Tuesday, October 24, 2023

బౌద్ధ చిహ్నారాధన - పార్టు 3

4. బుద్ధుని పాదముద్రలు
.
గురువులు, పెద్దల పాదాలను పూజించటం, వాటికి శిరస్సుముట్టించి ప్రార్ధించటం ఒక సంప్రదాయం. బుద్ధునికి ప్రతిరూపంగా బుద్ధ పాదాలను పూజించటం ఆ కోవకు చెందినదే.
ద్రోన (Drona) అనే పేరుకల బ్రాహ్మణుడు ఒకనాడు బుద్ధభగవానుని పాదముద్రలను చూసి, అవి అపూర్వమైనవని గుర్తించి ఆ పాదముద్రలను విడిచిన వ్యక్తికొరకు అన్వేషించి బుద్ధభగవానుని కలిసాడట. ఆయనవద్ద అనేక ఆథ్యాత్మిక సందేహాలకు సమాధానాలు దొరకటంతో, బుద్ధభగవానుడే “మహాపురుషుడు” అని గుర్తించిన ద్రోన, బౌద్ధసంఘంలో చేరినట్లు బౌద్ధసాహిత్యం ద్వారా తెలుస్తున్నది. [1] . ఈ కథద్వారా బుద్ధపాదాలు బుద్ధభగవానుని చేర్చే సాధనాలు అని చెబుతున్నట్లు అర్ధం చేసుకోవాలి.
రాతిపై పల్లముగా (concave) చెక్కిన పాద ఆకృతి బుద్ధభగవానుడు ఆ ప్రదేశంలో నడయాడినదానికి సూచన. రాతిపై ఉబ్బెత్తుగా (convex) చెక్కిన ముద్రలు బుద్ధభగవానుడి పాదాలు. ఇవి భక్తులకు ఆథ్యాత్మిక మార్గదర్శనం చేసే చిహ్నాలు.
బుద్ధపాదాలకు ప్రత్యేకమైన మందిరాలు నిర్మించి పూజించటం జరిగేదని తొట్లకొండ, బావికొండ బౌద్ధ శిథిలాల ద్వారా తెలుస్తుంది. అమరావతి శిథిలాలలో లభించిన బుద్ధపాదాలలో-పద్మం, ధర్మచక్ర, స్వస్తిక, త్రిరత్న చిహ్నాలు ఉంటాయి. ఆ తరువాత కాలంలో చెక్కిన బుద్ధపాదాలపై, 8 (అష్టమంగళ), 16(షోడశ) 108 (అష్టశత) చిహ్నాలవరకూ ఉండటం ఒక పరిణామం. [2]
ఈ నేలపై నడయాడిన పుణ్యపురుషులు విడిచిన పాదముద్రలను పవిత్రంగా చూసుకోవటం అన్నిమతాలలోను కనిపిస్తుంది. Domine Quo Vadis చర్చ్ లో ఒక పాలరాతిపై ఉన్న పాదముద్రలు ఏసుక్రీస్తువని భక్తుల విశ్వాసం. జెరుసలెం లో Dome in the Rock వద్ద ఉన్న గురుతులు మహమ్మదు ప్రవక్త పాదముద్రలని నమ్ముతారు.
భారతదేశం నలుమూలలా కనిపించే పాదముద్రలు విష్ణువు, శ్రీరాముడు, భీముడు వంటి పురాణపురుషులవని హిందువులు భావిస్తారు.
BCE రెండోశతాబ్దానికి చెందిన భార్హౌత్ స్తూపం పై లభించే బుద్ధునిపాదముద్రలు భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనవి.


***
5.బుద్ధుని భిక్షాపాత్ర
.
బుద్ధుడు ఉపయోగించిన భిక్షాపాత్రను ఆయన చిహ్నంగా అనేక శిల్పాలలో చూపబడింది. బుద్ధభగవానుడు Kusinara వెళుతూ వెళుతూ తన భిక్షాపాత్రను వైశాలి ప్రజలకు ఇచ్చివేసాడు. రెండో శతాబ్దంలో కనిష్కుడు దీనిని వైశాలినుండి నేటి Peshawar కు తరలించాడు. చైనా యాత్రికులు దీనిని చూసినట్లు వారి కథనాలలో నమోదు చేసారు. ఇస్లామిక్ పాలనలో ఈ భిక్షాపాత్ర ఒక మసీదునుండి మరొక మసీదుకు మారుతూ చివరకు Kandahar చేరింది. ఆ సమయంలో ఈ పాత్రపై ఖురాన్ వాక్యాలు లిఖించబడ్డాయి. బ్రిటిష్ చరిత్రకారులు ఈ భిక్షాపాత్రపై ఉన్న శాసనాలను చదవటానికి ప్రయత్నించారు.
ఇటీవలి కాలంలో తాలిబాన్లు అనేక బౌద్ధ చిహ్నాలను నాశనం చేసినప్పటికీ ఈ భిక్షాపాత్రపై ఖురాన్ వాక్యాలు ఉండటంతో దీనిని ఏమీ చెయ్యలేదు. ఇది ప్రస్తుతం కాబూల్ నేషనల్ మ్యూజియం లో ఉంది.
ఈ భిక్షాపాత్ర 400 కేజీల బరువు ఉంటుంది. ఒక మనిషి ఎత్తలేడు. ఇది బహుశా అసలైన భిక్షాపాత్రకు నమూనాగా భక్తులు పూజించటానికి పెద్ద ఆకారంలో చేయించినది కావొచ్చు.
6. త్రిరత్న, వజ్రాసన చిహ్నాలు
.
బుద్ధుడు ప్రవచించిన మూడు ప్రధాన ధర్మాలైన బుద్ధ, దమ్మ, సంఘ లను త్రిరత్న చిహ్నం సూచిస్తుంది. ఈ త్రిరత్న చిహ్నం సాంచి స్తూపం పై కనిపిస్తుంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ఆసనాన్ని వజ్రాసనంగా భావిస్తారు. బౌద్ధ శిల్పాలలో బోధి వృక్షం క్రింద ఒక ఖాళీ ఆసనం రూపంలో వజ్రాసనం కనిపిస్తుంది.
****
ముగింపు
.
బుద్ధుడు BCE 623 ఆరోశతాబ్దంలో జన్మించాడు. బౌద్ధమతం ఒకప్పుడు భారతదేశం నలుమూలలా విస్తరించింది. భారతదేశంలో ఏ మూల తవ్వినా బౌద్ధమతపు ఆనవాళ్ళు నేటికీ శిల్పాలు, చెక్కుడు ఫలకల రూపంలో లభిస్తాయి. బుద్ధుని జననం, జ్జానోదయం, మొదటి భోధన, పరినిర్వాణం లాంటి ముఖ్యమైన జీవిత ఘట్టాలను చెక్కుడు ఫలకలుగా చేసి ప్రదర్శించటం ద్వారా బౌద్ధమతం సామాన్య ప్రజలలోకి సమర్ధవంతంగా చేరగలిగింది. వేల మైళ్ళ దూరంలో, వందల సంవత్సరాల వ్యత్యాసంతో చెక్కిన శిల్పాలు ఒకే రకమైన ప్రతిమాలక్షణాలను కలిగి ఉండి ఆనాటి శిల్పులు సాధించిన ప్రామాణికతకు అద్దంపడతాయి. భారతీయ శిల్పశాస్త్ర ఆవిర్భావ సమయంలో/పరిణామక్రమంలో బౌద్ధమతం ఇచ్చిన ఊతం సామాన్యమైనది కాదు.
బుద్ధుడు BCE ఆరోశతాబ్దానికి చెందినవాడైనప్పటికీ మానవరూపంలో ఉన్న బుద్ధ ప్రతిమలు CE ఒకటో శతాబ్దం నుంచి మాత్రమే కనిపిస్తాయి. BCE 332 లో అలెగ్జాండర్ బారతదేశంపై చేసిన దండయాత్రఫలితంగా భారత గ్రీకు సంస్కృతుల మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. పెద్దసంఖ్యలో గ్రీకు సైనికులు, వ్యాపారులు భారతదేశంలో స్థిరపడ్డారు. వారు తమతో పాటు గ్రీకు భాష, కళలు, సంస్కృతులను తీసుకొచ్చారు. భారతీయ-గ్రీకుల సాంస్కృతిక సమ్మేళనం వలన ఇండో- హెలినిస్టిక్ సంస్కృతి అనే కొత్త సాంస్కృతిక ఒరవడి ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ ఉన్న గాంధార ప్రాంతంలో ఒక కొత్త శిల్పకళాశైలి ఏర్పడింది. దానిని గాంధారశిల్పశైలి అంటారు. ఈ శైలిలో అంతవరకూ చిహ్నాలరూపంలో ఉన్న బుద్ధుడు, బౌద్ధమతపాత్రలు మొదటిసారిగా మానవరూపంలో చిత్రీకరించటం జరిగింది. బౌద్ధమత పరిణామక్రమంలో ఇదొక ముఖ్యమైన మలుపు.
కూర్చొని ఉన్న బుద్ధుని శిల్పాలలో ధ్యానముద్ర, భూమిస్పర్శ ముద్ర, ధర్మచక్రముద్ర లతో ఉన్నవి , అలాగే నిలుచుని ఉన్న అవలోకేశ్వర, , శయనస్థితిలో ఉండే Reclining బుద్ధుని ప్రతిమలు భారతదేశంలో విరివిగా లభిస్తాయి.
బౌద్ధ ప్రతిమాశాస్త్రం ఆ తదుపరి కాలంలో వచ్చిన హిందూ ప్రతిమలను తీర్చిదిద్దటానికి ప్రేరణగా నిలిచి ఉంటుంది.
[1] pn.15, Buddhapada and the Bodhisattva Path, Hamburg Buddhist Studies 8
[2] The Significance of the signs and symbols on the foot prints of the buddha, TB Karunaratne, Jestor 5.
బొల్లోజు బాబా
ఈ సీరిస్ రాయటానికి సంప్రదించిన పుసకాలు
1. Yaksha cult, Ram Nath Misra
2. The Art and Architecture of India, Benjamin Rowland
3. Le Huu Phuoc, Buddhist Architecture
4. Iconography of the Hindus Buddhists, and Jains, RS Gupte
5. Gouriswar Bhattacharya, Essays on Buddhist Hindu Jain iconography and epigraphy
6. The Art of Ancient India, Buddhist, Hindu, Jain
7. Elements of Buddhist Iconography, Ananda K Coomaraswamy
8. పురాణాలు-మరోచూపు, బి. విజయభారతి

















Thursday, October 19, 2023

పాలస్తీనియన్ కవిత్వం

ప్రస్తుతం పాలస్తీనియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇదివరలో నేను అనువదించిన పాలస్తీనియా కవిత్వాన్ని మరొకసారి తరచి చూసుకొన్నాను. వీటిని అనువదించేటపుడు నేను అనుభవించానో లేదో గుర్తురావటం లేదు కానీ .... నేడు మాత్రం ఆ వాక్యాల వెనుక గూడుకట్టుకొన్న ఒక వేదన బలంగా తెలుస్తోంది.
ఎంత దుఃఖం..... ఎంత దుఃఖం.... కవిత్వం అంటేనే దుఃఖం కదా!
.
బొల్లోజు బాబా

****

1.
FADY JOUDAH
.అనుకరణ -- by Fady Joudah
తన సైకిల్ హేండిల్స్ మధ్య
గూడుకట్టుకొన్నసాలెపురుగుని
రెండువారాలుగా
అదిలించ లేదు మా అమ్మాయి
దానంతట అదే వెళిపోయే వరకూ
ఎదురుచూసింది.
నీవు దాని గూటిని తొలగించి ఉన్నట్లయితే
అది తెలుసుకొనేది కదా "ఈ ప్రదేశం తన ఇల్లు కాదని;
నీవూ చక్కగా సైకిల్ తొక్కుకొని ఉండేదానవు" అన్నాను నేను
మనచుట్టూ ఎంతోమంది
నిరాశ్రయులు అవుతున్నది అలానే కదూ?'
అంది మా అమ్మాయి.
 
Poem by Palestinian poet Fady Joudah
30-07-2016

****

2.
DARWISH, MOHMOUD
ముహమ్మద్ దర్విష్ (1941-2008) ఒక పాలస్తీనా కవి. అతని కవితలు శక్తివంతమైన రాజకీయ ప్రకటనలు గా ఉంటాయి. అతని కవితలు పాలస్తీనా ప్రజల యొక్క దుఃఖం మరియు ఆశలను వ్యక్తం చేస్తాయి.


దాహంతో చచ్చిపోయిన ఒక నది –A river dies of thirst
ఇక్కడ ఒక నది ఉండేది, ఇరు తీరాలతో.
ఆ నదిని వానచినుకులతో పోషించే
స్వర్గలోకపు అమ్మ కూడా ఉండేదిక్కడ.
కొండకోనల్లోంచి జారుతో
మందగమనంతో పారేది అది.
ఓ అందమైన అతిధిలా గ్రామాలను సందర్శిస్తూ
లోయలకు పచ్చదనాన్ని, కొండఫలాల్ని అందించేది.
రాత్రివేళల తీరాలపై దొర్లే సరదాప్రియులను చూసి
నవ్వుకొంటూ సాగేది
“మబ్బు పాలను తాగి, పశువులకు నీళ్ళు తాపి
జెరుసెలేమ్ కు, డమాస్కస్ కు ఉరకలెత్తిన నది”
అప్పుడప్పుడూ అది వీరోచితంగా గానం చేసేది
ఒక్కోసారి ఉద్రేకంతో.
ఇక్కడ ఒక నది ఉండేది, ఇరు తీరాలతో.
వానచినుకులతో ఆ నదిని పోషించే
స్వర్గలోకపు అమ్మ కూడా ఉండేది
కానీ వాళ్లు దాని అమ్మను అపహరించాక
ఆ నదికి నీరు లభించక
క్రమక్రమంగా చచ్చిపోయింది, దాహంతో
మూలం: A river dies of thirst
 
2. ఉదాసీనుడు - The indifferent one
.
అతను దేనినీ లక్ష్యపెట్టడు.
వాళ్ళు అతని ఇంటికి కుళాయి నిలుపుచేస్తే:
‘పరవాలేదు! వానాకాలం దగ్గరలోనే ఉంది’ అంటాడు.
కరంటు ఆపు చేస్తే: ఆవులిస్తూ
“పరవాలేదు, ఈ వెలుగు సరిపోతుంది’ అంటాడు
నీ జీతం తగ్గిస్తాం అని వాళ్ళు బెదిరిస్తే,
‘పరవాలేదు! మద్యం, సిగరెట్లు మానేస్తాను’ అంటాడు
అతన్ని వాళ్లు జైలులో పెట్టినపుడు
‘పరవాలేదు, జ్ఞాపకాలతో కొంతకాలం ఏకాంతంగా
గడపవచ్చు’ అంటాడు.
ఇంటివద్ద దిగపెట్టినపుడు:
‘పరవాలేదు! ఇది నా ఇల్లు’ అంటాడు
ఒకసారి అతణ్ణి కోప్పడుతూ అడిగాను
‘రేపు ఎలా జీవించాలనుకొంటున్నావు’ అని
అతనన్నాడూ
‘ఈ రేపు నన్ను బాధించదు.
అదొక ఒఠి ఊహ. నన్ను ఆకర్షించదు
నేను నేను మాత్రమే: నన్ను ఏదీ మార్చలేదు
నేను దేన్నీ మార్చలేనట్లుగానే,
నా సంతోషాల్ని దూరం చేయకు.
‘నేనేమీ Alexander the Great లేదా
Diogens ని’ కాదులే అన్నాను
‘నిర్లిప్తత అనేది ఒక వేదాంతం
ఒకరకమైన ఆశావహ దృక్ఫథం కూడా’ అన్నాడతను.
.
మూలం: The indifferent one
Date: 15-02-2019


3. ఇద్దరు అపరిచితులు - Two strangers by Darwish

ఆకాశం వైపు చూసాడు
ఒక నక్షత్రం అతని వైపే చూస్తోంది
లోయలోకి చూసాడు
అతని సమాధి అతనివైపే చూస్తోంది
తనను బాధించిన, ఆనందింపచేసిన
స్త్రీ వైపు చూసాడు
ఆమె ఇతని వైపు చూడటం లేదు
అద్దంలో చూసుకొన్నాడు
దాన్లోంచి అతని లాంటి మరో అపరిచితుడు
అతన్నే తొంగి చూస్తున్నాడు
మూలం Two strangers by Darwish
Date: 13-02-2019
*****

3.
SAMIH AL-QASIM
Samih al-Qasim జోర్డాన్ లో జన్మించిన పాలస్తీనియన్ కవి. ఇతను అనేకసార్లు రాజకీయకారణాల వల్ల జైలు పాలయ్యాడు. ఇతర కవుల్లా ఇతను పాలస్తీనియాను విడిచిపెట్టి పోలేదు దానికి కారణం నా మాతృభూమిపై నా అనుబంధమే అని ప్రకటించుకొన్నాడు. తన జీవితంలో ఎక్కువకాలం గృహనిర్భంధంలోనే గడిపాడు "The only way I can assert my identity is by writing poetry" అనేది Samih al-Qasim కవిత్వ వస్తువు మరియు శిల్పము. Samih al-Qasim 2014 లో మరణించాడు.
Samih al-Qasim కవితల అనువాదాలు ఇవి.
 
1.
Travel Tickets
నన్ను చంపినరోజు
నా జేబులో Travel Tickets గమనిస్తావు నువ్వు
శాంతిలోకి
పంటపొలాలలోకి, వానలోకి
మనుషుల అంతరాత్మలలోకి
తీసుకెళ్ళే Travel Tickets
ప్రియమైన నా హంతకుడా
ఆ టికెట్లను వృధాచేయకు.
వాటిని వాడుకో.
దయచేసి ప్రయాణించు

2.
Slit lips
చనిపోయిన
ఒక కోకిల కథను
నేను నీకు చెప్పి ఉండేవాడిని.
వాళ్ళు నా నాలుకను
చీల్చి ఉండకపోతే
ఆ కథను నీకు......

3.
Abandoning
నేను చూసాను ఆమెను
నేను చూసాను ఆమెను కూడలిలో
నేను చూసాను కూడలిలో ఆమె రక్తంచిందించటం
నేను చూసాను కూడలిలో ఆమె నడవలేకపోవటం
నేను చూసాను కూడలిలో ఆమె చంపబడటం
నేను చూసాను... నేను చూసాను....
ఈమె సంరక్షకుడు ఎవరని అతను బిగ్గరగా అరచినప్పుడు
నాకు ఆమె పరిచయమే అనే విషయాన్ని చెప్పలేదు
ఆ కూడలిలో ఆమెనలా విడిచిపెట్టేశాను
ఆ కూడలిలో రక్తమడుగులో ఆమెనలా విడిచిపెట్టేసాను
ఆ కూడలిలో నడవలేకపోతున్న ఆమెనలా విడిచిపెట్టేసాను
ఆ కూడలిలో మృత్యువుకి ఆమెనలా విడిచిపెట్టేసాను
ఆమెనలా విడిచిపెట్టేసాను....

4.
End of Discussion with a Jailer
నా జైలుగది కిటికీలోంచి
నన్ను చూసి నవ్వే చెట్లు
నా ప్రజలతో నిండిన ఇంటికప్పులు
నాకోసం విలపిస్తూ ప్రార్ధించే కిటికీలు కనిపిస్తాయి
నా ఇరుకైన గది తలుపురంద్రంలోంచి
నీ విశాలమైన గది కూడా కనిపిస్తుంది.

5. Confession at Midday
.
ఒక చెట్టును నాటాను
దాని ఫలాల్ని తృణీకరించి
మానుని కలపగా వాడుకొన్నాను
కొమ్మలను వీణగా చేసి
గొప్ప రాగాల్ని పలికించాను
వీణ పగిలిపోయింది
రాగాలు ఆగిపోయాయి
ఫలాలు పోగొట్టుకొన్నాను
ఇప్పుడు చెట్టు కొరకు దుఃఖిస్తున్నాను.
,
మూలం- Samih al-Qasim
20-05-2021

***
4.
RAFEEF ZIADAH We teach life sir

నేడు నా దేహం టీవీలో చూపించే ఒక ఊచకోత
నేడు నా దేహం sound-bites కి పదాల పరిమితికి లోబడి
టీవీలో చూపించే ఒక ఊచకోత
నేడు నా దేహం sound-bites కి పదాల పరిమితికి లోబడి ఉంటూ
సరిపడినన్ని గణాంకాలు కలిగి ఉన్న టీవీలో చూపించే ఒక ఊచకోత.
నేను ఇంగ్లీషు నేర్చుకొన్నాను, నా UN resolutions తెలుసుకొన్నాను
అయినప్పటికీ అతను నన్ను అడిగాడూ...
Ms. Ziadah "మీరు మీ పిల్లలకు ద్వేషాన్ని నేర్పటం నిలిపివేస్తే
పరిస్థితులన్నీ చక్కదిద్దుకొంటాయి కదా" అని
మౌనం...
ప్రశాంతంగా ఉండేందుకు శక్తికోసం నేను నా లోపలకు తొంగిచూసుకొన్నాను
Gaza పై బాంబులు జారవిడిచే సమయాన ప్రశాంతత నా నాలుక చివర ఉండదు
ప్రశాంతత నన్ను విడిచి వెళిపోయింది
మౌనం...చిరునవ్వు
మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
Ziadah నవ్వుతూ ఉండు
మౌనం..

మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
వారు మా చివరి ఆకాశాన్ని కూడా ఆక్రమించేసాకా
పాలస్తీనియన్లమైన మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
మా ఆకాశాన్ని కబళించి ఎత్తైన వివక్షా ప్రహరీలతో వాళ్ళ భవంతులు నిర్మించుకొన్నాకా
మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
సరే పోనీయండి
ఈ మొత్తాన్ని ఒక కథగా ఎలా చెబుతారు? ఒక మానవ గాథలా?
వివక్ష, ఆక్రమణ లాంటి పదాలు లేకుండా
రాజకీయాలు లేకుండా
కొంచెం సహాయం చెయ్యండి"

నేడు నా దేహం టీవీలో చూపించే ఒక ఊచకోత
Gaza లో ఒక స్త్రీకి అత్యవసర మందులు అవసరపడ్డాయి అనే కథగా చెబుతారా?
మీ సంగతేమిటి?
సూర్యుడిని కప్పటానికి సరిపడా విరిగిన ఎముకల చేతులు ఉన్నాయా మీకు?
చనిపోయిన మీ బంధువుల జాబితా ఇవ్వండి
పన్నెండు వందల పదాల పరిమితికి లోబడి

నేడు నా దేహం టీవీలో చూపించే ఒక ఊచకోత
అది sound-bites కి పదాల పరిమితికి లోబడి ఉంటూ
ఉగ్రవాదుల రక్తానికి స్పందించటం మానేసిన వారిని కదిలించాలి.
కానీ వారు విచారం వ్యక్తం చేసారు
Gaza లో పశువులు మరణించినందుకు విచారం వ్యక్తం చేసారు
వారికి UN resolutions, గణాంకాలు ఇచ్చాను.
మేం ఖంఢిస్తాం, మేం గర్హిస్తాం, మేం తిరస్కరిస్తాం
ఇక్కడ ఇరుపక్షాలు సరిజోడీ కాదు.
ఒకరు ఆక్రమణదారులు మరొకరు ఆక్రమితులు
వందమరణాలు ఒకవైపు, వేయిమరణాలు మరోవైపు
యుద్ధము, ఊచకోత

మేము పరదేశీయులం కాదు, టెర్రరిస్టులం కాము అని ప్రకటిస్తున్నాను
వందల వేల మృతుల్ని పదే పదే లెక్కిస్తున్నాను
ఎవరైనా ఉన్నారా? వింటున్నారా?

ప్రతి ఒక్క శరణార్ధుల శిబిరంలోకి వెళ్ళి అక్కడి ప్రతి ఒక్క శిశువుని ఎత్తుకొని
మరే బాంబు శబ్దాలను వినకుండా వారి చెవులను నా చేతులతో కప్పాలని ఉంది
నేడు నా దేహం టీవీలో చూపించే ఒక ఊచకోత
UN resolutions ఎందుకూ పనికి రాకుండా పోయాయి
నేను ఇంగ్లీషు ఎంతగొప్పగా నేర్చుకొన్నా no sound-bite
And no sound-bite
ఏ sound-bite వారిని బ్రతికించలేదు
ఏ sound-bite దీన్ని బాగుపరచలేదు

మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
మేము జీవితాన్ని నేర్పుతున్నాం సర్
పాలస్తీనియన్లమైన మేము ఉదయాన్నే నిద్రలేచి
ఈ ప్రపంచానికి జీవితాన్ని నేర్పుతున్నాం సర్

Source: Rafeef Ziadah We teach life sir

(Rafeef Ziadah పాలస్తీనియన్ జర్నలిస్టు. పై కవితలో తమ భూభాగాలను కోల్పోయి, తమ సొంత నేలపైనే పరాయి వారిగా బ్రతకాల్సిన దుస్థితి వర్ణించబడింది. తమపై జరుగుతున్న వివక్ష, ఊచకోతలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటం పై కవితలో కవయిత్రికి, ఆమె సహచర మిత్రునికీ మధ్య జరిగిన సంభాషణా రూపంలో వ్యక్తీకరించబడింది)

1, June 2021

అనువాదం:  బొల్లోజు బాబా

బౌద్ధ చిహ్నారాధన - పార్టు 2


3. స్తూపం (thube)

బుద్ధుని రూపం బదులుగా ఆరాధించబడిన చిహ్నాలలో స్తూపం ఒకటి. ప్రాచీన బౌద్ధనిర్మాణాలలో స్తూపారాధన శిల్పాలు తప్పక కనిపిస్తాయి. స్తూపం అంటే అర్ధవృత్తాకారంలో లేదా గంట ఆకారంలో ఉండే నిర్మాణం అని అర్ధం.
 
బుద్ధుడు పరినిర్వాణం పొందినపుడు అతని దేహ అవశేషాల కొరకు ఆనాటి సమకాలీన ఎనిమిది మంది రాజులు యుద్ధానికి దిగారట. ఆ సంఘటనను సాంచిస్తూప దక్షిణ ద్వారంపై శిల్పరూపంగా మలచారు. ఇందులో బుద్ధునిదహనం చేసిన చోటుకు ఇరువైపులా సేనలు మొహరించి ఉండటం చూడవచ్చు. (photo). ద్రోన అనే బ్రాహ్మణుడు (Brahmin Drona) మధ్యవర్తిత్వం వహించి అవశేషాలను ఎనిమిది సమ భాగాలుగా చేసి ఇవ్వటంతో యుద్ధం ఆగిందని “మహాపరి నిర్వాణ సూత్ర” గ్రంథంలో చెప్పబడింది. ఆ సంఘటనను శిల్పంగా మలచిన ఫలకం నేడు టోక్యో మ్యూజియంలో ఉంది. (see photo).
 
ఆ ఎనిమిది అవశేషాలను ఆయా రాజ్యాల ప్రధాన పట్టణాలకు పంపి స్తూపాలను నిర్మించారు. అవి- రాజగృహ, వైశాలి, కపిలవస్తు, అల్లకప్ప, రమగ్రమ, పావ, కుశినగర్, వేతాదిప లు. ఆర్కియాలజిస్టులు వీటిలో ఇంతవరకూ రాజగ్రిహ, వైశాలి, రమగ్రమ, కుశినగర్ కపిలవస్తు ల వద్ద నిర్మించిన స్తూపాలను గుర్తించగలిగారు. మిగిలినవాటి వివరాలు తెలియరావు. Piprahwa/కపిలవస్తు స్తూపం వద్ద ఒక భరిణిలో దొరికిన బుద్ధునివని చెప్పబడే అవశేషాలను 1971 లో K.M. Srivastava కార్బన్ డేటింగ్ చేయించి అవి క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దానికి చెందినవని నిర్ధారించాడు. [1]
 
ఆ తరువాత అశోకచక్రవర్తి వాటిని తవ్వించి ఆ దాతువులను మరల కొన్ని వేల భాగాలుగా చేసి చేసి దేశమంతటా 84 వేల స్తూపాలు నిర్మించినట్లు బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుస్తుంది. ఈ స్తూపాలవద్ద అశోకుడు రాతి స్తంభాలను పాతించి దానిపై తన శాసనాలను లిఖింపచేసాడు. ఈరోజు దేశంలో ఏ ప్రాంతంలో తవ్వినా దొరకే బౌద్ధ అవశేషాలు అశోకుడు స్థాపించినవే కావొచ్చు.
గాజు, లేదా బంగారు భరణెలో బుద్ధుని భౌతిక అవశేషాలు ఉంచి దానిపై నిర్మించిన స్తూపాన్ని Relic stupa అంటారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా దంతపురంవద్ద బుద్ధుని దంతం కలిగిన Relic స్తూపం ఉండేదట. ఆ పవిత్రదంతాన్ని శ్రీలంక అనురాధపురానికి తరలించుకొని పోగా దంతపురం అనే ఊరిపేరు, అక్కడ కొన్ని స్తూప శిథిలాలు మాత్రం ప్రస్తుతం మిగిలాయి.
 
నిత్యం దర్శించుకొని ఆరాధన చేయటం కొరకు నిర్మించిన స్తూపాన్ని Votive stupa అంటారు. విశాఖపట్టణం సమీపంలో బావికొండ, సాలిహుండంల వద్ద వీటి అవశేషాలు కనిపిస్తాయి.
బౌద్ధ స్తూపం చుట్టూ ప్రదక్షణ చేయటానికి వీలుగా ఒక మార్గం, దానికి వెలుపల పిట్టగోడలాంటి ప్రాకారం ఉంటుంది. దీన్ని Guard rails (వేదిక) అంటారు. ఇది నిలువు, అడ్డ రాతి స్తంభాల వెదురుబద్దల అల్లికవంటి బిగింపుతో నిర్మితమై ఉంటుంది. వీటిపై అందమైన బౌద్ధ శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఈ రాతి వేదిక (railing) ఐహిక ప్రపంచాన్ని, ఆథ్యాత్మిక ప్రపంచాన్ని వేరుచేసి, భక్తులను స్తూపం చుట్టూ ఉన్న ప్రదక్షణ మార్గం మీదకు నడిపిస్తుంది. స్తూపం చుట్టూ మూడుసార్లు ప్రదక్షణం చేయాలని బౌద్ధనియమావళి.
 
బౌద్ధ స్తూపాలు, కొండగుహలు, చైత్యాలు ప్రస్ఫుటమైన శైలిని కలిగిన స్వతంత్రనిర్మాణాలు.
బోధగయలో CE 150 కి చెందిన మహాబోధి ఆలయ గోపురం 180 అడుగుల ఎత్తుఉండే ఇటుకల నిర్మాణం. గోపురశిఖరంపై బౌద్ధ స్తూపం ఉంటుంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధివృక్షానికి దగ్గరలో ఈ ఆలయం ఉందికనుక దీన్ని Great Awakening Temple అని అంటారు.
400-425 CE మధ్య నిర్మించిన సాంచి 17 వ నంబరు బౌద్ధ ప్రతిమాగృహం భారతదేశంలో అత్యంతపురాతనమైన freestanding ఆలయం. ఇది చాలా సరళమైన నిర్మాణాన్ని కలిగిఉంటుంది. చతురస్రాకారపు గర్భగుడి దాని పైన చదునైన కప్పు, ద్వారమండపాన్ని నిలబెడుతూ ముందువైపున నాలుగు స్తంభాలు వాటిపై పద్మాలు, సింహాలు చెక్కబడి ఉంటాయి.
పైన చెప్పిన బౌద్ధ ఆలయాల నిర్మాణశైలి కొన్ని శతాబ్దాల అనంతరం నిర్మించిన హిందూ ఆలయాలనిర్మాణ శైలికి స్పూర్తి కావొచ్చు.[2]
 
బొల్లోజు బాబా

1. The Relics of Culture, Vol I William Anderson Gittens- pn.78
2. Buddhist Architecture, Le Huu Phuoc 2010 pn. 252, 254

















Tuesday, October 17, 2023

బౌద్ధ చిహ్నారాధన - పార్టు 1


.
వైదికదేవతలు విగ్రహాలరూపంలో పూజలందుకొన్నట్లు ఆధారాలు లేవు. BCE మూడో శతాబ్దంలో మొదట చిహ్నాలరూపంలో బౌద్ధమత ఆరాధన సాగి క్రమేపీ మానవరూప ప్రతిమల ఆరాధన వచ్చింది. ఈ దశలలో ధర్మచక్రం, బోధి వృక్షం, స్తూపం, త్రిరత్న, వజ్రాసనం, పద్మం, బుద్ధుని పాదముద్రలు, భిక్షపాత్ర లాంటి వివిధ చిహ్నాల ఆరాధన జరిగేది. ఇవి ఎక్కువగా అమరావతి, సాంచి, భార్హుత్, బోధగయ లాంటి బౌద్ధ నిర్మాణాలలో కనిపిస్తాయి.
.
1. ధర్మచక్రం (dhammacakka): బౌద్ధమతంలో ధర్మచక్రం అనేది బుద్ధునికి, బౌద్ధధర్మానికి సంకేతం. బుద్ధుడు సారనాథ్ లో మొదటిసారిగా చేసిన బోధనను “ధమ్మచక్క పవత్తన సుత్తం” అంటారు. ఈ ప్రసంగంలో బుద్ధుడు జీవితం యొక్క అర్ధం, విముక్తి సాధించే మార్గం గురించి భోధించాడు. ఈ ధర్మచక్రం అనేది శాంతి, జ్ఞానం, విముక్తులకు చిహ్నం. ఈ విలువలను బోధించటం ద్వారా బుద్ధభగవానుడు ప్రపంచంలో Wheel of Law ను తిరిగేలా చేసాడని బౌద్ధుల విశ్వాసం.
BCE 1 వ శతాబ్దానికి చెందిన సాంచి స్తూపశిల్పాలలో పశ్చిమతోరణం పై ఒక స్తంభంమీద 32 ఆకులుకలిగిన ధర్మచక్రానికి అశోకుడు తనపరివారంతో భక్తితో నమస్కరిస్తూ ఉండటం చూడవచ్చు. (See Photo)
BCE రెండవ శతాబ్దానికి చెందిన భార్హుత్ వద్ద లభించిన ధర్మచక్రం అత్యంత ప్రాచీనమైనది. భారతదేశ అధికారిక ముద్రలో, జండాపై ఉండే ధర్మచక్రం బౌద్ధచిహ్నమే.
ఈ భూమిపై ధర్మం అందరికి సమానంగా అందేలా ఎవరైతే ఈ చక్రాన్ని తిప్పుతారో అతనే చక్రవర్తి అని (He who turns the Wheel) బౌద్ధసాహిత్యం చెబుతుంది.
***

2. బోధి వృక్షం: సిద్ధార్థుడు తనదైన దర్శనాన్ని పొందటానికి ముందు అప్పటికి ప్రచారంలో ఉన్న అన్ని దర్శనాలను అధ్యయనం చేసాడు. కొంతకాలం వాటితో నడిచాడు. ఒకనాడు ఆహారాదులు సేవించి బోధి వృక్షం కూర్చుని నలభై ఐదు రోజుల పాటు ధ్యానం చేసి ఒక నూతన దర్శనాన్ని పొందాడు. జ్ఞానోదయం పొందిన సిద్ధార్థుడు బుద్ధునిగా మారాడు.
బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధివృక్షం భౌగోళికంగా బోధగయవద్ద ఉంది. బుద్ధుడు పరినిర్వాణం చెందిన మూడు శతాబ్దాల తరువాత అశోకచక్రవర్తి BCE 242 లో ఆ బోధివృక్షం చుట్టూ రాతి ఆవరణాన్ని ఏర్పరచి దానినొక పవిత్ర దర్శనీయస్థలంగా తీర్చిదిద్దాడు. ఆ వృక్షంనుంచి ఒక కొమ్మను శ్రీలంక అనురాధాపురానికి పంపి అక్కడ నాటింపచేసాడు. నేడు శ్రీలంకలో పూజలందుకొంటున్న బోధి వృక్షం (Bo tree) అశోకుడు పంపించినదే అంటారు.
అశోకుని నాల్గవభార్య “తిస్సరక్క”, తన భర్త తనను పట్టించుకోకుండా ఆ వృక్షం పైనే ఎక్కువ ఆసక్తిపెడుతున్నాడని బోధగయలోని బోధి వృక్షాన్ని నాశనం చేయించిందట. ఈ కథ ద్వారా బుద్ధుడు జ్ఞానోదయం పొందిన అసలైన బోధివృక్షం అశోకునికాలానికే అంతరించిపోయినట్లు అర్ధంచేసుకోవాలి. తిరిగి ఆ ప్రాంతంలో మొలిచిన మరొక బోధివృక్షాన్ని 7 వ శతాబ్దంలో శైవమతానికి చెందిన శశాంకుడనే బెంగాలు రాజు బోధగయమీదుగా వెళుతూ కూకటి వేళ్లతో పెకలించి నాశనం చేసినట్లు హుయాన్ త్సాంగ్ తన రాతలలో తెలిపాడు. [1]
 
1862 Cunningham బోధగయ సందర్శించినపుడు- “ప్రసిద్ధిగాంచిన బోధివృక్షం ఇంకా ఉంది. చాలాభాగం పాడయింది. మూడుకొమ్మలు ఉన్నాయి. ఒకటిమాత్రమే పచ్చని ఆకులతో ఉంది. ముప్పై అడుగుల ఎత్తు ఉంటుంది. అరవై ఏళ్ళక్రితం 1811 లో Hamilton ఈ చెట్టును చూసి వందేళ్ల వయసుంటుందని లెక్కగట్టాడు” - అని రికార్డు చేసాడు.
 
బోధివృక్షం బౌద్ధులకు ఒక ఆరాధనీయ శిల్పంగా మారింది. భర్హౌత్, సాంచి, మథుర, అమరావతి స్తూపాలలో బోధివృక్ష నిర్మాణాలు, దానిని పూజిస్తూ పరివారము కనిపిస్తాయి. బౌద్ధ సాహిత్యంలో ఈ వృక్షాన్ని జీవన ఫలాలను ఇచ్చే kappa rukka (కల్పవృక్షం) గా చెప్పబడింది.

బౌద్ధం ప్రారంభదశలలో బోధివృక్షం బుద్ధుని రూపంగా పూజలందుకొనేది. BCE 1 వ శతాబ్దానికి చెందిన అమరావతి రాతిఫలకలో బోధివృక్షం పూజలందుకొంటున్న దృశ్యం చూడవచ్చు. ఇందులో అందమైన తలపాగలు, బరువైన ఆభరణాలు ధరించిన పురుషులు, చక్కని ఆకులతో రావి చెట్టు, చెట్టు మొదలులో ఒక ఆసనము, దానిముందు ఒక జత పాదముద్రలు కనిపిస్తాయి. ఒక భక్తుడు పాదుకలకు శిరస్సువంచి నమస్కరిస్తుంటాడు. రెండువేల ఏండ్ల క్రితపు తెలుగు ప్రజల ఆహార్యాన్ని, ఆరాధనను పై ఫలక ప్రతిబింబిస్తుంది. (see photo)

బుద్ధుడు బోధివృక్షంకింద జ్ఞానోదయం పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు డిసంబరు 8 న Bodhi Day గా జరుపుకొంటారు. ఇది మతపరమైన శలవు దినం. ఆ రోజున Budu saranai/బుద్ధుని శాంతి నీదే అగుగాక అని ఒకరినొకరు అభివాదాలు తెలుపుకొంటారు.
 
బొల్లోజు బాబా

[1] The Historical Buddha, Hans Wolfgang Schumann, pn 60



















Sunday, October 15, 2023

పిచ్చుకలు ఎగిరిపోయాయి....

.
పార్కు బెంచీపై ఒంటరిగా కుర్చొన్నాను
కేరింతలు వినబడనంత దూరంగా
పిల్లలు ఆడుకొంటున్నారు

ఎక్కడినుంచి వచ్చాయో కిచకిచమంటూ
పిచ్చుకల గుంపొకటి నా ముందు వాలింది
రొద... రొ..ద...రొ...ద
ఒకటే శబ్దబీభత్సం
పాడు పిచ్చుకలు... పాడుపిచ్చుకలు

చెట్లను తప్పించుకొంటూ
గుంపుగా పైకి లేస్తూ వాలుతూ
రొద... రొ..ద... ఒకటే రొద
చెవులు గళ్ళెత్తిపోతున్నాయి
సన్నని తీగలా నొప్పి మొదలైంది
రెండుచెవుల్లో

దూరంగా వెళిపోదామనుకొనే లోపే
రెక్కలు తపతపలాడించుకొంటు
ఎటో ఎగిరిపోయాయి

భయంకరమైన నిశ్శబ్దం

బొల్లోజు బాబా

Wednesday, October 11, 2023

మహామాయ దేవి-గజలక్ష్మి

సిద్ధార్థుని తల్లి పేరు మహామాయ. తండ్రి శుద్ధోధనుడు. ఒకనాడు ఈమె ఆరు దంతములు కలిగిన తెల్లని ఏనుగు ఆకాశం నుండి దిగివచ్చి తన గర్భంలోకి కుడివైపునుండి ప్రవేశించినట్లు స్వప్నంలో దర్శించింది. ఈ విషయాన్ని భర్త శుద్ధోదనుడికి తెలియచేసింది. శుద్ధోదనుడు ఆస్థాన పండితులను పిలిచి ఈ స్వప్నం గురించి తెలిపి ఇది దేనికి సంకేతమని అడిగాడు. ఆ పండితులు మహామాయ గర్భంలో గొప్ప అర్హంతుడు జన్మించబోతున్నట్లు చెప్పారు.
పదినెలల తరువాత మహామాయ పుట్టింటికి వెళుతూ దారిమధ్యలో పురిటినొప్పులు రాగా, లుంబిని వనంలో ఒక శాలవృక్షం క్రింద సిద్ధార్ధునికి జన్మనిచ్చి ఏడవరోజున మరణించింది. అది BCE 623వ సంవత్సరం.
 
భారతదేశం నలుమూలలా ఒకప్పుడు విస్తరించిన బౌద్ధమతం- బుద్ధుని జీవిత చరిత్రను, కథలను, సంఘటనలను, ముద్రలను, భంగిమలను- శిల్పాలు, చెక్కుడు ఫలకల రూపంలో కాలంలో నిక్షిప్తం చేసింది. భారతదేశంలో ఏ మూల తవ్వినా నేటికీ అవి ఏదో ఓ రూపంలో దర్శనమిస్తూనే ఉన్నాయి. బుద్ధుని జననం, జ్జానోదయం, మొదటి భోధన, పరినిర్వాణం లాంటి ముఖ్యమైన జీవిత ఘట్టాలను చెక్కుడు ఫలకలుగా చేసి ప్రదర్శించటం ద్వారా బౌద్ధమతం సామాన్య ప్రజలలోకి సమర్ధవంతంగా చేరగలిగింది.
 
పైన చెప్పిన మహామాయ స్వప్న వృత్తాంతాన్ని వివరించే చెక్కుడు ఫలకలు నేడు పదుల సంఖ్యలో లభిస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో దొరికిన ఈ ప్రతిమలలో ఒకే రకమైన వివరాలు, భంగిమలు కలిగి ఉండటం – తొలితరం శిల్పకారులు తమ కళను ఏమేరకు ప్రామాణికరించారనేదానికి అద్దం పడుతుంది. మహామాయ స్వప్న వృత్తాంత చెక్కుడు ఫలకలలో ఈ క్రింది వివరాలు ఉమ్మడిగా కనిపిస్తాయి (Fig.1)

1. మహామాయా దేవి మంచంపై ఎడమవైపుకు తిరిగి పడుకొని ఉంటుంది
2. ఎత్తైన తలగడలపై ఎడమచేతిని ఆన్చి తలను నిలబెట్టి నిద్రిస్తూంటుంది
3. రవికె, తలపాగ, కర్ణాభరణాలు, కంఠాభరణం, గాజులు, పాదాలను కప్పుతూ దేహ వస్త్రం- ఇదీ ఆమె ఆహార్యం
4. గుండ్రని తేజో మండలము పై తొండము క్రిందకు చాపిన ఒక ఏనుగు బొమ్మ ఉంటుంది.
5. మంచానికి నగిషీ చెక్కిన కోళ్ళు, మంచం దిగటానికి వీలుగా వేసినఎత్తు తక్కువ పీట, పరుపు క్రిందనుండి అందంగా ముడతపెట్టి నేలవైపుకు వేలాడుతున్న దుప్పటి- లాంటి వివరాలు 2300 సంవత్సరాల నాటి రాణిగారి శయనాగారపు సౌందర్యాన్ని కళ్ళకు కడతాయి.
6. మంచం వెనుకవైపున సన్నని దీపస్తంభం
7. మంచం పక్కనే చేత కత్తిబళ్ళెం ధరించిన యవని సేవిక. ఆమెకు కూడా తలపాగ, దేహం చుట్టూ చుట్టబడిన వస్త్రం, కర్ణ, కంఠాభరణాలు, గాజులు ఉంటాయి.
మహామాయ స్వప్నోదంతంతో ఇంతవరకూ లభించిన అనేక ఫలకాలలో పై వర్ణనలు చిన్నచిన్న మార్పులతో కనిపిస్తాయి.
***
సిద్ధార్ధునికి జన్మనిచ్చిన వారంలో మహామాయ మరణించింది. బౌద్ధ iconography లో మాయాదేవి రూపం ఆ తరువాతకూడా అనేక స్తూపాలలో పద్మంపై నిలుచుని లేదా కూర్చుని ఇరువైపులా రెండు ఏనుగులు తమ తొండాలతో నీటిని అభిషేకం చేస్తున్నట్లు కనిపిస్తుంది.
ఇలా ఏనుగుల అభిషేకంతో మహామాయాదేవి ప్రతిమా లక్షణాలమూలాలు పాలి సాహిత్యంలో ఇలా ఉన్నాయి

సిద్ధార్థుడు జన్మించినపుడు మహామాయ, సిద్ధార్థుల పై ఆకాశం నుండి రెండు ధారలుగా నీరు వర్షించి వారిని శుభ్రపరచినట్లు ఒక బౌద్ధ జాతక కథలోని ఈ వాక్యాలు akasato dve udaka dhara nikkhamitvaa సూచిస్తున్నాయి.
 
మహామాయ స్వప్నంలో కనిపించిన ఏనుగులు, బుద్ధుని జనన సందర్భంగా రెండుధారల నీటిని ఆమెపై వర్షించటం -ఏనుగుల అభిషేకం చేస్తున్న మహమాయ ప్రతిమకు మూలంగా చెబుతారు. [1].
***

రెండు ఏనుగుల మధ్య పద్మాలను చేతబూనిన మహామాయ ప్రతిమ మొదటగా మధ్య ప్రదేష్ లోని 125-100 BCE కి చెందిన బౌద్ధ స్థూపం Bharhut లో కనిపిస్తుంది. BCE ఒకటో శతాబ్దానికి చెందిన మహామాయాదేవి టెర్రకోట మట్టి ప్రతిమ అమెరికా LACM మ్యూజియంలో కలదు. CE ఐదవ శతాబ్దానికి చెందిన ఒరిస్సా రత్నగిరి బౌద్ధ ఆరామ గుమ్మంపైన రెండు ఏనుగులు అభిషేకం చేస్తున్న మహామాయాదేవి ప్రతిమ ఉన్నది.
 
***
9 వ శతాబ్దం నుంచి ఈ మహామాయా దేవి హిందూ ఐకనోగ్రఫీ లో గజలక్ష్మిగా రూపాంతరం చెందటం గమనించవచ్చు. దీనికి కారణం అదృష్టాన్ని ఇచ్చే మోటిఫ్ గా మహామాయాదేవి శిల్పం అప్పటికే ప్రజలలో చొచ్చుకొని పోయి ఉండటం కావొచ్చు. అందుకనే కొన్ని జైన దేవాలయ ప్రవేశద్వారాలపైన కూడా గజలక్ష్మి ప్రతిమలు కనిపిస్తాయి. ఉదాహరణకు కర్ణాటకలోని ఇంద్రగిరి జైన ఆలయం.

నిజానికి అత్యంత ప్రాచీనమైనదనీ, బౌద్ధం కంటే పూర్వపుదని చెప్పే శ్రీ సూక్తంలో లక్ష్మి దేవి “ శ్రీ”, “ లక్ష్మి” లాంటి పేర్లతో చెప్పబడుతుంది తప్ప "గజలక్ష్మి" అన్న మాట లేదు. ఆ పదం ఆ తరువాతి పరిణామం.

“గజలక్ష్మి” అన్న పదం హిందూ sanskrit iconographic texts లలో ఎక్కడా కనిపించదని ప్రముఖ చరిత్రకారుడు N. K. Bhattasali అంటారు. ఆయన హిందూ గజలక్ష్మి పదానికి బదులుగా కమలాదేవి అనే పదాన్ని ఉపయోగించారు. [2].
 
12 శతాబ్దంనుండి బౌద్ధమతం కనుమరుగైపోయినప్పటికీ బౌద్ధ మోటిఫ్ లు హిందూ గాథల మూలాంశాలుగా కొనసాగాయి. ఎన్నో కథలు, కథనాలు, పాత్రలు, వస్తువులు హిందూమతంలోకి చేరి కలిసి కరిగిపోయాయి. ఈ మహామాయాదేవి గజలక్ష్మిగా మారటం కూడా అలాంటిదే.
 
బొల్లోజు బాబా

[1] pn. 22 Elements of Buddhist Iconography, by AK Coomaraswamy
[2]. pn 107, Studies in Art, Iconography, architecture and archaelogy of India and Bangladesh -Gouriswar Bhattacharya




























Sunday, October 8, 2023

చలిరాత్రి రాసిన కవిత by JIE XISI (1274–1344)



.
మంచురాలే ఆకాశంలో పలుచగా
పరచుకొన్న తారలు చలికి గడ్డకట్టాయి
ప్రవహించే చందమామ
అడవిని ముంచెత్తింది
ఆగాగి వినిపించే రాలేఆకుల శబ్దాల మధ్య
ఈ ఖాళీ ఇంట్లో నాకు నిద్రపట్టదు
.
అనువాదం: బొల్లోజు బాబా
Source: Written on a Cold Night by JIE XISI (1274–1344)
.
JIE XISI నిరుపేదకుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకొని రాజాస్థానంలో చరిత్రకారునిగా స్థిరపడ్డాడు. ఇతని వచనం పొందికగా, క్లుప్తంగా ఉంటుందని పేరు. ఇతని కవిత్వం "మూడురాత్రులు ముగిసిన పెళ్ళికూతురు" లా ఉంటుందని ఇతని సమకాలీన కవి అయిన Yu Ji వ్యాఖ్యానించాడట.

Monday, October 2, 2023

సుఖ శాంతులతో పొంగిపొరలే పల్లెజీవనం by XIN QIJI (1140–1207)


ఏటిఒడ్డున గరికపొదలమధ్య
ఎత్తుతక్కువ తాటాకు పాక
సారాయి నింపుకొన్న
రెండు గొంతుకలు Wu మాండలీకంలో
పలికే తియ్యని మాటలు

జుత్తునెరిసిన ఆ ముదుసలి ఎవరు?

ఆమె పెద్దకొడుకు ఏటికి అవతల
ఎండిన కంది కట్టలను కర్రతో నూర్చుతున్నాడు
ఆమె మధ్యకొడుకు
వెదురుబద్దలతో కోళ్లగూడు అల్లుతున్నాడు
ఆమె చిన్నకొడుకు తుంటరి
ఏటి ఒడ్డుపై వెల్లకిలా పడుకొని
తామరకాయని చీల్చి లోపలేముందో చూస్తున్నాడు
 
మూలం: Village Life, to the Tune of “Clear Peaceful Happiness” by XIN QIJI (1140–1207)
అనువాదం: బొల్లోజు బాబా

XIN QIJI (1140–1207) సైన్యంలో వివిధ హోదాలలో పనిచేసి పదవీవిరమణ చేసాక కవిత్వం ఇతనికి పునర్జీవనాన్ని ఇచ్చింది. ఆదర్శవాదం, దేశభక్తి, సైనికజీవనం ఇతని కవిత్వంలో పెద్దగా కనిపించవు. 600 పైన కవితలు రచించాడు. ప్రకృతి, ప్రేమ, వేదాంత ధోరణి లు కవితా వస్తువులు.