భారతదేశం చారిత్రికంగా భిన్న మత విశ్వాసాల సమ్మేళనం. అనేక సముదాయాలు వివిధ సంస్కృతులతో కలిసిమెలిసి జీవించాయి. మనుషుల మధ్య బంధుత్వాలకు మతాలు అడ్డురాలేదు. చరిత్రలో హిందూ ముస్లిమ్ ల మధ్య అనేక వివాహాలు జరిగాయి. ఇవి భిన్న సంస్కృతుల సమ్మేళనానికి దారితీసాయి. చాలామంది మొఘల్ చక్రవర్తులు హిందూ స్త్రీలకు పుట్టారు. వారి ఆస్థాన చరిత్రకారులు ఈ విషయాన్ని ఎక్కడా దాచిపెట్టలేదు. స్పష్టంగానే రాసుకొన్నారు. వీటిని ఉత్త రాజకీయ తంత్రంగా భావించలేం. ఒక ముస్లిం రాజు హిందూ స్త్రీని పెండ్లాడి ఆమెను జనానాలో ఒకానొక దేహంగా మార్చకపోవటం; ఆమెద్వారా కలిగిన పుత్రుడు సింహాసనం అధిష్టించటం అనేవి ఉత్త రాజకీయ వ్యూహాలుగా పరిగణించలేం. రాజనీతిని మించిన మానవీయకోణాన్ని, సౌహార్దతను ఊహించాలి. భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన హిందు ముస్లిమ్ వివాహాలు కొన్ని ఇవి…….
****
1. హర్కబాయి (1542-1623) - అక్బర్ Maryam-Uz-Zamani
జైపూర్ రాజైన భర్మల్ 1562 లో తనకూతురు హర్కబాయిని అక్బరుకి ఇచ్చి వివాహం చేసాడు. ఈమె అక్బరుకు ఎంతో ఇష్టమైన రాణి అయింది. హర్కబాయి అపురూప సౌందర్యం, అద్భుతమైన మేధాశక్తి, గొప్ప దయ కలిగిన స్త్రీ. అక్బర్ చూపించిన మతసహనం, లౌకికత వెనుక ఈమె హస్తం ఉందని చరిత్రకారుల అభిప్రాయం. ఈమె కోరికపై అక్బరు గోమాంసాన్ని తినటం మానివేసాడు. ఈమె ద్వారా వైదిక క్రతువులు, బ్రాహ్మణులు, సూర్యనమస్కారాలు, శాఖాహారం, పూజలు లాంటివి ముఘల్ అంతఃపురంలోకి పవేశించాయి. హిందూస్త్రీలు సంస్థానంలో హారతి ఇస్తే స్వీకరించాలని అందరినీ ఆదేశించాడు అక్బరు. హర్కబాయి అక్బరులకు 1569లో కుమారుడు కలిగాడు. ఇతనే మొఘల్ చక్రవర్తి జహంగీరు. హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన మొదటి చక్రవర్తి జహంగీరు.
ముఘల్ సంస్థానంలో హర్కబాయి నాలుగుదశాబ్దాల సుదీర్ఘకాలంపాటు పట్టపురాణిగా ఆ పిదప రాజమాతగా ఎంతో గౌరవాన్ని పొందింది. ఈమె పేరుమీద ఒక ఓడ ఉండేది. ఈమె అనేక నౌకా వ్యాపారాలు చేసేది. వ్యాపారాభివృద్ధినిమిత్తం దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించేది. ఈమె ఓడ పేరు రహిమి (Rahimi.) 12000 మంది సైనికులను కలిగి ఉన్న నలుగురు మొఘలు సంపన్న వ్యక్తులలో ఈమె ఒకరు. స్త్రీలలో ఒకే ఒకరు. ఇదీ ఈమె హోదా.
జహంగీర్ తనతల్లి హర్కబాయిని ఎంతో గౌరవంగా Her Majesty అని సంబోధించేవాడు. పాదాలకు నమస్కరించిన పిదప మాట్లాడేవాడు.
1605 లో అక్బర్ చనిపోయేనాటికి హర్కబాయి ముఘల్ స్త్రీలలో అత్యంత సంపన్నురాలు . ఈమె తన 81 వ ఏట 1623 లో మరణించింది. హర్కబాయి గౌరవార్ధం అక్బరు సమాధిపక్కనే ఆగ్రాలో ఈమె సమాధికూడా నిర్మించారు.
2. మన్ బాయి (1570-1605)- జహంగీర్
జహంగీర్ తల్లి హర్కబాయి సోదరుని పేరు రాజ భగ్వంత్ దాస్. ఇతను జైపూర్/ అంబర్ ను పాలించిన 23 వ రాజు. ఇతని కూతురు పేరు మన్ భవతి బాయి (Man Bai). జహంగీరు, మన్ బాయిలు బావమరదళ్ళు అవుతారు. మన్ బాయి గొప్ప సౌందర్యరాశి, సౌశీల్యవతి. మేనత్త హర్కబాయిలా తెలివైనది. ఆమెను జహంగీరుకు ఇచ్చి వివాహం చేయాలని హర్కబాయి ప్రతిపాదించగా, వంశప్రతిష్టలు కలిగిన కుటుంబానికి చెందిన అమ్మాయి కనుక అక్బరు మన్ బాయిని కోడలుగా చేసుకోవటానికి వెంటనే అంగీకరించాడు. మన్ బాయి, జహంగీరుల వివాహం 1585 లో అంగరంగవైభవంగా జరిగింది. వీరిద్దరికి 1587 ఖుస్రో మిర్జా అనే కొమారుడు కలిగాక మన్ బాయికి పట్టమహిషి (Shah Begum) హోదా లభించింది.
మన్ బాయి సోదరుని పేరు మాధవ సింగ్. ఇతనితో తన కొడుకు ఖుస్రో మిర్జా కలిసి భర్త జహంగీరుపై వ్యతిరేకంగా కుట్రలు పన్నటం మన్ బాయిని తీవ్రమైన మనస్తాపానికి గురిచేసేది . కొడుకుకు భర్తకు నచ్చచెప్పలేక మన్ బాయి తీవ్రఒత్తిడికి గురయి 1605 లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మన్ బాయి, జహంగీర్ల దాంపత్యం ఎంతో అన్యోన్యమైనది. భార్య చనిపోయిందని తెలిసిన జహంగీరు నాలుగురోజులపాటు భోజనం చేయలేదు.
జహంగీరు భార్యావియోగంతో విరాగిగామారాడని తెలిసిన అక్బరు ఆ సమయంలో తను ధరించిన తలపాగ, శాలువాలను పంపించి ఓదార్చే ప్రయత్నం చేసాడు. కొడుకుపట్ల పిచ్చిప్రేమకు, భర్త పట్ల అనురాగానికి మధ్య నలిగిపోయి ఆత్మహత్య చేసుకొన్న కోడలి పట్ల ఎంతో కలత చెందాడు అక్బరు.
జహంగీరు, అలహాబాదు, Khusrau Bagh ఆవరణలో మన్ బాయి జ్ఞాపకార్థం అందమైన సమాధిని నిర్మింపచేసాడు.
3. జగత్ గోసాయిన్ (1573 – 1619) – జహంగీర్
ఈమెకే మనవతి బాయి, జోధ్ బాయి (జోదా అక్బరు జంట కాదు) అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈమె మార్వార్ (ప్రస్తుత జోధ్ పూర్) రాకుమార్తె. రాజ్ పుత్ రాజా ఉదయ్ సింగ్ కూతురు. ఈమె తాతగారైన Maldev Rathore నాయకత్వంలో మార్వార్ బలమైన రాజపుత్రుల రాజ్యంగా ఏర్పడింది.
యువరాజుగా ఉన్న జహంగీరు ఒకనాడు ఒక రాజకుటుంబ వేడుకలో అపురూపలావణ్యవతి అయిన జగత్ గోసాయిన్ ని చూసి ప్రేమించాడు. ఆమెను పెండ్లాడాలనే కోర్కెను వెలిబుచ్చాడు. ఈ పెళ్ళి ప్రతిపాదనను అక్బరు అంగీకరించలేదు. అక్బరు తల్లి హమీదాబాను అందరిని ఒప్పించింది. అలా జహంగీరుకు జగత్ గోసాయిన్ కి 1586లో వివాహమైంది. ఈ వివాహం మార్వార్ రాజు సంస్థానంలో పండితుల వేదమంత్రాలతో ముస్లిమ్ కట్టుబాట్ల మధ్య జరిగింది.
అందం, ఆకర్షణీయ సంభాషణ, చమత్కారం, సమయస్పూర్తి, ధైర్యసాహసాలతో జగత్ గోసాయిని తక్కువ కాలంలోనే జహంగీరుకు అత్యంత ప్రియమైన వ్యక్తిగా మారింది. జగత్ సంగీతంలో గొప్ప ప్రావీణ్యం కలిగిన గాయని. ఈమె 1592 లో జహంగీరుకు ఒక మగబిడ్డను ఇచ్చింది. అతనే మొఘల్ చక్రవర్తి షాజహాన్. హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన రెండవవ్యక్తి ఇతను. ఈ బిడ్డ జాతకం ప్రకారం మహర్జాతకుడని పండితులు చెప్పటంతో తాత అయిన అక్బర్ చక్రవర్తి ఈ బిడ్డకు “కుర్రం” (సంతోషకరమైన) అని నామకరణం చేసి తనవద్దే ఉంచుకొని పెంచి పెద్దచేసాడు.
1605 లో అక్బర్ మరణించాక కుర్రం తండ్రి వద్దకు వచ్చేసాడు. 1611 లో నూర్జహాన్ ను వివాహం చేసుకొన్నాకా ఆమె ఆకర్షణలోపడి జహంగీర్ జగత్ గోసాయిన్ పట్ల ఆదరణ తగ్గించేసాడు. 1619 లో జగత్ గోసాయిన్ అనారోగ్యకారణాలతో మరణించింది. ఈమె మరణానంతరం జహంగీర్ అన్ని రాజపత్రాలలో ఈమె పేరును Bilqis Makani (the Lady of Pure Abode) గా ప్రస్తావించమని ఆదేశించాడు. 1628 లో జగత్ గోసాయిన్ కుమారుడు షాజహాన్ ముఘల్ చక్రవర్తిగా సింహాసనం అధిష్టించే నాటికి ఈమె జీవించి లేదు.
4. నవాబ్ బాయి
కాశ్మీరుకు చెందిన రాజపుత్ రాజౌరి రాకుమార్తెను ఔరంగజేబు 1638 లో పెళ్ళిచేసుకొన్నాడు. ఈమె పేరు నవాబ్ బాయి. వీరిద్దరికి 1643 లో బహదూర్ షా I జన్మించాడు. ఇతను ఔరంగజేబు మరణానంతరం ముఘల్ చక్రవర్తి అయి 1707 నుండి 1712 వరకూ పరిపాలించాడు. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన మూడవ వ్యక్తి. 1662 లో ఔరంగజేబు తీవ్రంగా అస్వస్థుడవగా, అతని చెల్లెలు రోషనార రాజ్యాధికారాన్ని చేతిలోకి తీసుకొని పరిపాలించసాగింది. ఈ చర్యను నవాబ్ బాయి ప్రతిఘటించింది. ఈమె కుమారులు తండ్రికి వ్యతిరేకంగా వ్యవహరించేవారు. ఈ కారణాలతో నవాబ్ బాయి అంతఃపురంలో క్రమేపీ గౌరవాన్ని కోల్పోయి ఔరంగజేబు ప్రేమకు దూరమైంది.
కొడుకులను భర్త ఖైదు చేయించాడని తెలిసి ఎంతో మానసిక క్షోభకు గురవగా, ఔరంగజేబు స్వయంగా వచ్చి నవాబ్ బాయిని ఓదార్చాడు. ఒక బాధ్యతకలిగిన తండ్రిగా, పాలకుడిగా ఏ పరిస్థితులలో సొంతకొడుకులను ఖైదుచేయించవలసిందో ఆమెకు వివరించాడు. 1691లో నవాబ్ బాయి చనిపోయింది. ఆమె గౌరవార్థం రాజ్యంలో ఒక వారంపాటు సంతాపదినాలు ప్రకటించాడు ఔరంగజేబు
5. ఉద్దమ్ బాయి/కుడ్సియాబేగం
ఉద్దమ్ బాయి హిందూ కుటుంబానికి చెందిన ఒక సామాన్య నర్తకి. రాజాస్థానంలో చేరింది. ఈమె తన సౌందర్యం, వాక్చాతుర్యం వల్ల ముఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా (r. 1719–1748) ప్రేమను చూరగొంది. మహమ్మద్ షాకు ఉద్దమ్ బాయి పట్ల మక్కువ పెరిగి రాణి హోదాను ఇచ్చాడు. వీరిద్దరికి పుట్టిన అహ్మద్ షా బహదూర్ 1748 - 1754 మధ్య ముఘల్ చక్రవర్తిగా రాజ్యమేలాడు. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన నాల్గవ వ్యక్తి.
కొడుకు శక్తిహీనుడు, దక్షతలేనివాడు కావటంచే ఉద్దం బాయి అనధికారికంగా రాజ్యపగ్గాలు చేపట్టింది. పరిపాలకురాలిగా ఎదిగి, ప్రభుత్వ వ్యవస్థను చేతుల్లోకి తీసుకొంది. ముఘల్ సామ్రాజ్యానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకొంది. డిల్లీలో గోల్డెన్ మాస్క్, కుడ్సియా బాగ్ లాంటి గొప్పనిర్మాణాలు చేపట్టింది.
పురుషుల ప్రపంచంలో ధైర్యం, తెలివితేటలు, సమర్ధత కలిగిన గొప్ప మహిళగా; ఒక నాట్యకారిణినుండి ఒక సామ్రాజ్ఞిగా ఎదిగిన ధీశాలిగా ఉద్దమ్ బాయి చరిత్రలో నిలిచిపోయింది.
6. అనూప్ బాయి 1699- ??
తొమ్మిదవ మొఘల్ చక్రవర్తి జహందర్ షా మూడవ భార్య అనూప్ బాయి. ఈమె రాజపుత్రుల యువరాణి. ఈమె Muazzamabadi అనే బిరుదును కలిగి ఉండేది. దాని అర్థం గౌరవనీయురాలైన అని. ఈమె కుమారుడు అలంగీర్ II. ఇతను 1754 – 1759 మధ్య ముఘల్ చక్రవర్తిగా పరిపాలించాడు. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన ఐదవ వ్యక్తి. ముఘల్ రికార్డులలో 1756-1761 మధ్య ప్రభావితం చూపిన తొమ్మిది మంది మొఘల్ స్త్రీలజాబితాలో Muazzamabadi పేరు ఏడవ సంఖ్యలో ఉంది .
ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అబ్దాలి రాజు, 30 జనవరి, 1757 న ఢిల్లీ వచ్చినపుడు, అలంగీర్ II చక్రవర్తి తల్లి హోదాలో అనూప్ బాయి 121 బంగారు నాణాలు, బాదంతో చేసిన పాయసం (లవజత్) ను అతనికి పంపించింది . ఆ సమయం మొఘల్ సామ్రాజ్యం అంతర్గత కలహాలతో సంక్షోభంలో ఉంది. బహుసా అబ్దాలి వంటి రాజుల సహకారం పొందటం కొరకు అనూప్ బాయి ఆ కానుకలను పంపిఉండవచ్చు. ఇదొక దౌత్యపరమైన కూటనీతి. ఈ ఉదంతాన్ని బట్టి అనూప్ బాయి తెరవెనుక పోషించినపాత్ర కొంతమేరకు అర్ధమౌతుంది. ఇంతకు మించి ఈమె గురించిన చారిత్రిక వివరాలు పెద్దగా తెలియరావు. అనూప్ బాయి 1735 లోనే మరణించిందని మరొక కథనం కలదు.
7. బిలాల్ కన్వర్ / జినత్ మహల్
బిలాల్ కన్వర్ అలంగీర్ II భార్య. ఈమె హిందూ స్త్రీ. బిలాల్ కన్వర్ 1728 లో షా ఆలమ్ II కు జన్మనిచ్చింది . ఇతను 1760 – 1806 మధ్య ముఘల్ సామ్రాజ్యాన్ని పాలించాడు. షా ఆలమ్ II హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన ఆరవ వ్యక్తి. ఇంతకు మించి బిలాల్ కన్వర్ గురించిన సమాచారం పెద్దగా లభించదు.
8. లాల్ బాయి
బహదూర్ షా II చివరి మొఘల్ చక్రవర్తి. ఇతని తల్లి పేరు లాల్ బాయి. ఈమె హిందూ స్త్రీ. 1775 లో లాల్ బాయి బహదూర్ షా II జన్మనిచ్చింది. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన ఏడవ వ్యక్తి.
బహదూర్ షా II బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిపిన మొదటి స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించాడు. బ్రిటిష్ వారు ఇతనిని రంగూన్ తరలించి మరణించేవరకూ గృహనిర్భంధంలో ఉంచారు.
****
9. మరికొన్ని ప్రముఖ వివాహాలు
కమలాదేవి - అల్లావుద్దిన్ ఖిల్జి: కమలాదేవి గుజరాత్ లోని వఘేలా రాజ్ పుత్ కరణ్ దేవ్ II భార్య. ఈమె గొప్ప అందగత్తె. విదుషీమణి. అల్లావుద్దిన్ ఖిల్జీ 1298 లో గుజరాత్ ను ఓడించినపుడు ఈమెను ఢిల్లీసంస్థానానికి తీసుకువెళ్ళి పెళ్ళిచేసుకొన్నాడు. ఇది చరిత్రలో నమోదైన హిందూ-ముస్లిమ్ ల మధ్య జరిగిన మొదటి వివాహం. అప్పటికి ఈమెకు దేవలాదేవి అనే ఆరు నెలల కుమార్తె కలదు. ఆమె తండ్రి సంరక్షణలో ఉండి పెరిగి పెద్దదయింది. కమలాదేవి క్రమేపీ అల్లావుద్దిన్ ఖిల్జి విశ్వాసాన్ని చూరగొని, అతని రాజకీయ నిర్ణయాలలో సలహాలు ఇచ్చేస్థాయికి చేరుకొంది. కమలాదేవి చొరవతో ఆమె కూతురైన దేవలాదేవిని ఢిల్లీకి తెప్పించాడు అల్లావుద్దిన్ ఖిల్జి, దేవలాదేవిని అల్లావుద్దిన్ ఖిల్జి కొడుకు ఖిజ్ర ఖాన్ కు ఇచ్చి వివాహం జరిపించారు.
జహంగీరు చక్రవర్తి మరొక భార్య మలిక జహన్ హిందూ స్త్రీ. ఈమె జసల్మార్ కు చెందిన రావల్ భీమ్ కూతురు.
ఔరంగజేబ్ కొడుకైన బహదూర్ షా I, రాజా రూప్ సింగ్ కూతురును పెండ్లాడాడు.
1351 లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన ఫిరోజ్ షా తల్లి పేరు నైలా. ఈమె భట్నేర్ హిందూ రాజ కుమార్తె .
విజయనగర రాజు దేవరాయ I తన కూతురుని 1407 బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా కు ఇచ్చి అంగరంగవైభవంగా పెళ్ళిచేసాడు.
ఖేర్లా రాజైన నరసింహరాయ్ 1417 లో తన కుతురును ఫిరోజ్ షాకు ఇచ్చి వివాహం జరిపించాడు. అపురూపసౌందర్యరాశి అయిన ఈమె ఆ తదుపరికాలంలో బహుమని సుల్తాను పట్టపురాణి హోదాను పొందింది.
వారణాసిలో ఇరవైముగ్గురు ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ప్రేమించి హిందూమతంలోకి మారిపోయిన ఉదంతాన్ని మధ్య ఆసియా యాత్రికుడు అమిర్ అలి బాల్కి తన రాతలలో పేర్కొన్నాడు. ఇది ఆనాటి సామాన్యప్రజలలో ఉండిన మత స్వేచ్ఛను తెలియచేస్తుంది
****
అదే విధంగా మొఘల్ రాజస్త్రీలను హిందూ రాజులకు ముఖ్యంగా రాజపుత్రులకు ఇచ్చి పెండ్లిచేసిన ఉదంతాలుకూడా చరిత్రలో కనిపిస్తాయి. అక్బరుకుమార్తెకు- మేవాడ్ యువరాజు అమర్ సింగ్ కు; అక్బర్ మేనకోడలుకు రాజామాన్ సింగుకు; రూహాని బాయికు మహారాజా ఛత్రసాల్ కు; వజీర్ ఖాన్ కుమార్తె మహారాణా కుంభకు: ఒకముస్లిం సైన్యాద్యక్షుని కుమార్తెకు రాజపుత్ర రాణాసంగకు జరిగిన వివాహాలు ముస్లిం రాచస్త్రీలకు హిందూ యువరాజులకు మధ్య జరిగిన వివాహాలకు కొన్ని ఉదాహరణలుగా చెబుతారు.
10. ముగింపు
నేడు భిన్న విశ్వాసాల మధ్య వివాహాలను లవ్ జిహాద్ అని, బలవంతపు మతమార్పిడులు అని మాట్లాడటం శోచనీయం. అలాంటి ఆరోపణలు రాజకీయ ప్రేరేపితం. ఈ రోజు ముఘల్స్ అంటే రక్తపిపాసులుగా, మతం పేరుతో ప్రజల్ని ఊచకోత కోసిన రాక్షసులుగా చిత్రిస్తున్నారు. కల్పితాలతో కట్టుకథలతో ఒక అబద్దపు నెరేటివ్ ను సృష్టిస్తున్నారు. వారి పేరు ఎవరైనా ఎత్తితే తీవ్రమైన దుర్భాషలతో, అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఊరూ పేరు, ఫొటో లేని సోషల్ మీడియా అనామకుల నుండి అత్యంత ఉన్నతమైన పదవులలో ఉన్నవారు వరకూ ఇదే ధోరణి. ఈ ద్వేషం బౌద్ధికంగా చాలా బలంగా ప్రజల మనసుల్లో నాటబడుతోంది. ఇక ఇలాంటి ద్వేషం భౌతికంగా ప్రతిఫలించటానికి ఎంతో దూరంలో లేము.
సాటి మనుషుల పట్ల ఎందుకింత ద్వేషమో అర్థం కాదు. ఈ ద్వేషం పునాదులపై ఏం నిర్మించాలని కోరుకొంటున్నారో ఊహకు అందదు. భిన్న అభిప్రాయాలు పరిఢవిల్లడం ప్రజాస్వామ్యం. మెజారిటేరియన్ భావజాలం మాత్రమే ఉండాలనుకోవటం ఫాసిజం. మానవజాతి పరిణామక్రమంలో మతం అనేది ఆదిమ అనాగరిక లక్షణమని, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం అనేవి నాగరిక లక్షణాలనీ ఎప్పటికి అర్ధం చేసుకొంటారూ?
ఎవరైతే ముస్లిమ్ పాలనవల్ల నష్టపోయారో వారే సమాజంలో ముస్లిముల పట్ల ఇంతటి ద్వేషానికి కారకులు అనటం సహజమైన అభియోగం. ఎవరు ముస్లిమ్ పాలనవల్ల నష్టపోయారు అని భిన్న సామాజిక వర్గాలను పరిశీలిస్తే---
రాజపుత్రులు, చోళులు, కాకతీయులు, పాండ్యులు, హొయసల రాజులు లాంటివారు సార్వభౌమత్వాన్ని కోల్పోయినా ముస్లిమ్ రాజులకు సామంతులుగా మారి అధికారాన్ని కోల్పోలేదు. అదే విధంగా స్థానిక జమిందార్లు/కౌలుదార్లకు వారి వారి హోదాలు పోలేదు చాలాచోట్ల. వ్యాపారులకు ముస్లిముల ద్వారా మధ్య ఆసియా వ్యాపారావకాశాలు పెరిగాయి. చేతివృత్తికారులకు ఆ వ్యాపారాల వల్ల పనులు పెరిగాయి.
ముస్లిమ్ పాలనలో వర్ణవ్యవస్థ కొంతమేర సడలటంతో దళిత బహుజనులు కొద్దిగా ఊపిరి పీల్చుకొన్నారు. అతిశూద్రులు కొంతమంది వివక్షనుంచి తప్పించుకోవటానికి ఇస్లాంలోకి మారారు. అధికజనాభా గ్రామాలలో నివసించేవారు. కేంద్రీయ ముస్లిం పాలనతో సంబంధంలేకుండా ఈ గ్రామీణ ప్రజలు స్వయంపోషణతో జీవించారు.
భక్తి ఉద్యమప్రభావంతో ముస్లిమ్ హిందూ ఐక్యత గ్రామాలలో బలపడింది. హోలి, దివాలి, సూఫీ, దర్గా, పీర్ల పండుగ లాంటి పండుగలలో హిందూముస్లిములమధ్య ఒకరకమైన సాంస్కృతిక సమ్మేళనం ఉండేది. దీనివల్ల కింది స్థాయి ప్రజలు ఒకరిపట్ల ఒకరు ప్రేమానురాగాలతో ఉండేవారు.
ఇక సమాజంలో ఎవరు ముస్లిమ్ పాలన వల్ల నష్టపోయారు అంటే కొంతమేరకు పండితవర్గం కనిపిస్తుంది. వీరు జనాభాలో 5%. ఒక పండితుడు సభకు రాగా, ఏ మహారాజైనా లేచి వెళ్ళి అతనిని ఆహ్వానించి ఉచితాసనంపై కూచుండబెట్టి, పాదాలు కడిగి ఆ నీళ్ళు నెత్తిన చల్లుకోవటం హిందూ ధర్మంలో భాగం. ముస్లిమ్ పాలనలో ఈ రకపు గౌరవాన్ని పండితులు కోల్పోయారు.
యజ్ఞయాగాదులు, Temple patronage తగ్గిపోయాయి. ఔరంగజేబు అయితే దర్బారులో కవులు, కళాకారులను నిషేదించాడు. అలా అంతవరకూ. ప్రభువు మెల్లకన్నుపై పద్యాలు చెప్పి మాన్యాలు పొందిన వైభోగం కోల్పోయారు పండితులు.
యజ్ఞయాగాదులు లేక శూద్రులు, అతిశూద్రులనుండి అతికష్టంగా కాపాడుకొన్న సంస్కృతం, వేదాలు పనికిరాకుండాపోయాయి.
ఈ వర్గం సమాజంలో శిష్టవర్గం. ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయగలిగిన వర్గం. వీరికి జరిగిన నష్టం మొత్తం సమాజానికి జరిగిన నష్టంగాను, వీరి శత్రువులు యావత్ సమాజపు శత్రువులుగాను చేయబడ్డారు. దీన్నే గ్రామ్సీ "కల్చరల్ హెగిమొని" అని వ్యవహరించాడు – సమాజంలోని ప్రభావశీల వర్గం తన విలువలు, నమ్మకాలను మిగిలిన ప్రజలచే వారికి తెలియకుండానే ఆమోదింపచేయటం.
.
బొల్లోజు బాబా
16/3/2025
No comments:
Post a Comment