Showing posts with label ఆయేషా హత్య. Show all posts
Showing posts with label ఆయేషా హత్య. Show all posts

Monday, June 2, 2008

వైచిత్రి

వైచిత్రి

రాష్ట్రాన్ని కుదిపేసిన
పైశాచిక హత్యోదంత నిందితుల్ని
శిక్షించాలని కోరుతూ
ఒక సమూహం రోడ్డుపై ప్రవహిస్తూవుంది

'శిక్షించాలి శిక్షించాలి
నిందితుల్ని శిక్షించాలి'
ఆక్రోశిత హృదయాల వేదన
రోడ్డుపై నల్ల కెరటమై ఘోషిస్తూవుంది.


ఎర్ర సముద్రం నిలువునా చీలి
మోజెస్ కి దారిచ్చినట్లుగా
ఉరుకుల పరుగుల నగర జీవనం
ఆ సమూహానికి దారి ఇస్తూంది.

ఆ సమూహం ప్రచండ భానుడిలా జ్వలిస్తూ

రోడ్డుపై నల్ల కాంతై ప్రకాశిస్తూవుంది.

సహృదయులు కొంతమంది
ప్లకార్డులు అందిపుచ్చుకున్నారు.


కొంతమంది తమ బిడ్డల్ని
ఒళ్లోకి లాక్కుంటున్నారు.

మరికొందరు అంతా ఈశ్వరేచ్ఛ
అనుకుంటూ సాగిపోయారు.

నిరసన జ్వాలలు
డ్రాయింగు రూములోకి ప్రత్యక్షప్రసారమవగా,
చానెల్ మార్చేసి నేరాలు - పాపాలు సీరియల్
ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది.

శాలువాలకై ప్రాకులాడే ఔత్సాహికుడు
సమూహపు ముందువరసకై
తెగ ఆరాట పడిపోతున్నాడు.

"అబ్బో ఎన్నిఓట్లో" అనుకున్న నాయకుడు
తన రంగు విప్పేసి, నల్లరంగు తొడుక్కుని
కొత్తరాగం అందుకొన్నాడు.

కొంతమంది నవ్వుకుంటున్నారు.

బొల్లోజు బాబా