Sunday, September 29, 2024

సమకాలీన తెలుగు లాక్షణికుడు - శ్రీ ఇస్మాయిల్

ఈ వ్యాసాన్ని కవిసంధ్య స్వర్ణోత్సవసంచికలో ప్రచురించిన గురువుగారు, శిఖామణి కి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

బొల్లోజు బాబా


సమకాలీన తెలుగు లాక్షణికుడు - శ్రీ ఇస్మాయిల్

చాన్నాళ్ళ క్రితం ప్రముఖ విమర్శకులు శ్రీ సీతారాం "కావ్యసౌందర్యశాస్త్రం లేదా భారతీయ లాక్షణిక సిద్ధాంతాలు వినా, మనవీ అని చెప్పుకోదగిన సాహిత్య సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా?" అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీనికి ప్రముఖ విమర్శకులు శ్రీ లక్ష్మి నరసయ్య "దళిత, బహుజన, ముస్లిం వాద సాహిత్య దృక్పథాలు వాటికి సంబంధించిన ఈస్థటిక్స్ లాంటివి దేశీయ సాహిత్య సిద్ధాంతాలు" అన్నారు.
షేక్ పీర్ల మొహమ్మద్" ఏ సిద్దాంతానికైనా యూనివర్సల్ అప్పీల్ ఉండాలి కదా" అనే కోణాన్ని గుర్తుచేసారు.
సోషల్ మీడియాలో ఈ అంశంపై జరిగిన చర్చ చాలా ఆలోచనల్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు ప్రముఖ కవి శ్రీ ఇస్మాయిల్ సమకాలీన తెలుగు లాక్షణికుడిగా కనిపించారు.
***
1. Literary theory అంటే ఏమిటి?

Literary theory సాహిత్యంలో ఉండే "సాహిత్యసంబంధి" (Literary) ఏమిటి? అని ప్రశ్నించి దానికి సమాధానాలు రాబడుతుంది. అంటె రసము, ఔచిత్యం, ధ్వని, Tension, Texture, Ambiguity లాంటి ఏ ప్రక్రియ వల్ల ఒక కవిత ఎలా గొప్పకవిత అయ్యిందో/అవ్వగలదో సిద్ధాంతీకరిస్తుంది. లిటరరీ సిద్ధాంతం అంటే సాహిత్యాన్ని అర్ధం చేసుకోవటానికి, విశ్లేషించటానికి, సృజించటానికి ఉపయోగపడే ఆలోచనలు, పద్దతులు
Literary Criticism సాహిత్యాన్ని విశ్లేషిస్తుంది, తూకంవేస్తుంది మంచి చెడ్డలు విడమరచి చెపుతుంది. ఈ విమర్శలో ఒక కవిత ఎందువల్ల మంచికవితో లేక అకవితో పై సిద్ధాంతాల ఆధారంగా నిరూపిస్తుంది. ఎక్కడ రసభంగం జరిగింది, ఎక్కడ ఔచిత్యదోషం ఉంది, ఉద్దేశించిన ధ్వనికి ఎలా అన్వయం కుదరలేదు అనే విషయాలను విపులీకరిస్తుంది.
Literary theory, Literary Criticism లు పరస్పరాధారితాలు. ముందు theory పుడుతుంది, దానికనుగుణంగా విమర్శ జరుగుతుంది. ఉదాహరణకు సాహిత్యమనేది ఒక సాంఘిక కార్యక్రమమని, కవి సామాజిక మార్పుకు దోహదపడాలనే మార్క్సిజసిద్ధాంతం మొదటగా పుట్టింది. ఆ సిద్దాంతాన్ని ఉపయోగించుకొని ఒక కవితలో "సామాజిక ప్రయోజనం" ఏమేరకు ఉంది అంటూ విమర్శ సాగుతుంది. అలాగన్నమాట.
నిజానికి ఈ సిద్ధాంతకర్తకు, విమర్శకుడి కన్నా ముందు సృజనకారుడు అనే వాడు ఒకడుంటాడు. వాడికీ గొడవలేమీ పట్టవు. వాడిమానాన వాడు రాసుకొంటూ పోతాడు. వాడు రాసినవాటిలోంచే ఈ సిద్దాంతాలు, విమర్శలు పుట్టుకొస్తాయి.
***
2. దేశీయ లాక్షణిక సిద్ధాంతాలు

సాహిత్యం ఎలా ఉండాలి ఏవేం అంశాల వలన ఒక రచన సాహిత్యవిలువలను పొందుతుంది అనే విషయాలను లోతుగా శోధించి, కొన్ని ప్రతిపాదనలను చేసారు మన పూర్వీకులు. ప్రాచీన భారతీయ సిద్ధాంతాలలో ప్రధానంగా అలాంటివి ఆరింటిని గుర్తించవచ్చు

• భరతుని రస సిద్ధాంతం: రసాత్మకమైనదే కావ్యమని ప్రతిపాదిస్తుంది.
• భామహుని అలంకార సిద్ధాంతం: కావ్యానికి అలంకారాలు ప్రధానం అంటుంది
• వామనుడి రీతి సిద్ధాంతం: మంచి కావ్యానికి మంచి గుణాలుండాలంటుంది.
• ఆనందవర్ధనుని ధ్వని సిద్ధాంతం: వాచ్యంగా చెప్పిన విషయం కన్నా చెప్పకుండా వదిలేసిన విషయం ప్రధానమంటుంది.
• కుంతకుని వక్రోక్తి సిద్ధాంతం: వక్రోక్తి అంటే అలంకారములతో నర్మగర్భంగా చెప్పటం. ఇది ఆనందవర్ధనుని ధ్వనిని పోలి ఉంటుంది.
• క్షేమేంద్రుని ఔచిత్య సిద్ధాంతం: ఏది దేనికి తగి ఉంటుందో దాన్ని ఔచిత్యం అంటారు. కావ్యానికి ఔచిత్యం ఉండాలంటుందీ సిద్దాంతం.

ఇరవయ్యోశతాబ్దంలో పాశ్చాత్య Literary theory లలో అనేక దృక్పథాలు ప్రవేశించి Literary criticism ను నడిపించాయి. దేశీయ లాక్షణిక సిద్ధాంతాలకు పాశ్చాత్య సిద్ధాంతాలకు పొంతన ఉండదు. భారతీయ, పాశ్చాత్య సంస్కృతులు పూర్తిగా భిన్నమైనవి కనుక ఈ రెండిటి మధ్య పోలికలు తేవటం దాదాపు అసాధ్యం.

మొదట్లో అరిస్టాటిల్ లాంటివారు జీవితాన్ని అనుకరించేదే కళ అన్నారు. తరువాత మిల్టన్ కాలంలో చందస్సును అనుసరించి చెప్పటమే సాహిత్యం అన్నారు కాల్పనికతే (romanticism) సాహిత్యమని షెల్లీ, కీట్స్ కవిత్వం చెప్పింది.

3. ఆధునిక సిద్ధాంతాలు
• అభ్యుదయ, సామాజిక ప్రయోజనం కలిగి ఉండటం (మార్క్సిస్ట్ సిద్ధాంతం)
• భిన్నత్వాలను celebrate చేస్తూ చరిత్రను నిరాకరించటం ద్వారా స్వీయ అస్తిత్వాన్ని ప్రకటించుకోవటం (పోస్ట్ మోడర్న్)
• మనో వైజ్ఞానిక అంశాలను పొదువుకోవటం (ఫ్రాయిడియన్)
• స్త్రీవాద (gender and Queer theories)
• సాంస్కృతిక వైవిధ్యాలను ప్రతిబింబించటం (Cultural theory)
• పాఠంలోనే అన్ని అర్ధాలు ఉంటాయి అనే ప్రతిపాదన (Structuralism)
• పాఠం వెలుపల సోషల్ పొలిటికల్, హిస్టారికల్ కారణాల వల్ల చాలా కనిపించని అర్ధాలు ఉంటాయి అనే ప్రతిపాదన (Post structuralism)
• రచనలో బహుళార్ధాలను వెతకటం (Deconstruction)
• వలసపాలనానంతర ప్రభావం (Post Colonial)-- లాంటి రకరకాల లిటరరీ సిద్ధాంతాలు సాహిత్యంలో "సాహిత్యసంబంధి" ఏదో తేల్చి చెప్పటం కొరకు ప్రతిపాదించబడ్డాయి. ఒక్కోక్కటీ అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్న రీతిలో సాగుతాయి.

పైన చెప్పిన ఆధునిక లిటరరీ థీరీలను గమనిస్తే, భారతదేశానికి సంబంధించి ఎప్పుడో వందల సంవత్సరాలక్రితం ఏర్పరచిన లాక్షణిక సిద్ధాంతాలే తప్ప ఆధునిక కాలంలో మనం సృష్టించుకొన్న ఆధునిక దేశీయ సాహిత్య సిద్ధాంతాలు ఏమున్నాయి అని ప్రశ్నించుకోవటం సందర్భోచితమే కాదు అవసరం కూడా. ఆమేరకు లక్ష్మి నరసయ్య గారు చెప్పిన దళిత,బహుజన ఈస్థటిక్స్ కొంతమేరకు ఆ లోటును తీర్చిందని భావించవచ్చు.

మన తరంలో తెలుగులో అంత స్పష్టంగా కవిత్వానికి చక్కని నిర్వచనాన్ని, అసలు ఏది కవిత్వం అన్నదానికి సమాధానాన్ని, కవిత్వపు పరిధులు, బలహీనతలను విస్పష్టంగా చెప్పిన ఒక సిద్ధాంతకర్తగా శ్రీ ఇస్మాయిల్ కనిపిస్తారు. ఈయన వెలిబుచ్చిన అభిప్రాయాలపై పాశ్చాత్యప్రభావం లేదని చెప్పలేం అయినప్పటికీ ఇస్మాయిల్ గారి అభిప్రాయాలు స్వతంత్రంగా, స్థానీయంగా ఉండటం గమనించవచ్చు.

4. సమకాలీన లాక్షణికుడు - శ్రీ ఇస్మాయిల్

తెలుగుకు సంబంధించినంత వరకూ కవిత్వాన్ని నిర్వచించి, కొన్ని లక్షణాలను ప్రతిపాదించిన ఆధునిక కవులలో ఇస్మాయిల్ కనిపిస్తారు. నేనొక లాక్షణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాను అని ఆయన ఎక్కడా చెప్పుకోకపోయినా ఆయన వదిలివెళ్ళిన ప్రతిపాదనలు, చేసిన చర్చలు, వాదప్రతివాదనలను ఈ రోజు మనముందే ఉన్నాయి. వాటి ద్వారా, ఇస్మాయిల్ తనజీవితకాలమంతా తపస్సుచేసి ఆధునిక కవిత్వంలోని "సాహిత్యసంబంధి" లక్షణాలను నిర్వచించారని, కవిత్వాన్ని విశ్లేషించటానికి కావాల్సిన పనిముట్లను గుర్తించారని తెలుసుకోవచ్చు.


ఒక లాక్షణికుడిగా ఇస్మాయిల్ చేసిన ప్రతిపాదనలు

1. కవిత్వంలో నిశ్శబ్దం:
మన చుట్టూ ఉన్న అనుభవిక ప్రపంచాన్ని ఆవిష్కరించటమే కవిత్వ లక్ష్యం. అనుభవాన్ని అనుభవంగానే ప్రత్యక్షం గా అందించటం కవిత్వం పని. అనుభూతి సామాన్య భాషకు అందదు. ఆ అనిర్వచనీయమైన ఆ నిశ్శబ్దాన్ని వాక్యాలలోకి ప్రవేశపెట్టటమే కవిత్వ లక్షణం. కవిత్వానికి శబ్దమెంత ముఖ్యమో నిశ్శబ్దం కూడా అంతే. (ఇది కొంతమేరకు ధ్వని సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. శబ్దం అంటే ఒక కవితలో పైకి చెపుతున్న విషయంగాను, నిశ్శబ్దం అంటే అన్యాపదేశంగా చెపుతున్న లేదా చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంచిన విషయంగాను అర్ధం చేసుకోవాలి)

2. కవిత్వం హృదయ సంబంధి:
కవిత్వం హృదయ సంబంధి. ఆలోచనా వ్యవస్థ బుద్ధికి సంబంధించినది. కవిత్వాన్ని బుద్ధి (Reason) శాసించలేదు. దాని సామ్రాజ్యమే వేరు. కవిత్వానికి "కరుణ ముఖ్యం".
అసలు సృజనాత్మకతకి మూలమేమిటి? కవి యొక్క దర్శనం (vision). ఇది పూర్తిగా వైయక్తికమైనది. ఏ కవి దర్శనం వానిది. దీన్నించే అతని కవిత్వం ఉద్భవిస్తుంది. కనక, కవి నిబద్ధుడై ఉండవలసింది తన సొంత దర్శనానికే!
కవిత్వం తల్లివేరు కవి అంతర్లోకమూ, బహిర్లోకమూ కలిసేచోట తన్ని ఉంటుంది.

3. కవిత్వం చేసే పని చదువరి మనస్సులో దీపం వెలిగించడం:
కవిత్వం చేసే పనల్లా చదువరి మనస్సులో దీపం వెలిగించడమే. దీని వల్ల అతని అవగాహన పరిధి విస్తరిస్తుంది. తన మనస్సులో వెలిగిన దీపం వెలుతురు తన దారి తను వెతుక్కోవడానికి సహాయపడుతుంది. ఫలానా దారినే నడవమని ఒకరు చెబితే వినడు మనిషి. అది తనకు తోచాలి. తన దారేదో తను నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయానికి కవిత్వం తోడ్పడుతుంది.
“కళ కళ కోసమే” అనే వాదనా, “కళ సాంఘిక రాజకీయ ప్రయోజనాల కోసం” అనే వాదనా – రెండూ అతి వాదాలే! ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఏదీ వుండదు. ఐతే దేని ప్రయోజనం దానికుంటుంది. ఇది గుర్తించడం ముఖ్యం. ప్రపంచాన్ని అవగాహన చేసికోవటమూ, తద్వారా ప్రపంచంతో అనుభౌతిక అనుసంధానం (emotional adjustment) సాధించటమూ – అనాది నుంచీ కళా ప్రయోజనమని ఇస్మాయిల్ గారి ప్రతిపాదన.

4. భాషని శుభ్రపరచటం:
నేను (ఇస్మాయిల్) కవిత్వంలో ఒక ముఖ్యమైన పని చేయడానికి పూనుకున్నాను. భాషని శుభ్రపరచడానికి ప్రయత్నించాను. చాలా మాటలకు మాసిన రంగులు, పాత వాసనలు ఉంటాయి. అలాంటి మాటల్ని కవిత్వంలో వాడలేదు. పాత కావ్యాల్లోనివి, పురాణాల్లోని పదాలు, సమాసాలు, పేర్లూ, కథలూ నా కవిత్వం జోలికి రాకుండా జాగ్రత్తపడ్డాను. నా స్వంతమైన, సరికొత్త అనుభవాల్ని వ్యక్తపరచటానికి, వ్యావహారికప్రపంచంలోని సరికొత్త మాటల్నే కోసుకొచ్చి వాడుకున్నాను.

5. కవిత్వానికి లేబుల్స్ ఉండకూడదు:
కవిత్వానికి లేబిల్స్ అంటించడం నాకిష్టం ఉండదు. ఆలోచన నుంచి తప్పించుకొనే మార్గాలు లేబిల్స్. అర్థం చేసుకొనే కష్టానికి పాల్పడకుండా, తేలిగ్గా కొట్టిపారెయ్యడానికి లేబిల్స్ ఉపయోగిస్తారు. ‘బూర్జువా, శ్రామికవర్గం, రివిజనిస్టు లాంటి లేబిల్స్ అంటించి ఇక ఆ విషయం గురించి ఆలోచించడం మానేయవచ్చు.
***

పైన చెప్పిన అయిదు పాయింట్లు ఆధునిక కవిత్వాన్ని అర్ధం చేసుకోవటానికి, విశ్లేషించటానికి దోహదపడే అంశాలు. పై అయిదు పాయింట్లు స్వేచ్ఛాప్రతిపాదనలు.

కవిత్వంలో నిశ్శబ్దం అనే ప్రతిపాదనకు ధ్వనిసిద్ధాంతం మూలాలు కనిపిస్తున్నా, చెప్పిన విధానం కొత్తది.

కవిత్వం హృదయసంబంధి అన్నటువంటి మాట emotions recollected in tranquility అన్న మాటకు దగ్గరగా అనిపించవచ్చు. కవిత్వం పూర్తిగా వైయక్తికఅనుభవంగా, దర్శనంగా ఆమేరకు తన సృజనను కొనసాగించటం ఇస్మాయిల్ నిబద్దతగా భావించాలి. సాహిత్యప్రయోజనం ఆనందోపదేశాలు అని మనవాళ్లు, పాశ్చాత్యులు అంగీకరించారు. ఆ మాటకు భిన్నంగా కవిత్వం చదువరి మనస్సులో దీపం వెలిగించడం అనటం నవ్యమైన ప్రతిపాదన

అదే విధంగా భాషను శుభ్రపరచటం తెలుగుకు మాత్రమే అన్వయించబడే ఒక విషయంగా భావించవచ్చు. ఈ ప్రతిపాదనకు మూలాలు వాడుకభాషోద్యమంలో ఉంటాయి. అలాంటి క్లిష్టపదాలను వాడటం గురించి, డెడ్ మెటఫర్లను ఒదిలించుకోవటం గురించి ఈ ప్రతిపాదన మాట్లాడుతుంది.

కవిత్వానికి లేబుల్స్ ఉండకూడదు అన్నటువంటి ప్రతిపాదనకూడా పూర్తిగా ఆధునికమైనదే. కామెడిలని, ట్రాజెడీలని సాహిత్యాన్ని లేబ్లింగ్ చేసే పద్దతి పాశ్చాత్యులది. దేశీయమైన ప్రాచీన సాహిత్యంలో ఈ పద్దతిలేదు. ఒక కావ్యం జీవితసామస్త్యాన్ని ప్రతిబింబించేవిధంగా ఉండటంచే లేబ్లింగ్ అవసరపడలేదు భారతీయ లక్షణకారులకు. ఆధునిక కాలంలో కవిత్వాలకు వేసే లేబ్లింగ్ వలన జరిగే నష్టం గురించి మాట్లాడటం కూడా "సాహిత్య సంబంధి" కి లేబుల్స్ తో పనిలేదు అని చెప్పటమే.
.
ఈ అయిదు ప్రతిపాదనలతో కూడిన "Ismayil Literary theory" సాహిత్యంలో ఉండే "సాహిత్యసంబంధి" (Literary) ని నిర్వచిస్తుంది.

బొల్లోజు బాబా





Monday, September 23, 2024

మొఘల్ పాలకులు -సంస్కృత పండితులు

భిన్నమతస్థులు ఒకరి ఆచార, వ్యవహారాల పట్ల మరొకరు సానుకూల దృక్పథంచూపటం, ఒకరి భాష, సాహిత్యాలను మరొకరు ఇష్టంగా అక్కున చేర్చుకోవటం లాంటి చర్యలద్వారా మతసామరస్యం వెల్లివిరుస్తుంది. మొదటిది సామాన్యజనం పాటించదగినది కాగా రెండవది మేధోపరమైన అంశం. మధ్యయుగాలలో అనేకమంది ముస్లిమ్, హిందూ ఆద్యాత్మికవేత్తల పరస్పర సంభాషణలు, చర్చల ద్వారా హిందూ ఇస్లాం మతాల మేళనం జరిగింది.

హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా (1238-1325), షేక్ ఫరీదుద్దీన్ గంజ్‌షకర్ (1173-1265), షా అబ్దుల్ కరిమ్ (1536-1623), షా ఇనాయతుల్లా (1655 – 1718) లాంటి సూఫీ సన్యాసులు హిందూ ముస్లిముల ఐక్యతను బోధించి ఇరుమతస్థులలో సమాన ఆదరణ పొందారు

సూఫీ వేదాంతి బాబా ఫట్టు, హిందూ గులాబ్ సింగ్ వద్ద శిష్యరికం చేసాడు. ఇతని దర్గా హిమాచల ప్రదేష్ లో నేటికీ హిందూ ముస్లిములకు దర్శనీయ స్థలం. కబీరుదాసు (1399-1518) రామ్ రహీమ్ ఏక్ హై అనే తత్వాన్ని జీవితాంతంప్రచారం చేసాడు.

నానక్ సాహెబ్ (1469-1539), దాదు దయాళ్ (1544-1603), యారి షా (1668-1725), బుల్లా సాహెబ్ (యారి షా శిష్యుడు), దరియాసాహెబ్ (1700-1780), తులసి సాహెబ్ (1760- 1842) లాంటి మహనీయులు హిందూ ముస్లిమ్ ల ఆద్యాత్మిక ఐక్యత, ఐహిక సామరస్యతల కొరకు ఎంతో కృషిచేసారు.

హిందూ ముస్లిమ్ ల మధ్య సాంస్కృతిక భావనలను ఇచ్చిపుచ్చుకోవటంలో స్త్రీలు కూడా పాటుపడ్డారు. నాని బాయి, మాతా బాయి (వీరు దాదు దయాళ్ కుమార్తెలు), దయాబాయి, క్షేమాబాయి మొదలగు వారు ఒకనాటి హిందూ ముస్లిమ్ సఖ్యతను బలపరచిన సాధకురాళ్ళు
***

గౌడియ వైష్ణవ సంప్రదాయ స్థాపకుడైన శ్రీ చైతన్య మహాప్రభుకు (1486-1533) బుద్ధిమంత ఖాన్ అనే ముస్లిమ్ అత్యంత సన్నిహితుడైన సేవకునిగా వ్యవహించేవాడు. బుద్ధిమంతఖాన్ ధనవంతుడు, దాత. ఇతను శ్రీచైతన్య మహాప్రభు, విష్ణుప్రియల వివాహం దగ్గరుండి జరిపించాడు. మహాప్రభు జరుపుతున్న హిందూభక్తి ఉద్యమంలో పాల్గొన్నాడు. అలా ఒక ముస్లిమ్ వ్యక్తి వైష్ణవ సంప్రదాయ స్థాపకుని ఆశయాలను, ఆదర్శాలను ముందుకు తీసుకొని వెళ్ళటంలో సహాయపడ్డాడు.

నజీర్ మహమ్మద్ , ఫకీర్ హబీబ్, సయ్యద్ మర్తూజా లాంటి కవులు –కృష్ణభక్తితో గీతాలు రచించారు.
ముస్లిమ్ యోగి వావర్ తొ అయ్యప్ప స్వామి, బీబి నాంచారితో వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆథ్యాత్మిక సంబంధాలను ఉత్త భక్తి కథలుగా కొట్టిపారేయలేం. వాటివెనుక మన పూర్వీకులు నిర్మించదలచిన సామరస్యతను అర్ధంచేసుకోవాలి.
***

ఏ కాలంలోనైనా అధికారం సాహిత్యాన్ని ప్రభావితం చేస్తుంది. బౌద్ధం అధికారంలో ఉన్నకాలంలో త్రిపిటకాలు; హిందూరాజుల పాలనలో ఇతిహాసాలు, పురాణాలు రాయబడ్డాయి. ముఘల్ పాలనలో ప్రత్యేకంగా ఇస్లామ్ మతాన్ని ప్రబోధించే రచనలేవీ రాలేదు సరికదా హిందూ వేద వేదాంగాలు ఇతిహాసాలు పర్షియన్ భాషలోకి తర్జుమా చేయబడ్డాయి. మొఘల్ పాలకులకు తమ పాలిత ప్రజల ఆచార వ్యవహారాలను, విజ్ఞానాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. సమయానుకూలంగా అనేకమంది పండితులు, రాజపుత్రుల సిఫార్సులతోనో లేక స్వయంగానో- జ్యోతిష్కులు, అనువాదకులు, రాజకీయ రాయబారులు, గాయకులు, కవిపండితులు, స్థానిక సమాచారం ఇచ్చే ఉద్యోగులు లాంటి భిన్నపాత్రలలో మొఘలుల కొలువుల్లో కుదురుకున్నారు.

ముఘల్ చక్రవర్తులు సంస్కృత పండితులను సాంస్కృతిక రాయబారులుగా భావించి, వారికి తమ ఆస్థానాలలో గౌరవ స్థానాన్ని ఇచ్చేవారు. బాబర్ (1504-21) ఆస్థానంలో జయరాజ్, హుమయూన్ (1530-40) ఆస్థానంలో ఆనందరాయ అనే పేర్లుకల సంస్కృతపండితులు ఉండేవారు. అక్బర్ (1556-1605) కాలంలో దేశం నలుమూలలనుంచి సంస్కృత పండితులు మొఘల్ ఆస్థానంలో చేరటం ప్రారంభమైంది. అక్బర్ తన సంస్థానంలో మతపరమైన తాత్వికచర్చలకొరకు ఒక సభను (ibadatkhanah) ఏర్పరచి దాని ద్వారా ఇస్లామ్, హిందూ, బౌద్ధ, జైన, క్రిష్టియన్ పండితుల మధ్య వేదాంత చర్చ జరిపించేవాడు. అక్బరీయ కాళిదాసు, హీరవిజయ సూరి, శాంతిచంద్ర లాంటి కవులు అక్బర్ సంస్థానంలో ఉండేవారు. ఇతనిపాలనలో మహాభారతం, అధర్వణవేదం, రామాయణం, హరివంశం, యోగవాసిష్టం లాంటి హిందూ గ్రంథాలు పర్షియన్ భాషలోకి అనువదింపబడ్డాయి.

అక్బరు సంస్థానంలో పెద్ద ఎత్తున ప్రవేశించిన పండితులు, చక్రవర్తిని ఆకర్షించటానికి అనేక యుక్తులకు పాల్పడేవారు.

ఒక బ్రాహ్మణుడు ముఘల్ పాలకుల ప్రాపకం పొందటం కొరకు ‘ష్యాయక్ భావన్’ అనే పేరుతో ఇస్లాంలోకి మారిపోయి స్థానిక హిందూ పండితులకి అక్బర్ కు మధ్య సంధానకర్తగా వ్యవహరించేవాడు.

హుమాయున్ కాలంలో అప్పటికే ఉన్న పెర్షియన్ జ్యోతిష్యానికి జోడింపుగా భారతీయ జ్యోతిష్యం కూడా ముఘల్ ఆస్థానంలోకి ప్రవేసించింది. కాలక్రమేణా అనేకమంది హిందూ జ్యోతిష్కులు అక్బర్ ఆస్థానంలో చేరి, చక్రవర్తి దినచర్యలలో మంచి చెడ్డలు చెప్పటం ద్వారా రాజకీయనిర్ణయాలను ప్రభావితం చేయసాగారు. ఈ ప్రభావం ఎంతవరకూ వెళ్ళిందంటే, అక్బరుకు మూలా నక్షత్రంలో కూతురు జన్మించినందుకు శాంతిహోమాలు జరిపించటం, రోజుకు నాలుగు సార్లు దగ్గరుండి ఆయనతో సూర్యనమస్కారాలు చేయించటం వరకు వెళ్ళింది.

కొందరు పండితులు “విష్ణుమూర్తి ఈ భూమిపై బాదుషాగా అవతరించనున్నాడని, ఆ అవతారంలో ప్రపంచాన్ని జయించి, గోవులను రక్షించి, బ్రాహ్మణులను ఆదరిస్తాడని” అంటూ కొన్ని సంస్కృతవాక్యాలను నలిగి, శిథిలమైన తాళపత్రాలపై రాసుకొచ్చి, ఇవి ఋషులు రచించినవని అక్బరు చక్రవర్తికి వినిపించగా ఆ మాటలను ఆయన నిజమని నమ్మేవాడట.

మరో అనామక రచయిత 1580 ప్రాంతంలో మరింత ముందుకెళ్ళి అల్లోపనిషద్ (అల్లా యొక్క ఉపనిషత్తు) రచించాడు. హిందూ దేవీ, దేవతలు అందరూ అల్లాతో సమానులే అని చెప్పే ఒక చిన్న గ్రంథం ఇది. దీనిని అక్బర్ చక్రవర్తికి భక్తితో సమర్పించుకొన్నాడట. ఈ ప్రయత్నాలన్నీ ముస్లిం పాలకుడిని ‘నా విష్ణుఃపృథ్వీపతి’ గా మార్చటానికే అని అర్ధం చేసుకోవాలి. ఈ ప్రయత్నాలకు అక్బర్ ఎంతో కొంత ప్రభావితం అయ్యాడు.

అక్బర్ తరువాత వచ్చిన జహంగీర్ ఆ తరువాత వచ్చిన షాజహాన్ లు కూడా ఇదే బాటలో పయనించి అనేకమంది సంస్కృత పండితులను ఆదరించారు. అనేక గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదింపచేసారు. షాజహాన్ చక్రవర్తి కొలువులో కవీంద్రాచార్య, జగన్నాథ పండితరాయలు వంటి జగత్ప్రసిద్ధి గాంచిన పండితులు ఉండేవారు.

తదనంతరం వచ్చిన ఔరంగజేబు (1658-1717) ఈ ఒరవడిని కొనసాగించలేదు. దానికి కారణం- సంస్కృతం నేర్చుకొని, ఎన్నో పవిత్ర హిందూ గ్రంథాలను సొంతంగా పర్షియన్ లోకి అనువదిస్తున్న అన్నగారైన దారాషికో ను హత్యచేసి రాజ్యాధికారం చేజిక్కించుకోవటం కావొచ్చు బహుశా. దారాషుకో చక్రవర్తి కావల్సిన వ్యక్తి. అప్పటికే ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించాడు. హిందూ-ఇస్లామ్ మతాలలోని సారాన్ని పోల్చుతూ వాటి ఐఖ్యతను కోరుతూ Majma-ul-Bahrain (రెండు సాగరాల సంగమం) అనే ఉద్గ్రంథాన్ని వెలువరించాడు. ఇతను ముఘల్ చక్రవర్తి అయిఉంటే భారతదేశచరిత్ర మరోలా ఉండేదంటారు. (నేటి పండితులకు ఔరంగజేబు పై ఉండే ద్వేషానికి మూలం ఈ నిరాదరణ కూడా కావొచ్చు)

ఔరంగజేబు అనంతరంవచ్చిన చక్రవర్తులు కూడా భిన్న సంస్కృతుల వాజ్ఞ్మయాలను ఇచ్చిపుచ్చుకోవటంలో పెద్దగా ఆసక్తి చూపలేదు. అంతే కాకముఘల్ సామ్రాజ్యం రాజకీయ ఒడిదుడుకుల పాలయి 1793 నుండీ క్రమేపీ బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళిపోయింది.
***

ఎక్కడినుంచో వచ్చిన ముఘల్స్ కు ఎందుకు సంస్కృతం అంటే అంత ప్రేమ కలిగింది అంటే బహుశా వారు భారతీయతను సాధించాలని భావించి ఉంటారు – అంటుంది ప్రముఖ చరిత్రకారిణి Audrey truschke

పదిహేడవశతాబ్దం వచ్చేసరికి అప్పటికి సుమారు రెండు శతాబ్దాలపాటు బ్రాహ్మణ మేధావులు మొఘల్ పాలక కులీన వర్గాలనుండి చక్కని ఆదరణ పొందారు. కొందరైతే పర్షియన్ భాషను నేర్చుకొని అధికారిక పదవులలో ప్రవేశించారు వీరి ప్రభావం మొఘల్ పాలన చివరివరకూ కొనసాగింది. ముస్లిమ్ ప్రపంచంలో భాగంగా ఉన్నప్పటికి దాని లోపలి విషయాలను, హిందూ ముస్లిమ్ సంస్కృతుల మధ్య జరిగిన అన్యోన్యాశ్రయతను, సాంస్కృతికపరమైన సంబంధబాంధవ్యాల గురించి పండితులు తమ సంస్కృత రచనలలో అక్కడక్కడా చేసిన చెదురు మదురు ప్రస్తావనలు తప్ప పెద్దగా ఎక్కడా ప్రతిబింబింపచేయలేదు. పండితుల చారిత్రిక నిశ్శబ్దం ఇది.

భానుకరుడు
భానుకర/భానుదత్త గొప్ప సంస్కృత కవి. తండ్రిపేరు గణపతి. నిజామ్ షా/షేర్ షా ఆస్థాన కవి. గీతాగౌరీశ, కావ్యదీపిక, రసమంజరి వంటి కావ్యాలను రచించాడు. అనేక పద్యాలలో ఇతను భూరన్ నిజామ్ షా ను కీర్తించటాన్ని బట్టి భానుకరుడు అతని ప్రాపకంపొందిన కవిగా గుర్తించటం జరిగింది. భూరన్ నిజామ్ షా 1510-1553 మధ్య పాలించాడు కనుక ఇతనిని 16 వ శతాబ్దపు కవిగా నిర్ణయించారు.
***

నిజాం షా సైన్యంతో యుద్ధరంగానికి కదం తొక్కుతున్న దృశ్యాన్ని భానుకరుడు ఇలా వర్ణించాడు. ఇవన్నీ అందమైన వర్ణనలు. భూమినే మూర్చిల్ల చేయటం కవియొక్క అసమాన ఊహాశాలిత.

గుర్రపు డెక్కలు కలిగించే ఒత్తిడికి భూమి మూర్చిల్లగా
సముద్రం అలలతో ఉప్పొంగి భూమిమోముపై నీళ్ళు జల్లిందట
దిక్పాలకి బలమైన గాలులను పంపి పతాకాలతో వీవెనలు వీచిందట
మూర్చనుండి కోలుకొనే వైద్యం కొరకు
పైకెగసిన ధూళి అశ్వనీదేవతలవైపు పరుగులిడిందట

యుద్ధంలో విజయం సాధించిన నిజాం షాని భానుకరుడు ఇలా స్తుతించాడు

నిజాంప్రభువు కోపంతో శత్రువులను చూస్తే
కంటిచూపుకే వారు తునియలైపోతారు
ఆకాశంలోని సూర్యుడు కూడా ఒణికిపోతూ
అపజయమే లేని మన ప్రభువు పతాకంలో తలదాచుకొంటాడు
(రాజపతాకంలో బహుశా సూర్యబింబ చిహ్నం ఉండేదేమో)

మరొక పద్యంలో సైన్య పదఘట్టనల తాకిడి తట్టుకోలేక నేల బయటకు చాచిన ఒణికే నాలుక వలె నిజాం పతాకం రెపరెపలాడుతోన్నదని వర్ణించాడు భానుకరుడు. ఇది కూడా అసమానమైనఊహ.
ఇతని రచనలు పద్యమిత్ర తరంగిణి, పద్యవేణి, రసిక జీవన సూక్తి సుందర లాంటి సంగ్రహాలలో ఉటంకింపుల ద్వారా మాత్రమే లభిస్తున్నాయి తప్ప సంపూర్ణ కావ్యాలు లభించలేదు.

జగన్నాథ పండితరాయలు
జగన్నాథపండితరాయలు (1590-1670) పదిహేడవ శతాబ్దపు కవి పండితుడు, సంగీతకారుడు. ఇతను పుష్టిమార్గీయ వైష్ణవసమాజాన్ని స్థాపించిన శ్రీమద్ వల్లభాచార్యుని మునిమనవడు. జగన్నాథుని తండ్రి శ్రీ పెరమభట్ట వారణాసిలో విద్యనభ్యసించి, శ్రీమద్ వల్లభాచార్యుని మనవరాలిని పెండ్లాడి మధురసమీపంలోని గోకులం వద్ద స్థిరపడ్డాడు . అలా జగన్నాథపండితరాయల తల్లి తరపు ముత్తాత వల్లభాచార్యుడు కాగా తండ్రితరపు పూర్వీకులు ఆంధ్రప్రదేష్, అమలాపురం వద్ద కల ముంగండ అగ్రహారానికి చెందినవారు.

జగన్నాథ పండితరాయలు ముఘల్ చక్రవర్తులైన జహంగీర్, షాజహాన్ ల ఆస్థాన పండితునిగా విశేషగౌరవం పొందాడు. భామిని విలాసము, రసగంగాధర, గంగాలహరి, పంచవిలాసములు, చిత్రమిమాంసఖండన ఇతని లభిస్తున్న రచనలు. ఆనందవర్ధనుడి ప్రసిద్ధిచెందిన ధ్వన్యాలోకముతో పోల్చదగిన గొప్ప అలంకార శాస్త్ర గ్రంథం రసగంగాధర. దీనిలో “రమణీయార్థ ప్రతిపాదక శబ్ధమే కావ్యం” అంటూ కావ్యానికి ఇచ్చిన నిర్వచనం ఈనాటికీ ఎంతో విలువైనది. సంప్రదాయాలను ధిక్కరించి ముస్లిమ్ మతానికి చెందిన ఒక మహిళను పెండ్లాడటం ఇతని ధీరవ్యక్తిత్వాన్ని పట్టిచూపుతుంది.

జగన్నాథపండితరాయలు ముఘల్ సంస్థానంలోకి ఎలా ప్రవేశించాడనేదానిపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

జగన్నాథుని కుటుంబం ఉంఛవృత్తి (భిక్షాటన) సాగించేది. విస్తరాకుల కొరకు ప్రతిరోజు ఒకచెట్టు ఆకులను కోసుకొనేవారట. ఒకనాడు ఆ తోట కాపలాదారు ఆకులుకోస్తున్న జగన్నాథుని అడ్డగించి “ఈ ప్రాంతాన్ని చక్రవర్తిగారు మా యజమానికి కానుకగా ఇచ్చారు, ఇకపై ఇక్కడి చెట్ల ఆకులను కోయరాదు” అన్నాడు. ఈ సంఘటనకు మ్రాన్పడిన జగన్నాథుడు ఆ ఊరి కరణం వద్ద ఈ విషయం చెప్పగా అతను “అవును నిజమే. నువ్వేమైనా చెప్పాలనుకొంటే చక్రవర్తిగారితోనే చెప్పుకో” అంటూ అవమానించాడట. ఆ మాటను పట్టుకొని జగన్నాథుడు నిజంగానే ఢిల్లీ వెళ్ళి ముఘల్ చక్రవర్తి జహంగీర్ ను కలిసి ఆయనను తన పాండిత్యంతో మెప్పించి ఆస్థానపండితునిగా స్థానం దక్కించుకొన్నాడట.

మరొక కథనం ప్రకారం జగన్నాథుడు మేవార్ మహారాజు జగత్ సింగ్ ఆస్థానపండితుడు. ఒకనాడు ముఘల్ చక్రవర్తి సభలో -రాజపుత్రులు క్షత్రియులు కారు; సంస్కృతము అరబిక్ భాషకంటే ప్రాచీనమైనది కాదు అనే రెండు అంశాలపై వాదోపవాదాలు జరిగాయట. పండితులు రెండుగా చీలిపోయారు. ఈ నేపథ్యంలో మేవార్ మహారాజు ఆదేశాలపై వాదించటానికి ఢిల్లీ వెళ్ళిన జగన్నాథుడు నిండు సభలో- రాజపుత్రులు క్షత్రియులేనని, సంస్కృతము అత్యంత ప్రాచీనభాష అని తన వాదనలు వినిపించి అందరిని మెప్పించాడట. అలా చక్రవర్తి ప్రశంసలకు పాత్రుడై కొలువులో చేరాడట.

జగన్నాథుడు కొంతకాలం జైపూర్ లో ఉన్నాడు. అప్పుడు మిత్రుడైన ఒక ముస్లిమ్ అధికారితో ఇస్లామ్ మతంపై లోతైన చర్చలు జరిపి అతనిని వాదనలో ఓడించాడట. ఆ అధికారి ఢిల్లీ వెళ్ళి ఈ విషయాన్ని చక్రవర్తికి చెప్పగా, ఆయన జగన్నాథుని పరీక్షించాలనే కోరికతో తనవద్దకు రప్పించుకొని అతని ప్రతిభపట్ల నమ్మకం కుదిరి తన ఆస్థానంలో నియమించుకొన్నాడంటూ మరొక కథనం ప్రచారంలో ఉంది.

పై కథనాలు ఊహాగానాలు కావొచ్చు. జగన్నాథుని మాతామహుని పేరు విట్టలేశుడు. ఇతను గొప్ప పేరుగాంచిన వైష్ణవ సన్యాసి. అక్బర్ సమకాలీనుడు. అక్బర్ అంతఃపురకాంతలలో కొందరు వైష్ణవం పట్ల ఆకర్షితులై, విట్టలేశుని ద్వారా వైష్ణవమతం పుచ్చుకొన్నారు. అలా విట్టలేశునికి ముఘల్ సంస్థానంలో ప్రవేశము, చక్రవర్తులతో సంబంధబాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయంతో విట్టలేశుని మనుమడైన జగన్నాథుడు ముఘల్ చక్రవర్తి కొలువులో సులువుగానే ప్రవేశించి ఉండవచ్చు.
***

జగన్నాథుడు ముఘల్ కొలువులో ఉండగా లవంగి అనే ముస్లిమ్ అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు. లవంగి ఒక అంతఃపురకాంత. ఈమె నూర్జహాన్ ఆశ్రితురాలు. నూర్జహాన్ దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె నిర్భాగ్యులైన బాలికలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పి వారిని అర్హతకలిగిన హిందు లేదా ముస్లిమ్ యువకులకు ఇచ్చి వివాహం జరిపించేదట. అలా నూర్జహాన్ ద్వారా రక్షణ పొందిన వారిలో లవంగి ఒకరు. జగన్నాథుడు లవంగి ద్వారా పొందిన కొడుకు చిన్నవయసులోనే మరణించాడు. ఈ మతాంతర వివాహం వల్ల జగన్నాథుడు జీవితాంతం స్వజనుల ఆక్షేపణలకు గురయినట్లు అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకనాడు జగన్నాథుడు వారణాసిలో గంగానదిలో స్నానం చేయబూనగా అక్కడి పండితులు “నువ్వు ముస్లిమ్ స్త్రీని పెళ్ళిచేసుకొని కులభ్రష్టత్వం పొందావుకనుక గంగను తాకరాదని” నిలువరించారట. (అలాచేసింది అద్వైతవేదాంతి అప్పయ్యదీక్షితులు అంటారు కానీ వీరిరువురు సమకాలీనులు కారు). ఈ సందర్భంగా జగన్నాథ పండితరాయలు గంగాలహరి పేరుతో గంగాస్తుతి చేసి గంగామాతను ప్రసన్నం చేసుకొని సచ్ఛీలుడిగా నిరూపించుకొన్నాడని ఒక ఐతిహ్యం. చనిపోయాడని మరొక కథనం కూడా కలదు.

1620 లలో జహంగీరు ఆస్థానంలో కవిగా జగన్నాథుడు స్థానం సంపాదించుకొన్నాడు. షాజహాన్ ఆస్థాన చరిత్రకారులు రచించిన Padshahnama లో “మార్చ్ 9, 1634 న (22nd Rabius AH 1044) జగన్నాథ కళావంత్ అనే గాయకుడు, చక్రవర్తిని కీర్తిస్తూ పన్నెండు అందమైన పద్యాలు సమర్పించుకోవటం జరిగింది. వాటికి సంతసించిన ప్రభువుల వారు, వెండితో తులాభారం గావించి, మొత్తం 4,500 రూపాయిలు బహుమతిగా ఇచ్చారు. “పండితరాయ” అనే బిరుదును కూడా ప్రసాదించారు” అని ఉన్నది. ఈ జగన్నాథ కళావంత్ అనే గాయకుడిని జగన్నాథకవిగా చరిత్రకారులు నిర్ధారించారు. ఆ విధంగా జగన్నాథుడు జగన్నాథపండితరాయలుగా మారిన చారిత్రిక సందర్భం లిఖించబడింది . (కారణాలు తెలియరావు కానీ, జగన్నాథుడు, కవీంద్రుడు లాంటి సంస్కృత కవులను ముఘల్ చరిత్రకారులు తమ రాతలలో dhrupad గాయకులుగా వర్ణించారు).
***

నూర్జహాన్ సోదరుడు, షాజహాన్ మామగారు అయిన ఆసిఫ్ ఖాన్ యొక్క విజయాలను కీర్తిస్తూ జగన్నాథుడు “ఆసిఫ్ విలాసము” అనే కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఒక పద్యం
ఆసఫ్ ఖాను యుద్ధంలో గణ్యుడు, దేవతలచే గౌరవింపబడినవాడు. ప్రపంచవిజేతకు సన్నిహితులుగా ఉండే అందరి రాజులలో ఆసఫ్ ఖాను- వాక్యాలలో కావ్యం వంటివాడు, కావ్యానికి ధ్వని, ధ్వనికి రసము, రసములలో శృంగారము వంటివాడు. అన్ని శాస్త్రాలను ఔపాసన పట్టిన ఆసఫ్ ఖాన్ నవాబు తన మాధుర్యము, ఘనత కారణంగా విమర్శకుల హృదయాలను గెలుచుకొన్నాడు.

1641 లో ఆసిఫ్ ఖాన్ చనిపోయినపుడు జగన్నాథుడు ఇలా విలపించాడు.

ఆసిఫ్ ఖాను మరణంతో అతని యశస్సు, అతని ఆశ్రితులు నశించటం సహజం.
కానీ ఇదేమి వింత! అతని కీర్తి ఈ సువిశాల పృధ్విపై దశదిశలా వ్యాపిస్తున్నది! //
ఆసిఫ్ ఖానుకు సమానుడు ఈ భూమిపై లేడు.
ఆయనమాటలు అమృతం; ఆయన వ్యక్తిత్వం రత్నగర్భ;
ఆయన కీర్తి అమృతకిరణాలు కలిగిన చంద్రకాంతి; ఆయన జ్ఞానం సాగరసమానం.

షాజహానుని కీర్తిస్తూ జగన్నాథపండితరాయలు చెప్పిన పద్యాలు

ఈ లోకంలో సహాయంకొరకు
ఇద్దరు ఈశ్వరులను మాత్రమే వేడుకోవాలి
ఒకరు ఢిల్లీశ్వరుడు మరొకరు సర్వేశ్వరుడు
ఆదరించటంలో మిగిలినవారెవరూ వీరికి సమ ఉజ్జీలు కారు.

ఓ షాబుద్దిన్ మహరాజా! నీవంటి సుగుణాలు కలిగిన వారు
ఈ ప్రపంచంలో మరొకరు ఉండరు
సృష్టికర్త మరోప్రపంచాన్ని పునఃసృష్టించినా
అక్కడ కూడా నీకు సమానుడు ఉండడు.

ఓ పాలసంద్రమా!
నీవు దేవుని ప్రత్యేక సృష్టి అని; అనంతమైన ఘనత, లోతు, రత్నాలతో
అనుగ్రహింపబడిన దానవని గర్వించకు;
ఎందుకంటే నీకు సమానంగా ఢిల్లీ చక్రవర్తి దారాషుకో ఉన్నాడు
***

షాజహాన్ ను చెరసాలలో పెట్టటం; అతని కుమారుడు, తనకెంతో ఆప్తమిత్రుడైన దారాషికో హత్యగావింపబడటం (1659) జగన్నాథపండితరాయలిని తీవ్ర మనస్తాపానికి గురిచేసాయి. దారాషికో ను స్తుతిస్తూ “జగదాభరణ” అనే స్మృతి గీతాన్ని రచించాడు

ఇతను మొఘల్ ఆస్థానపండితుడిగా 1660 వరకూ ఉండి బయటకు వచ్చేసాడు. తరువాత బెంగాల్, కూచ్ బేహార్ రాజయిన ప్రాణనారాయణ వద్ద కొన్నాళ్ళు ఆశ్రయం పొందాడు. జీవిత చరమ దశను వారణాసిలో గడిపాడు.

రాజాస్థానాలలో సత్యానికి తావులేదని, నిజాయితీ ఉండదని, ఋజువర్తనులకు రాజసేవ నరకప్రాయంబని తలచి ప్రశాంతంగా జీవించాలని వారణాసి వెళ్ళే సమయంలో రాసిన పద్యం అయి ఉంటుంది ఇది…

ఓ గార్దభమా! ఎన్నాళ్ళిలా ఎండుగడ్డి తింటూ,
బట్టలమూటలు మోసుకొంటూ తిరుగుతావు?
రాజుగారి అశ్వదళంలో చేరి మంచి గ్రాసం తిను
అక్కడ నువ్వు గాడిదవని ఏ అధికారీ గుర్తించడులే!
తోక ఉన్న ప్రతీదీ అశ్వమని భావిస్తారు వారు
రాజుగారు కూడా వారినే విశ్వసిస్తారు
సత్యానికి చోటు లేదు అక్కడ.

వారణాసిలో జగన్నాథపండితరాయలిని సంప్రదాయ బ్రాహ్మణులు మతాంతర వివాహం చేసుకొన్నాడనే నెపంతో అనేక అవమానాలపాలు చేసారు. ఒక కథనం ప్రకారం అయితే…. ఆ అవమానాలకు మనస్తాపం చెందిన జగన్నాథపండితరాయలు, భార్య లవంగితో కూడి గంగానదిలోకి మెట్టుమెట్టుకూ ఒక్కో పద్యం చొప్పున చెప్పుకొంటూ దిగుతూ 53 పద్యాలు చెప్పేసరికి భారాభర్తలు ఇరువురూ గంగానదిలో కొట్టుకుపోయి మరణించారట. ఇది కల్పన కావొచ్చు. రాజాశ్రయం కోల్పోయి, వృద్ధాప్యం మీదపడగా శ్రీనాథుని వలే కష్టాలపాలయి అనామకంగా మరణించి ఉండవచ్చు ఈ కవిరాజు. అభిమానులెవరో జగన్నాథపండితరాయలి దయనీయనిష్క్రమణను గౌరవనీయంగా మార్చటానికి పై కథను కల్పించి ఉంటారు.

హీరవిజయ సూరి
హీరవిజయ సూరి (1526-1595) గుజరాత్ కు చెందిన సంస్కృత పండితుడు. జైన మతావలంబి. ఇతను 1582 లో అక్బర్ కోరికపై ఫతేపూర్ సిక్రి లో జరిగే భిన్నమతాల తాత్విక చర్చలలో జైనమతం తరపున పాల్గొనటానికి వచ్చాడు. ఇతని వైదుష్యంపై అక్బరుకు గౌరవం ఏర్పడింది. ఇతనికి “జగద్గురు” అనే బిరుదునిచ్చి సత్కరించాడు. ఇతని అహింసాబోధనలకు అక్బరు ఎంతో ప్రభావితం అయ్యి, వారంలో కొన్ని రోజులు మాంసాహారం తీసుకొనే వాడు కాదు.

హీరవిజయ మొఘల్ ఆస్థానంలో తనకున్న పరపతిని ఉపయోగించి కొన్ని రాజకీయ ఉత్తర్వులను సంపాదించాడు. 1584 లో ప్రముఖ జైన “పర్యుషన” పండుగకాలంలో 12 రోజుల పాటు జంతుబలులను నిషేదించే రాజాజ్ఞను పొందాడు. ముఘల్ దండయాత్రలలో ఖైదీలుగా తీసుకుపోయిన వారిని అక్బర్ చే విడుదల చేయించాడు. ఫతేపూర్ సిక్రీ సమీపంలో జైనులు పవిత్రంగా చూసుకొనే “దామర చెరువు” లో చేపలను పట్టుకోవటాన్ని నిలుపుచేసే ఉత్తర్వు ఇప్పించాడు. ఇలా విధించిన నిషేదం గురించి చక్రవర్తి గ్రామాలలో చాటింపు వేయించాడు. ఈ పనులన్నీ అహింసను జీవినవిధానంగా చేసుకొన్న జైనమతస్థులందరికీ సంతోషం కలిగించిన అంశం.

శాంతిచంద్ర అనే జైన కవి కృపాశకోశ (దయానిధి) అనే పేరుతో రాసిన అక్బరు జీవిత చరిత్రలో ఈ చేపలవేట నిషేదాన్ని ఇలా వర్ణించాడు-

భూలోక చంద్రుడైన అక్బరుని పుణ్యమహిమచేత
చేపలను ముక్కులతో పట్టుకొని తినే కొంగలు కూడా
జాలిపడి వాటిని తినటం మానేసాయి
ఇదే కావ్యంలో శాంతి చంద్ర అక్బరు సుగుణాలను ఇలా వర్ణించాడు
అతను జిజియాపన్ను తొలగించాడు
అనేక ఆలయాలు విరూపం కాకుండా కాపాడాడు
ఎందరో యుద్ధ బంధీలను దయతో విడుదల చేయించాడు
అందరినీ సమాదరించాడు
ఆలమందలు దూడలకు నిర్భయంగా జన్మనిచ్చాయి

అక్బర్ ఆస్థాన చరిత్రకారుడు అబుల్ ఫాజిల్ కూర్పుచేసిన ఆనాటి 140 మంది ప్రముఖవ్యక్తుల జాబితాలో హీరవిజయ సూరిది 21 వ స్థానం.
*****
గోసాయి జద్రుప్/చిత్రరూప్

గోసాయి జద్రుప్ ఒక బ్రాహ్మణ సాధువు. ఇతనిని వివిధ సమయాలలో 1617 నుంచి 1620 మధ్య జహంగీర్ చక్రవర్తి కనీసం 6 సార్లు సందర్శించినట్లు ముఘల్ చరిత్రకారులు లిఖించారు. “గోసాయి జద్రుప్ వేదాంతం, సూఫీయిజంలలో గొప్ప పాండిత్యం కలిగిన వ్యక్తి. తన తండ్రి అక్బర్ చక్రవర్తి కూడా జద్రుప్ ను ఉజ్జయిని వద్ద ఒకసారి సందర్శించాడు (1601)” అని జహంగీర్ చెప్పేవాడట. అక్బర్ కానీ, జహంగీర్ కానీ జద్రుప్ ను ఆస్థానానికి పిలిపించుకొని మాట్లాడటం కాక, తామే స్వయంగా జద్రుప్ ఆశ్రమానికి వెళ్ళి అతనితో సంభాషించే వారంటే జద్రుప్ పట్ల ఎంతటి గౌరవం కలిగిఉండేవారో ఊహించుకోవచ్చు.

జద్రుప్ 1560 ప్రాంతంలో జన్మించి ఉండవచ్చు ఎందుకంటే 1618 లో జహంగీర్ ఇతనిని కలిసినప్పుడు 60 ఏళ్ల వయసు ఉండవచ్చు అని అన్నాడు. అప్పటికే జద్రుప్ భార్యబిడ్డలను త్యజించి సన్యాసిజీవనాన్ని సాగిస్తున్నాడు. జహంగీర్ తనకొడుకు ఖుశ్రోను తనపై తిరుగుబాటు చేసినందుకు1606 లో ఖైదు చేయించాడు. ఖుశ్రో మామగారు జద్రుప్ ను కలిసి ఖుశ్రోను జైలునించి విడుదల చేయిమని జహగీరు చక్రవర్తికి చెప్పమని కోరాడు. జద్రుప్ జహంగీర్ ను ఖుశ్రోను క్షమించి విడుదల చేయమని కోరగా, అతను అంగీకరించి విడుదల చేసాడట.

మధురలో హకిం బేగ్ అనే ఒక ముస్లిం అధికారి జద్రుప్ కు కొరడా దెబ్బల శిక్ష విధించగా (ఏం నేరం చేసాడో తెలియరాదు), జహంగీర్ చక్రవర్తి హకిం బేగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసి విధులనుండి శాశ్వతంగా తొలగించాడట . జద్రుప్ సూచనలపై ప్రాచీన భారతదేశ తూనికలు, కొలతలను జహంగీర్ తన రాజ్యంలో ప్రవేశపెట్టాడు.

1623 ప్రాంతంలో జద్రుప్ ఉజ్జయిని నుండి వారణాసి కి మారిపోయి 1638 లో అక్కడే మరణించాడు.
గోసాయి జద్రుప్ తో జహంగీర్ మాట్లాడుతున్న వర్ణచిత్రం పారిస్ మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నది.

రుద్రకవి
రుద్రకవి ముఘల్ కుటుంబీకులపై నాలుగు కావ్యాలు రచించాడు. అవి అక్బర్ కుమారుడు దన్యాల్ షా పై దానషాహరచరిత్ర Dānaśāhacarita-(1603), రాజ ప్రముఖుడైన ఖాన్ ఇ-ఖాన్ గురించి ఖానఖానాచరిత్ర khānakhānacarita (1609), జహంగీర్ పై జహంగీరచరిత్ర Jahāngīracarita, 1610-1620) షాజహానుపై కీర్తిసముల్లాస Kīrtisamullāsa (1610-1620) కావ్యాలు. వీటిలో ముఘల్ ప్రముఖులను హిందూ రాజులను కీర్తించినట్లే ఇంద్రుడు, చంద్రుడు, ఈశ్వరుడు, విష్ణువు లాంటి ఉపమానాలతో పోల్చటం సంప్రదాయ సంస్కృతకావ్యాల ఒరవడి గానే కాక వారందరినీ హిందూ సంస్కృతిలోకి తీసుకువచ్చే ప్రయత్నంగా కూడా అర్ధం చేసుకోవచ్చు.
***

ముగింపు
ముఘల్ పాలకులు బాబరు కాలం నుంచీ సంస్కృత పండితులను చేరదీసారు. అనేక హిందూ పురణేతిహాసాలను పర్షియన్ భాషలోకి అనువదింపచేసారు. భారతీయ పెర్షియన్ సంస్కృతుల మేళనం కొరకు పాటుపడ్డారు. 1501-1722 మధ్య అనేకమంది మంది కవులు ఇరాన్, మధ్య ఆసియాలనుండి భారతదేశం వలస వచ్చారు. బాబర్ స్వయంగా కవి. గజల్స్ రచించేవాడు. హుమాయున్, జహంగీర్, షాజహాన్ లు కవిత్వం పట్ల ఎంతో మక్కువ కలిగి ఉండేవారు. వీరి ఆస్థానాలలో Tahir Bukhari, Qara Bahadur Khan, Maulana Nadiri Samarkandi, Talib Amuli, Nur Jahan, Muhammad Quli Salim Tahani లాంటి ప్రముఖ పెర్షియన్ కవులు ఉండేవారు.

ఒక్క ఔరంగజేబ్ మాత్రం సాహిత్యంపై విముఖత చూపాడు. ఇతని పాలనలో ఆస్థాన కవులు లేరు.
***

బహదూర్ షా జఫర్
చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ కు (1775-1862) యుద్ధాలకంటే కవిత్వం అంటే ఎక్కువ ఇష్టం. ఇతని ఆస్థానంలో మీర్జాగాలిబ్, మొమిన్ ఖాన్ వంటి గొప్ప కవులు ఉండేవారు. ఇతను స్వయంగా మంచి కవి. బ్రిటిష్ వారిపై ఇతను 1857 లో చేసిన తిరుగుబాటు విఫలమైనప్పుడు ఆ సందర్భాన్ని ఇలా సాహిత్యంలో నిక్షిప్తం చేసాడు.

అయ్యో! ఎంత గొప్ప తిరుగుబాటు ఇది
దయలేని కాలం వల్ల
ఢిల్లీ ఒక్క క్షణంలో జాఫర్ చేతుల్లోంచి జారిపోయింది.
అయినా బహదూర్ షా తన భారతీయుల పోరాట పటిమపట్ల ఆశావహంగానే ఉన్నాడు ఇలా
భారతీయులకు నిజాయితీ,
ఆత్మగౌరవం ఉన్నంతవరకూ
ఎన్నటికైనా హిందూస్థాన్ ఖడ్గం
లండన్ సింహాసనం ముందు
తళుక్కున మెరవకపోదు.
.
బహదూర్ షాని రాజకీయ ఖైదీగా బంధించి రంగూన్ కు తరలించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ సందర్భంలో అతను రాసుకొన్న చివరి కవిత్వం ఇది.
.
నీవు నన్ను చక్రవర్తిని చేసాననుకొన్నావు
కానీ నేను నా కిరీటాన్ని బిక్షాపాత్రగా,
నమ్మించి ద్రోహం చేయబడిన దానిలా
మిగుల్చుకొన్నాను //
తనకు ప్రియమైన భూమిలో ఖననం కొరకు
ఆరడుగుల స్థలం కూడా లేని
జాఫర్ ఎంతటి దురదృష్టవంతుడు
.
బహదూర్ షా ను స్థానికులు ఒక సూఫీ తాత్వికునిగా భావించి ఆశీర్వాదాలు తీసుకొనేవారట. బహదూర్ షా జాఫర్ November 7th, 1862 న మరణీంచాడు. రంగూన్ (బర్మా) లోనే ఖననం చేయబడ్డాడు. ఇతని సమాధి చాన్నాళ్ళు కాలగర్భంలో ఉండిపోయింది.
1991 లో స్థానిక వర్కర్లు డ్రైనేజ్ కొరకు కాలువలు తవ్వుతున్నప్పుడు, భూమిలో 3 అడుగుల లోతులో ఇతని సమాధి కనిపించింది. జాఫర్ ను "Emperor-Saint" గా గుర్తించి, ప్రస్తుతం దాని వద్ద ఒక సూఫీ దర్గా నిర్మించారు.

ఎవరు నా తరపున ప్రార్ధిస్తారు?
నాకొక పూలగుత్తి తీసుకొస్తారు?
నాకోసం ఒక కొవ్వత్తిని వెలిగిస్తారు?
నేను ఒట్టి చీకటి సమాధిని తప్ప మరేమి కాదు--- అంటూ బహదూర్ షా రాసుకొన్న వాక్యాలు గుండెల్ని మెలిపెడతాయి .

2012 లో భారత ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఈ దర్గాని సందర్శించి బహదూర్ షా జాఫర్ కు నివాళులు అర్పించారు.

బొల్లోజు బాబా







Monday, September 16, 2024

కవిత్వంలో అస్పష్టత - సంక్లిష్టత


‘‘కవిత్వమనేది
ఆత్మలోకంలో ఇద్దరి సంభాషణ
అది
స్వగతమూ కాదు
ఊదరగొట్టే ఉపన్యాసం
అంతకంటే కాదూ’’

కవిత్వం ఒక సామాజిక వ్యవహారం. నా ఆత్మతృప్తికోసం వ్రాసుకొంటాను అనటం ఒక హిపొక్రిసి. ఒక ఊహకు అక్షరరూపమివ్వగానే అది రచన అయిపోదు. దాన్ని మరొకరు చదివినప్పుడే అవుతుంది. కవికి కలిగిన ఊహను అదే స్థాయిలో పాఠకునిలో ప్రవేశపెట్టినపుడు ఏ పేచీ ఉండదు. కవిచేసిన కల్పనను పాఠకులు అందుకోలేకపోతే ఆ కవిత అస్పష్టంగా (Obscurity) ఉందని అర్ధం. అలా కాక పాఠకుడి కొంత శ్రమించి అందులో ఉన్న గూఢార్ధాన్ని విప్పుకొని ఆనందించినపుడు ఆ కవిత సంక్లిష్టంగా (Difficulty/Complexity)) ఉందని భావించాలి.

ఒక కవిత అర్ధం కాకపోవటానికి అనేక కారణాలుంటాయి. ‘‘పాఠకులే నా స్థాయికి ఎదిగి కవితను అర్ధం చేసుకోవాలని’’ కవి కోరుకోవటం సహజమైనా అదంత మర్యాదకరమైన వాదన కాదు. తన కవిత్వంలో తనకు తెలియకుండా దొర్లిన లోపాలను పరిశీలించుకోవటం అవసరం.
స్పష్టాస్పష్టంగా ఉండటం కూడా ఒక కవిత్వ లక్షణమే అయినప్పటికీ హద్దులు దాటకుండా చూడటం కవి బాధ్యత. కొన్ని కవితలు పూర్తిగా అర్ధమవ్వకపోయినా ఏదో అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించటం చేస్తాయి. దానికి కారణం ఆ కవితలలో కవి వాడిన ట్రోప్స్‌ చేసే మాయ అనుకోవచ్చు.

కవి భావం పాఠకునికి అందకపోవటాన్ని అస్పష్టతగా నిర్వచించు కొనవచ్చును.
రమణీయార్ధ ప్రతిపాదనే కవిత్వం అన్నారు ప్రాచీనులు. వివిధ రకాలైన శబ్ద, అర్ధ కావ్యదోషాలను ప్రతిపాదించి కావ్యం రమణీయంగా, స్పష్టమైన అర్ధం కలిగి ఉండేలా శాసించారు. ఆధునిక కవిత్వం ఆ శృంఖలాలను ఛేదించుకొంది. ఇది యుగధర్మం.

ఒకప్పుడు కవిత్వం ఏదో ఒక కథతో ముడిపడి ఉండేది. నేడు కవిత్వం నుండి కథ వేరుపడి స్వతంత్రంగా ప్రయాణిస్తున్నది. కవిత్వం అనేది ఒక సంపూర్ణమైన కథను కాక భావాలను, అనుభూతులను మాత్రమే వ్యక్తీకరించే సాధనంగా మారింది.

ఈ నేపథ్యంలో- జీవితం నుంచి వస్తువును తీసుకొని మూర్త వర్ణణలతో వ్రాసిన కవిత్వం సులభంగా అర్ధమౌతుంది. కుందుర్తి, తిలక్‌, శేషేంద్ర శర్మ, శిఖామణి, శివారెడ్డి, ఇస్మాయిల్‌ లాంటి కవులు ఆ కోవకు చెందిన కవిత్వాన్ని వ్రాసారు. అలాకాక అమూర్త/నైరూప్య భావాలద్వారా కవిత్వం చెప్పినప్పుడు భావప్రసరణలో కొంత సంక్లిష్టత ఏర్పడుతుంది.

ఎందుకంటే ఇక్కడ కవి వాడే ప్రతీకలు, ఉపమానాలు, భాష, చేసే ప్రయోగాల వల్ల అభివ్యక్తి జటిలమౌతుంది. ఆరుద్ర, మో, సిద్దార్థ, ఎమ్మెస్‌ నాయుడు, ఎమ్మెస్‌ సూర్యనారాయణ, అనంతు లాంటి కవుల కవిత్వం ఈ బాపతు.

కవిత్వంలో కనిపించే అస్పష్టతను - భాషాపరమైన అస్పష్టత, వస్తుపరమైన అస్పష్టత, భావపరమైన అస్పష్టతలుగా పరిశోధకులు విభజించారు.

నువ్వు దగ్గరుంటే
కోటినక్షత్రాల వెలుగునౌతాను
నువ్వు దూరమైతే
తోకచుక్కలా నేల రాల్తాను `` అంటూ తన ప్రేయసిని గురించి వర్ణించాడో యువకవి. ఇది చదివిన పాఠకుడు అయోమయానికి గురవుతాడు ఎందుకంటే తోకచుక్కలు నేల రాలవు, ఉల్కలు రాల్తాయి. పాపం ఆ యువకవికి తోకచుక్కలకు, ఉల్కలకు భేధం తెలియక చక్కని అనుభూతిని పాడుచేసాడు. ఇది భాషాగతమైన అస్పష్టత.

కవిత్వంలో అస్పష్టతను గురించి మాట్లాడుకొనేపుడు వేగుంట మోహన ప్రసాద్‌ ప్రస్తావన రాక మానదు. మో అధివాస్తవిక కవిత్వానికి చిరునామ.

రెబెకా
ప్రజాపతి ఉరుముతాడు
ఐవీ శంపాలత క్రీపర్‌ మెరుస్తుంది
ఇసిరిస్‌ వినాయకుడు చెర్లో మునుగుతాడు
కప్ప తల్లి పెళ్ళి అయిపోతుంది
బతకమ్మ పండగ చేసుకుంటాం
నీ ప్రప్రధమ అధమాధమ ప్రేయసి
చాటల్ని పంచుతుంది
కదలని అకతా నదిలో
ఆత్మకు లంగరు వేస్తాం
అక్షరం క్షయమవుతుంది
ఆత్మ శరీరమవుతుంది (రహస్తంత్రి - వేగుంట మోహన ప్రసాద్‌)

ఇది ఒక పూర్తి కవిత. క్రింద ఇచ్చిన ఫుట్‌ నోట్సులో రెబెకా అంటే Daphne Du Maurier నవల అని, ఇసిరిస్‌ అంటే ఇలియట్‌ ‘వేస్ట్‌ లాండ్‌’ లో ఫెర్టిలిటీ గాడ్‌ అని ఇంకా ఇ.ఎం.ఫార్‌ స్టర్‌ తన నవలలో ఉపయోగించిన ‘కనక్ట్‌’ థీరీ ఈ కవితలో వాడాను అని చెప్తాడు కవి. ఇవేవీ కవితను అర్ధం చేసుకోవటానికి ఏమాత్రం సహాయపడవు సరికదా మరింత క్లిష్టతరం చేస్తాయి. కవితా వస్తువు అంతుచిక్కదు. కవితమొత్తం ఒక ఆత్మాశ్రయ అంతర్ముఖత్వ మేధావితన ప్రకటనలా అనిపిస్తుంది. వస్తుపరమైన అస్పష్టతకు రెబెకా ఉదాహరణగా నిలుస్తుంది. అయినప్పటికీ కవితలో మెరిసే విభ్రమ ఆకట్టుకొంటుంది. విభ్రమను కావ్యలక్షణంగా ప్రాచీనులు గుర్తించారు. ‘‘తిక్కగా ఉన్నా కవిత్వం ఉంటే క్షమిస్తాం’’ అని మో గురించి ఇందుకే అన్నాడేమో చేరా.

“To be or not to be” షేక్స్‌పియర్‌ హామ్లెట్‌ స్వగతం లోని ప్రసిద్ధ వాక్యం. ఒక డోలాయమాన మానసిక స్థితిని అద్భుతంగా వ్యక్తీకరిస్తుంది.

ఆలూరి బైరాగి ‘‘హామ్లెట్‌ స్వగతం’’ కవిత ఇలా మొదలౌతుంది
తీగలు త్రెంచిన తుఫాను తగ్గిన తరువాత నేడు
తెలుస్తున్నది విధ్వంసపు టడుగుజాడల రాలుటాకుల పూల మధ్య
వేసిన ప్రశ్న ఒప్పైన ప్రత్యుత్తరం తప్పేనని
ప్రత్యుత్తరం తప్పైతే వేసిన ప్రశ్న తప్పేనని
వానకు తడిసి ఎండకెండి చేరుకొన్నది నావ నేడు తీరాన్ని
పగిలి చెదిరి చిద్రుపలై మునిగి దూరపారాన్ని
యిప్పుడిరక పగమరచిన సెగలారిన చీకటిలో
నీడల నటన బాధించదు ఇంద్రియాలను
ఆవేశం అలసటగా, చైతన్యం వేడిలేని వెలుతురుగా,
కలగా, అలగా, ఒక తీయని జలగా మారిన ఈ వేళలందు
తెలుస్తున్నది చావు బ్రతుకులిక్కడ లెక్కకు రావని
లెక్కకు వచ్చేవిచ్చట ఒక చూపని,
ఒక నవ్వని, ఒక కిరణం, ఒక పూవని,
తెలుస్తున్నది//......... అంటూ ఒక ప్రవాహగతిలో సాగిపోతుంది కవిత.

తీగలు తెంచిన తుఫాను అన్న ఊహే బుద్దికి అందదు. ఏం ప్రశ్నో, ఎవరు వేశారో అర్ధం కాదు. ఒక వేళ టుబి ఆర్‌ నాటుబి ప్రశ్నే అనుకొన్నా ఆ ప్రశ్నెందుకు తప్పో, జవాబెందుకు తప్పవుతుందో అర్ధం కాదు. నీడల నటన, అలసట చెందే ఆవేశం, వేడిలేని వెలుతురు చైతన్యం, లెక్కకు వచ్చే చూపు- లాంటి అమూర్తభావనలు కవితను అర్ధం చేసుకోవటంలో అడ్డుతగుల్తాయి. మొత్తం కవితలో వేదనలాంటి అనుభూతి స్పష్టాస్పష్టంగా తెలుస్తూంటుంది తప్ప విషయం అర్ధం కాదు. దీన్ని భావపరమైన అస్పష్టతగా భావించవచ్చు.

ఎమ్మెస్‌ నాయుడు తెలుగు సాహిత్య రంగంలో పేర్గాంచిన కవి. ‘‘ఒక వెళ్లిపోయాను’’ కవితా సంకలనంతో అలజడి రేపి తనని తాను నిరూపించుకొన్న భావుకుడు. ‘గాలి అద్దం’ ఇతని రెండవ సంపుటి. నాయుడు కవిత్వంలో అద్బుతమైన పదచిత్రాలు ఉంటాయి. ఒక మత్తులోకి లాక్కెళ్తాయి. భావం కనపడీ కనపడకుండా దోబూచులాడి నేను చెప్పేది ఇంతవరకే ఆపై నీ ఊహకు పనిపెట్టుకో అంటూ అదృశ్యమైపోతూంటుంది.

ఆధునిక జీవితంలో ఎన్ని అసంగతాలు, మార్మికతలు, అస్ఫష్టతలూ ఉన్నాయో అన్నీ ఇతని కవిత్వంలో ప్రతిబింబిస్తాయి. చెప్పేది ఎంతైతె ఉంటుందో చెప్పనిదీ రెట్టింపు ఉంటుంది.

(( మరల తల ))
ముఖమొహ్హటే
చలామణి గారడి
చలనం చలచలన
మరో మర
మరల తల
తాటకతై
మోహ మొహాల దడబడ
నయన ఖార్ఖానాలో మకమక
దాటని కన్నీటి పొలిమేర
ఆలోచనల పశువు
చిద్విలాస సంఘర్షణలో
దిగంబరై `` (ఎమ్మెస్‌ నాయుడు).

కవితా శీర్షికే తిరకాసుగా ఉంది. ఇక లోపలకు వెళితే పదాలను ఓ డబ్బాలో వేసి తిప్పి తిప్పి పేపరుపై బోర్లించినట్లు అనిపిస్తుంది.

బి.ఎస్‌.ఎం కుమార్‌ కవిత్వం మరీ అరాచకంలా అనిపిస్తుంది. అస్పష్టతకు మించిన పేరేదైనా ఉంటే సరిగ్గా సరిపోతుంది. ఆయన ఒక కవితలో కొంతభాగం ఇది. (పూర్తికవితలు కూడా ఇలానే ఉన్నాయి)

//తరగని నడకల్ని వేలాడేసిన సమయాన్ని పీలుస్తూ
రాత్రి మెల్లగా కూల్చే సంభాషణ
ఇద్దరమూ ఎదురుగానే కూర్చున్నాం
తన గాజు బిందువుల్ని నా తలమీదుగా ఒదులుతూ
అరచేతులు కలగనే కన్నీళ్లు బయటపడని రోడ్డు పగులుతూ.... (పేజి.నం: 3 నిఘాలు, వృత్తాలూ, వెల్తురారిన కళ్లు)

కుమార్‌ మంచి ప్రతిభాశాలి భాషాపటిమా, నూత్నపదబంధాల్ని సృష్టించగలిగే శక్తి కలిగినవాడు. అయినప్పటికీ పదానికి పదానికి పొంతన కానీ, వాక్యానికి వాక్యానికీ మధ్య ఒక క్రమం కానీ, భావానికి భావానికి మధ్య ఒక అన్వయం కానీ ఉండదు ఇతని కవిత్వంలో. ప్రముఖ విమర్శకుడు శ్రీ తమ్మినేని యదుకుల భూషణ్‌ అన్నట్లు ‘‘కవిత వ్రాయటం పూర్తయింది, ఇక అర్ధం చేసుకోవటమే మిగిలుంది’’ అనుకోవాలి.

నేడు వస్తువినిమయ ధోరణులు, ఉపాధులు విచ్ఛిన్నం కావటం, జీవికకోసం వలసలు తప్పని సరి అవ్వటం, రాజకీయ అవినీతి పెచ్చరిల్లటం లాంటి సాంస్కృతిక సామాజిక మార్పులు అనేకం చోటుచేసుకోవటం వల్ల జీవనం సంక్లిష్టమైపోయింది. ఆధునిక కవులు వైయక్తికమైన తమ విరక్తిని, అసంతృప్తిని, బాధను వ్యక్తీకరించటానికి చేసే ప్రయత్నంలో జీవితంలోని అస్పష్టత కవిత్వంలోకి వచ్చి చేరింది.

కవి మానసిక సంక్షోభం, అతి ప్రతీకాత్మకత, భావాలను నియంత్రించలేక పోవటం, మితిమీరిన నైరూప్య భావచిత్రణ మొదలగునవి కవిత్వంలో అస్పష్టతకు కారణాలుగా చెప్పుకోవచ్చు.
కవిత్వంలో అవిచ్ఛిన్నత, అసంబద్దత పోస్ట్‌మోడర్న్‌ లక్షణాలుగా చెపుతారు. అలాంటి కవిత్వం సామాన్య పాఠకునికి అస్పష్టంగా ఉంటుందని యువకవులు గుర్తించాలి.
****
కొంతమంది పాఠకులు కవిత్వాన్ని అర్ధం చేసుకోవటానికి ఏమాత్రం ప్రయత్నం చేయరు. కవిత్వం అంటే న్యూస్‌ పేపర్‌ కథనంలా సుభోధకంగా ఉండాలని భావిస్తారు. ఇలాంటి వారికి కవితలోని ‘కవిత్వభాష’ అర్ధం కాక ఆ కవిత అస్పష్టంగా ఉందని ఆరోపిస్తారు. నిజానికి అది అస్పష్టత కాదు సంక్లిష్టత. ఒకే కవితలో విభిన్న ఆలోచనలను, కోణాలను, సన్నివేశాలను చొప్పించటం సంక్లిష్టతకు దారి తీస్తుంది. అలాంటి కవిత్వాన్ని పొరలు పొరలుగా విప్పుకొని చదువుకొన్నప్పుడు రససిద్ధి కలుగుతుంది. వాక్యాల మధ్య అర్ధాలను వెతుక్కొని, కలుపుకొని హృదయగతం చేసుకొన్నప్పుడు ఆ కవిత తాలూకు సంపూర్ణ చిత్రం ఏర్పడుతుంది. కవి ఉద్దేశించిన భావాలు అవగతమౌతాయి. ఒక పజిల్‌ ను విప్పుకొన్నప్పుడు కలిగినటువంటి ఆనందం కలుగుతుంది.

ఒక కవి ఎంతో శ్రమించి కవిత్వాన్ని సృజించినపుడు, పాఠకులు కూడా కొంత శ్రమించి ఆ కవితాఫలాన్ని అందుకోవటం వారి బాధ్యత. అలాంటి పాఠకులే కవిత్వానికి సహృదయులు. ఈ ప్రక్రియలో ఒక రచనలోని మంచి చెడ్డలను విశ్లేషించే విమర్శకుల పాత్రకూడా ముఖ్యమైనది.
కవి ఊహలను అందుకోవటానికి ఒక పాఠకుడు ఏమేరకు శ్రమించాలో, చెల్లి సురేంద్రదేవ్‌ వ్రాసిన ‘‘ ఎంగిలి బిర్యాని చేతులు’’ అనే కవితను ఉదాహరణగా తీసుకొని పరిశీలిద్దాం.

ఈ కవిత కావేరి జలవివాదం గురించి. దీనిలో అతని సామాజిక దృక్ఫథం, రాజకీయ అవగాహన, కవిత్వతత్వం స్పష్టంగా వ్యక్తమవటం గమనించవచ్చు. కర్ణాటకలో పుట్టి తమిళనాడులో ప్రవహించే కావేరి జలాల పంపకం ఇరురాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. తమిళనాడు దిగువ రాష్ట్రం కనుక కర్ణాటక విడుదల చేస్తేనే నీరు పొందే పరిస్థితి. దీన్ని నేపథ్యంగా తీసుకొని వ్రాసిన ఒక కవితలో, కావేరి నదికి తమిళులకు మధ్య ఉన్న చారిత్రిక, ఐతిహాసిక అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు సురేంద్ర.

ఎంగిలి బిర్యానీ చేతులు

ఎవడో గిట్టనివాడు
మన గడ్డివాములపైన
పూరిగుడెసెల పైన
లంకచుట్ట విసిరినట్లు
ఈ రెండు రాష్ట్రాల నడుమ
ఏ ఫారిన్‌ సిగరెట్‌ చిచ్చుపెట్టిందో
బెంగుళూరు నడిబడ్డున తగలబడిపోయిన
వాహనాల అస్తికలను పశ్చిమవాహిని లో
ఎవరు కలుపుతారో?

ఎంగిలి బిర్యానీ చేతులు అనే కవితా శీర్షిక- కావేరి వివాదం కారణంగా కర్ణాటకలో తమిళులపై జరుగుతున్న దాడులు అన్నీ రాజకీయ ప్రేరేపితమని, కవి తీసుకొన్న స్టాండ్‌ ని ముందే బలంగా వ్యక్తీకరిస్తుంది.

తమిళనాడులోని శ్రీరంగపట్నం వద్ద ప్రవహించే కావేరినదిని పశ్చిమ వాహిని అంటారు. దీన్ని దక్షిణ గంగగా భావించి పితృదేవతలకు తర్పణం విడువడం అనాదిగా ఆ నాటలో ఒక ఆచారం. సురేంద్ర పై కవితా వాక్యాలలో బెంగళూరులో తగులబడిన అస్తికలు తమిళులవని అన్యాపదేశంగా చెపుతున్నాడు.

చోళరాజు కంఠమండు నీటి కొరకు
అగస్త్య మహర్షిని ప్రార్ధిస్తే
జంభాపతి దేవత
వెనవా తీర్థ విళక్కువా...!
అంటూ స్వాగతించిన కావేరి నది...
గుర్తుచేస్తున్నాడు కవి.
తన రాజ్యంలోని ప్రజలు నీరులేక కరువులతో అల్లాడుతున్నప్పుడు కంఠమాన్‌ అనే తమిళ చోళ రాజు తన సమకాలీనుడైన అగస్త్య మహామునిని వేడుకొన్నాడట. అపుడు అగస్త్యుడు తన కమండలం నుంచి నీరును నేలపై చల్లగా కావేరి నది ఏర్పడిరదని, ఆ నదిని జంభాపతి అనే దేవత ‘‘ఈ రాజ్య ప్రజల దాహాన్ని తీర్చే కాంతిపుంజం’’ గా ఆహ్వానించినట్లు - ఒక తమిళ ఇతిహాసం చెపుతుంది.

పై ఖండికల ద్వారా తమిళుల సంస్కృతి, చరిత్రలలో కావేరినది ఒక భాగంగా ఎప్పటినుంచి ఉన్నదో స్పష్టపరుస్తున్నాడు కవి.

/నాడు తైత్తరీయ ఉపనిషద్‌ లో ‘‘అన్నం బహు కుర్వీత’’
అంటూ కావేరిని కీర్తించారు
నేడు
శ్రీరంగనాథలో ఎండిన కావేరినదిని చూడు
ఇప్పటికైనా సిగ్గేస్తుందా...?

భారతీయులకు నది అంటే దైవం. ఆవిషయాన్ని మన పూర్వీకులు ఏనాడో గుర్తించి తైత్తరీయ ఉపనిషద్‌ లో నదీ వనరుల్ని ప్రస్తావిస్తూ let us share, let us produce and share”అన్నారు. కానీ ఈరోజు పంచుకోవటానికి ఇన్ని యుద్ధాలా అన్న సూటి ప్రశ్న ఆలోచింపచేస్తుంది.
కర్నాటిక్‌ సంగీత విద్వాంసులు

త్యాగరాజు... ముత్తుస్వామి దీక్షితార్‌..
శ్యామశాస్త్రి
ఈ నీళ్ళు త్రాగిన వాళ్ళే//
ఎక్కడో కొడగు కనుమలలో జన్మించి
తమిళుల దాహార్తిని తీరుస్తూ
పుదుచ్చేరి తీరానా పూమ్బుహార్‌ లో
కావేరి బంగాళాఖాతంలో కలిసిపోతుంది
పెట్రోల్‌ బాంబ్స్‌ వేసిన ఎంగిలి బిర్యానీ చేతులకు
కనీసం ఇదైనా తెలిసిందా!
‘బిలగుండ్లు’ భద్రంగా ఉండాలి. /

తమిళనాట స్థిరపడిన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రిలను కర్ణాటక సంగీతానికి కావేరినది అందించిన కానుకలు. వీరు కావేరిఒడ్డున నివసిస్తూ, అనేక కీర్తనలలో కావేరిని స్తుతించారు.

కావేరి నది కర్ణాటకలో పుట్టి, తమిళనాడులో ప్రవహించి, పుదుచ్చేరి వద్ద సముద్రంలో కలుస్తోన్నదనే సంగతైనా కనీసం ఈ అలజడులు చేస్తున్న వారికి తెలుసా- ఇది మూడు రాష్ట్రాల ఉమ్మడి సొత్తని ప్రశ్నిస్తున్నాడు కవి.

తమిళుల పక్షాన నిలబడి ఇంత గొప్పగా చెప్పిన కవి చివరలో కర్ణాటకకు ఒక హెచ్చరిక కూడా చేస్తాడు ‘‘బిలగుండ్లు భద్రం గా ఉండాలి’’ అని.

బిలగుండ్లు అనేది కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతం. అక్కడ తమిళనాడుకు ఎంతనీరు వస్తుందో నీటిపారుదల నిపుణులు బొట్టు బొట్టు లెక్కిస్తారు. బిలగుండ్లు జోలికి వస్తే ఊరుకోమన్న హెచ్చరిక ఆఖరి వాక్యంలో ధ్వనిస్తుంది.

అనేక మంది చారిత్రిక వ్యక్తులు, సంఘటనలు, ఉటంకింపులతో కవిత రాయాలంటే ఆయా అంశాలపట్ల కవి రీసెర్చ్‌ చేయాలి. చదవాలి, అవగాహన పెంచుకోవాలి. తనదైన వ్యాఖ్యానం చేయగలగాలి. ఇవన్నీ పై కవితలో కనిపిస్తాయి. యధాలాపంగా చదివితే ఇలాంటి కవితలు అర్ధం కావు. అలాగని అస్ఫష్టత ఉందని కాదు. ఇది సంక్లిష్టత. కవిత్వంలో సంక్లిష్టతను విప్పుకోవాలంటే పాఠకుడు కొంచెం శ్రమించాలి. కవి స్థాయిని అందుకోవటానికి ప్రయత్నించాలి.

పై కవితలో కవిత్వాంశ ఎక్కడ ఉంది అనే అనుమానం కలగవచ్చు. కావేరి అల్లర్లను ‘‘ఎంగిలి బిర్యాని చేతులు’’ అనటం లోనే ఉంది. నేడు సమాజంలో ఉండే రాజకీయ వ్యూహాలు, ఈ సమస్య పట్ల కవికి ఉన్న దృక్ఫధం సూటిగా స్పష్టంగా ఆవిష్కృతమై కవితను ఊహించని ఎత్తులకు తీసుకువెళ్ళింది. మిగిలిన వాక్యాలన్నీ ఆ దృక్ఫధానికి రక్తమాంసాలుగా మారిపోయి గొప్ప ఉద్వేగభరితమైన అనుభవాన్ని అందిస్తాయి.

(కవిత్వంలో ఉండే సంక్లిష్టతను వివరించటానికి పై కవితను ఉదాహరణగా తీసుకొన్నాను తప్ప కవిత్వపఠనం ఇంత శ్రమతో కూడుకున్నది అని భయపెట్టటానికి కాదు. కవి ఎంతో శ్రమించి ఒక సృజన చేస్తున్నపుడు పాఠకుడు కూడా కొంత శ్రమించాల్సిన భాద్యత ఉండాలని చెప్పటానికి మాత్రమే. అదే లేకపోతే భాషపుట్టినపుడు పుట్టిన కవిత్వం ఇంతకాలం మనగలదా?)

రాత్రి హోరున వర్షం
ఉదయం లేచి చూస్తే
ఎదురింటాయనకు రెండు మేడలు. (ఇస్మాయిల్‌ హైకు)

యాధాలాపంగా చదివితే వర్షానికి రెండుమేడలకు సంబంధం తెలియదు. సాధారణంగా భారీ వర్షం వచ్చినపుడు రోడ్లపై నీళ్లు నిలబడటం సాధారణం. అలా నీళ్లు నిలిచినపుడు ఎదురింటాయన మేడ ఆ నీళ్లలో ప్రతింబింబంగా ఏర్పడి రెండు గా కనిపిస్తున్నదనే చక్కని ఊహను ఈ హైకూ దృశ్యమానం చేస్తుంది.
****

కొన్ని కవితలు ఒకే అర్ధాన్ని కాక భిన్న అర్ధాలను ఊహించుకొనేలా ఉంటాయి. ఆలా ఉండటాన్ని అనిర్వచనీయత (Ambiguity) అని కొందరు నిర్వచించారు. కవిత్వం ప్రధానంగా అర్ధకళ. బహుళార్ధాలు వచ్చేలా రాయటం కవిత్వంలో సామాన్యమే. కవిత్వాన్ని ఎలా వ్రాసినా ఇస్మాయిల్‌ గారు అన్నట్లు ‘‘కవిత్వం చేసే పనల్లా చదువరి మనస్సులో దీపం వెలిగించడమే. దీని వల్ల అతని అవగాహన పరిధి విస్తరిస్తుంది. తన మనస్సులో వెలిగిన దీపం వెలుతురు తన దారి తను వెతుక్కోవడానికి సహాయపడుతుంది’’.

మామూలు భాషవేరు కవిత్వభాష వేరు. కప్పిచెప్పేది కవిత్వం అన్నారు. కవిత్వం కొంత గూఢతను సహజంగానే కలిగిఉంటుంది. పాఠకునిలో హృదయాన్ని కదిలించగలిగే ఉద్వేగాలను/అనుభూతులను ఇవ్వగలిగితే అది మంచి కవిత్వమౌతుంది. ఈ ప్రక్రియలో కవిత అర్ధమైందా లేదా అనేది కొంత అప్రస్తుతం అయినప్పటికీ అస్పష్టకవిత్వం ఉత్తమ కవిత్వమనిపించుకోదు.
కవి, ఒక భావ వాహిక, పాఠకుడు ముగ్గురూ కలిసినపుడే రచన అవుతుంది. భావాలు కవి వద్దే ఆగిపోతే దాన్ని కవిత్వం అనలేం. కవిత్వంలో అస్పష్టతకు కవిని నిందించరాదు. అస్పష్టత అనేది భావప్రసార సంబంధమైన సమస్య. ఈ అంశానికి సంబంధించి ఆధునిక కవిత్వం మరిన్ని మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది.

బొల్లోజు బాబా

(కవిత్వభాష పుస్తకంలోని “అస్పష్టత-సంక్లిష్టత” పేరుతో రాసిన వ్యాసం.
పూర్తిపుస్తకాన్ని కింది లింకులోనుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును).

Saturday, September 7, 2024

మిత్రుని వాల్ పై చేసిన కామెంటు....(ఎడిటెడ్)


బ్రాహ్మణ భక్తి బ్రాహ్మణ ద్వేషం కవలలు ---కొంతవరకూ నిజమే కావొచ్చు.

రెండో శతాబ్దానికి చెందిన సంస్కృత వ్యాకరణ వేత్త పతంజలి అతని మహాభాష్య అనే గ్రంధంలో – బ్రాహ్మణులు శ్రమణులు(బౌద్ద, జైన, ఆజీవికులు) పాము ముంగిసల్లా ఆగర్భ శత్రువులని అన్నాడు.
కాపాలికా మతంలో చేరిన ప్రతీ వ్యక్తి ఒక బ్రాహ్మణుడిని చంపి అతని పుర్రెలో భిక్షాటన చేయాలని ఒక నియమం ఉండేది.

చార్వాకులు బ్రాహ్మణుల పట్ల సెటైర్స్ వేసారు "తోడేలు పాదముద్ర" అనే పిట్టకథ పేరుతో. వారు అభూతకల్పనలతో మాయమాటలు చెబుతారని అన్నారు. వేదాలను రచించినవారు విదూషకులు, మోసగాళ్ళు, రాక్షసులు అన్నారు.

వేదాలను అధ్యయనం చేస్తున్నవారిని "మూర్ఖుల సమూహం" గా వర్ణించాడు, ఏడవ శతాబ్దానికి చెందిన జైన మత ఉద్యోదన సూరి తన కువలయమాల కావ్యంలో.
 
బౌద్ధులు బ్రాహ్మణీయ సిద్ధాంతాలను అంగీకరించలేదు. బుద్ధుడు బ్రాహ్మణులు చెప్పుకొనే ఉత్తమజన్మ భావనను విమర్శించాడు. వారు కూడా మామూలు మనుషులే అన్నాడు. అది ద్వేషంగా పరిణమించిందో లేదో తెలియదు కానీచాలామంది హిందూ బ్రాహ్మణులు బౌద్ధంలో చేరారు
.
అశోకుడు లౌకిక భావనలని అవలంబించాడు. బ్రాహ్మణులకు అగ్రపీఠం ఇవ్వలేదు. అందరినీ సమాదరించాడు. ఈ రాజనీతి బ్రాహ్మణవాదుల సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను సవాలు చేసింది.

బ్రాహ్మణుల పట్ల ద్వేషం అనేది సైద్ధాంతికంగా వారు చేస్తున్న అశాస్త్రీయ అరాచకాల పట్ల అని ఊహిస్తాను ముఖ్యంగా జన్మ ఆధారిత హెచ్చుతగ్గుల వ్యవస్థ పట్ల.
 
కిందనున్నవారు పైకి చేరలేక, ఒక వర్ణంలో పుట్టినందుకు జీవితాంతం బానిస జీవితాన్ని గడపాల్సి రావటం, దానికి కారణమైన "బ్రాహ్మనిజం" పై కలిగిన ద్వేషం అది.

ఈ ద్వేషం నుండి తప్పించుకోవటానికి ధర్మశాస్త్రాలలో బ్రాహ్మణుని సేవించాలి. దూషించరాదు, తాకరాదు, దండించరాదు (రాజుకూడా), గాయపరిస్తే మరణ శిక్ష, ఇక హత్య అయితే వేయి జన్మలవరకూ విముక్తే ఉండదు (ఈశ్వరునికూడా బ్రహ్మహత్యాపాతకదోషం అంటుతుంది అనే పురాణాలతో) అంటూ చాలా చాలా బలమైన రాతలు రాసుకొన్నారు. బ్రాహ్మణాధిక్యతను చాటి చెప్పే పురాణాలు ఇతిహాసాలు రాసుకొన్నారు.
 
సమాజంనుంచి ప్రతిఘటన రాకుండా. ధర్మశాస్త్రాలను రాజుచే బలంగా అమలుచేయించుకొన్నారు.
 
బ్రాహ్మనిజానికి- ఇతర సాంస్కృతిక జీవనాలకు మధ్య జరిగిన సంఘర్షణే మన చరిత్ర. ఇది ముఖ్యంగా బౌద్ధ హిందూ మతాల ఘర్షణ అంటారు డా. అంబేద్కర్ గారు.

 
బొల్లోజు బాబా