Thursday, October 31, 2024

పెరియార్ పోరాట ఫలితం మొదటి రాజ్యాంగ సవరణ, కుల ఆధారిత రిజర్వేషన్లు


మద్రాస్ ప్రొవిన్స్ లో బ్రిటిష్ వారి పాలనలో 1928 నుంచీ వెనుకబడిన తరగతులకు కమ్యునల్ జి.వొ అమలులో ఉండేది. దీని ప్రకారం అణగారిన వర్గాలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ దక్కేది.
 
భారత రాజ్యాంగం 26, జనవరి 1950 నుండి అమలులోకి వచ్చింది.  1951 లో చంపకం దొరైరాజన్ అనే ఒక బ్రాహ్మణ స్త్రీ- తన కూతురికి ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ వైద్య విద్యలో సీటు రాలేదని, ఆమె కన్నా తక్కువ మార్కులు వచ్చిన ఒక వెనుకబడిన తరగతికి చెందిన మరొక విద్యార్ధికి సీటు వచ్చిందని, ఇది రాజ్యాంగంలో 15 వ ఆర్టికిల్ ప్రకారము అందరూ సమానమే అనే సూత్రానికి అనుకూలంగా లేదని - మద్రాసు హైకోర్టులో కేసు వేసింది. ఈ కేసును శ్రీ ఎమ్. కె. నంబియార్ అనే ఆనాటి ప్రసిద్ధ లాయర్ వాదించారు. మద్రాస్ హైకోర్టు రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే కనుక కులం ఆధారంగా కొందరికి రిజర్వేషన్లు కల్పించటం రాజ్యాంగ విరుద్ధం అని తీర్పునిచ్చింది.
 
ఈ తీర్పును మద్రాసు ప్రభుత్వం సుప్రీమ్ కోర్టులో సవాలు చేసింది. సుప్రీం కోర్టుకూడా ఏడుగురు జడ్జిల ధర్మాసనం ద్వారా హైకోర్టు తీర్పునే సమర్ధించి “కులాధారిత రిజర్వేషన్లు” చెల్లవు అని తీర్పు ఇచ్చింది.
 
ఈ తీర్పుపై పెరియార్ ఆధ్వర్యంలో తమిళనాడు భగ్గున మండింది. నిజానికి కమ్యునల్ జివొ ను రూపొందించి అమలుచేయించింది 1928 లో పెరియారే. ఆ జివొ వల్ల ఎందరో అణగారిన కుటుంబాలకు చెందిన వారు ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందటం చూసి పెరియార్ ఎంతో సంతోషించేవారు. స్వాతంత్ర్యం వచ్చాకా తన సొంత రాష్ట్రంలో అప్పటికే సుమారు పాతికేళ్ళుగా అమలులో ఉన్న రిజర్వేషన్లు ఆగిపోవటం పట్ల పెరియార్ తీవ్రమైన ఆవేదన చెందారు.
యావత్ తమిళ ప్రపంచం అతని ఆవేదనను, ఆగ్రహాన్ని పంచుకొంది. రానున్న ప్రమాదాన్ని పసిగట్టింది. ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసనలతో తమిళనాడు మొత్తం అట్టుడికి పోయింది. ప్రపంచంలో తమిళులు ఉన్న ప్రతీచోటా ఈ తీర్పు పట్ల వ్యతిరేకత పెల్లుబికింది.
సమాన హక్కు పేరుతో అణగారిన వర్గాలు ఇతరులతో సమానం అయ్యే హక్కును కాలరాస్తున్న రాజ్యాంగంపట్ల తన నిరసనను తెలియచేసాడు పెరియార్.
 
పెరియార్ చేస్తున్న ఉద్యమంవెనుక ఉద్దేశాలను, రాజ్యాంగం వల్ల ఏర్పడిన చిక్కుముడిని అర్ధం చేసుకొన్న జవహర్ లాల్ నెహ్రూ ఆనాటి లా మినిస్టర్ డా. బి. ఆర్. అంబేద్కర్ ను పిలిచి రాజ్యాంగంలోని 15 వ ఆర్టికిల్ వల్ల కలుగుతున్న ఇబ్బందులను సవరించే ప్రక్రియ చేపట్టవలసినదిగా కోరాడు.
 
నెహ్రూ సూచన మేరకు డా. బి.ఆర్ అంబేద్కర్ 15 వ ఆర్టికిల్ లోకి 15(4) పేరుతో ఒక సవరణ ప్రతిపాదించారు. ఇది రాజ్యాంగానికి చేసిన తొలి సవరణగా చరిత్రకు ఎక్కింది. (దీనితో పాటు మరొక రెండు కూడా ఉన్నాయి)

ఈ సవరణ “దేశప్రజలందరూ సమానమే. అణగారిన వర్గాలను ఇతర వర్గాలతో సమానం చేసే కార్యక్రమాలలో మాత్రం ఈ అందరూ సమానమే అనే క్లాజు వర్తించదు” అని చెబుతుంది.
ఈ 15(4) ఆర్టికిల్ సవరణ ప్రతిపాదించే సందర్భంగా జరిగిన పార్లమెంటు డిబేట్స్ లో ఈ బిల్లును సమర్ధిస్తూ ఇలా మాట్లాడారు.
 
జవహర్ లాల్ నెహ్రూ: అనేక కారణాల వల్ల ఇప్పుడు ఉన్న తరాన్ని నిందించలేం. ముందు తరాలకి బాధ్యత ఉంది. అనేకమంది ప్రజలు ఆర్ధికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. కొంతమంది ఒక విషయంలో ముందు ఉన్నా అనేక విషయాలలో వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో వెనుకబడిన వారిని మనం ప్రోత్సహించాలి. వారికొరకు ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలి.
 
ఎవరో ఒక పెద్దమనిషి అంటున్నాడు- “భారతదేశంలో 80% మంది వెనుకబడిన వారే. ఎంతమందినని ప్రోత్సహిస్తారు?” అని. 80% మంది స్థితి అలా ఉంటే ఏమీ చెయ్యకుండా వారిని అలాగే ఉంచటం పరిష్కారం కాదుకదా?. వారికి అవకాశాలు కల్పించాలి- ఆర్ధిక అవకాశాలు, విద్యా అవకాశాలు లాంటివి. ఎదగనివ్వాలి వారిని.

డా. బి.ఆర్. అంబేద్కర్: ఒక జడ్జ్ ఇచ్చిన తీర్పును పాటించటానికి బద్దుడను కానీ దానిని గౌరవించటానికి బద్దుడను కాను. ఒక కులానికో/సమూహానికో రిజర్వేషన్లు ఇచ్చినపుడు, అది దక్కనివారు మరొక కులానికో సమూహానికో చెందినవారై ఉంటారనేది సత్యం. ఈ దేశంలో కొంతమంది ప్రజలను మినహాయించకుండా రిజర్వేషన్లు ఇవ్వటం సాధ్యం కాదు.
 
***

1951 జూన్ లో రాజ్యాంగానికి చేసిన 15(4) సవరణ వల్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వెనుకబడిన బలహీనవర్గాలవారికి రిజర్వేషన్లు ఇచ్చే వెసులుబాటు కలిగింది.
 
ఈ సవరణే చేయకపోతే భారతదేశంలో చంపకం దొరైరాజన్ (1951) సుప్రీమ్ కోర్టు తీర్పు ప్రకారం ఏనాటికీ వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఉండకపోయేవి.

అలాజరగకుండా చూసిన పెరియార్, నెహ్రూ, డా. అంబేద్కర్ లు చిరస్మరణీయులు.
ఈ రోజు సనాతన వాదులు నరనరాన విషం నింపుకొని వీరిని నిత్యం దూషించటానికి ఉండే చాలా కారణాలలో ఆఘమేఘాలమీద చేయించిన పై రాజ్యాంగ సవరణ ఒకటి.
 
దానికి కారణమైన పెరియార్ పై రాజ్యాంగాన్ని తగలపెట్టాడని, కూతురిని పెళ్ళిచేసుకొన్నాడని లాంటి వికృతమైన అభియోగాలు చేస్తారు వీళ్ళు. పెరియార్ రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లని తగలపెట్టటం నిజమే. ఇది రాజ్యాంగం వలన కలుగుతున్న ఇబ్బందులను తెలియచెప్పటానికి చేసిన ధిక్కారం. దానికి జైలు శిక్ష కూడా అనుభవించారు పెరియార్.
 
ఇక కూతుర్ని పెళ్ళి చేసుకొన్నాడనేది అసత్యం. పెరియార్ కి 54 ఏళ్ళ వయసులో మొదటిభార్య మరణించింది (1933). విలువైన ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదని, తన ఉద్యమం ఆగిపోకూడదని 1948 లో తన 68 వ ఏట పెరియార్, పార్టీ కార్యకర్తగా ఉన్న పొన్నియమ్మ అనే ముప్పై ఏండ్ల వయసు కల ఒక మహిళను పెండ్లాడాడు.

ఈమె పెరియార్ కన్నా వయసులో చిన్నదే తప్ప పెరియార్ కూతురూ కాదు, మనవరాలూ కాదు. ఒక సాధారణ పార్టీ కార్యకర్త. ఈమె పాతికేళ్ళ వయసులో పెరియార్ బాగోగులు చూసేందుకు పార్టీ పరంగా నియమించబడిన కార్యకర్త. ఈమెకు ఏ రకంగాను పెరియార్ తో చుట్టరికం లేదు.
పెరియార్ హిందూమతాన్ని జీవితపర్యంతమూ చాలా తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నాడు. కనుక సనాతన వాదులు కచ్చగట్టి పెరియార్ సొంత కూతురునినే పెండ్లాడాడు అని దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి పెరియార్ కు సంతానమే లేదు. పెరియార్ సంపన్నుడు. ఆయన ఆస్థుల రక్షణ కొరకు, పార్టీ పురోగతికొరకు పొన్నియమ్మను పెండ్లి చేసుకొన్నాడు. అప్పట్లో అడాప్షన్ చట్టం లేదు. ఒక స్త్రీకి ఆస్తి ఇవ్వాలంటే భార్య మాత్రమే అర్హురాలు. లీగల్ కారణాలతో పెరియార్ 69 ఏండ్ల వయసులో 30 ఏండ్ల పొన్నియమ్మను పెండ్లిచేసుకోవలసి వచ్చింది.
 
శ్రీమతి పొన్నియమ్మ 1973 లో పెరియార్ మరణానంతరం పెరియార్ స్థాపించిన ద్రవిడ కజగం అనే పార్టీని చనిపోయే వరకూ నడిపించారు. పెరియార్ ద్వారా సంక్రమించిన ఆస్తులతో స్కూళ్ళను, అనాధాశ్రమాలను స్థాపించారు. 1978 లో శ్రీమతి పొన్నియమ్మ మరణించారు. చిల్లర డబ్బుల కొరకు నీతి లేని వాట్సాప్ సనాతన వాదులు పెరియార్ సొంత కూతుర్నే పెళ్లి చేసుకున్నాడని ప్రచారం చేస్తున్నారు. ఇది హేయం.

బొల్లోజు బాబా



ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా - ముందుమాట

ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా పుస్తకానికి నేను రాసుకొన్న ముందుమాట ఇది. నిజానికి ప్రముఖ చరిత్రకారుడు శ్రీ కూచిభొట్ల కామేశ్వర రావుగారిని ఈ పుస్తకానికి ముందుమాట రాయమని అడిగి, పట్టణాల ఆవిర్భావం గురించి మీ మాటలో ప్రస్తావించండి అని కోరాను. అప్పటికే తీవ్ర అనారోగ్యకారణాలవల్ల కొన్ని ఆశీస్సులు మాత్రమే ఫోన్ లో డిక్టేట్ చేసారు.
ఆ కారణంగా, అర్బనైజేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో నేనే నా మనవిమాటలలో వివరించాను. ఈ వ్యాసం నాకెంతో ఇష్టమైనది. నిన్నచదివితే ఇంకా తాజాగానే అనిపించింది. కవర్ పేజ్ పై ఉన్నది ద్రాక్షారామ ఆలయాన్ని నిర్మించిన చాళుక్యభీముడు. బాక్ డ్రాప్ లో బిక్కవోలులో శంకోలు ధరించిన శివుడు.

ఈ పుస్తకం ఇప్పడు రెండో ముద్రణలో ఉంది. కావలసిన వారు, పల్లవి పబ్లికేషన్స్, శ్రీ వి.నారాయణ గారిని, ఫోన్ నంబరు. 9866115655 లో సంప్రదించగలరు.
 
బొల్లోజు బాబా


ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా

మనవి మాటలు

వ్యవసాయంద్వారా ఆహారోత్పత్తుల మిగులు ఏర్పడ్డాక ప్రజలు ఒక చోట స్థిరంగా నివసించటానికి మొగ్గుచూపారు. జీవించటానికి అనువుగా ఉంటూ రాజకీయ, ఆర్ధిక, మతపరమైన ప్రాధాన్యత కలిగిన జనావాస ప్రాంతాలు క్రమేపీ పట్టణాలుగా రూపుదిద్దుకొన్నాయి. మెగస్తనీస్‌ ఆంధ్రులకు ప్రాకారాలు కలిగిన ముప్పై పట్టణాలు ఉన్నాయని చెప్పాడు. ఇవి ఎక్కడెక్కడ ఉండేవో నేడు గుర్తించటానికి ఏ రకమైన ఆధారాలు లభించవు.
 
శాసనాలలో జనసాంద్రత కలిగిన ప్రాంతాలు - నగర, పుర, పట్టణ అనే మూడురకాల పేర్లతో చెప్పబడ్డాయి. పర్వతాలవంటి భవనాలతో, వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ఊరును ‘‘నగరము” అని; తీరప్రాంతంలో ఉండే రేవుస్థలాన్ని ‘‘పట్టణము” అని; బలమైన కోటను కలిగి ఉన్న ఊరుని ‘‘పురము” అని చరిత్రకారులు నిర్వచించారు. పిఠాపురం, రాజమహేంద్రవరం లలో బలమైన కోటలు ఉండేవి కనుక వాటికి పిష్టపురి, జననాథపురం అనే పేర్లు ఉన్నాయని ఊహించవచ్చు కానీ ఈ విభజనను అంత ఖచ్చితంగా పాటించినట్లు కనిపించదు. రాజమహేంద్ర పట్టణం (EI Vol 5 p.32), పిఠా పట్టణం (శ్రీనాథుని పద్యం) లాంటి ప్రయోగాలు కూడా ఉండటం గమనార్హం.
 
ఒక ప్రాంతంలో ఏమేరకు పట్టణీకరణ జరిగిందో అనేది అది ఆ ప్రాంతపు రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక అభివృద్ధికి, నాగరికతకు సూచిక. ఆయా పట్టణాల ఉత్థానపతనాలు ఆ ప్రాంత చరిత్రకు అద్దంపడతాయి.
 
భౌగోళికంగా వివిధ ప్రాంతాలను కలిపే రహదారులు; అన్ని వృత్తుల వారికి అవకాశాలు; ఆర్ధిక వ్యవస్థను నడిపించే ఏదైన ఒక ప్రముఖ దేవాలయం; ఓడరేవుల ద్వారా విదేశీ వ్యాపారం;ప్రజలకు రక్షణ; భిన్నమతాల మధ్య సహిష్ణుత; రాజకీయ ప్రాధాన్యత కలిగి ఉండటం- లాంటివి పట్టణీకరణకు దోహదపడే అంశాలు.
 
తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పట్టణీకరణపై ఆథ్యాత్మిక కేంద్రాల ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో ఆలయాలు సమాజంలో Money Circulate చేసే ఆర్దిక కేంద్రాలు. ఇవి గ్రామీణ ఎకానమీని అర్బన్‌ ఎకానమీని అనుసంధానం చేసేవి. దేవుని పేరుమీద జరిగే ఈ తతంగంలో అప్పటి సమాజంలోని దాదాపు అన్ని సామాజిక వర్గాలకు ఏదోఒక పాత్ర ఇవ్వబడింది.
జిల్లాలో ప్రాచీన చరిత్ర కలిగిన ద్రాక్షారామ, సామర్లకోట, సర్పవరం, పిఠాపురం, బిక్కవోలు, పలివెల లో నెలకొని ఉన్న వివిధ ఆలయాలు ఆయా ప్రాంతాలు అభివృద్ధిచెందటానికి సహాయపడ్డాయి. బౌద్ధ, జైన మతాలకు సంబంధించి జిల్లాలో అనేక చోట్ల భారీ అవశేషాలు లభిస్తూండటాన్ని బట్టి ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధ, జైన విశ్వాసులకు కూడా దర్శనీయస్థలంగా ఉండేదని భావించవచ్చు. ఒక ప్రాంతంలో నెలకొన్న ఆథ్యాత్మిక కేంద్రం మతాలకు అతీతంగా ఆ ప్రాంత పట్టణీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
 
ఆథ్యాత్మిక కేంద్రాల తరువాత జిల్లా పట్టణీకరణకు దోహదపడిన మరొక అంశం కోరంగి, ఆదుర్రు లాంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఓడరేవులు. పట్టణాలలో నివసించే వృత్తికారులు, వర్తకులు వివిధ వ్యాపార శ్రేణులుగా (Guilds) సంఘటితమై ఈ ఓడరేవుల ద్వారా పెద్దఎత్తున విదేశీ వ్యాపారం జరిపేవారు. కోరంగి ఓడరేవు మాత్రమే కాదు ఒకప్పటి గొప్ప నౌకానిర్మాణ కేంద్రం కూడా. పిఠాపురం కూడా ఒకనాటి ఓడరేవు కావొచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది.
 
తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం కొంతకాలం కళింగరాజ్యానికి, రాజమహేంద్రవరం వేంగి రాజ్యానికి రాజధానులుగా ఉన్నాయి. అవికాక బిక్కవోలు, చాళుక్యభీమవరం, కోరుకొండ, కడలి, ముమ్మిడివరం, రంప లాంటి ప్రాంతాలు వివిధకాలాలలో రాజకీయ కేంద్రాలుగా ఉండటం వల్ల అవి పట్టణాలుగా మారి అభివృద్ధిపథంలో నడిచాయి.
 
వేంగి, కళింగ రాజ్యాలను కలిపే ప్రాచీన రహదారి జిల్లా లోని రామచంద్రపురం, బిక్కవోలు, పిఠాపురం, కొడవలి మీదుగా రామతీర్థం వైపు వెళుతుంది. ఇది సుమారు రెండువేల సంవత్సరాలనాటి జాతీయ రహదారి. ఆ విధంగా ఈ ప్రాంతం ఒకప్పటి ప్రముఖ ప్రాచీన రాజ్యాలతో అనుసంధానింపబడి ఉంది. ఈ లక్షణం కూడా పట్టణీకరణకు అనుకూలించే అంశము.
హిందు, బౌద్ధ, జైన విశ్వాసాలకు చెందిన అనేక ప్రాచీన క్షేత్రాలు జిల్లాలో కనిపిస్తాయి. బౌద్ధానికి సంబంధించి ఆదుర్రు, పిఠాపురం, గొల్లప్రోలు, కొడవలి, కాపవరం, తుని, రంపఎర్రంపాలెం, కోరుకొండ లాంటి ప్రాంతాలలో వివిధ భారీ బౌద్ధ అవశేషాలు లభిస్తున్నాయి. ఇవి ఆయా ప్రాంతాల ప్రాచీన ప్రాధాన్యతను నిరూపిస్తాయి. అదే విధంగా జిల్లాలో జల్లూరు, కాజులూరు, ఆర్యావటం, పిఠాపురం, బిక్కవోలు, తాటిపాక, రాజోలు, రామచంద్రపురం లాంటి ప్రాంతాలలో ఒకప్పుడు జైనమతం వెలసిల్లినట్లు నేడు అనేక విగ్రహాలు బయటపడుతున్నాయి.
 
ఈ భిన్న మతాలు ఒకనాడు సమాంతరంగా సహజీవనం చేసినట్లుకూడా అర్ధమౌతుంది. ప్రజలు భిన్నవిశ్వాసాలకు సహిష్ణుత కలిగి ఉండటం మానవ నాగరికత, సంస్కృతుల ఔన్నత్యానికి ఉత్తమోత్తమ నిదర్శనం.
***
ఈ పుస్తకంలో తూర్పుగోదావరికి చెందిన ప్రాచీనపట్టణాల చరిత్రను చెప్పటానికి ప్రయత్నించాను. దీనిలో హుయాన్‌ త్సాంగ్‌ పిఠాపుర సందర్శన, గుణగ విజయాదిత్యుని చారిత్రిక స్థానం, బిక్కవోలు ఆలయ శిల్ప సంపద, కోరంగి సాంస్కృతిక అంశాలు లాంటివి విశిష్టమైనవి అని తలుస్తాను.
నిజానికి ప్రాచీనపట్టణాలు అనే అంశం చాలా లోతైనది. ఎంత చదివినా తరగని మెటీరియల్‌ అందుబాటులో ఉంది. వాటిని శక్తిమేరకు క్రోడీకరిస్తూ, సులభంగా అందించాలని నేను చేసిన ప్రయత్నం ఇది. నేను విస్మరించిన లేదా నా దృష్టికి రాని అనేక అంశాలు మిగిలే ఉంటాయి అన్న స్పృహ నాకు ఎప్పుడూ ఉంటుంది.

భవదీయుడు
బొల్లోజు బాబా
అక్టోబరు 2021



Monday, October 21, 2024

One more comment ....

ఏమన్నా విమర్శిస్తే, మొదటి బాణం బ్రాహ్మణద్వేషం అనటం ఒక అనాది బ్లాక్ మెయిల్. ఒకె.
బ్రాహ్మణులపై ద్వేషం నాకెందుకు ఉంటుంది. వాళ్ళు కూడా నాకులాంటి మనుషులే కదా. నాది బ్రాహ్మనిజం పై అనంగీకారం.

నేను ప్రశ్నించింది హరనాథరావు గారిని కాదు. హరనాథరావు గారు చెబుతోన్న "గుణాన్ని/జ్ఞానాన్ని బట్టి ఎవరైనా బ్రాహ్మణుడు కావచ్చు" అనే ఐడియాని ప్రశ్నించాను.

హరనాథరావుగారితో నాకు పనిలేదు. ఆ ఐడియా మంచిది కాదు అని నమ్ముతాను. అది మన సమాజంలో బ్రాహ్మణులే అందరికన్నా పైన ఉండదగిన వారు, అబ్రాహ్మణులందరూ గుణం/జ్ఞానం లేనివారు అని, వారు బ్రాహ్మనుని కింద ఉండాలి అనే భావనను సమాజంలో పెంచిపోషిస్తుంది. దేన్నే బ్రాహ్మనిజం అంటారు. ఈ భావన ఒప్పుకోలేం.

ఇది హరనాథరావుగారికి అర్ధం కాకపోవచ్చు. అబ్రాహ్మణుడైన నాకు స్పష్టంగా తెలుస్తుంది.
వ్యక్తుల స్థాయి దాటి భావాల స్థాయిలో చర్చలు జరపండి. నాకు హరనాథరావు గారి పట్ల సాటిమనిషిపై ఉండే ప్రేమే ఉంది తప్ప ద్వేషం లేదు.


బొల్లోజు బాబా

Saturday, October 19, 2024

సనాతన ధర్మము - శూద్రులు


ఒక మిత్రుడు ఈ వాట్సప్ సందేశాన్ని పంపి దీనిపై వివరణ ఇవ్వమని అడిగాడు. నాకు తెలిసిన వివరణలు ఇవి. ఈ మెసేజ్ సారాంసం ఏమిటంటే శూద్రులు హిందూ ధర్మంలో గొప్ప మర్యాదలు పొందారు. వేదాలను అధ్యయనం చేసారు. వారిపై ఎక్కడా వివక్ష చూపినట్లు ఆధారాలు లేవు అంటూ శూద్ర ఋషులను, భక్తి సంప్రదాయ శూద్ర పంత్ లను కలగాబులగం చేసి వండిన వ్యాసం ఇది.
 
దీని వెనుక ఉద్దేశాలు ఏమిటంటే- ఈ రోజు సనాతన ధర్మం కావాలి అంటూ చేస్తున్న ప్రచారానికి హిందూ ధర్మం శూద్రులపట్ల వర్ణ వివక్ష చూపింది అనే ప్రధానమైన అభ్యంతరానికి సమాధానం చెప్పుకోవలసి వస్తున్నది. ఈ అంశానికి సమాధానంగా ఇదిగో చరిత్రలో ఈ ఈ శూద్రులు వేదాలను చదివి ఋషులయ్యారు అంటూ గొప్ప లిస్ట్ నొకదాన్ని ఇస్తున్నారు. ఏ రకమైన వివక్షా లేదని తీర్పులు ఇచ్చేస్తున్నారు.

నిజానికి పురాణాలలో శూద్ర ఋషుల వెనుక చాలా సందర్భాలలో బ్రాహ్మణ తండ్రి లేదా ఏదో దైవశక్తి ఉండటం గమనించవచ్చు. అది నిజమైన శూద్ర సమానత్వం అవ్వదు.
ముస్లిమ్ పాలన వచ్చాక వర్ణవ్యవస్థ సడలింది. బ్రిటిష్ పాలనలో పూర్తిగా చట్టవ్యతిరేకం అయ్యింది. సూఫీ వేదాంతం ప్రభావంతో శూద్ర వర్గాలు భక్తి సంప్రదాయాన్ని నిర్మించుకొన్నాయి. ఇది హిందూ ధర్మానికి ప్రతిగా నిలబెట్టిన ఆథ్యాత్మిక సంప్రదాయం. ఒకనాటి బౌద్ధ జైన మతాలతో దీనిని పోల్చవచ్చు.
 
ఇక చివరలో రొడ్డకొట్టుడు శ్లోకం పుట్టుకతో అందరూ శూద్రులే బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణులు అవుతారని గొప్ప రిఫరెన్స్ గా ఇచ్చారు. అదే సమయంలో ఈ వ్యాసంలోని వ్యక్తులు వేదాలు చదివారు బ్రహ్మజ్ఞానం పొందారు అంటూ ఒకపక్క మాట్లాడుతూ వారు బ్రాహ్మణులు అని చెప్పక శూద్రులు అని చెప్పటం- గొప్ప జోక్.
****

శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారు ... వేదాలు వింటే శూద్రుల చెవులలో సీసం పోశారు ... అంటూ విషప్రచారం చేస్తున్నారు.
వాస్తవానికి అసలు అటువంటి సంఘటనలు జరగకపోయినా బ్రిటీష్ చేసిన ప్రక్షిప్తాలను పట్టుకొని మెకాలే - మాక్స్ ముల్లర్ మానస పుత్రులు, పాశాంఢ ఎడారి మత మార్పిడి మాఫియాలు, వామపక్ష చరిత్రకారులు, రచయితలు కల్పించి రాసిన తప్పుడు రాతలను చూపించి ఇప్పటికీ కొంతమంది "మా వంటి శూద్రులను (author of this article)" హిందూ ధర్మం నుండి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
అసలు చరిత్రలో ఎన్నడైనా శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారా...??? వేదాలు వింటే శూద్రుల చెవులలో సీసం పోశారా...???

వివరణ:హిందూ ధర్మశాస్త్రాలు శూద్రులను  బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారికి సేవలు చేయాలని  చెప్పాయి. కాస్త చదువుకొంటే ఈ విషయాలు తెలుస్తాయి. ఈ ధర్మశాస్త్రాలను రాసింది క్రీపూ నుండి క్రీశ 6 వ శతాబ్దం మధ్య. అప్పటికి బ్రిటిష్ వారు లేరు, వామపక్ష చరిత్రకారులు లేరు. శూద్రుడు వేదాలు వింటే ఏం చెయ్యాలో హిందూ ధర్మశాస్త్రాలు ఇలా చెప్పాయి.
 
1. ద్విజుణ్ణి అవమానించిన శూద్రుని నాలుక కోసివేయాలి (మను 8.270)

2. కాత్యాయనుని ఆదేశాల ప్రకారం శూద్రుడు వేదాలను పొరపాటునగాని, పొంచి ఉండిగానీ విన్నట్లయితే అతని నాలుక రెండుగా చీల్చబడుతుంది. అతని చెవులలో సీసం పోయబడుతుంది.
3. శూద్రుడు ఉన్నతజాతికి ధర్మాన్ని ఉపదేశిస్తే రాజు వాడి నోట్లో, చెవిలో మండుచున్న నూనెను పోయించాలి (మను 8.272)

4. శూద్రుడు మతధర్మ సూత్రాలు బోధిస్తున్నా, వేదమంత్రాలు ఉచ్ఛాటన చేస్తున్నా బ్రాహ్మణున్ని అవమానిస్తున్నా అతనికి శిక్షగా నాలుక తెగనరికి వేయాలి (బృహస్ఫతి స్మృతి)

5. శూద్రుడెవరైనా ఉద్దేశపూర్వకంగా వేదమంత్రోచ్ఛాటనను ఆలకిస్తున్నట్లయితే అతని చెవుల్లో సీసంగాని, లక్క గాని కరిగించి పోయాలి, వేదపఠనం చేస్తున్నట్లయితే, అతని నాలుక కోసివేయాలి. వేదపాఠాన్ని స్ఫురణకు తెచ్చుకొంటున్నట్లయితే అతని శరీరాన్ని రెండుగా ఖండించాలి (గౌతమ ధర్మ సూత్రాలు)

6. శూద్రకులజులు ద్విజునిపై అసత్యారోపణ చేసినా, అవమానించినా, బ్రాహ్మణులకు వారి విధులకు సంబంధించి పాఠాలు చెప్పినా రాజోద్యోగులు వారి నాలుకలు కత్తిరింపచేయాలి. (నారద స్మృతి)

7. ఇక పై సూత్రాలు ఎప్పుడైనా సామాజికంగా అమలులో ఉన్నాయా అని ప్రశ్నిస్తారు కొందరు. నిన్నమొన్నటి వరకు ఉన్నాయి. పీష్వాల పాలనలో అబ్రాహ్మణుడు ఎవరైనా వేదమంత్రాలను పఠిస్తే వారి నాలుకలను కత్తిరించేవారు. ఈ చట్టాన్ని ధిక్కరించి వేదాలను ఉచ్ఛరించిన అనేకమంది కంసాలుల నాలుకలను కత్తిరించమని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ బ్రాహ్మణులు కంసాలులు గొడవలు ఈస్ట్ ఇండియా కంపనీ ప్రెసిడెంటువద్దకు వచ్చినట్లు Resolution of Government Dated 28th July 1779 ద్వారా తెలుస్తున్నది.
 
ఇక సమకాలీనంగా జరిగిన కొన్ని వందల వర్ణ వివక్షా దాడుల ఉదాహరణలను న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లతో సహా డా. అంబేద్కర్, రచనలు ప్రసంగాలు సంపుటం 5 లో పొందుపరిచారు. వాదించటానికి కొంచెం చదువుకొని రావాలి.

పరమ పవిత్ర శ్రీమద్ రామాయణ మహా కావ్యాన్ని రచించిన బోయవాడు అయిన రత్నాకర పూర్వ నామం కలిగిన వాల్మీకి మహర్షుల వారు శూద్రుడు కాదా...???

వివరణ: మన వేదాలు ఇతిహాసాలు పురాణాలు అన్ని విదేశీ ఆర్యపండిత రాతలు. వీరు వచ్చి స్థానిక ద్రవిడ, నాగ జాతులను జయించి, వారిని శూద్రులు, అతిశూద్రులుగా (ఎస్సీ) విభజించి ఆధిపత్యం చలాయించారు. వేదాలు, పురాణాలు ఇతిహాసాలు ఆర్యపండిత ఆధిపత్యాన్ని స్థిరపరచే రాతలు. ఈ ప్రక్రియలో కొన్ని రాతలు వారే రాసుకొని అవి శూద్రుల, అతిశూద్రుల రాతలుగా ప్రచారం చేసారు.
చాలా సందర్భాలలో తండ్రి బ్రాహ్మణుడై ఉంటాడు. అలా ఇవి మీరాతలే, మీరు ఆర్యపండితుల ఆధిపత్యాన్ని అంగీకరించినట్లు మీరే రాసుకొన్నారు చూడండి అంటూ చెప్పటం ఒక రకమైన మార్కటింగ్ టెక్నిక్.
ఇక వాల్మీకి బ్రాహ్మణుడు.  పేర్లు, అగ్నిశర్మ/లోహ జంఘ. బోయ అని కల్పించారు..
 
మత్స్య గ్రంధికి జన్మించి పంచమ వేదం శ్రీమద్ భగవద్గీత, మహా భారతం వంటి పరమ పవిత్ర సనాతన గ్రంధాలను లిఖించిన కల్పి అనే పూర్వ నామం కలిగిన వ్యాస మహర్షుల వారు శూద్రుడు కాదా...??
 
వివరణ: వ్యాసుడు: బ్రాహ్మణ పరాశురుడికి జన్మించాడు. తాత బ్రాహ్మణ వశిష్టుడు. ఇతను శూద్ర స్త్రీకి పుట్టాడు. క్షేత్రబీజ ప్రాధాన్యతలను అనుసరించి ఇతను బ్రాహ్మణుడు. 
 
శూద్రునిగా పుట్టి దస్య కుమారుడు అయినా వేద జ్ఞానాన్ని ఆర్జించి రుషి అయి ఆత్రేయోపనిషత్తు, ఆత్రేయ బ్రాహ్మణమును రచించిన ఆత్రేయ ఋషి వారు శూద్రుడు కాదా...???

వివరణ: ఆత్రేయ కాదు ఐతరేయ. తల్లి దాసి. పేరు ఐతరేయ. ఆమెకు ఒక గొప్ప తపోసంపన్నుడైన ఋషివల్ల మహిదాసుడు అనే కొడుకు పుట్టాడు. ఇతనిని తండ్రి సరిగ్గా పోషించటం లేదని, ఐతరేయ భూదేవిని ప్రార్ధించగా భూదేవి ప్రత్యక్షమై ఐతరేయ మహిదాసకు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించినట్లు, ఆ శక్తితో ఐతరేయ మహిదాసు ఐతరేయ బ్రాహ్మణాన్ని రచించినట్లు – ఒక కథనం. ఇందులో దైవశక్తి చెప్పబడింది.

పుట్టుకతో శూద్రునిగా జూదగానికి పుట్టినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋషిగానే కాదు ఆచార్యులుగా ప్రఖ్యాతి గాంచిన ఐలశు ఋషి వారు శూద్రుడు కాదా...???

వివరణ: కవశ ఐలూశ అనే ఋషి దాసికి జన్మించాడు. ఒక రోజు బృగు, అంగీరసుడులు యజ్ఞం చేస్తుండగా ఐలూశు డు వచ్చి వారి సరసన కూర్చున్నందుకు ఆ బ్రాహ్మణులు ఇతనిని తక్కువ కులజుడివని దూషించి, ఒక నీరు దొరకని ఎడారిలోకి తరిమేసారు. అక్కడ ఇతనికి సరస్వతి కటాక్షం లభించింది. సరస్వతి నది ఇతని వెంటే నడిచింది. ఆ మహిమకు బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి ఇతనిని ఋషిగా అంగీకరించారు. ఈ కథలో దైవశక్తి చెప్పబడింది తప్ప బ్రాహ్మణులు శూద్రులను సోదరభావంతో స్వీకరించినట్లు చెప్పబడలేదు.

శూద్రురాలికి పుట్టిన జాబల కుమారుడైన సత్యాకాం వేద సారాలను గ్రహించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, గురు విధేయతతో గౌతమ మహర్షుల వారినే మెప్పించిన సత్యాకాం, జాబల మహర్షుల వారు శూద్రుడు కాదా..???

వివరణ: దాసి అయిన జాబాలి కొడుకు సత్యకామ.  జాబాలి ఇతనిని హరిద్రుమతుడు అనే గురువు వద్దకు విద్యనేర్చుకొనేందుకు పంపుతుంది. ఉపనయనయనం చేసే ఉద్దేశంతో అతని కులగోత్రములు అడుగగా, నాకు తెలియవు అంటుంది తల్లి. ఆ గురువు దివ్య దృష్టితో అతని జన్మను తెలుసుకొని గాయత్రిమంత్రం ఉపదేశిస్తాడు.

జాబాలి పై దయతో గౌతముడు అనేబ్రాహ్మణుడు అతనికి బ్రాహ్మణ హోదా ఇస్తాడు తప్ప స్వంతంగా/పోరాడి గడించుకొన్నది కాదు. దీన్ని బ్రాహ్మణాధిక్యతగానే చూడాలి.

శూద్రురాలికి పుట్టినా కూడా వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ప్రఖ్యాతి గాంచిన బ్రహ్మర్షి మాతంగి మహర్షుల వారు శూద్రుడు కాదా. ??

వివరణ: మతంగుడు మూల వాసి. ఇతను నాస్తికుడు, ఋషి. ఇతని ఆలోచనలు ఆర్యధర్మానికి భిన్నమైనవి. ఇతను అందరూ మైత్రీభావనతో మెలగాలని చెప్పేవాడు. వేదబాహ్యుడు. అయినప్పటికీ ఇతనిని ఆర్యబ్రాహ్మణులు హిందూ ధర్మంలోని ఋషిగా ప్రచారించుకొన్నారు. ఇతనికి ఆశ్రమాలు కలవు. ఇతని కుమారుడు కపిలుడు. యోగసాంఖ్యశాస్త్రకర్త. మతంగుడే నేటి పంచమవర్ణానికి ఆదిపురుషుడుగా చెబుతారు.

బ్రాహ్మణ అగస్త్యుడు దక్షిణానికి వచ్చి తన శిష్యులతో ఆశ్రమాలు ఏర్పరచుకొనే క్రమంలో అప్పటికే ఇక్కడ ఉన్న మతంగుని ఆశ్రమాలను ఆక్రమించుకోగా, మతంగుడు మరొక చోటుకు తరలిపోవలసి వచ్చిందని ఒక కథనం కలదు.

పుట్టుకతో శూద్రురాలి కుమారుడైనా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఖ్యాతి గాంచిన విదురుడు హస్తినాపుర రాజ్యంలో మంత్రిగా సేవలు అందించాడు.ఇతడు శూద్రుడు కాదా.???

వివరణ: సంతానం కొరకు అంబ ను వ్యాసునితో సంభోగించటానికి వెళ్లమంటే, వ్యాసుని గడ్డాలు చూసి ఇష్టపడక, అంబ ఒక దాసిని పంపుతుంది. అలా బ్రాహ్మణ మూలాలు కలిగిన వ్యాసుడి కి దాసికి పుట్టిన సంతానం విదురుడు. ఇతను శూద్రుడు కాదు. క్షేత్రబీజ ప్రాధాన్యతలను బట్టి బ్రాహ్మణుడే.

పుట్టుకతో శూద్రుడు అయిన వత్సుడు గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋషివత్స గా ప్రఖ్యాతిగాంచలేదా...? వీరు శూద్రుడు కాదా...??? Ref:-(ఆత్రేయ బ్రాహ్మణము - 2.19)

వివరణ: వత్సుడిని అతని సోదరుడే నువ్వు శూద్ర స్త్రీకి పుట్టావు అని నిందించగా, కాదు నేను బ్రాహ్మణుడినే అని వాదించి అగ్నిప్రవేశం చేసి తన దోషాన్ని తొలగించుకొన్నాడు. ( మను 8-116). కనుక ఇతను బ్రాహ్మణుడు.

శూద్రునికి జన్మించినప్పటికీ అద్భుత మేధో సంపత్తి, బ్రహ్మ జ్ఞానంతో ఋగ్వేదంనందలి కొన్ని ఋక్కులకు కర్తయై బ్రాహ్మణత్వం పొందిన "కవష ఐలుషుడు" శూద్రుడు కాదా...???

వివరణ: కవశ ఐలుషుని గురించి ఇదివరకే పైన చెప్పటం జరిగింది. ఈ పాయింటు రిపీట్ అయింది. బ్రాహ్మణత్వం పొందాడు అని చెబుతూ మరలా చివర్లో శూద్రుడు కాదా అని ప్రశ్నిస్తారెందుకు?   అంటే........

సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్ముడు శూద్రులు అయిన గొల్ల వారి ఇంట్లో పెరిగాడు యశోదమ్మకి మాతృ ప్రేమని పంచాడు !! ఎవరిని ఎవరికి బానిసలుగా చూడమని ఎక్కడ కూడా చెప్పలేదు.

వివరణ: కృష్ణుని పాత్రద్వారా  మనుస్మృతిలోని వర్ణవిభజనను ఆర్యపండితులు చెప్పించారు- నేనే నాలుగు వర్ణాలను సృష్టించాను. వాటికి ధర్మాలు నిర్ణయించాను. స్వధర్మమే పాటించాలి వీడరాదు అని చెబుతాడు గీతలో. అంటే శూద్రుడు జీవితాంతం శూద్రుడిగానే ఉంటూ పై మూడు వర్ణాలకు సేవలు చేసుకోవాలని అర్ధం. మీ శూద్రులలో ఒకడే ఇలా చెప్పాడు అని ఆ పాత్రతో చెప్పించటం, అందరినీ ఒప్పించే ప్రక్రియ. Manufacturing of opinion అని చెప్పొచ్చు.

మహర్షులకి కూడా దక్కని శ్రీరాముడి ఆలింగనం నిమ్న జాతివాడుగా భావించబడే పల్లెకారుడు (మత్స్యకారుడు) గుహుడికి దక్కింది. ఆనాడు అంత తేడాలు ఉంటే మరి శ్రీ రాముడికి పల్లెకారుడితో స్నేహం ఎలా ఉంటుంది..? మరి గుహుడు శూద్రుడు కాదా...???

వివరణ: గుహుడు కిరాతరాజు. ఇతను మతంగుని వలె మూలనివాసి. స్థానికుడు. ఆర్యులు దక్షిణాపథానికి వచ్చే క్రమంలో అనేక స్థానిక రాజులతో సంబంధాలు పెట్టుకొన్నారు. వారిలో గుహుడు ఒకడు. ఇతను ఆర్యులవైపు ఉన్నాడు కనుక అస్మదీయుడయ్యాడు. ఆర్యపండితులకు వ్యతిరేకంగా ఉండిన వారిని అవతారాలు ఎత్తి మరీ సంహరించినట్లు కథలు కథలుగా పురాణాలు రాసుకొన్నారు.

అద్భుతమైన వేద జ్ఞానంతో, సుమధుర గానంతో సాక్ష్యాత్ ఆ శ్రీరామచంద్రుల వారికే తన ఎంగిలి ఫలాన్ని తినిపించిన శబరి శూద్రురాలు కాదా...???

వివరణ: శబరి మాతంగ ఆశ్రమవాసి. మూల నివాసి. ఆర్య సంస్కృతికి వెలుపలి వ్యక్తి. ఆర్యులను ఆహ్వానించింది కనుక ఆర్య సాహిత్యంలో చోటు దక్కించుకోగలిగింది.

స్వయంగా కవి పండితుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి భోజుడిగా ప్రఖ్యాతుడు అయిన శ్రీ కృష్ణ దేవరాయలు వారు శూద్రుడు కాదా...???

వివరణ: అతను రాజు. హిందూ ధర్మం ప్రకారం శూద్రరాజులు పట్టాభిషేకసమయంలో సువర్ణగర్భ యాగం చేసి దండిగా సువర్ణాన్ని పండితులకు దానం ఇస్తేనే అతనికి పాలించే అర్హత వస్తుంది. శూద్ర శివాజీని కొందరు పండితులు ఈ క్రతువు చేయటానికి నిరాకరించగా, భారీ ఎత్తు ధనాన్ని ఇచ్చి పట్టాభిషిక్తుడయినట్లు చరిత్ర చెబుతుంది. రాజు శూద్రుడైనా king maker గా బ్రాహ్మణుడు ఉండటం జన్మ ఆధారిత వర్ణ వ్యవస్థ వేసిన మాస్టర్ ప్లాన్.

అఖండ భారతాన్ని అప్రతిహతంగా పాలించిన, ముర అనే శూద్ర మహిళకు జన్మించినా వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగినచంద్రగుప్త మౌర్య శూద్రుడు కాదా...???

వివరణ: చూడుడు పై పాయింటు వివరణ. నిజానికి మౌర్య సామ్రాజ్యాన్ని పతనం చేసి నిర్మించిన ఇతర సామ్రాజ్యాలేవి అంతటి విశాలమైనవి, అఖండ భారతాన్ని పాలించినవి కావు
.
మట్టిబొమ్మలను మహారణానికి జట్టునడిపిన శాలివాహనుడు కుమ్మరివృత్తికి చెందినవాడు. మరి ఆయన శూద్రుడు కాదా...???

వివరణ: చూడుడు పై పాయింటు వివరణ

విశ్వ కర్మలలో 6 తెగలు ఉన్నాయి. వడ్రంగి, కంసాలి మొదలైనవి వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. మంగలులను నాయీ బ్రాహ్మణులు అంటారు, వారిలో కూడా యజ్ఞోపవీతాన్ని ధరించేవారు ఉన్నారు. ఇక కుమ్మరులు వీరిలో యజ్ఞోపవీతాన్ని ధరించే సంప్రదాయం ఉంది. ఇక మాదిగలలో వారికి ప్రత్యేక పురోహిత వర్గం ఉంది. వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. వీరిలో అనేక లక్షల మంది వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి పౌరోహిత్యం చేస్తున్నారు. మరి వీరందరూ శూద్రులు కాదా...???

వివరణ: అవును నిజమే. అన్నీ ఉన్నాయి. శూద్రజంధ్యధారులు చరిత్రలో ఎంతో పోరాటం చేసి ఉపనయన హక్కును నిలుపుకొన్నారు (ఆర్యపండితులు ఉపనయనాన్ని మూడు వర్ణాలకే పరిమితం చేయకముందు అన్ని వర్ణాలవారు, స్త్రీలతో సహా అందరకు ఉపనయన హక్కు ఉండేది). ఇది గొప్ప విషయం. శూద్రజంద్య ధారులు ఆలయ గర్భగుడిలో ప్రవేశించి మూల మూర్తిని అర్ఛించే అర్హత కలిగిన నాడు వీరు బ్రాహ్మణ జంద్యధారులతో సమానం అవగలరు అనే సూక్ష్మవిషయాన్ని గ్రహించాలి. ఇలాంటి సన్నివేశం ఇటీవలి తంగలాన్ సినిమాలో ఉంది.

వేద కాలంలో పుట్టుకతో శూద్ర కుటుంబంలో పుట్టినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋషిగా మారి, జనశృతి పౌత్రయణ జరిపిన రైక్వ ఋషి వారు శూద్రుడు కాదా...???

వివరణ: రైక్వ ఋషి, జన శృతి అనే శూద్రరాజు వద్ద బహుమతులు గ్రహించి అతనికి విద్యలు నేర్పినట్టు చాంధోగ్య ఉపనిషత్ లో ఉన్నది. ఆకాలంలో జైన బౌద్ధాలు ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. జైన బౌద్ధాలలో శూద్ర బ్రాహ్మణ బేధాలు లేవు. రైక్వ ఋషి జైనుడో బౌద్ధుడో అయ్యే అవకాశం ఎలా కాదనగలరు?

కుమ్మరి వృత్తి చేసేవారి కుటుంబంలో జన్మించినా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో, భక్తితో, మెప్పించిన భక్త తుకారాం శూద్రుడు కాదా

వివరణ: 12 వ శతాబ్దం నుంచి భారతదేశంలో వ్యవస్థీకృత ముస్లిం పాలన మొదలైంది. వైదిక విద్యను స్థానంలో క్రమేపీ ఇస్లామిక్ విద్య రాసాగింది. ఇది అంతవరకూ సమాజంలో బిగుసుకుపోయి ఉన్న వర్ణ వ్యవస్థను బద్దలు కొట్టింది. ఎంతో మంది శూద్రులు విద్యనభ్యసించసాగారు. పెర్షియన్ భాషలో విద్యాబోధన సాగింది.

ముస్లిమ్ పాలకులు స్థానిక ప్రజల మతపరమైన విశ్వాసాలను గౌరవించారు. బాబర్ కాలంనుంచి ముఘల్ పాలకులు సంస్కృత పండితులను చేరదీసారు. హుమాయున్ అక్బర్ లు పరమతసహనానికి నమూనాగా నిలిచాడు. జహంగీర్, షాజహాన్ లు కూడా అదే బాటలో నడిచారు.
హజ్రత్ నిజాముద్దిన్ ఔలియా (13 వ శతాబ్దం), షా ఇనాయతుల్ల (17 వ శతాబ్దం) లాంటి సూఫీ సన్యాసులు హిందూ ముస్లిమ్ ఐక్యతను బోధించారు. నానక్ సాహెబ్ దాదు దయాల్, బుల్లా సాహెబ్, తులసి సాహెబ్ లాంటి మహనీయులు హిందూ ముస్లిమ్ ఐక్యతకు కృషిచేసారు.

ఈ నేపథ్యంలోంచే భక్తి ఉద్యమం మొదలైంది.ఈ భక్తి ఉద్యమం ఇస్లామ్ మతంలోని ఎకేశ్వరోపాశన నుండి ప్రేరణ పొందింది. హిందు మత లక్షణాలైన కులమతాల వివక్ష లేదు, సంస్కృతం బోధనా భాష కాదు. స్థానిక భాషలలో కీర్తనలు రాసుకొన్నారు ఈ భక్తి కవులు. దేవుని చేరుకోవటానికి మధ్యలో పూజారి అవసరంలేదు. పూజలు, క్రతువులు, యజ్ఞాలు యాగాలు అవసరం లేదు. హిందూ ధార్మిక గ్రంథాలైన వేదాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రస్తావన లేదు. ఉత్త భక్తి తో ఎవరైనా దేవుడిని చేరుకోవచ్చు అని చేసిన ఉద్యమమే భక్తి ఉద్యమం. దీనిని నడిపించింది శూద్రులు, ముస్లిము సూఫీలు. ఇది పరమతసహనానికి సూచనగా నిలిచింది.

క్రతువులు, వేదాలు, పురాణాలు, సంస్కృతం, వర్ణవ్యవస్థ, యజ్ఞాలు, పూజారులు ఉండే సనాతన ధర్మానికి భక్తి ఉద్యమానికి అసలు సంబంధమే లేదు. ఈ రోజుకీ ఈ భక్తి ఉద్యమంలోని సంత్ (భక్తి ఉద్యమ నిర్మాతలు) లను వారు శూద్రులని హిందూ పీఠాధిపతులు గుర్తించరు

ఈ వ్యాసంలో తుకారం, నారాయణ గురు, కబీరు, రవి దాస్, మీరాభాయ్, సంత్ ఘాసి దాస్ లాంటి వారిని హిందూమతం ఉత్పత్తి చేసిన శూద్ర ఋషులుగా చెప్పటం వక్రీకరణ. వారు హిందూ ధార్మికతను ధిక్కరించి, వెలుపలకి వచ్చి ఒక ఉద్యమాన్ని నడిపిన గొప్ప సామాజిక సంస్కర్తలు. అంతేకాక మరికొందరు ఋషులు జైన మతానికి చెందినవారు కూడా కావొచ్చు. ఎందుకంటే దాదాపు 15 శతాబ్దం వరకూ జైనం మనుగడలో ఉంది. వారిని హిందూ ఋషులుగా అప్రాప్రియేట్ చేసుకోవటం లోతుతక్కువ వాదన.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానంతో ఋషిగా మారిన ఋషి నారాయణగురు వారు శూద్రుడు కాదా...???

వివరణ: ఇతను బ్రిటిష్ ఇండియాలో 19 వ శతాబ్దపు సంఘ సంస్కర్త. శూద్రుడు. కేరళాలో హిందూ మతంలోని కులవ్యవస్థపై, బ్రాహ్మణాధిక్యతపై పోరాడిన వీరుడు.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన కబీర్_దాస్ శూద్రుడు కాదా...???

వివరణ: 15 వ శతాబ్దపు ముస్లిమ్ పాలనలో కబీర్ దాస్ ఒక భక్తి ఉద్యమకారుడు. ఇతనిపై సూఫీల ప్రభావం ఉంది. ఇతను ఇస్లామ్ మతాన్ని స్వీకరించాడు. ఇతనిని ఇప్పటికీ హిందూముస్లిములు సమానంగా ఆదరిస్తారు. హిందూ బ్రాహ్మణులు కబీర్ ను ఎన్నో కష్టాలపాలు చేసినట్లు అనేక కథలు కలవు.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో బెంగాలీ మహారాజు లక్ష్మణ్ సేన్ కు రాజగురువుగా ఎనలేని సేవలు అందించిన ఋషి ధోయి శూద్రుడు కాదా...???

వివరణ: థోయి 12 వ శతాబ్దానికి చెందిన కవి. పావన దూత అనే కావ్యాన్ని రచించాడు. హిందుఋషా కాదా చెప్పలేం.

శూద్రునిగా పుట్టినా కూడా కళంగినథార్ శిష్యరికంలో వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానంకలిగిన తమిళ బోగర్ చైనా దేశం వెళ్లి హిందూ ధర్మ ప్రచారం చేశారు. మరి ఈయన శూద్రుడు కాదా...???

వివరణ: సిద్ధవైద్యం తెలిసిన తమిళ వ్యక్తి. పురాణ వ్యక్తి. చారిత్రిక వివరాలు తెలియరావు. క్రీపూ 3000 కి చెందిన వ్యక్తి అంటారు. ఇతను వేదాలను అభ్యసించాడని ఎక్కడ ఉంది? రిఫరెన్స్ ?

మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన కూడా అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం, గొప్ప బ్రహ్మ జ్ఞానంతో 63 శైవ నాయనార్లలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన "ఆదిపట్టన్" శూద్రుడు కాదా...???

వివరణ: చోళులకాలంలో నివసించిన శైవభక్తుడు. ఇతను వేదాలను అభ్యసించాడని ఎక్కడ ఉంది? రిఫరెన్స్ ?

కళింగ రాజ్యాన గోవులు కాసే వారి ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, కలిగిన "అచ్యుతానంద" శూద్రుడు కాదా...???

వివరణ: అత్యుతానంద దాస. 16 వ శతాబ్దం. ముస్లిమ్ పాలనలో జీవించాదు. ఇతను గోకాపరుల కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. తండ్రి Dinabandhu Mohanty. ఇతను కరణాలు. లేఖన వృత్తి.

కళింగ రాజ్యాన కాటికాపరి వృత్తి చేసేవారి ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ఐదుగురు పంచసఖాలలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన "బలరాం దాస్" శూద్రుడు కాదా...???

వివరణ: బలరామ్ దాస్ 16 వ శతాబ్దం. ముస్లిమ్ పాలనలో జీవించాడు. వీరు కాటికాపరి వృత్తి కాదు. తండ్రి Somanatha Mahapatra. ఇతను కరణాలు. వీరు సంపన్నులు.

కళింగ రాజ్యాన మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన కూడా అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం, గొప్ప బ్రహ్మ జ్ఞానంతో ఋషిగా వెలుగొందిన "భీమ దిబారా" శూద్రుడు కాదా...???

వివరణ: అవును శూద్రుడే. ఇతను 17 వ శతాబ్దానికి చెందిన వాడు. అప్పటికి ముస్లిమ్ పాలన, బ్రిటిష్ వారి ప్రభావంచే మనుధర్మం వెనక్కి వెళ్ళి శూద్రులందరూ విద్యనభ్యసిస్తున్నారు.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన ఋషి రవిదాస్ శూద్రుడు కాదా...???

వివరణ: రవిదాస్, మీరాభాయి లు భక్తి సంప్రదాయానికి చెందిన 15 వ శతాబ్దపు కవులు. ముస్లిమ్ సూఫీ సంప్రదాయం అనుసరించారు. రవిదాస్ పంత్ చర్మకారకులానికి చెందిన వ్యక్తి. హిందూ ధర్మాన్ని తిరస్కరించిన శూద్ర భక్తి కవి.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన ముని నామ్ దేవ్ శూద్రుడు కాదా...???

వివరణ: నామ్ దేవ్ 13 వ శతాబ్దంలో ముస్లిమ్ పాలనలో జీవించిన భక్తి కవి. భూస్వామ్య శూద్రకులస్థుడు. ఇతను వేదాలను అభ్యసించాడని ఎక్కడ ఉంది? రిఫరెన్స్ ? ఇతను వేదాలను అనుసరించలేదు.

శూద్రుల ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చోఖ మేళ" శూద్రుడు కాదా...???

వివరణ: చొక్కమేళ మరాఠా భక్తిసంప్రదాయ కవి. 14 వ శతాబ్దం. ముస్లిమ్ పాలనలో ఆథ్యాత్మిక అన్వేషణ చేసిన మహర్ కులస్థుడు. ఇతనిని బ్రాహ్మణ పండితులు ఆలయంలోకి అనుమతించలేదు. ఆ కారణంగా సొంత ఆలయాన్ని నిర్మించుకొన్నాడు. వేదాలను, హిందూ ధర్మాలను అంగీకరించలేదు. ఇతను వేదాలను అభ్యసించాడని ఎక్కడ ఉంది? రిఫరెన్స్

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన "సంత్ కణ్హోపుత్ర" శూద్రుడు కాదా...???

వివరణ: సంత్ కన్నోఫుత్ర స్త్రీ. రాజ నర్తకి. 15 వ శతాబ్దంలో ముస్లిమ్ పాలనలో విఠలుని ఆరాధించి కవిత్వం చెప్పిన కవయిత్రి. ఈమె వేదాలను అభ్యసించినట్లు ఎక్కడ ఉంది? రిఫరెన్స్

" మహారాజు కవార్ధ" రాజ గురువు వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన శూద్రుడైన "గురు బాలాక్ దాస్" ...!

వివరణ: గురుబాలక్ దాస్ 19 వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో జీవించిన భక్తి సంప్రదాయానికి చెందిన సంత్. కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఇతను చేస్తున్న బోధనలు ప్రజలలో విస్తరిస్తున్నాయని తెలిసిన అగ్రవర్ణ హిందువులు ఇతన్ని కత్తులతో పొడిచి చంపేసారు.

జష్పూర్ యువరాజు రాజ్ కుమార్ దిలీప్ సింగ్ రాజ గురువు శూద్రుడైన "గురు రామేశ్వర్ ప్రసాద్ గాధర".!

వివరణ: గురు రామేశ్వర్ యోగి 1905-1996 మధ్య జీవించిన చత్తిస్ గఢ్ కు చెందిన ఆథ్యాత్మిక వేత్త. ఇతను గిరిజనుల అభ్యున్నతి కొరకు పాటుపడిన సామాజిక కార్యకర్త. 

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "సంత్ ఘాసిదాస్" శూద్రుడు కాదా...???

వివరణ: సంత్ ఘాసిదాస్ 19 వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో జన్మించాడు. భక్తి సంప్రదాయానికి చెందిన సంత్ గురువు.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన తమిళులకు ఆరాధ్యుడు అయిన, "తిరు వల్లువార్" శూద్రుడు కాదా...???

వివరణ: తిరువళ్ళువార్ జైనుడు. హిందూమతానికి చెందిన వ్యక్తే కాదు. ఇతని కాలానికి హిందూమతం ఇంకా దక్షిణభారతదేశానికి రానేలేదు. ఇక బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఎక్కడిది. ఇదొక ఊతపదంగా ఉంది ఈ వ్యాసం మొత్తంలో. ఆ పదాలు పడితే తప్ప హిందుమతం అని అనుకోరని కాబోలు.

మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "గురు విఠల్ రాంజీ షిండే" శూద్రుడు కాదా...???

వివరణ: గురు విఠల్ 20 వ శతాబ్దపు సామాజిక కార్యకర్త. దళితులు, సమాజంలో వెలివేయబడినవారి అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త. వర్ణ వ్యవస్థను వ్యతిరేకించారు. బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యం ఎక్కడిది. రిఫరెన్స్.

మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "సోయరా భాయ్"శూద్రురాలు కాదా...??

వివరణ: ఈమె పైన చెప్పిన 14 వ శతాబ్దపు ముస్లిమ్ పాలనలో భక్తికవి గా పేరుగాంచిన చర్మకార చొక్కమేళ సంత్ యొక్క భార్య. ఈ దంపతులు వేదాలను అంగీకరించలేదు. గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యం ఎక్కడిది. రిఫరెన్స్?

మధ్య భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెంది శివ, వైష్ణవ బేధాలను రూపుమాపిన "శోభి రామ్" శూద్రుడు కాదా...???

వివరణ: శోభిరామ్ 18 వ శతాబ్దం బ్రిటిష్ పాలనలో గురు శివనారాయణ వద్ద శిష్యరికం చేసిన ఒక చమర్ యోగి. వేద పాండిత్యం రిఫరెన్స్??

పంజాబ్ లో రజక వృత్తి చేయువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "నామ్ దేవ్" శూద్రుడు కాదా...???
వివరణ: ఇది రిపీట్

మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బహిరామ్ చోఖమేల" శూద్రుడు కాదా.??

వివరణ: బహిరామ్ బాబా 1800 లలో జీవించిన యోగి. ఇతనికి వేదపాండిత్యం నేర్చుకొన్నాడని రిఫరెన్స్ లు ??.

మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బంకా మహర్" శూద్రుడు కాదా.??

వివరణ: ఇతను పైన చెప్పిన చొక్కమేళ కు బావమరిది. 14 వ శతాబ్దం. ముస్లిమ్ పాలన. వీళ్ళు వేదాలను తిరస్కరించారు. వేదపాండిత్యం ???

మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "భాగు" శూద్రుడు కాదా.??

వివరణ: భాగు మహరిన్ మహర్ కులానికి చెందిన భక్తి కవయిత్రి. ఈమె గురించి వివరాలు తెలియరావు. భక్తి సంప్రయానికి చెందిన వ్యక్తి.

మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చన్నయ్య" శూద్రుడు కాదా.??

వివరణ: మదరా చన్నయ్య 11 వ శతాబ్దానికి చెందిన కన్నడ కవి. బసవని శిష్యుడు అంటారు
.
ఉత్తర భారతంలో పారిశుద్ధ్య వృత్తి చేయు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "గోపాలానంద్ మహరాజ్ " శూద్రుడు కాదా.??

వివరణ: పంతొమ్మిదో శతాబ్దపు సాధువు. స్వామినారాయణ సంప్రదాయానికి చెందిన వ్యక్తి. అనేక పుస్తకాలు రాసాడు. 1908 లో మరణించారు.

ఇలా చెప్పుకుంటే పోతే అనేక లక్షల మంది శూద్ర హిందువులు వేదాలు చదివి, బ్రహ్మ జ్ఞానం పొంది ఋషులుగా, మునులుగా, పంత్ లా, సాధు లా ఎనలేని ఖ్యాతి పొందారు, పొందుతూ హిందూ ధర్మానికి ఎనలేని సేవ చేస్తున్నారు...!
జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
ఒక బ్రాహ్మణునికి జన్మించినా పౌరుషం కల్గి యుద్ద విద్యలు నేర్చి క్షత్రియుడు కావచ్చు. ఒక శూద్రునికి జన్మించినా మేధోసంపత్తితో బ్రాహ్మణుడు కావచ్చు.

వివరణ: 12 వ శతాబ్దం నుండి ముస్లిముల పాలన కారణంగా కొంతమేరకు వర్ణ వ్యవస్థ పగుళ్ళు తీసింది. శూద్రులు వేదాలను, పురాణాలను పక్కనపెట్టి భక్తి ఉద్యమాన్ని నడిపించారు. ఇది ఎక్కువగా వర్ణవ్యవస్థకు, క్రతువులకు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. దీనికి ప్రేరణ ముస్లిమ్ పాలకుల సూఫీ వేదాంతం. దాన్ని ఆధారం చేసుకొని శూద్రులు, అతిశూద్రులు తమ ఆథ్యాత్మిక ప్రపంచాన్ని భక్తి ఉద్యమం ద్వారా నిర్మించుకొన్నారు. దీనిలో హిందూ మత ప్రమేయం తక్కువ.

ఇక పై శ్లోకంలో బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అంటున్నప్పుడు పైన చెప్పిన ఋషులను, సంత్ లను నేటికీ శూద్రులుగానే ఎందుకు పిలుస్తున్నారు మీరు?. వారికి బ్రహ్మ జ్ఞానం వచ్చిందని పేరు పేరుకి చెప్పినపుడు వారు శూద్రులు, చమరులు అని కులాలుగా ఎందుకు చెబుతున్నారు? వారు బ్రాహ్మణులు అని ఎందుకు చెప్పటం లేదు?
ఇంతచిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు. అంటే జన్మనా జాయితే అనేది అంతా బూటకం. పై పై నాటకం.

పోనీ గత రెండువందలేళ్ళుగా బ్రహ్మజ్ఞానం వల్ల ఏ శూద్రుడు బ్రాహ్మణుడిగా మారాడో లెక్కలు తీయండి. కేస్ట్ సర్టిఫికేట్లు ఆధారాలుగా చూపి మాట్లాడాలి. గాలి కబుర్లు కాదు.  లేదూ దుర్గుణాలు కలిగిన ఏ బ్రాహ్మణుడు  శూద్రుడిగా మారాడో చెప్పండి. 

 దొంగతనం మొదలైన అపరాధాలలో శూద్రునకు 8 రెట్లు దండన విధిస్తే, వైశ్యునకు 16 రెట్లు, క్షత్రియునకు 32 రెట్లు బ్రాహ్మణునకు 64 లేక 100 లేక 128 రెట్ల దండన విధించాలని మనువు ఆదేశించారు. శిక్షల విషయంలో ప్రక్షిప్త శోకాలు కనిపించిన మహానుభావులకు ఈ శ్లోకాలు ఎందుకు కనిపించలోదో విజ్ఞులైన మీరు గ్రహించగలరనుకుంటాను.!

వివరణ: ఈ శ్లోకానికి మూలం ఏటో చెప్పాలి? ఈ విధంగా చివరన ఎక్కడిదో నంబరుతో సహా ఇచ్చినట్లు…… అంతే తప్ప ఉత్తినే ఏదో నాలుగులైన్లు రాసి చెబితే ఎలా నమ్మేది.

బ్రాహ్మణుడు క్షత్రియుల్ని దూషిస్తే యాభైపణాలు, వైశ్యుల్ని దూషిస్తే ఇరవై ఐదు పణాలు, శూద్రుణ్ణి దూషిస్తే పన్నెండు పణాలు శిక్ష విధించాలి. అదే ఒక శూద్రుడు బ్రాహ్మణున్ని అవమానిస్తే ఆ శూద్రుని నాలుక కోసివేయాలి. మను: 8.270)

ద్విజుని కులాన్ని, పేరును అమర్యాదగా ఉచ్చరించిన శూద్రుని నోట్లో పదివేళ్ళ పౌడగున్న ఇనుప మేకును ఎర్రగా కాల్చి దూర్చాలి. (మను 8.271)
****

బొల్లోజు బాబా

Tuesday, October 8, 2024

కొంచెం ప్రజాస్వామ్యం కండి.

వేదాలు వినకూడదని, చదువుకోకూడదని, బ్రాహ్మణులను పూజించాలని లాంటి రాతలన్నీ వ్యాసుడు, వాల్మీకి లాంటి బ్రాహ్మణేతరులే రాసుకొన్నారని అని వాదించటం ఏదైతే ఉందో అది హిలేరియస్.
బ్రాహ్మణాధిక్యతను స్థిరపరచే రాతలు రాసిన బ్రాహ్మణులను, బ్రాహ్మణేతరులు అని ప్రచారించటం గొప్ప మార్కెటింగ్ టెక్నిక్.
ఇలాంటి వాదనలు శతాబ్దాలుగా చేసారు. ఇంకానా... ఇది డా. అంబేద్కర్, పెరియార్, పూలే ల యుగం. తర్కం నడుస్తున్న రోజులు ఇవి.
కొంచెం ప్రజాస్వామ్యం కండి.

Reference comment

కృష్ణుడు ఏంచెప్పాడు- బ్రాహ్మణాధక్యతను, చతుర్వర్ణాలను చెప్పాడు గీతలో. స్వధర్మం పాటించమన్నాడు. గీత దాటొద్దన్నాడు.
విశ్వామిత్రుడు- బ్రాహ్మణ జన్మ ఉత్తమమైనదని దాన్ని కోరుకోవటానికి తపస్సుచేసాడు
అరుంధతి - బ్రాహ్మణ కశ్యపుని ముని కుమార్తె. బ్రాహ్మణుని భార్య. మాదిగ స్త్రీ అని కథనాలు అల్లారు.
వాల్మీకి: బ్రాహ్మణుడు పేర్లు, అగ్నిశర్మ/లోహ జంఘ. బోయ అని కల్పించారు. రాసిందంతా బ్రాహ్మణాధిక్యతను స్థిరపరచే రాతలు.
వ్యాసుడు: బ్రాహ్మణ పరాశురుడికి జన్మించాడు. తాత బ్రాహ్మణ వశిష్టుడు. రాసిన రాతలు బ్రాహ్మణాధిక్యతను స్థిరపరచే కావ్యాలు, ఇతిహాసాలు.
మనువు కూడా బిసి అని వాదించాడో అతితెలివి మేధావి.
ఇలాంటి వాదనలనే లోతుతక్కువ వాదనలు అంటారు. బ్రాహ్మణవాదాన్ని చెప్పినవారందరూ బ్రాహ్మణేతరులు కనుక బ్రాహ్మణవాదం/సనాతనం అనేది బ్రాహ్మణేతరులే కావాలని తమమీద వేసుకొన్నారు;
వేదాలు వినకూడదని, చదువుకోకూడదని, బ్రాహ్మణులను పూజించాలని లాంటి రాతలన్నీ తమకు తామే రాసుకొన్నారని అని వాదించటం ఏదైతే ఉందో అది హిలేరియస్.
బ్రాహ్మణాధిక్యతను స్థిరపరచే రాతలు రాసినవారిని బ్రాహ్మణేతరులు అని ప్రచారించటం మార్కెటింగ్ టేక్నిక్.
ఇలాంటి వాదనలు శతాబ్దాలుగా చేసారు. ఇంకానా... ఇప్పుడు డా. అంబేద్కర్, పెరియార్, పూలే ల యుగం, తర్కం నడుస్తున్న రోజులు ఇవి.
కొంచెం ప్రజాస్వామ్యం కండి.
పిఎస్. ఆయా పాత్రలు చారిత్రికమైనవని నమ్మలేను కానీ పురాణ పాత్రలుగా ఎంచి వాటిపై విశ్లేషణ ఇది.



బొల్లోజు బాబా

సాయిబాబా విగ్రహాలు తొలగింపు

యూపి ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలు తొలగింపు పై పెట్టిన ఒక పోస్టు వద్ద నే చేసిన కామెంట్లు ఇవి.
.
ఇది ఇక్కడితో ఆగుతుందా? హిందూ, బౌద్ధ ఆ తరువాత శైవ వైష్ణవ గొడవలుగా మారదని గ్యారంటీ లేదు.
***
శైవ వైష్ణవ గొడవలు వచ్చేంతగా శాస్త్రం ఎవరూ చదువుకోలేదు అన్న మిత్రుని వ్యాఖ్యకు ఇచ్చిన సమాధానం ఇది.
***
మీరు శాస్త్రం మాట్లాడుతున్నారు.
వాస్తవం అలా లేదు.
ఈ రోజు హిందుత్వ పేరుతో జరుగుతున్న ఈ విభజన, ద్వేషానికి కారణం వైష్ణవమే అనే భావన బలపడుతోంది.
మొన్న అయోధ్యాలయ ప్రారంభోత్సవ వేళ కూడా పిఠాధిపతుల నిరసనలో ఈ శైవ వైష్ణవ విభేధాలు స్పష్టపడ్డాయి
రాహులుడు శివుని పటం ప్రదర్శిస్తూ కూడా ఇదే అభిప్రాయాన్ని నర్మగర్భంగా ప్రకటించాడు
ఓట్లకోసం తాత అడ్డబొట్లు పెట్టుకొని శివాలయాలచుట్టూ తిరిగాడు మొన్న తమిళనాడులో.
పొలిటికల్ గా, మతపరంగా శైవ వైష్ణవ బేధాలు కన్సాలిడేట్ అవుతున్నాయి.
ఇక వ్యవహారపరంగా మతం బ్రాహ్మణుల చేతులలోంచి భజరంగ్ సేవకుల చేతులలోకి ఏనాడో జారిపోయింది.
బ్రాహ్మణుల చేతుల్లో రాజకీయనిర్ణయాలకు శాస్త్రప్రకారం సమర్ధింపులు చేయటం మిగిలింది.
ఒక వేళ అన్నిటినీ మింగేసి వైష్ణవం ఒకటే మిగిలినా.... అందులో మళ్ళా ద్వైత, అద్వైత, గౌడీయ అంటూ భిన్న శాఖల ఆధిపత్య పోరు మొదలౌతుంది.
మత ఆధారంగా విభజన ద్వేషం మొదలయ్యాకా దానికి అంతం ఉండదు. చరిత్ర ఈ నరమేథాలను చాలానే చూసింది.
బొల్లోజు బాబా

ప్రాచీనగాథ

మంచినీటిలో బతికే నీరుపిల్లి
సముద్రపు ఎండు చేపలని
తింటుందేమో కానీ
మరొకరిని కౌగిలించుకొన్న ఛాతీని
నేను హత్తుకోను
.
ఓరమ్‌పోకియార్, ఐంగురునూరు – 63
(బయట తిరుగుళ్ళు మరిగిన భర్తగురించి చెప్పిన మాటలు)
రానున్న నా ప్రాచీనగాథలు పుస్తకం నుండి
***
పై గాథ రెండువేల సంవత్సరాల క్రితపు సంగం కాలపు సాహిత్యం. అప్పటికి వైదిక ధర్మం ఇంకా దక్షిణభారతదేశానికి రాలేదు. ఇక్కడి ప్రజలను జైన, బౌద్ధ ధర్మాలు నడిపించాయి.
ఒక స్త్రీ ఎంత స్వేచ్ఛగా, ఎంత నిర్భయంగా తన అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నదో గమనించవచ్చు.
భర్త కుష్టురోగి అయినప్పటికీ వాడితోనే కాపురం చేయాలని, అతను కోరితే బుట్టలో ఎత్తుకొని ప్రియురాలి ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పింది సనాతన ధర్మం.

బొల్లోజు బాబా

సెక్యులరిజమ్ అనేది యూరోపియన్ భావన భారతీయులది కాదు. .... ఒక హిందుత్వ వాది.

సెక్యులరిజమ్ అనేది యూరోపియన్ భావన భారతీయులది కాదు. .... ఒక హిందుత్వ వాది.

***
.
ఒక మతానికి చెందిన వ్యక్తులు అసందర్భంగా తమ మతాన్ని పొగుడుకోవటం, ఇతర మతాలను నిందించటం చేయరాదు. పరమతానికి చెందినవారిని కూడా గౌరవించవలెను. ఇలా చేయుటవలన తమ మతాన్ని అభివృద్ధి చేసుకోవటమే కాక ఇతర మతాల వారికి ఉపకారం కలిగించిన వారు అవుతారు. తన వారిని స్తుతిస్తూ ఇతర మతస్తులను నిందించేవాడు తన మతానికే ఎక్కువ అపకారం చేసిన వాడవుతాడు. సమస్త జనులకు ధర్మాభివృద్ధే ముఖ్యము-- - అశోక చక్రవర్తి, XII వ శిలాశాసనము
.
***
హిందుత్వ వాదులకు భారతదేశం అంటే ఆరో శతాబ్దపు మతం మాత్రమే. అంతకు ముందుకూడా ఈ దేశానికి చరిత్ర ఉందని తెలుసుకోవటానికి ప్రయత్నించరు. రెండువేల సంవత్సరాల క్రితపు అశోకుని శిలా శాసనంలో చెప్పింది ప్రాచీన భారతదేశ సెక్యులరిజం.
విభజన, ద్వేషం బాగా అమ్ముడుపోయే సరుకులైనప్పుడు, సమత సహిష్ణుత ఎవరికి కావాలి?
బొల్లోజు బాబా

థేరీగాథలు


థేరీగాథలు BCE ఆరోశతాబ్దానికి చెందిన తొలితరం బౌద్ధ బిక్కుణిల అనుభవాలు. మానవ దుఃఖం, వేదన, ముక్తికొరకు అన్వేషణ, తధాగతుని బోధనలో దొరికిన సాంత్వన ఈ గాథల ఇతివృత్తం.
వీటిని అనువదించి 2022 లో పుస్తకంగా తీసుకొచ్చాను. ఛాయావారు ప్రచురించారు.
ఈరోజు వాటిని మరలా చదువుకొంటే, మంచి అనుభూతిని ఇచ్చాయి ప్రతి గాథ వెనుక చారిత్రిక అంశాలను పుస్తకం చివరలో నోట్సు రూపంలో ఇచ్చాను.
****
.
భద్ధ కుండలకేశ
.
శిరోముండనం గావించుకొని
దుమ్ముపట్టిన దుస్తులు ధరించి
తప్పులు లేనిచోట తప్పులు ఉన్నాయని
తప్పులు ఉన్నచోట వాటికి అంధురాలినై
సంచరించేదానిని
యాభై ఐదేండ్లపాటు
అంగ, మగధ, వజ్జి, కాశి, కోశల రాజ్యాల
నలుమూలలా పర్యటించాను
ఆ రాజ్య ప్రజలు ఇచ్చిన భిక్షను తిన్నాను
ఒకనాడు
నిర్మలమైన బుద్ధభగవానుడు శిష్యులతో కలసి వుండగా
గృధ్రకూటపర్వతం వద్ద చూసాను
ఎదురుగా మోకాళ్లపై కూర్చొని
చేతులు జోడించి భక్తితో నమస్కరించాను
“రా భద్దా” అన్నారాయన
ఆ క్షణమే నా ధమ్మ దీక్షా స్వీకారం జరిగింది
తధాగతుడు ఇచ్చిన వస్త్రాన్ని ధరించిన భద్ధ
అన్ని బంధనాలనుంచి విముక్తమయింది.
.
నోట్స్
.
రాజగృహలో ఒక వడ్డీవ్యాపారస్తుని కుమార్తె బద్ద. ఒకరోజు పురవీధిలో మరణదండన విధించటానికి తీసుకొని వెళుతున్న ఒక దొంగను చూసి మనసుపారేసుకొని, అతనిని తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోను అని తల్లిదండ్రులకు చెప్పటంతో- భద్ధ తండ్రి తలారులకు భారీగా లంచాలిచ్చి ఆ దొంగను రహస్యంగా విడిపించి ఇంటిలోకి తీసుకొని వచ్చి, స్నానం చెయించి, అలంకరించి, కూతురు ముందు నిలబెట్టాడు. ఆ దొంగ పేరు సత్తుక. ఇంతచేసినప్పటికీ ఇతనిలో ఏ మార్పు రాక, భద్ధ ఒంటిపై ఉన్న నగలను ఎలా దొంగిలించాలా అని ఆలోచించసాగాడు.
మరణదండన నుండి తప్పించుకొన్నందుకు కొండదేవతకు మొక్కుకున్నానని, అది తీర్చుకొనటానికి వెళ్లాలని, బద్దను నమ్మించి ఆమెను ఒక పెద్దకొండపైకి తీసుకొనివెళ్ళాడు సత్తుక. అక్కడ ఆమె ఒంటిపైఉన్న నగలను దొంగిలించి ఆ కొండపైనుండి కిందకు తోసేసి చంపెయ్యాలని అతని పథకం. అతని పన్నాగాన్ని గ్రహించిన భద్ధ, మిమ్ములను చివరిసారిగా ఒకసారి కౌగిలించుకోవాలనిఉంది నా ఆఖరుకోర్కె తీర్చమని అని అడిగి, సత్తుకను కౌగిలించుకొని క్షణకాలంలో అతనిని ఆ కొండపైనుంచి తోసి చంపివేసింది. ఇంత జరిగిన తరువాత ఇంటికి వెళ్ళటానికి భద్ధకు మొఖం చెల్లక, శ్వేతాంబర జైనమతంలో చేరి సన్యాసిగా జీవనం ప్రారంభించింది. అప్పట్లో జైనమతం తీసుకోవాలంటే తలపై జుత్తును చేతితో పెకలించుకోవాలి. ఆ విధంగా చేయటంవలన కేశాలు చిక్కులు పడటంతో అప్పటినుండి భద్ధకు భద్ధ కుండలకేశ (Good one with curly hair) అనే పేరు వచ్చింది. ఈమె జైనబోధనలను మొక్కవోని దీక్షతో సంపూర్ణంగా అధ్యయనం చేసి దేశసంచారానికి బయలుదేరింది.
ఏదైనా ఊరు వెళితే అక్కడ ఒక ఖాళీ స్థలంలో ఒక నేరేడు కొమ్మను పాతి తనతో ఆధ్యాత్మికంగా వాదించేవారికొరకు ఎదురుచూసేది. ఆ ఊరిలో ఎవరైనా ఈమెతో వాదించాలనుకొంటే ఆ నేరేడు కొమ్మను తొలగించి, ఈమెతో వేదాంత చర్చ చేసేవారు. అలా ఈమె యాభై ఏండ్లపాటు ప్రాచీన ఉత్తరభారతదేశంలోని అనేక పట్టణాలు సంచరించి ఎందరినో తన వాదనాపటిమతో ఓడించి దిగ్విజయయాత్ర జరుపుతూ ఒకనాడు శ్రావస్తి వచ్చింది. అక్కడ బుద్ధుని శిష్యుడైన సారిపుత్త తో వాదనకు దిగింది. వీరిరువుతూ హోరాహోరిగా వేదాంత చర్చ చేసారు. సారిపుత్త జ్ఞానసంపత్తిని గ్రహించిన భద్ధకుండలకేశ అతనిని గురువుగా ఉండమని కోరింది. సారిపుత్త బుద్ధునివద్దకు వెళ్ళమని చెప్పటంతో, భద్ధకుండలకేశ గృధ్రకూటపర్వతంపై ఉన్న బుద్ధభగవానుని చేరి నమస్కరించగానే, ఆయన “రా బద్ధా” అన్నాడట. ఆ మాటే భద్ధ కు బుద్ధుడు నేరుగా ఇచ్చిన దీక్షగా పరిగణిస్తారు.

బొల్లోజు బాబా
Uploading: 5514503 of 5514503 bytes uploaded.