Wednesday, September 28, 2022

మనసుతో చదవాల్సిన కవిత్వానుభవాలు - బెందాళం క్రిష్ణారావు



థేరీ గాథలు*****
మనసుతో చదవాల్సిన కవిత్వానుభవాలు
- బెందాళం క్రిష్ణారావు
------------------------------------
చరిత్ర అంటే ఎవరికి ఆసక్తి ఉండదు..ప్రతి ఒక్కరికీ దానిని తెలుకోవాలన్న తపన తప్పక ఉంటుంది. అయితే అది కల్పనల్లో కూరుకుపోతే తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుందేమో గానీ నిజమైన ఆసక్తినీ, జిజ్ఞాసనీ అందించలేదు. ప్రాచీన భారత దేశ చరిత్రకు మూలాధారాల్లో అత్యంత కీలకమైనది బౌద్ధ సాహిత్యం. ..సంఘం శరణం గచ్ఛామి..అనే భావనలో జనించిన బౌద్ధం ఎప్పడూ నేలవిడిచి సాము చేయలేదు. అందుకే ఇది కాల్పనికతకు దూరంగా మానవ జీవన నైతికతతో మనసు కేంద్రంగా ధార్మిక పరిమళాలను ఈ లోకంలో వెదజల్లింది.
బుద్ధుని మహా పరినిర్యాణం తరువాత ఆనాటి మగధ రాజధాని రాజగృహ సమీపంలోగల సప్తపర్ణిక అనే గుహలో సమావేశమైన భిక్షువులు సుత్త, వినయ పిటకాలను క్రోడీకరించారు. అందులో సుత్త పిటకంలోని ఐదో భాగమైన ఖుద్ధక నికాయ నందున్న 18 గ్రంథాల సముదాయంలో ‘థేరీ గాథలు’ కూడా ఒకటి. ఆనాటి పాళీ భాష నుంచి ఇవి వందేళ్ల కిందట 1909లో తొలిసారిగా ఇంగ్లీష్ లోకి తర్జుమా అయినాయి. వాటన్నింటినీ పరిశీలించిన ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు, రచయిత బొల్లోజు బాబా ఈ పుస్తకాన్ని ‘థేరీ గాథలు’ పేరిట తెలుగులో తాజాగా అనుసృజన చేశారు. ఇందులోని కవిత్యరూప గాథలన్నీ 2600 సంవత్సరాల నాటి సమాజాన్ని మహిళా దృక్కోణంలో మన ముంగిట ఆవిష్కరిస్తాయి.
ఇందులోని కవితా వాక్యాలకు మూలకర్తలైన భిక్షుణిల పేర్లు బౌద్ధ సాహిత్యంలో ఎన్నో చోట్ల మనకు తారసపడతాయి. వీరంతా గౌతమ బుద్ధుని సమకాలికులు. తొలి భిక్షుణి సంఘం వీరితోనే ఆరంభమైంది. కొంతమంది ఆరంభమైన తర్వాత చేరినవారు కూడా ఉన్నారు. ప్రజాపతి గౌతమి ప్రోద్బలంతోనే బుద్ధుడు భిక్షుణి సంఘాన్ని ఆరంభించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ సంఘంలో మొత్తం భిక్షుణి (థేరీ)లు ఎంతమంది అనే కచ్చితమైన సంఖ్య తెలియకపోయినా 73మంది థేరీల గాథలను ఇందులో చదవవచ్చు.
 
ఈ థేరీలంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కారు. సమాజంలో అట్టడుగు స్థితి నుంచి రాజమాతల వంటి ఉన్నత స్థాయికి చెందినవారు ఉన్నారు. తమ తమ జీవన నేపథ్యాలు ఎంతో విభిన్నమైనవి అయినప్పటికీ వీరందరినీ సద్ధమ్మమే కలిపింది.
 
ఈ థేరీ గాథల్లో ఐదు పంక్తుల కవితా వాక్యాల నుంచి ఏడు పేజీల వరకూ 68 గాథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. థేరీల మధ్య జరిగిన సంభాషణలు, వారికి బుద్ధుడు ఇచ్చిన ఉపదేశాలు. ఈ గాథల్లో ఎంతో రమణీయంగా తొణికిసలాడుతుంటాయి. ఆనాటి సామాజిక జీవితాన్ని, రాజకీయ పరిస్థితుల్ని ఈ గాథలు చదువరుల కళ్లముందు నిలుపుతాయి. ఆ నేపథ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
 
దు:ఖ మూలాలను అర్ధం చేసుకోవడంలో, వాటిని అధిగమించడంలో తధాగతుని మార్గంలో ఎలా పయనిస్తున్నామో థేరీలు కవితాత్మకంగా ఈ గాథల్లో అభివ్యక్తీకరించారు. రెండున్నర సహస్రాబ్ధాల కిందట, అంతకు వందేళ్ల ముందే మహిళల మానసిక అనుభవాలు, భావ వ్యక్తీకణ, ధార్మిక అవగాహన ఎంత స్పష్టంగా, సూటిగా, లోతుగా ఉందో చెప్పడానికి ఈ థేరీ గాథలే చారిత్రక సత్యాలు. వారికి ఆ మనో స్పష్టతని, చైతన్యాన్ని ఇచ్చింది తధాగతుడు ఉపదేశించిన బౌద్ధ ధమ్మమే తప్ప వేరొకటి కాదు.
 
బుద్ధుని కాలానికి చేతిరాత గ్రంథాలు లేవు. ఆయా సమయాల్లో, వివిధ సందర్భాల్లో చేసిన బోధనలను విని జ్ఞప్తిలో ఉంచుకోవడానికి పదేపదే మననం చేసుకోవడం తప్ప ఇంకెలాంటి సౌలభ్యం లేదు. అయినా ఈ గాథలు ఎప్పటికప్పుడు రాసుకుని ఉన్నవాటిగా అనిపిస్తాయి. థేరీలు ‘శీల- సమాధి- ప్రజ్ఞ’లతో జీవితాలను, అంతరంగాలను మమేకం చేసుకుని అష్టాంగమార్గంలో ముందుకుసాగడం వల్లే ఈ గాథలు ఇంతటి ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
 
విద్యను మహిళలకు, శూద్రులకు ఎంతో దూరం చేసిన ఆనాటి సమాజపు కారుచీకట్లలో ఈ థేరీలు ధార్మిక విద్యుల్లతలై ఈ కవితా గాథలను ప్రకాశవంతం చేశారు. ఈ గాథలతో పాటు ‘ఎండ్ నోట్స్’ పేరిట రచయిత బొల్లోజు బాబా 32 పేజీల్లో ఎంతో ఉపయుక్తమైన అంశాలను అందించారు. ఇందులో ఆయన ఇచ్చిన సమాచారం, విశ్లేషించిన విషయాలు థేరీ గాథలకు ఒక పరిపూర్ణతని తీసుకొచ్చాయి. ఆనాటి మానవ సంబంధాలను, సామాజిక సంబంధాలను బౌద్ధ సాహిత్య వెలుగుల్లో వివరిస్తూ మంచి విశేషాలను అందించారు. ఆనాటి మహిళల జీవితాల్లో ఆవరించిన దు:ఖం, విషాద సందర్భాలు, నిస్సహాయత ఎలాంటివో ఈ గాథలు తట్టిలేపుతాయి. ఎంతో ఆధునిక ప్రపంచంలో ఉన్నామని భావిస్తున్న నేటికాలంలో కూడా మహిళల జీవితాలను అడుగడునా సవాల్ చేస్తున్న దు:ఖం, విషాదాలు, కన్నీళ్లు, కలతలు, ప్రేమ రాహిత్యం, నిస్సహాయత వంటివన్నీ ఆనాటికి ముందు నుంచే రకరకాల రూపాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయని అర్ధమైన తర్వాత మనసు ఎంతో ఆర్ద్రతకు లోనవుతుంది. మార్పు రావాల్సింది బయట ప్రపంచంలో మాత్రమే కాదని..ముందు అది మనసు లోలోతుల్లోంచి జనించాలని మరోసారి స్పష్టమౌతుంది.
ఈ పుస్తకానికి భిక్ఖు ధమ్మరక్ఖిత బంతే అర్ధవంతమైన ముందుమాటని, ప్రసిద్ధ సాహితీవేత్త వాడ్రేవు చినవీరభద్రుడు చివరి కవర్ పేజీపై ఇందులోని అంశాల నేపథ్యాన్ని తనదైన శైలిలో పరిచయ రూపంలో అందించారు.
 
ఇటీవల వస్తున్న పుస్తకాల శ్రేణిలో ‘థేరీ గాథలు’ ఎంతో విలువైన పుస్తకం అని భావిస్తున్నాను. 182 పేజీల్లో ఉన్న ఈ పుస్తకాన్ని ఒకసారి చదివి పక్కన పెట్టేయడానికి వీలు కుదరదు. కేవలం కళ్లు, నోటితో మాత్రమే కాదు. పదేపదే మనసుతో చదవాల్సిన పుస్తకమిది. అప్పుడే చదువరులు థేరీల మనోస్పందన వినగలరు. ఈ పుస్తకం కోసం హైదరాబాద్ లోని ఛాయ రిసోర్స్ కేంద్రం వారిని 7093165151 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చును.
 
**************



No comments:

Post a Comment