Monday, March 28, 2022

అతని కవిత్వమొక అనుభూతి

 (శ్రీ ఎమ్మెస్ సూర్యనారాయణ ఇటీవల వెలువరించిన “నేనొక అనుభూతి” కవిత్వ సంపుటి పరిచయ వ్యాసం మార్చ్ 2022 ప్రస్థానం సంచికలో ప్రచురించబడింది. ఎడిటర్ గారికి కృతజ్ఞతలు)

.
అతని కవిత్వమొక అనుభూతి
.
కవి స్వీయ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసిన కవిత్వాన్ని అనుభూతి కవిత్వం అంటారు.
క్షణక్షణం మనల్ని ప్రత్యక్షంగా తాకే అనుభవాలూ, వాటి స్పందనలూ, జీవితాన్ని జీవనపాత్రంగా మార్చే అనంతమైన అనుభూతులూ, ఇవి కాక కవిత్వానికేవీ అర్హం? అని ఇస్మాయిల్ ప్రశ్నిస్తారు.
బాహ్యదృశ్యాలు అంతరంగప్రపంచంలో దృశ్యత్వాన్ని కోల్పోయి కేవల అనుభూతిగా మిగుల్తాయని శ్రీకాంత శర్మ అభిప్రాయపడ్డారు.
ఆధునిక కవిత్వంలో అనుభూతి కవిగా గుర్తింపబడిన వాడు బాలగంగాధర తిలక్. ఆ తరువాత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, శేషేంద్ర శర్మ, వేగుంట మోహన ప్రసాద్, ఇస్మాయిల్, కొత్తపల్లి శ్రీమన్నారాయణ లాంటివారు ఈ అనుభూతికవిత్వాన్ని వెలిగింపచేసారు. ఇదేక్రమంలో సమకాలీనంగా బి.వి.వి. ప్రసాద్, నామాడి శ్రీధర్, ఎమ్మెస్ సూర్యనారాయణ లాంటివారు రాజకీయ దృక్ఫథాలతో ప్రమేయం లేకుండా జీవనానుభవాలను పరిగణలోకి తీసుకొని కవిత్వాన్ని రచిస్తున్నారు.
తెలుగు సాహిత్యంలో అనుభూతి కవిత్వంపై డబ్బైలలో గొప్ప చర్చ జరిగింది. సాహిత్యమంతా మానవానుభవంలోంచి పుట్టుకొచ్చినదే కనుక అనుభూతి కవిత్వాన్ని ఒక సాహిత్య ధోరణిగా భావించవచ్చు తప్ప సిద్ధాంతంగా అంగీకరించలేం-అంటూ మార్స్కిస్టు విమర్శకులు చేసిన వాదన సహేతుకంగానే అనిపించినా; అనుభూతి కవిత్వంలో సామాజిక స్పృహ ఉండదని, సామాజిక ప్రయోజనం లేని కవిత్వం ప్రగతినిరోధమని అంటూ చేసిన విమర్శను అంగీకరించలేం.
ప్రజలను గొప్ప గొప్ప కార్యాలకు ప్రేరేపించటం ఒక్కటే సామాజిక ప్రయోజనంగా భావిస్తారు కానీ, “పఠిత హృదయంలో దీపం వెలిగించటం” కూడా సామాజిక ప్రయోజనమే. సాటి మనిషిపట్ల కరుణను, ప్రకృతి పట్ల ప్రేమను, కలిగించటం నేటి యాంత్రిక ప్రపంచానికి ఎంతో అవసరం. ఎమ్మెస్ కవిత్వం ఆ పనిచేస్తుందని, ఇటీవల వెలువరించిన “నేనొక అనుభూతి” కవిత్వ సంపుటిలోని అనేక కవితలు నిరూపిస్తాయి. .
***
ఎంతైనా రైతు… ప్రాణాలు పోసి, పెంచిన వరి కంకుల కలలు
బతుకు కుప్పపోసి….నూర్చి ఎగరబోసిన బంగారు క్షణాలు
జీవితం పణంగా పెట్టి… పరిరక్షించిన ధాన్యపురాశులు
కృషి పరిపూర్ణతకు ధన్యత చెందే జీవరాశులు
ఒక్క ఈవియమ్ బీప్ సౌండ్ లో గల్లంతైపోవడం
ఈ శతాబ్దపు విషాదం…//
ప్రభుత్వం తీసుకొచ్చిన రైతువ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధానిలో పెద్దఎత్తున ఉద్యమం సాగింది. చివరకు ప్రభుత్వం దిగొచ్చింది. తాము ఎన్నుకొన్న ప్రభుత్వాలు తమ గొంతుకలనే కోయటాన్ని ఎంతో పదునుగా చెబుతున్నాడు.
వరికంకుల కలలు, బంగారు క్షణాలు, ధాన్యపురాశులు అంటూ రైతుజీవితాన్ని కళ్లముందు నిలిపి… అదంతా ఒక్క ఈవియం బీప్ సౌండ్ లో గల్లంతైంది అనటం గొప్ప శక్తివంతమైన అభివ్యక్తి.
***
ఈ కాలం
పచ్చిగాయాలు రేగిన
క్షతగాత్ర యవనిక
దీనికి ఒక సరికొత్త పాత పేరు
వికారి--- అనే వాక్యాల ద్వారా వగరు అనే కవితను ఒక ఉగాది కవితగా పోల్చుకోవచ్చును.
ఈ కవితలో వగరును రుచిరాజంగా ప్రకటిస్తాడు. ఆరింటిలో నాది వగరు దారి అంటాడు. వసంతపు గాలులన్నీ వగరుగా వీచాలి/పొద్దుటే కోకిలను వగరుగా కూయమని అడగాలి.. (వగరు) అంటాడు. చాలా చిత్రమైన ప్రతిపాదన. ఇంతవరకూ మనం విన్న ఉగాదికవితలలోకెల్లా విలక్షణమైన ఊహతో కూడుకొని ఉన్న కవిత ఇది. . ఇదే ఎమ్మెస్ కవితామార్గం.
***
చాన్నాళ్ళ క్రితం రాధేయ పురస్కారం కోసం అనంతపురం వెళ్ళాడు ఎమ్మెస్. సస్యశ్యామల కోనసీమనుండి కరువుప్రాంతంగా చెప్పబడే రాయలసీమకు ఒక కవి ఎలా వెళతాడు? అసలు ఎలా వెళ్ళాలి? అనేదానికి “మబ్బుల్లేని ఆకాశంలోకి… అనేకవితలో సమాధానం దొరుకుతుంది.
పక్షిలా వచ్చివాలాను! రెక్కలు దులిపాను!
ఏమో! రెండుదుక్కుల వానౌదామనుకొన్నాను
ఈ శప్తభూమిపై తప్త హృదయంతో దొర్లాలనుకొన్నాను//
గుండెలో గోదారి నింపుకొచ్చాను//
కార్మొయిళ్ళని దుస్తులుగా కుట్టించుకొని
ధరించి వచ్చాను
ఈ మట్టిపొరల్లోకి దూకి
వరికంకునై నాట్యమాడాలని వచ్చాను//
సంచిలో పట్టినన్ను మబ్బులేసుకొచ్చా… అంటాడు ఎమ్మెస్. ఇక్కడనుంచి నీటిని, నదులని పట్టుకెళ్ళాలని ఉంది అన్న ఊహే హృదయాన్ని కదిలింపచేస్తుంది.
***
చిత్రకొండ గంగాధర్ కవి, రచయిత. చెరువుగట్టుపై చెప్పులు, రాసుకొన్న డైరీలు విడిచి చెరువులోకి నడుచుకొంటూ వెళ్ళి ఆత్మహత్యచేసుకొన్న ధీరచిత్తుడు. ఈ సంపుటిలో ఎచటికి పోగలవు అనే కవిత చిత్రకొండ గంగాధర్ పై వ్రాసినది. ఈ కవితలోని శిల్పవిన్యాసం ఉత్కృష్టమైన స్థాయిలో కనిపిస్తుంది.
నిద్రిస్తున్న తటాకపు
రహస్యనీటిపొరల అరలు తెరిచి
చిత్రంగా ఎక్కడకు మాయమయ్యావు?— రాత్రిపూట, లోతైన చెరువునీళ్ళలోకి అదృశ్యమైపోయిన చిత్రకొండను ఒక దృశ్యంగా కళ్ళముందు నిలుపుతాడు.
చెరువుగట్టున ఆత్మదీపాన్ని వెలిగించి
ఎచటికి పోగలవు… ఒకానొక రాత్రి …. అంటూ కవిత ముగుస్తుంది. ఆత్మదీపం అంటే
అతను చెరువుగట్టున మిగిల్చిన డైరీలలోని సాహిత్యంగా భావించాలి.
గంగాధర్ కవిత్వాన్ని పత్రశకలం పేరుతో ఒక సంపుటిగా, మృతనగరం అనే ఒక నవలను నామాడి శ్రీధర్ పుస్తకరూపంలోకి తీసుకొని వచ్చారు. అలా సాహిత్య రూపంలో ఆత్మదీపంగా వెలుగుతున్నప్పుడు గంగాధర్ ఎచటికి పోగలడు?
***
వాచ్యంగా కాక శబ్దప్రధానంగా ఉండే కవిత్వాన్ని అందుకోలేని అరసికులతోను, రసజ్ఞతలోపించిన విమర్శకులతో ఎమ్మెస్ కవిత్వ యుద్ధం చేస్తున్నాడు చాన్నాళ్ళుగా. అలాంటి వారిని ఉద్దేసించి రాసిన “అజ్ఞానులు” అనే కవితలో
ఉంటారుంటారు! సర్వత్రా ఉంటారు…
ఉండాలి కూడా
రోడ్డుపై వేలాది బాతులు
వయ్యారంగా నడుస్తున్న అపురూప దృశ్యంలో
ఒక మోటారు బైకు నిస్సిగ్గు అసహన చక్రాలకింద పడి
అదాటుగా -నువ్వొక బాతై మరణించి
తిరిగి అక్షరమై లేచిన క్షణాల్లో
పుట్టుకొస్తారు వాళ్ళు!
నీ కస్సలు బోధపడని లెక్కలేవో పట్టుకొస్తారు
వాళ్ళుండాలి సుమా! ఉంటేనే నీ ఉనికి! -- అంటాడు
పై కవితలో చెప్పిన “ఒక మోటారు బైకు నిస్సిగ్గు అసహన చక్రాలంటే” ఏమిటి? మోటరు బైకు చక్రాలు అనొచ్చు కదా. నిస్సిగ్గు, అసహనం విశేషణాలు మన యాంత్రిక జీవనాన్ని సూచిస్తాయి. మన యాంత్రిక జీవనం మనం జీవించే క్షణాలను నిస్సిగ్గుగా, అసహనంతో చిదిమేస్తున్నదనే సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాడిక్కడ కవి.
ఒక అందమైన సంధ్య మనకు పట్టదు. చలం అన్నట్లు ఎవరా అమ్మాయి అని ప్రశ్నిస్తాం.
మన యాంత్రిక జీవన రణగొణల మధ్య మనచుట్టూ ఉన్న అనేక అనుభవాలకు మనం అంధులమై పోతాం, మోటార్ బైకు కింద పడే బాతులమై పోతాం. వాటిని ఎమ్మెస్ లాంటి సున్నిత హృదయులు పట్టుకొని, గొప్ప పదాలతో నిర్వచించి దివ్యత్వాన్ని అద్ది కవిత్వంలోకి తీసుకొని వస్తారు. ఉదాహరణకు-సస్యరహస్యం నింపుకొన్న పంటకాలువ, పున్నమిపడవ-సరంగు కవి, తమ అందంతో మూర్చలు ప్రసాదించే సీతాకోక చిలుకలు, పడవ సరంగు గెడపై అదాటున దర్శనమిచ్చిన పాలపిట్ట, గోవా మోహిని, చంద్రకలశం, చిమ్మచీకట్లో స్కూటీకి అడ్డుపడే తాబేలు, వర్షరుతు రాయభారి, పుప్పొడి దుప్పటి, పుణ్యక్షేత్రం ఒక రెక్కల లోకం – లాంటి అనేక వ్యక్తీకరణలు మనం అంధులమైపోయిన అలాంటి కొన్ని సందర్భాలను పునరుజ్జీవింపచేస్తాయి ఈ పుస్తకంలో.
***
అనువాదకులు వివిధ భాషలనుంచి సాహిత్యాన్ని అనువదించి పాఠకులకు అందిస్తారు. ఇతరభాషలలోని సాహిత్యాన్ని చదువుకోవటానికి అనువాదకుల సహాయం తప్పనిసరి. ఒక పాఠకుడు అనువాదకుల పట్ల చూపించాల్సిన ప్రేమ కృతజ్ఞతలు లోపలి ఆకాశాలు అనే కవితలో ఇలా అంటాడు ఎమ్మెస్.
ఈ నా హృదయాకాశంలోకి
ఎన్ని పక్షులు
తమ రెక్కల్ని అనువదించి
ఎన్ని ఆకాశాలను దులపరించాయో!
నా లోపలి మట్టిప్రమిదను తుడిచి
ఎన్నెన్ని తప్త దగ్ధ విశ్వగానాల ఘోషను
చమురుగా నింపాయో….
ఒక అనువాదకుడు ఒక పాఠకుని హృదయాకాశంలోకి ఎన్ని ఆకాశాలను దులపరించాడో అన్న ఊహే ఎంతో గాఢమైనది. అపూర్వమైనది.
***
జీవనగాథాకవిత్వం పేరుతో ప్రముఖుల జీవనరేఖలను కవితలుగా పోతపోయటం ఒక నూతన ప్రక్రియ కాకపోవచ్చు. అలా రాసిన కవితలు ఆయావ్యక్తుల జీవితాలలోని మంచి చెడులను అద్భుతంగా వ్యక్తీకరిస్తున్నాయి.
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పై వ్రాసిన కవిత శీర్షిక తపతి…శుభలక్ష్మి. సుబ్బలక్ష్మిని శుభలక్ష్మిగా సంబోధించటం ద్వారా పెద్దబొట్టుతో ఆమె నిండైన విగ్రహాన్ని కళ్ళముందు నిలుపుతాడు.
సదాశివమేనాడో చెక్కిన మరబొమ్మా// అనే వాక్యంలో ఆ సర్వేశ్వరుడు చెక్కిన బొమ్మ అనే అర్ధం పైకి తెలుస్తున్నా- తరచిచూస్తే సుబ్బలక్ష్మి భర్త అయిన సదాశివం ఆమెను ను ఒక మరబొమ్మలా ఆడించేవాడనే గాసిప్ కూడా ఇమిడిపోవటం ఎమ్మెస్ ప్రతిభకు తార్కాణం.
***
రాసిన ప్రతీదానికి సామాజిక ప్రయోజనం ఉండాలనీ, ఉంటేనే అది ఉత్తమ కవిత్వమనీ, లేకపోతే అది రెండో రకం కవిత్వం అని విమర్శకులు చేసే దాష్టీకం వల్ల ఆధునిక కవిత్వంలో భక్తి, తాత్వికత, శృంగార, నాస్టాల్జియా లాంటి అనేక కవిత్వ పాయలు దాదాపు ఎండిపోయాయి.
ముందుగా చెప్పుకొన్నట్లు ఎమ్మెస్ యోధుడు. చుట్టూ ఎంతో మంది అరసికులతో. రసజ్ఞత లోపించిన విమర్శకులతో యుద్ధం చేస్తున్నాడు. “పొయం ఉంది భయం లేదు” అని సంకల్పం చెప్పుకొన్నవాడు, మనకు ధైర్యం చెప్పినవాడు. అందుకనే భక్తి భావంతో వ్రాసిన శివవచనాలను ఈ సంపుటి చివరలో చేర్చాడు. సమకాలీన కవిత్వ సంపుటులలో భక్తి కవితలకు స్థానం కల్పించటం యోధత్వం కాక మరేమిటి? మన తెలుగు విమర్శకులు మిస్టిక్ కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఏమి ఉంది అని నిస్సిగ్గుగా ప్రశ్నించగలరు కానీ, ప్రపంచవ్యాప్తంగా రూమీ కవిత్వం, అక్కమహాదేవి వచనాలకు ఎందుకు ఆదరణ లభిస్తోందో కనీసం ఊహైనా చేయరు.
పొత్రంలో ఉంటావు
బరువుగా!
పత్రంలో
తేలికగా!
నువ్వు
బరువా?
తేలికా?
ఈ శివవచనం శివుడిని ఉద్దేశించినదైనా, అది ఎమ్మెస్ కవిత్వానికి కూడా అన్వయించుకోవచ్చు.
***
ఎమ్మెస్ కవిత్వం ఎన్నడూ వాచ్యంగా ఉండదు. ఎమ్మెస్ ఏనాడూ ఎంగిలి ప్రయోగాలు చేయలేదు, డెడ్ మెటఫర్స్ వాడలేదు. ఏం చెప్పినా నవ్యంగానే చెప్పాడు, సొంతస్వరంలోనే రాసాడు. కవిత్వం అనేది ధ్వన్యాత్మకంగా, ప్రతీకాత్మకంగా మాత్రమే చెప్పాలని కంకణం కట్టుకొని మూడు దశాబ్దాలుగా కవిత్వాన్ని వెలువరిస్తున్నాడు. ఇతనిది జీవనానుభవాల కవిత్వం. కవిగా ఎమ్మెస్ నిజాయితీపరుడు. తాను చూచినది, తాను అనుభవించినది మాత్రమే కవిత్వంలోకి తీసుకొని వచ్చాడు. తన అనుభవానికి వెలుపల ఉన్నదానిని ఏనాడూ స్పృశించలేదు.
ఇక చివరగా ---
జీవితం
కిటికీపై
వాలిన పిట్ట
ఎగిరిపోయేలోగా
మిగిలిపోయే
నేనొక అనుభూతి…
రామో విగ్రహవాన్ ధర్మః అంటే ధర్మానికి ఒక ఆకారాన్ని ఇస్తే అది రాముడు అని అర్ధం. అదే రీతిగా, అనుభూతికి ఒక ఆకారాన్ని ఇస్తే ఎమ్మెస్ కవిత్వం అని అర్ధం చెప్పుకోవచ్చు. అందుకనే జీవితం కిటికీ పై వాలిన పిట్ట ఎగిరిపోయేలోపు నేనొక అనుభూతిగా మిగిలిపోతాను అని ప్రకటించుకొన్నాడు- మనకున్న గొప్ప కవి శ్రీ ఎమ్మెస్ సూర్యనారాయణ.
బొల్లోజు బాబా






Wednesday, March 23, 2022

శ్రీ అల్లూరి రామరాజు గురించిన ఆనాటి వార్తా కథనాలు

 శ్రీ అల్లూరి రామరాజు గురించిన ఆనాటి వార్తా కథనాలు

.
1924 మే నెల 7 వ తారీఖున శ్రీ రామరాజు దొరకలేదు; అగ్గిరాజు దొరికాడు; రామరాజు గాయపడి ఉండవచ్చు... అంటూ మే 9 వ తారీఖున వచ్చిన మొదటి వార్త తప్పు కావొచ్చు. అప్పుడే రామరాజు దొరికిపోయి, పోలీసుల చేత ఎన్ కౌంటర్ కాబడి ఉండవచ్చును.
ఎందుకంటే మే 16 వ తేదీన పోలీసులు విడుదల చేసిన మరొక వార్తలో-- మే 7 వ తేదీన పట్టుబడి, పారిపోవటానికి ప్రయత్నించినందుకు శ్రీ రామరాజుపై కాల్పులు జరిపి చంపివేసి; 8 వ తేదీన దహనం చేసేసాం అని ఉంది.
అరెస్టు కాబడిన వ్యక్తి పారిపోవటానికి ప్రయత్నించగా ఎన్ కౌంటర్ చేసేసాం అనటం ఎంత చక్కని పౌరాణిక కథ.
బొల్లోజు బాబా











Monday, March 21, 2022

ఒకనాటి రెండు మంచి నాటకాలు.....

 ఒకనాటి రెండు మంచి నాటకాలు.....

.
మా నాన్నగారి పేరు శ్రీ బొల్లోజు బసవలింగం. 10 జూలై, 1932 న జన్మించారు వీరు 16 సంవత్సరముల ప్రాయంలో రచించిన "రాణిదుర్గావతి" అనే పద్యకావ్యం పలువురి పండితుల ప్రశంసలు పొందింది. ఎవరు దోషి, వారసుడు, రాధామాధవం, త్యాగజ్వాల, కర్తవ్యం, నిజం దాగదు, సతీ అహల్య, బాగుపడాలంటే, శ్రీకృష్ణ రాయబారం వంటి నాటకాలను రచించారు. డా. అంబేద్కర్ రచనలను కొన్నింటిని అనువదించారు. సువర్ణశ్రీ కలం పేరుతో రచనలు చేసారు. 25 ఏప్రిల్ 2004 న పరమపదించారు.
ఈ మధ్య ఆర్చైవ్ ఆర్గ్ లో పాత పత్రికలు వెదుకుతూంటే ఆంధ్రజ్యోతి 1967, జూలై 16 నాటి పత్రికలో "మూడు మంచి నాటకాలు" పేరుతో ఒక సమీక్షాకథనం కనిపించింది. వాటిలో రెండునాటకాలు మా నాన్నగారు సువర్ణశ్రీ పేరుతో రచించిన వారసుడు, ఎవరుదోషి నాటకాలు (మరొకటి రెంటాల గోపాలకృష్ణ గారి రజని నాటకం).
చాలా ఆనందంగా, గర్వంగా అనిపించింది చదివినపుడు.
***
.
మూడు మంచి నాటకాలు
.
వారసుడు, ఎవరు దోషి
రచన "సువర్ణశ్రీ" అనే కలం పేరుగల బొల్లోజు బసవలింగం, వెల: ఒక్కొక్కటి రెండురూపాయలు, ప్రచురణ, విజిఎస్. పబ్లిషర్స్, అమలాపురం.
***
కాంతాన్ని మినహాయించినా, కనీసం కనకం కోసం మనిషి ఎంత నైచ్యానికి దిగజారగలడో రెండురంగాలకు విస్తరించిన వారసుడు నాటకం వ్యక్తం చేస్తున్నది. స్త్రీ పాత్రలు లేకుండా శ్రీ "సువర్ణశ్రీ" రచించిన ఈ నాటకంలో డబ్బుకోసం మనిషి ఎంత హేయానికి పూనుకోగలడో పూర్తిగా నిరూపించారు.
తాము వారసులు కాకపోయినా, ఒక ధనవంతుడు తన అవసాన దశలో చేసిన ఒక ప్రకటన ఆధారంగా బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు మూగుతారు కొందరు. అతని ఆస్తిపాస్తులు కోసం ఆ ధనవంతుని చావుకోరుకోవడమే కాక, అందుకు వారు స్వయంగా ప్రయత్నిస్తారు కూడా. చివరకు తన మిత్రుని సలహాతో తాను అప్పులతో తలమున్కలై ఉన్నట్లు ధనవంతుడు వెల్లడించి, తనకు ఆశ్రయం కోఱగానే అందరూ నిష్క్రమిస్తారు. నౌకరుగా చేరినా ఆ తాత మనుమడు చిరంజీవి తన సుగుణసంపత్తిచే తాత హృదయాన్ని చూరగొని కథానాయకుడావుతాడు. ఈ నాటకం వెనుక కులాలు, మతాలు కంటే మానవత్వమే మిన్న అనే ముఖ్యమైన అంశం నిలిచి వుంటుంది. రచన వ్యంగ్యాత్మకంగా, హాస్యస్ఫోరకంగా కొనసాగుతుంది.
శ్రీ సువర్ణశ్రీ రచించిన మరొక నాటకం "ఎవరుదోషి" కనకానికి ఆశించి దేశద్రోహానికి పాల్పడి, స్వీయ కాంత చేతిలో నిహతుడయిన యువ సైంటిస్ట్ ను పరిచయం చేస్తుంది. సైంటిస్ట్ నరసింహరావు భార్య నిర్మల పాత్ర ఆదర్శప్రాయమైనట్టిది. ద్వితీయరంగంలో ఆమె పాత్ర ధీరోదాత్తమవుతుంది. నరసింహారావును హత్యచేసినదెవరో పోలీస్ ఇన్ స్పెక్టరు జయరామ్ కూపీతీసే సందర్భంగా రచన పగడ్బందీగా సాగినది. ముఖ్యంగా హత్యసమయంలో ప్రయోగించిన "టెక్నిక్" కు రచయిత అభినందనీయులు.
కాగా, ఈ రెండు నాటకాలలో కూడా ఒక పాత్రధారి పూర్తిచేయవలసిన వాక్యాన్ని మరొక పాత్రధారి అందుకొని పూర్తిచేయడం కనిపిస్తుంది. ఉత్తమమైన నాటక రచయితగా శ్రీ సువర్ణశ్రీ ఖ్యాతి గాంచగలరని, ఈ రెండు నాటకాల రచనావిధానం చెప్పకయే చెబుతున్నది
--- ప్రాచేతస
ఆంధ్రజ్యోతి 1967, జూలై 16








Thursday, March 17, 2022

Historical narratives .. some thoughts

 చరిత్రకు సంబంధించి సత్యాసత్యాలను పక్కన పెడితే కాలనాళికలో పడిన గతం కథనాలుగా మిగిలిపోతుంది.

.
ఆర్యులు అనార్యులు అనేది ఒక కథనం.
తెల్లవారందరూ దోపిడీ దారులని చెప్పటం ఒక కథనం
మతపరమైన జెనోసైడ్ జరిగిందనటం మరో సక్సెస్ ఫుల్ కథనం
.
ప్రజలను పోలరైజ్ చేయటం లక్ష్యంగా ఉన్నప్పుడు... తదనుగుణంగానే చారిత్రిక కథనాలు నిర్మించబడతాయి.
ఏ కథనం ఏ వర్గానికి ఉపయోగపడుతుందో వారు దాన్ని నెత్తికెత్తుకొంటారు. ప్రచారం చేస్తారు తమ తమ ప్రయోజనాలు సాధించుకొంటారు.
బొల్లోజు బాబా

Tuesday, March 15, 2022

రెప్పవాలనివ్వని కవిత్వం

 ఈ రోజు కాకినాడ సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో శ్రీమతి దొండపాటి నాగజ్యోతిశేఖర్ రచించిన "రెప్పవాల్చని స్వప్నం" కవితాసంపుటి ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తకాన్ని శ్రీ మార్నిజానకిరామ్ గారు ఆవిష్కరించగా, శ్రీమతి పద్మజావాణి, డా. జోశ్యుల కృష్ణబాబుగారు విశ్లేషించారు. ఈ సభకు శ్రీ గనారా గారు అధ్యక్షత వహించారు.

***
.
రెప్పవాలనివ్వని కవిత్వం
.
"రెప్పవాల్చని స్వప్నం" పుస్తకం ద్వారా తెలుగు కవిత్వప్రపంచంలోకి సత్తువకలిగిన వాక్యాన్ని రాయగలిగే కవయిత్రి ప్రవేశించారు.
శ్రీమతి దొండపాటి నాగజ్యోతిశేఖర్ కవిత్వపు పలుకు విభిన్నమైనది. వాక్యవాక్యానా నింపిన మెటాఫర్ కొత్తగా ఉంటోంది. కవిత ముగిసే సరికి గాఢమైన ఉద్వేగం హృదయాన్ని బలంగా తాకుతుంది.
.
నువ్వెళ్ళిపోయాకా ... అనే కవితలో
నువ్వెళ్ళిపోయాక
తేనెపిట్ట ఒకటి పూర్తిగా రాని రెక్కలతో
పొడి ఎదమైదానంలో ఎగరాలని చూస్తున్నది.
సగం విరిగిన కాళ్ళతో స్వప్నాలు
చీకటిని దాటాలని పరిగెడుతున్నాయి.
దిగులు తీతువు ఉండుండి
విసుగురాగం పాడుతుంది.//
అసలు నీతో పరిచయమే లేనికాలం ఎంత తెల్లగా ఉండేది
ఏ భావోద్వేగజ్వాలలూ
ఏ కన్నీటిజాలూ లేని
నిశ్చల నిశ్శబ్దం.
నీ మిణుగురురెక్కల్ని
స్పృశించానో లేదో
వేళ్లకు అంటుకొన్న వెన్నెళ్ళను
విదిలించడం నా వల్ల కాలేదు.
పదం పదంగా నువ్వు కురుస్తుంటే
ఆ చిత్తడిలో మొలుస్తూ నేను//
నువ్వెళ్ళిపోయావు సరే
నేనేంటి
అక్షరమై పుట్టటం మొదలెట్టాను.
.
వియోగ క్షణాలన్నీ కవిత్వంగా మారుతున్నాయి అన్న వస్తువును ఎంత అందంగా, శక్తివంతంగా చెబుతున్నారు నాగజ్యోతి.
కాలం తెల్లగా ఉండటం, వేళ్లకు అంటుకొన్న వెన్నెలల్ని విదిలించలేకపోవటం, రెక్కలు పూర్తిగా రాని తేనెపిట్ట లాంటి వ్యక్తీకరణలు- ఈ కవి చేయబోయే సుదీర్ఘ సాహితీయానాన్ని నా కళ్ళకు కనిపింపచేస్తున్నాయి.
దాదాపు ఇలాంటి వస్తువే ... "మొగ్గ విచ్చుకొంటున్న చప్పుడు" అనే కవితగా పోతపోసుకొంది...
.
గాయాలరాత్రిని భుజానవేసుకొని
గేయఉదయమొకటి ప్రసవించాలని
మౌనతోటలోకి ప్రవేశించా//
// ఇప్పుడు నేను వేకువ శృతుల్ని
భుజాన ఎత్తుకొని
కాంతి పక్షుల్ని ఎగరేస్తూ
కవిత్వపుతోటలో
ఆగని పాటనై ప్రతిధ్వనిస్తున్నా
నా చుట్టూ పచ్చగా నవ్వుతూ
వేల వికసిత మస్తిష్కసుమాలు
ఈ కవయిత్రి బలం నవ్యమైన మెటఫర్లని అలవోకగా సృష్టించగలగటం. ఇది అనేక కవితలలో చూడొచ్చు.
పై కవితలో మరోచోట--
ఓ పద్యపుమొగ్గ
భావపరిమళమద్దుకొని
అల్లనల్లన విచ్చుకొంది---అంటారు. ఆ ఊహాశాలిత ఆశ్చర్యపరచకమానదు.
***
ఈ సంపుటిలోని నాకు బాగా నచ్చిన రెండు కవితలు
ఆమెనో వాక్యంగా రాయాలనుకున్నప్పుడల్లా
ఆమె ఓ నదై వేళ్ళసందుల్లోంచి జారిపోతుంది
పొట్లంచుట్టిన పూలవానై మాయమౌతుంది
ఆకాశాన్ని మోసే ఆమె చేతులను అందుకొని కరచాలనం
చెయ్యాలనుకున్నప్పుడల్లా
ఆమె ఓ వేసవిపాటై సాగిపోతుంది
కరగని మేఘమై కన్నీటికోక చుట్టుకొని దాగుంటుంది//
దుఃఖసంద్రాన్ని నొక్కిపెడుతున్న ఆమె పాదాలను
ముద్దాడాలనుకున్నప్పుడల్లా
ఆమె ఓ నెత్తుటి కావ్యమై జనిస్తుంది
తడుస్తున్న నా ఎదకు ఓ ఓదార్పుగీతం పూసి
వీడ్కోలు పలుకుతుంది// ---- వాఖ్యానం అవసరం లేదు. కవిత మొత్తం తేటగా, లోతుగా, పారదర్శక సరోవరంలా ఉంది.
***
.
ఆ ఒక్కటే
అవును నీ బలమంతా నీ పుట్టుకలోనే ఉంది
పుడుతూనే అహం నీకోట
అణచివేత నీ మొదటిమాట.
నీ బలమంతా నీ పుట్టుకలోనే ఉంది
నీ నెత్తురు కొడవలిగా మారి లేడి కుత్తుకలు తెంచుతుంది//
చమటవాసన నీకు బానిస
నీ బలం
ఆకలిని చెట్టుకు కట్టేసి చంపుతుంది//
నీ బొడ్డుతాడుకోసిన దాసీ
నిన్నెత్తుకున్న నిరుపేద భుజాలు
నీ సంపద పెంచిన నెత్తుటిచుక్కలూ
నీ కాళ్ళకు చెప్పులైన చీల్చబడ్డ చర్మాలూ
నీ కసువుని ఊడ్చి బొబ్బలెక్కిన చేతులు
నీ దాహం తీర్చిన దేహాలూ
పుట్టుకలోనే బలహీనమవ్వటం
నీ బలమైంది
అవును నీ బలమంతా
నీ పుట్టుకలోనే ఉంది --- (ఆ ఒక్కటే)
చాలా శక్తివంతమైన కవిత. కొన్ని కులాలకు పుట్టుకతో వచ్చిపడే సోషల్ కాపిటల్ ని అర్ధవంతంగా వ్యక్తీకరించిన కవిత ఇది. వాడి బలం వాడి పుట్టుక అయితే వీడి పుట్టుకే వీడి బలహీనత కావటం సమకాలీన సామాజిక దొంతరల విషాదం.
***
.
నాగజ్యోతి గారి కవిత్వ వ్యక్తీకరణ సామాన్యమైనది కాదు. చాలా విలక్షణమైన, శక్తివంతమైన అభివ్యక్తి ఈమెది. కొన్ని కవితలలో వస్తువుని శిల్పం మింగేయటం గమనిస్తాం. ఆ మేరకు శ్రద్ధతీసుకోవాల్సి ఉండొచ్చు.
ఈమె సాహిత్య ప్రస్థానం భవిష్యత్తులో మరిన్ని ఎత్తులకు ఎదగాలని, ఎదుగుతుందనే నమ్మకం నాకు ఉంది.
కొత్త కవిత్వ సంపుటి తెస్తున్నందుకు అభినందనలు. సాహితీ ప్రపంచానికి సాదరాహ్వానం పలుకుదాం.
బొల్లోజు బాబా








Thursday, March 10, 2022

అభినందనలు

 అభినందనలు

తమ్ముడా.....అని ఆశీర్వదించే అన్నగారి వాత్సల్యానికి సదా వినమ్రచిత్తుడను.....
ధన్యవాదములు సర్... మీ ప్రేమపూర్వ ఆశీస్సులకు... ఈ నాలుగువాక్యాలు చాలా విలువైనవి,
మా నాన్నగారి ప్రస్తావనను గుండెల్లో దాచుకొంటాను...
Madhunapantula Satyanarayanamurthy గారికి ధన్యవాదములతో
బొల్లోజు బాబా
****
పద్యం.
తెలుగున వేళ యేండ్లుగ గతించిన గాథలపెంపు కొండ గు
ర్తుల పెనుగుంపు గాని 'యిది రూఢిగ నిట్టిది"నాగ దెల్ప నె
వ్వలన నసాధ్య, మైన నొకపాటి చరిత్రము నేడు నేర్పుదీ
ర్పుల బరిశీలకుల్ తడవి ప్రోవులు వెట్టిరి పుణ్య బుద్ధులై.
తెలుగు నేలలో వేల సంవత్సరాల కథల అభివృద్ధి సాధారణ మైన గుర్తులు యొక్క పెద్ద గుంపు మాత్రమే. ఇది ఇటువంటిది. దీనిపుట్టుక ఇది అని చెప్పడానికి వీలు కానిది. ఐనా ఒకపాటి చరిత్రను పరిశీలించారు కొందరు పుణ్య బుద్ధులు.
ఇది ఆంధ్రపురాణం అవతారిక లో సత్యనారాయణ శాస్త్రి గారి అభిప్రాయ ప్రకటన.
కొందరు పుణ్య బుద్ధులై న వారివల్ల చరిత్ర నమోదై భవిష్యత్తరాలకి అందుతోంది.
చరిత్ర రచన మామూలు సంగతి కాదు. అధ్యయనం చేయాలి. ఆకళింపు చేసుకోవాలి. వ్యక్తిగతమైన ప్రేమలూ పక్షపాతాలూ పక్కన బెట్టాలి.
ఇంతా చేసాక తారీఖు లు, దస్తావేజులు, శాసనాలూ, కైఫియతులూ గా రచన చేస్తే చప్పగా వుండి చదివేవాడు చప్పున పక్కన పెట్టేస్తాడు.
ఇదంతా ఎందుకంటే బాబా అనగా బొల్లోజు బాబా ఇటీవలే ప్రచురించిన ప్రాచీన పట్టణాలు (తూర్పుగోదావరి జిల్లా) గ్రంథం.
అతడు ఎప్పటిలాగే తనరచన ప్రేమతో ఇచ్చారు.
ఆసక్తి కరమైన శైలి బాబాది. ఇలాంటి రచన చదవాలంటే శైలి ముఖ్యం. కవిత్వ భాష తెలిసిన బాబాకి శైలెందుకు తెలియదు.?
నేను పుట్టిన ఊరు పిఠాపురం. మాతామహస్థానం.
ఎప్పటి నుంచో దీని చరిత్ర, నేపథ్యం లాంటి వి తెలుసుకోవాలనే ఆసక్తి. చిన్నప్పుడు మేనమామ లతో సన్యాసిరాళ్ల సంగతులు. కుంతీమాధవ, కుక్కుటేశ్వరుల సంగతులు గుర్తొచ్చింది. ఎంత పౌరాతన్యమేచికొనెనో తెలియచెప్పిన బాబా కి థాంక్స్.
శాతవాహన, మాధరులు పరిపాలన చేసిన సంగతి తెలియని తెలియదు. నాకు పిఠాపురం చరిత్రంటే గంగాధర రామారావు గారి పిఠాపురం చరిత్రే. అదికూడా కవిజన పోషకుడు ఆంధ్రభోజుడు సూర్యారావు బహద్దూర్ గారి నుండే తెలుసు వీరి ఆస్థానకవి ఓలేటి వేంకట రామశాస్త్రి గారు
రాజా వారి సంగతులు మా ముత్తాత గారి సంగతులు ఆనాటి సాహిత్య వైభవం పెద్దల వల్ల వినడమే.
బాబా నిజానికి సైన్స్ రంగానికి చెందిన వాడు. ఆతని ప్రాధాన్యత, పరిశీలన చరిత్ర కి సంబంధించినది.
బాబా తండ్రి గారు బసవ లింగం గారు మంచి కవి, రచయిత, ఫ్రెంచి పండితుడు. నాకు ఆత్మీయ మిత్రుడు. ఆయన దగ్గర ఫ్రైంచ్ నేర్వాలని వుండేది.
రాజీ ధోరణి కాకుండా దీక్ష తో పట్టుదలతో పుణ్య బుద్ధితో
రచించారు.
అభినందనలు
తమ్ముడా.
Madhunapantula Satyanarayanamurthy



Tuesday, March 8, 2022

The Orange - Wendy Cope

 The Orange - Wendy Cope

.
అల్పాహార సమయంలో
ఒక పెద్ద కమలాపండు కొన్నాను
దాని సైజు చూసి అందరూ నవ్వారు
తొక్క వలిచి రాబర్ట్ కి, దేవ్ కి పంచి
నేను తిన్నాను
వారికి చెరో పావు, నాకు సగం
చిన్నచిన్న విషయాలు నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి
ఆ కమలాపండు ఇచ్చినట్లు.
సాయింత్రమయ్యాకా కొద్దిగా షాపింగ్ చేసాను
పార్క్ లో కాసేపు నడిచాను
ఇదే శాంతి, ఇదే సంతృప్తి.
ఆ రోజంతా నిమ్మళంగా నడిచింది
నేను చేయాల్సిన పనులన్నీ ఆస్వాదిస్తూ పూర్తిచేసాను
ఇంకా కొద్దిసమయం మిగిలింది
జీవించి ఉన్నందుకు సంతోషం
నీ ప్రేమకు ధన్యురాలను
.
Source: The Orange by Wendy Cope
అనువాదం: బొల్లోజు బాబా

పెన్నా సాహిత్య పురస్కారం 2020

 పెన్నారచయితల సంఘం వారు ప్రతి ఏటా ఇచ్చే పెన్నా సాహిత్య పురస్కారాన్ని 2020 సంవత్సరానికిగాను నేను రచించిన "మూడో కన్నీటి చుక్క" కవిత్వ సంపుటానికి ప్రకటించారు. ఈ అరుదైన గౌరవానికి పాత్రుణ్ణి చేసిన పెన్నారచయితల సంఘం వారికి కృతజ్ఞతలు.

18 డిసెంబరున ఏర్పాటు చేసిన వారిసభకు నెలకొని ఉండిన పరిస్థితుల కారణంగా ప్రయాణాలు చేసే ధైర్యం సరిపోక వెళ్ళలేకపోయాను. వారికి క్షమాపణలు చెప్పుకొన్నాను.
నెల్లూరు, పెన్నారచయితల సంఘంవారు నా కొరకు తయారుచేసిన మెమెంటో, అభినందనపత్రం, శాలువాలను ఈరోజు కాకినాడ వచ్చిన డా.సుంకర గోపాల్ ద్వారా అందచేసారు.
సభకు వెళ్లకుండా వాటిని తీసుకోవటానికి సిగ్గుగా అనిపించినా, వారి అభిమానానికి, ప్రేమకు నేను పాత్రుడిని కావటం చాలా సంతోషంగా అనిపించింది.
శ్రీ మోపూరు పెంచల నరసింహం, శ్రీ అవ్వారు శ్రీధర్ బాబు, శ్రీమతి తోట సులోచన, శ్రీ సుంకర గోపాల్ మరియు కార్యవర్గం అందరకూ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.
సన్మానపత్ర రచన చేసిన శ్రీ నల్లు రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదములు.
ఇప్పుడిప్పుడే ప్రపంచం కలుగులోంచి బయటపడి సమూహాల్లోకి తెరుచుకొంటోంది... వీరందరినీ భౌతికంగా కలిసే అవకాశం భవిష్యత్తులో కలుగుతుందంది ఆశిస్తున్నాను
భవదీయుడు
బొల్లోజు బాబా




Saturday, March 5, 2022

‘కవిత్వ భాష’లో విహారయాత్ర (Book Review)

thank you Lenin Babu gaaru

మీ క్లోజ్ రీడింగ్ కు థాంక్యూ అన్నమాట చాలా చిన్నది. మీ పఠనాశక్తి గొప్పది. ఈ నాలుగు ప్రశంసాపూర్వక వాక్యాలకు ధన్యుడను
ఈ పుస్తకాన్ని ఇక్కడనుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును https://archive.org/details/kavithva-bhasha-by-bolloju-baba


భవదీయుడు
బొల్లోజు బాబా


.
‘కవిత్వ భాష’లో విహారయాత్ర

“చాలా కాలం తరువాత ఒక పుస్తకంలోకి దూకి ప్రతీ పదాన్నీ కౌగిలించుకుంటున్నాను…ఒడ్డుకు చేరాక ఇంకోసారి మిమ్మల్ని పలకరిస్తాను ” అని శ్రీ బొల్లోజు బాబా గారికి facebookలో కామెంట్ పెట్టాను…దానికి పూర్వరంగం ఏమిటంటే, “కవిత్వ లక్షణాలు ఏమిటి?…కవితాత్మక గద్యానికీ, కవిత్వానికీ తేడా ఏమిటి?…ఈ రెంటినీ గుర్తించటం ఎలా?…” అని నేను facebookలో అడిగిన ఒక ప్రశ్నకి వారు ఈ పుస్తకం పంపి, అందులో ఫలానా చోట మీ ప్రశ్నకి సమాదానం లభిస్తుంది అని చెప్పటం…నేను పుస్తకంలో వారు చెప్పిన భాగం చదివి తక్షణ స్పందనగా పై కామెంట్ పెట్టాను… పుస్తకం చదివాక,వారికి కృతజ్ఞతగా ఈ పోస్టు రాయకుండా ఉండలేకపోయాను…

సామాజిక మాధ్యమాలలో ఒకరి వీపు ఒకరు చరుచుకుంటూ ఉండే కవికూటములలోని కవుల లక్షణం బొల్లోజు బాబాగారికి  లేదు అని అనిపిస్తోంది …పొగడ్తలు ఆశించే చోట ప్రశ్నలు ఎదురైతే,చూసీ చూడనట్టు తప్పుకుపోవటమో, ప్రశ్న వేసిన వారిని ‘మీ తలం వేరు, మా తలం వేరు’ అని జవాబు ఇచ్చినట్లే ఇచ్చి,అసలు ప్రశ్నకి జవాబు దాటవేసి తమ భద్రజీవితపు బావులలోకి మునిగి పోవటమో వీరు చెయ్యలేదు …ఒక పాఠకుడికి మేలు చేసే సంకల్పాన్ని చూపించారు… సులక్షణాలు లేకుంటే, అభినందిస్తూ నెత్తిన ప్రేమతో నిమిరినా, మొట్టికాయలూ వెయ్యటానికి  మొహమాటపడని శ్రీ రెంటాల వెంకటేశ్వరరావు గారిని ఈ పుస్తకంలోకి పెద్దపీట వేసి ఆహ్వానించి ఉండేవారు కాదు …ఆ నిజాయితీతో కూడిన  ఒద్దిక నాచేత వీరికీ, వారికీ  నమస్కారం చేయించింది…వారి మధ్య అవ్యక్త గురుశిష్య భావనా వీచికలు నా  హృదయానికి వెచ్చదనపు హాయినిచ్చాయి…’కవిత్వ భాష’లో నా విహార యాత్రకి ఆత్మీయంగా పొద్దు పొడిచింది…

బాలుడినైన నన్ను చెయ్యి పట్టి నడిపించే కవిత్వ గైడ్ లాగా అనిపించారు శ్రీ బొల్లోజు బాబా…

ఒక గదిలో కొండేపూడి నిర్మలగారు ‘మేకులు వంగాయి’ అంటుంటే, ‘మేకులే వంగితే, మానవ హృదయం ఎంత?’ అని గుసగుసలాడారు నా విభ్రమం సంబ్రమంగా మారేటట్టు…

ఇంకాస్త ముందుకు నడిపించి కరెన్సీ నోటులో కత్తిని చూస్తున్న అలిశెట్టి ప్రభాకర్ గారి చూపులో నా చూపుని సంలీనం చేయించారు…

అడవిలో చెట్టు దుంగల్లో తల లేని మొండాలను చూపించే అరణ్యకృష్ణ గారి ఆవేదనా ప్రకంపనలకు నా  హృదయాన్ని శృతి చేశారు…

ఒక చోట పాటిబండ్ల రజని గారు మనస్సు ఇంకిపోయే మందుకై తపించడాన్ని చూపించారు…

ఎండ్లూరి సుధాకర్ గారు తమ గుప్పిట్లో దాచుకున్న బొటనవేలిలో, దాచేస్తే దాగని  వివక్షాచరిత చీకటిలా విస్ఫోటించడాన్ని విప్పార్చిన నా కళ్ళకు సాక్షాత్కరింపచేశారు …

కొందరు పుట్టుకతోనే కొన్ని పుట్టుమచ్చల అమానవీయ బరువును మొయ్యవలసిన పరిస్థితిని చూపించే ఖాదర్ మోహిద్దీన్ గారిని పరిచయం చేశారు…ఇంకొన్ని అడుగులు వేశాక, ఇస్మాయిల్ గారు ఎండా, నీడలతో చిత్రించిన ఆకుని పరిశీలించమన్నారు…

అంతలో,తనంటే ఇష్టపడే పాపని ఎత్తుకున్న వానై వచ్చిన తెలుగు వెంకటేష్ గారిలో తడిచేలా చేశారు…

ఆ తరువాత మండే గుండెతో ఉన్న కలేకూరి ప్రసాద్ గారి ఎగిరే ధిక్కార పతాకంలా ఉన్న కవిత్వాన్ని తలవంచి చదవమన్నారు…

కాస్త ముందుకు కదిలి, అత్యాచార బాధితురాలికి ధైర్యాన్ని కలిగిస్తూ కవన ఖడ్గం అందించే కె.క్యూబ్ వర్మ గారిని చూపిస్తూనే, నగలు పెట్టుకుని నడిచే గాయాలని చూపించే కొండేపూడి నిర్మల గారినీ వినమన్నారు…

జయప్రభ గారు, జూపాక సుభద్ర గారు పైట/కొంగు ని చూసిన విధానాన్ని తరిచి చూపిస్తూ, శవపేటికలను తుపాకులతో కొలిచి తాలిబన్లపై కాల్పులు జరిపిన అనంతు గారినీ  చూపించారు…

చూపుడు వేలినుండి వెలిగించే ఖడ్గాలను మొలిపించిన సరికొండ నరసింహ రాజు గారిని, పిల్లలను నీలిగోళ్ళ దగ్గరితనం గురించి హెచ్చరించే నిరంతర గారిని, గతాన్ని చదివించే కొప్పర్తిగారినీ,తరాల పాటు స్థిరంగా ఉన్న  కుడి ఎడమలని తిరగేస్తున్న శివసాగర్ గారినీ చూపించారు…

కొంచెం ముందుకు నడిచి చీకటి చరిత్ర మీద చెరగని వెలుగు పాదముద్రలతో నడుస్తూ మినుములు మొలిపిస్తున్న  శిఖామణి గారినీ,కూలీలు వేసుకున్న స్వేదబిందువుల దండలను చూపించే గుంటూరు శేషేంద్రశర్మ గారినీ చూశాను…

ఆ పక్కనే,రాత్రి వేళ మిణుగురుల సంగీతాన్ని వాయించే సూర్యుడిని చూపించే డాక్టర్ ఎన్.గోపి గారు, ప్రతీ మనిషీ ఊరికొయ్యే అని ఉచ్చ స్వరంలో అరుస్తున్న భగ్వాన్ గారు, పిడికిలి బిగించి, “నాక్కొంచెం నమ్మకమివ్వు” అంటున్న ఆలూరి భైరాగి గారూ  కనపడ్డారు…

అక్కడినుండి సముద్ర తీరానికి వస్తే , “ఈ సముద్రపు నీరు ఇంత ఉప్పగా ఉందేమిటి?ఈ జలసానువుల మీద తెల్లగుడ్డ కప్పింది ఎవరు?”అని నిలదీస్తూ సిరికి స్వామినాయుడు గారు కనిపించారు…

అటుచూస్తే, దేవుని కన్నీళ్లను తుడుస్తున్న తిలక్ గారు… ఇటు చూస్తే, పాపుల్ని కరుణించేవరకూ నువ్వు నిదురించవు కదా అని ప్రపంచీకరణపై వక్రోక్తులు విసురుతూ అద్దేపల్లి ప్రభు గారు కనిపించారు…

సముద్రాన్నే,ఆస్తి అనుకున్న ఏమీలేని అమాయకపు అమ్మని చూపిస్తూ ఎం.వెంకట్ గారు,కాగితాలపై పెరిగే అభయారణ్యాల గుట్టుని పట్టిస్తూ యశస్వి సతీష్ గారు, పొలాలకు తాళాలు వేస్తూ దర్భశయనం శ్రీనివాసాచార్య గారు సంచలిస్తున్నారు…

అంతేనా,స్వీట్ డిస్టర్బెన్స్ మధ్య పాఠాలు చెబుతూ గోదావరి శర్మ గారు, కనుకొనుకులలో నిప్పుకణికలతో ఎదురుచూస్తూ నారాయణస్వామి గారు, ఏమీ లేకపోవటాన్ని కాపలా కాస్తున్న హెచ్చార్కే గారు, వానలకు తడిసిన కొన్ని ఎండలను చూపిస్తూ త్రిపురనేని శ్రీనివాస్ గారు మనస్సులో అలజడి రేపుతూ కనిపించారు…

వీటన్నిటి మధ్యలో నా చేతులు తన చేతుల నుండి విడివడిన క్షణాలూ,జతపడిన క్షణాలూ ఉన్నాయి… ఇమేజరీ,సినక్డకి,అల్లిగొరి మొదలైన తూకపు రాళ్ళు నా హృదయంలో పెడుతూ భుజం తడుతూ శ్రీ బొల్లోజు బాబా నన్ను ముందుకు నడిపించారు…

 భూగోళానికి అటూ ఇటూ ఉన్న కవులు చేసిన కృషినీ, పూర్వపు సిద్ధాంత  తరకలను రుచి చూపించారు…వాటి నడుమ సామ్యాల, వైవిధ్యాల  అధ్యయన సారాలను చవి చూపించారు…పాత పనిముట్లను,కవిత్వ తూకపు రాళ్ళను  ఆధునీకరించుకోవలసిన ఆవశ్యకతను చెప్పడం నాకు వ్యక్తిగతంగా నచ్చింది…

ఆ పక్కనే, ఆత్మకు లంగరు వేస్తూ కలవరిస్తున్నాడేమో అని అనుమానం కలిగిస్తూ వేగుంట మోహన ప్రసాద్ గారు…ఆయనను చూస్తూ తిక్కగా ఉన్నా కవిత్వం ఉంటే క్షమించేస్తాం అని సాలోచనగా అంటూ, చేరా గారు కనిపించారు…

కొంచెం ముందుకు నడిపించి, పదాలతో కవితా ప్రహేళికలు సృష్టిస్తున్న  ఎమ్మెస్ నాయుడు మరియు బి.ఎస్.ఎం కుమార్ గార్లను చూపించారు …వారిని ఓరకంట చూస్తూ ”కవిత రాయటం పూర్తయ్యింది…ఇక అర్థం చేసుకోవటమే మిగిలుంది” అంటూ తమ్మినేని యదుకుల భూషణ్ గారు అంటున్న మాటలనూ వినమని సైగ చేశారు…

కాస్త దూరంలో “దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తాం” అంటూ కాళోజీ గారు కన్నెర్ర చేస్తూ కనిపించారు…అటుపక్కనే, ఆ నీళ్ళు ఉల్లిపాయలు తరిగితే వచ్చినవి కావని భావన గారి బాధని మన భాషలోకి తర్జుమా చేసి వివరించే వాడ్రేవు చినవీరభద్రుడు గారు…కవిత్వం చదవటం ఒక performing art అని చెబుతూ శివారెడ్డి గారు గంభీరంగా కవితాలీనులై ఉండటం చూపించారు…అలంకార రహితులై  నిరాడంబరంగా వెలగటం చూపించారు…

“నిప్పులు చిమ్ముతూ నింగికి నేనెగిరిపోతే ” అంటున్న శ్రీ శ్రీ గారు, “పంజరంలో ఇమడలేని విశ్వనరుడను నేను ” అంటూ జాషువా గారు, ‘ప్రపంచమే ఒకటి ’  అంటూ దాశరధి గారు, ఎంకిని ముద్దు చేస్తూ నండూరి గారు,’బండరాళ్ళ పై మొక్కలు ఎదగవంటూ ’ భైరాగి గారూ కనిపించారు…

అంతేనా, ఇంకా ఎందరో కనిపించారు…ఎన్ని వెలిగే హృదయాలో!…ఎన్ని నివురుగప్పిన మాణిక్యాలో!… కవిత్వాన్ని పలు విధాలుగా వాడిన ఎన్ని మచ్చుతునకలో!…ఇవి కాక,కాలంతో పాటు కవిత్వంలో వచ్చిన మార్పులు, తారీఖులు దస్తావేజుల జోలికి పోకుండా వివరించారు…

చాలా కొత్త పదాలు పరిచయమయ్యాయి…పాఠకుల ఆస్వాదనా శక్తిని పెంచే పుస్తకమిది…చిన్నప్పుడు మిత్రులతో ఆటలలో పడితే ఆకలి తెలిసేది కాదు…పెద్దయ్యాక, క్లాసులో పాఠం చెప్పటానికి నోట్సు తయారు చేసుకోవటానికి మంచి ముడి సరుకు దొరికితే ఆకలి అయ్యేది కాదు…అలా,చదవటం మొదలయ్యాక  ఆకలిని దూరం చేసి, మరొక ఆకలిని తీర్చిన పుస్తకం ఇది…

పత్రికలలో ప్రచురితమయ్యే, చాలా కవితలను చూసి, ఇదేమి కవిత్వం? గద్యాన్ని శకలాలుగా చేసి కవిత్వంగా చలామణి చేస్తున్నారు…అని చిరాకు పడే నేను ఇప్పుడు కాస్త educated పాఠకుడిని అయ్యానని అనిపిస్తుంది…ఇందుకు కారకులు శ్రీ బొల్లోజు బాబాగారు…ఇటువంటి వ్యాసాలు వ్రాయాలంటే,ఎంతటి అధ్యయనం,జ్వలన కావాలో కొంత ఊహించగలను…వారికి చాలా కృతజ్ఞతలు…నా ప్రశ్నకి సమాధానాన్ని మించి చాలా ఇచ్చిన పుస్తకం ‘కవిత్వ భాష’…నాబోటి వారు చదవవలసిన పుస్తకం…

***లెనిన్ బాబు***