Monday, October 26, 2015

పక్షి ప్రేమికులు


ప్రతీరోజూ అతను
తట్టనిండా కొంత దయను
మోసుకొని వచ్చి ప్లాట్ ఫార్మ్ పై పేర్చి
ఒక మూలగా కూర్చొని
దారిన పోయే వాళ్ళ కళ్ళలోకి
చూస్తుంటాడు.
దయంటే ఏమీ కాదూ
వాని జీవితంలోని కొంత భాగమూ,
కొన్ని చెమట చుక్కలు,
కాస్త పల్లెటూరి మట్టీ అంతే!
వాటిని తీసుకొని,
సారెపై బుడగలా ఉబ్బించి, నిప్పుల్లో కాల్చి
తట్టలోకి ఎత్తుకొని పట్నం వచ్చి
ప్లాట్ ఫారం పై అమ్మకానికి పెడతాడు.
కరంటు తీగలమీద పక్షులు
ఆ పల్లెటూరి మట్టిని
విప్పారిన నేత్రాలతో చూస్తూంటాయి.
మట్టితో చేసిన ఆ పక్షిగూళ్ళను
ఎవరెవరో దయాళువులు
ఒక్కొక్కటిగా కొనుక్కుంటారు
ఇంటి బయట వేలాడదీయటానికి.
సాయింత్రానికి ఖాళీతట్టను
భుజానికి తగిలించుకొని
బయలుదేరేటపుడు
పక్షులు అతని తలపై తిరుగుతూ
అరుస్తూ, ఆనందంగా సాగనంపుతాయి.
బొల్లొజు బాబా
Published in Surya telugu dialy Monday, 26-10-2015

1 comment: