Monday, April 7, 2025

ఎమర్జెన్సీ- ఆరెస్సెస్ పాత్ర

శ్రీమతి ఇందిరాగాంధీ భారతరాజ్యాంగంలోని ఆర్టికిల్ 352 ప్రకారం దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇది 1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకు కొనసాగింది. ఈ సమయంలో పౌరహక్కులు, పత్రికా స్వేచ్ఛ, న్యాయస్వాతంత్రం నిలిపివేయబడ్డాయి. ఎమర్జన్సీకి నేడు యాభయ్యవ సంవత్సరం నడుస్తోంది. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ అత్యంత వివాదాస్పదమైన ఘట్టం. 

ఇందిరాగాంధి లోక్ సభ ఎన్నిక చెల్లదని ఇచ్చిన కోర్టు తీర్పును తప్పించుకోవటానికి, ప్రత్యర్ధులను జైళ్ళలో పెట్టించటానికి ఎమర్జెన్సీ విధించింది అని నేటికి ఆరెస్సెస్ దాని రాజకీయముఖమైన బిజెపి పార్టీ ఆరోపణలు చేస్తాయి.  

ఇందిరాగాంధి ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో లోక్ సభలో చేసిన ప్రసంగపాఠాలు Press Information Bureau ఆర్చైవ్స్ రూపంలో ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. వాటి ఆధారంగా- ఎమర్జెన్సీ విధించటానికి గల కారణాలలో RSS పాత్ర ప్రధానంగా ఉన్నట్లు అర్ధమౌతుంది. RSS నాయకత్వంలో నడిచే జనమోర్చ వల్ల దేశప్రజాస్వామ్యానికి ముప్పువాటిల్లనుందని దానిని తప్పించటానికే ఎమర్జెన్సీని విధించినట్లు ఆమె ప్రసంగ పాఠాల ద్వారా తెలుస్తుంది.

****

1. ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులు

1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధం కారణంగా దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. 1973లో ప్రపంచ చమురు సంక్షోభం ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. 1974లో రైల్వే ఉద్యోగుల సమ్మె వల్ల దేశంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. 1973లో గుజరాత్‌లో విద్యార్థులు చేపట్టిన "నవనిర్మాణ ఉద్యమం" హింసాత్మకంగా మారింది. దీని ఫలితంగా రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. అయినప్పటికీ, మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ఆందోళనలు కొనసాగాయి.

1974లో బీహార్‌లో జయప్రకాశ్ నారాయణ్ "సంపూర్ణ క్రాంతి" (సంపూర్ణ విప్లవం) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం హింసాత్మకంగా మారి, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం జరిగింది. ఇందిరా గాంధీ ఈ ఉద్యమాలను దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఆందోళనలుగా, అంతర్గత భద్రతకు విఘాతకరంగా అభివర్ణించారు. ఈ అల్లర్లలో వందల మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. 

ఈ సంఘటనల వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందని ఇందిరా గాంధీ గుర్తించారు. దేశం అరాచక శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆమె భావించారు. ఈ నేపథ్యంలో 1975లో అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువడింది.

ఇందిరాగాంధీ రాయబరేలి నియోజకవర్గం నుండి 1971 లో లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికకావటాన్ని ప్రత్యర్ధులు కోర్టులో సవాలు చేసారు. ఆమె ప్రభుత్వ యంత్రాంగాన్ని/వాహనాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించి దుర్వినియోగం చేసారని, పరిమితిని మించి ఎన్నికల ఖర్చు చేసారని; పార్టీ గుర్తయిన “ఆవుదూడ” చిహ్నం మతపరమైనదిగా ఉంది అని వివిధ అభియోగాలతో ఆమె ఎన్నికను రద్దు చేస్తూ, ఆమెను ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేదిస్తూ 1975 జూన్ 12 న అలహాబాద్ హైకోర్టు తీర్పుచెప్పింది. దీనిపై సుప్రీమ్ కోర్టుకు వెళ్ళగా అక్కడ ఆమెకు ప్రధానిగా కొనసాగేందుకు స్టే లభించింది తప్ప తీర్పురద్దు ఊరట లభించలేదు. 

జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో జనతాపార్టీ, జనసంఘ్ (ఇది నేటి బిజెపి పూర్వరూపం), సమాజ్ వాద పార్టీ, భారతీయలోక్ దళ్ వంటి పార్టీలన్నీ కలిసి జూన్ 25, 1975న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఒక భారీ ర్యాలీని నిర్వహించి “సైన్యం, పోలీసులను ప్రధాని ఇందిర ఆదేశాలను పాటించవద్దని పిలుపునిచ్చాయి”. ఇలాంటి పరిస్థితులలో దేశంలో అరాచకత్వం పెచ్చరిల్లువచ్చునని తలచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కొరకు జూన్ 25, 1975 రాత్రి ఇందిర దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. 

****

2. శ్రీమతి ఇందిరాగాంధి వాదన

తాను ఎందుకు ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందో జూలై 22, 1975 న ప్రధానిహోదాలో శ్రీమతి ఇందిరాగాంధి లోక్ సభలో సుదీర్ఘంగా ప్రసంగించింది. ఆ ప్రసంగపాఠం Preserving our Democratic Structure, Prime minister explains reason for emergency పేరుతో ఆర్చైవ్స్ లో లభిస్తుంది. ఈ ప్రసంగంలో దేశాన్ని ఆరెస్సెస్ నుంచి కాపాడటానికే ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆ ప్రసంగపాఠంనుంచి కొన్ని ముఖ్యాంశాలు. 

• ఆరెస్సెస్ వారు తమ శాఖలలో యువతకు ఇచ్చే శిక్షణ, వారు బోధించే హింసను నేను ఖండిస్తున్నాను. 

• ఆరెస్సెస్, జనసంఘ్ ల ప్రధాన ఆయుధం అబద్దాలను ప్రచారం చెయ్యటం 

• ఫాసిజం అంటే అణచివేత మాత్రమే కాదు. ఫాసిజం అంటే అబద్దాలను సృష్టించి వాటిని విస్తృతంగా ప్రచారం చేయటం. 

• ఇది మా (కాంగ్రెస్) విధానం కాదు. మేము అసత్యాలను, అబద్దాలను నమ్మం. 

• “జర్మన్లు తమ జాతి సాంస్కృతిక స్వచ్చతను కాపాడుకోవటం కోసం తమదేశం నుండి యూదులను తరిమేసారు. ఈ అంశాన్ని భారతదేశం నేర్చుకోవలసి ఉంది” అని గోల్వాల్కర్ అన్నాడు

• 1969 అలహాబాదు అల్లర్లలో జనసంఘ్ నేత్రుత్వంలో ముస్లిములు, ముస్లిముల ఆస్తులపై దాడులు జరిగాయని ఎంక్వయిరీ రిపోర్టు తెలిపింది.  

• 1971 టెలిచెరి దాడులలో ముస్లిముల పట్ల హిందువులలో ద్వేషభావనలను రెచ్చగొట్టడంలో ఆరెస్సెస్ ముఖ్యమైన పాత్ర వహించిందని ఎంక్వయిరీ రిపోర్టు చెప్పింది. 

• “క్రైస్తవులు చూడటానికి ప్రమాదరహితంగా కనిపిస్తారు కానీ, వారు మతద్రోహులు మాత్రమే కాదు జాతి వ్యతిరేకులు కూడా” అని ఆరెస్సెస్ అన్నది.

• ఈ దేశంలో స్త్రీలకు ఓటుహక్కు కల్పించటం అనవసరం, వృధా ప్రక్రియ అని ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజర్ వ్యాఖ్యానించింది.

• సర్దార్ పటేల్ 1948 సెప్టెంబర్ 11న రాసిన లేఖలో ఇలా రాశారు: “ఆరెస్సెస్ వారి ప్రసంగాలన్నీ మతోన్మాద విషంతో నిండి ఉంటాయి. హిందువులను ఉత్సాహ పరచటానికి విషాన్ని వ్యాప్తి చెయ్యనవసరం లేదు. వారిని సంఘటిత పరచటం కొరకు నిరపరాధులు, అసహాయులైన స్త్రీలు, పురుషులు, పిల్లలపై ప్రతీకారం తీర్చుకోవలసిన అవసరం లేదు. ఈ చర్యల ఫలితంగా గాంధీజీ తన జీవితాన్ని బలిపెట్టవలసి వచ్చింది”. 

• ఈ రోజు అబద్దాలను సృష్టించి, ప్రచారం చేస్తూ, హింసను ప్రేరేపిస్తూ, భయోత్పాతం సృష్టించేది ఎవరో (ఆరెస్సెస్) అందరికీ తెలుసు వారు జనతా మోర్చతో జతకూడారు. (ఇందిరకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి జనతామోర్చ. ఇదే తరువాత జనతాపార్టీగా ఏర్పడింది. దీనిలో జయప్రకాష్ నారాయణ్, మొరార్జి దేశాయ్, నిజలింగప్ప, వాజ్ పేయి, అద్వాని, జార్జ్ ఫెర్నాండేజ్, చరణ్ సింగ్ ప్రభృతులు ఉన్నారు). 

ప్రపంచవ్యాప్తంగా ఇన్ని అసత్యాలను, హింసను, నిందలను భరిస్తున్న ఒక్క నాయకుడి పేరుకానీ, ఒక్క దేశం పేరు కానీ చెప్పండి ఎవరైనా?

• 1967 లో ఒక సందర్భంలో జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ “ఈ దేశం సైన్యం నియంతృత్వపాలనలోకి వెళ్లాలి. దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవలసినదిగా సైన్యాన్ని కోరుతున్నాను” అని పిలుపునిచ్చారు. ఈ రోజు అదే నాయకులు మాకు ప్రజాస్వామ్యం ఎలా ఉండాలో అంటూ ఉపన్యాసాలిస్తున్నారు. విపక్షాలు మీరందరూ జైళ్ళలో కాక ఇక్కడ ఉండి (పార్లమెంటులో) మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్యం పనిచేస్తున్నదని అర్థం.

అలాకాక ఆరెస్సెస్ నాయకత్వంలో విపక్షాలు విధ్వంస ప్రణాళికలు అమలుచేసి ఉన్నట్లయితే- అప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడి నాశనం అయి ఉండేది. 

హింస, మతోన్మాద ద్వషానికి మారుపేరయిన ఆరెస్సెస్ కు తమ ప్రచారబాధ్యతలు అప్పచెప్పటం విపక్షాలకు ఏమేరకు సబబు? నక్సలైట్లు విప్లవసాధనకొరకు పూర్తిస్థాయిలో పనిచేయాలని పిలుపునివ్వటం ప్రజాస్వామ్యమా?

• మనకు ఆరెస్సెస్ చరిత్ర తెలుసు. అది ఎలా ఎదిగిందో, ఏ విధంగా ద్వేషాన్ని ప్రజల్లో రగిల్చిందో చూసాం. వారికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదు. 

• ఆరెస్సెస్ నాయకులు తాము ప్రజాస్వామికవాదులుగా చెప్పుకొంటారు కానీ ముస్లిములు, క్రిస్టియన్లకు సమానహక్కులు లేవంటారు. మా (కాంగ్రెస్) ప్రజాస్వామ్యం అలా కాదు. ప్రజలందరకూ సమానహక్కులు ఉండాలి అంటుంది. ప్రతి పౌరుడూ ఈ దేశప్రజే. 

• చాలా సంవత్సరాల క్రితం నేను (ఇందిరాగాంధి) కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక ముస్లిమ్ నాయకుని పేరు చెబితే అందరూ “ఒక ముస్లిమ్ ని హిందూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండతగడని” అన్నారు. అయినప్పటికీ చేసాం. ఇప్పుడు అలా ఎవరైనా అనగలరా? అదే విధంగా డా.జాకీర్ హుసైన్ ను రాష్ట్రపతిని గావించినపుడు కూడా ఇవే అభ్యంతరాలు వచ్చాయి. కానీ మేము ఆయనను ప్రెసిడెంటును చేయగలిగాం. ఈరోజు ఒక ముస్లిమ్ ప్రెసిడెంట్ అవలేడని అనగలరా? అలాగని వారికి వారి న్యాయమైన వాటా దక్కిందని చెప్పటానికి లేదు. మేము మూసుకుపోయిన తలుపులు తెరిచాం. చాలామంది అన్నారు అప్పట్లో ఆ తలుపులు తెరవటం అసాధ్యం అని. తెరుస్తాం అని చెప్పాం, తెరిచాం.

• ఈ రోజున హరిజనులకు (దళితులు) దక్కాల్సిన వాటా దక్కుతుందని చెప్పలేము కానీ ఇదివరకటి మీద వారి అవకాశాలు మెరుగయ్యాయని మాత్రం చెప్పగలం.   

*****

ఎమెర్జెన్సీ విధించటానికి గల కారణాలను వివరించే క్రమంలో ఇందిరా గాంధి ప్రధానంగా ఆరెస్సెస్ పేరును పదే పదే తీయటం గమనార్హం. 1975 జూన్ 27న, ఇందిరా గాంధీ అనేక ప్రపంచ నాయకులకు ఎమర్జెన్సీని ఎందుకు ప్రకటించారో వివరిస్తూ కేబుల్స్ పంపారు, అందులో ఆమె ఇలా పేర్కొన్నారు: "...జయప్రకాష్ నారాయణ్ మహాత్మా గాంధీ హత్యకు ప్రేరేపించిన, మతోన్మాద హిందూ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్‌తో కలిసిపోయారు...." అని. 

*****

3. Document of Surrender

ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే అనేక మంది ఎబివిపి, ఆర్ఎస్ఎస్ సభ్యులను ఇందిరాగాంధీ అరెస్టు చేయించింది. చాలామంది తప్పించుకున్నారు. ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ దేవరస్‌ను జూన్ 30న నాగ్‌పూర్‌లో అరెస్టు చేశారు. 1975 జూలై 4న ప్రభుత్వం ఆరెస్సెస్ ను నిషేదించింది. స్వాతంత్ర్యానంతరం ఆరెస్సెస్ నిషేదం ఇది రెండవసారి. 1948 ఫిబ్రవరిలో గాంధి హత్యకు తదనంతర అల్లర్లకు బాధ్యులను చేస్తూ పటేల్ ఆర్ఎస్ఎస్‌ను మొదటి సారి నిషేధించి, సుమారు 25 వేలమంది దాని కార్యకర్తలను ఖైదు చేయించాడు.  

ఇందిరాగాంధి ప్రభుత్వం దేశంలోని సుమారు 44 వేలమంది ఆరెస్సెస్ కార్యకర్తలను అరెస్టు చేసి జైళ్ళలో వేసింది. వీరిలో ఎనభైమంది వరకూ జైళ్ళలోనే మరణించారు. 

యారవాడ జైలునుంచి ఆరెస్సెస్ ఛీఫ్ బాలాసాహెబ్ దేవరస్ ఇందిరాగాంధికి క్షమాపణపత్రం రాసి విడుదల చేయమని కోరాడు. ఇందిర పట్టించుకోలేదు. జైలులో ఉన్న ఆర్ఎస్ఎస్ వ్యక్తులను విడుదల చేయమని మరియు సంస్థపై నిషేధం ఎత్తివేయమని ఇందిరా గాంధీని అభ్యర్థించమని దేవరస్ వినోబా భావేకి ఉత్తరాలు రాసాడు. ఇంకా ఇతను మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్ బి చవాన్ ద్వారా ఇందిరతో రాజీ ప్రయత్నాలు చేసాడు. బెంగుళూరులో అద్వాని, అటల్ బిహారీ వాజ్ పేయి లు అరెస్టు చేయబడ్డారు. అటల్ అనారోగ్యకారణాలతొ పెరోల్ పై బయటకు వచ్చి ఎమర్జెన్సీ ముగిసేవరకూ స్వేచ్ఛగానే ఉన్నాడు. 

నవంబర్ 1976లో, మాధవరావు ములే, దత్తోపంత్ తెంగడి, మోరోపంత్ పింగ్లే నేతృత్వంలో 30 మందికి పైగా RSS నాయకులు ఇందిరా గాంధీకి లేఖ రాశారు, RSS కార్యకర్తలందరినీ జైలు నుండి విడుదల చేస్తే ఎమర్జెన్సీకి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.  

ప్రభుత్వం స్వచ్చందంగా లొంగిపోయే వ్యక్తుల కొరకు ఒక హామీ పత్రం తయారు చేసింది. దాని ప్రకారం ------------- ఖైదీ నైన నన్ను విడుదల చేసినట్లయితే నేను దేశ అంతర్గత భద్రతకు, ప్రజల శాంతికి విఘాతం కలిగించే పనులను చేయను. ఎమెర్జెన్సీకి విరుద్దమైన ఎటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనను….. అంటూ సాగుతుంది. 

అలాంటి “Document of Surrender” ను సమర్పించి అనేకమంది నిర్బంధిత ఆరెస్సెస్ వ్యక్తులు జైళ్ళనుంచి విడుదలయ్యారు. 

****

4. ముగింపు

ఈ రోజు సంఘీయులు తాము ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రాణాలకు ఒడ్డి పోరాడామని, ఎమర్జెన్సీ అనేది ప్రజాస్వామ్యపు చీకటి రోజని ప్రచారించుకొంటారు. నిజానికి ఎమర్జెన్సీ విధించిందే సంఘీయుల్ని కట్టడి చేయడానికే అనేది ఇందిర వాదన. Document of Surrender పత్రాలను సమర్పించి ఆనాటి చాలామంది ఆరెస్సెస్ నాయకులు జైలు జీవితాన్ని తప్పించుకొన్నారు.

ఆరెస్సెస్ హిందువులను సంఘటితం చేసి, ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలన్నది లక్ష్యంగా చేసుకొని దాని ఆవిర్భావం నుంచి కృషి చేస్తున్నది. అదే మా అంతిమ లక్ష్యమని చెప్పుకోవటానికి ఆ సంస్థ ఏనాడు తడబడలేదు. 

చరిత్రలో ఆరెస్సెస్ రెండు సార్లు 1948 లో ఒకసారి, 1975 లో రెండోసారి నిషేదానికి గురయ్యింది. ఈ రెండు సందర్భాలలోను ఈ సంస్థ తన లక్ష్యానికి చాలా దగ్గరగా రావటం గమనించవచ్చు. 1948లో గాంధీజీ హత్య నేపథ్యంలో నెహ్రూని ఒంటరిని చేసి, సమాజంలో ముస్లిముల పట్ల వ్యతిరేకత తారాస్థాయికి తీసుకువెళ్లి, దేశాన్ని హిందూ రాష్ట్రంలా మార్చే అవకాశం ఉండేది, కానీ నెహ్రూ యొక్క సెక్యులర్ దృక్పథం మరియు ఐక్యతపై నమ్మకం దానిని నిరోధించాయి.

ప్రజాస్వామ్యవాది అయిన నెహ్రూ దేశాన్ని ఆ ప్రమాదం నుంచి రక్షించాడు. పటేల్ ద్వారా ఆరెస్సెస్ పై నిషేదం విధించి వేలమంది కార్యకర్తలను ఖైదుచేయించి “భిన్నత్వంలో ఏకత్వం” అనేది ఈ దేశ చిరునామాగా తీర్చిదిద్దాడు. 

1975 కి వచ్చేసరికి ఇందిర ఎన్నిక రద్దు నేపథ్యంలో- జయప్రకాష్ ద్వారా ఇందిరను దింపివేసి, సైనికుల ద్వారా రాజ్యాన్ని చేజిక్కించుకొని దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే రెండో ప్రయత్నం జరిగి ఉంటుందని ఊహించవచ్చు. ఈ ఊహకు ఆరెస్సెస్ పై నిషేదం, భారత రాజ్యాంగంలో సోషలిస్ట్, సెక్యులర్ అనే భావనలను ప్రవేశపెట్టటం లాంటివి ఆధారాలుగా నిలుస్తాయి. ముఖ్యంగా రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన “సెక్యులర్” అనే పదం. దీన్ని మార్చితే తప్ప దేశాన్ని హిందూ రాష్ట్రంగా చేయటానికి వీలవదు. దీన్ని మార్చటం కొరకే చార్సౌబార్ నినాదం అంటారు. ఆ మేరకు ఇందిరాగాంధీ అపరకాళికమాత్రమే కాదు క్రాంత దర్శి కూడా.  

ఈ రోజున బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎమర్జెన్సీ కాలంలో ఖైదుచేయబడిన ఆర్ఎస్సెస్ కార్యకర్తలకు, వారు క్షమాపణ పత్రం రాసి విడుదలైనప్పటికీ ప్రభుత్వం నెలకు పదివేలరూపాయిల పించను అందిస్తోంది. ఒక నేరేటివ్ ని ప్రజల సామూహిక జ్ఞాపకాలలోంచి చెరిపేసి మరొక ప్రత్యామ్నాయ నెరేటివ్ ని ఎంత బలంగా ముద్రించటానికి చేస్తున్న ప్రయత్నమో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. 

నేడు సంఘీయులు తమ వందేళ్ళ ప్రస్థానంలో లక్ష్యసాధనకు చాలా చేరువలోకి వచ్చారు. ఇది ఇందిర, నెహ్రూల కాలం కాదు. ఒకే దేవుడు (ఎక్కువగా ఉత్తరాది వైష్ణవం), ఒకే ఆరాధనా విధానం, ఒకే సంస్కృతి, ఒకే ఆహారం, ఒకే బాషతో ఉండే శిలాసదృశ సమాజం కావాలా లేక ఇష్టదేవతారాధనతో, భిన్న సంస్కృతులతో, భిన్న భాషలతో, భిన్న ఆరాధనా విధానాలతో, ప్రజలందరూ సామరస్యంతో ఉండే సమాజం కావాలా అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.  


బొల్లోజు బాబా

(ఈ వ్యాసాన్ని రాయటానికి ఉపయోగపడిన వ్యాసాల లింకులు మొదటి కామెంటులో కలవు)


ఈ వ్యాసాన్ని రాయటానికి ఉపయోగపడిన వ్యాసాల లింకులు


1. https://economictimes.indiatimes.com/news/politics-and-nation/on-emergency-indira-gandhi-drew-comparison-between-nazis-and-rss/articleshow/69956572.cms

2. https://frontline.thehindu.com/politics/rss-emergency/article64760048.ece/amp/

3. https://theprint.in/opinion/rss-leaders-deserted-jayaprakash-resistance-during-indira-emergency/448294/

4. https://archive.pib.gov.in/archive/ArchiveSecondPhase/PRIME%20MINISTER/1975-JUNE-DEC-P.M-SPEECHES-EMERGENCY/PDF/PRI-1975-06-26_012.pdf

5. https://archive.pib.gov.in/archive/phase2/archiveministry.aspx?phase=3






2 comments: