Friday, February 18, 2022

అడవిపూల అందాలు, పరిమళాలు

 ఈ సంవత్సరం అజో-విభో కందాళం ఫౌండేషన్ వారి పురస్కారాలు శ్రీ తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి, శ్రీ శిఖామణి, శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ లు అందుకొన్నారు. వారి సాహితీ కృషిని పురస్కరించుకొని విడుదలచేసిన సావనీర్లలో ఆ ముగ్గురిపైనా వ్యాసాలు రాసే అదృష్టం నాకు ఇచ్చిన ఆ యా సావనీర్ల సంపాదకులైన శ్రీ రెంటాల వెంకటేశ్వరరావు, శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ అద్దేపల్లి ప్రభు గార్లకు ధన్యవాదములు. ఫౌండేషన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు.

శ్రీ తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి గారు అడివిపూలు పేరిట అనువదించిన గాథాసప్తశతి పై వ్రాసిన వ్యాసం ఇది.
****
అడవిపూల అందాలు, పరిమళాలు
గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే శాతవాహన రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల ప్రాకృత గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు.
ఈ గాథలలో పల్లెజీవనము, ఆనాటిప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు, ప్రకృతి వర్ణణలు కనపడతాయి. స్వేచ్చగా, అరమరికలు లేకుండా ఉండే పల్లెజీవుల జీవనానుభవాలు అవి. గోదావరి, నర్మద నదీతీరాలలో వికసించిన కవిత్వమది. ఈ కావ్యం అమృతమధురం అని హాలుడే స్వయంగా చెప్పాడు. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది. ఈ గాథలలో పొంగిపొరలే కవిత్వం వల్లే అవి రెండువేల సంవత్సరాలుగా సజీవంగా నిలిచిఉన్నాయి అనిపించకమానదు.
Arvind Krishna Mehrotra 1991 లో The Absent Traveller పేరిట సప్తశతి గాథలను ఇంగ్లీషులోకి అనువాదం చేసాడు. శ్రీ తల్లావఝుల పతంజలిశాస్త్రి గారు ఆ సహస్రాబ్దాల కవిత్వ వనంలో ఒక “Absent Traveller” గా సంచరించి వివశులై ఓ వైశాఖమాసపు మధ్యాహ్నం వేళ వాటిని తెలుగులోకి అనువదించటం మొదలుపెట్టారు. అలా మొత్తం 100 సప్తశతి గాథలకు శాస్త్రిగారు చేసిన అనువాదాలు “అడవిపూలు” పేరుతో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో అక్టోబరు, 1993 నుండి ఫిబ్రవరి 1994 మధ్య సీరియల్ గా వచ్చాయి. ప్రతీవారం ఎంతో అందమైన భావస్ఫోరక చిత్రాలను ఆర్టిస్టు చంద్ర వేసారు.
శాస్త్రిగారికి వాచ్యంగా చెప్పటం ఇష్టం ఉండదు అవి కథలైనా, కవిత్వమైనా. ధ్వని ప్రధానంగా సాగుతాయి వీరి రచనలు. సప్తశతి గాథలు కూడా ధ్వన్యాత్మకం. అందుకనే అవి శాస్త్రిగారిని ఆకర్షించి ఉంటాయి. ఎంతెలా అంటే అనువదించి హృదయభారాన్ని దింపుకునేంత.
.
1. అడవి పూల పరిమళాలు
.
అడవిపూలు పేరిట శాస్త్రిగారు తెనిగించిన ఈ గాథలలో మానవసంబంధాలకు వ్యక్తీకరించే గాథలు ప్రధానంగా ఉన్నాయి. జాగ్రత్తగా తరచి చూస్తే మానవసంబంధాలలోని చీకటివెలుగులను రెండింటిని ప్రతిబింబించే గాథలను సమంగా ఎంపికచేసుకొని అనువదించినట్లు అర్ధమౌతుంది. ఇది శాస్త్రిగారి ఇతర రచనలలో కనిపించే- జీవన సామస్త్యాన్ని పొదువుకోవటం, జీవితంలోని బహుళతకు పెద్దపీటవేయటం లాంటి లక్షణాలను ప్రతిబింబిస్తుంది.
కాళ్లకు మొక్కిన కోడలి గాజులు
పాదం మీద జారి పడ్డాయి
అత్తగారి కరుకు కళ్ళు సైతం
అశ్రుపూరాలైనాయి
భర్త దేశాంతరం వెళ్ళగా అతని రాకకోసం ఎదురుచూస్తూ, చిక్కిశల్యమౌతూ ఉండే నాయికను ప్రాచీన కవులు ప్రోషిత పతిక అని వర్ణించారు. అలాంటి ఒక ప్రోషితపతిక చిక్కి సగమయ్యింది అనే విషయాన్ని అన్యాపదేశంగా గాజులు వదులుగా మారాయి అని చెప్పటం అనేక గాథలలో కనిపిస్తుంది. పై గాథలో అలాంటి స్థితిలో ఉన్న కోడలిని చూసి కఠినాత్మురాలైన అత్తగారు బాధపడి కన్నీరు కార్చినట్లు చెప్పటం రెండువేల ఏండ్లనాటి మానవ సంబంధాలలోని ఆర్థ్రతను తెలియచేస్తుంది.
అనేక సప్తశతి గాథలలో దూరదేశమేగిన భర్తలకొరకు ఎదురుచూసే భార్యలు కనిపిస్తారు. అప్పట్లో భార్యా పిల్లలను గ్రామాలలో విడిచిపెట్టి మగవారు నగరాలకు వెళ్ళి తమ ఉత్పత్తులను అమ్ముకోవటమో లేక అక్కడ వ్యాపారం చేయటమో లేదా తమ వృత్తిపరమైన సేవలు అందించి ధనం సంపాదించటమో చేసేవారని అనుకోవాలి.
అలా దూరదేశం వెళ్ళిన భర్త రాక కొరకు భార్యలు రోజులు లెక్కపెట్టుకొంటూ గడిపేవారు.
వియోగ దినాల్ని
వేళ్లకి మించి లెక్కించ లేక
గొల్లు మంది చదువురాని చిన్నది
పై గాథలో స్వచ్ఛమైన పల్లెటూరి అమాయకత్వం కనిపిస్తుంది. పరదేశం వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడో చేతి వేళ్లతో లెక్కించుకొంటున్నదట ఒక చదువురాని చిన్నది. పదిరోజులకు చేతి వేళ్లు అయిపోయాయి. ఇరవై రోజులు అయ్యే సరికి కాలి వేళ్లు కూడా అయిపోయాయి. ఆ తరువాత రోజుల్ని ఎలా లెక్కించాలో తెలియక గొల్లుమందట ఆ అమ్మాయి. ఈ చిన్ని గాథలో ఒకనాటి ప్రజలు ఒకరిపై ఒకరు చూపుకొన్న అనురాగము ద్యోతకమౌతుంది. ఆధునికప్రపంచాన్ని ఓదార్చటానికి ఇట్లాంటి నిష్కాపట్యము అవసరపడుతుందేమో ఆలోచించాలి.
పొలానికి పోనే పోను
పిట్టల్ని తిననీ పంటని
బాటలెరిగిన బాటసారులు
ఎటువెళ్ళాలని అడుగుతూనే ఉంటారు
ఒక చిన్నది ఇంట్లో అమ్మతో చెప్పుకొంటున్న ఒక పిర్యాదు కాబోలు ఇది. పంటపోతే పోనే అనటం అమాయకత్వం అనుకోవచ్చు, కానీ ఒక మగవాడు ఎందుకు మాటలు కలపాలనుకొంటున్నాడో అర్ధంకాకపోవటం స్వచ్ఛమైన ముగ్దత్వం. అమ్మాయిలతో మాటలు కలపి మెల్లమెల్లగా ముగ్గులోకి దింపాలని యత్నించే వ్యక్తులుండటం ఒక పురాతన సలపరింత ఈ సమాజానికి. ఈ గాథలో కూడా ఆనాటి పల్లెజీవుల మధ్య నడచిన సంబంధ బాంధవ్యాలు తెలుస్తాయి.
కారుమేఘా లాకాశంలో
కాలిదారుల్లో చెట్లు పెరిగేయి
ఏరులేమో పొంగి పొర్లేయి, అయినా
అమాయకురాలా, కిటికీలో కూచుని
అతని కోసం ఎదురుచూస్తున్నావు
పొరుగూరు వెళ్ళిన భర్తలు వానాకాలం సమీపించేలోగా సొంత ఊర్లకు చేరుకొనేవారు ఎందుకంటే వానాకాలంలో వాగులు, నదులూ పొంగి దారులన్నీ మూసుకుపోతాయి. అలా రాలేకపోతే వరదలు తగ్గేదాకా కనీసం రెండు మూడు నెలలు ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సి వచ్చేది. పై గాథలో వర్షాకాలం మొదలయ్యాకా కూడా భర్త రాకకోసం ఇంకా ఎదురుచూసే ఒక స్త్రీ ని సముదాయిస్తూ, చిరుకోపం ప్రదర్శించటంలో ఉన్న ఆనాటి మానవ సంబంధాలను "ఫ్రీజ్ షాట్" తీసిన పురా కవిని అభినందించకుండా ఉండలేం.
దప్పికతో నీటి ఒడ్డున
దుప్పీ జింకా
జింక ముందని దుప్పి
దుప్పి ముందని జింకా
అరమరికలు లేకుండా ఉండే పల్లెజీవుల, అరణ్యాలలో నివసించే పుళిందుల జీవనానుభవాలు ఈ గాథలలో అందంగా ఒదిగిపోయాయి. సాటిమనిషికొరకు తన అవసరాలను త్యాగం చేయటం అనేది ఒక ఉదాత్తమైన చర్య. దాంపత్యంలో ఉండే వ్యక్తులు కూడా ఒకరి కొరకు మరొకరు అన్నట్లుగా కలిసిమెలసి జీవించాలని పై గాథ చెపుతూంది. జంతువులే అలా ఉంటున్నాయి మనుషులు మరెంతగా ఉన్నతంగా ఉండాలి అనే స్ఫూర్తిని నింపే గాథ ఇది.
***
మానవ సంబంధాలు అన్నీ నలుపు తెలుపులలో ఉండవు. గ్రేషేడ్స్ కూడా ఉంటాయి. విలువలు సాపేక్షం. ఒకకాలపు మంచి మరో కాలానికి చెడుగా రూపాంతరం చెందవచ్చు. గాథాసప్తశతిలో అనేక గాథలు ఆనాటి ప్రజల జీవితాలలోని గ్రేషేడ్స్ ను అద్భుతంగా నిక్షిప్తం చేసాయి. శాస్త్రిగారి అడివిపూల అనువాదంలో కూడా అది ప్రతిబింబించింది.
సప్తశతి గాథలలో ఎక్కువ భాగం ప్రేమానుభవాలే. అందులో కూడా రహస్యసమాగమములు, స్వైరిణీ సంయోగాలు, వివాహం వెలుపలి ప్రేమోదంతాలు వంటి అంశాలు ఎక్కువ. ఇవి ఆ కాలంలో అసహజం కాకపోవచ్చు. ఆనాటి ప్రజలు శృంగారాన్ని హాయిగా అనుభవించారు, మాట్లాడు కొన్నారు, అందమైన కవిత్వరూపంలో వ్రాసుకొన్నారని భావించాలి. ఈ క్రింది గాథలో ఒక గృహిణికి తేలుకుట్టిందనే వంకతో భర్తముందే ఆమెను ప్రియుడువద్దకు చేర్చారట చెలికత్తెలు
దీన్ని తేలు కుట్టిందని గోల చేశారు
గిలగిల కొట్టుకుందామె
మొగుడి ముందునుంచే చెలులు
చేరవేశారామెను వెజ్జు ప్రియుడికి!
.
పై గాథలో శృంగారేచ్ఛకన్నా మానవసంబంధాలలోని 'గ్రే షేడ్స్ ' చిత్రణ ప్రతిభావంతంగా కనిపిస్తుంది. ఇలాంటి గాథలే తరువాతి కాలంలో స్త్రీల చుట్టూ ఆంక్షలు బిగుసుకు పోవటానికి దోహదపడి ఉంటాయి
***
ఒకప్పుడు బాటసారులకు ఆతిథ్యం ఇవ్వటం గృహస్థుల బాధ్యతగా ఉండేది. మన సంస్కృతిలోని అతిధిదేవోభవ అనే వాక్యానికి ఆచరణరూపమది. ఈ ఆతిథ్యం ఇచ్చే ప్రక్రియమాటున ఇంటి స్త్రీలు ఆ బాటసారులతో లైంగిక బంధాలు పెట్టుకొన్నట్లు కొన్ని గాథలలో కనిపిస్తుంది.
అది అత్తగారి పక్క
ఇదిక్కడ నా పడక
అక్కడేమో పని వాళ్ళు
రే చీకటి యాత్రీ
రాత్రి నా మంచం తట్టుకునేవు
పై గాథ అలాంటిదే. పై గాథలో ఓ గృహణి ఇంటికి వచ్చిన అతిధితో తాను ఎక్కడ పడుకొంటుందో తెలుపుతూ, శృంగారానికి తన సంసిద్ధతను చాలా గడుసుగా చెబుతున్నది. రేచీకటి యాత్రీ (Night-blind traveller) అని సంబోధించటం ద్వారా ఒక వేళ ఆ బాటసారి రాత్రిపూట దొరికిపోయినా “రేచీకటి కనుక తడబడ్డాను” అని చెప్పుకొనే ఎస్కేప్ రూట్ కూడా ఆమె అతనికి అందిస్తోంది తెలివిగా. ఈ గాథ ధ్వన్యాత్మక వ్యక్తీకరణకు చక్కని ఉదాహరణగా ఆలంకారికులు తీసుకొన్నారు.
ఇంకా అలకేనా అతగాడికి?
ఆహా కలుసుకోడ పడదట
ఓసి నీచురాలా,
అందుకేనా నీ అధరం ఎర్రబడింది.
నాయిక తన ప్రేమ సందేశాన్ని నాయకునికి దూతలద్వారా ఎరుకపరచి, సమాగమ స్థలాన్ని, సమయాన్ని స్థిరపరచుకోవటం ఒకనాటి కావ్యసంప్రదాయం. ఇది ఒక్కోసారి వికటించి ప్రియునివద్దకు రాయభారానికి పంపిన దూతిక అతనితో సుఖించి రావటం జరిగినట్లు కొన్ని గాథలలో కనిపిస్తుంది. పై గాథ అలాంటిదే. అలాంటి దూతికను నీచురాలా అని సంబోధిస్తున్నదా నాయిక. ఇలాంటి గాథలలోని విచ్చలవిడితనాన్ని పక్కన పెడితే- ఒక పురుషుని ఇష్టపడిన స్త్రీ (పై గాథలో దూతిక) ఏ మేరకు తెగించి తన కోర్కెను ప్రకటించగలుగుతున్నదో అది అతని మగటిమికి పరోక్ష సూచికగా వర్ణించటం ఈనాటికీ ఒక గొప్ప వ్యక్తీకరణే.
.
2. అడవిపూల అందాలు
.
శాస్త్రిగారు గాథల ఎంపికలో ప్రస్ఫుటంగా కనిపించే మరో ప్రధాన అంశం-సౌందర్యాత్మకత. నిజానికి సప్తశతి గాథలు అందమైన దృశ్య లేదా ఘటనల చిత్రణలు. అదే సౌందర్యాత్మకత అడవిపూలలో కూడా గమనించవచ్చు.
ఊరి చెరువులో పడింది ఆకాశం
ఒక్క తామర తెగలేదు
ఒక్క కొంగ తగ్గలేదు
పై గాథను వివరిస్తూ శ్రీ Vadrevu Ch Veerabhadrudu గారు “ఈ కవితను ఎన్నిభాషల్లోకైనా అనువదించండి, పైనుంచి కిందకు రాసే భాషలు, కుడినుంచి ఎడమకు రాసే భాషలు, ఏ భాషలో కూడా ఈ కవిత నష్టపోదు” అంటారు. చెరువునీటిలో ఆకాశం ప్రతిబింబిస్తోందట, అలా ఆకాశం చెరువులోకి “పడటం” వల్ల ఒక్క కలువా చెదరలేదు, ఒక్క కొంగా బెదరలేదు అన్న పదచిత్రపు తాజాదనం, బహుసా ఈ భూమిపై ఆకాశము, తామరలు, కొంగలు ఉన్నంతకాలమూ నిలిచే ఉంటుంది.
ఒక అందమైన అమ్మాయిని వర్ణించేటపుడు దేహసౌందర్యం ప్రధాన పాత్రవహించటం, అదే పురుషుని వర్ణించవలసివచ్చినపుడు అది అతనిపట్ల మనసుపడ్డ ఒక స్త్రీ మనోచిత్రణ పరంగా ఉండటం ఈ గాథలలో చాలాచోట్ల కనిపిస్తుంది.
ఒక యువతి తను మనసుపడ్డ యువకుని గురించి తన అత్తతో ఇలా అంటున్నది.
అత్తా!
చూపు సరిపోతుందా?
నీళ్ళు కలగంటే
దాహం తీరుతుందా?
ఎంతసేపు అతనిని చూసినా తనివితీరకపోవటాన్ని కలలో నీళ్ళు తాగితే దాహం తీరుతుందా అనే పోలికతో ముడిపెట్టి ప్రశ్నించటంలోని అసమాన కవిత్వగాఢత కారణంగా- పై గాథాకారుడు ప్రతీ తరంలోనూ మరల మరల జన్మిస్తూఉంటాడనటంలో సందేహం లేదు.
చూపు, పడ్డ చోటి నుంచి చెదరదు
ఆమెనెవరూ
పూర్తిగా చూడలేదింకా.
“కళ్లు తిప్పుకోనివ్వని అందం” అని అందరూ అనే మాటని ఈ గాథకర్త ఎంతదూరం తీసుకెళ్ళాడో తిలకించండి. ఇదొక ఉత్ప్రేక్ష కావొచ్చు. కానీ ఎంత తర్కబద్దమైనదీ! ఆమె శరీరాన్ని పూర్తిగా చూసిన వారే లేరు అనటం ద్వారా ఆమె సౌందర్యాన్ని ఎంత ఎత్తుకు తీసుకెల్లి వదిలాడో కదా ఈ ప్రాచీన గాథాకారుడు.
.
3. అడవిపూల అనువాద సొబగులు
.
హాలుని గాథాసప్తశతి చాలామందినే ఆకర్షించింది. శ్రీనాథుడు తన యౌవనారంభంలో గాథాసప్తశతిని అనువదించాను అని చెప్పుకొన్నాడు. సప్తశతి గాథలను 1870 లో Weber అనే జర్మన్ పండితుడు సేకరించి జర్మన్ భాషలోకి అనువదించి ప్రకటించాడు. 1930 లో శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, 1944 లో శ్రీ గట్టి లక్ష్మి నరశింహ శాస్త్రి 1968 లో వాసిరెడ్డి వెంకటసుబ్బయ్య లు సప్తశతిని తెనిగించారు. 1993 లో పతంజలి శాస్త్రిగారు కూడా “తలచిన రామునే తలచెద నేనును” అన్న చందాన తనదైన అనుభూతిని “అడవిపూల” రూపంలో మనకు అందించారు. ఆ తరువాత 2012 లో శ్రీ దీవి సుబ్బారావు, శ్రీ నరాల రామారెడ్డి, 2013 లో శ్రీ జెజ్జాల కృష్ణ మోహన రావు తదితరులు శాలివాహన గాథాసప్తశతిని తెలుగులోకి అనువదించారు.
పతంజలి శాస్త్రిగారి అనువాదాలను గమనించినపుడు, రెండు లక్షణాలు స్ఫుటంగా కనిపిస్తాయి. ఒకటి సరళత, రెండు సజీవత. ఈ రెండు లక్షణాల వల్ల అనువాదం హృద్యంగా ఉంటూ ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ను కలిగి ఉంటుంది.
చూడు, ఎలా పడుతున్నాయో
పగడాలు, పచ్చలు
గగన దేవత తెగిన హారంలా
చిలుకల వరస
ఆకుపచ్చని ఈకలతో, ఎర్రనిముక్కుతో రామచిలుక చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. రామచిలుకలు సాధారణంగా ఒక గుంపుగా ఎగురుతూ ఉంటాయి. అలాంటి ఒక రామచిలుకల గుంపు ఎగురుతూ వచ్చి వాలే దృశ్యాన్ని ఒక అందమైన పదచిత్రంగా ఈ గాథలో దర్శించవచ్చు. పై గాథలో రామచిలుకల గుంపును పగడాలు, పచ్చలు పొదిగిన “గగనదేవత తెగిన హారంలా” అన్న వర్ణన కీలకమైనది.
ఈ ఉపమానాన్ని…
గట్టిలక్ష్మి నరసింహశాస్త్రి “సురపథమ్ము పేరిటి పడతిమిన్న కంఠముననుండి (ఆకాశమనెడి స్త్రీ కంఠమునుండి) అని వర్ణించారు.
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు “గగనలక్ష్మి మెడ బచ్చల కెంపులకంటె” అని తెనిగించారు
దీవి సుబ్బారావు ఆకాశ సుందరి మెడకున్న కెంపు పచ్చల కంఠహారం అన్నారు.
ఏ అనువాదమూ అంతిమం కాదు అనేది సత్యమైనా- అనువాదకుడు, లక్ష్యభాషలో ఆ అనువాదం మరో వందేళ్ళు సజీవంగా ఉండేలా చేయటానికి ఏ మేరకు భాషాపరమైన ముందుచూపును ప్రదర్శించగలిగాడు అనేది పరిగణార్హం. పతంజలి శాస్త్రిగారు ఈ గాథలను అనువదించి ముప్పై ఏండ్లు అవుతున్నా వీటిలోని భాష సమకాలీనత, సరళత్వం విషయంలో నేటికీ తాజాగానే ఉండటం గమనించవచ్చు. అనువాదకునిగా శాస్త్రిగారి ప్రతిభ ఇది
వేసవిలో మూసిన కన్రెప్పల్లా
వేసిన తలుపుల వెనుక
విశ్రాంతిలో ఉంది గ్రామం
ఇళ్ళు పెట్టే గురకలాగ
ఎక్కడో తిరగలి గరగర
In summer, behind doors
Shut, like eyelids,
The village at siesta; somewhere
A hand-mill rumbles,
As if the houses snored.
డబుల్ మెటఫర్స్ చేసే ఇంద్రజాలం ఈ గాథ. అద్భుతమైన దృశ్యమానం. ఇది శాస్త్రిగారి అనువాద పటిమకు అద్దం పడుతుంది. మూలంలో ఉన్న వరుసక్రమాన్ని పైకి కిందకూ సర్ది- మూసిన కన్రెప్పల్లా అంటూ ప్రారంభించటం, తిరగలి గరగరను చివరకు తీసుకురావటం వల్ల గాథను సులభంగా అర్ధం చేయించగలిగారు. hand-mill ను తిరగలి, siesta ను విశ్రాంతి గా అనువదించటం ద్వారా గాథకు, స్థానీయతను, సరళతను అద్దారు. గాథలో వచ్చే అనుప్రాస, తూగు చదువుకొనేటపుడు చక్కని పఠనానుభవాన్ని కలిగిస్తాయి. ఉత్తమ అనువాదకుడు పాఠకునికి విధేయుడై ఉంటాడు అనటానికి ఈ గాథ మంచి ఉదాహరణగా నిలుస్తుంది.
***
రెండువేల సంవత్సరాలుగా ఎంతోమందిని “దీవించి, ఊగించి, శాసించి, రక్షించిన అపూర్వ శక్తి” గాథాసప్తశతి కవిత్వం. ఆ అనుభవాన్ని శాస్త్రి గారు ఒక రుబాయీలా ఇలా చెప్పుకొన్నారు. సప్తశతిని ప్రేమించే అసంఖ్యాక రసజ్ఞుల హృదయ నివేదన ఇది.
కొంచెం ఫ్రెంచి వైను
కాసింత గంధలేపనం
ఎర్రతురాయి కింద శయనం
గాథాసప్తశతి పారాయణం.
బొల్లోజు బాబా


Monday, February 14, 2022

సమతామూర్తి - శ్రీ రామానుజాచార్యుడు

సమతామూర్తి - శ్రీ రామానుజాచార్యుడు
.
శ్రీ రామానుజాచార్యుడు (సా.శ. 1017-1137) తమిళనాడులోని శ్రీపెరుంబుదుర్ లో జన్మించారు. రామానుజాచార్యుడు విశిష్టాద్వైతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చాడు. విశిష్టాద్వైతం అంటే వైష్ణవమే. ఈ సిద్ధాంతం ప్రకారం దేవుడు ఒక్కడే. అతడే నారాయణుడు. జీవాత్మ పరమాత్మను చేరటమే మోక్షం. మోక్షం సిద్ధించాలంటే గొప్ప విష్ణుభక్తితో జీవించాలి. మనసావాచాకర్మణా విష్ణువుని శరణువేడాలి. రామానుజాచార్యుడు తన జీవితమంతా ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేయటానికే వెచ్చించాడు. అనేక ఆలయాలను సందర్శించి ఆక్కడ స్పష్టమైన పూజావిధానాలను, పద్దతులను ఏర్పరచాడు. తన సిద్ధాంతాన్ని కులబేధాలకు అతీతంగా ప్రజలందరికీ చేరువచేసాడు.
.
ఆంధ్రదేశంలో రామానుజాచార్యుడు
.
రామానుజాచార్యుడు ఆంధ్రదేశంలో విస్తృతంగా సంచరించాడు. ముఖ్యంగా తిరుమలతో రామానుజాచార్యుని అనుబంధం బలమైనది. రామానుజాచార్యుని మేనమామ శ్ఱీశైలపూర్ణుడు తిరుమలలో నివసించటం దీనికి కారణం కావొచ్చు.
చిదంబరం ఆలయంలో తొలగించిన గోవిందరాజ స్వామి విగ్రహాన్ని తీసుకొని వచ్చి తిరుపతిలో ప్రతిష్టింపచేసాడు శ్రీ రామానుజాచార్యుడు. తిరుపతి పన్నెండోశతాబ్దానికి పూర్వం కొత్తూరు అనే పేరుతో పిలువబడిన ఒక చిన్న ఊరు. శ్రీ రామానుజాచార్యుడు సా.శ 1130 లో గోవిందరాజస్వామి ఆలయనిర్మాణం గావించిన ఆ కొత్తూరు చుట్టూ రామానుజపురం, ఆ తరువాత అచ్యుతాపురం, శ్రీనివాసపురంలు ఏర్పడి క్రమేపీ అది తిరుపతి పట్టణంగా వృద్దిచెందింది.
తిరుమల మూలవిరాట్టు శివుడా, విష్ణువా అనే వివాదం రేగినపుడు శ్రీ రామానుజాచార్యుడు అది విష్ణు స్వరూపమని నిష్కర్ష చేసాడని అంటారు. అదే విధంగా శ్రీ కూర్మ ఆలయం, సింహాచల ఆలయాలను కూడా కూడా ప్రముఖ వైష్ణవ క్షేత్రాలుగా తీర్చిదిద్దడంలో రామానుజాచార్యుని పాత్ర ప్రముఖమైనది.
రామానుజాచార్యుని బోధనల ప్రభావంతో పన్నెండో శతాబ్దంలో ఆంధ్రదేశంలో వీరవైష్ణవ ఉద్యమం ఒక కెరటంలా ఉవ్వెత్తున ఎగసింది. పల్నాడు (గుంటూరు) లో బ్రహ్మనాయుడు అన్ని కులాలను ఏకం చేయాలనే ఉద్దేశంతో చాపకూడు (సహపంక్తిభోజనం) ఉద్యమాన్ని చేసాడు.
నెల్లూరులో రంగనాథస్వామి , మాచెర్లలో చెన్నకేశవ స్వామి, కోరుకొండ నరసింహస్వామి ఆలయాలు ఆంధ్రలో వైష్ణవం విస్తరించిన విధానాన్ని తెలుపుతాయి.
రామానుజాచార్యుని బోధనలవల్ల భూస్వామ్యవర్గాలు ఆలయానికి చేరువై గొప్ప ఆథ్యాత్మిక సేవలందించటం ఆంధ్రదేశ చరిత్రలో గొప్ప పరిణామం. వీరి పేర్లు వీరు చేసిన కైంకర్యాలు అనేక శాసనాలలో కనిపించటం మొదలైంది ఈ కాలంలోనే.
 
1. సత్ శూద్రులు

పన్నెండు, పదమూడు శతాబ్దాలకు చెందిన శాసనాలలో వ్యవసాయ రంగానికి చెందిన కాంపులు, రెడ్లు, వెలమలు తమని తాము సత్ శూద్రులు, శ్రీ వైష్ణవులుగా చెప్పుకొన్నారు. వీరిలో ఆలయాలుకు అంకితమైన వారిని దాసులుగా పిలుచుకొన్నారు. ఈ సత్ శూద్రులు 12 సంవత్సరాలు మంచి నడవడిక ప్రదర్శించితే ఆలయ కార్యక్రమాలలో ప్రధాన పాత్ర వహించవచ్చునని పంచరాత్ర, పరమసంహిత గ్రంథం ఆమోదించింది. ఆ విధంగా పల్నాటి బ్రహ్మనాయుడు “ఆచార్య” స్థానాన్ని పొందాడు
దాస నంబిలు ఆలయానికి చెందిన బృందావనాలను సాకుతూ, ఆలయంలోని వివిధ అర్చనలకు అవసరమైన దండలను, పూలను అందించేవారు. వీరి పోషణ కొరకు భక్తులు భూములు దానంగా ఇచ్చేవారు. (శాసన సంఖ్య 1238 SII V- శాసన వాక్యము- తోట దాసరులు ఇద్దరకు కూడుజీతమునకు//)
కప్పరం దాసరుల పేరుతో ఆలయంలో ఉత్సవ విగ్రహాలను సంరంక్షించే ప్రత్యేకమైన దాసులు ఉండేవారని సా.శ.1637 నాటి నంద్యాల తామ్రశాసనం ద్వారా తెలుస్తున్నది.
.
2. దాసరులు

కాపు, గొల్ల, బోయి, కురుంబ, మాల కులాలనుంచి వైష్ణవధర్మ ప్రచారం కొరకు సన్యసించిన వారిని దాసరులు అంటారు. వీరిలో బోయ, మాల కులాలనుంచి వచ్చిన దాసరులు సహపంక్తి భోజనానికి అనర్హులు. (Castes and Tribes of southern India, Thurston, pp. 112-118).
ఈ దాసరులు, వైష్ణవ ఆచార్యులను అనుసరిస్తూ, ఊరూరూ తిరుగుతూ వారికి సహాయకులుగా ఉండేవారు. మిగిలిన సమయాలలో భిక్షమెత్తుకొని జీవించేవారు. శంఖము, దీపపు సెమ్మె, గంట లేదా కిన్నెర ధరించి వైష్ణవ గీతాలు పాడుకొంటూ ధర్మ ప్రచారం చేసేవారు. వీరు పరయా (మాలమాదిగ) విష్ణు భక్తులకు తీర్ధప్రసాదాలు అందించేవారు.
.
3. అంత్యజులు

రామానుజాచార్యుడు చేసిన ధార్మిక విప్లవ ఫలితంగా వైష్ణవ సంప్రదాయం సమాజంలో అంత్యజులుగా చెప్పిన చండాలురను కూడా చేరింది. రామానుజుని వద్ద అనేకమంది శూద్ర శిష్యులు ఉండేవారు. పంచములకు ఆలయదర్శనాన్ని కల్పించాడు రామానుజుడు
ఆంధ్రదేశంలో వైష్ణవభక్తులైన పంచములలో బ్రహ్మనాయుడి వద్ద సైన్యాద్యక్షుడిగా పనిచేసిన మాల కన్నమదాసు గొప్ప వీరునిగా, విష్ణుభక్తునిగా చరిత్రలో నిలిచిపోయాడు.
.
4. దొమ్మరులు

వైష్ణవ ప్రభావంచే ఆంధ్రదేశంలో దొమ్మర కులం గౌరవ స్థానాన్ని పొందినట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తున్నది. దొమ్మరులు గ్రామాలలో తిరుగుతూ వ్యాయామ విన్యాసాలను ప్రదర్శించి గ్రామస్థులను . ఆనందపరచినందుకు, వారి పోషణకుగాను గ్రామంలోని ప్రజలు కొంత ధనాన్నిగాని, ధాన్యాన్నిగాని వాళ్లకు చెల్లించేవారు. దీనిని దొమ్మరి పన్ను అంటారు.
వైష్ణవభక్తులైన దొమ్మర కులస్థులు తమకు వచ్చే ఈ ఆదాయంలో కొంతభాగాన్ని దేవుడికి సమర్పించుకొన్నట్లు కొన్ని శాసనాలు కలవు.
కడపజిల్లాలోని మోటకట్ల తిరువెంకటనాథునికి - పద్మరాజు కొడుకైన బసవరాజు తనకులానికి వచ్చే దొమ్మరపన్ను సమర్పించుకొన్నట్లు శాసనం వేయించాడు. (A.R.No. 11 of 1968-69.).
అదే విధంగా గుంటూరు జిల్లాలోని గోపినాథ ఆలయంలోని ఒక శాసనంలో – దొమ్మరి కులపెద్దలు అయిన చెంకు రెడ్డి, నరసానేడు, కొమార వీరయ్య లు అయినవోలు గ్రామ ప్రజలు కట్టాల్సిన దొమ్మరి పన్ను ను దేవునికి సమర్పించుకొన్నట్లు ఉన్నది. ఇలాంటి శాసనాల ద్వారా ఆనాటి సమాజంలో దొమ్మరుల సామాజిక హోదాను, ఆర్ధిక స్థితిని, వారి ఆత్మవిశ్వాసాన్ని ఊహించవచ్చును.
ఇది రామానుజాచార్యుని వైష్ణవ బోధనలు తెచ్చిన సామాజిక మార్పుగా భావించాలి.
***
రామానుజాచార్యుని ఉద్యమ ప్రభావంతో భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం లాంటి కావ్యాలు వచ్చాయి. సర్పవరం, భీమవరం, శ్రీకాకుళం, బాపట్ల, అహోబిలం, తిరుమల లాంటి ఆలయాలలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం అంగరంగవైభోగాలు జరగసాగాయి.
 
.
“మనం నాలుగు వర్ణాలకంటే క్రిందకు దిగి చండాలుడిని చేరాలి… వారిలో కూడా నిజమైన విష్ణుభక్తులు ఉన్నారు” అన్న ఆనాటి శ్రీ రామానుజాచార్యుడి సమతా దృష్టి [1] నేడు ఆయనను సమతామూర్తిగా నిలిపాయి.
రామానుజాచార్యుని కార్యక్షేత్రం అంతా ఆంధ్రరాష్ట్రంలో ఉండింది కనుక సమతామూర్తి విగ్రహం ఆంధ్రాలో ఎక్కడైనా నెలకొల్పి ఉన్నట్లయితే మరింత ఔచిత్యవంతంగా ఉండేది.

బొల్లోజు బాబా

[1]Social Mobility and Medieval south Indian Hindu sects Burton Stein

Thursday, February 10, 2022

ఒక సాయింత్రం


పార్కుబెంచీపై ఇద్దరు వృద్ధులు
గుప్పెట్లోని పొగడపూలను
ముక్కువద్దకు తీసుకొని
గాఢంగా పీల్చుతూ అన్నారొకరు
"మా అబ్బాయికి వీసా వచ్చిందట"
ఒక్కొక్క పదాన్ని కూడబలుక్కొంటూ
అతని గుప్పెట్లోని పూలను తీసుకొని
దుఃఖ పరిమళాన్ని
గాఢంగా పీల్చుకొంటూ
"అవునా" అన్నాడు మరొకరు
ఆకాశమంతా
నల్లనల్లగా పరచుకొంటోంది
ఒంటరి సాయింత్రం
బొల్లోజు బాబా

Monday, February 7, 2022

బుద్ధిజం – కొన్ని ఆలోచనలు

 1. కులవ్యవస్థ – బౌద్ధమతం – పార్ట్ 1 

తెరవాద బుద్ధిజానికి చెందిన త్రిపిటక పాళీ రచనలలో - చాతుర్వర్ణాలు, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర అనే వరుసక్రమంలో ఉంటాయి. బ్రాహ్మణ వర్ణానికి మొదటిస్థానం లేదు. ఈ నాలుగు వర్ణాలు అన్నీ పవిత్రమైనవేనని ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ కాదని, అన్నీ సమానం అని చెప్పబడింది[1]

బుద్ధుడు మానవులందరూ సమానం అని ప్రవచించి, కులవ్యవస్థలోని ఎక్కువతక్కువలను నిరసించాడు. ఒక వ్యక్తి జన్మ వలన కాక కమ్మ/కర్మ కారణంగా మాత్రమే బ్రాహ్మణుడు లేదా చండాలుడుగా నిర్ణయించబడుతున్నాడని అన్నాడు.

కమ్మ/కర్మ అంటే ఒకవ్యక్తి చేతనతో చేసే పనులు. ఒక వ్యక్తి నీతిగా ప్రవర్తిస్తే (కమ్మ) బ్రాహ్మణుడిగాను, అనైతికంగా ఉంటే వసల (చండాలుడు/outcaste) గా జీవించవలసి ఉంటుందని బుద్ధిజం బోధించింది.[2]

పై వాక్యాల ఆధారంగా బుద్ధుడు కులవ్యవస్థను సమర్ధించాడని కొంతమంది అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ కర్మ/కమ్మ సిద్ధాంతం బౌద్ధం కన్నా ప్రాచీనమైనది అయిన జైనమతానికి చెందినది. కర్మను జైనులు పదార్ధంగా భావించారు. మంచి పనులు చేస్తే మంచికర్మ పదార్ధం ఆత్మకు పట్టుకొంటుందని, చెడ్డ/అనైతిక కర్మలు చేస్తే చెడ్డకర్మ పదార్ధం పట్టుకొంటుందని జైన కర్మ సిద్ధాంతం చెబుతుంది.

జైన మతం పాపపుణ్యాలను, కర్మ సంచయాన్ని, పునర్జన్మను, మోక్షాన్ని విస్త్రుతంగా చర్చించింది. బౌద్ధం ఈ కమ్మ/కర్మ బావనలను జైనం నుంచి స్వీకరించింది. అప్పట్లో జైన సంఘాలలో కులవివక్ష ఉండేది. అస్పృశ్యులకు జైన సంఘారామంలోకి ప్రవేశం ఉండేది కాదు[3].

ఆ తరువాత వచ్చిన హిందూమతం ఈ కర్మ సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళింది.

***

బౌద్ధం చాతుర్వర్ణాలలోని హెచ్చుతగ్గులను తీవ్రంగా ఖండించింది. బౌద్ధధమ్మాన్ని స్వీకరించిన అందరూ అంతకుపూర్వం బ్రాహ్మణ, క్షత్రియ శూద్ర ఎదోఒక వర్ణానికి చెందినవారే. వీరిలో బ్రాహ్మణ, క్షత్రియ వ్యక్తులే ఎక్కువ శాతం కాగా ఇతర తక్కువ వర్ణస్థులు కూడా గణనీయంగానే ఉండేవారు.

వీరందరిని ఉద్దేశించి - గంగ, యమున సరయు, మహి లాంటి నదులు సముద్రాన్ని చేరగానే తమ పేర్లను, అస్తిత్వాలను ఎలాగైతే కోల్పోతాయో అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకు చెందిన వారెవరైనప్పటికీ దమ్మాన్ని ఆచరించటం మొదలుపెట్టగానే వారి వారి వర్ణాలను కోల్పోతారు అని వినయపిటక లో బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు.

బుద్ధుని ముఖ్య అనుచరులలో చాలామంది శూద్ర, అతిశూద్ర కులాలకు చెందిన క్షురకులు, పాకీపని చేసేవారు, చండాలురు లాంటి వారు ఉండేవారు. వీరు అందరితో సమానంగా అర్హంత (ముక్తి) స్థాయిని పొందారు. బౌద్ధ సంఘలో బుద్ధుని తరువాత గొప్ప స్థానాన్ని పొందిన వినయ అనే సన్యాసి క్షౌరవృత్తికి చెందినవాడు.

***

వాసెత్త సుత్త, సుత్త నిపాత గ్రంధాలలో –పురుగులు, మృగాలు మొక్కల లాగా మనుషులకు ఏ రకమైన శరీరనిర్మాణ సంబంధమైన తేడాలు లేవు కనుక మనుషులందరూ ఒకటే అని బుద్ధుడు శాస్త్రీయంగా చెప్పటానికి ప్రయత్నించాడు[4].

అస్సలాయనసుత్త, మజ్జిమనికాయ గ్రంధాలలో బుద్ధుడు బ్రాహ్మణులు చెప్పుకొనే ఉత్తమజన్మ భావనను విమర్శించాడు. తెల్లగా ఉన్నామని, స్వచ్చమైనవారమని, బ్రహ్మ నోటిలోంచి రావటం ద్వారా ఉత్తమజన్మ పొందినవారిమని బ్రాహ్మణులు చెప్పుకొంటారుకానీ- వారు నవమాసాలు మోసిన స్త్రీ గర్భం నుంచి ఇతరులలాగే జన్మించారని, పాలు తాగి పెరిగారని, వారు కూడా మామూలు మనుషులేనని అన్నాడు.

***

హిందు ధర్మశాస్త్రాలు ఒకే రకమైన నేరానికి వివిధ వర్ణాలకు వివిధ రకాల శిక్షలు చెప్పాయి. బ్రాహ్మణుడు దొంగతనం చేస్తే ప్రాయశ్చిత్తం, శూద్రుడు చేస్తే కొరడా దెబ్బలు, చండాలుడు దొంగతనానికి పాల్పడితే మరణ దండనలు ఉండేవి. ఈ అంశంపై బౌద్ధ సన్యాసులైన మహాకచ్చన, అవంతి పుత్త మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.

ప్ర. ఒక బ్రాహ్మణుడు దొంగతనం చేస్తే అతనికి ఎలాంటి శిక్ష విధించాలి?

జ. అతని ఆస్తులు లాక్కొని, దేశబహిష్కరణ లేదా నేరాన్ని బట్టి సముచిత శిక్ష విధించాలి.

ప్ర. అదే దొంగతనం ఇతర వర్ణాలవారు చేస్తే?

జ. వారికి అదే శిక్ష. ఎలాంటి తేడాలు ఉండకూడదు.

ప్ర. తక్కువ వర్ణాలవారు కష్టపడి ధనం సంపాదించుకొని, బ్రాహ్మణులని తమ వద్ద దశ్యులు/పనివాళ్లుగా పెట్టుకొనవచ్చునా? (శూద్రులు పై మూడు వర్ణాలవారికి సేవలు చేయాలి అని ధర్మశాస్త్రాలు చెప్పాయి)

జ. నిస్సందేహంగా పెట్టుకోవచ్చు. అలా జరిగినప్పుడే నాలుగు వర్ణాలవారు సమాన స్థాయిలో ఉన్నట్లు [5].

***

ప్రాచీన బౌద్ధ సాహిత్యం కుల వ్యవస్థలోని ఈ అంశాల గురించి మాట్లాడింది.

1. కుల వ్యవస్థలోని వ్యక్తుల మధ్య హెచ్చుతగ్గులు అశాస్త్రీయం అని; శారీరిక క్రియలద్వారానే మానవులు జన్మిస్తారేే తప్ప దైవసంబంధ పుట్టుక ఎవరికీ లేదని; భిన్నవర్ణాలమధ్య వివాహం వలన ధర్మశాస్త్రాలు చెప్పినట్లు కొత్త మానవజాతి ఉద్భవించదు అని చెప్పింది.

2. కులం అనేది శాశ్వతం కాదని, గుణకర్మల ఆధారంగా మార్పుకు గురవుతుందని చెప్పింది.

3. జీవులందరూ సమానం అని, వారు చేసే పనులు/కర్మలు ఆధారంగా వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయని చెప్పింది

4. సమాజంలో ఉత్తమ స్థానాలు పొందాలంటే మంచి కర్మలు, జ్జాన సముపార్జన అవసరం అని ప్రభోదించింది

5. దిగువ వర్ణాలకు చెందిన వ్యక్తులకు విద్యను నిరాకరించటం అనైతికం, అన్యాయమని చెప్పింది 

ప్రాచీన బౌద్ధ సాహిత్యం కులంలోని ఈ అంశాలపై మౌనంగా ఉంది

1. కుల ఆధారిత వివక్ష, పీడనల గురించి

2. స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం ల గురించి, వాటిని ఎలా సాధించాలో అనే విషయం.

3. నిచ్చెనమెట్ల వ్యవస్థ మూలాలు

***

బుద్ధుడు నిర్వాణం చెందాకా కాలక్రమేణా తదుపరి పాళిరచనలలో-ఈ శూద్ర అతి శూద్రవర్ణాలు తక్కువ స్థాయి మనుషులుగా చెప్పబడ్డారు. ఒక జాతకకథలో చండాలుడు నగరంలోకి ప్రవేశించినందుకు ప్రజలు అతనిపై పిడిగుద్దులు కురిపించి స్పృహకోల్పోయేలా చేసారని ఉన్నది. మరొక జాతక కథలో చండాలునిపై వీచిన గాలిని తాకటం అంటే మైలపడినట్లు అని చెప్పబడింది. చండాలుడిని చూస్తే చాలు కళ్ళను మంత్రజలంతో శుభ్రపరచుకోవాలని ఇంకో జాతకకథలో ఉంది.[4]

బుద్ధుని కాలంలో అందరూసమానమని చెప్పినప్పటికీ క్రమేపీ అతిశూద్ర వర్గాలను దూరంపెట్టటానికి కారణం బౌద్ధంలోకి వచ్చిన బ్రాహ్మణ వర్ణం కారణమని ఒక వాదన కలదు.

***

బుద్ధుడు కులవ్యవస్థపై తన వ్యతిరేకతను ఇలా స్పష్టపరిచాడు.

1. కులవ్యవస్థను సృష్టించి, పోషించే ధర్మశాస్త్రాలను నిరసించాడు. శాస్త్రీయంగా అవి తప్పు అని నిరూపించటానికి ప్రయత్నించాడు.

2. కులవ్యవస్థ సృష్టించే అసమానతలు ఎంతటి అసంబద్దమో తార్కికంగా వివరించటానికి ప్రయత్నించాడు.

3. సన్యసించటం ద్వారా గత జీవితపు కుల/వర్ణ ఆధారిత హెచ్చుతగ్గులను వదిలించుకొని అందరూ సమాన హోదాలతో జీవించే సంఘాన్ని ఏర్పరచాడు.

4 వర్ణాంతర వివాహాలను బుద్ధుడు అంగీకరించాడు. విముఖత లేదు [5]

రెండున్నరవేల ఏండ్లతరువాత కులవ్యవస్థపై చేసిన పోరాటంలో డా. అంబేద్కర్ కూడా ఇవే మార్గాలను ఆశ్రయించటం ఆశ్చర్యం కలిగించకమానదు.

1. మనుధర్మశాస్త్రాన్ని దహనం చేసాడు

2. కులవ్యవస్థ ఎంతటి అమానుషమో అనేక వ్యాసాలు, పుస్తకాల ద్వారా చెప్పాడు.

3. తన అనుయాయిలతో హిందూమతాన్ని త్యజించి కులవ్యవస్థలేని బౌద్ధాన్ని స్వీకరించాడు.

4. కులనిర్మూలనకు కులాంతరవివాహాలు పరిష్కారమని చెప్పాడు.

కులవ్యవస్థ పై మహాత్మాగాంధి అభిప్రాయాలుకూడా ఇదే క్రమంలో ఉండటం మరింత ఆశ్చర్యం కలిగించకమానదు.

1. వర్ణ వ్యవస్థపట్ల మొదట్లో సానుకూలంగా ఉన్నప్పటికీ, క్రమేపీ మనుషులు అందరూ సమానం అని గుర్తించి, వివిధ వర్ణాల/కులాల ఎక్కువతక్కువలను తీవ్రంగా ఖండించాడు.

2. కుల పీడన అస్పృశ్యతలను ఖండించి వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేసాడు. కులవ్యవస్థపై గాంధి వ్రాసిన వ్రాతలలో ఎక్కువభాగం అస్పృశ్యత గురించే

3. గాంధి 1946 లో కాంగ్రెస్ లో చేరే యువతీయువకులు కులాంతరవివాహాలు చేసుకోవాల్సింది అని పిలుపు ఇచ్చాడు.

కులవ్యవస్థపై గాంధి 1920 లలో వెలిబుచ్చిన అభిప్రాయాలకు జీవిత చరమాంకానికి చేరాకా ఏర్పరచుకొన్న అభిప్రాయాలకు హస్తిమశకాంతర వ్యత్యాసం కనిపిస్తుంది.

కుల వ్యవస్థలోని లోపాలను సంస్కరించటంలో అంబేద్కర్ ది ఆచరణాత్మక పంథా అయితే, గాంధీది ఆదర్శాలను నింపుకొన్న మార్గం.

***

బౌద్ధసంఘం వెలుపల ఆనాటి సమాజంలో కుల వ్యవస్థ

బౌద్ధం వర్ణ/జాతి వ్యవస్థను నిర్ధ్వంద్వంగా తిరస్కరించిందని బౌద్ధసాహిత్యంలో అనేక ఆధారాలు లభిస్తాయి.  ఈ  కులవ్యవస్థ నిర్మూలన అనేది సన్యాసులవరకే పరిమితమనే భావన కలుగుతుంది.

ఆరో శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన హ్యుయాన్ త్సాంగ్ భారతదేశం నలుమూలలా సుమారు 20 పైగా వివిధ పట్టణాలలో వేలకొలదిగా విస్తరించి ఉన్న బౌద్ధసంఘాల  వివరాలను పొందుపరచాడు.  బౌద్ధ సంఘానికి వెలుపల సమాజం ఏ విధంగా ఉండేదో, అక్కడ సామాన్యప్రజలలో ఏ విధమైన స్తరీకరణ ఉన్నదో బౌద్ధరచనలద్వారా తెలుసుకొనవచ్చును.

ఆనాటి బౌద్ధ సమాజంలో దమ్మాన్ని స్వీకరించి ఆరామాలలో నివసించే సన్యాసులు/శ్రమణులు ఒకవైపు; సంసారిక జీవనాన్ని సాగిస్తూ బౌద్ధదమ్మం పట్ల విశ్వాసం కలిగి ఉండే సాంఘిక సమూహం మరొకవైపు ఉండేవి. 

ఈ సాంఘిక సమూహంలో, క్షత్రియులు, బ్రాహ్మణులు, గాహపతి (ఇంటియజమాని) అంటూ మూడురకాల వ్యక్తులు ఉండేవారు.  పరిపాలనా వ్యవహారాలు క్షత్రియులు, ఆద్యాత్మిక వ్యవహారాలు బ్రాహ్మణులు చూసేవారు.

ఆనాటి సమాజంలో గాహాపతులు చాలా ముఖ్యమైన వర్గం.  వీరు వ్యవసాయం, వ్యాపారం చేస్తూ సంపదలు సృష్టించి, రాజుకు పన్నులు కట్టి సమాజాన్ని ఆర్ధికంగా ముందుకు నడిపించేవారు.

2. బౌద్ధమతం ఎందుకు క్షీణించింది?  పార్టు 2

ఆర్కియాలజీ, సాహిత్యాల ఆధారంగా బౌద్ధం భారతదేశ నలుమూలలా బలంగా విస్తరించిందని తెలుస్తుంది. ఆరవశతాబ్దపు చైనా యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ రాతలలో ఆనాటి బౌద్ధ ఆరామాల విస్తరణ, ఇతర ఆరాధనా పద్దతులతో తులనాత్మకత లాంటి వివరాలు లభిస్తాయి.

  •  నేటి ఉత్తరప్రదేశ్ లోని కానౌజ్/కన్యాకుబ్జ లో బౌద్ధులు, ఇతర విశ్వాసులు సమాన సంఖ్యలో ఉన్నారు; వెయ్య ఆరామాలు, పదివేల బిక్షుకులు, 200 (హిందూ) దేవాలయాలు, కొన్ని వేలమంది దేవభక్తులు ఉన్నారు.
  • వారణాసిలో ముప్పై ఆరామాలు 3000 మంది భిక్షుకులు, 100 (హిందూ) దేవాలయాలు పదివేలమంది భక్తులు ఉన్నారు, వీరిలో ముఖ్యంగా పశుపతులు, జైనులు ఎక్కువ.
  • మగధలో 50 ఆరామాలు, పదివేలమంది భిక్షుకులు ఉన్నారు.
  • వైశాలి లో కొన్ని వందల ఆరామాలు ఉన్నాయని కానీ అవన్నీ శిథిలమైపోయాయని, బౌద్ధ భిక్షుకులు కొద్దిమంది మినహా చాలామంది వైశాలిని విడిచివెళ్ళిపోయారని, కొన్ని పదుల దేవ ఆలయాలు ఉన్నట్లు తెలిపాడు.
  • పుండ్రవర్ధన (బెంగాల్) లో 3000 భిక్షకులతో ఇరవై ఆరామాలు, కొన్ని వందల ఆలయాలు ముఖ్యంగా జైనులు ఉన్నారు.
  • సముద్రతీర పట్టణమైన Samatata లో 30 ఆరామాలు, 2000 మంది భిక్షకులు ఉన్నారు.
  • తామ్రలిప్తి లో 10 ఆరామాలు, 50 దేవ ఆలయాలు ఉన్నాయి.
  • ఓడ్ర (ఒరిస్సా) దేశంలో బౌద్ధులు ఎక్కువగా ఉన్నారని, 100 ఆరామాలతో 10 వేల భిక్షుకులు నివసిస్తున్నారని చెప్పాడు
  • కోశల (ఉత్తరప్రదేష్) లో 100 ఆరామాలు 10 వేలమంది భిక్షుకులు, 70 దేవ ఆలయాలు ఉన్నాయని చెప్పాడు.
  • పిఠాపురం (వేంగి?) 30 కి పైగా బౌద్ధారామాలు, చాలామట్టుకు శిథిలస్థితిలో ఉన్నాయి. 3000 మంది భిక్షుకులు, 100 కు పైగా దేవ ఆలయాలు ఉన్నాయని వాటికి శైవ, జైన విశ్వాసులు ఉన్నారు.
  • తమిళనాడు కాంచిపురంలో 100 కు పైగా ఆరామాలు, 10 వేలకు పైగా భిక్షుకులు ఉన్నారని, 80 కి పైగా దేవ ఆలయాలు అసంఖ్యాకంగా జైనులు ఉన్నట్లు చెప్పాడు.
  • మహారాష్ట్రలోని కొల్లాపూర్ లో వందకు పైగా సంఘారామములు పదివేల భిక్షుకులు ఉన్నట్లు చెప్పాడు.
  • నాసిక్ లో 100 ఆరామాలు, 5000 మంది భిక్షుకులు, 100 కు పైగా దేవ ఆలయాలు ఉన్నాయని చెప్పాడు. అజంతా గుహలగురించి కూడా వర్ణించాడు.
  • మాలవా (మాళ్వా) పంజాబ్ లో 100 ఆరామాలు, 2000 భిక్షుకులు ఇంకా ఎక్కువసంఖ్యలో ఇతర విశ్వాసులు ఉన్నారు ముఖ్యంగా శైవులు.
  • వలాభి (గుజరాత్ ) వంద వరకూ ఆరామాలు, 6000 మంది భిక్షకులు ముఖ్యంగా థెరెవాద బౌద్దులు. అనేక వందల దేవ ఆలయాలు ఉన్నాయి.
  • గుర్జర (రాజస్థాన్) లో ఉన్న ఆరామాలు శిథిలస్థితిలో ఉన్నాయని, శైవం ప్రముఖంగా ఉందని చెప్పాదు.
  • సింధ్ (పాకిస్తాన్) వందలకొలదీ ఆరామాలు ఉన్నాయని 10000 మంది భిక్షక పూజారులున్నారని. వీరు ఎక్కువగా థెరెవాద బౌద్ధులని చెప్పాడు. శైవులు కూడా గణనీయంగా ఉన్నారు [6].

పై వివరాల ద్వారా ఒకనాటి అఖండ భారతదేశంలో బౌద్ధం ఏమేరకు విస్తరించిందో స్పష్టంగా అర్ధమౌతుంది. పై వివరాలను గమనిస్తే బౌద్ధానికి ప్రత్యామ్నాయంగా అప్పట్లో జైనం, శైవం ఉన్నట్లు కనిపిస్తుంది. వీటినే దేవాలయాలుగా హ్యుయాన్ త్సాంగ్ చెప్పాడు. ఆరామాలు ఆధ్యాత్మిక బోధనలేకాక వ్యాపార, బాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే కేంద్రాలుగా, వైద్యం[7] , విద్య (ఒకనాటి విశ్వవిద్యాలయలు బౌద్ధులని) అందించే ఉన్నత స్థానాలుగా ఉండేవి.

పై జాబితాలో ఎక్కడా వైష్ణవాలయాలు లేకపోవటాన్ని బట్టి వైష్ణవం ఇంకా వెలుగులోకి వచ్చినట్లు అనిపించదు. భారతదేశ జనాభాలో ఎంతమంది బౌద్ధాన్ని ఒక ధార్మిక జీవన విధానంగా చేసుకొన్నారో అనేదానికి స్పష్టమైన లెక్కలు లేవు.

దేశం నలుచెరగులా విస్తరించిన బౌద్ధం పన్నెండో శతాబ్దానికల్లా దాదాపు క్షీణించింది. అదేకాలంలో ఆదరణకు నోచుకొంటున్న వైష్ణవం బుద్ధుడిని విష్ణుమూర్తి అవతారంగా కలుపుకొని ఒక పురాణపురుషునిగా చేసుకొంది. కానీ ఈ ప్రయత్నం రామ, కృష్ణావతారాలలాగా ప్రసిద్ధిచెందలేదు.

బుద్ధుని తరువాత వ్రాసిన ఉపనిషత్తులు, పురాణాలు, సంస్కృత, ప్రాకృత కావ్యాలు బుద్ధుని గురించి పెద్దగా చెప్పలేదు. బౌద్ధ పండితుల రచనల వ్రాతప్రతులు ఒక్కటీ లభించలేదు, కనీసం ఆయారచనలలోంచి ఆలంకారిక ఉదాహరణలు అలంకార శాస్త్ర గ్రంధాలలోకికూడా ఎక్కలేదు. బుద్ధచరిత, సౌందరానంద, మరి కొన్ని బౌద్ధ గ్రంధాలు తప్ప – బౌద్ధ సన్యాసుల జీవనం, సంఘ నిర్మాణం, బుద్ధిస్ట్ ఆర్ట్, బుద్ధుని బోధనల పై పండిత చర్చలు, బుద్ధుని కాలపు విశేషాలు లాంటివి అన్నీ భారతదేశంలో 12 వ శతాబ్దానికి వచ్చేసరికే కాలగర్భంలో కలిసిపోయాయి.

యూరోపియన్ చరిత్రకారులు James Prinsep, Alexander Cunningham, Henry Olcott లాంటి వారు టిబెట్, సిలోన్, జపాన్ లాంటి దేశాలలోని పాళి భాషలో ఉన్న బుద్ధుని రచనలను సేకరించి ఇంగ్లీషులోకి అనువదించి ప్రపంచానికి పరిచయం చేసారు. ఆ తరువాత శ్రీలంకు చెందిన Anāgārika Dharmapāla ఇంకా Sarat Chandra Das, Satish Chandra Vudyabhushan, Hara Prasad Sastri, Lakshmi Narasu వంటి భారతీయులు విదేశాలలోఉన్న బౌద్ధ రచనలను సేకరించి అనువదించే మహా క్రతువులో పాలుపంచుకొన్నారు. 1908 లో మెట్రిక్యులేషన్ పాస్ అయినందుకు డా. బి.ఆర్. అంబేద్కర్ కు బుద్ధుని జీవితంపై Krishnaji Arjun Keluskar వ్రాసిన పుస్తకం బహుమతిగా ఇవ్వబడింది. వీరందరి కృషి కారణంగా 12 వ శతాబ్దంలో అంతర్ధానమైన బౌద్ధం 20వ శతాబ్దం వచ్చేసరికి భారతీయులకే కాక మొత్తం ప్రపంచానికి తెలిసింది.

***

బౌద్ధం ఎందుకు కనుమరుగైందో తెలిపే చారిత్రిక ఆధారాలు పెద్దగా కనిపించవు. భారతదేశంలో బౌద్ధానికి చెందిన ఒక్క వ్రాతప్రతి లభించలేదు. టిబెట్, చైనా, శ్రీలంకలలో లభించిన వాటి అనువాదాలే నేటి బౌద్ధ సాహిత్యం అంతా. ప్రముఖ ఇండాలజిస్టు A.L. Basham బౌద్ధం క్షీణించటాన్ని ఇలా విశ్లేషించాడు

1. ఊచకోతలు ప్రధానకారణం కాదు

2. అప్పటికి ఉన్న విశ్వాసాలు సంస్కరించబడి “హిందూమతం” పేరిట స్థిరీకరించబడటం

3. వైష్ణవం, శైవం క్రమేపీ ఇతర దేవతారాధనలు అన్నీ ఒకే గొడుగు క్రిందకు తీసుకురావటం

4. విస్త్రుతమైన ప్రచారం, శంకరాచార్యునిచే వ్యవస్థీకృత నిర్మాణం దానికి లభించిన రాజాదరణ

5. అప్పటికే క్షీణిస్తున్న బౌద్ధంపై యుద్ధోన్మాదంలో ముస్లిములు చేసిన దాడులు ఆఖరి అస్త్రంగా పరిణమించాయి.

భారతదేశంలో క్రీపూ. రెండో శతాబ్దంలోని పుష్యమిత్రశుంగుడి నుంచి ఆరోశతాబ్దంలోని తురుష్కరాజైన– Mihirakula వరకూ బౌద్ధమతాన్ని వివిధ దశలలో హింసాత్మకంగా అణచివేసినట్లు పదహారవ శతాబ్దానికి చెందిన టిబెట్ బౌద్ధగురువు తారానాథుని రచనల ద్వారా తెలుస్తున్నది. ఇదే తరహా ఊచకోతలు ఆ తరువాత హిందూమతంపై కూడా జరిగాయి. కనుక ఒక్క ఊచకోతలవల్లే బౌద్ధం కనుమరుగు అయి ఉండకపోవచ్చు.

***

సూర్యుడు, గణేశుడు, పార్వతిదేవి, శివుడు, విష్ణువు మొదలైనవారు పంచదేవతలని, వీరిని ప్రధాన దేవతలుగా ఆరాధించటాన్ని పంచాయతన పూజావిధానం అంటారు. ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు ప్రవేశపెట్టినట్లు చెప్పే, ఈ పంచాయతన పూజావిధానం ద్వారా వివిధ ఆరాధనాపద్దతులు ఏకం అవ్వటంతో బలమైన హిందుమత భావన కలిగింది. శంకరాచార్యుడు అఖండ భారతావని అంతా తిరిగి హిందుధర్మాన్ని ప్రచారం చేసి, అనేకచోట్ల పండిత చర్చలు జరిపి ఆలయాలు స్థాపించి-హిందూమతానికి ఒక వ్యవస్థీకృత రూపాన్ని తీసుకొచ్చాడు.

***

ఏడో శతాబ్దం వరకూ రాజులు బౌద్ధాన్ని, జైనాన్ని హిందూమతాన్ని సమాదరించారు. క్రమేపీ హిందూమతం పట్ల ఆదరణ పెరిగింది. దీనికి కారణం … రాజ్యానికి కావల్సిన వెట్టిచాకిరీ చేసే వర్గం ఒకటి హిందూమతం ఏర్పరచిన కులవ్యవస్థ వలన చాలా సులువుగా అందుబాటులోకి వచ్చింది. ఉత్పత్తి వర్గాలుగా ఈ బహుజన సమూహం సమాజ ఆర్ధిక అభివృద్ధికి ఉపయోగపడింది. ఇదంతా సంపదను తేరగా అనుభవించే పాలకులకు లాభించే వ్యవహారం.

అంతే కాక హిందూమతం రాజుకి దేవునితో సమానమైన స్థానాన్ని కట్టబెట్టింది. కొన్ని జాతక కథలలో రాజు తప్పు చేస్తే ప్రజలు తిరగబడి అతడిని చంపివేసినట్లు ఉండటాన్ని బట్టి బౌద్ధమతంలో రాజుకు సర్వాధికారాలు లేవని అర్ధమౌతుంది.[10] తమిళ ప్రాచీన కావ్యం శిలపధికారంలో నెడుంజెళియన్ అనే రాజు తప్పుడు తీర్పు ఇచ్చినందుకు మరణించటమే కాక అతని రాజ్యం నాశనమవ్వటం రాజు ధర్మానికి కట్టుబడి లేకపోతే నాశనం అవుతాడు అనే భావనను హిందూవేతర మతాలు ప్రచారంచేసాయి. అంతేకాక బౌద్ధ, జైనాలలో రాజు సర్వస్వంగ పరిత్యాగి. హిందూ రాజుకు అలాంటి పరిమితులు లేవు భోగలాలసుడుగా కూడా ఉండొచ్చు. సర్వశక్తిసంపన్నుడు. అది రజోగుణం. ఈ అంశాలన్నీ కూడా హిందూమతానికి రాజాదరణ లభించటానికి కారణం కావొచ్చు.

***

బుద్ధుని సంఘారామం తమ పోషణ కొరకు ధనికులపై ఎక్కువగా ఆధారపడేది. బౌద్ధమతం పట్టణాలలో బాగా విస్తరించింది. దీనికి పోషకులు వ్యాపారులు. విదేశీవ్యాపారం తగ్గిపోవటంతో వ్యాపారవర్గాల ప్రాభవం తగ్గిపోయింది. క్రమేపీ భూస్వామ్యవాదం పెరిగింది. ఈ క్రమంలో హిందూమతం – పంచాంగం ద్వారా వానలు పడే కాలాన్ని చెబుతూ, విత్తనాలు ఎప్పుడు జల్లాలి, కోతలు ఎప్పుడు కోయాలి అనే అంశాలకు ముహుర్తాలు పెడుతూ వ్యవసాయాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకొంది. ఆ విధంగా హిందుమతం గ్రామీణ ఫ్యూడల్ వ్యవస్థను బలోపేతం చేసి తన అదుపాజ్ఞలలో. ఉంచుకొంది.

ఇక పట్టణాలలో బౌద్ధ ఆరామాలకు రాజాదరణ, వ్యాపారుల ఆదరణతగ్గి, నిర్వహణకొరకు నిధులు కరువై రకరకాల హీన పద్దతులకు పాల్పడవలసి వచ్చింది. బుద్ధుని దంతాన్ని ప్రదర్శనకు పెట్టి, తలకు ఒక్కో బంగారు నాణెం చొప్పున వసూలుచేసేవారు. ఇది సామాన్యజనానికి అందుబాటులో లేని రుసుము. బౌద్ధంలో చీలికల కారణంగా ఏర్పడిన వజ్రయానం తాంత్రిక పూజావిధానాలను అవలంబించింది. నగ్నలైంగిక పూజలు ఒక ఆరాధనవిధానంగా బోధించటంతో ప్రజలకు ఏవగింపు కలిగి బౌద్ధం క్రమేపీ ఆదరణ కోల్పోయింది. అందుకనే కొన్నిచోట్ల బౌద్ధ శిథిలాలను లంజల దిబ్బలుగా స్థానికులు పిలుస్తారు.

***

3. ప్రాచీన భారతదేశం బౌద్ధులదా? హిందువులదా? పార్టు 3

క్రీ.పూ మూడవశతాబ్దం నుంచి కనిపిస్తున్న కళలు, కట్టడాలు, శాసనాలు ప్రాచీన భారతదేశం బౌద్ధులకు చెందినదని నిర్ధ్వంద్వంగా నిరూపిస్తాయి. విహారాలు, స్తూపాలు, గుహలు, చైత్యగృహాలు, ఆరామాలు, గాంధారి, అమరావతి శైలి విగ్రహాలు మొదలైన బౌద్ధనిర్మాణాలు ముఖ్యంగా.

బుద్ధుని సమకాలీనరాజులైన బింబిసారుడు, పెసనెది బౌద్ధం పట్ల సానుకూల దృక్ఫథం కలిగి ఉన్నారు. అశోక చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించాడు. అశోకుని అనంతరం పుష్యమిత్ర శుంగుడు (క్రీపూ 2 వ శతాబ్దం) బౌద్ధాన్ని పక్కనపెట్టి వైదిక క్రతువులను ప్రోత్సహించాడు. ఇతని కాలంలోనే మనుస్మృతి రచింపబడి ఉంటుందని డా.అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. ఆ తరువాత వచ్చిన గుప్తులకాలంనుంచి (క్రీశ. 2-5 వశతాబ్దం) హిందూ ఆలయాలు కనిపించటం మొదలౌతుంది. సాహిత్యానిది కూడా ఇదే ఒరవడి. హిందూ సంస్కృత సాహిత్యంకన్నా బౌద్ధ పాలి సాహిత్యం ప్రాచీనమైనది. వైష్ణవం, శైవం కలిసిపోవటం, ధర్మశాస్త్రాలు ఏర్పడటం లాంటివి హిందూమతం సాంద్రపడటానికి దోహదపడిన అంశాలు.

***

బౌద్ధ, హిందు మతాలలో రాజ్యం ఏడు అంగాలను కలిగి ఉండాలని చెప్పాయి. బౌద్ధం ప్రకారం రాజ్యానికి దమ్మ చక్రం, ఏనుగు, గుర్రం, మణులు, రాణి, మంత్రి, గృహస్థు ఉండాలి. హిందుమతం ప్రకారం ఆ ఏడు అంగాలు ఇలా ఉన్నాయి- రాజు, మంత్రులు, సరిహద్దులు, కోటలు కలిగిన రాజ్యాలు, ఖజానా, సైన్యం, రక్షకభటులు, మిత్రకూటమి. హిందూ రాజ్యలక్షణాలలో కనిపించే హింస, యుద్ధం, రక్షణ లాంటి అంశాలు బౌద్ధం చెప్పిన రాజ్యలక్షణాలలో కనిపించకపోవటం గమనార్హం.

 

బౌద్ధం ప్రకారం వ్యాపారులు, కులవృత్తి సంఘాలు (artisan guilds) ఆనాటి ఆర్ధిక వ్యవస్థని నియంత్రించేవారు. పెద్ద ఎత్తున విదేశీ వ్యాపారం జరిపారు. ఇది ఒకరకంగా స్వేచ్ఛావిఫణి సిద్ధాంతం లాంటిది. పెట్టుబడిదారి వ్యవస్థ. రాజుపాత్ర పరిమితం. హిందూరాజ్యం అలా కాదు. అది ఫ్యూడల్ వ్యవస్థను సమర్ధిస్తుంది. కౌటిల్యుని అర్ధశాస్త్రం వ్యాపారులను దొంగలంటుంది. హిందూ రాజ్యంలో ఆర్ధిక వ్యవస్థను రాజు నియంత్రించేవాడు. రాజు/భూస్వామి సర్వ శక్తివంతుడు.

బౌద్ధ సంఘం రాజు నియంత్రణకు వెలుపల ఉండేది. 

బౌద్ధసమాజంలో సాంఘిక జీవనం

ఆనాటి బౌద్ధ సమాజంలో దమ్మాన్ని స్వీకరించి ఆరామాలలో నివసించే సన్యాసులు/శ్రమణులు ఒకవైపు; సంసారిక జీవనాన్ని సాగిస్తూ బౌద్ధదమ్మం పట్ల విశ్వాసం కలిగి ఉండే సాంఘిక సమూహం మరొకవైపు ఉండేవి. ఈ సాంఘిక సమూహంలో, క్షత్రియులు, బ్రాహ్మణులు, గాహపతి (ఇంటియజమాని) అంటూ మూడురకాల వ్యక్తులు ఉండేవారు. పరిపాలనా వ్యవహారాలు క్షత్రియులు, ఆద్యాత్మిక వ్యవహారాలు బ్రాహ్మణులు చూసేవారు.

ఇక గాహాపతులు ఆనాటి సమాజంలో చాలా ముఖ్యమైన వర్గం. వీరు వ్యవసాయం, వ్యాపారం చేస్తూ సంపదలు సృష్టించి, రాజుకు పన్నులు కట్టి, సమాజాన్ని ఆర్ధికంగా ముందుకు నడిపించేవారు. భూములు, తోటలు, పశువులు, దశ్యులు/బానిసలు, బంగారం వెండి లాంటి సంపదలన్నీ వీరి ఆధీనంలో ఉండేవి. వీరే ఆరామాల నిర్మాణ, నిర్వహణల కొరకు విరాళాలు ఇచ్చేవారు.

వివిధ వ్యాపార/వ్యవసాయ కార్యక్రమాలకొరకు అనేకమంది దస్యులు, కూలీలు గాహాపతుల ఆధీనంలో ఉండేవారు. వీరందరికీ గాహపతులు ఉపాధి కల్పిస్తూ పోషణ జరిపేవారు. బుద్ధభగవానుడు ఒకనాడు పుత్త సిగాలా అనే గాహాపతి తో “అతని వద్ద ఉన్న దస్యులను ప్రేమగా చూసుకొమ్మని, వారి శక్తికి అనుగుణంగా పని కేటాయించమని, చక్కని ఆహారము, బత్యములు అందించమని, అనారోగ్యానికి గురయితే అవసరమైన శలవులు ఇవ్వమని” కోరటాన్ని బట్టి ఆనాటి సమాజంలో క్షత్రియులు, బ్రాహ్మణుల సరసన గాహాపతులు పోషించిన పాత్రను అర్ధం చేసుకొనవచ్చు. (Mahavagga, p.255).

బౌద్ధ సమాజంలో ఈ గాహాపతుల ఆస్తులకు నష్టం కలిగించిన వారిని కఠినంగా శిక్షించేవారు. అనంతపిండక, దమ్మదిన్న లాంటి గాహాపతులు వందల కొద్దీ అనుచరులతో వచ్చి బుద్ధుని దర్శించుకొనేవారని అంగుత్తర నికాయ లో చెప్పబడింది.

బౌద్ధసన్యాసులు అవసానదశలో ఉన్నప్పుడు బుద్ధభగవానుడు వచ్చి వారిని పరామర్శించటం ఒక ఆచారం. ఇదే సంప్రదాయం నకులపిత అనే గాహాపతి అస్వస్థుడైనపుడు బుద్ధభగవానుడు సందర్శించడాన్ని బట్టి- గాహాపతులు బౌద్ధ సంఘం వెలుపల ఉన్నప్పటికీ బౌద్ధ సన్యాసులతో సమానమైన గౌరవాన్ని పొందేవారని అర్ధం చేసుకొనవచ్చును.

ప్రస్తుత శ్రీలంక బౌద్ధ సమాజంలో – క్షత్రియులు, బ్రాహ్మణులు లేకపోవటం గమనార్హం. క్షత్రియులు రాజు పాత్రకు పరిమితం కావటంతో వారి సంఖ్యపరిమితం. ఆద్యాత్మిక వ్యవహారాలు చూడటానికి బౌద్ధ భిక్షుకులు సరిపోతారు కనుక బ్రాహ్మణుల పాత్ర లేకపోవటంతో వారి ఉనికి కూడా లేదు. బౌద్ధంలో అస్పృశ్యత లేదు. అందుచేత శ్రీలంక బౌద్ధ సమాజంలో అస్పృశ్యులు లేరు. ఆ సమాజంలో మూడువంతుల మేర వ్యవసాయ, వ్యాపార వృత్తులు నెరపే గోయిగామ అనే వర్గం ఉన్నది. ఇది ప్రాచీనబౌద్ధంలోని గాహాపతులు గా పోల్చుకొనవచ్చును. మిగిలినవారు శ్రామికులు, కూలీలు. నిజానికి చాతుర్వర్ణ వ్యవస్థ, దానికి వెలుపల అస్పృశ్యులను ఏర్పరచిన హిందుభావజాలం భారతీయ సమాజాన్ని ఏ మేరకుప్రభావితం చేసిందో శ్రీలంక బౌద్ధ సమాజాన్ని చూస్తే అర్ధమౌతుంది. (రి. Social Dimentions of Early buddhism by uma chakravarthi p.115-118). బౌద్ధం అంతరించకపోయి ఉన్నట్లయితే భారతదేశ సమాజం ఇలాగే ఉండొచ్చనే ఊహ మరీ విపరీతమైనది కాకపోవచ్చు.

బుద్ధుని బోధనలపట్ల ఆకర్షితులైన ప్రజలలో కొద్దిమంది సంఘంలో చేరి బౌద్ధాన్ని ఆచరించారు, మరికొందరు సంఘం వెలుపల ఉంటూ సంసారిక జీవనాన్ని సాగిస్తూ బుద్ధుని బోధనలను నిజజీవితంలో పాటించారు.

సంఘంలో చేరిన 105 మందిలో బ్రాహ్మణులు 39, క్షత్రియులు 28, పై కులస్థులు 21, (ucca kulas-వణిజులు, శెట్టి, గణిక) క్రింది కులస్థులు 8 మంది (nica kulas చుండ, కమ్మర, కుంభకార) ఉన్నట్లు బౌద్ధరచనలద్వారా అర్ధమౌతుంది. ఈ లెక్కలు ఆనాటి సమాజంలోని స్తరీకరణను అర్ధం చేసుకోవటానికి ఉపయోగపడతాయి.

సంఘం వెలుపల సామాన్యజీవనం సాగిస్తూ బుద్ధుని బోధనలపట్ల సానుకూలతను ఏర్పరచుకొన్న వారిని ఉపాసకులని పిలిచేవారు. విహారాలు నిర్మించటం, దుస్తులు దానం చేయటం, మందులు, ఆహారము అందించటం లాంటి పనులద్వారా ఉపాసకులు బౌద్ధ సంఘానికి తమ సహాయసహకారాలు అందించేవారు. ఈ పనులు చేసినందుకు ప్రతిఫలంగా బౌద్ధ భిక్షువులు వీరికి దమ్మమార్గాన్ని ప్రభోదించేవారు.

బుద్ధుడు జీవించి ఉన్న కాలంలో ఇలా ఉపాసకులుగా 175 మంది ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో బ్రాహ్మణులు 76, గాహాపతులు 33, పైకులాల వారు 26, క్షత్రియులు 22, క్రింది కులాలవారు 11 మంది ఉన్నట్లు గుర్తించారు.

పైన చెప్పిన 76 మంది బ్రాహ్మణులలో ఎనిమిది మంది సంపన్నులు, పేరు ప్రతిష్టలు కలిగినవారు. వారు పొక్కరసాది, సొనాదన్ద, కుటాదంత, లోహిచ్చ. వీరు కోసల, మగధ లలో బ్రాహ్మణీయ భూములను అనుభవిస్తున్న హిందూ బ్రాహ్మణులు. వీరు బౌద్ధమతం వైపు ఆకర్షితమవటం ఆనాటి సమాజంలో గొప్ప ప్రభావితం చూపిన ఉదంతం అయి ఉండవచ్చు. బౌద్ధం బ్రాహ్మణవర్ణానికి పెద్దపీట వెయ్యకపోయిన వారు ఆద్యాత్మిక అన్వేషణలో భాగంగా బౌద్ధంలోకి చేరి ఉంటారనేది ఒక అభిప్రాయం. (రి. . Social Dimentions of Early buddhism by uma chakravarthi p.130-139)


ముగింపు

మతం అనే భావన ఆధునికమైనది. ఈనాడు మతం దాదాపు అనువంశికంగా పరిణమించింది. స్వేచ్ఛపరిమితం. భారతదేశ చరిత్రలో భిన్న భావజాలాలు కలిసి జీవనం చేసాయి. ఒకే కుటుంబంలో వివిధ వ్యక్తులు భిన్న ఆరాధనా పద్దతులను పాటించేవారు. ఒక ఆరాధనా విధానంనుంచి మరొక విధానంలోకి మారటం సహజంగా జరిగిపోయేది. బౌద్ధ థెరిగాథలలో – జైనం, హిందు, అజీవక జీవన విధానాలనుంచి బౌద్ధంలోకి వచ్చిన స్త్రీల గాథలు అనేకం కనిపిస్తాయి. శాతవాహనులు, ఖారవేలుడు, చాళుక్యులు భిన్న ఆరాధనా విధానాలను ప్రోత్సహించారు. మనపూర్వీకులు అనుభవించిన స్వేచ్ఛ అది.

బౌద్ధం కాలక్రమేణా హీనయాన ( థెరెవాద), మహాయాన, వజ్రయాన అంటూ వివిధ శాఖలుగా చీలిపోయింది. థెరెవాద బౌద్ధంలో ఉపాసకులకు బౌద్ధ సన్యాసులకు మధ్య దూరం ఎక్కువ. ఎందుకంటే థెరెవాద బౌద్ధంలో సంసారజీవితాన్ని త్యజించి సన్యసించటం ముఖ్యం. అందువల్ల ఆ బౌద్ధ విధానంలో సంసారులకు పెద్దగా పాత్ర ఉండేది కాదు.

బుద్ధుని అనంతరం వచ్చిన మహాయాన బౌద్ధశాఖలో సన్యసించటం ముఖ్యం కాదు. కనుక ఉపాసకులు పరిత్యాగంతో సంబంధంలేకుండా బుద్ధుని బోధనలు ఆచరించేవారు. అలా బౌద్ధం సామాన్య ప్రజలలోకి వెళ్ళగలిగింది.

బౌద్ధం దయ, మానవత, సమానత్వాలను బోధించింది. జన్మ ఆధారంగా మనుషుల ఎక్కువతక్కువలను బౌద్ధం ఖండించింది. స్త్రీలకు మతాచారాలలో సమాన పాత్రను ఇచ్చింది. భారతదేశ చరిత్ర హిందూమతానికి, బౌద్ధమతానికి మధ్య జరిగిన సాంస్కృతిక, సామాజిక ఘర్షణగా డా. అంబేద్కర్ చూసాడు.

ఆలోచనలు, సాహిత్యం, శిల్పశైలి, నిర్మాణ విశిష్టలతో కూడిన బౌద్ధమతం- లోతులు ఇంకా తెలియని ఒక జ్ఞాన భాండాగారం. భారతదేశ చరిత్రను, సంస్కృతిని, ఆత్మను నిర్మించటంలో బౌద్ధమతం పోషించిన పాత్ర అపురూపమైనది. మానవజాతి ప్రయాణంలో బౌద్ధం తీసుకొచ్చిన భావజాల విప్లవం గొప్ప మైలురాయి.=


బొల్లోజు బాబా

 [1] ‘Ime cattāro vaṇṇā samasamā honti. Samao Gotamo cātuvaṇṇi suddhi Paññāpeti Majjhima Nikāya II,.

[2] “na jaccā vasalo hoti, na jaccā hoti brāhmao/kammunā vasalo hoti, kammunā hoti brāhmao”

[3] Buddha and Ambedkar on caste by Mahesh A. Deokar

4. Jātaka, (1877–1897) Vol. IV).

5. “brāhmaṇīṃ katriyākanyāṃ vaiśyāṃ sūdrīṃtathaiva ca |yasyā ete guṇā santi tā me kanyāṃ pravedaya || na kulena na gotrea kumāro mama vismita | gue satye ca dharme ca tatrāsya ramate mana ||”

[6] పే. 153 Buddhism in India, Gail Omvedt

[7] బౌద్ధ ఆరామాలు నేటి ఆసుపత్రుల వలే వైద్యసేవలు అందించేవి. నాగార్జునకొండ వద్ద vigatajvar’ālaye (Fever house) పేరుతో దొరికిన ఒక ఫలకముపాటలిపుత్ర లో ఒక ఆరామం వద్ద జరిపిన తవ్వకాలలోī ārogyavihāre (Healing House) అనే ఒక ఫలకముధన్వంతరి అనే పేరుకలిగిన మరోఫలకముశ్రీలంక బౌద్ధ రచనలలో Rogalaya పేరుతో ఆరామంలోని ప్రత్యేక నిర్మాణాలు ఈ దృగ్విషయానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. రి. Health care in Indian Buddhism, Jessica Fish; Ancient Monastic Hospital System in Sri Lanka, Dr. L. Prematilleke

[8]. 136 Buddhism in India, Gail Omvedt).


సంప్రదించిన పుస్తకాలు

1. Classical Buddhism, Neo-Buddhism And The Question Of Caste by Edited by Pradeep P Gokhale

2. Buddhism in India Challenging Brahmanism and Caste, by Gail Omvedt

3.Social Dimentions of Early Buddhism by Uma Chakravarti

4. Social Aspects of Early Buddhism by Devananda

5. Archaeology Of Early Buddhism By Lars Fogelin

6. Buddhism and India by JB Sharma, SP Sharma

7. Health care in Indian Buddhism, Jessica Fish; Ancient Monastic Hospital System in Sri Lanka, Dr. L. Prematilleke

8. Health Care In Indian Buddhism: Representations Of Monks And Medicine In Indian Monastic Law Codes By Jessica Fish, B.A.

 

Tuesday, February 1, 2022

అన్యతార (అనామిక) - థెరిగాథ

 అన్యతార (అనామిక) - థెరిగాథ


.

ఇంటిని విడిచి ఏళ్లు గడిచాయి

కూర్చొవటం, నడవటం, ఎదురుచూడటం

ఇదే నా దినచర్య

చర్మం ఎండిపోవటం, జుత్తు నెరవటం

గమనించుకోనేలేదు, 

హఠాత్తుగా 

నేను వృద్ధురాలినైపోయాను

ఓ రోజు ఒక పొలంలో నిద్రించాను

భోరున వాన

ఆ బురదలో, నిస్సహాయంగా నేను

ఇంటికి చేరినట్లు అనిపించింది.

ఎవరో నన్ను ఆరామానికి మోసుకొచ్చారు

ఆ రాత్రి నాకు అర్ధమైంది

మనం ఎక్కడనుంచి వచ్చాం 

ఎక్కడకు వెళుతున్నాం అని

ఆ మర్నాడు 

అదే పొలానికి వెళ్ళి కూర్చున్నాను

మరలా భోరున వాన 

నేను అక్కడి దాననే అని 

ఒక్కో వానచుక్కా చెబుతోంది

బాట ముగిసిపోవటం

నీకు తెలిసిపోతుంది.

(transcreated from The First Free Women, By Matty Weingast)

***

అన్యతార మహాప్రజాపతి గౌతమికి సహాయకురాలు.  ఈమె గౌతమి వద్ద సన్యాసం తీసుకొంది.  ప్రాపంచిక విషయాలపట్ల లౌల్యంచే ఈమెకు ఇరవై ఐదేండ్లు శ్రమించినా జ్ఞానం సిద్ధించలేదు. మరొక బౌద్ధ సన్యాసిని అయిన ధమ్మదిన్న బోధనలు విన్నతరువాత ఈమె సాధన సఫలమైంది. 

అనువాదం 

బొల్లోజు బాబా