Friday, October 11, 2024

సనాతన ధర్మం అంటే ఏమిటి? - కొన్ని చర్చనీయాంశాలు

హిందూమతాన్ని జీవన విధానంగా చాలామంది నిర్వచించారు. భిన్న సంస్కృతుల, విశ్వాసాల సమ్మేళనంగా హిందూమతం చెప్పబడుతూ వచ్చింది. గత కొన్ని దశాబ్దాలుగా హిందుత్వ వాదులు హిందూ మతాన్ని ఏకసదృశ భావజాలంగా; ఉత్తరభారతదేశపు వైష్ణవమతాన్ని హిందూమతంగా తీర్చిదిద్దుతూ వస్తున్నారు. దీనికి వీరు ఎంచుకొన్న పదం “సనాతన ధర్మం”

హిందూమతాన్ని ప్రాధమికస్థాయిలో హిందు విద్యార్ధులు అర్ధం చేసుకొనటం కొరకు “సనాతన ధర్మ” అనే పేరుతో ఒక వాచకాన్నీ సెంట్రల్ హిందూ కాలేజ్, బెనారస్ వారు 1904 లో ముద్రించారు. దానిలోని అంశాలను క్లుప్తంగా ఈ వ్యాసం/సీరిస్ చర్చిస్తుంది.

ఈ పుస్తకంలో మూడు పార్టులు ఉన్నాయి. మొదటి పార్టు లో హిందూమతమౌలిక భావనలు. ఇది మరలా ఆరు చాప్టర్లుగా ఉంది. రెండవ పార్టులో సనాతన ధర్మము- హిందూ ఆచార్యవ్యవహారములు. దీనిలో ఏడు చాప్టర్లు ఉన్నాయి. మూడవ పార్టులో సనాతన ధర్మము-, నైతిక బోధనలు. పార్ట్ I, పార్ట్ II లలో అనేక విభేదించే అంశాలు ఉన్నాయి. పార్ట్ III లో అభ్యంతరకర అంశాలు పెద్దగా ఏమీ లేవు.

****


పార్ట్ I – హిందుమత మౌలిక భావనలు

వేదాలను అనుసరించే మతం వైదికధర్మం లేదా సనాతన ధర్మం. ధర్మ అంటే విశ్వాసాలు. ప్రజలను కలిపిఉంచే విశ్వాసాలు.

ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వర్ణవేదము అనేవి నాలుగు వేదాలు వీటినే శృతులు అంటారు. వైదికధర్మాన్ని అవలంబించేవారికి వేదాలే ప్రామాణ్యము. శృతుల ఆధారంగా రాసిన గ్రంధాలను స్మృతులు అంటారు. ఇవి మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, శంఖలిఖిత స్మృతి, పరాశర స్మృతి. ఇవి కాక పురాణాలు, రామాయణ మహాభారత ఇతిహాసాలు కూడా సనాతన ధర్మంలో అంగాలు.

(శృతులలో ఆర్యులవలస, వారు అనార్యులను ఏ విధంగా తుదముట్టించారు లాంటి వివరాలు కలవు. చూడుడు: పురాణాలు మరోచూపు, డా. విజయభారతి.

స్మృతులు ప్రజలను ఎక్కువతక్కువ వర్ణాలుగా విభజించి, శూద్రులు, అతిశూద్రులపట్ల జన్మ ఆధారిత వివక్షను చూపాయి. )

చాప్టర్ I- బ్రహ్మమొక్కటే

సనాతన ధర్మములో పరమాత్మ ఒక్కడే బ్రహ్మన్. అతను నిరాకారుడు, నిర్గుణుడు. ఈయనే ఈ చరాచర సృష్టికి కారణము. మన శరీరములో ఉండే ఆత్మ పరమాత్ముని అంశ.

చాప్టర్ II - అవతారాలు

సృష్టి ఆరంభంలో పరమాత్మ- బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులను సృష్టించాడు. వీరు ఈ లోకానికి సృష్టి, స్థితి లయకారకులు.

ఈ లోకంలో ఎప్పుడైతే ధర్మానికి హానికలుగుతుందో అప్పుడు విష్ణువు అవతారపురుషుడై జన్మించి దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షిస్తాడు. ఇవి- మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అంటూ పది అవతారాలు.

(ఈ అవతారాలలో సంహరింపబడిన శంఖాసురుడు, హిరణ్యాక్షుదు, బలి, రావణుడు లాంటివారు అనార్యరాజులని వారిని నిర్మూలించటాన్ని అవతారకథలుగా ఆర్య పండితులు రాసుకొన్నారని ఒక వాదన కలదు. బుద్ధుడిని కూడా ఒక అవతారంగా చెప్పటం విస్తరణనైజంగా అన్వయిస్తారు)

చాప్టర్ III-పునర్జన్మ

ప్రాణిలో ఉండే జీవాత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును పొందుతుంది. దీనినే పునర్జన్మ అంటారు. జీవాత్మ కోరికలు తీర్చుకోవటం కొరకు నిరంతరంగా పునర్జన్మ పొందుతూ ఉంటుంది. కోరికలను జయించి, దైవచింతన చేస్తూ జీవించినట్లయితే జీవాత్మ ఆ పరమాత్మలో లీనంఅవుతుంది. ఇక తిరిగి పునర్జన్మ ఉండదు. దీనినే మోక్షం అంటారు.

(ఇవన్నీ విశ్వాసాలు. ఆత్మకు పునర్జన్మకు ఏ రకమైన శాస్త్రీయనిరూపణలు చేయలేం. అందుకే చార్వాకులు- దేహంలో ఉండే చైతన్యమే ఆత్మ. వేరుగా ఆత్మలేదు. దేహంలోంచి ప్రాణం పోవటమే మోక్షం. కనుక మోక్షం కొరకు ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు చెయ్యక్కరలేదు” అంటూ రెండువేల ఏండ్లక్రితమే ఈ భావనలను ఖండించారు.)

చాప్టర్ IV- కర్మ

కర్మ అంటే మనం చేసే ప్రతి చర్య ఆలొచన, మాట. ఇవి మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు, చెడు కర్మలు చేస్తే చేడుఫలితాలు కలుగుతాయి. కర్మ అనేది పునర్జన్మతో ముడిపడి ఉంటుంది. మనం ఈ జన్మలో చేసే మంచి కర్మల ఆధారంగా వచ్చేజన్మలో సుఖసంతోషాలను, చెడుకర్మల ఆధారంగా కష్టాలను అనుభవిస్తాము.

(సంచితకర్మలు, పునర్జన్మలు లాంటివి విశ్వాసాలు. సాక్ష్యాలు చూపించలేం. కర్మ భావన అనేది ఈ జన్మలో జరుగుతున్న విషయాలకు గతజన్మలో చేసిన కర్మలే కారణం అనే వాదన ఒక జాతిలో స్వేచ్ఛా సంకల్పం, వ్యక్తిగత ప్రయత్నాల అవసరాన్ని తగ్గిస్తుంది. ప్రజల మధ్య విభజనలు, హెచ్చుతగ్గుల పట్ల వారు ఏ పోరాటమూ చేయక అన్యాయాన్ని నిష్క్రియంగా స్వీకరించేలా చేస్తుంది. నా బ్రతుకు ఇంతే అనే నిరాశావాద ధోరణి ప్రబలుతుంది. నిజానికి వర్ణవ్యవస్థ ద్వారా 80% ప్రజలను బానిసలుగా రెండువేల సంవత్సరాలుగా కిక్కురుమనకుండా తొక్కిపెట్టటానికి దోహదపడిన మంత్రాంగంలో కర్మ సిద్ధాంతం ఒకటి)

చాప్టర్ V-దానధర్మాలు

యజ్ఞయాగాదులలో దానధర్మాలు చేయటం సనాతన ధర్మములో ఒక ధార్మిక విధి

చాప్టర్ VI-భూలోకము, స్వర్గలోకము

మనము నివసించే లోకము భూలోకము. ఇది మన కంటికి కనిపిస్తుంది. మన కంటికి కనిపించని లోకములు చాలా ఉన్నాయి. వేదాల ప్రకారం 14 లోకాలున్నాయి. మనిషి మరణించాకా అతని ఆత్మ స్వర్గలోకం చేరుతుంది. అతను చేసుకొన్న పుణ్యం కొద్దీ అక్కడ ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉండి తిరిగి మానవజన్మ ఎత్తటానికి భూలోకం చేరుతుంది.

(ఇవన్నీ విశ్వాసాలు. ధర్మాధర్మములు, పాప పుణ్యములు, స్వర్గ నరకములు, అదృష్ట దురదృష్టములు అగోచరములు కనుక లేవు అని వీటిని చార్వాకులు ఏనాడో ఖండించారు. అంతే కాదు స్వర్గప్రాప్తి కొరకు యజ్ఞయాగాదులలో పశువులను బలి ఇవ్వటం పట్ల -యజ్ఞంలో హింసించబడే పశువుకు స్వర్గప్రాప్తి లభించేటట్లయితే తండ్రినే హింసించి చంపి నేరుగా స్వర్గానికి పంపొచ్చు కదా అని ప్రశ్నించారు)

పార్ట్ II – సనాతన ధర్మము- హిందూమత ఆచార వ్యవహారములు

చాప్టర్ I – సంస్కారములు

సనాతన ధర్మంలో ప్రతిఒక్కరు జీవితకాలంలో వివిధ దశలలో నిర్వర్తించాల్సిన విధులను సంస్కారాలు అని పిలిచారు. గౌతమ ధర్మసూత్రలో ఇవి 40 రకాలు అని చెప్పబడ్డాయి. కానీ కాలక్రమేణా 16 మాత్రమే మిగిలాయి. వీటిని షోడశ సంస్కారములు అంటారు. అవి 1. గర్భాధానము, 2. పుంసవనము/మగబిడ్డ కలగాలని చేసే పూజ 3. సీమంతము, 4. జాతకర్మ 5. నామకరణము, 6. నిష్క్రమణము, 7. అన్నప్రాశనము, 8. చౌలము/పుట్టువెంట్రుకలు 9. ఉపనయనము, 10. మహానామ్నీ వ్రతము, 11. మహావ్రతము, 12. ఉపనిషద్వ్రతము, 13. గోదానము, 14. కేశాంతము, 15. సమావర్తనము 16. వివాహము.

(పై సంస్కారములలో ఉపనయనము ముఖ్యమైనది. ప్రాచీనకాలంలో ఆర్య అనార్య జాతులందరికీ ఉపనయన సంస్కారం ఉండేది. క్రమేపీ ఇది శూద్రులకు నిరాకరింపబడింది. ఉపనయనం ఉండటం ఒక గౌరవ సూచనగాను, లేకపోవటం దాసత్వం గాను మారిపోయింది. ఇది సమాజాన్ని నిలువునా చీల్చింది ఉపనయనం ఉన్న పైమూడు వర్ణాలు అధికులుగాను, ఉపనయనం లేని శూద్రులు వారి సేవకులుగాను మిగిలిపోయారు. అంతే కాక సమాజంలో ఉపనయనం అయినవారికి మాత్రమే వేదాధ్యయన అర్హత, ఆస్తి హక్కు ఉండేది. ఉపనయనం లేకపోవటం వల్ల శూద్రులు సామాజికంగా, ఆర్ధికంగా, విద్యాపరంగా సర్వం కోల్పోయి పై మూడు వర్ణాలకు బానిసలుగా చరిత్రలో మిగిలిపోయారు. ఉపనయనం చేయించే అర్హత బ్రాహ్మణులు తమవద్దే ఉంచుకొన్నారు. ఎవరైనా బ్రాహ్మణులు శూద్రులకు ఉపనయనం చేయిస్తే వారిపై ఆంక్షలు ఉండేవి. అబ్రాహ్మణులు ఎవరైనా ఉపనయనం చేయించినా అది చెల్లదు. ఆ విధంగా శూద్రులు దాదాపు పరాజితులుగా మిగిలిపోయారు. ఇక అతిశూద్రులైతే ఈ మొత్తం ప్రక్రియలో పూర్తిగా బహిష్కృతులు. (రిఫరెన్స్: Selected works of Dr. B. R. Ambedkar).

ఇలాంటి నేపథ్యంలో కూడా కొన్ని శూద్రకులాలు నేడు జంధ్యాన్ని ధరించే హక్కు కలిగి ఉన్నారంటే వారి పూర్వీకులు ఎన్నెన్ని పోరాటాలు చేసి ఆ అర్హతను పొందారో ఆశ్చర్యం కలిగిస్తుంది.)

చాప్టర్ II- శ్రాద్ధం

మనిషి మరణించాక చేసే కర్మను శ్రాద్ధం అంటారు. చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ మొదట ప్రేతలోకము వెళుతుంది. బ్రతికుండగా చేసిన కర్మలను అనుసరించి అక్కడ యమకింకరులు పెట్టే బాధలను అనుభవిస్తుంది. చనిపోయిన పదవరోజున పిండములు పెట్టినచో వాటిని తిని, ఆ జీవాత్మ ప్రేతలోకమునుండి పితృలోకము వెళుతుంది. పితృలోకములో నుండి చేసుకొన్న పుణ్యములను అనుసరించి శుద్ధిపడి స్వర్గలోకమునకు వెళుతుంది. ఇదే మనిషి మరణము తరువాత ఆత్మ సంచరించే క్రమము. కనుక వారసులు బ్రాహ్మణుడు చెప్పినట్లు శ్రాద్ధకర్మలు చేయకుంటే వాని జనకులు స్వర్గలోకప్రాప్తి లేక పితృలోకములోని పూర్వీకులను కలుసుకోలేక ప్రేతలోకంలో యమకింకరులచే బాధింపబడుతూ ఉంటారని సనాతన ధర్మము చెబుతుంది.

(ఇవన్నీ విశ్వాసాలు. ఈ ప్రక్రియను అనాదిగా అనేకమంది ఖండిచారు. శ్రాద్ధము మరణించినవారికి చేరేటట్లయితే, దూరదేశమేగిన వారికి ఇంటినుంచే భోజనం పంపవచ్చు కదా! ఇక్కడ ఇచ్చిన దానము పై లోకములలోని వారికి చేరేటట్లయితే, మేడ క్రింద ఇచ్చిన దానము మేడపై ఉండేవారికి చేరుతుందా! మరణించిన వ్యక్తి వేరేలోకాలకు వెళితే బంధువులను చూడటానికి ఒకసారైనా తిరిగి రాడేమి? ప్రేతకార్యాదులు కొందరకు ఒకరకమైన జీవనోపాధి- అంటూ చార్వాకులు ఏనాడో శ్రాద్ధకర్మలు అనేవి బ్రాహ్మణులకు సంపాదనామార్గం అని తూర్పారపట్టారు. నిన్నమొన్నటి వేమన “పిండములను జేసి పితరుల దలపోసి/కాకులకును బెట్టు గాడ్దెలార/పెంట దినెడు కాకి పితరు డెట్లాయెరా” అంటూ సూటిగా ప్రశ్నించాడు.)

చాప్టర్ III - శౌచం

శారీరిక శుభ్రతను శౌచం అంటారు. ఆరోగ్యము, శక్తి, వ్యాధులనుండి రక్షణ కొరకు దేహాన్ని శుచిగా ఉంచుకోవటం అవసరం. మనం తీసుకొనే ఆహారం శుభ్రంగా ఉండాలి.

తాజా ఆకుకూరలు, పళ్ళు, పప్పుదినుసులు, ధ్యాన్యాలు, దుంపలు లాంటి ఆహారాలలో జీవశక్తి ఉంటుంది. వాటిని తీసుకోవటం వల్ల ఆ శక్తిని మనమూ పొందగలము. అన్నిరకాల మాంసములు అశుచియైనవి ఎందుకంటే వాటిలోని జీవశక్తి తరిమివేయబడినది. అది కుళ్ళిపోవుతున్న ఆహారము. శాకాహారముతో పెరిగిన దేహముకన్నా మాంసాహారముతో పెరిగిన దేహము త్వరగా శిథిలమౌను.

(శారీరిక శుభ్రత, ఆరోగ్యపుటలవాట్లు మంచివి. వీటిని అందరూ పాటించాలి. ఇక శుచి పేరిట ఆహారపుటలవాట్లను నియంత్రించటం వ్యక్తిగత స్వేఛ్ఛను హరించటమే. ప్రజల ఆహారపద్దతులు ఆర్థికస్థోమత, అవసరాలు, ప్రాధాన్యతలు, పోషక ఆవశ్యకతలు, సాంస్కృతిక ఆచారాలపై ఆధారపడి ఉంటాయి. ఒకరకమైన ఆహారం ఉత్తమమైనది, మరొకటి చెడ్డది అని మతం చెప్పటం వివక్షాపూరితం. ఇది సమాజంలో నైతిక అంతస్తులను సృష్టిస్తుంది. మాంసం తినే వ్యక్తులలో ఇది ఆత్మన్యూనత కలిగిస్తుంది. తాముతక్కువ స్థాయి వ్యక్తులమని వారిని న్యూనపరుస్తుంది. సనాతన ధర్మం చేసే ఈ బోధ ఒకరకమైన మోరల్ పోలీసింగ్. అవాంఛనీయం. ఈ రోజు సమాజంలో బీఫ్ తినే వారిపట్ల కొనసాగున్న వివక్ష హింసకు మూలాలు ఇక్కడ ఉన్నాయి.)

చాప్టర్ IV – పంచ ఋణాలు

ప్రతిరోజు ప్రతిఒక్కరు ఐదుఋణాలను తీర్చుకొంటూ ఉండాలి. అవి ఋషిఋణం, దైవ ఋణం, పితృఋణం, మనుష్యఋణము, భూతఋణము. వీటికొరకు అర్పణలు చేయాలి.

రోజు ఏదేని పవిత్రగ్రంథంలోని కొంతభాగాన్ని చదువటం ద్వారా ఋషి/వేదఋణం; దేవతలకు హోమంచేయటం లేదా పూజించటం ద్వారా దైవరుణం;పూర్వీకులకు తర్పణ వదలటం ద్వారా పితృఋణం;అతిధిని ఆదరించటం ద్వారా మనుష్యఋణము; భోజనం చేసే ముందు కొద్దిగా ఆహారము క్రిమికీటకాలు, బిచ్చగాళ్ళకొరకు పక్కన ఉంచటం ద్వారా భూతఋణాన్ని తీర్చుకోవాలి.

(మనం ఈ సమాజం నుంచి ఎన్నో తీసుకొంటాం. వాటికి కృతజ్ఞతగా మనం కూడా ఈ సమాజానికి ఎంతో కొంత ఋణం తీర్చుకోవలసి ఉంటుంది. ఈ పంచఋణాలు అలాంటి pay back ప్రక్రియ. చాతుర్వర్ణాలలో చదువుకొనే హక్కు మొదటి మూడు వర్ణాలకే ఉంది. శూద్రులకు, అతిశూద్రులకు చదువుకొనే హక్కు కాదు కదా వేదాలను వినే అర్హత కూడా లేదు. అంతే కాక ఏవర్ణమైనా స్త్రీలకు కూడా వేదాధ్యయనం నిషిద్ధము. కనుక ఋషిరుణం అనేది మొదటిమూడువర్ణాల పురుషులు మాత్రమే తీర్చుకోగలరు.. రెండో రుణం తీర్చుకోవటంలో భగవంతునికి భక్తునికి అనుసంధానకర్తగా బ్రాహ్మణుడి అవసరం ఉంటుంది. ఇక మిగిలిన ఋణాలను తీర్చుకోవటం తల్లిదండ్రులపట్ల, సాటిమనిషిపట్ల, పంచభూతాల పట్ల ప్రేమ కలిగి ఉండటంగా బావించవచ్చు)

చాప్టర్ V - ఆరాధన

ప్రతిఒక్కరు ప్రతిదినం దేవుని ఆరాధించాలి. ఈశ్వరుడు, నారాయణుడు, దుర్గ, లక్ష్మి వినాయకుడు, కృష్ణుడు ఎవరైనా కావొచ్చు. వారివారి పెద్దలు చెప్పిన కులాచారముల ప్రకారం లేదా ఎవరైనా గురువు చెప్పినట్లు - ఇష్టదైవంయొక్క చిన్న విగ్రహమో, పటమో పెట్టుకొని శత లేదా సహస్రనామావళి పఠిస్తూ ఈ ఆరాధన చేయవచ్చును.

(మనలోని బహుళఆరాధనా పద్దతులకు పైన చెప్పిన సనాతన ధర్మమే కారణము. చెట్టు, జంతువు, రాయి రప్ప, ముక్కోటి దేవతలు, ఆథ్యాత్మిక బోధకుడు ఎవరిని కావాలంటే వారిని తమ ఇష్టదైవాలుగా చేసుకొని ఆరాధన జరుపుకోవటం సనాతన ధర్మంలో భాగం. ముస్లిమ్ పీర్లను, దర్గాలను దర్శించుకోవటం, క్రిష్టియన్ మేరీమాతకు కొబ్బరికాయలు కొట్టి, తలనీలాలు సమర్పించుకోవటం లాంటివి భారతదేశ నలుమూలలా కనిపించే ఒక సాధారణ సనాతన సంప్రదాయం. ఒకరే దైవం, ఒకటే ఆరాధన పద్దతి అని ప్రచారించటం సనాతనధర్మానికి విరుద్ధం, ఇది ఒకరకంగా క్రిష్టియన్, ఇస్లామ్ మతాలను అనుకరించటం.)

చాప్టర్ V - ఆశ్రమాలు

సనాతన ధర్మం ప్రకారం మనిషి తన జీవితాన్ని నాలుగు దశలలో జీవించాలి. అవి బ్రహ్మచర్యము (విద్యార్ధిదశ), గార్హస్థ్యము (కుటుంబజీవనం), వానప్రస్థము (పిల్లలు పెద్దవాళ్ళయ్యాక బాధ్యతలు వారికి అప్పగించి అరణ్యంలో నివసించటం), సన్యాసము (పూర్తిగా అథ్యాత్మిక జీవనం). వీటిని వర్ణాశ్రమధర్మములు అంటారు.

(ఆధునిక కాలంలో ఇలా జీవించలేం కానీ ఈ ఈ దశల వెనుక కల ఉద్దేశాలను గుర్తించటం ముఖ్యం. ఈ దశలను గుర్తించిననాడు జీవితంపట్ల వివిధ వయస్సులలో చేయాల్సిన విధులు తెలుస్తాయి. నిష్కామ కర్మతో జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించే అవకాశం కలుగుతుంది. )

చాప్టర్ VI – చాతుర్వర్ణాలు

సనాతన ధర్మం ప్రకారం మనుషులు నాలుగు వర్ణాలుగా విభజించబడ్డారని పురుషసూక్తములోని “ బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్య కృతః/ఊరు తథస్య యద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్రో మజాయత" అనే శ్లోకం వివరిస్తుంది. బ్రాహ్మణుడు మహాపురుషుని ముఖంనుండి, క్షత్రియుడు భుజాలనుండి, వైశ్యుడు తొడలనుండి, శూద్రుడు పాదాల నుండి ఉద్భవించారని అర్ధం.

(మానవ జీవనాన్ని నేరుగా ప్రబావితం చేసే ధర్మశాస్త్రాలు/సూత్రాలు పై శ్లోకం ఆధారంగా రచించబడినాయి. మనుస్మృతి, యాజ్జవల్క్య స్మృతి, నారద స్మృతి లాంటివి ధర్మశాస్త్రాలు కాగా, ఆపస్తంబ ధర్మసూత్రం, బౌధాయన ధర్మసూత్రం, గౌతమ ధర్మసూత్రం లాంటివి ధర్మ సూత్రాలు. ఇవన్నీ BCE రచనలు. వివిధ యుగాలలో వివిధ స్మృతులు వర్తిస్తాయి. ప్రస్తుత కలియుగంలో పరాశరస్మృతి అమలులో ఉంటుందని చెబుతారు. ఇతరస్మృతులకు దీనికి పెద్ద తేడా కనిపించదు. వాదనకొరకు అలా చెబుతారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని నాలుగు వర్ణాలు. ఈ వర్ణాలలో ముందున్న వర్ణం జన్మతా తరువాత వర్ణం కన్నా ఉన్నతమైనది.

1. బోధన, అధ్యయనం, యజ్ఞాలు నిర్వహించటం, దానధర్మాలు పొందటం బ్రాహ్మణుల చేయవలసిన పనులు. ఈ పనులను ఇతర వర్ణాలవారు చేయరాదు. క్షత్రియులు పాలన, వైశ్యులు వ్యాపారము, శూద్రులు పై ముగ్గురికి సేవలు చేయుట వారి వారి కర్మలు. వైశ్య, శూద్రులు తమ వర్ణ ధర్మములు తప్పితే లోకం అలజడి పాలవుతుంది కనుక వారు ధర్మములను పాటించే విధంగా రాజు జాగ్రత్తలు తీసుకోవలెను. (మను :8418)

2. శూద్రులు పై మూడు వర్ణాల వారికి సేవ చేయాలి. ఎంత పై స్థాయి వర్ణానికి సేవలందిస్తారో అంత ఎక్కువ శ్రేయస్సు వారు పొందెదరు.

3. శూద్రులు ఉపనయనానికి, వేదాధ్యయనానికి అర్హులు కారు.

4. సనాతనధర్మంలో భిన్న వర్ణాలు ఎలాజీవించాలో చెప్పిన నియమాలు ఇలా ఉన్నాయి. – బ్రాహ్మణుడు క్షత్రియుల్ని దూషిస్తే యాభైపణాలు, వైశ్యుల్ని దూషిస్తే ఇరవై ఐదు పణాలు, శూద్రుణ్ణి దూషిస్తే పన్నెండు పణాలు శిక్ష విధించాలి. అదే ఒక శూద్రుడు బ్రాహ్మణున్ని అవమానిస్తే ఆ శూద్రుని నాలుక కోసివేయాలి. మను: 8.270).

బ్రాహ్మణుడిని పేరుని హేళనగా పలికితే శూద్రుని నోట్లో కాల్చిన మేకు దూర్చాలి. (మను 8.272). బ్రాహ్మణునికి ధర్మంగురించి చెప్పే శూద్రుని చెవుల్లో, నోట్లో మరిగే నూనె పొయ్యాలి

(8.272). ఉన్నతకులాల వారిని నీచకులస్థుడు ఏ అవయవంతో అయితే గాయపరుస్తాడో దానిని నరికివేయాలి. (8.279)

తక్కువవర్ణస్థుడు వాడు ఎక్కువ వర్ణస్థుని సరసన కుర్చీపై కూర్చునేందుకు ప్రయత్నిస్తే వారి పిరుదులపై కత్తి గాట్లు పెట్టించాలి. (8.281). అతడు ఒకవేళ ఉమ్మివేస్తే పెదాలను, ఉచ్చపోస్తే పురుషాంగాన్ని, ఆపాన వాయువు వదిలితే మలద్వారాన్ని కోయించాలి (మను 8.282).

ఈ సృష్టిలో సమస్తం బ్రాహ్మణుని సొత్తే. తన ఉత్తమమైన జన్మ వలన బ్రాహ్మణుడు అన్నింటికీ తీసుకోవటానికి అర్హుడే (మను: 1:100)

బ్రాహ్మణుడు ఎంతనీచుడైనప్పటికీ వాని యెడల సకల గౌరవమర్యాదలు చూపాలి (మను: 9.319)

రాజు న్యాయనిర్ణయం కొరకు బ్రాహ్మణుడిని లేదా క్షత్రియుడిని, లేదా వైశ్యుడిని వినియోగించవచ్చు కానీ శూద్రునికి న్యాయనిర్ణేతగా వ్యవహరించే అవకాశం ఏ మాత్రం ఇవ్వరాదు. (కాత్యా: 67)

ఇక ఈ చాతుర్వర్ణాలకు వెలుపల ఉన్నవారు (అతి శూద్రులు మాలమాదిగలు/చండాలురు/వర్ణబాహ్యులు) అయితే సనాతనధర్మ వర్ణవ్యవస్థలో అసలు మనుషులే కారు. వర్ణబాహ్యులను దస్యులు అంటారు. వీరి నివాసం గ్రామం వెలుపల ఉండాలి. వీరు శవాలపై కప్పిన దుస్తులను ధరించాలి. పగిలిన మట్టిపాత్రలలో భుజించాలి. ఇనుప ఆభరణాలు మాత్రమే వేసుకోవాలి. వీరు ఊరిలో కాని పట్టణాలలో కానీ తిరుగరాదు. (మను: 10.54). శవాలను మోసుకుపోవటం, నేరస్తులను వధించటం వీరి విధులు. ఒక చండాలుడు ఉద్దేశపూర్వకంగా తన స్పర్శ ద్వారా ద్విజకులాలను తాకి మైలపరిస్తే వానికి మరణదండన విధించాలి. (విష్ణు: 5.104). స్త్రీ స్వాతంత్రమర్హతి అంటూ స్త్రీకి జీవితపర్యంతమూ స్వేచ్ఛలేకుండా చేసి పురుషునిపై ఆధారపడి జీవించాలని మనుధర్మశాస్త్రం చెప్పింది (9.2)

ధర్మశాస్త్రాలలోని పై నియమాలను గమనిస్తే, ఒకనాటి భారతదేశంలోని 80% ప్రజలు ఈ వర్ణవ్యవస్థ వలన ఎంతటి దుర్భర పరిస్థితులలో జీవించారో అర్ధమౌతుంది. సనాతనధర్మంలోని చాతుర్వర్ణ వ్యవస్థ భారతీయ సమాజాన్ని జన్మ ఆధారిత సమూహాలుగా విభజించి, 90 శాతం ప్రజలను 10 శాతం ప్రజలకు బానిసలుగా చేసింది. ఈ 90% ప్రజలకు ఆర్ధిక, రాజకీయ, విద్య, ఆథ్యాత్మిక మానవహక్కులను తిరస్కరించింది. ఈ దుర్నీతి ద్వారా సమాజంలో బ్రాహ్మణాధిక్యత స్థాపించబడి, పురాణాలు, ఇతిహాసాలలోని పిట్టకథల ద్వారా అది మరింత స్థిరపరచబడింది.

ధర్మశాస్త్రాలలోని ఈ అరాచకనియమాలను ఖండిస్తూ డా. అంబేద్కర్ మనుస్మృతిని బహిరంగంగా తగలపెట్టారు. అదొకబలమైన symbolic gesture. రాజ్యాంగంలో ప్రజలందరికీ సమానహక్కులు కల్పించాడు. అతిశూద్రులు సామాజికంగా పైకిరావటానికి కొన్ని సదుపాయాలు కల్పించాడు.

రాజ్యాంగం అమలులో ఉన్న ఈ కాలంలో ధర్మశాస్త్రాలు ఎవరు పాటిస్తున్నారని వాదనకొరకు చిలకపలుకులు వల్లిస్తారు. సనాతన ధర్మంలోని వర్ణవ్యవస్థ ప్రజల మనస్సులలో బలంగా నాటిన కుల వివక్ష, వర్ణాధారిత ఆధిపత్య ధోరణులు స్త్రీలపట్ల పక్షపాతవైఖరి, దాడులు, హత్యలు లాంటివి నిత్యం వార్తల్లో అందరం వినేవే అని అంగీకరించరు.

పార్ట్ III – సనాతన ధర్మము, నైతిక బోధనలు

(ఈ రకపు బోధనలు మనం ఎలాంటి మంచిమనుషులుగా ఉండాలి, మన చుట్టూ ఉన్నవరితో ఎలా వ్యవహరించాలి లాంటి విషయాలను తెలియచేస్తాయి. సనాతనధర్మం పేరిట నైతికబోధనలు అనే విభాగంలో చెప్పిన నైతికత, ధర్మం, మానవత్వం లాంటి అంశాలు సార్వజనీనాలు. ఒక్క హిందూమతానికే పరిమితం అయ్యే అంశాలు కావు. వీటి కారణంగా సమాజానికి మేలే తప్ప కీడు జరగలేదు. క్లుప్తంగా వాటిగురించి)

చాప్టర్ I
నైతికత అంటే ఇతరులతో, ఇతర జీవులతో ఎలా వ్యవహరిస్తామనేదే మన నైతికత. సమస్తజీవుల క్షేమం కోరుకోవటమే సరైన నైతిక జీవనం. మంచి ప్రవర్తనను సదాచారం అంటారు. ధర్మ , అర్ధ, కామ మోక్షాలు జీవనాదర్శాలు. ప్రతిఒక్కరు తన కాలాన్ని వీటికి సరైనవిధంగా కేటాయించాలి.

చాప్టర్ II
మనుషులందరిలో పరమాత్మ ఉంటాడని, అతను ఒక్కడే అని నమ్మినపుడు ఎదుటివ్యక్తికి చేసిన హాని, తనకు తాను చేసుకొంటున్న హాని అని గుర్తించవచ్చు. లోకస్సమస్తా సుఖినోభవంతు అనే భావన.

చాప్టర్ III
తప్పు ఒప్పులు తెలుసుకొని జీవించటం ఉత్తమ జీవనం. భగవంతుని సంకల్పానికి అనుగుణంగా నడవటం ఒప్పు, వ్యతిరేకంగా నడవటం తప్పు అని శృతులు చెబుతున్నాయి.

చాప్టర్ IV
సనాతనధర్మం ప్రకారం- నిర్భయత, స్వచ్ఛత, వివేకం, దాతృత్వం, ఇంద్రియాల నియంత్రణ, త్యాగం, నిజాయితి, జాలి, వినయం, చంచలత్వం అహంకారం దురాశలేకపోవటం లాంటి లక్షణాలు ఉత్తమ నైతిక విలువలు, దైవగుణాలు అని చెప్పబడ్డాయి. వీటికి వ్యతిరేక గుణాలు అసురగుణాలు.

చాప్టర్ V
మనుషులందరూ ఒక్కడే ఉన్న పరమాత్మకు లోబడి ఉన్నప్పుడు పరస్పర స్వీయత్యాగం, సామరస్య సంబంధాల స్థాపన జరుగుతుంది. ఇదే యజ్ఞ ఫలము.

చాప్టర్ VI
ఈశ్వరుడే ఆలోచన, శక్తి, ఆనందము. మనిషి అతని సృష్టే కనుక అతనుకూడా ఈ లక్షణాలను కలిగి ఉంటాడు. అంతర్లోచనం ద్వారా ఈ శక్తులను మనిషి పొందగలడు.

చాప్టర్ VII
మనిషి ఉద్వేగాలను జయించగలగాలి. ఇది కష్టసాధ్యం. మనస్సు కోర్కెలు, ఆనందాల వెంటపడుతుంది. ఇంద్రియ నిగ్రహం అలవరచుకోవాలి. దేవతలను, ద్విజులను, గురువులను నిత్యం పూజించాలి. ఇతరులకు హానికలిగించరాదు. అదే ఉత్తమజీవనం.

చాప్టర్ VIII
ప్రతిఒక్కరికి పైన దేవుడు, రాజు, తల్లిదండ్రులు, గురువు, పెద్దవయసు వారు ఉంటారు. వీరు మనకంటే పెద్దలు. వీరిని నిత్యం, భక్తితో, విధేయతతో ప్రేమతో కొలుస్తూ ఉండాలి. అట్లు కానిచో పతనమవ్వటం ఖాయం.

చాప్టర్ I‍X
భార్యభర్తలు, స్నేహితులు, సోదరులు, అతిధి వంటి సమానస్తుల మధ్య ప్రేమ, అంగీకారం, స్నేహభావం ఉండాలి.

చాప్టర్ X
మనకంటా చిన్నవారిపట్ల మమకారంతో, దయతో, సహనంతో ఉండాలి. వారి కష్టసుఖాలలో పాలుపంచుకోవాలి.

చాప్టర్ XI
వ్యక్తులు ఒకరిపట్ల ఒకరు ద్వేషరహితంగా, భావోద్వేగాలకు గురికాకుండా పరస్పర సౌమ్యతతో, సహనంతో జీవించాలి.

ముగింపు

హిందుమతంలో భిన్న ఆరాధనా విధానాలు ఉంటాయి. ఒక్కో కులానికి ఒక్కో కులదైవం, కులాచారం, కుల కట్టుబాట్లు ఆ కులస్థులను నడిపిస్తాయి. హిందూమతం అంటేనే భిన్నత్వం. వివిధ సాంస్కృతిక, నైతిక, సామాజిక అంశాల కలబోత హిందు మతం. వీటన్నిటినీ సనాతన ధర్మం అనే మూసలో ఒదిగించాలని జరుగుతున్న ప్రయత్నం ఇప్పటికే చాలాదూరం వచ్చేసింది.

సనాతన ధర్మం అంటే అనాదిగా పాలకవర్గాలు ప్రచారం చేసిన బ్రాహ్మనిజం. దీనిలో వైవిధ్యం ఉండదు. ప్రజలు వర్ణాలుగా విభజించబడి ఉంటారు. అందరిలో పై మెట్టుపై బ్రాహ్మణుడు కూర్చుని ఉంటాడు. కింద మెట్లపై ఉన్నవారందరూ పైనున్న బ్రాహ్మణునికి సేవలు చేయాలి. ఈ మెట్లకు వెలుపల ఉన్న అతి శూద్రులకు అసలు ఈ ధర్మంలో స్థానమే లేదు. పంతొమ్మిదోశతాబ్దం వరకూ వారు అత్యంత హేయమైన, దుర్భర పరిస్థితులలో ఊరికిదూరంగా నివసించవలసి వచ్చింది. స్త్రీ కి శూద్రస్థానం ఇవ్వబడింది. సతి, బాల్యవివాహాలు లాంటి దురాచారాలతో స్త్రీలను సమాజంలో పిల్లలను కని ఇచ్చే యంత్రాలుగా చేసింది. సమానత్వం మృగ్యం. దీన్ని శ్రమవిభజనగా చెబుతారు కానీ డా. అంబేద్కర్ అన్నట్లు ఇది శ్రామికుల విభజన.

సనాతన ధర్మం మరొక గుణం విస్తరణనైజం. భిన్నఆరాధనా విధానాలను తనలో కలిపివేసుకొంటుంది. వాటికి తనకన్న కిందస్థానాన్ని కేటాయిస్తుంది. ఉదాహరణకు బహుజనుల దేవతలైన గంగమ్మ, మైసమ్మ, మరిడమ్మ లాంటి గ్రామదేవతలను బ్రాహ్మణీకరణ చేస్తుంది కానీ వాటికి హిందూ ప్రధాన దేవతల స్థాయి కల్పించదు. బహుజనుల ఆరాధనా విధానాలను కబళిస్తుంది. అక్కడి బహుజన పూజారులను తొలగించి వైదిక మంత్రాలు పూజావిధానాలు, బ్రాహ్మణపూజారులను ప్రవేశపెడుతుంది. తద్వారా బహుజనుల ఆరాధనావిధానాలలోని భిన్నత్వాన్ని తొలగించి ఏకసదృశ బ్రాహ్మణిజపు రూపాన్ని రుద్దుతుంది సనాతనధర్మం. హిందూమతం అంటే బహుళత్వం అనే మౌలికభావనను తొలగించి హిందూమతం అంటే బ్రాహ్మణుడే అనే అర్ధాన్ని కలిగిస్తుంది సనాతనధర్మం. సనాతనధర్మ భావజాలం, ఆచరణ కేవలం బ్రాహ్మణీయ ఆధిపత్యం కొరకే. సనాతన ధర్మంలో సోదరభావానికి, సమానత్వానికి స్వేచ్చకు వైవిధ్యానికి స్థానం లేదు. ఇది ఒకరకంగా మత ఫాసిజం.

గాంధి తన జీవితకాలంలో సనాతన ధర్మం అంటే హిందూ ముస్లిమ్ ఐక్యతగా నిర్వచించాడు. అతిశూద్రులు అనాదిగా హిందూమతం వెలుపల ఉన్నారు, వారు హిందువులే కారు అంటూ డా. అంబేద్కర్ పదునైన వాదనాపటిమతో అందరినీ ఒప్పిస్తున్న తరుణంలో అతిశూద్రులు కూడ హిందూంమతంలోని వారే అని గాంధీ వాదించాడు. అంబేద్కరైట్స్ దృష్టిలో నేటికీ పగవాడిగా మిగిలిపోయాడు. కులాలు ఉండలి కానీ కులవివక్ష ఉండకూడదు అని అన్నాదు. ఇవన్నీ సాఫ్ట్ సనాతన ధర్మం. దీనికి వ్యతిరేకంగా ఈ దేశం హిందువులనీ ఇక్కడ హిందువులే ప్రధాన పాత్రవహించాలని, అన్నిరంగాలలో వారే ఆధిపత్యం వహించాలని, హిందూయేతర వ్యక్తులు ఈ దేశం విడిచివెళ్ళిపోవాలని కోరుకునే అతివాద హిందుత్వం ఉండేది.

ఇలాంటి నేపథ్యంలోంచి నెహ్రూ, ఇందిరలు స్వతంత్ర్య భారతదేశాన్ని – భిన్నమతాలు స్వేచ్చగా మనుగడసాగించే లౌకికవాద రాజ్యంగా తీర్చిదిద్దారు. దళితులు, స్త్రీలకు సమాన హక్కులు కల్పించి అన్నిరంగాలలో పురోగవ్రుద్ధి సాధించేలా కృషిచేసారు. ఇది గాంధీజీ స్వప్నించిన “ఈశ్వర అల్లా తేరె నామ్ సబకో సంమతి దే భగవాన్” భజన్ కు సాకారం.

ఈ దేశ భిన్నత్వాన్ని గౌరవిస్తూ దానిలోంచి సహిష్ణుత, సామరస్యాన్ని సాధించటమే “గాంధి-నెహ్రూ మోటిఫ్”. ఇది దేశ కులమతాలకు అతీతంగా ప్రజలందరూ సమానం అంటుంది. మతాన్ని పాలననుంచి విడగొడుతుంది. దీన్నే శ్రీమతి ఇందిరాగాంధి కూడా కొనసాగించింది. ఈరకపు పాలన హిందుత్వవాదుల వాదనకు పూర్తిగా భిన్నం. హిందుత్వవాదులకు మతం ఆధారంగా ప్రజలను విడదీయాలి, ఆ వ్యవస్థలో మతపరమైన అధికారాలను బ్రాహ్మణులకు మాత్రమే కట్టబెట్టాలి. అతిశూద్రులు, స్త్రీలను తక్కువ సమానులుగా చెయ్యాలి. అది కావాలి అంటే “గాంధి-నెహ్రూ మోటిఫ్” ను ధ్వంసం చేయాలి. దానికి ఎన్నిరకాల అబద్దాలు ఆడాలో, ఎన్నిరకాల అసత్యాలు ప్రచారం చేయాలో అన్నీ తమ సోషల్ మీడియా జీతగాళ్లతో సనాతన ధర్మం ముసుగులో చేయిస్తున్నారు.

అలాగని మంచి లేదా అంటే మన సనాతనధర్మంలో మనిషిని మనిషిని అనుబంధం అనే దారంతో కుట్టే పండుగలు, షోడశ సంస్కారాలు, క్రమశిక్షన పెంచే స్వీయ ఆచారాలు, కష్టకాలంలో ధైర్యాన్ని జీవితం పట్ల నమ్మకాన్ని ఇచ్చే కులదేవతారాధన, వాటి సంబురాలు, సంగీతం, నాట్యం, సాహిత్యం, శిల్పం వంటి మన కళలు - ఇవన్నీ సనాతనధర్మపు పాటించదగ్గ విలువలే. అనూచానంగా ప్రతి ఒక్కరూ పాటించేవే. వీటిని రాజకీయంగా ఎవరూ ప్రచారం చేయక్కరలేదు. బలవంతంగా ఎవరితోటీ చేయించలేం కూడా.

అలా కాక- రాజకీయంగా సనాతన ధర్మం పేరిట ఇంత ప్రచారం, బలవంతం జరుగుతున్నదంటే అది హిందుత్వాని బలవంతంగా సనాతన ధర్మం పేరిట రుద్దేప్రయత్నం. హిందుత్వ బలపడటం అంటే వర్ణవ్యవస్థను, బ్రాహ్మణాధిక్యతను బౌద్ధికంగా బుర్రల్లో బిగించటం. ఇది 80 శాతం ఉన్న బహుజనులకు ఆమోదయోగ్యమా అనేది ఆలోచించుకోవాలి.


బొల్లోజు బాబా



Tuesday, October 8, 2024

కొంచెం ప్రజాస్వామ్యం కండి.

వేదాలు వినకూడదని, చదువుకోకూడదని, బ్రాహ్మణులను పూజించాలని లాంటి రాతలన్నీ వ్యాసుడు, వాల్మీకి లాంటి బ్రాహ్మణేతరులే రాసుకొన్నారని అని వాదించటం ఏదైతే ఉందో అది హిలేరియస్.
బ్రాహ్మణాధిక్యతను స్థిరపరచే రాతలు రాసిన బ్రాహ్మణులను, బ్రాహ్మణేతరులు అని ప్రచారించటం గొప్ప మార్కెటింగ్ టెక్నిక్.
ఇలాంటి వాదనలు శతాబ్దాలుగా చేసారు. ఇంకానా... ఇది డా. అంబేద్కర్, పెరియార్, పూలే ల యుగం. తర్కం నడుస్తున్న రోజులు ఇవి.
కొంచెం ప్రజాస్వామ్యం కండి.

Reference comment

కృష్ణుడు ఏంచెప్పాడు- బ్రాహ్మణాధక్యతను, చతుర్వర్ణాలను చెప్పాడు గీతలో. స్వధర్మం పాటించమన్నాడు. గీత దాటొద్దన్నాడు.
విశ్వామిత్రుడు- బ్రాహ్మణ జన్మ ఉత్తమమైనదని దాన్ని కోరుకోవటానికి తపస్సుచేసాడు
అరుంధతి - బ్రాహ్మణ కశ్యపుని ముని కుమార్తె. బ్రాహ్మణుని భార్య. మాదిగ స్త్రీ అని కథనాలు అల్లారు.
వాల్మీకి: బ్రాహ్మణుడు పేర్లు, అగ్నిశర్మ/లోహ జంఘ. బోయ అని కల్పించారు. రాసిందంతా బ్రాహ్మణాధిక్యతను స్థిరపరచే రాతలు.
వ్యాసుడు: బ్రాహ్మణ పరాశురుడికి జన్మించాడు. తాత బ్రాహ్మణ వశిష్టుడు. రాసిన రాతలు బ్రాహ్మణాధిక్యతను స్థిరపరచే కావ్యాలు, ఇతిహాసాలు.
మనువు కూడా బిసి అని వాదించాడో అతితెలివి మేధావి.
ఇలాంటి వాదనలనే లోతుతక్కువ వాదనలు అంటారు. బ్రాహ్మణవాదాన్ని చెప్పినవారందరూ బ్రాహ్మణేతరులు కనుక బ్రాహ్మణవాదం/సనాతనం అనేది బ్రాహ్మణేతరులే కావాలని తమమీద వేసుకొన్నారు;
వేదాలు వినకూడదని, చదువుకోకూడదని, బ్రాహ్మణులను పూజించాలని లాంటి రాతలన్నీ తమకు తామే రాసుకొన్నారని అని వాదించటం ఏదైతే ఉందో అది హిలేరియస్.
బ్రాహ్మణాధిక్యతను స్థిరపరచే రాతలు రాసినవారిని బ్రాహ్మణేతరులు అని ప్రచారించటం మార్కెటింగ్ టేక్నిక్.
ఇలాంటి వాదనలు శతాబ్దాలుగా చేసారు. ఇంకానా... ఇప్పుడు డా. అంబేద్కర్, పెరియార్, పూలే ల యుగం, తర్కం నడుస్తున్న రోజులు ఇవి.
కొంచెం ప్రజాస్వామ్యం కండి.
పిఎస్. ఆయా పాత్రలు చారిత్రికమైనవని నమ్మలేను కానీ పురాణ పాత్రలుగా ఎంచి వాటిపై విశ్లేషణ ఇది.



బొల్లోజు బాబా

సాయిబాబా విగ్రహాలు తొలగింపు

యూపి ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలు తొలగింపు పై పెట్టిన ఒక పోస్టు వద్ద నే చేసిన కామెంట్లు ఇవి.
.
ఇది ఇక్కడితో ఆగుతుందా? హిందూ, బౌద్ధ ఆ తరువాత శైవ వైష్ణవ గొడవలుగా మారదని గ్యారంటీ లేదు.
***
శైవ వైష్ణవ గొడవలు వచ్చేంతగా శాస్త్రం ఎవరూ చదువుకోలేదు అన్న మిత్రుని వ్యాఖ్యకు ఇచ్చిన సమాధానం ఇది.
***
మీరు శాస్త్రం మాట్లాడుతున్నారు.
వాస్తవం అలా లేదు.
ఈ రోజు హిందుత్వ పేరుతో జరుగుతున్న ఈ విభజన, ద్వేషానికి కారణం వైష్ణవమే అనే భావన బలపడుతోంది.
మొన్న అయోధ్యాలయ ప్రారంభోత్సవ వేళ కూడా పిఠాధిపతుల నిరసనలో ఈ శైవ వైష్ణవ విభేధాలు స్పష్టపడ్డాయి
రాహులుడు శివుని పటం ప్రదర్శిస్తూ కూడా ఇదే అభిప్రాయాన్ని నర్మగర్భంగా ప్రకటించాడు
ఓట్లకోసం తాత అడ్డబొట్లు పెట్టుకొని శివాలయాలచుట్టూ తిరిగాడు మొన్న తమిళనాడులో.
పొలిటికల్ గా, మతపరంగా శైవ వైష్ణవ బేధాలు కన్సాలిడేట్ అవుతున్నాయి.
ఇక వ్యవహారపరంగా మతం బ్రాహ్మణుల చేతులలోంచి భజరంగ్ సేవకుల చేతులలోకి ఏనాడో జారిపోయింది.
బ్రాహ్మణుల చేతుల్లో రాజకీయనిర్ణయాలకు శాస్త్రప్రకారం సమర్ధింపులు చేయటం మిగిలింది.
ఒక వేళ అన్నిటినీ మింగేసి వైష్ణవం ఒకటే మిగిలినా.... అందులో మళ్ళా ద్వైత, అద్వైత, గౌడీయ అంటూ భిన్న శాఖల ఆధిపత్య పోరు మొదలౌతుంది.
మత ఆధారంగా విభజన ద్వేషం మొదలయ్యాకా దానికి అంతం ఉండదు. చరిత్ర ఈ నరమేథాలను చాలానే చూసింది.
బొల్లోజు బాబా

ప్రాచీనగాథ

మంచినీటిలో బతికే నీరుపిల్లి
సముద్రపు ఎండు చేపలని
తింటుందేమో కానీ
మరొకరిని కౌగిలించుకొన్న ఛాతీని
నేను హత్తుకోను
.
ఓరమ్‌పోకియార్, ఐంగురునూరు – 63
(బయట తిరుగుళ్ళు మరిగిన భర్తగురించి చెప్పిన మాటలు)
రానున్న నా ప్రాచీనగాథలు పుస్తకం నుండి
***
పై గాథ రెండువేల సంవత్సరాల క్రితపు సంగం కాలపు సాహిత్యం. అప్పటికి వైదిక ధర్మం ఇంకా దక్షిణభారతదేశానికి రాలేదు. ఇక్కడి ప్రజలను జైన, బౌద్ధ ధర్మాలు నడిపించాయి.
ఒక స్త్రీ ఎంత స్వేచ్ఛగా, ఎంత నిర్భయంగా తన అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నదో గమనించవచ్చు.
భర్త కుష్టురోగి అయినప్పటికీ వాడితోనే కాపురం చేయాలని, అతను కోరితే బుట్టలో ఎత్తుకొని ప్రియురాలి ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పింది సనాతన ధర్మం.

బొల్లోజు బాబా

సెక్యులరిజమ్ అనేది యూరోపియన్ భావన భారతీయులది కాదు. .... ఒక హిందుత్వ వాది.

సెక్యులరిజమ్ అనేది యూరోపియన్ భావన భారతీయులది కాదు. .... ఒక హిందుత్వ వాది.

***
.
ఒక మతానికి చెందిన వ్యక్తులు అసందర్భంగా తమ మతాన్ని పొగుడుకోవటం, ఇతర మతాలను నిందించటం చేయరాదు. పరమతానికి చెందినవారిని కూడా గౌరవించవలెను. ఇలా చేయుటవలన తమ మతాన్ని అభివృద్ధి చేసుకోవటమే కాక ఇతర మతాల వారికి ఉపకారం కలిగించిన వారు అవుతారు. తన వారిని స్తుతిస్తూ ఇతర మతస్తులను నిందించేవాడు తన మతానికే ఎక్కువ అపకారం చేసిన వాడవుతాడు. సమస్త జనులకు ధర్మాభివృద్ధే ముఖ్యము-- - అశోక చక్రవర్తి, XII వ శిలాశాసనము
.
***
హిందుత్వ వాదులకు భారతదేశం అంటే ఆరో శతాబ్దపు మతం మాత్రమే. అంతకు ముందుకూడా ఈ దేశానికి చరిత్ర ఉందని తెలుసుకోవటానికి ప్రయత్నించరు. రెండువేల సంవత్సరాల క్రితపు అశోకుని శిలా శాసనంలో చెప్పింది ప్రాచీన భారతదేశ సెక్యులరిజం.
విభజన, ద్వేషం బాగా అమ్ముడుపోయే సరుకులైనప్పుడు, సమత సహిష్ణుత ఎవరికి కావాలి?
బొల్లోజు బాబా

థేరీగాథలు


థేరీగాథలు BCE ఆరోశతాబ్దానికి చెందిన తొలితరం బౌద్ధ బిక్కుణిల అనుభవాలు. మానవ దుఃఖం, వేదన, ముక్తికొరకు అన్వేషణ, తధాగతుని బోధనలో దొరికిన సాంత్వన ఈ గాథల ఇతివృత్తం.
వీటిని అనువదించి 2022 లో పుస్తకంగా తీసుకొచ్చాను. ఛాయావారు ప్రచురించారు.
ఈరోజు వాటిని మరలా చదువుకొంటే, మంచి అనుభూతిని ఇచ్చాయి ప్రతి గాథ వెనుక చారిత్రిక అంశాలను పుస్తకం చివరలో నోట్సు రూపంలో ఇచ్చాను.
****
.
భద్ధ కుండలకేశ
.
శిరోముండనం గావించుకొని
దుమ్ముపట్టిన దుస్తులు ధరించి
తప్పులు లేనిచోట తప్పులు ఉన్నాయని
తప్పులు ఉన్నచోట వాటికి అంధురాలినై
సంచరించేదానిని
యాభై ఐదేండ్లపాటు
అంగ, మగధ, వజ్జి, కాశి, కోశల రాజ్యాల
నలుమూలలా పర్యటించాను
ఆ రాజ్య ప్రజలు ఇచ్చిన భిక్షను తిన్నాను
ఒకనాడు
నిర్మలమైన బుద్ధభగవానుడు శిష్యులతో కలసి వుండగా
గృధ్రకూటపర్వతం వద్ద చూసాను
ఎదురుగా మోకాళ్లపై కూర్చొని
చేతులు జోడించి భక్తితో నమస్కరించాను
“రా భద్దా” అన్నారాయన
ఆ క్షణమే నా ధమ్మ దీక్షా స్వీకారం జరిగింది
తధాగతుడు ఇచ్చిన వస్త్రాన్ని ధరించిన భద్ధ
అన్ని బంధనాలనుంచి విముక్తమయింది.
.
నోట్స్
.
రాజగృహలో ఒక వడ్డీవ్యాపారస్తుని కుమార్తె బద్ద. ఒకరోజు పురవీధిలో మరణదండన విధించటానికి తీసుకొని వెళుతున్న ఒక దొంగను చూసి మనసుపారేసుకొని, అతనిని తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోను అని తల్లిదండ్రులకు చెప్పటంతో- భద్ధ తండ్రి తలారులకు భారీగా లంచాలిచ్చి ఆ దొంగను రహస్యంగా విడిపించి ఇంటిలోకి తీసుకొని వచ్చి, స్నానం చెయించి, అలంకరించి, కూతురు ముందు నిలబెట్టాడు. ఆ దొంగ పేరు సత్తుక. ఇంతచేసినప్పటికీ ఇతనిలో ఏ మార్పు రాక, భద్ధ ఒంటిపై ఉన్న నగలను ఎలా దొంగిలించాలా అని ఆలోచించసాగాడు.
మరణదండన నుండి తప్పించుకొన్నందుకు కొండదేవతకు మొక్కుకున్నానని, అది తీర్చుకొనటానికి వెళ్లాలని, బద్దను నమ్మించి ఆమెను ఒక పెద్దకొండపైకి తీసుకొనివెళ్ళాడు సత్తుక. అక్కడ ఆమె ఒంటిపైఉన్న నగలను దొంగిలించి ఆ కొండపైనుండి కిందకు తోసేసి చంపెయ్యాలని అతని పథకం. అతని పన్నాగాన్ని గ్రహించిన భద్ధ, మిమ్ములను చివరిసారిగా ఒకసారి కౌగిలించుకోవాలనిఉంది నా ఆఖరుకోర్కె తీర్చమని అని అడిగి, సత్తుకను కౌగిలించుకొని క్షణకాలంలో అతనిని ఆ కొండపైనుంచి తోసి చంపివేసింది. ఇంత జరిగిన తరువాత ఇంటికి వెళ్ళటానికి భద్ధకు మొఖం చెల్లక, శ్వేతాంబర జైనమతంలో చేరి సన్యాసిగా జీవనం ప్రారంభించింది. అప్పట్లో జైనమతం తీసుకోవాలంటే తలపై జుత్తును చేతితో పెకలించుకోవాలి. ఆ విధంగా చేయటంవలన కేశాలు చిక్కులు పడటంతో అప్పటినుండి భద్ధకు భద్ధ కుండలకేశ (Good one with curly hair) అనే పేరు వచ్చింది. ఈమె జైనబోధనలను మొక్కవోని దీక్షతో సంపూర్ణంగా అధ్యయనం చేసి దేశసంచారానికి బయలుదేరింది.
ఏదైనా ఊరు వెళితే అక్కడ ఒక ఖాళీ స్థలంలో ఒక నేరేడు కొమ్మను పాతి తనతో ఆధ్యాత్మికంగా వాదించేవారికొరకు ఎదురుచూసేది. ఆ ఊరిలో ఎవరైనా ఈమెతో వాదించాలనుకొంటే ఆ నేరేడు కొమ్మను తొలగించి, ఈమెతో వేదాంత చర్చ చేసేవారు. అలా ఈమె యాభై ఏండ్లపాటు ప్రాచీన ఉత్తరభారతదేశంలోని అనేక పట్టణాలు సంచరించి ఎందరినో తన వాదనాపటిమతో ఓడించి దిగ్విజయయాత్ర జరుపుతూ ఒకనాడు శ్రావస్తి వచ్చింది. అక్కడ బుద్ధుని శిష్యుడైన సారిపుత్త తో వాదనకు దిగింది. వీరిరువుతూ హోరాహోరిగా వేదాంత చర్చ చేసారు. సారిపుత్త జ్ఞానసంపత్తిని గ్రహించిన భద్ధకుండలకేశ అతనిని గురువుగా ఉండమని కోరింది. సారిపుత్త బుద్ధునివద్దకు వెళ్ళమని చెప్పటంతో, భద్ధకుండలకేశ గృధ్రకూటపర్వతంపై ఉన్న బుద్ధభగవానుని చేరి నమస్కరించగానే, ఆయన “రా బద్ధా” అన్నాడట. ఆ మాటే భద్ధ కు బుద్ధుడు నేరుగా ఇచ్చిన దీక్షగా పరిగణిస్తారు.

బొల్లోజు బాబా
Uploading: 5514503 of 5514503 bytes uploaded.