Wednesday, December 4, 2019

మన పూర్వీకులు ఎలా జీవించి ఉంటారో అనే ఊహ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎవరికైనా.
ఆనందరంగ పిళ్లై డైరీలు "ఫ్రెంచిపాలనలో యానాం" పుస్తకం వ్రాయటానికి ఎంతో ఉపయోగపడ్డాయి.
Robert Sewell వ్రాసిన "ద ఫర్ గాటెన్ ఎంపైర్" చదివి హంపీ వెళ్లాను.
చాన్నాళ్ళుగా చదవాలనుకొంటున్న పుస్తకాలు ఇవి ఇన్నాళ్లకు కోరిక తీరింది.
1. Abbé Dubois (1765 – 1848) వ్రాసిన "Hindu Manners, Customs and Ceremonies"
రెండువందల ఏళ్ల నాటి మన జీవన విధానాలను ఆసక్తికరంగా వర్ణించిన పుస్తకమిది. ఎంత అజ్ఞానం, ఎంత విజ్ఞానం కలబోసుకొన్న జీవనాలు ఆనాటివి అనిపించక మానదు.
ఈ పుస్తకాన్ని ఏదో ఒక మతానికి చెందిన పుస్తకంగా అనుకొంటే అంత మజా ఉండదు. ఒక చరిత్ర పుస్తకంలా భావించాలి.
అన్నట్టు దుబాయిస్ మన వేమనను మొదటగా గుర్తించి ఫ్రెంచిలోకి అనువదించిన వ్యక్తి. ఇతను వేమనను ఒక చోట "The 'Recent' Reformer of Hindoo customs" అనటం భలే అనిపించింది.
2. Niccolao Manucci (1638–1717) ముస్లిం పాలనలోని అనేక ఉదంతాలను కళ్లకు కట్టినట్లు వర్ణిస్తాడు తన Storia do Mogor (Mughal story) లో.
ఇవి నిజానికి నాలుగు వాల్యూములు. అబ్రిడ్ జ్డ్ వాల్యూమ్ కూడా ఉంది.
ఈ పుస్తకం చదివాకా- చరిత్ర ఇంత రక్తసిక్తమా అనిపించింది. గతం అంతా కుట్రలు కుతంత్రాలేనా ?
అక్బర్ శత్రువులకు విషం కలిపిన తాంబూలాలు ఇచ్చేవాడట. ఒకసారి పొరపాటున అలాంటిదాన్ని తానే సేవించి మరణించాడని అంటాడు. ఇది చరిత్రలో కనిపించని పార్శ్వం.
ఔరంగ జేబు, షాజహానును చంపకుండా బంధించి ఉంచటానికి కారణం రహస్యంగా దాచిన విలువైన వజ్రాల సమాచారం కోసమట. ఆ విషయం చెపితే ఎక్కడ చంపేస్తాడోనని చివరివరకూ షాజహాన్ చెప్పడు. చచ్చాక షాజహాన్ భార్య (ఆమె ఔరంగజేబు అక్కే) ఆ వివరాలను - తన భర్త మరణించాకా మాత్రమే ఇవ్వమన్నాడని అందచేస్తుంది.
షాజహాన్ మరణించాక ఔరంగజేబు - తన తండ్రి మరణించాడని ఎర్రగాకాల్చిన ఊసతో పాదాలకు వాతలుపెట్టి నిర్ధారించుకొన్న తరువాత మాత్రమే శవాన్ని ఖైదునుండి బయటకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడట. (చచ్చినట్లు నటించి ఖైదునుండి బయటకు వచ్చి తన వర్గీయులను కూడదీసి తిరుగుబాటు చేస్తాడేమోనని భయం)
అంతఃపుర సేవలకై అవసరమయ్యే వేలకొలది నపుంసకుల కొరకు బానిసల సేకరణ, వారిని వ్యంధ్యుల్ని చేయటానికి కర్మాగారాలు (?) ఏర్పడటం లాంటివి చదువుతున్నప్పుడు జుగుప్స కలుగుతుంది.
ఇంకా రాజ్ పుత్రుల వీరోచిత గాధలు, సతి ఉదంతాలు, సమాజంలో సన్యాసులు చేసే మోసాలు, దేవాలయాలలో శక్తిపూజ పేరిట జరిగే విచ్చలవిడి సమూహ శృంగారాలు, కులకాంతల, రాణుల రహస్య ప్రణయాలు, సైనికుల కిరాతకాలు, పరయాల కష్టాలు (ఎస్సీలు), శివాజీ నిమ్నోన్నతాలు, దేవాలయాల విధ్వంశం, ప్రజల ఊచకోత ఒకటేమిటి ఆనాటి సామాన్యుల అనుభవాలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి.
చాలా కథలు నా చిన్నప్పటి చందమామ కథలలాగ అనిపించాయి. బహుసా అనూచానంగా అవి తరువాతి తరాలకు అందింపబడి ఉంటాయి.
అప్పటి ప్రజలు ఎలాంటి జీవితాలను జీవించారో తలచుకొంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. సామాన్యుడి నుంచి కులీనుల వరకూ ప్రతి ఒక్కరూ కత్తి అంచున జీవించారు ఆ కాలంలో.
****
దుబాయిస్ ఒక క్రిస్టియన్ ఫాదర్. అతని రచన సాత్వికంగా, మర్యాదగా సాగుతుంది. ఇతను దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డాడు కనుక ఇక్కడి ఆచార వ్యవహారాల గురించి ఎక్కువగా ప్రస్తావించాడు. శ్రీరంగపట్నంలో ఇతను సేవలందించిన చర్చి నేటికీ ఉన్నది.
మనుచి ఒక దేశద్రిమ్మరి. డక్కామొక్కీలు తిన్నవాడు. సైనికుడిగా, వ్యాపారస్తునిగా, వైద్యునిగా, రాజోద్యోగిగా రకరకాలగా జీవించాడు. ఇతను చూసిన జీవితం విస్తారమైనది. అందుకే ఇతని రచన, బీభత్సంగా ఉద్వేగభరితంగా ఉంటుంది.
ఇంకా Jean-Baptiste Tavernier (1605 – 1689) ఒకడు ఉన్నాడు ఊరిస్తూ.... 
బొల్లోజు బాబా
Image may contain: textImage may contain: 1 personImage may contain: text

No comments:

Post a Comment