Saturday, July 30, 2016

అనుభూతి పరిమళాలు అద్దుకొన్న "ద్విభాషితాలు”


"తెలుగు కవిత్వం ప్రధానంగా రీతి కవిత్వం. ఇది బహుసా సంస్కృత సాహిత్యం నుంచి కూడా మనకు వచ్చిఉంటాది. రీతి కవిత్వం అంటే ఏదైనా కూడా వర్ణణాత్మకంగా ఉండాలి, వివరంగా ఉండాలి, ధారాళంగా ఉండాలి, కవిత్వ ధార ఉండాలి. – వాడ్రేవు చినవీరభద్రుడు, ప్రముఖ కవి, విమర్శకులు." 

ప్రముఖ వైణిక విద్వాంసుడు శ్రీ ద్విభాష్యం నగేష్ బాబు రచించిన “ద్విభాషితాలు” కవిత్వ సంపుటిలోని కవితలను పరిశీలించినట్లయితే- వీరభద్రుడు గారు అన్నటువంటి ధార కనిపిస్తుంది. అక్షర విన్యాసం, వివరణాత్మక వర్ణణలు ఈ కవితలను సౌందర్యభరితం చేసాయి. అదే సమయంలో గుండెను తడిపే ఆర్థ్రత అంతర్జలలా ప్రవహిస్తూంటుంది.
మనం రోజూ చూసే దృశ్యాలు, కలిగే అనుభవాలు, పొందే అనుభూతులు శ్రీ నగేష్ బాబు కలం లోంచి జాలువారి చక్కని కవితావాక్యాలుగా శిల్పీకరించుకొన్నాయి. సరళమైన శైలి, వస్తువైవిద్యం, సౌందర్యాన్ని పట్టిచ్చే సూక్ష్మ దృష్టి, మారుతున్న మానవవిలువలను గుర్తించి వాటిని నిలుపుకోవటానికి చేసే ప్రయత్నం, కల్మషమెరుగని హృదయం ప్రకటించే సామాజిక స్పృహ, ఏదైనా ఒక సత్యవాక్యమో సుందరస్వప్నమో దొరకకపోతుందా అంటూ లోలోపలికి చేసుకొనే అంతర్వీక్షణా – ఇవీ శ్రీ నగేష్ బాబు కవితా లక్షణాలు.

సౌందర్యం అనేది ఈ కవిని వెంటాడే లౌల్యం. అనేక కవితలలో ఈ విషయం తెలుస్తూంటుంది. అందుకనే ….

“ఉదయాస్తమయాల అంచులు
వర్ణరంజితమైనప్పుడు
దృశ్యమే ఐశ్వర్యం (అమృతవర్షం) అంటూ రంగులద్దుకొన్న సంధ్యలను వర్ణిస్తాడు. 


నవ వధువు లజ్జాభరిత వదనంలా
సరస్సులో కలువలు
హిమస్నాన కేళీవిలాసంలో తడిసి
మలయపవనంలో… దేహాల్ని ఆరబెట్టుకొంటున్న పైర్లు
(లోపలిస్పర్శ) అంటూ సుందర దృశ్యాన్ని మన కళ్లముందు నిలుపుతాడు.

వెలుగు పడమటిపొలం మలుపు తిరిగినప్పుడు…
పక్షుల రెక్కలపై వాలి… గూడు చేరుతుంది రాత్రి (రాత్రిగీతం)
అంటూ చీకటిపడేవేళని అద్బుతపదచిత్రంగా లిఖిస్తాడు.

వేడెక్కిన సముద్రం ఎల్ నినో ప్రయోగించి…
నగర వీధుల్లో పడవల్ని తిప్పుతోంది (సంవత్సరోత్సవం)
అన్న వాక్యాల్లో నేడు ఆధునిక మానవుడు చేస్తున్న ప్రకృతివిధ్వంశాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తాడు.

మంచి ఎత్తుగడ, నడక, ముగింపులతో సాగిన “వైణికుని సాధన” అనే కవిత, స్వయంగా వైణికవిద్వాంసుడయిన శ్రీ నగేష్ బాబు మాత్రమే వ్రాయగలిగే కవిత.

ఇంట్లో గోడవారన నిలబెట్టిన వీణను చూస్తే….
నానుంచి నేను విడిపోయి..
నాకోసం నిరీక్షిస్తున్నట్లుంది
తరాల సంస్కృతిని నాకు ఉపదేశం చేయడానికి
నా ముందు ప్రత్యక్షమై
దీక్షలో కూర్చొన్న మహారుషిలా వుంది…….
అంటూ మొదలైన కవిత “వీణ నా తపస్సు/వీణ నా యశస్సు// నాకు వరంగా దొరికిన ధనస్సు!” అంటూ ముగుస్తుంది. సునాదవైణికునిగా పలు జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలెన్నో ఇచ్చిన ఒక విద్వాంసుని జీవితంతో వీణావాద్యం ఎలా పెనవేసుకుపోయిందో కవితాత్మకంగా ఆవిష్కరిస్తుందీ కవిత.

“అద్దం మీద పిచుక” కవితలో- అద్దంమీద పిచుక తన ప్రతిబింబాన్ని ఎలాగైతే శోధించుకొంటుందో అలాగే మనిషికూడా ఒక్కసారైనా అద్దంమీద పిచుక కావాలి, తనని తాను తవ్వుకోవాలి అంటారు నగేష్ బాబు. Know Thyself అని సోక్రటిస్ అన్న మాటకు ఒక చక్కని Alligory ను జోడించి గొప్ప తాత్విక భావాన్ని హృద్యంగా వర్ణించారు.

“నాన్న” అనే శీర్షిక పెట్టి “అమ్మ” పై వ్రాసిన కవిత చాలా కరుణరసార్థ్ర భరితంగా ఉంది. చాలా మంచి కవిత ఇది.
“లోపలి స్పర్శ” కవితలో కనిపించే అంతర్వీక్షణం, “దర్శనం” లో చూపించిన దైవత్వం, “మెరుపు” లో పలికిన మౌనప్రేమ, “మూడు కాళ్ళ కుందేలు” కవితలో వ్యక్తమైన వ్యంగ్యం, – వంటివి “ద్విభాషితాలను” ఉత్తమ కవిత్వంగా నిరూపిస్తాయి.

రచయిత ఫోన్.నం: 9849439170
మెయిల్: nageshbabuveena@gmail.com
*****
29-7-2016 న పల్లెపాలెంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో, శ్రీ వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ అదృష్ట దీపక్, శ్రీ మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, శ్రీ శిఖామణి లు పాల్గొన్నారు.
బొల్లోజు బాబా

1 comment:

  1. Thanks for the information..see the indomitable power of blogging...Keep it up my friend..all the best..!

    ReplyDelete