Monday, August 10, 2020

సప్తశతి గాథలలో ఆర్ధిక లావాదేవీలు - పార్ట్ 13 .

 సప్తశతి గాథలలో ఆర్ధిక లావాదేవీలు - పార్ట్ 13

.
ప్రాచీన భారతదేశములో బలమైన బాంకింగ్ వ్యవస్థ ఉండేదని అనేక శాసనాధారాలు కనిపిస్తాయి. అప్పుకు ఏడాదికి 15% నుండి 69% వరకు వడ్డి చట్టసమ్మతమని క్రీస్తుపూర్వం మూడో శతాబ్దానికి చెందిన కౌటిల్యుని అర్ధశాస్త్రంలో ఉన్నది. అంతకు మించి వడ్డీ వసూలు చేసే వ్యాపారిని దండించ వచ్చునని చెబుతుంది. వివిధ వృత్తుల వారు Guilds (వ్యాపార సంఘాలు) ఏర్పరచుకొని వ్యాపారాలు నిర్వహించేవారు. కులీనులు ఈ Guilds వద్ద ధనాన్ని దాచుకొనేవారు. అలా దాచుకొన్న ధనానికి 9-12% వడ్డీ లభించేది. దీన్ని ఒకరకంగా నేటి షేర్ మార్కెట్టు డివిడెండ్లతో పోల్చుకొనవచ్చును.

Ushavadata అనే క్షత్రప రాజు 3000 బంగారు నాణాలను Guild of Weavers (చేనేత సంఘం) వద్ద Deposit చేసి- దానిపై ఏడాదికి 12% చొప్పున వచ్చే వడ్డీ ధనాన్ని, వానాకాలంలో ఓ గుహలో ఆశ్రయం పొందే 20 మంది భౌద్ధ భిక్షుకుల అన్నవస్త్రాలకు వినియోగించాలని వేయించిన శాసనం నాసిక్ లోని 10వ నంబరు గుహగోడలపై కలదు. ఇది రెండవ శతాబ్దమునకు చెందిన శాసనం. భౌద్ధ భిక్షుకులు ఊరూరా తిరుగుతూ భౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసేవారు. ఆ సమయంలో వీరిపోషణ యాచన ద్వారా చేసుకొనేవారు. వానాకాలంలో వీరి సంచారానికి ఆటంకం ఏర్పడేది. ఆ సమయంలో వీరు గుహలలో తాత్కాలికంగా నివసించి వానలు తగ్గాక మరలా దేశాటనకు బయలుదేరేవారు. వానాకాలంలో భౌద్ధ ప్రచారకుల పోషణ కొరకు రాజు చేసిన ఏర్పాట్లను పై శాసనం తెలుపుతుంది.
***
.
సప్తశతి కొన్ని గాథలలో ఆనాటి బాంకింగ్ వ్యవస్థ గురించి పరోక్ష ప్రసక్తులు కనిపిస్తాయి.
.
బాలకా! తొందరపడకు
బధ్రపరచమని ఉంచటానికి ఇది సరైన చోటు కాదు
నాకు తెలిసున్నంతమేరకు
ఇక్కడ దాచుకొన్న హృదయాల్ని
ఎవ్వరూ తిరిగిపొందలేదు - (154)
.
బహుసా జారిణులను ప్రేమించకు అని ఒక యువకునికి ఇవ్వబడిన ఒక సలహా కావొచ్చు పై గాథ. కానీ between the lines గమనిస్తే, అప్పట్లో భద్రపరచే వ్యక్తులుండేవారని, వారిలో కూడా మంచి బాంకర్లు చెడ్డ బాంకర్లు ఉంటారని తెలుస్తుంది. అంతే కాక చెడ్డ బాంకర్ వద్ద చేసిన Deposit తిరిగి రాదు అనే హెచ్చరిక కూడా కనిపిస్తుంది.

విలువైన వస్తువులను ఇతరుల వద్ద బధ్రపరచటాన్ని నిక్షేపం/Deposit అంటారు. నిక్షేపం తీసుకొన్న వ్యక్తి మోసం చేస్తే దొంగకు విధించే శిక్షనే అతనికీ విధించాలని కౌటిల్యుని అర్ధశాస్త్రంలో చెప్పబడింది. యుద్ధం, దోపిడీలు, అగ్నిప్రమాదం, వరదలు, ఓడలు మునిగిపోయిన సందర్భాలలో Diposits లో కొంతభాగమే ఇవ్వొచ్చు లేదా పూర్తిగా ఇవ్వనక్కరలేదని ఉన్నది.
***
.
ఎవరి ముఖవర్చస్సు దినదినం వృద్దినొందుతూ ఉంటుందో
తండ్రి అప్పు పుత్రులకు సంక్రమించినట్లు
ఎవరి స్నేహసంపత్తి అప్రయత్నంగా పెరుగుతుందో
అలాంటి వారీ లోకంలో అరుదుగా ఉంటారు. (113)
.

తండ్రి చేసిన అప్పు కొడుక్కి వారసత్వంగా వచ్చినట్లు స్నేహితులను తన ప్రయత్నం లేకుండా పొందగలగటం సుగుణంగా చెప్పబడిందీ గాథలో. ఇక్కడ అప్పు, సంపద పోలిక అన్వయదోషంగా అనిపిస్తూన్నా అప్రయత్నసిద్ధిని గురించి చెపుతున్నట్లుగా భావించాలి.
అప్పుతీసుకొన్న వ్యక్తి మరణించిన పక్షంలో అతని జ్యేష్ట కుమారుడిని మాత్రమే దానికి బాధ్యుడిని చేయాలని కౌటిల్యుని అర్ధశాస్త్రం చెపుతుంది.
***

గుప్త నిధుల గురించిన పరోక్ష ప్రస్తావనలు అనేక గాథలలో కనిపిస్తాయి. అప్పట్లో కొద్దిమంది తమ సంపదలను ఇతరుల వద్ద నిక్షేపం (Deposit) చేయటంపట్ల నమ్మకంలేక వాటిని రహస్యంగా భూమిలో పాతర వేసుకొనేవారు.

ఎవరికైనా దొరికిన అలాంటి నిధి లక్ష పణాల కంటే ఎక్కువ ఉంటే రాజుకు చెందుతుందని; తక్కువ ఉంటే ఆ నిధిని కనుగొన్న వానికి దానిలో ఆరవ వంతు బహుమానం రాజు ఇవ్వాలని; ఆ నిధి తమ పూర్వీకులదని నిరూపించుకోగలిగితే అది ఎంత పెద్దమొత్తమైనా పూర్తిగా అతనే పొందవచ్చునని; అలాకాక రహస్యంగా ఏదైనా నిధిని రాజుకు చెప్పకుండా తీసివేసుకొంటే నిధిని స్వాధీన పరచుకోవటమే కాక ఆ వ్యక్తికి వెయ్యిపణాల జరిమానా విధించాలనీ కౌటిల్యుని అర్ధశాస్త్రం చెపుతున్నది.

అయినప్పటికీ నిధి దొరకటం గొప్ప భాగ్యంగా భావించేవారు ఆనాటి ప్రజలు.
.
దుస్తులు గాలికి పైకి లేవటంతో
ఆమె తొడలపై ఉన్న పంటిగాట్లు వెల్లడయ్యాయి
వాటిని చూసిన ఆమె తల్లి
గుప్తనిధి దొరికినంత సంబరపడింది (508)
.
పెళ్ళియిన తరువాత కూతురు కాపురం సుఖంగా సాగాలని అందరూ కోరుకొంటారు. సుఖసంసారానికి భూమిక శృంగారం కూడానని నేడు బహిరంగంగా అంగీకరించలేకపోవచ్చు.... కానీ ఆనాటి ప్రజలు దాన్ని అంగీకరించారు, తమ సంతోషాన్ని ప్రకటించుకొన్నారు. పై గాథలో గుప్తనిధి దొరకటం అనే ఉపమానం ఆకర్షిస్తుంది. గుప్తనిధులు దొరకటం ఏ కాలంలోనైనా గొప్ప అదృష్టమే కదా!
***
.
భార్య చనిపోవటంతో ఇల్లంతా బోసి పోయింది.
ఒకనాడు వారు రతికేళి జరిపిన చోట్లన్నీ
నిధులను ఎవరో తవ్వుకుపోయినట్లు ఖాళీగా ఉన్నాయి
ఆ రైతు వాటినే తదేకంగా చూస్తూ మౌనంగా దుఃఖిస్తున్నాడు. (373)
.
సాధారణంగా కొంతమంది తమ సంపదను ఇంట్లో కానీ ఎవరూ సంచరించని ప్రదేశాలలో కానీ దాచుకొనేవారు. అలా దాచుకొన్న నిధులను దొంగలో లేక ఇతరవ్యక్తులో తవ్వుకొని పోవటం జరిగేదని పైగాథ ద్వారా ఊహించుకోవచ్చు. మానవ సంబంధాలలోని ఆర్థ్రతను ఈ గాథ కరుణరసాత్మకంగా ఆవిష్కరిస్తుంది.


***



.
యోధుని భార్య చన్నులవైపు ఆశగా, కోర్కెతో
దొంగచూపులు చూస్తున్నాడా బందిపోటు
గుండ్రంగా నిండుగా సర్పాలచే కాపాడబడుతున్న
లంకెబిందెల్లా ఆకర్షిస్తున్నాయవి (577)
.
గుప్తనిధులను కాపాడుకోవటం కోసం ఆనాటి కులీనులు తంత్రవిద్యలను ఆశ్రయించేవారని తెలుస్తుంది. సర్పబంధనం ద్వారా రహస్యంగా దాచుకొన్న తమ సంపదలను కాపాడుకోవచ్చునని విశ్వసించేవారు. ఇటీవల పద్మనాభస్వామి ఆలయమాళిగలలో ఒక దానిని తెరవక పోవటానికి సర్పబంధనాన్ని ఒక కారణంగా చూపిన సంగతిని ఇక్కడ గుర్తుచేసుకొనవచ్చును.

పై గాథలో యోధుని పరాక్రమం ఆమెను కాపాడే రక్షణ అని చేసిన ఊహ రమ్యమైనది. Tieken, Basak ల అనువాదాల్లో బందిపోటు అన్న పదానికి Kidnapper, Ravisher అనే పదాలు వాడారు. అప్పుడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకువెళుతున్న అర్ధం ధ్వనిస్తుంది. ఆ సమయంలో కూడా Kidnapper భయపడుతున్నాడంటే యోధుని పరాక్రమం అమోఘంగా వర్ణించబడినదని భావించాలి.
***
.
ఆమె చనుద్వయం
ప్రేమను దాచుకొన్న
బంగారు లంకెబిందెలు
ఒక్కోదాని పైనా మన్మధుని
తేనెరంగు అధికార ముద్ర. (813)
.
స్త్రీ స్తనాల areola ల యొక్క రంగు, రూపానికి హృద్యమైన భాష్యం ఈ గాథ. ఇక్కడ అధికార ముద్ర అన్న పదం విశిష్టమైనది.
కౌటిల్యుని అర్ధశాస్త్రంలో - దేశ సరిహద్దుల్లో ఆపత్సమయాల్లో ఉపయోగపడటానికి మరణదండన విధించిన వారితో గుప్తంగా ధనాన్ని పాతరవేయించి దాచుకోవాలని, ఆ పని పూర్తయిన తరువాత వారికి విధించిన మరణదండనం ద్వారా చంపించివేస్తే ఆ రహస్యం బయటపడదని - ఉన్నది. అంటే రాజులు కూడా రహస్యంగా నిధులను ఏర్పాటు చేసుకొనేవారని అర్ధమౌతుంది. బహుసా అలాంటి లంకెబిందెలకు అధికారికంగా రాజ ముద్రలు (Seals) వేసేవారేమో! తరవాత దొరికితే రాజసంపద అని గుర్తించటానికి.
***
.
సప్తశతి కాలానికి శాతవాహనులు వివిధ సముద్రపోర్టుల ద్వారా విదేశీ వ్యాపారాలు సాగించారు. కానీ వారు చేసిన వ్యాపారాలకు సంబంధించి ఏ రకమైన ప్రస్తావనలు ఈ గాథలలో కనిపించవు.

అనేక గాథలలో పురుషులు భార్యాపిల్లలను విడిచి దూరదేశాలకు ప్రయాణాలు కట్టటం; అక్కడనుండి వారు తమ భార్యలకు ఉత్తరాలు వ్రాయటం; జవాబులు అందుకోవటం; వానాకాలం లోపులో ఇంటికి చేరుకోవాలని తొందరపడటం; ఇంటివద్ద అతని భార్య తన భర్త వచ్చే రోజుకోసం ఎదురుచూడటం లాంటి వర్ణనలు కనిపిస్తాయి. అలాచేసే దేశాటన వ్యాపారం కొరకు అని భావించవచ్చు.

అప్పట్లో Paithan, Junnar, Tagars, Karahakata, Nasik, Govardhana, Dhannakataka, Vijayapura, Kevurura, Kotilingala Chadaka లు ప్రధాన వాణిజ్యకేంద్రాలుగా ఉండేవి. గ్రామాలలో భార్యా పిల్లలను విడిచిపెట్టి నగరాలకు వెళ్ళి తమ ఉత్పత్తులను అమ్ముకోవటమో లేక అక్కడ వ్యాపారం చేయటమో లేదా తమ వృత్తిపరమైన సేవలు అందించి ధనం సంపాదించటమో చేసేవారని అనుకోవాలి.

అలా దూరదేశం వెళ్ళిన భర్త ఇంటికి ఎంతో కొంత డబ్బునో, సంపదలనో తీసుకొస్తాడని ఆశించిన ఒక భార్య బాధ ఈ గాథలో తెలుస్తుంది.
.
అతను లేకపోవటం కన్నా
ఇక్కడ నేను పడ్డ దురవస్థ కన్నా
తను ఏ ప్రయోజనమూ సాధించకుండా
తిరిగి రావటమే నన్నెక్కువ బాధిస్తున్నది (76)
.
పై గాథను బట్టి అలా దూరదేశం వెళ్ళిన వ్యక్తులు డబ్బు సంపాదించటం కొరకే వెళ్లారని అనుకోవచ్చు.
***

అప్పటికి కొన్ని వందల సంవత్సరాలుగా నాణాల వాడుక ఉన్నప్పటికీ, సప్తశతి గాథలలో ఆశ్చర్యకరంగా డబ్బుల/నాణాల ప్రసక్తి ఎక్కడా కనిపించదు సరికదా ఒక గాథలో వస్తుమార్పిడి గురించి ఉన్నది.
.
మాఘమాసపు చలిసమయాలలో
పొగలేకుండా వెచ్చదనాన్ని ఇచ్చే
తన భార్య ఎత్తైన చన్నులను నమ్ముకొని
ఆ రైతు తన కంబళిని ఇచ్చేసి
ఎద్దును బదులుగా పుచ్చుకొన్నాడు (238)
.
ఈ గాథలో ఆ రైతు కంబళిని పక్కన పెట్టేసి తానే బలిష్టమైన ఎద్దుగా మారాడు అనే శృంగారపరమైన ధ్వని ఉండొచ్చు గాక, కానీ తీసుకొన్న ఉపమానంలో ఉన్న వస్తుమార్పిడి అనే పదం గమనించదగినది. నిన్నమొన్నటి వరకూ గ్రామాలలో స్వయం ఉత్పత్తుల వస్తు మార్పిడి జరిగిన సంగతి మరచిపోరాదు.

బొల్లోజు బాబా

No comments:

Post a Comment