Thursday, September 4, 2025

సృజనకు దిక్సూచి



శ్రీ అవధానుల మణిబాబు కవిగా, విమర్శకునిగా మంచి పేరుతెచ్చుకొని, తెలుగు సాహిత్యరంగంలో తనకంటూ ఒక చక్కని స్థానాన్ని సంపాదించుకొన్నారు. వీరి మూడు కవిత్వసంపుటులపై శ్రీ పెండ్యాల కామేశ్వరరావు గారు ఒక సమీక్షా గ్రంథం "అతడిలా అర్ధమయ్యాడు" పేరుతో రచించారు. దీనిని ఆత్మీయుల సమక్షంలో ఆవిష్కరించారు.
ఈ గ్రంథాన్ని శ్రీ మధునాపంతుల సత్యనారాయణ మూర్తి ఆవిష్కరించగా, శ్రీ మాకినీడి సూర్యభాస్కర్, శ్రీ సి.ఎస్. శ్రీ రాజా రామవరపు లు సమీక్షించారు. ఇంకా డా.కాళ్ళకూరి శైలజ,శ్రీ రామకృష్ణ శ్రీవత్స శ్రీ మార్ని జానకిరాం చౌదరి, శ్రీ కాకరపర్తి, శ్రీ మేకా మన్మథరావు ప్రభృతులు తమ అభినందనలు తెలియచేసారు.
ఈ పుస్తకానికి నేను రాసిన బ్లర్బ్ ఇది....

***

సృజనకు దిక్సూచి
.
శ్రీ అవధానుల మణిబాబు కవిత్వం, విమర్శలో తనదైన ముద్రను ఏర్పరచుకొన్న సాహితీవేత్త. వ్యక్తిగా మృధు స్వభావి. కవిగా స్వాప్నికుడు, సున్నిత భావుకుడు. అంశాన్ని తులనాత్మకంగా తూకం వేస్తూ లోతుగా మూల్యాంకనం చేయగల విమర్శకుడు. నిరంతర అధ్యయనశీలి. శ్రోతలను తనతో పాటూ అనుభూతి పడవలో ప్రయాణం చేయించగల చక్కని వక్త. అది ఆథ్యాత్మిక ప్రసంగమైనా, ఆధునిక కవిత్వంపై ఉపన్యాసమైనా. వీరు రాసినపుస్తకాలు మొత్తం పది. వేటికవే వైవిధ్యభరితమైనవి. ఎంత గొప్ప రచన చేసినా అంతకంత ఒదిగి ఉండటం, ఆదరణ, ఆర్థ్రత లాంటి లక్షణాలు శ్రీ మణిబాబును ఉన్నతంగా నిలుపుతాయి.
ఈ పుస్తకరచయిత శ్రీ పెండ్యాల కామేశ్వరరావు నాలుగు దశాబ్దాలపాటు ఆధునిక ఆంగ్లసాహిత్య అధ్యయనం, బోధన చేసిన నిష్ణాతులు. సాహిత్యసభలలో శ్రీ కామేశ్వరరావు గారిని తరుచుగా చూస్తుంటాను కానీ, వారిలో సాహిత్యంపట్ల ఇంత అపారమైన అనురక్తి, లోతైన విశ్లేషణాశక్తి ఉన్నాయని తెలియదు. వారు శ్రీ మణిబాబు రచనలలోంచి “బాటే… తన బ్రతుకంతా”, “నాన్న…పాప”, “నేనిలా….తానలా”, “నింగికి దూరంగా… నేలకు దగ్గరగా” కవిత్వసంపుటులలోని కవిత్వంపై అద్భుతమైన ఆత్మీయపరామర్శ చేసారు. ఈ వ్యాసాలను “అతడిలా అర్ధమయ్యాడు” అనే పేరుతో పుస్తకంగా వెలువరిస్తున్నారు. ఈ విశ్లేషణాత్మక సమాలోచనలో శ్రీ కామేశ్వరరావు చేసిన పరిశీలనలు శ్రీ మణిబాబు కవిత్వంలోని తాత్వికతను, కవితాలక్షణాలను, సామాజిక స్పందనను ప్రతిబింబిస్తాయి.

శ్రీ మణిబాబు కవిత్వాన్ని శ్రీ కామేశ్వరరావు దర్శించిన తీరు వారి వాక్యాలలో….

• విషాదానికి తాత్వికత జోడించడం ఋషి లక్షణం. భారతియ చింతనా మర్మం అది. మణిబాబుకి ఆ చింతన బాగా వంటపట్టింది.

• కవితావస్తువు ఎంపిక విషయంలో ఈయనకో ప్రణాళిక ఉంటుందనిపిస్తుంది. పూలన్నీ రాశిగా పోసి కావలసిన పూలను, ఒకదాని తర్వాత ఒకటి ఏది ఉంటుందో, ఉండాలో ఎంచి అల్లినట్లు ఒకదండలా కవిత్వం చెప్పడం ఆయన కవితాలక్షణం.

• వేర్వేరు కార్యక్షేత్రాలలోని విషయాలను సమన్వయం చేయడంలో కవి విజయవంతం అయ్యాడు;
• కవి సమూహంలోను ఉంటాడు. తనకు తానుగానూ ఉంటాడు; కవి ముద్ర, సమాజపు బ్రతుకు బాటలో, బలంగా పడాలి. మార్గదర్శకం కావాలి

• మణిబాబు గారి కవితల పుస్తకం ముఖచిత్రం చూడండి. “బాటే… తన బతుకంతా”. ఏడు అడుగులుంటాయి. గుబురునీడలలో సాగే పయనమది. నిండారా పచ్చదనం. స్నేహం సప్తపదీనాం. మణిబాబుగారి వ్యక్తీకరణలన్నీ ఇలాగే ఉంటాయి.

పై వాక్యాలు శ్రీ మణిబాబు కవిత్వతత్వాన్ని చక్కగా ఆవిష్కరిస్తాయి. అవి ప్రశంసలు కావు, పరిశీలనలు.

ఏ కవికైనా సహృదయుడైన పాఠకుడు దొరకటం గొప్ప అదృష్టం. అలాగే ఒక విశ్లేషకుడు, కవి తన కవిత్వంలో నిగూఢంగా దాచిన అర్ధాలను, నిక్షిప్తం చేసిన రహస్యాలను, పొదిగిన సొగసులను విప్పిచెప్పి కొన్ని సార్లు ఆ కవినే విస్మయపరచినపుడు అలాంటి కవిత్వం ధన్యతనొందినట్లే. ఆమేరకు శ్రీ మణిబాబుకు అభినందనలు.
తన లోతైన విశ్లేషణల జోడింపుతో తెలుగు విమర్శనారంగానికి కొత్త వన్నెలద్దుతూ, సిసలైన సృజనకు దిక్సూచిగా నిలిచిన శ్రీ కామేశ్వరరావు గారికి నమస్కారములు
భవదీయుడు

బొల్లోజు బాబా









No comments:

Post a Comment