలలో గుర్రానికి సంబంధించి ఒక్క అస్థిపంజరంకానీ, ఎముకలు కానీ లభించలేదు
లభించిన అనేక టెర్రకోట మట్టిప్రతిమలలో ఒక్క గుర్రం బొమ్మకూడా లేదు. ఒకే ఒక్క గుర్రం బొమ్మనొకదానిని చూపుతారు కానీ అది గుర్రమా లేక మరేదైనా మేక లాంటి జంతువా చెప్పలేము.
సింధులోయలో లభించిన కొన్ని వందల ముద్రలలో అనేక ఇతర జంతువులైన ఏనుగులు, పులులు, ఎద్దులు, ఖడ్గమృగాలు, నీల్గై లాంటివి ఉంటాయి తప్ప ఒక్క గుర్రం బొమ్మ కలిగిన ముద్ర లభించలేదు.
సింధులోయ ప్రాంతాలలో గుర్రాల అస్థికలు BCE 1500 నుండి మాత్రమే లభిస్తూండటం కూడా ఋగ్వేద ఆర్యులు గుర్రాలులాగే రథాలు ఎక్కి బయటనుంచి వచ్చిన విషయాన్ని దృవీకరిస్తుంది. కానీ ఈ తమ విదేశీమూలాలను అంగీకరించటానికి బ్రాహ్మణవాదులు సిద్ధంగాలేరు. సింధులోయనాగరికత నుంచీ మేము ఇక్కడే నివసిస్తున్నాము, అప్పటి ప్రజలు వేదావలంబులు, మేము కూడా ఈ దేశపు మూలవాసులమేనని అని నిరూపించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆధునిక జన్యు, భాషాపరమైన ఆవిష్కరణలు వారి వాదనలను బలహీనపరుస్తాయి.

బ్రాహ్మణవాదులు కొందరు చేసే వాదనలు

1. బింబెత్క గుహ చిత్రాలు: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌సేన్ జిల్లాలో ఉన్న బింబెట్క గుహలలో, రాతి యుగం నాటి నుండి మధ్యయుగం వరకు గుహ చిత్రాల సమూహం ఉంది. ఈ చిత్రాలు 7000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవిగా భావిస్తారు.
ఈ చిత్రాలలో గుర్రాలు ఉండటాన్ని, భారతదేశంలో గుర్రాలు 7000 సంవత్సరాల నుంచీ ఉన్నాయని కొందరు వాదిస్తారు. కానీ ఈ చిత్రాలు వివిధ కాలాలలో లిఖించబడ్డాయి. మొదటి దశలలో గీసిన చిత్రాలలో ఏ రకమైన గుర్రం బొమ్మలు లేవు. గుర్రం బొమ్మలు ఉన్న కాలం సుమారు 300 BCE గా గుర్తించారు. ఇది భారతదేశంలోని గుర్రాల ప్రాచీనతకు ఏ రకమైన ఆధారం కాజాలదు.
 
2. సినౌలి రథం (Sinauli Chariot) 2018 లో ఉత్తరప్రదేష్ లో సినౌలి వద్ద జరిపిన బృందం అధ్యక్షుడు సంజయ్ మంజుల్- తమకు గుర్రాలు లాగే రథం దొరికిందని అని ప్రతిపాదించగా దానిని చాలామంది అంగీకరించలేదు. ఆర్యులరథానికి ఆకులచక్రాలు ఉండటం ముఖ్యమైన చిహ్నం అని Edwin Bryan అనే ఇండాలజిస్టు అభిప్రాయపడ్డాడు. సినౌలి లో దొరికింది సాలిడ్ చక్రాలు కలిగిన బండిగా గుర్తించారు.

ఈ బండిని లాగేది ఎద్దులా లేక గుర్రమా అనేది నిర్ధారణ కాలేదు. సినౌలిలో దొరికిన బండి సమీపంలో ఏ రకమైన గుర్రం యొక్క అవశేషాలు లభించలేదు.
 
3. సుర్కోతడ (Surkotada Horse-): గుజరాత్ సుర్కోతడ వద్ద Equus caballus జాతికి చెందిన గుర్రం ఎముకలు లభించాయని ఇవి వేదపూర్వకాలానికి చెందినవవిగా గుర్తించారు. (Sharma 1974). కానీ ఈ ఎముకలు గాడిదకు చెంది ఉండవచ్చునని Meadow (1987) అభిప్రాయపడ్డాడు. ఈ ఎముకలకార్బన్ డేటింగ్ పై కూడా అనుమానాలు కలిగాయి. సుర్కోతడ వద్ద లభించినట్లు గా చెబుతున్న ఎముకలు హరప్పా సైటు పై పై పొరలలోంచి లభించాయి, వీటిని మరింత లోతుగా అధ్యయనం చేయవలసి ఉందని Richard Meadow అన్నాడు. [3]

4. 1999లో, NS Rajaraman, హరప్పాలో గుర్రాల ఉనికికి ఋజువులు ఉన్నాయని, గుర్రం ముద్ర కూడా ఉందని పేర్కొన్నారు. కానీ, అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం చెందిన ఇండాలజిస్టు మైఖేల్ విట్జెల్, డిజిటల్ గ్రాఫిక్స్ ఉపయోగించి సృష్టించిన ఆ ముద్ర ఒక నకిలీ (Hoax) అని నిరూపించారు.[2]
 
ముగింపు

తమ విశ్వాసాలు వేల సంవత్సరాల క్రితానివి, లక్షల సంవత్సరాలకు పూర్వానివి అని చెప్పటం ఆధునిక కాలంలో కుదరదు. ప్రతి దానికి ఆధారాలు చూపాలి. సరైన ఆర్కియలాజికల్, భాషాపరమైన, జన్యుపరమైన ఆధారాలు చూపి ఏ వాదనైనా సహేతుకంగా చెప్పినప్పుడు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండాలజిస్టుల పరీక్షలకు తట్టుకొని నిలబడగలుగుతుంది. లేకపోతే ప్రపంచ చరిత్రకారులముందు మన వాదనలు Hoax లు గా మిగిలిపోతాయి.
 
బొల్లోజు బాబా

[1] origin-domestic-horses-finally-established
[2] putting-the-horse-before-the-cart-what-the-discovery-of-4000-year-old-chariot-in-up-signifies, Scroll Article
[3] A Comment on “Horse Remains from Surkotada” by Sándor Bökönyi




4 comments: